‘సూక్ష్మ’ ఊతం..‘సాగు’కు దైన్యం | - | Sakshi
Sakshi News home page

‘సూక్ష్మ’ ఊతం..‘సాగు’కు దైన్యం

Feb 2 2026 7:53 AM | Updated on Feb 2 2026 7:53 AM

‘సూక్

‘సూక్ష్మ’ ఊతం..‘సాగు’కు దైన్యం

బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం పేదలకు ఎలాంటి లాభం లేదు అంకెల గారడీ ఉపయోగం లేదు దేశ గతిని మార్చే బడ్జెట్‌

కర్నూలు(సెంట్రల్‌): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. బడ్జెట్‌లో సూక్ష్మ పరిశ్రమలకు ఊతం ఇచ్చినా ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ హబ్‌లో మౌలిక వసతుల కల్పనపై స్పష్టత రాలేదు. పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులు, ఎయిర్‌పోర్టు అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులకు ఆశించిన మేరకు నిధులను సాధించడంలో కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కూటమి పార్టీ నేతలు విఫలమయ్యారని తేటతెల్లం అయ్యింది.

చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు

కేంద్ర బడ్జెట్‌లో సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు విరివిగా ప్రోత్సాహకాలు ఇచ్చారు. స్టార్టప్‌ పరిశ్రమలకు ఇప్పటి వరకు ఇచ్చే రూ.10 కోట్ల రుణాన్ని రూ.20 కోట్ల వరకు పెంచారు. జిల్లాలో ఇవి 1500 ఉన్నాయి. మరోవైపు ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చారు. జిల్లాలో 5 వేలకు పైగా ఎంఎస్‌ఎంఈలు నడుస్తున్నాయి. ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ హబ్‌లో మౌలిక వసతుల కల్పనపై స్పష్టత లేకపోవడంతో ఎంపీలు వివరణ కోరాలని ప్రజలు కోరుతున్నారు.

విజయవాడకు నేరుగా రైలు లేదు

కర్నూలు నుంచి రాజధాని అమరావతి(విజయవాడ)కి వెళ్లేందుకు నేరుగా రైలును కేటాయించలేదు. అలాగే 48 ఏళ్లుగా ప్రతిపాదన ఉన్న కర్నూలు–మంత్రాలయం కొత్త రైల్వేలైన్‌, పంచలింగాల సమీపంలో నిర్మాణంలో ఉన్న రిహబులిటీ వర్కుషాపునకు నిధులు ఇవ్వలేదు. కాచిగూడ – గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ వరకు పొడిగించాలనే డిమాండ్‌ను పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–చైన్నె హైస్పీడు రైళ్లు కర్నూలు మీదుగా వెళ్లే అవకాశం ఉంది.

వేతన జీవులకు ఊరట

కర్నూలు జిల్లాలో ట్రేజరీ ద్వారా 28,895 మంది, కార్పొరేషన్ల ద్వారా మరో 5 వేల మంది ఉద్యోగులు జీతాలు తీసుకుంటున్నారు. బడ్జెట్‌లో ఉద్యోగులకు ఉపశమనం కలిగించేలా పన్ను శ్లాబులను సవరించారు.రూ.12.75 లక్షల వరకు పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. దీంతో దాదాపు 20 వేల మందికి పన్ను నుంచి మినహాయింపు కలిగే అవకాశం ఉంది.

జిల్లాకో బాలికల హాస్టల్‌

జిల్లాలో 6,20,658 లక్షల మంది రైతులు ఉన్నారు. ధరలు పతమైన సమయంలో కంది, మినుములను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. పండ్లు, కూరగాయల ఉత్పత్తి, అధికోత్పత్తి వంగడాల సృష్టి కోసం ప్రత్యేక జాతీయ మిషన్‌ ఏర్పాటు చేస్తామని, పత్తి ఉత్పాదను పెంచేందుకు జాతీయస్థాయిలో ప్రత్యేక మిషన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పింది. జిల్లాకో బాలికల హాస్టల్‌ ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో చెప్పారు.

