breaking news
Hyderabad
-
Hyderabad: బ్రిడ్జి కింద నగ్నంగా మహిళ మృతదేహం..!
రాజేంద్రనగర్: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం..కిస్మత్పూర్ బ్రిడ్జి పక్కనే ఉన్న కల్లు కంపౌండ్ సమీపంలోని పొదల్లో ఓ మహిళ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా పడి ఉంది. సంఘటన జరిగి రెండు, మూడు రోజులు కావస్తుండటంతో పాటు రెండు రోజులుగా వర్షాలు పడటంతో మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. క్లూస్ టీమ్, డాగ్స్ టీమ్ను రప్పించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతదేహనికి కొద్ది దూరంలో నల్లటి స్క్రాప్, నల్లటి పైజామా కనిపించింది. మృతురాలు వయస్సు 25–30 సంవత్సరాలు ఉంటుందని ఇన్స్పెక్టర్ తెలిపారు. మహిళను ఇక్కడికి తీసుకొచ్చి లైంగికదాడికి పాల్పడి చంపారా..లేదా ఇతర ప్రాంతంలో హత్య చేసి ఇక్కడ పడేశారా అన్నది దర్యాప్తులో తేలనుందని ఇన్స్పెక్టర్ తెలిపారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించామన్నారు. మృతురాలికి సంబంధించిన ఫోటోలను అన్ని పోలీస్స్టేషన్లకు పంపించామన్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మృతురాలి ఆచూకీ తెలిస్తే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించాలన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మేడ్చల్రూరల్: రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థినితో పాటు మరో యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హన్మకొండ జిల్లాకు చెందిన ఇస్లావత్ అనూష (20) ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధి ఘనాపూర్లోని మెడిసిటీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటుంది. కాగా మంగళవారం మధ్యాహ్నం తన స్నేహితుడు మహేశ్వర్రెడ్డితో కలిసి మేడ్చల్ నుండి నగరం వైపు ద్విచక్ర వాహనంపై 44వ జాతీయ రహదారిపై వెళ్తుండగా మార్గమధ్యలో ఆక్సిజన్ పార్క్ సమీపంలో వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న ఇద్దరు కిందపడిపోగా అనూష శరీరంపై నుండి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన మహేశ్వర్రెడ్డిని మేడ్చల్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
25న బతుకమ్మకుంటలో బతుకమ్మ
సాక్షి, హైదరబాద్: అంబర్పేటలోని బతుకమ్మకుంట ఈసారి బతుకమ్మ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ నెల 25న ఇక్కడ నిర్వహించనున్న కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. హైడ్రా అ«దీనంలో పునరుజ్జీనం పొందిన ఈ కుంటను అదే రోజు ప్రజలకు అంకితం చేయనున్నారు. ఆ ఏర్పాట్లను ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జలమండలి ఎండీ అశోక్రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. బతుకమ్మ కుంటకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా బతుకమ్మ ఉత్సవాలు జరగాలని వేంనరేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ఆక్రమణలకు గురై నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయి, పిచ్చి మొక్కలు పెరిగి అటువైపు వెళ్లాలంటే కాదు.. కనీసం చూడాలంటే భయపడే విధంగా బతుకమ్మ కుంట మారిపోయింది. కబ్జాల చెర నుంచి దీనికి విముక్తి కలి్పంచి సర్వాంగ సుందరంగా తీర్చడంలో హైడ్రా కృషి అభినందనీయం’ అని మేయర్ విజయలక్ష్మి, మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు. -
మరో 5 చోట్ల.. జంక్షన్ ఫ్రీ
సాక్షి,హైదరబాద్: ఇప్పటికే గ్రేటర్లోని పలు జంక్షన్లలో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం ఫ్లై ఓవర్లు వచ్చాయి. కొత్తగా మరిన్ని ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ల కోసం టెండర్ల దశలో ఉన్నాయి. వాటిలో కొన్ని టెండర్లు పూర్తయ్యాయి. అవి అలా ఉండగానే.. నాగార్జునసాగర్ రింగ్ రోడ్ –శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాకపోకలు సాగించే వారికి సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం మరో ఐదు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, ఆర్యూబీ (రోడ్ అండర్బ్రిడ్జి)ల నిర్మాణాలకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ఇవన్నీ కూడా భవిష్యత్లో రానున్న ఎయిర్పోర్ట్ మెట్రో రైలు మార్గంలో ఉండటంతో మెట్రో వర్గాలతో సమన్వయంతో సదరు ప్రాజెక్టుల డిజైన్లు తదితరాలకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. త్వరలోనే ఫీజిబిలిటీ స్టడీ, డీపీఆర్లు పూర్తి చేసి పనులు చేపట్టనున్నట్లు సంబంధిత ఇంజినీర్లు తెలిపారు. దాదాపు మూడునెలల్లో ఇవి పూర్తయ్యాక టెండర్లు పిలవనున్నట్లు పేర్కొన్నారు. పనులు ఇవీ.. 1. టీకేఆర్ కాలేజీ జంక్షన్ ఫ్లై ఓవర్: టీకేర్ కాలేజీ జంక్షన్, గాయత్రినగర్ జంక్షన్, మందమల్లమ్మ జంక్షన్ల మీదుగా ఆరు లేన్లతో ఫ్లై ఓవర్. 2. ఒమర్ హోటల్ జంక్షన్ ఫ్లై ఓవర్: హఫీజ్బాబానగర్ జంక్షన్– బాలాపూర్– చర్చిరోడ్ జంక్షన్ (ఒమర్ హోటల్ నుంచి మెట్రో ఫంక్షన్ హాల్ మీదుగా షోయబ్ హోటల్) వరకు ఆరులేన్ల ఫ్లై ఓవర్. 3. బండ్లగూడ జంక్షన్ ఫ్లై ఓవర్: బండ్లగూడ–ఎర్రకుంట జంక్షన్ వద్ద ఆరులేన్ల ఫ్లై ఓవర్. 4. మైలార్దేవ్పల్లి జంక్షన్ ఫ్లై ఓవర్: మైలార్దేవ్పల్లి, శంషాబాద్ రోడ్, కాటేదాన్ జంక్షన్ల వద్ద ఆరులేన్ల ఫ్లై ఓవర్. 5. ఆరాంఘర్ జంక్షన్ ఆర్యూబీలు: ఆరాంఘర్ జంక్షన్ వద్ద ప్రస్తుతమున్న ఆర్యూబీకి రెండు వైపులా రెండు లేన్లతో మరో రెండు ఆర్యూబీలు. ఈ పనులను వేటికవి విడివిడిగానే చేయనున్నారు. పనులు పూర్తయితే సికింద్రాబాద్, ఉప్పల్ సహా వివిధ మార్గాల నుంచి ఎయిర్పోర్ట్కు రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ చిక్కులు లేని సాఫీ ప్రయాణంతో ఎంతో సమయం కలిసి వస్తుందని, వ్యయ ప్రయాసలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. డీపీఆర్లో భాగంగా టోపోగ్రాఫికల్ సర్వే, ట్రాఫిక్ సర్వే నిర్వహించడంతో పాటు రద్దీ సమయాల్లో సదరు మార్గాల్లో ప్రయాణించే వాహనాలు, కారిడార్లో రానున్న మెట్రోరైలు, సీటీఎస్ (కాంప్రహెన్సివ్ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్స్టడీ) మాస్టర్ప్లాన్, బీఆర్టీఎస్ (బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్)లో రాబోయే ప్రాజెక్టులు తదితర అంశాలు పరిగణనలోకి తీసుకోనున్నారు. హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)ప్రాజెక్ట్ కింద ఎల్బీనగర్–ఆరాంఘర్ కారిడార్ పనుల్లో భాగంగా వీటిని చేపట్టనున్నారు. ఢిల్లీ, కోల్కతా, బెంగళూర్, చెన్నైల కంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పెద్దది కావడం, టీసీయూఆర్ (తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్) వరకు నగరంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యల్లేకుండా చేయాలనే తలంపుతో ప్రభుత్వం ఉన్నందున ఈ ఫ్లై ఓవర్లు ఎంతో అవసరమని భావిస్తున్నారు. అదే మార్గంలో డీఆర్డీఎల్, డీర్డీఓ, మిధాని వంటి పరిశోధన సంస్థలు, లే»ొరేటరీలు ఉండటం తెలిసిందే. ఇప్పటికే గ్రేటర్ జనాభా కోటికి పైగా ఉండటమే కాక భవిష్యత్లో మరింత పెరగనుండటంతో ట్రాఫిక్ సమస్యలు పెరగకుండే ఉండేందుకు ఇవి అవసరం కానున్నాయి. -
నిద్దరోయిన నిఘా నేత్రం!
సాక్షి,హైదరాబాద్: దొంగలను గుర్తించాలన్నా, దోపిడీ ముఠాల ఆటకట్టించాలన్నా.. ఏమూలలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్నా సీసీటీవీ కెమెరాల పాత్ర అత్యంత కీలకం. కానీ.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో సీసీ కెమెరాల నిర్వహణ డొల్లతనంగా మారింది. రోడ్ల విస్తరణ, అక్రమ కేబుల్ వైర్ల తొలగింపు సమయంలో కెమెరాల వైర్లూ తొలగించడం, వార్షిక నిర్వహణ సరిగా లేకపోవడం తదితర కారణాలలో నిఘా నేత్రాలు నిద్దరోయాయి. సైబరాబాద్లో అత్యంత కీలకమైన మాదాపూర్ జోన్లో ఏకంగా 644 సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదు. రోడ్ల విస్తీర్ణం, వైర్ల కత్తిరింపు.. రోడ్డు ప్రమాదాలు, చెయిన్ స్నాచింగ్లు, దాడులు, హత్యోదంతాలు ఇతరత్రా కేసుల్లో నేరస్తులను పట్టుకునేందుకు సీసీటీవీ కెమెరాలు కీలకం. కేసుల దర్యాప్తు, పోలీసుల పరిశోధనకు ఆయువుపట్టు లాంటి కెమెరాల నిర్వహణపై నిర్లక్ష్యం అలుముకుంటోంది. వార్షిక నిర్వహణ సరిగా లేక, విద్యుత్ స్తంభాలపై ఉన్న అక్రమ తీగలను తొలగించే సమయంలో సీసీటీవీ కెమెరాల వైర్ల తొలగింపు తదితర కారణాలతో కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో పోలీసులకు నేరాల దర్యాప్తులో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2.14 లక్షల సీసీటీవీ కెమెరాలున్నాయి. వీటిలో ‘నేను సైతం’ కింద 1.87 లక్షల కెమెరాలు, ‘నిర్భయ, సేఫ్ సిటీ’ ప్రాజెక్ట్ల కింద 27 వేల కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిలో సుమారు 41 శాతం కెమెరాలు పని చేయడం లేదని అధికారులు గుర్తించారు. ప్రత్యేక వ్యవస్థే లేదు.. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ కోసం ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రత్యేక వ్యవస్థే లేకుండాపోయింది. అంతేకాకుండా ప్రత్యేకంగా నిధుల కేటాయింపులూ లేవు. హైవేలతో పాటు నగరాలు పట్టణాల్లోని రోడ్లపై వీటిని ఏర్పాటు చేస్తున్న పోలీసు శాఖ కూడా సొంత నిధులు వినియోగించడం లేదు. సామాజిక బాధ్యతగా కార్పొరేట్ సంస్థలు, ఇతర సంఘాలు, సంస్థలు ఇచ్చే విరాళాలు, నిధులతో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. కెమెరాల ఏర్పాటే కష్టసాధ్యంగా ఉన్న పరిస్థితుల్లో, ఏర్పాటైన కెమెరాల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాంకేతికంగా ప్రపంచదేశాలతో పోటీ పడుతున్న సైబరాబాద్లో కెమెరాలు పని చేయకపోవడం విచారకరం. నిర్వహణ చేయకపోయినా బిల్లుల చెల్లింపు మాదాపూర్ జోన్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను ఓ కాంట్రాక్టర్కు అప్పగించారు. సదరు సంస్థ కెమెరాల నిర్వహణ పేలవంగా ఉన్నట్లు గుర్తించిన ఓ ఉన్నతాధికారి ఆ సంస్థ యజమానిని కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు. రోడ్ల విస్తరణ సమయంలో సుమారు 300 కెమెరాలు ఎటో పోయాయని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఒప్పందంలో కెమెరాలు పోయినా కూడా కొత్తవి ఏర్పాటు చేసే బాధ్యత నిర్వహణ సంస్థదే కదా అని సదరు అధికారి ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు తెలిసింది. పైగా సదరు అధికారి తనను వేధిస్తున్నాడంటూ ఆపై ఉన్నతాధికారులకు, పలుకుబడి ఉన్న వాళ్లతో చెప్పడంతో సదరు అధికారి షాక్కు గురయ్యారు. అయితే 2020 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకూ అదే నిర్వహణ సంస్థకు కెమెరాల నిర్వహణ బిల్లులు పేరిట రూ.5.75 కోట్లు ప్రభుత్వం నుంచి చెల్లించడం గమనార్హం. నిర్లక్ష్యం, నిర్వహణ చేయకపోవడంపై సదరు ఏఎంసీ కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సంబంధిత అధికారి లేఖ రాసినట్లు సమాచారం. -
HYD: గోల్డ్ షాపుల ఓనర్స్ ఇళ్లలో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటీ అధికారులు.. సోదాలు చేపట్టారు. ప్రముఖ బంగారం షాపు యాజమానుల ఇళ్లలో బుధవారం ఉదయం నుంచి ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. బంగారం కొనుగోలులో ట్యాక్స్ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. దీంతో, 15 బృందాలు రంగంలోకి దిగి.. సోదాలు చేస్తున్నారు. అటు.. వరంగల్లో సైతం తనిఖీలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బుధవారం ఉదయం నుంచి నిలిచిపోనున్నాయి. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్కుమార్ విజ్ఞప్తి చేసినా.. సేవల నిలిపివేతకే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో గత ఆగస్టు నుంచి ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూసినా ప్రయోజనం లేకపోవడంతో సేవలు నిలిపి వేయడం మినహా మరో గత్యంతరం లేకుండా పోయిందని అసోసియేషన్ అధ్యక్షుడు వద్దిరాజు రాకేశ్ ఒక వీడియో ప్రకటనలో పేర్కొన్నారు.ఆర్థిక సమస్యలతో పాటు ఆసుపత్రుల్లో సేవలకు సంబంధించి కూడా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని మంత్రి, ఆరోగ్యశ్రీ సీఈవోలకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలో 470 వరకు ఆసుపత్రులు ఉండగా వీటికి సంబంధించి రూ.1,400 కోట్ల బకాయిలు ఉన్నట్లు అసోసియేషన్ చెబుతోంది.తెల్లరేషన్కార్డు ఇవ్వగానే ఆస్పత్రుల్లో చేర్చుకునే ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోవడంతో పేదలు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది.బిల్లుల బకాయిలను రాబట్టుకోవడం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల నిర్వాహకులు సేవలను బంద్ చేయడం ఈ ఏడాదిలో ఇది రెండో సారి. 2024 డిసెంబర్ నాటికి బకాయిలు రూ.1,000 కోట్లు దాటాయని పేర్కొంటూ జనవరి 10 నుంచి ఐదారు రోజులపాటు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపి వేశారు. -
జీఎస్టీ రేట్ల తగ్గింపులో ప్రముఖ పాత్ర నాదే
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ రేట్ల తగ్గింపులో ప్రముఖ పాత్ర తనదేనని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ‘జీఎస్టీ రేట్ల సవరణ కోట్లాది మంది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. జీఎస్టీ కౌన్సిల్ సభ్యునిగా ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకోవడంలో నేను ప్రముఖ పాత్ర పోషిస్తున్నా’అని ఆయన వెల్లడించారు. జీఎస్టీ రేట్ల సవరణతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.5 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని, అయినా పేద, మధ్య తరగతి ప్రజలు, రైతుల శ్రేయస్సుకు ఆ నష్టాన్ని భరిస్తున్నామని స్పష్టం చేశారు. జీఎస్టీ రేట్ల సవరణ నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో వ్యాపార వర్గాలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజల మేలు కోసం జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ జరగాలని సీఎం రేవంత్రెడ్డితోపాటు కేబినెట్ మొత్తం విధాన నిర్ణయం తీసుకుందన్నారు. సవరించిన రేట్లతో పెద్ద సంఖ్యలో వస్తువుల ధరలు తగ్గుతున్నాయని, ఈ ఫలాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతోపాటు వ్యాపారులందరిపై ఉందని చెప్పారు. రేట్ల సవరణ ద్వారా తగ్గిన వస్తువుల వివరాలు ప్రజలకు వ్యాపారులు తెలియజేయాలని,15 రోజుల్లో ఆదాయ పెంపు మార్గాలపై నివేదిక ఇవ్వండిరాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచడంలో భాగంగా అన్ని శాఖలను సమన్వయం చేసే బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీరియస్గా తీసుకోవాలని మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆదాయ వనరుల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సచివాలయంలో సమా వేశమైంది. భట్టి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఉపసంఘం సభ్యులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు తోపాటు ఆర్థిక, వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా, ఇతర ఆదాయార్జిత విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆదాయ పెంపుదలకు గల మార్గాలను అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి సర్కిల్వారీగా పన్నుల శాఖ ఆదాయాన్ని సమీక్షించాలని, రవాణా శాఖలో ఆదాయ లక్ష్యాలు చేరుకునేందుకు అవసరమైన ప్రత్యేక పాలసీని రూపొందించాలని భట్టి చెప్పారు. -
పిల్లల బతుకులు ఆగం చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: ‘యువత జీవితాలతో రాజకీయాలు చేయొద్దు. రూ.3 కోట్లు తీసుకుని ఉద్యోగాలు అమ్ముకున్నా రంటున్నారు. అమ్ముకున్న వారెవరు? కొనుక్కున్నవారెవరు ? ఇలా మాట్లాడే వారి దగ్గర ఏమైనా ఆధారాలుంటే చూపించాలి. మీరు రాజకీయాలు చేసుకోండి. లేనిపోని మాటలు మాట్లాడి పిల్లల బతుకులు ఆగం చేయొద్దు. ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది. పిల్లలకు ఇబ్బందులు లే కుండా నియామక పత్రాలు ఇస్తారని ఆశి స్తున్నాం. ఏది ఏమైనా విచారణకు మేము కూడా సహకరిస్తాం. రూ.3 కోట్లకు ఎన్ని సున్నాలుంటాయో కూడా మాకు తెలీదు. అంత సొమ్ముంటే ఏ వ్యాపారమో చేసుకు నే వాళ్లం. రూ.3 కోట్లు కాదు.. బ్యాంకులో రూ.3 లక్షలుంటే చూ పండి. మావి పేద కుటుంబాలు, కాయ కష్టం చేసి పిల్లల్ని చది వించాం. పిల్లలు కూడా రాత్రి పగలు తేడా లేకుండా, పండుగలు, ఇతర శుభ కార్యాలకు దూరమై, ఒక దీక్ష చేసినట్లు చదువుకుని, ర్యాంకులు సాధిస్తే అసత్య ఆరోపణలతో వారిని అవమానిస్తున్నారు. ర్యాంకర్లు ఎవరైనా, ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు? పిల్లలకు న్యాయం చేయాలి. ఇప్పటికే మూడు దఫాలు రద్దు చేశారు. ఇలాగే కొనసాగితే ప్రభుత్వ ఉద్యోగాలపై భవిష్యత్తరాలకు నమ్మకం పోతుంది..’ అంటూ నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్న పలువురు గ్ర–1 ర్యాంకర్ల తల్లిదండ్రులు వాపోయారు. మంగళవారం సోమాజీ గూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు.న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందిగ్రూప్–1 ఉద్యోగాలు అమ్ముకున్నారంటున్నారు. రూ.3 కోట్లు అని ప్రారంభించి రూ.1,700 కోట్ల స్కాం అంటున్నారు. అభియోగం మోపితే సరిపోదు. దాన్ని నిరూపించగలగాలి. ఇక్కడున్న తల్లిదండ్రులకు రూ.3 కోట్లు ఇవ్వగలిగే స్థోమత ఉందా.? లక్షల్లో అప్పులు చేసి పిల్లల్ని చదివించారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచాలి.– దాదా సలాం, గోదావరిఖని, 46వ ర్యాంకర్ తండ్రిఎప్పటికీ అశోక్నగర్లోనే ఉండాలా?రాజకీయ నాయకులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దు. ఆరోపణలు విని మేము చాలా బాధపడుతున్నాం. 563 మంది రూ.3 కోట్లు చొప్పున ఇస్తే సుమారు రూ.1,700 కోట్లు అవుతుంది. అంత సొమ్ముఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి చేరిందనేది నిరూపించాలి. రూ.లక్షలు ఫీజులు కడుతూ ఎప్పటికీ అశోక్ నగర్లోనే ఉండాలా? – పావని, ర్యాంకర్ తల్లిరాజకీయం పార్టీలు చూసుకోవాలివారం రోజులుగా జరుగుతున్న వ్యవహారం మొత్తం చూస్తు న్నాం. రూ.3 కోట్లు అంటూ ప్రచారం చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దు. అందరూ సహకరించాలి. రాజకీయం ఉంటే ఆయా పార్టీలు చూసుకోవాలి. – జంగారెడ్డి, 159వ ర్యాంకర్ తండ్రినిందలు భరించలేకపోతున్నాం..నా కొడుకు మూడు దసరాల నుంచి ఇప్పటివరకు ఒక్క దఫా కూడా మాతో లేడు. గతంలో ప్రిలిమ్స్లో అవకతవకలు జరిగాయన్నారు. ఈసారి మెయిన్స్ రాసి ర్యాంకు వచ్చినప్పుడు ఏమీ అనలేదు. తీరా జాబ్లో చేరే సమయంలో రాజకీయ నాయకుల స్వార్థాల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. ఇదెంతవరకు సమంజసం? ఏమైనా సరే నిందలు వేయకండి. భరించలేకపోతున్నాం. – లలిత, 67వ ర్యాంకర్ ఉదయ్కిరణ్ తల్లి -
విజయనగరం ఐసిస్ కేసులో కదలిక
సాక్షి హైదరాబాద్/కొత్తగూడెం టౌన్: ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్)ల ద్వారా విధ్వంసాలకు పాల్పడడానికి కుట్రపన్నిన విజయనగరం ఐసిస్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, ఢిల్లీలోని 16 ప్రాంతాల్లో మంగళవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ మేరకు ఎన్ఐఏ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. విజయనగరం కేంద్రంగా ఐసిస్ ఉగ్రవాది సిరాజ్–ఉర్–రెహమాన్ను జులైలో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఐఈడీల తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలను సిరాజ్ కలిగి ఉండటంతో ఉగ్రవాద నెట్వర్క్పై ఎన్ఐఏ స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 27న సౌదీ అరేబియాలోని రియాద్కు పారిపోవడానికి ప్రయత్నించిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ను అరెస్ట్ చేసింది. సిరాజ్తో కలిసి నేపాల్ సరిహద్దు ద్వారా ఆయుధాల సరఫరాకు ఏర్పాట్లు చేయడానికి కుట్ర చేసినట్లు గుర్తించింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కుట్ర పన్నినట్లు సిరాజ్ విచారణలో వెల్లడించాడు. దీని ఫలితంగా మరో నిందితుడు సయ్యద్ సమీర్ను కూడా ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఈ సోదాల్లో డిజిటల్ వివైజులు, డాక్యుమెంట్లు, నగదు సహా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా ఉగ్రవాదం వైపు యువత రిక్రూట్మెంటుకు సంబంధించిన ఆధారాలు సేకరించింది. కాగా, ఈ కేసుకు సంబంధించిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఐదు నెలల క్రితం పెట్టిన మతపరమైన పోస్టులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొందరు లైక్ కొట్టిన నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. కొత్తగూడెం బస్టాండ్ సమీపాన మధురబస్తీలోని ఓ ఇంటికి తెల్లవారుజామున 4 గంటలకు దాదాపు పది వాహనాలతో వచ్చిన అధికారులు ఉదయం 6 గంటల వరకు సోదాలు నిర్వహించి వివరాలు సేకరించారు. అనంతరం కొత్తగూడెం పాలకేంద్రం సమీపాన మరొకరి ఇంట్లోనూ చేపట్టిన తనిఖీలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగాయి. -
ఫీజు రీయింబర్స్మెంట్ ప్లానింగ్ ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ హేతుబద్ధీకరణపై ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ దిశగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సంక్షేమ, విద్యాశాఖ అధికారులతోపాటు కాలేజీ యాజమాన్య ప్రతినిధులను ఇందులో చేర్చాలని నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హేతుబద్ధీకరణపై దృష్టి పెట్టారు. విద్యాశాఖ అధికారులతో ఆయన సంప్రదింపులు చేపట్టారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్ల మేర పేరుకుపోయాయి. ఇక నుంచి ఫీజు రీయింబర్స్మెంట్కు కొత్త మార్గదర్శకాలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. డేటా సేకరణఫీజు రీయింబర్స్మెంట్పై సమగ్ర సమాచారం సేకరించాలని ముఖ్యమంత్రి కార్యా లయం విద్య, సంక్షేమ శాఖలను ఆదేశించింది. దీంతో పాటే కాలేజీల నాణ్యత ప్రమాణాలపైనా నివేదిక కోరుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ పొందే కాలేజీల్లో హాజరు శాతం ఎలా ఉంది? కొన్నేళ్లుగా ఆయా కాలేజీల్లో ఫలితాలు ఎలా ఉన్నాయి? ఎంతమంది ఉద్యోగాలు పొందారు? ఆ కాలేజీలు ఎన్నిసార్లు జాతీయ, అంతర్జాతీయ ర్యాంకులు పొందాయి? ఇలాంటి అనేక వివరాలను ప్రభుత్వం కోరినట్టు తెలిసింది. నాణ్యత లేని కాలేజీలను దృష్టిలో ఉంచుకొని మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాలేజీలో కనీస స్థాయి ప్రమాణాలు, విద్యార్థుల హాజరు, ఉద్యోగ అవకాశాలను కొలమానంగా తీసుకునే వీలుంది. దీంతో పాటు యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ, లేబొరేటరీలు ఉన్న కాలేజీలకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందనే నిబంధన తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. నేరుగా ఇస్తే సమస్యలేంటి?విద్యార్థికి వారి బ్యాంకు ఖాతాలోనే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే వచ్చే సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారుల ద్వారా వాకబు చేసినట్టు తెలిసింది. దీనిపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఫీజు రీయింబర్స్మెంట్ రావడం ఆలస్యమైతే, కాలేజీల నుంచి విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుందనే భావన విద్యార్థి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఖాతాల్లో డబ్బులు వేసినా, అవి వాడుకుంటే సమస్యలు వస్తాయనే ఆలోచన కొంతమంది అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజ మాన్యాలు మాత్రం ప్రత్యేక బ్యాంకు ఖాతా పెట్టాలని, ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని, కాలేజీ నిర్వహణ వ్యయాన్ని ఈ ఖాతాలో ఉంచాలన్న ప్రతిపాదన తీసుకొచ్చాయి. దీనికి బ్యాంకులు ఏమేర ముందుకొస్తాయనేది ఉన్నతాధికారులు పరిశీలించే పనిలో ఉన్నారు. -
‘మర్రి’కి అటూ ఇటూ రోడ్డు!
సాక్షి, హైదరాబాద్: హెదరాబాద్ – బీజా పూర్ జాతీయ రహదారిలో భాగంగా హైదరాబాద్ శివారులోని అప్పా కూడలి నుంచి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ 916 మర్రి వృక్షాలను తొలగించాల్సి రావటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పర్యావరణ ప్రేమి కులు జాతీయ హరిత ట్రిబ్యునల్ను ఆశ్రయించటంతో రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే.మర్రి వృక్షాల పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళిక సమ ర్పించాలని హరిత ట్రిబ్యునల్ ఆదేశించిన నేపథ్యంలో తాజాగా ఎన్హెచ్ఏఐ సరికొత్త ఆలోచనతో మధ్యేమార్గాన్ని రూపొందించింది. గతంలో రూపొందించిన డిజైన్ను సవరించి రూపొందించిన కొత్త డిజైన్ను తాజాగా ట్రిబ్యునల్కు ఎన్హెచ్ఏఐ సమర్పించింది. మరోవైపు కేసు దాఖలు చేసిన పర్యావరణ ప్రేమికులు, ఆ డిజైన్ ప్రకారం వృక్షాల భద్రతపై ఈ వారంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి ట్రిబ్యునల్ ముందు తమ వాదనను వినిపించనున్నారు. ఇదీ చిక్కు...హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు ఉన్న 163 నంబర్ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఉన్న 46.405 కి.మీ. సర్వీసు రోడ్లతోపాటు నాలుగు వరసలుగా విస్తరించే బాధ్యతను ఎన్హెచ్ఏఐకి కేంద్ర ఉపరితల రవాణాశాఖ అప్పగించింది. మన్నెగూడ నుంచి పరిగి మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు ఉన్న భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని ఎన్హెచ్ విభాగానికి అప్పగించింది. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డుకిరువైపులా 60 నుంచి 85 ఏళ్ల వయసు ఉన్న 915 మర్రి వృక్షాలను తొలగించాల్సి రావటంతో పర్యావరణ ప్రేమికులు అభ్యంతరం తెలిపారు. ఆ రోడ్డును అలాగే ఉంచి ప్రత్యామ్నాయ రోడ్డును నిర్మించాలని డిమాండ్ చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసు దాఖలు చేశారు. తాజా పరిష్కారం ఇలా: రోడ్డును రెండు వైపులా కలిపి 60 మీటర్లకు విస్తరించాల్సి ఉంది. దీంతో అక్కడ ఉన్న అన్ని మర్రి వృక్షాలను తొలగించాలని గతంలో నిర్ణయించారు. ఇప్పుడు ఆ డిజైన్ను మార్చారు. తొలుత 5 మీటర్లుగా ప్రతిపాదించిన సెంట్రల్ మీడియన్ను ఇప్పుడు 1.5 మీటర్లకు తగ్గించారు. దీంతో కలిసి వచ్చే మూడున్నర మీటర్ల భాగాన్ని ప్రధాన కారేజ్వేలో కలిపేయటం ద్వారా వృక్షాలకు చేరువ వరకు మాత్రమే రోడ్డును విస్తరిస్తారు. వృక్షాల ఆవల సర్వీసు రోడ్డును నిర్మిస్తారు. అంటే.. సర్వీసు రోడ్డుకు, ప్రధాన క్యారేజ్ వేకు మధ్యలో ఆ వృక్షాలుంటాయి. రోడ్డు మీదకు వచ్చి వాహనాలకు ఇబ్బందిగా మారే కొమ్మలను తొలగిస్తారు. 150 వృక్షాలు మాత్రం ఈ డిజైన్కు అనుకూలంగా లేవు. దీంతో వాటిని ఉన్న చోట నుంచి ట్రాన్స్లొకేట్ పద్ధతిలో కాస్త పక్కకు మార్చి తిరిగి నాటుతారు. ఆ 150 వృక్షాలకు ఇప్పటికే రెడ్ మార్క్ వేశారు. అయితే, ఈ డిజైన్ ప్రకారం మర్రి వృక్షాల కొమ్మలు తొలగించనుండటంతో పర్యావరణ ప్రేమి కులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. -
నేడు పరేడ్గ్రౌండ్స్లో ‘హైదరాబాద్ లిబరేషన్ డే’
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో బుధవారం ‘హైదరాబాద్ లిబరేషన్ డే’జరగనుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 8.55 గంటలకు పరేడ్ గ్రౌండ్కు ఆయన చేరుకుంటారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. సీఆర్పీఎఫ్, ఇతర బలగాలు నిర్వహించే పరేడ్ను వీక్షిస్తారు. పారామిలటరీ దళాల ప్రత్యేక పరేడ్ కూడా ఉంటుంది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక (పూర్వ హైదరాబాద్ స్టేట్)లకు చెందిన సాంస్కృతిక బృందాల ప్రదర్శన, థీమ్ ఆధారిత బ్యాలె, దేశభక్తితో కూడిన ప్రదర్శనలు ఉంటాయి. ఈ సందర్భంగా సభికులను ఉద్ధేశించి రాజ్నాథ్సింగ్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు గజేంద్ర చౌహాన్, జి.కిషన్రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొంటారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక జూబ్లీ బస్టాండ్కు సమీపంలోని కంటోన్మెంట్ పార్క్లో ఏర్పాటు చేసిన భారతరత్న, మాజీ ప్రధాని ఏబీ వాజ్పేయి విగ్రహాన్ని రాజ్నాథ్సింగ్ ఆవిష్కరి స్తారు. అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళతారు. హైదరాబాద్ లిబరేషన్డేను పురస్కరించుకొని ఉదయం 6.30 గంటలకు అసెంబ్లీ వద్దనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అంజలి ఘటిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. -
నిజాం రాజు.. తలొగ్గిన రోజు
సాక్షి, హైదరాబాద్ : అదిగో సుశిక్షితులైన సైనికుల కవాతు.. వినీలాకాశంలో సమున్నతంగా రెపరెపలాడిన త్రివర్ణ పతాక దృశ్యం అదిగో.. హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించిన భారత సైనికులకు నీరాజనాలు పలుకుతున్న జనుల జయజయ ధ్వానాలవిగో.. 1948 సెప్టెంబరు 17న భాగ్యనగరంలో కనువిందు చేసిన దృశ్యం ఇది. నిజాం నిరంకుశ, రాచరిక పాలనకు చరమగీతం పాడిన రోజు ఇది. రజాకారుల అకృత్యాలతో నలిగిపోయిన ప్రజలు ఈ రో జు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. ఆనందోత్సాహాలతో వేడుకలు చేసుకున్నారు. భారత యూనియన్ బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ విజయవంతమై నిజాం నిరంకుశ పాలన అంతమైన ఆ రోజుపై భిన్నాభిప్రాయాలు, విభిన్న దృక్పథాలు ఉన్నప్పటికీ హైదరాబాద్ సంస్థానం సువిశాలమైన భారత యూనియన్లో భాగమైంది. ఒక నవ శకం ప్రారంభమైంది. ఆ రోజు ఏం జరిగిందంటే.. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిణామాలు వేగంగా జరిగాయి. భారత సైన్యం అన్ని వైపుల నుంచి నగరానికి చేరువైంది. హైదరాబాద్ ప్రధాని లియాఖత్ ఉదయమే తన పదవికి రాజీనామా చేశారు. ఓటమి అనివార్యమని నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్కు తెలిసిపోయింది. కేఎం మున్షీని కింగ్కోఠికి పిలిపించాడు. ‘పోలీసు చర్యను ఆహ్వానిస్తూ భద్రతా సమితికి ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని’ మున్షీ సూచించారు. ఈ మేరకు రేడియోలో ప్రసంగించాలని కోరారు. అందుకు నిజాం అంగీకరించాడు. కానీ.. అప్పటి వరకు రేడియోలో ప్రసంగించిన అనుభవం లేని నిజాం నవాబు దక్కన్ రేడియో స్టేషన్కు వెళ్లి తన లొంగుబాటును ప్రకటించాడు. అదే రోజు నిజాం సైన్యాధ్యక్షుడు ఇద్రూస్, భారత సైనిక బలగాల కమాండర్ జేఎన్ చౌధురి ఒక నిర్ణీత ప్రదేశంలో కలుసుకున్నారు. ‘బేషరతుగా లొంగిపోతున్నట్లు’ ఇద్రూస్ ప్రకటించాడు. ఆ తర్వాత ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. చౌధురి జట్కా బండి నగరంలోకి పరుగులు తీసింది. జనం జేజేలు.. నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లు ఉదయం నుంచే వార్తలు వెలువడ్డాయి. అప్పటి వరకు ఏ క్షణంలో ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో గడిపిన నగరవాసులు.. నెమ్మదిగా వీధుల్లోకి వచ్చారు. సికింద్రాబాద్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. భారత సైనికులకు స్వాగతం పలుకుతూ జేజేలు పలికారు. వేలాదిగా తరలి వచ్చిన జనంతో పరేడ్ గ్రౌండ్స్ జనసంద్రమైంది. త్రివర్ణ పతాకలు రెపరెపలాడాయి. ‘మహాత్మా గాందీకి జై’, పండిట్ నెహ్రూ జిందాబాద్, సర్దార్ పటేల్ జిందాబాద్, భారత్మాతాకీ జై’ అంటూ జనం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘రజాకార్ ముర్దాబాద్’ అనే నినాదాలు ప్రతిధ్వనించాయి. బొల్లారం నుంచి భారత సైనిక బలగాలు పరేడ్ గ్రౌండ్స్కు చేరుకున్నాయి. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాచరిక పాలన 1948 సెప్టెంబరు 17వ తేదీతో అంతమైంది. ఐదు రోజుల పోలీసుచర్య... హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య సెప్టెంబరు 13వ తేదీ సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. లెఫ్ట్నెంట్ జనరల్ మేజర్ రాజేంద్రసింగ్ నేతత్వంలో మేజర్ జనల్ జె.ఎన్.చౌధురి దీనికి సారథ్యం వహించారు. భారత సైన్యం నలు వైపుల నుంచి హైదరాబాద్ భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. షోలాపూర్ నుంచి బయలుదేరిన సైన్యం నల్దుర్గ్ కోటను స్వాదీనం చేసుకొని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ వైపునకు వచ్చింది. మేజర్ జనరల్ డీఎస్ బ్రార్ ముంబై నుంచి, ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఎ.ఎ. రుద్ర విజయవాడ వైపు నుంచి బ్రిగేడియర్ శివదత్త బేరార్ నుంచి బయలుదేరారు. అన్ని వైపుల నుంచి భారత సైన్యం హైదరాబాద్ను ముట్టడించింది. భారత వైమానిక ఎయిర్ మార్షల్ ముఖర్జీ సైతం తన సేవలను అందజేసేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో నిజాం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 1948 సెప్టెంబరు 14న దౌలతాబాద్, జల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్, సూర్యాపేట్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలను సైన్యం తన స్వాదీనంలోకి తీసుకుంది. లాతూర్, జహీరాబాద్ ప్రాంతాల్లో నిజాం సైనికులపై భారత సేనలు బాంబుల వర్షం కురిపించాయి. సెప్టెంబరు 16న రాంసింగ్ నేతృత్వంలోని సైనికులు జహీరాబాద్ను ఆక్రమించుకున్నారు. షోలాపూర్ నుంచి హైదరాబాద్ వరకు యూనియన్ సైనికుల పాదాక్రాంతమైంది. నిజాం సైనికులు బీబీనగర్, పటాన్చెరు, గచ్చిబౌలి, లింగంపల్లి, మల్కాపూర్ తదితర ప్రాంతాల్లో మందుపాతరలు పేల్చి సైన్యాన్ని అడ్డుకొనేందుకు విఫలయత్నం చేశారు. సైన్యం మరింత ముందుకు చొచ్చుకొని వచ్చింది. నిజాం సైన్యాధికారి ఎల్ ఇద్రూస్ చేతులెత్తేశారు. సెప్టెంబరు 17 సాయంత్రం 5 గంటలకు భారత సైనికులు హైదరాబాద్లోకి ప్రవేశించారు. ఇదీ హైదరాబాద్ సంస్థానం..» ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటకలోని హైదరాబాద్ సంస్థానం విస్తీర్ణం సుమారు 1,41,133 చదరపు కిలోమీటర్లు. » చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఆయన కింద 975 మంది జాగీర్దార్లు ఉండేవారు. వీరి అ«దీనంలో సాగుకు అనుకూలమైన 53,106 చదరపు కిలోమీటర్ల భూమి ఉండేది. » 1921 నవంబర్లో ఆంధ్ర మహాసభ ఏర్పాటైంది. రాజకీయ సంబంధమైన ఒక సంస్థ నిజాం సంస్థానంలో ఏర్పడడం ఇదే మొదటిసారి. 1923లో ఆర్య సమాజ్ హైదరాబాద్ శాఖ ఏర్పాటు చేశారు. » గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం 1937లో అనేక ప్రావిన్స్లలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ప్రభావం హైదరాబాద్ సంస్థానంపై పడింది. ‘బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలని’ ఆంధ్ర మహాసభ మొదటిసారిగా రాజకీయ డిమాండ్ను బాహాటంగా ప్రకటించింది. ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో కన్నడ పరిషత్, మహారాష్ట్ర పరిషత్ కూడా ఏర్పడ్డాయి. హైదరాబాద్ సంస్థానంలో కాంగ్రెస్ ప్రారంభమైంది. -
కొత్త డిస్కమ్కు గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడో విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుకు సంబంధించి విద్యుత్ అధికారులు రూపొందించిన ప్రణాళికకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఆర్థికపరమైన అంశాలపై మరింత అధ్యయనం చేయాలని సూచించారు. ఏయే సంస్థల నుంచి రుణాలు పొందే వీలుంది? ఎంత మేర రుణాలు తీసుకోవచ్చన్న దానిపై నిర్దిష్ట సమాచారం అందించాలని అధికారులకు చెప్పినట్టు తెలిసింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం రాత్రి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, జెన్కో ఎండీ హరీశ్రావు, సింగరేణి సీఎండీ బలరాం, డిస్కమ్ల సీఎండీలు ముషారఫ్, వరుణ్రెడ్డి, రెడ్కో చైర్మన్ శరత్ తదితరులు పాల్గొన్నారు. ఉచితాలన్నీ కొత్త డిస్కమ్ పరిధిలోకి..: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాలన్నీ కొత్త డిస్కమ్ పరిధి పర్యవేక్షణలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యవసాయం, ఎత్తిపోతల పథకాలు, గ్రామీణ మంచినీటి సరఫరా, జీహెచ్ఎంసీ పరిధిలోని తాగునీటి సరఫరాను కొత్త డిస్కమ్ పరిధిలోకి తెచ్చేందుకు వీలుగా రూపొందించిన ప్రణాళికను సీఎంకు అధికారులు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రెండు డిస్కమ్లు కమర్షియల్ ఆపరేషన్ విధులు నిర్వర్తిస్తాయని, కొత్త డిస్కమ్ ప్రభుత్వ పథకాలను పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఈ డిస్కమ్కు కావాల్సిన మానవ వనరులను రెండు డిస్కమ్ల పరిధి నుంచి తాత్కాలికంగా ఏర్పాటు చేయవచ్చని, కొంతమందిని తాత్కాలికంగా నియమించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో డిస్కమ్ ఏర్పాటుకు కావాల్సిన నిధుల సమీకరణపై ప్రభుత్వం చర్చించాల్సి ఉందని, కేబినెట్ ఆమోదం తర్వాత దీనిపై స్పష్టత ఇస్తామని సీఎం అన్నట్టు తెలిసింది. వీలైనంత త్వరగా కొత్త డిస్కమ్ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులు ఇస్తామని అన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రాజధానిలో అండర్ గ్రౌండ్ కేబుల్ రాష్ట్ర రాజధానితో పాటు, పరిసర జిల్లాల్లో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న వైనాన్ని అధికారులు సీఎంకు వివరించారు. భవిష్యత్తులో స్మార్ట్ టెక్నాలజీతో నడిచే ట్రాన్స్ఫార్మర్లు, కేబులింగ్ వ్యవస్థ అవసరాన్ని తెలియజేశారు. ఇతర దేశాల్లో అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం అమలులో ఉందంటూ.. దీన్ని రాజధానిలోనూ తీసుకొచ్చేందుకు రూపొందించిన సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు. ఎక్కువ స్థలం ఆక్రమించకుండా సబ్ స్టేషన్ల ఏర్పాటు విధానాన్ని ఇందులో ప్రస్తావించారు. ఆన్లైన్ విధానంలో సబ్ స్టేషన్లు, ఆధునిక టెక్నాలజీ ద్వారా వాటి పనితీరును గుర్తించే వ్యవస్థ గురించి వివరించారు. సబ్ స్టేషన్ సామర్థ్యానికి మించి విద్యుత్ కనెక్షన్లు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ అంతరాయాలను అదుపు చేయాలని సీఎం ఆదేశించారు. అవినీతిపై ఓ కన్నేయండి విద్యుత్ శాఖ అవినీతిమయమైందన్న ఆరోపణలు సర్వత్రా విన్పిస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నట్టు తెలిసింది. తాజాగా ఓ అధికారి ఏసీబీకి చిక్కడంపై ఆయన ఆరా తీశారు. విద్యుత్ సంస్థల్లో కీలకమైన అధికారులపైనా ఆరోపణలున్నాయని, ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారులు తమ దృష్టికి తెచ్చినట్టు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శితో సీఎం అన్నట్టు తెలిసింది. ఏసీబీతో సమన్వయం చేసుకుని, అక్రమ ఆస్తులున్న వారి జాబితాను రూపొందించాలని ఆయన సూచించినట్లు సమాచారం. జెన్కోలో ఓ డైరెక్టర్ స్థాయి అధికారి అవినీతి వ్యవహారంపై సీఎం ప్రత్యేకంగా ఆరా తీసినట్టు తెలిసింది. -
పట్టువిడుపులుంటేనే పరిష్కారం!
