వలసబాటలో విషాదం
బొలెరో వాహనాన్ని ఢీకొన్న డీసీఎం
ఆత్మకూరు రూరల్: వలసబాటలో విషాదం చోటు చేసుకుంది. బొలెరో వాహనాన్ని డీసీఎం ఢీకొన్న ఘటనలో తొమ్మిదేళ్ల బాలిక మృత్యువాత పడిన ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణ శివార్లలో గీతా భవన్ హోటల్ సమీపంలో శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాలివీ.. కర్నూలు జిల్లా కోసిగి మండలం కామన్దొడ్డి గ్రామానికి చెందిన నాగేష్ దంపతులు తమ కుమార్తె కీర్తి(9), మరికొందరితో కలసి గుంటూరులో మిరప తోటల్లో పనులు చేసేందుకు వలస కూలీలుగా వెళ్ళేందుకు ఒక బొలెరో వాహనంలో ప్రయాణమయ్యారు. వాహనం ఆత్మకూరు పట్టణశివార్లలో బైపాస్ రోడ్డుపై వెళుతున్న సమయంలో ఎదురుగా రాంగ్ రూట్లో ఒక డిసిఎం వాహనం వచ్చి నేరుగా వారు ప్రయాణిస్తున్న బొలెరోను ఢీకొంది. దీంతో బొలెరో పైనుంచి కీర్తితో పాటు మరో నలుగురు ఎగిరి కింద పడ్డారు. తలకు తీవ్ర గాయం కావడంతో కీర్తి అక్కడికక్కడే మరణించింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. తమిళనాడుకు చెందిన డిసిఎం డ్రైవర్ ప్రమాద సమయంలో తప్ప తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మకూరు ఎస్ఐ నారాయణ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తొమ్మిదేళ్ల బాలిక మృతి
ఉపాధి కరువై
వలస పోతుండగా ఘటన
తప్పతాగి డ్రైవింగ్ చేసిన డీసీఎం డ్రైవర్
వలసబాటలో విషాదం


