breaking news
Hyderabad
-
రైతు సంక్షేమమే ధ్యేయం
హైదరాబాద్: రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఉదయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిలతో కలిసి ప్రీ బడ్జెట్ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఆర్గానిక్, నేచురల్ ఫార్మింగ్ లో స్వయం సహాయక సంఘాలను భాగస్వాములుగా చేయాలని వ్యవసాయ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా కూరగాయలు, పూల సాగు చేయించి ఆ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. రైతు వేదికలు, వ్యవసాయ మార్కెట్ గోడౌన్లు, వేర్ హౌసింగ్ గోదాములపై సోలార్ రూఫ్ టాప్ లు ఏర్పాటు చేసుకొని విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఈ వ్యవస్థ ద్వారా వ్యవసాయ శాఖకు విద్యుత్ ఖర్చులు మిగలడంతో పాటు అదనంగా ఉత్పత్తి చేసిన విద్యుత్తును విక్రయించుకునే అవకాశం, ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుందని తెలిపారు. వ్యవసాయ శాఖ సంస్థలపై సోలార్ రూఫ్ టాప్ ల ఏర్పాటుకు సంబంధించి రెడ్కో సంస్థను సంప్రదించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో చేపట్టని అనేక సంక్షేమ పథకాలను రైతుల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలు పెద్ద సంఖ్యలో పంపిణీ చేస్తుంది అదేవిధంగా విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందజేస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని ఈ అంశాన్ని రైతులకు చక్కగా వివరించాలని మంత్రులు సూచించారు. రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల కింద వివిధ రకాల పంటలు సాగు చేస్తున్న తీరు, నీటి సరఫరా, యాసంగి వరి సాగు, మార్కెట్లోకి రానున్న ధాన్యం, సేకరణ తదితర అంశాల పై మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లు సమావేశంలో చర్చించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి, అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ అల్దాస్ జానయ్య తదితరులు పాల్గొన్నారు. -
కల్తీ అల్లం- వెల్లుల్లి పేస్టు తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు
సాక్షి, హైదరాబాద్: శాస్త్రిపురంలోని బాబా కాంటా, ఉడంగడ్డ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా.. అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్న కేంద్రాలపై రాజేంద్రనగర్ జోన్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. నిందితులు.. ఎవరికీ అనుమానం రాకుండా నాసిరకం అల్లం, వెల్లుల్లిని సేకరించి, వాటికి ఉప్పు, టైటానియం డై ఆక్సైడ్ వంటి రసాయనాలు, గమ్ పౌడర్ను కలిపి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పేస్టు చిక్కగా ఉండటానికి, రంగు కోసం ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.నిందితులు అబ్దుల్ అలీమ్, జసాని దిల్దార్ అలీలపై కేసు నమోదు చేసిన పోలీసలు దర్యాప్తు చేపట్టారు. 1800 కిలోల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 కిలోల గమ్ పౌడర్ (Xanthan Gum), 2 కిలోల టైటానియం డై ఆక్సైడ్, సింథటిక్ ఫుడ్ కలర్ (లెమన్ ఎల్లో), 7 ప్యాకింగ్ మెషీన్లు, 3 గ్రైండింగ్ మెషీన్లు, 2 వెయింగ్ మెషీన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
హైదరాబాద్లో పాడైపోయిన డ్రై ఫ్రూట్స్ విక్రయాలు
సాక్షి, హైదరాబాద్: అపరిశుభ్రమైన ఆహార పదార్థాల విక్రయాలపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. హైదరాబాద్ సిటీ సి.సి.ఎస్ (CCS), స్పెషల్ క్రైమ్ టీమ్, ఫుడ్ అడల్టరేషన్ టీమ్, బహదూర్పురా పోలీసులు సంయుక్త తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో పాడైపోయిన డ్రై ఫ్రూట్స్ను నాణ్యమైనవిగా నమ్మించి ప్రజలకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 30 కార్టన్ బాక్సుల్లో ఉన్న అపరిశుభ్రమైన, పాడైపోయిన డ్రై ఫ్రూట్స్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హైదరాబాద్లోని చార్మినార్, చేలాపురా ప్రాంతంలో GEM Foods (ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్) పేరుతో ఒక గోడౌన్ను నిర్వహిస్తూ..పాడైపోయిన, బూజు పట్టిన డ్రై ఫ్రూట్స్ను సేకరించి, వాటిని తినడానికి యోగ్యమైన నాణ్యమైన డ్రై ఫ్రూట్స్గా అమ్మకాలు సాగిస్తున్నాడు. ఆహార పదార్థాలను, ముఖ్యంగా ప్యాక్ చేసిన లేదా డ్రై ఫ్రూట్స్ వంటి వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.వస్తువులను కొనేముందు వాటి నాణ్యత, వాసన, రూపాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని.. ఎవరైనా పాడైపోయినా.. కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లు గమనిస్తే, వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్, ఆహార భద్రతా అధికారులకు సమాచారం అందించాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు. -
ఆకట్టుకున్న ‘మెగా రైతు మేళా-2026’
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ అగ్రి-సొల్యూషన్స్ సంస్థ అయిన కోరోమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU), తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖతో భాగస్వామ్యంగా హైదరాబాద్లోని రాజేంద్రనగర్ PJTAU క్యాంపస్లో మెగా రైతు మేళా 2026ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 5000 మందికి పైగా రైతులు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచే వినూత్న సాంకేతిక మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డి.అనసూయ సీతక్క, వ్యవసాయం, మార్కెటింగ్, సహకారం, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ శంకర సుబ్రమణియన్ ఎస్, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) డైరెక్టర్ జనరల్ డా. మంగి లాల్ జాట్, మరియు PJTAU వైస్-చాన్సలర్ మరియు చైర్మన్ ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య హాజరయ్యారు.ఈ రైతు మేళా, రైతులు వ్యవసాయ నిపుణులతో నేరుగా చర్చించేందుకు పంట పోషణ, పంట సంరక్షణ, విత్తనాలు, ప్రెసిషన్ వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణలో తాజా అభివృద్ధులను తెలుసుకునేందుకు ఒక చురుకైన వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సాంకేతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
తెలంగాణ ఆర్టీసీ సమ్మె నోటీసు
హైదరాబాద్ : దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను మార్చి 13లోగా సీఎం రేవంత్రెడ్డి పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని గతంలో హెచ్చరించిన తెలంగాణ ఆర్టీసీ.. ఈ మేరకు సమ్మె నోటీసు ఇచ్చింది. ఈరోజు(శుక్రవారం) ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చాయి ఆర్టీసీ కార్మిక సంఘాటు. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె నోటీసును అందజేశారు. ఆర్టీసీ ఎండీ లేకపోవడంతో పేషీలోనే సమ్మె నోటీసు ఇచ్చారు. 14 రోజుల తర్వాత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని వారు హెచ్చరించారు. తమ పెండింగ్ సమస్యలను సీఎం రేవంత్రెడ్డి పరిష్కరించాలని, లేకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని గత నెలలో ఆర్టీసీ కార్మిక సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చాక 2017 వేతన సవరణ అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అందుకు సంబంధించిన ఎరియర్స్ను మాత్రం ఇంకా చెల్లించలేదని, ఆర్టీసీకి రావాల్సిన రూ. 2,150 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
టెన్త్ విద్యార్థులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను ఒత్తిడిగా భావించకుండా, తమ జ్ఞానం, ప్రతిభను చూపించే మంచి అవకాశంగా భావించాలని.. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని గవర్నర్ పిలుపునిచ్చారు.పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండి, సమయాన్ని సక్రమంగా వినియోగించుకొని తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలన్న శివ ప్రతాప్ శుక్లా.. ఆత్మ విశ్వాసం విజయానికి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆయన ప్రశంసించారు. పరీక్షలకు హాజరవుతున్న ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. -
రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్
తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు కేంద్రప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి ప్రయాణించే మూడు స్పెషల్ రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు మరో సౌకర్యం అందుబాటు వచ్చినట్టయింది.కాచిగూడ-మధురై-కాచిగూడరైలు నం. 07191/07192 కాచిగూడ-మధురై-కాచిగూడ రైలును రైలు నం. 17165/17616 కాచిగూడ-ట్యుటికోరిన్-కాచిగూడ ఎక్స్ప్రెస్గా మార్చారు. ఇకపై ఈ రైలు ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో మొదలై మరుసటి రోజు మంగళవారం రాత్రి 10:45 గం.లకు కేరళ రాష్ట్రంలోని ట్యూటికోరిన్ కు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ట్యూటికోరిన్ నుంచి బుధవారం ఉదయం 7:45 గంటలకు మొదలై మరుసటిరోజు మధ్యాహ్నం 1:25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లె రోడ్, పీలేరు, పాకాల, చిత్తూరు స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ రైలు నం. 07230/07229 హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ రైలును రైలు నం. 17069/17070 హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ ఎక్స్ప్రెస్ గా మార్చారు. ఈ రైలు గతంలోలాగే ప్రతి బుధవారం సాయంత్రం 5:20 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు తమిళనాడులోని కన్యాకుమారి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో కూడా గతంలో లాగే ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 5:15 గంటలకు కన్యాకుమారిలో బయలుదేరి శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్, తిరుపతి, పాకాల జంక్షన్, చిత్తూరు స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లిరైలు నం. 07225/07226 చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి రైలును రైలు నం. 17065/17066 చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ గా మార్చారు. ఇకపై ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7:15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు బుధవారం ఉదయం 11:20 గంటలకు పశ్చిమబెంగాల్ షాలిమార్కు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో బుధవారం మధ్యాహ్నం 12:50 గం. లకు షాలిమార్ లో బయలుదేరి మరుసటి రోజు గురువారం సాయంత్రం 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది. 3 స్పెషల్ రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ రైల్వే తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్జే దొర కన్నుమూత
హైదరాబాద్: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్జే దొర కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నిమ్స్లో చికిత్స పొందుతూ మృతిచెందారు.కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఆయన్ను నిమ్స్లో చేర్చగా.. ఈ రోజు(శుక్రవారం, మార్చి 13వ తేదీ) చికిత్స పొందుతూ కన్నుమూశారు. హెచ్జే దొర.. ఆయన పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించి, క్రమశిక్షణతో పాటు ప్రజల భద్రత కోసం కృషి చేశారు. దశాబ్దాలపాటు పోలీస్ వ్యవస్థలో కీలక పదవుల్లో పనిచేసి, అనేక సంస్కరణలకు మార్గదర్శకుడయ్యారు. ప్రధానంగా గ్రేహౌండ్స్ బలోపేతానికి హెచ్జే దొర విశేషంగా కృషి చేశారు. ఆయన మరణం రాష్ట్రానికి, పోలీస్ శాఖకు పెద్ద నష్టం అని పలువురు భావిస్తున్నారు. సహచరులు, శిష్యులు ఆయనను క్రమశిక్షణా ప్రియుడిగా, నిబద్ధత కలిగిన అధికారిగా గుర్తుచేసుకుంటున్నారు. -
కూకట్పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం బట్టబయలు
హైదరాబాద్: చార్మ్ బ్యూటీ స్పా సెంటర్పై దాడి చేసి ఆరుగురు మహిళలను, ఒక విటుడుని, నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. భాగ్యనగర్ కాలనీలో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు కూకట్పల్లి పోలీసులు, యాంటి ఉమెన్ ట్రాఫిక్ సైబరాబాద్ టీం ఆధ్వర్యంలో దాడి చేశారు. భాగ్యనగర్కాలనీలోని చార్మ్ బ్యూటీ స్పా సెంటర్ను నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా విటులను ఆకర్షించి స్పా సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పోలీసుల దాడి చేసి ఆరుగురు మహిళలను, విటుడిని, ముగ్గురు నిర్వాహకులను అరెస్టు చేశారు. వారి నుంచి 4 స్మార్ట్ ఫోన్లు, రూ.9100 నగదు స్వా«దీనం చేసుకున్నారు. మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. జగద్గిరిగుట్టకు చెందిన నిర్వాహకురాలు (31), మలక్ పేటకు చెందిన సబ్ ఆర్గనైజర్ (36)ని, గుంటూరుకు చెందిన జయప్రకాష్ (25)లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
టెస్ట్ డ్రైవ్ పేరుతో బెంజ్ కారుతో జంప్
హైదరాబాద్: టెస్ట్ డ్రైవ్ పేరుతో తీసుకెళ్లిన విలాసవంతమైన కారును తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... 2024 డిసెంబర్ 16న అక్బర్ఖాన్ అనే వ్యక్తి సయ్యద్ అషా్ఫక్ అహ్మద్(66)కు చెందిన మెర్సిడెస్బెంజ్ జీఎల్ఏ 200డి (టీఎస్ 09 ఈఎక్స్ 8199) కారును టెస్ట్ డ్రైవ్ కోసం తీసుకువెళ్లాడు. అనంతరం కారును తిరిగి ఇవ్వకపోగా మహమ్మద్ సఫీర్ అహ్మద్, కార్స్ గలోర్లతో కలిసి అక్బర్ఖాన్ ఆ కారును విక్రయించాడు. అయితే ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన రూ. 25 లక్షల్లో కేవలం రూ. 2.50 లక్షలు మాత్రమే చెల్లించినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని చెల్లించకపోవడంతో పాటు కారును కూడా తిరిగి ఇవ్వలేదు. పైగా సయ్యద్ అషా్ఫక్ అహ్మద్ను బెదిరించాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఆ రోజే చనిపోతాననుకున్నా’
హైదరాబాద్: ఉద్యోగంలో చేరిన రోజే చనిపోతానేమోనని భయమేసిందని టెలీకాలర్ కీర్తన ఆందోళన వ్యక్తం చేసింది. మధురానగర్లోని వారాహి కన్సెల్టెన్సీలో మంగళవారం జరిగిన శశికిరణ్రెడ్డి హత్యకు సంబంధించిన వివరాలను ఆమె పోలీసులకు తెలిపింది. వివరాలివీ... వారాహి కన్సెల్టెన్సీ నిర్వాహకులు శశికిరణ్రెడ్డిని కత్తితో పొడిచి... కత్తితో స్టాఫ్ను బెదిరిస్తూ బయటికొచి్చన ప్రభుకుమార్ ఎదురుగా ఉన్న రిసెప్షనిస్టు లయ (అక్షయ)ను కత్తితో పొడిచినట్టు పేర్కొంది. మక్తల్ మండలం సంగంబండ గ్రామానికి చెందిన కీర్తన అదే రోజు (మంగళవారం) ఉద్యోగంలో చేరింది. ఉదయం 9 గంటలకు ఉద్యోగంలో చేరిన ఆమె మధ్యాహ్నం లంచ్ పూర్తి చేసిన కొద్ది నిమిషాలకే ఈ సంఘటన జరగడం భయమేసిందని తెలిపింది. శశికిరణ్రెడ్డి గదిలోంచి పెద్దగా కేకలు వినిపించాయి. రిసెప్షనిస్టు లయ తలుపులు కొడుతూ ఉందని, కొంత సేపటికి తర్వాత యువకుడు కత్తితో బయటకు వచ్చాడని తెలిపింది. లయను కూడా పొడిచాడంది. నిందితుడు కిందకు పరిగెత్తగానే కీర్తన శశికిరణ్రెడ్డి ఆఫీస్లోకి పరిగెత్తి చూడగా ఆయన ఒళ్లంతా రక్తంతో నిండిపోయిందని, ఆయన ఏదో చెబుతున్నాడని అర్థం కాలేదని పేర్కొంది. ధైర్యం చేసి 100కు ఫోన్ చేసినట్టు తెలియజేసింది. వివరాలను మధురానగర్ పీఎస్ ఎస్హెచ్ఓ ప్రభాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సిలిండర్ డెలివరీపై కఠిన నియమం
హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ల డెలివరీకి ‘ఓటీపీ’ సమస్యగా మారింది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నది. గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే గ్యాస్ సిలిండర్ల డెలివరీలో తప్పనిసరిగా ఓటీపీ నమోదు చేసుకోవాలని, ఓటీపీ నెంబర్ చెబితేనే సిలిండర్ జారీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే గత పది రోజుల నుంచి డెలివరీ బాయ్స్ గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్న సమయంలో ఓటీపీ నెంబర్ తప్పనిసరిగా నమోదు చేసుకుంటున్నారు. ఓటీపీ నమోదులో చాలా సమయం తీసుకుంటున్నదని డెలివరీ బాయ్స్తో పాటు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఖైరతాబాద్ రేషనింగ్ సర్కిల్–7 పరిధి కిందికి వచ్చే జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల పరిధిలో 81 రేషన్ దుకాణాలు ఉండగా, 9 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,57,221 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ఒక్కో ఏజెన్సీ రోజూ 500–600 వరకు మాత్రమే సిలిండర్లు పంపిణీ చేస్తుంది. రెండు వారాల క్రితం ఒక్కో గ్యాస్ ఏజెన్సీ 700–800 వరకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసేది. రెండు వారాల క్రితం వరకు ఓటీపీ అడగగకుండానే బుకింగ్ చేసుకున్న వినియోగదారుడికి సిలిండర్ పంపిణీ చేసేవారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సిలిండర్లు పక్కదారి పట్టకుండా డెలివరీ సమయంలో పకడ్బందీగా సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఓటీపీకి చాలా సమయం.. గ్యాస్ బుకింగ్ చేసుకున్న సమయంలో ఆ గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరుపై ఉంటే వారి మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. రెండు మూడు వారాల తర్వాత సిలిండర్ డెలివరీ సమయంలో డెలివరీబాయ్ బుకింగ్ సమయంలో వచ్చిన ఓటీపీని అడుగుతాడు. ఆ ఇంటి యజమానురాలు కనెక్షన్ ఎవరి పేరుపై ఉందో వారికి ఫోన్లు చేసి ఓటీపీ నెంబర్ తీసుకుని మళ్లీ డెలివరీ బాయ్కు చెప్పగానే తాజా బిల్లుతో పాటు వచ్చే ఓటీపీ, బుకింగ్ సమయంలో వచి్చన ఓటీపీ సరిపోవాల్సి ఉంటుంది. తేడా వస్తే సమయం అంతా వృథా అవుతుందని డెలివరీ బాయ్స్ వాపోతున్నారు. ఒక్కో సిలిండర్ పంపిణీకి గతంలో ఐదు నిమిషాలు పడితే, ఇప్పుడు పావుగంట సమయం తీసుకుంటున్నది. దీని వల్లనే సిలిండర్ల పంపిణీలో జాప్యం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. ఆందోళన వద్దు.. కొరత లేదు కావలసినన్ని సిలిండర్లు ఉన్నాయి. వచ్చిన చిక్కల్లా ఓటీపీతోనే. ప్రతి సిలిండర్ డెలివరీలోనూ ఓటీపీ నమోదు చేసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే చాలా సమయం తీసుకుంటుంది. మా ఏజెన్సీ పరిధిలో రెండు వారాల క్రితం వరకు రోజుకు 800 సిలిండర్లు పంపిణీ చేసేవాళ్లం. ఇప్పుడు 600 మాత్రమే చేయగలుగుతున్నాం. డెలివరీ బాయ్స్ సైతం సిలిండర్లను అనుకున్న స్థాయిలో ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం మా ఏజెన్సీ పరిధిలో బుకింగ్ చేసుకున్న రెండు రోజుల్లోనే గ్యాస్ సరఫరా అవుతోంది. గృహావసరాల డొమెస్టిక్ సిలిండర్ల గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కమర్షియల్ సిలిండర్ల కొరత మాత్రం ఉంది. బుకింగ్ సమయంలో వచ్చే ఓటీపీని కనెక్షన్ ఉన్న వినియోగదారుడు తప్పనిసరిగా భద్రపరచుకోవాలి. బుకింగ్ సమయంలో వచ్చే ఓటీపీకి, డెలివరీ సమయంలో వచ్చే ఓటీపీకి ట్యాలీ కావలసి ఉంటుంది. త్వరత్వరగా ఓటీపీ నెంబర్ చెబితే అంతే త్వరగా సిలిండర్ల పంపిణీ కూడా జరుగుతుంది. చాలామంది సిలిండర్లు దొరకవేమోనని ఆందోళన చెందుతున్నారు. అది సరికాదు. గ్యాస్ గోడౌన్లలో కావలసినన్నీ సిలిండర్లు స్టాక్లో ఉన్నాయి.అక్రమార్కులపై కొనసాగుతున్న దాడులు బంజారాహిల్స్: గ్యాస్ సిలిండర్ల రీఫిల్లింగ్ సెంటర్లతో పాటు వాణిజ్య సిలిండర్ల స్థానంలో డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్న ప్రాంతాలపై పౌర సరఫరాల శాఖ అధికారులు, టాస్్కఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు కొనసాగిస్తున్నారు. గురువారం జూబ్లీహిల్స్ జోన్ టాస్్కఫోర్స్ ఎస్ఐ రవిరాజ్, రేషనింగ్ ఖైరతాబాద్ సర్కిల్–7 జూనియర్ ఎంక్వైరీ ఇన్స్పెక్టర్లు టి.సాయికిరణ్, రాచకొండ సాహిత్సాగర్ తదితరులు వెంకటగిరిలో దాడులు చేశారు. అచిన్తల్వార్ బాలాజీ అనే వ్యక్తి డొమెస్టిక్ సిలిండర్ల నుంచి మినీ సిలిండర్లకు గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నట్లుగా సమాచారం రావడంతో దాడులు చేశారు. ఇందులో భాగంగా రెండు డొమెస్టిక్ సిలిండర్లతో పాటు 35 మినీ సిలిండర్లను స్వా«దీనం చేసుకున్నారు. బాలాజీపై కేసు నమోదు చేశారు. అలాగే అమీర్పేట, ఎస్సార్నగర్ ప్రాంతాల్లో రేషనింగ్ అధికారులు దాడులు చేసి అక్రమంగా వినియోగిస్తున్న 11 సిలిండర్లను స్వా«దీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. నిరంతరం ఈ దాడులు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. -
Hyderabad: పెరుగూ కల్తీ
హైదరాబాద్: కాదేదీ కల్తీకి అనర్హం అన్నచందంగా మారింది హైదరాబాద్ నగరంలో నిత్యావసరాల వస్తువుల పరిస్థితి. గురువారం జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ అధికారులు పోలీసులతో కలిసి అంబర్పేటలోని ఓ దుకాణంలో 2,500 కిలోల కల్తీ పెరుగును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. అంబర్పేట రహత్నగర్కు చెందిన నరేష్ రాఘవేంద్ర ఆరు నెలలుగా స్థానికంగా ఎన్నార్ ఎంటర్ప్రైజెస్ పేరిట పాల వ్యాపారం చేస్తున్నారు. వీరు కల్తీ పెరుగు తయారు చేసి విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో.. జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ విభాగం అధికారులు స్థానిక పోలీసులతో కలిసి ఎన్నార్ ఎంటర్ప్రైజ్పై దాడి చేశారు. అక్కడ లభించిన 2,500 కిలోల అనుమానిత కల్తీ పెరుగును సీజ్ చేశారు. పెరుగు నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఫిర్యాదు మేరకు అంబర్పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నల్లగున్నవ్.. నీకెందుకు చదువు..?
మెదక్ కలెక్టరేట్: ‘నల్లగున్నవు నీకు చదువెందుకు.. టీసీ ఇస్తాం వెళ్లిపో’.. అంటూ తమ కుమార్తెను పాఠశాలకు రానివ్వడం లేదని తల్లిదండ్రులు గురువారం కలెక్టర్ ప్రతిమాసింగ్కు మొర పెట్టుకున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్పూర్కు చెందిన బాధిత విద్యార్థిని మనస్విని, ఆమె తల్లిదండ్రులు ఎల్లం, జ్యోతి విలేకరులకు తెలిపిన వివరాలివి. మెదక్లోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ (టీజీఆర్ఎస్)లో మనస్విని 7వ తరగతి చదువుతోంది. గత నెల 20న కడుపునొప్పి రావడంతో.. ప్రిన్సిపాల్కు సమాచారం అందించి విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకెళ్లగా కిడ్నీలో స్వల్పంగా రాయి ఉన్నట్లు తేలింది. నీళ్లు తాగితే సరిపోతుందని వైద్యులు చెప్పడంతో పాఠశాలలో చేర్పించారు. ఈ క్రమంలో మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు వెళ్లి ఏఎన్ఎం ఆశాజ్యోతిని సంప్రదించగా దురుసుగా ప్రవర్తించింది. ‘ఏ అడివినుంచి వచ్చిండ్రు మీరు... ఆ పిల్లకు టీసీ ఇచ్చి పంపిస్తాం’.. అని అవమానించినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతరం పాపకు ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇటీవల పాఠశాలలో చేర్చుకోవాలని వెళ్తే ప్రిన్సిపాల్తో పాటు సిబ్బంది నోటికొచ్చినట్లు మాట్లాడి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నీలో రాయి తగ్గినట్లు డాక్టర్ సర్టిఫికెట్ తెస్తేనే చేర్చుకుంటామని ప్రిన్సిపాల్ పాఠశాలలోకి రానివ్వడం లేదని వాపోయారు. ‘నల్లగా ఉన్న నీకు చదువెందుకు?.. టీసీ ఇచ్చి పంపిస్తాం.. వెళ్లిపో’.. అని నర్స్ ఆశాజ్యోతి, ప్రిన్సిపాల్ తారాసింగ్ పాఠశాలలోకి రానివ్వడం లేదని విద్యార్థిని బోరున విలపించింది. స్పందించిన కలెక్టర్ ప్రతిమాసింగ్ ప్రిన్సిపాల్ తారాసింగ్ వివరణ తీసుకొని విద్యార్థిని మనస్వినిని పాఠశాలకు పంపించినట్లు సమాచారం. -
ప్రైవేట్ బస్సు బోల్తా.. పలువురు ప్రయాణికులు మృతి
సాక్షి,నిజామాబాద్: జిల్లా గన్నారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలం గన్నారం వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడి.. నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. హైదరాబాద్ నుండి మహారాష్ట్రలోని అకొలకు 22 మంది ప్రయాణికులతో బయల్దేరింది.అయితే గురువారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో 44వ జాతీయ రహదారిపై బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు ఘటన స్థలంలోనే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
హాలీవుడ్తో పోటీ పడదాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా హాలీవుడ్తో పోటీ పడాలని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు మన సినిమా లు బాలీవుడ్తో పోల్చుకునే వారిమని, కానీ ఇప్పుడు టాలీవుడ్ సినిమాల స్థాయి అంతర్జాతీయ స్థాయికి చేరుకుందన్నారు. ఇప్పు డు మన సినిమాలు కేవలం హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతున్నాయని, అంతటి ప్రమాణాలతో తెలుగు సినిమా అభివృద్ధి చెందిందన్నారు. కోకాపేట్లో నిర్మించిన అల్లు అర్జున్ థియేటర్ ఆఫ్ అల్లు సినిమాస్ను గురువారం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు.‘తెలుగు సినీ పరిశ్రమ దేశంలో ముందువరుసలో ఉంది. అత్యంత ఉత్తమ చిత్రాలను మన పరిశ్రమ నిర్మిస్తోంది. బాహుబలి, కలి్క, అరుంధతి లాంటి సినిమాలు టాలీవుడ్కు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో ఆ సినిమాలు నిర్మించారు. కలెక్షన్లు కూడా అంతర్జాతీయ స్థాయిలో పోటీగా నిలిచాయి. సినిమా రంగం సాంకేతికంగా అత్యంత వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ప్రేక్షకులను కట్టిపడేసే సినిమాలు వస్తున్నా యి. ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ ధియేటర్ నిర్మించారు. నేను సినిమా అభిమానిని. అందులోనూ కృష్ణ అభిమానిని. కాలేజీ రోజుల్లో మా ప్రాంతంలో సినిమా థియేటర్లు లేవు. వనపర్తి, కర్నూలుకు వెళ్లి సినిమా చూసేవాడిని. లారీఎక్కి సినిమాలు చూశాను. నటుడు కృష్ణ ఏడాదికి 15 సినిమాలు చేసేవారు. ఇప్పు డు ఐదారేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. సినిమా సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది.సినిమాల్లో కథ, కథనం ఆధారంగా మన జీవితంలో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎన్టీ ఆర్ అక్కినేని, రామానాయుడు లాంటి వాళ్లు తెలుగు సినీ పరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాద్కు తీసుకువచ్చారు. కానీ నటుడు కృష్ణ మాత్రం సాహసాలు చేసారు. సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభు త్వం అండగా ఉంటుంది. ఐటీ, ఫార్మా ఇండస్ట్రీ మాదిరిగా సినీ ఇండస్ట్రీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. మన సినిమాలు హాలీవుడ్ స్థాయికి వెళ్ళాలి. భాష అడ్డంకి కాదు. కేవలం టాలెంట్ మాత్రమే ఇప్పుడు కనిపిస్తోంది.’అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు, సినీ నిర్మాత అల్లు అరవింద్, నటుడు అల్లు అర్జున్, అల్లు వెంకట్, అల్లు శిరీష్ పాల్గొన్నారు. -
నెట్ఫ్లిక్స్తో హైదరాబాద్కు హాలీవుడ్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు హాలీవుడ్ను రప్పించాలనే తన కల నెట్ఫ్లిక్స్ ద్వారా నిజం కాబోతున్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ప్రపంచంలోని 500 అతిపెద్ద కంపెనీల పెట్టుబడులను హైదరాబాద్కు రప్పించేందుకు కృషి చేస్తున్నామని ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారానికి చిరునామాగా ఉన్న తెలంగాణకు వచ్చే పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్కు చెందిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో గురువారం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సినిమారంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటుండగా, బాహుబలి, కల్కి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఇక్కడ నుంచే వచ్చాయి. ప్రపంచ సంస్థలకు వేదికగా నిలుస్తున్న హైదరాబాద్ అన్ని రకాల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తుంది. నెట్ఫ్లిక్స్ విస్తరణకు అవసరమైన అన్ని సదుపాయాలు, సహకారాన్ని మా ప్రభుత్వం అందిస్తుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చూపే అద్భుత అవకాశం వినోదరంగంలో పేరొందిన నెట్ఫ్లిక్స్, ఐలైన్ ద్వారా లభిస్తుంది. క్రీడా రంగంలో మౌలిక వసతుల కల్పన, క్రీడా విశ్వ విద్యాలయాల ఏర్పాటు వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. త్వరలో క్రీడల ప్రసార రంగంలోనూ అడుగుపెడుతున్న నెట్ఫ్లిక్స్ నుంచి సహకారాన్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో నెటిఫ్లిక్స్ ఆఫీసు నిర్మాణానికి అవసరమైన భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. నెట్ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీసును ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయాలి’అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఐలైన్ స్టూడియో కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీధర్బాబు, దిల్రాజు, రానా, సంజయ్జాజు, జెఫ్షాపిరో తదితరులు తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం: మంత్రి దుద్దిళ్ల యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగంలో హైదరాబాద్ను గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ‘హైదరాబాద్కు నెట్ఫ్లిక్స్ రాకతో సినిమా స్టోరీ టెల్లింగ్లో తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తమవుతుంది. గ్లోబల్ ప్రొడక్షన్ పైప్లైన్లో నగరం నిర్ణయాత్మక కేంద్రంగా మారుతుంది. ప్రపంచస్థాయి నిర్మాణ ప్రమాణాలు, ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణల వాతావరణంతోపాటు స్థానిక యువత కు భవిష్యత్తు నైపుణ్యాలు ఐలైన్ స్టూడియో ద్వారా అందుబాటులోకి వస్తాయి. పరిశ్రమల భాగస్వామ్యంతో ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో నెట్ఫ్లిక్స్ భాగస్వామిగా మారాలి’అని శ్రీధర్బాబు చెప్పారు. ఆవిష్కరణలకు కేంద్రం: సంజయ్‘వేగంగా విస్తరిస్తున్న మీడియా, వినోద రంగ మౌలిక సదుపాయాలతో.. ప్రతిభకూ, ఆవిష్కరణలకూ శక్తిమంతమైన కేంద్రంగా హైదరాబాద్ నిలిచింది. సాంకేతిక ఆవిష్కరణలను కథన కళారీతులతో మేళవిస్తూ దక్షిణాసియాలో ముఖ్యమైన కేంద్రంగా ఐలైన్ స్టూడియోస్ సేవలందిస్తుంది. అలాగే దృశ్య శ్రవణ, వినోద రంగాల్లో సరికొత్త అవకాశాలను అందిస్తుంది. దేశవ్యాప్తంగా 15వేల పాఠశాలలు, కాలేజీల్లో 500 కంటెంట్ క్రియేటర్ ల్యాబ్ల ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదించింది. తద్వారా సృజనాత్మక రంగంలో దాదాపు 20 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయి’అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు చెప్పారు. భారత సృజనాత్మక సాంకేతిక సంస్థ (ఐఐసీటీ) త్వరలోనే హైదరాబాద్లో ప్రాంతీయ ప్రాంగణాన్ని కూడా ప్రారంభించనున్నట్టు ఆయన ప్రకటించారు. కాగా హైదరాబాద్లో ఐలైన్ స్టూడియోస్ 32వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతోంది. ఇందులో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, జనరేటివ్ వర్చువల్ ఎఫెక్ట్స్ కోసం ఆధునిక సాంకేతికత ఉంటుంది, ఈ స్టూడియో లాస్ ఏంజెలిస్, వాంకోవర్, సియోల్, లండన్లో స్థాపించిన నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో సినీ నటుడు రానా దగ్గుబాటి, ఐలైన్ స్టూడియోస్ సీఈఓ జెఫ్ షాపిరో, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పాల్గొన్నారు. -
సంక్షేమ విద్యా సంస్థలపై గ్యాస్ బండ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట గురుకులంలో గ్యాస్ నిండుకోవడంతో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. దమ్మపేట పాఠశాలకు రెండు, మూడు రోజులుగా గ్యాస్ సరఫరా కావడం లేదు. సంక్షేమ పాఠశాలల్లో గ్యాస్ కొరత విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, గురుకులాలకు సరిపడా గ్యాస్ సరఫరా చేయాలని ఆయన ఏజెన్సీలను ఆదేశించారని ఆర్సీఓ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. – పాల్వంచ రూరల్ సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు, వసతిగృహాలపై గ్యాస్ బండ పడింది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల సరఫరాలో నెలకొన్న సమస్యతో విద్యార్థులకు భోజనాన్ని అందించడంలో సిబ్బందికి కష్టాలు నెలకొన్నాయి. గురుకుల విద్యా సంస్థల్లో రోజుకు మూడు పూటలా ఆహారాన్ని అందించాల్సి ఉండగా...వసతి గృహాల్లో మాత్రం రెండు పూటలా ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ వసతిగృహాలు, సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఆహారాన్ని గ్యాస్ పొయ్యిల ద్వారానే వండి వడ్డిస్తున్నారు. తాజాగా నెలకొన్న పరిస్థితితో వంట సంకటంలో పడింది. సకాలంలో వారికి వండివార్చడం ఇబ్బందికరంగా మారడంతో ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యి ఏర్పాటు చేస్తూ నెట్టుకొస్తున్నారు. కాగా, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలో గురుకుల పాఠశాలలు, కళాశాలలు వెయ్యికిపైగా ఉన్నాయి. ఇవికాకుండా సంక్షేమ శాఖల పరిధిలో వసతిగృహాలు, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో రెండు వేల ఆశ్రమ పాఠశాలలు, పాఠశాల విద్యా శాఖ పరిధిలో మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు దాదాపు వెయ్యి వరకు ఉన్నాయి. వీటి పరిధిలో 12లక్షల మంది విద్యార్థులున్నారు. ఈ విద్యా సంస్థలకు సగటున 4,500 వేల గ్యాస్ సిలిండర్లు అవసరం. దీంతో ఒక్కో గురుకుల పాఠశాలకు సగటున 3 సిలిండర్లు అవసరమని సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం సరఫరాలో నెలకొన్న సమస్యతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఒకేసారి నాలుగైదు సిలిండర్లు స్టాక్ ఉండే చోట ప్రస్తుతం ఒక్కటి కూడా అందుబాటులో లేదని వాపోతున్నారు. మూడు రోజులుగా సంక్షేమ వసతిగృహాల్లో కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తుంగా గురువారం నుంచి గురుకుల విద్యా సంస్థల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండడం, పొయ్యిపై చేసే వంటకు ఎక్కువ సెగ తగలడంతో అన్నం, సాంబార్, ఒక రకం కర్రీతో సరిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. -
కష్టంగా ఉందమ్మా... కాస్త సర్దండి
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో చదువుతున్న పిల్లల నుంచి ఫోన్లు వస్తే సంతోషపడిపోయే మధ్య తరగతి తల్లిదండ్రులు ఇప్పుడు హడలి పోతున్నారు. తీవ్రంగా కలవర పడుతున్నారు. ఏం చెబుతారోనని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ కష్టంగా ఉందని, ఎంతోకొంత సర్దమని బేలగా మాట్లాడు తుండటంతో అల్లాడిపోతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. జీవన వ్యయం భారీగా పెరిగింది. తాత్కాలిక ఉపాధి దొరకడం కూడా కష్టమవుతోందని విద్యార్తులు చెబుతున్నారు. అమెరికాలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని సమాచారం. యుద్ధం కారణంగా నిత్యావసరాల ధరలు పెరిగాయని, ఇంటి అద్దెలూ ఎక్కువగా వసూలు చేస్తున్నారని యూఎస్లోని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యూనివర్సిటీలు, అధికార యంత్రాంగం.. విద్యార్థులపై, వారి సామాజిక మాధ్యమాలపై అనుక్షణం నిఘా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ముమ్మర తనిఖీలు కొనసాగుతుండటంతో పార్ట్టైం ఉద్యోగాలు చేయలేకపోతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. చదువులూ అంతంత మాత్రమే విదేశీ విద్యార్థులు అందిస్తున్న సమాచారం మేరకు యుద్ధం నేపథ్యంలో చదువులు సైతం సరిగా సాగడం లేదు. కొన్ని చోట్ల క్యాంపస్లు తాత్కాలికంగా మూసివేశారు. గల్ఫ్ దేశాల్లో ఆన్లైన్ క్లాసులకే పరిమితమవుతున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ 2025 డేటా ప్రకారం 150 దేశాల్లో 18.8 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. దాదాపు 12.5 లక్షల మంది ఉన్నత విద్య చదువుతున్నారు. 6 లక్షల మంది పాఠశాల విద్యలో ఉన్నారు. యుద్ధ వాతావరణంలో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమన్ దేశాల్లో విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నట్టు వార్తలొస్తున్నాయి. వైద్య విద్య కోసం వెళ్ళిన విద్యార్థులు తమను స్వదేశానికి పంపమంటూ వేడుకుంటున్నారు. అప్పులు తీర్చేదెలా? : లక్షల్లో అప్పు చేసి పిల్లలను విదేశీ చదువులకు పంపిన తల్లిదండ్రుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. అప్పులు తీర్చలేక, విదేశాల్లో ఉన్న పిల్లలకు డబ్బులు పంపలేక తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల నుంచి ఫోన్ వచ్చిందంటే కంగారు పడిపోతున్నారు. క్షేమ సమాచారం తెలుసుకుంటూనే పరిస్థితి ఎలా ఉందని ఆరా తీస్తున్నారు. మధ్యతరగతి తల్లిదండ్రులు ఉన్న ఆస్తిని అమ్మేసి పిల్లలకు పంపుతున్నారు. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్ళు కొనసాగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. మెడిసిన్ తరగతులు జరగడం లేదు వైద్య విద్య కోసం ఇక్కడికి వచ్చా. తరగతులు జరగడం లేదు. యుద్ధం భయంతో నిద్రచీ కూడా పట్టడం లేదు. చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాం. మా తల్లిదండ్రులూ కంగారు పడుతున్నారు. నిత్యావసరాల కోసం రెట్టింపు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. – పల్లవి సామంతుల (యూఏఈలో వరంగల్ వైద్య విద్యార్థి) ఏం చేయాలో పాలు పోవడం లేదు యుద్ధం కారణంగా ఇక్కడ నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. తాత్కాలికంగా ఉద్యోగం చేసే పరిస్థితి లేదు. ఇంటి దగ్గర్నుంచి డబ్బులు పంపమని అడగాలన్నా ఇబ్బందిగానే ఉంటోంది. ఏం చేయాలో తెలియడం లేదు. కొన్నిసార్లు పస్తులు కూడా ఉంటున్నాం. – నీలేష్ సుకుమార్ (అమెరికాలోని హైదరాబాద్ విద్యార్థి) పొలం అమ్మి డబ్బులు పంపా బాబు అమెరికాలో పడుతున్న అవస్థలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది. యూఎస్కు పంపడానికి చేసిన అప్పు ఇప్పటికీ కడుతున్నాం. మరోవైపు యుద్ధం కారణంగా అక్కడ ఆర్థిక పరిస్థితి తారుమారైంది. దీంతో కొంత పొలం అమ్మేసి డబ్బులు పంపాల్సి వచ్చింది. – నీలకంఠం రామారావు(విద్యార్థి తండ్రి, మహబూబ్నగర్) -
రాష్ట్రంలో సిలిం‘డర్’!
సాక్షి, హైదరాబాద్ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం వల్ల పెట్రో ఉత్పత్తుల సరఫరాకు అంతరాయం కలుగుతుండటం, కేంద్రం ఆంక్షల నేపథ్యంలో.. రాష్ట్రంలో వాణిజ్య ఎల్పీజీ (కమర్షియల్ గ్యాస్) సిలిండర్ల కొరత తీవ్రరూపం దాల్చింది. గ్యాస్ ప్లాంట్లలో కమర్షియల్ సిలిండర్లను నింపే ప్రక్రియ ఆగిపోయింది. స్టార్ హోటళ్లు, పెద్ద రెస్టారెంట్లు, క్లబ్బుల నుంచి చిన్న టీ దుకాణాల వరకు గ్యాస్ కోసం ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఓ పది సిలిండర్లు సర్దండి’అంటూ గ్యాస్ ఏజెన్సీలను వేడుకుంటున్నా స్టాక్ లేదనే సమాధానమే వినిపిస్తోంది. ఎంత ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా ఫలితం ఉండటం లేదు. దీంతో చిన్న హోటళ్లు మూతపడుతున్నాయి. స్టార్ హోటళ్ల యాజమాన్యాల్లో కూడా పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. హోటళ్లతో పాటు పారిశ్రామిక ఉత్పత్తులపై కూడా గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రాష్ట్రంలో వినియోగమయ్యే ఎల్పీజీ గ్యాస్లో గృహ వినియోగం, హోటళ్లు, బేకరీలు, స్వీట్ దుకాణాలలో వినియోగించే గ్యాస్తో పోలిస్తే పరిశ్రమలకు వినియోగించే గ్యాసే ఎక్కువ. వీటితో పాటు పాలు, వాటి అనుబంధ ఉత్పత్తులు సరఫరా చేసే డెయిరీల్లో కూడా ఎల్పీజీ గ్యాస్ మంటలు రేపుతోంది. ఈ కారణంగా పాల సేకరణ నిలిచిపోతే గ్రామీణ పాడి పరిశ్రమ తీవ్ర సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గృహ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూస్తామనే ప్రకటనలు తప్ప ఇతర వర్గాల గురించి పౌరసరఫరాల శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. హైదరాబాద్ నగర శివారులోని చర్లపల్లి ప్రాంతంలో భారత్, హెచ్పీ, ఇండియన్ ఆయిల్ కంపెనీలకు సంబంధించిన మూడు ప్రధాన ఎల్పీజీ ఫిల్లింగ్ ప్లాంట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ఖాళీ అయిన గ్యాస్ సిలిండర్లన్నింటిలో ఎల్పీజీని ఇక్కడి నుంచే రీ ఫిల్లింగ్ చేస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయిల్ కంపెనీలు ఇచి్చన సూచనలతో చర్లపల్లిలో వాణిజ్య సిలిండర్లను ఫిల్ చేసే ప్రక్రియ దాదాపుగా నిలిచిపోయింది. ఇప్పటికే ఉన్న స్టాక్ను కొద్దికొద్దిగా సర్దుతున్నారు. రోజుకు 2 వేల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లు తీసుకునే ఏజెంట్కు 100 నుంచి 200 సిలిండర్లు ఇవ్వడం గగనంగా మారిందని అంబర్పేటకు చెందిన ఓ ఏజెన్సీ నిర్వాహకుడు తెలిపారు. గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుండటంతో కమర్షియల్ సిలిండర్ల ఫిల్లింగ్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెపుతున్నారు. దీంతో వందలాది గ్యాస్ లారీలు ప్లాంట్ల వెలుపల కిలోమీటర్ల మేర బారులు తీరాయి. సిలిండర్లతో వచ్చిన ట్రక్కులు రోజుల తరబడి నిలిచిపోవడంతో డ్రైవర్లు, క్లీనర్లు రోడ్లపైనే నిరీక్షించాల్సి వస్తోంది. పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగే పరిస్థితి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు రోజుకు వేల టన్నుల ఎల్పీజీ వినియోగిస్తుంటాయి. నాచారం, ఉప్పల్, ఐడీఏ బొల్లారం, బాలానగర్, సనత్నగర్, కాటేదాన్, పటాన్చెరులలోని దాదాపు అన్ని పరిశ్రమలల్లో ఎల్పీజీ గ్యాస్ వినియోగం పెద్ద ఎత్తున ఉంటుంది. 19 కిలోల ఎల్పీజీ నుంచి 33, 47, 425, 450 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను పారిశ్రామిక అవసరాల కోసం వినియోగిస్తుంటారు. భారీ పరిశ్రమలకు టన్నుల ఎల్పీజీతో కూడిన ట్యాంకర్ (బుల్లెట్)లను వినియోగిస్తారు. నగరంలోని బిస్కట్ కంపెనీలు, చాక్లెట్, పప్పు పాకెట్లు, మిఠాయిలు, తినుబండారాలు తయారు చేసే పరిశ్రమలు కూడా భారీగా గ్యాస్ను వినియోగిస్తున్నట్లు ఓ ప్రైవేట్ ఏజెన్సీ నిర్వాహకుడు తెలిపారు. మొత్తం ఎల్పీజీ వినియోగంలో పరిశ్రమలు దాదాపు 40 శాతం వాటా కలిగి ఉన్నట్లు ఓ అంచనా. కాగా దీనిపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో నగరంలో సేవారంగం, ఉత్పత్తి, ఆహార రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. కొన్ని పరిశ్రమలు ప్రైవేట్ గ్యాస్ కంపెనీలపై ఆధారపడుతున్నా అక్కడ కూడా సరఫరా పరిమితంగా ఉండటంతో పరిస్థితి క్లిష్టంగా మారుతోంది. పాడి పరిశ్రమపై ప్రభావం! హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న పరిశ్రమలతో పాటు రాష్ట్రంలోని ప్రధానమైన పాల ఉత్పత్తి కేంద్రాలు, దానా తయారీ కేంద్రాలు చిక్కుల్లో పడే పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సహకార రంగంలో ఉన్న విజయ డెయిరీ, కరీంనగర్ డెయిరీ, ముల్కనూరు డెయిరీ, మదర్ డెయిరీ తదితరాలతో పాటు ప్రైవేటు రంగంలో కొన్ని పదుల సంఖ్యలో డెయిరీలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. గ్రామాల నుంచి పాలు సేకరించి, వాటిని శుద్ధి చేసి లక్షల లీటర్ల పాలను ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా విక్రయిస్తున్నారు. పాల ప్రాసెసింగ్లో భాగంగా వేడి చేసేందుకు, పెరుగు, నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల తయారీకి ప్రతిరోజు గ్యాస్ సిలిండర్లు పెద్ద ఎత్తున అవసరం అవుతాయి. కాగా గ్యాస్ అందుబాటులో లేకపోతే డెయిరీల్లో కూడా ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ప్రైవేట్ గ్యాస్ కంపెనీలకు బారులు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సరఫరా తగ్గిపోవడంతో హోటల్ యజమానులు, పరిశ్రమల నిర్వాహకులు ప్రైవేట్ ఎల్పీజీ కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రైవేటు రంగంలోని గో గ్యాస్, టోటల్, అజియాస్, సూపర్, స్ఫూర్తి, భాగ్యనగర్ గ్యాస్ వంటి ప్రైవేటు కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. ఆయా గ్యాస్ ఏజెన్సీలు ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ ధరను కిలో రూ.140కి పెంచాయి. 7వ తేదీకి ముందు ఇది రూ.104గా ఉంది. ఇక 21 కిలోల ప్రైవేటు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రూ.3 వేలు పలుకుతోంది. దీన్ని బ్లాక్లో రూ.5 వేలకు కూడా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రంగంలోని మూడు కంపెనీల ఏజెన్సీలు కూడా బ్లాక్లో సిలిండర్లను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయనే ఆరోపణలు విని్పస్తున్నాయి. కాగా దేవాలయాల్లో జరిగే అన్నదాన కార్యక్రమాలు, తీర్థ ప్రసాదాల తయారీపై కూడా గ్యాస్ కొరత ప్రభావం పడింది. హాస్పిటళ్లలో, జీహెచ్ఎంసీ పరిధిలో రూ.5కే భోజనం అందించే హరేకృష్ణ ఫౌండేషన్కు ప్రతిరోజు దాదాపు 100 సిలిండర్లు అవసరం. సిలిండర్ల సరఫరా లేకపోతే ఆ సంస్థకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. -
ఢిల్లీ మద్యం కేసులో కవితకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు అందించారు. ఈ నెల 16న ఢిల్లీ హైకోర్టులో జరిగే విచారణకు హాజరుకావాలని సూచించారు. సరైన ఆధారాలు లేవంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మద్యం కేసును కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ తీర్పుపై సీబీఐ.. ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ వేసింది. ఈ మేరకు కేసులో నిందితులుగా పేర్కొన్న ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సహా 23 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం సీబీఐ అధికారులు కోర్టు నోటీసుల కాపీని బంజారాహిల్స్లోని కవిత నివాసంలో అందించారు. సీబీఐ అధికారులు తనకు నోటీసులు ఇచ్చినట్టు కవిత ధ్రువీకరించారు. ఈ విషయంపై తమ లీగల్ బృందంతో చర్చిస్తున్నామని, విచారణకు సహకరిస్తానని కవిత ఎక్స్లో పోస్ట్ పేర్కొన్నారు. -
2050 నాటికి 556 కి.మీ మెట్రో
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరాభివృద్ధి విస్తరణలో భాగంగా 2050 నాటికి 556.6 కి.మీ. వరకు మెట్రో కారిడార్ల ఏర్పాటును హెచ్ఎండీఏ ప్రతిపాదించింది. ప్రజా రవాణా సదుపాయాల విస్తరణలో భాగంగా 336.4 కి.మీ. వరకు ఎంఎంటీఎస్ సదుపాయాలను పెంచనున్నారు. దశలవారీగా 19,352 కి.మీ. రోడ్ నెట్వర్క్ను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. మహానగర అభివృద్ధి, విస్తరణకు అనుగుణంగా ‘మాస్టర్ ప్లాన్–2050’ రూపకల్పన తుది దశకు చేరుకుంది. కీలకమైన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ)పై గురువారం వర్క్షాప్ నిర్వహించారు. హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధ్యక్షత వహించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎంఏయూడీ) జయేశ్ రంజన్, మరో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్, రవాణా శాఖ కమిషనర్ కె.ఇలంబర్తి, ఎఫ్సీడీఏ కమిషనర్ కె.శశాంక, పట్టణ రవాణా అంశాలపై ప్రభుత్వ సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి, డీటీసీపీ డైరెక్టర్ ఎస్. దేవేందర్రెడ్డి, జేఎన్టీయూ కాకినాడ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ పాల్గొన్నారు. ప్రణాళికలపై విస్తృత చర్చ మాస్టర్ ప్లాన్–2050లో భాగంగా రూపొందించనున్న ఆర్థికాభివృద్ధి, సమగ్ర మొబిలిటీ, మౌలిక సదుపాయాల కోసం ప్రతిపాదించిన బ్లూ, గ్రీన్ ప్రణాళికలపై హెచ్ఎండీఏ అధికారులు వివరించారు. లీ అసోసియేట్స్ రూపొందించిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్పై విస్తృత చర్చ జరిగింది. వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, నిపుణులు సలహాలు, సూచనలను అందజేశారు. ప్రభుత్వ సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి, ‘ట్రాన్సిట్ ఫస్ట్’ విధానం ప్రాముఖ్యతను వివరించారు. ఇదీ సమగ్ర రవాణా ప్రణాళిక » 2050 వరకు సమగ్ర రవాణా ప్రణాళిక అమలుకు రూ.4 లక్షల కోట్లు అవసరమని అంచనా. » మెట్రో రైల్ను 2030 నాటికి 258.4 కిలోమీటర్లకు, 2040 నాటికి 534.1 కి.మీ.లకు, 2050 నాటికి 556.6 కి.మీ.లకు విస్తరించాలి. » 2030 నుంచి 2040 నాటికి ఎంఎంటీఎస్ నెట్వర్క్ను 202 కి.మీ.నుంచి 255.6 కి.మీ.కు పెంచాలి. 2050 నాటికి మొత్తం 336.4 కి.మీ.లకు విస్తరించాలి. » 2030 నుంచి 2040 వరకు, ఆ తరువాత 2050 వరకు దశలవారీగా కొత్త రోడ్లు, హైవేలు, 18 మీటర్ల కంటే వెడలై్పన కారిడార్లను నిర్మించాలి. 2050కి 19,352 కి.మీ.లకు రోడ్ నెట్వర్క్ను పెంచాల్సి ఉంటుంది. » 2050కి 75 గ్రేడ్ సెపరేటర్లు, 120 ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్ల ఏర్పాటును ప్రతిపాదించారు. 34 ఆర్ఓబీలు, 16 ఆర్యూబీలు అవసరం అని, 8 చోట్ల ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించాలని నిర్ణయించారు. » మూసీ ప్రక్షాళనలో భాగంగా 29 చోట్ల వంతెనలు నిర్మించి రవాణా సదుపాయాలను మెరుగుపర్చాలి. » ప్రత్యేక బస్ మార్గాలను ఏర్పాటు చేయాలి. బీఆర్టీఎస్, డీబీఎల్ సదుపాయాలను అభివృద్ధి చేయాలి. 2040 నాటికి 29 కి.మీ. 2050 నాటికి 48 కి.మీ.చొప్పున ఈ కారిడార్లను ఏర్పాటు చేయాలి. 2050 వరకు ఏడు భారీ బస్ టెర్మినళ్లను, ట్రక్ టెర్మినళ్లను ఏర్పాటు చేయాలి. -
‘కాళేశ్వరం’పై ఏప్రిల్ 8న తీర్పు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లలో అన్ని పక్షాల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఏప్రిల్ 8న తుది ఉత్తర్వులు వెలువరిస్తామని చెప్పింది. లిఖిత పూర్వక వాదనలు సమర్పించడానికి ఒకట్రెండు రోజులు అవకాశం ఇచ్చింది. అప్పటివరకు పిటిషనర్లపై ఎలాంటి చర్యలొద్దన్న మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించినా.. చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ హైకోర్టులో గత సెప్టెంబర్లో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దామ శేషాద్రినాయుడు, రామచంద్రరావు, న్యాయవాది తరుణ్ జి.రెడ్డి వాదనలు వినిపించారు. మీడియాకు వివరాలు ఎందుకు ఇచ్చారు? శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయడాన్ని, దర్యాప్తు సీబీఐకి అప్పగించడాన్ని మేము తప్పుబట్టడం లేదు. లోపభూయిష్టంగా కమిషన్ ఏర్పాటు, చట్టవిరుద్ధంగా చేపట్టిన విచారణను మాత్రమే ప్రశ్నిస్తున్నాం. నివేదికను అసెంబ్లీలో ఉంచి చర్చ జరగకముందే మీడియాకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి.. వివరాలు వెల్లడించాల్సిన అత్యవసరం ఎందుకు వచ్చిందో చెప్పాలి. చట్టప్రకారం, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా కమిషన్ ఏర్పాటు చేశామంటున్న ప్రభుత్వం.. పిటిషనర్ల కీర్తి ప్రతిష్టలు దెబ్బతీసేలా చేయడం సరికాదు. బహుళ ప్రయోజనాలతోనే నాటి ప్రభుత్వం కాళేశ్వరం చేపట్టింది. దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రంగా మారింది. 13 జిల్లాలకు తాగు, సాగు నీటిని అందించింది. అంచనాతో పోలిస్తే వ్యయం పెరగని ఒక్క ప్రాజెక్టు ఇరు రాష్ట్రాల్లో ఉంటే చూపాలి? కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే కమిషన్ వేశారు. నివేదిక చట్టవిరుద్ధం. రద్దు చేయాలి’అని చెప్పారు. రాంచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. చట్టంలోని నిబంధనలు పాటించకుండా ఏర్పాటు చేసిన కమిషన్ చెల్లదన్నారు. తరణ్ జి.రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సాక్షిగా పిలిచి వివరాలు తీసుకుని నివేదికలో ఇష్ట్రం వచ్చినట్లు పరువుకు నష్టం కలిగించేలా ఆరోపణలు చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పు రిజర్వు చేసింది. భవన వివాదాలపై ట్రిబ్యునళ్లుఏర్పాటు చేయాలని సర్కార్కు హైకోర్టు సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల పరిధిలోని భవన నిర్మాణ అనుమతులు, అక్రమ నిర్మాణాల సీజ్, కూల్చివేతలు లాంటి వివాదాలపై ప్రత్యేక ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. రాజ్యాంగ ధర్మాసనానికి వచ్చే పిటిషన్ల సంఖ్య తగ్గడంతోపాటు ఇప్పటివరకు ఉన్న కేసుల భారం కూడా కొంత తగ్గుతుందని వ్యాఖ్యానించింది. ధర్మాసనం సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్రెడ్డి చెప్పారు. అనంతరం స్థల వివాదంపై దాఖలైన అప్పీల్ను ధర్మాసనం ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. టైటిల్ను పరిశీలించకుండా మేడ్చల్ మల్కాజిగిరి ఉప్పల్ మండలం కొత్తపేట సర్వే నంబర్ 106, 107లో భవన నిర్మాణానికి రాధేశ్యామ్ కన్స్ట్రక్షన్కు అనుకూలంగా 2025, అక్టోబర్ 10న అనుమతి మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో హబ్సిగూడకు చెందిన శ్రీనివాస్యాదవ్, మలక్పేట్కు చెందిన డీఈ నాగరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. కమిషనర్ ప్రాథమికంగా టైటిల్, సబ్జెక్ట్ ఆస్తిపై హక్కులు ధ్రువీకరించిన తర్వాతే భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేశారని, అనుమతిని రద్దు చేయమని చెప్పడానికి పిటిషనర్ల వద్ద సరైన ఆధారాలు లేవంటూ పిటిషన్ను కొట్టివేశారు. న్యాయాధికారులను కేటాయిస్తాం.. దీన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అప్పీల్ విచారణ సందర్భంగా ఇలాంటి వేలాది పిటిషన్లు హైకోర్టులో పెండింగ్లో ఉండటాన్ని ప్రస్తావించింది. ప్రతీ వివాదం నేరుగా హైకోర్టుకు రాకుండా ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తే సత్వర పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడింది. ఈ విషయాన్ని ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చించాలని ఏజీకి సూచించింది. ప్రత్యేక ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొస్తే న్యాయాధికారులను కేటాయిస్తామంది. దీనిపై ఏజీ స్పందిస్తూ.. ఈ విషయంపై ప్రభుత్వానికి న్యాయసలహా ఇస్తానని పేర్కొన్నారు. ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న విషయాన్ని తమ తీర్పులో ప్రస్తావిస్తామని.. అప్పుడు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ను మూడు వారాలపాటు వాయిదా వేస్తున్నామని.. అప్పటివరకు ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. -
మేడిగడ్డకు బోర్హోల్ ‘పరీక్ష’
సాక్షి, హైదరాబాద్: కుంగిపోయిన మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఎన్నో సాంకేతిక అవాంతరాలు ఎదురవుతున్నాయి. బరాజ్ పునరుద్ధరణకు ముందు దాని పునాదుల కింద భూగర్భ స్వభావం, దాని స్థితిగతులను నిర్థారించడం కీలకం కాగా, ఆ సమాచారం ఆధారంగానే పునరుద్ధరణ డిజైన్లను రూపొందిస్తారు. ఈ సమాచారం కోసం బరాజ్ కాజ్వే, స్పిల్వేకు బోరు రంధ్రాలు (బోర్హోల్స్) చేయాల్సి ఉండగా, సమస్యలు ఉత్పన్నమయ్యాయి. బరాజ్ పునాదుల కింద నదీగర్భంలో ఉన్న సమస్యలను గుర్తించడానికి జియో ఫిజికల్, జియో టెక్నికల్, హైడ్రాలిక్ మోడల్ పరీక్షలను నిర్వహించడానికి పూణెలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ పవర్ అండ్ వాటర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)కు గతంలో వర్క్ఆర్డర్ జారీ చేసింది. ఈ పరీక్షల్లో భాగంగా బోర్హోల్స్ వేసేందుకు ప్రయత్నించడంతో తీవ్ర సమస్యలు ఉత్పన్నమైనట్టు సమాచారం. దీంతో క్షేత్రస్థాయిలో పరీక్షించి బోర్హోల్స్ తవ్వడానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి సత్వరంగా డ్రిల్లింగ్ నిపుణుడిని పంపాలని సీడబ్ల్యూపీఆర్ఎస్కు రాష్ట్ర నీటిపారుదల శాఖ తాజాగా విజ్ఞప్తి చేసింది. -
1.15 కోట్ల కుటుంబాలకు బీమా
సాక్షి, హైదరాబాద్/మణికొండ: రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా కల్పించి, ఆరోగ్య భద్రత అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గురువారం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని మెడికవర్ 25వ ఆసుపత్రిని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. సంపూర్ణమైన విద్య అందిస్తే 90 శాతం సమస్యలు పరిష్కారమవుతాయి. సంక్షేమ పథకాల అవసరం ఉండదు. 2006లో రాజీవ్ ఆరోగ్య శ్రీ వచ్చింది. 20 ఏళ్లలో కోట్లాది మందికి వైద్య సేవలందించాం. ఈ డేటాను ఎనాలసిస్ చేస్తాం. ఏ ప్రాంతంలో ఎలాంటి రోగాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయనేది స్పష్టమవుతుంది. దీనికి తగ్గట్లు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 4 కోట్ల మంది ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకోవడానికి డేటాబేస్ డిజిటల్ కార్డును సిద్ధం చేస్తాం. పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలో ప్రారంభించాం. మెడికల్, ఫార్మా, డ్రగ్స్ హబ్గా హైదరాబాద్ మారింది’అని చెప్పారు. విద్యార్థులకు రవాణా సదుపాయం ‘రా్రష్తంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 21 లక్షల మంది విద్యార్థులున్నారు. కేవలం పాఠశాలకు వెళ్లి చదువుకునే విధానం తల్లిదండ్రులకు సంతృప్తినివ్వడం లేదు. 3వ తరగతి చదువుతున్న విద్యార్థి 2వ తరగతి పాఠ్యపుస్తకాన్ని కేవలం 6.5 శాతం మంది మాత్రమే చదవగలుగుతున్నట్లు మా సర్వేలో తేలింది. విద్యతోపాటు స్కిల్ అవసరం. స్కిల్ లేకుంటే ప్రపంచంతో పోటీపడలేం. నర్సరీ నుంచి 12 వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే కొత్త కాన్సెప్ట్ తెస్తున్నాం. ఎడ్యుకేషనల్ రిఫారŠమ్స్ తీసుకురావడమే కాకుండా ఇప్పటివరకు ఉన్న ఇంటర్మీడియెట్ విధానాన్ని వచ్చే ఏడాది నుంచి రద్దు చేస్తాం. నర్సరీ నుంచి 12 వరకు స్కూల్ ఎడ్యుకేషన్ కిందకు తెస్తాం. వివిధ పాఠశాలలను ఒక దగ్గరకు తెస్తాం. ప్రైవేటు స్కూల్స్ సక్సెస్ స్టోరీ.. రవాణానే. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఉచితంగా, లేదా 50 శాతం రాయితీతో ప్రభుత్వమే విద్యార్థులను పాఠశాలకు తరలిస్తుంది. మేము ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)గా మార్చాం. సీఎస్సార్ కింద పదేళ్ల పాటు టాటాసన్స్ సంస్థ వీటిని నిర్వహిస్తుంది. రూ.2,400 కోట్ల బడ్జెట్లో 2,100 కోట్లు టాటాసన్స్ భరిస్తుంది. భవిష్యత్తులో పాలిటెక్నిక్ కళాశాలలనూ ఈ కోవలోకి తెస్తాం. ప్లేట్లో ఆహారం వడ్డిస్తే అది ఎన్ని కేలరీలు ఉంటుందో తెలిపే యాప్ ఉంది. దాన్ని వాడుకుంటాం’అని రేవంత్రెడ్డి చెప్పారు.బ్లూ కలర్ జాబ్స్కు సిద్ధం కండి‘వైట్ కాలర్ జాబ్లో వచ్చే గ్యాప్ను భర్తీ చేయడానికి బ్లూ కలర్ జాబ్కు ప్రిపేర్ కావాలి. దీన్ని ఏఐ రీప్లేస్ చేయలేదు. మొదటి దశలో ఎడ్యుకేషన్, ఇరిగేషన్ తీసుకున్నాం. రెండో దశలో సేవారంగం తీసుకున్నాం. ఇప్పుడు తయారీ రంగంపై దృష్టిసారిస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి హెల్త్ టూరిజంలో తెలంగాణకు 8–10 లక్షల మంది, ఇతర దేశాల నుంచి 2.10 లక్షల మంది వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. కొన్ని నెలల్లో రూ.1,800 కోట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేశాం. 10 వేల బెడ్ ఆసుపత్రులుగా ఎల్బీనగర్, సనత్నగర్, అల్వాల్, వరంగల్ టిమ్స్, నిమ్స్ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేయబోతున్నాం. ముఖ్యమంత్రిగా అడుగుతున్నా ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు సంవత్సరంలో ఒక నెల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయండి. మిగతా 11 నెలలు మీరు పనిచేస్తున్న సంస్థలు, కుటుంబం కోసం పనిచేయండి. దీనికి ఒక ప్లాట్ఫాం క్రియేట్ చేస్తున్నాం. వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. త్వరలోనే కొత్త పాలసీతో మీ ముందుకొస్తాం’అని రేవంత్రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్యాదవ్, రఘువీర్రెడ్డి, సీపీ సజ్జనార్, మెడికవర్ ఆసుపత్రి చైర్మన్ అనిల్కృష్ణ తదితరులు ఉన్నారు. -
హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చందానగర్ ప్రాంతంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న అను ఫర్నీచర్ దుకాణం గోడౌన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, భారీగా ఎగిసిపడ్డాయి.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. -
త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనలో పోలీస్ శాఖ పాత్ర కీలకం
హైదరాబాద్: 2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా రాష్ట్రం ముందుకు పోతున్న క్రమంలో ఈ లక్ష్యసాధనలో పోలీస్ శాఖ పాత్ర కీలకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మొదట హోంశాఖ తదుపరి మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబుతో కలిసి పరిశ్రమలు, ఐటీ శాఖల ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు వస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతలు కీలకం అన్నారు. ఈ అంశంలో ఏ చిన్న పొరపాటుకు హోంశాఖ అధికారులు, సిబ్బంది అవకాశం ఇవ్వరాదని, ప్రతి కదలిక మీ కను సన్నల్లో ఉండాలని సూచించారు. విధుల నిర్వహణ క్రమంలో హోం శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్ నగరం ప్రపంచంలో మేటి నగరంగా ఎదుగుతున్న క్రమంలో వేగంగా పలు సంస్కరణలు చేపడుతున్నామని ఇందులో భాగంగాపోలీస్ శాఖలో దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాల (EV )వినియోగాన్ని పెంచాలని సూచించారు. అదేవిధంగా నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర గణనీయంగా ఉంటుంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సీసీ కెమెరాల వినియోగాన్ని పెద్ద సంఖ్యలో చేపట్టాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని చిన్న కదలికను సైతం వేను వెంటనే గుర్తించి నిఘాను పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాల వినియోగాన్ని పెంచాలని అందుకు అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. 2047 త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా లక్ష సాధనలో పబ్లిక్, ప్రైవేట్ (PP )మోడల్ అనివార్యమని ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని పరిశ్రమల శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు.CURE, PURE తో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి RARE (రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ) సమ ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ సీఎం సూచించారు. RARE రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీస్ (MSME)లను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది ప్రజా ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. ఎంఎస్ఈల ద్వారా రాష్ట్ర నలుమూలలోని యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి తో పాటు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉన్న రంగం ఎంఎస్ఈ అని తెలిపారు. 41 జీసీసీలతో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, ఇదే వేగాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వ నుంచి ప్రోత్సాహం కల్పిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు అన్నారు. డాటా సెంటర్లలో AI వినియోగాన్నిపెద్ద ఎత్తున చేపట్టాలని మంత్రి శ్రీధర్ బాబుకు సూచించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీవీ ఆనంద్, TGIICC MD శశాంక, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
కిడ్నీ వ్యాధులను ముదరనివ్వొద్దు..
హైదరాబాద్: మన దేశంలో కిడ్నీ వ్యాధులపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది జబ్బు ముదిరేంత వరకు గుర్తించడమే లేదు. చిన్న వయస్సు నుంచే కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే కిడ్నీల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం మార్చి రెండో గురువారం ప్రపంచ వ్యాప్తంగా ‘వరల్డ్ కిడ్నీ డే’ గా జరుపుకుంటున్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా గురువారం ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో మూత్రపిండాల ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కిడ్నీ వ్యాధుల నివారణ, ముందస్తు గుర్తింపు, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను సంబంధిత విభాగాల డాక్టర్లు వివరించారు. ఈ సందర్భంగా కామినేని ఆస్పత్రి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ ఎ.సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. కిడ్నీ వ్యాధుల నివారణ, ముందస్తు పరీక్షల ప్రాధాన్యాన్ని వివరించారు. ‘కిడ్నీ సంబంధిత వ్యాధుల లక్షణాలు కనిపిస్తే.. ముందుగా సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. గాబరా పడి బీపీ. షుగర్లు పెంచుకుని వ్యాధులను ముదరనివ్వొద్దు. ఇలా వ్యవహరిస్తే సగం వరకు వ్యాధులను నయం చేయవచ్చు. కిడ్నీ జబ్బులు, డయాలసిస్ అనగానే ఇక జీవితం అయిపోయినట్లుగా భావించొద్దు. అధునాతన చికిత్సల ద్వారా డయాలసిస్, ట్రాన్స్ప్లాంటేషన్తో విజయవంతంగా జీవితాన్ని గడపవచ్చు’ అని సూచించారు. కామినేని ఆస్పత్రి యూరాలజీ విభాగం డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ వి. సూర్యప్రకాశ్ మాట్లాడుతూ.. ‘కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మొదటి, సులభమైన మార్గం సరైన హైడ్రేషన్. అది సరిగా లేకపోతే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి. రోజుకు కనీసం 2, 3 లీటర్ల నీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి కిడ్నీలపై భారం తగ్గుతుంది. కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం తగ్గుతుంది. మంచి అలవాట్లు కిడ్నీలను దీర్ఘకాలం కాపాడుతాయి’ అని పేర్కొన్నారు. -
‘గ్యాస్ బ్లాక్ మార్కెట్పై చర్యలు తీసుకోండి’
హైదరబాద్: గ్యాస్ కొరత కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 90 శాతం హోటళ్లు మూతపడే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏర్పడిన గ్యాస్ కొరతను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. గ్యాస్ కొరత కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రధానంగా గ్యాస్ బ్లాక్ మార్కెట్ కారణంగానే ఈ పరిస్థితి వచ్చినట్లు కనబడుతోందని, ఈ బ్లాక్ మార్కెట్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కేటీఆర్. ఈ మేరకు సిలిండర్ల తీవ్ర కొరతను పరిష్కరించడానికి వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాశారు. ఎల్పీజీ సిలిండర్ లభ్యతపై పారదర్శక సమాచారాన్ని అందించడానికి రియల్-టైమ్ పబ్లిక్ డాష్బోర్డ్ను రూపొందించాలని ఆయన సిఫార్సు చేశారు చిన్న వ్యాపారాలపై అదనపు ఆర్థిక భారాన్ని నివారించడానికి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లపై తాత్కాలిక ధరను నిర్ణయించి దానిని అమలు చేయాలన్నారు. -
మద్యం తాగి.. కత్తి కొనుగోలు చేసి...
హైదరాబాద్: పక్కా పథకం ప్రకారమే మధురానగర్లో వారాహి కన్సల్టెన్సీ నిర్వాహకుడు శశికిరణ్రెడ్డిని పొలమరశెట్టి ప్రభుకుమార్(19) హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో నిందితుడిని పోలీసులు సెల్ఫోన్ నెంబర్ ఆధారంగా సాంకేతికతను వినియోగించి చేధించి పట్టుకున్నారు. వివరాలివీ... విశాఖపట్నం జిల్లా మునగపాక మండలం ఘనపర్తి గ్రామానికి చెందిన పొలమరశెట్టి ప్రభుకుమార్(19) టెన్త్ ఫెయిలయ్యాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి మధురానగర్లో ఉన్న వారాహి కన్సల్టెన్సీ నిర్వాహకుడు శశికిరణ్రెడ్డిని సంప్రదించాడు. ఇందుకోసం ఫీజు కింద రూ. 2,500 చెల్లించాడు. హైదరాబాద్లోని ఉమర్గూడలో అద్దెకు ఉంటున్నాడు. లక్డీకాపూల్లోని హిల్టాప్ హోటల్లో ప్రభుకుమార్కు సెక్యూరిటీగార్డ్ ఉద్యోగాన్ని కన్సల్టెన్సీ ద్వారా ఇప్పించాడు. అక్కడ 10 రోజులు పనిచేసిన ప్రభు నిర్వాహకులతో గొడవ పడి ఉద్యోగం మానేయడంతో పనిచేసిన రోజులకు హోటల్ యాజమాన్యం జీతం చెల్లించింది. అయితే తనకు సరైన ఉద్యోగం ఇప్పించలేదని ప్రభుకుమార్ కొద్ది రోజులుగా శశికిరణ్రెడ్డి చుట్టూ తిరుగుతూ తాను చెల్లించిన రూ. 2,500 వాపసు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేయసాగాడు. దీంతో రూ. 1500 ప్రభుకు ఇచ్చి పంపించారు. ఇంకా రూ. 1000 బాకీ ఉన్నాడని, అవి కూడా ఇవ్వాలంటూ రోజూ కన్సల్టెన్సీ చుట్టూ తిరుగుతున్నా స్పందన లేకపోవడంతో శశికరణ్రెడ్డి అంతుచూడాలని పథకం వేశాడు. ఇందులో భాగంగానే మంగళవారం మధ్యాహ్నం శశికిరణ్ను హత్య చేసేందుకు మధురానగర్కు వచ్చాడు. ప్రాణభయంతో పరుగులు తీసిన ఉద్యోగులుమంగళవారం మధ్యాహ్నం మధురానగర్లోని ఓ మద్యం దుకాణంలో ఫూటుగా మద్యం తాగాడు. అక్కడే ఓ కూరగాయల కత్తిని కొనుగోలు చేసి జేబులో పెట్టుకుని నేరుగా శశికిరణ్ ఆఫీసులోకి ప్రవేశించి గడియ వేసి బెదిరించి తన స్నేహితుడికి రూ. 1500 ఫోన్పే చేయించాడు. ఆ తరువాత రూ. 1000 ఇవ్వాలంటూ కత్తితో పొడిచాడు. తలుపు తీసి బయటకు వచ్చే సమయంలో అక్కడే పనిచేస్తున్న ట్రైనర్ లయ కనిపించడంతో ఆమెపై కూడా కత్తితో దాడి చేయడంతో భయంతో ఆమె రెండో అంతస్తులోకి పరుగులు తీసి తలుపులు వేసుకుని ప్రాణాలు కాపాడుకుంది. మిగతా ఉద్యోగులు కూడా భయంతో గదుల్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.అక్కడే రక్తం శుభ్రం చేసుకుని... నిందితుడు ప్రభు హత్య చేసిన తర్వాత బయటకు వెళ్లే సమయంలో భవనం కింది భాగంలో ఉన్న రక్తపు మరకలను నీటితో శుభ్రం చేసుకుని కత్తిని అక్కడే వదిలేసి అమీర్పేట వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఒక ఆటోను బుక్ చేసుకుని ఎల్బీనగర్ వెళ్లాడు. శశికిరణ్ను కత్తితో పొడిచిన సమయంలో పెనుగులాటలో ప్రభుకుమార్కు కూడా చేతి వేళ్లకు గాయాలు కావడంతో ఎల్బీనగర్లోని రెయిన్బో పిల్లల ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వెళ్లాడు. తాము ఇక్కడ చికిత్స చేయించలేమని నిరాకరించారు. బయటకు వచి్చన నిందితుడు ఓ కారును బుక్ చేసుకుని విజయవాడ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. చిట్యాల వద్దకు రాగానే నిందితుడి నుంచి రక్తపు వాసన వస్తుండటంతో గమనించిన కారు డ్రైవర్ అతన్ని అక్కడే వదిలేసి తిరుగుముఖం పట్టాడు. చిట్యాలలో బస్సు ఎక్కిన నిందితుడు తొలుత జగ్గయ్యపేటలోని తన స్నేహితుడి వద్దకు వెళ్లగా, అప్పటికే విషయం తెలుసుకున్న స్నేహితుడు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో విజయవాడకు వెళ్లి కనకదుర్గా టెంపుల్ సమీపంలో తన స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్నాడు. ఫోన్ నెంబర్ సహాయంతో పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ట్రాక్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో నిందితుడు తలదాచుకున్న ప్రాంతాన్ని బుధవారం తెల్లవారుజామున గుర్తించారు. అక్కడి నుంచి నిందితుడిని మధురానగర్ ఠాణాకు తరలించారు. ఘటనా స్థలంలో కత్తిని స్వా«దీనం చేసుకున్నారు. రూ. 1000 కోసమే శశికిరణ్ను హత్య చేసినట్లుగా నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. మొత్తానికి ఈ కేసును పోలీసులు చేధించారు. గాయాలపాలైన లయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. రూ.1000 ఇవ్వలేదని చంపేశాడు -
యుద్ధం ఎఫెక్ట్: హైదరాబాద్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు
సాక్షి, హైదరాబాద్: అక్కడెక్కడో పశ్చిమాసియాలో యుద్ధం ఇక్కడి జన జీవన ఛిన్నాభిన్నం చేస్తోంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో చమురు సరఫరా గొలుసు తెగిపోవడంతో మహా నగరంలో పెట్రోల్, సీఎన్జీ, వంటగ్యాస్ కొరత తీవ్రరూపం దాల్చింది. ఇంధన సెగలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి నిన్నటి వరకు సాఫీగా సాగిన నగర జీవనం.. ఇప్పుడు బంకుల ముందు పడిగాపులతో నరకప్రాయంగా మారింది. కిలోమీటర్ల మేర క్యూలైన్లు చమురు కంపెనీల నుంచి డీలర్లకు స్టాక్ సరఫరా గణనీయంగా తగ్గడంతో నగరంలోని మెజారిటీ పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులను దర్శనమిస్తున్నాయి. తెరిచి ఉన్న కొన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర ఆటోలు, కార్లు క్యూ కడుతున్నాయి. గంటల తరబడి వేచి చూసినా ఇంధనం దొరుకుతుందన్న గ్యారంటీ లేకపోవడంతో వాహనదారులు విలవిలలాడుతున్నారు. గ్యాస్ ఆటోలు కలిగిన డ్రైవర్లు ఎల్పీజీ, సీఎన్జీ నింపుకొనేందుకు రాత్రింబవళ్లూ ఆయా బంకుల వద్ద గంటలతరబడి వేచి ఉన్నారు. ముఖ్యంగా సీఎన్జీపై ఆధారపడే ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది. వాణిజ్య గ్యాస్కు ‘గండం’.. ఇంధన కొరత కేవలం వాహనాలకే పరిమితం కాకుండా వంటగది వరకు పాకింది. వంట–గ్యాస్ కష్టాలు తీవ్రంగా మారాయి. కర్రీ పాయింట్లు, హోటళ్లు, చిన్న చిన్న టిఫిన్ బండ్లపై ఎఫెక్ట్ బాగా కని్పస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్యాస్ నిల్వలను కేవలం గహ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ మళ్లించడంతో, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. గ్యాస్ కొరతతో నగరం పొడవునా చిన్న, మధ్యతరహా హోటళ్లు మూతపడుతున్నాయి. గ్యాస్ పొదుపు చర్యల్లో భాగంగా హాస్టల్ నిర్వాహకులు మెనూలో కోత విధిస్తున్నారు. వంటల సంఖ్యను తగ్గించడంతో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతులెత్తేస్తున్న డీలర్లు ముందస్తు సమాచారం లేకుండానే చమురు సంస్థల్లో లోడింగ్ పాయింట్ల వద్ద స్టాక్ నిలిపివేయడంతో సరఫరా లేక డీలర్లు చేతులెత్తేస్తున్నారు. ఇలాగే కొనసాగితే రవాణా రంగం పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
విదేశీ మెడికల్ విద్యార్థులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో మెడిసిన్ చదివి, ఇక్కడ వైద్య సేవలు అందించాలనుకునే విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)ఊరట కలిగించింది. 2026–27 విద్యా సంవత్సరానికి విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్ఎంజీస్) కోసం దేశవ్యాప్తంగా 43,250 కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్ (సీఆర్ఎంఐ) సీట్లు అందుబాటులో ఉంచినట్టు ప్రకటించింది. ఇందులో తెలంగాణలో 4,871 సీట్లు ఉన్నాయి. ఈ మేరకు ఎన్ఎంసీకి చెందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు (యూజీఎంఈబీ) మంగళవారం రాష్ట్ర వైద్య మండళ్లకు సర్క్యులర్ జారీ చేసింది. ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర వైద్య మండళ్లు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్తో సమన్వయం చేసుకొని ఎఫ్ఎంజీలకు ఇంటర్న్షిప్ సీట్లు కేటా యించాలి. ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీల్లో అనుమతించిన ఇంటర్న్ల సంఖ్యలో 7.5 శాతం సీట్లు విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్స్కు ఇవ్వాలని సూచించింది. కొత్తగా ప్రారంభమైన మెడికల్ కాలేజీలలో సీఆర్ఎంఐ సీట్లలో 100 శాతం ఎఫ్ఎంజీలకు కేటాయించాలని పేర్కొంది. 2022–23 నుంచి 2025–26 మధ్య పెరిగిన ఎంబీబీఎస్ సీట్ల కారణంగా ఏర్పడిన అదనపు ఇంటర్న్షిప్ అవకాశాలను కూడా విదేశీ విద్యార్థులకు ఇవ్వాలని తెలిపింది. తెలంగాణలో కొత్త కాలేజీల్లో 100 శాతం సీట్లు తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్స్కు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించనున్నారు. ఇందులో గాంధీ మెడికల్ కాలేజీ–13 సీట్లు, ఉస్మానియా మెడికల్ కాలేజీ –19 సీట్లు , కాకతీయ మెడికల్ కాలేజీ, వరంగల్కు 19 సీట్లు, ప్రభుత్వ కాలేజీల్లో మహబూబ్నగర్లో 13, సిద్దిపేటలో 13, సూర్యాపేటలో 11, నల్లగొండలో 11, నిజామాబాద్లో 9 సీట్లు, సిద్దిపేట, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, రామగుండం, సంగారెడ్డి, మహబూబాబాద్, నాగర్కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 150 సీట్లు, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల, మహేశ్వరం, నిజామాబాద్, నిర్మల్, నాగర్కర్నూల్, వికారాబాద్, నారాయణపేట, కామారెడ్డి, ఆసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్ల, ప్రభుత్వ కాలేజీల్లో 100 సీట్లు , నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 200 సీట్లు, నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్– 250 సీట్లు , మహవీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్–200 సీట్లు , ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 150 సీట్లు, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ, సంగారెడ్డిలో 150 సీట్లు కాగా మిగతా ప్రభుత్వ కాలేజీల్లో 50 సీట్ల చొప్పున కేటాయించారు. పాత ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మమత(ఖమ్మం)లో 61, మెడిసిటీ (ఘన్పూర్) 11, మమత (బాచుపల్లి)11, మహేశ్వర (మెదక్) 11, మల్లారెడ్డి, మల్లారెడ్డి (మహిళ) కళాశాలల్లో 15 చొప్పున సీట్లు కేటాయించారు. ఇలా ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొత్తం 4,871 సీఆర్ఎంఐ సీట్లు అందుబాటులో ఉంటాయి. -
ఫిరాయింపుల్లో ప్రథమ ముద్దాయి రాహుల్గాంధీ
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పు అత్యంత అప్రజాస్వామికం, దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆడిస్తున్న ఆటలో భాగంగానే స్పీకర్ ప్రసాద్కుమార్ పిటిషన్లు డిస్మిస్ చేశారన్నారు. అసెంబ్లీ స్పీకర్పై రాహుల్గాంధీ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందని చెప్పారు. తెలంగాణ నుంచి వస్తు న్న డబ్బు సంచుల కోసం ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ నడిపించిందని, స్పీకర్ చేతుల్లో నిర్ణయాధికారం లేదన్నారు. పార్టీ ఫిరాయింపుల్లో ప్రథమ ముద్దాయి రాహుల్గాంధీ అని, ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగంపై కాంగ్రెస్ చేస్తున్న దాడిలో ప్రధాన నేరస్తుడు రాహుల్గాంధీ అని కేటీఆర్ విమర్శించారు. ఆయన అనుమతి లేకుండా అనర్హత పిటిషన్లు డిస్మిస్ చేసేంత సాహసం స్పీకర్ చేయలేరన్నారు. మాజీ మంత్రులు జోగు రామన్న, పువ్వాడ అజయ్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ తాతా మధు, పార్టీ నేతలు కర్నె ప్రభాకర్, డాక్టర్ ఆనంద్, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తదితరులతో కలిసి కేటీఆర్ బుధవారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై రాహుల్గాంధీ సమాధానం చెప్పాలి. ఈ నిర్ణయంతో రాహుల్ గాంధీ జోకర్గా నిలిచిపోయారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే వెనువెంటనే సభ్యత్వం కోల్పోయేలా చట్టం తెస్తామని ప్రకటించిన రాహుల్గాంధీకి ఏమాత్రం సిగ్గూ, గౌరవం ఉన్నా స్పీకర్ నిర్ణయంపై స్పందించాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. వెలుగుమట్ల కూల్చివేతలపై వదిలిపెట్టం ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో పేదల ఇళ్ల కూల్చివేత అంశాన్ని అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రశ్నించి తీరుతామని కేటీఆర్ అన్నారు. ‘ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల బినామీలు భూ మాఫియాగా ఏర్పడి పేదల మీద దాడి చేసి బయటకు పంపుతున్నారు. వెలుగుమట్లతోపాటు రాష్ట్రంలో కూలగొడుతున్న ప్రతీ ఇంటికి తిరిగి పట్టా ఇచ్చేంత వరకు వదిలిపెట్టం. ఇళ్లు కోల్పోయి ఏడుస్తున్న బాధితులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ మృగాల్లా మాట్లాడుతున్నారు. మంత్రుల ఆదేశాలతో ఖమ్మం ఏసీపీ బాధితులపైనే కేసులు పెడుతున్నారు’అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్, రాహుల్నుసన్మానించాలి‘ఒక పార్టీ బీ ఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండానే మరో పార్టీ బీ ఫామ్ మీద ఎంపీగా ఎలా పోటీ చేస్తారు. ఇంత అద్భుత నిర్ణయం తీసుకున్న స్పీకర్ను, ఆయన వెనుక ఉన్న రాహుల్గాందీని బహిరంగ సభ వేదికపై సత్కరించాలి’అని కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘అన్ని సాక్ష్యాలు ప్రజల ముందు ఉన్నా, విచారణ చేయాల్సిన అవసరం ఏముంది. ఫిరాయింపుల సంస్కృతి గురించి ఇకపై మాట్లాడే నైతిక హక్కు రాహుల్గాం«దీ, కాంగ్రెస్ పార్టీకి లేదు. పార్టీ ఫిరాయింపుల అంశంపైన దానం నాగేందర్, కడియం శ్రీహరిలు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ ఇచ్చిన గౌరవం, వచి్చన పదవులపై ఆయనే ప్రశ్నించుకోవాలి. మురికి మాటలు మాట్లాడుతున్న కడియం శ్రీహరి బీఆర్ఎస్లో కొనసాగుతున్నట్టు చేస్తున్న ప్రకటనలు ఆయన నైతిక పతనానికి అద్దం పడుతున్నాయి’అని కేటీఆర్ విమర్శించారు. -
రాష్ట్రానికి గ్యాస్ దడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం పతాక స్థాయికి చేరింది. పది రోజులుగా సరఫరాలో నెలకొన్న అంతరాయం ఇప్పుడు సామాన్యుడి కడుపు కొడుతోంది. అటు గృహ వినియోగదారులు, ఇటు వ్యాపార వర్గాలు గ్యాస్ కోసం అల్లాడిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి మొదలుకొని మారుమూల జిల్లాల వరకు పరిస్థితి అదుపు తప్పుతోంది. వంటింటి గ్యాస్ బుకింగ్ల సంఖ్య రెండు మూడు రోజులుగా భారీగా పెరిగినట్టు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. బుక్ చేసిన వారికి గ్యాస్ సిలిండర్లు పంపించేందుకు ఎప్పటికప్పుడు స్టాక్లతో ఏజెన్సీలు కసరత్తు చేస్తున్నాయి. ఇదే సమయంలో వంట గ్యాస్, కమర్షియల్ గ్యాస్ను ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అదనుగా గ్యాస్ బుకింగ్, సరఫరా పేరుతో సైబర్ నేరగాళ్లు కూడా రంగంలోకి దిగారని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ ప్రజలకు సూచించారు. చాయ్ డబ్బా నుంచి స్టార్ హోటల్ వరకు.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల మందికి పైగా ఆధారపడిన హోటల్, దాని అనుబంధ రంగాలు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల కొరతతో మూతపడే స్థితికి చేరుకుంటున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల బుకింగ్ను కంపెనీలు తాత్కాలికంగా నిలిపివేయడంతో హోటల్ యజమానులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రతీరోజు ఐదు నుంచి పది సిలిండర్లు వాడే హోటళ్లకు ఏజెన్సీలు తమ వద్ద స్టాక్ ఉంటే ఒకటీ అరా పంపిస్తున్నాయి. దీంతో హైదరాబాద్లోని క్లబ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లలో ఆంక్షలు మొదలయ్యాయి. నగరంలోని దాదాపు అన్ని క్లబ్లు సభ్యులకు ఆంక్షలు విధిస్తూ సమాచారం ఇస్తున్నాయి. లిమిటెడ్ మెనూతో పాటు విజిటర్స్ను తీసుకురావొద్దని సమాచారం ఇచ్చాయి. బార్ అండ్ రెస్టారెంట్లు, క్యాంటీన్లలో కూడా గ్యాస్ తక్కువగా వినియోగించేలా మెనూను రూపొందించారు. మధ్యతరగతి హోటళ్లు, రెస్టారెంట్లలో కేవలం రైస్ ఐటమ్స్, కూరలు మాత్రమే వండుతున్నారు. గ్యాస్ ఎక్కువగా ఖర్చయ్యే స్వీట్లు, బేకరీ ఐటమ్స్ తయారీని పూర్తిగా నిలిపివేశారు. హైదరాబాద్ సహా జిల్లాల్లోని చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు గ్యాస్ దొరక్క కొన్ని మూతపడ్డాయి. దీనివల్ల రోజువారీ కూలీలు, బ్యాచిలర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతి గృహాల్లో ’డ్రై’ డేస్... ఐటీ కారిడార్లో ఆందోళనహైదరాబాద్లోని ఐటీ కారిడార్ (మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి)లో పరిస్థితి దయనీయంగా మారే అవకాశముంది. వేలాదిగా ఉన్న పీజీలు, హాస్టళ్లలో గ్యాస్ నిల్వలు అయిపోతాయనే భయంతో యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. కష్టంగా ఒకే పూట వండి పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఓ హాస్టల్ యజమాని వ్యాఖ్యానించాడు. దిల్సుఖ్నగర్, అమీర్పేట, ఫిల్మ్నగర్, విద్యానగర్, సికింద్రాబాద్, హిమాయత్నగర్, పంజగుట్ట ప్రాంతాల్లో హాస్టళ్లు, రూముల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు, యువకులు, ఉద్యోగినులు కూడా ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటర్ పరీక్షలు ముగుస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఊరట లభించినట్టయింది. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు కూడా త్వరలోనే సెలవులు వచ్చే అవకాశం ఉండడంతో కొద్దిరోజుల పాటు కాలం వెళ్లదీసేందుకు ప్రిన్సిపాల్స్ తగిన ఆదేశాలు జారీ చేశారు. రంజాన్ వేళ... బిర్యానికే పరిమితం రంజాన్ నెల కావడంతో హైదరాబాద్తోపాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ వంటి నగరాల్లో ఉపవాస దీక్షల్లో ఉండే ముస్లింల కోసం సాయంత్రం నుంచి రాత్రి వేళ్లలో పెద్ద ఎత్తున హోటళ్లు పనిచేస్తాయి. సిలిండర్ల సమస్యతో హైదరాబాద్లోని ఇరానీ హోటళ్లలో కట్టెల పొయ్యిలనే వినియోగిస్తున్నారు. వీటిల్లో బిర్యానీ, హలీమ్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. తందూరీ రొట్టెల కోసం వాడే బట్టీలనే కూరల కోసం కూడా వినియోగిస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు పాతబస్తీ, నాంపల్లి, మెహిదీపట్నం, టోలిచౌకీ, సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్రోడ్స్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లు, దాబాలు బట్టీలు, కట్టెల పొయ్యిలతోనే ఆహార సేవలు అందిస్తున్నాయి. కాగా ఇరానీ హోటళ్లలో చాయ్, ఇతర తినుబండారాల విషయంలో కోతలు పెడుతున్నట్టు తెలుస్తోంది. బ్లాక్ మార్కెట్ హల్చల్..ధరల మోత వంట గ్యాస్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తలెత్తిన సమస్యల నేపథ్యంలో ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్ దందాకు తెర లేపినట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. రూ.965కు లభించే డొమెస్టిక్ సిలిండర్ను రూ.1200 వరకు విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక రూ.2,050 వరకు ఉన్న కమర్షియల్ గ్యాస్ను కూడా కొన్ని ఏజెన్సీలు దాదాపు రూ.2,800 వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఎల్పీజీ, సీఎన్జీలతో నడిచే ఆటోలు, కార్లు ఆయా గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రాల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఐదు రోజుల్లో ఎల్పీజీ ధరను 50 రూపాయలు పెంచినట్టు ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలతో కూడా ఎల్పీజీ, సీఎన్జీ లభించే పరిస్థితి లేక ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఇన్ని సమస్యలు ఎదురవుతున్నా పౌరసరఫరాల శాఖ కనీసం స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. -
జిల్లా కేంద్రాల చుట్టూ రింగురోడ్లు : సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన జిల్లా కేంద్రాలన్నింటికీ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రోడ్లు భవనాల శాఖను ఆదేశించారు. జిల్లా కేంద్రాలైన ప్రధాన పట్టణాల్లోకి భారీ వాహనాలు వెళ్లకుండా చూడటంతో పాటు సరుకు రవాణా వాహనాలు వేగంగా ముందుకు సాగేందుకు రింగురోడ్లు దోహదం చేస్తాయని అన్నారు. బుధవారం రాత్రి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో రోడ్లు భవనాల శాఖ, రవాణా శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రాల చుట్టూ ఉన్న రోడ్లను అనుసంధానించి రింగురోడ్లుగా మార్చాలని, ఆయా పట్టణాల నుంచి రింగురోడ్లకు అనుసంధానంగా రేడియల్ రోడ్లను నిర్మించాలని సీఎం ఆదేశించారు. సమీపంలోని జాతీయ రహదారులకు రింగురోడ్లను అనుసంధానించే అంశంపై అధ్యయనం చేయాలని సూచించారు. హైదరాబాద్–విజయవాడ ఎక్స్ప్రెస్ వే నుంచి నాగార్జునసాగర్ చేరేందుకు కొత్తగా రోడ్డు నిర్మించే అంశంపై కూడా అధ్యయనం చేసి నివేదిక సమరి్పంచాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఆర్ఓబీలు, ఆర్యూబీలను వేగంగా పూర్తి చేసి, అవసరమైన కొత్త వాటి కోసం ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. ఈవీల వినియోగం పెంచాలి.. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడంపై అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక నుంచి ప్రభుత్వ వినియోగం కోసం కొనే వాహనాలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే అయి ఉండాలని స్పష్టం చేశారు. ‘క్యూర్’ పరిధిలో అద్దెకు తీసుకునే ప్రభుత్వ వాహనాలు కూడా అవే ఉండాలని చెప్పారు. రవాణా శాఖలో ఇక అన్ని సేవలు ఆన్లైన్ ద్వారానే సాగాలని ఆదేశించారు. కార్యాలయాలన్నీ సొంత భవనాల్లోనే ఉండాలని, అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. శంషాబాద్ సమీపంలో ఆధునిక బస్ టెర్మినల్ రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు లఘు చిత్రాలు ప్రదర్శించాలని సీఎం సూచించారు. శంషాబాద్ సమీపంలో హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రారంభమయ్యే ప్రాంతంలో ఆధునిక బస్ టెర్మినల్ నిర్మించాలని, ఇందుకు స్థలం కేటాయిస్తామని, అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్ది, రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పథంలో రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: 2023–24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వ్యయాల పెరుగుదలతో ముందుకు సాగినట్లు ఆర్థిక ఆరోగ్య సూచిక (ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్) నివేదిక వెల్లడించింది. సామాజిక సేవలు, ఆర్థిక సేవలకు కేటాయింపులు పెరగడం, ముఖ్యంగా మూలధన వ్యయాలు గణనీయంగా పెరగడం ద్వారా మౌలిక సదుపాయాల నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలపై రాష్ట్రం దృష్టి కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. నీతి అయోగ్ విడుదల చేసిన ఈ నివేదికలో రాష్ట్ర ఆదాయాల్లో సొంత పన్ను ఆదాయాలే ప్రధాన భాగాన్ని కలిగి ఉండగా, పన్నేతర ఆదాయాలు కూడా వేగంగా పెరుగుతున్నట్లు తేలింది. అయితే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల వాటా క్రమంగా తగ్గుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఆర్థిక సూచికల పరంగా చూస్తే రాష్ట్రం స్వల్ప రెవెన్యూ మిగులు కొనసాగిస్తూ, దవ్య్ర లోటును చట్టపరమైన పరిమితులలోనే ఉంచినట్లు తెలిపింది. అయితే అభివృద్ధి అవసరాల కారణంగా అప్పులు క్రమంగా పెరిగాయని, ఎఫ్ఆర్బీఎం చట్టం సూచించిన పరిమితిని స్వల్పంగా అధిగమించినట్లు పేర్కొంది. అభివృద్ధి వ్యయాల్లో భారీ పెరుగుదల 2019–20 నుంచి 2023–24 మధ్య రాష్ట్ర అభివృద్ధి రెవెన్యూ వ్యయాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సంక్షేమం, మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి సామాజిక సేవలపై వ్యయం మొత్తం రెవెన్యూ వ్యయంలో సుమారు 38–39 శాతం స్థాయిలో కొనసాగుతోంది. ఇక ఆర్థిక సేవలపై వ్యయం ఈ కాలంలో వేగంగా పెరిగి 22 శాతం నుంచి 35 శాతానికి పెరిగింది. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి, వృద్ధి లక్ష్యాలపై ప్రభుత్వ దృష్టిని ప్రతిబింబిస్తోంది. అభివృద్ధి మూలధన వ్యయం 2019–20లో రూ.16,860 కోట్లు ఉండగా 2023–24 నాటికి రూ.43,918 కోట్లకు పెరిగింది. అంటే 160 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. రాష్ట్ర మొత్తం రెవెన్యూ ఆదాయం 2019–20లో రూ.1,02,543 కోట్లు ఉండగా 2023–24 నాటికి రూ.1,69,293 కోట్లకు పెరిగింది. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో సుమారు 11–12 శాతం స్థాయిలో కొనసాగుతోంది. రాష్ట్ర మొత్తం ఆదాయంలో సొంత పన్ను ఆదాయాలే సుమారు 80 శాతం వరకు ఉన్నాయి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల వాటా సుమారు 6 శాతం మాత్రమే ఉండగా ఇది క్రమంగా తగ్గుతున్నట్లు నివేదిక తెలిపింది. ఎఫ్ఆర్బీఎం పరిమితి మించి అప్పులు ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర అప్పులు జీఎస్డీపీలో 33.10 శాతం లోపు ఉండాలి. అయితే 2023–24లో రాష్ట్ర మొత్తం అప్పులు, ఇతర రుణ బాధ్యతలు రూ.5,17,659 కోట్లుగా తేలాయి. అంటే ఎఫ్ఆర్బీఎం పరిమితి మించి జీఎస్డీపీలో 34.47 శాతంగా నమోదయ్యాయి. గత ఐదేళ్లుగా రాష్ట్రం అప్పులు క్రమంగా పెరుగుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ట్రం మార్కెట్ నుంచి రూ.49,618 కోట్ల రుణాలు సమీకరించినట్లు నివేదిక పేర్కొంది. -
సుసంపన్న తెలంగాణ నిర్మిద్దాం
సాక్షి, హైదరాబాద్: ‘సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రివర్గ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు. మనమందరం కలిసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ లక్ష్యాలను గౌరవిస్తూ ముందుకు సాగుదాం. రాష్ట్ర గవర్నర్గా సమగ్రత, సమైక్యత, సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంటా. నా విధులను న్యాయబద్ధంగా, నిజాయితీగా, భారత రాజ్యాంగానికి లోబడి అంకితభావంతో నిర్వహిస్తా. మనమందరం సుసంపన్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడానికి కలిసి పని చేద్దాం..’అని రాష్ట్ర నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు లోక్భవన్లో ఆయన గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తన సందేశాన్ని విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడం అదృష్టం ‘తెలంగాణ ప్రజలకు సేవ చేయడం గర్వంగా, అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం అంటే సాంస్కృతిక సంపద, గొప్ప సంప్రదాయాలు, అసాధారణ పురోగతికి నిదర్శనం. ఈ ప్రాంతం ఆశలు, ఆవిష్కరణలు, సహన శక్తికి చిహ్నంగా నిలుస్తుంది. ప్రజల అకుంఠిత దీక్ష, రాష్ట్రంలోని సమృద్ధ వనరులు, వ్యూహాత్మక దృష్టి.. సమగ్ర అభివృద్ధికి, స్థిరమైన ప్రగతికి బలమైన ప్రాతిపదికను అందిస్తాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా పని చేసిన నా అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. తెలంగాణ జై తెలంగాణ..’అని గవర్నర్ శుక్లా తన సందేశంలో పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలను అప్పగించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, డీజీపీ శివధర్రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం, ఆయన మంత్రివర్గ బృందంతో గవర్నర్ గ్రూపు ఫొటో దిగారు. తెలుగులో ప్రమాణం గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణస్వీకారం చేయడం విశేషం. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆయనకు తెలుగు భాషతో ఇప్పటివరకు ఎలాంటి పరిచయం లేకపోయినా తెలుగులో ప్రమాణస్వీకారం చేయడానికి బాగా ప్రాక్టీస్ చేసినట్టు లోక్భవన్ వర్గాలు తెలిపాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం తెలుగులోనే ‘అనే నేను..’అనే పదాలతో ప్రమాణాన్ని ప్రారంభించగా, శివపత్రాప్ శుక్లా అనే నేను.. అంటూ గవర్నర్ పూర్తిగా తెలుగులో ప్రమాణం చేశారు. భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు చార్మినార్: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన కుటుంబ సభ్యులతో కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ కుమార్తె, అల్లుడు, కుమారుడు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్లతో కలిపి దాదాపు 19 మంది వరకు ఆయన వెంట ఉన్నారు. ఆలయ ట్రస్టీ శశికళ వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పూర్ణకుంభంతో వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం వారిని ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
పార్టీ మారలేదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరారని పేర్కొంటూ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కొట్టేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, బీజేపీ శాసనసభా పక్షం నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ పూర్తి చేసిన స్పీకర్ బుధవారం ఉదయం 10 గంటలకు తన తుది తీర్పును ప్రకటించారు. వాస్తవానికి తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే 8 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను గతంలోనే డిస్మిస్ చేసిన స్పీకర్ తాజాగా.. దానం, కడియంకు సంబంధించి తీర్పు వెలువరించారు. వారు పార్టీ మారలేదని స్పష్టం చేశారు. కాగా స్పీకర్ నిర్ణయంతో దానం, కడియంపై కచ్చితంగా అనర్హత వేటు పడుతుందని భావించిన బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. స్పీకర్ ట్రిబ్యునల్ నుంచి తీర్పు కాపీ అందిన తర్వాత తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. రాష్ట్రంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే 2024 లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి.టి.ప్రకాశ్గౌడ్ (రాజేంద్రనగర్), పోచారం శ్రీనివాస్రెడ్డి (బాన్సువాడ), దానం నాగేందర్ (ఖైరతాబాద్), కాలే యాదయ్య (చేవెళ్ల), డాక్టర్ ఎం.సంజయ్కుమార్ (జగిత్యాల), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), బండ్ల కృష్ణమోహన్రెడ్డి (గద్వాల), అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి), గూడెం మహీపాల్ రెడ్డి (పటాన్చెరు) వీరిలో ఉన్నారు. అయితే దానం నాగేందర్ 2024 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వగా ఆమె చివరి నిమిషంలో కాంగ్రెస్లో చేరి ఎంపీగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కడియం కావ్య తరఫున కడియం శ్రీహరి ప్రచారం చేసినట్లు బీఆర్ఎస్ ఆరోపించింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారంటూ భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం)లోని పేరా 2(1) ప్రకారం వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ 2024 జూలైలో శాసనసభ స్పీకర్ వద్ద వేర్వేరుగా అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది. కోర్టుల్లో బీఆర్ఎస్ సుదీర్ఘ న్యాయపోరాటం తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని పేర్కొంటూ బీఆర్ఎస్ 2024 డిసెంబర్లో హైకోర్టును ఆశ్రయించింది. దీంతో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ స్పీకర్ను ఆదేశించింది. అయితే స్పీకర్కు కాల పరిమితి విధించడం తగదంటూ ఆ ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. డివిజన్ బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ తీర్పును రద్దు చేసిన సుప్రీంకోర్టు.. 3 నెలల్లో అన్ని పిటిషన్లు పరిష్కరించాలని ఆదేశించింది దీంతో 2025 ఆగస్టులో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన స్పీకర్ దశల వారీగా విచారణ జరిపారు. అయితే నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలనే ఆదేశాలను స్పీకర్ పాటించక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. 2025 నవంబర్ 17న ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పదింటిలో ఏడు పిటిషన్లు డిస్మిస్ చేసినట్లు 2026 జనవరి 16న సుప్రీంకోర్టుకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్పై దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన స్పీకర్.. తాజాగా కడియం, దానంలకు అనర్హత వర్తించదని పేర్కొంటూ పిటిషన్లు డిస్మిస్ చేశారు. -
హైదరాబాద్ పిల్లల సోషల్ మీడియా వినియోగం ఎంతంటే?
పొద్దున లేవగానే ఒకసారి.. స్కూల్కి వెళ్లే ముందు మరోసారి.. మళ్లీ తిరిగొచి్చనప్పటి నుంచి సరదాగా కాలక్షేపానికి.. నిద్రపోయే ముందు కొద్దిసేపు.. ఇదేదో మందులు వేసుకోడానికి ప్రి్రస్కిప్షన్పై రాసిన సమయం అనుకునేరు? అలా అనుకుంటే పొరపాటే.. ఇది ప్రస్తుతం నగరాల నుంచి పల్లెల వరకూ సామాజిక మాధ్యమాల వినియోగంలో పిల్లలు బంధీలైన తీరు. కొందరు టైం పాస్ కోసం.. మరికొందరు సెలబ్రిటీ స్టేటస్ కోసం.. పిల్లలు మొదలుకుని.. పండు ముసలి వరకూ ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి ఖాతాల వినియోగం పెరిగిపోయింది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో అయితే చెప్పే ప్రసక్తే లేదు.. దైనందిన జీవితంలో కనీసం రెండు గంటల పాటు దీనికోసమే కేటాయిస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం 16ఏళ్ల లోపువారికి సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తామని ప్రకటించడంతో దేశవ్యాప్త చర్చకు దారితీసింది. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్లో సోషల్ మీడియా వాడకం సర్వసాధారణ విషయం. ఈ సోషల్ యాప్స్ వాడకం వయసుతో సంబంధం లేకుండా మారింది. బాల్యం అంటే అటలు.. పాటలు అనే కాలం నుంచి.. బాల్యం అంటే స్మార్ట్ఫోన్ అనే నిర్ధారణకు వచ్చిన పరిస్థితి. అయితే.. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదా.? అమలు సాధ్యమా? ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగం అధికంగా ఉండే హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో చిన్నారులు, టీనేజర్ల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డిజిటల్ ‘డీలా’.. ఓ వైపు చాట్ జీపీటీ, ఏఐ, జెమినీ, పర్ప్లెక్సిటీ వంటి టెక్నాలజీ వేదికలతో అంతా స్మార్ట్ మయం అవుతోంది. విద్యా కేంద్రాల్లో, పాఠశాలల్లో టెక్నాలజీ వినియోగం, స్మార్ట్ ఆలోచనలవైపు ప్రపంచం పరుగుపెడుతోంది.. అదే టెక్నాలజీ వినియోగంలో నైపుణ్యం సాధించేందుకు చిన్నారులకు స్మార్ట్ఫోన్, టాబ్లెట్ పరిచయం చేస్తూ.. ఆన్లైన్ క్లాసులు, హోమ్వర్క్ పేరుతో క్రమంగా స్క్రీన్ టైమ్ సోషల్ మీడియావైపు దారి మళ్లుతోంది.ఎంతలా అంటే.. టెక్నాలజీ పరిచయం లేని పాఠశాలల్లోని పిల్లలు సైతం సోషల్ మీడియా ఖాతాలు వినియోగించేలా. రీల్స్, షార్ట్స్, గేమింగ్, లైవ్ స్ట్రీమ్.. వంటి వ్యాపకాలతో అనేక సామాజిక రుగ్మతలకు లోనవుతున్నారు. 16 ఏళ్లలోపు పిల్లలపై ఈ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఫలితంగా ప్రత్యక్షంగా మాట్లాడే నైపుణ్యాలు, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం వంటివి తగ్గిపోయి.. వర్చువల్ ఫ్రెండ్షిప్, లైక్స్, ఫాలోవర్స్ ఆధారంగా రిలేషన్స్ని అంచనావేసే మానసిక ధోరణికి లోనవుతున్నారు. ఫలితంగా ఆందోళన, అసూయ, డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు.. సోషల్ మీడియా అధిక వినియోగం వల్ల నైపుణ్యాలను కోల్పోవడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నారు. మరీ ముఖ్యంగా స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల కంటి సమస్యలు, దృష్టిలోపం, తలనొప్పి, నిద్రలేమితనం, స్థూలకాయం వంటి సమస్యలూ పెరుగుతున్నాయి. దీంతోపాటు శారీరక చురుకుదనం తగ్గి జీవనశైలి వ్యాధులకు లోనవుతున్నారు. మరోవైపు ఫాలోవర్స్, లైక్స్ సంఖ్య ఆధారంగా స్వీయ విలువను అంచనావేసే మానసిక రుగ్మతకు, ట్రోలింగ్, సైబర్ బుల్లీయింగ్తో తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని, దీనిపై కట్టడి లేకపోతే భవిష్యత్తులో దుష్పరిణామాలను చూడాల్సిన పరిస్థితి తప్పదని మానసిక నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అడిక్షన్కు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంటి సభ్యులే కారకులవుతున్నారు. పిల్లలకు అన్నం తినిపించడానికి, ఏడవకుండా ఉండడానికి మొదలై.. బిజీ జీవితంలో పిల్లలకు సమయం కేటాయించలేక వారిని అల్లరిని కట్టడిచేయడానికి స్మార్ట్ఫోన్ అలవాటు చేస్తున్నాం. దీంతోపాటు చౌకైన డేటా అనో, అందరూ వాడుతున్నారులే..అనే భావన, కంటెంట్ అల్గారిథమ్స్ పిల్లలను ఎక్కవగా ఆకట్టుకునేలా రూపొందించిన ప్రోగ్రామ్స్ కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే వీటిని కట్టడిచేయడంలో మొదటి పాత్ర తల్లిదండ్రులదే.. మితిమీరిన వినియోగం వల్ల పిల్లల గోప్యత, భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, బైక్ నెంబర్లను ఆధారంగా చేసుకుని ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన ఆ మధ్య చర్చనీయాంశమైంది. పిల్లల జీవితాలను కంటెంట్గా మార్చడం ఎంతవరకూ సమంజసం? అనేచర్చ ఉత్పన్నమవుతోంది.సర్వే చెబుతోందేంటి? హైదరాబాద్లో ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. 10–16 ఏళ్ల వయసు పిల్లల్లో సుమారు 68 శాతం మంది రోజుకు కనీసం 2–3 గంటలు సోషల్ మీడియా వినియోగిస్తున్నారు. వీరిలో 40 శాతం మంది నిద్ర సమస్య, 30 శాతం మంది చదువుపై దృష్టి తగ్గడం, వయసుకు మించిన సమాచారం తెలుసుకోవడం, సామాజిక, నైతిక పరమైన విషయాల్లో జెన్ జీ తరం కన్నా.. జెన్ ఆల్ఫా తరంలో తేడాలు కనిపిస్తున్నాయని సర్వే ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. అయితే సంపూర్ణ నిషేధం కంటే.. అవగాహన, నియంత్రణ, తల్లిదండ్రుల భాగస్వామ్యం ముఖ్యమని.. డిజిటల్ లిటరసీ, హెల్దీ స్క్రీన్ హ్యాబిట్స్ నేర్పడం, కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెంచడం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కట్టడి సాధ్యమేనా? దేశంలో చిన్నారుల ఆన్లైన్ భద్రతకు ఐటీ నిబంధనలు, డేటా రక్షణ మార్గదర్శకాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్ వంటి నగరాల్లో అమలే పెద్ద సవాలుతో కూడినది. వయసు నిర్ధారణ వ్యవస్థలు బలహీనంగా ఉండటం, తల్లిదండ్రులే అకౌంట్లు తెరవడానికి అనుమతించడం వల్ల నిబంధనలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. మరోవైపు చిన్నారులకు ఎలాంటి కంటెంట్ చూపించాలి, వేటికి దూరంగా ఉంచాలి అనే విషయాల పై పెద్దలకు అవగాహన లేకపోవడం. సమయ పరిమితితో విద్యాపరమైన వెబ్సైట్లు, ఈ–లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, కథలు, సైన్స్ వీడియోలు, క్రియేటివ్ ఆర్ట్స్ వంటి కంటెంట్ వైపు పిల్లలను మళ్లించడం వారి అభిృద్ధికి దోహదపడుతుంది. -
'గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ వల'
సాక్షి హైదరాబాద్: గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెరతీశారు.తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా ఫేక్ వెబ్సైట్ లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.ముఖ్యంగా ఆన్లైన్లో ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యారెంటీగా, అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మబలికే సందేశాలు వస్తే అవి కచ్చితంగా సైబర్ మోసాలేనని ప్రజలు గ్రహించాలన్నారు. ఇలాంటి అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని సిలిండర్ బుకింగ్ లేదా ఆన్లైన్ చెల్లింపుల కోసం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్లను లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలని తెలిపారు.వీరు ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి గుర్తుతెలియని వ్యక్తులకు మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని నకిలీ వెబ్సైట్లలో వివరాలు నమోదు చేయడం ద్వారా మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ 1930 కి కాల్ చేయాలని లేదా http://cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు.. జాగ్రత్త!వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెరతీశారు. తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ, అదనపు సిలిండర్లు…— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 11, 2026 -
300 కేజీల కుళ్లిపోయిన మాంసం స్వాధీనం
హైదరాబాద్: అపరిశుభ్రమైన మాంసాన్ని అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ సొమ్ము చేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు. హైదరాబాద్లోని మంగళ్హాట్ పోలీసులు, గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా మంగళ్హాట్ పరిధిలో ఆకస్మిక దాడులు చేయడంతో ఇటువంటి మరో ఘటన బయటపడింది. తాజా మాంసం అని నమ్మిస్తూ నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళ్హాట్ లోని చిస్తీ చమన్ దర్గా సమీపంలో ‘ఏ టూ జెడ్ షీప్ అండ్ గోట్ ఆఫ్ఫాల్’ పేరుతో మాంసం వ్యాపారం నిర్వహిస్తున్న మహమ్మద్ అఫ్రోజ్ (41) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గతంలో కూడా ఇటువంటి నేరానికి పాల్పడగా, అప్పట్లో జీహెచ్ఎంసీ అధికారులు అతడికి జరిమానా విధించారు. మళ్లీ అలాంటి పనులే చేస్తున్నాడు. అతడి షాపులో నుంచి పోలీసులు సుమారు 300 కిలోల కుళ్లిపోయిన గొర్రె, మేక మాంసం స్వాధీనం చేసుకున్నారు. అఫ్రోజ్ అధిక లాభాల కోసం కర్ణాటక, ఢిల్లీ, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల నుంచి తక్కువ ధరకే మాంసాన్ని సేకరించేవాడు.అలా సేకరించిన మాంసాన్ని డీప్ ఫ్రీజర్లలో నిల్వ ఉన్న నీటితో నింపిన ప్లాస్టిక్ టబ్బులలో రోజుల తరబడి ఉంచేవాడు. మాంసం కుళ్లిపోకుండా, దుర్వాసన రాకుండా ఉండేందుకు ఇలా నిల్వ చేస్తూ, వినియోగదారులకు అది తాజా మాంసమని నమ్మించి విక్రయించేవాడు. అతి షాపులో ఉన్న 300 కేజీల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు పారేశారు.అపరిశుభ్రమైన ప్రాంతాల నుంచి మాంసం, ఆహార పదార్థాలను కొనుగోలు చేయవద్దని పౌరులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. అక్రమ నిల్వలు, కార్యకలాపాలు ప్రజల దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. -
సామాన్యుడికి షాక్.. పెళ్లిళ్లు వాయిదాపడే పరిస్థితి?
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ భారత్లో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై తీవ్రంగా పడింది. నిన్న బెంగళూరు, విశాఖ, ముంబై నగరాల్లో గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు మూతపడగా.. ఈ రోజు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు సిలిండర్ బండలతో రోడ్డెక్కారు. కొన్ని రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ సరఫరాను నిలిపివేయడంతో పెళ్లిళ్లు వాయిదాపడే పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో గ్యాస్ సరఫరా కష్టాలు మొదలయ్యాయి. అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్తో పాటు.. బిహార్లో పోలీసుల బందోబస్తు నడుమ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా జరుగుతోంది. ఈ రాష్ట్రాల్లోని కీలక నగరాల్లో ఒకట్రెండు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కూడా కనిపిస్తున్నాయి. ఇక రాజస్థాన్లో ఎల్పీజీ బ్లాక్ మార్కెటింగ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేశాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాలు డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాపై దృష్టి సారించాయి.రోజురోజుకీ పరిస్థితి తీవ్రంఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో మధ్యప్రదేశ్లో ఆ వాతావరణం కనిపిస్తోంది. రాబోయే వారం రోజుల్లో ఒక్క భోపాల్లోనే వెయ్యికి పైగా పెళ్లిళ్లు షెడ్యూల్ అయినట్లుగా తెలుస్తోంది. గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం ఉండడంతో.. పెళ్లింట భోజనాలు ఉంటాయా? అనే ఆందోళనలు వధువు, వరుడి తరఫు వారిలో నెలకొంటున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం నిలిపివేయడంతో క్యాటరింగ్ నిర్వాహకులు, హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు పెళ్లిళ్ల సీజన్ దాటిపోతోందని, అడ్వాన్సులు తీసుకున్న తమకు నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవిధంగా ఇది అత్యయిక స్థితిని తలపిస్తోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.యూపీలో పోలీసుల బందోబస్తు నడుమ..యూపీలో గడిచిన నాలుగైదు రోజులుగా ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్లు పెరిగాయి. బుకింగ్ల మధ్య 25 రోజుల గ్యాప్ అనే నిబంధన కొనసాగుతున్నప్పటికీ.. అసాధారణంగా బుకింగ్లు పెరుగుతున్నాయని ఎల్పీజీ డీలర్లు చెబుతున్నారు. గోరఖ్పూర్, సిద్ధార్థనగర్ ప్రాంతాల్లో పౌరులు ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీల ముందు క్యూకట్టారు. సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎరువుల కోసం రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరినట్లు ఇప్పుడు యూపీలో ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం తెల్లవారుజాము 3 గంటల నుంచి ఏజెన్సీల వద్ద క్యూకట్టారు. అయితే.. వారందరికీ సిలిండర్లు సర్దుబాటు అయ్యే పరిస్థితులు కనిపించడం లేదని, టోకెన్లు ఇచ్చి, రాబోయే రోజుల్లో పంపిణీ చేస్తామని డీలర్లు చెబుతున్నారు దుర్గా..బిహార్లో బుకింగ్ల నిలిపివేత?రెండ్రోజులుగా బిహార్లో కమర్షియల్ సిలిండర్ల బుకింగ్లను చమురు సంస్థలు నిలిపివేశాయి. దీంతో.. బెంగళూరు మాదిరిగానే హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు బంద్కు సిద్ధమవుతున్నారు. డొమెస్టిక్ బుకింగ్లు కొనసాగుతున్నప్పటికీ.. బ్లాక్మార్కెటింగ్ భయాలు ఉండడంతో ప్రజలే ఏజెన్సీల వద్దకు ఖాళీ సిలిండర్లతో చేరుకుంటున్నారు. దీంతో.. అక్కడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా గోపాల్ గంజ్, ఖగారియా, ఔరంగాబాద్, పట్నా నగరాల్లో తెల్లవారుజాము నుంచే ప్రజలు సిలిండర్ బండ కోసం క్యూలైన్లలో నిలబడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే.. డీలర్లు తమపై దాడులు జరిగే ప్రమాదాలున్నాయనే భావనతో ఏజెన్సీలను తెరవడం లేదు.రాజస్థాన్లో బ్లాక్ మార్కెటింగ్?కమర్షియల్ సిలిండర్ ధర 19 వందల రూపాయలదాకా ఉండగా.. ఇప్పుడు రాజస్థాన్లో బ్లాక్ మార్కెటర్లు దాన్ని 2,500 నుంచి మూడువేల రూపాయలకు విక్రయిస్తున్నారు. దీనిపై ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ ఓ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, అక్రమార్కుల దందాను వెలుగులోకి తెచ్చింది. పోలీసులు ఈ అంశంపై సీరియస్గా దృష్టి సారించారు. లూథియానా, ఫరీద్కోట్, హోషియార్పూర్, పటియాలా ప్రాంతాల్లో చమురు సంస్థల వెబ్సైట్లు డౌన్ కావడంతో.. కొత్త బుకింగ్లు జరగడం లేదని తెలుస్తోంది దుర్గా..కేంద్ర ప్రభుత్వం చర్యలు పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిన్ననే ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో చమురు కంపెనీల తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సరఫరాను ఎస్మా చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ మధ్య 25 రోజుల గ్యాప్ ఉండాలనే నిబంధనను నిక్కచ్చిగా అమలు చేస్తోంది. గ్యాస్ డెలివరీ బాయ్స్ దుర్వినియోగానికి పాల్పడకుండా ఉండేందుకు ఓటీపీ ఆధారిత డెలివరీని అమలు చేస్తోంది. మరోవైపు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. - సాక్షి వెబ్డెస్క్ -
కాంగ్రెస్ పాలనలో అవమానం: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పాలనలో అవమానం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయింపుదారుల వ్యవహారంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ ప్రసాద్కుమార్ క్లీన్చిట్ ఇవ్వడంపై ఆయన స్పందించారు. పార్టీ ఫిరాయింపుదారులకు స్పీకర్ క్లీన్చిట్ ఇవ్వడం హాస్యాస్పదమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీకర్ వ్యవహారశైలి ఉందని విమర్శించారు.''దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసుల్లో స్పీకర్ తీరు రాజ్యాంగ విరుద్ధం. బీఆర్ఎస్ – కాంగ్రెస్ ఒకే తీరుతో వ్యవహరిస్తున్నాయి. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్పై వేటు వేయకపోవడం అప్రజాస్వామికం. ఫిరాయింపులను అరికట్టాల్సిన స్పీకర్.. క్లీన్చిట్ ఇవ్వడంతో ఫిరాయింపులను ప్రోత్సహించినట్టే. ప్రజా తీర్పును కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కాలరాస్తున్నాయి. అధికారంతో వ్యవస్థలను మేనేజ్ చేయవచ్చు కానీ ప్రజల ఆగ్రహాన్ని కాదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తార''ని కిషన్రెడ్డి హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్రానికి మచ్చ: డాక్టర్ లక్ష్మణ్పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు, చీకటి రోజని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. స్పీకర్ ఇచ్చిన తీర్పు సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉందని మండిపడ్డారు. శాసన సభ స్పీకర్ వ్యవస్థకు మచ్చతెచ్చే విధంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల క్లీన్చిట్ ఇవ్వడం తెలంగాణ రాష్ట్రానికి మచ్చ అని వ్యాఖ్యానించారు. ''పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఫిరాయింపుల కిందికిరారు అంటున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులకు నిర్వహాచనం ఏంటి? ఒకరు ఎంపీగా పోటీ చేశారు, ఇంకొకరు ఎన్నికల్లో ప్రచారం చేశారు. గతంలో నైతిక విలువలతో అటల్ బీహార్ వాజపేయి రాజీనామా చేసి, ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో గెలిచారు. గతంలో బీఆర్ఎస్ హోల్సేల్గా ఎమ్మెల్యేలను చేర్చుకుంటే, రిటైల్గా కాంగ్రెస్ వ్యవహరించింది. రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉంటే, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విధానంపై జవాబు చెప్పాలి. దేశం మొత్తం తలవంపులు తెచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం ఉంద''ని డాక్టర్ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: లావు శ్రీకృష్ణ దేవరాయలకు కేటీఆర్ కౌంటర్ -
భగవత్ గైడెన్స్.. టాప్–100లో 37 మంది!
సాక్షి, హైదరాబాద్: శాంతిభద్రతల అడిషనల్ డీజీగా అత్యంత కీలకమైన పోస్టులో కొనసాగుతున్నా.. సీనియర్ ఐపీఎస్ మహేశ్ భగవత్ సివిల్స్ గురువుగా తన సత్తా చాటుతూనే ఉన్నారు. యూపీపీఎస్సీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలకు మార్గదర్శనం చేస్తూ వారి విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.తాజాగా వెలువడిన సివిల్ సర్వీసెస్ పరీక్ష–2025 ఫలితాల్లోనూ దేశవ్యాప్తంగా మొత్తం 958 మంది అభ్యర్థులు తుది జాబితాలో స్థానం సంపాదించారు. వీరిలో మహేశ్ భగవత్ మార్గదర్శకత్వంలో ఇంటర్వ్యూ దశకు సిద్ధమైన 300 మంది అభ్యర్థులు తుది జాబితాలో చోటు సంపాదించడం విశేషం. ఈ 300 మందిలో 37 మంది అభ్యర్థులు టాప్–100 ర్యాంకుల్లో నిలిచారు. మహేశ్ భగవత్ శిష్యురాలు తేజస్వినీ సింగ్ 62వ ర్యాంకు సాధించడంతో పాటు ఇంటర్వ్యూలో అత్యధికంగా 225 మార్కులు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలంగాణ టాపర్గా గూడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించగా, ఆమె ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనీ డీఎస్పీగా ఉన్నారు.అలాగే దైనెంపల్లి ప్రవీణ్ 793వ ర్యాంకు సాధించి ట్రైనీ డీఎస్పీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ టాపర్గా జస్వంత్ జెన్ను 23వ ర్యాంకు సాధించగా, రాష్ట్రం నుంచి మరో 20 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఆల్ ఇండియా టాప్–10లో 3, 4, 6, 7 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు కూడా మహేశ్ భగవత్ బృందం నుంచి ఇంటర్వ్యూ మార్గదర్శకత్వం పొందినవారే కావడం గమనార్హం. అభ్యర్థులు కష్టపడి సాధించిన ఈ విజయానికి మెంటర్ల సహకారం కూడా ఎంతో తోడ్పడిందని మహేశ్ భగవత్ పేర్కొన్నారు.చదవండి: విమెన్ సివిల్ పవర్ -
ఐటీ కారిడార్ హాస్టళ్లలో ‘గ్యాస్’ కష్టాలు..
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు భాగ్యనగరంలోని ఐటీ కారిడార్ హాస్టళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎల్పీజీ సరఫరా వ్యవస్థలో మరింత అంతరాయం కలగవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాలని హైదరాబాద్లోని ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ తమ సభ్యులకు, నివాసితులకు మార్గదర్శకాలు జారీ చేసింది.మెనూ నుంచి చపాతీ, దోశ అవుట్?గ్యాస్ కొరత దృష్ట్యా హాస్టల్ అసోసియేషన్ సోషల్ మీడియా వేదికగా ఒక నోటీసును విడుదల చేసింది. గ్యాస్ ఎక్కువగా ఖర్చయ్యే అల్పాహారాలను ప్రస్తుతానికి నిలిపివేయాలని హాస్టల్ యజమానులను కోరింది. చపాతీ, దోశ, పూరీ వంటి ఎక్కువ సమయం తీసుకునే వంటకాలకు స్వస్తి పలకాలని సూచించింది. పరిస్థితి మెరుగుపడే వరకు కేవలం అన్నం, సాంబార్ వంటి ప్రాథమిక భోజనం మాత్రమే అందించే అవకాశం ఉంది. లభ్యతను బట్టి అదనపు కూరలు, స్నాక్స్ను కూడా తాత్కాలికంగా రద్దు చేయాలని అసోసియేషన్ స్పష్టం చేసింది.‘ప్రస్తుత పరిస్థితుల్లో నివాసితులు హాస్టళ్ల యాజమాన్యానికి సహకరించాలి. వంటకు ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషించాలని హాస్టల్ యజమానులను కోరుతున్నాం’ అని నోటీసులో పేర్కొన్నారు.హోటల్ పరిశ్రమలోనూ ఆందోళనహాస్టళ్లు మాత్రమే కాకుండా నగరంలోని హోటళ్లు కూడా వాణిజ్య సిలిండర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ రబ్బానీ మాట్లాడుతూ.. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో పలుచోట్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.25 రోజుల వెయిటింగ్ పీరియడ్మరోవైపు, తెలంగాణలో గ్యాస్ సరఫరాపై వస్తున్న వార్తలను అధికారులు పాక్షికంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 2.3 లక్షల సిలిండర్ల సరఫరా స్థిరంగా ఉందని వెల్లడించారు. అయితే, ప్రజలు భయంతో సిలిండర్లను నిల్వ చేయకుండా చూసేందుకు ఇండియన్ ఆయిల్ రిఫైనర్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొత్త గ్యాస్ బుకింగ్ల కోసం 25 రోజుల వెయిటింగ్ పీరియడ్ అమలులోకి వచ్చింది. సరఫరా క్రమబద్ధీకరణ కోసమే ఈ నిబంధన విధించినట్లు అధికారులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: రీఛార్జ్ ముగిస్తే ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు ఆపేస్తారు? -
తెలంగాణ గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్భవన్ వేదికగా గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. శివ్ ప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణస్వీకారం చేయడం విశేషం. గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్, మంత్రులు, మండలి చైర్మన్ హాజరయ్యారు. కలిసి పని చేద్దాంతెలంగాణ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శివ్ ప్రతాప్ శుక్లా తన సందేశం ఇచ్చారు. ''తెలంగాణ ప్రజలకు సేవ చేయడం గర్వంగా భావిస్తున్నాను. రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలంగాణ సాంస్కృతిక సంపద, గొప్ప సంప్రదాయాల రాష్ట్రం. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ అనుభవం తెలంగాణకు ఉపయోగపడుతుంది.తెలంగాణ ఆశలు, ఆవిష్కరణలు, సహనశక్తికి ప్రతీక. ప్రజల దీక్షతో రాష్ట్రం సమగ్ర అభివృద్ధి దిశగా సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్కు అభినందనలు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ లక్ష్యాలతో ముందుకు సాగుదాం. సమైక్యత, సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటాను. రాజ్యాంగానికి అనుగుణంగా నిజాయితీగా విధులు నిర్వహిస్తాను. సుసంపన్నమైన తెలంగాణ కోసం కలిసి పని చేద్దామ''ని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు. -
స్పీకర్ తీర్పుపై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి క్లీన్చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమే అంటూ ఘాటు విమర్శలు చేశారు.తెలంగాణ స్పీకర గడ్డం ప్రసాద్ తీర్పుపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లీన్చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి. కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి క్లీన్చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమే అవుతుంది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు.ఇది కేవలం ఒక తీర్పు మాత్రమే కాదు.. అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ. ప్రజల ఓట్లతో గెలిచి.. పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, స్పీకర్ దానికి ముద్ర వేస్తే ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయి?. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సరైన సమయంలో సమాధానం చెబుతారు అంటూ పోస్టు చేశారు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లకు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి.కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడం.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్…— KTR (@KTRBRS) March 11, 2026ఇది కూడా చదవండి: తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు.. -
దానం, కడియంకు ఊరట.. స్పీకర్ సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పు వెల్లడించారు. రాజకీయ ఉత్కంఠకు తెరదించుతూ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు వెల్లడించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు పార్టీ మారారు అనడానికి సరైన ఆధారాలు లేవని స్పీకర్ ప్రకటించారు. అనంతరం, ఇద్దరిపై వేసిన రెండు పిటిషన్లకు డిస్మిస్ చేశారు. దీంతో ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంతటితో స్పీకర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుకు తెరపడింది. కాగా, పార్టీ ఫిరాయింపుల కేసులో ఇప్పటికే ఈ కేసులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రేపటి వరకు ఫిరాయింపు కేసులో ఏదో ఒకటి తేల్చాలని గతంలో సుప్రీంకోర్టు గడువు విధించింది. సుప్రీంకోర్టు డెడ్ లైన్ నేపథ్యంలో నేడు స్పీకర్ తీర్పును వెల్లడించారు. మరోవైపు.. తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి.. స్పీకర్కు చెప్పుడం కొసమెరుపు. ఈ నేపథ్యంలో స్పీకర్ తీర్పుపై పిటిషనర్లు మరోసారి కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక, స్పీకర్ తీరుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందిస్తూ..‘స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నాను. పార్టీ ఫిరాయిస్తే షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. కానీ, నాకు పార్టీ షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..‘స్పీకర్ పరిధిలో నేను ఏ తప్పూ చేయలేదు. కేసీఆర్ అంటే అపారమైన గౌరవం ఉంది. నన్ను కేసీఆర్ ప్రశ్నించాలి. కౌశిక్ రెడ్డికి ఏం సంబంధం?. అసెంబ్లీలో బీఆర్ఎస్ నాకు ఎలాంటి విప్ జారీ చేయలేదు. కేసీఆర్ నన్ను వివరణ అడగలేదు. నేను బీఆర్ఎస్ మెంబర్షిప్ వదులుకోలేదు.. ఎక్కడా తీసుకోలేదు అని వ్యాఖ్యలు చేశారు. -
రూ.1000 ఇవ్వలేదని చంపేశాడు
హైదరాబాద్: తనకు నచ్చిన ఉద్యోగం ఇప్పించలేదనే అక్కసుతో కన్సల్టెన్సీ యజమానిని ఓ యువకుడు హత్య చేసిన ఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఏపీలోని విజయవాడ (ఏలూరు) ప్రాంతానికి చెందిన శశికిరణ్రెడ్డి (35) కొంత కాలంగా నగరంలోని మధురానగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. శశికిరణ్ యూసుఫ్గూడలో బీజీఎస్ వారాహి సాయిరాం కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడు. గత నెలలో ప్రభు కుమార్ అనే 22 ఏళ్ల యువకుడు ఉద్యోగం కోసం వచ్చాడు. శశికిరణ్రెడ్డి కంపెనీ నిబంధనల ప్రకారం అతని వద్ద రూ.2,500 తీసుకుని బంజారాహిల్స్లోని ఓ హోటల్లో ఉద్యోగం ఇప్పించాడు. ఉద్యోగం నచ్చలేదని.. డబ్బులు తిరిగివ్వాలని.. కొన్ని రోజుల తర్వాత తనకు ఉద్యోగం నచ్చలేదని, డబ్బులను తిరిగి ఇవ్వాలని యువకుడు అడిగాడు. కంపెనీ నిబంధనల ప్రకారం ఒకసారి ఇచి్చన నగదు తిరిగి ఇవ్వలేమని శశికిరణ్ తేల్చి చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన యువకుడు గది తలుపులు వేసి శశికిరణ్ను బెదిరించాడు. చేసేదేమీలేక శశికిరణ్ రూ.1,500 ఇచ్చాడు. మిగతా వెయ్యి రూపాయలు ఇవ్వడం కుదరదని చెప్పాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. యువకుడు వెంట తెచ్చుకున్న కత్తితో శశికరణ్ మెడపై పొడిచాడు. గదిలో గొడవ జరుగుతోందని తెలుసుకున్న రిసెప్షనిస్ట్ లయ యజమాని గది తలుపు తెరిచింది. ఈ క్రమంలో యువకుడు పారిపోతూ లయపై కూడా కత్తితో దాడి చేశాడు. ఆమె పట్టుకునే ప్రయత్నం చేయగా.. పక్క బిల్డింగ్లోకి దూకి పారిపోయాడు. క్షతగాత్రుడిని పోలీసులు భుజాలపై ఎత్తుకుని.. విషయాన్ని సిబ్బంది మధురానగర్ పీఎస్కు సమాచారం అందించగా.. ఇన్స్పెక్టర్, మరో కానిస్టేబుల్తో కలిసి శశికిరణ్ను భుజాలపై ఎత్తుకుని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయనతో పాటు గాయపడిన లయను కూడా ఆసుపత్రిలో చేర్చారు. శశికిరణ్రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. లయ చికిత్స పొందుతోంది. కాగా శశికిరణ్రెడ్డి భార్య నాగ భారతికి 20 రోజుల క్రితమే సీమంతం చేశారు. ఆ ఆనందంలో ఉండగానే.. భర్త హత్యకు గురి కావడంతో భోరున విలపించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సు దూసుకొచ్చింది.. ట్రాఫిక్ పోటెత్తింది
ఆర్టీసీ బస్సు దూసుకురావడంతో..దాన్ని తప్పించబోయిన ఓ పోలీస్ వాహనం డివైడర్ను ఢీకొట్టడం..టైరు వీల్రాడ్ విరగడంతో మంగళవారం ఈఎస్ఐ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా..లిఫ్టింగ్ వాహనం తీసుకువచ్చి పోలీస్ వాహనాన్ని తొలగించారు. అప్పటికే మారి్నంగ్ పీక్ అవర్స్ కావడంతో రోడ్లపైకి వచి్చన వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దాదాపు గంటసేపు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. –సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
రెండో భార్య హత్యకు కుట్ర.. రియల్టర్ అరెస్టు
సాక్షి,హైదారబాద్: రెండో భార్యపై అనుమానం పెంచుకుని హత్య చేసేందుకు ప్లాన్ చేసిన ఓ రియల్టర్తోపాటు మరో ఇద్దరిని చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నాటు తుపాకీ, మ్యాగజైన్, ఆరు తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు మంగళవారం వివరాలు వెల్లడించారు. మల్కాజ్గిరి మారుతినగర్కు చెందిన దామర అరుణ్కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. తన రెండో భార్యపై అనుమానం పెంచుకుని ఆమెను హతమార్చాలని కుట్ర పన్నాడు. చెన్నపురం చౌరస్తా వద్ద పాన్షాపు నిర్వహించే మహమ్మద్ అబ్బు ద్వారా యాకత్పురకు చెందిన విద్యార్థి మీర్ ముజమ్మిల్ అలీఖాన్ను పరిచయం చేసుకున్నాడు. తుపాకీ అందించడానికి అలిఖాన్ అంగీకరించడంతో అడ్వాన్స్గా రూ.20 వేలు ఇచ్చాడు. ఈ ఏడాది జనవరి మొదటివారంలో అలీఖాన్ తన బంధువు సలామత్ సల్మాన్తో కలిసి బీహార్ వెళ్లాడు. ముంగేర్కు చెందిన తాబిష్కు రూ.35 వేలు చెల్లించి ఒక నాటు తుపాకీ, పది బుల్లెట్లు, రెండు మ్యాగజైన్లను కొనుగోలు చేసుకొని రాగా, వీటిని అరుణ్కుమార్ తీసుకొని మరో రూ.1.10 లక్షలు ఇచ్చాడు. ఈ తుపాకీని పరీక్షించడానికి అరుణ్ కుమార్ తన పొలంలో నాలుగు తూటాలు పేల్చి సంతృప్తి చెందాడు. భార్యను చంపే కుట్రలో అలీఖాన్, సల్మాన్లను భాగస్వాముల్ని చేసే నిమిత్తం సోమవారం అంబర్పేటలోని అలీకేఫ్ చౌరస్తా వద్ద వారితో సమావేశమయ్యాడు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.సైదాబాబు నేతృత్వంలో ఎస్సైలు ఎం.మహేష్ కె.రామారావు, కె.స్వామి వలపన్ని ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు. కేసును అంబర్పేట పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న సలామత్ సల్మాన్, తాబిష్ కోసం గాలిస్తున్నారు. -
లావణ్య త్రిపాఠి కేసు దర్యాప్తు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి కొణిదెలను ఆన్లైన్ వేధింపులకు గురిచేసిన ఇన్స్టాగ్రామ్ ఐడీకి సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆ సంస్థకు ఈ–మెయిల్ ద్వారా లేఖ రాశారు. అభ్యంతరకర, అసభ్య, పరువుకు భంగం కలిగించే అంశాలను తొలగించాలని కోరారు. తనకు ఎదురైన ఆన్లైన్ వేధింపులపై లావణ్య త్రిపాఠి మేనేజర్ శనివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఫిర్యాదుతోపాటు ఆధారాలుగా 11 స్క్రీన్షాట్లను పోలీసులకు అందించారు. దాదాపు 15 వారాలుగా ఎదుర్కొంటున్న వేధింపులను వివరించారు. ఇన్స్టాలో ‘పర్పుల్ క్రెయాన్ 00’అకౌంట్ ఐడీ ఉన్న వ్యక్తి.. లావణ్య త్రిపాఠిపై పెట్టిన అభ్యంతరకర పోస్టులు, కామెంట్స్ను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఆ ఐడీకి సంబంధించిన ఐపీ అడ్రస్ను సంగ్రహించాలని నిర్ణయించారు. -
హైదరాబాద్లో పీజీ హాస్టళ్లకు భారీ షాక్..!
సాక్షి, హైదరాబాద్: కమర్షియల్ (వాణిజ్య) సిలిండర్ల కొరతతో ముంబైలో 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్ల మూసివేత! ఇబ్బందులు కొనసాగితే సగం హోటళ్లు బంద్ తప్పదనే అంచనాలు వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు బెంగళూరు, పలు ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి. మరి మన హైదరాబాద్ పరిస్థితి...? ఇతర నగరాల తరహాలోనే భాగ్య నగరంపైనా పశ్చిమాసియా యుద్ధ మేఘాలు గట్టి ప్రభావమే చూపుతున్నాయి. ఆయిల్ కంపెనీలు ఇండెంట్ తీసుకోవడం లేదని చెబుతున్న వెండర్లు... సోమవారం నుంచి కమర్షియల్ సిలిండర్ల పంపిణీని పూర్తిగా ఆపేశారు. దీంతో వాణిజ్య సిలిండర్ల లభ్యత కష్టమనే ఆందోళన కలుగుతోంది. మరీ ముఖ్యంగా హాస్టళ్లు, హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణ క్లిష్టంగా మారనుంది. ఇదే పరిస్థి్థతి మరో రెండు రోజులు కొనసాగితే వంట కష్టమేనని హాస్టళ్ల నిర్వాహకులు వాపోతున్నారు. ఇప్పటికే మెనూలో కోత పెట్టారు. సహజంగా పేయింగ్ గెస్ట్ (పీజీ) హాస్టళ్లలో రోజూ టిఫిన్లో ఇడ్లీ, దోశ, పూరీ, బోండా, మధ్యాహ్నం లంచ్లో చపాతీ, అన్నం, పప్పు, కర్రీ, రాత్రి భోజనంలో కర్రీతో పాటు ఒక ఫ్రై ఇస్తుంటారు. కానీ, ప్రస్తుతం టిఫిన్లో, డిన్నర్లో పలు పదార్థాలను తొలగించారు. ఐటీ కారిడార్లో తీవ్ర చర్చ పీజీ హాస్టళ్లలో వంటపై ఐటీ కారిడార్లో తీవ్ర చర్చ జరుగుతోంది. నగరంలో దాదాపు 11 వేల హాస్టళ్లు, 3 వేలకు పైగా హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయని అంచనా. ఐటీ ఉద్యోగులతో పాటు ఉన్నత ఆదాయ (బ్లూ కాలర్) ఉద్యోగులు, వివిధ కోర్సులు అభ్యసించే విద్యార్థులు దాదాపు 10 లక్షల మంది హాస్టళ్లలో ఉంటున్నారు. గచి్చబౌలి, మాదాపూర్, కొండాపూర్, శేరిలింగంపల్లి, గోపన్పల్లి, మియాపూర్, కేపీహెచ్బీ, కూకట్పల్లి, యూసుఫ్గూడ, అమీర్పేట, మణికొండ, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వందల పీజీ హస్టళ్లు, గెస్ట్ హౌస్లు నిర్వహిస్తున్నారు. ఐటీ కారిడార్లోని గచి్చ»ౌలి, మాదాపూర్, చందానగర్, మియాపూర్, కూకట్పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లోనే వెయ్యి హోటళ్లు కొనసాగుతున్నాయి. వీటన్నిటిలో గ్యాస్తోనే కిచెన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కొరత తీవ్ర ప్రభావం చూపనుంది. ఇదే అదనుగా కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ విక్రయాలు ఊపందుకుంటున్నాయి. ఒక్కో వాణిజ్య సిలిండర్ను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. సామాన్యులపై ప్రభావం హోటళ్ల వద్ద సాధారణంగా 2 నుంచి 3 రోజులకు సరిపడా నిల్వలు ఉంటాయి. అవి అయిపోతే వంట గదులు మూతపడాల్సిందే. ఇలాగైతే హోటళ్లను నడపడం అసాధ్యమని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని హోటల్స్ అసోసియేషన్ నేతలు కోరుతున్నారు. రంజాన్ మాసం కావడంతో హైదరాబాద్లో హోటళ్ల వ్యాపారం జోరుగా సాగుతుంది. హలీం తయారీకి కట్టెల పొయ్యి వాడడం వల్ల కొంత ఉపశమనం ఉంటుంది. కానీ, మిగతా హోటళ్లకు గ్యాస్ కొరత ఏర్పడుతోంది. వ్యాపారులు, వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. చాలా హోటళ్లు మెనూలో ఐటమ్స్ తగ్గించడం లేదా పనివేళలను కుదించే ఆలోచన చేస్తున్నాయి. కమర్షియల్ సిలిండర్ల పంపిణీపై చర్యలు తీసుకోవాలి కమర్షియల్ సిలిండర్ల సప్లయ్ నిలిచిపోవడంతో పీజీ హాస్టళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఐటీ కారిడార్ హాస్టళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి తెలిపారు. కట్టెల పొయ్యిపై వంటలు చేసి సమయానికి అందించడం కుదరదన్నారు. కమర్షియల్ సిలిండర్ల సప్లయ్ పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు. కాగా, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సప్లయ్ నిలిచిపోయిన నేపథ్యంలో బుధవారం ఉయదం 10.30 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు అమర్నాథ్రెడ్డి, ఐటీ కారిడార్ హాస్టళ్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కరుణాకర్, ట్రెజరర్ మహీధర్ తెలిపారు. రాయదుర్గంలోని ప్రశాంతిహిల్స్లో జరిగే ఈ సమావేశంలో గ్యాస్ కొరతతో హాస్టళ్లపై పడుతున్న ప్రభావాన్ని వివరించనున్నారు.20 శాతం పెరిగిన బుకింగ్ పశి్చమాసియా యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ప్రచారంతో సాధారణ రోజుల కంటే బుకింగ్ల సంఖ్య 15 శాతం నుంచి 20 శాతం పెరిగింది. అవసరం లేకున్నా ఇలా చేస్తుండడంతో సరఫరా గొలుసుపై ఒత్తిడి పడుతోంది. ఈ నేపథ్యంలోనే రెండు సిలిండర్ల బుకింగ్ మధ్య కనీస కాలాన్ని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచారని, సిలిండర్ల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, వినియోగదారులు అనవసరంగా ఆందోళన చెందవద్దని అధికారులు పేర్కొంటున్నారు. అవసరమైతేనే గ్యాస్ బుక్ చేయాలని, వంటింట్లో గ్యాస్ ఆదా పద్ధతులను పాటించాలని సూచిస్తున్నారు. -
పూర్తిస్థాయి డీజీపీ ఎవరో?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి పూర్తి స్థాయి డీజీపీ ఎంపిక ప్రక్రియ కీలక దశకు చేరింది. ఆరు వారాల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో బుధవారం ఢిల్లీ షాజహాన్ రోడ్డులోని ధోల్పూర్ హౌస్లో ఉదయం 10.15 గంటలకు ఎంపిక కమిటీ కీలక సమావేశం జరగనుంది. కమిటీలో సభ్యుడిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ అధికారులతో కూడిన ఐపీఎస్ అధికారుల పేర్లు యూపీఎస్సీకి ఇప్పటికే చేరాయి.సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. కనీసం 6 నెలల పదవీకాలం ఉన్న నలుగురు అధికారుల జాబితా పంపాల్సి ఉండగా. అందులో సీనియర్ ఐపీఎస్ అధికారులు 1992 బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్, 1994 బ్యాచ్కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, శిఖా గోయల్, సౌమ్య మిశ్రాల పేర్లు ఉన్నట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం ఇన్చార్జి డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి పేరు కూడా ఉన్నట్టు తెలిసింది. అయితే ఆయన వచ్చే ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు. పదవీకాలం 6 నెలల కంటే తక్కువగా ఉండటంతో, ఆయనకు పూర్తిస్థాయి డీజీపీగా అవకాశం దక్కడం కష్టమే అన్న వాదనలు పోలీసు అధికార వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఉత్కంఠగా మారిన ఎంపిక ప్రస్తుతం డీజీ ర్యాంకులో ఉన్న వారిలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, 1992 బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్ అందరికంటే సీనియర్. ఆ తర్వాత 1994 బ్యాచ్లో ప్రస్తుతం ఇన్చార్జి డీజీపీగా కొనసాగుతున్న బి.శివధర్రెడ్డి, కేంద్ర సర్వీస్లో ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్గా పనిచేస్తున్న వినాయక్ ప్రభాకర్ ఆప్టే, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా పనిచేస్తున్న శిఖా గోయల్, జైళ్లశాఖ డీజీగా పనిచేస్తున్న సౌమ్యా మిశ్రా ఉన్నారు. వీరిలోంచి యూపీపీఎస్సీ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఎంపిక చేసి, ఆ జాబితాను రాష్ట్రానికి పంపుతుంది. రాష్ట్రానికి వచ్చిన జాబితాలోని ముగ్గురి నుంచి ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తుంది. అయితే డీజీపీ పదవి ఎవరికి దక్కుతుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అందరికంటే సీనియర్ సీవీ ఆనంద్ సీనియర్గా ఉన్నప్పటికీ కేంద్ర సర్వీస్లో సుదీర్ఘంగా కొనసాగుతున్న వినాయక్ ప్రభాక్ ఆప్టేపై ప్రభుత్వం ఆసక్తి చూపకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. ఇక అత్యంత సీనియర్ ఐపీఎస్ అయిన సీవీ ఆనంద్ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతుందా..? లేదంటే మహిళా డీజీపీని నియమించాలనుకుంటే శిఖాగోయల్, సౌమ్యా మిశ్రాలలో ఒకరికి అవకాశం ఇస్తుందా అన్నది త్వరలోనే తేలనుంది.డీజీపీగా జితేందర్ పదవీ విరమణ చేసిన సమయంలోనే ఆ పదవి కోసం శిఖా గోయల్ పూర్తి ప్రయత్నాలు చేసినా.. అప్పట్లో ఆమెకు ఆ అవకాశం దక్కలేదు. ఉమ్మడి ఏపీలోనూ, ప్రస్తుత తెలంగాణలోనూ మహిళా అధికారి ఎవరూ డీజీపీ కాలేదని, తనకు ఆ అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతున్నట్లు చెబుతున్నారు. పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యే వారు కనీసం రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగనుండడంతో ఈ పదవికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. -
వివేకా హత్య కేసులో.. కొత్త నిందితులెవరూ లేరు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సమగ్ర దర్యాప్తు చేశామని, కొత్తగా నిందితులెవరూ లేరని, తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పేర్కొంది. ఈ మేరకు సీబీఐ కోర్టుకు అనుబంధ నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. వివేకా హత్య కేసులో కొత్తగా ఎవరి పాత్ర బహిర్గతం కాలేదని అనుబంధ నివేదికలో సీబీఐ వెల్లడించింది. సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్యాదవ్, ప్రకాశ్రెడ్డి మనవడు అర్జున్రెడ్డి సీడీఆర్ రికార్డుపై వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత పొరపడ్డారని స్పష్టం చేసింది. యూటీసీ సమయాన్ని భారత కాలమానంగా భావించారని తెలిపింది.వాస్తవానికి యూటీసీ సమయానికి 5:30 గంటలు కలిపితే ఇక్కడి సమయం వస్తుందని, ఆ మేరకు ఉదయం 7:12 గంటలకు కిరణ్, అర్జున్కు మెసేజ్ పంపడం అనుమానించాల్సిన విషయం కాదని పేర్కొంది. అర్జున్ కూడా వరుసకు వివేకాకు మనవడు అవుతారని, అందుకే వివరాలు తెలియజేశారని వెల్లడించింది. దీంతో ఎలాగైనా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతిని ఇరికించాలని విశ్వ ప్రయత్నం చేసిన పచ్చమీడియా, సునీత కుయుక్తులు బెడిసికొట్టాయి. వైఎస్ వివేకా హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో నర్రెడ్డి సునీత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పాక్షిక దర్యాప్తునకు అనుమతిస్తూ డిసెంబర్ ఉత్తర్వులు జారీ చేసింది.⇒ చార్జిషీట్లో వివరాలు..‘2019 మార్చి 15న వివేకా తన ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉండటం చూసిన పీఏ కృష్ణారెడ్డి.. ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్, భార్య సౌభాగ్యమ్మకు ఫోన్ చేసి చెప్పారు. కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది. 2020 జూలైలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీబీఐకి కేసు బదిలీ చేసింది. 2021 అక్టోబర్లో ప్రాథమిక దర్యాప్తు తర్వాత గంగిరెడ్డి, సునీల్యాదవ్, ఉమా శంకర్రెడ్డి, షేక్ దస్తగిరిలను నిందితులుగా పేర్కొంటూ పులివెందులలోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ దాఖలైంది.దస్తగిరి అప్రూవర్గా మారగా తరువాత శివశంకర్రెడ్డిని నిందితుడిగా చేరుస్తూ అనుబంధ చార్జిషీట్ వేశారు. అనంతరం కేసు హైదరాబాద్ కోర్టుకు బదిలీ అయ్యింది. ఉదయ్కుమార్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డిని నిందితులుగా చేరుస్తూ మరో అనుబంధ చార్జిషీట్ దాఖలైంది. ఈ కేసు సీఆర్పీసీ సెక్షన్ 207 కింద నిందితులకు అందించిన పత్రాల ధృవీకరణ దశలో ఉంది’ అని చార్జిషీట్లో పేర్కొంది.⇒ సమాచారం ఇవ్వడంలో తప్పులేదు..‘ఈ కేసులో తదుపరి దర్యాప్తు కోరుతూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత 2025 సెప్టెంబర్లో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టు ఆమె పిటిషన్ను పాక్షికంగా అనుమతించింది. వివేకా మృతి చెందిన నాటి రాత్రి సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్యాదవ్, వైఎస్ ప్రకాశ్రెడ్డి మనవడు అర్జున్రెడ్డి ఫోన్ కాల్స్ను పరిశీలించి ఏదైనా ఉంటే దర్యాప్తు చేయాలని 2025 డిసెంబర్లో కోర్టు ఆదేశించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కాల్ డేటా రికార్డు(సీడీఆర్)ను పరిశీలించాం. 2019 మార్చి 15న కో–ఆర్డినేటేడ్ యూనివర్సల్ టైమ్ (యూటీసీ) 1:42:42 ప్రకారం.. ‘వివేకం సర్’, ‘అర్జున్ అన్నా.. సర్, చనిపోయారు..’ అని మెసేజ్ పంపారు.ఈ సమయంపై పొరపడిన సునీతారెడ్డి అర్థరాత్రిగా భావించారు. కానీ, వాస్తవం ఏమిటంటే.. యూటీసీ సమయానికి అదనంగా 5:30 గంటలు కలిపితే భారత కాలమానం వస్తుంది. 1:42:32 యూటీసీ సమయం అంటే.. భారత కాలమానం ప్రకారం ఉదయం 7:12:42 (7 గంటల 12 నిమిషాల 42 సెకన్లు). అప్పటికే వివేకా మృతి వార్త మీడియాలోనూ ప్రసారమైంది. అంతేకాదు.. ఆ రోజు రాత్రి, ఉదయం కిరణ్ యాదవ్ తన ఇంట్లోనే ఉన్నారని తేలింది. ఉదయం (తెల్లవారుజామున) టీవీ చూస్తుండగా వివేకా మరణవార్త అతనికి తెలిసింది. అదే రోజు అర్జున్రెడ్డి లాంటి వారు కొందరు కిరణ్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. కిరణ్ ఫోన్ చేసినా అర్జున్ అందుబాటులోకి రాకపోవడంతో మెసేజ్ పంపారు. అర్జున్కు వరుసకు వివేకా తాత అవుతారు.అందుకే కిరణ్ వివరాలు తెలిపారు. అంతేగానీ ఈ హత్యతో వారికి ఎలాంటి సంబంధం లేదు. ఇతరుల పాత్రపై కూడా సమగ్ర దర్యాప్తు చేశాం. వివేకా హత్య కేసులో మరే ఇతర వ్యక్తి పాత్ర బయటపడలేదు. కేసులో తదుపరి దర్యాప్తును ముగించాలి. ఈ అనుబంధ నివేదికను అంగీకరించాలి’ అని సీబీఐ చార్జిషీట్లో నివేదించింది. అర్జున్, కిరణ్యాదవ్ నుంచి సేకరించిన వాంగ్మూలం రికార్డులు, సమయానికి సంబంధించి ఢిల్లీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ రవీందర్ చౌహాన్ నుంచి తీసుకున్న స్టేట్మెంట్ను నివేదికకు జత చేసింది. -
నేడు కొత్త గవర్నర్ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్గా శివప్రతాప్ శుక్లా బుధవారం ఉదయం 11.30 గంటలకు లోక్భవన్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులు, అధికార, విపక్ష పార్టీల నేతలు, అధికారులు పాల్గొంటారు. గవర్నర్గా నియమితులైన శివప్రతాప్ శుక్లా మంగళవారం హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. -
ఆరు గ్యారంటీల చట్టబద్ధతకు ప్రైవేట్ బిల్లు : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు మొదటి కేబినెట్ సమావేశంలోనే చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొ స్తున్నా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టేందుకు సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రవేశపెట్టే ప్రైవేట్ మెంబరు బిల్లుకు అధికార పార్టీ మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగర శివారులోని గోల్కొండ రిసార్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమం ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మూడో వార్షిక బడ్జెట్కు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వ పదవీకాలం సగం పూర్తయినా హామీల అమలు జరగడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హామీల వైఫల్యం, మోసాన్ని ఎండగట్టేందుకు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాం. రెండేళ్లుగా అసెంబ్లీ కమిటీలు లేకుండానే ప్రభుత్వం సమావేశాలను బలవంతంగా నడిపిస్తోంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని మా పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వ్యక్తికి ఇచ్చారు. సెలెక్ట్, స్టాండింగ్, పిటిషన్స్ తదితర 14 అసెంబ్లీ కమిటీలు పెండింగ్లో ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్, చీఫ్విప్ లాంటి పదవులు భర్తీ చేయకుండా మందబలంలో బుల్డోజర్ టాక్టిక్స్ను ప్రభుత్వం ప్రయోగిస్తోంది. అసెంబ్లీ ఉభయ సభల్లో అబద్ధాలు, అసత్యాలతో అంకెలను తారుమారు చేస్తూ తూతూమంత్రంగా సమావే శాలు నిర్వహిస్తోంది’అని కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీలో కాంగ్రెస్ను నిలదీసేందుకే.. ‘ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అసెంబ్లీలో నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలంగా నిలదీయడానికే అవగాహన సమావేశాలు బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. రైతుబంధు, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత, మూసీ బాధితులు తదితర అంశాలతోపాటు ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న అంకెల గారడీని, లేని అప్పులను ఉన్నవిగా చూపిస్తున్న కాంగ్రెస్ అబద్ధాలను అంకెలతో సహా ఎండగడతాం. భవిష్యత్లోనూ బీఆర్ఎస్ శాసన మండలి, శాసనసభ సభ్యుల నడుమ మా పార్టీ సమన్వయం కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆరు గ్యారంటీలు, హామీల అమలుకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరిట భారీ అవినీతికి తెరలేపింది. మేము సుందరీకరణకు కాకుండా దాని పేరిట జరుగుతున్న అవినీతిని వ్యతిరేకిస్తున్నాం. ఢిల్లీకి నిధులు పంపేందుకే రేవంత్రెడ్డి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును చేపడుతున్నాడు. రేవంత్రెడ్డి చెబుతున్న మాటలకు ఎంత మాత్రం విలువ లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పట్టపగలు నాశనం చేసిన సీఎం ‘నైట్ ఎకానమీ’గురించి మాట్లాడుతున్నాడు. రేవంత్రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ఒక్క ఇళ్లు కట్టినా నేను రాజీనామా చేస్తాను అని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఇళ్లు, ఫైఓవర్లు, ప్రాజెక్టులకు రంగులు పూసి రేవంత్ తమ ఘనతగా చెప్పుకుంటున్నాడు’అని కేటీఆర్ విమర్శించారు. ముగిసిన అవగాహన కార్యక్రమం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎస్.మధుసూదనాచారి తదితరులు ప్రసంగించారు. పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్రెడ్డి వివిధ అంశాలపై ప్రసంగించారు. -
ఇరవయ్యేళ్లు ఇబ్బందుల్లేకుండా..
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర భూములు, ఆస్తుల క్రయవిక్రయ లావాదేవీల కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత పదేళ్ల కాలంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య (భూములు, ఆస్తుల క్రయ విక్రయ లావాదేవీలు) నాలుగు రెట్లు పెరిగిన నేపథ్యంలో వచ్చే 20 ఏళ్ల కాలానికి తగిన విధంగా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ పోర్టల్ను నిర్వహిస్తున్న నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) సహకారంతోనే మరో 20 ఏళ్ల పాటు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సాఫ్ట్వేర్ను ఆధునీకరించాలని సర్కారు భావిస్తోంది. ఈ కార్యక్రమానికి అవసరమైన నిధులు వచ్చే బడ్జెట్లో కేటాయించనున్నారు. దాదాపు రూ.10 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తుండగా, ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ చేసిన ప్రతిపాదనకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఏకీకృత పోర్టల్ తరహాలోనే..! ప్రస్తుతం రాష్ట్రంలో భూముల వివరాలు, సర్వే, రిజిస్ట్రేషన్ల వివరాలు వేర్వేరు డొమైన్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ మొత్తం డేటా, ఇతర సమాచారాలను సమీకృతం చేస్తూ ఏకీకృత పోర్టల్ తీసుకురావాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగా ఏకీకృత పోర్టల్ తరహాలోనే స్టాంపుల శాఖ సాఫ్ట్వేర్ను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రానున్న ఇరవై ఏళ్ల సమాచారాన్ని నిక్షిప్తం చేయడంతో పాటు, రోజువారీ కార్యకలాపాలను నియంత్రించే సర్వర్లతో సహా ఇతర అంశాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పోర్టల్కు కొత్త సొబగులు అద్దనున్నారు. ఈ బాధ్యతలు తీసుకున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ రాజీవ్గాంధీ హనుమంతు ఎప్పటికప్పుడు ఇందుకు అవసరమైన సమాచారం తీసుకుంటూ, ఎన్ఐసీతో సమన్వయం చేసుకుంటూ 2047 వరకు ఉపయోగపడేలా సాఫ్ట్వేర్ను ఆధునీకరించే పనిలో నిమగ్నమయ్యారు. మరో ఆరు నెలల్లోపు ఈ ప్రకియ పూర్తవుతుందని, 20 ఏళ్ల పాటు రిజిస్ట్రేషన్ల శాఖ నిర్వహించే క్రయ విక్రయ లావాదేవీలకు ఎలాంటి అవాంతరాలు లేని కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. -
ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం హోటల్ రంగాన్ని తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి పెట్రో ఉత్పత్తుల దిగుమతికి ఆటంకాలు ఎదురవుతుండటంతో దేశంలో వాణిజ్యావసరాలకు ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. గృహావసరాలకు, అత్యవసర సేవలు అందించే ఆస్పత్రులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. మరోవైపు ఈ నెల 7వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచింది. కేంద్రం ఆంక్షల నేపథ్యంలో గ్యాస్ ఏజెన్సీలు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేశాయి. దీంతో ఇప్పటికే ముంబై, బెంగళూరులో 20 శాతం హోటళ్లు మూతపడినట్లు తెలుస్తోంది. చిన్న, మధ్య తరగతి హోటళ్లు, మెస్లు, హాస్టళ్లపై సైతం దీని ప్రభావం పడుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన నగరాల్లోనూ సమస్య తలెత్తుతున్నట్టు సమాచారం. వీరికి హోటళ్లే ఆధారం తెలంగాణలో 1.49 కోట్ల గృహ వినియోగదారులు ఉండగా, నెలకు కోటికి పైగా సిలిండర్లు వినియోగమవుతున్నాయి. అలాగే 5 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉండగా, వినియోగం దానికి రెట్టింపు స్థాయిలో ఉంటుంది. కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25 వేలకు పైగా మీడియం స్థాయి హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా, చిన్న హోటళ్లు భారీ ఎత్తున ఉన్నాయి. మెస్లు, చిన్న చిన్న రోడ్డుపక్క హోటళ్లు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇక స్టార్ హోటళ్లు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. చిన్న చిన్న హోటళ్లు రోజుకు ఒక సిలిండర్, పెద్దవి 3–5 వినియోగిస్తాయి. వినియోగదారులను బట్టి రెస్టారెంట్లు, బార్లలో కూడా రోజుకు ఐదుకు తక్కువ కాకుండా సిలిండర్ల వినియోగం ఉంటుంది. అదే స్టార్ హోటళ్లు రోజుకు 25 సిలిండర్లకు పైగా వినియోగిస్తాయి. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెం వంటి నగరపాలక సంస్థలతో పాటు జిల్లా కేంద్రాలు, మునిసిపాలిటీలు, మండల కేంద్రాలలోని హోటళ్లలో కూడా గ్యాస్ సిలిండర్ల వినియోగం పెద్ద ఎత్తున ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులకు హోటల్ ఆహారమే ఆధారం. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేస్తే హోటళ్లు మూత పడడమే కాకుండా లక్షలాది మంది ఉపాధికి గండి పడుతుంది. 60–65 శాతం ఎల్పీజీ దిగుమతి భారత్ 60–65 శాతం ఎల్పీజీ కోసం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి సరఫరా ఆగిపోవడంతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. 2025లో ఎల్పీజీ వినియోగం 31 మిలియన్ టన్నులకు చేరగా, దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి కేవలం 12–13 మిలియన్ టన్నులకే పరిమితమవడంతో సమస్య మరింత ఉధృతమైంది. ప్రత్యామ్నాయాల అన్వేషణలో హోటల్ రంగం తాజా పరిస్థితులతో ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు హోటల్ రంగం మొగ్గు చూపుతోంది. ఎలక్ట్రిక్ స్టవ్లు, బయోగ్యాస్ వంటి ఆప్షన్లు పరిశీలిస్తున్నప్పటికీ, అవి ఖర్చుతో కూడుకున్నవే గాక తక్షణ పరిష్కారానికి వీలుకానివనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు వంటగదుల్లో విద్యుత్ వినియోగం పెంచే ఆలోచనలో హోటళ్ల యజమానులు ఉన్నారు. హైదరాబాద్లో పుష్కలంగా నిల్వలు యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ప్రచారంతో సాధారణ రోజుల కంటే ఇప్పుడు గృహ వినియోగం బుకింగ్ల సంఖ్య 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో సిలిండర్ల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, వినియోగదారులు అనవసరంగా భయాందోళన చెందవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: భారత్ గ్యాస్ వంట గ్యాస్ కొరతపై జరుగుతున్న ప్రచారంతో ప్రజలు ఆందోళన చెందుతుండడంతో గ్యాస్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. భారత్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్..ఎల్పీజీ వినియోగదారులు ఆందోళన చెందవద్దంటూ సంక్షిప్త సందేశాలు పంపుతోంది. ‘ఇంధన సరఫరాలో కొరత ఉందని సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదారి పట్టించే, ఆధార రహితమైన వార్తలు ప్రచారం చేస్తున్నారు. దేశంలో ఇంధనం సమృద్ధిగా అందుబాటులో ఉంది. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాం. ఇంధనాన్ని సమర్థవంతంగా, అవసరానికి అనుగుణంగా వినియోగించడం మంచిది’ అని బీపీసీఎల్ ఆంగ్లంలో ఎస్ఎంఎస్లు పంపించింది. అయితే గృహ వినియోగదారులు ఒకసారి గ్యాస్ బుక్ చేసిన తర్వాత మరోసారి బుక్ చేయాలంటే ఇప్పటివరకు ఉన్న 21 రోజుల గడువును 25 రోజులకు పెంచుతూ ఆయిల్ కంపెనీల నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఏజెన్సీలు చెబుతున్నాయి. హోటళ్లు మూతపడే ప్రమాదం: హోటల్స్ అసోసియేషన్ వాణిజ్య ఎల్పీజీ సరఫరా నిలిచిపోతే హోటల్ రంగం మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర హోటళ్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షుడు ఎస్.వెంకటరెడ్డి, కార్యదర్శి సీహెచ్ వేణుగోపాల్ తదితరులు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని కలిసి సమస్యను వివరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మంత్రి ఢిల్లీకి వెళ్లిన కారణంగా వచ్చిన తర్వాత ఆయన్ను కలుస్తామని వెంకటరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో హోటళ్లు మూతపడిన దాఖలాలు లేవని, కానీ సోమవారం నుంచి కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేశారని ఆయన వివరించారు. -
గోదావరి పుష్కరాలకు 8 కోట్ల మంది!
సాక్షి, హైదరాబాద్: అత్యంత భక్తి ప్రపత్తులతో ఆచరించే గోదావరి పుష్కరాలు వచ్చే సంవత్సరం జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్నాయి. ఆది పుష్కరాల తర్వాత నిర్వహించే అంత్య పుష్కరాలు 2028 జూలై 13 నుంచి 24 వరకు జరుగుతాయి. ఈ మేరకు పండితులు తేదీలు ఖరారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. పుష్కరాల నిర్వహణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం పుష్కరాల నిర్వహణ ప్రణాళిక ఖరారుపై నిర్వహించిన సమావేశంలో ఈ తేదీలను అధికారికంగా ప్రకటించింది. కుంభమేళాకు చేసే ఏర్పాట్ల తరహాలోనే ఏర్పాట్లు ఉండాలని నిర్ణయించారు. గతంలో జరిగిన గోదావరి పుష్కరాల అనుభవాలను గమనంలో ఉంచుకొని ప్రణాళిక ఖరారు చేయాలని నిర్ణయించారు. వచ్చే పుష్కరాల్లో దాదాపు 8 కోట్ల మంది స్నానాలు ఆచరించే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన జరిగిన ఉప సంఘం సమవేశంలో అంచనా వేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ బ్రాండ్ మార్మోగేలా... మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను కమిటీ ఆదేశించింది. భారీ సంఖ్యలో పుణ్యస్నానాలకు వస్తారని భావిస్తున్నందున, వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో పుష్కర ఏర్పాట్లు ఉండాలని పేర్కొంది. ఈ మేరకు 96 ప్రాంతాలను అధికారులు ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో స్నాన ఘట్టాలు, సులభంగా చేరుకునేలా మెరుగైన రోడ్లు నిర్మించాలని ఆదేశించింది. వానాకాలంలో పనులకు ఇబ్బందులుంటాయని, ఈలోపే పనులు మొదలయ్యేలా చూడాలని ఆదేశించింది. ఈ నెల చివరి నాటికి డీపీఆర్లను పూర్తి చేయాలని పేర్కొంది. ముఖ్యమైన ప్రాంతాలను ముందుగా ఎంపిక చేసి యుద్ధప్రాతిపదికన పనులు చేయాలని సూచించగా, రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించిన 9 ప్రాంతాలను తొలి విడత పనులకు అధికారులు ఎంపిక చేశారు. సమన్వయలోపం తలెత్తకుండా గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్, శాఖల వారీగా నోడల్ అధికారులను నియమిస్తున్నట్టు కమిటీ పేర్కొంది. -
కిమ్స్ ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
గచ్చిబౌలి (హైదరాబాద్): అరుదైన అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఆస్పత్రి కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నవీన్కుమార్ మంగళవారం వివరాలను వెల్లడించారు. కిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేసన్ అనంతరం మూడు రకాల ఇమ్యూనో సప్రెషన్ చికిత్స పొందుతున్న రోగిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ను గుర్తించినట్లు తెలిపారు. దీంతో ల్యాప్రోస్కోపిక్ విధానంలో ప్యాంక్రియాటో డ్యూడెనెక్టమీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. అయితే రోగికి అప్పటికే పాలీసిస్టిక్ లివర్ వ్యాధి, మార్పి డి చేసిన కిడ్నీలో పెద్ద తిత్తి (సిస్ట్) ఉండటంతో పాటు గతంలో ఓపెన్ బైలాటరల్ నెఫ్రెక్టమీ చేయించుకోవడం తదితర క్లిష్టమైన సమస్యలు ఉండడంతో సర్జరీ సంక్లిష్టంగా మారిందన్నారు. అలాగే చిన్న పేగు, కాలేయానికి కీలకమైన రక్తనాళం (సుపీరియర్ మెసెంటరిక్ వీన్) ప్రభావితమవడం కూడా సర్జరీకి మరో పెద్ద సవాల్గా నిలిచిందని వివరించారు. ఈ నేపథ్యంలో ల్యాప్రోస్కోపిక్ విధానంలో ప్యాంక్రియాటో డ్యూడెనెక్టమీతో పాటు సంబంధిత ఎస్ఎం నాళాన్ని కట్ చేసి మరమ్మతు చేశామని తెలిపారు. విజయవంతంగా చికిత్స ల్యాప్రోస్కోపిక్ విధానంలో రక్తనాళాల తొలగింపు ఆపరేషన్లు ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువ ఆస్పత్రులలోనే జరుగుతున్నాయని డాక్టర్ నవీన్కుమార్ తెలిపారు. అందులోనూ సంక్లిష్టమైన ఇమ్యూనో సప్రెషన్లో ఉన్న రోగులకు ప్రధాన ప్యాంక్రియాస్ శస్త్ర చికిత్సల్లో మరణాల శాతం 50 వరకు ఉండే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. ప్రపంచంలోనే ల్యాప్రోస్కోపిక్ విధానంలో ఇలాంటి శస్త్రచికిత్స ఇదే తొలిసారి కాగా ఇలాంటి మరో సర్జరీని అమెరికాలోని మేయో క్లినిక్లో ఓపెన్ సర్జరీ ద్వారా నిర్వహించారని తెలిపారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ వరుణ్, డాక్టర్ జోయల్, డాక్టర్ రాజేశ్వర్, డాక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
కవిత దీక్ష భగ్నం.. హైదరాబాద్ తరలింపు
సాక్షి హైదరాబాద్/ఖమ్మంఅర్బన్: ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్లలో భూదాన్ బాధితులకు మద్దతుగా అంబేడ్కర్ భవన్ వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన దీక్షను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్తో కలిసి సోమవారం రాత్రి ఆమె దీక్ష ప్రారంభించిన విషయం విదితమే. ఈ మేరకు తెల్లవారుజామునే పెద్దసంఖ్యలో చేరుకున్న పోలీసులు కవిత తదితరులను వాహనాల్లో ఎక్కించి హైదరాబాద్లోని జాగృతి కార్యాలయానికి తరలించారు. అయితే వెలుగుమట్ల బాధితులకు ప్రభుత్వం కూల్చివేసిన చోటే కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే డిమాండ్తో కవిత తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ‘వెలుగుమట్లలో బాధితులకు ఇళ్లు నిర్మించి ఇచ్చేంత వరకు నిరాహార దీక్ష కొనసాగుతుంది’అని చెప్పారు. రాహుల్గాంధీకి కవిత లేఖ : వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో పేదల ఇళ్ల కూల్చివేత ఘటనపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం జోక్యం చేసుకోవాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాందీకి ఆమె మంగళవారం లేఖ రాశారు. ప్రభుత్వ చర్యల వల్ల సుమారు 600 ఇళ్లు బుల్డోజర్లతో కూల్చివేయబడగా దాదాపు 2 వేల మంది ఒక్కరాత్రిలోనే నిరాశ్రయులయ్యారని ఆమె తెలిపారు. బాధితుల్లో అధికంగా సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలే ఉన్నాయని పేర్కొన్నారు. -
కూల్చిన స్థలంలోనే ఇళ్లు కట్టి ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్ : పైసాపైసా కూడబెట్టుకున్నాం.. ఉన్న దాంట్లో సర్దుకుంటూ ఇళ్లు కట్టుకున్నాం. పిల్లలు పెద్దవారు అవుతున్నారు. ఇప్పుడిప్పుడే మా జీవితాలు కాస్తా మెరుగుపడుతున్నాయనుకునే సమయంలో బుల్డోజర్లతో మా ఇళ్లు కూల్చేశారు. మేము ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం మానవీయ కోణంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే మేమంతా రోడ్డుపాలవుతామని ఖమ్మం శివారు వెలుగుమట్ల భూదాన్ భూమిలో నివస్తున్న బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో న్యాయవాదులు సుగుణారావు, తిరుమలరావు, బీఆర్ఎస్ లీగల్సెల్ ప్రతినిధి నిరూషా, బీఆర్ఎస్ ఖమ్మం టౌన్ అధ్యక్షుడు నాగరాజు తదితరులతో కలిసి బాధితులు మాట్లాడారు. వెలుగుమట్లలో కట్టుకున్న 700 ఇళ్లు కూల్చి.. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు ఊరు అవతల ఇస్తామని అంటే సహించేది లేదు. కూల్చినచోటే ఇళ్లు కట్టి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా తెల్లవారు జామున 4 గంటలకు వందలాది మంది పోలీసులతో వచ్చి ఇళ్లను కూల్చడం అమానుషమన్నారు. 650 మంది బాధితులను అంబేడ్కర్ భవన్లో ఒక్కచోట ఉంచారని, అంత మంది కలిసి ఉన్నా.. నాలుగు బాత్రూమ్లు ఉన్నాయని వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు ఎలా ఉండగలుగుతారని ప్రశ్నించారు. ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయని, పది పరీక్షలకు పిల్లలు ప్రిపేర్ అవుతున్నారని, వారికి భోజనం ఇవ్వడం లేదని, భోజనం చేయడానికి వెళ్తామంటే కూడా బయటకు పంపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూదా న్ బోర్డు అక్కడ పేదలకు 62 ఎకరాల ఏడు గుంటల భూమి ఇచ్చిందని, ప్రభుత్వం కేవలం 32 ఎకరాలే చూపిస్తుందని, మిగిలిన 30 ఎకరాలు ఎక్కడకు వెళ్లిందో సీబీసీఐడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిని న్యాయస్థానం సుమోటోగా తీసుకొని న్యాయం చేయాలన్నారు.ఇప్పుడు ఎక్కడకు పోవాలి 2011లో ఖమ్మంలోని వెలుగుమట్లకు వచ్చాం. వంద గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్నాం. దాదాపు నాతోపాటు 100 మంది వరకు ఇళ్లు కట్టుకొని ఉంటున్నారు. ఇంకా 800 మందికిపైగా ఇళ్లు కట్టుకోలేదు. ఇళ్లల్లో, బయట పని చేసుకుంటా పైసా పైసా కూడబెట్టుకొని ఇళ్లు కట్టుకున్నాం. ఒక్కసారిగా మా ఇళ్లను కూల్చేశారు. మేము ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ కన్నీటిపర్యంతమయ్యారు శాంతి.బుల్డోజర్ మా ఇంటిపైకి వచ్చింది ఉదయం నాలుగు గంటలకు ఏదో శబ్దం వస్తుందని లేచా. లేచి వాళ్ల ముఖాలే చూశా. మా ఇళ్ల వద్ద హడావుడి. ఒక వైపు అరుపులు, మరో వైపు ఏడుపులు, తీరా చూస్తే ఒక బుల్డోజర్ మా ఇంటిపైకి వచ్చింది. ఎలాంటి వస్తువులు తీసుకోకుండానే ఇళ్లు కూల్చారు. వస్తువులు తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదు. ఇలాంటి దారుణం మరెక్కడా ఉండదని బోరున విలపించారు సరస్వతి. -
‘పది’కి పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 14 నుంచి పదవ తరగతి పరీక్షలు మొదలవుతాయి. ఏప్రిల్ 16తో ఈ పరీక్షలు ముగుస్తాయి మొత్తంగా 5,28,239 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5,17,727 మంది. 5,329 ప్రభుత్వ పాఠశాలల నుంచి 2,07,573 మంది, 1,057 గురుకులాల నుంచి 60,139 మంది, 5,288 ప్రైవేట్, ఎయిడెడ్ స్కూల్స్ నుంచి 2,50,015 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. ఉదయం 9.30 నుంచి మొదలయ్యే పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను తేలికగా తెలుసుకునేందుకు హాల్టికెట్లపై క్యూఆర్ కోడ్ను ముద్రించారు. విద్యార్థులకు ఇప్పటికే హాల్టికెట్లు పంపినట్టు అధికారులు తెలిపారు. మీ సేవ కేంద్రాల ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. 8096958096 వాట్సాప్ నంబరు ద్వారా కూడా హాల్టికెట్లు పొందొచ్చు. కంగారు పెట్టకుండా నిఘా పరీక్షలు సజావుగా నిర్వహించాలని జిల్లా అధికారులను పాఠశాల విద్య డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. పటిష్టమైన నిఘా వ్యవస్థ, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రతీ కేంద్రానికి సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ నిఘా సిబ్బంది, పరీక్షల సిబ్బంది విద్యార్థులను ఆందోళనకు గురిచేసేలా వ్యవహరించొద్దని ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరగాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందే భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు విభాగాన్ని కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రంలో తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను నికోలస్ ఆదేశించారు. సీసీ కెమెరాల ముందే పరీక్ష పేపర్ ఓపెన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. -
11 నుంచి ఏప్రిల్ 1 వరకు పలు రైళ్ల రద్దు
కాచిగూడ (హైదరాబాద్): రైళ్ల నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 11వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కాచిగూడ–కర్నూల్ సిటీ (17435), 12 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు కర్నూల్ సిటీ – కాచిగూడ (17436) రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజనల్ మేనేజర్ (డీఆర్ఎం) సంతోష్ కుమార్ వర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 11 నుంచి 31 వరకు కాచిగూడ – రాయచూర్ –కాచిగూడ వయా దేవరకద్ర, కృష్ణా (67787, 67788), కాచిగూడ– రాయచూర్–కాచిగూడ వయా గద్వాల్ (17693, 17694) రైళ్లను రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. గద్వాల్ –రాయచూర్–గద్వాల్ (67784, 67783)ను రద్దు చేస్తున్నామని వివరించారు. -
మూడేళ్లలో పంచాయతీలకు శాశ్వత భవనాలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో శాశ్వత భవ నాల్లేని గ్రామపంచాయతీల భవనాలు నిర్మించే దిశలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సూచించారు. స్థలాలు అందుబాటులో ఉన్నచోట తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు కలిపి నిర్మించే అవకాశాలు పరిశీలించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని, అవసరమైన పౌష్టికాహారంతో పాటు బోధనా పద్ధతులతో తర్ఫీదు ఇవ్వాలన్నారు. పట్టణాల్లో రోడ్లపై కొందరు చంటి బిడ్డలతో యాచక వృత్తి కొనసాగిస్తున్నారని, వారందరినీ శిశు విహార్లో చేర్చుకుని అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపై చంటి బిడ్డలు పట్టపగలు ఎండకు, వర్షాకాలంలో వానకు తడిసి వారి విలువైన బాల్యం మసకబారకుండా చూడాలన్నారు. శిశు విహార్లలో ఆధునిక వంట గదిని నిర్మించాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో 2026–27 బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ప్రీ–బడ్జెట్ సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ఈ శాఖలకు బడ్జెట్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉపాధి హామీకి కేంద్ర ప్రభుత్వం కోతలు విధిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ లోటును భర్తీ చేసే దిశగా చర్య లు తీసుకుంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గకుండా ఉండేలా రాష్ట్రం నుంచి అవసరమైన నిధు లు కేటాయించి పథకం అమలు కొన సాగించేందుకు చర్యలు తీసుకుంటామని భట్టి విక్ర మార్క, సీతక్క వెల్లడించారు. ఏజెన్సీలో ఇసుక మైనింగ్ ట్రైబల్ ఏజెన్సీల ద్వారా మాత్రమే జరగాలని భట్టి స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, సీసీఎల్ఏ సెక్రటరీ లోకేశ్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, పీఆర్ కమిషనర్ దివ్య దేవరాజ్, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ గౌతం, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు. -
Allu Cinemas: 75 అడుగుల డాల్బీ స్క్రీన్.. టికెట్ రేట్లపై చర్చ
హైదరాబాద్లోని కోకాపేట్లో మార్చి 12న కొత్తగా ప్రారంభం కానున్న అల్లు సినిమాస్ ఇప్పుడు సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు అరవింద్ కలిసి నిర్మించిన అల్లు సినిమాస్ ఒక సినిమా హాల్ మాత్రమే కాదు ఇదొక విజువల్ వండర్. ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ఇక్కడ ఉంది. ఇక్కడ సినిమా ఎక్స్పీరియన్స్ మరో లెవెల్లో ఉండనుంది.ఈ మల్టీప్లెక్స్లో నాలుగు స్క్రీన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రత్యేకమైన డాల్బీ విజన్ స్క్రీన్. ఇది 75 అడుగుల వెడల్పుతో ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతానికి ఇండియాలో కేవలం మూడు డాల్బీ విజన్ స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి పూణేలో 55 అడుగుల స్క్రీన్, రెండవది బెంగళూరులో 65 అడుగుల స్క్రీన్, ఇప్పుడు హైదరాబాద్లో 75 అడుగుల స్క్రీన్ రూపంలో అల్లు సినిమాస్. ఈ ప్రత్యేకత వల్ల అల్లు సినిమాస్ టికెట్ రేట్లు ఎలా ఉండబోతున్నాయన్నది సినీప్రియులలో పెద్ద చర్చగా మారింది. పూణేలోని డాల్బీ స్క్రీన్లో టికెట్ రేట్లు సాధారణ రోజుల్లో రూ.500 లోపు, పెద్ద సినిమాల వీకెండ్స్లో రూ. 900 వరకు ఉంటాయి. ఇక బెంగళూరులోని డాల్బీ స్క్రీన్లో టికెట్ రేట్లు క్యాపింగ్ సిస్టమ్కు ముందు గరిష్టంగా రూ.1000 వరకు ఉంటాయి. దాంతో హైదరాబాద్లోని అల్లు సినిమాస్ టికెట్ రేట్లు కూడా సాధారణ రోజుల్లో రూ.500, పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు సీటింగ్ బట్టి రూ.1000 వరకు ఉండే అవకాశం. తెలంగాణలో ప్రత్యేక టెక్నాలజీ, పరిమిత సీటింగ్ సామర్థ్యం ఉన్న స్క్రీన్లకు అధిక ధరలు వసూలు చేయడానికి ప్రత్యేక అనుమతులు ఉన్నాయి. అల్లు సినిమాస్ అల్ట్రా లగ్జరీ మల్టీప్లెక్స్ సెగ్మెంట్లోకి వస్తుంది. దాంతోడాల్బీ విజన్ స్క్రీన్కు భారీగా టికెట్ రేట్లు ఫిక్స్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి హైదరాబాద్లోని అల్లు సినిమాస్ ప్రీమియం మల్టీప్లెక్స్లకు కొత్త బెంచ్మార్క్గా నిలవబోతున్నాయి. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న అల్లు సినిమాస్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇందులో మొదటిగా ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 చిత్రాలు ప్రదర్శించబడుతాయి. -
రైల్వేకు వందల కోట్ల లాభం
'తుక్కు' సాధారణంగా ఈ పదం ఎందుకు పనికి రాకుండా వృథాగా ఉన్న వస్తువుల విషయంలో వాడుతుంటాం.. అయితే అదే కోట్ల వర్షం కురిపిస్తే.. తుక్కేంటి..కోట్లేంటి అనుకుంటున్నారా.. లేదండి ఇది అక్షరాల నిజం దక్షిణ మధ్య రైల్వే గతేడాదికి సంబంధించిన స్క్రాప్ను అమ్మితే వందల కోట్లు సంస్థకు వచ్చాయి.దక్షిణ మధ్య రైల్వే (SCR) “మిషన్ జీరో స్క్రాప్” అనే కార్యక్రమంలో స్క్రాప్ను విక్రయిస్తుంది. ఈ కార్యక్రమం ప్రకారం ఒక నెలకు మించి స్క్రాప్ (పాత లోహ వస్తువులు) నిల్వ ఉండకుండా వెంటనే విక్రయించాలని నియమం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో రైల్వే బోర్డు రూ. 510.00 కోట్లు సేకరించాలని టార్గెట్ పెట్టుకుంది. అయితే రికార్డు స్థాయిలో లక్ష్యాన్ని అధిగమించి, ₹602.06 కోట్ల ఆదాయం స్క్రాప్ విక్రయాల ద్వారా దక్షిణ మధ్య రైల్వే ఆదాయం పొందింది.మొత్తంగా 132,583 మెట్రిక్ టన్నుల స్క్రాప్ ను సేకరించి, దేశం నలుమూలల నుంచి వచ్చిన కొనుగోలుదారులకు e-Auction ద్వారా పూర్తిగా పారదర్శకంగా విక్రయించింది. దీని వల్ల స్వచ్ఛ భారత్ మిషన్కు సహకారం అందడంతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రాంగణాలు శుభ్రంగా మరియు పచ్చగా మారాయి. అంతే కాకుంజా అలాగే ఇప్పటివరకు భారతీయ రైల్వేలలో స్క్రాప్ విక్రయాల ద్వారా అధిక ఆదాయం పొందిన మెుదటి రైల్వేజోన్గా రికార్డు సాధించింది. -
టార్పిడోల తయారీ కోసం వీఈఎం, టీకేఎంఎస్ ఒప్పందం
హైదరాబాద్: భారత్లో సంయుక్తంగా టార్పిడోలను ఉత్పత్తి చేయడానికి వీఈఎం టెక్నాలజీస్, టీకేఎంఎస్ సహకార ఒప్పందం (టీమింగ్ అగ్రిమెంట్)పై సంతకాలు చేశాయి. టార్పిడో అంటే జలాంతర్గాములు, యుద్ధ నౌకల నుంచి ప్రయోగించే సముద్ర యుద్ధ ఆయుధం. టార్పిడోకు సంబంధించిన సాంకేతికత బదిలీ, “మేక్ ఇన్ ఇండియా”కు ఊతం ఇచ్చేలా హెవీవెయిట్ టార్పిడోను సంయుక్తంగా అభివృద్ధి చేయడం కోసం ఈ సహకార ఒప్పందం చేసుకున్నారు. భారత మార్కెట్కు ఆధునిక హెవీవెయిట్ టార్పిడోలు సరఫరా కావడానికి ఈ ఒప్పందం బాగా ఉపయోగపడుతుంది. సాంకేతిక స్వావలంబనకు ఊతం ఇవ్వడం, స్థానిక రక్షణ పరిశ్రమను మరింత విస్తరించడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి.వీఈఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్తో టీకేఎంఎస్ సంస్థ సహకార ఒప్పందం (టీమింగ్ ఒప్పందం)పై సంతకం చేసింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఈ ప్రముఖ రక్షణ సంస్థ ఆయుధ వ్యవస్థలు, గగనతల వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి, తయారీ రంగాల్లో నైపుణ్యం కలిగి ఉంది. అట్లాస్ ఎలక్ట్రానిక్ విభాగం కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు మైఖేల్ ఓజెగోవ్స్కీ ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తమ టార్పిడో సాంకేతికత బదిలీ ద్వారా భారత నౌకాదళం మరింత శక్తిమంతం అవుతుందని తెలిపారు. వీఈఎం టెక్నాలజీస్ ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పారు.మొదటి దశలో ఈ సహకార ఒప్పందం ద్వారా.. హెవీవెయిట్ టార్పిడో తయారవుతుంది. భవిష్యత్లో అభివృద్ధి చేసే టార్పిడో ప్రోగ్రామ్స్లో టీకేఎంఎస్, వీఈఎం మధ్య మరింత సహకారం కూడా సాధ్యమని భావిస్తున్నారు.వీఈఎం, టీకేఎంఎస్ మధ్య సంయుక్త సంస్థను కూడా స్థాపిస్తారు. ఈ సంస్థ ద్వారా భారత మార్కెట్కు దీర్ఘకాలంగా ఉన్నత ప్రమాణాల హెవీవెయిట్ టార్పిడోల సరఫరా జరుగుతుంది. అదే సమయంలో ఎగుమతి అవకాశాలు కూడా తెరుచుకుంటాయి. టీకేఎంఎస్ విభాగమైన అట్లాస్ ఎలక్ట్రానిక్ వీఈఎంకు అవసరమైన సాంకేతికత బదిలీ చేస్తుంది. సాఫ్ట్వేర్ అనుమతి పత్రాలు కూడా అందిస్తుంది. దీనివల్ల భారత తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి సాధ్యం అవుతుంది.టీకేఎంఎస్ ప్రపంచంలోని ప్రముఖ నౌకాదళ సంస్థల్లో ఒకటి. కీల్, విస్మార్, ఇటజాయి వంటి ప్రాంతాల్లో మూడు నౌకాశ్రయ కర్మాగారాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇతర కేంద్రాలు కూడా ఉన్నాయి. మొత్తం 9,100 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. జలాంతర్గామి నౌకలు, సముద్ర ఉపరితల యుద్ధ నౌకలు, సముద్ర ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, భద్రతా సాంకేతికత రంగాల్లో వ్యవస్థ సరఫరాదారుగా సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. కీల్ కేంద్రంలో సుమారు 3,300 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు బెయిల్
సాక్షి హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని పాస్పోర్టు ట్రయల్ కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు.. సుప్రీంకోర్టులో ఇది వరకే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజుూరు చేసింది. పాస్పోర్టు సరెండర్ చేయాలని ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని ఆదేశించింది.కేసు నేపథ్యం ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి.రమేశ్ ఫిర్యాదుతో 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీసుస్టేషన్లో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు, ఇతరులపై ఐపీసీ, ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం, ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదైంది. అందులో ఐపీసీలోని 120 బీ (కుట్ర) సెక్షన్ను తొలగించినప్పటికీ నిందితులపై ఫోన్ ట్యాపింగ్ అభియోగాలు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్లోని సెక్షన్లు వర్తింపజేయాలని న్యాయ నిపుణులు ఉన్నతాధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావు అదనపు కస్టడీ, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న కస్టడీ పిటిషన్లతోపాటు ఈ చట్టాన్ని జోడిస్తూ అదే నెల ఆఖరి వారంలో మెమోను కోర్టులో దాఖలు చేయడంతో ఇది ట్యాపింగ్ కేసుగా మారింది.ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుట్యాపింగ్ వ్యవహారంలో తాను పాత్రధారినేనని.. నాటి డీజీపీలుగా, నిఘా విభాగాధిపతులుగా పనిచేసిన అదనపు డీజీపీ పర్యవేక్షణలో ట్యాపింగ్ జరిగినట్లు ప్రభాకర్రావు పేర్కొన్నారు. ట్యాప్ చేస్తున్న నంబర్ల పూర్వాపరాలను డీజీపీతోపాటు చీఫ్ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ, లా సెక్రటరీలతో కూడిన కమిటీ సమీక్షిస్తుందని.. వారి అనుమతితోనే అది జరిగిందని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. -
కిషన్రెడ్డి, బండి సంజయ్లకు పొన్నం బహిరంగ లేఖ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కేంద్రం దయ కాదు.. తెలంగాణ హక్కు. అని తెలంగాణ ప్రజలు పన్నులు చెల్లిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్లకు బహిరంగ లేఖ రాశారు.‘పార్లమెంట్ లో జరుగుతున్న కేంద్ర బడ్జెట్ చర్చలో తెలంగాకి సంబంధించిన రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్ట్ లపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డిలు చర్చించాలి. ఎన్నికలు, రాజకీయాలు వేరు. రాష్ట్ర అభివృద్ధి పై వివక్ష వద్దు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్లు కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి నిధులు సాధించాలి. తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్లను ఇంకా విస్మరించడం తగదు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచినా విభజన చట్టం హామీలు అమలు చేయడంలో కేంద్రం దారుణంగా విఫలమైంది’ అని విమర్శించారు. -
Hyderabad: మద్యం రాత్రయినా..
అర్ధరాత్రి దాటితే ఔషధాల కోసం కొంత దూరం వెళ్లాల్సి రావొచ్చు.. మద్యం కావాలంటే అంతగా శ్రమించాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. సమయం ఏదైనా అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం వైన్స్, బార్స్కు ఓ సమయం కేటాయిస్తాయి.. ఆ తర్వాత బెల్టు షాపుల్లో విరివిగా మద్యం దొరుకుతుంది. ధర మాత్రం వారు ఎంత చెబితే అంత అధికంగా చెల్లించాల్సిందే.. ఇదేంటని ప్రశ్నిస్తే.. అధికారులకు భారీగా ముట్టజెప్పాల్సి వస్తుంది. అందుకే ఎక్కువ తీసుకుంటున్నాం అనే సమాధానం వస్తోంది. నిత్యం కూలి పనులు చేసు‘కొనే’ వారే మద్యం కోసం అధిక డబ్బులు చెల్లిస్తున్నారు. ప్రతి గల్లీలో బెల్టు షాపులు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నాయి. ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధి ఎల్లమ్మబండ పరిసర ప్రాంతాల్లోని అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెలిశాయి. ఎవరూ అడ్డూ అదుపు చెప్పక పోవడంతో జోరుగా మద్యం విక్రయిస్తున్నారు. అంతేకాకుండా జగద్గిరిగుట్ట హనుమాన్నగర్, దీనబందు కాలనీ, ప్రగతి నగర్, రిక్షా పుల్లర్స్ కాలనీ, భూదేవిహిల్స్, శంషీగూడ, పీజేఆర్నగర్, హైదర్నగర్ వంటి ప్రాంతాల్లో మద్యంతో పాటు కల్తీ మద్యం కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఆబ్కారీ శాఖ అధికారులు కేవలం నామమాత్రంగా దాడులు చేస్తూ వారి వద్ద నుంచి ప్రతినెలా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజు వారి కష్టాన్ని మద్యానికి ఖర్చు చేసి కుటుంబాలను రోడ్డుపైకి తీసుకువస్తున్నారని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యువత మద్యం మత్తులో వాహనాలను అతివేగంగా నడుపుతూ మృత్యువాత పడుతున్నారని, విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్టు షాపులను నియంత్రించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రశ్నించే వారిపై దాడులు.. ఎల్లమ్మబండలో అర్ధరాత్రి వేళలో బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయించే వారిని సామాజికవేత్తలు, స్థానిక వాకర్స్ ప్రశ్నిస్తే 365 రోజులు, 24 గంటలు బెల్ట్ షాపులు నడిపిస్తాం.. అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రతినెలా వారికి మామూళ్లు అందజేస్తుంటాం.. ప్రశ్నించడానికి మీరెవరని బెదిరిస్తున్నారంటూ సామాజికవేత్తలు, వాకర్స్ ఆవేదన వ్యక్త చేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ మద్యం తాగుతూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఎన్నిమార్లు ఫిర్యాదులు చేస్తున్నా ఆబ్కారీ శాఖ అధికారులు తూతూమంత్రంగా హెచ్చరికలు జారీ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. భాగ్యనగర్కాలనీలో ప్రధాన రహదారిపై వైన్ షాపు నిర్వహించడంతో కాలనీవాసులు ధర్నా నిర్వహించారు. ఆ ప్రాంతం నుంచి తీసివేసి కొద్ది దూరంలో ఏర్పాటు చేశారు. అయినా మందుబాబులు ఆ ప్రాంతంలో రహదారులపైనే వాహనాల పార్కింగ్, అటుగా రాకపోకలు సాగించే వారితో దురుసుగా ప్రవర్తించడం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అలసత్వం వీడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
లంచమిస్తావా?... జైలుకెళ్తావా?
సాక్షి, హైదరాబాద్: ఓ సైబర్ నేరంలో బాధితుడైన వ్యక్తి సాంకేతికంగా నిందితుడిగా మారాడు...ఇతడి బ్యాంక్ ఖాతాను వినియోగించుకున్న సైబర్ నేరగాళ్లు మరొకరిని మోసం చేశారు...రూ.2 లక్షలు కోల్పోయిన బాధితుడి ఫిర్యాదుతో ఈ బాధితుడు కమ్ నిందితుడిపై మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. ఇందులో అరెçస్టు చేయకుండా నోటీసులు జారీ చేయడానికి దర్యాప్తు అధికారి రూ.3 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ దందాలో మరో ఎస్సై మధ్యవర్తిత్వం చేశాడు. రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు ఎస్సైలూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కారు. ఢిల్లీకి పిలిచి మనీమ్యూల్గా మార్చి... కాంబోడియాలో తిష్టవేసి, వ్యవస్థీకృతంగా సైబర్ నేరాలు చేసే ముఠాలు తాము టార్గెట్ చేసిన వ్యక్తుల నుంచి డబ్బు డిపాజిట్/బదిలీ చేయించుకోవడానికి సొంత ఖాతాలు వాడరు. వివిధ మెట్రో నగరాల్లో ఉన్న దళారుల సాయంతో అమాయకులకు ఎర వేసి వారి ఖాతాల వివరాలు తీసుకుంటారు. సాంకేతిక పరిభాషలో వీరిని మనీమ్యూల్స్గా పిలుస్తారు. కొందరు కమీషన్లకు ఆశపడి మనీమ్యూల్స్గా మారితే మరికొందరు వాస్తవాలు తెలియక దళారుల వల్లో చిక్కుతున్నారు. సైదాబాద్ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తికి కొన్నాళ్ల క్రితం సోషల్మీడియాలో వచి్చన ప్రధాన మంత్రి రోజ్గార్ యోజన (పీఎంఆర్వై) పథకం నకిలీ ప్రకటన చూశాడు. దళారులు ఇచి్చన ఆ ప్రకటన నిజమైనది భావించి అందులో పేర్కొన్న నెంబరులో సంప్రదించాడు. ఇతడిని ఢిల్లీ పిలిపించుకున్న దళారులు ఓ బ్యాంకు ఖాతా తెరిపించి, రుణం మొత్తం అందులో డిపాజిట్ చేస్తామంటూ వివరాలు తీసుకుని పంపారు. రుణానికి బదులు పిలుపు వచ్చింది... ఆ బ్యాంకు ఖాతా వివరాలను దళారులు కాంబోడియాలో ఉన్న సూత్రధారులకు పంపారు. వీటి ఆధారంగా సైబర్ కేటుగాళ్లు మల్కాజ్గిరి పరిధిలో నివసించే వ్యక్తి నుంచి రూ.2 లక్షలు కాజేశారు. ఈ బాధితుడి ఫిర్యాదుతో ఎల్బీనగర్లోని మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. దీన్ని ఏఆర్ఎస్సై ప్రమోద్ గౌడ్ దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు డబ్బు డిపాజిట్ చేసిన ఖాతా సైదాబాద్ వాసి పేరుతో ఉన్నట్లు ప్రమోద్ గుర్తించాడు. వెంటనే అతడికి ఫోన్ చేసి ఠాణాకు పిలిపించాడు. రుణం వస్తుందని ఎదురు చూసిన సైదాబాద్ వాసికి పోలీసుల నుంచి పిలుపు రావడంతో కంగుతిన్నాడు. ఠాణాకు వచ్చి అన్ని వివరంగా చెప్పాడు. ఈ విషయం ప్రమోద్ ద్వారా సైబర్ ల్యాబ్లో పని చేసే మరో ఏఆర్ఎస్సై జటావత్ బాబు నాయక్కు తెలిసింది. సైదాబాద్ వాసి పరిస్థితిని క్యాష్ చేసుకోవాలని పథకం వేసిన బాబు నాయక్ తాను చెప్పినట్లు చేయాలంటూ ప్రమోద్కు చెప్పాడు.రూ.3 లక్షలు డిమాండ్ చేసి రూ.లక్ష... దర్యాప్తు అధికారి ప్రమోద్ సూచనల మేరకు సైదాబాద్ వాసితో సంప్రదింపులు జరిపిన బాబు నాయక్ ఆ కేసులో అరెస్టు చేస్తామని బెదిరించాడు. అలా కాకుండా నోటీసులు జారీ చేయాలంటే రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బేరసారాల తర్వాత కనీసం రూ.లక్ష అయినా ఇవ్వాలని లేదంటే జైలుకు పంపిస్తామని స్పష్టం చేశాడు. దీంతో సైదాబాద్ వాసి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ సిటీ రేంజ్–2 డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలోని బృందం వలపన్నింది. సోమవారం లంచం సొమ్ము ఇస్తానంటూ సైదాబాద్ వాసి చెప్పడంతో అతడిని ఠాణాకు కాకుండా ఎల్బీనగర్ చౌరస్తాలోని ఓ ప్రాంతానికి రమ్మని ఇద్దరు ఎస్సైలు సూచించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ డబ్బు తీసుకుంటున్న ప్రమోద్, బాబు నాయక్లను అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్టు చేశారు. ఈ ఇద్దరినీ మంగళవారం ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. అవినీతి అధికారులపై 1064కు కాల్ చేసి, 9440446106కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఏసీబీ కోరింది. -
ఢీ కొట్టి.. 200 మీటర్లు ఈడ్చుకెళ్లి
హైదరాబాద్: మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఎస్సై రవీందర్రెడ్డి కథనం ప్రకారం... షాద్నగర్కు చెందిన సర్ఫరాజ్, హుస్సేన్, షమీర్, మాజీద్లు రెండు బైక్లపై పల్లెచెరువు మీదుగా చార్మినార్కు షాపింగ్ నిమిత్తం వెళ్తున్నారు. అదే సమయంలో నగరానికి చెందిన కిషోన్, టోటన్లు పల్లెచెరువు మీదుగా కారులో ఇంటికి వెళ్తున్నారు. అతివేగంగా వచ్చిన ఆ కారు వారి బైక్లను బలంగా ఢీ కొట్టింది. నలుగురు యువకులు పక్కకు పడిపోయి, స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే కారు డ్రైవర్ కిషోర్ భయంతో కారును మరింత వేగంగా పోనివ్వడంతో దాని కింద భాగంలో బైక్ చిక్కుకుపోయింది. 200 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. కేసు దర్యాప్తులో ఉంది. -
సీఎస్ పదవీకాలాన్ని మరో 3 నెలలు పొడిగించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీకాలం ఈ నెల 31తో ముగియనుండగా, మరో 3 నెలలు పొడిగించేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ(డీఓపీటీ)కి ప్రభుత్వం లేఖ రాసింది. వాస్తవానికి కె.రామకృష్ణారావు గతేడాది ఆగస్టు 31న పదవీవిరమణ చేయాల్సి ఉండగా, ఆయ న పదవి కాలాన్ని ఏడు నెలలు పొడిగించడాని కి అప్పట్లో కేంద్రం అనుమతిచ్చింది. తాజాగా రెండోసారి మరో 3 నెలలు పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా, కేంద్రం తీసుకోనున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. కేంద్రం అనుమతిస్తే మరో 3 నెలల పాటు రామకృష్ణారావు సీఎస్గా కొనసాగుతారు. లేనిపక్షంలో సీనియారిటీ ప్రకారం ముందంజలో ఉన్న ఐఏఎస్ అధికారులు జయేశ్ రంజన్, వికాస్రాజ్లలో ఒకరిని కొత్త సీఎస్గా నియమించే అవకాశముంది. -
కొంగొత్తగా.. ఉన్నతంగా!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యా మండలి గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల స్వరూపాన్ని పూర్తిగా మార్చబోతోంది. సంప్రదాయ కోర్సులను పునర్నిర్మించడం, మూడు, నాలుగేళ్ల మల్టీ డిసిప్లినరీ కోర్సులను అందుబాటులోకి తీసుకురానుంది. 2026–27 విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ), వికసిత్ భారత్, నేషనల్ క్రెడిట్ పాలసీకి అనుగుణంగా వీటికి రూపకల్పన చేశారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఇప్పటికే అవసరమైన ముసాయిదాను మండలి పంపింది. యూనివర్సిటీలు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది. ఇవీ కొత్త కోర్సులు యూజీ, పీజీలో ఉన్నత విద్యా మండలి ప్రధానంగా పది కొత్త కోర్సులు ప్రతిపాదిస్తోంది. ఇవన్నీ గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా తేలికగా పూర్తి చేసే కోర్సులు. మార్కెట్ లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని మండలి అధ్యయనంలో వెల్లడైంది. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో వీటిని నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కోర్సులపై విద్యార్థులు, విద్యావేత్తల నుంచి సలహాలు సూచనలను ఈ నెల 23 వరకూ తీసుకుంటున్నట్టు మండలి తెలిపింది. కోర్సుల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ⇒ బీఏలో సెక్యూరిటీ, డిఫెన్స్ స్టడీస్, ల్యాండ్, అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ ఉంటాయి. ⇒ హాస్పిటల్ నిర్వహణ, హెల్త్ మేనేజ్మెంట్ బీబీఏలో ఉంటాయి. ఎయిర్పోర్టు ఎయిర్లైన్, ఎయిర్ ట్రాఫిక్స్ కోర్సులతో బీబీఏ ప్రవేశ పెడుతున్నారు. ⇒ మారిటైం టెక్నాలజీ(నౌక నిర్మాణం, నావిగేషన్, సముద్రవాణిజ్యంలో ఉపయోగించే ఆధునిక సాంకేతిక) కామర్స్, మేనేజ్మెంట్తో బీబీఏను తీసుకొస్తున్నారు. ⇒ బీకాంలో ఫైనాన్స్ టెక్నాలజీ, బిఎస్సీలో డేటాసైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, క్లైమేట్ సైన్స్, బయో ఇన్ఫర్మాటిక్స్ వంటివి ఉంటాయి. – కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్, రోబోటిక్స్, మేథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డేటాసైన్స్ బీఎస్సీలో ఉంటాయి. ఇవే కోర్సులు దాదాపు పీజీలో కూడా ఉంటాయి. ఉపాధి పెంచేందుకే.. యూజీ, పీజీ కోర్సులను క్షేత్రస్థాయి విద్యార్థులకు చేరువ చేయాలన్నదే సంకల్పం. సంప్రదాయ డిగ్రీలు, సాంకేతిక విద్యా కోర్సులే కాదు... కొత్త కోర్సుల ద్వారా విస్తృత ఉపాధి అవకాశాలున్నాయి. వీటిపై అధ్యయనం చేసిన తర్వాతే కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. త్వరలోనూ ఉన్నత విద్యలో సరికొత్త మార్పు కన్పిస్తుందని ఆశిస్తున్నాం. – ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ -
వంట నూనెలు సలసల!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం సెగ సామాన్యుడి ఇంటిని తాకుతోంది. ఇరాన్– ఇజ్రాయెల్– అమెరికా యుద్ధం మొదలైన తరువాత చోటుచేసుకున్న పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచింది. ఈ క్రమంలో నిత్యావసర వస్తువుల ధరలూ పెరిగిపోయాయి. ప్రధానంగా విదేశాల నుంచి దిగుమతి అయ్యే వంటనూనెలు, పప్పు దినుసు లు, నూనె గింజల ధరలు ఎగబాకాయి. కిరాణా దుకాణం నుంచి క్విక్ కామర్స్ ఆన్లైన్ మార్కెట్ల వరకు అన్ని చోట్ల ధరలు పెరిగాయి. వంట నూనెల ధరలు గతవారం రోజుల్లోనే లీటరుకు రూ. 15–25 వరకు పెరిగాయి. సన్ఫ్లవర్ ఆయిల్ ఫిబ్రవరి చివరలో హైదరాబాద్లో లీటరు రూ.150కి అటు ఇటుగా ఉండగా, ప్రస్తుతం అది రూ.170కి చేరింది. వేరుశనగ నూనె కూడా రూ. 180కి పైనే పలుకుతోంది. ఇక సామాన్యులకు అందుబాటులో ఉండే పామాయిల్ ధర లీటరుకు రూ.15 నుంచి రూ. 20 మేర పెరిగింది. మార్కెట్లో నిల్వలు ఉన్నప్పటికీ, ధరలు ఇంకా పెరుగుతాయనే సాకుతో కొన్నిచోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టి మరీ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బేగంబజార్, సికింద్రాబాద్ వంటి హోల్సేల్ మార్కెట్లలో కూడా హోల్సేల్ వ్యాపారులు నూనె ధరలను పెంచి విక్రయిస్తున్నారు. దాంతో రిటైల్ వ్యాపారులు కూడా ధరలను పెంచడంతో ఆ భారం సామాన్యుడిపై పడుతోంది. పెరిగిన పప్పుల ధరలు గల్ఫ్ దేశాల నుంచి రావలసిన పప్పు దినుసుల నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లు జరుగుతున్న ప్రచారంతో పప్పు ధాన్యాల ధరలు భారీగా పెరిగాయి. కందిపప్పు బహిరంగ మార్కెట్లో కిలోకు రూ. 130–150 మధ్య పలుకుతోంది. వేరుశనగ దిగుబడి తగ్గడం వల్ల వీటి ధరలు కిలో రూ.180 నుంచి రూ.200కి చేరాయి. పెసర పప్పు, మినప్పప్పు ధరలు కూడా ఎగబాకాయి. ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతల వల్ల ఉత్పత్తి దేశాలతోపాటు డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేల్, రిటైల్ వ్యాపారుల మధ్య సప్లై చైన్ లింక్ తెగిపోవడంతో ధరలను పెంచి విక్రయిస్తున్నట్లు వాణిజ్య వర్గాలు చెపుతున్నాయి. వంట సామగ్రి ధరలు పెరిగాయ్ ఏం యుద్ధమో ఏమో. వంట నూనెలతోపాటు పప్పులు, మిర్చి, వేరుశనగ వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గ్యాస్ రేట్లు పెంచారు. ఈ ధరలతో హోటల్ నడుపుడు ఎట్లనో తెలుస్తలేదు. ధరలు పెరిగితే మేం కూడా టిఫిన్లు, చపాతి, భోజనాల ధరలు పెంచక తప్పదు. ధరలు పెరగకుండా సర్కార్ ప్రయత్నించాలి. –శేషమ్మ, హోటల్ నిర్వాహకురాలు, నాగర్ కర్నూల్ -
'సన్' డే ఒకలా.. మండే మరోలా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతల నమోదులో భారీ హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఒకరోజు అధికంగా, మరో రోజు సాధారణ స్థితి నుంచి అంతకంటే తక్కువగా నమోదవుతున్నాయి. వేసవి సీజన్ ప్రారంభంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం ఒకేసారి సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీలు పెరగడం... మరుసటి రోజు సాధారణం కంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం. గత మూడు రోజుల ఉష్ణోగ్రతల నమోదు చూస్తే గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ⇒ శనివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా... చాలా ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీలకు పైబడి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ⇒ ఆదివారం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కాగా... సోమవారం భద్రాచలం, హనుమకొండ, నల్లగొండ, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ⇒ కనిష్ట ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఒక డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతల్లో భారీ వ్యత్యాసంతో నమోదు కావడం గత ఆరేళ్లలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ⇒ సోమవారం ప్రధాన ప్రాంతాల్లో... గరిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 39 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 16.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. మూడు రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బిహార్ నుంచి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా మరాత్వాడ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో దక్షిణ, తూర్పు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు, సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఉత్తర ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే ఒకట్రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. ఈ నెల 15 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొన్నిచోట్ల వడగండ్ల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని సూచిస్తున్నారు. మార్చి చివరి వారం నుంచి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని, ఏప్రిల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావొచ్చని హెచ్చరిస్తున్నారు. -
పోలీసింగ్ మారాలి : సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కాలక్రమేణా నేర స్వభావం మారుతోందని, సైబర్ నేరాలు, డ్రగ్స్ సరఫరా వంటి భవిష్యత్ సవాళ్లకు తగ్గట్టుగా పోలీసింగ్లోనూ మార్పులు రావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఏ సమస్య వచ్చినా ప్రజలు మొట్టమొదట సహాయం కోసం చూసేది పోలీసుల వైపేనని, ఏళ్లుగా ప్రజల్లో పోలీసులు పెంచుకున్న విశ్వాసం అలాంటిదన్నారు. అయితే, పోలీస్ శాఖలో ఉద్యోగులు ఆటో మోడ్కు వెళితే సమాజానికి అత్యంత ప్రమాదకరమని సీఎం హెచ్చరించారు. మారుతున్న సాంకేతికత, నేరాలకు తగ్గట్టుగా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్గ్రేడ్ కావాలని చెప్పారు. వచ్చే 25 ఏళ్లకు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. సోమవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్– 2026 కార్యక్రమంలో రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులనుద్దేశించి రేవంత్రెడ్డి ప్రసంగించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే... శాంతిభద్రతలు బలంగా ఉండాలి.. అభివృద్ధి జరగాలంటే ఆ ప్రాంతంలో శాంతిభద్రతలు బలంగా ఉండాలి. శాంతిభద్రతలు బాగున్న రాష్ట్రాల్లోనే పరిశ్రమలు వస్తాయి.. తద్వారా ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. తెలంగాణలోనూ శాంతిభద్రతలు బాగున్నాయి కాబట్టే ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. దేశం వందేళ్ల స్వాతంత్య్రదిన వేడుకల నాటికి తెలంగాణ సాంకేతికంగా, అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదగాలి. అందుకు కొత్త విధానాలు తెస్తున్నాం. దేశంలో ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా మారింది. ట్రాఫిక్ సమస్యలతో బెంగుళూరులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముంబై, చెన్నై నగరాలు వరదలతో సతమతమవుతున్నాయి. అలాంటి మెట్రోపాలిటన్ నగరాల నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరాన్ని కేవలం 24 గంటల్లో 2 సెం.మీ.వర్షపాతానికి తట్టుకునేలా అన్ని వ్యవస్థలు మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ, కోవిడ్ తర్వాత రెండు మూడు గంటల్లో 40 సెం.మీ.వర్షం వచ్చింది. భవిష్యత్తు అవసరాలకు తగ్గుట్టుగా అన్ని వ్యవస్థలు మార్చుకోవాలి. సమస్యను అర్థం చేసుకోవాలి.. పోలీసు విధుల్లో నిరంతరం సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉటుంది. ఎన్నో సమస్యలు పరిష్కరించాలి. అయితే సమస్య పరిష్కారంలో వేగంగా పరిగెత్తితే అది మరింత గందరగోళానికి దారి తీస్తుంది. సమస్యలను అర్థం చేసుకుంటే 50 శాతం పరిష్కారం దొరుకుతుంది. సమస్యను అర్థం చేసుకునేందుకు కింది స్థాయి సిబ్బందికి తగిన సమయం ఇవ్వండి. అధికారుల విద్యార్హత, నైపుణ్యం ఆధారంగా వాళ్లకు డ్యూటీలు ఇస్తే మరింత రాణించే అవకాశం ఉంటుంది. జనాభా ప్రాతిపదికన క్షేత్రస్థాయి అవసరాలకు తగ్గట్టుగా పోలీసులపై పనిభారం, ఒత్తిడి తగ్గించేలా సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలి. ప్రత్యేక అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న గ్రేహౌండ్స్, ఎస్ఐబీ వంటి సంస్థలు తమ లక్ష్యాన్ని దాదాపుగా చేరుకున్నాయి. కూబింగ్ పోయింది కాబట్టి గ్రేహౌండ్స్లో ఉన్న సిబ్బందిని మరోచోట వాడుకోవాలి. విచారణలో సేకరిస్తున్న సమాచారాన్ని ఐసీసీసీలో ఒక డేటా సెంటర్ను ఏర్పాటు చేయండి. పోలీసులను ఏ, బీ, సీగా వర్గీకరించుకున్నా.. పోలీసు అధికారుల పనితీరుకు సంబంధించిన పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. దాని ఆధారంగా వాళ్లను నేను ఏ, బీ, సీ కేటగిరీల్లో వర్గీకరించుకుని పెట్టుకున్నా. దానికి అనుగుణంగానే నేను వారికి పోస్టింగ్స్ ఇస్తున్నా. ఈ విషయంలో నేను కరెక్ట్ లేదా తప్పు కావొచ్చు. ఈ రెండేళ్లలో ఎలాంటి ఫైరవీలు లేకుండా 90 శాతం మందికి ఇలానే పోస్టింగ్లు ఇచ్చాం. టీవీల్లో వచ్చే వరకు కూడా ఎవరికి ఎక్కడ పోస్టింగ్ వచ్చిందో తెలియలేదు. పోలీసింగ్లో మార్పులు, నూతన చట్టాలు తేవాల్సిన ఆవశ్యకత, ఇతర అంశాలపై చర్చించేందుకు ఏటా డిసెంబర్లో పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ నిర్వహించాలి. బడ్జెట్ ప్రవేశపెట్టకముందే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటే అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించుకోవచ్చు. సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, రిక్రూట్మెంట్, ఇతర సమస్యల పరిష్కారానికి మీరు కొన్ని ప్రతిపాదనలు అందించారు. వీటిపై విశ్లేíÙంచాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అధికారుల కమిటీ నియమిస్తాం. అందరికీ పోస్టింగ్లు వచ్చాయి: డీజీపీ శివధర్రెడ్డి 2001–02లో అప్పటి డీజీపీ హెచ్జే దొర ఆఫీసర్స్ రిట్రీట్ ను ప్రారంభించారని, 24 ఏళ్ల తర్వాత ఆ సంప్రదాయాన్ని మళ్లీ ప్రారంభించినట్టు డీజీపీ బి.శివధర్రెడ్డి తెలిపారు. గతంలో రెండు మూడేళ్లపాటు కూడా ఐపీఎస్ అధికారులు పోస్టింగ్లు లేకుండా చీఫ్ ఆఫీస్లో ఉండేవారని, అయితే గత రెండేళ్లలో ఏ ఒక్క అధికారి ఖాళీగా ఉండకుండా అందరికీ పోస్టింగ్లు ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు అని చెప్పారు. భవనాలు, రోడ్డు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ మాట్లాడుతూ, పోలీసులు, రవాణాశాఖ అధికారులు కలిసి పనిచేస్తే ట్రాఫిక్ పరమైన సమస్యలు పరిష్కరించవచ్చన్నారు. కార్యక్రమంలో భాగంగా టీజీ పోలీస్ అకాడమీ మ్యానువల్ను రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. చైల్డ్ ప్రొటెక్షన్ స్ట్రెంథెనింగ్ యూనిట్ ఏర్పాటుపై టీజీపీఏ, యూనిసెఫ్ల మధ్య ఎంఓయూ కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్దా..?, ఓవైసీదా?’
హైదరాబాద్: తెలంగాణలో ప్రజాపాలన నడవడంలో లేదని, రజాకార్ పాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ధ్వజమెత్తారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నిర్ణయం తీసుకునే ముందు ఓవైసీ అనుమతిని సీఎం రేవంత్రెడ్డి తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పరిపాలన ఓవైసీ చేతుల్లో ఉందా ? అంటూ ప్రశ్నించారు. ప్రజల కోసం కాదు…ఓవైసీ కోసం ప్రభుత్వం నడుస్తోందా ?’ అని నిలదీశారు. తెలంగాణలో ప్రభుత్వం ఎవరిది?, కాంగ్రెస్దా.. లేక ఓవైసీదా? అని ట్వీట్ చేశారు.❌Praja Palana✅ Razakar PalanaFor every decision, Revanth Reddy needs the permission of Owaisi.Such is the state of affairs in Congress-ruled Telangana. pic.twitter.com/pYMQHwFFxT— N Ramchander Rao (@N_RamchanderRao) March 9, 2026 ఓవైసీ పిలుపుతో వేల కోట్లు సమీకరిస్తామని అంటున్నారుతెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డాఉ. ‘ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు రోజుకొక లాగా మారుతున్నాయి. ఒకవైపు పేదలు, దళితులు, గిరిజనులకు భూమి లేదని చెబుతున్నారు. కానీ జర్నలిస్టులకు, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు భూమి ఇస్తామని హామీ ఇస్తున్నారు. పెన్షన్లు క్లియర్ చేయడానికి ప్రభుత్వానికి డబ్బులు లేవని అంటున్నారు. కానీ ఓవైసీ ఒక పిలుపు ఇస్తే మూసీ ప్రాజెక్ట్కు వేల కోట్ల రూపాయలు సమీకరిస్తామని చెబుతున్నారు. కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకా పెండింగ్లోనే ఉంది. కానీ అమ్మాయిలకు ఉచిత EV స్కూటీలు ఇస్తామని కొత్త హామీలు ఇస్తున్నారు’ అని విమర్శించారు. -
పోలీస్ వెబ్సైట్.. అప్డేట్ మిస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు...ఈ పేరు చెప్పగానే టెక్నాలజీ గుర్తుకువస్తుంది. దీని వినియోగానికి కేరాఫ్ అడ్రస్గా ఉన్న రాష్ట్రం అనేక ప్రాంతాలకు మార్గదర్శకమైంది. కేసు నమోదు నుంచి దర్యాప్తు, అభియోగపత్రాల దాఖలు వరకు ఆన్లైన్ విధానం కొనసాగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా... ప్రాథమిక అంశమైన అధికారిక వెబ్సైట్ నిర్వహణలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. పునర్వ్యవస్థీకరణను పట్టించుకోకుండా, అధికారుల బదిలీలపై దృష్టి పెట్టకుండా, అదనపు బాధ్యతలు తప్పినా ఇన్చార్జ్లను కొనసాగిస్తూ దీని నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాజధానిలోని కమిషనరేట్లలో జరిగిన మార్పుచేర్పులను పట్టించుకోవట్లేదు. కొన్ని బదిలీ, బాధ్యతల స్వీకరణ జరిగి ఇప్పటికి నెలన్నర అవుతున్నా అధికారిక వెబ్సైట్ (tspolice.gov.in)లో మాత్రం మార్పుచేర్పులు లేవు. ఇలాంటి చిత్రాలు మరెన్నో రాష్ట్ర పోలీసు అధికారిక వెబ్సైట్లో ఉన్నాయి.వాటిలో కొన్ని ఇవి... జనవరి 17న జరిగిన ఐపీఎస్ బదిలీల్లో భాగంగా ఐపీఎస్ అధికారి ఎస్.చైతన్యకుమార్ నగర డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీగా వచ్చారు. అంత వరకు ఈ పోస్టుకు అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు ఇన్చార్జ్గా ఉన్నారు. అంతర్థానమైపోయిన సౌత్ ఈస్ట్ జోన్ను కొనసాగిస్తున్న పోలీసు వెబ్సైట్ దీనికి చైతన్యకుమార్ డీసీపీగా ఉన్నట్లు చూపిస్తోంది. నగర పోలీసు విభాగంలో పరిపాలన డీసీపీగా కె.వెంకట లక్ష్మి నియమితులయ్యారు. అయినా ఇప్పటికీ తఫ్ఫీర్ ఇక్బాల్ను వెబ్సైట్ ఇన్చార్జ్గా కొనసాగిస్తోంది. ఈయన నగరంలో సౌత్ రేంజ్ అదనపు సీపీగా నియమితులైనా... ఇంకా సంయుక్త సీపీ శాంతిభద్రతలుగానే చూపిస్తోంది. గతంలో నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్కు డీసీపీగా పని చేసిన అపూర్వ రావు కొన్నాళ్ల ఇంటెలిజెన్స్కు బదిలీ అయ్యారు. అధికారిక వెబ్సైట్ మాత్రం ఈ విషయం పట్టించుకోలేదు. రాజధానిలోని పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ తర్వాత రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లు హైదరాబాద్లో కలిశాయి. అలాగే నగరంలో ఉన్న జోన్ల పేర్లు ఈస్ట్, వెస్ట్, సెంట్రల్... నుంచి సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్... ఇలా మారాయి. ఈ అంశమూ వెబ్సైట్ నిర్వాహకులకు పూర్తిగా పట్టలేదు. రక్షితా మూర్తిని సికింద్రాబాద్ డీసీపీ అంటూ అప్డేట్ వెర్షన్ నమోదు చేసినా.. కె.శిల్పవల్లిని మాత్రం ఇప్పటికీ సెంట్రల్ జోన్ డీసీపీగానే వెబ్సైట్ సంబోధిస్తోంది. రాజేంద్రనగర్ను సైబరాబాద్తో చూపిస్తున్న సైట్... అక్కడ ఉన్న డీసీపీ శ్రీనివాస్కు బదులు యోగేష్ గౌతం అంటూ కొనసాగిస్తోంది. రాచకొండ కమిషనరేట్ పేరు మల్కాజ్గిరిగా మారింది. అవినాష్ మహంతిని దీనికి కమిషనర్గా చూపిస్తున్న వెబ్సైట్... మహేశ్వరం జోన్ను మాత్రం రాచకొండగానే కొనసాగిస్తోంది. మరికొందరు డీసీపీ పోస్టులూ రాచకొండలో ఉన్నట్లే పేర్కొంటోంది. నగర సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీగా కె.శ్యామ్ సుందర్ వచి్చనా... ఇప్పటికీ అపూర్వ రావే ఇన్చార్జ్ అని వెబ్సైట్ చెప్తోంది. హైదరాబాద్ వెస్ట్జోన్ డీసీపీగా పని చేసిన చింతమనేని శ్రీనివాస్ చాలా రోజుల క్రితమే సైబరాబాద్లో కొత్తగా ఏర్పడిన శేరిలింగంపల్లి డీసీపీగా వెళ్లారు. విభజన తర్వాత జూబ్లీహిల్స్గా మారిన ఈ జోన్కు రమణారెడ్డి డీసీపీగా వచ్చారు. ఈ అంశాలు వెబ్సైట్లో అప్డేట్ కాలేదు. పాతబస్తీలోని సౌత్ జోన్ చారి్మనార్ జోన్గా మారిపోయింది. అయితే పోలీసు వెబ్సైట్లో మాత్రం ఇంకా పాత పేరే కొనసాగుతోంది. -
రిటైర్డ్ జడ్జి.. డిజిటల్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరస్తులు తెలివిమీరిపోయారు. విద్యార్థులు, గృహిణులు, నిరుద్యోగులే కాదు ఉన్నత విద్యావంతులను కూడా అలవోకగా మోసం చేస్తున్నారు. కేటుగాళ్లు తాజాగా డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ జడ్జీనే మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కేటుగాళ్లు ఆయన నుంచి రూ.1.66 కోట్లను దోచుకున్నారు. ఈమేరకు మల్కాజ్గిరి పోలీసు కమిషనరేట్ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరెడ్మెట్కు చెందిన రిటైర్డ్ జడ్జి (73)కి ఫిబ్రవరి 23న గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను సీనియర్ సీబీఐ అధికారి దీపక్ కుమార్ అని పరిచయం చేసుకున్న కేటుగాడు.. మీరు ఆధార్తో అనుసంధానమైన రెండు మొబైల్ నంబర్లను మహిళలకు అభ్యంతరకరమైన కాల్స్ చేయడానికి ఉపయోగిస్తున్నారని రిటైర్డ్ జడ్జికి చెప్పాడు.ఈమేరకు బెంగళూరులోని ఇందిరానగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందని భయభ్రాంతులకు గురి చేశాడు. ఇదే సమయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌరవ్ సారథిగా పరిచయం చేసుకున్న మరో మోసగాడు కాన్ఫరెన్స్ కాల్లో చేరి.. మానవ అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉన్నావని చెప్పాడు. ఈమేరకు సుప్రీంకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందన్నాడు. కుటుంబం లేదా స్నేహితులతో సహా ఎవరితోనూ ఈ విషయాన్ని చర్చించవద్దని మోసగాళ్లు హెచ్చరించారు. మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణా, దొంగతనం కేసులున్నాయంటూ బ్యాంకు ఖాతాల వివరాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.విచారణ తర్వాత డబ్బు తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు. దీంతో అరెస్ట్, ప్రతిష్టకు నష్టం వాటిల్లుతుందని భయపడిన రిటైర్డ్ జడ్జి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 2 మధ్య నాలుగు లావాదేవీల్లో తన మూడు బ్యాంకు ఖాతాల నుంచి రూ.1.66 కోట్లను మోసగాళ్ల ఖాతాలకు బదిలీ చేశారు. నిందితులు హామీ ఇచ్చిన విధంగా తన డబ్బును తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
30 నెలల్లో ‘పాలమూరు’ పూర్తి
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వచ్చే 30 నెలల్లో పూర్తి చేసి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. మార్చి 2027 నాటికి కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్తో సహా దక్షిణ తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందించే ప్రాజెక్టులకు అవసరమైన నిధులు, వనరులను కల్పించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కల్వకుర్తికి రూ.909 కోట్లు, నెట్టెంపాడుకు రూ.252 కోట్లు, బీమాకు రూ.200 కోట్లు, కోయిల్సాగర్కు రూ.185 కోట్లు కలిపి మొత్తం రూ.1546 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు.రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగిరం చేయడంలో భాగంగా భూసేకరణ కోసం రూ.5వేల కోట్లను కేటాయిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ఆదివారం ఆయన జలసౌధలో సమీక్షించారు. గత బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.35,200 కోట్ల అంచనాలతో పరిపాలనపర అనుమతులు జారీ చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.27,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేసినట్టు చెప్పుకుంటోందని తప్పుబట్టారు. అంత ఖర్చుచేసినా ఎకరానికి సాగునీరు అందించలేదన్నారు.తాజాగా అంచనాలు రూ.55 వేల కోట్లకు పెరిగాయని, డిస్ట్రిబ్యూటరీల వ్యయం కలిపితే రూ.80వేల కోట్లకు చేరుకుంటుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై రూ.7,161 కోట్లను ఖర్చు చేసిందన్నారు. జూరాల ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు కాగా, పూడికతో 9 టీఎంసీలకు తగ్గిపోయిందని ఉత్తమ్ తెలిపారు. నిల్వ సామర్థ్య పునరుద్ధరణకు తక్షణమే పూడిక తొలగింపు పనులను చేపడతామని ప్రకటించారు. జూరాల నుంచి తొలగించే ఇసుకను గోదావరి పరీవాహకంలోని ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించాలని సూచించారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కృష్ణాజలాల్లో చుక్క నీళ్లను వదులుకోమన్నారు. సమీక్షలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
‘కొత్త’ మండలి భవనాన్ని ప్రారంభించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 నుంచి 2017 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభగా కొనసాగిన నిజాం కాలం నాటి ఈ భవనాన్ని ప్రభుత్వం రూ.30 కోట్ల ఖర్చుతో పునరుద్ధరించింది. ప్రస్తుతం జూబ్లీహాల్లో కొనసాగుతున్న శాసనమండలిని ఈ పునరుద్ధరించిన భవనంలోకి తీసుకురానున్నారు.ఆదివారం ఉదయం కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ వెంటరాగా, పునరుద్ధరించిన మండలి భవనాన్ని రేవంత్ ప్రారంభించి లోపలికి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కౌన్సిల్ హాల్లోని సీట్లలో ఆసీనులైన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్ తదితరులు కొద్దిసేపు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి మండలి సభ్యులు, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సాక్షి, హైదరాబాద్/ఏజీవర్సిటీ: రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. తెలంగాణ రైతుని తలెత్తుకుని నిలబడేలా చేసేందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న మెగా మహిళా రైతు మేళా ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, 2026 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ మేళాను నిర్వహించారు. వ్యవసాయ వర్సిటీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. రూ.500 కోట్లతో పునరుద్ధరించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో మహిళా రైతులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో మహిళా రైతులకు డ్రోన్లు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పంట మార్పిడి, సహజ వ్యవసాయ విధానాలను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఆహార ధాన్యాల్లో స్వావలంబన: మంత్రి శ్రీధర్బాబు అధునాతన నైపుణ్యాలు, సాంకేతికతను ఉపయోగించి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రైతులకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలు ఆహార భద్రతపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఆహార ధాన్యాల్లో స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆహార ఉత్పత్తిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. విత్తనాలు నాటినప్పటి నుంచి పంట కోసి ఇంటికి చేరేవరకు మహిళలు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఐకార్ డైరెక్టర్ జనరల్ ఎంఎల్ జాట్ మాట్లాడుతూ కొత్త సాంకేతికతలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. పంటల వైవిధ్యీకరణ, మార్కెట్లతో రైతాంగాన్ని అనుసంధానం చేయడంపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా 30 మంది మహిళా రైతులకు మంత్రులు అవార్డులు అందజేశారు. మెగా మహిళా రైతు మేళాలో సుమారు 6 వేల మంది మహిళా రైతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో శాసన మండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ అనేది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. హైడ్రా పునరుజ్జీవం కల్పించిన శివరాంపల్లిలోని చారిత్రక బమ్రుఖనుద్దౌలా చెరువును ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఓల్డ్ సిటీ ప్రజలకు అద్భుత సంస్కృతిని అందించడానికి ఈ చెరువును అభివృద్ధి చేశాం. ఇది చెరువు అభివృద్ధి మాత్రమే కాదు.. ఈ ప్రాంత ప్రజలకు కాలుష్యరహిత వాతావరణం అందించడం. నిజాం సర్కారు గొలుసుకట్టు చెరువులను నిర్మించి హైదరాబాద్ను లేక్స్ అండ్ రాక్స్ సిటీగా మార్చింది. ప్రపంచంలోనే అద్భుతమైన ఈ నగరాన్ని పాడు చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఎక్కడ చూసినా చెత్తే కనిపిస్తోంది. లండన్, దక్షిణ కొరియా, సింగపూర్ ఇలా అనేక నగరాల్లో నాగరికత, అభివృద్ధి నీటి సమీపంలోనే జరిగింది. నగరంలోనూ నిజాం సర్కార్ అనేకం నిర్మించింది. వరదల్లో అనేక మంది చనిపోతే వాటి నియంత్రణతో పాటు సాగునీరు, తాగునీరు అందించడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ నిర్మాణం చేపట్టింది. ఇవన్నీ రానురాను పాడవుతున్నాయి. నిజాం పురానాపూల్, ఉస్మానియా ఆస్పత్రి, ఉస్మానియా యూనివర్సిటీ, కౌన్సిల్ భవనం, ఫలక్నుమా ప్యాలెస్ సహా ఎన్నో భవనాలు నిర్మించి ఇచ్చారు. వాటిని రక్షించడం, నిర్వహించడం సాధ్యం కావవట్లేదు. ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకున్నాం. రానున్న మూడు నెలల్లో పురాతన భవనాల పునరుద్ధరణ చేపడతాం. పాతబస్తీలో మెట్రో రైల్ను వీలైనంత త్వరలో నిర్మిస్తాం’ అని చెప్పారు.పాతబస్తీలో అభివృద్ధి జరగాలి: ఒవైసీ‘పాతబస్తీ హైదరాబాద్కు గుండెకాయ వంటిది. పాతబస్తీలో తగిన స్థాయిలో అభివృద్ధి జరగాలి. అంతా కలిసి దీనిపై ఉన్న అపార్థాలను దూరం చేద్దాం, మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లోపు మెట్రో పనులు చేస్తామని సీఎం చెప్పారు. ఆ స్థాయిలో పనులు జరుగుతున్నాయి. మీరాలం ట్యాంక్పై మంజూరైన బ్రిడ్జ్ పనులకు సీఎం ఈ నెల 14న శంకుస్థాపన చేస్తారు’ అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. హెచ్ఎండీఏ కేటాయించిన రూ.20 కోట్లతో ఈ చెరువును అభివృద్ధి చేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు. ఎంఐఎం నుంచి మాకు మద్దతు‘పాతబస్తీ నుంచి అసదుద్దీన్ దేశ ప్రతినిధిగా గొంతు వినిపిస్తున్నారు. ఒవైసీ, ఎంఐఎం నుంచి మాకు మంచి మద్దతు వస్తోంది. ప్రపంచంతో పోటీపడే నగరంగా చేయాలనే ఆక్రమణలు తొలగించి చెరువులు, పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. బమ్రుఖనుద్దౌలా చెరువు వద్ద లేక్ పోలీసింగ్ ఏర్పాటు చేయాలి. ఆడబిడ్డలు ధైర్యంగా ఇక్కడకు వచ్చేలా, వాకింగ్ చేసేలా చర్యలు తీసుకోండి. ప్రతి మహిళ స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా చేరాలి. మీరు ఉత్పత్తి చేసే వస్తువులను ఇక్కడ స్టాల్స్ పెట్టి విక్రయించుకునే అవకాశం ఇస్తాం. ఈ ప్రాంతంలో లేక్ ఎకానమీ ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్లను ఆదేశిస్తున్నా. వాకింగ్ చేసిన వాళ్లు ఇక్కడే వారికి కావాల్సినవి కొనుక్కునే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయండి. పాతబస్తీలో రాత్రి ఒంటి గంట వరకు వ్యాపారాలకు అనుమతి ఇస్తున్నాం. మూసీ పరీవాహక ప్రాంతంలో నైట్ ఎకానమీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పాతబస్తీలో యువతలో నిరుద్యోగం ఉంది. వీరు నైట్ ఎకానమీ ద్వారా జీవనోపాధి పొందుతారు. గండిపేట నుంచి గౌరారం వరకు మూసీ వెంట లేక్ ఎకానమీ అభివృద్ధి చేస్తాం. మూసీలో పేదల ఇళ్లు ఉంటే వారిని వీధుల్లో వదిలేయం. వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తాం. దీని అభివృద్ధితో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఉపాధి కలుగుతుంది. మీరు అందరూ వచ్చి కూర్చుని పనులు చేయించండి. ఒవైసీ ఎంఐఎం పార్టీ వర్కర్లను ఈ కోణంలో ఆదేశించాలి. మీరు ఆదేశిస్తే అన్నీ జరుగుతాయి. ఈ ప్రాంతం అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ పనులు చేయించుకోవాల్సిన బాధ్యత మీదే. గతంలో రంజాన్ వస్తే బిర్యానీ, కుబానీ ఇచ్చి వెళ్లే వాళ్లు. నేను వాటితోపాటు అభివృద్ధి కూడా చేస్తా’ అని అన్నారు. -
ఎస్హెచ్జీ మహిళకు డిజిటల్ హెల్త్ కార్డు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సభ్యులకు డిజిటల్ హెల్త్ కార్డు జారీ చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఈ కార్డుల జారీకి ముందు వారికి 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, వీటి ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందించి పంపిణీ చేస్తామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం బంజారాహిల్స్లోని కొమురంభీమ్ ఆదివాసీ భవన్లో జరిగిన కార్యక్రమాలకు ఆయన మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ద్వారా ఎస్హెచ్జీ మహిళలకు 30 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షలను నిర్వహించే కార్యక్రమాన్ని రాజనర్సింహ, సీతక్క లాంఛనంగా ప్రారంభించారు. బస్ స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో శిశువులకు పాలిచ్చేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. దీంతోపాటు ప్రభుత్వం నిర్వహిస్తున్న వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ఆన్లైన్ పోర్టల్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడం సమాజ అభివృద్ధికి కీలకమన్నారు. మహిళల ఆరోగ్యం బాగుండాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకే ఎస్హెచ్జీ సభ్యులకు 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలకు అవకాశం ఇస్తే పంట పొలాల నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పం ఇప్పుడిప్పుడే సాకారమవుతోందన్నారు. ‘ఇందిరా మహిళా శక్తి అచీవ్మెంట్స్’ పుస్తకాన్ని సీతక్క విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, ముఖ్యకార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, అనితా రామచంద్రన్, దివ్య దేవరాజన్, శ్రుతి ఓజా, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు. వినూత్న వ్యాపారాలతో రాణిస్తున్న 31 మంది మహిళలను సన్మానించి, వారికి రూ.25వేల చొప్పున ఆర్థిక ప్రోత్సాహక చెక్కులను అందజేశారు. -
నిజాం రాణులు జలకాలాడిన తటాకం!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం పాతబస్తీలో ప్రారంభించిన బమ్రుఖనుద్దౌలా చెరువు కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. 1770లో హైదరాబాద్ మూడో నిజాం సికందర్ జా ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ రుక్న్ ఉద్ దౌలా దీన్ని నిర్మించారు. చారిత్రక ఆనవాళ్ల ప్రకారం తొలినాళ్లలో ఈ చెరువు 100 ఎకరాలకుపైగా విస్తరించి ఉండేది. రాజేంద్రనగర్, ఆరాంఘర్, కాటేదాన్ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఈ చెరువులోకి చేరేది. నిజాం కాలంలో మీరాలం ట్యాంక్ను రాజులు.. బమ్రుఖనుద్దౌలా చెరువును రాణులు స్నానాల కోసం ఉపయోగించేవారు. ఈ చెరువులో వనమూలికల మొక్కలు, కొమ్మలు వేసి దిగువున నిర్మించిన బావిలోకి వచి్చన ఊటని తాగునీరుగా వినియోగించేవారు. ఔషధగుణాలున్న ఆ నీటినే నిజాం వాడారు. ఈ చెరువు చుట్టూ సువాసనలు వెదజల్లే పూల మొక్కలు విరివిగా ఉండేవని.. అవి చెరువులో పడటంతో ఇక్కడి నీటిని సెంట్ల తయారీకి వినియోగించేవారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ కారణంగానే బమ్రుఖనుద్దౌలా చెరువు నీరు అరబ్ దేశాలకు ఎగుమతి అయ్యేదని చెబుతున్నారు. కబ్జాల చెర విడిపించిన హైడ్రా..: హైదరాబాద్ నగరం కాలక్రమేణా విస్తరించడం, ఇతర ప్రాంతాల నుంచి వరద రాకపోవడంతో బమ్రుఖనుద్దౌలా చెరువు చివరకు 18 ఎకరాల్లో మిగిలింది. కానీ అక్రమార్కులు క్రమంగా చెరువును కబ్జా చేయడంతో 4.12 ఎకరాలకు కుంచించుకుపోయొంది. దీంతో 2024 ఆగస్టులో రంగంలోకి దిగిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆయా ఆక్రమణలను తొలగించి దశలవారీగా చెరువును తిరిగి 18 ఎకరాలకు విస్తరించింది. దాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. నాటి చారిత్రక ఆనవాళ్లను పరిరక్షిస్తూనే తాజా ఆకర్షణలతో తీర్చిదిద్దింది. అలాగే జల కాలుష్యానికి తావు లేకుండా మురుగునీటి కట్టడి, చెరువులోకి ఇన్లెట్, ఔట్లెట్స్ను పక్కాగా ఏర్పాటు చేసింది. నిజాం కాలంలో రాతితో నిర్మించిన బండ్ను చెక్కు చెదరకుండా కాపాడుతూ మరింత పటిష్టం చేసింది. చెరువు పూడికలో కలిసిపోయిన నాటి రాళ్లను బయటకు తీసి భద్రపరిచింది. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్లు, చిన్నారుల కోసం ప్లే ఏరియాలు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఆక్రమణలకు వీల్లేని రీతిలో చెరువు కట్ట చుట్టూ, చెరువు లోపలి వైపు కూడా ఫెన్సింగ్ వేసింది. -
అతివలకే అందలం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మహిళ మాటకు విశ్వసనీయత ఎక్కువగా ఉంటుందని.. అందుకే ప్రభుత్వ పాలనలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వివిధ శాఖల్లో మహిళలకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమైన శాఖలకు మహిళలనే ఉన్నతాధికారులుగా నియమించామని అన్నారు. పలు జిల్లాలకు కలెక్టర్లుగా, అవకాశమున్న చోట ఎస్పీలుగా నియమించామని తెలిపారు. ఆదివారం ప్రజా భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళ కేంద్రంగా పథకాలు..: ‘ఉక్కు మహిళ సోనియాగాంధీ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. అందుకే మహిళ కేంద్రంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నాం. మహిళా సంఘాలు కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా వెయ్యి బస్సులకు యజమానులను చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్లకు సైతం యజమానులుగా నిలబెట్టాం. ఎస్హెచ్జీలు ఉత్పత్తి చేసే వస్తువుల విక్రయం కోసం అమెజాన్తో అవగాహన కుదుర్చుకున్నాం. లోకల్ టాలెంట్ను గ్లోబల్ టాలెంట్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం’అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాలి... ‘దేశంలో ఇంకా మహిళలు, పురుషులు, కులాలు అంటూ ఎన్నో రకాలుగా వివక్ష కనిపిస్తూనే ఉంది. అభివృద్ధి చెందిన అమెరికాలోనూ వివక్ష ఉన్నప్పటికీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు ఉంది. మన దేశంలోనూ కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాలి.. అవకాశాలు కల్పించాలి. నా ప్రయాణంలో అనేక మంది జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు నా శ్రేయోభిలాషులుగా ఉన్నారు’అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మూసీ రివర్ఫ్రంట్కు అడ్డుపడుతున్నారు.. 2047 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా మూసీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాం. కానీ కొందరు ఈ ప్రభుత్వాన్ని ఏమీ చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారు. అహ్మదాబాద్లో సబర్మతి రివర్ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్, యూపీలో గంగా రివర్ ఫ్రంట్ నిర్మించిన వారు హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ను మాత్రం వద్దంటున్నారు. ఈసా నది ఒడ్డున 2004లో 9 మీటర్ల బఫర్ జోన్లో అపార్ట్మెంట్ కట్టారు. నదులకు 50 మీటర్ల బఫర్ జోన్ ఏర్పాటు చేస్తూ తర్వాత నిర్ణయం తీసుకున్నారు. 50 మీటర్ల లోపల కట్టడాలపై నిషేదం ఉంది. 50 శాతం బఫర్ జోన్ ఉంది. అందుకే ఆ అపార్ట్మెంట్ నివాసితులను పిలిచి మాట్లాడాం. వాళ్లకు ఏడెకరాల భూమి ఇచ్చి అందులో అపార్ట్మెంట్ కట్టుకోవడానికి కావాల్సిన డబ్బు డిపాజిట్ చేస్తామని చెప్పాం. కానీ రాజకీయ జోక్యం పెరిగింది. ప్రతి పార్టీ అక్కడికి వెళ్లి సానుభూతి చూపిస్తోంది. సానుభూతితో సమస్య పరిష్కారం కాదు. 50 మీటర్ల బఫర్జోన్లో ఉన్న అన్ని కట్టడాలకు విలువ సున్నాయే. ప్రత్యామ్నాయం చూపించాలని మేం ప్రయత్నిస్తుంటే రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. బఫర్ జోన్లో ఉన్న వారికి జరిగే నష్టంపై చర్చిస్తే బాగుంటుంది. నగరాన్ని కాపాడుకోవడానికి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కావడానికి అందరి సహకారం కావాలి. గాంధీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తే తప్పేంటి? ఈ నెల 13న మూసీ రివర్ ఫ్రంట్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం’అని సీఎం వివరించారు. త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై శుభవార్త ‘జర్నలిస్టుల మధ్య ఎలాంటి తేడా లేదు. డెస్కు జర్నలిస్టులు, బ్యూరో జర్నలిస్టులు అని వేరుగా చూడం. అందరూ సమానమే. ప్రైవేటు కార్యాలయాల్లో మహిళల సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఇటీవలే ఈ అంశంపై చర్చ చేశాం. త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలపై ఫిర్యాదులకు ఒక వేదిక ఏర్పాటు చేస్తాం. నిజమైన జర్నలిస్టులెవరో, జర్నలిస్టు ముసుగులో వ్యాపారాలు చేస్తున్నవారెవరో తేడా తెలియాలి. అందుకోసం ప్రత్యేకంగా చట్టంపై అసెంబ్లీలో చర్చిస్తాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశం సుదీర్ఘకాలంగా ఉంది. చట్టం వల్ల ఇబ్బంది లేకుండా ఇళ్ల స్థలాలపై నిర్ణయం తీసుకుంటాం. అతిత్వరలోనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి మంచి వార్త చెబుతా. ప్యూచర్ సీటీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జర్నలిస్టులకు మంచి కాలనీని డిజైన్ చేస్తాం’అని సీఎం వివరించారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ అగ్రగామి: మంత్రి పొంగులేటి మహిళా సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే ప్రక్రియలో భాగంగా వడ్డీలేకుండా రూ. 23 వేల కోట్లు అందించినట్లు వివరించారు. రాష్ట్ర గౌరవాన్ని పెంచేలా మహిళలకు, మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అక్రెడిటేషన్ కార్డుల మంజూరులోనూ వారికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. -
‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్లో రోల్ మోడల్గా తెలంగాణ
‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలపాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పోలీసింగ్ లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘ట్రిపుల్ టీ’(టెక్నాలజీ, ట్రస్ట్, టాలెంట్) వ్యూహంతో ముందుకెళ్తున్నామన్నారు. ఆదివారం ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో పోలీస్ ఉన్నతాధికారులకు ‘తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ 2026’ పేరిట నిర్వహించిన ప్రత్యేక కార్యశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.... ఒకప్పుడు పోలీసింగ్ అంటే కేవలం శాంతి భద్రతల పరిరక్షణ మాత్రమే, ఇప్పుడు డేటా సెక్యూరిటీ, డిజిటల్ ట్రస్ట్ గా రూపాంతరం చెందిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా క్రైం కూడా భౌతిక సరిహద్దులను దాటి డిజిటల్ రూపంలోకి విస్తరించిందన్నారు. డీప్ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, ఆటోమేటెడ్ ఫిషింగ్ స్కామ్లు పోలీసులకు పెను సవాల్గా మారాయన్నారు. ప్రస్తుతం నేరగాళ్లకు ఆయుధాలతో పనిలేదని, స్మార్ట్ ఫోన్, డేటా, డిజిటల్ ఐడెంటిటీస్ తో నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఒక్క 2024లో దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రూ.22,845 కోట్లు కొల్లగొట్టారని, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 206 శాతం ఎక్కువన్నారు. సైబర్ బాధితుల్లో నిరక్షరాస్యుల కంటే అక్షరాస్యులే అధికంగా ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ప్రొఫెషనలిజం, ఆపరేషనల్ రెడీనెస్, లీడర్షిప్, ఇన్నోవేషన్, కొలాబరేషన్ , ఎథిక్స్ తో కూడిన ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ ఆవశ్యకమన్నారు. ఇప్పటికే టెక్నాలజీ ఎనేబుల్డ్ పోలీసింగ్ లో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. రాబోయే రోజుల్లో డేటా అనలిటిక్స్, ఏఐ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ సాయంతో నేరాల జరగకముందే అడ్డుకునే ‘ప్రెడిక్టివ్ పోలీసింగ్’కు పెద్దపీట వేస్తామన్నారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్య సాధనలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. ప్రజల నమ్మకాన్ని చూరగొన్నప్పుడే అసలైన పోలీసింగ్ సాధ్యమవుతుందన్నారు. నక్సలిజంపై పోరాటంలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు స్మరించుకున్నారు. వారి త్యాగం వృథా కాలేదన్నారు. కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష భిష్త్, రిటైర్డ్ డీజీపీలు హెచ్ జే దొర, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Hyderabad: కూకట్పల్లి షాపింగ్ మాల్లో ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి వైజంక్షన్లోని లేక్ షేర్ మాల్లో ప్రమాదం జరిగింది. సందర్శకులపై హోర్డింగ్లు, యాడ్ బోర్డులు పడ్డాయి. పలువురికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఆదివారం సెలవు దినం కావడంతో మాల్లో జనసంచారం తక్కువగా ఉంది. ఈ సమయంలో ఘటన జరగడంతో పెను ప్రమాదమే తప్పింది.హోర్డింగ్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఒక్కసారిగా వినియోగదారులంతా భయంతో పరుగులు తీశారు. మాల్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
‘ కృష్ణా జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటాం’
హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పనులపై సమీక్ష చేశామని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో సీఎం రేవంత్ నాయకత్వంలో కృష్ణా జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్. ఆ నీటిని ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలకు అందిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి తెలంగాణ ఏర్పడిన తర్వాత అత్యదిక వరి సాగు ఈ ఖరీఫ్ పంటలో వచ్చింది. కృష్ణా, గోదావరి బేసిన్లలో అత్యధిక సాగు పంటలు పండాయి. ఇరిగేషన్ విషయంలో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం. అన్ని ప్రాజెక్టులపై రివ్యూ చేశాం. ప్రాజెక్టులకు భూ సేకరణను జూన్ 2 లోపు 5 వేల కోట్ల తో కంప్లిట్ చేస్తాం. పాలమూరు - రంగా రెడ్డి ప్రాజెక్టుకు నిధుల అంశాన్ని చర్చించాం. పాలమూరు ను 90 శాతం చేశామని గత పాలకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రూ. 55 వేల కోట్ల ప్రాజెక్టులో రూ. 27 వేల కోట్లు ఖర్చు చేస్తే అది 90 శాతం అయినట్ల..?, వారి హయాంలో నే పాలమూరు అంచనాలు రూ. 84 వేల కోట్లకు పెంచారు. రూ. 27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి నీరు ఇవ్వలేదు.పాలమూరు ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలంకు షిఫ్ట్ చేయడం వల్ల తీరని అన్యాయం జరిగింది. 2028 డిసెంబర్ లోపు అన్ని ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తాం’ అని తెలిపారు. -
అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యంపై అవగాహనకు ‘పర్పుల్ రైడ్’
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు అపోలో ఆసుపత్రులు, పర్పుల్ రైడ్ సంయుక్తంగా ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించాయి. జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని అపోలో ఆసుపత్రి వరకు కొనసాగింది. సుమారు వెయ్యికి పైగా మహిళలు పాల్గొని ఉత్సాహంగా ర్యాలీని విజయవంతం చేశారు. న్యాయం, గౌరవానికి ప్రతీకగా భావించే పర్పుల్ రంగు సందేశాలతో తెలుపు టీషర్టులు ధరించి మహిళలు పాల్గొన్నారు.ర్యాలీ ప్రారంభ కార్యక్రమంలో అపోలో ఆసుపత్రుల జాయింట్ మేనే జింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగితా రెడ్డి మాట్లాడుతూ, మహిళలు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని ముందుగా చూసుకుంటూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఎక్కువగా ఉందన్నారు. గుండె జబ్బులు, స్తన మరియు గర్భాశయ గర్భద్వార క్యాన్సర్లు, మధుమేహం, రక్తహీనత వంటి వ్యాధుల కోసం క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరమని చెప్పారు. ముందస్తు పరీక్షల ద్వారా అనేక ప్రాణాలను రక్షించవచ్చని, ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.ఆరోగ్య రంగంలో సాంకేతికత ప్రాధాన్యాన్ని వివరించిన ఆమె, ఏఐ ఆధారిత ఆరోగ్య అంచనాలు ద్వారా వ్యాధి ప్రమాదాలను ముందుగానే గుర్తించి సమయానికి వైద్య సలహాలు పొందవచ్చన్నారు. మహిళలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలా కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలని సూచించారు.ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రుల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ సీఈఓ తేజస్వి రావు వీరేపల్లి మాట్లాడుతూ, మహిళల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళలు సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారని, మహిళలు బైక్ నడపలేరనే భావన ఇప్పుడు పాతబడి పోయిందన్నారు. ఈ ర్యాలీ ద్వారా మహిళల సాధికారతతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం లక్ష్యమని చెప్పారు.క్యాంపెయిన్కు అనుబంధంగా ఉన్న డాక్టర్ రోషన్ మాట్లాడుతూ, మహిళలు ఆరోగ్య పరీక్షలు, వ్యాయామం, ముందస్తు స్క్రీనింగ్పై దృష్టి పెట్టడం ద్వారా జీవనశైలి వ్యాధులను నివారించవచ్చన్నారు. మహిళల ధైర్యం, సామర్థ్యాన్ని ఈ ర్యాలీ ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని అపోలో ఆసుపత్రి వైద్యులు పాల్గొన్న వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. సాధారణ ఆరోగ్య సమస్యలు, జీవనశైలి వ్యాధులు, ముందస్తు నిర్ధారణ ప్రాధాన్యం గురించి వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఉచిత వైద్య సలహాలు, ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, స్వచ్ఛంద సేవకులు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -
కౌన్సిల్ హాల్ ప్రారంభించిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే పునరుద్ధరించిన అసెంబ్లీ ప్రాంగణంలోని శాసన మండలి భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు( ఆదివారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తగా పునరుద్ధరించిన భవనాన్ని పరిశీలించారు. అసెంబ్లీ సమావేశాలు నూతన భవనంలోనే జరపనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్లతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. కాగా తెలంగాణ చారిత్రక వారసత్వానికి చిహ్నంగా ఉన్న శాసనమండలి భవనాన్ని అధునాతన వసతులతో తీర్చిదిద్దారు. ఈ భవనంలో అధునాతన, సౌండ్ లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మండలిలో 40 మంది సభ్యులు ఉండగా, 50 మంది కూర్చునేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీంతోపాటు ముఖ్యమంత్రి, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, వైస్చైర్మన్, చీఫ్ విప్, కార్యదర్శి, మంత్రులు, సభ్యుల కోసం ప్రత్యేక లాంజ్లు సిద్ధం చేశారు. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని అధునాతన డిజిటల్ టెక్నాలజీతో సీటింగ్ ఏర్పాట్లు చేశారు. -
థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్ ల్లో మాదిరిగానే సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ పార్కింగ్ ఫీజు వసూలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ 2021, జూలై 20న జారీ చేసిన జీవో 121పై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 6కు వాయిదా వేసింది. తెలంగాణ మున్సిపల్ చట్టం–2019 ప్రకారం వాణిజ్య భవనాల్లో పార్కింగ్ ఉచితం. దీనికి విరుద్ధంగా జీవో 121 జారీ చేశారంటూ న్యాయ విద్యార్థి ప్రేమ్కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. థియేటర్లో తన నుంచి వసూలు చేసిన పార్కింగ్ ఫీజు రశీదును జత చేశారు. పిటిషన్పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలును తాత్కాలికంగా నిలిపివేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేసింది. -
గ్రేప్ ‘పండు’గ ప్రారంభం
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్లోని ద్రాక్ష పరిశోధన కేంద్రంలోని గ్రేప్ ఫెస్టివల్ శనివారం ప్రారంభమైంది. ప్రజలు నేరుగా తోటల్లోకి వెళ్లి స్వయంగా పరిశీలించి కట్ చేసుకొని కొనుగోలు చేసే సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ హారి్టకల్చర్ వర్సిటీ ప్రాంగణంలోని ద్రాక్ష పరిశోధన కేంద్రంలో ఈ వెసులుబాటు ఉంది.52 రకాల ద్రాక్ష చెట్ల నుంచి ఇష్టమైన పండ్లు కోసుకోవచ్చు. ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ క్షేత్రానికి సందర్శకులు రావచ్చని నిర్వాహకులు వెల్లడించారు. రకాన్ని బట్టి రూ.250 నుంచి 700 ధర నిర్ణయించారు. కార్యక్రమంలో పరిశోధన కేంద్రం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రమ్య మృతి కేసు నిందితుడికి రెడ్కార్నర్ నోటీసు
హైదరాబాద్: ఏడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి, మరో ఇద్దరు మృతికి కారణమైన నిందితుడికి బంజారాహిల్స్ పోలీసులు రెడ్కార్నర్ నోటీసు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే... 2016 జూలై ఒకటిన రమ్య(9) అనే విద్యారి్థనిని పాఠశాల నుంచి తీసుకొని ఆమె బాబాయి పి.రాజేష్, తాత మధుసూదనాచారిలు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–3 నాగార్జున సర్కిల్ నుంచి బంజారాహిల్స్ వైపు కారులో వెళ్తున్నారు. అదే సమయంలో సినీమ్యాక్స్ భవనంలోని టీజీఐ ఫ్రైడ్ పబ్లో అతిగా మద్యం తాగిన ఆర్.శ్రావిల్, కచ్చా విష్ణువినీత్ల కారు బంజారాహిల్స్ నుంచి నాగార్జున సర్కిల్ పంజగుట్ట వైపు అతివేగంగా దూసుకువచ్చింది. శ్రావిల్ నడుపుతున్న ఈ కారు అదుపుతప్పి పంజగుట్ట శ్మశానవాటిక సమీపంలోని డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపు రమ్య ఉన్న కారుపై పడింది. ఈ ప్రమాదంలో రమ్య, మధుసూదనాచారి, రాజేష్లు మృతి చెందారు. ఈ మేరకు ఏ1 శ్రావిల్, ఏ2 విష్ణువినీత్లపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు నడుస్తుండగానే విష్ణువినీత్ అమెరికా వెళ్లాడు. ఈ నెల 17న నాంపల్లి సెషన్స్ కోర్టులో ఈ కేసు వాయిదా ఉండటంతో పోలీసులు సాక్షుల విచారణ చేపట్టారు. నిందితులను కూడా హాజరుపర్చేందుకుగాను అమెరికా నుంచి విష్ణువినీత్ను రప్పించేందుకు రెడ్కార్నర్ నోటీసు జారీ చేశారు. -
పండ్ల రవాణాపై గల్ఫ్ గుబులు
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం భాగ్యనగరం పండ్ల మార్కెట్పై పడింది. అరబ్బు దేశాల్లో కార్గో రవాణాపై ఆంక్షల నేపథ్యంలో పండ్లు, ఇంటీరియర్, ఫర్నిచర్ వంటి వస్తువులపై ప్రభావం పడింది. దీంతో ఇరాన్, దుబాయ్, టర్కీ, తుర్కియో వంటి దేశాల నుంచి నుంచి హైదరాబాద్కు దిగుమతి అయ్యే యాపిల్స్, కివీ, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ విదేశీ పండ్ల దిగుమతి తగ్గింది. వీటితో పాటు ఇంటీరియర్ ఫర్నిచర్లపై ప్రభావం ఉంది. రెండింతలైన ధరలు.. రంజాన్ మాసం కావడంతో సాధారణంగానే ఖర్జూరం, బాదం వంటి డ్రై ఫ్రూట్స్కు డిమాండ్ ఎక్కువ. పశి్చమాసియాలో యుద్ధంతో ధరలు దాదాపు రెండింతలు పెరిగాయి. సాధారణంగా అక్కడి మార్కెట్లో యాపిల్స్ ధర (బాక్స్) రూ.1,200 ఉంటుంది. అదే బాక్స్ నగర మార్కెట్లో దిగుమతి అయ్యాక రూ.1,800కు విక్రయిస్తుంటారు. కానీ, యుద్ధం నేపథ్యంలో అదే బాక్స్ ధర అక్కడి మార్కెట్లో రూ.1,800 ఉండగా.. ఇక్కడికొచ్చేసరికి రూ.2,500కు పెరిగింది. నిర్మాణ సామగ్రిపైనా.. ఇంధన, చమురు దిగుమతులతో పాటు స్థిరాస్తి మార్కెట్ కూడా ప్రభావం చూపిస్తుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. సౌదీ అరేబియా, యూఏఈ నుంచి ఇనుము, స్టీల్, కాపర్ వైర్లు దిగుమతి అవుతుంటాయి. గల్ఫ్ దేశాల నుంచి పెట్కోక్ (సిమెంట్లో ఉపయోగించేవి), పాలిమర్లు, సల్ఫర్,, సున్పపురాయి దిగుమతి అవుతాయి. ఈ ముడి పదార్థాలతో ఇంటీరియర్, నిర్మాణ సామగ్రి తయారవుతుంటాయి. మార్బుల్స్, టైల్స్, గ్లాస్ వంటివి దిగుమతులపై ప్రభావం ఉంటుంది. ఈ మేరకు తుది దశ నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో పాటు ధరలలో 1–2 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం
సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల ఉద్రిక్తతల ప్రభావం మహా నగరంలోని వాణిజ్య వంట గది వరకూ చేరాయి. గృహాపయోగ వంటగది అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అత్యవసర ఆదేశాలు తాజాగా హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్నతరహా పరిశ్రమలపై ప్రభావం చూపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ , 1955 కింద చమురు సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్లోని ప్రధాన గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్లలో వాణిజ్య సిలిండర్ల లోడింగ్ను తాత్కాలికంగా నిలిచిపోయి గ్యాస్ కొరతను సృష్టిస్తోంది. హోటళ్లు – రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం నగరంలోని ఫుడ్ ఇండస్ట్రీపై గ్యాస్ ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడ సుమారు 70 నుంచి 80 వేలకుపైగా హోటళ్లు, రెస్టారెంట్లు టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు వాణిజ్య గ్యాస్ వినియోగంపైనే ఆధారపడి ఉన్నాయి. డిమాండ్కు సరిపడా సిలిండర్లు సరఫరా కాకపోతుండటంతో డీలర్లు చేతులెత్తేస్తున్నారు. వంటగ్యాస్ ఒక్కసారిగా నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ధరలు పెరగగా, మరింత పెరుగుతాయనే ఆశతో కొందరు వ్యాపారులు నిల్వలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కువ శాతం హోటళ్లు, బిర్యానీ పాయింట్లు వాణిజ్య గ్యాస్పైనే ఆధారపడి ఉన్నాయి. చిన్నపాటి తోపుడు బండ్లు, ఫంక్షన్ల ఆర్డర్లు తీసుకునే క్యాటరర్లు సిలిండర్ల కోసం డీలర్ల చుట్టూ తిరుగుతున్నారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా తగ్గడంతో, బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనాల్సి వస్తోందని హోటల్ యజమానులు వాపోతున్నారు. రోజువారీ గ్యాస్ వినియోగం రాష్ట్ర వ్యాప్తంగా నెలకు సగటున 7 నుండి 7.5 లక్షల కమర్షియల్ సిలిండర్లు (19 కేజీలు) అవసరమవుతుండగా, ఇందులో దాదాపు 50 – 60 శాతం వాటా కాగా.. ఒక్క గ్రేటర్ పరిధిలో ప్రతిరోజూ సుమారు 12,000– 15,000 కమర్షియల్ సిలిండర్లు అవసరమవుతాయని అంచనా ఒక మధ్యస్థ రెస్టారెంట్కు రోజుకు 2 నుండి 5 సిలిండర్లు అవసరమైతే, పెద్ద హోటళ్లకు 10 కి పైగా అవసరమవుతాయి. చిన్న టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు రోజుకు సగటున ఒక చిన్న, సగం పెద్ద సిలిండర్ను వినియోగిస్తాయి. కేంద్ర ప్రభుత్వం గహ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, కమర్షియల్ సరఫరాపై తాత్కాలిక ఆంక్షలు విధించడంతో హోటల్ యజమానులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద సాధారణంగా 2–3 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉంటాయి. సరఫరాలో జాప్యం జరిగితే హోటల్ రంగం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. సిలిండర్ల కోసం ‘పానిక్ బుకింగ్’ మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరమైతే ముడి చమురు సరఫరా నిలిచిపోతుందని, తద్వారా గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ భయంతో సామాన్య ప్రజలు తమకు అవసరం లేకున్నా ముందస్తుగా సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారు. -
వంటకు యుద్ధం మంట
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వంటింటిపై పడింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు, గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ (ఎలీ్పజీ), కమర్షియల్ గ్యాస్ ధరలను పెంచింది. ఎల్పీజీ సిలిండర్పై రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ.114.50 పెంచింది. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.853 నుంచి రూ.913కు పెరిగింది. రాష్ట్రంలో ఇదే సిలిండర్ ధర రూ. 905 నుంచి 965కు చేరుకుందని ఆయిల్ కంపెనీ వర్గాలు చెప్పాయి. ఇది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రవాణా ఖర్చులను బట్టి మారనుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ ధరల పెంపు గృహ బడ్జెట్పై మరింత ఒత్తిడి పెంచనుంది. కమర్షియల్ గ్యాస్ ధరలు భారీగా పెంపు హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు ఉపయోగించే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను కేంద్రం ఏకంగా రూ.114.50 పెంచింది. దీంతో ఢిల్లీలో ధర రూ.1,883కు చేరగా, హైదరాబాద్లో సుమారు రూ.2వేల వరకు ఉండే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మార్చి 1న కమర్షియల్ సిలిండర్పై రూ.28 పెంచారు. తాజా పెంపుతో ఈ ఏడాది ప్రారంభం నుంచి కమర్షియల్ సిలిండర్ ధర మొత్తం రూ.300కు పైగా పెరిగినట్లయింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఫుడ్ సెంటర్ల నిర్వహణ ఖర్చులు పెరగనున్నాయి. ఫలితంగా టీ నుంచి భోజనం వరకు, ఇతర అన్ని తినుబండారాల ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్ల వ్యాపారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.‘మహాలక్ష్మి’కి ఊరట? తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద 42.90 లక్షల కుటుంబాలకు రూ.500 సబ్సిడీ కింద ఏటా ఆరు సిలిండర్లను ప్రభుత్వం పేదలకు అందిస్తోంది. అయితే పెరిగిన ధరలను ప్రభుత్వం భరిస్తుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. ఈ పథకం కింద ఏడాదికి రూ. 740 కోట్లు బడ్జెట్లో కేటాయించింది. పెరిగిన ధర కూడా ప్రభుత్వం భరించే పక్షంలో ఖజానాపై ఈ భారం మరింత పెరుగుతుంది. కాగా, ప్రస్తుతం పెట్రో ల్, డీజిల్ ధరలను పెంచే యోచన లేదని కేంద్రంచెబుతున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఎక్కువకాలం అధికంగా కొనసాగితే వాటి ధరల పెంపు తప్పదని విశ్లేషకులు అంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. -
మహిళల భద్రత అందరి బాధ్యత
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని.. సమాజంలోని అందరి బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణను దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత రాష్ట్రంగా మార్చడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సొంత కుటుంబ సభ్యులకు ఎక్కడైనా వేధింపులు ఎదురైతే ఎలా స్పందిస్తామో ఇతర ఆడపిల్లల విషయంలోనూ యువత అలాగే స్పందించాలని.. మహిళా రక్షణ అంబాసిడర్లు కావాలని సూచించారు. మహిళలకు అండగా ఉన్న వారికే సమాజంలో మర్యాద ఉంటుందని, అదే ఉద్దేశంతో తెలంగాణ పోలీస్శాఖ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ‘స్టాండ్ విత్ హర్’కార్యక్రమాన్ని ప్రారంభించిందని సీఎం రేవంత్ చెప్పారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన ‘స్టాండ్ విత్ హర్’కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘స్టాండ్ విత్ హర్’కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సినీ హీరో సాయిదుర్గతేజ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, డీజీపీ బి.శివధర్రెడ్డి, సీఐడీ చీఫ్ చారుసిన్హా సహా మహిళా పోలీస్ అధికారులు, ఐఏఎస్ అధికారులతో కలిసి ‘స్టాండ్ విత్ హర్’బ్రోచర్ను సీఎం ఆవిష్కరించారు. డిజిటల్ క్రైం పెరిగింది.. ‘రాష్ట్రంలోని మహిళలకు సంపూర్ణమైన రక్షణ కలి్పంచామని ఎవరైనా భావిస్తే అది అసంపూర్తి రక్షణే అని భావిస్తున్నా. గతంలో కొన్ని ప్రాంతాల్లోనో, బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు వేధింపులు ఎదురయ్యేవి. కానీ ఈ రోజుల్లో ఫిజికల్ క్రైమ్ కంటే ఆన్లైన్ క్రైమ్ పెరిగిపోయింది. మహిళలను వేధించేందుకు కొందరు డీప్ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారు. వాటిని నియంత్రించడానికి తెలంగాణ సైబర్ క్రైం విభాగాన్ని కూడా పటిష్టం చేశాం. మనల్ని మనం సవరించుకొని మహిళలపట్ల మన బాధ్యతల్ని మనం నెరవేర్చాల్సిన సందర్భం వచ్చింది. మహిళల శక్తిసామర్థ్యాలపట్ల మా ప్రభుత్వానికి బలమైన నమ్మకం ఉంది. అందుకే రాష్ట్ర పోలీస్ శాఖలోని కీలక విభాగాలకు, ప్రభుత్వంలోని ముఖ్యమైన శాఖలకు మహిళలనే అధికారిణులుగా నియమించాం.ఆడబిడ్డలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతమైతేనే ఆ రాష్ట్రం లేదా దేశం పురోగతి సాధిస్తుంది’అని సీఎం రేవంత్ చెప్పారు. సాయిదుర్గ తేజ్ మాట్లాడుతూ సొంత తల్లిని ఎలా గౌరవిస్తామో..అదేవిధంగా ప్రతి మహిళను గౌరవించాలని సూచించారు. బైక్పై వెళ్లే సమయంలో హెల్మెట్ పెట్టుకోవడం మరవొద్దని సూచించారు. డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారతతోపాటు భద్రత కూడా సామాజిక బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ వారికి అండగా నిలవాలన్నారు. మహిళా భద్రతపై పురుషుల్లో మరింత అవగాహన పెంచేలా స్టాండ్ విత్ హర్ ద్వారా ప్రచారం నిర్వహించనున్నట్లు సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హా పేర్కొన్నారు. -
ముందుగానే మండుతున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం నడివేసవిని తలపిస్తోంది. సీజన్ ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగతలు నమోదు కావాల్సి ఉండగా... చాలాచోట్ల సాధారణం కంటే సుమారు 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు పొడి వాతావరణం, ఆకాశం నిర్మలంగా ఉండటం, మేఘాలు లేకపోవడం, గాలిలో తేమశాతం తగ్గడంతో వేడిమి అధికంగా ఉంది. ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటోంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉండాలి. కానీ 40 డిగ్రీలకు పైబడి నమోదవుతుండటం మున్ముందు పరిస్థితిపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఏప్రిల్లో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతుండటం కలవరపెడుతోంది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్నగర్లో 40.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. నల్లగొండ మినహా అన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధికంగా మహబూబ్నగర్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.9 డిగ్రీలు అధికంగా నమోదు కాగా... ఆదిలాబాద్లో 2.8, భద్రాచలంలో 2.7, హనుమకొండలో 2.1 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండ్రోజుల పాటు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థితిలోనే నమోదవుతున్నాయి. దీంతో సాయంత్రానికి వాతావరణం చల్లబడటంతో ఉక్కపోత నుంచి ఉపశమనం లభిస్తోంది. శనివారం ఒడిశా పరిసర ప్రాంతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. ఇది తెలంగాణ, అంతర్గత కర్ణాటక మీదుగా కర్ణాటక తీరం వరకు సముద్రమట్టం నుంచి సగటున 0.9 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతోంది. వచ్చేవారం చివర్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ చెప్పింది. -
గణపతీ.. లొంగిపోండి
సాక్షి, హైదరాబాద్: ‘గణపతి.. ఆయుధాలు అప్పగించి లొంగిపోండి. తెలంగాణ ప్రభుత్వం మీ ప్రాణానికి రక్షణ కల్పిస్తుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటుంది’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సహా తెలంగాణ ప్రాంతం నుంచి అజ్ఞాతంలో ఉన్న ఏడుగురు జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం సూచించారు. హింసతో ఏ సమస్యా పరిష్కారం కాదని.. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సాధించిన గాం«దీజీ మార్గంలోనే తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సీఎం స్పష్టం చేశారు. సాయుధ బలగాలైనా, మావోయిస్టులైనా దేశ పౌరులేనని.. ఎవరి ప్రాణానికీ నష్టం జరగొద్దన్నదే తమ ప్రభుత్వ విధానమన్నారు. తెలంగాణ గడ్డపై హింసకు తావులేదని చెప్పారు. మావోయిస్టు పారీ్టలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న మొత్తం 130 మంది మావోయిస్టులు సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో శనివారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో లొంగిపోయారు. 124 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ బి.శివధర్రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్కుమార్, ఆపరేషన్స్ అడిషనల్ డీజీ అనిల్కుమార్, ఎస్ఐబీ చీఫ్, ఐజీ సుమతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. దేశ చరిత్రలోనే భారీ లొంగుబాటు.. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఇందుకు కృషి చేసిన తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి, ఎస్ఐబీ చీఫ్ సుమతితోపాటు ఇతర అధికారులను అభినందించారు. ఆయుధాలు విడిచి లొంగిపోయే మావోయిస్టుల రక్షణ, ఆరోగ్య భద్రత, ఇతర పునరావాసం విషయంలో ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని వెల్లడించారు. అజా్ఙతంలో ఉన్న మావోయిస్టులంతా బయటికి వచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని సూచించారు. అయితే మావోయిస్టు అగ్రనేత గణపతి ఎక్కడ ఉన్నారన్నది సమాచారం తమ వద్ద లేదన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు మంచి జీవితం గడిపేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా లేక కుటుంబ సభ్యలతో శాంతియుత జీవితం గడుపుతారా అనేది వారి ఇష్టమని సీఎం పేర్కొన్నారు. మంత్రి సీతక్క సహా ఎందరో మాజీ మావోయిస్టులు రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎవరైనా కాంగ్రెస్ పారీ్టలో చేరాలనుకుంటే గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ అందుబాటులో ఉంటారని చెప్పారు. చర్చలే పరిష్కారం.. ‘మహాత్మాగాంధీ శాంతియుత పోరాటంతో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించిపెట్టారు. ప్రపంచానికి శాంతిమార్గాన్ని చూపారు. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం. తెలంగాణ గడ్డపై హింస కుదరదు. రాష్ట్ర ప్రభుత్వం సైతం శాంతియుత మార్గాన్నే అనుసరిస్తోంది. మావోయిస్టుల్లో ఇంకా అజ్ఞాతంలో ఉన్న వారికి సీఎంగా పిలుపునిస్తున్నా. అందరూ జనజీవన స్రవంతిలోకి రండి. తెలంగాణ ప్రభుత్వం మీతో చర్చించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ఉంది’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. లొంగిపోయేవారు ఆత్మగౌరవంతో బతికేలా సహకరిస్తాం.. ‘ఇటీవల లొంగిపోయిన దేవ్జీ, చంద్రన్న, సుజాతక్క, రాజిరెడ్డి సహా అందరూ నన్ను కలిసి ఎన్నో అంశాలపై మాట్లాడారు. అన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇస్తే జైళ్లలో ఉన్న మావోయిస్టులతోపాటు అజా్ఙతంలో ఉన్న మావోయిస్టులతో చర్చించి సీపీఎం మావోయిస్టు పార్టీని రద్దు చేస్తామని ప్రతిపాదించారు. అయితే రాష్ట్ర స్థాయిలోని అంశాలను పరిష్కరిస్తామని.. నక్సలిజం జాతీయ సమస్య కాబట్టి కేంద్రంతో మాట్లాడతామని వారికి చెప్పాను. రివార్డుల మొత్తం పెంపు, ఇల్లు, వ్యవసాయ భూమి కేటాయింపు, వైద్య సాయం కోసం లొంగిపోయిన మావోయిస్టులు చేసిన విజ్ఞప్తిపై తెలంగాణ ప్రభుత్వం తరఫున సానుకూలంగా ఉన్నాం. లొంగిపోయిన వారికి ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వడంతోపాటు నిమ్స్ వంటి ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తాం. రివార్డుల మొత్తాన్ని పెంచే విషయంలో ఉదారంగా వ్యవహరిస్తాం. పునరావాసం మెరుగ్గా అందించే అంశంపై సీఎస్, డీజీపీ, ఇతర అధికారులతో అధ్యయం చేసి వాటిని పెంచే ప్రయత్నం చేస్తాం. చట్ట పరిధిలో ఎత్తివేయడానికి అవకాశం ఉన్న కేసులను ఎత్తివేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కోర్టు పరిధిలో ఉన్న కేసుల పరిష్కారానికి అవసరమైతే ఒక కమిటీని ఏర్పాటు చేసి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. లొంగిపోయే వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడంతోపాటు ఇళ్లు కట్టుకోవడానికి వారి సొంత గ్రామాల్లో స్థలాలు ఇస్తాం. భూములు అందుబాటులో లేనందున వ్యవసాయ భూమి కేటాయింపులో మాత్రం ఇప్పుడే మాట ఇవ్వలేను. లొంగిపోయిన మావోయిస్టులు సమాజంలో ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానం కొనసాగించేలా ప్రభుత్వం సంపూర్ణంగా సహకారం అందిస్తుంది’అని సీఎం రేవంత్ చెప్పారు. అమిత్ షా పూర్తి స్వేచ్ఛనిచ్చారు.. ‘లొంగిపోయిన మావోయిస్టుల ఆరోగ్య పరిరక్షణ, ఆర్థిక వెసులుబాటు కల్పన, నివాస స్థలం, ఇళ్ల కేటాయింపు అంశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మాజీ మావోయిస్టు నాయకుల ప్రతిపాదనలను ఇటీవల ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఈ మేరకు ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్చలు జరపడం వల్ల దేశంలోనే తొలిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో ఆయుధాలతో, పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. 2024 తర్వాత నుంచి 721 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 250కిపైగా ఆయుధాలు స్వాధీనం చేశారు. బుల్లెట్ ద్వారా కాదు బ్యాలెట్ ద్వారా సమస్యలు పరిష్కరించాలని నమ్మి ముందుకు వచ్చిన అందరికీ అభినందనలు’అని రేవంత్ అన్నారు. -
స్థానికంగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు!
సాక్షి, హైదరాబాద్: సొంతింటి కలను సాకారం చేసుకునే క్రమంలో పేదలు తమ ఉపాధిని, సామాజిక జీవనాన్ని కోల్పోకుండా ఇకపై లబ్దిదారులకు ప్రస్తుతం వారు నివసిస్తున్న ప్రాంతానికి గరిష్టంగా ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న గృహ సముదాయాల్లోనే ఇళ్లను కేటాయించనున్నట్లు హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్ వెల్లడించారు. శనివారం ఆయన సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. సాధారణంగా గృహనిర్మాణ పథకాల కింద ఇళ్లను కేటాయించి, లబ్ధిదారులను సుదూర ప్రాంతాలకు తరలించడం వల్ల వారి జీవనోపాధి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ సమస్య కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో అధికంగా ఉన్నట్లు గుర్తించాం. గతంలో ఉన్నట్లు కాకుండా లబి్ధదారులను దూర ప్రాంతాలకు తరలించే పరిస్థితిని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు కొత్తగా మార్గదర్శకాలను జారీ చేశాం. లబ్ధిదారుల ఎంపికలో ఆయా గృహ సముదాయాలకు సమీపంలో నివాసం ఉన్న వారికే తొలి ప్రాధాన్యం ఇస్తాం. జీవో నంబర్ 33 మార్గదర్శకాలకు అనుగుణంగా కోర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో నిర్మాణాలు పూర్తయిన, నిర్మాణాలు కొనసాగుతున్న సుమారు 25,619 గృహాలను యుద్ధప్రాతిపదికన లబ్దిదారులకు కేటాయించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈనెల చివరి నాటికి లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి, ఇళ్ల కేటాయింపుల ప్రక్రియను పూర్తి చేస్తాం. డబుల్ బెడ్రూమ్ గృహనిర్మాణ ప్రాజెక్టులను పూర్తి మౌలిక సదుపాయాలతో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. జూన్ నాటికి కనీసం 10 వేల ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ‘ఇందిరమ్మ’కింద ఆర్థిక చేయూత మహానగర పరిధిలో ‘ఇందిరమ్మ ఇళ్ల‘పథకం కింద స్థలాలు ఉన్న అర్హులైన లబ్ధిదారులకు సొంత గృహ నిర్మాణాలకు త్వరలో అనుమతులు, ఆర్థిక చేయూత మంజూరు చేస్తాం. ఇప్పటికే సుమారు 18,000 మంది లబ్దిదారులను గుర్తించాం. మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులను ఈ నెల 31 నాటికి ప్రారంభించే విధంగా చర్యలు చేపడుతున్నాం. మహానగర్ పరిధిలో మురికివాడల స్థానంలో సుమారు 25,000 గృహాలను గరిష్టంగా జీ+5, జీ+10 వరకు భవన సముదాయాలను నిర్మించి మెరుగైన నివాస సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించాం. ప్రస్తుతం వారు ఉంటున్న ప్రాంతాల్లోనే అత్యాధునిక భవనాలను నిర్మిస్తాం. అలాగే దశాబ్దాల క్రితం నిర్మించిన శిథిలావస్థలో ఉన్న ఈడబ్ల్యూఎస్, వాంబే గృహాల స్థానంలో కూడా కొత్త భవనాలను నిర్మించి, అక్కడి నివాసితులకు మెరుగైన గృహాలను అందిస్తాం. -
పాత అసెంబ్లీ.. మళ్లీ కొత్తగా!
(సాక్షి, హైదరాబాద్) : హైదరాబాద్ నగరం నడిబొడ్డున ‘పాత అసెంబ్లీ’గా పేరుగాంచిన గ్రాండ్ టౌన్ హాల్ భవనానికి 1905లో అప్పటి నిజాం మహబూబ్ అలీ ఖాన్ శంకుస్థాపన చేశారు. 1913లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవనం నాటి నుంచి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు వేదికగా నిలుస్తూ నగర చారిత్రక వైభవాన్ని గుర్తు చేస్తోంది. భారతీయ సంప్రదాయ, పాశ్చాత్య నిర్మాణ శైలి (ఇండో సెరాసోనిక్ వాస్తు శైలి లేదా ఇండో గోతిక్ నిర్మాణ శైలి) సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుంది. భవనం బాహ్య భాగంలో భారతీయ నిర్మాణ శైలికి ప్రత్యేకమైన గొప్ప కెనోపీలు, వంపు గవాక్షాలు, అలంకార స్తంభాలు, సున్నితమైన బ్రాకెట్లు కనిపిస్తాయి. అంతర్గత భాగంలో మాత్రం పాశ్చాత్య శైలిలో కోరింథియన్ స్తంభాలు, పూల అలంకరణలు, విక్టోరియన్ మింటన్ టైల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 1956 నుంచి ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు వేదికగా నిలిచిన ఈ భవనం 2017 వరకు వినియోగంలోనే ఉంది. 2014లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏపీ అసెంబ్లీకి కేటాయించారు. రెండేళ్ల పాటు ఈ భవనంలోనే కొనసాగిన ఏపీ అసెంబ్లీని ఆ తర్వాత అమరావతికి తరలించారు. భవనంలోని విద్యుత్, ఇతర ఫర్నిచర్ తదితరాలను ఏపీకి తరలించే క్రమంలో సీలింగ్, ఫ్లోరింగ్ వంటివి దెబ్బతిన్నాయి. శిథిలావస్థకు చేరిన చారిత్రక భవనం శతాబ్దానికిపైగా వినియోగంలో ఉన్న ఈ భవనం 2017 నాటికి పైకప్పు సరైన సంరక్షణ లేకపోవడం వల్ల బలహీనంగా మారి శిథిలావస్థకు చేరింది. చారిత్రక భవనాన్ని పునరుద్ధరించి వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినా నిర్మాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని భావించింది. ఈ దశలో కుతుబ్షాహీ టూంబ్స్తోపాటు సుమారు వంద వరకు చారిత్రక భవనాలకు మరమ్మతులు చేసి పునరుద్ధరించిన ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్, రోడ్డు భవనాల శాఖతో కలిసి పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు సంకల్పించింది. భవనం అసలు నిర్మాణాన్ని కాపాడుతూ సంప్రదాయ నిర్మాణ పదార్థాలు, పాత పద్ధతులను మేళవించి నిపుణులైన కళాకారులతో రూ.30 కోట్లతో ఈ పనులు చేపట్టారు. సుమారు 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవన పునరుద్ధరణలో వందలాది కళాకారులు పాలుపంచుకున్నారు. అత్యవసర ప్రాధాన్యతతో చేపట్టిన ఈ పనులు ఏడాదిన్నర కాలంలో పూర్తి అయ్యాయి. సంరక్షణలో అనేక సవాళ్లుభవనంలో దెబ్బతిన్న లేదా కనుమరుగైన నిర్మాణ అంశాలను గుర్తించేందుకు విస్తృత పరిశోధన, సాంకేతిక పరిశీలనలు చేపట్టారు. వాటి ఆధారంగా భవనం నిర్మాణ బలాన్ని కాపాడుతూ పునరుద్ధరణ పనులు నిర్వహించారు. అయితే భవనాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరాల వల్ల కొన్ని అసలు నిర్మాణ లక్షణాలను పూర్తిగా పునరుద్ధరించడం సాధ్యపడలేదు. ప్రత్యేకంగా ప్రధాన సభా మందిరంలోని కిటికీలను తరువాతి కాలంలో నిర్మించిన బాల్కనీలు, అలంకార ప్రవేశ ద్వారం కొంతవరకు కప్పేశాయి. భవనానికి ముందు, వెనుక భాగాల్లో నిర్మించిన ఆర్సీసీ నిర్మాణాలు అసలు ఆర్కేడ్లను అడ్డుకోవడంతో సరైన గాలి, వెలుతురు లేకుండా పోయింది. మరోవైపు పాత భవనం చుట్టూ వివిధ సందర్భాల్లో చేపట్టిన ఇతర నిర్మాణాల మూలంగా భవనంలోని అసలు వర్షపు నీటిపారుదల వ్యవస్థ కూడా మూసుకుపోయింది. దీంతో తీవ్రమైన నీటి లీకేజీతో పైకప్పు బలహీనపడింది. ఈ సమస్యలను పరిష్కరించడం పునరుద్ధరణలో సవాల్గా నిలిచింది. లైమ్ మోరా్టర్ నిపుణులు, మట్టి కళాకారులు, రాగి పనివాళ్లు, సంప్రదాయ టైల్స్ తయారీదారులు, కార్పెంటర్లు సహా అనేక రంగాల కళాకారులు పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్నారు. మొత్తం 50వేలకు పైగా పనిదినాలు ఈ ప్రాజెక్టుకు వినియోగించారు. ప్రధాన సభా మందిరంలోనూ.. భవనంలో అత్యంత ముఖ్యమైన ప్రదేశం ప్రధాన సభా మందిరంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నిర్మాణాలను తొలగించడంతో ఇటుకలతో కూడిన జాక్ ఆర్చ్ నిర్మాణం బయటపడింది. హాల్లోని గోడలపై పూసిన ఎనామెల్ పెయింట్ పొరలను కూడా తొలగించడంతో ఒరిజినల్ శైలి బయట పడింది. 10వేల చదరపు అడుగులకుపైగా గోడలపై ఉన్న పూతలను తొలగించి అసలు స్టక్కో అలంకరణలను వెలికితీశారు. కోరింథియన్ స్తంభాలు, అలంకార బ్రాకెట్లు, గవాక్షాలపై ఉన్న శిల్పాలను శుభ్రపరచి పునరుద్ధరించారు. హాల్ రెండు వైపులా తరువాతి కాలంలో నిర్మించిన బాల్కనీలు అసలు గవాక్షాల అందాన్ని తగ్గిస్తున్నాయని గుర్తించి సవరించారు. కారిడార్లలోనూ గాలి, వెలుతురు వచ్చేలా చేశారు. కారిడార్లు, మొదటి అంతస్తులో పాతకాలం నాటి విక్టోరియల్ టైల్స్తో మరమ్మతులు చేశారు. బాహ్య భాగంలో అలంకార శిల్పాలు భవనం బాహ్య నిర్మాణంలో బ్రాకెట్లు, చత్రాలు, ఫినియల్స్ వంటి అలంకార శిల్పాలు విస్తారంగా ఉన్నాయి. పునరుద్ధరణకు ముందు ఇవి తీవ్రంగా దెబ్బతిన్నాయి. చజ్జాలు విరిగిపోవడం, బ్రాకెట్లు పగలడం వంటి సమస్యలు కనిపించాయి. తర్వాత 100 మీటర్లకు పైగా చజ్జాలను సంప్రదాయ పద్ధతిలో పునర్మించారు. 1.5 నుంచి 3 అడుగుల ఎత్తు కలిగిన 250కిపైగా అలంకార పూలకుండలను సంప్రదాయ పద్ధతిలో తయారు చేశారు. రాతి నిర్మాణాన్ని శుభ్రపరిచి అసలు నేలస్థాయిని గుర్తించి చుట్టుపక్కల మట్టిని తగ్గించారు. నీటి చొరబాటును నివారించేందుకు 50 మి.మీ మందంతో గ్రానైట్ రక్షణ పొర ఏర్పాటు చేశారు. మొత్తంగా శాసన మండలి భవనం పునరుద్ధరణతో చారిత్రక నిర్మాణ కళను పునరుజ్జీవింపజేసి తెలంగాణ చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిపే ప్రయత్నాలు చేశారు. ఆధునిక వసతులతో ఏర్పాట్లుతెలంగాణ చారిత్రక వారసత్వానికి చిహ్నంగా ఉన్న శాసనమండలి భవనాన్ని అధునాతన వసతులతో తీర్చిదిద్దాం. కేవలం ఏడాదిన్నరలో పనులు పూర్తి చేసుకున్న ఈ భవ నంలో అధునాతన, సౌండ్ లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మండలిలో 40 మంది సభ్యులు ఉండగా, 50 మంది కూర్చునేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీంతోపాటు ముఖ్యమంత్రి, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, వైస్చైర్మన్, చీఫ్ విప్, కార్యదర్శి, మంత్రులు, సభ్యుల కోసం ప్రత్యేక లాంజ్లు సిద్ధం చేశారు. భవిష్య త్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని అధునాతన డిజిటల్ టెక్నాలజీతో సీటింగ్ ఏర్పాట్లు ఉన్నా యి. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 8న ఈ భవనాన్ని ప్రారంభిస్తున్నారు. – గుత్తా సుఖేందర్రెడ్డి, శాసన మండలి చైర్మన్ -
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి
చందానగర్: చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని, ఆర్థిక స్వావలంబన సాధనే లక్ష్యంగా ఆడబిడ్డలు కష్టపడాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం చందానగర్లో అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పలువురు మాజీ కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేటి సమాజంలో పురుషాధిక్యత అడుగడుగునా ఉందన్నారు. రాజకీయాలు కూడా దానికి అతీతం కాదన్నారు. పోటీ ప్రపంచంలో మహిళలు నిలదొక్కుకోవాలంటే రెట్టింపు ప్రయత్నం చేయక తప్పదన్నారు. అమ్మాయిలు తమ కాళ్ల మీద తాము నిలబడి ఆర్థిక స్వాతంత్య్రం సాధించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తనకు కూడా కూతురు ఉందని గుర్తు చేస్తూ, యువతకు ఆయన కీలక సూచనలు చేశారు.ఆర్థికంగా ఎవరి మీదా ఆధారపడకుండా, సొంతంగా ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచే స్థాయికి ఎదిగినప్పుడే సమాజంలో గౌరవం, గుర్తింపుతో పాటు మహిళలకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానున్న నేపథ్యంలో విద్యావంతులు, సామాజిక స్థితిగతులపై అవగాహన ఉన్న మహిళలు రాజకీయాల్లోకి రావాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల్లో› 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని, భవిష్యత్తులోనూ మహిళా సంక్షేమం కోసం మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనంతరం సబితారెడ్డి, సునీతారెడ్డిలు మాట్లాడుతూ మహిళలకోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. మహిళలకు భద్రత, రక్షణ కావాలంటే కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సమాజానికి విశేష సేవలు అందించిన వివిధ రంగాలకు చెందిన సుమారు 40 మంది మహిళలకు పురస్కారాలు అందజేశారు. -
సీఎస్గా జయేశ్? లేదా వికాస్?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో కీలకమైన ప్రధాన కార్యదర్శి (సీఎస్) పదవి ఎవరిని వరించనుందన్న అంశం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది, ఈనెల 31న సీఎస్గా కె.రామకృష్ణారావు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో కీలక స్థానాల్లోని 8 మంది ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల్లో నుంచి ఒకరిని సీఎం రేవంత్రెడ్డి ఎంపిక చేసుకోనున్నారు. ప్రధానంగా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్; రోడ్లు–భవనాలు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ మధ్య పోటీ ఉన్నట్లు సచివాలయవర్గాల్లో చర్చ జరుగుతోంది.వీరిద్దరిలో ఒకరిని రేవంత్రెడ్డి సీఎస్గా ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ఉన్న వారిలో శశాంక్గోయల్ (ఢిల్లీలో తెలంగాణ భవనస్పెషల్ సీఎస్), సంజయ్ జాజు (కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి), సవ్యసాచిఘోష్ (రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రమాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి), నవీన్ మిత్తల్ (ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి), దాన కిషోర్ ( కార్మిక శాఖ, గవర్నర్ స్పెషల్ సీఎస్) ఉన్నారు. వీరితోపాటు ఫార్ములా ఈ–కార్ రేసులో ముద్దాయిగా ఉన్న అర్వింద్కుమార్ కూడా ఉన్నారు. అయితే, ఇటీవలే ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. అన్నీతానై... జయేశ్ రంజన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కీలక అధికారిగా మారారు. ఏడెనిమిది సంవత్సరాలుగా ఆయన పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచి్చన తరువాత ఆయన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో సఖ్యంగా లేకపోవడం.. అన్నీ తానై వ్యవహరించడంతోపాటు కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే తాను జవాబుదారీ అన్నవిధంగా ఉండటంతో మంత్రి ఒత్తిడి మేరకు ఆయనను అక్కడ నుంచి తప్పించారు. ఆ తరువాత ‘టాస్్క’పేరిట సీఎం నేతృత్వంలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ వ్యవహారాలను అప్పగించారు. అక్కడ నుంచి తప్పించి ఆయనకు ఈ మధ్యనే పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అయితే ఆయన సీరియస్గా ఉండరన్న ప్రచారం విస్తృతంగా ఉంది. ఒక శాఖకు అధికారిగా వ్యవహరించడం వేరు.. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని వెళ్లడం వేరని ఐఏఎస్ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జయేశ్రంజన్ ఏ మేరకు సఫలీకృతం అవుతారన్నది ప్రశ్నార్థకమని అంటున్నారు. మిగిలిన వారు ఎలా..? ఇక వికాస్రాజ్ అయితే.. కాస్త ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుంది. ఇప్పటివరకు ఆయన వివాదరహితుడిగా ఉన్నారు. అదే సమయంలో చొరవ తీసుకుని అధికార యంత్రాంగాన్ని ముందుకు నడిపించిన దాఖలాలు పెద్దగా లేవని సచివాలయ వర్గాల కథనం. తెలంగాణ భవన్లో స్పెషల్ సీఎస్గా ఉన్న శశాంక్గోయల్ను పిలిచి సీఎస్ పదవిచ్చే అవకాశం లేదంటున్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా ఉన్న సంజయ్జాజు రాష్ట్రానికి రావడానికి ఇష్టపడటం లేదని సమాచారం. ఇక అర్వింద్కుమార్ సస్పెండైన నేపథ్యంలో ఆయన పేరు పరిశీలనకు వచ్చే అవకాశం లేదంటున్నారు. సవ్యసాచి ఘోష్ విషయానికొస్తే.. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కాస్త గుర్తింపు కలిగిన శాఖల ఫోకల్ పోస్టుల్లో పనిచేస్తున్నారు. ఈ మధ్యనే ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి పొందిన నవీన్మిత్తల్, దాన కిషోర్లకు సీఎస్ పదవి దక్కే అవకాశం లేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో రానున్న రెండేళ్లు ప్రభుత్వానికి కీలకం కావడం వల్ల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను జోడెద్దులుగా ముందుకుతీసుకెళ్లకలిగే అధికారికే రేవంత్రెడ్డి పట్టం కడతారని సమాచారం. -
చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి 2025 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును ప్రకటించింది. అలాగే, పైడి జయరాజ్ అవార్డుకు సహజనటుడు కమల్ హాసన్ను ఎంపిక చేసింది. ఈ మేరకు 2025 సంవత్సరం గద్దర్ చలనచిత్ర అవార్డులను జ్యూరీ శనివారం మీడియా సమావేశంలో ప్రకటించింది. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్), ఉత్తమ నటిగా రష్మిక మందన్నా (ది గర్ల్ఫ్రెండ్)ను ఎంపిక చేసింది. అలాగే, తొలి ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి, ద్వితీయ ఉత్తమ చిత్రంగా ‘దండోరా’, తృతీయ ఉత్తమ చిత్రంగా ‘ద గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో’ ఎంపికయ్యాయి. అలాగే, జాతీయ సమైక్యతను చాటే చిత్రంగా ‘తండేల్’ నిలిచింది. రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డును ప్రసాద్ ఐ మ్యాక్స్ యజమాని రమేష్ప్రసాద్కు ప్రకటించారు. పలువురు పాతతరం వారికి స్పెషల్ అవార్డులను ప్రకటించారు. ఈ పురస్కారాలను ఉగాది (ఈనెల 19న) పర్వదినాన హైటెక్స్లో ప్రదానం చేయనున్నారు. మెయిన్ స్ట్రీమ్ అవార్డ్స్ అధ్యక్షుడిగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ వ్యవహరించారు. షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ విభాగానికి కనకమేడల విజయకృష్ణ చైర్మన్ కాగా, పుస్తకాలు– సమీక్షల పరిశీలనకు తనికెళ్ల భరణి చైర్మన్గా వ్యవహరించారు. ప్రత్యేక అవార్డుల కమిటీకి తమ్మారెడ్డి భరద్వాజ అధ్యక్షుడిగా వ్యవహరించారు. జ్యూరీ 2025వ సంవత్సరానికి ఎంపిక చేసిన తుది జాబితాను ప్రజా భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, జ్యూరీ సభ్యులు తనికెళ్ల భరణి, రోజా రమణి, మణిశర్మ, ప్రగతి తదితరులు అందచేశారు. అవార్డుల ఎంపిక ప్రక్రియ, ప్రదానోత్సవ నిర్వహణపై వారు చర్చించారు. అనంతరం చలన చిత్ర అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జ్యూరీ పురస్కారాల జాబితాను ప్రకటించింది. -
Hyd: ప్రతీరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరగాల్సిందే: సీఎం రేవంత్
హైదరాబాద్: నగరాన్ని క్లీన్సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. ఈ రోజు శనివారం(మార్చి 7వ తేదీ) మున్సిపల్ కమిషనర్లతో జరిగిన సమీక్షలో సీఎం రేవంత్.. ఈ మేరకు పలు సూచనలు చేశారు. ‘నగరంలో ప్రతీరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరగాల్సిందే. కార్పొరేషన్స్ కోర్, అర్బన్ రీజియన్ పరిధిలో ప్రతీరోజు చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలి. చెత్త సేకరణకు సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ఇప్పటి నుంచే ప్రోత్సహించాలి. ఒక్కో వాహనానికి ఒక్కో ఏరియా చొప్పున కేటాయించి నిరంతరం పర్యవేక్షించాలి. నగరం పరిధి విస్తరించిన నేపథ్యంలో ఇప్పటికే కొత్తగా గుర్తించిన డంప్ యార్డులను వీలైనంత త్వరగా సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకురావాలి. కార్పోరేషన్ల వారీగా దగ్గరలోని డంపింగ్ యార్డులకు చెత్తను తరలించేలా చర్యలు తీసుకోవాలి. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పోరేషన్లలో నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్మాణ వ్యర్థాల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అపరిశుభ్రత లేకుండా చూసుకోవడంతో పాటు దోమల నివారణకు చర్యలు చేపట్టాలి. సీజనల్ వ్యాధుల విషయంలో నగరవాసులకు సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలి’ అని పేర్కొన్నారు. -
ఇలా చేస్తే తప్ప.. హైదరాబాద్లో ఇల్లు కొనలేమా?
నగరంలో రూ.45 లక్షలలోపు ధర ఉన్న ‘అఫర్డబుల్ హౌసింగ్’కు ఏటా గిరాకీ పెరుగుతూనే ఉంది. సులువైన గృహ రుణాలు, వడ్డీ రాయితీ కారణంగా కస్టమర్ల నుంచి అందుబాటు గృహాలపై ఆసక్తి పెరుగుతోంది. కానీ, భూముల ధరలు, నిర్మాణ వ్యయ భారం, కార్మికుల కొరత తదితర కారణాలతో వీటి నిర్మాణానికి డెవలపర్లు ఆసక్తి చూపించడం లేదు. దాంతో వాటి కొరత ఏర్పడింది. – సాక్షి, సిటీబ్యూరోగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకూ విస్తరించింది. ఇలాంటి తరుణంలో గ్రేటర్లో అందుబాటు గృహాల నిర్మాణం డెవలపర్లకు లాభసాటిగా లేకపోవడంతో క్రమంగా అఫర్డబుల్ హౌసింగ్ తగ్గుముఖం పట్టింది. మరోవైపు పెరిగిన ధరల నేపథ్యంలో 90 శాతం మంది ఉద్యోగ వర్గాలు ఇల్లు కొనలేని పరిస్థితి.కనీసం రూ.కోటి లేనిదే ఇల్లు రావడం లేదు. దీంతో అద్దె గృహాలకు డిమాండ్ పెరగడంతో ఓనర్లు అద్దెలను విపరీతంగా పెంచేస్తున్నారు. ఉద్యోగులు తమ సంపాదనలో దాదాపు 40 శాతం అద్దెకే వెచ్చిస్తున్నారు. రీ–డెవలప్మెంట్ అవసరం.. ముంబై తరహాలో హైదరాబాద్లోనూ పాత స్థలాలు, ప్రాంతాలను రీ–డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. పాత పౌర మౌలిక సదుపాయాలు నగరాభివృద్ధికి అత్యంత కీలకం. అందుకే ఆయా ప్రాంతాలను క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలి. రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లకు నిర్మాణ రుసుములు, పన్ను రాయితీలు, జీఎస్టీ మినహాయింపుతో ప్రోత్సహించాలి. రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గిస్తే కొనుగోలుదారులు ఉత్సాహంగా ముందుకొస్తారు. -
సీఎం రేవంత్ సమక్షంలో వందకు పైగా మావోయిస్టుల లొంగుబాటు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో 126 మంది మావోయిస్టులు.. ఆయుధాలు విడిచి సరెండర్ అయ్యారు. వీరి కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి తీసుకొచ్చారు. లొంగిపోయిన వారిలో సినీ నటుడు కాకరాల సత్యనారాయణ కుమార్తె మాధవి సైతం ఉన్నారు. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ దళం మొత్తం సరెండర్ అయ్యింది. లొంగిపోయిన వారిలో కీలక మావోయిస్టు నేత సంతోష్ ఉన్నారు. 31 ఏకే-47లతో పాటు భారీగా ఆయుధాలను అప్పగించారు సంతోష్. ఇక లొంగిపోయిన వారిలో ఏవోబీ కీలకనేత చలసాని నవత సైతం ఉన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ మావోయిస్టుల ఆయుధాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించిన తర్వాత వారితో ముచ్చటించారు. కాగా, మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్లైన్కు సమయం దగ్గర పడుతుండటంతో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది మావోయిస్టులు లొంగిపోగా, తాజాగా వందకు పైగా మావోయిస్టులు లొంగిపోవడం ఆ ఉద్యమం చివరి దశకు చేరిందనేదానికి నిదర్శనం. -
ఇల్లు కొంటే.. గేటెడ్ కమ్యూనిటీలోనే కొనాలి!
పని ఒత్తిడితో అలసిసొలసి ఇంటికి వచ్చిన ఉద్యోగికి ప్రశాంతమైన వాతావరణం.. నడిచి వెళ్లి వచ్చేంత దూరంలోనే అందుబాటులో ఉండే నిత్యావసరాలు.. పిల్లలు హాయిగా ఆకుడునేలా భద్రత.. వృద్ధుల కాలక్షేపం కోసం లైబ్రరీ.. కుటుంబ సభ్యులంతా కలిసి సంతోషంగా గడిపేలా పచ్చటి పార్కులు.. ఎలాంటి పొల్యూషన్ లేని ప్రాంతం.. ప్రస్తుతం నగరవాసులు కోరుకుంటున్నవి ఇవే.. ముఖ్యంగా కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆలోచనలు, అభిరుచులను నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లే విధంగా వాతావరణం ఉంటుంది. అలాంటి అవసరాలు తీరుస్తున్నాయి కాబట్టే ‘గేటెడ్ కమ్యూనిటీ’లకు ఆదరణ పెరుగుతూనే ఉంది. కట్టుదిట్టమైన భద్రత, ఆధునిక వసతులు మాత్రమేæకాదు.. మెరుగైన జీవనశైలి, ఆరోగ్యకర వాతావరణం, మనశ్శాంతిని అందించే కేంద్రాలే గేటెడ్ కమ్యూనిటీలు.. – సాక్షి, సిటీబ్యూరోభార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు కావడం, ఇద్దరికీ మంచి ప్యాకేజీ ఉండటం, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని స్టాండలోన్ అపార్ట్మెంట్ల నుంచి గేటెడ్ కమ్యూనిటీలకు షిఫ్ట్ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటి ధర అధికంగా ఉన్నా ఏమాత్రం ఆలోచించడం లేదు. 24/7 భద్రత, నిఘా, ఆధునిక వసతులు, మెరుగైన మౌలిక వసతులు ఉండటంతో ఈ తరహా ప్రాజెక్ట్ల లో అపార్ట్మెంట్లను కొనేందుకు మొగ్గు చూపిస్తున్నారు.తొలి ప్రాధాన్యత భద్రతకే.. ఎవరైనా సరే ఇంటిని ఎంపిక చేసే ముందు ప్రాధాన్యత ఇచ్చేది భద్రతకే. కమ్యూనిటీ లోపలికి ఎవరొస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? అనే కచి్చతమైన సమాచారం ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ గేట్ల వద్ద 24/7 భద్రతా సిబ్బంది, సీసీటీవీ కెమెరాలతో గట్టి నిఘా ఉంటుంది. నివాసితులు అనుమతిస్తే తప్ప బయటివారు లోపలికి వచ్చేందుకు వీలుండదు. దీంతో భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులైనా పిల్లలు, పెద్దలను ఒంటరిగా ఇంట్లో వదిలి వెళ్లేందుకు ఎలాంటి భయం అక్కర్లేదు. అలాగే గేటెడ్లో జిమ్, స్విమ్మింగ్ పూల్, మల్టీపర్పస్ హాల్, ఇండోర్ గేమ్స్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, ఫిట్నెస్ సెంటర్, పార్క్, యాంఫీ థియేటర్, ల్యాండ్స్కేప్ గార్డెనింగ్, స్పోర్ట్స్ కోర్ట్ క్లబ్హౌస్ వంటి సౌకర్యాలు ఉంటాయి. రిటైల్ దుకాణం, ఫార్మసీ, వెల్నెస్ సెంటర్ కూడా ఉంటాయి.సామాజిక బంధాలు.. సాధారణంగా నగరాలలో పక్కింటి వాళ్లెవరో కూడా తెలియదు అనే భావన ఉంటుంది. కానీ, గేటెడ్ కమ్యూనిటీలలో అలా కాదు. నివాసితులందర్నీ ఒక చోట చేరుస్తుంది. వాకింగ్, వ్యాయామం వంటి వేళల్లో ఒకర్ని ఒకరు కలుసుకుంటారు. పిల్లలు వారి వయస్సు స్నేహితులతో ఆడుకుంటారు. పండుగల సందర్భాలలో కమ్యూనిటీ మొత్తం సందడి వాతావరణం నెలకొంటుంది. కమ్యూనిటీ లోపల ధ్వని, వాయు కాలుష్యం ఉండదు. దీంతో నివాసితులు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో నివాసం ఉండే వీలు కలుగుతుంది.మౌలిక సదుపాయాలు.. గేటెడ్ కమ్యూనిటీలలో ప్రణాళికాబద్ధమైన మౌలిక సదుపాయాలు ఉండటం వీటి అదనపు ఆకర్షణ. వెడల్పాటి రోడ్లు, రహదారికి ఇరువైపులా చెట్లు, వృద్ధులు, పిల్లలు సేదతీరేందుకు అక్కడక్కడ బెంచ్లు, కుర్చీలు ఉంటాయి. పరిశుభ్రమైన నీటి వ్యవస్థ, భూగర్భ విద్యుత్ లైన్లు, మురుగు నీటి వ్యవస్థ ఉంటాయి. ప్రజారవాణా, మెరుగైన మౌలిక వసతులకు చేరువలో ఉంటాయి. నేటి అవసరాలకు తగినట్లు సౌర విద్యుత్, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి.అవసరాలు తీరేలా.. గేటెడ్ కమ్యూనిటీ లే–అవుట్లు కూడా ప్రతి ఇంటికీ మెరుగైన సూర్యరశి్మ, స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేస్తారు. అందుకే గేటెడ్లో ఎక్కువ స్థలం గ్రీనరీకి కేటాయిస్తారు. కమ్యూనిటీలోని వసతుల నిర్వహణకు క్రమశిక్షణ కలిగిన సిబ్బంది ఉంటారు. నేటి అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీల్లోనే కో–వర్కింగ్ స్పేస్, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు, సౌర విద్యుత్ వంటివి ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి యువతరం అభిరుచులు, అవసరాలకు తగ్గట్లు గేటెడ్ కమ్యూనిటీలను పలువురు బిల్డర్లు ఐటీ పార్క్లు, అంతర్జాతీయ స్కూళ్లు, ఆస్పత్రులకు సమీప దూరంలో గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్నారు. సాధారణంగా గేటెడ్ కమ్యూనిటీలలో అపార్ట్మెంట్ల విస్తీర్ణం 1,300 చ.అ. నుంచి ప్రారంభమవుతాయి. ఆ పరిమాణంలో ఉంటే కనీస వసతులు, జీవనశైలి కల్పించే వీలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.నగరం నలువైపులా.. కూకట్పల్లి, మదీనాగూడ, తెల్లాపూర్, నల్లగండ్ల, మియాపూర్, బాచుపల్లి, గుండ్లపోచంపల్లి, ఉప్పల్, వనస్థలిపురం, కొంపల్లి, శామీర్పేటతో పాటు ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానమై ఉన్న ప్రాంతాలలో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లు నిర్మాణంలో ఉన్నాయి. విశాలమైన స్థలం, వసతులు, నిర్వహణ చార్జీల నేపథ్యంలో గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ల ధర 20–25 శాతం ఎక్కువగా ఉంటుంది. స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్లతో పోలిస్తే గేటెడ్ కమ్యూనిటీలలో ప్రాపర్టీల విలువ 30–35 శాతం అధికంగా ఉంటుంది. డిమాండ్ కారణంగా వీటిల్లో అద్దెలు బాగానే గిట్టుబాటవుతాయి. -
త్వరలో చర్లపల్లి-నాగర్కోయల్ అమృత్ భారత్.. ప్రత్యేకత ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్ మీదుగా మరో అమృత్భారత్ రైలు పరుగు పెట్టబోతోంది. హైదరాబాద్ను కన్యాకుమారితో అనుసంధానిస్తూ ఈ రైలు ప్రారంభం కాబోతోంది. చర్లపల్లి నుంచి కన్యాకుమారి చేరువలో ఉన్న నాగర్కోయల్ మధ్య నడిచే ఈ రైలు.. ఈనెల 11న ప్రారంభం కానున్నట్టు తెలిసింది.జనవరిలో చర్లపల్లి–కేరళ రాజధాని తిరువనంతపురం మధ్య ఓ అమృత్భారత్ రైలు ప్రారంభం కావడం తెలిసిందే. దాంతోపాటే నాగర్కోయల్ అమృత్భారత్ కూడా మంజూరైంది. అయితే, అప్పట్లో దానికి రేక్ అందుబా టులో లేకపోవటంతో పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఆ ఇబ్బందిని దాటుకుని ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పటికే హైదరాబాద్ మీదుగా రెండు అమృత్భారత్ రైళ్లు, వరంగల్ మీదుగా ఒకటి నడుస్తున్నాయి. కొత్త రైలుతో తెలంగాణకు నాలుగో అమృత్భారత్, హైదరాబాద్కు మూడోదిగా ఉండనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చర్లపల్లి–ముజఫర్పూర్ జంక్షన్(బిహార్) మధ్య ఒకటి, చర్లపల్లి–తిరువనంతపురం మధ్య మరొకటి నడుస్తున్నాయి.కాగా, హైదరాబాద్–నాగర్కోయిల్ అమృత్ భారత్ రైలు ప్రయాణంలో అనేక పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు దర్శించవచ్చు. ఈ మార్గం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలను కలుపుతుంది. మదురై, రామేశ్వరం, కన్యాకుమారీ, కుర్తాలం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ఈ మార్గం సహాయపడుతుంది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం (యాదగిరిగుట్ట), భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవాలయం, తిరుమలను దర్శించుకోవచ్చు. -
సోషల్ మీడియా వల్లే నేరాలు: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : గతంలో మహిళలపై వేదింపులు పట్టణాలకే పరిమితమయ్యేవని కానీ ప్రస్తుత రోజుల్లో వాటి పరిధి పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జేఎన్టీయూ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన "స్టాండ్ విత్ హర్" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోషల్ మీడియా కారణంగానే మహిళలపై వేదింపులు పెరిగాయని సీఎం అన్నారు. నారీమణుల భద్రత కోసం కేవలం చట్టాలు చేయడం మాత్రమే కాదని వాటిని అమలు చేసి తీరాలని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని పథకాలు మహిళల పేరు మీదే అమలు చేస్తున్నామన్నారు. మహిళ సంఘాల ద్వారా ఆర్టీసీలో 1000 బస్సులు నడుపుతున్నామని రాష్ట్రం అభివృద్ధిలో దూసుకపోతుందని తెలిపారు. మహిళల భద్రత కోసం పురుషులు ముందుకు రావాలనే సందేశంతో తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. "స్టాండ్ విత్ హర్" ప్రోగ్రామ్కి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రిటైల్ ఫేమ్.. రియల్ ఎస్టేట్ బూమ్!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ల్యాండ్స్కేప్ దాని సాంప్రదాయ కేంద్రాలకు మించి విస్తరిస్తోంది. కార్యాలయ స్థలాలు, నివాస, డేటా సెంటర్లు, పారిశ్రామిక లైఫ్ సైన్సెస్తో సహా వివిధ రంగాలు వృద్ధి కేంద్రాలుగా ఉద్భవిస్తున్నాయి. ఓ వైపు పశ్చిమ, మధ్య హైదరాబాద్లో బిజినెస్ హాట్స్పాట్లు నానాటికీ పెరుగుతున్నాయి. మరోవైపు రాబోయే 3–5 సంవత్సరాలలో తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందనున్నాయని, ఇవి గ్రేడ్–ఏ ఆఫీస్ స్టాక్లో 12–15 శాతం, వార్షిక ఆఫీస్ స్పేస్ డిమాండ్లో 5–10 శాతం వాటా అందుకుంటాయని కొలియర్స్ నివేదిక పేర్కొంది. స్టార్టప్స్లోనూ టాప్.. హైదరాబాద్ వర్ధమాన వ్యవస్థాపకులకు కూడా కీలకమైన నగరంగా మారింది. 2014లో కేవలం 200 స్టార్టప్లు మాత్రమే నగరంలో ఉండగా, ఆ సంఖ్య 7,500కు పెరిగింది. ఈ పెరుగుదల నగరంలో వ్యాపార స్థలాలకు డిమాండ్ను అనూహ్యంగా పెంచేస్తోంది. అమెరికాకు చెందిన స్టార్టప్ పరిశోధన సంస్థ స్టార్టప్ జీనోమ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఆసియాలోనే స్టార్టప్లకు ఉత్తమ నగరాల్లో హైదరాబాద్ 19వ స్థానంలో నిలవడం గమనార్హం. లీజింగ్.. కింగ్.. రిటైల్, ఫ్యాషన్ వృద్ధికి దేశంలోని అగ్ర నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా మారుతోంది. కుష్మాన్– వేక్ఫీల్డ్ తాజా రిటైల్ మార్కెట్ బీట్ రిపోర్ట్ ప్రకారం, 2025 మొదటి త్రైమాసికంలో 0.8 మిలియన్ చదరపు అడుగుల స్థలం రిటైల్ లీజింగ్ను సిటీ నమోదు చేసింది. 2024తో పోలిస్తే ఇది 106 శాతం పెరుగుదల కావడం విశేషం. మొత్తం జాతీయ రిటైల్ లీజింగ్లో 34 శాతంతో నగరాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపింది. దీనిలో ఎక్కువ భాగం జీవనశైలి ఉత్పత్తుల షాపింగ్కు సంబంధించినవి, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, కొత్తపేట, కొంపల్లి వంటి కీలకమైన ప్రాంతాలలో కొలువుదీరుతున్నాయి. -
సీఎం రేవంత్ సమక్షంలో లొంగిపోనున్న మావోయిస్టులు.. గణపతిపై క్లారిటీ?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టుల ఉద్యమం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. 100 మంది పీఎల్జీఏ మావోయిస్టులు లొంగిపోతున్నట్టు సమాచారం. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం సరెండర్ కానున్నట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించనున్నారు. సీఎం సమక్షంలో ఆయుధాలతో సహా మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఈ సందర్బంగా బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు. మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటుపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. లొంగిపోతున్న వారిలో పీఎల్జీఏ బెటాలియన్ కంపెనీ కమాండర్ కొరసా లక్కు, ఉకి కల్లు, చలసాని నవత, అరుణ, సుధాకర్ ఉన్నట్టు తెలుస్తోంది. -
వ్యభిచార కేంద్రాలపై పోలీసుల దాడి
హైదరాబాద్: వేరు వేరు ప్రాంతాలలో వ్యభిచార కేంద్రాలపై దాడి చేసి పలువురిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్పల్లి సుమిత్రానగర్లోని ఓ అపార్టుమెంట్లో వ్యభిచార కేంద్రంపై గురువారం సాయంత్రం పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకురాలు (40), విటుడు రవికుమార్ (47), మరో మహిళ(47)ను అరెస్టు చేశారు. మహిళను రెస్క్యూ హోంకు తరలించి, నిర్వాహకురాలు, రవికుమార్లను రిమాండ్కు తరలించారు. అదే విధంగా అదే కాలనీలోని మరో అపార్టుమెంట్లో వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిర్వాహకురాలు (46), విటుడు శ్రీవేంద్ర వర్మ (30)లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో మహిళను (32) హోంకు తరలించారు. -
చేనేత.. అమల పలకరింత
హైటెక్ సిటీ సమీపంలోని ఇందిరా మహిళా శక్తి బజార్లో ఇండియా హ్యాండ్ మేడ్ కలెక్టివ్ (ఐహెచ్ఎంసీ), గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్) సంయుక్తాధ్వర్యంలో శుక్రవారం హస్తకళల ప్రత్యేక ప్రదర్శనను సినీనటి, జంతు హక్కుల కార్యకర్త అమల అక్కినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా చరఖాపై నూలు వడుకుతున్న ఓ మహిళతో ఆమె సరదాగా మాట్లాడారు. అర్పిత.. స్ఫూర్తి మంత్రచిన్న వయసులో జరిగిన ప్రమాదం ఆమె జీవితాన్ని అల్లకల్లోలం చేసింది. ఆ దుర్ఘటనలో రెండు కాళ్లనూ కోల్పోయినా భయపడలేదు.. ఇంతలో దెబ్బ మీద దెబ్బ అన్నట్లు తల్లిదండ్రులు కాలం చేశారు.. కానీ, బెదరలేదు.. విధిని ఎదిరించి స్ఫూర్తిగా నిలుస్తోంది కోల్కతాకు చెందిన అర్పితా రాయ్.. ఉద్యోగిగా.. యోగా శిక్షకురాలిగా రాణిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎఫ్టీసీసీఐ నిర్వహించిన కార్యక్రమంలో ప్రేరణాత్మక ప్రసంగం చేశారు అర్పితా రాయ్..కమలం.. వికసిత కాంత మహిళా శక్తి తోడ్పాటు లేనిదే వికసిత భారత్ సంకల్పం అసాధ్యం. వనితల తోడిదే అవని అని వక్తలు కొనియాడారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను నిర్వహించారు. -
యువతితో పెళ్లైన హోంగార్డు ప్రేమాయణం!
హైదరాబాద్: ఇటీవల జరిగిన మేడారం జాతరకు విధులపై వెళ్లిన ముగ్గురు పిల్లలున్న ట్రాఫిక్ హోం గార్డు అక్కడ ఓ యువతితో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడమే కాకుండా రక్షణ కోరుతూ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. వివరాలివీ... శ్రీకాకుళంకు చెందిన పొంగూరు వాసుదేవరావు(38) అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఆయనకు ఇదివరకే వివాహం అయి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లను తీసుకొని భార్య ఇటీవల తన స్వగ్రామానికి వెళ్లింది. ఏడేళ్ల కొడుకుతో వాసుదేవరావు జగద్గిరిగుట్టలో అద్దెకుంటూ అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. మేడారం జాతరకు విధులపై వెళ్లాడు. అక్కడ ఇంటర్ పూర్తి చేసుకున్న ఓ విద్యార్థిని తన తల్లి కనిపించడం లేదంటూ వాసుదేవరావు కూర్చున్న ట్రాఫిక్ బూత్ను ఆశ్రయించింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగగా గంట వ్యవధిలోనే ఆమె తల్లిని కనుగొని అప్పగించాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. హైదరాబాద్కు వచ్చిన తర్వాత తరచూ ఇద్దరూ కలుసుకునే వారు. గత నెల 25వ తేదీన వాసుదేవరావు ప్రేమించిన యువతి(25)ను అమీర్పేట్లోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో మొదటి భార్యకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. తరచూ తన కూతురు బయటికి వెళ్తుండటాన్ని గమనించిన యువతి తండ్రి ఆరా తీయగా వాసుదేవరావును ఆమె పెళ్లి చేసుకున్నట్లుగా తేలింది. ఈ విషయంలోనే తమకు రక్షణ కావాలంటూ తాను వివాహం చేసుకున్న యువతిని తీసుకొని వాసుదేవరావు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఘటన వివరాలు ఆరా తీసి విచారణ చేపట్టి ఆ యువతి మేజర్ కావడంతో హోంగార్డుతో పంపించారు. ఈ విషయంపై మొదటి భార్య నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
యువతితో అసభ్య వీడియోలు తీసిన దర్శకుడు
హైదరాబాద్: వెండితెరపై వెలిగిపోవాలని నగరానికి వచ్చిన ఆ యువతిని ఓ దర్శకుడు ట్రాప్ చేసి సినిమా షూటింగ్ పేరుతో ఆమెను కారులో కూర్చుండబెట్టుకొని అసభ్యకరమైన సీన్లు తీసి సోషల్ మీడియాలో పోస్టే చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... శ్రీకృష్ణానగర్లో నివసిస్తున్న శంకర్(25) రీల్స్తో పాటు వెబ్సిరీస్లకు దర్శకత్వం వహిస్తుంటాడు. కాకినాడకు చెందిన యువతి(23) సినిమాల్లో వేషాల కోసం హైదరాబాద్కు వచ్చి యూసుఫ్గూడలోని తన స్నేహితురాలి వద్ద ఉంటున్నది. ఇటీవల ఓ వెబ్ సిరీస్లో వేషం ఉందంటూ శంకర్ ఆ యువతిని పిలిపించుకున్నాడు. కారులో కూర్చుండబెట్టుకొని కెమెరాతో షూట్ చేయసాగాడు. అసభ్యకరమైన డైలాగ్తో పాటు ఆమె చేత అసభ్య చేష్టలతో షూటింగ్ నిర్వహించి దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో యువతి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది. ఇలాంటి వేషాలు వేస్తున్నావేంటంటూ ఆమెను ప్రశ్నించారు. ఆ వీడియో తొలగించాలని శంకర్కు చెప్పగా నిర్లక్ష్యం చేశాడు. మిగతా సోషల్ మీడియా ఖాతాల్లో కూడా ఆమె చేత పలికించిన డైలాగ్లు సన్నివేశాలను పోస్ట్ చేయడమే కాకుండా బ్లాక్ మెయిల్ చేయసాగాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు యువ దర్శకుడు శంకర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా మేలుకో.. ‘షీబాక్స్’కు చెప్పుకో!
సాక్షి, హైదరాబాద్: మహిళా భద్రత కోసం అందుబాటులో ఉన్న మరో అస్త్రం షీ–బాక్స్. పని ప్రాంతాల్లో లైంగిక వేధింపులను అరికట్టే లక్ష్యంతో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2017లో ప్రారంభించిన ఆన్లైన్ పోర్టలే ఈ షీ–బాక్స్ (సెక్స్వల్ హెరాసె్మంట్ ఎల్రక్టానిక్ బాక్స్). దేశంలో ఎక్కడ పనిచేసే మహిళలైనా, ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో ఫిర్యాదు చేసేలా దీన్ని రూపొందించారు.కాగా, 2024, ఆగస్టు 29న ఈ పోర్టల్ను మరింతగా ఆధునీకరించారు. బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతూనే, నిందితులను శిక్షించేలా ఇందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది.ప్రభుత్వ, ప్రైవేటు, వ్యవస్థీకృత లేదా అవ్యవస్థీకృత రంగాల్లో పనిచేసే మహిళలెవరైనా లైంగిక వేధింపులపై ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. దేశంలో కార్యాలయాల్లో మహిళలపై వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో, బాధితులు భయపడకుండా నేరుగా ఫిర్యాదు చేయడానికి ఈ వ్యవస్థను రూపొందించారు. 2013లో అమల్లోకి వచి్చన పోష్ యాక్ట్ (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాసె్మంట్)ను సక్రమంగా అమలు చేయడంలో ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది.బాధితులు బయటికి రావాల్సిన పనిలేకుండా ఆన్లైన్లోనే ఫిర్యాదు చేయడంతోపాటు వారి ఫిర్యాదు ఏ స్థితిలో ఉందో తెలుసుకునేందుకు పురోగతిని ట్రాక్ చేసే వీలుంటుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రతీ సంస్థ ఇంటర్నల్ కంప్లైట్స్ కమిటీ ఏర్పాటు చేయడంతోపాటు ఆ వివరాలను షీ–బాక్స్ పోర్టల్లో నమోదు చేయడం తప్పనిసరి. కాగా, అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ పోర్టల్లో ఫిబ్రవరి వరకు 1,008 ఫిర్యాదులు నమోదవగా, అందులో 105 ఫిర్యాదులు పరిష్కరించారు. షీ–బాక్స్ అంటే ఏమిటి? షీ–బాక్స్ అనేది మహిళలు ఉద్యోగ స్థలాల్లో ఎదుర్కొనే లైంగిక వేధింపులపై ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు రూపొందించిన డిజిటల్ ప్లాట్ఫాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళలు ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఎలా ఫిర్యాదు చేయాలి? ⇒ షీ–బాక్స్ పోర్టల్ https:// shebox.wcd. gov. in/ లోకి వెళ్లాలి. ⇒ కుడిచేతి వైపు ఉన్న రిజిస్టర్ యువర్ కంప్లైంట్పై క్లిక్ చేయాలి. ⇒ అందులో సూచించిన విధంగా వివరాలు నమోదు చేయాలి. ⇒ అవసరమైతే ఆధారాలు అప్లోడ్ చేయాలి. ⇒ ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత అది సంబంధిత సంస్థలోని ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ఐసీ సీ) లేదా సంబంధిత అధికారులకు పంపిస్తారు. ఫిర్యాదు చేసిన తర్వాత ఏమవుతుంది? ⇒ ఫిర్యాదు సంబంధిత శాఖకు, ప్రైవేటు కార్యాల యం అయితే సంబంధిత కార్యాలయంలోని ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి లేదా జిల్లా స్థాయి లోని లోకల్ కమిటీ (ఎల్సీ)కి పంపిస్తారు. ⇒ అనంతరం విచారణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ⇒ విచారణ ప్రారంభమైన తర్వాత గరిష్టంగా 90 రోజుల్లో విచారణ ప్రక్రియ పూర్తి చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ⇒ బాధితురాలికి ఫిర్యాదు స్థితి గురించి సమాచారం అందుతుంది. పోర్టల్లోకి వెళ్లి తమ ఫిర్యాదు ఏ స్థితిలో ఉందో తెలుసుకునేందుకు పురోగతిని ట్రాక్ చేసే వీలుంటుంది. -
టికెట్ స్కాన్ చేస్తేనే ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: రైలు టికెట్ను క్యూఆర్ కోడ్తో స్కాన్ చేస్తేనే ప్రయాణికులు రైల్వే స్టేషన్లోకి ప్రవేశించగలుగుతారు. మెట్రో రైల్ స్టేషన్లలో ఉన్న తరహా విధానం త్వరలో సికింద్రాబాద్ స్టేషన్లో ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇదే కాదు, విమాన ప్రయాణికుల లగేజీ చెకింగ్, సెక్యూరిటీ చెకింగ్ తరహాలో సికింద్రాబాద్ స్టేషన్లో కూడా పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు కాబోతోంది. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిలో భాగంగా హై సెక్యూరిటీ సిస్టం ఏర్పాటు కాబోతోంది.రాత్రి కాగానే కొందరు నిరాశ్రయులు, ఆగంతకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి వెళ్లి అక్కడ ప్రయాణికులు కూర్చునే బెంచీలపై నిద్రకు ఉపక్రమిస్తారు. కానీ, వారిని అడ్డుకునేవారుండరు. ఇక అలాంటి వారు స్టేషన్లోకి ప్రవేశించలేరు. చివరకు సెక్యూరిటీ చెకింగ్ లేకుండా స్వయంగా ప్రయాణికులు కూడా స్టేషన్లోకి వెళ్లడం సాధ్యం కాదు. అలాంటి దుర్భేద్య వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయించారు. వచ్చే నెలలో అందుబాటులోకి పదో నంబరు ప్లాట్ఫామ్ ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నా యి. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. అతి కీలక ఎయిర్ కాంకోర్స్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరాంతానికి పూర్తిస్థాయిలో అది సిద్ధం కానుంది. ఈలోపు, పదో నంబరు ప్లాట్ఫామ్ వైపు పనులు దాదాపు ముగిసినందున, వచ్చే నెల నుంచి అక్కడి వసతులను ప్రయాణి కుల వినియోగంలోకి తేనున్నారు. భద్రత వ్యవస్థ మాత్రం పనులు మొత్తం పూర్తయ్యాకే ప్రారంభం కానుంది. పదేళ్ల క్రితం దేశంలో తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో, సికింద్రాబాద్ స్టేషన్లో బ్యాగేజీ స్కానింగ్ వ్యవస్థ ప్రారంభించారు.కానీ, నిత్యం లక్షన్నర మంది ప్రయాణికులు వచ్చే చోట ఒకటి చొప్పున రెండు వైపులా రెండు చెకింగ్ సెంటర్లు మాత్రమే ఏర్పాటు చేయడంతో ప్రయాణికుల సామర్థ్యాన్ని అది తట్టుకోలేకపోయింది. దీంతో ఒకటి రెండు రోజుల్లోనే వాటిని మూసేశారు. ఇప్పుడు స్టేషన్లోకి ఎలాంటి చెకింగ్ లేకుండా ఎవరైనా వెళ్లొచ్చు. రీడెవలప్మెంట్ పనుల్లో భాగంగా ప్రస్తుతం రూ.740 కోట్ల వ్యయంతో పూర్తిగా ఆధునీకరిస్తున్నందున, విమానాశ్రయ తరహా హంగులద్దుతున్నారు. ప్రయాణికులు, వారి సంబం«దీకులు కలిపి నిత్యం లక్షల మంది స్టేషన్కు వస్తున్నారు. దీంతో భద్రత కట్టుదిట్టంగా ఉండాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒకటో నంబరు ప్లాట్ఫామ్, అటు పదో నంబర్ ప్లాట్ఫామ్ ఉండే రెండు ప్రవేశ మార్గాల్లో దాదాపు ఆరు వరకు భద్రత తనిఖీ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు.ఎలా ఉండబోతోంది?⇒ ప్రయాణికులు ముందుగా లగేజీ స్కానింగ్ చేయించుకోవాలి. వెంట తెచ్చే ప్రతి బ్యాగును ఎక్స్రే స్కానింగ్ చేస్తారు. ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ వేస్తారా? లేదా? అన్న విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు. చెక్ చేసిన తర్వాతనే లగేజీని లోనికి అనుమతిస్తారు. గంట వ్యవధిలో 30 వేల మంది వచ్చినా సరిపోయే సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ⇒ ప్రయాణికులకు సెక్యూరిటీ చెకింగ్ తప్పనిసరి. లోనికి ప్రవేశించేముందే భద్రత సిబ్బంది స్కానర్ల సాయంతో ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతారు. ⇒ లోనికి ప్రవేశించేముందు క్యూఆర్ కోడ్ సాయంతో ఆన్లైన్ టికెట్, ప్రత్యక్ష టికెట్లను స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల టికెట్ లేని వారిని నిరోధించేందుకు వీలవుతుంది. ప్రయాణికుల వెంట వచ్చే సంబం«దీకులు ఇక కచ్చితంగా ప్లాట్ఫామ్ టికెట్ కొనాల్సిందే. ⇒ పునరాభివృద్ధి తర్వాత భారీ భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయనున్నందున, సిబ్బంది సంఖ్యను కూడా భారీగా పెంచనున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు, ప్రభుత్వ రైల్వే పోలీసు సిబ్బందిని అదనంగా రిక్రూట్ చేసుకోనున్నారు. -
50 లక్షల ఓటర్లు తగ్గుతారు సర్!!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)తో భారీగా ఓటర్లు తగ్గిపోనున్నట్టు విశ్వసనీయ సమాచారం. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ‘సర్’లో ఏకంగా 50 లక్షల వరకు ఓటర్లు తగ్గిపోతారని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3.32 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత ఈ సంఖ్య 2.75 కోట్ల నుంచి 2.80 కోట్ల మధ్య ఓటర్లు ఉండే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. 2002 ఓటర్ల జాబితాతో ర్యాండమ్ మ్యాపింగ్ చేసినట్టు తెలిసింది. హైదరాబాద్, శివార్లలో దాదాపు 87 లక్షల ఓటర్లు ఉంటే.. అందులో దాదాపు 15 నుంచి 20 లక్షల ఓటర్లు, గ్రామీణ జిల్లాల్లో దాదాపు 30 లక్షల వరకు ఓటర్లు తగ్గుతారని ఎన్నికల సంఘం వర్గాల నుంచి అందుతున్న సమాచారం.ఎన్నికల సంఘం రూపొందించిన ‘డెమోగ్రఫీ సిమిలర్ ఎంట్రీస్’సాఫ్ట్వేర్ ఆధారంగా బోగస్ లేదా డూప్లికేట్ ఓట్లను తొలగిస్తారు. దేశంలో ఎక్కడైనా సరే రెండో ఓటు ఉంటే..ఈ సాఫ్ట్వేర్తో తొలగించే వీలుంటుందని అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా హైదరాబాద్లో ఎక్కువగా జిల్లాల నుంచి వచ్చి స్థిరపడినవారు. ఏపీ నుంచి వచ్చి స్థిరపడినవారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చి.. ఇక్కడ కూడా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. తమ స్వస్థలాల్లోనూ ఓటర్లుగా నమోదై ఉన్నారు. అలా రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న వారందరి ఓట్లను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో తొలగిస్తారని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.ఎస్ఐఆర్ సందర్భంగా బీఎల్ఓ ఇంటింటికి సర్వేకు వచ్చిన సమయంలో ఓటర్లు తప్పనిసరిగా భౌతికంగా ఉండాలని, ఒకవేళ లేని పక్షంలో కుటుంబ యజమాని సంబంధిత వ్యక్తికి సంబంధించి అన్ని ఆధారాలను (ప్రూఫ్స్) చూపించి సంతకం చేయాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉండే వారి ఓట్లు కనుమరుగయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. విదేశాలలో ఉన్న వారికి, రోహింగ్యాలకు ఇక్కడ ఓటు హక్కు కల్పించరు. అవసరమైతే ఎన్యుమరేటర్లు రెండుమూడుసార్లు వచ్చి మరీ తనిఖీలు చేసిన తర్వాతనే తుది జాబితాను రూపొందిస్తారు.ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ప్రతీ ఓటరు వివరాలు సేకరించి.. ఎన్యుమరేటర్ ఫామ్లో నింపిన తర్వాత ఒక ఓటరు రిసిప్ట్ కాపీ ఇస్తారని, అదే కాపీని సంబంధిత సిబ్బంది డిజిటల్ రికార్డుల్లోనూ భద్రపరుస్తారని అధికారులు చెబుతున్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఒకే ఓటరు రెండుచోట్ల ఓట్లు వేసే పద్ధతిని ఈ ఎస్ఐఆర్ ద్వారా అరికట్టడానికి వీలవుతుందని, వాస్తవంగా ఎంతమంది ఓటర్లు ఉన్నారన్న విషయంలో పూర్తి స్పష్టత వస్తుందని, డూప్లికేషన్కు ఆస్కారం ఉండదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మూడో దశలో తెలంగాణ...దేశవ్యాప్తంగా ఇప్పటికే రెండు దశల్లో పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. మూడో దశలో తెలంగాణలో చేపట్టనుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ జారీ కానున్నట్టు సమాచారం. 2002 ఎన్నికల జాబితాతో అనుసంధానం చేసిన మ్యాపింగ్ ప్రక్రియ చేస్తోంది. ఈ సమయంలో ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే ఓటు గల్లంతయ్యే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం 4 భాగాలుగా ఈ ప్రక్రియ కొనసాగనుంది. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించడం, ముసాయిదా జాబితా ముద్రణ, ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా ప్రచురణతో ఈ ప్రకియ పూర్తవుతుంది. ప్రతి ఇంటికీ నాలుగైదుసార్లు వెళ్లి వివరాలు సేకరించడం ద్వారా బీఎల్ఓలు ఎన్యుమరేషన్లో కీలక భూమిక పోషించనున్నారు.పాస్పోర్టు, రేషన్, ఆధార్ వంటి గుర్తింపు కార్డులను పరిశీలించి నిజమైన ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళతారు. తద్వారా డూప్లికేట్, చనిపోయిన, ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలస వెళ్లిన వారు, బోగస్ ఓటర్లు జాబితా నుంచి తొలగించి, వాస్తవ ఓటర్లకు మాత్రమే ఓటుహక్కు ఉండేలా ఈ ప్రక్రియను కొనసాగించాలని ఎన్నికల సంఘం ఉద్దేశం. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా అన్నది రానున్న కాలంలో తెలియాల్సిందే. -
10న బీఆర్ఎస్ వర్క్షాప్ !
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించేందుకు వర్క్షాప్నకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 10న హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టులో దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్, అసెంబ్లీ మాజీ కార్యదర్శి సదారాం తదితరులను వక్తలుగా ఆహ్వానించినట్టు తెలిసింది.ఈ వర్క్షాప్నకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ నిర్వహణ తీరుతెన్నులు, సభా నియమావళితోపాటు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, వాటిని శాసనసభ సమావేశాల్లో లేవనెత్తాల్సిన తీరు తదితరాలపై నిపుణులు సూచనలు, సలహాలతోపాటు అవగాహన కల్పిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తర్వాతి దశల్లో కింది స్థాయి నాయకులు, క్రియాశీల కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. ‘అంబేడ్కర్ విగ్రహం’పై ఉద్యమం మూసీ సుందరీకరణ పేరిట భారీ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హుస్సేన్సాగర్ తీరాన ఏర్పాటు చేసిన భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని పట్టించుకోకపోవడంపై ఉద్యమించాలని పార్టీ నిర్ణయించింది. ఈ నెల 10న ప్రారంభించే ‘అంబేడ్కర్ విగ్రహం’ఉద్యమ కార్యక్రమాన్ని వచ్చే నెల 14న జరిగే అంబేడ్కర్ జయంతి నాటికి తీవ్ర స్థాయికి తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహ ప్రాంగణాన్ని మూసివేసి సందర్శకులకు కూడా అనుమతి ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.గ్రామ, మండల, జిల్లా స్థాయి మొదలుకొని దశలవారీగా అవసరమైతే ఢిల్లీ స్థాయికి ఉద్యమం తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన సాగర హారం తరహాలో ఏప్రిల్ 14న హైదరాబాద్లోని అంబేడ్కర్ విగ్రహానికి ప్రభుత్వ ఆంక్షల నుంచి విముక్తి కల్పించాలనే డిమాండ్తో హుస్సేన్సాగర్ చుట్టూ మానవహారం నిర్వహించే యోచనలో ఉంది. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగతోపాటు వివిధ దళిత సంఘాలు, ప్రజా సంఘాల నేతలతో త్వరలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు పార్టీ నేతలు భేటీ అవుతారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆంక్షలు విధించడంపై త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ‘గ్రేటర్’లో విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు గ్రేటర్ హైదరాబాద్తోపాటు కొత్తగా ఏర్పడిన మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల పరిధిలో విస్తృతంగా పార్టీ కార్యకలాపాలు చేపట్టేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. గ్రేటర్ కార్పొరేషన్లకు మరో రెండు నెలల్లోపే ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తోన్న బీఆర్ఎస్ ఆ లోపే పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని భావిస్తోంది. కేటీఆర్ ఇప్పటికే గ్రేటర్లో ఇఫ్తార్ విందులు, ఇతర పారీ్టల నుంచి నేతల చేరికలు వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. -
ప్రపంచంలోనే గొప్ప నగరం హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్ /శంషాబాద్: ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన గొప్ప నగరంగా హైదరాబాద్ అవతరించనుందని, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, ట్రంప్, ఎలాన్ మస్క్ వంటి వారి సంస్థలు హైదరాబాద్కు రాబోతున్నాయని, ప్రపంచంతోనే పోటీపడే నగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నిర్మించిన కొత్వాల్గూడ ఎకోపార్కును ఆయన శుక్రవారం ప్రారంభించారు.బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్ ఛేంజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ భారత్ ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, శంషాబాద్ హైస్పీడ్ రైల్ టెరి్మనల్, బుద్వేల్ ట్రంపెట్, ఎకో పార్కు వంటి ప్రాజెక్టులు హైదరాబాద్ను అద్భుతమైన నగరంగా ఆవిష్కరించనున్నాయన్నారు. హైదరాబాద్ కంటే సుందరమైన నగరం దేశంలోనే లేదన్నారు. చంద్రబాబు, వైఎస్ హయాంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారని, కృష్ణా, గోదావరి నీళ్లు నగరానికి తీసుకొచ్చారని చెప్పారు. మూసీ వరదల నుంచి కాపాడుకునేందుకు నాటి నిజాం నవాబు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లను నిర్మించాడన్నారు. ఉస్మానియా ఆస్పత్రి, గోల్కొండ, అసెంబ్లీ వంటి చారిత్రక కట్టడాలు హైదరాబాద్లో ఉన్నాయని చెప్పారు. ఎంతో అందమైన హైదరాబాద్ నగరం ఆక్రమణలు, చెత్తతో నిండిపోయిందని, అలాంటి నగరాన్ని తిరిగి అందంగా, మరింత సుందరంగా చేస్తామంటే ప్రతిపక్షంలో ఉన్నవారు ఒప్పుకోవడం లేదన్నారు. మూసీ మురికిలో బతకాలని ఎవరూ కోరుకోరని, గంగా, యమున నదుల తరహాలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులు, గ్రీన్ఫీల్డ్ రోడ్లు, రేడియల్ రోడ్ల వల్ల భూములు కోల్పోయే వారికి తగిన పరిహారం అందజేస్తామని, వారికి ఎలాంటి నష్టాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ఉత్తమ ప్యాకేజీని అందజేసే బాధ్యత తానే తీసుకుంటానని సీఎం చెప్పారు. నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తుంటే కేటీఆర్ అడ్డుపడుతున్నాడని, చాలాకాలం మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి కూడా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మూసీని నైట్ ఎకానమీ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామన్నారు. పాలపిట్ట రంగులో ఉన్న ఇందిరమ్మ చీరలు ధరించిన మహిళలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు.బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్ఛేంజ్ ప్రత్యేకతలు అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.488 కోట్లు ఖర్చు చేసి ట్రంపెట్ను నిర్మించనున్నారు. ఇది ఓఆర్ఆర్ను రేడియల్ రోడ్–2తో అనుసంధానం చేస్తుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం లూపులు, ర్యాంపులు 15.36 కిలోమీటర్లు ఉంటాయి. 1.5 కిలోమీటర్ల సరీ్వస్ రోడ్ అందుబాటులోకి వస్తుంది. ఈ ట్రంపెట్లో 59 పియర్లు, 60 స్పాన్లు ఉంటాయి. ఇది భూమి నుంచి 26 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కొత్వాల్గూడ ఎకో–హిల్ పార్కు హిమాయత్సాగర్ సమీపంలో 85 ఎకరాల్లో ఎకో–హిల్పార్కును అభివృద్ధి చేశారు. ఇందులో దాదాపు 10 లక్షల మొక్కలు నాటారు. ఈ పార్కు హైదరాబాద్ నగరానికి గ్రీన్ లంగ్స్పేస్గా మారనుంది. దేశ నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించే ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద పక్షుల ఏవియరీ ఇక్కడ ఏర్పాటు చేశారు. 4.8 ఎకరాల విస్తీర్ణంలో 6,500 పక్షులకు ఆవాసంగా ఈ ఏవియరీ ఉంటుంది. పార్కులో 1.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ బోర్డ్ వాక్, 400 సీట్ల ఓపెన్ ఎయిర్ థియేటర్, సీతాకోక చిలుకల గార్డెన్, సెన్సరీ పార్కు, పిల్లల కోసం నేచురల్ ప్లే ఏరియా తదితర సదుపాయాలు ఉంటాయి. ఈ పార్కును సందర్శించడం వల్ల సింగపూర్లో పర్యటిస్తున్న అనుభూతి కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. పార్కు ప్రారంభించిన అనంతరం ఆయన అందులో కలియతిరిగారు. -
బస్సు అదుపుతప్పి.. లారీ, టిప్పర్ దూసుకెళ్లి..
అడ్డాకుల/హసన్పర్తి/చొప్పదండి: వాహనాల అతివేగం, నిర్లక్ష్యం ఏడు కుటుంబాల్లో పెను విషాదం నింపింది. రాష్ట్రంలో వేర్వేరు చోట్ల శుక్రవారం జరిగిన మూడు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి అవతలి వైపు మార్గంలో వస్తున్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందగా ఓ లారీ అతివేగంగా దూసుకెళ్తూ ముందున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఇద్దరిని బలిగొంది. అలాగే ఓ టిప్పర్ సైతం మితిమీరిన వేగంతో వెళ్తూ ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు స్నేహితులు మృతిచెందారు.తిరుపతి వెళ్తుండగా..ఎస్స్సై ఎం.వేణు, బాధితుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి 28 మంది ప్రయాణికులతో తిరుపతి బయలుదేరిన మహబూబ్నగర్ డిపో ఆర్టీసీ బస్సు 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదానికి గురైంది. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి శివారు, పొన్నకల్ స్టేజీ సమీపంలో డివైడర్ను ఢీకొని అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట నుంచి సిమెంట్ పైపులను మహబూబ్నగర్ తీసుకెళ్తున్న లారీని ఢీకొట్టింది.ఈ దుర్ఘటనలో లారీ, బస్సు క్యాబిన్లు నుజ్జునుజ్జు కావడంతో కొత్తకోట మండలం వడ్డెవాటకు చెందిన లారీ డ్రైవర్ నందిపేట రవి (35), కొత్తకోటకు చెందిన లారీ సహాయకుడు నాగన్న (38) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. క్షతగాత్రులను అంబులెన్సుల్లో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా బస్సు డ్రైవర్ పురుషోత్తం (58) చికిత్స పొందుతూ మరణించారు. మరో డ్రైవర్ రామన్గౌడ్తోపాటు 10 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో వెంకట్రామమ్మ, శాంతి, సురేశ్బాబు, శిరీష ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మిగిలిన వారు చికిత్స అనంతరం వెళ్లిపోయారు. ఇంజనీరింగ్ పరీక్ష రాసి వస్తుండగా..హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిలోని హసన్పర్తి పెద్ద చెరువు సమీపంలో శుక్రవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఇంజనీరింగ్ పరీక్ష రాసి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరి పైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మలుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటకు చెందిన షేక్ జునైద్ అక్రమ్ (21), వరంగల్ ఎల్లంబజార్కు చెందిన ఆకుతోట సుప్రతిక (21) మృతిచెందారు. వారిద్దరూ హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ సమీపంలోని ఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు.జునైద్ ఓ ప్రైవే ట్ హాస్టల్లో ఉంటూ బైక్పై కళాశాలకు రాకపోకలు సాగిస్తుండగా సుప్రతిక ఆర్టీసీ బస్సులో కళాశాలకు వెళ్లి వస్తోంది. కళాశాలలో మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతుండటంతో శుక్రవారం పరీక్ష రాశాక జునైద్ లిఫ్ట్ ఇవ్వడంతో సుప్రతిక బైక్పై ఎక్కింది. ప్రమాద తీవ్రతకు మృతదేహాలు నుజ్జునుజ్జు కావడంతో స్నేహి తులు కంట తడిపెట్టారు. మృతదేహాలను ఎంజీఎంకు తరలించారు. మృతులిద్దరూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. జునైద్ తండ్రి షేక్ జమీల్ అక్రమ్ పాన్షాపు నిర్వహిçస్తుండగా, సుప్రతిక తండ్రి ఉమామహేశ్వర్ పండ్ల వ్యాపారి.పెళ్లి వేడుకకు వెళ్తుండగా.. తమ స్నేహితుడి పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు బైక్పై వెళ్తున్న ఇద్దరిని టిప్పర్ రూపంలో మృత్యువు వెంటాడింది. ఎస్సై నరేశ్రెడ్డి కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్కు చెందిన చిలుక ప్రదీప్కుమార్ (24), తాటికొండ సాయి కిరణ్ (24) శుక్రవారం పక్కనే ఉన్న చాకుంటలో స్నేహితుడి వివాహానికి బైక్పై వెళ్తున్నారు. మరో పది సెకన్లలో మెయిన్ రోడ్డు నుంచి చాకుంట క్రాస్ రోడ్డు దాటుతామని అనుకుంటుండగా కరీంనగర్ నుంచి ధర్మారం వైపు వెళ్తున్నటిప్పర్ వెనుక నుంచి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడ్డ వారి తల మీద నుంచి టిప్పర్ వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ప్రదీప్కుమార్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, సాయికుమార్ గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. -
నేను అందరివాడిని
సాక్షి, హైదరాబాద్: బలహీనుల పక్షాన నిలబడే మొదటి వ్యక్తిగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. సామాజికంగా, ఆర్థికంగా బలహీనులుగా ఉన్న వారికి అండగా నిలిచి వారి లక్ష్య సాధన కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో భాగంగా మందకృష్ణ, సతీశ్ మాదిగ తదితరులు కలిసినప్పుడు అండగా నిలిచానన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీలో తొలి ప్రకటన చేసింది తమ ప్రభుత్వమేనని గుర్తుచేశారు.రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేసినందుకు మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ శుక్రవారం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో కృతజ్ఞత సభ నిర్వహించింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వర్గీకరణపై వడివడిగా కదిలాం.. ‘ఎస్సీ వర్గీకరణ అంశం దశాబ్దాలపాటు నలిగింది. ఎలాగైనా వర్గీకరణ సాధించాలన్న తపనతో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. ఎన్నో చిక్కుముడులు, కమిషన్లు, తర్జనభర్జనలు జరిగాయి. 20 ఏళ్లుగా ఈ సమస్యను ప్రత్యక్షంగా చూస్తూ వచ్చిన నేను మీరు కోట్లాడిన ప్రతి సందర్భంలో నా చేతనైనా సాయం చేస్తూ వచ్చా. అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు నాటి పాలకులు సండ్ర వెంకటవీరయ్య, సంపత్ కుమార్తోపాటు నన్ను సభ నుంచి బయటకు గెంటేశారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టిన ప్రజాప్రభుత్వం.. వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయడంతోపాటు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది.అలాగే వన్ మ్యాన్ కమిషన్ను నియమించి ఆ కమిషన్ నివేదిక ఆధారంగా వర్గీకరణ అమలు చేసింది. ఇలా అన్నీ వేగంగా, విజయవంతంగా పూర్తి చేశాం. వర్గీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించకపోవచ్చు. కానీ వీలైనంత వరకు పరిష్కారం చూపే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. పదోన్నతులు, ఉన్నత విద్య, లిడ్క్యాప్ భూముల పరిరక్షణ లాంటి సమస్యల పరిష్కారం పెద్ద విషయం కాదు.ప్రభుత్వం మీ సమస్యలను ముందుండి పరిష్కరిస్తున్నప్పుడు వెనుక నుంచి జరిగే దాడులను మీరే ఆపాలి. మీరే నాకు అండగా నిలవాలి. నిరంతరం అప్రమత్తంగా ఉండి సమస్యలను అర్థం చేసుకొని ముందుకెళ్లాలి’అని సీఎం రేవంత్రెడ్డి కోరారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు, బ్రాండ్ అంబాసిడర్లు అన్నీ ప్రభుత్వ ఉద్యోగులేనని.. ప్రభుత్వం తలపెట్టిన 99 రోజుల ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. మిత్రధర్మం... పేదల పక్షం... ‘మహాభారతంలో అర్జునుడు, కృష్ణుడు అందరికీ ఇష్టమే. కానీ నాకు కర్ణుడు, బార్బరికుడంటే అభిమానం. కర్ణుడు మిత్రధర్మాన్ని చివరి వరకు పాటించాడు. ఘటోత్కచుడి కుమారుడు బార్బరికుడు మాత్రం బలహీనుల పక్షాన నిలబడి పోరాడాడు. నేను కూడా బలహీనుల ఆశయ సాధన, సమస్యల పరిష్కారంలో ముందుంటా. వర్గీకరణ విషయంలో న్యాయం ఉంది. మీరు బలహీనులు కాబట్టే రాజకీయపరమైన ఒత్తిడి వచ్చినా మాదిగల పక్షాన నిలబడ్డా. నా ప్రయత్నంలో మంత్రివర్గ సహచరులు, అధికారులు సమయస్ఫూర్తి చూపి అండగా నిలబడ్డారు’అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. నా శక్తి ఉన్నంత వరకు సాయం చేస్తా.. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం పంచేందుకు భూములు లేవు. అలాగే ఆర్థిక వెసులుబాటు పరిమితంగా ఉంది. ఈ నేపథ్యంలో దారిద్య్రరేఖలో ఉన్న మాదిగ జాతి ముందుకు నడవాలంటే విద్య అవసరం. అందుకే నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికీ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు కాస్మొటిక్, డైట్ చార్జీలు పెంచాం. విద్య ఒక్కటే మీ జీవితంలో మార్పు తెస్తుంది. గత ప్రభుత్వం పేదలకు బర్రెలు, గొర్రెలు, చేపలు ఇచ్చామని చెప్పింది. చెప్పులు కుట్టుకొమ్మంది.బర్రెలు, గొర్రెలు, చేపలతో కాదు.. మీ జాతి బిడ్డలంతా కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలి. ఉన్నత స్థానాల్లోకి ఎదగాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. నా శక్తి ఉన్నంత వరకు మీకు సాయం చేస్తా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జగ్జీవన్రామ్ కుమార్తె మీరాకుమార్ ఎలా పనిచేశారో అదే స్ఫూర్తితో నేనూ పనిచేస్తా. ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు నన్ను రేవంత్ మాదిగ అన్నారు. ఇంకొన్ని పేర్లతోనూ పిలిచారు. నన్ను ఎలా పిలిచినా ఇబ్బంది లేదు.. నేను అందరి వాడిని’అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.ఎనిమిది నెలల్లోనే పూర్తి: మంత్రి దామోదర రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను 8 నెలల్లోనే పూర్తి చేసి చరిత్ర సృష్టించామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తదుపరి నిమిషమే సీఎంకు అసెంబ్లీలో సమాచారం ఇచ్చానని, వెంటనే సీఎం స్పందించి అసెంబ్లీలో ప్రకటన చేశారని.. కేవలం గంట వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తయిందన్నారు. వర్గీకరణతో ఉద్యోగాలు, విద్యలో మాదిగలకు అవకాశాలు పెరుగుతాయని.. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు సబ్ప్లాన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.గ్రూప్–1 ఉద్యోగాలు వచ్చాయి: అడ్లూరి ఎస్సీ వర్గీకరణ అమలుతో అత్యంత పేద కుటుంబాలకు గ్రూప్–1 లాంటి ఉద్యోగాలు వచ్చాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. వర్గీకరణ వల్లే 778 మందికి వైద్య విద్యలో ప్రవేశాలు, ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయన్నారు. దశాబ్దాల క్రితం కొట్లాడిన దానికి ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. -
మన టాప్ ర్యాంక్ 23
సాక్షి, హైదరాబాద్: సివిల్స్–2025 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏపీలోని కాకినాడకు చెందిన జీను శ్రీజశ్వంత్చంద్ర ఆలిండియా 23వ ర్యాంక్ సాధించగా తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన గూడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించారు. తెలంగాణకు చెందిన 20 మందికి వెయ్యిలోపు ర్యాంకులు లభించాయి.ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం తుది ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్తోపాటు కేంద్ర ప్రభుత్వ సర్విసుల్లో 1,087 పోస్టులు ఖాళీగా ఉండగా తుది ఫలితాల్లో 659 మంది పురుషులను, 299 మంది మహిళలను కలిపి మొత్తంగా 958 మందిని సివిల్స్ విజేతలుగా యూపీఎస్సీ ప్రకటించింది. టాప్ 25 ర్యాంకులు సాధించిన వారిలో 14 మంది పురుషులు ఉండగా 11 మంది మహిళలు ఉన్నారు. మొత్తం అర్హుల్లో 317 మంది జనరల్ కేటగిరీ వారుకాగా 306 మంది ఓబీసీలు, 158 మంది ఎస్సీలు, 73 మంది ఎస్టీలు, ఉన్నారు.అలాగే ఆర్థికంగా వెనుకబడిన (ఈడబ్ల్యూఎస్) విభాగం నుంచి 104 మంది ఈ జాబితాలో స్థానం సంపాదించారు. అలాగే ఐఏఎస్కు 180 మంది, ఐపీఎస్కు 150 మంది, ఐఎఫ్ఎస్కు 55 మంది, కేంద్ర సర్విసుల (గ్రూప్–ఏ)కు 507 మంది, గ్రూప్–బీ సర్విసులకు 195 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. సివిల్స్ ప్రిలిమ్స్ను 5,76,793 మంది రాయగా 14,161 మంది మెయిన్స్కు ఎంపికయ్యారు. వారిలో 2,736 మంది మాత్రమే ఇంటర్వ్యూ దశకు చేరుకున్నారు.]గతేడాదికన్నా సంఖ్య తగ్గింది సివిల్స్–2025 ఫలితాల్లో ఏపీ, తెలంగాణ అభ్యర్థుల సంఖ్య గతేడాదితో పోలిస్తే కొద్దిగా తగ్గింది. గతేడాది రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన గ్రూప్–1 పరీక్షలకు సన్నద్ధత వల్ల అభ్యర్థులు సివిల్స్పై ఎక్కువ దృష్టి సారించలేకపోయారు. విజేతల్లో ఎ క్కువ శాతం మంది ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారు, సివిల్స్ రీ–అటెంప్ట్ చేసిన వారే ఉన్నారు. తొలిసారి పరీక్ష రాసిన వారి సంఖ్య తక్కువగానే ఉంది. – వి. గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీఅనూజ్ అగ్నిహోత్రి టాపర్ రాజస్తాన్కు చెందిన అనూజ్ అగ్నిహోత్రి జాతీయ స్థాయి టాపర్గా నిలిచాడు. అనూజ్ ఎయిమ్స్ జో«ద్పూర్లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తొలి ప్రయత్నంలో ఢిల్లీ, అండమాన్–నికోబార్ దీవుల సివిల్ సర్వీసు (డీఏఎన్ఐసీఎస్)లకు ఎంపికై ప్రస్తుతం శిక్షణలో ఉన్న అతను తాజాగా మూడో ప్రయత్నంలో ఆలిండియా టాపర్గా సివిల్స్కు ఎంపికయ్యాడు. చెన్నైకి చెందిన రాజేశ్వరి సువే తన రెండో ర్యాంకు సాధించారు.అన్నా యూనివర్సిటీ నుంచి బీటెక్ చేసిన ఆమె ఐదో ప్రయత్నంలో సివిల్స్ సాధించారు. అలాగే ఢిల్లీ యూనివర్సిటీ కామర్స్ గ్రాడ్యుయేట్ ఆకాన్‡్ష ధుల్ మూడో ర్యాంక్ పొందారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన బీఏ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ భార్గవ్ ఝన్ఝన్వాలా నాలుగో ర్యాంకు సాధించగా ఢిల్లీ లా యూనివర్సిటీ నుంచి బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్) చేసిన ఇషాన్ భటా్నగర్ ఐదో ర్యాంకు పొందారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నందుకే ఈ ఫలితం: అనూజ్ సివిల్స్ ఫలితాల విడుదల అనంతరం అనుజ్ అగ్నిహోత్రి మీడియాతో మాట్లాడుతూ ‘ఈ విజయం అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తోంది. గత రెండు ప్రయత్నాల్లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని అంకిత భావంతో సన్నద్ధం కావడం వల్లే ఈ ఫలితం లభించింది’అని పేర్కొన్నాడు. మరోవైపు ఆలిండియా టాపర్గా నిలిచిన అనుజ్ అగ్నిహోత్రికి రాజస్తాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, లోక్సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా అభినందనలు తెలిపారు.ఐపీఎస్ టు ఐఏఎస్.. 23వ ర్యాంక్ సాధించిన కాకినాడకు చెందిన జీను శ్రీజశ్వంత్ చంద్ర ఐఐటీ కాన్పూర్లో బీటెక్ చేశారు. 2018లో బెంగళూరులో శామ్శాంగ్ సంస్థలో మూడేళ్లపాటు ఉద్యోగం చేశారు. సివిల్స్ కోసం ఉద్యోగానికి స్వస్తిపలికి 2020లో తొలి ప్రయత్నంలో ర్యాంక్ రాకపోయినా మరో ప్రయత్నంగా 2021లో రాసి 314వ ర్యాంక్ సాధించి పోస్టల్ శాఖలో ఉద్యోగం పొందారు. 2022లో మరోసారి సివిల్స్ రాసి ఐఆర్ఎంఎస్తోపాటు ఇండియన్ ఫారెస్ట్ సర్విసులోనూ కొలువు సాధించారు.2023లో సివిల్స్లో ఆలిండియా స్థాయిలో 162వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ ఏపీ కేడర్కు ఎంపికయ్యారు. అప్పటి నుంచీ హైదరాబాద్లోని నేషనల్ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతూనే ఐఏఎస్ కోసం 2024లో మళ్లీ పరీక్ష రాశారు. 390వ ర్యాంక్ రావడం, లక్ష్యం నెరవేరకపోవడవంతో మరింత సాధన చేసి 2025లో మరోసారి పరీక్ష రాసి 23వ ర్యాంక్తో ఐఏఎస్కు ఎంపికయ్యారు. శ్రీజశ్వంత్ చంద్ర తండ్రి మాణిక్యాలరావు కుటుంబం పిఠాపురం నుంచి జగ్గంపేట వెళ్లి స్థిరపడింది. తల్లి వరలక్ష్మి ఉపాధ్యాయిని.సింగరేణి కార్మీకుడి కుమార్తెకు 55వ ర్యాంకు సివిల్స్ ఫలితాల్లో సింగరేణి కార్మీకుడి కుమార్తె జాతీయ స్థాయిలో 55వ ర్యాంకుతో సత్తా చాటింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నారు గ్రామానికి చెందిన గుడెల్లి రాజేశం–రాణి దంపుతుల కుమార్తె గుడెల్లి సృజన ఆరో ప్రయత్నంలో విజయం సాధించింది. తండ్రి రాజేశం ఆర్జీ–3 ఏరియాలోని ఓసీపీ వన్లో జనరల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. మంథని జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశాక.. 2018లో ఢిల్లీ వెళ్లి శిక్షణ తీసుకుంది. అమ్మనాన్నల ప్రోత్సాహంతోనే.. ‘మేము ముగ్గురం పిల్లలం. ఐఏఎస్ కావాలనే నా కలను అమ్మానాన్నలు వారి కలగా మార్చుకున్నారు. నా ప్రయత్నాలను ప్రోత్సహించారు. గతేడాది ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనక్కి వచ్చా. మరోసారి ప్రతి్నంచాలని ప్రోత్సహించారు. గ్రూప్–1 రాసి డీఎస్పీగా శిక్షణ తీసుకుంటూనే మరోసారి సివిల్స్కి ప్రిపేరయ్యా. అమ్మానాన్నల మాట ఈరోజు నిజమైంది. అప్పటి కరీంనగర్ కలెక్టర్ స్మితాసబర్వాల్ను స్ఫూర్తిగా తీసుకొని సివిల్స్కు ప్రిపేరయ్యా. మహేశ్ ఎం.భగవత్ సర్ సలహాలతో ఈరోజు సివిల్స్లో మంచి ర్యాంకు సాధించా.’ఐఎఫ్ఎస్ వచ్చినా ఐఏఎస్పై గురి 103వ ర్యాంకు సాధించిన బిపుల్ గుప్తా విశాఖవాసి. ఆయన తండ్రి విశాఖ స్టీల్ప్లాంట్ బ్లాస్ట్ఫర్నేస్ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్ పవన్ కుమార్ గుప్తా. 2024 సివిల్స్ పరీక్షల్లో బిపుల్కు 368వ ర్యాంకు రావడంతో ఐఎఫ్ఎస్ అధికారిగా ఏపీ కేడర్లో చేరారు. ప్రస్తుతం డెహ్రాడూన్లో శిక్షణ పొందుతున్నారు. అయినా ఐఏఎస్ లక్ష్యంగా మళ్లీ సివిల్స్ రాసి ఇప్పుడు 103వ ర్యాంకు సాధించారు. బిపుల్ 2022లో ఐఐటీ మద్రాస్లో బీటెక్ పూర్తి చేశారు. తైక్వాండోలో బ్లాక్బెల్ట్ సాధించిన బిపుల్ గుప్తా తల్లి డాక్టర్ దీప గుప్త ప్రముఖ యూట్యూబర్. ఈసారి ఐఏఎస్ లభించే అవకాశం ఉందని బిపుల్ తెలిపారు.నాలుగో ప్రయత్నంలో 393వ ర్యాంకు సివిల్స్లో మూడుసార్లు విఫలమైనా పట్టుదలతో చదివి నాలుగో ప్రయత్నంలో 393వ ర్యాంకు సాధించారు తిరుపతికి చెందిన యారాశి తుషారికరెడ్డి. ఆమె తండ్రి వై.ఎం. గురువారెడ్డి తిరుపతి బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి, తల్లి మల్లీశ్వరి టీటీడీలో సూపరింటెండెంట్. తుషారిక చెన్నైలోని ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీటెక్ చేశారు. ప్రస్తుతం ఐఆర్ఎస్ లేదా ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ పోస్టు రావచ్చని ఆమె అంచనా వేస్తున్నారు. గ్రూప్–2తో మురిసి.. సివిల్స్లో మెరిసి శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు లక్ష్మి కుమారుడు సౌరోతు రాము సివిల్స్లో 463వ ర్యాంకు సాధించారు. రాముది సాధారణ వ్యవసాయ కుటుంబం. తండ్రి చిన్నప్పుడే చనిపోగా.. తల్లి కష్టపడి కుమారుడిని చదవించారు. ఆయన ఎన్ఐటీ వరంగల్లో బీటెక్ పూర్తి చేశారు. గత నెలలో గ్రూప్–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. ఇప్పుడు మొదటి ప్రయత్నంలోనే సివిల్స్లో ర్యాంకు కొట్టారు.నాలుగో యత్నంలో 573వ ర్యాంకు విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎల్ఎంఎం విభాగంలో జనరల్ ఫోర్మెన్గా పనిచేస్తున్న రాజబాబు, విజయలక్ష్మి దంపతుల రెండో కుమార్తె శ్వేత ఐఐటీ హైదరాబాద్లో పూర్తి చేశారు. అనంతరం రెండుసార్లు సివిల్స్ ప్రిలిమ్స్లో విఫలమైన ఆమె మూడోసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లినా అనుకున్న ఫలితం రాలేదు. నాలుగో ప్రయత్నంలో 573 ర్యాంక్ సాధించారు. ప్రజాసేవ చేయాలన్నదే తన లక్ష్యమని శ్వేత పేర్కొన్నారు. ⇒ ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన గోగుళ్ల రాజశేఖర్కు చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరమైనా సివిల్ సర్విసెస్లో 920వ ర్యాంకు సాధించారు. ఒడిశాలోని భువనేశ్వర్ ఐఐటీలో ఇంజినీరింగ్ ఎలక్ట్రానిక్స్ చదివారు. నాలుగు ప్రయత్నాల్లో విఫలమైనా కుంగిపోకుండా ఐదోసారి పరీక్షలు రాసి విజయం సాధించారు.⇒ విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొర్లాం గ్రామానికి చెందిన ప్రమోద్విష్ణు సత్తా చాటారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 640వ ర్యాంకు సాధించారు. ఆయన విజయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ⇒ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణానికి చెందిన రాఘవేందర్ పదుకొనె, మమత దంపతుల కూతురు ఇంద్రార్చిత సివిల్స్లో 627 ర్యాంకు సాధించారు.నాలుగో ప్రయత్నంలో 178వ ర్యాంకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు కాకతీయనగర్కు చెందిన బానోతు లక్ష్మీరచన సివిల్స్ ఫలితాల్లో 178వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి బానోతు వెంకటరమణ విప్రోలో ఉద్యోగి కాగా తల్లి తులశమ్మ గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. ఐఐటీ ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ తర్వాత బజాజ్ సంస్థలో అసోసియేట్ సైంటిస్ట్గా పనిచేస్తూ సివిల్స్ సాధించాలని మూడుసార్లు ప్రయతి్నంచింది. చివరకు నాలుగో ప్రయత్నంలో లక్ష్మీరచన 178వ ర్యాంకు సాధించింది. ఐఐటీ ఇండోర్లో ఆమె చదివింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సివిల్స్ సాధించాలన్న తన తండ్రి కోరిక నెరవేరలేదని.. దాంతో తనను సివిల్స్ రాయమన్నారని.. ఇప్పుడు తన తండ్రి కల నెరవేర్చినట్లయిందన్నారు.ఎంపీడీఓకు 472వ ర్యాంకుసిద్దిపేట జిల్లా మర్కూక్ మండల అభివృద్ధి అధికారి బేతి విక్రమ్ సివిల్స్లో 472 ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ విక్రమ్ మాట్లాడుతూ సాధించాలనే కృషి ఉంటే ఏదీ అసాధ్యం కాదని, తాను ఐఏఎస్ కోసం చాలా కష్ట పడ్డానన్నారు. తన కల సాకారమైందన్నారు. డిప్యూటీ కలెక్టర్కు 358వ ర్యాంకు మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామానికి చెందిన ఎం.వెంకటేశ్ ప్రసాద్ సాగర్ సివిల్స్లో 358వ ర్యాంకు సాధించారు. గతేడాది ఫలితాల్లో ఆయనకు 700వ ర్యాంకు వచ్చింది. గ్రూప్–1లోనూ సత్తా చాటిన వెంకటేశ్.. ప్రస్తుతం నల్లగొండ జిల్లా డిప్యూటీ కలెక్టర్గా ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్లో శిక్షణలో ఉన్నారు. ఆయన తండ్రి సత్యయ్య ట్రాన్స్కో ఏఈగా పనిచేస్తున్నారు. తల్లి యశోద గృహిణి. ఈసారి ఐఏఎస్ రాకపోతే మరోసారి ప్రయతి్నంచి లక్ష్యాన్ని చేరుకుంటానని వెంకటేశ్ ప్రసాద్ తెలిపారు.రెండో ప్రయత్నంలో...హైదరాబాద్లోని యాప్రాల్కు చెందిన ఆర్మీ విశ్రాంత అధికారి కల్నల్ శ్రీనివాస్, విశ్రాంత ఉపాధ్యాయిని బిందుల కుమారుడు డి.ఎస్.కె ప్రచేత్ సివిల్స్లో 193వ ర్యాంకు సాధించాడు. రెండో ప్రయత్నంలో సివిల్స్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. మద్రాస్ ఐఐటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.మూడో ప్రయత్నంలో 259వ ర్యాంకు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన శనిగరం వర్షిత్ రెడ్డి సివిల్స్లో 259వ ర్యాంక్ సాధించారు. వర్షిత్ హైదరాబాద్లోని బిట్స్ క్యాంపస్లో 2023లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కస్టమ్స్ విభాగంలో జీఎస్టీ విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా గతేడాది ఉద్యోగం సాధించి ప్రస్తుతం విజయవాడలో ఉద్యోగం చేస్తున్నారు. మూడో ప్రయత్నంలో సివిల్స్లో ర్యాంక్ సాధించారు. ఆయన తండ్రి శనిగరం నవీన్రెడ్డి వ్యాపారవేత్త, తల్లి కవితరెడ్డి.అటెండర్ కొడుకుకు 768వ ర్యాంకు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన కుమ్మరి శ్రవణ్కుమార్ సివిల్స్లో 768 ర్యాంకు సాధించాడు. ఆయన తండ్రి కుమ్మరి యాదగిరి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో అటెండర్గా పనిచేస్తుండగా తల్లి జ్యోతి ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. గ్రూప్–1లో ట్యాక్స్ ఆఫీసర్గా ఎంపికై ఉద్యోగ శిక్షణ ఉంటూనే సివిల్స్ కోసం ప్రయతి్నంచి 6వ ప్రయత్నంలో శ్రవణ్కుమార్ లక్ష్యం చేరుకున్నాడు. లక్ష్యం పెట్టుకొని చదివానని.. సమాజంలో విద్యాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పాడు.సివిల్స్లో అన్నదమ్ములకు ర్యాంకు నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన అంజిరెడ్డి, ఆలివేలు దంపతుల కుమారులు వేలిమినేటి విక్రమసింçహారెడ్డి, విజయసింçహారెడ్డి సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. విక్రమసింçహారెడ్డి 541 ర్యాంకు, విజయసింçహారెడ్డి 682 ర్యాంకు సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సోదరులిద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇటీవల జరిగిన గ్రూప్–1 పరీక్షల్లో విక్రమ్సింçహారెడ్డి 208 ర్యాంక్ సాధించి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉద్యోగంలో చేరగా విజయసింహారెడ్డి గ్రూప్–1లో 340 ర్యాంక్ సాధించి మహబూబ్నగర్లో ఎంపీడీవోగా పనిచేస్తున్నాడు.అమ్మానాన్న ప్రోత్సాహంతోనే.. అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే సివిల్స్లో ర్యాంక్ సాధించానని 748వ ర్యాంకర్ పూదరి రాహుల్ తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన పూదరి గంగలక్షి్మ–మల్లేశం దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు రాజశ్రీకి వివాహం కాగా, పెద్దకుమారుడు రవితేజ సివిల్ సర్జన్గా శిక్షణ పొందుతున్నారు. చిన్నకుమారుడు రాహుల్ సివిల్స్లో 748వ ర్యాంక్ సాధించారు. -
గచ్చిబౌలిలో పేలిన హీలియం గ్యాస్ బెలూన్
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో హీలియం గ్యాస్ బెలూన్ పేలి నలుగురికి గాయాలయ్యాయి. బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ప్రాంగణంలో అడ్వర్టైజ్మెంట్ గ్యాస్ బెలూన్ పేలింది. ఓ కన్వెన్షన్ లో హొలీ ఈవెంట్ లో అడ్వర్టైజ్మెంట్ కోసం బెలూన్ ఏర్పాటు చేశారు. అయితే అది గాలికి ఎగిరి వచ్చి బ్రహ్మకుమారీస్ ప్రాంగణంలో పడింది. దీన్ని బ్రహ్మకుమారీస్ వాలంటరీలు తీయడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా పేలింది,. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఉస్మాన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
TG: సివిల్స్ విజేతలకు సీఎం అభినందనలు
సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ 2025 ఫైనల్ ఫలితాల్లో విజయం సాధించిన తెలంగాణ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్టం నుంచి 20 మంది సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించగా వారందరినీ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.యుపీఎస్సీ నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీకి ప్రిపేరయ్యే అభ్యర్థుల్లో పేదవారు ఉంటారని గుర్తించిన ప్రభుత్వం వారికి అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా మెయిన్స్ రాసే విద్యార్థులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే గతేడాది సివిల్స్ అభయహస్తం కింద సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన 202 మంది అభ్యర్థులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. వారిలో 51 మంది ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యారు. వారందరికీ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నగదుని అందజేసింది. -
అందుకే మాదిగల వైపు నిలబడ్డా: సీఎం రేవంత్
హైదరాబాద్: చాలా కాలం నుంచి ఎస్సీ వర్గీకరణ అంశం నలుగుతోందని, ఈ అంశాన్ని 20 ఏళ్ల నుంచి గమనిస్తున్నాని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ నిర్వహిస్తున్న ధన్యవాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ మేం మాటలతో గెలవలేదు.. కమిట్మెంట్తో గెలిచాం. వర్గీకరణ అంశంలో మాదిగవైపు న్యాయం ఉంది. అందుకే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మాదిగల వైపే నిలబడ్డాను. తెలంగాణ పునర్నిర్మాణంలో మాదిగల భాగస్వాములు కావాలి. ప్రజల జీవితాల్లో మార్పు రావాలన్న బలమైన ఆకాంక్షతో 2023 ఎన్నికల్లో కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. 2023 లో మా దగ్గర అధికార యంత్రాంగం, అక్రమ సంపాదన లేదు..చాలా కాలం నుంచి ఎస్సీ వర్గీకరణ అంశం నలుగుతోంది. పోరాటంలో కొంత మంది ప్రాణాలు కూడా పోయాయి. ఎలా అయితే సాధించుకోవాలన్న తపనతో కొందరు ప్రాణ త్యాగాలు చేశారు. ఎన్నో చిక్కుముడులు, కమిషన్లు,తర్జనభర్జనలు జరిగాయి. 20 ఏళ్ల నుంచి ఈ సమస్యను ప్రత్యక్షంగా నేను చూస్తూ వస్తున్నాను. మీరు కోట్లాడిన ప్రతి సందర్భంలో నా చేతనైనా సాయం చేస్తూ వచ్చాను. క్రిష్ణ మాదిగ, సతీష్ మాదిగ నా దగ్గరకు వచ్చినప్పుడు చేతనైన సాయం చేసి అండగా నిలిచాను. అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి పాలకులు సండ్ర వెంకటవీరయ్య, సంపత్ కుమార్ తో పాటు నన్ను బయటకు గెంటివేశారు. నాకు మహాభారతంలో కర్ణుడు, బార్బరీకుడు అనే పాత్రలు ఇష్టం. కర్ణుడికి అవమానం జరిగినప్పుడు పోరాటం చేశారు.. మిత్రధర్మాన్ని నేరవేర్చాడు. నేను కూడా మిత్రధర్మాన్ని నిర్వర్తించాను.. మాదిగలకు నేను అండగా నిలబడ్డాను. నా శక్తి ఉన్నంతవరకూ మీకు సాయం చేస్తాను’ అని సీఎం రేవంత్ తెలిపారు. -
హైదరాబాద్ ఐఎండీ ఆఫీస్కు బాంబు బెదిరింపు మెయిల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వాతావరణ శాఖ (ఐఎండీ) కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. ఒక్కసారిగా ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. బేగంపేట ఆఫీస్లో 14 ఆర్డీఎక్స్ బాంబులను అమర్చినట్లు మెయిల్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. తనిఖీలు చేపట్టారు. బాంబు లేదని పోలీసుల తేల్చారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టుతో పాటు పలు జిల్లా కోర్టులకు బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.గత నెలలో రాజమండ్రి జిల్లా కోర్టులో బాంబు ఉందంటూ బెదిరింపు రావడంతో కోర్టు భవనాన్ని ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. మరోవైపు నాంపల్లి సీబీఐ కోర్డుకు, కరీంనగర్ కోర్టుకు బాంబు బెదింరింపులు రావడంతో పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. న్యాయవాదులను కోర్టు సిబ్బందిని బయిటకి పంపారు. అనంతరం డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. అయితే ఇటీవల తరచుగా కోర్టులకు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలోని ఓ కోర్టు భవనంలో బాంబు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. అంతే కాకుండా తరచుగా విద్యాలయాలకు బెదిరింపులు వస్తున్నాయి. -
Hyderabad: కొండలు కరిగించేస్తున్నారు
ఇది కొత్వాల్ గూడ పరిధిలోని రెడీమిక్స్ ప్లాంటు. పూర్తిగా 111 జీఓ పరిధిలో ఉంటుంది. ఇక్కడ నిర్మాణాలకే కాదు పరిశ్రమలకు, ప్లాంట్లకు అనుమతుల్లేవు. కానీ పలు సంస్థలు ఇక్కడ సుమారు ఇరవై వరకు ఆర్ఎంసీ ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. కళ్లముందే పెద్దఎత్తున క్వారీ తవ్వకాలు చేపడుతున్నా..క్రషర్ మిషన్లు, రెడీమిక్స్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నా పట్టించుకునే నాథుడే కరువమయ్యాడు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రేటర్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. భూముల ధరలు ఆకాశాన్నంటాయి. రియల్టర్లు ప్రభుత్వ, ప్రైవేటు భూములే కాదు వాగులు, వంకలు, ఎత్తైన కొండలు, గుట్టలను కూడా వదలడం లేదు. తక్కువ ధరకు వాటిని కొను గోలు చేసి లేక్వ్యూల పేరుతో ఎత్తైన నిర్మాణాలు చేపడుతున్నారు. వీటికి గ్రానైట్, కంకర, రోబోసాండ్ పెద్ద మొత్తంలో అవసరం ఉంటుంది. వీటి కొనుగోలుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుండటంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు పక్కనే ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లోని కొండలు, గుట్టలపై కన్నేశాయి. ఇందుకు అధికారంలో ఉన్న కొంత మంది పెద్దల సహకారం కూడా లభిస్తుండటంతో యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నాయి. పైసా ఖర్చులేకుండానే విలువైన మట్టిని తమ సైట్లోకి తరలిస్తున్నాయి. జిలెటిన్స్టిక్స్తో కొండలను పిండి చేస్తున్నాయి. అక్కడే క్రషర్ మిషన్లు, రెడీమిక్స్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, నిర్మాణాలకు అవసరమైన ముడిసరుకునంతా సమకూర్చుకుంటున్నాయి. అక్రమ మైనింగ్తో ప్రభుత్వ ఆదాయానికి పెద్దమొత్తంలో గండి పడుతోంది. ఒక్క శంషాబాద్ మండల పరిధిలోనే 20 అక్రమ ఆర్ఎంసీ ప్లాంట్లు ఉన్నట్లు అంచనా. వీటిలో ఏ ఒక్కదానికి కూడా మైనింగ్ లీజు సహా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, లోకల్ బాడీ నుంచి నిరభ్యంతర పత్రం, తెలంగాణ విద్యుత్ తనిఖీ ప్రధాన అధికారి, రెవెన్యూ శాఖల నుంచి కనీస అనుమతులు లేవంటే ఆశ్చర్య పోనవసరం లేదు. కోకాపేట్లో.. కొంత మంది తీసుకున్న అనుమతులకు భిన్నంగా తవ్వకాలు చేపడుతుంటే.. మరికొంత మంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు తవ్వకాలకు పాల్పడుతున్నారు. కనీసం లీజు అనుమతులు కూడా తీసుకోకుండా రూ.కోట్ల విలువైన సహజ సంపదను కొల్లగొడుతున్నారు. కోకాపేటలోని విలువైన ప్రభుత్వ భూమిలో పరిమితికి మించి తవ్వకాలు చేపట్టారు. మొబైల్ క్రషింగ్ ప్లాంట్కు పరి్మషన్ తీసుకుని ఫిక్స్డ్ క్రషింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేశారనే ఆరోపణలున్నాయి. 15 లక్షల క్యూబిక్ మీటర్ల మైనింగ్ చేపట్టి, ప్రభుత్వానికి కనీస ఫీజును కూడా చెల్లించడం లేదు. ఈవిషయంపై శంషాబాద్ తహసీల్దార్ రవీందర్ దత్తు మాట్లాడుతూ.. ఇప్పటికే ఐదు ప్లాంట్లను సీజ్చేశామని తెలిపారు. మిగిలిన వాటిని కూడా రెండు మూడు రోజుల్లో సీజ్ చేస్తామని వివరించారు.అక్రమ క్రషర్ మాఫియా కనిపించడం లేదా? శంషాబాద్: జీవో 111 పరిధిలో చిన్న ఇల్లు కట్టడానికి సైతం అనుమతించని అధికారులకు అనుమతులు లేని అక్రమ క్రషర్ మాఫియా ఎందుకు కనిపించడంలేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. కొత్వాల్గూడ అసైన్డ్ భూముల్లో కొనసాగుతున్న క్రషర్ ప్లాంటును ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నేతృత్వంలోని నిజనిర్ధాణ కమిటీ గురువారం మధ్యాహ్నం పరిశీలించింది. మంత్రి పొంగులేటికి కుమారుడు నగరంలో నిర్మాణం చేస్తున్న ఆకాశహరŠామ్యలకు ఇక్కడ ఉన్న రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ ద్వారానే మెటీరియల్ సరఫరా జరుగుతోందన్నారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి అడ్డగోలుగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. అక్రమ మైనింగ్లో సంబం«ధమున్న పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో గరీబోళ్ల ఇళ్లు కూల్చేసి ఆ ప్రాంతాన్ని గాజాలా మార్చారన్నారు. అక్రమ మైనింగ్ చేస్తుంటే ప్రశి్నంచని అడ్డుకోలేని పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం పెయిడ్ బ్యాచ్ కాదా అని నిలదీశారు. రాష్ట్రంలో ఏ ఒక్క కాంట్రాక్టును పొంగులేటి వదలడంలేదన్నారు. మొత్తం మీద రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు ఏఐసీసీకి ఏటీఎంలా మారిందని ఆయన ఆరోపించారు. -
జీహెచ్ఎంసీ అప్పులు మీరే కట్టండి
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు వివిధ ప్రాజెక్టుల కోసం ఆర్థిక సంస్థలు, బ్యాంకుల ద్వారా తీసుకున్న భారీ రుణాలు. మరోవైపు బల్దియాకు అధిక ఆదాయ వనరులైన ఆస్తిపన్ను, టౌన్ప్లానింగ్ ఫీజులు భారీగా తగ్గే పరిస్థితులు. ఇంకోవైపు తీసుకున్న అప్పులన్నీ జీహెచ్ఎంసీ పేరిటే ఉండటంతో అప్పులు కట్టాల్సిన బాధ్యతతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన భవనాలు ఏళ్లకేళ్లుగా ఆస్తిపన్ను చెల్లించకపోవడంతో కొండలా పేరుకు పోయిన బకాయిలు.. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ విస్తరించి మూడు కార్పొరేషన్లుగా మారింది. దీంతో కొత్త కార్పొరేషన్లు బకాయిలు కట్టే పరిస్థితిలో లేవు. జీహెచ్ఎంసీ పరిధి ఎక్కువగా ఉన్నా ఆదాయం వచ్చే అవకాశం అంతంతమాత్రమే. దీంతో మూడు కార్పొరేషన్లు మనుగడ సాగించాలంటే, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి చెందాలంటే వివిధ ప్రాజెక్టుల (ఎస్సార్డీపీ, ఎస్ఎన్డీపీ,సీఆర్ఎంపీ) కోసం తీసుకున్న అప్పుల్ని ప్రభుత్వమే చెల్లించాల్సిందిగా జీహెచ్ఎంసీ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ భవనాల నుంచి రావాల్సిన ఆస్తిపన్ను కానీ, స్టాంపుడ్యూటీ ద్వారా కానీ, వృత్తిపన్ను ద్వారా కానీ, ఇతరత్రా రూపాల్లో జీహెచ్ఎంసీకి రావాల్సిన బకాయిలేవి చెల్లించకుండా, వాటి బదులు తమ అప్పులు తీర్చాల్సిందిగా కోరింది. ఇందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తోంది. మూడు కార్పొరేషన్ల ఏర్పాటులో ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించి ప్రభుత్వం స్పెషల్ టాస్క్ఫోర్స్ కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో ఏ కార్పొరేషన్పైనా భారం లేకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ ఈమేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రుణ భారం గత ప్రభుత్వ హయాంలో నగరంలో భారీయెత్తున మౌలిక సదుపాయాలు కలి్పంచారు. అభివృద్ధి పనులు చేశారు. అందుకుగాను మున్సిపల్ బాండ్ల జారీ, వాణిజ్య రుణాలు, ఇతరత్రా వెరసి రూ.6,530 కోట్ల అప్పులు చేశారు. వడ్డీ సహా చెల్లింపులు పోను గత అక్టోబర్ వరకు మిగిలిన అప్పుల భారం రూ.4,877 కోట్లు. రాని బకాయిలు వివిధ రూపాల్లో ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి నిధులు రావడం లేదు. వాటిలో స్టాంపు డ్యూటీవే దాదాపు రూ.2,500 కోట్లు బకాయిలున్నాయి. మ్యుటేషన్ ఫీజులు రూ. 100 కోట్లు రావాల్సి ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల భవనాలకు సంబంధించిన ఆస్తిపన్ను తదితరాలు వెరసి వేల కోట్లు రావాలి. ఇవేవీ రాకపోవడంతో జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. అయినప్పటికీ నెలనెలా సిబ్బంది జీతాలకు దాదాపు రూ.120 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి.వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని జీహెచ్ఎంసీ ఈ విజ్ఞప్తి చేసింది. మూడు కార్పొరేషన్లలో జనాభా, మౌలిక వసతులు, ఆదాయ మార్గాలను పరిగణనలోకి తీసుకోవాలని ఒక ఆలోచన చేశారు. కానీ, అప్పుల భారం ఉంటే ప్రగతి ముందుకు సాగదని, అభివృద్ధి ఆగిపోగలదని భావించి ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. అప్పులన్నీ జీహెచ్ఎంసీ పేరిటే ఉన్నాయి ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాగలదని ఆశిస్తున్నారు.‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక’ నేటినుంచేనగర కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం అమలులో నగరంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. తద్వారా రాబోయే కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలుపు కోసం బాట వేయవచ్చనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదటి వారం నగరంలోని మూడు కార్పొరేషన్ల పరిధిలో పర్యటించనున్నట్లు తెలిసింది. గ్రేటర్ నగరం మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటైన నేపథ్యంలో వీటి పరిధిలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. తొలిరోజు అగ్రసేన్ మహరాజ్ జంక్షన్, చాచానెహ్రూ పార్కు, పబ్లిక్హెల్త్ ఇంజినీరింగ్ కార్యాలయం, కొత్వాల్గూడ, ఉప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాల్లో పర్యటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. మూడు కార్పొరేషన్ల అధికారులు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ఎక్కువగా చెత్త తరలింపు వంటి పనులకు ప్రాధాన్యమిచ్చారు. నగరానికి ప్రాధాన్యం ఎందుకు ? రాజధాని హైదరాబాద్ మూడు కార్పొరేషన్లుగా మారడంతో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కలి్పంచవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. మూడు కార్పొరేషన్లు ప్రస్తుతం స్పెషలాఫీసర్ పాలనలో ఉన్నాయి. జరగబోయే ఎన్నికల్లో మూడింట రెండు కార్పొరేషన్లను గెలుచుకోవాలనేది అధికార పార్టీ ఆలోచన కాగా, ఒక కార్పొరేషన్ను మిత్రధర్మంగా ఎంఐఎంకు వదిలేశారనే ప్రచారం ఇప్పటికే మొదలైంది. మూడుకార్పొరేషన్ల ఎన్నికలూ ఒకేసారి జరుగుతాయా, లేక వేర్వేరుగానా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
ఇక ఈ–ఆఫీస్ పాలనే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై పరిపాలన అంతా నూరు శాతం ఆన్లైన్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టం (ఓఎఫ్ఎంఎస్) ద్వారానే కొనసాగనుంది. ఈ నెల 15 నుంచి ఓఎఫ్ఎంఎస్ విధానంలోనే పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మాన్యువల్ పద్ధతిలో వచ్చే ఫైళ్లను ఎట్టిపరిస్థితిలోనూ ఆమోదించబోమని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రాయి రవి అన్ని శాఖలకు మెమో జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తుండగా ఆర్థిక శాఖ కూడా యుద్ధప్రాతిపదికన అమలుకు నిర్ణయించింది. తాజా ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ పూర్తిస్థాయిలో ఈ–ఆఫీస్లుగా అవతరించనున్నాయి. ప్రతి ఉద్యోగికి ప్రత్యేక లాగిన్...: రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం కాగితాలతో కూడిన ఫైళ్లను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర కార్యాలయాల్లో కొన్నింటిని డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తీసుకువచి్చనప్పటికీ అర్జీలతో కూడిన వాటిని కాగితాల్లోనే నిర్వహిస్తున్నారు. కానీ ఇకపై కాగితాలతో కూడిన ఫైళ్లకు తప్పనిసరిగా స్వస్తి పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు ప్రతి అంశం ఆర్థికశాఖతో ముడిపడి ఉండటంతో ఫైళ్ల నిర్వహణ ఆన్లైన్ ఫైల్ మేనేజ్మెంట్ విధానంలోకి మార్పు చేయాల్సిందే. ప్రజల నుంచి లేదా ఉద్యోగుల నుంచి వచ్చే వినతులు కాగితాల్లో వస్తే వాటిని వెంటనే స్కాన్ చేసి డిజిటల్ రూపంలోకి మార్చాకే ఫైలును ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్ఎంఎస్ విధానంలో భాగంగా శాఖలవారీగా ప్రతి ఉద్యోగికి త్వరలో ప్రత్యేకంగా లాగిన్ ఐడీలను కేటాయించనున్నారు. ఆన్లైన్ విధానం ద్వారా ఫైళ్ల నిర్వహణ సమయం తగ్గడంతోపాటు పారదర్శకత పెరగనుంది. ఒకవేళ ఫైలు నిర్వహణలో జాప్యం జరిగినా ఉన్నతాధికారులకు తెలియడంతోపాటు కారణాలను తెలుసుకొని చర్యలు తీసుకొనే వీలుంటుందని.. ఫలితంగా జవాబుదారీతనం మరింత మెరుగవుతుందని సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. -
ఎస్ఐఆర్కు వేగంగా కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)కు ఎన్నికల సంఘం కార్యాచరణ వేగవంతం చేసింది. ఏప్రిల్ రెండో వారం నుంచి ఈ ప్రక్రియ చేపట్టనున్న నేపథ్యంలో ఓటర్ల ఎన్యూమరేటర్ల నుంచి సేకరించాల్సిన డేటాకు సంబంధించిన ఫారాల ముద్రణ, బీఎల్ఓలకు శిక్షణ, వారికి అవసరమైన కిట్స్ పంపిణీ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. ఈ టెండర్ల ఆర్థిక బిడ్స్ను శుక్రవారం తెరవనున్నారు. ఆ తరువాత కాంట్రాక్టర్లకు ఆ బాధ్యత అప్పగిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం 3.36 కోట్ల మంది ఉన్నారు. మూడో దశ కింద 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ కోసం ఏప్రిల్ మొదటివారంలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ ప్రక్రియ చేపట్టడానికి అవసరమైన ప్రీ ఎస్ఐఆర్ ర్యాండమ్ పరిశీలన కొనసాగుతోంది. రాష్ట్రంలో ఉన్న 3.36 కోట్ల మంది ఓటర్ల దగ్గరకు వెళ్లి పోలింగ్ కేంద్ర అధికారులు(బీఎల్ఓ)లు పరిశీలన జరుపనున్నారు. ప్రీ ఎస్ఐఆర్ కసరత్తులో భాగంగా జరుగుతున్న ఫీల్డ్ సర్వే వివరాలు వచ్చేనెల మూడవ వారం నుంచి మొదలయ్యే అసలు ప్రక్రియకు దోహదపడనుంది. నోటిఫికేషన్ వచ్చే నాటికి... ఎస్ఐఆర్ నోటిఫికేషన్ వెలువడే నాటికి ఎన్యూమరేటర్ ఫామ్ల ముద్రణ, బీఎల్ఓలకు కిట్ల తయారీ పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కసరత్తు చేస్తున్నారు. నిర్వాచన్ సదన్ నుంచి వచ్చే మార్గదర్శకాలు, ఆదేశాలకు అనుగుణంగా ఒక వారమంతా బీఎల్ఓలకు తుది దశ శిక్షణను ఇవ్వనున్నారు.బీఎల్వోలు పూర్తి చేసే ఎన్యుమరేటర్ ఫారాల్లో ఒకటి ఓటర్కు ఇవ్వడం, ఒకదాన్ని ఎన్నికల సంఘం తన వద్ద రికార్డు చేయనుంది. క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలు, సందేహాలు, కొత్త గైడ్లైన్స్ మీద ఈసీ, సీఈఓ అధికారులు వాళ్లకు అవగాహన కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ పూర్తై, తుది జాబితా వెలువడటానికి నాలుగు నెలలు పట్టే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 350 ఓటర్లు.. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 350 మంది ఓటర్ల వివరాలను బూత్ లెవెల్ ఆఫీసర్లు నమోదు చేయనున్నారు. ప్రతీ 10 మంది బీఎల్ఓలకు ఒక సూపర్వైజర్ ఉంటారు. రోజూ సేకరించిన సమాచారాన్ని ఓటర్లు ఎన్యూమరేషన్ ఫామ్లలో భర్తీ చేసిన తర్వాత ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ రూపంలోకి అప్లోడ్ చేస్తారు. మండలస్థాయిలో తహసీల్దారు అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా. ఈఆర్వోగా రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు ఉంటారు. జిల్లాస్థాయిలో ఎలక్షన్ ఆఫీసర్గా కలెక్టర్ వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని మొత్తం 37 వేల పోలింగ్ కేంద్రాల బీఎల్ఓలు, మరో 15 వేల మంది అసిస్టెంట్ బీఎల్ఓలు, సూపర్వైజర్లు.. ఇలా దాదాపు 60 వేల మంది సిబ్బందిని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియలో పాల్గొననున్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు సేకరించిన వివరాల తర్వాత ఓటర్ల పేర్లు గల్లంతైనా, నమోదు కాకపోయినా, పేర్లతో పాటు అడ్రస్ గల్లంతు అయిన వారి ఫిర్యాదులు, అభ్యంతరాలు, అభిప్రాయాలను తీసుకుని పరిష్కరించడానికి నెల రోజుల గడువులోగా పూర్తి చేస్తారని సమాచారం, వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని పరిష్కరించిన తరువాతనే తుది జాబితా సిద్ధం చేస్తారు. ఈ ఏడాది సెపె్టంబరు నాటికల్లా ఓటరు జాబితా వెలువడే అవకాశం ఉంది. అర్హత కలిగినవాళ్ల పేర్లు జాబితాలో యధావిధిగా ఉంటాయని, సమగ్రమైన వివరాలు, నిర్దిష్టమైన ప్రూఫ్ లేనివాళ్లు మాత్రం లిస్టులో నుంచి తొలగిస్తారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
డిండి.. ‘ఏదుల’ గండి
సాక్షి, హైదరాబాద్: ఏదుల రిజర్వాయర్లో నీటిమట్టం కనీసం 440 మీటర్లు ఉన్నప్పుడే డిండి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు నీటిని తరలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ సిఫారసు చేసింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుంచే డిండి ఎత్తిపోతల పథకానికి సైతం నీటిని తరలించడానికి అనుమతిస్తూ గతేడాది జనవరి 22న నీటిపారుదల శాఖ జీఓ 10 జారీ చేసింది. ఏదుల రిజర్వాయర్లో 336 మీటర్లు నీటిమట్టం నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించడానికి పనులు చేపట్టాలని అప్పట్లో కోరింది. గత నెల 6న నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) నేతృత్వంలోని కమిటీ డిండి ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నిల్వలు 440 మీటర్లు ఉంటేనే... ఏదుల రిజర్వాయర్లో కనీసం 437.375 మీటర్ల నీటి మట్టం ఉంటేనే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నుంచి వీరాంజనేయ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు నీటిని తరలించాలని గతంలో అనుమతులిచ్చారు. ఏదుల జలాశయ గరిష్ట నీటినిల్వ మట్టం (ఎఫ్ఆర్ఎల్) 445 మీటర్లు కాగా, గరిష్ట నిల్వ సామర్థ్యం 6.59 టీఎంసీలు. జలాశయంలో 440 మీటర్ల మట్టంతో 4.16 టీఎంసీలు, 437 మీటర్ల మట్టంతో 3.04 టీఎంసీల నిల్వలు, 436 మీటర్ల మట్టంతో 2.72 టీఎంసీల నిల్వలు ఉంటాయి. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించడానికి నిర్మిస్తున్న కాల్వ అడుగు (బెడ్ లెవల్) 21.643 కి.మీ.ల వద్ద 421.45 మీటర్ల మట్టాన్ని కలిగి ఉండగా, ప్రతిపాదనల ప్రకారం ఏదులలో 436.41 మీటర్ల మట్టం నుంచి నీటిని తరలించాల్సి ఉంది. డిండి ఎత్తిపోతలకు నీటిని తరలించడానికి ఏదుల రిజర్వాయర్లో ఉండాల్సిన నీటిమట్టం, డిండి ప్రాజెక్టు కాల్వ లోతు మధ్య 4.9 మీటర్ల వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో డిండి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలించడానికి ఏదుల రిజర్వాయర్లో ఉండాల్సిన కనీస నిల్వ మట్టాన్ని 440 మీటర్లకు పెంచాలని ఈఎన్సీ(జనరల్) నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.ఏదుల రిజర్వాయర్ను 440 మీటర్లకు నింపడానికి కేవలం 2 రోజులే పడుతుందని, దీని వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేసింది. ఏదులలో 440 మీటర్ల స్థాయిలో నిల్వలున్నప్పుడే డిండి, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలని సూచించింది. ఈ మేరకు రెండు ప్రాజెక్టుల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరింది. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున మొత్తం 90 టీఎంసీలను తరలించడానికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మిస్తుండగా, రోజుకు 0.5 టీఎంసీల చొప్పున మొత్తం 30 టీఎంసీలను తరలించుకోవడానికి డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. డిండి ఎత్తిపోతల పథకం ద్వారా నాగర్కర్నూల్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని 21 మండలాల పరిధిలో 3.61 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించారు. ఏదుల రిజర్వాయర్ నీటిమట్టం 440 మీటర్లకు చేరినప్పుడే డిండి ఎత్తిపోతలకు నీటిని విడుదల చేయాలని నీటిపారుదల శాఖ తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినట్టు మునుగోడు కాంగ్రెస్ నేత ఐలయ్య ‘సాక్షి’కి తెలిపారు. -
తొలిసారి నాన్నా అంటున్నా..
సాక్షి, హైదరాబాద్/జగిత్యాల: ‘తండ్రి ప్రేమ తెలిసిన వాని మాటలు ఒకలా ఉంటాయి. తెలియని వాని మాటలు మరోలా ఉంటాయి. కానీ తండ్రి కోసం ఎదురు చూసే నాలాంటి వాని భావాలు ఎలా ఉంటాయి? మనం కలిసి ఉంటే బహుశా ‘నాన్నా’అని ఇప్పటికి కొన్ని లక్షల సార్లు మిమ్మల్ని పిలిచి ఉండేవాడిని. కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని ‘నాన్నా..’అని సంబోధిస్తూ మొదలు పెడుతున్నాను..’అంటూ గణపతి కుమారుడు శ్రీనివాసరావు పేరిట ఓ ఆడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగుబాటుపై చర్చ జరుగుతున్న సమయంలో ఇలా ఆడియో విడుదల కావడం చర్చకు దారి తీసింది. ఎంతో భావోద్వేగంతో 4.18 నిమిషాల నిడివితో ఉన్న ఈ ఆడియోలో అనేక విషయాలు ప్రస్తావించారు. ఒకప్పటి పరిస్థితులతో పోలి్చతే ఇప్పటి పరిస్థితులకు చాలా మార్పే ఉందని, నేటి తరానికి మార్గనిర్దేశనం చేసేందుకు రావాలంటూ తన అభిలాషను బయటపెట్టారు. కాగా ఈ ఆడియో గణపతి కుమారుడిదేనని ఓ పోలీస్ ఉన్నతాధికారి నిర్ధారించారు. ఆ ఆడియోలో ఏముందంటే.. అమ్మ కన్నీటితో ఎన్ని మెత్తలు తడిచిపోయాయో.. ప్రతి కుటుంబం చిరునవ్వు వెనక కనబడని ఒక గొప్ప తండ్రి కష్టం దాగి ఉంటుందని పెరిగే కొద్దీ అర్థమైంది. ఆ విషయంలో నాకు తండ్రి లేని లోటును తెలియకుండా అన్నీ తానై పెంచింది నన్ను కన్నతల్లి. అమ్మా నీకు వందనం. మీరు ఎంచుకున్న గమ్యం వైపు అడుగులు వేస్తూ అజ్ఞాన జీవితం ప్రారంభించాక అమ్మ కన్నీటితో ఎన్ని మెత్తలు తడిచిపోయాయో తెలియదు. ఏ బట్ట కట్టిందో.. ఏ తిండి తిన్నదో కూడా ఎవరికీ తెలియదు. సమాజానికి ఎదురుపడలేక ఇంటి గడప దాటలేదు. నన్ను పెంచుకుంటూ తన బాధను మరిచింది. నాకు తెలిసి అమ్మ పుట్టినప్పటి నుంచి ఏ సుఖమూ అనుభవించలేదు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా తన ధైర్యాన్ని కోల్పోకుండా పోరాడుతూనే ఉంది. నాన్నా మీరు ఎంచుకున్న సిద్ధాంతాన్ని ప్రశ్నించడం లేదు. మంచో, చెడో మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేయడం అంటే అది ఆత్మార్పణమే.. ఇది నా అభిలాష ఓ మారుమూల గ్రామంలో ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మీరు మీకున్న మేధాశక్తితో పన్నెండు రాష్ట్రాలకు మీ సామ్రాజ్యాన్ని విస్తరించి, మీ బంధాల్లో సేవ చేస్తూ మావోయిజం అంటే గణపతి, గణపతి అంటే మావోయిస్టు అనేంతగా ఎదిగి సమాంతర ప్రభుత్వం నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. సమాజంలో అంతర్గతంగా సమస్యలు చాలానే ఉండవచ్చు. కానీ నేటితరం ఎంతో అవగాహనతో ఉంటూ సామాజిక మార్పులకు అనుగుణంగా ప్రపంచంతో అనుసంధానమై ఉంటున్నారు. నేటి తరం యువతలో దాగి ఉన్న ప్రతిభకు, నైపుణ్యాలకు మీవంటి వారి విజ్ఞానం, అనుభవం మార్గదర్శకాలుగా తోడైతే మన దేశం అన్ని రంగాలలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ఓ కొత్త నవభారతాన్ని నిర్మిస్తారని నా నమ్మకం. మీకు చెప్పగలిగే స్థానంలో నేను లేకపోవచ్చు. కానీ ఇది నా అభిలాష. -
విద్యార్థి నేత నుంచి తెలంగాణ గవర్నర్ దాకా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ నూతన గవర్నర్గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆయన దశాబ్దాలపాటు బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా, రాష్ట్రాల గవర్నర్ స్థాయికి ఎదిగారు. 1952 ఏప్రిల్ 1న యూపీలోని గోరఖ్పూర్లో జని్మంచిన ఆయన.. దీన్దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్పూర్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో (ఎల్ఎల్బీ) పట్టా పొందారు. ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి 19 నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. 1989లో తొలిసారి గోరఖ్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఆ తర్వాత 1991, 1993, 1996లలోనూ వరుస విజయాలు సాధించారు. యూపీ ప్రభుత్వంలో కళ్యాణ్ సింగ్, రాజ్నాథ్ సింగ్, రామ్ ప్రకాష్ గుప్తాల కేబినెట్లలో జైళ్లు, గ్రామాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. 2016లో యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.2017లో ప్రధాని మోదీ కేబినెట్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. పాలనాపరమైన అనుభవం, వివాదరహితుడిగా ఆయనకు పేరు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 2023 ఫిబ్రవరిలో హిమాచల్ ప్రదేశ్ 29వ గవర్నర్గా నియమించింది. అక్కడ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించిన ఆయన్ను తాజాగా తెలంగాణ గవర్నర్గా బదిలీ చేసింది. -
మరోసారి ప్రజల్లోకి ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి మరోసారి ప్రజల్లోకి వెళ్తోంది. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’పేరిట 99 రోజుల కార్యాచరణతో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల్లోకి వెళ్లనున్నారు. సీఎం రేవంత్రెడ్డి 10 థీమ్స్తో 99 రోజుల కార్యాచరణను ప్రకటించిన సంగతి విదితమే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ తరహా కార్యక్రమం చేపట్టడం ఇది మూడోసారి. గత రెండు విడతల్లో వచ్చి న ఆర్జీలతో రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, రైతు భరోసా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలను అమలులోకి తెచ్చి ంది. ఇప్పుడు ‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక’పేరుతో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రకటించింది. పౌర సేవలు, ప్రజల అవసరాలతో మమేకమై ఉండే అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వ హించనుంది. ఈమేరకు ప్రభుత్వం గురువారం ఒక ప్రకటన విడు దల చేసింది. ఐదు స్థాయిల్లో : గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదు స్థాయిల్లో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో పారిశుధ్యంతోపాటు పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయనుంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను ఇందులో భాగస్వాములను చేసింది. మండలాలు, జిల్లా కేంద్రాల్లో వివిధ శాఖల అధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనుంది. అన్ని స్థాయిల్లోనూ గ్రామ సర్పంచి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసేలా మార్గదర్శకాలను రూపొందించింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో వస్తున్న సంస్కరణలు, వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటళ్లను తీర్చిదిద్దే ప్రణాళికను సర్కారు ప్రజలకు వివరించనుంది. అలాగే, సోలార్ విద్యుత్తు వినియోగం పెంచటం, సోలార్ విద్యుత్తు ఉత్పత్తి ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ఉన్న మార్గాలను ప్రజలకు, రైతులకు తెలియజేయనుంది. యువతకు నైపుణ్యాల శిక్షణతోపాటు ఉపాధి కల్పించే కార్యక్రమాలను ఈ యాక్షన్ ప్లాన్లో పేర్కొంది, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహించి.. లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందిరా మహిళా శక్తి సాధిస్తున్న విజయాలను, కొత్తగా వ్యాపారాభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించనుంది.కార్యాచరణ ఇలా...1వ వారం – గ్రామీణాభివృద్ధి (మార్చి 30 నుంచి ఏప్రిల్ 4) 2వ వారం – ఆరోగ్య రంగం (ఏప్రిల్ 6 నుంచి 11) 3వ వారం – అరైవ్–అలైవ్ (ఏప్రిల్13 నుంచి 18) 4వ వారం – సంక్షేమం (ఏప్రిల్ 20 నుంచి 25) 5వ వారం – పిల్లల భద్రత, డ్రగ్స్ అడ్డుకట్ట (ఏప్రిల్ 27 నుంచి మే2) 6వ వారం – రైతు సంక్షేమం (మే 4 నుంచి 9) 7వ వారం – విద్య (మే 11 నుంచి 16) 8వ వారం – యువత, క్రీడలు (మే 18 నుంచి 23) 9వ వారం – మహిళా సంక్షేమం (మే 25 నుంచి 30) 10వ వారం – పర్యావరణం (జూన్ 1 నుంచి 6) -
ఘనంగా భట్టి తనయుని వివాహం
సాక్షి, హైదరాబాద్ : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య–సాక్షిల వివాహం శంషాబాద్ జీఎంఆర్ ఏరీనాలో గురువారం ఘనంగా జరిగింది, వధూవరులను ఆశీర్వదించడానికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సహా పలువురు సీనియర్ రాజకీయ నాయకులు, సినీ తారలు వచ్చారు. వారందరినీ డిప్యూటీ సీఎం ఆప్యాయంగా పలకరించారు. వివాహ వేడుకకు హాజరైనవారిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్రావు, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎంపీ సంతోశ్కుమార్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ ప్రముఖుల్లో చిరంజీవి, నాగార్జున, శ్రీకాంత్, తనికెళ్ల భరణి, పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ సీనియర్ అధికారులు ఉన్నారు. -
కీలక పోస్టింగ్లన్నీ ఇన్చార్జ్లతోనే
సాక్షి, హైదరాబాద్: పోలీస్శాఖలోని కీలక పోస్టులను ఇన్చార్జ్లతో నెట్టుకొస్తున్నారు. కొందరు అధికారులు రెండు అంతకంటే ఎక్కువ విభాగాల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇలా ఇన్చార్జ్ బాధ్యతల్లో ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా 14 మంది ఐపీఎస్లు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపు కోటాను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 83 మంది ఐపీఎస్లు ఉన్నారని, ఆ సంఖ్యను 105కు పెంచాలన్నారు. పెరుగుతున్న పనిభారం నిరంతర పర్యవేక్షణ అవసరమయ్యే కీలక శాఖలకు ఉండే అధికారులకు ఇతర విభా గాల బాధ్యతలు అప్పగించడంతో వారిపై పనిభారం పెరుగుతోందన్న భావన వ్యక్తమవుతోంది. కొందరు ఐపీఎస్ అధికారుల వద్దే అత్యంత కీలక శాఖలతోపాటు ఇతర విభాగాలు ఉండడంతో పనిభారంతోపాటు పర్యవేక్షణ కొరవడుతుందన్న వాదనా వినిపిస్తోంది. తెలంగాణ పోలీస్శాఖ అధికారిక వె బ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం..ప లు విభాగాలకు ఇన్చార్జ్లుగా కొనసాగుతు న్న ఐపీఎస్ అధికారులు వివరాలు చూస్తే.. ⇒ బి.శివధర్రెడ్డి డీజీపీ కోఆర్డినేషన్, హెడ్ఆఫ్ పోలీస్ ఫోర్స్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ⇒ డా.సౌమ్యా మిశ్రా జైళ్ల శాఖ డీజీ, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగ కమిషనర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ⇒ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా ఉన్న శిఖాగోయల్కు టీజీ సైబర్ సె క్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు, టీజీఎఫ్ఎస్ఎల్ ఇ న్చార్జ్ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. ⇒ మరికొన్ని కీలక విభాగాలు చారుసిన్హా పర్యవేక్షిస్తున్నారు. సీఐడీ అడిషనల్ డీజీతోపాటు మహిళా భద్రత విభాగం, భరోసా అడిషనల్ డీజీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు, ఏసీబీ డైరెక్టర్ జనరల్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లోనూ చారుసిన్హా కొనసాగుతున్నారు. ⇒ మరో సీనియర్ ఐపీఎస్ అధికారి వీవీ శ్రీనివాసరావుకు అడిషనల్ డైరెక్టర్ టెక్నికల్ సరీ్వసెస్, టీజీఎల్పీఆర్బీ చైర్మన్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు, ఇన్చార్జ్ అడిషనల్ డీజీ ట్రైనింగ్గా బాధ్యతలు అప్పగించారు. ⇒ అడిషనల్ డీజీ ఆర్గనైజేషన్, హోంగార్డ్స్, అడిషనల్ డీజీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో స్వాతిలక్రా ఉండగా, శాంతిభద్రతల అడిషనల్ డీజీ మహేశ్ భగవత్కు అడిషనల్ డీజీ లీగల్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు, టీజీ పిక్స్ ఇన్చార్జ్ ఎండీగా సైతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ⇒ అడిషనల్ డీజీ పర్సనల్, మల్టీజోన్–2 అడిషనల్ డీజీగా దేవేంద్రసింగ్ చౌహాన్ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ⇒ సంజయ్కుమార్ జైన్ అడిషనల్ డీజీ తెలంగాణ బెటాలియన్స్, పీటీఓ హైదరాబాద్ ఇన్చార్జ్గా, షానవాజ్ ఖాసిం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్శాఖ డైరెక్టర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ⇒ ఎం శ్రీనివాసులు అడిషనల్ కమిషనర్ క్రైం హైదరాబాద్ సిటీ, డిటెక్షన్ డిపార్ట్ మెంట్ (డీడీ) ఇన్చార్జ్ డీసీపీగా, తఫ్సీర్ ఇక్బాల్ హైదరాబాద్ సిటీ జాయింట్ కమిషనర్ శాంతిభద్రతలు, హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ అడ్మిన్గా ఇన్చార్జ్గా, ఎల్ఎస్ చౌహాన్ డీఐజీ జోగుళాంబ జోన్, డీఐజీ చారి్మనార్ జోన్గా, భాస్కరన్ ఎస్పీ సీఐ సెల్, ఇంటెలిజెన్స్ ఇన్చార్జ్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ⇒ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ఈగల్ (గతంలో టీజీ యాంటీ నార్కో టిక్స్ బ్యూరో)కు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్య డైరెక్టర్గా ఉండగా, మరో రిటైర్డ్ ఐపీఎస్ వీబీ కమలాసన్రెడ్డి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఓఎస్డీ, టీజీఐసీసీసీ డైరెక్టర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో, ఇంటెలిజెన్స్ ఓఎస్డీగా వి.శివకుమార్ పనిచేస్తున్నారు. -
తెలంగాణ నూతన గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా (73) నియమితులయ్యారు. ప్రస్తుతం హిమాచల్ప్ర దేశ్ గవర్నర్గా ఉన్న ఆయన్ను తెలంగాణకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించిన జిష్ణుదేవ్ వర్మను పొరుగున ఉన్న మహారాష్ట్రకు బదిలీ చేసింది. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ల (ఎల్జీ)ను మారుస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పాలనాపరమైన మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఒకేసారి పెద్ద సంఖ్యలో గవర్నర్లను, లెఫ్టినెంట్ గవర్నర్లను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనా అనుభవం ఉన్న పలువురిని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయగా, మరికొందరికి కొత్తగా అవకాశం కలి్పంచింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్లకు సైతం స్థానచలనం కలిగింది. లద్దాఖ్ ఎల్జీకి ప్రమోషన్ ఇచ్చి రాష్ట్ర గవర్నర్గా పంపడం గమనార్హం. కాగా, పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనందబోస్ తన పదవికి రాజీనామా చేయగా దాన్ని రాష్ట్రపతి ఆమోదించారు. ఇప్పటివరకు తమిళనాడు గవర్నర్గా ఉన్న ఆర్.ఎన్. రవిని బెంగాల్ గవర్నర్గా బదిలీ చేశారు.కొత్త నియామకాలు, బదిలీలు..⇒ తెలంగాణ: శివ ప్రతాప్ శుక్లా (హిమాచల్ప్రదేశ్ నుంచి బదిలీ) ⇒ మహారాష్ట్ర: జిష్ణుదేవ్ వర్మ (తెలంగాణ నుంచి బదిలీ) ⇒ పశ్చిమ బెంగాల్: ఆర్.ఎన్. రవి (తమిళనాడు నుంచి బదిలీ) ⇒ బిహార్: లెఫ్టినెంట్జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ ⇒ నాగాలాండ్: నంద్ కిశోర్ యాదవ్ ⇒ హిమాచల్ ప్రదేశ్: కవీందర్ గుప్తా (లద్దాఖ్ ఎల్జీకి ప్రమోషన్) ⇒ తమిళనాడు: రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (ప్రస్తుత కేరళ గవర్నర్కు తమిళనాడు అదనపు బాధ్యతలు) ⇒ లద్దాఖ్ ఎల్జీ: వినయ్ కుమార్ సక్సేనా (ఢిల్లీ నుంచి బదిలీ) ⇒ ఢిల్లీ ఎల్జీ: తరణ్జీత్ సింగ్ సంధూ -
సింఘ్వీ, వేం ఎన్నిక ఏకగ్రీవమే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ వారిద్దరినీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేయగా గురువారం శాసనసభ ప్రాంగణంలో ఎన్నికల అధికారి ఉపేందర్రెడ్డికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. తగినంత సంఖ్యాబలం లేనందున బీఆర్ఎస్ రాజ్యసభ ఎన్నికల బరిలో ఎవరినీ పోటీకి నిలపలేదు. సాయి అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు బలపరచాలనే నిబంధనను పాటించని కారణంగా ఆయన అభ్యర్థిత్వం శుక్రవారం స్రూ్కటినీలో తిరస్కరణకు గురవుతుందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రం నుంచి రాజ్యసభకు పార్టీ హైకమాండ్ ప్రతిపాదించిన సింఘ్వీ రెండోసారి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్నేహితుడు వేం నరేందర్రెడ్డి రాజ్యసభలో అడుగుపెట్టడం లాంఛనం కానుంది. సీఎం, మంత్రులు వెంట రాగా నామినేషన్లు దాఖలు కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి ఉదయం 10:30 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభకు వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీకి రాగా ఆయనతో కలిసి వెళ్లి మరో సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి ఉపేందర్రెడ్డికి అందజేశారు.సింఘ్వీ మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా వేం నరేందర్రెడ్డి నాలుగు సెట్లు దాఖలు చేశారు. మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం నుంచి నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి హాజరైన ఎంఐఎం ఎమ్మెల్యేలు అహ్మద్ బిన్ బలాలా, జుల్పికర్ అలీ ఒక సెట్ నామిషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఊహించినట్లుగానే బీఆర్ఎస్ రాజ్యసభ బరిలో అభ్యర్థిని దించలేదు. రాజ్యసభ సభ్యత్వాన్ని పొందేందుకు అవసరమైన 40 మంది శాసనసభ్యుల బలం లేకపోవడంతో పోటీ చేయలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. రెండోసారి రాజ్యసభకు అదృష్టం: సింఘ్వీ నామినేషన్ దాఖలు అనంతరం వేం నరేందర్రెడ్డితో కలిసి గాంధీ భవన్కు వచ్చిన అభిషేక్ మను సింఘ్వీకి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ను కలిశారు. అనంతరం సింఘ్వీ తెలంగాణ తరఫున రాజ్యసభకు రెండోసారి వెళ్లనుండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. రెండోసారి తెలంగాణ నుంచి ఎంపీగా తనను ఎంపిక చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాం«దీ, కేసీ వేణుగోపాల్కు ధన్యవాదాలు తెలిపారు.వేం నరేందర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు వెళ్లడం ఆనందంగా ఉందని.. ఇప్పటివరకు ఎలా పనిచేశానో, భవిష్యత్తులోనూ అలాగే పనిచేస్తానన్నారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధుల కోసం పోరాడుతానని పేర్కొన్నారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసిన రేవంత్రెడ్డి, మహేశ్గౌడ్కు ధన్యవాదాలు తెలిపారు. కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి పెళ్లికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డిలతో కలిసి సీఎం రేవంత్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. -
భారీగా బదిలీలు.. తెలంగాణ గవర్నర్గా ఎవరంటే?
దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను నియమించారు. తెలంగాణలో ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను.. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించారు.ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా తరంజిత్ సింగ్ సంధును ఎంపిక చేయగా.. నాగాలాండ్ గవర్నర్గా నంద్ కిషోర్ యాదవ్ నియమితులయ్యారు. బీహార్ గవర్నర్గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ నియమించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవిని బదిలీ చేశారు. తమిళనాడు గవర్నర్గా కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను నియమించగా.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా నియమితులయ్యారు. -
తల్లిదండ్రులకు ఆరచేతిలో వైకుంఠం
సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ మహానగరంలో పదవ తరగతి వార్షిక పరీక్షల వేడి మొదలవ్వక ముందే కార్పొరేట్ విద్యా సంస్థలు తమ అడ్మిషన్ల వేటను ముమ్మరం చేశాయి. విద్యార్థులు ఇంకా ఎస్సెస్సీ పాఠ్యపుస్తకాలతో కుస్తీ పడుతుండగానే ‘ఇంటర్’ సీటు రిజర్వు చేసుకోవాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి పెరుగుతోంది. ‘ముందస్తు రిజర్వేషన్.. భారీ ఫీజు డిస్కౌంట్’ అనే నినాదంతో తల్లిదండ్రులను ఆకర్షించే పనిలో పడ్డాయి. వీకెండ్ వస్తే చాలు ప్రధాన కార్పొరేట్ కళాశాలల ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేయడం, నేరుగా ఇళ్లను సందర్శించడం సర్వసాధారణమైంది. తమ క్యాంపస్లలో ఉన్న వసతులను చూపిస్తూ ఏసీ క్లాస్రూమ్లు, అత్యాధునిక ల్యాబ్ల పేరుతో భ్రమలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించాలంటే ఇప్పుడే చేరాలని, లేదంటే సీట్లు దొరకవని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. వాస్తవానికి విద్యాశాఖ నిబంధనల ప్రకారం పదవ తరగతి ఫలితాలు రాకముందే అడ్మిషన్లు నిర్వహించడం నిషిద్ధం. అయినప్పటికీ నిబంధనలు బేఖాతర్ చేస్తూ అడ్మిషన్ల కోసం అడ్డదారులకు తెరలేపడం విస్మయానికి గురిచేస్తోంది.ప్రత్యేక బ్యాచ్ల ఆకర్షణ సాధారణ తరగతులకు భిన్నంగా.. అత్యంత ప్రతిభావంతుల కోసం అంటూ ప్రత్యేక విభాగాలను ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను బురిడీకొట్టించడం సాధారణంగా తయారైంది. ముందస్తుగా సీటు బుక్ చేసుకుంటే ఫీజులో 20 నుండి 40 శాతం వరకు తగ్గింపు ఇస్తామని ఆశ కలిగిస్తున్నారు. పరిమిత సీట్లంటూ జేఈఈ, మెడిసిన్ ర్యాంకుల హామీలు, క్యాంపస్లో చేరితే ఐఐటీల్లో సీటు గ్యారెంటీ అంటూ ఆరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. విద్యార్థుల కంటే ఎక్కువగా తల్లిదండ్రుల బలహీనతలను, వారి భవిష్యత్తు ఆందోళనలను ఈ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.ప్రీ–రిజిస్ట్రేషన్ మాయాజాలం పదవ తరగతి పరీక్షలు కూడా పూర్తికాకముందే సీటు గ్యారెంటీ అంటూ తల్లిదండ్రుల నుండి ప్రీ–రిజిస్ట్రేషన్ అడ్మిషన్న్టోకెన్ పేరిట కొంత వసూలు చేస్తున్నారు. ఆ తరువాత వస్తే ‘సీటు దొరకదు‘ అని చెప్పి తల్లిదండ్రులను మానసికంగా సిద్ధం చేస్తారు. ఒకసారి ఈ సొమ్ము చెల్లిస్తే, ఒకవేళ విద్యార్థికి వేరే కాలేజీలో సీటు వచ్చినా, ఆలోచన మార్చుకున్నా ఈ డబ్బు తిరిగి రాదు. ఇది కార్పొరేట్ విద్యా సంస్ధల మార్కెటింగ్ గిమ్మిక్కుల్లో ప్రధానమైనది.చదవండి: 'మమ్మల్ని పంపించండి మహాప్రభో'ఫీజుల మోత మహా నగరంలోని హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని కార్పొరేట్ విద్యా సంస్థలు క్యాంపస్లు బట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి. మాదాపూర్, కూకట్పల్లి, పటాన్చెరు, శివారులోని డిమాండ్ ఉన్న ఏరియాల్లో కోర్సు ఆధారంగా ఫీజులు మారుతుంటాయి. కార్పొరేట్ సంస్థలు అందించే సౌకర్యాలను బట్టి ఫీజులను మూడు ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు: -
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మళ్ళీ ట్విస్ట్
హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయం మళ్లీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ అనర్హత కేసు విచారణలో భాగంగా దానం నాగేందర్పై విచారణ పూర్తి కాలేదు. దానం నాగేందర్పై విచారణను శనివారానికి వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మరొకవైపు కడియం శ్రీహరి విచారణ పూర్తి చేశారు స్పీకర్. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణకు హాజరు కావాలని ఇరు వర్గాలకు సూచించారు స్పీకర్. దానంపై దాఖలైన రెండు పిటిషన్లను శనివారం విచారించనున్నారు. గత నెలలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. మూడు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని ఫిబ్రవరి 6వ తేదీన హెచ్చరించింది. ఈ క్రమంలోనే తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కు మరో అవకాశం ఇచ్చింది. అనర్హత అంశాన్ని తేల్చాలని ఇప్పటికే స్పీకర్కు చాలా సమయం ఇచ్చామని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తిచేసి కోర్టుకు నివేదిక సమర్పించాలని స్పీకర్ను ఆదేశించింది. ఈ క్రమంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్.. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణను తేల్చేపనిలో పడ్డారు. -
మహిళల కోసం ప్రత్యేక యూరాలజీ కేంద్రం ప్రారంభం
హైదరాబాద్: మహిళల యూరాలజీ ఆరోగ్య సమస్యలకు సమగ్ర, ప్రత్యేక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బంజారాహిల్స్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘‘సెంటర్ ఫర్ ఫంక్షనల్ అండ్ ఫీమేల్ యూరాలజీ’ని ప్రారంభించింది. ఈ సందర్భంగా పూర్తిగా మహిళా వైద్య సిబ్బందితో నిర్వహించే ‘ఆల్-వుమెన్ ఆపరేషన్ థియేటర్ (ఓటీ)’*ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐపీఎస్ అధికారి శిఖా గోయల్ పాల్గొన్నారు.మహిళల్లో మూత్ర అసంయమనం, పెల్విక్ ఆర్గన్ ప్రోలాప్స్, పునరావృత మూత్ర మార్గ ఇన్ఫెక్షన్లు, మూత్రాశయ నొప్పి వంటి సమస్యలు అధికంగా కనిపిస్తున్నప్పటికీ, సామాజిక సంకోచం, అవగాహన లోపం కారణంగా చాలామంది చికిత్సకు ముందుకు రావడం లేదని వైద్యులు తెలిపారు. ఈ సమస్యలకు సమగ్ర నిర్ధారణ, ఆధునిక చికిత్సలు ఒకే చోట అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఈ కేంద్రంలో మూడు ముఖ్య విభాగాలు ఏర్పాటు చేశారు. పూర్తిగా మహిళా వైద్యులు, అనస్థీషియా నిపుణులు, నర్సులు, సాంకేతిక నిపుణులతో పనిచేసే ప్రత్యేక ఆపరేషన్ థియేటర్, శస్త్రచికిత్స అవసరం లేకుండా పెల్విక్ కండరాల బలపరిచే పునరావాస కార్యక్రమం, అలాగే మూత్రాశయ పనితీరును అంచనా వేసే యూరోడైనమిక్ పరీక్షల సదుపాయం అందుబాటులో ఉంచారు.గత ఐదేళ్లలో ఏఐఎన్యూ మహిళా యూరాలజీ బృందం 307 ప్రధాన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. మూత్ర లీకేజ్, యూరినరీ ఫిస్టులాలు, సిస్టోసీల్స్, ఫీమేల్ యూరేథ్రోప్లాస్టీ వంటి క్లిష్ట సమస్యలకు చికిత్స అందించిన అనుభవంతోనే ఈ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సారికా పాండ్య మాట్లాడుతూ, మహిళలు తమ ఆరోగ్య సమస్యలను దాచిపెట్టకుండా ముందుకు రావాల్సిన అవసరం ఉందని, ఆధునిక సాంకేతికతతో సమగ్ర చికిత్సలు అందించేందుకు ఈ కేంద్రం తోడ్పడుతుందని తెలిపారు. కన్సల్టెంట్ డాక్టర్ దీప్తి సురేకా మాట్లాడుతూ, మహిళలు సంకోచం లేకుండా వైద్య సేవలు పొందేలా పూర్తి మహిళా సిబ్బందితో ఈ ఓటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువతుల నుంచి వృద్ధుల వరకు మహిళల యూరాలజీ సమస్యలకు రోగి-కేంద్రీకృత, సమగ్ర వైద్య సేవలు అందించడం ఈ కేంద్ర లక్ష్యమని నిర్వాహకులు వెల్లడించారు. -
ఇఫ్తార్ విందులో.. ఖర్జూర నోరార
రంజాన్ అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు.. రుచి, ఆరోగ్యం, సంప్రదాయం, ఆధునికత కలిసే ఒక ప్రత్యేక జీవనశైలి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరంలో ఉన్న ఫుడ్ లవర్స్ రంజాన్ సీజన్ వచ్చిందంటే ఇఫ్తార్ టేబుల్స్ కొత్త ట్రెండ్స్తో మెరుస్తాయి. అయితే ఈ ఇఫ్తార్లో ఎన్ని వెరైటీలు ఉన్నా ఖర్జూరాలది మాత్రం ప్రత్యేక స్థానం. కేవలం రంజాన్ మాసం కోసం దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన, రుచికరమైన ఖర్జూరాలను నగరానికి దిగుమతి చేసుకుంటారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నగరంలో మరిన్ని వెరైటీల ఖర్జూరాలు సందడి చేస్తున్నాయి. వీటికి తోడు ట్రెడిషనల్ ఇఫ్తార్కు మోడ్రన్ టచ్ ఇచ్చే పానీయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ రెండింటినీ కలిపి చూస్తే ఈ ఏడాది రంజాన్ మాసం ఒకహెల్తీ లైఫ్ స్టైల్ స్టేట్మెంట్లా కనిపిస్తోంది. – సాక్షి, సిటీబ్యూరోరంజాన్ (Ramadan) మాసంలో ప్రతిరోజూ ఇఫ్తార్ విందులో ఖర్జూరాలు తొలి ముద్దగా తినడం తెలిసిందే.. ఈ ఖర్జూరాల్లో అంతర్జాతీయ ఆహార ప్రయాణం దాగుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనంగా పండించిన ఫలాల్లో ఒకటైన ఖర్జూరం.. ఇప్పుడు కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, ఒక లగ్జరీ గిఫ్ట్, న్యూట్రిషనల్ పవర్హౌస్ కూడా. విభిన్న దేశాల నుంచి వచ్చే ఈ ఖర్జూరాలకు ప్రత్యేక ఆదరణ, దానికి తగ్గట్టుగానే రేట్లు సైతం ఉంటున్నాయి. ఇందులో భాగంగా దేశీయంగా పండించే భారతీయ ఖర్జూరం(ఖజూర్) నగరంలో సులభంగా లభ్యమవుతుంది. ఈ ఖర్జూరం ఫోనిక్స్ సిల్వెస్ట్రీస్ జాతికి చెందింది. దేశంలో రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో దొరికే ఈ ఖర్జూరం గట్టిగా, ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ రకం. ఫ్రెష్గా లేదా సన్–డ్రైడ్గా వీటిని వినియోగిస్తారు. సిటీలో ‘కింగ్ ఆఫ్ డేట్స్’ (King of Dates).. అధునాతన జీవనశైలికి కేంద్రమైన హైదరాబాద్లో ఏ దేశాలకు చెందిన ఉత్పత్తులైనా సులభంగా నగరానికి చేరుకుంటాయి. ఇదే క్రమంలో ‘కింగ్ ఆఫ్ డేట్స్’గా పిలుచుకునే మొరాకో నుంచి వచ్చే మెడ్జూల్ ఖర్జూరం (Medjool dates ) పెద్ద పరిమాణంలో, అంబర్ బ్రౌన్ కలర్తో ప్రత్యేకంగా నిలుస్తుంది. కారమెల్, టాఫీ, హనీ నోట్స్తో నిండిన ఈ రకం గిఫ్టింగ్కు హాట్ ఫేవరెట్. సిటీలో ప్రీమియం డ్రైఫ్రూట్ స్టోర్లలో దీని డిమాండ్ భారీగా పెరుగుతోంది. హనీ టచ్తో సాఫ్ట్ డిలైట్గా ఉంటే. సౌదీ అరేబియాలో పండే సుక్కరి ఖర్జూరం కూడా నగరంలోని ముస్లింలు అమితంగా ఇష్టపడతారు. ఇవి మృదువుగా, తక్కువ ఫైబర్, సహజమైన తేనె రుచితో ఉంటాయి. రంజాన్ గిఫ్ట్ హ్యాంపర్లలో ఇది తప్పనిసరి ఐటమ్. ఈ రకం తాజాగా ఉన్నప్పుడు గోల్డెన్ యెల్లో, పండినప్పుడు అంబర్ బ్రౌన్గా మారుతుంది. సహజ చక్కెర ఎక్కువగా ఉండటంతో ఎనర్జీ బూస్టర్గా వీటిని పరిగణిస్తారు. అల్జీరియా, ట్యునీషియా ప్రాంతాల నుంచి వచ్చే డెగ్లట్ నూర్ రకాన్ని ‘క్వీన్ ఆఫ్ డేట్స్’గా పిలుస్తారు. ఈ రకం పాక్షికంగా ఎండిపోయి, నట్టి స్వీట్నెస్తో ఉంటుంది. బేకింగ్, కుకింగ్కు ఇవి అద్భుతంగా సరిపోతాయి. రంజాన్ డెజర్ట్స్లో ఇది ఫేవరెట్. ఇరాన్ నుంచి వచ్చే మజాఫతి ఖర్జూరం డార్క్ బ్రౌన్ నుంచి నలుపు రంగులో ఉంటుంది. సాఫ్ట్, జ్యూసీ టెక్స్చర్తో మోలాసిస్ లాంటి రుచి దీని ప్రత్యేకత. సౌదీ అరేబియా మదీనాలో మాత్రమే దొరికే అజ్వా రకానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎక్కువ. ఈ ఖర్జూరం మతపరమైన, సాంస్కృతిక విలువలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇది ప్రీమియం కేటగిరీలోకి వస్తుంది. -
Hyd: ఐదంతస్తుల భవనం నుంచి పడి ముగ్గురి దుర్మరణం
హైదరాబాద్: నగరంలోని టోలిచౌకీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఐదంస్తుతల భవనం నుంచి పడి పలువురు కార్మికులు మృత్యువాత పడ్దారు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు పైనుంచి కిందకు పడిపోయారు. దాంతో ముగ్గురు అడికక్కడే మృతిచెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది..టోలిచౌకిలో జరిగిన ప్రమాదానికి సంబంధించి బిల్డింగ్కి G+2 మాత్రమే పర్మిషన్ ఉన్నట్టుగా గుర్తించారు. ఈ విషయంపై షేక్ పేట్ ఎమ్మార్వో స్పందించారు. ‘మిగతా ఫ్లోర్లకు పర్మిషన్ లేనందున బిల్డింగ్ని సీజ్ చేయబోతున్నాం. ఇద్దరు ఇక్కడికి ఇక్కడే మృతి చెందారు. ఇంకొకరు చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. మొత్తం ముగ్గురు మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ఓలివ్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. మృతి చెందిన మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది.’ అని తెలిపారు.


