శ్రీశైలంలో శివస్వాముల వాహనం బోల్తా
● ఒకరికి తీవ్ర గాయాలు, పలువురికి స్వల్ప గాయాలు
శ్రీశైలం: శ్రీశైలేశుడిని దర్శించుకుని తిరిగి వెళ్తున్న శివసాములు వాహనం బోల్తాపడి పలువురికి గాయాలయ్యాయి. క్షేత్ర పరిధిలోని క్షత్రియ రాజుల సత్రం ఎదురుగా ఉన్న టర్నింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందుకూరు గ్రామానికి చెందిన సుమారు 20 మంది శివ స్వాములు మంగళవారం రాత్రి శ్రీశైలానికి ఓ ట్రాలీ వాహనంలో శ్రీశైలం చేరుకున్నారు. బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. క్షత్రియ రాజుల సత్రం వద్దకు రాగానే వాహన డ్రైవర్ రాము అక్కడ ఉన్న టర్నింగ్ వద్ద స్పీడ్గా కట్ చేయడంతో ట్రాలీ ఆటో ఒకవైపు ఒరిగిపోయి కింద పడిపోయింది. వెంటనే చుట్టుపక్కల ఉన్న స్థానికులు ట్రాలీ వాహనాన్ని లేపి అందులో ఉన్న శివ స్వాములను చికిత్స నిమిత్తం దేవస్థానం వైద్యశాలకు తరలించారు. శివకుమార్ అనే శివ స్వామికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం స్థానిక వైద్యులు హైదరాబాద్కు రెఫర్ చేశారు. అలాగే మహేష్, సిద్దుల అంజి, నాగరాజుతో పాటు ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీశైలంలో శివస్వాముల వాహనం బోల్తా


