సాక్షి, హైదరాబాద్: శాంతిభద్రతల అడిషనల్ డీజీగా అత్యంత కీలకమైన పోస్టులో కొనసాగుతున్నా.. సీనియర్ ఐపీఎస్ మహేశ్ భగవత్ సివిల్స్ గురువుగా తన సత్తా చాటుతూనే ఉన్నారు. యూపీపీఎస్సీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలకు మార్గదర్శనం చేస్తూ వారి విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
తాజాగా వెలువడిన సివిల్ సర్వీసెస్ పరీక్ష–2025 ఫలితాల్లోనూ దేశవ్యాప్తంగా మొత్తం 958 మంది అభ్యర్థులు తుది జాబితాలో స్థానం సంపాదించారు. వీరిలో మహేశ్ భగవత్ మార్గదర్శకత్వంలో ఇంటర్వ్యూ దశకు సిద్ధమైన 300 మంది అభ్యర్థులు తుది జాబితాలో చోటు సంపాదించడం విశేషం. ఈ 300 మందిలో 37 మంది అభ్యర్థులు టాప్–100 ర్యాంకుల్లో నిలిచారు. మహేశ్ భగవత్ శిష్యురాలు తేజస్వినీ సింగ్ 62వ ర్యాంకు సాధించడంతో పాటు ఇంటర్వ్యూలో అత్యధికంగా 225 మార్కులు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలంగాణ టాపర్గా గూడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించగా, ఆమె ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనీ డీఎస్పీగా ఉన్నారు.
అలాగే దైనెంపల్లి ప్రవీణ్ 793వ ర్యాంకు సాధించి ట్రైనీ డీఎస్పీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ టాపర్గా జస్వంత్ జెన్ను 23వ ర్యాంకు సాధించగా, రాష్ట్రం నుంచి మరో 20 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఆల్ ఇండియా టాప్–10లో 3, 4, 6, 7 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు కూడా మహేశ్ భగవత్ బృందం నుంచి ఇంటర్వ్యూ మార్గదర్శకత్వం పొందినవారే కావడం గమనార్హం. అభ్యర్థులు కష్టపడి సాధించిన ఈ విజయానికి మెంటర్ల సహకారం కూడా ఎంతో తోడ్పడిందని మహేశ్ భగవత్ పేర్కొన్నారు.
చదవండి: విమెన్ సివిల్ పవర్


