మార్చి 14న జాతీయ లోక్ అదాలత్
కర్నూలు: ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కోర్టుల్లోని సివిల్, మోటార్ వెహికల్ ప్రమాదాలు, వివాహ సంబంధమైన కేసులు, భూసేకరణ కేసులు, రాజీ కాదగిన క్రిమినల్, మున్సిపల్ ట్యాక్స్ కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఆదేశాల మేరకు కర్నూలు, నంద్యాల జిల్లాలో ఉన్న అన్ని కోర్టులలో ఫ్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కక్షిదారులు తమ కేసులను రాజీ పూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పది సంవత్సరాల పైబడి పెండింగ్లో ఉన్న సివిల్ కేసుల పరిష్కారానికి ఈ ఫ్రీ సిట్టింగ్ లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
కల్లూరు, మద్దికెరలో
అతి పెద్ద గోదాములు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని కల్లూరు, మద్దికెర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అతి పెద్ద గోదాములు నిర్మించుకునేందుకు సహకార శాఖ చర్యలు చేపట్టింది. వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజీ ప్రాజెక్టు (డబ్ల్యూఎల్జీఎస్పీ) కింద ఒక్కో సంఘం పరిధిలో 2,500 టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించడానికి జిల్లా సహకార కేంద్రబ్యాంకులోని ఫ్యాక్స్ డెవలప్మెంటు సెల్ డీపీఆర్ సిద్ధం చేస్తోంది. ఈ గోదాములు నిర్మించాలంటే కనీసం 2 ఎకరాల భూమి అవసరం. మద్దికెర, కల్లూరు సహకార సంఘాలకు ఈ స్థాయిలో భూములు ఉండటంతో డబ్ల్యూఎల్జీఎస్పీ కింద గోదాముల నిర్మాణానికి సహకార శాఖ చర్యలు చేపట్టింది. డబ్ల్యూఎల్జీఎస్పీ 33 శాతం సబ్సిడీ ఇస్తుంది. జిల్లా కలెక్టర్ నుంచి పరిపాలన అనుమతులు తీసుకున్న తర్వాత పనులు మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వాము వ్యాపారుల సిండికేట్
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వాము వ్యాపారుల సిండికేట్ కొనసాగుతోంది. మార్కెట్లో వాముకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ సిండికేట్ కారణంగా ధరలు పెరుగకపోగా తగ్గుతుండటం పట్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం మార్కెట్కు వాము 994 క్వింటా ళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.2,011, గరిష్ట ధర రూ.26,800 లభించగా..సగటు ధర రూ.12,6 99 మాత్రమే నమోదైంది. ఈ నెల 2న వాముకు లభించిన గరిష్ట ధర రూ.30,303 ఉండగా.. సగటు ధర మాత్రం రూ.16,099 మాత్రమే. మార్కెట్కు వాము భారీగా వచ్చేలా ఒకటి, రెండు చిన్న లాట్లకు ఎక్కువ ధర కోట్ చేయడం పరిపాటిగా మారింది.
ఆర్యూలో విద్యార్థుల మధ్య గొడవ
కర్నూలు (సెంట్రల్) : రాయలసీమ యూనివర్సిటీలో మరోసారి విద్యార్థుల మధ్య గొడవ చోటు చేసుకుంది. పీజీ విద్యార్థిపై బీటెక్ విద్యార్థులు దాడి చేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఏడాదిలో విద్యార్థుల మధ్య గొడవలు తారా స్థాయికి చేరడం ఇది నాలుగో సారి. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న ఓబులేసు అనే విద్యార్థిపై మూడో సంవత్సరం చదువుతున్న బీటెక్ విద్యార్థులు దాడి చేశారు. ముఖంపై కొట్టడంతో నోటి వెంబడి రక్తం వచ్చింది. దీంతో సమీపంలో ఉన్న విద్యార్థులు కొందరు కలగజేసుకుని దాడిని సద్దుమణిగించారు. అయితే, దాడిచేసిన బీటెక్ విద్యార్థులు మద్యం మత్తులో ఉన్నట్లు వారు చెబుతున్నారు. వర్సిటీలో తరచూ విద్యార్థులు మద్యం సేవిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విద్యార్థుల మధ్య గొడవలు ర్యాగింగ్కు దారితీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై వైస్ చాన్స్లర్ వి.వెంకటబసవరావు స్పందిస్తూ విద్యార్థుల మధ్య ర్యాగింగ్ లేకుండా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. దాడి సంఘటనపై విచారణ చేయిస్తానని వివరించారు.
అహోబిలేశుడికి బ్రహ్మరథం
ఆళ్లగడ్డ: పార్వేటగా బయలుదేరిన అహోబిలేశుడికి ఊరూరా భక్తులు బ్రహ్మరథం పడుతున్నారు. నాలుగు రోజులుగా ఆళ్లగడ్డ పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ అహోబిల లక్ష్మీనరసింహ స్వామి పార్వేట మహోత్సవాలు ముగిశాయి. మంగళవారం ఉత్సవ పల్లకీ ఎస్ లింగందిన్నెలో కొలువు దీరింది. పొలిమేరకు చేరుకున్న పల్లకీకి గ్రామస్తులు స్వాగతం పలికారు.
మార్చి 14న జాతీయ లోక్ అదాలత్


