కరీంనగర్క్రైం: ప్రజల ప్రాణాలు కాపాడేందుకు నిర్వహించే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను కొందరు అక్రమ సంపాదనకు మార్గంగా మార్చుకున్నట్లు ఆరోపణలు వెలుగులోకి రావడం కరీంనగర్ పోలీసుశాఖలో కలకలం రేపింది. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వాహనదారుల భయాన్ని ఆసరాగా చేసుకుని భారీగా డబ్బు వసూలు చేసి, వారికి బదులుగా ఇతరులను కోర్టుకు హాజరుపరిచినట్లు జరిగిన వ్యవహారంలో ఆర్ఎస్సై శనిగల శ్రీకాంత్, కోర్టు డిస్పోజల్ కానిస్టేబుల్ సాయి, ట్రాఫిక్ స్టేషన్ రైటర్ కిరణ్ (పీసీ)ను పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రాథమిక విచారణలో 130పైగా కేసుల్లో రూ.30 లక్షలకుపైగా అక్రమ వసూళ్లు జరిగినట్లు గుర్తించారని సమాచారం. అయితే కేసుల సంఖ్యతో పాటు వసూళ్ల మొత్తం ఎక్కువగా ఉండే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
భయాన్ని పెట్టుబడిగా మార్చిన దందా?
డ్రంకెన్ డ్రైవ్ కేసులో కోర్టుకు వెళ్తే జైలు శిక్ష పడుతుందనే భయాన్ని వాహనదారుల్లో కలిగించి, వారి ఆర్థిక స్థోమతను బట్టి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు, కొందరి నుంచి రూ. లక్ష వరకు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. డబ్బు చెల్లించిన వారికి బదులుగా వేరే వ్యక్తులను కోర్టుకు పంపించి కేసులు ముగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి డ్రంక్ డ్రైవ్లో పట్టుబడిన వారిని తప్పించి పో లీ సు, కోర్టు వ్యవస్థల కళ్లుగప్పి అక్రమాలకు పాల్పడడం చర్చనీయాంశంగా మా రింది.
ట్రాఫిక్ విభాగంపై ఆర్ఎస్సైల కన్ను..
ట్రాఫిక్ విభాగంలో పనిచేసి అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చాలా మంది ఆర్ఐలు, ఆర్ఎస్సైల కన్ను ఈశాఖపై పడుతుంది. పలువురు ఆర్ఐ, ఆర్ఎస్సైలు వారికి కేటాయించిన విధులు నమ్మకంగా పూర్తిచేసి, నిర్ణీత సమయం పూర్తయిన తర్వాత ఉన్నతాధికారులు మార్చగానే సొంత విభాగానికి మారుతుంటారు. కానీ, ఆర్ఎస్సై శనిగల శ్రీకాంత్ గతంలోనే ఓసారి ట్రాఫిక్లో చేసి మళ్లీ ఇదే విభాగానికి రావడం చర్చకు దారితీసింది.
ముగ్గురు కుమ్మక్కై వ్యవస్థనే మోసం చేశారా?
ఆర్ఎస్సై, స్టేషన్ రైటర్, కోర్టు కానిస్టేబుల్ కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు ఆరోపణలు వెలుగులోకి రావడంతో, పోలీస్ కమిషనర్ వారిని హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేసి విచారణ చేపట్టారు. అనంతరం ముగ్గురిని సస్పెండ్ చేశారు. కోర్టు కానిస్టేబుల్ సాయి ఇంకా ప్రొబేషనరీ కాలంలోనే ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ వ్యవహారం ముగ్గురికే పరిమితమా? మరికొందరి పాత్ర కూడా ఉందా?.. గతంలో నమోదైన అన్ని డ్రంకెన్ డ్రైవ్ కేసులను తిరిగి పరిశీలిస్తారా?.. అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. అన్ని విషయాలపై ఉన్నతాధికారుల విచారణ జరుగుతుండగా, ఈ అంశంపై పోలీసుబాస్ సీరియస్గా ఉన్నట్లు తెలిసింది.


