తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు కేంద్రప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి ప్రయాణించే మూడు స్పెషల్ రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు మరో సౌకర్యం అందుబాటు వచ్చినట్టయింది.
కాచిగూడ-మధురై-కాచిగూడ
రైలు నం. 07191/07192 కాచిగూడ-మధురై-కాచిగూడ రైలును రైలు నం. 17165/17616 కాచిగూడ-ట్యుటికోరిన్-కాచిగూడ ఎక్స్ప్రెస్గా మార్చారు. ఇకపై ఈ రైలు ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో మొదలై మరుసటి రోజు మంగళవారం రాత్రి 10:45 గం.లకు కేరళ రాష్ట్రంలోని ట్యూటికోరిన్ కు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ట్యూటికోరిన్ నుంచి బుధవారం ఉదయం 7:45 గంటలకు మొదలై మరుసటిరోజు మధ్యాహ్నం 1:25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లె రోడ్, పీలేరు, పాకాల, చిత్తూరు స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.
హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్
రైలు నం. 07230/07229 హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ రైలును రైలు నం. 17069/17070 హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ ఎక్స్ప్రెస్ గా మార్చారు. ఈ రైలు గతంలోలాగే ప్రతి బుధవారం సాయంత్రం 5:20 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు తమిళనాడులోని కన్యాకుమారి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో కూడా గతంలో లాగే ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 5:15 గంటలకు కన్యాకుమారిలో బయలుదేరి శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్, తిరుపతి, పాకాల జంక్షన్, చిత్తూరు స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.
చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి
రైలు నం. 07225/07226 చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి రైలును రైలు నం. 17065/17066 చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ గా మార్చారు. ఇకపై ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7:15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు బుధవారం ఉదయం 11:20 గంటలకు పశ్చిమబెంగాల్ షాలిమార్కు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో బుధవారం మధ్యాహ్నం 12:50 గం. లకు షాలిమార్ లో బయలుదేరి మరుసటి రోజు గురువారం సాయంత్రం 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.
3 స్పెషల్ రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ రైల్వే తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.


