అక్రమార్జనకు ‘కొమ్ము’ కాస్తూ..
● పెద్దాసుపత్రిలో పచ్చని చెట్లతో వ్యాపారం
● భారీ వృక్షాలను నరికి తరలిస్తున్న
కొందరు ఉద్యోగులు
కర్నూలు (హాస్పిటల్): ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గత కొన్ని నెలలుగా ఏపుగా పెరిగిన వృక్షాలను కొందరు వ్యక్తులు గొడ్డళ్లు, యంత్రాలతో నిలువునా నరికి నేలకూల్చేస్తున్నారు. వాటిని ప్రత్యేకంగా తెచ్చుకున్న వాహనాల్లో ఆసుపత్రి దాటించేస్తున్నారు. ఇందుకు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం సహకరిస్తుండటంతో అక్రమార్కుల ఆగడాలకు అంతు లేకుండాపోతోంది. ఇటీవల ఆసుపత్రిలోని ఓల్డ్ క్లినికల్ లెక్చరర్ గ్యాలరీ, సూపర్ స్పెషాలిటీ బ్లాక్ వద్ద, పూర్వ క్యాన్సర్ వార్డు దగ్గర ఏపుగా పెరిగిన చెట్లను నరికేశారు. తాజాగా గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం వెనుకవైపున పలు వృక్షాలను సైతం నరికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. విషయాన్ని సెక్యూరిటీ గార్డులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పనులు ఆపి వచ్చి మాట్లాడాలని ఆదేశించారు. అయితే చెట్లు కొట్టే వ్యక్తులు రాకుండా అక్కడి నుంచి ఉడాయించారు. ఆసుపత్రిలో పర్యవేక్షణకు సంబంధించిన ఓ కీలక ఉద్యోగికి ఇందులో పాత్ర ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చెట్లను కొట్టివేయించి వాటి ద్వారా వచ్చిన సొమ్మును అతను ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఇటీవల ప్రాంతీయ శిక్షణ కేంద్రం మేల్ ఆవరణలో సైతం చెట్లను కొట్టివేశారు. ఇందులోనూ అక్కడ పనిచేసే కొందరు ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు సమాచారం. ఒక మొక్క వృక్షంగా పెరిగి చల్లని గాలిని, ఆక్సిజన్ను ప్రకృతికి అందించేందుకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలా ఏపుగా పెరిగిన వృక్షాలను నిమిషాల్లో అక్రమార్కులు నరికి నేలకూలుస్తుండటంతో ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి వారి ఆగడాలను అరికట్టాలని వారు కోరుతున్నారు.
అక్రమార్జనకు ‘కొమ్ము’ కాస్తూ..


