యఽథేచ్ఛగా సుద్దమట్టి తవ్వకాలు
కోడుమూరు రూరల్: అక్రమార్కులు ప్రకృతి వనరులను దర్జాగా కొల్లగొడుతున్నారు. నిన్నటి వరకు హంద్రీనది నుంచి ఇసుక తరలించి సొమ్ము చేసుకున్న వ్యక్తులు నేడు సుద్దమట్టిపై కన్నేశారు. వర్కూరు గ్రామ సమీపంలోని గాజులదిన్నె ప్రాజెక్టు ఎడమకాల్వ కింద ఉన్న భూముల్లో నుంచి వారం రోజుల నుంచి సుద్దమట్టిని తరలిస్తున్నారు. గ్రామంలో సుద్దమట్టి తవ్వకాలు చేపడుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఆ వైపు తొంగి చూడడం లేదు. దీంతో పట్టపగలే ట్రాక్టర్లతో సుద్దమట్టిని తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. కాగా గ్రామంలో హైస్కూల్, ప్రాథమిక పాఠశాల ఉన్న రోడ్డు మీదుగానే ట్రాక్టర్లతో వేగంగా మట్టిని నిత్యం తరలిస్తుండడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


