సాక్షి, అమరావతి: ఆంధ్రజ్యోతి దినపత్రికకు విశాఖలో రూ.కోట్ల విలువైన భూమిని కట్టబెడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఆమోద పబ్లికేషన్స్ (ఆంధ్రజ్యోతి)కి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపులను రద్దు చేయాలని కోరుతూ విశాఖపట్నానికి చెందిన నక్కా నిమ్మిగ్రేస్ హైకోర్టులో ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.


