కామారెడ్డి జిల్లా: ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. అరబ్ దేశాలలో రకరకాల పనులు చేసుకుంటున్నారు. గల్ఫ్ దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఇక్కడి వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఆందోళన చెందుతున్నారు. అనుక్షణం టీవీలలో యుద్ధవార్తలను చూస్తూ తమ వారు ఉండే ప్రాంతాలలో ఏమైనా దాడులు జరుగుతున్నాయా అని ఆందోళనగా పరిశీలిస్తున్నారు. రోజుకు నాలుగు సార్లు వాట్సాఫ్లో ఫోన్లు చేస్తూ తమ వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు.

యుద్ధం నేపథ్యంలో యూఏఈ, ఖతార్, కువైట్, దుబాయ్ దేశాలు విమాన రాకపోకలను నిలిపి వేసింది. ఇప్పటికే ఎయిర్ ఇండియా, ఇండిగో విమాన సంస్థలు గల్ఫ్ దేశాలకు తమ సరీ్వసులను నిలిపి వేసింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్, అబుదబి,దోహా, జెడ్డా, సౌదీ అరేబియా,కువైట్, మస్కట్, మక్కా వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసింది. ఈ పరిస్థితుల్లో డబ్బుల గురించి పట్టించుకోకుండా కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు వద్దామన్నా వారికి కుదరడం లేదని వారు వాపోతున్నారు.

ఖతర్, అబూదాబీలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని అక్కడి భారతీయ రాయబార కార్యాలయాలు సూచిస్తున్నాయని వారు తెలిపారు. తమ కార్యాలయాలు యధావిధిగా పని చేస్తున్నాయని అవసరమైతే ఖ తార్లో ఉంటున్న వారు 00974 55647502 , అబుదబీలో టోల్ ఫ్రీ నంబర్ 800–46342, వాట్సాఫ్ నంబర్ 972543090571 నంబర్లకు ఫోన్ చేసి కానీ మెయిల్ ద్వారా గాని తమకు కలిగిన ఇబ్బంది గురించి తెలియజేయ వచ్చని రాయబార కార్యాలయ అధికారులు తెలిపినట్లు అక్కడి వారు తెలిపారు.
భారతీయులు ఖతార్ అధికారులు అధికారిక ఛానెళ్ల ద్వారా జారీ చేసే వార్తలు, సూచనలు, మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించాలని భారత ఎంబసీ అధికారులు తెలిపినట్లు వారు తెలిపారు. సోషల్ మీడియాపై ఆంక్షలు ఉన్నందున వాట్సాఫ్, ఫేస్ బుక్, ఇన్స్ట్రాగామ్ తదితర మాధ్యమాలలో వచ్చే వార్తలను నమ్మ వద్దని , వాటిలో యుద్ధ వార్తలు పోస్టింగ్లు పెట్టవద్దని వారు సూచించిన ట్లు తెలిపారు. యుద్ధం కారణంగా గల్ఫ్లోని 14 దేశాలపై డ్రోన్లు, క్షిపణుల దాడులు జరిగే ప్రమాదం ఉన్నందున ఆయా దేశాల్లోని భారతీయులు ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ ఉద్యోగులు సూచిస్తున్నట్లు వారు తెలిపారు. యుద్ధం ఇప్పుడప్పుడే ఆగే పరిస్థితి లేనట్లు కనబడుతున్నందున తమ పరిస్థితి ఏమిటా అని వలస జీవులు గాబరా పడుతున్నారు.
‘‘ఇప్పటికైతే బాగానే ఉన్నాం. ఉ ద్యోగాలకు సెలవులు ప్రకటించారు. రూముల్లోనే బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాం. ఇక్కడి యుద్ధ వాతావరణం ఫోటోలు సోషల్ మీడియాలో పెడితే అరెస్టులు చేస్తున్నారు. క్షణ క్షణం..భయం భయంగా బతుకుతున్నాము..’’ అరబ్ దేశానికి వలస వెళ్లిన ఒక మిత్రుడు ఫోన్లో అక్కడి పరిస్థితిని వివరించారు.


