నిర్మల్ఖిల్లా: మలేషియాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులకు అక్కడి ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీచేసింది. సరైన వీసా పత్రాలు లేకుండా లేదా వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటున్నవారు ఏప్రిల్ 30లోగా దేశం విడిచి వెళ్లాలని సూచించింది. గడువు తర్వాత కూడా కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మలేషియాలోని ఎన్నారై సంఘాలు భారతీయులను అప్రమత్తం చేస్తున్నాయి.
స్పెషల్ డ్రైవ్ అమలు
అక్రమ వలసదారులు ఎటువంటి చట్టపరమైన ఇ బ్బందులు ఎదుర్కోకుండా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లేలా మలేషియా ప్రభుత్వం ‘మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రామ్ 2.0 అమలు చేస్తోంది. ఈ పథ కం ద్వారా గడువులోపు దరఖాస్తు చేసుకున్నవారు కేవలం నామమాత్రపు జరిమానా చెల్లించి చట బద్ధంగా తమ దేశాలకు వెళ్లే అవకాశం కల్పించారు. ఈ పథకం గడువు ఏప్రిల్ 30తో ముగియనుంది.
గడువు తర్వాత చర్యలు
గడువు తర్వాత దేశంలో అక్రమంగా ఉంటున్నవారిపై మలేషియా అధికారులు కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. గడువు ముగిసిన వెంటనే దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టి పత్రాలు లేని వారిని గుర్తించి అరెస్టు చేస్తారని తెలుస్తోంది. ఒకసారి అరెస్టు అయితే భారీ జరిమానాలు, జైలుశిక్ష కూడా ఎదుర్కోవాల్సి రావచ్చని ఎన్ఆర్ఐ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
పాస్పోర్ట్ లేనివారికి ప్రత్యేక సదుపాయం
కొంతమంది భారతీయుల వద్ద పాస్పోర్టులు పోవడం లేదా చెల్లుబాటు కాలేకపోవడం వంటి సమస్యలు ఉన్న నేపథ్యంలో కౌలాలంపూర్లోని భారత హైకమిషన్ ప్రత్యేకంగా ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తోంది. ఈ సర్టిఫికెట్ ఆధారంగా పాస్పోర్ట్ లేకపోయినా భారత్కు తిరిగి వెళ్లే అవకాశం ఉంటుంది.
అప్రమత్తంగా ఉండాలి
మలేషియాలో ఉన్న తమ బంధువులకు ఈ విషయాన్ని వెంటనే తెలియజేసి, గడువులోపు స్వదేశానికి తిరిగివచ్చేలా ప్రోత్సహించాలని రాష్ట్ర ఎన్నారై సలహాకమిటీ వైస్ చైర్మన్ మందా భీమ్రెడ్డి, సభ్యులు స్వదేశ్, ఎన్ఆర్ఐ సంఘాలు కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాయి. చట్టపరమైన ఇబ్బందులు లేకుండా గౌరవప్రదంగా స్వదేశానికి చేరుకునేందుకు ఇదే చివరి అవకాశం కావడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాయి.