సాక్షి, హైదరాబాద్: సాదా బైనామా.. తెలంగాణ రైతాంగం పరిష్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న భూ సమస్య. దాదాపు 9.84 లక్షల దర ఖాస్తులకు సంబంధించిన 11 లక్షలకు పైగా ఎకరాలకు యాజమాన్య హక్కులు ఇచ్చే ప్రక్రియ. దీని అమలు కోసం ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోయినా, ఈ క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న, వ్యవహరించాల్సిన తీరుపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. చట్టం, నిబంధనల పేరుతో రైతులపై కఠినంగా కాకుండా అందరి ఆమోదం మేరకు ఉదారంగా వెళ్లడం ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భూ చట్టాల నిపుణులు చెబుతున్నారు. తొలుత మూడు.. ఆ తర్వాత మరిన్ని గతంలో ఉన్న ధరణి చట్టం స్థానంలో భూభారతి చట్టం తెచ్చినప్పుడు సాదా బైనామాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు కొత్త అంశాలను చేర్చింది. సమస్య పరిష్కారానికి 2020లో ప్రభుత్వానికి దర ఖాస్తు చేసుకుని ఉండాలని, 12 ఏళ్లుగా భూమి అనుభవంలో ఉండాలని, సమస్య పరిష్కారమయ్యేటప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కట్టాలని స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత చట్టానికి నిబంధనలు తయారు చేసేటప్పుడు అదనంగా మరికొన్ని నిబంధనలు పెట్టారు. సాదా బైనామా పరిష్కరించి 13 బీ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటే అంత ప్రభుత్వానికి చెల్లించాలని, సాదా బైనామాపై విచారణ సందర్భంగా కొన్న వ్యక్తితో పాటు అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధనలు విధించారు. ఈ అఫిడవిట్తోనే తంటా.. రాష్ట్ర ప్రభుత్వం సాదా బైనామాలను పరిష్కరించే క్రమంలో చట్టంలోని నిబంధనల మేరకు వెళ్తే సన్న, చిన్నకారు రైతాంగానికి చాలా ఇబ్బందులు వస్తాయని భూచట్టాల నిపుణులు చెపుతున్నారు. గత ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుని పరిష్కరించకుండా వెళ్లిపోతే, ఈ ప్రభుత్వం సదరు దరఖాస్తులను పరిష్కరించకపోగా, రైతులను ఇబ్బందుల్లోకి నెట్టిందని, కోర్టుల పాలు చేసిందనే అపప్రద మూటగట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి 2007 కంటే ముందు సాదా బైనామాలను పరిష్కరించే సమయంలో అమ్మిన వ్యక్తి సమ్మతి తప్పనిసరి అనే నిబంధన ఉండేది. కానీ దివంగత వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఆ నిబంధనను తీసేశారు. ఎప్పుడో అమ్మిన వ్యక్తి ఇప్పుడు అంగీకరించేందుకు ఇష్టపడక పోవచ్చు కాబట్టి చుట్టుపక్కల రైతులను విచారణ చేసి, లేదంటే గ్రామ పెద్దల స్టేట్మెంట్ ఆధారంగా కూడా క్రమబద్ధీకరించేందుకు వెసులుబాటు కల్పించారు. దీనికి తోడు పహాణీలోని సాగుదారు కాలమ్లో ఉన్న కొన్న వ్యక్తి పేరును ఆధారంగా పరిగణనలోకి తీసుకునేవారు. 2009–16 వరకు ఇదే పద్ధతిలో సాదా బైనామాలు క్లియర్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్న వారితో పాటు అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్ ఇవ్వాలంటే సమస్యను సృష్టించడమేనంటూ, ఆ నిబంధనను తొలగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం కూడా ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే రైతుల నుంచి రాతపూర్వక అభ్యంతరాలు తీసుకోవడంతో పాటు చుట్టు పక్కల రైతులను విచారించాలనేది నిబంధనగా చేర్చాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఆ దరఖాస్తుల సంగతేంటి? సాదా బైనామాల పరిష్కారానికి 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 9.84 లక్షల దరఖాస్తులు రాగా కొన్నింటిని అప్పట్లోనే పరిష్కరించినట్టు తెలుస్తోంది. అప్పట్లో వచ్చిన ధరణి చట్టంలో సాదా బైనామాల పరిష్కార అంశం లేనప్పటికీ ఆన్లైన్లో వచ్చిన దాదాపు 4 లక్షల దరఖాస్తులపై అప్పుడే నిర్ణయం తీసుకున్నారని, అందులో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులను తిరస్కరించారని తెలుస్తోంది. అయితే కొత్తగా వచ్చిన భూ భారతి చట్టంలో సాదా బైనామాల పరిష్కారం కోసం 2020లో దరఖాస్తు చేసి ఉండాలని మాత్రమే ఉంది కానీ, అప్పట్లో తిరస్కారానికి గురైతే మళ్లీ పరిశీలించకూడదని లేదు. ఈ చట్టం నిబంధనల్లోనూ దరఖాస్తుల తిరస్కరణ, ఆమోదం గురించిన ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన సమయం మధ్యలో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిశీలించి పరిష్కరించాల్సిందేనని నిపుణులు చెపుతున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా చట్టం, నిబంధనలపైనే ఆధారపడకుంగా సమ్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపిస్తూ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించుకుని ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. సాదా బైనామాలను ఉదారంగా పరిష్కరించకపోతే మరోమారు పరిష్కారానికి అవకాశం లేదు కాబట్టి రైతులు నష్టపోతారని, మళ్లీ సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుందని వారు చెపుతున్నారు. చెక్లిస్టు, ఎంక్వైరీ ఫార్మాట్, ప్రాసెస్ విషయంలో ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాలని అంటున్నారు. ఉదారంగా వెళ్లడమే మేలు సాదా బైనామా అనేది తెలంగాణలో పెద్ద భూసమస్య. 1989 నుంచి నలుగుతున్న సమస్య. అది కూడా చిన్న, సన్నకారు రైతులకు సంబంధించింది. కొన్న మాట వాస్తవమా?.. కాదా?, సాగులో ఉన్నారా?.. లేదా? అన్నది క్షుణ్ణంగా పరిశీలింకుని మిగిలిన అంశాల్లో పట్టుదలకు పోకుండా ప్రభుత్వం కొంత ఉదారంగా వ్యవహరించాలి. అదే సమయంలో అవకతవకలు జరగకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలి. – భూమి సునీల్, భూచట్టాల నిపుణుడు సాదాబైనామా క్లియరెన్స్ కోసం ఏముండాలంటే...! – భూమి రైతు ఆదీనంలో కొనసాగుతుండాలి – 12 సంవత్సరాలుగా సదరు వ్యక్తి అనుభవంలో ఉండాలి – కొనుగోలు చేసినట్టుగా పత్రం లేదా పహాణీలోని సాగుదారు కాలమ్లో పేరు ఉండాలి. సాదా బైనామా.. కథా కమామిషు తెలంగాణ రైతాంగానికి సుపరిచితమైన ఈ సాదా బైనామాల వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది. నిజాం రాజ్యం నుంచి నిన్న మొన్నటి వరకు కూడా రాష్ట్ర రైతాంగం కేవలం తెల్ల కాగితాలపై రాసుకోవడంతో పాటు నోటి మాటలతో వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు జరిపింది. వీటినే సాదా బైనామాలంటున్నారు. నిరక్షరాస్యతతో పాటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కావాలంటే ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి వస్తుందనే కారణంతో కొందరు రైతులు ఈ ప్రక్రియ ద్వారా భూముల యాజమాన్య హక్కును మార్చుకునే వారు. కానీ కొన్ని వ్యక్తికి అధికారికంగా ఎలాంటి హక్కులు వచ్చేవి కావు. తెలంగాణ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)లో తొలిసారిగా 1989లో సాదా బైనామాలను క్రమబద్ధీకరించే ప్రక్రియ మొదలైంది. ఆ తర్వాత 1996, 97.. ఇలా ఇప్పటికి 13 సార్లు ఉచితంగా ఈ తరహా భూములను క్రమబద్ధీకరించారు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016, 2017లో కూడా క్రమబద్ధీకరణ జరిగింది. చివరిసారిగా 2020లో ఆన్లైన్లో దరఖాస్తులు. ఇప్పుడు ఈ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియనే జరుగుతోంది. అయితే గతానికి భిన్నంగా ఈసారి ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలనే నిబంధన విధించారు. -
''నాకు సాయం చేయండి సార్'.. జైశంకర్కు హైదరాబాద్ యువతి అభ్యర్థన
హైదరాబాదీ యువతి భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్కు లేఖ రాసిందిహైదరాబాదీ యువతి హనా అహ్మద్ ఖాన్ జూన్ 2022లో చికాగోలో పోలీస్గా పనిచేస్తున్న మహ్మద్ జైనుద్దీన్ ఖాన్ (అమెరికా పౌరుడు)ని వివాహం చేసుకుంది. అనంతరం ఫిబ్రవరి 2024లో ఆమె అమెరికాలోని చికాగోలో తన భర్తతో కలిసి నివసించేవారు. కొన్నాళ్లకు జైనుద్దీన్ ఖాన్ ఆమెను మానసిక వేధింపులు, శారీరక వేధింపులకు గురి చేశాడు. కొంతకాలం తరువాత హజ్ యాత్రకు తీసుకెళ్తానని చెప్పి జైనుద్దీన్ ప్రణాళికాబద్ధంగా ఫిబ్రవరి 7, 2025న ఆమెను హైదరాబాద్కు తీసుకువచ్చాడు. సోమాజిగూడలోని పార్క్ హోటల్లో ఓ రూమ్ తీసుకున్నారు. అనంతరం ఆమె తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళగా, ఆమె భర్త పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్, ఆభరణాలు వంటి అన్ని వస్తువులతో హోటల్ను ఖాళీ చేసి అమెరికాకు తిరిగి వెళ్లిపోయాడు. దాంతో వెంటనే హనా అహ్మద్ పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలలుగా తన భర్తను సంప్రదించడానికి ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆమె న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయాన్ని, హైదరాబాద్లోని USA కౌన్సెలేట్ను సంప్రదించడానికి ప్రయత్నించింది కానీ ఆమె ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ జోక్యం చేసుకుని తన భర్తపై చట్టపరంగా పోరడడానికి, USAకి తిరిగి వెళ్లడానికి అవసరమైన వీసా మంజూరు చేయమంటుంది. న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయం, హైదరాబాద్లోని USA కౌన్సెలేట్కు ఆదేశాలవ్వగలరని ఆమె అభ్యర్థించింది. ఈ విషయంలో తీసువాల్సిన అవసరమైన చర్యలను తెలియజేయగలరంటూ భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్కు తన లేఖలో పేర్కొంది. -
చావుకబురు ‘చల్లగా’.. అక్టోబర్ నుంచే ఎముకలు కొరికే చలి..
ఈ సంవత్సరం చివర్లో లా నినా పరిస్థితులు తిరిగి రావచ్చని, ఇది ప్రపంచ వాతావరణ నమూనాలను నిర్ధేశ్యించనుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. మన శీతాకాలాన్ని సాధారణం కంటే చాలా చల్లగా మార్చే అవకాశం ఉందని వీరు హెచ్చరిస్తున్నారు. రానున్న అక్టోబర్ డిసెంబర్ 2025 మధ్య లా నినా అభివృద్ధి చెందడానికి 71 శాతం అవకాశం ఉందని సెప్టెంబర్ 11న నేషనల్ వెదర్ సర్వీస్కు చెందిన క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్ తెలిపింది. ఇది అలాగే కొనసాగి డిసెంబర్ 2025 నుంచి తగ్గడం మొదలవుతుందని ఫిబ్రవరి 2026 మధ్యకు వచ్చేసరికి 54%కి తగ్గుతుందని వెల్లడించింది. కానీ లా నినా వాచ్ అప్పటికీ ప్రభావం చూపుతూనే ఉంటుందంది.ఎల్ నినో–సదరన్ ఆసిలేషన్ (ఇఎన్ఎస్ఓ) శీతలీకరణ దశ అయిన లా నినా, భూమధ్యరేఖ పసిఫిక్లో సముద్ర ఉష్ణోగ్రతలను మారుస్తుంది తద్వారా ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై చాలా గాఢమైన ప్రభావాలను చూపుతుంది. ఈ ప్రభావం భారతదేశంపైన ఎలా ఉంటుంది అనే విషయానికొస్తే, ఇది తరచుగా సాధారణం కంటే చల్లగా ఉండే శీతాకాలాలను మనం ఎదుర్కోవలసి రావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.భారత పౌరాణిక విభాగం (ఐఎమ్డి) తన ఇటీవలి తన ఇఎన్ఎస్ఓ బులెటిన్లో భూమధ్యరేఖ పసిఫిక్పై ప్రస్తుతం తటస్థ పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది అంటే ఎల్ నినో లేదా లా నినా పరిస్థితి లేదు). ఐఎమ్డి కి చెందిన మాన్సూన్ మిషన్ క్లైమేట్ ఫోర్కాస్ట్ సిస్టమ్ (ఎమ్ఎమ్సిఎఫ్ఎస్) ఇతర అంచనాలు, ఈ తటస్థ పరిస్థితులు రుతుపవనాల సీజన్ మొత్తం కొనసాగుతాయని తేల్చాయి. అయితే రుతుపవనాల తర్వాత నెలల్లో లా నినా ఆవిర్భవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా అంచనా వేశాయి.ఈ నమూనాలు ఈ సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ (50% కంటే ఎక్కువ) మధ్య లా నినా అభివద్ధి చెందే అవకాశాలను చూపిస్తున్నాయని ఐఎమ్డి శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. వాతావరణ మార్పులు భూ ఉపరితలం వేడెక్కడం ప్రభావం కొంతవరకు దీనిని భర్తీ చేయగలదు, లా నినా ఉన్న శీతాకాలాలు అది లేని సంవత్సరాలతో పోలిస్తే మరింత చల్లగా ఉంటాయని స్పష్టం చేశారు.ప్రైవేట్ ఫోర్కాస్టర్ స్కైమెట్ వెదర్ అధ్యక్షుడు జిపి శర్మ మాట్లాడుతూ స్వల్పకాలిక లా నినా ఎపిసోడ్ను తోసిపుచ్చలేమని అన్నారు. ‘పసిఫిక్ మహా సముద్రం ఇప్పటికే సాధారణం కంటే చల్లగా ఉంది, అయినప్పటికీ లా నినా పరిమితుల వద్దకు ఇంకా రాలేదు. అయితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు –0.5నిఇ కంటే తక్కువగా పడిపోయి అదే విధంగా కనీసం మూడు త్రైమాసికాల పాటు కొనసాగితే, దానిని లా నినాగా ప్రకటిస్తారు.2024 చివరిలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. నవంబర్ నుంచి జనవరి వరకూ లా నినా పరిస్థితులు కాస్త కనిపించి, మళ్ళీ తటస్థంగా మారిందన్నారు. కొనసాగుతున్న పసిఫిక్ శీతలీకరణ ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని శర్మ అన్నారు. ‘లా నినా ప్రారంభమైతే ఏర్పడే పొడి శీతాకాలాల కోసం అమెరికా ఇప్పటికే అప్రమత్తంగా ఉంది. భారత దేశానికి, చల్లటి పసిఫిక్ జలాలు సాధారణంగా కఠినమైన శీతాకాలాలుగా మారతాయి.ముఖ్యంగా ఉత్తర హిమాలయ ప్రాంతాలలో హిమపాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది‘ అని ఆయన అంచనా వేస్తున్నారు. మొహాలి (పంజాబ్)లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఇఆర్) బ్రెజిల్లోని నేషనల్ ఇన్సి్టట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్ చేసిన 2024 అధ్యయనం ప్రకారం, ఉత్తర భారతదేశంపై తీవ్రమైన చలి తరంగాలను ప్రేరేపించడంలో లా నినా పరిస్థితులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేలింది. ‘లా నినా సమయంలో దేశంలోకి చల్లని గాలి ప్రవేశిస్తుంది. ‘ఎల్ నినో, తటస్థ సంవత్సరాలతో పోలిస్తే లా నినా సంవత్సరాల్లో శీతల తరంగ సంఘటనల ఫ్రీక్వెన్సీ వ్యవధి కూడా ఎక్కువగా ఉన్నాయి‘ అని అధ్యయనం తేల్చింది. -
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్రెడ్డి నియమితులయ్యారు. అర్బన్ ట్రాన్స్పోర్ట్ సలహాదారుగా రెండేళ్లపాటు ఆయన కొనసాగనున్నారు.హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్, ఉమెన్ అండ్ చైల్డ్వెల్ఫైర్ డైరెక్టర్గా శ్రుతి ఓజా, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా కృష్ణ ఆదిత్య, హెచ్ఎండీఏ సెక్రటరీగా కోటా శ్రీవాత్స, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిగా ఎం.రాజారెడ్డి నియమితులయ్యారు. -
తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు దాడులు జరిపారు. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా 809 మెడికల్ షాపులు,అనధికార వైద్యులకు సంబంధించిన ఆస్పత్రులలో డీసీఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 234 మెడికల్ షాపుల్లో అబార్షన్ కిట్లు అమ్ముతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా మైఫెప్రిస్టోన్, మిసోప్రోస్టాల్ వంటి మందులు లైసెన్స్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్నట్లుగా పలు ఆధారాల్ని సేకరించారు. దీంతో సదరు మెడికల్ షాపులను సీజ్ చేస్తూ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరు 234 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 165 మెడికల్ షాపుల లైసెన్సులు సస్పెండ్ చేయడంతోపాటు ఏడు మెడికల్ షాపుల లైసెన్సులు పూర్తిగా రద్దు చేశారు. అక్రమంగా అబార్షన్ కిట్లు మహిళలకు ప్రమాదం. అందుకే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ దాడులు కొనసాగుతాయి అధికారులు తెలిపారు. అనధికార మెడికల్ షాపుల వద్ద అబార్షన్ కిట్లు, మందులు కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి హానికరం. ప్రజలు నిబంధనల ప్రకారం మాత్రమే మందులు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. -
కాలి నరం ద్వారా 600 గ్రాముల బరువుగల చిన్నారికి గుండె చికిత్స
హైదరాబాద్: ఏడు నెలలకే.. అంటే నెలలు నిండకముందే పుట్టిన ఒక శిశువుకు గుండెకు సంబంధించిన సమస్య వచ్చింది. అతడికి గచ్చిబౌలి కిమ్స్ వైద్యులు అత్యాధునిక పద్ధతిలో, శస్త్రచికిత్స అవసరం లేకుండా నయం చేసి ప్రాణం పోశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ నియోనాటాజిస్ట్ డా. భవాని దీప్తి మరియు కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుదీప్ వర్మ తెలిపారు.“నగరంలోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన దంపతులకు నెలలు నిండకముందే ఏడు నెలలకే ఒక బాబు పుట్టాడు. దీంతో అత్యవసర పరిస్థిత్తుల్లో 97 రోజుల పాటు బాబును ఎన్ఐసియూ లో ఉంచాల్సి వచ్చింది. ఈ సమయంలో ఊపిరితిత్తుల నుండి రక్తం రావడం మరియు గుండె సంబంధిచిన పీడిఏ సమస్య వల్ల వెంటి లేటర్ అవసరం పడింది.తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఊపిరితిత్తులకు, మిగిలిన శరీరానికి, రక్త సరఫరా చేసే రక్తనాళాలకు మధ్య ఒక గొట్టం లాంటిది ఉంటుంది. పుట్టిన 7 నుంచి 10 రోజుల్లో అది మూసుకుపోతుంది. కానీ, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు అది మూసుకోవడం కష్టం అవుతుంది. దీనినే పీడిఏ అంటారు. ఈ సమస్య వల్ల ఊపిరితిత్తులకు రక్తం ఎక్కువగా వెళ్లి ఒత్తిడి పెరుగుతుంది. గుండె పనితీరు దెబ్బతింటుంది. నెలలు నిండని శిశువుల్లో 80% మందికి ఈ తరహా సమస్య ఉంటుంది. అప్పుడు ఊపిరితిత్తులు పనిచేయకపోవడం, గుండె కూడా దెబ్బతినడంతో వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది.ఈ సమస్యకు ముందుగా మందులు వాడి చూస్తారు. వాటితో నయమైతే పర్వాలేదు. లేకపోతే మాత్రం తప్పనిసరిగా శస్త్రచికిత్స గానీ, ఇలాంటి డివైస్ తో మూసేయడం గానీ చేయాలి. లేకపోతే ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది. ఇంతకాలం ఎదభాగానికి ఒక పక్క నుంచి శస్త్రచికిత్స చేసి ఆ రంధ్రాన్ని మూసేసేవారు. కానీ, ఈ కేసులో బాబు అతి తక్కువ బరువు ఉండడం, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉండడంతో శస్త్రచికిత్స చేయడం అంత సురక్షితం కాదని భావించాం. అందుకే అత్యాధునిక పరికరంతో ఆ రంధ్రాన్ని మూసేయాలని నిర్ణయించాం. సర్జరీ చేసే సమయానికి అతడి బరువు కేవలం 600 గ్రాములు మాత్రమే ఉన్నాడు.1.2 మిల్లీమీటర్లు చుట్టుకొలత ఉన్న పికోలో అనే అత్యాధునిక పరికరాన్ని కాలి నరం ద్వారా లోపలకు పంపి, దాని సాయంతో రంధ్రాన్ని మూసేశాం. ఈ డివైస్ అమర్చి కోలుకున్న శిశువుల్లో దేశంలోనే అతి తక్కువ బరువు గల చిన్నారిగా రికార్డు సృష్టించాడు. దీంతో రంధ్రం పూడుకుపోయి, బాబుకు ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ నయమయ్యాయి. ఈ ప్రొసీజర్ తర్వాత ఎన్ఐసీయూలో డాక్టర్ భవానీ దీప్తి, డాక్టర్ సింధు మారు బృందం బాబును కంటికి రెప్పలా కాపాడుకున్నారు.శస్త్రచికిత్స అవసరం లేకుండానే పీడీఏ మూయడానికి ఈ పరికరం గేమ్ఛేంజర్ అవుతుంది. బాబుకు ఇక ఎలాంటి సమస్యలు లేకపోవడంతో పాలు కూడా తాగడం మొదలుపెట్టాడు. తర్వాత 2.45 కిలోలకు బరువు పెరగడంతో డిశ్చార్జి చేశాం” అని డాక్టర్ భవనీ దీప్తి మరియు డా.సుదీప్ వర్మ వివరించారు. -
ఏసీబీకి ఏకంగా డైనోసార్ చిక్కింది.. ఏడీఈ అంబేద్కర్ ఆస్తులు 300కోట్లు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఏసీబీకి భారీ అవినీతి తిమింగలం కాదు.. ఏకంగా డైనోసార్ చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్శాఖ ఏడీఈ అంబేద్కర్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.గత కొంతకాలంగా ఏడీఈ అంబేద్కర్కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం అంబేద్కర్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కోట్లలో నగదును స్వాధీనం చేసుకున్నారు. మణికొండలోని ఏడీఈ ఇల్లు,బంధువులు,కుటుంబసభ్యుల ఇళ్లతో పాటు గచ్చిబౌలి,మాదాపూర్ సహా 15 చోట్ల ఏసీబీ సోదాలు జరిపింది. విద్యుత్శాఖ ఏడీఈ అంబేద్కర్ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఇతర జిల్లాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు అంబేద్కర్ రూ.300కోట్లకుపైగా ఆస్తిపాస్తులున్నట్లు గుర్తించారు.పదెకరాల స్థలంలో పెద్ద కంపెనీ ఏర్పాటు చేసినట్లు ఏసీబీ అధికారుల సోదాల్లో తేలింది. -
మెట్రో రైళ్లలో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్జెండర్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మెట్రో రైళ్లలో 20 మంది ట్రాన్స్జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా ప్రభుత్వం నియమించింది. మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ గార్డులుగా వారికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నియామక పత్రాలు అందించారు. సెక్యూరిటీ గార్డు నియామకాల కోసం దాదాపు 300 మంది దరఖాస్తు చేసుకోగా, నైపుణ్యం కలిగిన వారిని ప్రభుత్వం ఎంపిక చేసింది.ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ట్రాన్స్జెండర్ల అభ్యున్నతి, వారు ఆత్మగౌరంతో జీవించాలన్నదే సీఎం సంకల్పమన్నారు. ట్రాన్స్జెండర్లు సమాజంలో గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించామన్నారు. కష్టపడి పనిచేస్తే మీకే కాకుండా, ఇతర ట్రాన్స్జెండర్లకు కూడా మంచి భవిష్యత్తు ఏర్పడుతుందన్నారు. ట్రాన్స్జెండర్లు.. ఈ సమాజానికి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకోవాలి. ట్రాన్స్జెండర్లకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి కచ్చితంగా అమలు చేస్తారు’’ అని మంత్రి పేర్కొన్నారు. -
ఏ ప్రాంతం ఏ జోన్లోనో..?
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ఆర్ వరకు భవన నిర్మాణాలు, లే అవుట్ల కోసం హెచ్ఎండీఏ అనుమతులను అందజేస్తోంది. కానీ ఈ అనుమతులపైన నిర్మాణసంస్థలు, ‘రియల్’ వర్గాలు సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి.‘మాస్టర్ప్లాన్–2050 ’రూపొందించకుండానే ఇస్తున్న అనుమతుల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటే ఆర్థికంగా భారీగా నష్టపోవలసి రావచ్చునని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అందజేస్తున్న అనుమతులకు భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు ఉండబోవని, కొత్తగా తయారుచేస్తున్న మాస్టర్ప్లాన్కు అనుగుణంగానే అనుమతులను ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ గత అనుభవాల దృష్ట్యా జోన్ల మార్పుపైన వివిధ వర్గాల నుంచి ఆందోళన వెల్లువెత్తుతోంది. అప్పటి మాస్టర్ప్లాన్ అమల్లోకి రావడానికి ముందే కొన్ని ప్రాంతాలను రెసిడెన్షియల్ జోన్లుగా భావించి అపార్ట్మెంట్లు, భవన నిర్మాణ లే అవుట్లకు అనుమతులను ఇచ్చారు. కానీ ఆ తరువాత వివిధ ప్రాంతాల్లోని నివాసిత స్థలాలు కన్జర్వేషన్ జోన్లోకి మారాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు మొదలుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అప్పటి మాస్టర్ప్లాన్ ప్రకారం నివాసిత మండలాల జాబితా లోంచి కన్జర్వేషన్ జోన్లోకి మారిన ప్రాంతాలను తిరిగి నివాసిత జోన్లోకి మార్చేందుకు రూ.లక్షల్లో ఫీజులు చెల్లించవలసి వచ్చిందని,ప్రస్తుతం మాస్టర్ప్లాన్–2050 అమల్లోకి రాకుండానే ఇప్పుడు ఇచ్చే అనుమతుల వల్ల మరోసారి అలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నిర్మాణ రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకీ సమస్య.. మాస్టర్ప్లాన్–2050కి అనుగుణంగానే ప్రస్తుతం అనుమతులను అందజేస్తున్నట్లు అధికారులు భరోసాను ఇస్తున్నారు. కానీ వివిధ వర్గాలకు చెందిన ప్రజల నుంచి రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ అంశంపైన కొంత గందరగోళం నెలకొంది. అప్పట్లో రంగారెడ్డి జిల్లా పులిమామిడి ప్రాంతంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఓ బడా నిర్మాణ సంస్థ వేసిన లే అవుట్లకు హెచ్ఎండీఏ అనుమతులను అందజేసింది. కానీ ఆ తరువాత అమల్లోకి వచ్చిన మాస్టర్ప్లాన్ ప్రకారం ఆ ప్రాంతమంతా కన్జర్వేషన్ జోన్లోకి మారిపోయింది. దీంతో అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. కన్జర్వేషన్ నుంచి మరోసారి రెసిడెన్షియల్ జోన్లోకి మార్చుకొనేందుకు స్థలాల కొనుగోలుదార్లు రూ.లక్షల్లో ఫీజులు చెల్లించవలసి వచ్చింది. ఒక్క పులిమామిడి ప్రాంతంలోనే కాకుండా అనేక చోట్ల ఇలాంటి సమస్యలు తలెత్తాయి. చాలా ప్రాంతాల్లో అప్పటి మాస్టర్ప్లాన్లోని లోపాలపైన ఇప్పటికీ దిద్దుబాటు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చెరువులు, కుంటలు, తదితర జలవనరులకు సమీపంలో ఉన్న రెసిడెన్షియల్ జోన్లలోని స్థలాల మార్పు కోసం హెచ్ఎండీఏ అధికారులు దిద్దుబాటు చర్యలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల జలవనరులు ఉన్న ప్రాంతాలు కూడా నివాసిత మండలాల జాబితాలోకి మారిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మాస్టర్ప్లాన్–2030 స్థానంలో కొత్తగా రానున్న మాస్టర్ప్లాన్–2050 నేపథ్యంలో హెచ్ఎండీఏ అనుమతులపైన గందరగోళం నెలకొంది. మాస్టర్ప్లాన్ లక్ష్యం ఏంటి.. హైదరాబాద్ మహానగరాభివృద్ధి కోసం రాబోయే ఇరువై ఐదు సంవత్సరాలను లక్ష్యంగా చేసుకొని హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్ఎంఏ) కోసం మాస్టర్ప్లాన్–2050 ను రూపొందిస్తున్నారు. హైదరాబాద్నగరాన్ని ప్రపంచంలోని 10 అగ్రగామి గ్లోబల్నగరాల పక్కన నిలిపే లక్ష్యంతో రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా అభివృద్ధికి అనుగుణంగా మెగామాస్టర్ప్లాన్కు కసరత్తు చేపట్టారు. హైదరాబాద్ మహానగర పరిధి 7,257 చదరపు కిలోమీటర్ల నుంచి 10,472.723 చదరపు కిలోమీటర్లకు పెరిగిన సంగతి తెలిసిందే. నగరం చుట్టూ సుమారు 354 కిలోమీటర్ల పరిధిలోనిర్మించనున్న రీజనల్రింగ్రోడ్డు వరకు అభివృద్ధి ప్రణాళికల కోసం హెచ్ఎండీఏ ఈ కసరత్తు చేపట్టింది. ఈ మెగామాస్టర్ప్లాన్ మూడు విభాగాలుగా ఉంటుంది. మొదటిది ఆర్థికమండళ్లు, పారిశ్రామిక ప్రాంతాలు, అంతర్జాతీయ బహుళ జాతి సంస్థల వ్యాపార కార్యకలాపాల విస్తరణ కోసం ఆర్థికాభివృద్ధి ప్రణాళిక (ఎకనమిక్ డెవలప్మెంట్ ప్లాన్) కాగా, రెండోది హైదరాబాద్ మెట్రో ఏరియా వరకు రహదారులు, మౌలిక సదుపాయలు, ప్రజారవాణా సదుపాయాల విస్తరణ కోసం కాంప్రహెన్సివ్ మొబిలిటీప్లాన్, జలనరులు, అర్బన్ఫారెస్ట్లు, పచ్చదనం అభివృద్ధి లక్ష్యంగా మూడో ప్రణాళిక బ్లూగ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ ఉంటుంది. ప్రస్తుతం ఈ మూడు వివిధ దశల్లో ఉన్నాయి. అనుమతులు తారుమారైతే ఎలా..‘వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న కొత్త మాస్టర్ప్లాన్ ప్రకారమే ఇప్పుడు అనుమతులను ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ అనుమతులు తారుమారైతే పరిష్కారమేంటనే దానిపైన మాత్రం స్పష్టత లేదు.’ అని షాద్నగర్ ప్రాంతానికి చెందిన రియల్టర్ ఒకరు తెలిపారు. ఇటీవల తాము 10 ఎకరాల్లో లే అవుట్ అనుమతులు తీసుకున్నామని, భవిష్యత్తులో ఈ ప్రాంతం ఏ జోన్లోకి మారుతుందో తెలియడం లేదని పేర్కొన్నారు. ఒకవేళ ఈ ప్రాంతం ఆర్ధిక మండలాల జాబితాలోకి, లేదా బ్లూగ్రీన్ జోన్లోకి మారినా తాము పెద్ద మొత్తంలో నష్టపోవలసి వస్తుందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొత్త మాస్టర్ప్లాన్ను రూపొందిస్తున్నారు. అడవులు, జలవనరుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. 2050 నాటికి హైదరాబాద్ జనాభా 3.5 కోట్లు దాటే అవకాశం ఉంటుందనే అంచనాలతో ఈ విస్తరణ ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడిస్తోన్న నిర్మాణరంగ అనుమతులపైన మరింత స్పష్టత రావలసి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
3 కోట్లకు ఎన్ని సున్నాలుంటాయో తెలీదు: గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తమపై జరుగుతున్న అసత్య ప్రచారం.. సంచలన ఆరోపణలపై తెలంగాణ గ్రూప్-1 ర్యాంకర్లు, వాళ్ల తల్లిదండ్రులు స్పందించారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో.. రీవాల్యూయేషన్ పేరిట హైకోర్టు వీళ్ల ఆశలపై నీళ్లు చల్లని సంగతి తెలిసిందే. అదే సమయంలో రాజకీయంగానూ వీళ్లపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సుమారు 200 మంది అభ్యర్థులు, వాళ్ల తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.టీఎస్పీఎస్సీ (TSPSC) నిర్వహించిన గ్రూప్-1 నియామక ప్రక్రియలో అవకతవకలు, పేపర్ మూల్యాంకనంలో అక్రమాలు, రాజకీయ జోక్యం ఉన్నాయని ఆరోపణలు బలంగా వినిపించాయి. ఈ క్రమంలో ఒక్కో ఉద్యోగానికి రూ.3 కోట్ల చొప్పున రూ.1700 కోట్ల కుంభకోణం జరిగిందనే ప్రభుత్వం, రిక్రూట్మెంట్ బోర్డుపైనా ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. మరోవైపు.. మెయిన్స్ పరీక్షల వాల్యూయేషన్లో అవకతవకలు జరిగాయని, కొందరికి అసాధారణ ర్యాంకులు వచ్చాయని.. ఆఖరికి పరీక్ష రాయనివారికి కూడా ఫలితాలు ఇచ్చారని ఆరోపిస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే కోర్టు ర్యాంకులు రద్దుచేస్తూ రీవాల్యూయేషన్ జరపాలని ఆదేశించింది.అయితే అప్పులు చేసి తమ పిల్లల్ని చదివించుకున్నామని.. అలాంటిది రూ.3 కోట్లు లంచాలు ఇచ్చి ఉద్యోగులు కొన్నామనే ప్రచారం తగదని తల్లిదండ్రులు వాపోయారు. రూ.3 కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తమలో కొందరికి తెలియదని అన్నారు ‘‘పస్తులుండి.. అప్పులు చేసి చదివించాం.. కష్టపడి మా పిల్లలు ఉద్యోగాలు సంపాదించారు. పేద విద్యార్థులే కష్టపడి గ్రూప్ 1ల్లో మెరిట్ ర్యాంకులు సాధించారు. రూ.3 కోట్లు చెల్లించి ఉద్యోగాలు కొనుగోలు చేశామనే ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారం ఎంతగానో బాధిస్తోంది. అంత డబ్బే ఉంటే వేరే వ్యాపారాలు చేసుకునేవాళ్లం. నిరుద్యోగులు పెళ్లిళ్లు చేసుకోకుండా.. కొన్ని ఏళ్ల నుంచి చదువుకున్నారు. యూపీఎస్సీ పరీక్షల కోసం కాకుండా ఈ పరీక్ష కోసమే ప్రిపేర్ అయ్యారు. అలాంటిది ఇప్పుడు అసత్య ఆరోపణలు మనోవేదనకు గురి చేస్తున్నాయి. రాజకీయాలు పార్టీల మధ్య ఉండాలి కానీ నిరుద్యోగులపై చూపించొద్దు. ఎన్నికల్లో ఓడితే మళ్లీ ఎన్నికలు పెట్టమని కోర్టులకెళ్తారా?. ఆరోపణలు చేస్తున్నవాళ్లు వాటిని నిరూపించాలి. వాటిపై ఎలాంటి విచారణకైనా మేం సిద్ధం. కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం. గ్రూప్-1ను ఇంకెంత కాలం నిర్వహిస్తారో రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టత ఇవ్వాలి. మా పిల్లలు కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారు. ఎలాగైనా మాకు న్యాయం చేయాలి.’’ అని ర్యాంకర్ల తల్లిదండ్రులు పలువురు కంటతడి పెట్టుకున్నారు. ఈ క్రమంలో.. ‘‘ఉద్యోగ భర్తీ మీద రాజకీయాలు ఎందుకు?’’, ‘‘మూడు కోట్లు ఎక్కడ?’’ అంటూ పలు ఫ్లకార్డులు ప్రదర్శించి తమ నిరసన తెలియజేశారు.xహైకోర్టులో ఏం జరిగింది?మెయిన్స్ వాల్యూయేషన్లో అవకతవకలు జరిగాయన్న వాదనలతో హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం ఏకీభవించింది. ర్యాంకులను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. మెయిన్స్ పేపర్లను తిరిగి రీవాల్యూయేషన్ చేయాలని, ఈసారి అవకతవకలు లేకుండా చూడాలని, మళ్లీ అవకతవకలు జరిగినట్లు తేలితే ఊరుకోబోమని.. మళ్లీ పరీక్షకు తామే ఆదేశిస్తామని స్పష్టం చేసింది. ఈ క్రమంలో 8 నెలల్లోగా రీవాల్యూయేషన్ ప్రకక్రియ పూర్తి చేయాలని, అలాకాని పక్షంలో మళ్లీ పరీక్ష నిర్వహించే దిశగా ఆలోచనలు చేయాలని సూచించింది. మొత్తం 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 9న ప్రిలిమ్స్, అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది. ఈ ఏడాది మార్చి 30న ఫలితాలను వెల్లడించింది. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలిచింది. కొందరు అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష నిర్వహణ, మూల్యాంకనం విధానాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఇలా దాఖలైన మొత్తం 12 పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదప్రతివాదనలు, పత్రాల పరిశీలన, విశ్లేషణ అనంతరం మంగళవారం 222 పేజీల సంచలన తీర్పును వెలువరించింది. అయితే.. కష్టపడి చదివిన తమ శ్రమ వృధా అవుతుండడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ కొందరు ర్యాంకర్లు హైకోర్టు డివిజనల్ బెంచ్ను ఆశ్రయించే యోచనలో ఉన్నారు. -
జూబ్లీహిల్స్తో ‘బిహార్’ మెలిక..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో ‘బిహార్ కూటమి’కి మెలిక పెట్టేందుకు ఆల్ ఇండియా మజ్లిస్–ఎ–ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) సిద్ధమవుతోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో మజ్లిస్ గత మూడు పర్యాయాలుగా అక్కడ పాగా వేసేందుకు ప్రయతి్నస్తూనే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో అధికార కాంగ్రెస్కు మిత్ర పక్షం కానప్పటికీ... ప్రభుత్వ నిర్ణయాలకు సహకరిస్తూ వస్తోంది. అయితే తాజాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్, ఆర్జేడీ సారథ్యంలోని మహా కూటమి(ఇండియా)లో చేరేందుకు అసక్తి చూపుతున్నా....కూటమి నుంచి సానుకూల స్పందన రాక పోవడాన్ని మజ్లిస్ తీవ్రంగా పరిగణిస్తోంది. దీంతో కాంగ్రెస్ పాలిత ప్రాంతమైన తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలను సాకుగా చూపించి మహా కూటమిపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒకవేళ అక్కడ కూటమిలో అవకాశం దక్కని పక్షంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్కు గుణ పాఠం చెప్పాలా..? లేక స్థానిక అవసరాల కోసం సహకరించాలా? అని సందిగ్దంలో పడినట్లు కనిపిస్తోంది. మజ్లిస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో దిగితే అధికార కాంగ్రెస్కు గెలుపు అంత సులువు కాదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ముస్లిం ఓటర్లు అధికం.. గత మూడు పర్యాయాలుగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో పాగా వేసేందుకు మజ్లిస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో సగానికి పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. తొలిసారిగా 2014లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బరిలో దిగి ఢీ.. అంటే ఢీ అనే విధంగా పోటీ పడి స్పల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన మజ్లిస్... ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పక్షం బీఆర్ఎస్ దోస్తీ కోసం బరిలో దిగకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది. కాగా 2023లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి జూబ్లీహిల్స్ (Jubilee Hills) మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేపై స్నేహపూర్వక పోటీకి దిగి పరాజయం పాలైంది. రాష్ట్రంలో బీఆర్ఎస్కు అధికారం చేజారగా, కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో అధికార కాంగ్రెస్తో మజ్లిస్ స్నేహం కుదిరింది. తాజాగా సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.ఆ దిశగా ప్రయత్నాలుత్వరలో జరుగనున్న బిహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు కాంగ్రెస్, ఆర్జేడీ సారథ్యంలోని మహా కూటమి(మహా ఘట్బంధన్) లో చేరేందుకు ఏఐఎంఐఎం శతవిధాల ప్రయత్నిస్తోంది. సంస్థాగతంగా బలంగా ఉన్న సీమాంచల్లో ఆరు స్థానాలు కేటాయిస్తే కలిసి వస్తామని ఇప్పటికే ప్రకటించింది. మహా కూటమి తమతో కలిసిరాని పక్షంలో బిహార్లోని అన్ని నియోజకవర్గాల్లో మజ్లిస్ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఆ పార్టీ అధినేత ఒవైసీ ఇప్పటికే స్పష్టం చేశారు. వాస్తవంగా తెలంగాణ, మహారాష్ట్ర తర్వాత బిహార్ను పార్టీ విస్తరణకు అనుకూలంగా మజ్లిస్ భావిస్తోంది. తొలిసారిగా 2015 అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్లోని ఆరు స్థానాల్లో తొలిసారి పోటీ చేసి విజయం సాధించలేక పోయినప్పటికి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లలో పోటీ చేసి ఐదు సీట్లను దక్కించుకుంది. ఐదుగురు శాసనసభ్యుల్లో నలుగురు పార్టీని వీడి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో చేరారు. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో పోటీ చేసినా.. ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇటీవల మహాకూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తూ ఇటీవల సాక్షాత్తు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్న్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు లేఖ రాశారు. రాబోయే ఎన్నికల్లో లౌకిక ఓట్లు చీలిపోయి మతతత్వ శక్తులు అధికారంలోకి వచ్చే అవకాశం ఇవ్వకూడదనే కూటమిలో చేరేందుకు ముందుకు వస్తున్నట్లు, గత అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సమయంలో మహా కూటమిలో చేరాలనే ఆసక్తి కనబర్చామని కానీ తమ ప్రయత్నాలు ఫలించలేదు‘ అని లేఖలో పేర్కొన్నారు అయితే మహా కూటమి నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం వైపు నుంచి ఒత్తిడి తెచ్చేందుకు మజ్లిస్ సిద్దమైనట్లు సమాచారం. -
ప్రియుడు అనిల్తో కలిసి భర్త చెవులు కోసిన భార్య
మహబూబాబాద్ రూరల్: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ఓ భార్య యత్నించగా.. తీవ్ర గాయా లతో భర్త తప్పించుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మేడ ప్రసాద్కు జిల్లాలోని కొత్తగూడ మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన రష్మితో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. కుమారుడు పుట్టినప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గంగారం మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన మద్దెల అనిల్తో రషి్మకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో భర్త ప్రసాద్ను అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఈ క్రమంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆదివారం అర్ధరాత్రి ప్రియుడు అనిల్ను రష్మి ఫోన్ చేసి పిలిపించింది.నిద్రిస్తున్న ప్రసాద్ను రషి్మ వెనుక నుంచి అదిమిపట్టుకోగా అనిల్ తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి చంపేందుకు ప్రయతి్నంచాడు. తప్పించుకునే ప్రయత్నంలో ప్రసాద్కు ఎడమ చెవి, ఎడమ చేయి, ఛాతిపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రసాద్ కేకలు విన్న చుట్టుపక్కల వాళ్లు, తండ్రి పాపయ్య అక్కడికి చేరుకుని అనిల్ను పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అనిల్, రష్మిని అదుపులోకి తీసుకుని మహబూబాబాద్ రూరల్ పోలీస్స్టేషన్కు తరలించారు. ప్రసాద్ను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
ఆర్టీసీ స్థలాల్లో భారీ వాణిజ్య, నివాస హర్మ్యాలు
సాక్షి, హైదరాబాద్: సొంత స్థలాల్లో భారీ వాణిజ్య, నివాస సముదాయాల నిర్మాణానికి ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా పలు భారీ నిర్మాణాలు చేపట్టిన కేంద్రప్రభుత్వ అనుబంధ సంస్థ నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ)కి నిర్మాణ, పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనుంది. ఇందుకోసం ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా, ఇటీవల నగరానికి వచి్చన ఆ సంస్థ ప్రతినిధులు ఆర్టీసీకి సంబంధించిన పలు స్థలాలను పరిశీలించారు. మియాపూర్లో ప్రస్తుతం ఉన్న బస్బాడీ తయారీ యూనిట్ స్థలాన్ని దాదాపు ఎంపిక చేశారు. ఇందులో ఉన్న బస్బాడీ యూనిట్ను ఉప్పల్ వర్క్షాప్నకు తరలించి ఆ స్థలాన్ని ఎన్బీసీసీకి అప్పగించనున్నారు. త్వరలో రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదరనుంది. తెలంగాణలో ఇదే తొలిసారి! ఢిల్లీలో రూ.2700 కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భరతనాట్య మండపం సహా నోయిడా, గుర్గావ్, ఇతర నగరాల్లో భారీ వాణిజ్య, నివాస గృహ సముదాయాలను ఎన్బీసీసీ నిర్మించింది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు చేపట్టి కొనసాగిస్తోంది. తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో, ఆర్టీసీ తన స్థలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి ఆదాయాన్ని పొందే క్రమంలో.. నమ్మకమైన సంస్థగా ఎన్బీసీసీకి బాధ్యత అప్పగించాలని నిర్ణయించింది.ఆర్టీసీ బస్భవన్ పక్కనే ఉన్న విశాలమైన స్థలంతోపాటు, మియాపూర్, కూకట్పల్లి, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లోని కొన్ని స్థలాలను ఎంపిక చేసింది. సమీప భవిష్యత్తులో నగరంలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే తిప్పాలని నిర్ణయించిన నేపథ్యంలో, మియాపూర్లోని బస్బాడీ యూనిట్ అవసరం అంతగా ఉండదని గుర్తించి దానిని ఉప్పల్లోని వర్క్షాప్, కరీంనగర్లోని వర్క్షాపుల్లో విలీనం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆయా స్థలాలను పరిశీలించిన ఎన్బీసీసీ ప్రతినిధులు, మియాపూర్ బస్బాడీ యూనిట్ స్థలాన్ని ఎంపిక చేశారు. ఆర్టీసీ ఎండీ ఆఫీసు పక్కనున్న స్థలం ఉపయుక్తమైనదే అయినప్పటికీ, ఇటీవల దాని ముందునుంచి స్టీల్ బ్రిడ్జి నిర్మించినందున.. వాణిజ్యపరంగా ఆ స్థలాన్ని తీసుకునేందుకు సంస్థలు ముందుకు రావని ఆ సంస్థ నివేదించింది. మియాపూర్లో.. మియాపూర్ బస్బాడీ వర్క్షాపు ప్రాంగణం 20 ఎకరాల్లో విస్తరించి ఉంది. అందులో రెండు డిపోలున్నందున, వాటి స్థలాన్ని అలాగే ఉంచి.. మిగతా 18 ఎకరాల స్థలాన్ని వాణిజ్య అవసరాలకు వాడాలని తాజాగా నిర్ణయించారు. చర్చల్లో భాగంగా ఎన్బీసీసీ ఆ స్థలాన్ని 90 ఏళ్ల లీజుకు అడిగింది. ఆర్టీసీ మాత్రం 40 ఏళ్లకుమించి లీజుకు ఇవ్వబోనని పేర్కొంది. ప్రస్తుతం ఆ విషయంలో చర్చలు కొనసాగుతున్నాయి. ఆ స్థలంలో భారీ ఆకాశహరŠామ్యలను నిర్మిస్తారు. అందులో కొంత భాగాన్ని వాణిజ్య వినియోగానికి వీలుగా నిర్మించి, వాటి పైభాగాన్ని నివాస గృహ సముదాయాలుగా నిర్మిస్తారు.అన్నింటినీ అద్దె ప్రాతిపదికనే కేటాయిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేసినందుకు ప్రాజెక్టు వ్యయంలో 10 శాతాన్ని కమీషన్గా తీసుకుంటుంది. లీజు, అద్దె ఆదాయాన్ని ఆర్టీసీ పొందుతుంది. నెలకు రూ.50 కోట్ల ఆదాయం వచ్చే ప్రణాళికలను ఎన్బీసీసీ ప్రతిపాదిస్తున్నట్టు తెలిసింది. ఏకాభిప్రాయం వచ్చాక ఒప్పందం చేసుకుని వెంటనే ప్రాజెక్టును కార్యరూపంలోకి తెచ్చేందుకు ఎన్బీసీసీ చర్యలు తీసుకుంటోందని సమాచారం. తొలి దశలో రూ.వేయి కోట్ల వ్యయం కాగల ప్రాజెక్టులను చేపట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం. -
