బాలుడికి త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
కర్నూలు: నగరంలోని అశోక్ నగర్లో బాలుడికి పెను ప్రమాదం తప్పింది. పారిశుద్ధ్య కార్మికులు కాల్వ మరమ్మతు పనులు చేస్తుండగా అక్కడున్న విద్యుత్ స్తంభం కుప్పకూలింది. స్తంభం నేల కూలే సమయంలో ఆ రోడ్డు మార్గం మీదుగా నడుచుకుంటూ వెళ్తున్న బాలుడిని చూసి స్థానికులు గట్టిగా కేకలు వేసి అప్రమత్తం చేశారు. ప్రమాదాన్ని గుర్తించిన బాలుడు ముందుకు వెళ్లకుండా వేగంగా వెనక్కు పరుగులు తీసి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బాలుడు ప్రమాదం నుంచి తప్పించుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు కూడా విద్యుత్ స్తంభం ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. స్తంభం రోడ్డుకు అడ్డంగా పడటమే కాక అక్కడున్న విద్యుత్ వైర్లు డిష్ వైర్లపై పడటంతో మొత్తం తెగిపోయి నేలపై పడ్డాయి. దీంతో కాలనీ ప్రజలు కొద్దిసేపు భయాందోళనకు లోనయ్యారు. స్థానికుల సమాచారంతో విద్యుత్ ఉద్యోగులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి కాలనీ ప్రజలకు ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు.


