సాక్షి, కర్నూలు జిల్లా: ఇవాళ చలో పోతిరెడ్డిపాడుకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. సీమ లిఫ్ట్ పూర్తి చేయాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. చలో పోతిరెడ్డిపాడుకు ప్రజా, రైతు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. రాయలసీమ జిల్లాల నుంచి రైతులు తరలివస్తున్నారు. పోతిరెడ్డిపాడులో బహిరంగ సభకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరుకానున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా రాయలసీమ ఎత్తిపోతలను నిర్దాక్షిణ్యంగా ఆపేసి ఈ ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై ప్రజానీకం కన్నెర్ర చేస్తోంది. ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాల్సిందేనని నినదిస్తోంది. ‘సీమ’కు ద్రోహం చేస్తున్న ‘జల’కంటక సర్కారుపై గళమెత్తి గర్జిస్తోంది. ‘తీరుమారకుంటే పతనం తప్పదు ఖబడ్దార్’ అంటూ హెచ్చరిస్తోంది.

వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ సుభిక్షంగా ఉందంటే అది ఒక్క వైఎస్సార్ వలనే.. రాయలసీమ ప్రజలు నిత్యం సుభిక్షంగా ఉండాలని వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకువచ్చారన్నారు. రేవంత్ రెడ్డి మాటలు విని చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపారని సతీష్రెడ్డి మండిపడ్డారు.

‘‘వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆగలేదు. కరువు సమయంలో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. వైఎస్ జగన్ తెచ్చిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు అపాల్సి వచ్చింది?. రేవంత్ మాటలను చంద్రబాబు ఎందుకు ఖండించలేదు సమాధానం చెప్పాలి. జీఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎంఎస్ఎస్కి పిడికెడు మట్టి తీయలేదు. రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. రాయలసీమ రైతులపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోంది. పోతిరెడ్డిపాడు నిరసన ఆరంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉదృతం చేస్తాం’’ అని సతీష్రెడ్డి హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఏనాడు రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమీ లేదు. రాయలసీమకు వచ్చిన ఎయిమ్స్, హైకోర్టు తరలించుకు పోయారు.
శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రయోజనాలను సీఎం చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టాడన్నారు. రాయలసీమ ద్రోహిగా చరిత్రలో చంద్రబాబు మిగిలి పోతారన్నారు. రాయలసీమకు మేలు చేసిన ఏకైక కుటుంబం వైఎస్సార్ మాత్రమే.. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సస్యశ్యామలం చేయాలని వైఎస్ జగన్ శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించాలి. సీమ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందించాలి.


