గోల్డెన్ అవర్లో చికిత్సకు తోడ్పడండి
● ఆర్టీఓ భరత్ చవాన్
కర్నూలు: ప్రమాదాల్లో గాయపడిన వారికి గోల్డెన్ అవర్లో చికిత్స అందించి ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని ఆర్టీఓ భరత్ చవాన్ పిలుపునిచ్చారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలు శివారు నందికొట్కూరు రోడ్డులోని పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులకు, సిబ్బందికి రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రమాదాల నివారణ, గుడ్ సమారిటన్ అంశాలపై గుడ్ సమారిటన్, రాహ్వీర్ పథకం ద్వారా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మొదటి గంటలోగా గాయపడినవారిని ఆసుపత్రికి తీసుకెళ్తే రూ.25 వేల వరకు నగదు ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. వ్యక్తిగతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలిపారు. ఇయర్ ఫోన్, బ్లూ టూత్ వాడుతూ వాహనాలు డ్రైవ్ చేయకూడదని సూచించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను వాహనదారులు తప్పకుండా పాటించాలని, హెల్మెట్, సీటు బెల్టు ధరించడం వల్ల కలిగే ఉపయోగాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వీడియో ప్రదర్శించి ప్రమాదాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంవీఐలు మధుసూదన్, రవీంద్ర కుమార్, నాగరాజ నాయక్, సుధాకర్ రెడ్డి, ఏఎంవీఐలు బాబుకిషోర్, గణేష్ బాబు, ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, డీన్ శశి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


