మల్లన్న దర్శనానికి జర్మనీ దేశస్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మ వార్ల దర్శనానికి జర్మనీ దేశస్తులు తరలి వచ్చారు. బుధవారం ఆ దేశానికి చెందిన సుమారు 20 మందితో కూడిన బృందం శ్రీశైలానికి చేరుకొని ఉచిత క్యూలైన్ ప్రవేశ ద్వారం నుంచి సాధారణ భక్తుల మాదిరిగానే దర్శనానికి వెళ్లారు. జ్యోతిర్లింగాల యాత్రలో భాగంగా ద్వాదశ జ్యోతిర్లింగం శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించడం జరిగిందని వారు తెలిపారు. విదేశీ భక్తులను చూసిన స్థానికులు, యాత్రికులు వారితో మాటామంతి కలిపి, ఫొటోలు దిగేందుకు అసక్తి చూపారు.
ప్లాస్టిక్ ప్లేట్ల వాహనాలు సీజ్
శ్రీశైలంప్రాజెక్ట్/ఆత్మకూరు రూరల్: శ్రీశైలం శిఖరేశ్వరం చెక్పోస్ట్ వద్ద బుధవారం ప్లాస్టిక్ ప్లేట్లను తరలిస్తున్న రెండు వాహనాలను శ్రీశైలం రేంజ్ అటవీ అధికారి పరమేశు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వినుకొండకు చెందిన తిరుమలశెట్టి, శ్రీకాంత్ టాటా ఇంట్రాల్ ఏపీ 39 ఏజె 4604 వాహనంలో 6,000 ప్లాస్టిక్ ప్లేట్లు శ్రీశైలంలోని భ్రామరి హోటల్కు తెస్తున్నారు. గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన పల్లె శివరామకృష్ణ అనే మరో వ్యక్తి శ్రీశైలంలోని రెడ్ల అన్నదాన సత్రానికి 1,30,000 ప్లాస్టిక్ ప్లేట్లను తెస్తున్నాడు. శిఖరేశ్వరం చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టిన అధికారులు ఆ వాహనాలను గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అటవీ అధికారి మాట్లాడుతూ నాగార్జునసాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం పూర్తిగా ప్లాస్టిక్ రహిత ప్రాంతమని తెలిపారు. ఇటువంటి ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు నిషిద్ధమని, ఎవరైనా ఇటువంటి వస్తువులు కలిగి ఉన్నా, తరలించినా అటవీ చట్టాల ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు.
రేపు ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళా
కర్నూలు(సెంట్రల్): జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.దీప్తి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముథూట్, అపోలో ఫార్మసీలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఆయా ఉద్యోగాలకు పది నుంచి డిగ్రీ, ఫాం(బీడీఎం) చదివిన వారు అర్హులని, వయసు 21–35 సంవత్సరాలు ఉండాలన్నారు. అభ్యర్థులు ధ్రువ పత్రాలు, ఫొటోలతో హాజరుకావాలని పేర్కొన్నారు.
వ్యక్తి బలవన్మరణం
డోన్ టౌన్ : పట్టణంలోని కొండపేటకు చెంది న రామసుబ్బయ్య (41) మంగళవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈయన కొన్నేళ్ల నుంచి తాగుడుకు బానిసై ఏం పని చేసేవాడు కా దు. అయితే, ఉన్నట్టుండి మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులుఓ గదిలో నిద్రిస్తుండగా మరో గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించి స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. రామసుబ్బయ్య అక్క లక్ష్మీదేవి ఫిర్యాధు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కుష్టును నిర్మూలిద్దాం
గోస్పాడు: కుష్టువ్యాధిపై అవగాహన పెంచుకొని నిర్మూలిద్దామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. బుధవారం నంద్యాలలో జిల్లా కుష్టు, ఎయిడ్స్, టీబీ నివారణ అధికారి డాక్టర్ శారదాబాయి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ కుష్టువ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 13వ తేదీ వరకు స్పర్శ్ లెప్రసీ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంచార వాహనం ద్వారా ఊరూరా ప్రజలకు కుష్టుపై వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ఔత్సాహిక పారిశ్రామిక
వేత్తలకు ప్రోత్సాహం
నంద్యాల: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ ప్రోత్సాహం అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు.కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమలు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 491 దరఖాస్తులు అందగా సింగిల్ డెస్క్ విధానం ద్వారా 474 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న 17 దరఖాస్తులను సంబంధిత శాఖలు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
మల్లన్న దర్శనానికి జర్మనీ దేశస్తులు


