బడిలో బియ్యం మాయం
● 240 బస్తాలు తరలించి సొమ్ము చేసుకున్న వైనం ● టీడీపీ నేత హస్తంపై అనుమానం
ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలోని మాచాని సోమప్ప బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బియ్యం పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. పాఠశాలలో 3,323 మంది విద్యార్థినులు చదువుతుండగా ప్రతి రోజు 2,500కు మించి మధ్నాహ్న భోజనం తినడం లేదు. మిగతా వారంతా ఇళ్ల నుంచే క్యారియర్లు తెచ్చుకుంటున్నారు. ఇదిలావుండగా పాఠశాలలో దాదాపు 240 మధ్యాహ్న భోజన బియ్యం బస్తాలను ఇటీవల పట్టణంలోని 33వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడి సహకారంతో స్కూల్ దాటించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. టీడీపీ నేత బియ్యాన్ని కోర్టు రోడ్డులో ఉన్న ఓ డీలర్ వద్ద విక్రయించాడని సమాచారం. అధికార పార్టీ నేతలు ప్రభుత్వ అండతో ఓ వైపు ప్రకృతి వనరులు కొల్లగొడుతూ మరో వైపు పిల్లల నోటికాడ ముద్దను సైతం లాక్కుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే బియ్యం మాయంపై విచారణ చేపట్టాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. కాగా తమ పాఠశాలలో బియ్యం బస్తాల లెక్కలు సరిగా ఉన్నాయని, బియ్యం స్వాహా చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని హెచ్ఎం కృష్ణమూర్తి తెలిపారు.


