సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్భవన్ వేదికగా గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. శివ్ ప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణస్వీకారం చేయడం విశేషం. గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్, మంత్రులు, మండలి చైర్మన్ హాజరయ్యారు.
కలిసి పని చేద్దాం
తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శివ్ ప్రతాప్ శుక్లా తన సందేశం ఇచ్చారు. ''తెలంగాణ ప్రజలకు సేవ చేయడం గర్వంగా భావిస్తున్నాను. రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలంగాణ సాంస్కృతిక సంపద, గొప్ప సంప్రదాయాల రాష్ట్రం. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ అనుభవం తెలంగాణకు ఉపయోగపడుతుంది.
తెలంగాణ ఆశలు, ఆవిష్కరణలు, సహనశక్తికి ప్రతీక. ప్రజల దీక్షతో రాష్ట్రం సమగ్ర అభివృద్ధి దిశగా సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్కు అభినందనలు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ లక్ష్యాలతో ముందుకు సాగుదాం. సమైక్యత, సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటాను. రాజ్యాంగానికి అనుగుణంగా నిజాయితీగా విధులు నిర్వహిస్తాను. సుసంపన్నమైన తెలంగాణ కోసం కలిసి పని చేద్దామ''ని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు.


