ప్రసాదం ప్రాశస్త్యం దెబ్బతీయడం ఘోర అపచారం
● మంత్రాలయం ఎమ్మెల్యే
వై.బాలనాగిరెడ్డి
మంత్రాలయం రూరల్: రాజకీయ స్వార్ధం కోసం తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యం దెబ్బతీసేందుకు సీఎం చంద్రబాబు కుట్ర చేశారని, ఇది ఘోర అపచారం అని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. రాంపురం గ్రామంలో కార్యకర్తలతో కలసి శ్రీ రామలింగేశ్వర ఆలయం ఎదుట టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ.. విజయవాడ వరదల్లో సహాయ, పునరావాస చర్యల్లో తన ఘోర వైఫల్యం నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకు సీఎం చంద్రబాబు మహా పాపానికి ఒడిగట్టారన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని వేదికగా చేసుకుని, స్వామివారి ప్రసాదాన్నే ఆయుధంగా మార్చిన చంద్రబాబు నాటకం పూర్తిగా భగ్నమైందన్నారు. గతంలో చంద్రబాబు అలిపిరి సంఘటన నుంచి బయటకు వచ్చిన విషయం గుర్తుచేసుకోవాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక సభ్యుడు పురుషోత్తంరెడ్డి, జిల్లా కార్యదర్శులు విశ్వనాథరెడ్డి, హనుమాపురం ఈరన్న, మంత్రాలయం మండల కన్వీనర్ భీమారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


