రాష్ట్రపతి పాలన విధించాలి
వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడులు అమానుషం
తిరుమల లడ్డూపై విష ప్రచారం దారుణం
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
ఆలూరు రూరల్: ‘టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో దౌర్జన్య పాలన సాగిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలి’ అని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. టీడీపీ దాడులను నిరసిస్తూ మంగళవారం ఆయన స్థానిక నాయకులతో కలసి ఆలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సిట్ అధికారులు నివేదిక ఇచ్చినా ప్రభుత్వ పెద్దలు అసత్య ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేతల ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని కోరిన సీనియర్ నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులకు పాల్పడడం దారుణమన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. ప్రశ్నించే వారిని అంతం చేయాలనే కుట్ర జరుగుతోందన్నా రు. పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. దాడులకు పాల్పడుతున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాయలసీమ ద్రోహి చంద్రబాబు..
రాయలసీమ ప్రాజెక్టులపై చిన్న చూపు చూస్తున్న చంద్రబాబు సీమ ద్రోహిగా నిలిచిపోతారని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. మంగళవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో వైఎస్సార్సీపీ నేతలతో కలసి ఈ నెల 5వ తేదీన రాయల సీమ ఎత్తిపోతల పథకం పనులు కొనసాగించాలని కోరుతూ వైఎస్సార్సీపీ చేపట్టిన ‘చలో పోతిరెడ్డిపాడు’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత కేవలం అమరావతిని మాత్రమే పట్టించుకుంటున్నారే తప్పా. రాయలసీమ సాగు ప్రాజెక్టులను విస్మరించారన్నారు. చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆలూరు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మల్లికార్జున, నాయకులు వెంకటేషులు, భాస్కర్, శివ, మల్లేష్, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు.


