4 నుంచి పాదయాత్ర భక్తులకు అనుమతివ్వండి
● ఫారెస్టు అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్
ఆత్మకూరు: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలానికి నల్లమల మీదుగా పాదయాత్రకు వెళ్లే భక్తులకు అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. మండలంలోని సిద్ధాపురం చెరువు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డితో కలసి మంగళవారం ఆమె పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. శ్రీశైలం మహాక్షేత్రానికి గత ఏడాది కంటే ఈ ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ఉన్నతాధికారుల అనుమతితో పాదయాత్ర భక్తులకు నల్లమల మీదుగా వెళ్లేందుకు అటవీ శాఖ అధికారులు సౌకర్యాలు కల్పిస్తారన్నారు. భక్తులు కూడా అటవీశాఖ అధికారులకు సహకరించాలన్నారు. ప్రస్తుతం పులుల గణన జరుగుతున్నందున ఇబ్బందులు తలెత్తనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. త్వరలోనే అటవీశాఖ అనుమతులతో వెంకటాపురం నుంచి దోర్నాల వరకు రహదారి విస్తరణ చేపడుతామన్నారు.
శివరాత్రి భక్తులకు మెరుగైన వసతులు
శ్రీశైలంప్రాజెక్ట్: శివరాత్రి నేపథ్యంలో శ్రీశైలం చేరుకునే భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎస్పీ సునీల్ షెరాన్, శ్రీశైలం దేవస్ధానం ౖచైర్మన్ రమేష్నాయుడు, ఈఓ శ్రీనివాసరావుతో కలసి ఆమె ఏర్పాట్లను పరిశీలించారు. శ్రీశైలం ప్రాజెక్ట్ దిగువన లింగాలగట్టు వద్ద లోలెవల్ పుష్కరఘాట్లను పరిశీలించారు. మహిళలు దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. వారి వెంట ఆర్డీఓ నాగజ్యోతి, తహసీల్దార్ శ్రీనివాపులు, సీఐలు జీవన్ గంగనాథబాబు, గంటా సుబ్బారావు ఉన్నారు.


