గంజాయి బ్యాచ్ అరెస్టు
250 గ్రాముల గంజాయి, రెండు బైకులు స్వాధీనం
పట్టుబడిన వారిలో వైద్యులు, ఇంజనీర్లు, ఉద్యోగులు, విద్యార్థులు, ట్రావెల్స్ నిర్వాహకులు
కర్నూలు: కర్నూలు నగరం 4వ పట్టణ పోలీస్స్టేషన్ సమీపంలోని 87, 88 సచివాలయాల వద్ద పాడుబడిన గదిలో గంజాయి తీసుకుంటున్న సమాచారంతో రెవెన్యూ, పోలీసు సిబ్బంది తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కొత్తపేటకు చెందిన దుర్గాప్రసాద్, గురురాఘవేంద్ర నగర్కు చెందిన కుమార్, సాయికుమార్, ఎన్ఆర్పేటకు చెందిన గౌతమ్, బంగారుపేటకు చెందిన సత్యప్రణయ్, జొహరాపురం హర్షవర్దన్, వీఆర్ కాలనీ సాయికృష్ణ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 250 గ్రాముల గంజాయి, దానిని సేవించడానికి ఉపయోగించిన బాటిల్తో పాటు రెండు బైకులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పట్టుబడిన ఏడుగురిలో దుర్గాప్రసాద్ గంజాయి సరఫరాదారుడు కాగా, మిగిలిన ఆరుగురు సేవించేవారు. బుధవారపేటకు చెందిన షేక్ మాలిక్ బాషాతో పాటు మరొకరు కలసి జట్టుగా ఏర్పడి అరకు నుంచి కిలోల కొద్దీ గంజాయిని తెచ్చి నగరంలోని ప్రధాన ఏజెంట్ల ద్వారా వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. దుర్గాప్రసాద్ కొంతకాలంగా ప్రధాన సూత్రదారి షేక్ మాలిక్ బాషా నుంచి కొనుగోలు చేసి పొట్లాల రూపంలో ఉద్యోగులు, విద్యార్థులకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు బయటపడింది. దుర్గాప్రసాద్ భారత్పే ఎగ్జిక్యూటివ్గా పనిచేసేవాడు. అయితే తక్కువ సమయంలోనే డబ్బులు సంపాదించాలనే ఆశతో అడ్డదారిగా గంజాయి రవాణా మార్గాన్ని ఎంచుకుని పోలీసుల వలకు చిక్కాడు. గంజాయి సేవిస్తున్న వారిలో విశ్వభారతి క్యాన్సర్ హాస్పిటల్లో అనాటమి టీచింగ్ ఫ్యాకల్టీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంజనీరింగ్ విద్యార్థి, ట్రావెల్ బిజినెస్, మాజీ ఐటీ ఉద్యోగి, డీ–ఫార్మసీ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్న వ్యక్తి కావడం గమనార్హం. వీరిపై కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచినట్లు నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ తెలిపారు.