ఆరోగ్యశ్రీ సేవలపై గందరగోళం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలపై గందరగోళం నెలకొంది. బకాయిలు చెల్లించని కారణంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి సేవలను నిలిపివేస్తున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వెలువడిన తర్వాత సోమ వారం ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేయడంతో ఆస్పత్రుల యాజమాన్యాలు పునరాలోచనలో పడినట్లు తెలిసింది. కొన్ని యాజమాన్యాలు బంద్ కొనసాగించాలని భావిస్తుండగా, ప్రభుత్వంతో గొడవ ఎందుకు అనే ధోరణిలో మరికొన్ని యాజమాన్యాలు ఉన్నట్లు సమాచారం. అయితే అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాకేష్ మాత్రం మంగళవారం అర్ధరాత్రి నుంచి సేవలు నిలిపివేస్తామని తెలిపారు. రూ.100 కోట్లు ఇస్తే ఎలా?: ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించని ప్రభుత్వ వైఖరికి నిరసనగా సెప్టెంబర్ 1 నుంచి సేవలు నిలిపివేస్తున్నట్టు గత నెల 25న నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. అయితే ప్రభుత్వం పిలిపించి మాట్లాడడంతో పాటు బకాయిలు చెల్లిస్తామంటూ హామీ ఇవ్వడంతో సేవల నిలిపివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. అయితే నెల మొదటి వారంలో ప్రభుత్వానికి సంబంధించిన ఇతర చెల్లింపుల నేపథ్యంలో ఆరోగ్యశ్రీ బకాయిల విడుదల కుదర్లేదు. దీంతో హాస్పిటల్స్ అసోసియేషన్ తాజాగా మరోసారి అల్టిమేటం ఇచ్చింది. అయితే ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేయడంతో ఏం చేయాలనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు సమాచారం. రూ.1,400 కోట్ల బకాయిలు ఉంటే రూ.100 కోట్లు ఇస్తే ఎలా అని డాక్టర్ రాకేష్ ప్రశ్నించారు. -
TG: ‘ఫీజు’ చర్చలు సఫలం
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో సమ్మెకు దిగిన ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలప్రదమయ్యాయి. ఇప్పటికే టోకెన్లు విడుదల చేసిన మొత్తంలో రూ.600 కోట్లు వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మిగిలిన బకాయిలను భవిష్యత్తులో చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కాగా సమ్మె విరమిస్తున్నట్టు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల ప్రతినిధులు తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రైవేటు కాలేజీలు దాదాపు ఏడాదిగా ఆందోళన చేస్తున్నాయి. గత ఏడాది పరీక్షలు కూడా బహిష్కరిస్తామని హెచ్చరించాయి. అయితే అప్పట్లో అధికారులు నచ్చజెప్పారు. కానీ బకాయిలు విడుదల కాకపోవడంతో తాజాగా సోమవారం నుంచి అన్ని కాలేజీలను బంద్ చేస్తున్నట్టు యాజమాన్యాలు నోటీసు ఇచ్చాయి. దీంతో ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించింది. ఆదివారం మొదలైన చర్చలు సోమవారం రాత్రి వరకు కొనసాగాయి. తర్జనభర్జనలు, వాదోపవాదాల తర్వాత ఎట్టకేలకు చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. అనంతరం మంత్రులు, యాజమాన్య సంఘాల ప్రతినిధులతో కలిసి భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడారు. ఇది మాకెంతో ప్రాధాన్యతాంశం: డిప్యూటీ సీఎం ఫీజు రీయింబర్స్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యధిక ప్రాధాన్యత కలిగిన అంశమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. పేద వర్గాల విద్యకు చేయూతనిచ్చే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని, దీన్ని తాము కొనసాగిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని ఛిన్నాభిన్నం చేసిందని, బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. వారు వారసత్వంగా ఇచ్చిన బకాయిలు తమకు భారంగా మారాయన్నారు. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కాలేజీల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపామని, చర్చలు సానుకూలంగా ముగిసాయని తెలిపారు. ప్రభుత్వానికి సహకరించి సమ్మె విరమించిన ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. కాలేజీల యాజమాన్యాలతో సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు ఫీజు రీయింబర్స్మెంట్ను హేతుబద్ధీకరించాలని ప్రభుత్వం భావిస్తోందని, దీన్ని పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని వేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించామని, త్వరలోనే ఆదేశాలు వెలువడతాయని వెల్లడించారు. హేతుబద్ధీకరణలో యాజమాన్యాలు, మేధావుల ఆలోచనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.డిగ్రీ, పీజీ కాలేజీల అసంతృప్తి! చర్చలపై ఇంజనీరింగ్ కాలేజీలు సంతృప్తి వ్యక్తం చేస్తే పీజీ, డిగ్రీ కాలేజీల యాజమాన్య ప్రతినిధులు మాత్రం అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మీడియా సమావేశానికి కూడా వారు దూరంగా ఉన్నారు. తమ బకాయిల విషయంలో ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని, కాలేజీలు నడపాలా? సమ్మెకు వెళ్లాలా? అనే దానిపై మంగళవారం నిర్ణయం తీసుకుంటామని ఆయా కాలేజీల ప్రతినిధులు తెలిపారు. చర్చల్లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డితో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
బండి సంజయ్పై కేటీఆర్ పరువు నష్టం దావా
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ అంశానికి తనపై ఆరోపణల చేసిన బండి సంజయ్పై చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనపై చేసిన ఆరోపణలకు గాను బండి సంజయ్పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఫోన్ట్యాపింగ్ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత నెలలోనే లీగల్ నోటీసులు పంపారు. బండి సంజయ్ తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలుగా కేటీఆర్ మంగళవారం పంపిన నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించిన పత్రికా సమావేశంలో బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ కేవలం రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకు ఈ తరహా ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు.మీడియా సమావేశంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవన్నారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా, కేంద్రమంత్రిగా బాధ్యత కలిగిన పదవుల్లో ఉంటూ ప్రజాజీవితంలో ఉన్న మరో శాసనసభ్యుడిపై అసత్యాలతో కూడిన అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని చెప్పారు. బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసు అందిన వారంలోపు బండి సంజయ్ స్పందించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే తాజాగా పరువు నష్టం దావా పిటిషన్ను దాఖలు చేశారు కేటీఆర్. -
అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యహహారంపై అటు అధికారం కాంగ్రెస్- ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తమ పార్టీ నుంచి గెలిచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా, ఆ ఎమ్మెల్యేలు మాత్రం తాము పార్టీ మారలేదని అంంటున్నారు. తాము నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్రను కలిశామని వారు అందుకున్న నోటీసులకు సమాధానంగా పేర్కొన్నారు. అయితే తమ పార్టీ నుంచి గెలిస్తే బీఆర్ఎస్ చేపట్టే కార్యక్రమిలకు వారు ఎందుకు దూరంగా ఉంటున్నారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. దీన్ని సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంచితే. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లో భాగంగా ఆ ఎమ్మెల్యేల సమాధానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ అదనపు కార్యదర్శికి వివరణ ఇచ్చారు. దీనిలో భాగంగా ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 15వ తేదీ) అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి పలు ఆదారాలు సమర్పించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అధికారిక కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆధారాలు, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పాల్గొన్న మరిన్ని ఆధారాలను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో జగదీష్రెడ్డి, వివేక్ గౌడ్ చింతా ప్రభాకర్ తదితరులు ఉన్నారు.అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ‘ వాళ్లు బీఆర్ఎస్లో ఉంటే ాపార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వాళ్లు బీఆర్ఎస్లో ఉంటే రాహుల్ గాంధీని ఎందుకు కలిశారు. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు కాంగ్రెస్ కండువా కప్పుకుని తిరుగుతూ జాతీయ జెండా అని చెబుతున్నారు. బీఆర్ఎస్లో ఉంటే కేసీఆర్తో ఉండాలి కదా?’ అని ప్రశ్నించారు. -
తెలంగాణలో ఆరోగ్య సేవలు బంద్..ఎప్పటినుంచంటే?
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎల్లుండి నుంచి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేయాలని ప్రైవేట్ ఆస్పత్రులు నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రైవేట్ ఆస్పత్రి సంఘాలు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వం తమకు వందల కోట్లలో బకాయిలు చెల్లించాల్సి ఉందని, వాటిని తక్షణమే చెల్లించాలని ప్రైవేట్ ఆస్పత్రి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంగా తమ ఆందోళనల్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. -
జూబ్లీహిల్స్ బైపోల్.. కవిత ఎంట్రీతో బిగ్ ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. అభ్యర్ధి దాదాపు ఖాయం అయ్యాడనుకున్న తరుణంలో.. మహమ్మద్ అజారుద్దీన్ను ఎమ్మెల్సీకి ఎంపిక చేసి కాంగ్రెస్ ట్విస్ట్ ఇచ్చింది. అక్కడి నుంచి అభ్యర్థి ఎంపిక విషయంలో మళ్లీ మల్లాగుల్లాలు పడుతూ మొదటికొచ్చింది. ఈలోపు.. బీఆర్ఎస్ రాజకీయం ఆసక్తికర మలుపు తిరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతనే అభ్యర్థిగా ప్రొజెక్టు చేస్తూ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా నేతలతో ఆయన వరుసగా భేటీ అవుతున్నారు. ఎలాగైనా ఈ ఉప ఎన్నికలో నెగ్గి.. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందర హైదరాబాద్లో తమ బలం ఏమాత్రం తగ్గలేదని రాజకీయ ప్రత్యర్థులకు చూపించాలని ఆయన భావిస్తున్నారు. ఈలోపు.. సోమవారం ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.బీఆర్ఎస్ మాజీ నేత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పీజేఆర్ తనయుడు, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పీ విష్ణువర్ధన్ రెడ్డి భేటీ అయ్యారు. ఇద్దరూ అరగంటకు పైగా చర్చ జరపడంతో జూబ్లీహిల్స్ టికెట్ కోసమేననే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. పీ జనార్ధన్ రెడ్డి తనయుడు పీ విష్ణువర్ధన్ రెడ్డి తండ్రి మరణానంతరం 2008లో జరిగిన ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆపై 2009లో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా మాగంటి గోపీనాథ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో బీఆర్ఎస్లో చేరారు. అయితే జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవచ్చనే సంకేతాల నడుమ.. ఆయన కవితతో భేటీ అయ్యారన్నది తాజా ఊహాగానాల సారాంశం. అయితే.. ఈ పుకార్లకు విష్ణు పుల్స్టాప్ పెట్టారు. పెద్దమ్మ తల్లి దసరా నవరాత్రి వేడుకలకు కవితకు ఆహ్వాన పత్రిక అందించడానికే వచ్చినట్లు చెప్పారాయన. ‘‘కేటీఆర్తోనే నా ప్రయాణం. ఎప్పుడు నేను ఇదే చెబుతా. కేటీఆర్కు ప్రమోషన్ ఉంటుంది.. నాకూ ప్రమోషన్ ఉంటుంది’’ అని ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే విష్ణు తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఈ పరిణామంతో తీవ్రంగా కలత చెందిన ఆమె.. పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ ప్రెస్మీట్లో ఆమె సంచలన ఆరోపణలే చేశారు. వేరే పార్టీలో చేరిక.. సొంత పార్టీ గురించి స్పష్టత ఇవ్వని ఆమె.. ఇక నుంచి రాజకీయంగా ఏ కార్యక్రమం చేపట్టినా కేసీఆర్ ఫొటోతోనే ముందుకు సాగుతానని ఆమె ప్రకటించడం గమనార్హం. -
కాలేజీ యాజమాన్యాల యూటర్న్.. బంద్ లేనట్లేనా?? ఇదిగో క్లారిటీ
తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల బంద్పై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగియడంతో నేటి నుంచి ఇచ్చిన బంద్ పిలుపుపై యాజమాన్యాలు యూటర్న్ తీసుకున్నాయనే చర్చ నడుస్తోంది. ప్రభుత్వంతో చర్చలు పూర్తైన తర్వాతే బంద్పై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నాయి. అయితే.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సహా పలు డిమాండ్లతో నేటి నుంచి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు నిరవధిక బంద్ను పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దాకా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల తరఫున ప్రతినిధులతో మంత్రి భట్టి, అధికార వర్గాలు చర్చలు జరిపాయి. కానీ, ఆ చర్చలు ఎలాంటి పురోగతి సాధించలేదు. దీంతో నేటి బంద్పై ప్రతిష్టంభన నెలకొంది. అయితే.. ఈ పరిణామంపై యాజమాన్యాల ప్రతినిధులు స్పందించారు. నేడు కాలేజీలను తెరవొద్దని నిర్ణయించినట్లు చెప్పారు. సోమవారం మధ్యాహ్నాం ప్రభుత్వంతో మరోసారి చర్చలు జరుపుతామని, ఆ చర్చల తర్వాతే బంద్ కొనసాగింపుపై స్పష్టమైన ప్రకటన చేస్తామని తెలిపారు. దీంతో ఇవాళ ప్రైవేట్ కాలేజీల బంద్ కొనసాగనుందనే స్పష్టత వచ్చింది. అయితే కొన్ని కాలేజీలు మాత్రం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తుండడం గమనార్హం.ఎందుకీ నిర్ణయం?తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, బీఈడీ, ఎంబీఏ, నర్సింగ్ తదితర వృత్తి విద్యా ప్రైవేట్ కళాశాలల బంద్ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ కళాశాలల యాజమాన్యాల సమాఖ్య నిరవధిక బంద్కు పిలుపునిచ్చింది. అంతేకాదు.. ఇప్పటికే టోకెన్లు ఇచ్చిన ₹1,200 కోట్ల బిల్లులను దసరా లోపు చెల్లించాలని, మొత్తం బకాయిలను డిసెంబర్ 31లోపు పూర్తిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే.. ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటుపై feasibility నివేదికను అక్టోబర్ 31లోపు విడుదల చేయాలని కోరుతున్నారు. మరోవైపు ఈ పరిస్థితుల మధ్య పరీక్షలు వాయిదా వేయాలని వర్సిటీలను ఫెడరేషన్ కోరుతోంది. ఈ పరిస్థితి విద్యార్థులు-తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాల మధ్య తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. బంద్ కొనసాగితే గనుక.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడనుంది. -
హైదరాబాద్: కారు బోల్తా.. ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి
సాక్షి, హైదరాబాద్: స్నేహితులంతా కలిసి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ఔటర్ రింగ్రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువతి మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సంగారెడ్డి జిల్లా, వావిలాల గ్రామానికి చెందిన రాళ్లకత్వ వెంకటేశ్వర్ రెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి (25) నగరంలోని ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తోంది. తన స్నేహితులైన నందకిషోర్, వీరేంద్ర, ప్రణీష్, సాగర్, అరవింద్, ఝాన్సీ, శృతితో కలిసి ఆదివారం కారులో రాచకొండ సమీపంలోని సరళ మైసమ్మ దేవాలయానికి వెళ్లారు. రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న వారు బొంగ్లూర్ వద్ద ఔటర్పై నుంచి ఘట్కేసర్ వైపు వెళ్తుండగా బలిజగూడ సమీపంలో భారీ వర్షం కారణంగా వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది.ఈ ఘటనలో సౌమ్యారెడ్డితో పాటు పలువురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వారికి చికిత్స నిమిత్తం వివిధ ఆస్పత్రులకు తరలించారు. సౌమ్యారెడ్డి చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందింది. మరో ముగ్గురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్డగోలుగా కత్తిరింపులు.. రోడ్లపైనే కేబుళ్ల గుట్టలు
సాక్షి, హైదరాబాద్: ‘ఆవుల కుమ్ములాటలో దూడలు బలైనట్లు’ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ–ఇంటర్నెట్ ఆప్టికల్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్పీ), ఎంఎస్ఓలు, లోకల్ కేబుల్ ఆపరేటర్లు (ఎల్సీఓలు) మధ్య నెలకొన్న పోరులో అమాయక వినియోగదారులు బలవుతున్నారు. మూడు వారాలు దాటినా ఇంటర్నెట్ సేవలు, టీవీ ప్రసారాలను పునరుద్ధరించకపోవడంతో.. ఇంటి నుంచి విధులు నిర్వహించే ఐటీ, అనుబంధ రంగాల ఉద్యోగులు సహా పిల్లలకు ఆన్లైన్ తరగతులు బోధించే తల్లిదండ్రులు ఇబ్బందిపడాల్సి వస్తోంది. వివిధ ఆఫర్లలో భాగంగా ముందే ఏడాది/ఆరు నెలల చార్జీలు చెల్లించిన వినియోగదారులు సైతం ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. ఆగస్టు 17న రామంతాపూర్ గోఖలేనగర్ ఘటనతో విద్యుత్శాఖ అప్రమత్తమైంది. తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు, కారి్మకులు, సాధారణ పౌరుల మృత్యువాతకు కారణమవుతున్న ఈ ప్రమాదకరమైన ఆప్టికల్ కేబుల్ వైర్ల తొలగించాలని నిర్ణయించింది. ఆ మేరకు కొద్ది రోజులుగా గ్రేటర్ జిల్లాల్లో ఎక్కడికక్కడే కేబుళ్లను కట్ చేస్తోంది. స్తంభాలపై లైన్లు వేస్తున్నప్పుడు మిన్నకుండిపోయి.. తీరా వేసిన తర్వాత కట్ చేయడం ఏమిటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఐఎస్పీలు, ఎంఎస్ఓలు, ఎల్సీఓలు తప్పు చేస్తే.. వినియోగదారులకు శిక్ష వేయడం ఎంత వరకు సబబు అనే ప్రశ్న తలెత్తుతోంది. రూ.100 కోట్లకుపైగా నష్టం గ్రేటర్ పరిధిలో ఐదు లక్షలకుపైగా విద్యుత్ స్తంభాలు ఉన్నట్లు అంచనా. ఏదైనా విద్యుత్ స్తంభంపై కేబుల్ వేయాలంటే ముందస్తుగా ఆ శాఖ అనుమతి తీసుకోవాలి. ఇందుకు ఒక్కో స్తంభానికి ఏటా రూ.50 నుంచి రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంది. 15 మీటర్ల ఎత్తులోనే కేబుల్ అమర్చుకోవాలి. మెజారిటీ కేబుళ్లు ఆరేడు అడుగుల ఎత్తులోనే వేలాడుతున్నాయి. ఒక స్తంభానికి, మరో స్తంభానికి మధ్య 50 మీటర్లకు మించరాదు.. కానీ మెజార్టీ స్తంభాలకు టన్నుల కొద్దీ బరువైన కేబుల్ ఉండలు వేలాడుతున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షానికి మధ్యలో ఏదైనా చెట్టు కొమ్మ విరిగి లైన్పై పడితే.. ఆ బరువుకు రెండు వైపులా ఉన్న స్తంభాలు నేలకూలుతున్నాయి. దెబ్బతిన్న ఇన్సులేటర్లు, జాయింట్లను పునరుద్ధరించేందుకు లైన్మెన్లు స్తంభాలపైకి ఎక్కడం చాలా కష్టంగా మారింది. కేబుళ్ల నుంచి ఎర్తింగ్ రివర్స్ వల్ల షాక్తో కిందపడి పోతున్న ఘటనలు లేకపోలేదు. కనీస అనుమతులే కాదు కనెక్షన్, మీటర్ తీసుకోకుండా ఏకంగా కేబుల్ జంక్షన్ బాక్సులకు కరెంట్ను వినియోగిస్తున్నారు. ఏళ్ల తరబడి కళ్లముందే ఈ చౌర్యం జరుగుతున్నా.. క్షేత్రస్థాయి ఇంజినీర్లు పట్టించుకోలేదు. కొత్తగా అనేక ఇంటర్నెట్ సరీ్వసు ప్రొవైడర్లు (ఐఎస్పీ), ఎంఎస్ఓలు, లోకల్ కేబుల్ ఆపరేటర్లు (ఎల్సీఓలు) పుట్టుకురావడం, వ్యాపారంలో పోటీతో ఎవరికి వారు స్తంభాలపై కేబుళ్లను వేసుకుంటూ ముందుకెళ్లడం, ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తినప్పడు పాత వైర్లను అలాగే వదిలేసి, కొత్తగా మరో ఆప్టికల్ కేబుల్ను అమర్చుతుండటం, తాజాగా వాటన్నింటినీ తొలగిస్తుండటంతో ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా నష్టపోవాల్సి వచి్చందని ఆయా సరీ్వసు ప్రొవైడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఫోన్లకూ తప్పని సిగ్నల్ సమస్యకేవలం ఆపరేటర్లే కాదు సేవల వినియోగంలో భాగంగా ముందే ఆఫర్ల పేరుతో (సంవత్సరం/ఆరు నెలలు) చార్జీలు చెల్లించిన గృహ, వ్యాపార, వాణిజ్య సంస్థల వినియోగదారులు సైతం ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. మూడు వారాలైనా ఆయా సర్వీసులు పునరుద్ధరించపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వినియోగదారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక..ఆయా సర్వీసు ప్రొవైడర్లు కాల్ సెంటర్లు/ వ్యక్తిగత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. మెజార్టీ ప్రజలు గృహ, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో వైఫై సరీ్వసులను వాడుతున్నారు. ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాల్లోనూ ఈ తరహా సేవలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఆప్టికల్ కేబుళ్లన్నింటినీ కట్ చేయడంతో సరీ్వసులు నిలిచిపోయి సిగ్నల్ సమస్యలు తలెత్తుతున్నాయి. రోజంతా టీవీ సీరియల్స్, ఓటీసీ సినిమాలు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ సర్వీసులకు అలవాటు పడిన గృహిణులు.. ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే పనిలో పడ్డారు. కట్ చేసిన కేబుళ్లను అక్కడే రోడ్లపైనే గుట్టలుగా వదిలేసి వెళ్లుండటం, అటుగా వచ్చిపోయే వాహనదారులు ఆయా వైర్ల మధ్య చిక్కుకుని ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనాల రాకపోకల సమయంలో కేబుళ్లు టైర్ల మధ్య చిక్కుకుపోయి ప్రమాదాలకు కారణమవుతోంది. -
వానొస్తే ప్రాణాలు గల్లంతే!
హైదరాబాద్: నగరంలో వానొస్తే ప్రాణాలు గల్లంతే అనే దుస్థితి నెలకొంది. ఆదివారం సాయంత్రం గంటసేపు వర్షం దంచికొట్టడంతో రహదారులు చెరువులను తలపించాయి. నాలాలు ఉప్పొంగాయి. ముషీరాబాద్తో పాటు తట్టి అన్నారంలో 12.8 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వరద ప్రవాహంలో నాంపల్లి పరిధి హబీబ్నగర్లోని అఫ్జల్సాగర్లో ఇద్దరు, ముషీరాబాద్లో మరొకరు కొట్టుకుపోయారు. కిలో మీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. హైడ్రా, జీహెచ్ఎంసీ, జలమండలి బృందాలు రంగంలోకి దిగి వరద నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాయి. Heavy Rains In Hyderabad Three People Missing After Falling Into A DrainageHeavy Rains In Hyderabad Three People Missing After Falling Into A Drainage -
కన్న తల్లినే చెరపట్టే యత్నం
జడ్చర్ల: మద్యం మత్తులో సభ్య సమాజం తలదించుకునే విధంగా కన్నతల్లినే చెరపట్టే ప్రయత్నం చేశాడో యువకుడు. దీంతో భార్యను కాపాడే ప్రయత్నంలో తండ్రి చేసిన దాడిలో కుమారుడు మృత్యువాత పడ్డాడు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని డీటీసీ (జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం) సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథనం ప్రకారం.. పోలేపల్లి గ్రామానికి చెందిన దంపతులు జడ్చర్ల డీటీసీ సమీపంలో నివసిస్తూ.. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు శ్రీధర్కు మినహా అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. తల్లిదండ్రుల వద్దే ఉంటున్న శ్రీధర్ (28) కొన్ని రోజులుగా తాగుడుకు బానిసగా మారి జులాయిగా తిరుగుతున్నాడు. జల్సాలకు అలవాటు పడి తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ సంపాదించిన డబ్బును బలవంతంగా తీసుకుని తాగుడుకు వెచ్చించేవాడు. అనేకసార్లు మద్యం మత్తులో కన్నతల్లి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. కుమారుడి వేధింపులు భరించలేక విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. దీంతో ఆయన కొడుకును పలుసార్లు మందలించి.. ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినా శ్రీధర్లో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి మద్యం సేవించిన కుమారుడు శ్రీధర్ మధ్యరాత్రి సమయంలో తల్లి దగ్గరకు వచ్చి అత్యాచారం చేయబోయాడు. ఆమె కొడుకు నుంచి తప్పించుకుని ఇంటి బయటకు పరుగెత్తే ప్రయత్నం చేయగా, చేయి పట్టుకుని గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి యతి్నంచాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో పక్క గదిలో నిద్రిస్తున్న భర్త మేల్కొని.. భార్యను కాపాడే ప్రయత్నం చేశాడు. దీంతో కొడుకు ఆగ్రహంతో తండ్రిని నెట్టి వేయడంతో అతను కింద పడిపోయాడు. ఈ క్రమంలో తండ్రి పక్కనే ఉన్న కర్రతో కుమారుడి తలపై బాదడంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. తర్వాత చలనం లేకపోవడంతో తమ కుమారుడు మృతి చెందాడని నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
హైదరాబాద్కు ఎల్లో అలర్ట్.. భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఉత్తర తెలంగాణ, విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించింది.దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ మొదలైంది. సాధారణంగా సెప్టెంబర్ మూడో వారం చివరలో మొదలవ్వాల్సిన ఈ ప్రక్రియకు ఈసారి సానుకూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో ముందే ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. రానున్న రెండు రోజుల్లో రాజస్తాన్, పంజాబ్, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు క్రమంగా నిష్క్రమిస్తూ అక్టోబర్ రెండో వారాంతానికి దేశం నుంచి పూర్తిస్థాయిలో నిష్క్రమిస్తాయని వివరించింది.ఈ సమయంలోనూ చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు గతేడాది కంటే మూడు రోజుల ముందే.. మే 23న కేరళను తాకాయి. ఆ తర్వాత మూడు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించాయి. జూలై రెండో వారం నాటికి దేశమంతా విస్తరించాయి. నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో సగటున 74.06 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటికే 83.02 సెం.మీ. మేర వర్షం కురిసింది. ఇది సాధారణ వర్షపాతంకన్నా 12 శాతం అధికం. -
ఒక్క గంటలో ఆగమాగం
సాక్షి, హైదరాబాద్/నాంపల్లి/ముషీరాబాద్: హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ఆదివారం రాత్రి అతలాకుతలం చేసింది. దాదాపు గంటపాటు వాన దంచికొట్టడంతో ప్రధాన రహదారులన్నీ నదుల్లా మారాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. దాదాపు నగరం మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద నీటిలో పడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఆదివారం సాయంత్రం వరకు వాతావరణం సాధారణంగానే ఉన్నా.. రాత్రి ఎనిమిది గంటల తర్వాత మొదలైన వాన గంటపాటు కుండపోతగా కురిసింది. రాత్రి పది గంటల వరకు అత్యధికంగా నగర శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ తట్టి అన్నారం, ముషీరాబాద్ బౌద్ధనగర్లలో 12 సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి ద్విచక్ర వాహనదారులు ఫ్లైఓవర్ల కింద తలదాచుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో కార్లు, ఆటోలు, బైక్లు నీటిలో కొట్టుకుపోయాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,పంజాగుట్ట, అమీర్ పేట, ముషీరాబాద్, తార్నాక, లక్డీకాపూల్, కాచిగూడ, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ నిలిచిపోయింది. హైడ్రా, జీహెచ్ఎంసీ, జలమండలి, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రధాన రహదారులపై నిలిచిన వర్షపు నీరు నాలాల్లోకి వెళ్లేలా చర్యలు చేపట్టారు. కాగా, ఆదివారం రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో 24.3 సెంటీమీటర్లు నమోదైంది. అఫ్జల్సాగర్ నాలాలో మామా అల్లుళ్లు గల్లంతు భారీ వర్షానికి అఫ్జల్సాగర్ నాలా పొంగి ప్రవహించింది. ఈ నాలాలో మాన్గార్ బస్తీకి చెందిన అర్జున్ (26), రాము (25) అనే యువకులు కొట్టుకుపోయారు. వీరిద్దరూ మామా అల్లుళ్లుగా తెలిసింది. వీరికోసం రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. అర్జున్, రాము ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు అఫ్జల్సాగర్ నాలా ప్రక్కనే ఉండటంతో ఇంట్లోకి వర్షపు నీరు చేరింది. ఇంట్లోని సామాన్లు బయటకు తెచ్చే క్రమంలో రాము అదుపు తప్పి నాలాలో పడ్డాడు. అతడిని కాపాడే క్రమంలో అర్జున్ కూడా నాలాలో పడిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అక్కడికి చేరుకుని పరిస్థితిని ఆరా తీశారు. ముషీరాబాద్ డివిజన్ బాపూజీనగర్లో నాలాలో దినేశ్ (సన్నీ) అనే యువకుడు గల్లంతయ్యాడు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే వినోబా నగర్కు చెందిన దినేశ్ (24) విధులు ముగించుకొని బైక్పై ఇంటికి వచ్చే క్రమంలో నాలాలో వరద ఉధృతి అధికంగా ఉండడంతో తన వాహనాన్ని ఆపి అక్కడ ఉన్న గోడ పక్కన నిలుచున్నాడు. ఇదే సమయంలో గోడ కూలడంతో దినేశ్ బైక్తోపాటు నాలాలో పడి కొట్టుకుపోయాడు. దినేశ్కు భార్య రాజశ్రీ, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. దినేశ్ కోసం ముషీరాబాద్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. -
మీడియా ముందుకు రావొద్దు!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థలకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పిలుపునిచ్చింది. విభేదాలకు దూరంగా ఉండాలని హితవు పలికింది. అంతర్గత విభేదాల పేరుతో ఎవరైనా మీడియా ముందుకొచ్చి మాట్లాడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కమిటీ చైర్మన్, ఎంపీ మల్లురవి అధ్యక్షతన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదివారం గాందీభవన్లో సమావేశమైంది. కమిటీ సభ్యులు అనంతుల శ్యాంమోహన్, కమలాకర్రావు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న ఫిర్యాదులపై కమిటీ చర్చించింది. వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సురేఖ, పార్టీ నేతలు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలపై రూపొందించిన నివేదికను.. సీఎం రేవంత్తోపాటు, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్కు అందజేయాలని కమిటీ నిర్ణయించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం వారికే ఇవ్వాలని తీర్మానించింది. సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణపై ఫిర్యాదు రావడంతో ఆయన వివరణ కోరింది. కమిటీ ముందుకు నర్సారెడ్డి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి తూంకుంట నర్సారెడ్డి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తనపై వచ్చిన ఫిర్యాదుల గురించి వివరణ ఇచ్చారు. అనంతరం నర్సారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తనపై నమోదైన పోలీస్ కేసు గురించి కమిటీ వివరణ అడిగిందని చెప్పారు. తనపై ఫిర్యాదు చేసిన నాయకులు పార్టీకి సేవ చేసిన వారు కాదని, బీజేపీకి పనిచేసిన వారని చెప్పారు. అలాంటి వారు ఆరోపణలు చేస్తే కమిటీ తనను వివరణ ఎందుకు అడిగిందో అర్థం కావడం లేదన్నారు. గజ్వేల్తో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావుకు సంబంధం లేదన్నారు. రాజగోపాల్రెడ్డి అంశం మా దృష్టికి రాలేదు: చైర్మన్ మల్లురవి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గురించి తాము చర్చించలేదని మల్లురవి చెప్పారు. కమిటీ భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎవరి ప్రయోజనాల కోసమో క్రమశిక్షణ కమిటీలో చర్చ జరగదన్నారు. రాజగోపాల్రెడ్డి అంశం తమ దృష్టికి రాలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే అది క్రమశిక్షణ కమిటీకి వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ నుంచి బయటకెళ్లిన వారంతా మళ్లీ పార్టీ గూటికి రావాలని కోరారు. పార్టీలో అంతర్గత విభేదాల పేరుతో రచ్చకెక్కితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మాజీ మంత్రి కేటీఆర్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డాడని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో ఆయన ఏం చేశారో ఒక్కసారి చూసుకుని తమను ప్రశ్నించాలన్నారు. పదేళ్లలో ఎంతో మందిని చేర్చుకున్న ఆయన కూడా రాజీనామాలు చేయించారా అని ప్రశ్నించారు. అసలు ఆ ఎమ్మెల్యేలు తాము పార్టీనే మారలేదని చెపుతుంటే కేటీఆర్కు వచి్చన ఇబ్బందేంటో అర్థం కావడం లేదన్నారు. -
‘నైరుతి’ ఉపసంహరణ షురూ
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ఉపసంహరణ మొదలైంది. సాధారణంగా సెప్టెంబర్ మూడో వారం చివరలో మొదలవ్వాల్సిన ఈ ప్రక్రియకు ఈసారి సానుకూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో ముందే ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. రానున్న రెండు రోజుల్లో రాజస్తాన్, పంజాబ్, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు క్రమంగా నిష్క్రమిస్తూ అక్టోబర్ రెండో వారాంతానికి దేశం నుంచి పూర్తిస్థాయిలో నిష్క్రమిస్తాయని వివరించింది. ఈ సమయంలోనూ చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు గతేడాది కంటే మూడు రోజుల ముందే.. మే 23న కేరళను తాకాయి. ఆ తర్వాత మూడు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించాయి. జూలై రెండో వారం నాటికి దేశమంతా విస్తరించాయి. నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో సగటున 74.06 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటికే 83.02 సెం.మీ. మేర వర్షం కురిసింది. ఇది సాధారణ వర్షపాతంకన్నా 12 శాతం అధికం. మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఉత్తర తెలంగాణ, విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
జలాశయాలల్లో నీళ్లు ఫుల్లు
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం/నాగార్జునసాగర్: ఎగువ ప్రాంతాల్లో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోటెత్తుతున్న వరదలతో గోదావరి, కృష్ణా పరీవాహకంలోని జలాశయాల్లో నీటి నిల్వలు దాదాపుగా గరిష్టానికి చేరుకున్నాయి. రాష్ట్రంలో మొత్తం 1,069.34 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన 87 జలాశయాలుండగా, వాటిలో నిల్వలు 879.52 టీఎంసీ (82శాతం)లకు చేరాయి. కృష్ణా పరీవాహకంలో మొత్తం 649.53 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 30 జలాశయాలుండగా ప్రస్తుతం వాటిలో 611.53 (94%) టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ మిగిలిన వరదను కిందకు విడుదల చేస్తున్నారు. జలాశయాల నిర్వహణలో భాగంగా వరదలు పోటెత్తినప్పుడు వాటిని పూర్తిగా నింపకుండా కొంత భాగం ఖాళీ (సాంకేతిక భాషలో ఫ్లడ్ కుషన్ అంటారు)గా ఉంచుతారు. వరదలు తగ్గు ముఖం పట్టిన తర్వాత పూర్తి సామర్థ్యం మేరకు నింపుతారు. ఈ నేపథ్యంలో కృష్ణా పరీవాహకంలోని జలాశయాలు పూర్తిగా నిండినట్టు భావించవచ్చు. ఇక గోదావరి పరీవాహకంలో మొత్తం 419.81 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 57 జలాశయాలుండగా వాటిలో నిల్వలు 267.76 (63.78%) టీఎంసీలకు పెరిగాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ పంప్హౌస్ల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసి జలాశయాలను నింపుతుండడంతో గోదావరి పరీవాహకంలోని జలాశయాల్లో నిల్వలు సైతం గరిష్ట స్థాయికి పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుత వానాకాలంలో సాగు చేసిన పంటలతో పాటు యాసంగిలో సాగుచేయనున్న పంటలకు సైతం పుష్కళంగా సాగునీరు లభించే అవకాశాలున్నాయి. జోరుగా కృష్ణా.. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి వరద కొనసాగుతుండడంతో జూరాల ప్రాజెక్టుకు ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో 72 వేల క్యూసెక్కులు వస్తుండగా, 69,903 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి మరో 13,124 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. జూరాల, తుంగభద్రకు దిగువన శ్రీశైలం జలాశయంలోకి 2.14 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 1.87 లక్షల క్యూసెక్కులను వదిలేస్తున్నారు. సాగర్కు మొత్తం 2,39,978 క్యూసెక్యుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో సాగర్ ప్రాజెక్టు మొత్తం 26 గేట్లు ఎత్తి 2,73,872 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదనతో 32,927 క్యూసెక్కులు.. మొత్తం 3,06,799 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 588.40 అడుగుల (307.2834 టీఎంసీలు) మేర నీరు ఉంది. గోదారి పరవళ్లు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రలోని జైక్వాడ్ నుంచి ఏపీలోని ధవళేశ్వరం బరాజ్ వరకు ప్రాజెక్టులన్నింటికీ నిరంతర వరద కొనసాగుతోంది. రాష్ట్రంలో మంజీరపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా 12.41 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ మిగిలిన నీళ్లను కిందికు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.07 టీఎంసీలకు పెరిగాయి. శ్రీరామ్సాగర్ పూర్తిగా నిండింది. దీని గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీల మేర నిల్వలను కొనసాగిస్తూ వచ్చిన వరదను వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా, నిల్వలు 4.48 టీఎంసీలను కొనసాగిస్తూ మిగిలిన నీళ్లను కిందికి విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా 18.7 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 2.98 లక్షల క్యూసెక్కుల వరదను కిందికి విడుదల చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బరాజ్కు 7.25 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 11.600 మీటర్ల నీటిమట్టంతో గోదావరి పుష్కరఘాట్ను తాకుతూ ప్రవహిస్తోంది. -
స్వయంగా పర్యవేక్షిస్తా
సాక్షి హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు చాలా అవసరమని, పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా గెలిపించాల్సిన గురుతర బాధ్యత ఇన్చార్జిలపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఈ ఉప ఎన్నిక కోసం పార్టీ నాయకత్వం ఇప్పటివరకు చాలా బాగా పని చేసిందని, ఇకపై ప్రతీరోజూ కీలకమని, ఈ ఉప ఎన్నికకు సంబంధించిన అన్ని వ్యవహారాలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని ఆయన వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆదివారం సాయంత్రం తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ, సాంస్కృతిక విభాగం చైర్మన్ వెన్నెల గద్దర్తో పాటు పార్టీ డివిజన్ ఇన్చార్జులుగా పనిచేస్తున్న కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్న ఈ సమావేశంలో.. ఉప ఎన్నికలో గెలుపునకు అవసరమైన కార్యాచరణపై ముఖ్యమంత్రి, పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలి.. పార్టీ నేతలందరూ సమన్వయంతో పనిచేసి, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ సూ చించారు. రాష్ట్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి చేరేలా కృషి చేయా లని ఆదేశించారు. ’జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రతీ ఒక్కరు పని చేయాలి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచా రం చేయాలి. పోలింగ్ బూత్ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా కల్పించాలి. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించాలి. అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుంది. అభ్యర్థి ఎవరైనా పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన బాధ్యత మీపై ఉంది. మీ పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటా. పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి’ అని సీఎం స్పష్టం చేశారు. కాగా, ఈనెల 21వ తేదీ కల్లా నియోజకవర్గంలోని 407 పోలింగ్ బూత్లలో ప్రతి బూత్కు పదిమంది చురుకైన కార్యకర్తలను ఎంపిక చేసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలని సమావేశంలో నిర్ణయించారు. -
సర్కారు కరుణిస్తేనే జీతాల పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) తన ఉద్యోగుల వేతన సవరణ బాధ్యతను ప్రభుత్వానికి వదిలేసింది. ప్రభుత్వం ఆర్థిక చేయూతనందిస్తేనే ఉద్యోగుల జీతాలు పెంచే అవకాశం ఉంటుందని తేల్చి చెప్పింది. 2017 నాటి వేతన సవరణను గతేడాది ఏప్రిల్లో అమలు చేసిన నేపథ్యంలో, ఆ తదుపరి 2021 వేతన సవరణపై సంస్థ దృష్టి సారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో 2025 వేతన సవరణ గడువు ప్రారంభమవుతున్నందున, 2021 వేతన సవరణ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తిరిగి పోలీసు శాఖకు బదిలీ అయ్యే అవకాశం ఉన్నందున, ఈలోపు దీన్ని కొలిక్కి తేవాలని ఆయన ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అక్కడి నుంచి ఆమోదం లభిస్తే నాలుగేళ్ల జాప్యంతో ఆ వేతన సవరణను పూర్తి చేసినట్టవుతుంది. 15 శాతం ఫిట్మెంట్ ఇస్తే నెలకు రూ.60 కోట్ల భారం వేతన సవరణ చేస్తే సంస్థపై పడే భారంపై అధికారులు లెక్కలు వేశారు. హీనపక్షంగా 10 శాతం ఫిట్మెంట్ ఇచ్చినా నెలకు జీతాల భారం అదనంగా రూ.40 కోట్లు పెరుగుతుంది. అదే 15 శాతం ప్రకటిస్తే ఆ మొత్తం రూ.60 కోట్లకు చేరుకుంది. మహాలక్ష్మి పథకం వల్ల రోజువారీ ఆదాయం తగ్గటంతో సంస్థ సొంతంగా ఈ భారాన్ని మోయటం అసాధ్యం. ప్రస్తుతం టికెట్ రూపంలో ఆర్టీసీకి వస్తున్న ఆదాయం రోజుకు రూ.12 కోట్ల లోపే. రోజువారీ ఖర్చులకు కూడా ఆ నిధులు సరిపోవటం లేదు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చాక, మహిళా ప్రయాణికుల నుంచి ఆదాయం 90 శాతం తగ్గిపోయింది. వేతన సవరణ చేస్తే రోజుకు అదనంగా రూ.2 కోట్లు చొప్పున జీతాలకు అదనంగా చెల్లించాలి. దానిని సర్దుబాటు చేయటం ఇప్పుడున్న పరిస్థితుల్లో సంస్థకు అసాధ్యమని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. రీయింబర్స్మెంట్ను రూ.350 కోట్లకు పెంచాలి.. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఆర్టీసీకి నెలకు రూ.310 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం కూడా ప్రతినెలా విడుదల కావటం లేదు. గత నెల రూ.190 కోట్లు మాత్రమే విడుదల కావటంతో ఉద్యోగులకు సకాలంలో ఆర్టీసీ జీతాలు చెల్లించలేకపోయింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని కనీసం రూ.350 కోట్లకు పెంచితే దానికి సరిపడే ఫిట్మెంట్ మేరకు వేతన సవరణ చేస్తామని తాజాగా ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదించింది. 2017 విడత వేతన సవరణను అప్పట్లో సకాలంలో చేయలేదు. దీంతో కార్మికులు సమ్మె చేయగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదుగురు మంత్రులతో కమిటీ వేసింది. ఆ కమిటీ కార్మిక సంఘాల నేతలతో చర్చించి, ఆర్థిక పరిస్థితి బాగోలేనందున కొంత విరామం తర్వాత వేతన సవరణ చేస్తామని, అప్పటి వరకు మధ్యంతర భృతి ఇస్తామని తేల్చి చెప్పింది. ఆ మేరకు 16 శాతం మధ్యంతర భృతిని ఖరారు చేసింది. 2024 వరకు అదే కొనసాగింది. మళ్లీ కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధం కావటంతో, గత సంవత్సరం ప్రభుత్వం 21 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఇప్పుడు అంతమేర ఫిట్మెంట్ ఇచ్చే పరిస్థితి దాదాపు లేదని ఆర్టీసీ పరోక్షంగా స్పష్టం చేసింది. 15 శాతం ఖరారు చేసినా పరిస్థితి చేయిదాటిపోతుందని తేల్చింది. ప్రభుత్వం ఎంతమేర ఆర్థిక సాయం చేస్తే అంతమేర వేతనాలను పెంచేందుకు సిద్ధమవుతోంది. -
బంద్పై ప్రతిష్టంభన!
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రైవేటు విద్యాసంస్థలన్నింటినీ మూకుమ్మడిగా మూసివేయాలని నిర్ణయించుకొని యాజమాన్యాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో సర్కారు చర్చలకు ఉపక్రమించింది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో ప్రజా భవన్లో సమావేశమయ్యారు. ఇరుపక్షాల మధ్య నాలుగు గంటలపాటు జరిగిన చర్చల్లో ఎలాంటి స్పష్టత రాలేదని తెలిసింది. ప్రభుత్వం నుంచి ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రాకపోవడంతో కళాశాలలు నడపటం కష్టంగా మారిందని, జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని యాజమాన్యాలు చెప్పాయి. తమకు రావాల్సిన బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలని కోరాయి. అయితే ప్రభుత్వం నుంచి ఈ విషయంలో స్పష్టమైన హామీ రాలేదని యాజమాన్యాలు చెప్పాయి. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఫీజు బకాయిలు ఏకకాలంలో చెల్లింపు సాధ్యం కాదని, విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. కళాశాలలను మూసివేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరింది. విద్యాసంస్థల డిమాండ్లను ఇప్పటికిప్పుడు నెరవేర్చడం సాధ్యం కాదని, కళాశాలలు మూసివేయడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని, నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పింది. ఫీజుల చెల్లింపు విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన భరోసా రాకపోవడంతో కళాశాలల మూసివేత నిర్ణయంపై వెనక్కు తగ్గే విషయంలో యాజమాన్యాలు కూడా ప్రభుత్వానికి స్పష్టత ఇవ్వలేకపోయినట్టు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఇరుపక్షాల మధ్య మళ్లీ చర్చలు జరగనున్నాయి. సమస్యలను అర్థం చేసుకున్నాం మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నత విద్యామండలి చైర్మన్, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ప్రైవేట్ కళాశాలల యజమాన్యాలు ఆదివారం అయినప్పటికీ అందరం కలిసి సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు చర్చించాం. చర్చలు సానుకూలంగా సాగాయి. కళాశాలల సమస్యలను అర్థం చేసుకున్నాం. సోమవారం ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకుంటాం. అప్పటివరకు సమ్మెను విరమించమని కళాశాలల యజమానులను కోరాం. వారు సానుకూలంగా స్పందించారు. –సమావేశం అనంతరం భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం ఉదయం ఏం జరిగిందంటే.. అంతకుముందు ఉదయం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు సమావేశమై కార్యాచణపై చర్చించాయి. సోమవారం నుంచి బంద్కు పాటించాలని నిర్ణయించాయి. ఫీజులు చెల్లించే వరకూ ఎట్టి పరిస్థితుల్లో కాలేజీలు తెరవొద్దని నిర్ణయించాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి) ప్రతినిధులు మీడియాకు తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ఏడాది నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నాయి. గత ఏడాది పరీక్షలను బహిష్కరించాలని నిర్ణయించాయి కూడా. దీంతో ప్రభుత్వం స్పందించి వారితో చర్చలు జరిపింది. దశల వారీగా బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దీంతో అప్పుడు ఆందోళన నిర్ణయాన్ని యాజమాన్యాలు విరమించుకున్నాయి. తాజాగా శుక్రవారం యాజమాన్య ప్రతినిధులు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డిని కలిసి నోటీసు ఇచ్చారు. సెప్టెంబర్ 30లోపు బకాయిలను విడుదల చేయకపోతే, ఆందోళనను ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం సర్కారు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో విద్యాసంస్థలను మూకుమ్మడిగా మూసివేయాలని నిర్ణయించారు. బంద్ జరిగితే రాష్ట్రంలోని 1,500 పైచిలుకు ప్రైవేట్ ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఫార్మసీ, నర్సింగ్ కాలేజీలకు తాళాలు పడనున్నాయి. దాదాపు 10 లక్షల విద్యార్థులకు బోధన దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఓపిక నశించిందన్న ప్రతినిధులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తుందని ప్రభుత్వంపై ఇన్నాళ్లు విశ్వాసం పెట్టుకున్నామని ‘ఫతి’ ప్రతినిధులు ఉదయం మీడియాకు చెప్పారు. ఇక ఓపిక నశించిందని, అందుకే ఆందోళన బాట పట్టామని తెలిపారు. టోకెన్లు జారీ చేసినప్పటికీ డబ్బులు ఇవ్వలేదన్నారు. దీంతో అన్ని కాలేజీల యాజమాన్యాలు ఉమ్మడి పోరుబాటకు సిద్ధమై ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ను ఏర్పాటు చేసుకున్నాయి. రూ.లక్ష కోట్ల డిపాజిట్లతో ప్రత్యేకంగా ట్రస్ట్ బ్యాంక్ను ఏర్పాటు చేయాలని ప్రైవేటు యాజామాన్యాలు సర్కారుకు ప్రతిపాదించాయి. ఈ లక్ష కోట్లలో సర్కారు వాటా పరిమితమేనని, సీఎస్సార్, కార్పస్ ఫండ్ వంటి ఇతర మార్గాల ద్వారానే ఈ నిధులను సేకరించవచ్చని సూచించాయి. లక్ష కోట్ల డిపాజిట్లపై వచ్చే ఏడు శాతం వడ్డీ (సుమారు రూ.3వేలకోట్లు)తో ఫీజు రీయింబర్స్ చేయొచ్చని ప్రతిపాతిదించాయి. దీనిని కూడా సర్కారు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో అన్ని రకాల వృత్తి విద్యా కాలేజీల యాజమాన్యాలు గురువారం రాత్రి సమావేశమయ్యాయి. సెపె్టంబర్ 15 నుంచి కాలేజీల నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించాయి. ‘ఫతి’ బాటలోనే తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్య సంఘం (టీపీడీపీఎంఏ) కూడా కాలేజీల బంద్కు పిలుపునిచ్చింది. తాము ఈ నెల 16 నుంచి కాలేజీలను మూసివేస్తామని అసోసియేషన్ చెప్పింది. -
హైదరాబాద్లో కుండపోత వాన
సాక్షి,హైదరాబాద్: నగరంలో కుండపోత వాన కురుస్తోంది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఉప్పల్ టూ వరంగల్ రహదారి మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆదివారం సాయంత్రం నుంచి మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, ఉప్పల్, హయత్నగర్, టోలీచౌకీ, మియాపూర్, అమీర్పేట్, పంజాగుట్ట, అబ్ధుల్లాపూర్మెట్, పెద్దఅంబర్పేట్లలో భారీ వర్షపాతం నమోదైంది. కుషాయిగూడా, కాప్రా, ఏఎస్రావు నగర్, చర్లపల్లి, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయాణగూడ, అంబర్పేట్, నల్లకుంటలలో వర్ష పడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. -
జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక ఏఐసీసీ చూసుకుంటుంది: సీఎం రేవంత్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశానికి సంబంధించి సీఎం రేవంత్రెడ్డి తన నివాసంలో సమీక్ష చేపట్టారు. ఆదివారం(సెప్టెంబర్ 14వ తేదీ) జూబ్లీహిల్స్ ఎన్నికపై పలువురు కాంగ్రెస్ నేతలతో చర్చిస్తున్నారు. దీనికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జూబ్లీహిల్స్ ఇంచార్జ్ మంతరులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్లతో సర్వే ఏజెన్సీల నుంచి పలువురు హాజరయ్యారు. ఈ నెలాఖరులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జూబ్లీహిల్స్లో అభివృద్ధి పనులు , అభ్యర్థి ఎంపిక పై మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు. జూబ్లీహిల్స్ రేసులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్లు పోటీలు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికపై సీక్రెట్ సర్వే రిపోర్ట్ను సీఎంకు అందజేశారు పీసీసీ చీఫ్దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రతీ ఒక్కరు పని చేయాలి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలి. పోలింగ్ బూత్ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా కల్పించాలి.కాంగ్రెస్తోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుంది. అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుంది పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత మీపై ఉంది. మీ పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటా. జూబ్లీహిల్స్ లో పార్టీ గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలి’ అని పేర్కొన్నారు.కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాను పోటీలో ఉన్నానని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అంటున్నారు. తాను సికింద్రాబాద్ ఎంపీగా రెండు సార్లు గెలిచానని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభవృద్ధి కోసం కృషి చేశానన్నారు. ఎంపీ ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశానన్నారు. మీడియాతో చిట్చాట్లో భాగంగా తన మనసులోని మాటను వెల్లడించారు అంజన్ కుమార్ యాదవ్. ‘నా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి. అందులో భాగంగా నాకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలిఉమ్మడి ఏపీ నుండి యాదవ సామాజికవర్గంకి మంత్రి పదవి కేటాయించారు. నాకన్న సీనియర్లు ఎవరు లేరు....నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. హైదరాబాద్ నుండి ప్రాతినిథ్యం లేదు కాబట్టి నాకు అవకాశం ఇచ్చి మంత్రి ఇవ్వాలి. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నేను ఉన్న ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి. జూబ్లీహిల్స్లో సర్వే చేస్తే అంజన్ కుమార్ యాదవ్ పేరు వస్తుంది’ అని పేర్కొన్నారు. -
Hyd: ఓల్డ్ బోయిన్పల్లిలోని మేధా స్కూల్ సీజ్
హైదారాబాద్: సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయినపల్లిలో డ్రగ్స్ తయారు చేస్తున్న మేధా హైస్కూల్పై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ స్కూల్ను సీజ్ చేసింది. మేధా స్కూల్ అనుమతులు సైతం రద్దు చేసింది విద్యా శాఖ. ఇక ఆ స్కూల్లో చదువుతున్న విద్యార్థులను ఇతర స్కూళ్లలో చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అసలు ఏం జరిగిందంటే..!విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలనే మ త్తుమందు తయారీ ఫ్యాక్టరీగా మార్చేశారు. ఉదయం పాఠశాల తరగతులు నిర్వహిస్తూనే గుట్టుచప్పుడు కాకుండా రాత్రివేళల్లో ఆ్రల్ఫాజోలం అనే మత్తుపదార్థాన్ని తయారు చేస్తున్నారు. స్వయంగా పాఠశాల కరస్పాండెంటే ఈ దందాకు తెరతీయడం గమనార్హం. సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయినపల్లిలో మేధా హైస్కూల్ కరస్పాండెంట్ మల్లేల జయప్రకాశ్గౌడ్ పాఠశాలలోనే ఆ్రల్ఫాజోలం తయారు చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) బృందం నిఘా పెట్టింది. శనివారం మధ్యాహ్నం జయప్రకాశ్గౌడ్ ఆ్రల్ఫాజోలంను కస్టమర్లకు విక్రయించేందుకు తీసుకెళ్తుండగా అప్పటికే మాటువేసి ఉన్న ఈగల్ బృందం అతడిని అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద నుంచి 3.5 కిలోల ఆ్రల్ఫాజోలంను స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. పాఠశాలలో తనిఖీ చేయగా.. రెండు గదుల్లో ఆల్ఫ్రాజోలం తయారీ పరికరాలు గుర్తించారు. ఈ సోదాల్లో తయారీలో ఉన్న 4.3 కిలోల ఆ్రల్ఫాజోలం, రూ.20 లక్షల నగదు స్వా«దీనం చేసుకున్నారు. జయప్రకాశ్గౌడ్కు సహకరిస్తున్న ఓల్డ్ బోయినపల్లి గంగపుత్ర కాలనీకి చెందిన గౌటె మురళీసాయి, బోయినపల్లి హస్మత్పేటకు చెందిన పెంటమోల్ ఉదయ్ సాయిని అరెస్టు చేశారు. పట్టుబడిన ఆల్ఫ్రాజోలం విలువ బహిరంగ మార్కెట్లో రూ. 50 లక్షల వరకు ఉంటుందని తెలిసింది. ఓల్డ్ బోయినపల్లిలో.. బీటెక్ డిస్కంటిన్యూ చేసిన జయప్రకాశ్గౌడ్ హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని తొమ్మిదేళ్లుగా మేధ హైస్కూల్ నడుపుతున్నాడు. పాఠశాల కరస్పాండెంట్గా పనిచేస్తూనే మత్తుపదార్థాల తయారీ దందాకు తెరతీశాడు. వనపర్తి ప్రాంతానికి చెందిన జయప్రకాశ్... మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో కల్లు దుకాణాలకు ఆ్రల్ఫాజోలం సరఫరా చేయడం ప్రారంభించాడు. ఆల్ఫ్రాజోలం తయారీ ఫార్ములాను ఒకరి నుంచి నేర్చుకున్న తర్వాత తానే స్వయంగా తయారీ ప్రారంభించాడు. ఇందుకు తాను నడుపుతున్న పాఠశాల అయితే ఎవరికీ అనుమానం రాదన్న ఉద్దేశంతో ఇక్కడే రెండు పెద్ద గదుల్లో ఆ్రల్ఫాజోలం తయారీ మొదలుపెట్టాడు. అవసరమైన కెమికల్స్. ఇతర పదార్థాలను రాత్రి సమయాల్లో తెచ్చేవాడు. ఉదయం పాఠశాల నడిచే సమయంలో ఆ రెండు గదులకు తాళం వేసి ఉంచేవాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా వెళ్లిన తర్వాత ఆ్రల్ఫాజోలం తయారీ మొదలుపెట్టేవాడు. ఈ విషయం పాఠశాల సిబ్బందికి, ఇతరులకు తెలియకుండా పాఠశాలతో సంబంధం లేని మురళీసాయి, ఉదయ్ సాయిలను తనతోపాటు చేర్చుకున్నాడు. గత ఆరు నెలలుగా ఇక్కడ ఆ్రల్ఫాజోలం తయారు చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..? ఈ ఆ్రల్ఫాజోలంను ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయిస్తున్నారా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
రేపటి నుంచి తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థలు బంద్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేపటి(సోమవారం, సెప్టెంబర్ 15వ తేదీ) నుంచి ఉన్నత విద్యాసంస్థలను బంద్ చేస్తున్నట్లు రాష్ట్ర హయ్యర్ ఇన్స్టిట్యూషన్ అసోసియేషన్ వెల్లడించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి విద్యార్థులు ఎవరూ కాలేజీలకు రావొద్దని పిలుపునిచ్చింది. డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, నర్సింగ్ సహా అన్ని కాలేజీల బంద్కు పిలుపునిచ్చింది. టెన్త్ తర్వాత ఉన్న అన్ని కళాశాలల విద్యార్థుల తరగతులకు రావొద్దని పేర్కొంది. అదే సమయంలో రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలను సైతం నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీనిలో భాగంగా పరీక్షలను వాయిదా వేయాలని వర్సిటీలను కోరినట్లు తెలిపింది. విద్యార్థులు రేపటి నుంచి కళాశాలకు రావొద్దని, వాటికి తాళాలు వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఫీజు రీయయింబర్స్మెంట్ బకాయిల నిలిపివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన అసోసియేషన్.. 23, 24 తేదీల్లో హైదరాబాద్లో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయనుంది. 20 రోజుల క్రితమే కాలేజీల బంద్పై సీఎస్కు నోటీస్ ఇచ్చామని, కనీసం 21లోగా రూ. 1800 కోట్ల బకాయిలు చెల్లించాలని పేర్కొంది. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని, అక్టోబర్ 31వ తేదీ నాటికి రెండో విడత బకాయిలు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేసింది. ఇక డిసెంబర్ 31వ తేదీ నాటికి మొత్తం బకాయిలు చెల్లించాల్సిందేనని తమ డిమాండ్లో పేర్కొంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రతీ ఏడాది మార్చి 30లోగా చెల్లించేలా జీవో ఇవ్వాలని అసోసియేషన్ పేర్కొంది. -
హనీ ట్రాప్లో యోగా గురువు రంగారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో యోగా ఆశ్రమం నిర్వహిస్తున్న ఓ యోగా గురువు హనీ ట్రాప్లో చిక్కుకున్నారు. అనారోగ్య సమస్యలతో రంగారెడ్డి యోగా శ్రమంలో ఇద్దరు మహిళలు చేరారు. కొన్ని రోజులుగా రంగారెడ్డికి ఆ మహిళలు సన్నిహితంగా ఉన్నారు. మహిళలతో సన్నిహితంగా ఉన్న ఫొటోలతో అమర్ గ్యాంగ్ బ్లాక్ మెయిల్కి తెరతీసింది.అమర్ గ్యాంగ్కు భయపడిన రంగారెడ్డి రూ.50 లక్షలు ఇచ్చారు. మరో రూ.2 కోట్లు అమర్ గ్యాంగ్ డిమాండ్ చేసింది. దీంతో రంగారెడ్డి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. హనీ ట్రాప్పై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. -
నాగోల్లో దారుణం.. భార్య గొంతు కోసిన భర్త
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం జరిగింది. భర్త తన భార్య గొంతును కోసిన ఘటన నాగోల్లో చోటు చేసుకుంది. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు.గత యాడాది క్రితమే మహాలక్ష్మి(20)కి వేణుగోపాల్తో వివాహమైంది. అదనపు కట్నం తేవాలంటూ పెళ్ళైన నెల నుండే భార్యపై భర్త పలుమార్లు దాడి చేశాడు. పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చినా భర్త తీర మారలేదు. వేణుగోపాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కాళ్లు, చేతులు కట్టేసి.. 40 కత్తిపోట్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన కూకట్పల్లి మహిళ హత్య కేసును సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. హతురాలు రేణు అగర్వాల్ ఇంట్లో ఉన్న రోల్డ్ గోల్డ్ వస్తువులను నిజమైన బంగారమని భావించిన నిందితులు.. వాటిని దాచిన లాకర్ కీ ఆమె ఇవ్వకపోవడంతో హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఇద్దరు నిందితులు హర్ష్, రోషన్లతో పాటు ఝార్ఖండ్లో వీరికి ఆశ్రయం కల్పించన రాజ్ వర్మను కూడా పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి మీడియాకు వివరాలు వెల్లడించారు. స్నేహితుడితో కలిసి.. కూకట్పల్లిలోని స్వాన్లేక్ గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్మెంట్లో ఉండే రాకే‹Ù, రేణు అగర్వాల్ దంపతుల ఇంట్లో ఝార్ఖండ్కు చెందిన రాజ్ వర్మ పని చేసేవాడు. ప్రతిరోజూ ఇంట్లో కబోర్డులు శుభ్రం చేస్తుండగా నకిలీ బంగారు ఆభరణాలను చూసి, అవి నిజమైనవిగా భావించాడు. తాను పనిచేసే ఇంట్లో భారీగా బంగారం, నగదు ఉన్నాయని స్నేహితుడు హర్ష్కు చెప్పాడు. వాటిని ఎలాగైనా దొంగిలించాలని భావించిన హర్ష్ పథకం వేశాడు. రేణు హత్యకు రెండు రోజుల ముందే రాజ్తో పని మాని్పంచి, ఆ స్థానంలో తాను పనిలో చేరాడు. అదే అపార్ట్మెంట్లో 14వ అంతస్తులో ఉంటున్న రాకేష్ సోదరుడి ఇంట్లో ఝార్ఖండ్కు చెందిన రోషన్ పని చేసేవాడు. హర్ష్, రోషన్లు ఇద్దరూ స్నేహితులే. కాళ్లు, చేతులు కట్టేసి.. 40 కత్తిపోట్లు ఈ నెల 10న రాకేష్, అతని కుమారుడు వ్యాపారం నిమిత్తం బయటికి వెళ్లిపోయారు. రేణు అగర్వాల్ ఒంటరిగా ఉండటంతో హర్ష్, రోషన్లు ఇంట్లోకి చొరబడ్డారు. రేణు నోటిలో దుస్తులు కుక్కి కాళ్లు చేతులు కట్టేశారు. లాకర్ తాళాలు ఎక్కడున్నాయో చెప్పాలని, డబ్బులు, బంగారం ఎక్కడెక్కడ దాచిపెట్టారో చెప్పాలంటూ చిత్రహింసలకు గురి చేశారు. సుమారు గంటకు పైగా ఆమెను చిత్రహింసలకు గురిచేసినా చెప్పకపోవడంతో.. ఆగ్రహానికి గురైన నిందితులు వంటింట్లోని కుక్కర్తో ఆమె తలపై బలంగా మోదారు. ఆపై కత్తితో గొంతుకోసి.. నుదురు, చేతులు, కడుపు, మెడపై 40సార్లు పొడిచి చంపేశారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం ఆభరణాలు, నగదు, రోల్డ్ గోల్డ్ వస్తువులు, గడియారాలను ట్రావెల్ బ్యాగ్లో సర్దుకున్నారు. ఈ ఇంట్లోనే స్నానం చేసి, ట్రావెల్ బ్యాగ్తో యజమాని స్కూటీపై పరారయ్యారు.పోలీసులను చూసి.. ప్లాన్ మార్చి.. ఈ ముఠా నిత్యం రైళ్లలోనే ప్రయాణాలు సాగిస్తుంటుంది. హత్య చేసిన తర్వాత కూడా రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు పయనమయ్యారు. వీరికి హఫీజ్పేట రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలియదు. దీంతో మార్గంమధ్యలో ఇద్దరు ముగ్గురిని అడిగి స్టేషన్కు దారి తెలుసుకున్నారు. స్టేషన్ బయటే స్కూటీని వదిలేసి.. లోపలికి వెళ్లి రైలు ఎక్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లిపోయారు. రాంచీ వెళ్లేందుకు టికెట్లు తీసుకొని రైలు ఎక్కేందుకు స్టేషన్ లోపలికి వెళ్లిపోయారు. అప్పటికే స్టేషన్ లోపల పోలీసులు ఉండటంతో అక్కణ్నుంచి బయటికి వచ్చారు. మళ్లీ హఫీజ్పేట చేరుకొని.. రాత్రి 1 గంట సమయంలో క్యాబ్ బుక్ చేసుకొని, రాంచీలోని రాజు వర్మ వద్దకు వెళ్లిపోయారు. రాంచీకి విమానంలో వెళ్లి నిందితుల పట్టివేత సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులు పనివాళ్లే నిందితులని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అప్పటికే హత్య కేసు, అనుమానితుల ఊహాచిత్రాలు మీడియాలో వైరల్ కావడంతో నిందితులను రాంచీలో వదిలేసిన క్యాబ్ డ్రైవర్ దీన్ని గమనించాడు. దీంతో వెంటనే క్యాబ్ యజమాని సహాయంతో నిందితులు క్యాబ్ బుక్ చేసుకున్న విషయాన్ని సైబరాబాద్ పోలీసులకు అందించారు. వెంటనే సైబరాబాద్ పోలీసులు నిందితుల కంటే ముందే విమానంలో రాంచీకి చేరుకున్నారు. హర్ష్, రోషన్, రాజ్లను అరెస్టు చేసి, స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తరలించారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, 16 వాచీలు, రెండు సెల్ఫోన్లు, రోల్డ్ గోల్డ్ వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు.డ్రగ్స్కు బానిస హర్ష్నిందితుడు హర్ష్ డ్రగ్స్కు వ్యవసనపరుడని విచారణలో పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసే సమయంలోనూ హర్ష్ మత్తులో ఉన్నాడని కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. కోల్కతాలోని ఓ రిహాబిలిటేషన్ సెంటర్లో అడ్మిషన్, చికిత్స చేయించుకున్న డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. హర్ష్పై 2023లోనే రాంచీలో మూడు కేసులు నమోదయ్యాయని చెప్పారు. స్థానికంగా జైలులో ములాఖత్కు వెళ్లి, బయటికి వచ్చేటప్పుడు హీరోగా రీల్స్ చేస్తూ ఉండేవాడని, అందుకోసమే చెయిన్స్, ఆయుధాలను కొనుగోలు చేశాడని సీపీ వివరించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీపీ అవినాష్ మహంతిని, ఆయన బృందాన్ని డీజీపీ డాక్టర్ జితేందర్ అభినందించారు. -
వెయ్యి టన్నుల నిమజ్జన వ్యర్థాల తొలగింపు
బంజారాహిల్స్: వినాయక విగ్రహాల నిమజ్జనం తర్వాత హుస్సేన్సాగర్తో పాటు చుట్టూ ఉన్న రోడ్లు, ఫుట్ఫాత్ల నుంచి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సిబ్బంది వెయ్యి టన్నుల నిమజ్జన వ్యర్థాలు, చెత్తాచెదారం తొలగించారు. ఈ నెల 6వ తేదీ విగ్రహాల నిమజ్జనం నుంచే హుస్సేన్సాగర్లో నుంచి, రోడ్లు, ఫుట్పాత్ల నుంచి వ్యర్థాల తొలగింపు పనులను జీహెచ్ఎంసీ సర్కిల్–17 సిబ్బంది ముమ్మరం చేశారు. హుస్సేన్సాగర్ చుట్టూ 500 మంది పారిశుద్ధ్య కారి్మకులు ఈ చెత్త తొలగింపులో పాల్పంచుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నిమజ్జన వ్యర్థాలు 150 టన్నుల మేర అదనంగా తొలగించినట్లు అధికారులు తెలిపారు. గతేడాది 850 టన్నుల వ్యర్థాలు తొలగించగా ఈ ఏడాది వెయ్యి టన్నులకు చేరింది. సుమారుగా అయిదున్నర లక్షల మంది భక్తులు ఈ సారి నిమజ్జన వేడుకలను తిలకించడానికి వచ్చారు. 40 వేల పెద్ద వినాయక విగ్రహాలు ఈ సారి నిమజ్జనం చేయగా గతేడాది కంటే 5 వేల విగ్రహాలు అదనంగా పెరిగాయి. నిమజ్జనానికి తిలకించడానికి వచి్చన భక్తుల ద్వారా టన్నుల కొద్ది పేపర్ ప్లేట్లు ప్లాస్టిక్ గ్లాస్లు, ప్లాస్టిక్ సంచులు, విగ్రహాల అలంకరణ, పూజా సామగ్రి పెద్ద సంఖ్యలో పేరుకుపోవడమే కాకుండా వీటి తొలగింపు కూడా సిబ్బందికి సవాల్గా మారింది. విగ్రహాల నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరగడంతో పాటు ఈ సారి చెత్తా చెదారం తొలగింపు కూడా ప్రణాళికాబద్ధంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పండుగ తర్వాత మూడో రోజు నుంచి మొదలైన చెత్తాచెదారం తొలగింపు నిమజ్జనం అనంతరం వారం రోజుల వరకు కొనసాగింది. దీంతో హుస్సేన్సాగర్ చుట్టూ శుక్రవారం నుంచి పూర్తి క్లీన్ అండ్ గ్రీన్ చోటు చేసుకుంది. ఓ వైపు జీహెచ్ఎంసీ ప్రణాళికాబద్ధంగా షిఫ్ట్ల వారీగా సిబ్బందిని నియమించి వ్యర్థాల తొలగింపు చేపట్టగా హెచ్ఎండీఏ కూడా హుస్సేన్సాగర్లో నుంచి 11 టన్నుల వేస్ట్ను తొలగించింది. ఇంకా ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది 12 వేల టనుల నిమజ్జన వ్యర్థాలు తొలగించగా ఈ సారి కొంత మేర తగ్గుముఖం పట్టింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో ఐరన్ మెటీరియల్ కూడా పెద్ద మొత్తంలో ఈ సారి తొలగించి హుస్సేన్సాగర్ను క్లీన్ చేశారు. హుస్సేన్సాగర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఎవరికి వారే వ్యర్థాలు, ఇనుప చువ్వలు, ఇతరత్రా వేస్ట్ మెటీరియల్ను తొలగించి ఇప్పుడిప్పుడే ప్రాంతాన్ని కుదుటపడేలా చేశారు. మొత్తానికి గతేడాదితో పోలిస్తే ఈ సారి నిమజ్జన వ్యర్థాలు పెద్ద ఎత్తున పోగవడమే కాకుండా వాటిని తొలగించడంలో జీహెచ్ఎంసీ పారిశుద్ద్య కారి్మకులు అదనంగా మూడు రోజుల కష్టపడాల్సి వచ్చింది. తొలగించిన వ్యర్థాలను డంపింగ్ యార్డ్కు తరలించినా కూడా జీహెచ్ఎంసీకి ఒక సవాల్గా మారింది. మొత్తానికి పది రోజులుగా దృష్టి పెట్టిన సిబ్బంది ఇప్పుడిప్పుడే సమస్యను కొలిక్కి తీసుకొచ్చారు. -
‘చోటే భాయ్’ని కాపాడుతున్న ‘బడే భాయ్’.. కేటీఆర్ సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ సొరంగం ఘటన జరిగి 200 రోజులు దాటినా కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగురి మృతదేహాలను కూడా వెలికితీయలేకపోయింది. ఇంకా కుటుంబాలకు ఎలాంటి పరిహారం కూడా చెల్లించలేదంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నపాటి సమస్యలకే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపించి హంగామా సృష్టించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఎస్ఎల్బీసీ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఎందుకు ఒక్క బృందాన్ని కూడా పంపలేదంటు కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ బడే భాయ్ ఎందుకు తెలంగాణలో కాంగ్రెస్ చోటే భాయ్ని కాపాడుతున్నారంటూ దుయ్యబట్టారు.బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన రోజున, ఆ ఆరు కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తాం. ఆ ఆరుగురి ప్రాణాలను బలిగొన్న వారికి శిక్ష పడేలా చేస్తాం. కాంగ్రెస్ విధ్వంసం చేసిన ప్రతి దానితో పాటు ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడానికి గల కారణాలకు మేము సమాధానాలు రాబడతాం’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. More than 200 days since the Srisailam Left Bank Canal tunnel collapsed, killing 8 hapless workers due to the criminal negligence of the corrupt Revanth GovtThis inefficient Congress govt couldn’t even retrieve the bodies of 6 victims, and hasn’t paid any compensation to the… pic.twitter.com/Rl11OwVJvf— KTR (@KTRBRS) September 14, 2025 -
తెలంగాణలో వానలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు (Rain Update) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలకి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన ప్రాంతాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఇక, హైదరాబాద్ నగరంలో మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.ఇక సోమవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా ఆదిలాబాద్, కుమ్రం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపెల్లి, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షం కురుస్తుందని వెల్లడించింది. ఇక, శనివారం రాత్రి హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. Overnight INTENSE THUNDERSTORMS lashed North TG districts, overall, 4th consecutive day of POWERFUL THUNDERSTORMS in many parts of TelanganaHyderabad too got decent rains yesterday. Will share today's forecast soon ⛈️👍 pic.twitter.com/tJeTJEy6rm— Telangana Weatherman (@balaji25_t) September 14, 2025 -
Hyderabad: ఈ క్యూ రేషన్ కోసం కాదు, బంగారం కోసం!
