రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం
ఆదోని రూరల్: ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. వెట్టి చాకిరి (బాండెడ్ లేబర్) నుంచి 21 మందికి విముక్తి కల్పించారు. ఆదోని ఇన్చార్జి సబ్కలెక్టర్ అజయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కపటి–నాగలాపురం గ్రామాల మధ్య ఉన్న ఇటుకల బట్టీలో మూడు నెలలుగా ఒడిశా, ఛత్తీస్ఘడ్, రాష్ట్రాలకు చెందిన 21 మంది వెట్టి చాకిరి పరిస్థితుల్లో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 16 మంది పెద్దలు కాగా, అందులో పురుషులు ఏడుగురు, మహిళలు 9 మంది, ఒక బాలుడు, నలుగురు బాలికలు ఉన్నారు. ఇటుకల బట్టీలో పని చేయించేందుకు ముందుగా కొంత మొత్తాన్ని అడ్వాన్స్గా ఇచ్చి, అనంతరం వారిని తీవ్రంగా వెట్టి చాకిరి చేయించేవారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని వారిని సురక్షితంగా విడుదల చేయించారు. విడుదలైన వారందరికీ ప్రభుత్వం తరపున రిలీజ్ సర్టిఫికెట్లు అందజేశారు. బాధితులకు రావాల్సిన వేతనాలు పూర్తిస్థాయిలో చెల్లించేందుకు అవసరమైన చర్యలు చేపట్టి, వారిని సొంత ప్రాంతాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సబ్కలెక్టర్ తెలిపారు. వెట్టి చాకిరి నేరమని, ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. ఎవరైనా ఈ విధమైన అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు పునరావృత్తంగాకుండా కార్మిక శాఖ అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహించాని సబ్కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శేషఫణి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
వెట్టి చాకిరి నుంచి 21 మందికి విముక్తి


