ప్రత్యేక ఉద్యమం.. జేఏసీ చోద్యం
● టీడీపీ నాయకులను వదిలేసి
రాజీవ్రెడ్డి వాహనాన్ని అడ్డుకున్న వైనం
● జేఏసీ తీరుపై పట్టణ ప్రజల విమర్శలు
ఎమ్మిగనూరుటౌన్: ఎమ్మిగనూరు జిల్లా కోసం టీడీపీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డినో, టీడీపీ నాయకులనో అడ్డుకొంటే రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చే అవకాశం ఉంది. అయితే అందుకు విరుద్ధంగా జేఏసీ నాయకులు ఆదివారం ఎమ్మిగనూరులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త రాజీవ్రెడ్డి వాహనాన్ని అడ్డుకుని విడ్డూరపు నాటకం ఆడారు. వాహనం దిగి వచ్చిన రాజీవ్రెడ్డి.. వైఎస్సార్సీపీ నేతల మాటలను చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడ వింటుందని చెప్పినా ఆందోళనకారులు వినలేదు. పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో కొద్ది సేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఇదిలా ఉండగా అంతకుమునుపే మాజీ మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నిరసన తెలిపి ర్యాలీ చేసిన అధికార టీడీపీ నాయకులను జేఏసీ నాయకులు ఎందుకు అడ్డుకోలేదని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నాయకులు దాడి చేయడం, ఆయన ఇంటిని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ర్యాలీ చేపట్టిన రాజీవ్రెడ్డిని ఎందుకు అడ్డగించారని, ఇందులో ఏదో మతలబు ఉందని అన్నారు.


