డివైడర్పైకి దూసుకెళ్లిన కావేరి ట్రావెల్స్ బస్సు
కర్నూలు శివారు రింగ్ రోడ్డులో ఘటన
ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
కర్నూలు: కావేరి ట్రావెల్స్ వోల్వో బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పాండిచ్చేరి నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా కర్నూలు శివారు ప్రజానగర్ కాలనీ, టిడ్కో ఇళ్ల మధ్య 40వ నెంబర్ జాతీయ రహదారి (రింగ్ రోడ్డు)పై అదుపు తప్పి డివైడర్పై దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులు నిద్రమత్తులో నుంచి తేరుకుని కేకలు వేశారు. ట్రావెల్స్ బస్సు రేడియేటర్ పైప్ ఊడిపోయి ఇంజిన్ వేడెక్కి ఆగిపోవడంతో అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నిద్రమత్తుతో ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో వెనకాల వస్తున్న ట్రావెల్ బస్సులోకి ప్రయాణికులను ఎక్కించి పంపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన తెలిసిన వెంటనే రవాణా శాఖ అధికారులు అక్కడికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. రేడియేటర్ పైపు ఊడిపోవడం వల్లనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారణకు వచ్చారు.
డివైడర్పైకి దూసుకెళ్లిన కావేరి ట్రావెల్స్ బస్సు