హైదరాబాద్: రేషన్ షాపులో సరుకులు తీసుకునేందుకు వచ్చినవారు కాదు వీరంతా. బంగారం కొనేందుకు వీరు ఇలా బారులు తీరారు. పసిడి 10 గ్రాముల ధర రూ.లక్ష దాటి పరుగులు తీస్తున్నా.. గిరాకీ మాత్రం తగ్గలేదనడానికి ఈ క్యూలైన్ చూస్తేనే తెలుస్తోంది. శనివారం అఫ్జల్గంజ్లోని ఓ జ్యువెలరీ షాపు ముందు బంగారం కొనుగోలు చేసేందుకు నగర వాసులు ఇలా క్యూ కట్టిన చిత్రం కనిపించింది. -
రసూల్పురా రద్దీకి చెక్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రసూల్పురా జంక్షన్ ఒకటి. ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి పంజగుట్ట, అమీర్పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాలకు వెళ్లేవారు రసూల్పురా జంక్షన్ నుంచే వెళ్తుంటారు. ఆయా ప్రాంతాల నుంచి మినిస్టర్ రోడ్, కిమ్స్, కవాడిగూడ, ముషీరాబాద్, ట్యాంక్బండ్ తదితర ప్రాంతాలకు వెళ్లేవారూ ఈ జంక్షన్ నుంచే ప్రయాణిస్తారు. సికింద్రాబాద్ నుంచి బంజారాహిల్స్ వైపు ఎన్ని ఫ్లై ఓవర్లు ఉన్నా రసూల్పురా జంక్షన్లో మాత్రం ఆగిపోక తప్పడం లేదు. ట్రాఫిక్ ఇబ్బందులతో ఎంతో సమయం వృథా అవుతోంది. వాహనాలకు ఇంధన వ్యయం అధికమవుతోంది. రసూల్పురా జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మిస్తే ఈ ఇక్కట్లు తగ్గుతాయని భావించిన జీహెచ్ఎంసీ సర్వే, ఇన్వెస్టిగేషన్, డీటెయిల్డ్ డిజైన్లతో సహా ఫ్లై ఓవర్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది సంబంధిత ఇంజినీర్లు తెలిపారు. నాలుగు లేన్లతో.. నాలుగు లేన్లతో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.150 కోట్లు. ఇందులో భూ సేకరణ అంచనా వ్యయమే దాదాపు రూ.70 కోట్లు. వై ఆకారంలో రానున్న ఈ ఫ్లై ఓవర్ అప్రోచ్ మార్గం హెచ్ఎంఆర్ఎల్ బిల్డింగ్ ఉత్తరం వైపు నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభంలో నాలుగులేన్లుగా ఉండే ఫ్లై ఓవర్ క్యారేజ్వే 14 మీటర్లుగా ఉంటుంది. రసూల్పురా జంక్షన్ దగ్గర నుంచి మినిస్టర్ రోడ్వైపు, పాటిగడ్డ రోడ్ వైపు రెండు ఆర్మ్లతో వై ఆకారంలో విడిపోతుంది. మినిస్టర్ రోడ్వైపు వెళ్లే ఆర్మ్ మూడు లేన్లతో ఉంటుంది. దీని క్యారేజ్వే వెడల్పు 11 మీటర్లు, పాటిగడ్డవైపు వెళ్లే మార్గం రెండు లేన్లతో ఉంటుంది. దీని క్యారేజ్వే వెడల్పు 7.5 మీటర్లు. రెండేళ్లలో పూర్తి చేయాలి.. పనులకు ఎంపికయ్యే ఏజెన్సీ పనులు రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చాక వాహన ప్రయాణ వేగం కనీసం 40 కేఎంపీహెచ్ నుంచి 65 కేఎంపీహెచ్కు పెరగవచ్చని అధికారులు తెలిపారు. ప్రయాణ మార్గం ఒకే వైపు ఉండే ఈ ఫ్లై ఓవర్ను హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్ట్ కింద ఈపీసీ (ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో చేపడుతున్నారు. -
Hyderabad: నేడు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. మిలాద్– ఉన్– నబీ ఊరేగింపు సందర్భంగా ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. మిలాద్–ఉన్–నబీ ఊరేగింపుల దృష్ట్యా ఫలక్నుమా, ఇంజన్ బౌలి, నాగుల్చింత ఎక్స్ రోడ్, హిమ్మత్పురా జంక్షన్, ఓల్గా, హరిబౌలి, పంచ్ మొహల్లా, చార్మినార్, గుల్జార్ హౌజ్, మదీనా జంక్షన్, పత్తర్గట్టి, మీరాలం మండీ, ఎతేబార్ చౌక్, అలీజా కోట్లా, బీబీ బజార్, వాల్టా హోటల్, అఫ్జల్గంజ్ టీ జంక్షన్, ఉస్మాన్ గంజ్, ఎంజే మార్కెట్ జంక్షన్, తాజ్ ఐలాండ్, నాంపల్లి టీ జంక్షన్, హజ్ హౌస్, ఏఆర్ పెట్రోల్ పంప్, నాంపల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు ఉంటాయని చెప్పారు. మిలాద్–ఉన్–నబీ ఊరేగింపు కారణంగా ఆదివారం ఓల్డ్ సిటీలోని పర్యాటక ప్రదేశాలను మూసివేయనున్నట్లు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారి వెల్లడించారు. చార్మినార్తో పాటు పాతబస్తీలోని స్మారక చిహ్నాలు, పలు పర్యాటక ప్రదేశాలను క్లోజ్ చేయనున్నట్లు ఆయన తెలిపార -
మాట తప్పాడని మట్టుబెట్టారు
కుషాయిగూడ: కొన్నేళ్ల పాటు తమను వెంట తిప్పుకున్నాడని.. మీ లైఫ్ సెట్ చేస్తా.. మంచి జీవితాన్నిస్తానని.. తీరా పక్కకు తప్పించాడని కక్ష పెంచుకున్నవారు శుక్రవారం నడిరోడ్డుపై ఓ రియల్టర్ను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది. నమ్మినవారే హత్యకు పూనుకోవడం చర్చనీయాంశంగా మారింది. హత్యకు వ్యాపార లావాదేవీలే కారణమని కొందరు, వాటాల పంచాయితీ అని మరికొందరు అంటుండగా.. అసలు విషయం మరోవిధంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మీర్పేట్– హెచ్బీకాలనీ డివిజన్ పరిధిలోని మంగాపురం కాలనీలో నివసించే శ్రీకాంత్రెడ్డి రియల్ ఎస్టేట్తో పాటు వడ్డీ వ్యాపారం కూడా చేసేవారు. లాలాపేట్కు చెందిన ఓ రౌడీషిటర్.. శ్రీకాంత్రెడ్డితో కలిసి వ్యాపారం చేసేందుకు రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఈ క్రమంలో కొంత కాలం క్రితం పెట్టుబడి పెట్టిన రౌడీషిటర్ చనిపోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు డబ్బుల కోసం శ్రీకాంత్రెడ్డిని అడగసాగారు. తనకు వ్యాపారంలో నష్టం వచి్చందని నెట్టుకువచ్చాడు. విసిగి వేసారిపోయిన రౌడీషిటర్ సంబంధీకులు మిన్నకుండిపోయినట్లు తెలిసింది. రూ.2 కోట్ల పెట్టుబడి, మిగిలిపోయిన విషయాలు శ్రీకాంత్రెడ్డి వెంట ఉండేæ ధన్రాజ్, జోసెఫ్లకు కూడా తెలుసు. ఈ విషయంపై పలుమార్లు మాట్లాడుకున్నారు. రూ.2 కోట్లు మిగిలాయి కదా.. తమకు రూ.10 లక్షలు ఇవ్వాలని వారు అడిగినట్లు సమాచారం. ఆ సమయంలో శ్రీకాంత్రెడ్డి సరే అనడంతో వారు ఆశలు పెంచుకున్నారు. బీరు తాగించి.. రూ.10 లక్షల విషయాన్ని ధన్రాజ్, జోసెఫ్లు పలుమార్లు ప్రస్తావించడంతో విసుగుచెందిన శ్రీకాంత్రెడ్డి.. మీతో నాకు సంబంధం లేదంటూ వారిని పక్కకు పెట్టినట్లు తెలిసింది. దీంతో వారు పగ పెంచుకున్నారు. పది రోజుల క్రితం మరోసారి శ్రీకాంత్రెడ్డిని ఆశ్రయించారు. డబ్బుల కోసం వేడుకున్నారు. అయినా శ్రీకాంత్రెడ్డి తీరులో మార్పు రాకపోవడంతో «ధన్రాజ్, జోసెఫ్లు శుక్రవారం మధ్యాహ్నం నుంచే మద్యం తాగారు. మద్యం మత్తులో హెచ్బీకాలనీ, మంగాపురంలోని శ్రీకాంత్రెడ్డి ఆఫీసుకు వెళ్లారు. వారితో పాటు తీసుకువచి్చన బీరులోంచి ఓ గ్లాసు శ్రీకాంత్రెడ్డికి పోసి తాగించారు. చివరి ప్రయత్నంగా మరోసారి డబ్బులు ఇవ్వాలని బతిమిలాడారు. అప్పటికీ శ్రీకాంత్రెడ్డి మాట తీరులో ఏ మాత్రం మార్పు కనిపించకపోవడంతో ఆగ్రహానికి లోనై అతడి గల్లా పట్టుకొని ఆఫీసు బయటికి ఈడ్చుకు వచ్చి కాలనీలో అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి హత్య చేశారు. వీరిద్దరితో పాటు మూడో వ్యక్తి సైతం శ్రీకాంత్రెడ్డి ఆఫీసుకు వచి్చనట్లు తెలిసింది. ఆ మూడో వ్యక్తి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. శ్రీకాంత్రెడ్డి హత్య కేసు నిందితులు ధన్రాజ్, జోసెఫ్తో పాటు మరో వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
రెండో బండి ఉంటే పన్నుల మోతే
కొద్దిరోజుల క్రితం జూబ్లీహిల్స్కు చెందిన ఓ వ్యక్తి కొత్త కారు నమోదు కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులను సంప్రదించారు. ఆయన పేరుతో ఇప్పటికే ఓ ద్విచక్ర వాహనం ఉందని, 2 శాతం పన్ను అదనంగా చెల్లించాలని వారు చెప్పారు. దీంతో ఆ వ్యక్తి విస్మయానికి గురయ్యారు. 33 ఏళ్ల క్రితం వినియోగించిన స్కూటర్ అది. చాలా ఏళ్ల క్రితమే అది తుక్కుగా మారింది. కనీసం ఆ వాహనానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు కూడా లేవు. కానీ.. రవాణాశాఖ రికార్డుల్లో మాత్రం నమోదై ఉండడంతో బిత్తరపోయారు. లేని వాహనం ఉన్నట్లుగా చూపడంతో పాటు రెండో బండి పేరిట కొత్తగా కొనుగోలు చేసిన వాహనంపై 20 శాతం నుంచి 22 శాతం వరకు జీవితకాల పన్ను పెంచారు. వాహనదారులపై రవాణా శాఖ గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్న దోపిడీకి ఇదో తాజా ఉదాహరణ. సాక్షి, హైదరాబాద్: కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై జీవితకాల పన్ను పెంచినప్పటికీ రెండో బండి పేరిట సాగించే ఆర్టీఏ అదనపు బాదుడు యథావిధిగా కొనసాగుతూనే ఉంది. పాత వాహనం ఉండి కొత్తగా మరో వాహనం కొనుగోలు చేసేవారు అదనంగా 2 శాతం పన్ను చెల్లించాల్సివస్తోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన స్క్రాప్ పాలసీకి అనుగుణంగా రెండో వాహనం నిబంధనను ఎత్తివేయనున్నట్లు రవాణాశాఖ ప్రకటించింది. కానీ.. ఈ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా కొత్త వాహనాలపై పన్నులు పెంచింది. కార్లు, తదితర నాలుగు చక్రాల వాహనాల ధరలపై 20 నుంచి 25 శాతం వరకు లైఫ్ ట్యాక్స్ విధించారు. ఒకవైపు అదనపు పన్నుల మోతను భరిస్తున్న వాహనదారులపై ‘పాతబండి’ పేరిట మరో 2 శాతం బాదుతున్నారు. రెండో బండి పేరిట ఏటా దాదాపు రూ.150 కోట్లకు పైగా పన్ను వసూలు చేయడం గమనార్హం. తుక్కు విధానం ఏమైనట్లు.. కూకట్పల్లికి చెందిన ఓ వాహనదారుడి పాత ద్విచక్ర వాహనం ఏడేళ్ల క్రితం చోరీకి గురయింది. ఈ మేరకు పోలీస్ కేసు కూడా నమోదైంది. ఇప్పటి వరకు ఆ బండి ఆచూకీ లభించలేదు. కానీ.. సదరు వాహనదారు కొత్తగా కొనుగోలు చేసిన కారుపై 2 శాతం అదనంగా పన్ను చెల్లించాల్సివచి్చంది. బండి అపహరణకు గురైనట్లు కేసు నమోదైనస్పటికీ కేవలం రవాణాశాఖ రికార్డుల్లో నమోదై ఉన్నందుకే అదనంగా సమరి్పంచుకోవాల్సి వస్తోంది. ఇలా భౌతికంగా లేని వాహనాలపై, కాలం చెల్లినవాటిపై సమగ్రమైన తుక్కు విధానాన్ని (స్క్రాప్ పాలసీ)ని రూపొందించి 2 శాతం అదనపు బాదుడు నుంచి మినహాయింపును ఇవ్వనున్నట్లు రవాణా అధికారులు ఏడాది క్రితం ప్రతిపాదించారు. గత ఆగస్టులో ఎడాపెడా జీవితకాల పన్ను పెంచినప్పటికీ ఈ రెండో వాహనం నిబంధనను తొలగించలేదు. దీంతో వాహనం ఉన్నా, లేకున్నా పెద్ద మొత్తంలో జీవితకాల పన్ను రూపంలో కోల్పోవాల్సివస్తోంది. ఇది కేవలం ఒకరిద్దరికి సంబంధించిన అంశం కాదు. గ్రేటర్లో లక్షలాది మంది వాహనదారులు తమ పాత వాహనాలపై రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాహనాలను విక్రయించినప్పటికీ యాజమాన్యం బదిలీ చేయకపోవడంతో కొందరు, కాలం చెల్లిన వాహనాలను రవాణా అధికారుల సమక్షంలో తుక్కుగా మార్చకపోవడంతో మరికొందరు దారుణంగా నష్టపోతున్నారు. ద్విచక్ర వాహనం ఉన్నా.. నగరంలో వాహనాల రద్దీని నియంత్రించేందుకు, ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ వాహనాలు కొనుగోలు చేయకుండా నిరుత్సాహపరిచేందుకు రవాణాశాఖ 2 శాతం అదనపు పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. నిజానికి అప్పటికే ఒక కారు కలిగి ఉన్న వ్యక్తి అదనంగా మరో కారును కొనుగోలు చేసినప్పుడు మాత్రమే 2 శాతం అదనపు పన్ను వర్తిస్తుంది. ఒక ద్విచక్ర వాహనం ఉండి కొత్తగా కారు కొనుగోలు చేసినప్పుడు ఇది వర్తించదు. కానీ రవాణా అధికారులు ఈ నిబంధనను బేఖాతరు చేశారు. ద్విచక్ర వాహనం ఉన్నా సరే ఏకంగా రూ.లక్షల్లో అదనపు బాదుడుకు పాల్పడుతున్నారు.‘కనీసం రూ.25 వేలు కూడా ఖరీదు చేయలేని డొక్కు స్కూటర్ ఉన్నందుకు రూ.లక్షల్లో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని’ ఓ వాహనదారుడు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు ద్విచక్ర వాహనాలను ఈ నిబంధన నుంచి తొలగించాలనే ప్రతిపాదన ఉన్నా.. ఏటా రూ.150 కోట్లకు పైగా అదనపు ఆదాయం వస్తుండడంతో బాదుడు కొనసాగిస్తున్నారు. -
చర్చలతో లాభం లేదు
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులతో చర్చలు జరపడం వల్ల ఫలితం ఏమీ ఉండదని డీజీపీ జితేందర్ అభిప్రాయపడ్డారు. ‘2004లోనూ మావోయిస్టులతో జరిపిన చర్చల సందర్భంగా ఫలితమేమీ రాలేదు. చర్చలు అనేది మావోయిస్టులు తమను తాము కాపాడుకునేందుకు, కాలయాపన చేసేందుకు వేసే ఒక ఎత్తుగడ మాత్రమే’అని ఆయన పేర్కొన్నారు. చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టులు చేస్తున్న ప్రకటనలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటని మీడియా అడిగిన ప్రశ్నకు డీజీపీ ఈ విధంగా స్పందించారు. మావోయిస్టుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. లొంగిపోవడమే మావోయిస్టులకు ఉత్తమ మార్గమని తెలిపారు. మార్చి 31, 2026 వరకు మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలన్నది అంతిమ లక్ష్యమని.. అది లొంగుబాట్లు కావచ్చు, లేదా ఎన్కౌంటర్ ద్వారా కావొచ్చు.. అని పేర్కొన్నారు. అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని మావోయిస్టులకు డీజీపీ విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకురాలు, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి, అలియాస్ కల్పన అలియాస్ సుజాతక్క శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇంటెలిజెన్స్ డీజీ శివధర్రెడ్డి, ఎస్ఐబీ చీఫ్ బి.సుమతిలతో కలసి డీజీపీ జితేందర్ మాట్లాడారు. ఈ ఏడాది ఇప్పటివరకు మావోయిస్టు పార్టీకి చెందిన 404 మంది సభ్యులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారని, తెలంగాణలో జరిగిన ఎన్కౌంటర్లలో 10 మంది మృతి చెందారని తెలిపారు. నంబాల కేశవరావు మృతి తర్వాత మావోయిస్టు పార్టీ నాయకుడు ఎవరన్నది తెలియదని, పలు పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ డీజీ శివధర్రెడ్డి మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టుల విషయంలో ప్రభుత్వం సానుభూతితోనే వ్యహరిస్తుందని వెల్లడించారు. ఆరోగ్యపరమైన సమస్యలకు చికిత్సతోపాటు రివార్డు మొత్తాన్ని ఇస్తామని తెలిపారు. మావోయిస్టులలో తెలంగాణకు చెందిన 78 మంది దేశవ్యాప్తంగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర కమిటీలో 11 మంది తెలంగాణ వాళ్లు ఉన్నారన్నారు. 43 ఏళ్ల అజ్ఞాతం వీడిన సుజాత.. తొలుత జననాట్యమండలిలో చేరిన పోతుల పద్మావతి, అలియాస్ సుజాత 43 ఏళ్ల అజ్ఞాత జీవితంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలి స్థాయి వరకు చేరారు. గద్వాల జిల్లా గట్టు మండలంలోని పెంచికలపాడు గ్రామానికి చెందిన ఆమె మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీని 1984లో వివాహం చేసుకున్నారు. 1989 వరకు పెరిమిలి దళంలో, తర్వాత ఎటపల్లి దళంలో పనిచేసిన సుజాత 1996లో ఉత్తర గడ్చిరోలి దేవూరి దళ కమాండర్గా, 1997–99 వరకు దక్షిణ బస్తర్ కమిటీ డివిజన్ కమిటీ మెంబర్గా, 2001లో దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు. 2018లో జనతన్ సర్కార్ పూర్తి బాధ్యతలు స్వీకరించారు. 2022లో గెరిల్లా స్థావరం దక్షిణ సబ్జోనల్ బ్యూరో కార్యదర్శిగా, 2023లో కేంద్ర కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొందారు. కోయ భాషలో వచ్చే పేతురి పత్రిక సంపాదకురాలిగా పనిచేశారు. ప్రస్తుతం సుజాత ఆరోగ్యం క్షీణించడంతో రాష్ట్ర డీజీపీ సమక్షంలో శనివారం లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్.. ఇంటెలిజెన్స్ డీజీ శివధర్రెడ్డి, ఎస్ఐబీ చీఫ్ సుమతితో కలసి సుజాతకు రూ.25 లక్షల రివార్డు చెక్కును అందించారు. -
కృష్ణా జలాల్లో 904 టీఎంసీలే లక్ష్యం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టీఎంసీల నీటిని సాధించడమే లక్ష్యంగా వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి న్యాయ నిపుణులు, నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కృష్ణా జలాలపై ఈ నెల 23, 24, 25 తేదీల్లో బ్రిజేష్ ట్రిబ్యునల్ వద్ద వాదనలు వినిపించాల్సి ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఎస్కే వోహ్రా, ప్రభుత్వ నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్దాస్, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్బొజ్జా, కార్యదర్శి పీజీ పాటిల్, చీఫ్ ఇంజనీర్లతో శనివారం సమీక్షించి, వారికి దిశానిర్దేశం చేశారు. కృష్ణానదిలో నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా సరే.. తెలంగాణకు చెందాల్సిన నీటివాటాలో ఒక చుక్క నీరు కూడా వదులుకునేది లేదని సీఎం చెప్పారు. న్యాయ నిపుణులకు అవసరమైన ఆధారాలన్నీ ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. స్వయంగా మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లి ఈ విచారణలో పాల్గొంటారని ముఖ్యమంత్రి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు, నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్ ముందు ఉంచాలని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవోలు, మెమోలు, డాక్యుమెంటన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, అప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్కు అందించాలని తెలిపారు. గత ప్రభుత్వంలో అన్యాయం... గత ప్రభుత్వం కృష్ణా జలాల్లో రావాల్సిన నీటి వాటాను సాధించకపోగా, ఏపీకీ 512 టీఎంసీలు కట్టబెట్టి, 299 టీఎంసీల వాటాకు ఒప్పుకొని తెలంగాణకు తీరని అన్యాయం చేసిందనే చర్చ ఈ సమీక్షలో వచ్చింది. అప్పటి సీఎం కేసీఆర్ 299 టీఎంసీల వాటాకు ఒప్పుకున్న విషయాన్ని ఏపీ ఇప్పుడు ట్రిబ్యునల్ముందుకు తెచ్చిందని న్యాయ నిపుణులు సీఎం రేవంత్కు ఈ సందర్భంగా వివరించారు. గడిచిన పదేళ్లలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటాను సాధించటంలో దారుణంగా విఫలమైందన్నారు. కృష్ణానదిపై తలపెట్టిన పాలమూరు నుంచి డిండి వరకు ప్రాజెక్టులన్నింటినీ పెండింగ్లో పెట్టిందని చెప్పారు. నీటి వాటాల విషయంలో తీరని ద్రోహం చేసిందన్నారు. దిగువ రాష్ట్రాల హక్కులతోపాటు నదీ వాటాల పంపిణీ న్యాయ సూత్రాల ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణాలో 904 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉందని, అందుకు అనుగుణంగా వాదనలు సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఏపీ అక్రమంగా నీటిని తరలించిన విషయంపై ... ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోయిందని, ఆ విషయాన్ని ట్రిబ్యునల్ముందుకు తీసుకురావాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. శ్రీశైలం రిజర్వాయర్ నిండకముందే, పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్స్కీమ్ద్వారా రోజుకు పది టీఎంసీల నీటిని ఏపీ మళ్లిస్తుందని, ఇతర బేసిన్లకు తరలించుకుపోతోందన్నారు. ఎక్కడ పడితే అక్కడ కాల్వల సామర్థ్యం పెంచుకోవటంతోపాటు పట్టిసీమ, పులిచింతల, చింతలపాడు వరకు ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్న అంశాలన్నీ ఆధారాలతో సహా ట్రిబ్యునల్కు నివేదించాలని, అందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా మళ్లించటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్తో పాటు పులిచింతల వద్ద ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులు మూతపడే ప్రమాదం ముంచుకొచ్చిందన్నారు. తక్కువ ఖర్చుతో ఉత్పత్తయ్యే జల విద్యుత్తు ఉత్పత్తికి విఘాతం కలుగుతోందని తెలిపారు. ఈ విషయాలన్నీ ట్రిబ్యునల్ ఎదుట వినిపించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణకు అన్ని అర్హతలు.... కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావటంతో తెలంగాణకు రావాల్సిన హక్కులు, నీటి వాటాలను సాధించుకునేందుకు అన్ని అర్హతలున్నాయని సీఎం అన్నారు. సాగునీటి, తాగునీటి అవసరాలతోపాటు మెట్ట ప్రాంతం, కరువు ప్రాంతమైన ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు కృష్ణా జలాలు తప్ప గత్యంతరం లేదనే విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణలో తలపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లనే కృష్ణా జలాశయాలను రాష్ట్రం వినియోగించుకోలేకపోయిందని గుర్తు చేయాలన్నారు. తెలంగాణ తరఫున వాదనలను వినిపించేందుకు ఇదే సరైన అవకాశమని సీఎం చెప్పారు. -
ఈవీఎంలను మ్యానిపులేట్ చేయలేరని చెప్పలేం
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)లను మ్యానిపులేట్ చేసే అవకాశాలను తోసిపుచ్చలేమని కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ అశోక్ లావాసా అన్నారు. అయితే, దేశంలో ఈవీఎంలను మ్యానిపులేట్ చేస్తున్నట్లు తాను భావించటంలేదని తెలిపారు. ఏ దేశంలోనూ ఈవీఎంలను దుర్వినియోగం చేసినట్టు ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈవీఎంలపై కోర్టుల్లో 40కిపైగా కేసులు వీగిపోయాయని గుర్తుచేశారు. మంతన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్లోని విద్యారణ్య పాఠశాలలో ‘కేంద్ర ఎన్నికల సంఘం: ముప్పేట దాడిలో ఓ కాపలాదారుడు’అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో అశోక్ లావాసా.. మంథన్ సహ వ్యవస్థాపకుడు ‘అజయ్ గాం«దీ’స్మారక ఉపన్యాసం ఇచ్చారు. సాంకేతిక రంగంలో శరవేగంగా మార్పులు వస్తున్న ప్రస్తుత తరుణంలో ఎన్నికల ప్రక్రియపై నిరంతర నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎస్ఐఆర్ పేరుతో ఈసీ పరిధి అతిక్రమణ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో బిహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధిని దాటి వ్యవహరించిందని అశోక్ లావాసా అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం చరిత్రలోనే ఇది అత్యంత వివాదాస్పద అంశమని తెలిపారు. ఓటర్ల జాబితాలో స్థానం కోసం పౌరసత్వాన్ని రుజువు చేసుకోవాలని పౌరులపై బాధ్యతలను వేయడం ఇదే తొలిసారి అన్నారు. గతంలో గుర్తింపు, పుట్టిన తేదీ, నివాస ధ్రువీకరణ పత్రాలు ఇస్తే ఓటరుగా నమోదు చేసేవారని గుర్తుచేశారు. దేశంలో పౌరసత్వం రుజువుకు ప్రభుత్వం ఎలాంటి ధ్రువీకరణ పత్రం ఇవ్వదని.. పాస్పోర్టు కూడా ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డుల తరహాలో పౌరసత్వ రుజువు కాదని తెలిపారు. కొత్తగా దేశ పౌరసత్వాన్ని స్వీకరించే వారికే అలాంటి పత్రాలు ఇస్తుందని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత రోడ్లపై నివసించే నిరాశ్రయులకు సైతం ఓటు హక్కు కల్పించడానికి నాటి కేంద్ర ఎన్నికల సంఘం తొలి కమిషనర్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. వారు ఓటు హక్కు కోల్పోతారు.. ఎస్ఐఆర్ నిర్వహణ వెనుక ఉద్దేశం, పాటించిన సూత్రాలు, అమలుపరిచిన విధానంపై ఎన్నో సందేహాలు లేవనెత్తాయని అశోక్ లావాసా అన్నారు. అర్హులందరికీ ఓటర్ల జాబితాలో స్థానం కల్పిస్తామని, అనర్హులని తొలగిస్తామంటే ఎవరికీ అభ్యంతరం ఉండదని తెలిపారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రక్రియను చేపట్టడం, ముందస్తు ప్రకటన లేకుండా అకస్మాత్తుగా ఎస్ఐఆర్ను అమలు చేయటం వివాదాస్పదమైందని చెప్పారు. చివరిసారిగా 2003లో ఎస్ఐఆర్ను 8 నెలల్లో నిర్వహించగా, ఈసారి 90 రోజులు మాత్రమే గడువు ఇవ్వడంతో ఎన్నో ఇబ్బందులొచ్చాయని అన్నారు. దేశంలో పుట్టి ఎలాంటి భూమి లేని, బడికి వెళ్లని, ఎలాంటి ప్రభుత్వ పథకం కింద లబ్ధి పొందని వారు ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈసీ నిర్దేశించిన 11 డాక్యుమెంట్లలో ఏదీ పౌరసత్వాన్ని ధ్రువీకరించదని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి అందరూ కలిసి పనిచేయాలని అశోక్ లావాసా పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలను సమాచార చట్టం పరి ధిలోకి తీసుకురావాలని కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదని, రాజకీయ పార్టీలన్నీ దీనికి వ్యతిరేకంగా ఉన్నాయని అశోక్ లావాసా విమర్శించారు. -
భూమి ఇస్తారా.. కోర్టుకు వస్తారా ?
సాక్షి, హైదరాబాద్: పీపుల్స్వార్ గ్రూప్ మాజీ దళసభ్యుడు నాగవెళ్లి మోహన్ భార్య అరుణకు భూమి ఇస్తారా.. లేదా వ్యక్తిగతంగా మా ముందు హాజరై వివరణ ఇస్తారా అని మెదక్ జిల్లా కలెక్టర్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వహించడంపై తీవ్రంగా పరిగణించింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేస్తూ.. ఆలోగా కౌంటర్ దాఖలు చేయకపోతే తమ ముందు హాజరు కావాలని కలెక్టర్ను ఆదేశించింది. 16ఏళ్లుఅండర్గ్రౌండ్లో ఉండి, పీపుల్స్వార్ దళ కమాండర్ హోదాకు ఎదిగిన మోహన్కు.. 5 ఎకరాల కేటాయింపుతో సహా పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో 1989లో లొంగిపోయాడు. ఇదే క్రమంలో లొంగిపోయిన తీవ్రవాదుల ఉపశమనం కోసం 1993లో ప్రభుత్వం ప్రత్యేక పాలసీని రూపొందించింది. నిఘా విభాగం మెదక్ జిల్లాలో అతనికి భూమి కేటాయించాలని 1999లో సిఫారసు చేయగా, జిల్లా స్థాయి కమిటీ కూడా ఆమోదించింది. సదాశివపేటలో కొంత భూమిని కేటాయింపు కోసం గుర్తించారు. ఈలోపే పోలీసులకు సహకరిస్తున్నారని మోహన్ను నక్సలైట్లు చంపేశారు. తర్వాత ఆ భూమిని అతని భార్య నాగవెల్లి అరుణకు కేటాయించాలని 2004లో కలెక్టర్ సిఫారసు చేశారు. ప్రజ్ఞాపూర్లో ఎకరం స్థలం కేటాయించారు. ఇది పట్టా భూమి అని కొందరు కోర్టుకు వెళ్లడంతో రద్దు చేశారు. దీంతో అరుణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ కాజా శరత్ విచారణ చేపట్టారు. పోలీసులకు సహకరించినందుకే హత్య.. పిటిషనర్ తరఫున న్యాయవాది గౌరారం రాజశేఖర్రెడ్డి వాదనలు వినిపించారు. 1989లో మోహన్ లొంగిపోగా, ఇప్పటివరకు భూమి కేటాయించకపోవడం సరికాదన్నారు. అరుణ దినసరి కూలీ అని, మానసిక వికలాంగుడైన కొడుకు కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. పోలీసులకు సహకరించినందుకే ఆమె భర్తను హత్య చేశారని గుర్తు చేశారు. వెంటనే అరుణకు భూమి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రెండు వారాలు సమయం ఇవ్వాలని, కౌంటర్ దాఖలు చేస్తామని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇదే చివరి అవకాశమని చెబుతూ, విచారణ వాయిదా వేశారు. -
పగలు తరగతులు... రాత్రి ఆ్రల్ఫాజోలం తయారీ
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలనే మ త్తుమందు తయారీ ఫ్యాక్టరీగా మార్చేశారు. ఉదయం పాఠశాల తరగతులు నిర్వహిస్తూనే గుట్టుచప్పుడు కాకుండా రాత్రివేళల్లో ఆ్రల్ఫాజోలం అనే మత్తుపదార్థాన్ని తయారు చేస్తున్నారు. స్వయంగా పాఠశాల కరస్పాండెంటే ఈ దందాకు తెరతీయడం గమనార్హం. సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయినపల్లిలో మేధా హైసూ్కల్ కరస్పాండెంట్ మల్లే ల జయప్రకాశ్గౌడ్ పాఠశాలలోనే ఆ్రల్ఫాజోలం తయారు చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) బృందం నిఘా పెట్టింది. శనివారం మధ్యాహ్నం జయప్రకాశ్గౌడ్ ఆ్రల్ఫాజోలంను కస్టమర్లకు విక్రయించేందుకు తీసుకెళ్తుండగా అప్పటికే మాటువేసి ఉన్న ఈగల్ బృందం అతడిని అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద నుంచి 3.5 కిలోల ఆ్రల్ఫాజోలంను స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. పాఠశాలలో తనిఖీ చేయగా.. రెండు గదుల్లో ఆల్ఫ్రాజోలం తయారీ పరికరాలు గుర్తించారు. ఈ సోదాల్లో తయారీలో ఉన్న 4.3 కిలోల ఆ్రల్ఫాజోలం, రూ.20 లక్షల నగదు స్వా«దీనం చేసుకున్నారు. జయప్రకాశ్గౌడ్కు సహకరిస్తున్న ఓల్డ్ బోయినపల్లి గంగపుత్ర కాలనీకి చెందిన గౌటె మురళీసాయి, బోయినపల్లి హస్మత్పేటకు చెందిన పెంటమోల్ ఉదయ్ సాయిని అరెస్టు చేశారు. పట్టుబడిన ఆల్ఫ్రాజోలం విలువ బహిరంగ మార్కెట్లో రూ. 50 లక్షల వరకు ఉంటుందని తెలిసింది. ఓల్డ్ బోయినపల్లిలో.. బీటెక్ డిస్కంటిన్యూ చేసిన జయప్రకాశ్గౌడ్ హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని తొమ్మిదేళ్లుగా మేధ హైసూ్కల్ నడుపుతున్నాడు. పాఠశాల కరస్పాండెంట్గా పనిచేస్తూనే మత్తుపదార్థాల తయారీ దందాకు తెరతీశాడు. వనపర్తి ప్రాంతానికి చెందిన జయప్రకాశ్... మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో కల్లు దుకాణాలకు ఆ్రల్ఫాజోలం సరఫరా చేయడం ప్రారంభించాడు. ఆల్ఫ్రాజోలం తయారీ ఫార్ములాను ఒకరి నుంచి నేర్చుకున్న తర్వాత తానే స్వయంగా తయారీ ప్రారంభించాడు. ఇందుకు తాను నడుపుతున్న పాఠశాల అయితే ఎవరికీ అనుమానం రాదన్న ఉద్దేశంతో ఇక్కడే రెండు పెద్ద గదుల్లో ఆ్రల్ఫాజోలం తయారీ మొదలుపెట్టాడు. అవసరమైన కెమికల్స్. ఇతర పదార్థాలను రాత్రి సమయాల్లో తెచ్చేవాడు. ఉదయం పాఠశాల నడిచే సమయంలో ఆ రెండు గదులకు తాళం వేసి ఉంచేవాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా వెళ్లిన తర్వాత ఆ్రల్ఫాజోలం తయారీ మొదలుపెట్టేవాడు. ఈ విషయం పాఠశాల సిబ్బందికి, ఇతరులకు తెలియకుండా పాఠశాలతో సంబంధం లేని మురళీసాయి, ఉదయ్ సాయిలను తనతోపాటు చేర్చుకున్నాడు. గత ఆరు నెలలుగా ఇక్కడ ఆ్రల్ఫాజోలం తయారు చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..? ఈ ఆ్రల్ఫాజోలంను ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయిస్తున్నారా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
మళ్లీ కృష్ణా, గోదావరికి వరద
కాళేశ్వరం/నాగార్జునసాగర్/దోమలపెంట: ఎగువన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి, కృష్ణా నదులకు వరద పోటెత్తుతోంది. కాళేశ్వరం వద్ద గోదావరిలో వరద ఉధృతమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద శనివారం గోదావరి పుష్కర ఘాట్ను తాకుతూ 10 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ప్రవహించింది. దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ వద్ద 5.25 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో తరలివెళ్తోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు ఎత్తి.. నీటిని దిగువకు ఇంజనీర్లు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్లో పలుమార్లు గోదావరి, ప్రాణహితలు ఉగ్రరూపం దాల్చి శాంతించాయి. మళ్లీ వరద పెరుగుతుండటంతో గోదావరి పరీవాహక ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. 26 గేట్ల ద్వారా కృష్ణమ్మ పరుగు సాగర్ వద్ద 26 గేట్ల ద్వారా కృష్ణమ్మ పరుగులిడుతోంది. సాగర్ జలాశయం క్రస్ట్గేట్ల నుంచి 2,09,794 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 32,764 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణా నదిలోకి వదులుతున్నారు. కాగా, ఈ సీజన్లో జూలై 29 నుంచి ఇప్పటివరకు సాగర్ గేట్లు తెరుచుకోవడం ఇది నాలుగోసారి కావడం విశేషం. శ్రీశైలంలో 7 గేట్ల ఎత్తివేత: ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో శనివారం శ్రీశైలం ఆనకట్ట వద్ద ఏడు గేట్లను ఎత్తి స్పిల్వే ద్వారా దిగువన నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో ఆనకట్ట స్పిల్వే ద్వారా 1,27,260, విద్యుదుత్పత్తి చేస్తూ 35,350, సుంకేసుల నుంచి 61,306, హంద్రీ నుంచి 250 మొత్తం 2,24,166 క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి వస్తుంది. దీంతో శ్రీశైలంలో ఆనకట్ట వద్ద 7 గేట్లను.. ఒక్కొక్కటి 10 అడు గుల మేర పైకెత్తి 1,93,634 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 66,280 క్యూసెక్కుల నీటిని సాగర్కు వదులుతున్నారు. -
సంచలన కేసుల్లో సాగదీతే!
2016 సెప్టెంబర్ 23న జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్స్టేషన్ పరిధిలోని చెర్లకొండాపూర్ గ్రామానికి చెందిన దువ్వాక రాజు (45) అనే మహిళను వ్యవసాయ పొలం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇప్పటివరకు నిందితులు దొరకలేదు. పోలీసులు దర్యాప్తులో పురోగతి కనిపించలేదు. ఆ తర్వాత ఎస్పీ నుంచి ఎస్హెచ్వోల దాకా అధికారులు బదిలీలు కావడంతో ఈ కేసు దర్యాప్తు గురించి అంతగా ఎవరూ పట్టించుకోలేదు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ముఖ్య అనుచరుడు బొడ్డు శ్రీధర్రెడ్డిని 2024 మే 23 అర్ధరాత్రి దారుణంగా హత్య చేశారు. దీనిపై సీఎం రేవంత్రెడ్డి స్పందించి వీలైనంత త్వరగా కేసును ఛేదించాలని ఆదేశాలిచ్చారు. ఐజీ సత్యనారాయణ గ్రామాన్ని స్వయంగా సందర్శించారు. అయినా నేటికీ కేసు మిస్టరీగానే మారింది. మృతుని కుటుంబ సభ్యులు డీజీపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని కలిసి విన్నవించినా, 15 నెలలుగా ఆ మిస్టరీ వీడలేదు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో రెండేళ్లుగా నమోదవుతున్న కేసుల్లో పురోగతి నెమ్మదించింది. దర్యాప్తు విషయంలో ఆధారాలు లభించక కొన్ని, ఆలస్యంగా వెలుగుచూసిన కేసుల్లో ఆధారాలు చెదిరిపోవడం వల్ల మరికొన్ని, దర్యాప్తులో శాస్త్రీయత లోపించడం వల్ల ఇంకొన్ని కేసులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. నమోదైన కేసులు వేలల్లో ఉంటుండగా.. పరిష్కారమైనవి వందల్లోనే ఉంటుండటం ఇందుకు నిదర్శనం. కేవలం 10% కేసుల్లోనే కోర్టుల్లో కన్విక్షన్ వస్తుంది. మిగిలిన కేసుల్లో దర్యాపు సాగుతూనే ఉంది. అన్నింటికంటే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కేసుల్లో మాత్రం సాగదీతే కనిపిస్తోంది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్లోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లను మినహాయించి ఆయా ఉమ్మడి జిల్లాల్లో కేసులు నమోదవుతున్న తీరు, పరిష్కారమవుతున్న తీరును పరిశీలించినప్పుడు ఇదే విషయం స్పష్టమైంది. కేసుల్లో సగం ట్రాఫిక్వే.. పోలీసులు నమోదు చేసే కేసుల్లో తీవ్ర నేరారోపణలు కలిగిన కేసులు, పెట్టీ కేసులు అని రెండు రకాలుగా ఉంటాయి. అయితే, హత్య, దొంగతనాలు, దోపిడీలు, హత్యాయత్నా లు, దాడులు, కిడ్నాప్లు, రేప్, రేప్ అటెంప్్ట, పోక్సో, అట్రాసిటీ తదితరాలు తీవ్ర నేరారోపణలు. ఈ కేసుల దర్యాప్తు విషయంలో జిల్లా ఎస్పీలు, సీపీలు సీరియస్గానే ఉంటారు. నెలా నెలా నిర్వహించే క్రైం మీటింగుల్లో కేసుల పురోగతి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటారు. వాస్తవానికి సీరియస్ కేసుల్లో దర్యాప్తుపై పోలీసులు నిందితుల గుర్తింపు 24 గంటల నుంచి 48 గంటల్లోనే పూర్తి చేస్తున్నారు. 90% కేసుల్లోనే సకాలంలోనే చార్జ్షీట్ దాఖలు చేస్తున్నారు. కొన్ని హత్య కేసుల్లో దర్యాప్తు అధికారులు సరి గ్గా వ్యవహరించక, ఆధారాలు సేకరించలేక కేసుల్లో నిందితులు నేటికీ పట్టుబడటం లేదన్నది మాత్రం వాస్తవం. ప్రతీ జిల్లా, కమిషనరేట్లలో నమోదవుతున్న కేసుల్లో సగానికి కంటే అధికంగా ట్రాఫిక్ కేసులే ఉన్నాయి. ఇవన్నీ సుదీర్ఘకాలం పెండింగ్లో ఉంటాయి. స్పెషల్ డ్రైవ్ పెట్టినప్పుడు కేసులు డిస్పోజ్ అవుతాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. మరికొన్ని సంచలనాలు.. » 2020 డిసెంబర్లో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో పొలానికి వెళ్లిన మహిళను దారుణంగా హతమార్చిన కేసులో నేటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేసు జాప్యాన్ని నిరసిస్తూ.. బంధువులంతా కలిసి పోలీస్స్టేçషన్పై దాడికి దిగారు. కేసులో ఎలాంటి సాంకేతి క ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తు అటకెక్కింది. » 2024 డిసెంబర్లో కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూరి ఎల్లారెడ్డి పెద్దచెరువులో బిక్కనూరు ఎస్సై, బీబీపేట మహిళా కానిస్టేబుల్, మరో కంప్యూటర్ ఆపరేటర్ అనుమానాస్పద స్థితిలో మరణించిన కేసును పోలీసులు ఛేదించలేకపోయారు. వీరిది హత్యా, ఆత్మహత్యా అన్న విషయంలో నేటికీ స్పష్టత లేదు. -
సింగిల్ డిజిట్ శిక్షలేనా ?
సాక్షి, హైదరాబాద్: ‘ప్రతిరోజూ అక్కడో ఇక్కడో దాడి చేసి అక్రమ మద్యం, గంజాయి, డ్రగ్స్ పట్టుకుంటున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ దాడులు కొంత ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కానీ, మరి ఈ కేసుల్లో నిందితులకు శిక్షలెందుకు పడడం లేదు ? శిక్షలు సింగిల్ డిజిట్కే పరిమితమా? శిక్షల శాతం గతం కంటే ఎందుకు పెరగడం లేదు’అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ప్రశ్నించారు.‘మహారాష్ట్ర పోలీసులు ఇక్కడకు వచ్చి డ్రగ్స్ రాకెట్ను ఛేదించేంతవరకు సమాచారం మీకెందుకు రాలేదు? మీ నిఘా ఏం చేస్తున్నట్టు? ఒక్క బార్షాప్ కోసం లైసెన్స్ తీసుకొని అదే లైసెన్స్ మీద రెండు, మూడు బార్లు నడిపిస్తుంటే మీ నిఘా ఏమైంది? వైన్షాపులు, బార్లపై నిఘా ఎందుకు తగ్గిపోయింది’అని ఆయన నిలదీశారు. శనివారం నాంపల్లిలోని తెలంగాణ ఆబ్కారీ భవన్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, ఎస్టీఎఫ్, డీటీఎఫ్ అధికారుల పనితీరుపై మంత్రి సమీక్షించారు.అక్రమ, కల్తీ మద్యం, కల్లు, డ్రగ్స్, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల విక్రయం, రవాణా, వినియోగం, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్), డ్రగ్స్ ముడిసరుకు తయారీ, కేసుల పురోగతి, శిక్షల నిష్పత్తి, పాత నేరస్తులపై నిఘా తదితర అంశాలపై ఆయన సుదీర్ఘంగా ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన యంత్రాంగం మంత్రి అడిగిన ప్రశ్నలకు మాత్రం నీళ్లు నమిలినట్టు తెలిసింది. అవసరమైతే ఆబ్కారీ పోలీసులకు కూడా డెడికేటెడ్ ఆయుధాలను ఇస్తామని, అక్రమ మద్యం వ్యవహారాలు, గంజాయి, డ్రగ్స్ అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని మంత్రి జూపల్లి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎలాంటి విధానం అమల్లో ఉంది? అనే అంశాలపై అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని, దీనిపై సీఎం రేవంత్రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మనమెందుకు బ్రాండింగ్ చేయకూడదు? ‘గోవాలో పెన్నీ, మధ్యప్రదేశ్లో మహువా (ఇప్పసారా)ను బ్రాండింగ్ చేసి అమ్ముతారు. మన రాష్ట్రంలో కూడా ఈత, తాటి కల్లును బాట్లింగ్ చేసి విక్రయిస్తే గీత కార్మికులకు ఉపాధి పెరుగుతుంది. కల్తీ కల్లు నివారించొచ్చు. రాష్ట్రంలో టాడీ నేచురల్ బ్రూవరీ ఏర్పాటుపై అధ్యయనం చేయండి. నివేదిక ఇస్తే సీఎంతో మాట్లాడతా.’అని మంత్రి జూపల్లి చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో భాగంగా స్వాదీనం చేసుకున్న నల్లబెల్లాన్ని వృథాగా పారబోయకుండా రైతులకు విక్రయించే అంశాన్ని పరిశీలించాలని మంత్రి జూపల్లి సూచించారు. ఎన్డీపీఎల్ మద్యాన్ని కూడా ధ్వంసం చేయకుండా, నాణ్యతను పరీక్షించి తిరిగి విక్రయించేందుకు గల అవకాశాలను కూడా అధ్యయనం చేయాలని చెప్పారు. సమన్వయం ముఖ్యం చర్లపల్లిలోని రసాయనిక పరిశ్రమలో డ్రగ్స్కు అవసరమైన రసాయనాలు తయారు చేస్తుంటే ఎందుకు నిఘా వర్గాలు గుర్తించలేకపోయాయని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. నేరాల నియంత్రణకు ఇతర రాష్ట్రాల అధికారులతో సమన్వయం ముఖ్యమని సూచించారు. గంజాయి, డ్రగ్స్ కేసుల్లో కింగ్పిన్లను గుర్తించి వారిపై పీడీ యాక్టులను నమోదు చేయాలని, పాత నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించి యువత భవిష్యత్ను నాశనం చేస్తున్న డ్రగ్స్, సింథటిక్ డ్రగ్స్ వినియోగాన్ని నియంత్రించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, కమిషనర్ సి.హరికిరణ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసిం, అదనపు కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేïÙలతో పాటు అన్ని జిల్లాల అధికారులు పాల్గొన్నారు. -
ఠాణాలో టోకెన్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా పంపిణీ పోలీసుల చేతుల్లోకి వెళ్తోంది. పంటల అదును దాటిపోతోందన్న బాధతో రైతు వేదికల ముందు యూరియా కోసం పడిగాపులు పడుతున్న రైతులు.. ఎలాగైనా యూరియా దక్కించుకోవాలన్న ఆశతో పరస్పరం దాడులకు దిగుతున్నారు. దీంతో చాలాచోట్ల రైతులను అదుపు చేసేందుకు సాయుధ పోలీసులను మోహరిస్తున్నారు. వ్యవసాయ సహకార సొసైటీలకు వస్తున్న యూరియా తక్కువగా ఉండటం, రైతులు అధిక సంఖ్యలో లైన్లలో వేచిచూస్తుండటంతో అధికారులు టోకెన్ల పంపిణీకి జంకుతున్నారు. ఆ బాధ్యతను కూడా పోలీసులకే అప్పగిస్తున్నారు. తరుముతున్న కాలం.. రాష్ట్రంలో వానాకాలం వరి పంట చాలా జిల్లాల్లో పొట్టదశకు వచ్చింది. గింజ గట్టి పడేందుకు, మొక్కకు బలాన్నిచ్చేందుకు ఇప్పుడు యూరియా వాడకం అత్యవసరం. అదును తప్పితే యూరియా వేసినా ఉపయోగం ఉండదు. దీంతో రైతులు సొసైటీ ఆఫీసులు, యూరియా దుకాణాల ముందు రాత్రి పగలు పడిగాపులు పడుతున్నారు. రాష్ట్రంలోని 500 రైతు వేదికల వద్ద యూరియా పంపిణీ జరుపుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. దీంతో ఆయా క్లస్టర్ల పరిధిలోని గ్రామాల ప్రజలంతా ఉదయాన్నే రైతు వేదికల వద్దకు వచ్చి లైన్లల్లో నిలబడుతున్న దృశ్యాలు దాదాపు అన్ని జిల్లాల్లో కనిపిస్తున్నాయి. మరినాట్లు ముందుగా పడే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మలిదశ యూరియా వాడకం కోసం రైతులు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. ‘అదును తప్పుతోంది.. ఒక్క బస్తా అయినా ఇప్పించండి’అని కామారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్, జగిత్యాల మొదలైన జిల్లాల రైతులు అధికారులను ప్రాధేయపడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. యూరియా కొరత లేకుండా కేంద్రంతో మాట్లాడి తెప్పిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రోజూ ప్రకటనలు ఇస్తున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఉన్నది 23 వేల మెట్రిక్ టన్నులే.. రాష్ట్రానికి కేంద్రం నుంచి వస్తున్న యూరియా ఏ రోజుకు ఆరోజే అన్నట్లుగా అయిపోతోంది. నిల్వ లేకుండా డిమాండ్కు అనుగుణంగా వ్యవసాయ శాఖ, మార్క్ఫెడ్ అధికారులు యూరియాను ఆయా జిల్లాల్లో డిమాండ్ అధికంగా ఉన్న మండలాలకు పంపిస్తున్నారు. రైల్వే వ్యాగన్ల ద్వారా ప్రతిరోజు 5 వేల టన్నులకు తగ్గకుండా యూరియాను కేంద్రం నుంచి తెప్పిస్తున్నా.. అది ఏమూలకు సరిపోవడం లేదు. శనివారం ఉదయం 10 గంటలకు రాష్ట్రంలో 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు మాత్రమే ఉన్నాయి. అందులో సొసైటీల వద్ద 6 వేల మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్ల వద్ద 7 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. ఉదయం దుకాణాలు తెరిచిన వెంటనే టోకెన్ల ప్రకారం ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున ఈ నిల్వల్లో 70 శాతం వరకు పంపిణీ చేసి, మిగతా నిల్వను మరుసటి రోజు కోసం దాచిపెడుతున్నారు. మార్క్ఫెడ్ గోదాముల్లో ఉన్న 10 వేల మెట్రిక్ టన్నులను ఆచితూచి పంపిస్తున్నారు. వీటికి తోడు ఆ రోజు వచ్చే రైల్వే వ్యాగన్ల లోడ్ మీదనే వ్యవసాయ శాఖ, మార్క్ఫెడ్ ఆధారపడుతోంది. సరఫరా చేసింది 7 లక్షల టన్నులు.. రాష్ట్రంలో ఈ వానకాలం సీజన్లో ఇప్పటివరకు సరఫరా చేసిన యూరియా 7 లక్షల మెట్రిక్ టన్నులు. రాష్ట్రంలో ఈ సీజన్లో 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా, ఒక లక్ష ఎకరాలు తక్కువగా అంచనాలో 98 శాతం మేర సాగయ్యాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో సాగు విస్తీర్ణం ఉన్నది ఈ సీజన్లోనే. ఇందులో యూరియా అత్యధికంగా వినియోగించే వరి ఏకంగా వ్యవసాయ శాఖ అంచనాలకు మించి 104 శాతం సాగైంది. 65.52 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. మొక్కజొన్న కూడా అంచనాకు మించి 122 శాతం.. అంటే 6.36 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి 45.76 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈ మూడు పంటలకే కాకుండా ఉద్యాన పంటలకు కూడా యూరియా వినియోగం అధికంగా ఉండడంతో రైతులకు ఈ పరిస్థితి తలెత్తింది. గత సంవత్సరం కన్నా దాదాపు 10 లక్షల ఎకరాలు పంటల విస్తీర్ణం పెరగ్గా, యూరియా కేటాయింపులు మాత్రం తగ్గాయి. ఈ నెలాఖరు వరకు 9.91 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రావాల్సి ఉండగా, ఇప్పటివరకు వచ్చింది 7 లక్షల మెట్రిక్ టన్నులే. కనీసం మరో 2 లక్షల మెట్రిక్ టన్నులు వెంటనే వస్తే తప్ప రైతులకు బాధలు తప్పవు. అదును తప్పిపోయిన తరువాత యూరియా వచ్చినా ఉపయోగం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచే యూరియా విక్రయంలో రేషన్ పద్ధతి పాటించేలా చేయడంలో విఫలమైన అధికార యంత్రాంగం.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తోంది. దీంతో సామాన్య చిన్న, సన్నకారు రైతులు ఒక్కో యూరియా బస్తా కోసం పడిగాపులు పడుతున్నారు. -
‘నాకు టికెట్తో పాటు మంత్రి పదవి కూడా ఇవ్వాలి’
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాను పోటీలో ఉన్నానని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తాను సికింద్రాబాద్ ఎంపీగా రెండు సార్లు గెలిచానని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభవృద్ధి కోసం కృషి చేశానన్నారు. ఎంపీ ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశానన్నారు. మీడియాతో చిట్చాట్లో భాగంగా తన మనసులోని మాటను వెల్లడించారు అంజన్ కుమార్ యాదవ్. ‘నా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి. అందులో భాగంగా నాకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలిఉమ్మడి ఏపీ నుండి యాదవ సామాజికవర్గంకి మంత్రి పదవి కేటాయించారు. నాకన్న సీనియర్లు ఎవరు లేరు....నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. హైదరాబాద్ నుండి ప్రాతినిథ్యం లేదు కాబట్టి నాకు అవకాశం ఇచ్చి మంత్రి ఇవ్వాలి. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నేను ఉన్న ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి. జూబ్లీహిల్స్లో సర్వే చేస్తే అంజన్ కుమార్ యాదవ్ పేరు వస్తుంది’ అని పేర్కొన్నారు. -
పానీపూరీ తిని నెల రోజులు ఆస్పత్రిపాలైన సాఫ్ట్వేర్ ఇంజినీర్
హైదరాబాద్: రోడ్డుపక్కన పానీపూరీ బండి కనపడగానే నోరు ఊరుతుంది. కానీ, అందులో వాడే నీళ్ల నాణ్యత గానీ, అమ్మే వ్యక్తి పాటించే పరిశుభ్రత గానీ పట్టించుకోకుండా తినడానికి వెళ్తే ఒక్కోసారి పెనుముప్పు వాటిల్లుతుంది. నగరానికి చెందిన 22 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ విషయంలో ఇలాగే జరిగింది. పానీపూరీ తిని, తీవ్రమైన హెపటైటిస్ ఎ ఇన్ఫెక్షన్ బారిన పడిన ఆ యువకుడు నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. దాంతో అన్నాళ్లూ ఉద్యోగానికి దూరం కావడమే కాక, చికిత్స ఖర్చు భారం కూడా అతడి మీద పడింది. నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి వైద్యులు సకాలంలో చికిత్స చేసి అతడి ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్. కలువల హర్ష తేజ తెలిపారు. “కళ్లు, చర్మం పసుపుపచ్చగా అయిపోవడం (కామెర్లు), కడుపులో ఏదో ఇబ్బంది, వికారం, వాంతులు, నీరసం, మూత్రం బాగా ముదురు రంగులో ఉండడం లాంటి సమస్యలతో ఆ యువకుడు ఆస్పత్రికి వచ్చాడు. ఏం జరిగిందని లోతుగా ప్రశ్నిస్తే, తాను రెండు వారాల క్రితం రోడ్డుపక్కన పానీపూరీ తిని, అక్కడ డబ్బాలో మంచినీళ్లు తాగానని చెప్పాడు. రక్తపరీక్షలు చేయడా హెపటైటిస్ ఎ తీవ్రంగా ఉందని, దాంతోపాటే కాలేయంలోని ఎంజైమ్లు పెరిగాయని, యాంటీ-హెచ్ఏవీ ఐజీఎం యాంటీబాడీలు పాజిటివ్ అని తేలింది.చాలామంది యువతలో హెపటైటిట్ ఎ దానంతట అదే తగ్గిపోతుంది. కానీ, నిర్లక్ష్యం చేస్తే అది చాలా ఇబ్బంది, సమస్యలు తెస్తుంది. వీధుల్లో అపరిశుభ్రంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఎంత తీవ్రమైన కాలేయ ఇన్ఫెక్షన్లు వస్తాయో ఈ కేసు వల్ల తెలుస్తుంది. ఆ యువకుడికి ముందుగా హైడ్రేషన్ ఇచ్చి, కాలేయాన్ని కాపాడే మందులు, ఇతర చికిత్సలతో 2-3 వారాలు పూర్తిగా విశ్రాంతి ఇచ్చాం. ఎప్పటికప్పుడు పరీక్షలు చేశాం. కాలేయం క్రమంగా మెరుగుపడింది. నాలుగు వారాలకు అతడు పూర్తిగా కోలుకున్నాడు. ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కౌన్సెలింగ్ ఇచ్చి, భవిష్యత్తులో రక్షణ కోసం హెపటైటిస్ ఎ టీకా తీసుకోవాలని సూచించాం" అని తెలిపారు.మనం ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం అనే రోజువారీ పనుల్లో జాగ్రత్తలు పాటిస్తే మన కాలేయం భద్రంగా ఉంటుందని, పాటించకపోతే ముప్పులో పడుతుందని వైద్యులు చెబుతున్నారు. తగిన అవగాహన, నిరోధక టీకాలు అందించడం ద్వారా ఇలాంటి నిరోధించగల వ్యాధుల నుంచి సమాజాన్ని రక్షించవచ్చు.-డాక్టర్. కలువల హర్ష తేజ, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ -
కవిత మాటలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ స్థాయిని మించి మాట్లాడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. రాహుల్పై మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ విషయంలో కవిత మాటలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కాళేశ్వరం అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ స్పందించాలి అని కేటీఆర్ మాట్లాడుతున్నారు. రాహుల్పై మాట్లాడే అర్హత కేటీఆర్కు ఉందా?. ఎమ్మెల్యేల గురించి రాహుల్ ఎందుకు మాట్లాడాలి?. ఓట్ చోరీ గురించి రాహుల్ ఆధారాలతో నిరూపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను తప్పించుకోవడానికి మోదీ అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉప రాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ ఎంపీలు దూరంగా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయలేదు.బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదు.. లోపాయికారీ ఒప్పందంలో ఉన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఇప్పటికే కవిత చెప్పారు. ముందు కవిత మాటలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి. కవిత వ్యాఖ్యలపై కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్కూడా ఎందుకు స్పందించడం లేదు. ఎందుకంటే రెండు పార్టీలు మానసికంగా ఒక్కటే కానీ.. భౌతికంగా ఒక్కటి కావాల్సి ఉంది. అందుకే రాహుల్పై కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
కేసీఆర్ను కలిసిన మాజీ మేయర్ కావ్య
హైదరాబాద్: ఎర్రవల్లి ఫాంహౌస్లో మాజీ సీఎం కేసీఆర్ను శుక్రవారం ఎమ్మెల్యే మల్లారెడ్డి సమక్షంలో జవహర్నగర్ మాజీ మేయర్ కావ్య కలిశారు. జవహర్నగర్ కార్పొరేషన్ను మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి సహకారంతో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కేసీఆర్ సారథ్యంలో మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ములా ఈ-రేసు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏసీబీ ఇప్పటికే సమగ్రంగా నివేదికను రెడీ చేసింది. ఇక, తాజాగా ఆ రిపోర్టు తాజాగా విజిలెన్స్ కమిషన్ వద్దకు చేరింది. దీంతో, ఈ కేసులో ఏం జరుగుతుందా? అనే సస్పెన్స్ నెలకొంది.వివరాల ప్రకారం.. ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ నివేదిక విజిలెన్స్ కమిషన్ వద్దకు చేరింది. కాగా, మరో రెండు రోజుల్లో ఫైల్పై విజిలెన్స్ తుది నిర్ణయం తీసుకోనుంది. అనంతరం, ప్రభుత్వానికి ఫార్ములా ఈ-రేసు కేసు తుది నివేదికను అందజేయనుంది. ఒకవేళ, అక్కడ ఆమోదం వచ్చిన వెంటనే నిందితులపై చార్జిషీటు దాఖలు చేసేందుకు తిరిగి నివేదిక ఏసీబీకి చేరనుంది.ఇక, ఫార్ములా ఈ-రేసు కేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలతో పాటు మరో ఇద్దరు A4, A5 నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కారు రేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ను రెండు సార్లు, ఐఏఎస్ అధికారి అరవింద్ను మూడు సార్లు ఏసీబీ ప్రశ్నించింది. -
తెలంగాణలో ఐదు జిల్లాలకు హెచ్చరిక.. అతి భారీ వర్షసూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు ప్రాంతాల్లో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శనివారం ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మరో 19 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.ఇక, అంతకుముందు.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. ఆదివారం మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాల ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని తెలిపింది.LOCALISED HEAVY THUNDERSTORMS ALERT TODAY ⚠️⛈️ Today, the Upper air circulation (UAC) centre is falling right on Telangana Scattered SEVERE THUNDERSTORMS expected in North, West, Central TG districts like Adilabad, Asifabad, Nirmal, Nizamabad, Karimnagar, Jagitial,…— Telangana Weatherman (@balaji25_t) September 13, 2025 Today’s Forecast (Sept 13, 2025) ⛈️⛈️Heavy to Very Heavy Rains likely across North, West, Central TG at few places. Moderate Rains in South, East TG‼️Hyderabad : Intense Spell at few places— Weatherman Karthikk (@telangana_rains) September 13, 2025 -
రేణు అగర్వాల్ కేసు.. పోలీసులు అదుపులో నిందితులు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులను స్పెషల్ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితుల్లో ఒకరిని ఢిల్లీలో, మరో ఇద్దరిని జార్ఖండ్లో పట్టుకున్నారు. దీంతో, వారిని హైదరాబాద్కు తరలిస్తున్నారు.వివరాల ప్రకారం.. రాకేష్, రేణు అగర్వాల్కు ఫతేనగర్లో స్టీల్ దుకాణం ఉంది. కూతురు తమన్నా చదువు నిమిత్తం వేరే రాష్ట్రంలో ఉంది. కొడుకు శుభం వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. స్పాన్ లేక్లోనే మరో అపార్ట్మెంట్లో రాకేష్ బంధువులు నివసిస్తున్నారు. ఆ ఇంట్లో జార్ఖండ్కు చెందిన రోషన్ అనే యువకుడు పని చేస్తున్నాడు. అయితే.. రోషన్ తన స్నేహితుడు హర్షను జార్ఖండ్ నుంచి రప్పించి.. 11 రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనిలో కుదిర్చాడు. ఈ ఇద్దరికీ రూ.15వేల జీతంతో పాటు అక్కడే ఆశ్రయం కల్పించారు.బుధవారం ఉదయం రాకేష్, శుభం స్టీల్ దుకాణానికి వెళ్లగా ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం ఐదు ఇంటికి భర్త కుమారుడు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. రాత్రి 7 గంటల సమయంలో రాకేష్ ఇంటికి వచ్చి తలుపు తట్టిన రేణు తీయలేదు. దీంతో ప్లంబర్ని పిలిపించి వెనుకవైపు నుంచి లోపలికి పంపించి తలుపు తీయించారు. లోపలికి వెళ్లి చూడగా.. హాల్లో రేణు కాళ్లు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపుమడుగులో కనిపించడంతో తండ్రికి, పోలీసులకు శుభం సమాచారమిచ్చాడు.ప్రాథమిక విచారణలో.. వేలిముద్రలో సరిపోలడంతో రోషన్, హర్షలే రేణు అగర్వాల్ను హతమార్చినట్లు తేలింది. ఆమె కాళ్లు చేతులు కట్టేసి తలపై కుక్కర్తో కొడుతూ బంగారం, నగదు కోసం చిత్రహింసలకు గురి చేశారు. ఆపై కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోశారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. ఆమె ఒంటిపై నగలను సూట్ కేసులో సర్దేసుకున్నారు. రక్తపు మరకలున్న దుస్తులను అక్కడే వదిలేసి.. శుభ్రంగా స్నానం చేసి సూట్కేసుతో బయటకు వచ్చేశారు. ఈ సమయంలో సీసీటీవీల్లో దృశ్యాలు నమోదు అయ్యాయి. చివరకు.. ఓనర్కు చెందిన స్కూటీపైనే ఇద్దరూ పరారయ్యారు. కూకట్పల్లి పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి.. నిందితుల కోసం గాలించారు. తాజాగా నిందితులు ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. -
శ్మశానంలో వ్యభిచారం నిర్వహిస్తున్న మాధవి..!
హైదరాబాద్: శ్మశానవాటికలో అయితే ఎలాంటి అనుమానం రాదనుకున్నదో ఏమో..ఓ మహిళ ఆ ప్రాంతాన్ని వ్యభిచార కేంద్రంగా మార్చింది. యువతులను తీసుకువచ్చి విటులను ఆహా్వనించి ఆమె కొనసాగిస్తున్న వ్యభిచార గృహం గుట్టురట్టయ్యింది. నిర్వాహకురాలితో పాటు ఓ మహిళ, విటుడిని పోలీసులు అరెస్టు చేశారు. బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. బేగంపేట శ్యాంలాల్బిల్డింగ్స్ సమీపంలోని ధనియాలగుట్ట శ్మశానవాటికలోని ఓ గదిలో వ్యభిచార కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో ఓ మహిళతో పాటు విటుడు గదిలో ఉండడాన్ని గుర్తించారు. మారీ మాధవి (39) అనే మహిళ ఇక్కడి గదిని వ్యభిచార గృహంగా మార్చినట్లు గుర్తించారు. వేర్వేరు ప్రాంతాల నుంచి మహిళలను, యువతులను తీసుకువచ్చి విటులకు సమాచారం అందించి రప్పిస్తున్నట్లు పోలీసుల విచారణలో మాధవి ఒప్పుకుంది. దీంతో నిర్వాహకురాలు మాధవితో పాటు గదిలో ఉన్న మహిళ, విటుడిగా వచ్చిన బాలానగర్కు చెందిన ఓ సివిల్ కాంట్రాక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1600 నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మళ్లీ జనహిత పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి వస్తున్నారని, ఆ తర్వాత జనహిత పాదయాత్ర ప్రారంభమవుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం నల్లగొండ, మహబూబ్నగర్లో ఈసారి యాత్ర జరగనుంది.ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల నేతలకు ఇప్పటికే టీపీసీసీ ఆదేశాలి్చంది. ఈ నెల 16న హైదరాబాద్కు రానున్న మీనాక్షి వారం పాటు ఇక్కడే ఉంటారని సమాచారం. జనహిత పాదయాత్రలో పాల్గొనడంతోపాటు ఈ దఫా పర్యటనలో ఆమె కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయి పార్టీ నాయకత్వానికి నామినేటెడ్ పోస్టుల కేటాయింపు ఈసారి క్లియర్ అవుతుందని సమాచారం. అందుకోసం ఆమె మరోమారు సీఎం రేవంత్రెడ్డితో సమావేశమవుతారని తెలుస్తోంది.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వచ్చేవారంలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఇప్పటివరకు బస్తీలు, వార్డులవారీ సమావేశాలకు పరిమితమైనా వచ్చే వారంలో నియోజకవర్గ స్థాయిలో పెద్ద సభను నిర్వహించాలని, ఈ సభకు సీఎం రేవంత్తోపాటు మీనాక్షి, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, మంత్రులు పాల్గొనేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో స్థానిక నేతలతో పాటు ఇన్చార్జిలుగా ఉన్న మంత్రులు, కార్పొరేషన్ల చైర్మన్లతో కూడా మీనాక్షి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని గాం«దీభవన్ వర్గాల సమాచారం.కాగా, పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్కుమార్గౌడ్ పదవి చేపట్టి ఏడాది అవుతున్న సందర్భంగా ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో నిర్వహించ తలపెట్టిన బీసీల సమరభేరి సభ వాయిదా పడింది. భారీ వర్ష సూచన కారణంగా సభను వాయిదా వేశామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తెలియజేస్తామని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇక, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాలపై చర్చించేందుకు ఎంపీ మల్లు రవి అధ్యక్షతన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదివారం భేటీ కానుంది. -
బొగ్గు వేలం ఎక్కడున్నా వెళ్తాం
సాక్షి, హైదరాబాద్: ఇకపై దేశంలో ఎక్కడ బొగ్గు గనుల వేలం జరిగినా సింగరేణి సంస్థ పాల్గొంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. సింగరేణి పరిధిలో ఉన్న ప్రస్తుత గనులు తరిగిపోతున్నాయని, మరో పదేళ్ల తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగితే సంస్థ ఉనికికి కూడా ప్రమాదం పొంచి ఉందని, ఈ ప్రమాదం బారి నుంచి సింగరేణిని కాపాడుకొని నిలబెట్టుకునేందుకే ఈ నిర్ణ యం తీసుకున్నామని చెప్పారు.శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి ఎమ్మెల్యే కె.విజయరమణారావు, సింగరేణి సీఎండీ బలరాం, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మిక సంఘాలతోపాటు బోర్డు విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ‘కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్వహించే వేలంలో పాల్గొనకుండా గత పాలకులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో సత్తుపల్లి, కోయగూడెం మైనింగ్ బ్లాకులు ప్రైవేటు వ్యక్తులకు దారాధత్తమయ్యాయి.తద్వారా రాష్ట్రానికి రూ.60వేల కోట్ల రెవెన్యూ నష్టం వచ్చింది. సింగరేణి సంస్థకు రూ.15వేల కోట్లు నష్టం కలిగింది. బొగ్గు గనుల వేలంలో పాల్గొంటే అటు సింగరేణితోపాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. సింగరేణికి కొత్త బ్లాకులు వస్తాయి. రాష్ట్రానికి రాయల్టీ రూపంలో ఆదాయం వస్తుంది. సింగరేణి మనుగడ దృష్ట్యా ఇకపై ఎక్కడ బొగ్గు గనుల వేలం జరిగినా పాల్గొనాలని నిర్ణయించాం.’అని భట్టి చెప్పారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ బొగ్గు గనుల వేలంలో పాల్గొంటే కలిగే లాభాలు, పాల్గొనకపోవడం కారణంగా జరిగే నష్టాలు, ఇతర రాష్ట్రాల్లో గనుల వేలం జరిగిన తీరును గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. త్వరలోనే బంగారం అన్వేషణ సింగరేణి వ్యాపార విస్తరణలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో రాగి, బంగారం తవ్వకాల లైసెన్స్ను సింగరేణి సంస్థ సాధించిందని భట్టి చెప్పారు. రాయచూర్, దేవదుర్గ్ బెల్టు లో రాగి, బంగారం బ్లాకులను వేలంలో దక్కించుకున్నా మని తెలిపారు. త్వరలోనే అన్వేషణ పనులు ప్రారంభిస్తా మన్నారు. ఈ ప్రాంతంలో భవిష్యత్లో జరిగే రాగి, బంగారం తవ్వకాలకు 37.75 శాతం రాయల్టీ వస్తుందని, ఇది సింగరేణి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని వెల్లడించారు. సింగరేణి గ్లోబల్ పేరుతో ఖనిజ రంగంలోకి థర్మల్, సోలార్, గ్రీన్ ఎనర్జీ రంగాలపై సింగరేణి దృష్టి సారించిందని భట్టి అన్నారు. దేశంలోనే కాక ప్రపంచంలో ఎక్కడ విలువైన ఖనిజాల వేలం జరిగినా పాల్గొనాలని, ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇచ్చేందుకు ఓ కన్సల్టెంట్ కమిటీని నియమించినట్టు ఆయన చెప్పారు. గ్రీన్హైడ్రోజన్ పై కూడా దృష్టి సారించి సింగరేణి పనిచేస్తుందని, సింగరేణి గ్లోబల్ పేరుతో విలువైన ఖనిజాల రంగంలోకి ప్రవేశిస్తామని ఆయన వెల్లడించారు. ⇒ సింగరేణి సీఎండీ బలరాం మాట్లాడుతూ భవిష్యత్లో జరిగే వేలంలో పాల్గొని కొత్త బ్లాకులు సాధించడం ద్వారా సంస్థ మనుగడకు ఇబ్బంది ఉండదన్నారు. ఈ దిశలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా హైదరాబాద్ సీఐఐ అవార్డుల ప్రదానంలో డిప్యూటీ సీఎం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం ఐటీ నుంచి.. లైఫ్ సైన్సెస్ వరకు అధునాతన తయారీ పరిశ్రమలతో ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. హైదరాబాదు సోమాజిగూడలోని ఒక ప్రైవేట్ హోటల్లో శుక్రవారం సాయంత్రం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సౌత్ రీజియన్ నిర్వహించిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్ లీడర్షిప్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో భట్టి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం నలుమూలల నుంచి తెలంగాణలో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సీఎఫ్వో కీలక భూమిక పోషించాలని కోరారు. కార్యక్రమంలో సీఐఐ దక్షిణ ప్రాంత డైరెక్టర్ దేవ్జ్యోతి, సీఐఐ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు శివప్రసాద్రెడ్డి, సైయంట్ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
‘ఫీజు’కు ఎంత కోత పెట్టొచ్చు?
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ను క్రమబద్ధికరించే ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీలతో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా ముఖ ఆధారిత హాజరు విధానం అమలుపై దృష్టిపెట్టారు. ప్రభు త్వ, ప్రైవేటు కాలేజీల్లో సీట్లు పొందుతున్న విద్యా ర్థులు ఎంత మంది? వారిలో నిత్యం కాలేజీలకు హాజరయ్యే వారు ఎందరు? 75 శాతం లోబడి విద్యార్థుల హాజరున్న కాలేజీలు ఎన్ని? ఎందరు విద్యార్థులు ఈ విభాగం కిందకు వస్తారు? అనే అంశాలపై చర్చించినట్లు తెలిసింది. వర్సిటీల స్థాయి లో ఇప్పటికే ముఖ ఆధారిత హాజరు విధానం అమ లు చేస్తున్నారని.. వర్సిటీల అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల్లో మాత్రం ఇది అమలు కావట్లే దని వీసీలు తెలిపారు. దీన్ని కచి్చతంగా అమలు చేసేలా చూడాలని చైర్మన్ సూచించినట్లు తెలిసింది. కోతకు లెక్కలేంటి? కాలేజీకి సరిగా రాని విద్యార్థులకు, రెగ్యులర్గా కాలేజీకి వచ్చి చదివే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ ఒకే విధంగా ఉండటం ఏమిటనే ప్రశ్న ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇలాంటి విద్యార్థులు ఎందరు ఉంటారో చెప్పాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఇటీవల అడిగింది. ఫీజు రీయింబర్స్మెంట్ను ఏ మేరకు కుదించే వీలుందో పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోందని.. అందుకు అనుగుణంగా సిద్ధం కావాలని వీసీలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏ మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ భారాన్ని తగ్గించే అవకాశం ఉంది? కాలేజీకి హాజరవ్వని విద్యార్థులు ఎందరు? ఈ దిశగా సమగ్ర సమాచారం సేకరించాలని వీసీలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి కోరినట్లు తెలిసింది. ఆ వివరాల ఆధారంగానే ఫీజు రీయింబర్స్మెంట్ లెక్కలను తయారు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. డిజీ లాకర్ విధానం పూర్తిగా డిజిటల్ విధానంలోకి యూనివర్సిటీలు వెళ్ళాలని బాలకిష్టారెడ్డి వీసీలకు సూచించారు. సర్టి్టఫికెట్లను ఆన్లైన్ విధానంలోనూ అందుబాటులోకి తేవాలని.. దీనివల్ల తప్పుడు ధ్రువీకరణ పత్రాలను నిరోధించవచ్చని పేర్కొన్నారు. డిజీ లాకర్ విధానంతోపాటు ప్రతి విద్యార్థికీ యూనిక్ ఐడీ నంబర్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రతి వర్సిటీ నాణ్యతా ప్రమాణాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని.. జాతీయ, అంతర్జాతీయ ర్యాంకులు పొందేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ దిశగా బోధన ప్రణాళికలో సమూల మార్పులు తేవాలని.. తద్వారా సమీకృత బోధన విధానం అమలుకు కృషి చేయొచ్చన్నారు. ఈ ఏడాది నుంచి పీజీ కోర్సుల్లో క్రీడాకారులకు 0.5 శాతం రిజర్వేషన్ కోటాను అమలు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్లు పురుషోత్తం, మహ్మద్, వర్సిటీల వీసీలు పాల్గొన్నారు. -
ప్రైవేటు కాలేజీలు బంద్
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సాధించుకునే దిశగా ఆందోళన చేపట్టాలని రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి కాలేజీల నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్(ఫతి) ప్రతినిధులు శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డిని కలిసి సమ్మె చేస్తున్నట్టు లిఖితపూర్వకంగా తెలిపాయి. ఈ నెల 30లోగా ప్రభుత్వం బకాయిలను విడుదల చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. బంద్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1,500కుపైగా ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఫార్మసీ, నర్సింగ్ కాలేజీలు మూతపడతాయని.. దీనివల్ల సుమారు 10 లక్షల మంది విద్యార్థులు నష్టపోతారని సంఘం నేతలు పేర్కొన్నారు. రూ. 10 వేల కోట్లకు చేరిన బకాయిలు.. సుమారు రూ. 10 వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంలో సర్కారు విఫలమైందంటూ కాలేజీల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్íÙప్ల బకాయిల సాధన కోసం ‘ఫతి’పేరిట ఏర్పడి పలుమార్లు ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తులు చేశాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణారావు సహా ప్రభుత్వ పెద్దలందరితోనూ సమావేశమయ్యాయి. అయినా సర్కారు ఒక్క రూపాయి కూడా బకాయిలు విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికను యాజమాన్యాలు సర్కారు ముందుంచాయి.రూ. లక్ష కోట్ల డిపాజిట్లతో ప్రత్యేకంగా ట్రస్ట్ బ్యాంక్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాయి. రూ. లక్ష కోట్ల డిపాజిట్ల సొమ్ముతో ప్రభుత్వ వాటా పరిమితమేనని.. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్), కార్పస్ ఫండ్ వంటి ఇతర మార్గాల ద్వారా ఈ నిధులను సేకరించవచ్చని సూచించాయి. ఈ డిపాజిట్లపై వచ్చే 7 శాతం వడ్డీ (సుమారు రూ. 3 వేల కోట్లు)తో ఫీజు రీయింబర్స్చేయవచ్చని ప్రతిపాదించాయి. అయితే అందుకు కూడా ప్రభుత్వం మొగ్గుచూపకపోవడంతో విసిగిపోయిన కాలేజీల యాజమాన్యాలు.. రాష్ట్రంలోని అన్ని రకాల వృత్తివిద్యా కాలేజీల యాజమాన్యాలు గురువారం రాత్రి సమావేశమయ్యాయి. అర్ధరాత్రి వరకు జరిగిన ఈ సమావేశం అనంతరం ఈనెల 15 నుంచి కాలేజీల నిరవధిక బంద్కు ‘ఫతి’పిలుపునిచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయనందుకు ఇంజనీర్స్డేను బ్లాక్ డేగా పాటించాలని నిర్ణయించాయి. 16 నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు కూడా..‘ఫతి’బాటలోనే తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్య సంఘం(టీపీడీపీఎంఏ) కూడా కాలే జీల బంద్కు పిలుపునిచ్చింది. ఈ నెల 16 నుంచి కాలేజీలను మూసేస్తామని అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణరెడ్డి, యా ద రామకృష్ణలు ప్రకటించారు. శుక్రవారం ఉన్నత విద్యామండలి కార్యాలయం ముందు ధర్నా చేపట్టి ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.దసరా జరుపుకోలేని పరిస్థితులున్నాయి ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా ఉండటంతో విద్యకు తొలి ప్రాధాన్యత లభిస్తుందనుకున్నాం. కానీ అసలు ప్రాధాన్యతే లేకుండా పోయింది. రూ. 10 వేల కోట్ల బకాయిల విడుదల కోసం 6 నెలలుగా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాం. ప్రత్యామ్నాయ ప్రణాళికను సర్కారు ముందుంచాం. దసరా పండుగను సంతోషంగా జరుపుకోలేని పరిస్థితులున్నాయి. జీతాలు ఇవ్వకపోతే సోమవారం నుంచి విధులకు హాజరుకాబోమని సిబ్బంది తేలి్చచెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాలేజీల నిరవధిక బంద్కు పిలుపునిచ్చాం. ఈ నెల 30లోగా ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలి. – రమేశ్, ‘ఫతి’చైర్మన్6 నెలలుగా వేతనాలు ఇవ్వలేకపోతున్నాం ప్రైవేటు కాలేజీల సిబ్బందికి 6 నెలలుగా వేతనాలు ఇవ్వలేకపోతున్నాం. యజమానులుగా మధ్యాహ్నం పూట కాలేజీకి వెళ్లలేకపోతున్నాం. సాయంత్రం, రాత్రిపూట వెళ్లి సంతకాలు పెట్టి వస్తున్నాం. బకాయిల విడుదల కోసం ఉప ముఖ్య మంత్రి భట్టిను నాలుగుసార్లు కలిశాం. ఇంజనీర్స్డేను బ్లాక్డేగా పాటించి, బంద్ను పాటించబోతున్నాం. ఆగస్టు 31 వరకు మాకు రావాల్సిన పూర్తి బకాయిలను విడుదల చేయాలి. – కేవీ రవికుమార్, ‘ఫతి’నాయకుడు -
విశ్వపరిశోధనాలయాలు
భారత్లో ఆవిష్కరణల వేగం పుంజుకొంది. దానికి తగ్గట్టుగా మేధో సంపత్తి హక్కుల (ఐపీ) కోసం దరఖాస్తులూ వెల్లువెత్తుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం దేశంలో దాఖలైన పేటెంట్లలో భారతీయ సంస్థల వాటా 20% కంటే తక్కువ. 2023కి వచ్చేసరికి ముఖచిత్రం మారిపోయింది. మొత్తం పేటెంట్ ఫైలింగ్స్లో ఏకంగా 57 శాతం వాటాతో మన సంస్థలు సత్తా చాటాయి. దరఖాస్తుల్లో దేశీయ యూనివర్సిటీలు ముందంజలో ఉండడం విశేషం. – సాక్షి, స్పెషల్ డెస్క్సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే స్థాయి నుండి సృష్టికర్తగా మారడానికి మనదేశం క్రమంగా అడుగులేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యసభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 2014–15లో భారతీయుల నుంచి వచ్చిన పేటెంట్ దరఖాస్తులు 12,071 కాగా, 2023–24 నాటికి ఇది 51,574కు పెరగడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. అలాగే, అప్పట్లో పేటెంట్ల మంజూరు కేవలం 684 కాగా, పదేళ్లలో 25,082కు పెరిగింది. పేటెంట్ నియమాలకు సవరణలతో నిర్దిష్ట గ్రూప్స్నకు వేగంగా పరీక్షలు, గడువు కాలాన్ని సరళీకృతం చేయడం.. విద్యా సంస్థలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు దరఖాస్తు రుసుములను 80% తగ్గించడం.. ఫైలింగ్, సమాచారం పూర్తిగా డిజిటలైజేషన్ వంటి సంస్కరణలకు దారితీశాయి.యూనివర్సిటీల సత్తాపేటెంట్ దాఖలు, టెక్నాలజీ బదిలీ, మేధోసంపత్తి హక్కు ల (ఐపీ) ద్వారా ఆదాయ సముపార్జన వంటి అంశాల్లో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులకు సహాయం చేయడానికి ప్రత్యేక ఐపీ సెల్స్ను, చట్టపరమైన సహాయ విభాగాలను ఏర్పాటు చేయడం ద్వారా విశ్వవిద్యాల యాలు కూడా ముందంజలో ఉన్నాయి. ఉన్నత విద్యా సంస్థలలో మేధోసంపత్తి హక్కులపై అవగాహన కోసం ప్రభుత్వం 2020లో ‘కపిల’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అలాగే 2016లో నీతి ఆయోగ్ ప్రారంభించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో సమస్య పరిష్కార నైపుణ్యాలు, వ్యవస్థాపకతను పెంపొందిస్తోంది. 2021 సెప్టెంబరు నుంచి పేటెంట్ దరఖాస్తు రుసుము గణనీయంగా తగ్గడం యూనివర్సిటీల్లో జోష్ నింపింది. ఐఐటీ మద్రాస్ 2022లో 156 పేటెంట్లను అందుకోగా.. ఏడాదిలో ఈ సంఖ్య 300కి చేరింది. ఐఐటీ బాంబే 2023–24లో 421 పేటెంట్లతో దేశంలో అగ్రస్థానంలో ఉంది.⇒ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ 2020లో 48వ స్థానం నుంచి 2024లో 39వ స్థానానికి ఎగబాకింది. ⇒ భారత్లో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)కి చేస్తున్న వ్యయం ప్రస్తుతం జీడీపీలో 0.67% మాత్రమే. ఇది యూఎస్లో 3.5%, చైనాలో 2.5%. ⇒ విద్యా సంస్థల పేటెంట్ అప్లికేషన్స్సంవత్సరం భారత్ విదేశీ2021–22 7,405 962022–23 19,155 2752023–24 23,306 237పెరిగిన వేగంరెండేళ్లలో దాఖలైన దాదాపు 80% పేటెంట్లు ఇప్పటికీ నమోదు కోసం వేచి ఉన్నాయి. అయితే 2000ల ప్రారంభంలో ఒక్కో పేటెంట్ మంజూరుకు 8–10 సంవత్సరాలు పట్టింది. 2020లో చాలావరకు 2–3 ఏళ్లలోపే అయిపోయాయి. కొన్ని దరఖాస్తు చేసిన ఏడాదిలోనే మంజూరయ్యాయి.వ్యక్తులూ.. విద్యాసంస్థలూ..2000లో వచ్చిన మొత్తం పేటెంట్ దరఖాస్తుల్లో కంపెనీలవి 43 శాతం కాగా, 2023 నాటికి ఇది 17 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో వ్యక్తుల దరఖాస్తులు 10 నుంచి 32 శాతానికి పెరిగాయి. 2010లో 20 శాతంలోపే ఉన్న విద్యాసంస్థల వాటా.. ఇప్పుడు ఏకంగా 43 శాతానికి ఎగబాకింది. 2023–24లో దేశీయ సంస్థలు, వ్యక్తుల వంటి వారు పెట్టుకున్న మొత్తం పేటెంట్ దరఖాస్తులు 51,574 కాగా మంజూరైనవి 25,079. ఇందులో..⇒ 2010 నుంచి 2025 సెప్టెంబరు 11 వరకు ఫైల్చేసిన పేటెంట్లు 9,32,693⇒ వీటిలో భారతీయులు దరఖాస్తు చేసినవి 3,83,073⇒ మొత్తం దరఖాస్తుల్లో మంజూరైనవి 3,20,807⇒ వీటిలో భారతీయులవి 70,088 -
పైసలకు కటకట.. పాలన వెలవెల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఆదాయానికి, ఖర్చుకు పొంతన కుదరక సిబ్బందికి నెలల తరబడి వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. అవసరమైన సిబ్బందిని ప్రభుత్వం కేటాయించకపోవడంతో పాలన కుంటుపడుతోంది. వివిధ శాఖల నుంచి రావాల్సిన సెస్సులు, గ్రాంట్లు రాకపోవడంతో ఆర్థికంగా సతమతం అవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత మూడు దఫాలుగా 20 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ప్రత్యేక గ్రాంట్లు ఇస్తే తప్ప ఈ మున్సిపాలిటీలు మనుగడ సాగించే పరిస్థితి లేదని స్థానికులు అంటున్నారు. సిబ్బంది, మౌలిక వసతుల లేమి.. కొత్త మున్సిపాలిటీల్లో సిబ్బంది, మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉంది. మున్సిపాలిటీ పరిధిలోని గ్రామ పంచాయతీలకు సంబంధించిన స్థిర, చరాస్తులు.. భవనాలు, లే ఔట్ అనుమతులు, పన్నుల వసూలుకు సంబంధించిన ఫైళ్లను కమిషనర్లు స్వాధీనం చేసుకుంటున్నారు. కొత్త మున్సిపాలిటీల్లో కమిషనర్, మేనేజర్ వంటి ఒకటిరెండు మిన హా మిగతా పోస్టుల్లో సమీప మున్సిపాలిటీలకు చెందిన అధికారులకు పూర్తి అదనపు బాధ్యతలు అప్ప గించారు. దీంతో వారు కొత్త మున్సిపాలిటీలకు అరుదుగా వచ్చి వెళ్తున్నారు.మేనేజర్, అసిస్టెంట్ ఇంజనీర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ వంటి పోస్టులు భర్తీ కాకపోవడంతో పాలనపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఇన్చార్జిలతోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు గ్రామ పంచాయతీ కార్యాలయాలకు మున్సిపల్ కార్యాలయాలుగా బోర్డులు మార్చినా ఫరి్నచర్ కొరత వేధిస్తోంది. రికార్డులను భద్రపరచడం సమస్యగా మారింది. మున్సిపల్ కార్యాలయాలకు వచ్చే వారు కనీసం కూర్చునే పరిస్థితి లేదు. ఆదాయానికి, ఖర్చుకు కుదరని లంకె.. కొత్త మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయానికి, ఖర్చుకు పొంతన కుదరక ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ మున్సిపాలిటీల్లో రెండేళ్లవరకు పన్నులను సమీక్షించి పెంచే అవకాశం లేదు. దీంతో గ్రామ పంచాయతీలకు వస్తున్న ఆదాయంతోనే పాలన సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ శివార్లలోని ఇస్నాపూర్, ఇంద్రేశం వంటివాటికి మినహా మిగతా చోట్ల ఆర్థిక పరిపుష్ట లేక సమస్యలు ఎదురవుతున్నాయి.గ్రామ పంచాయతీలకు సాధారణంగా ఇంటి పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్ను, వాణిజ్య లైసెన్సుల జారీ, వాటి రెన్యూవల్, తైబజార్ వేలం, పశువుల సంత తదితరాల ద్వారా జనరల్ ఫండ్ సమకూరుతోంది. పాలక మండళ్లు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్ల విడుదల నిలిచిపోయింది. రిజిస్ట్రేషన్, ఇతర విభాగాల నుంచి సెస్సుల విడుదల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాక్టర్ డీజిల్ వంటి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో కొత్త మున్సిపాలిటీలు ఉన్నాయి. కమిషనర్ వేతనం కూడా జీఎఫ్ నుంచే.. కమిషనర్, అధికారులు, ఇతర ఉద్యోగుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయకపోవడంతో వేతనాల చెల్లింపులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర ఖజానా నుంచి 010 పద్దు కింద వేతనాలు చెల్లించే వెసులుబాటు లేకపోవడంతో జనరల్ ఫండ్ (జీఎఫ్) నుంచే కమిషనర్, సిబ్బంది వేతనాలు చెల్లించాల్సి వస్తోంది. విలీన గ్రామపంచాయతీల కార్యదర్శులు పట్టణంలో పనిచేస్తూ పంచాయతీరాజ్ విభాగం నుంచి వేతనాలు తీసుకుంటున్నారు. తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్యం తదితర విభాగాల్లో పనిచేసే కార్మికులు, కంప్యూటర్ ఆపరేటర్లు గ్రామ పంచాయతీల్లో రూ.9,500 వేతనం పొందే వారు. మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ అయిన నేపథ్యంలో వారికి ప్రతి నెలా రూ.15,600 వేతనం చెల్లించాల్సి ఉంది. కానీ, చాలాచోట్ల పాత వేతనాలే ఇస్తున్నారు. వాటిని కూడా నెలల తరబడి పెండింగులో పెడుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొత్త మున్సిపాలిటీలు ఇవే.. కోహిర్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం (సంగారెడ్డి).. కేసముద్రం (మహబూబాబాద్).. స్టేషన్ ఘన్పూర్ (జనగాం).. మద్దూర్ (నారాయణపేట).. ఎదులాపురం, కల్లూరు (ఖమ్మం).. అశ్వారావుపేట (భద్రాద్రి కొత్తగూడెం).. చేవెళ్ల, మొయినాబాద్ (రంగారెడ్డి).. ములుగు (ములుగు).. అలియాబాద్, మూడు చింతలపల్లి, ఎల్లంపేట్ (మేడ్చల్–మల్కాజ్గిరి).. బిచ్కుంద (కామారెడ్డి). జిల్లా కేంద్రమే అయినా.. ములుగు జిల్లా కేంద్రం ఈ ఏడాది 29న గ్రామ పంచాయతీ నుంచి అప్గ్రేడ్ అయ్యి 20 వార్డులతో కొత్త మున్సిపాలిటీగా ఏర్పడింది. పొరుగునే ఉన్న బండారుపల్లి, జీవింతరావుపల్లి పంచాయతీలు ఇందులో విలీనం అయ్యాయి. ఇప్పటివరకు కమిషనర్, మేనేజర్ మాత్రమే బదిలీపై వచ్చారు. పురపాలనలో అత్యంత కీలకమైన ఏఈ, టీపీఎస్, అకౌంట్స్ ఆఫీసర్, శానిటరీ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. మున్సిపాలిటీలో ప్రస్తుతం 130 మంది మల్టీ పర్పస్ వర్కర్లు ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వీరిలో 80 మంది పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నవారే. మున్సిపాలిటీ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలుగా కాగా, ఏటా రూ.3.27 కోట్లు వేతనాలుగా చెల్లించాల్సి వస్తోంది. దీంతోపాటు మరో రూ.1.20 కోట్లు కార్యాలయ నిర్వహణ, వాహనాలు, ఇంధనం కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. నాలుగు నెలలుగా జీతాల్లేవు.. కల్లూరు గ్రామ పంచాయతీలో గడిచిన 23 ఏళ్లుగా ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నా. నాతోపాటు మరో 93 మంది మల్టీ పర్పస్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. గ్రామ పంచాయతీలో పనిచేసిన కాలంలో నెలకు రూ.9,500 వేతనం ఇచ్చేవారు. మున్సిపాలిటీగా మారిన తర్వాత ఎంత వేతనం వస్తుందో తెలియదు. నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదు. జీఓ 60ని అనుసరించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు చెల్లించాలి. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, జీవిత బీమా వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సయ్యద్ వజీర్ మియా, ఎలక్ట్రీషియన్, కల్లూరు మున్సిపాలిటీ -
ఓట్ల చోరీపై మాట్లాడే రాహుల్.. దీనికి ఏం సమాధానం చెప్తారు?: కేటీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తమ పార్టీని వీడిన పలువురు కాంగ్రెస్లో చేరారని బీఆర్ఎస్ అంటుంటే, వారు తమ పార్టీలో చేరలేదని కాంగ్రెస్ అంటోంది. అయితే దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల చోరీకి పాల్పడిందని కేటీఆర్ విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాహుల్ ఫోటోలు దిగారని, ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఏంటని ప్రశ్నించారు. ఓట్ల చోరీపై మాట్లాడే రాహుల్.. దీనికి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు కేటీఆర్.ఇక తాము కాంగ్రెస్లో చేరలేదని ఎవరిపై అయితే ఆరోపణలు వచ్చాయో ఆ ఎమ్మెల్యేలు అంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ను కలిశామని అంటున్నారు. కాగా, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇదే అంశంపై తెలంగాణ స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. వారి వద్ద నుంచి వివరణ తీసుకున్నారు. స్పీకర్ పంపిన నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు.. యూ టర్న్ తీసుకున్నారు. తాము కాంగ్రెస్లో చేరలేదని బీఆర్ఎస్లోనే ఉన్నామని స్పష్టం చేశారు. -
కళ్లల్లో కారం కొట్టి.. కత్తులతో బెదిరించి..హైదరాబాద్లో దారిదోపిడీ..
