గంజాయి ముఠా అరెస్ట్
ఆళ్లగడ్డ: గంజాయి దిగుమతి చేసుకుని విక్రయాలు చేపడుతున్న ఐదురుగురు ముఠా సభ్యులను శనివారం ఆళ్లగడ్డ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఆరు కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ వివరించారు. శిరివెళ్ల మండలం బోయిలకుంట్ల గ్రామా నికి చెందిన జింకల మద్దిలేటి దగ్గరకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కోడూరు శ్రీనివాసులు బోయిలకంట్ల గ్రామ సమీపంలోని కాశినాయన ఆశ్రమం దగ్గరకు గంజాయి తీసుకుని వస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అక్కడ మాటు వేశారు. అక్కడ మద్దిలేటి, కోడూరు శ్రీనివాసులుతో పాటు దండబోయిన గురుస్వామి, షేక్ అబ్దుల్ నబీ, మెఘల్ గఫార్బేగ్ గంజాయిని తరలించేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు గమనించారు. వారిని అదుపులోకి తీసుకుని వారి దగ్గర ఉన్న ఆరు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కోడూరు శ్రీనివాసుల ద్వారా ఒడిశా నుంచి గంజాయి సరఫరా చేసుకుంటున్నట్లు విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్కు తరలించారు.
ఐదుగురికి రిమాండ్


