అత్యాచార నిందితులను అరెస్టు చేయాలి
కర్నూలు(సెంట్రల్): కర్నూలు మండలం దిన్నెదేవరపాడు పరిధిలోని అంబేడ్కర్ నగర్లో మహిళపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం కలెక్టరేట్ గాంధీ విగ్రహం ఎదుట ఐద్వా, కేవీపీఎస్, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శ్యామల అధ్యక్షతన జరిగిన ధర్నాను ఉద్దేశించి శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి.నిర్మల, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఆనంద్బాబు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి.రాఘవేంద్ర, ఐద్వా జిల్లా కార్యదర్శి కె.అరుణ, బాధితురాలి కోడళ్లు, కృషమ్మ, మేరీ మాట్లాడుతూ.. జనవరి 30వ తేదీన అంబేడ్కర్ నగర్లో 50 ఏళ్ల వృద్ధురాలిపై అత్యంత పాశవికంగా కళ్లలో కారం చల్లి.. చేతులు కట్టేసి ఇద్దరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక ఆమెను కర్రలు, రాళ్లతో కొట్టి హింసించారని, ఇది మానవ జాతికే అవమానకరమన్నారు. నిందితులకు మరో మహిళ సహకరించడం దురదృష్టకరమని, అత్యాచారం జరిగి ఆరు రోజులవుతున్నా నిందితులను అరెస్టు చేయకపోవడం తగదన్నారు. పోలీసులే కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎస్పీ జోక్యం చేసుకొని నిందితులను అరెస్టు చేయాలని లేకపోతే గ్రామస్తులతో కలసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.


