హైదరబాద్: గ్యాస్ కొరత కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 90 శాతం హోటళ్లు మూతపడే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏర్పడిన గ్యాస్ కొరతను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. గ్యాస్ కొరత కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ప్రధానంగా గ్యాస్ బ్లాక్ మార్కెట్ కారణంగానే ఈ పరిస్థితి వచ్చినట్లు కనబడుతోందని, ఈ బ్లాక్ మార్కెట్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కేటీఆర్. ఈ మేరకు సిలిండర్ల తీవ్ర కొరతను పరిష్కరించడానికి వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాశారు.
ఎల్పీజీ సిలిండర్ లభ్యతపై పారదర్శక సమాచారాన్ని అందించడానికి రియల్-టైమ్ పబ్లిక్ డాష్బోర్డ్ను రూపొందించాలని ఆయన సిఫార్సు చేశారు చిన్న వ్యాపారాలపై అదనపు ఆర్థిక భారాన్ని నివారించడానికి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లపై తాత్కాలిక ధరను నిర్ణయించి దానిని అమలు చేయాలన్నారు.


