సాక్షి,నిజామాబాద్: జిల్లా గన్నారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలం గన్నారం వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడి.. నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. హైదరాబాద్ నుండి మహారాష్ట్రలోని అకొలకు 22 మంది ప్రయాణికులతో బయల్దేరింది.
అయితే గురువారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో 44వ జాతీయ రహదారిపై బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు ఘటన స్థలంలోనే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


