గణతంత్ర దినోత్సవ బహుమతుల పేరిట సైబర్ మోసాలు
కర్నూలు: గణతంత్ర దినోత్సవ బహుమతులు, అమరవీరులైన జవాన్లకు విరాళాల పేరిట నకిలీ వెబ్ లింకులతో కొందరు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారి పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. సోషల్ మీడియా, వాట్సప్ ద్వారా వచ్చే ఆఫర్లను నమ్మరాదని, అధికారిక వెబ్సైట్లు ధృవీకరించుకున్న సమాచారాన్ని మాత్రమే నమ్మాలని శనివారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు. వ్యక్తిగత సమాచారం, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటీపీలు, అపరిచిత లింకులలో పంచుకోవద్దని సూచించారు. గిఫ్ట్ కార్డుల లింకులను ఆశపడి క్లిక్ చేస్తే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతారని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే స్థానిక పోలీసులు లేదా నేషనల్ సైబర్ హెల్ప్లైన్ నెంబర్ 1930 లేదా వెబ్సైట్ www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
విభిన్న ప్రతిభావంతులకు ఆన్లైన్ కోచింగ్
కర్నూలు(అర్బన్): ట్రాన్స్జెండర్లు, విభిన్న ప్రతిభావంతులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ఫాతిమా తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలు, ఐటీ/ఐటీఈస్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు https://apdascac.ap.gov.in అనే అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