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో దారిదోపిడీ కలకలం రేపుతోంది.హైదరాబాద్కు చెందిన స్టీలు వ్యాపారి రాకేష్ అగర్వాల్.. తన కారు డ్రైవర్..వ్యాపార భాగస్వామిని వికారాబాద్ నుంచి రూ.40లక్షల నగదు తీసుకుని రావాలని పురమాయించారు.అయితే, కారు డ్రైవర్,పార్టనర్ ఇద్దరు కలిసి వికారాబాద్ నుంచి రూ.40లక్షల నగదు తీసుకుని శంకర్పల్లి మీదిగా కీసర బయల్దేరారు. శంకర్పల్లి మండలం పర్వేడ వద్దకు రాగానే.. ఆ కారును వెనుక నుంచి ఓ స్విప్ట్ వాహనం ఢీకొట్టింది.వెంటనే మెరుపు వేగంతో రాకేష్ అగర్వాల్ మనుషులపై కారంపొడి చల్లి, నకిలీ గన్నుతో బెదిరించారు. రూ40లక్షలు తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ కొత్తపల్లి గ్రామం వద్ద నిందితుల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వాహనం బోల్తా పడడంతో నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్థానికులు నిందితుల్ని ప్రశ్నించడంతో భయాందోళనకు గురైన నిందితులు రూ.40లక్షల నగదులో కొంతమొత్తాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు.దోచుకున్న మొత్తాన్నికారులో వదిలేసి పారిపోయారు. వాహనం బోల్తాపై సమాచారం అందుకున్న శంకర్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.స్పాట్లో రూ.8లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దోపిడికి వినియోగించిన పిస్తోల్ డమ్మీదని గుర్తించారు. నెంబర్ ప్లేటుకూడా డమ్మీదని తేల్చారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేష్ అగర్వాల్ మనుషులు రూ.40లక్షల తీసుకువస్తున్నారని దుండగులకు ఎవరు సమాచారం ఇచ్చారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. -
హైదరాబాద్ 4.0 దిశగా శరవేగంగా అడుగులు
నిజాం కాలంలో 1591లో పురుడు పోసుకున్న హైదరాబాద్ నగరం అభివృద్ధి ప్రస్థానం నేడు శరవేగంగా సాగుతోంది. తాజాగా ఫ్యూచర్ సిటీ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. 1998లో ఐటీ రాకతో హైదరాబాద్ వేగం మరింత పుంజుకుంది. అప్పటివరకు హైదరాబాద్, సికింద్రాబాద్లకే పరిమితమైన అభివృద్ధి సైబరాబాద్కు విస్తరించింది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్రోడ్డు, మెట్రోల ఏర్పాటుతో నగర రూపురేఖలే మారిపోయాయి. అంతర్జాతీయ మౌలిక వసతులు, నైపుణ్య కారి్మకుల లభ్యత, తక్కువ జీవన వ్యయం, కాస్మోపాలిటన్ కల్చర్, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో ప్రపంచ దిగ్గజసంస్థలు నగరంలో కొలువుదీరాయి. అయితే గ్రేటర్పై ఒత్తిడి పెరగడంతో దానికి అనుబంధంగా నాలుగో నగరం అనివార్యమైపోయింది. ప్రధాన నగరంలో రద్దీని తగ్గించడంతోపాటు భవిష్యత్తు అవసరాల కోసం ఫ్యూచర్ సిటీ ఏర్పాటు తప్పనిసరైంది. –సాక్షి, సిటీబ్యూరోప్రపంచంలో కోటి జనాభా ఉన్న 37 మెగా నగరాల్లో ఆరు ఇండియాలోనే ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా నగరాలు కేవలం జనాభా సెంటర్లు మాత్రమే కాదు. ప్రధాన ఆరి్థక, ఉద్యోగ కేంద్రాలు కూడా. 146 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో దాదాపు 37 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2050 నాటికి ఇది 53 శాతానికి, 87.6 కోట్ల జనాభాకు చేరుతుందని అంచనా. మన మెట్రో నగరాలు ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్నాయి. విధానపరమైన మార్పులు, స్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రపంచీకరణ, శ్రామిక జనాభా పెరుగుదల వంటివి నగరాల అభివృద్ధి, విస్తరణకు ప్రధాన కారణాలు.మహానగరం మనదే.. ప్రపంచవ్యాప్తంగా నగరాలు ఆర్థిక వృద్ధికి ఇంజిన్లు అని చెప్పవచ్చు. ప్రపంచ జీడీపీలో 80 శాతం కంటే ఎక్కువ వాటా నగరాలదే. ఉత్పాదకత, ఆవిష్కరణ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక అభివృద్ధిని సాధించడంలో నగరాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. దేశంలోని 8 ప్రధాన నగరాలు 4,308 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్నాయి. 1995 నుంచి 2025 మధ్య కాలంలో ఈ నగరాలు ఏకంగా 2,136 చ.కి.మీ. విస్తరించాయి. గత మూడు దశాబ్దాల్లో విస్తీర్ణాలు 98 శాతం పెరిగాయి. ఇందులో అత్యధిక విస్తీర్ణం హైదరాబాద్దే. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ 7,257 చదరపు కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది.వృద్ధి ఎక్కడ్నుంచి ఎక్కడికి.. 1990 చివర్లో హైదరాబాద్లో ఫార్మాతోపాటు ఐటీ, ఐటీఈఎస్ రంగం జోరందుకుంది. దీంతో 2000 సంవత్సరాంతంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ అప్గ్రేడ్ అయ్యాయి. 2008లో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ప్రపంచ ప్రయాణికులు, కార్గో సేవలతో వృద్ధి రెండింతలైంది. అదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనతో నగరం పశి్చమ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్ను విమానాశ్రయానికి అనుసంధానించింది. దీంతో హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోయింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, నైపుణ్య కారి్మకులకు నగరం వేదికైంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమలు చేసిన వ్యాపార అనుకూల విధానాలతో ఆరి్థక, సాంకేతిక కేంద్రంగా హైదరాబాద్ స్థానం మరింత బలోపేతమైంది. ఔటర్, మెట్రోలు అందుబాటులోకి రావడంతో నగరంలో కనెక్టివిటీ మరింత పెరిగింది. దీంతో నగరాభివృద్ధి పశి్చమం వైపు నుంచి దక్షిణం దిశగా విస్తరించింది.గ్రేటరే..7,257 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో పట్టణ ప్రాంతం 519 చ.కి.మీ. 1995లో 267 చ.కి.మీ.లుగా ఉన్న నగర అర్బన్ ఏరియా 2005లో 319 చ.కి.మీ. 2015లో 407 చ.కి.మీ.లకు విస్తరించింది. గత మూడు దశాబ్దాల్లో గ్రేటర్ పట్టణ ప్రాంతం 252 చ.కి.మీ. పెరిగింది. 95 శాతం మేర వృద్ధి చెందింది. 1995లో 49 లక్షలుగా ఉన్న గ్రేటర్ జనాభా 2015 నాటికి 87 లక్షలు, ఇప్పుడు 1.13 కోట్లకు చేరింది. గత 30 ఏళ్లలో జనాభా 131 శాతం పెరిగింది. ఐటీ, ఐటీఈఎస్, ఫార్మాసూటికల్స్, బయో టెక్నాలజీ, టూరిజం ఇదే నగరాభివృద్ధికి చోదకాలు.హెచ్ఎంఆర్ దిశగా.. దేశానికే తలమానికంగా నిలిచేలా తెలంగాణలో ఒక ప్రధాన పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్, యాదాద్రి–భువనగిరి, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలను కలుపుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్(హెచ్ఎంఆర్)ను ప్రతిపాదించింది. 10,472.723 చ.కి.మీ. మేర విస్తరించి ఉండే హెచ్ఎంఆర్.. రీజినల్ రింగ్ రోడ్డుతో అనుసంధానమై ఉంటుంది. దీంతో హైదరాబాద్తోపాటు పొరుగు జిల్లాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది.మాస్టర్ ప్లాన్ తప్పనిసరి ఏ నగరానికైనా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి అవసరం. మౌలిక వసతుల కల్పనతోపాటు పర్యావరణానికి ప్రాధాన్యం ఇచ్చే మాస్టర్ప్లాన్ ప్రకారమే అభివృద్ధి జరగాలి. సిటికీ వలసలు పెరుగుతుండటంతో పట్టణ ప్రాంతం విస్తరిస్తుంది. – కె.విద్యాధర్, డైరెక్టర్, హెచ్ఎండీఏఉద్యోగ అవకాశాల గని ఉద్యోగ, ఉపాధి అవకాశాల పుష్కలంగా ఉండటమే హైదరాబాద్ అభివృద్ధికి కారణం. పటిష్టమైన లా అండ్ ఆర్డర్, నైపుణ్య కార్మికుల లభ్యత, కాస్మోపాలిటన్ కల్చర్ వంటి వాటితో నగరంలోకి జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి.–కె.ఇంద్రసేనారెడ్డి, ప్రెసిడెంట్, క్రెడాయ్ తెలంగాణ -
సర్కార్ నడుపుతున్నారా?.. సర్కస్ నడుపుతున్నారా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సర్కార్ నడుపుతున్నారా?.. సర్కస్ నడుపుతున్నారా? అంటూ రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల నగరంలో నిన్న ఒక చిన్నారి తెరిచి ఉంచిన మ్యాన్హోల్లో పడిపోయిందని.. అదృష్టవశాత్తూ పాప ప్రాణాలు దక్కాయి. చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోని మూడు విభాగాలేమో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.‘‘తప్పు హైడ్రాది అని జీహెచ్ఎంసీ ప్రకటిస్తే.. తప్పు మాది కాదు జల మండలిది అని హైడ్రా చేతులు దులుపుకుంది. ఆ వెంటనే అసలు మాకేం సంబంధం లేదని జలమండలి చేతులెత్తేసింది!. మున్సిపల్ శాఖను కేవలం కాసుల వేటకు వాడుకోవడంలో రేవంత్ బిజీగా ఉంటే, ఆయన శాఖలోని విభాగాలేమో సమన్వయలేమితో నగరవాసులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి’’ అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సర్కార్ నడుపుతున్నరా?సర్కస్ నడుపుతున్నరా?ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల నగరంలో నిన్న ఒక చిన్నారి తెరిచి ఉంచిన మ్యాన్హోల్లో పడిపోయింది. అదృష్టవశాత్తూ పాప ప్రాణాలు దక్కాయి. చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోనిమూడు విభాగాలేమో ఒకరిపై ఒకరు… pic.twitter.com/y4AgJyiXir— KTR (@KTRBRS) September 12, 2025 -
వీధిలో చెత్త వేశారో.. మీ ఇంటికి పోలీసులొస్తారు
● 2024 అక్టోబర్ 11: మాసబ్ట్యాంక్ ప్రాంతంలో అర్ధరాత్రి కలకలం రేగింది. ఓ ప్రార్థన స్థలం ఎదురుగా రోడ్డుపై ఓ ప్రాణి మాంసం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయం బయటకు రావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు దర్యాప్తు చేపట్టారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సమీపంలో ఉన్న చెత్తకుప్ప నుంచి ఓ వీఽధికుక్క మాంసం తీసుకువెళ్తుండగా... ఓ ముక్క ప్రార్థన స్థలం సమీపంలో పడిపోయిందని తేలింది. ● 2025 ఫిబ్రవరి 12: టప్పాచబుత్ర పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ దేవాలయంలోనూ మాంసం పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. ఈ విషయం కొద్దిసేపట్లోనే దావానలంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున భక్తులు అక్కడకు చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు అవాంఛనీయ ఘటలకు తావు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ మాంసం అక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి చుట్టు పక్కల సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో చెత్త కుప్పలో పడేసిన వ్యర్థాల నుంచి ఓ పిల్లి తీసుకువచ్చి అక్కడ పడేసినట్లు వెలుగులోకి వచ్చింది. సాక్షి, సిటీబ్యూరో నగరంలో తరచూ చోటుచేసుకుంటున్న ఇలాంటి ఉదంతాల నేపథ్యంలో పోలీసు విభాగం అప్రమత్తమైంది. ఎవరి ప్రమేయం, ఎలాంటి దురుద్దేశం, కుట్ర లేకపోయినా కొన్ని సందర్భాల్లో ఈ తరహా ఘటనలు శాంతిభద్రతల సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయి. గణేష్, దుర్గా నవరాత్రుల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన మండపాల వద్ద ఇలా జరిగితే పరిస్థితులు చేతులు దాటిపోయే ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త, మాంసం ఆహార వ్యర్థాలు వేయడమే వీటికి మూలమనే ఉద్దేశంతో ప్రత్యేక దృష్టి పెట్టారు. నిషేధం ఉన్నా పట్టించుకోని ప్రజలు... బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడంపై ఏళ్లుగా నిషేధం ఉంది. ఇలా చేసిన వారికి జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణీత మొత్తం జరిమానా విధించే అవకాశమూ ఉంది. గతంలో బల్దియా అధికారులు ఇంటింటికీ చెత్త డబ్బాలు కూడా పంచి పెట్టారు. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించే విధానమూ అమలులో ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ అనేక మంది బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడేస్తున్నారు. గార్బేజ్ల వద్దే కాకుండా కాస్త ఖాళీ కనిపిస్తే చాలు అక్కడ డంప్ చేస్తున్నారు. ఇళ్ల నుంచి తీసుకువచ్చి పడేసే ఈ చెత్తలో ఆహార వ్యర్థాలు, మాంసం కూడా ఉంటున్నాయి. ఇలా బహిరంగ ప్రదేశాల్లో పారేసే చెత్తను క్లియర్ చేయడం, అలా వేయకుండా నియంత్రించడంలో జీహెచ్ఎంసీ అధికారులు అవసరమైన స్థాయిలో చర్యలు తీసుకోవట్లేదు. ఫలితంగానే ఎన్ని స్వచ్ఛ అవార్డులు గెల్చుకున్న నగరమైనా ఇప్పటికీ ఎక్కడ చూసినా వ్యర్థాలే కనిపిస్తుంటాయి. రంగంలోకి దిగిన పోలీసు విభాగం.. ఈ చెత్త వల్ల ఉత్పన్నం అవుతున్న సమస్యలను పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు విభాగం నియంత్రించాలని నిర్ణయించింది. దీనికోసం నగర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలను వినియోగించుకుంటోంది. ప్రతి ప్రాంతంలోనూ కాకపోయినా.. కొన్ని సున్నిత, కీలక ప్రాంతాలపై దృష్టి పెడుతోంది. ప్రధానంగా రెండు వర్గా లు, ప్రార్థన స్థలాలు ఉన్న చోట్ల ఈ చర్యలు తీసుకుంటోంది. అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా చెత్త వేస్తున్న వారిని స్థానిక పోలీసులు గుర్తించనున్నారు. ఆపై వారిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీకి సిఫార్సు చేయడమో, సిటీ పోలీసు చట్టం కింద కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోవమో చేయనున్నారు. ప్రధానంగా వెస్ట్, సౌత్, సౌత్ వెస్ట్ జోన్లలో ఈ విధానం అమలు చేస్తున్నారు. ఈ చర్య ల వల్ల అవాంఛిత ఘటనలు నిరోధించడంతో పా టు స్వచ్ఛ హైదరాబాద్ను సాధించడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తీవ్ర ఇబ్బందులు తెస్తున్న ఆహార, మాంస వ్యర్థాలు కొన్నిసార్లు శాంతిభద్రతల సమస్యల వరకు.. నిఘా వేసి ఉంచాలని నగర పోలీసుల నిర్ణయం సీసీ కెమెరాలను సైతం వినియోగిస్తున్న కాప్స్ -
రూ.1000 కోట్ల మోసం..
ఇద్దరు నిందితుల అరెస్టు సాక్షి, సిటీబ్యూరో: వ్యవస్థీకృత ఆర్థిక నేరాల నెట్వర్క్ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బ్రేక్ చేశారు. కృత్రిమ మేధ ఆధారిత పెట్టుబడుల పేరిట సుమారు రూ.1,000 కోట్లు మోసం చేసిన ఇద్దరు ఘరానా కేటుగాళ్లను అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన గడ్డం వేణుగోపాల్, కర్ణాకటకు చెందిన శ్రేయాస్ పాల్ ఇరువురు కలిసి సైబరాబాద్ కేంద్రంగా నకిలీ కంపెనీలను ఏర్పాటు చేశారు. ఐఐటీ క్యాపిటల్ టెక్నాలజీస్, ఏవీ సొల్యూషన్స్, శ్రీనివాస్ అనలిటిక్స్, ట్రేడ్ బుల్స్ టెక్నాలజీస్ వంటి రకరకాల పేర్లతో ఆన్లైన్లో నకిలీ కంపెనీలను నిర్వహిస్తున్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు నకిలీ సెబీ, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ రిజిస్ట్రేషన్లను సైతం సృష్టించారు. మధ్యతరగతి ఇన్వెస్టర్లను, ఐటీ నిపుణులు, రిటైర్డు ఉద్యోగులను నమ్మించేందుకు ప్రీమియం ఆఫీసులు, హోటళ్లలో సెమినార్లలో నిర్వహించేవారు. పెట్టుబడులపై ఏటా 84 శాతం రాబడిని అందిస్తామని మాయమాటలు చెప్పారు. స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్ సాఫ్ట్వేర్, కల్పిత ట్రేడింగ్ డాష్బోర్డ్ల ముసుగులో 2022 నుంచి 2025 మధ్య కాలంలో సుమారు 3 వేలకు పైగా బాధితుల నుంచి రూ.వెయ్యి కోట్లకు పైగా పెట్టుబడులను వసూలు చేశారు. ఇన్వెస్టర్ల నుంచి వసూళ్లు చేసిన సొమ్మును 21 వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు మళ్లించారు. ఆయా సొమ్ముతో ప్రాపర్టీలు, లగ్జరీ వాహనాలు, బంగారం కొనుగోలు చేశారు. ఈమేరకు పలువురు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఇద్దరు నిందితులు గడ్డం వేణుగోపాల్, శ్రేయాస్ పాల్లను అరెస్టు చేశారు. 20 మందికి పైగా ఏజెంట్లు, కన్సల్టెంట్లు, టెక్నికల్ డెవలపర్లు, వెబ్సైట్ నిర్వాహకులు ఈ నెట్వర్క్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
ఎన్నాళ్లీ నిర్లక్ష్యం?
● ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం.. ప్రజలకు శాపం ● నాలా ప్రాంతాల్లోనూ అశ్రద్ధే.. ప్రాణాలు పోతున్నా అంతేనా వర్షాలు కురుస్తున్నా తెరిచి ఉంచుతున్న మ్యాన్హోళ్ల మూతలు సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయా ప్రభుత్వ విభాగాలు చెబుతున్నా, ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. గురువారం ఐదేళ్ల బాలిక మ్యాన్హోల్ గుంతలో పడటమే ఇందుకు నిదర్శనం. సకాలంలో స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రతియేటా వర్షాకాలానికి ముందే వానలతో ప్రమాదాలు సంభవించకుండా నాలా ప్రాంతాల్లో భద్రత చర్యలు పరిశీలించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కప్పులు వేయడం, మెష్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఆపనులు సవ్యంగా జరగడం లేదు. దాంతో పిల్లలు, పాదచారులు, కార్మికులు నాలాల్లో పడి మరణిస్తున్నారు. భద్రత కరువు తగిన రక్షణ ఏర్పాట్లు, భద్రత చర్యలు లేకపోవడంతోనే ఏడాది క్రితం కవాడిగూడ నాలాలో పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అంతకుముందు సంవత్సరాల్లో ఓల్డ్బోయిన్పల్లిలో ఆనంద్సాయి, నేరేడ్మెట్లో సుమేధ, యాకుత్పురాలో జకీర్ అబ్బాస్ తదితర బాలలు నాలాల్లో పడి ప్రాణాలు కోల్పోయారు. హైడ్రా నిర్వాకం గురువారం ఉదయం రెయిన్బజార్ డివిజన్ మౌలాకాచిల్లా ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలిక స్కూల్కు వెళ్తూ మూత లేకుండా ఉన్న మ్యాన్హోల్లో పడిపోయింది. బాలిక నానమ్మ, స్థానికులు గుర్తించి వెంటనే.. పైకి లాగడంతో ప్రాణాపాయం తప్పింది. జీహెచ్ఎంసీ నిర్వాకం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ మ్యాన్హోల్ పనులు తాము చేయడం లేదని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. హైడ్రా సిబ్బంది మ్యాన్హోల్ను శుభ్రం చేసేందుకు బుధవారం మూత తెరిచారు. తిరిగి దాన్ని మూసివేయకుండా అలాగే వదిలేసి వెళ్లారు. సమన్వయ లేమి.. వరుస వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మ్యాన్హోళ్లు, నాలాల్లో పూడికతీత తదితర పనుల్ని జీహెచ్ఎంసీ చేసేది. రోడ్లపై నిల్వ నీటిని తోడిపోసేది. చెరువుల పరిరక్షణ, విపత్తు నిర్వహణలో హైడ్రాకు మంచి పేరు రావడంతో వర్షాకాల సమస్యల పరిష్కార బాధ్యతల్ని కూడా జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాకు బదలాయించారు. దీంతో జీహెచ్ఎంసీ కేవలం రోడ్లపై గుంతల్ని మాత్రమే పూడస్తోంది. మిగతా పనులు చేయడం లేదు. నాలాలు, మ్యాన్హోల్స్, లోతట్టు ప్రాంతాలకు సంబంధించి హైడ్రాకు సరైన అవగాహన లేదు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించినప్పటికీ, విభాగాల మధ్య అధికారుల మధ్య అది సాధ్యమవుతున్నట్లు లేదు. హైడ్రా సిబ్బంది మిగతా విభాగాల కంటే తామే గొప్ప అనేవిధంగా పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. -
మ్యాన్హోల్లో పడిన చిన్నారి..
తప్పిన ప్రాణాపాయం యాకుత్పురా: పాఠశాలకు వెళ్తున్న ఓ చిన్నారి ప్రమాదశాత్తు డ్రైనేజీ మ్యాన్హోల్లో పడి స్వల్ప గాయాల పాలైన ఘటన గురువారం యాకుత్పురాలో జరిగింది. యాకుత్పురా గంగానగర్ నాలా మౌలా కా చీల్లా ప్రాంతానికి చెందిన సల్మాన్ కుతూరు జైనాబ్ ఫాతిమా (5) స్థానిక పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. గురువారం ఉదయం నానమ్మతో కలిసి పాఠశాలకు బయలుదేరింది. రోడ్డుపై ఉన్న మ్యాన్హోల్ పైకప్పు తెరిచి ఉండటంతో ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. దీంతో ఆమె నానమ్మ, స్థానికులు వెంటనే చిన్నారి ఫాతిమాను పైకి లాగి కాపాడారు. స్వల్ప గాయాల పాలైన చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జలమండలి, హైడ్రా విభాగాల అధికారులు సిబ్బందితో మౌలాకా చీల్లా ప్రాంతాంలో డ్రైనేజీ మ్యాన్హోళ్ల పూడికతీత పనులు చేపట్టి పైకప్పు వేయకుండా వదిలేసిన వారిని గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పత్తర్గట్టీ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ సోహెల్ ఖాద్రీ డిమాండ్ చేశారు. మ్యాన్హోల్లో పడిపోతున్న చిన్నారి ఫాతిమా -
పని మనుషులే ప్రాణాంతకులై..
కాళ్లు, చేతులు కట్టేసి.. కుక్కర్తో తలపై మోది మూసాపేట: కూకట్పల్లిలోని స్వాన్లేక్ అపార్టుమెంట్లో గృహిణి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సుమారు 5 టీంలతో నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇంటి పని మనుషులే ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నా యి.. స్వాన్లేక్ అపార్టుమెంట్ 13వ అంతస్తులోని 1,311 బ్లాక్లో రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్ దంపతులు నివాసముంటున్నారు. బాలానగర్, జీడిమెట్లలో స్టీల్ సామాను వ్యాపారాన్ని రాకేష్ అగర్వాల్, తన కుమారుడు శుభంతో నిర్వహిస్తు న్నారు. రాకేష్ భార్య రేణు (50) ఇంట్లోనే ఒక్కరే ఉండేవారు. వీరి కూతురు తమన్నా అహ్మదాబాద్లో ఎంబీఏ చదువుతోంది. కొన్ని నెలల క్రితం రేణు అగర్వాల్కు అనారోగ్యంగా ఉండటంతో బరువు పనులు చేసుకోలేకపోతున్నారు. దీంతో పని మనిషిని నియమించుకోవాల్సి వచ్చింది. వీరు నివసించే పై అంతస్తులో ఉండే బంధువుల ఇంటిలో పని చేస్తున్న రోషన్కు తెలిసిన వ్యక్తి హర్ష్ (20)ని 11 రోజుల క్రితం రేణు ఇంటితో పా టు మరో ఇంట్లో పనిలో కుదిర్చాడు. వీరు రేణు అగర్వాల్ ఇంట్లోనే ఉండేవారు. రేణు ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన రోషన్, హర్ష్లు ఆమెను హత్య చేయాలని పథకం రచించారు. ఒంటరిగా ఉండటాన్ని గమనించి.. ఇదే అపార్ట్మెంట్లోని 14వ అంతస్తులో బంధువుల ఇంటిలో రోషన్ 11 నెలలుగా పని మనిషిగా చేస్తున్నాడు. ఆ ఇంట్లో ఆరుగురు వ్యక్తులు ఉండటం, రేణు ఇంటిలో ముగ్గురు కుటుంబ సభ్యులే ఉండటాన్ని గమనించాడు. రేణు భర్త రాకేష్, కుమారుడు శుభం ఉదయమే బయటకు వెళ్లేవారు. దీంతో రేణు ఒక్కరే ఇంట్లో ఉండేవారు. ఈ విషయాన్ని గమనించిన రోషన్, హర్ష్లు ఇద్దరూ కలిసి రేణు హత్యకు పథకం పన్నారు. బుధవారం రేణు భర్త, కుమారుడు బయటికి వెళ్లిన అనంతరం అదను చూసుకున్న నిందితులు ఆమె కాళ్లు, చేతులు కట్టేసి.. కుక్కర్తో తలపై మోది.. లాకర్ కోడ్ చెప్పాలంటూ హింసించారు. రెండు చేతులపై కత్తి గాట్లు, కడుపులో పొడిచిన గాట్లు, మెడను అత్యంత కిరాతకంగా కోసిన ఆనవాళ్లు ఉన్నాయి. రేణు హత్య అనంతరం అనుమానితులిద్దరూ అక్కడే స్నానం చేసి దుస్తులు మార్చుకుని ఇంటికి తాళం వేసి లిఫ్ట్ నుంచి సెల్లార్లోకి వెళ్లారు. ఇంటి యజమాని స్కూటీపై బ్యాగ్తో పాటు ఇద్దరు పరారయ్యారు. లాకర్ ఓపెన్ చేసి డబ్బులు ఎంత మొత్తం దొంగిలించారో తెలియడంలేదు. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం వెల్లడించలేదు. సికింద్రాబాద్ నుంచి మాదాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సుమారు 2 గంటల పాటు చక్కర్లు కొట్టి, స్కూటీని హఫీజ్పేటలో వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది. స్నానం చేసి మరీ నింపాదిగా వెళ్లటంతో పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. గాలింపు చర్యలు ముమ్మరం.. సుమారు 5 టీంలతో నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీఎస్, ఎస్ఓటీ, కూకట్పల్లి పోలీసులు, బాచుపల్లి డీఐ, కూకట్పల్లి డీఐ, కేపీహెచ్బీ డీఐలు టీములుగా ఏర్పడి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా, సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. స్కూటీపై పరారవుతున్న అనుమానితులు కూకట్పల్లి పరిధిలో గృహిణి దారుణ హత్య మర్డర్ అనంతరం స్నానం చేసి బ్యాగ్తో పరారీ 5 టీంలతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు -
అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం
జూబ్లీహిల్స్ టికెట్పై ఎమ్మెల్యే దానం వ్యాఖ్యలు బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అధిష్టానం నిర్ణయించిన వ్యక్తి గెలుపు కోసం కృషి చేస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గురువారం ఆదర్శనగర్లో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు పోటీ చేస్తారని, మంత్రి పదవి దక్కే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వస్తున్నాయి’ అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. స్పందిస్తూ.. అవన్నీ ఊహాగానాలు కావచ్చన్నారు. అయితే.. అధిష్టానం నిర్ణయం మేరకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ఉంటుందని, టికెట్ ఎవరికి వచ్చినా అభ్యర్థి గెలుపు కోసం కష్టపడి పని చేస్తామన్నారు. ప్రసుత్త పరిస్థితిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడం ఎంతో అవసరమన్నారు. కొంతకాలంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో దానం నాగేందర్ నిలిచే అవకాశం ఉందంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బలమైన సామాజిక వర్గం అండదండ ఉండడంతో పాటు మైనార్టీ వర్గాల్లో సైతం ఆయనకు మంచి పరపతి ఉండడం, పార్లమెంట్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దానం నాగేందర్కు సుమారు 85,000 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన జూబ్లీహిల్స్లో సులభంగా గెలిచే అవకాశం ఉందంటూ పార్టీ పెద్దలు సైతం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. -
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపటి వరకు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇవాళ, రేపు ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, అంబ్కేదర్ కోనసీమ, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ పేర్కొంది.తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట,రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలోఅసాధారణ వృద్ధి
● గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాలాపేట: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశం అసాధారణ వృద్ధిని సాధిస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రశంసించారు. ఈ మేరకు సీఎస్ఐఆర్–ఐఐసీటీలో జరుగుతున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ రీసెర్చ్ ఆండ్ డెవలప్మెంట్ 6వ ప్రాంతీయ సదస్సులో రెండో రోజు గురువారం గవర్నర్ పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు. దేశంలో పరిశోధనలు, పేటెంట్లు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. స్థిరమైన, నైపుణ్యంతో కూడిన సమానమైన ఆర్థికాభివృద్ది కోసం నూతన ఆవిష్కరణలు పెరగాలన్నారు. పరిశోధన, అభివృద్ధిని సులభతరం చేయడానికి విద్యా వ్యవస్థను సంస్థాగతంగా మెరుగుపరచాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, పద్మ అవార్డు గ్రహీత అనిల్ కకోద్కర్, నీతి ఆయోగ్ గౌరవ సభ్యుడు డాక్టర్ వి.కె సారస్వత్, నీతి ఆయోగ్ సీనియర్ సలహాదారు ప్రొఫెసర్ వివేక్ కుమార్ సింగ్, పలువురు శాస్త్రవేత్తలు, వివిధ సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు. -
స్వామి వివేకానంద బోధనలు స్ఫూర్తిదాయకం
కవాడిగూడ: స్వామి వివేకానంద బోధనలు స్ఫూర్తిదాయకమని రాజ్యసభ సభ్యులు అనిల్కుమార్ యాదవ్ అన్నారు. గురువారం రామకృష్ణ మఠంలోని వివేకానంద ఆడిటోరియంలో స్వామి వివేకానంద హ్యుమన్ ఎక్స్లెన్సీ సిల్వర్జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా సంప్రీతి దివస్ పేరిట యూత్ కన్వెన్షన్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన అనిల్కుమార్ యాదవ్ మాట్లాడారు. స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11న చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో చేసిన ప్రసంగం ప్రపంచాన్నే ఆకర్షించిందన్నారు. ఆయన స్ఫూర్తితో రామకృష్ణ మఠంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భారతదేశంలోని ఆధ్యాత్మికత, సహనం, ఐక్యత వంటి అంశాలను తన ప్రసంగం ద్వారా వివేకానందుడు ప్రపంచానికి చాటారని తెలిపారు. యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొన దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకావాల్సి ఉండగా..కొన్ని కారణాలతో హాజరుకాలేక పోయారని, భవిష్యత్తులో సీఎంను తీసుకొచ్చే బాధ్యత తనదే అని అనిల్కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణమఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద, కలకత్తా రామకృష్ణ మఠం అధ్యక్షులు నిత్య ముక్తానంద స్వామి తదితరులు ప్రసంగించారు. అనంతరం ఎంపీ అనిల్కుమార్ యాదవ్ను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఎంపీ అనిల్కుమార్ యాదవ్ -
‘జూబ్లీహిల్స్ లయన్స్’ సేవలు భేష్
మాదాపూర్: విద్యార్థుల సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లయన్స్ క్లబ్ సేవాతత్పరతను చాటుకుంది. ఈ మేరకు మాదాపూర్లోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ విద్యార్థుల కోసం ఐరన్ షెడ్ నిర్మించారు. శనివారం ఈ షెడ్ను లయన్స్ జిల్లా గవర్నర్ 320డి లయన్ అమర్నాథ్రావు ప్రారంభించారు. ఈ నిర్మాణానికి లయన్ గిరిజారెడ్డి, డాక్టర్ పి.సీత, జయశ్రీ మూర్తి, జ్వాలా వైష్ణవి, మండవ శిల్ప విరాళాలు అందించారు. విద్యార్థుల సౌకర్యం కోసం నిర్మించిన ఈ షెడ్..విద్యాభివృద్ధికి లయన్స్క్లబ్ చూపుతున్న అంకితభావానికి నిదర్శనమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు లయన్ కోనేరు రామసుందరి, కార్యదర్శి లయన్ రిందా దేవి, హెడ్మాస్టర్ మోహన్రావు, నరసింహరాజు, రామమోహన్, సౌభాగ్య, మర్రి ప్రవీణ్, ఈవీ రమణ తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన... మాదాపూర్లోని మండల ప్రాథమిక పరిషత్ స్కూల్లో లయన్స్క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320డి అధ్వర్యంలో శనివారం సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. లయన్ నాగరాజు, నరసింహరాజు, పద్మావతి త్రిపురనేనిలు మానసిక ఆరోగ్యంపై మార్గనిర్దేశం చేయగా, తెలంగాణ పోలీస్ ట్రైనింగ్ సెంటర్, అంబర్పేట్ నిపుణులు విద్యార్థులకు సైబర్క్రైమ్స్, డ్రగ్స్ దుష్ఫలితాలపై అవగాహన కల్పించారు. ఫోరెన్సిక్, కెరీర్ ప్రోగ్రెస్పై సుశ్మిత, సైబర్ ముప్పు, హ్యాకింగ్పై రాహుల్ వివరించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ క్లబ్ అధ్యక్షుడు కోనేరు రామ సుందరి, హెడ్మాస్టర్ బసవలిగం తదితరులు పాల్గొన్నారు. మాదాపూర్ స్కూల్లో ఐరన్ షెడ్ ఏర్పాటు సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన -
అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి..