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్ర విభజన తరువాత దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం ఊతమివ్వని బడ్జెట్‌ ఇది. ఏపీ, తెలంగాణలకు పెద్దగా ఉపయోగపడని బడ్జెట్‌ ఇది. విశ్వ విద్యాలయాలకు ఏమాత్రం నిధులు లేవు. కర్నూలు రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు. ఇది ప్రాంతీయ అసమానతలకు దారి తీసే అవకాశం. పరిశ్రమలు, వ్యవసాయానికి చేయూతను ఇచ్చారు. ఎయిర్‌పోర్టు అభివృద్ధికి ఏ మాత్రం నిధులు ఇవ్వలేదు.

– మన్సూర్‌ రెహమాన్‌, రిటైర్డ్‌ ఎకనామిక్‌ప్రొఫెసర్‌

కేంద్ర బడ్జెట్‌తో పేదలకు ఎలాంటి లాభం లేదు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. టీడీపీ, బీజేపీ ఎంపీలు 21 మంది ఉన్నా బడ్జెట్‌లో నిధులు రాలేదు. ఓర్వకల్లు ఇండస్ట్రీయల్‌ హబ్‌ ప్రస్తావన లేదు. అమరావతికి రైలు లేదు. రైతులకు కనీస మద్దతు ధరపై మాట్లడలేదు. ఇది పూర్తిగా పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన బడ్జెట్‌. బడ్జెట్‌ సవరణలో ఏపీకి నిధులపై ఎంపీలు పోరాటం చేయాలి. – ఎస్వీ మోహన్‌రెడ్డి,

జిల్లా అధ్యక్షుడు, వైఎస్‌ఆర్‌సీపీ

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింది. ఏపీకి గుండుసున్నా నిధులు వచ్చాయి. ఈ బడ్జెట్‌ కేవలం అంకెల గారడీ, ఇది సామాన్య ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని బడ్జెట్‌. ఎన్నికలు ఉన్నా తమిళనాడు, కేరళ, బెంగాల్‌ రాష్ట్రాల కోసమే ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏపీకి ఒక్కప్రాజెక్టకు నిధులు లేవు.– బి.గిడ్డయ్య, జిల్లా కార్యదర్శి, సీపీఐ

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి, కర్నూలుకు నిధులుసాధించడంలో కూటమి నేతలు విఫలమయ్యారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక నిధులు కేటాయించలేదు. రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్‌లో రిక్తహస్తం చూపారు. రైతులకు కనీస మద్ధతు ధరపై నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ బడ్జెట్‌తో ఉపయోగం లేదు

–డి.గౌస్‌దేశాయ్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి

ఈ బడ్జెట్‌ దేశ దిశ గతిని మార్చేది. అభివృద్ధి సాధించాలి. ఆ ఫలాలు పేద,మ ధ్య తరగతి వర్గాల ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 12.75 లక్షల వరకు ట్యాక్స్‌ కట్టాల్సిన అవసరం లేకుండా ఉద్యోగులకు మేలు చేకూర్చారు.

– సాయి ప్రదీప్‌, జిల్లా అధికార ప్రతినిధి, బీజేపీ

కేంద్ర బడ్జెట్‌పై మిశ్రమ స్పందన

సూక్ష్మ పరిశ్రమలకు

లబ్ధి చేకూరే అవకాశం

సాగునీటి ప్రాజెక్టులకు

నిధులు సాధించడంలో వైఫల్యం

‘సూక్ష్మ’ ఊతం..‘సాగు’కు దైన్యం 1
1/5

‘సూక్ష్మ’ ఊతం..‘సాగు’కు దైన్యం

‘సూక్ష్మ’ ఊతం..‘సాగు’కు దైన్యం 2
2/5

‘సూక్ష్మ’ ఊతం..‘సాగు’కు దైన్యం

‘సూక్ష్మ’ ఊతం..‘సాగు’కు దైన్యం 3
3/5

‘సూక్ష్మ’ ఊతం..‘సాగు’కు దైన్యం

‘సూక్ష్మ’ ఊతం..‘సాగు’కు దైన్యం 4
4/5

‘సూక్ష్మ’ ఊతం..‘సాగు’కు దైన్యం

‘సూక్ష్మ’ ఊతం..‘సాగు’కు దైన్యం 5
5/5

‘సూక్ష్మ’ ఊతం..‘సాగు’కు దైన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement