సాక్షి, హైదరాబాద్: అపరిశుభ్రమైన ఆహార పదార్థాల విక్రయాలపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. హైదరాబాద్ సిటీ సి.సి.ఎస్ (CCS), స్పెషల్ క్రైమ్ టీమ్, ఫుడ్ అడల్టరేషన్ టీమ్, బహదూర్పురా పోలీసులు సంయుక్త తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో పాడైపోయిన డ్రై ఫ్రూట్స్ను నాణ్యమైనవిగా నమ్మించి ప్రజలకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 30 కార్టన్ బాక్సుల్లో ఉన్న అపరిశుభ్రమైన, పాడైపోయిన డ్రై ఫ్రూట్స్ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు హైదరాబాద్లోని చార్మినార్, చేలాపురా ప్రాంతంలో GEM Foods (ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్) పేరుతో ఒక గోడౌన్ను నిర్వహిస్తూ..పాడైపోయిన, బూజు పట్టిన డ్రై ఫ్రూట్స్ను సేకరించి, వాటిని తినడానికి యోగ్యమైన నాణ్యమైన డ్రై ఫ్రూట్స్గా అమ్మకాలు సాగిస్తున్నాడు. ఆహార పదార్థాలను, ముఖ్యంగా ప్యాక్ చేసిన లేదా డ్రై ఫ్రూట్స్ వంటి వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
వస్తువులను కొనేముందు వాటి నాణ్యత, వాసన, రూపాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని.. ఎవరైనా పాడైపోయినా.. కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లు గమనిస్తే, వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్, ఆహార భద్రతా అధికారులకు సమాచారం అందించాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు.


