నాపరాతి గనిలో ట్రాక్టర్ బోల్తా
● డ్రైవర్ మృతి
అవుకు(కొలిమిగుండ్ల): నాపరాతి గనిలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు శనివారం దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. అవుకు మండల పరిధిలోని రామాపురానికి చెందిన బోయ వెంకటరాముడు(45) నాపరాళ్ల లోడింగ్తో పాటు డ్రైవర్గా వెళుతుంటాడు. ఈ క్రమంలోనే ఉదయం ట్రాక్టర్లో గ్రామానికి సమీపంలోని గనిలోకి వెళ్లి నాపరాళ్లను లోడ్ చేసుకొని బయలు దేరాడు. గని మధ్యలోకి రాగానే ఇంజిన్, ట్రాలీకి మధ్యనున్న పిన్ కట్ కావడంతో అదుపు తప్పి ఇంజిన్ భాగం గని గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వెంకటరాముడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో గనిలో పని చేస్తున్న ఇతర కార్మికులకు ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. కాగా అనివార్య కారణాలతో దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


