హైదరాబాద్: మన దేశంలో కిడ్నీ వ్యాధులపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది జబ్బు ముదిరేంత వరకు గుర్తించడమే లేదు. చిన్న వయస్సు నుంచే కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే కిడ్నీల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం మార్చి రెండో గురువారం ప్రపంచ వ్యాప్తంగా ‘వరల్డ్ కిడ్నీ డే’ గా జరుపుకుంటున్నారు.
ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా గురువారం ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో మూత్రపిండాల ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కిడ్నీ వ్యాధుల నివారణ, ముందస్తు గుర్తింపు, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను సంబంధిత విభాగాల డాక్టర్లు వివరించారు.
ఈ సందర్భంగా కామినేని ఆస్పత్రి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ ఎ.సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. కిడ్నీ వ్యాధుల నివారణ, ముందస్తు పరీక్షల ప్రాధాన్యాన్ని వివరించారు. ‘కిడ్నీ సంబంధిత వ్యాధుల లక్షణాలు కనిపిస్తే.. ముందుగా సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. గాబరా పడి బీపీ. షుగర్లు పెంచుకుని వ్యాధులను ముదరనివ్వొద్దు. ఇలా వ్యవహరిస్తే సగం వరకు వ్యాధులను నయం చేయవచ్చు. కిడ్నీ జబ్బులు, డయాలసిస్ అనగానే ఇక జీవితం అయిపోయినట్లుగా భావించొద్దు. అధునాతన చికిత్సల ద్వారా డయాలసిస్, ట్రాన్స్ప్లాంటేషన్తో విజయవంతంగా జీవితాన్ని గడపవచ్చు’ అని సూచించారు.
కామినేని ఆస్పత్రి యూరాలజీ విభాగం డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ వి. సూర్యప్రకాశ్ మాట్లాడుతూ.. ‘కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మొదటి, సులభమైన మార్గం సరైన హైడ్రేషన్. అది సరిగా లేకపోతే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి. రోజుకు కనీసం 2, 3 లీటర్ల నీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి కిడ్నీలపై భారం తగ్గుతుంది. కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం తగ్గుతుంది. మంచి అలవాట్లు కిడ్నీలను దీర్ఘకాలం కాపాడుతాయి’ అని పేర్కొన్నారు.


