హైదరాబాద్ : దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను మార్చి 13లోగా సీఎం రేవంత్రెడ్డి పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని గతంలో హెచ్చరించిన తెలంగాణ ఆర్టీసీ.. ఈ మేరకు సమ్మె నోటీసు ఇచ్చింది. ఈరోజు(శుక్రవారం) ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చాయి ఆర్టీసీ కార్మిక సంఘాటు. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె నోటీసును అందజేశారు. ఆర్టీసీ ఎండీ లేకపోవడంతో పేషీలోనే సమ్మె నోటీసు ఇచ్చారు. 14 రోజుల తర్వాత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని వారు హెచ్చరించారు.

తమ పెండింగ్ సమస్యలను సీఎం రేవంత్రెడ్డి పరిష్కరించాలని, లేకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని గత నెలలో ఆర్టీసీ కార్మిక సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చాక 2017 వేతన సవరణ అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అందుకు సంబంధించిన ఎరియర్స్ను మాత్రం ఇంకా చెల్లించలేదని, ఆర్టీసీకి రావాల్సిన రూ. 2,150 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


