శ్రీవారి లడ్డూను రాజకీయ లబ్ధికి వాడుకోవడం దుర్మార్గం
● ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి
చిప్పగిరి: శ్రీ వేంకటేశ్వర స్వామి కలియుగ దైవమని, స్వామి ఆలయంలో ప్రసాదంగా భక్తులకు అందించే లడ్డూనూ కూడా రాజకీయ లబ్ధి కోసం సీఎం చంద్రబాబు వాడుకోవడం దుర్మార్గమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. చిప్పగిరిలోని చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో 101 కొబ్బరి కాయలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక్క అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. ఆధారం లేకుండా తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ఎలా అరోపణలు చేస్తారని ప్రశ్నించారు. సనాతన ధర్మం అంటూ గుడి మెట్లను శుభ్రం చేసి నటించిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సీబీఐ సిట్ చార్జిషీట్పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బుసినే శ్రీరాములు, వెంకటేష్, సర్వర్ఖాన్, సేనాపతి, జయన్న, మహానంది, నెట్టికంటి తదితరులు పాల్గొన్నారు.


