ఫైల్ ఫొటో
సాక్షి, ప్రకాశం: హైదరాబాద్ పోలీస్ అకాడమీ ట్రైనీ ఐపీఎస్ల ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పరారీలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ట్రైనీ ఐపీఎస్(సస్పెండెడ్) ఉదయ్కృష్ణారెడ్డి ఖండించారు. తనపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్న ఆయన.. తాను ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.
‘‘మా నాన్నమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడంతో స్వస్థలం ప్రకాశం జిల్లా ఊళ్లపాలెం వచ్చా. కేసు కోర్టు పరిధిలో ఉంది. అందువల్ల పూర్తి వివరాలు వెల్లడించలేను. త్వరలోనే నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా’’ అని మంగళవారం ఉదయ్కృష్ణారెడ్డి ఓ మీడియా చానెల్తో మాట్లాడారు.
నాకు విలువలున్నాయి
తాను పూర్తి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తినని, విలువలకు కట్టుబడి జీవిస్తున్నానని ఉదయ్కృష్ణారెడ్డి తెలిపారు. పోలీస్, న్యాయ వ్యవస్థలపై తనకు నమ్మకం ఉందని, విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.
నోటీసులు అందలేదు
పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్లోని తన రెండు చిరునామాలకు వెళ్లారన్న ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. ఆ రెండు చిరునామాలు తాత్కాలికమైనవని, తన శాశ్వత చిరునామా అయిన ఊళ్లపాలెంకు ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. తాను స్వయంగా హైదరాబాద్కు వెళ్తున్నానని, ఎక్కడికీ పారిపోలేదని మరోసారి స్పష్టం చేశారు.
తోటి ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డిపై తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారి సంచలన ఆరోపణలతో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు నమోదు అయ్యింది. ఆ వెంటనే దర్యాప్తు నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అటుపై ఆరోపణలు తట్టుకోలేక ఉదయ్ ఆస్పత్రి పాలయ్యారు కూడా. అయితే ఈ ఆరోపణలపై ఉదయ్కృష్ణారెడ్డి తాజాగా వివరణ ఇచ్చారు.తనపై వచ్చిన ఆరోపణలపై చట్టపరమైన ప్రక్రియను గౌరవిస్తానని ఉదయ్కృష్ణారెడ్డి తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని, చివరికి నిజాలు బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.


