సాక్షి, నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. ప్రైవేట్ కంపెనీ ఉద్యోగుల జీతాల్లో టీడీపీ నేతలు కమీషన్లు దండుకుంటున్నారు. ఇదేమని ప్రశ్నించిన ఉద్యోగులపై టీడీపీ నేత రాజగోపాల్ దాడికి పాల్పడ్డారు. కొలిమిగుండ్లలోని ఇండో ఫ్యూచర్ ఎనర్జీస్ కంపెనీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుల జీతాలు ఏజెన్సీ నిర్వాహకులు తగ్గించి ఇస్తున్నారు. కంపెనీ చెల్లిస్తున్న పూర్తి జీతాన్ని ఉద్యోగులకు ఇవ్వకుండా టీడీపీ నాయకులు కమీషన్లు తీసుకుంటున్నారు.
సెక్యూరిటీ సూపర్వైజర్గా విధులు నిర్వహించిన శ్రీనివాస్ యాదవ్ను గతంలో ప్రశ్నించినందుకు టీడీపీ నాయకుడు రాజగోపాల్.. ఆయన్ని ఉద్యోగం నుంచి తీయించివేయించాడు. నిరసన తెలుపుతున్న సెక్యూరిటీ సిబ్బందికి మద్దతు తెలిపిన శ్రీనివాస్ యాదవ్, సెక్యూరిటీ గార్డులపై టీడీపీ నేత రాజగోపాల్ దాడి చేశారు.
26,330 ఏజెన్సీ వారు సెక్యూరిటీ గార్డులకు జీతాలు చెల్లిస్తుంటే.. టీడీపీ నాయకులు మాత్రం 13,270 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు అంటూ ఉద్యోగులు వాపోతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం వారిని ఉద్యోగంలో నుంచి తొలగిస్తామంటూ టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు.


