సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పు వెల్లడించారు. రాజకీయ ఉత్కంఠకు తెరదించుతూ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు క్లీన్ చిట్ ఇచ్చారు.
పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు వెల్లడించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు పార్టీ మారారు అనడానికి సరైన ఆధారాలు లేవని స్పీకర్ ప్రకటించారు. అనంతరం, ఇద్దరిపై వేసిన రెండు పిటిషన్లకు డిస్మిస్ చేశారు. దీంతో ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంతటితో స్పీకర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుకు తెరపడింది.
కాగా, పార్టీ ఫిరాయింపుల కేసులో ఇప్పటికే ఈ కేసులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రేపటి వరకు ఫిరాయింపు కేసులో ఏదో ఒకటి తేల్చాలని గతంలో సుప్రీంకోర్టు గడువు విధించింది. సుప్రీంకోర్టు డెడ్ లైన్ నేపథ్యంలో నేడు స్పీకర్ తీర్పును వెల్లడించారు. మరోవైపు.. తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి.. స్పీకర్కు చెప్పుడం కొసమెరుపు. ఈ నేపథ్యంలో స్పీకర్ తీర్పుపై పిటిషనర్లు మరోసారి కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు సమాచారం.
ఇక, స్పీకర్ తీరుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందిస్తూ..‘స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నాను. పార్టీ ఫిరాయిస్తే షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. కానీ, నాకు పార్టీ షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు’ అని చెప్పుకొచ్చారు.
మరోవైపు.. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..‘స్పీకర్ పరిధిలో నేను ఏ తప్పూ చేయలేదు. కేసీఆర్ అంటే అపారమైన గౌరవం ఉంది. నన్ను కేసీఆర్ ప్రశ్నించాలి. కౌశిక్ రెడ్డికి ఏం సంబంధం?. అసెంబ్లీలో బీఆర్ఎస్ నాకు ఎలాంటి విప్ జారీ చేయలేదు. కేసీఆర్ నన్ను వివరణ అడగలేదు. నేను బీఆర్ఎస్ మెంబర్షిప్ వదులుకోలేదు.. ఎక్కడా తీసుకోలేదు అని వ్యాఖ్యలు చేశారు.


