మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోలు బాంబులతో దాడులా?
టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలి
కర్నూలు (టౌన్): రాష్ట్రంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారని, పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోలు బాంబులతో దాడులు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై వెంటనే కేంద్ర హోం శాఖ స్పందించాలని కోరారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్న సమయంలో అప్పటి తెలుగుదేశం నేతల దూషణలను వీడియో క్లిప్పింగ్లతో చూపించారు. అనంతరం ఎస్వీ మాట్లాడుతూ.. తన 40 ఏళ్ల రాజకీయంలో ఏనాడు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు చూడలేదన్నారు. పాలన చేతకాక అసహనంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన వైఎస్సార్సీపీ నేతలను ఎంచుకొని దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని, తప్పుడు కేసులతో వేధిస్తున్నారన్నారు. మాజీ మంత్రులు అంబటి, జోగి రమేష్, విడదల రజని.. ఇలా అనేక మంది వైఎస్సార్సీపీ సీనియర్ నేతలను లక్ష్యంగా చేసుకొని ఇళ్లను ధ్వంసం చేయడం, దాడులకు తెగబడటం అత్యంత దుర్మార్గమన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు రాష్ట్రంలో అరాచక శక్తులను పెంచిపోషిస్తున్నారని విమర్శించారు. ‘పొరబాటున మాటలు దొర్లాయి’ అని ఒక వైపు మాజీ మంత్రి అంబటి మీడియాను పిలిచి వివరణ ఇచ్చినా, దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఫ్లెక్సీ వ్యవహారంలో అభ్యంతరం చెప్పినందుకే ఈ దాడులు చేశారన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే రకం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వెనుక చంద్రబాబు కుట్ర దాగి ఉందని తేలిపోయిందన్నారు.
రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో
అక్రమ కేసులు
తిరుమల లడ్డూ వ్యవహారంలో కల్తీ లేదంటూ సీబీఐ విచారణలో తెలిపోవడంతో చంద్రబాబు ఆదేశాలతో వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేసి దాడులు చేస్తూ, తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఎస్వీ అన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీడీపీ నేతలు దూషించారన్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, పట్టాభి, వంగలపూడి అనిత, నారాయణ అవమానకరంగా మాట్లాడినా కేసులు పెట్టలేదని గుర్తు చేశారు. ఇప్పుడు రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి జైళ్లకు పంపడం దారుణమన్నారు. ఎల్లకాలం అధికారంలో ఉండబోరన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించుకోవాలన్నారు. ప్రభుత్వం మారితే ఇప్పుడు దాడులు చేస్తున్న టీడీపీ నా యకులు, కార్యకర్తల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఆలోచించుకోవాలన్నారు. అప్పుడు కాపాడటానికి చంద్రబాబు, లోకేష్ ముందుకురారని, సినిమా షూటింగ్ల్లో పవన్ కళ్యాణ్ ఉంటారన్నారు. జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కొంత మంది పోలీసు అధికారుల వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితులు దాపురించాయని విమర్శించారు. విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు షరీఫ్, నరసింహులు యాదవ్, కటారి సురేష్, తిరుమలేశ్వర రెడ్డి, కార్పొరేటర్ క్రిష్ణ కాంత్ రెడ్డి, కిషన్, పత్తాబాషా, రామాంజనేయులు పాల్గొన్నారు.
కర్నూలు రెండో పట్టణ సీఐకి ఫిర్యాదు
కల్తీ నెయ్యి కేసుపై సిట్ చార్జ్షీట్కు విరుద్ధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలపై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు రెండో పట్టణ పోలీసు స్టేషన్లో సీఐ నాగరాజును కలిసి సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ మాజీ సీఎంకు వ్యతిరేకంగా పోస్టర్లను ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ పోస్టర్లు శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా ఉన్నందున వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు
పరువు పోయిందనే దాడులు
వెంటనే కేంద్ర హోం శాఖ స్పందించాలి
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి
మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోలు బాంబులతో దాడులా?