బహదూర్ పురా: అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర అటవీ శాఖ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఇకపై ప్రతిభావంతులైన ఫ్రంట్లైన్ అధికారులకు ఏటా రూ.10 వేలు నగదు పురస్కారం అందిస్తామన్నారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలు వృథా కానివ్వమన్నారు. గురువారం నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కు ఆవరణలోని అమరవీరుల విగ్రహం వద్ద నిర్వహించిన జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ డాక్టర్ జితేందర్, రాష్ట్ర అటవీ ప్రధాన అధికారిణి డాక్టర్ సువర్ణలతో కలసి పాల్గొన్నారు. స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. 1984 సంవత్సరం నుండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో విధి నిర్వహణలో 22 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. వీరి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పచ్చదనం పెంపులో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘వన మహోత్సవం’ ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద మానవ ప్రయత్నమన్నారు. వనమహోత్సవం ద్వారా మన రాష్ట్రంలో 307.48 కోట్లకు పైగా మొక్కలను ఇప్పటికే నాటడం జరిగిందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ అడవులను కాపాడుతున్న అటవీ అధికారుల కృషి అభినందనీయమన్నారు. ఎటువంటి సౌకర్యాలు లేనిచోట, దట్టమైన అడవుల్లో వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి అడవులను కాపాడుతున్నారన్నారని, విధి నిర్వహణలో అమరులైన అటవీ అధికారులు, సిబ్బంది త్యాగాలను స్మరించుకోవాలన్నారు. డీజీపీ డాక్టర్ జితేందర్ మాట్లాడుతూ..అడవులను కాపాడేందుకు అధికారులు చేస్తున్న కృషి ఎంతో గొప్పదన్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ మాట్లాడుతూ అడవులను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వాటిని కాపాడటమే అమరులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారిణి డాక్టర్ సువర్ణ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎలుసింగ్ మేరు, పీసీపీఎఫ్ జౌహరి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా, అడిషనల్ పీసీపీఎఫ్లు సి.శరవనణ్, , ప్రియాంక వర్గీస్, జూపార్కుల డైరెక్టర్ డాక్టర్ సునీల్, క్యురేటర్ జె.వసంత, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ క్షితిజ, డాక్టర్ జి. రామలింగం, జీహెచ్ఎంసీ అర్బన్ ఫారెసీ్ట్ర డైరెక్టర్ సుభద్రాదేవి, జూపార్క్ డిప్యూటీ డైరెక్టర్ (వెటర్నరీ) డా.ఎం.ఎ. హకీమ్, డిప్యూటీ క్యురేటర్ బర్నోబా, అసిస్టెంట్ డైరెక్టర్ (వెట్) శ్రీనివాస్ , మాజీ క్యూరేటర్లు ఎ.శంకరన్, రాజశేఖర్, మాజీ డిప్యూటీ క్యూరేటర్ ఎ.నాగమణి, అసిస్టెంట్ క్యురేటర్లు నాజియా తబుసుమ్, ఎన్.లక్ష్మణ్, ఈపీఆర్ఓ హనీఫుల్లా, జూ సిబ్బంది పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ -
హెచ్సీఎస్సీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమ్మిట్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమ్మిట్–2025 నిర్వహించాలని నగర పోలీసు విభాగం నిర్ణయించింది. ఈ నెల 18, 19 తేదీల్లో జల విహార్ కేంద్రంగా జరుగనుంది. దీనికి సంబంధించిన లోగోను నగర ట్రాఫిక్ విభాగం చీఫ్ జోయల్ డెవిస్ గురువారం ఆవిష్కరించారు. ఈ సమ్మిట్లో వివిధ ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, నిపుణులతో పాటు సాధారణ ప్రజలు సైతం పాల్గొనున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేని సురక్షిత నగరాన్ని సాకారం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి కీలక సలహాలు, సూచనలను ఇవ్వనున్నారు. ప్రైవేటు బస్సులో కీచక డ్రైవర్ శివాజీనగర (బెంగళూరు): బస్సులో ఒంటరిగా ప్రయాణించిన బాలిక మీద లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక డ్రైవర్కు బాలిక కుటుంబీకులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున బెంగళూరులో బసవేశ్వర సర్కిల్లో జరిగింది. వివరాలు.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రైవేటు స్లీపర్ బస్సు బయల్దేరింది. అందులో ఓ బాలిక (15) బెంగళూరుకు వస్తోంది. మొబైల్ఫోన్ చార్జింగ్ అయిపోవడంతో చార్జింగ్ చేయాలని డ్రైవర్ను కోరింది. కొంతసేపటి తరువాత బాలిక మొబైల్ ఇవ్వాలని అడిగితే, ముద్దివ్వాలని డ్రైవర్ ఆరిఫ్ (41) బాలికను ఒత్తిడి చేశాడు. తరువాత బాలిక తన సీటు వద్దకు వెళ్లి నిద్రపోయింది. డ్రైవర్ బాలిక వద్దకు వెళ్లి తరచూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇది తట్టుకోలేక బాలిక తల్లికి ఫోన్ చేసి చెప్పింది. బస్సు సిటీకి రాగానే బాలిక తల్లి, సోదరుడు బస్సు నిలిపి డ్రైవర్ ఆరిఫ్ను ప్రశ్నించారు. డ్రైవర్ తప్పయిపోయిందంటూ చేతులెత్తి మొక్కి వేడుకున్నాడు. బాలిక కుటుంబీకులు అతన్ని చితకబాదారు. ఇంతలో పోలీసులు చేరుకొని డ్రైవర్ని అరెస్ట్ చేశారు. ● ఒంటరి బాలికపై లైంగిక వేధింపులు ● చితకబాదిన కుటుంబీకులు ● హైదరాబాద్ టు బెంగళూరు బస్సులో ఘటన -
14.9 కిలోల గంజాయి స్వాధీనం
ఇద్దరి అరెస్టు సికింద్రాబాద్: విశాఖపట్నం నుంచి ఢిల్లీకి గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.18.47 లక్షల విలువచేసే 14.9 కిలోల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ డీఎస్పీ ఎస్ఎన్ జావెద్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు సాయీశ్వర్గౌడ్, సారస్వత్లు వెల్లడించిన వివరాల ప్రకారం..ఢిల్లీ చాందినీ చౌక్కు చెందిన చంద్రప్రకాశ్ అనే ఫుట్పాత్ వస్త్రవ్యాపారి, అదేప్రాంతానికి చెందిన జమీలాఖాతూన్లు స్నేహితులు. చంద్రప్రకాశ్ మాదకద్రవ్యాల వినియోగానికి బానిస అవగా, జమీలాఖాతూన్కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వీరిరువురు గంజాయి రవాణా వ్యాపారం చేసి పెద్దమొత్తంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా చంద్రప్రకాశ్కు ఫేస్బుక్ ద్వారా ఫరాన్ఖాన్ అనే గంజాయి వ్యాపారి పరిచయం అయ్యాడు. అతని ద్వారా విజయనగరం వెళ్లిన వీరిద్దరు 14.9 కిలోల గంజాయి ప్యాకెట్లు సేకరించి విశాఖ ఎక్స్ప్రెస్ రైలు ద్వారా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుకున్నారు. ఢిల్లీ రైలు ఎక్కేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వెయిటింగ్ హాలులో వేచిచూస్తుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. కేసులు నమోదు చేసిన పోలీసులు ఇరువుర్ని రిమాండ్కు తరలించి గంజాయి విక్రయించిన ఫరాన్ఖాన్ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. -
జింక కొమ్ముల విక్రయానికి యత్నం
సాక్షి, సిటీబ్యూరో: అరుదైన యాంటిలోప్ సెర్వికాప్రా జాతికి చెందిన జింక కొమ్ములు విక్రయించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడి నుంచి రెండు కొమ్ములు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం అటవీ శాఖ అధికారులకు అప్పగించినట్లు అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన మహ్మద్ ఖలీముద్దీన్ అలియాస్ సలీం వృత్తిరీత్యా తాపీ మేస్త్రి. బతుకుతెరువు కోసం నగరానికి వలసవచ్చిన ఇతగాడు షహీన్నగర్లో ఓ పాన్షాపు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో సదాశివపేటకు రాకపోకలు సాగిస్తూ మేసీ్త్ర పని కూడా చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం అక్కడ ఓ ఇంటి కూల్చివేత పనులు చేస్తుండగా ఇతడికి జింక కొమ్ములు దొరికాయి. వీటిని సొంతం చేసుకుని సలీం నల్లరంగు కవర్లో చుట్టి నగరానికి తీసుకువచ్చాడు. తొలినాళ్లల్లో ఆ కొమ్ముల నుంచి చిన్న ముక్కలు వేరుచేసి పొడి చేసేవాడు. దీన్ని వినియోగిస్తే ఎముకలు పటిష్టం కావడంతో పాటు కొన్ని రోగాలు తగ్గుతామని నమ్మబలికి విక్రయించే వాడు. ఇటీవల రెండు కొమ్ముల్నీ విక్రయించాలని భావించిన సలీం ఖరీదు చేసే వ్యక్తుల కోసం వెతుకుతున్నాడు. దీనిపై తూర్పు మండల టాస్క్ఫోర్స్కు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ ఎ.నాగార్జున నేతృత్వంలో ఎస్సైలు ఎం.అనంతాచారి, ఎస్.కరుణాకర్రెడ్డి తమ బృందాలతో వలపన్ని సలీంను పట్టుకున్నారు. అతడి నుంచి రెండు జింక కొమ్ములు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. నిందితుడిని అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ -
‘విజయ్ శంకర్లాల్ జ్యువెలరీ’ నగలు దొరికాయి
● రూ.1.50 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం లక్డీకాపూల్: బషీర్బాగ్లోని విజయ్ శంకర్లాల్ జ్యువెలరీలో ఈ నెల 5న చోరీకి గురైన రూ.1.50 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు దొరికాయని, ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు సెంట్రల్ జోన్ డీసీపీ కె.శిల్పవల్లి తెలిపారు. గురువారం ఆమె ఇక్కడ వివరాలు వెల్లడించారు. ఐపీఎల్ బెట్టింగ్లో భారీగా నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ముంబైకి చెందిన రోనక్ చడ్వా గత ఏప్రిల్లో జ్యువెలరీ షాపులో పనికి చేరాడు. తనతో పాటు బెట్టింగ్లో నష్టపోయిన మహ్మద్ హస్నైన్ హబియాతో కలిసి కుట్రపన్ని ఈ నెల 5న జ్యువెలరీ షాపులో దొంగతనం చేశారు. దీనిపై 7న బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీసీఎస్తో కలిసి సైఫాబాద్ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఆభరణాలను రోనక్, మహ్మద్ హస్నైన్ హబియా దొంగిలించినట్లు గుర్తించి అరెస్టు చేశామని, నేరస్తులను ఏసీజేఎం కోర్టులో హాజరుపరిచామన్నారు. ఆభరణాలన్నీ చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. నగరంలో నగల దుకాణాల్లో పనిచేసే వారిని సమగ్రంగా విచారించిన తర్వాతే నియమించుకోవాలని డీసీపీ సూచించారు. సమావేశంలో అదనపు డీసీపీ బీ.ఆనంద్ ,సైఫాబాద్ ఏసీపీ ఆర్. సంజయ్ కుమార్, సైఫాబాద్ ఇన్స్పెక్టర్ కే. రాఘవేందర్, డీఐ ఎన్. రాజేందర్, డీఐ సైఫాబాద్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
శ్లాబ్ ఎక్కడిదాకా అయింది.. బిల్లులు వస్తున్నాయా?
సాక్షి, హైదరాబాద్: ‘హలో... నేను గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని మాట్లాడుతున్నా. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచి్చన ఇల్లు వచి్చందా.. దానికి సంబంధించిన బిల్లులు వస్తున్నాయా.. ఇంటి శ్లాబ్ ఎక్కడి వరకు వచ్చింది..అధికారులు మీకు సహకరిస్తున్నారా’అంటూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడారు. గురువారం మంత్రి హైదరాబాద్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ కాల్ సెంటర్, హెల్ప్డెస్్క, ఇందిరమ్మ ఇళ్ల కాల్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులతో ఫోన్లో మాట్లాడారు.ముందుగా వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం లబ్ధిదారుతో మాట్లాడారు. ‘బేస్మెంట్ వరకు మా ఇల్లు పూర్తయింది. కానీ ఇంకా బిల్లు రాలేదు’అని ఆమె చెప్పారు. దీనికి మంత్రి స్పందిస్తూ బేస్మెంట్ పూర్తయి ఎన్ని రోజులైంది, దాని ఫొటోలు అప్లోడ్ చేశారా అని అడిగారు. అప్పుడు అక్కడే ఆధార్ నంబర్తో అన్నీ పరిశీలించారు. రూ.లక్ష వచ్చే సోమవారం మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయని పొంగులేటి చెప్పారు. మరో వ్యక్తి ఫోన్ చేసి గ్రేటర్ హైదరాబాద్లో ఎప్పుడు ఇళ్లు ఇస్తారని అడగ్గా, పొంగులేటి స్పందిస్తూ నగరంలో స్థల సమస్య ఉందని, త్వరలోనే పరిష్కారం కనుగొని అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు టోల్ఫ్రీ కాల్ సెంటర్ ఫోన్ 1800 599 5991 రోజూ ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించడంతోపాటు వాటిని పరిష్కరించడంలో చొరవ చూపడానికి ఈ కాల్ సెంటర్ ను వినియోగించుకోవచ్చన్నారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వాటిని సంబంధిఅగీత అధికారుల వద్దకు తీసుకెళ్లి చర్యలు తీసుకుని లబ్ధిదారులకూ ఆ వివరాలను తెలియచేస్తారని పొంగులేటి చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లలో దేశానికే తెలంగాణ ఆదర్శం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కలి్పంచడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం తన నివాసంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మదన్మోహన్ రావు తదితరులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేస్తుంటే, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అడ్డుకుంటోందని సమావేశంలో మంత్రులు అభిప్రాయపడ్డారు. -
దంచికొట్టిన వాన
సాక్షి, హైదరాబాద్/మెదక్ మున్సిపాలిటీ/తాండూరు రూరల్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు దంచికొట్టాయి. హైదరాబాద్తోపాటు మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. మెదక్లో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకధాటిగా 3 గంటలపాటు కుండపోత వాన కురిసింది. దీంతో మెదక్ పట్టణం అతలాకుతలమైంది. జిల్లా కేంద్రంలో అత్యధికంగా 17.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ చెరువులను తలపించగా, పట్టణంలోని పలువురి ఇళ్లలోకి నీరు చేరింది. పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణం వర్షపు నీటితో నిండిపోవడంతో విద్యా ర్థులు అవస్థలు పడ్డారు. మెదక్ మండలంలోని పలు గ్రామాల్లో 13 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాజధానిలో... హైదరాబాద్లో ఉదయం ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా కన్పించిన వాతావరణం మధ్యాహ్నం మూడు తర్వాత ఆకాశంలో ఒక్కసారిగా దట్టంగా మబ్బులు కమ్ముకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. హయత్నగర్లో 11.2 సెం.మీ., డిఫెన్స్ కాలనీ కమాన్ వద్ద 10.2 సెం.మీ, వర్షపాతం నమోదైంది. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపైకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్దుపై నాలుగు అడుగుల ఎత్తు మేర వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఎల్బీనగర్ నుంచి మెహిదీపట్నం వరకు ఉన్న ఇన్నర్ రింగ్రోడ్డు సహా ఇతర మార్గాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. వాగులో ఒకరి గల్లంతు వాగు దాటుతుండగా ఓ వ్యక్తి గల్లంతైన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెంకలాన్లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భుక్తంపల్లి మొగులప్ప(40) ఆవుల కాపరిగా పని చేస్తున్నాడు. గురువారం అతను ఊరి శివారులోని చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో వృథాగా పడేసిన టార్ఫాలిన్, ప్లాస్టిక్ కవర్ల కోసం దిడ్డివాగు దాటి వెళ్లాడు. ఎగువ ప్రాంతంలో కరిసిన వర్షానికి వరద ఉధృతమైంది. అవతలి ఒడ్డున ఉన్న గ్రామస్తులు వద్దని వారిస్తున్నా వినకుండా కవర్ల మూటను నెత్తిపై పెట్టుకుని వాగు దాటుతూ కొట్టుకుపోయాడు. అతని భార్య లలితమ్మ, ఇద్దరు కొడుకులు అక్కడికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. మొగులప్ప ఆచూకీ కోసం చేపట్టిన సహాయక చర్యలకు వర్షం ఆటంకం కలిగించింది. రెండ్రోజులు మోస్తరు వర్షాలు రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలో కొనసాగుతున్న ఉపరితల చక్రవాత ఆవర్తనం గురువారం కూడా కొనసాగింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 4.5 కి.మీ. ఎత్తువరకు కొనసాగుతోంది. మరో ద్రోణి సబ్ హిమాలయన్ పశ్చిమబెంగాల్, సిక్కిం ప్రాంతం నుంచి జార్ఖండ్, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ వివరించింది. ప్రస్తుత నైరుతి సీజన్లో ఇప్పటివరకు సగటున 64.05 సెం.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 78.52 సెం.మీ. నమోదైంది. -
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్
రాయ్పూర్ (ఛత్తీస్గఢ్)/ సాక్షి ప్రతినిధి, వరంగల్: ఛత్తీస్గఢ్లోని గరియాబండ్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో మొత్తం 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు గురువారం పోలీసులు ప్రకటించారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా రాష్ట్ర కమిటీ కార్యదర్శి మోడెం బాలకృష్ణ (60) ఉన్నట్లు ఓ అధికారి చెప్పారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండకు చెందిన బాలకృష్ణ అలియాస్ మనోజ్ అలియాస్ బాలన్న, అలియాస్ రామచందర్, అలియాస్ భాస్కర్పై మొత్తం రూ.2 కోట్ల రివార్డు ఉన్నట్లు తెలిపారు. ఎన్కౌంటర్పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా హర్షం వ్యక్తం చేశారు. వచ్చే మార్చి 31లోగా నక్సలైట్ల ఏరివేత పూర్తి కావడం ఖాయమని పేర్కొన్నారు. మెయిన్పూర్ అటవీ ప్రాంతంలో.. మెయిన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. యాంటీ నక్సలైట్ ఆపరేషన్లో భాగంగా భద్రతా దళాలు కూంబింగ్ చేపడుతుండగా ఎన్కౌంటర్ జరిగినట్లు రాయిపూర్ రేంజ్ ఐజీపీ అమ్రేశ్ మిశ్రా తెలిపారు. ఛత్తీస్గఢ్ పోలీస్కు చెందిన స్పెషల్ టాస్క్ఫోర్స్, జిల్లా పోలీసు విభాగానికి చెందిన ‘ఈ–30’, సీఆర్పీఎఫ్కు చెందిన కోబ్రా దళాలు ఎన్కౌంటర్లో పాల్గొన్నాయని ఆయన చెప్పారు. సీనియర్ నేతలతో పాటు మొత్తం 10 మంది నక్సలైట్లు మృతి చెందారని, పూర్తి వివరాలు అందాల్సి ఉందని అన్నారు. బాలకృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. హైదరాబాద్లో చదువుతూ ఉద్యమ బాట మోడెం వెంకటయ్య, మల్లమ్మ దంపతులకు బాలకృష్ణ జన్మించారు. వెంకటయ్యకు పోస్టుమ్యాన్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్లోని చాదర్ఘాట్ ఏరియాకు సుమారు 50 ఏళ్ల కిందటే మకాం మార్చారు. బాలకృష్ణకు ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. 1983లో మావోయిస్టు (పీపుల్స్వార్) పార్టీ పట్ల ఆకర్షితుడైన బాలకృష్ణ.. హైదరాబాద్లో ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే వదిలేసి పోరుబాట పట్టారు. కొంతకాలం రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్ఎస్యూ) జంట నగరాల బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు ఎదిగారు. 1993లో అరెస్టు.. 1999 వరకు జైల్లో.. పీపుల్స్వార్ పార్టీ పనిలో భాగంగా అడవినుంచి బయటకు వచ్చిన బాలకృష్ణను అప్పటి యాంటీ నక్సల్స్ స్క్వాడ్ (ఏఎన్ఎస్) పోలీసులు 1993లో అరెస్టు చేశారు. పోలీసు డీఐజీ కేఎస్ వ్యాస్ హత్య, ఎమ్మెల్యే కిడ్నాప్లతో పాటు బెంగళూరు ఆయుధాల స్వా«దీనం, కుట్ర కేసులలో ఆయన సుమారు ఆరేళ్ల పాటు ముషీరాబాద్ జైల్లోనే ఉన్నారు. 1999లో బెయిల్పై విడుదలైన ఐదు రోజులకే కుటుంబసభ్యులు ఎంత బతిమిలాడినా వినకుండా తిరిగి అడవిబాట పట్టారు. సుమారు 26 సంవత్సరాలు ఏవోబీలో వివిధ కేడర్లలో పని చేశారు.ఈ క్రమంలో ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల పోలీసులకు మోస్ట్వాంటెడ్గా మారారు. ఆయనపై మూడు రాష్ట్రాలతో పాటు ఎన్ఐఏ ప్రకటించిన దానితో కలిపి రూ.2 కోట్ల రివార్డు ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్ పేరిట గత కొంతకాలంగా ప్రత్యేక పోలీసు బలగాలు అడవులను జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే. ఉద్యమ నిర్మాణంలో భాగంగా ఇతర నాయకులు, దళాలతో కలిసి బాలకృష్ణ ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దులో సంచరిస్తున్నట్లు కేంద్ర బలగాల నుంచి సమాచారం అందింది. ఈ మేరకు కూంబింగ్ చేపట్టగా ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. -
పత్రికల స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్య రక్షణకు పెను విఘాతం
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీల గళాన్ని వినిపిస్తున్న పత్రికలపై ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు ధోరణిపై ప్రజా సంఘాల నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి వినిపించడమే ప్రతిపక్ష పార్టీల కర్తవ్యమని, పత్రికలు, మీడియా బాధ్యత కూడా ఇదేనన్నారు. కానీ ప్రజా సమస్యలను వినిపించుకోకుండా ఏకపక్షంగా గొంతు నొక్కే ప్రయత్నం ప్రజా క్షేత్రంలో చెల్లుబాటు కాదని హెచ్చరించారు. సాక్షి మీడియాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు.పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబమే పత్రికా స్వేచ్ఛ. సామాజిక మాధ్యమాల యుగంలో ప్రెస్మీట్ను వక్రీకరించకుండా యథాతథంగా ప్రచురించడం సంపాదకుడి బాధ్యత. సాక్షి ఎడిటర్గా తన విద్యుక్త ధర్మాన్ని పాటించిన ఆర్.ధనంజయరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం సరైన చర్య కాదు. ఫిర్యాదులోని అంశాల్లో ఆధారాలు పరిశీలించకుండా కేసులు నమోదు చేయడం సరికాదు. పత్రికా సంప్రదాయాలు, విలువలు కాపాడేలా ప్రభుత్వం, అధికారులు వ్యవహరించాలి. నేతలు తమ పార్టీ విధానాలను వెల్లడిస్తే, వాటి ఆధారంగా ఎడిటర్పై కేసులు నమోదు చేయడం సరికాదు. – కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అఎడిటర్పై కేసులు పెట్టే సంస్కృతి ఏమిటి? విలేకరుల సమావేశంలో ఒక నాయకుడు మాట్లాడిన అంశాలను పత్రికలో ప్రచురిస్తే.. పత్రిక సంపాదకునిపై ఏకంగా కేసు నమోదు చేయడం ఏమిటి? ఇదెక్కడ న్యాయం? ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా, అందులో పనిచేసే వారిని, ఎడిటర్ ధనంజయరెడ్డిని వేధించేలా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిపై కేసు పెట్టొచ్చు కానీ... అది ప్రచురించిన సంపాదకునిపై కేసు పెట్టడం అధికార దుర్వినియోగమే. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే అవుతుంది. ధనంజయరెడ్డిపై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి. తన విధిని నిర్వర్తిస్తున్న సంపాదకునిపై కేసులు పెట్టే సంస్కృతికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలకాలి. – టి.హరీశ్రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం పత్రికా స్వేచ్ఛ మన ప్రజాస్వామ్యానికి నాలుగో మూల స్తంభం. కానీ తరచుగా పత్రికలు, జర్నలిస్టులపై, చివరకు ఎడిటర్లపైనా దూషణలతోపాటు భౌతిక దాడులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక మీడియా సమావేశాన్ని ప్రచురించినందుకు సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయడం కూడా ఇలాంటి కోవలోనికి వస్తుంది. విమర్శ హేతుబద్ధం కానప్పుడు, విమర్శ చేసినఅ∙వారిపై చట్టబద్ధ చర్య తీసుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఈ విషయంపై పత్రిక సంపాదకునిపై కేసు పెట్టడం కక్ష సాధింపు చర్యనే. దీనిని ఖండిస్తూ ఎడిటర్, ఇతర జర్నలిస్టులపైన నమోదు చేసిన కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై ఎడిటర్ గిల్డ్ స్పందించాలని కోరుతున్నా. – విమలక్క, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలుఇది కక్షసాధింపు ధోరణే తెలుగు రాష్ట్రాల్లో పాలక పక్షాలు.. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతిపక్షాల గొంతును వినిపిస్తున్న మీడియాపైనా కక్షసాధింపు ధోరణి కనిపిస్తోంది. కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్కృతి పెరగడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఈ ఆలోచన విధానం నుంచి ప్రభుత్వాలు బయటకు రావాలి. ప్రతిపక్షాల పాత్రను అణఅచివేయడం వారి స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్య రక్షణకు పెను ప్రమాదం. – సంధ్య, పీఓడబ్ల్యూ నేతమీడియాపై కేసులు సరికాదు ఉద్దేశ పూర్వకంగా మీడియాపై కేసులు పెట్టడం సరికాదు. మీడియాలో కేవలం పాలక పక్షం వార్తలే కాదు. ప్రతిపక్షం వార్తలు కూడా వస్తాయి. ప్రతిపక్ష పార్టీల వార్తలు రాసినందుకు మీడియాపై కేసులు నమోదు చేయడమంటే జర్నలిజంపైన దాడి చేయడమే. ఇది పూర్తిగా అక్రమం. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు సరికాకపోతే వాస్తవాలను వెల్లడించి రాజకీయ పోరాటం చేయాలి కానీ కేసులు పెట్టకూడదు. – ఎస్ఎల్ పద్మ, ప్రజాపంథ -
రాష్ట్రానికి పాలనా పక్షవాతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని పరిపాలనా పక్షవాతం (అడ్మినిస్ట్రేటివ్ పెరాలిసిస్) పట్టి పీడిస్తోందని బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు వ్యాఖ్యానించారు. దాదాపు 22 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని మండిపడ్డారు. రూరల్..అర్బన్ సెక్టార్లలోనే కాదు.. అన్ని సెక్టార్లలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు సమన్వయకర్తగా నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో రాంచందర్రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాజెక్టును కూడా సక్రమంగా ప్రారంభించలేదని, జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, భద్రతా చర్యల్లో విఫలమైందన్నారు. హైడ్రా చర్యల్లో భాగంగా ఎక్కడెక్కడ ఎవరెవరి ఆస్తులు కూల్చారు..సాధించిన ఫలితాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీగా ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతానికి పైగానే టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు.ఫార్ములా ఈ–కార్ రేస్ అవకతవకలపై ఏసీబీ విచారణలో వెల్లడైన అంశాలను ప్రభుత్వం బయటపెట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా రూ.1,000 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారన్నారు. అయితే అందుకు పూర్తి విరుద్ధంగా ఓయూ ఉద్యోగులకు ఈసారి నెల జీతమే ఆలస్యంగా వచి్చందన్నారు. జాబ్ కేలండర్ ప్రకటిస్తారు కానీ.. దానిని అమలు చేయడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలు జరిగితే కాంగ్రెస్ హయాంలో ‘హోప్ బ్రేకేజ్’జరుగుతోందన్నారు. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలి కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్లపై కాకుండా నాణ్యత, అవినీతి, నిర్వహణ తదితర అంశాలు ముడిపడి ఉన్నందున మొత్తం ప్రాజెక్టుపైనే సీబీఐ విచారణ జరిపించాలని రాంచందర్రావు డిమాండ్ చేశారు. వందరోజుల్లో ఎన్నికల హామీలు అమలు చేస్తామని చెప్పి..రెండేళ్లు కావొస్తున్నా ఏమీ చేయకపోవడంతో ప్రజలు ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రెండునెలల్లో బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపాలంటున్న కాంగ్రెస్ నేతలు, మంత్రులు మరి స్పీకర్ వద్ద పెండింగ్లో ఉన్న పదిమంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల నోటీసులపై కాలపరిమితితో చర్యలెందుకు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.కాంగ్రెస్ సర్కార్ ‘మిస్ మేనేజ్మెంట్’కారణంగానే తెలంగాణలో యూరియా కొరత ఏర్పడిందని ఒక విలేకరి వేసిన ప్రశ్నకు ప్రతిస్పందించారు. పార్టీలో అన్నీ సర్దుకుంటాయని, రాష్ట్ర కమిటీలో పరిమితంగా పోస్టులున్నందున అందరిని సంతృప్తి పరచలేమన్నారు. ఈ కమిటీలో చోటుదక్కని వారు ఎవరూ బాధపడొద్దని పార్టీలో ఇంకా 650 పోస్టులు ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల పార్టీ ముఖ్యనేతలపై చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘ఎవరు పడితే వారు చేసే వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు’అని అన్నారు. తన వెనుకాల ఎవరూ లేరని కేవలం ప్రధానమంత్రి మోదీ మాత్రం ఉన్నారని చెప్పారు. జర్నలిస్టులపై జరిగిన దాడులను ఖండిస్తున్నామని, జర్నలిస్టులు, న్యాయవాదుల రక్షణకు చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. -
కొండలను చీలుస్తూ.. లోయలను దాటుతూ..
ఐజోల్ నుంచి సాక్షి ప్రతినిధి గౌరీభట్ల నరసింహమూర్తి: ఎత్తయిన కొండలు, ఒకటి కాదు రెండు కాదు వందలు.. ఆ వెంటనే అగాధాలను తలపించే లోయలు... కొండలను చీలుస్తూ పరుగులెత్తే నదులు.. ఇలాంటి ప్రాంతాల్లో నడకదారి నిర్మాణం కూడా కష్టమే. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మిజోరం భౌగోళిక పరిస్థితి. ఆ రాష్ట్ర రాజధాని నగరమైన ఐజోల్లో భారీ భవనాలు కూడా చాలినంత స్థలం లేక కొండ అంచుల్లో కొంతమేర అగాధంలోకి వేలాడుతున్నట్టు పిల్లర్లపై నిర్మించి ఉంటాయి. నడకదారి నిర్మాణం కూడా కనాకష్టంగా ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు దాదాపు 52 కి.మీ.మేర రైల్వే లైన్ నిర్మితమైంది. ఆ రైల్వే ప్రాజెక్టును ప్రతిపాదించటమే ఓ సాహసం. అలాంటిది 11 ఏళ్ల కఠోర శ్రమతో ఇంజినీర్లు అద్భుతాన్ని చేసి చూపారు. ప్రపంచంలోనే అతి కష్టమైన రైల్వే ప్రాజెక్టుల్లో ఒకటిగా ఇప్పుడది రికార్డుల్లోకెక్కింది. దాన్నిశనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేస్తున్నారు. కొత్తగా నిర్మించిన రైలు కారిడార్ నిడివి 51.38 కి.మీ. కానీ, దీని నిర్మాణానికి అయిన వ్యయం రూ.8,071కోట్లు. అంటే కి.మీ.కు రూ.157 కోట్లు అన్నమాట. సాధారణంగా రైల్వే లైన్ల నిర్మాణంలో కి.మీ.కు అయ్యే ఖర్చు రూ.13 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఉంటుంది. కానీ, ఇక్కడ వ్యయం అంతకంటే పది రెట్లు ఎక్కువగా ఉండటం ఓ రికార్డు. వంతెనలు, సొరంగాలు... ఈ కారిడార్ నిర్మాణంలో 153 వంతెనలు, 45 సొరంగాలను నిర్మించాల్సి రావటమే భారీ వ్యయానికి కారణం. ఒకదానిని ఆనుకుని ఒకటిగా ఈ ప్రాంతంలో భారీ కొండలుంటాయి. ఆ కొండలను తొలిస్తే తప్ప రైలు కారిడార్ నిర్మాణం సాధ్యం కాదు. దీంతో 45 కొండలను తొలుస్తూ సొరంగాలు నిర్మించారు. రెండు కొండల మధ్య అగాధంలా లోయలున్నందున, సొరంగాలకు సమాంతరంగా వంతెనలు నిర్మించి దానిమీదుగా ట్రాక్ ఏర్పాటు చేశారు. సొరంగాలలో మూడో దాని నిడివి 1.9 కి.మీ. కావటం విశేషం. అలా మొత్తం సొరంగాల నిడివి 15.88 కి.మీ.గా ఉంది.అంటే మొత్తం రైలు కారిడార్లో 31 శాతం నిడివి సొరంగాలతోనే ఉందన్నమాట. ఇక 153 వంతెనల్లో 55 వంతెనలు అతి భారీవి. వాటిల్లో 97వ నంబర్ వంతెన పొడవు 742 మీటర్లు కాగా, దానికి నిర్మించిన స్తంభాల ఎత్తు 114 మీటర్లు. మరో 88 వంతెనలు కాస్త చిన్నవి. 10 ఆర్యూబీలు, ఆర్ఓబీలు కూడా ఉన్నాయి. ఇలా మొత్తం వంతెనల నిడివి కలిపితే 11.76 కి.మీ. మొత్తం కారిడార్ నిడివిలో వీటి వాటా 23 శాతం. అంటే 54 శాతం రైల్వే లైను వంతెనలు, సొరంగాలతోనే ఉంటుందన్నమాట. ఐజోల్కు భాగ్యం ⇒ దేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలకు గాను సిక్కింలో అసలు రైల్వే లైనే లేదు. ఆరు రాష్ట్రాల్లో పాక్షికంగా ఉన్నప్పటికీ, మిజోరం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ రాజధానులకు రైల్వే కనెక్టివిటీ లేదు. ఇంతకాలం తర్వాత మిజోరం రాజధాని ఐజోల్కు ఆ భాగ్యం దక్కబోతోంది. మిగతా మూడు రాష్ట్రాల రాజధానులను రైల్వేతో జోడించే కసరత్తు జరుగుతోంది. ⇒ ఐజోల్కు 20 కి.మీ. దూరంలో ఉన్న సాయిరంగ్ స్టేషన్ నుంచి ఇక నాలుగు రైళ్లు నడవనున్నాయి. ఇందులో రాజధాని ఎక్స్ప్రెస్ వారానికి ఒక రోజు ఢిల్లీకి, కోల్కతాకు వారంలో మూడు రోజులు నడిచే మరో ఎక్స్ప్రెస్, అస్సాం రాజధాని గువాహటికి నిత్యం ఓ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం కానున్నాయి. సాయిరంగ్ స్టేషన్ నుంచి మయన్మార్ దేశ సరిహద్దు 223 కి.మీ. దూరంలో ఉంటుంది. ⇒ ప్రకృతి రమణీయతకు నెలవైన ఆ ప్రాంతానికి రైలు కనెక్టివిటీతో పర్యాటకుల సంఖ్య భారీగా పెరగనుంది. పరిశ్రమలు కూడా రానున్నాయి. ప్రస్తుతం రోడ్డు మార్గాన సరుకుల రవాణా కూడా అతి కష్టంగా ఉన్నందున, ఆ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు అధికం. ఇప్పుడు రైలు మార్గాన సరుకు రవాణా సులభతరం కానున్నందున ధరలు దిగివచ్చి సామాన్యులకు ఊరట కలిగే అవకాశం ఉంది. -
పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పూర్తికి సంపూర్ణ సహకారం
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు వేగవంతమైన, రైలు–రోడ్డు–పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేసేలా రైల్వే ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని సీఎం రేవంత్రెడ్డి దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులను కోరారు. రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, కొత్త ప్రతిపాదనలకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవతోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్రెడ్డి గురువారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షించారు. వివరాలు సీఎం మాటల్లోనే.... పెండింగ్లో ఉన్న రైలు ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. అవసరమైన నిధులను సమకూర్చటంతోపాటు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల అలైన్మెంట్లు ఉండాలి. దూరాభారం తగ్గించి, అంచనా ఖర్చును కూడా తగ్గించుకోవాలి. – రాష్ట్ర పునరి్వభజన చట్టంలోని హామీ ప్రకారం హైదరాబాద్ నుంచి అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉంది. – రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. అందుకు సంబంధించి 300 కిలోమీటర్ల అలైన్మెంట్ ప్రతిపాదనలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది. దానికి అనుగుణంగా రైల్వేలైన్ ఏర్పాటు చేయాలి. రైల్వే విభాగ పరిశీలనలో ఉన్న అన్లైన్మెంట్తోపాటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన అలైన్మెంట్ను పరిశీలించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలి. హైవే వెంట రైలుమార్గం ఉండాలి, హైవేకు ఇరువైపులా కిలోమీటరన్నర దూరం వరకు ఇండ్రస్టియల్ కారిడార్ను విస్తరించాలనే ప్రతిపాదనలున్నాయి. – కొత్తగా అభివృద్ధి చేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే ప్రతిపాదనలకు అనుగుణంగా హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగుళూరు హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల సర్వే, అలైన్మెంట్ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలి. ప్రయాణికులకు వేగవంతమైన రవాణా సదుపాయాలు అందించటంతోపాటు కొత్తగా వేసే రైలు మార్గాలన్నీ ఆయా ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలి. విదేశాల తరహాలో రైలు, రోడ్డు, పోర్ట్ కనెక్టివిటీని అధునాతనంగా అభివృద్ధి చేయాలి. – వికారాబాద్– కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలి. గద్వాల–డోర్నకల్ రైల్వే లైన్ పనుల డీపీఆర్ పూర్తి చేసి వేగంగా పనులు చేపట్టాలి. వరంగల్లోనూ రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలి. భూపాలపల్లి నుంచి వరంగల్ కొత్త మార్గాన్ని పరిశీలించాలి. కాజీపేట జంక్షన్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలి. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్తోపాటు వరంగల్ను అభివృద్ధి చేయాలి. అందుకు అనుగుణంగా రైల్వే ప్రాజెక్టులను చేపట్టాలి’అని ముఖ్యమంత్రి రైల్వే అధికారులకు సూచించారు. ఆర్ఆర్ఆర్ చుట్టూరా రీజనల్ రింగ్ రైల్ హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రైల్ ఆవశ్యకతను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైల్వే అధికారులకు వివరించారు. దాదాపు 362 కిలోమీటర్ల మేరకు రీజనల్ రింగ్ రోడ్డు వెంట రింగ్ రైలు ఏర్పాటు చేస్తే.. హైదరాబాద్ మహానగర భవిష్యత్ స్వరూపం మారిపోతుందన్నారు. వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రైల్వే అధికారులకు సీఎం సూచించారు. తెలంగాణ ఇండ్రస్టియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వేలైన్ ఉండేలా ఈ కనెక్టివిటీ ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్అండ్బీ స్పెషల్ సెక్రెటరీ వికాస్రాజ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, ఆర్థికశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. -
ఈ మెట్రో నడపలేం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైల్ను వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు నిర్మాణసంస్థ ఎల్అండ్టీ తేల్చిచెప్పింది. నగరంలోని మూడు కారిడార్లలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో నిర్మించిన ఈ ప్రాజెక్టును కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ మెట్రో నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేసి అప్పగించాలని సూచించినా సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. ఆర్థికంగా భారంగా పరిణమించిన మెట్రోరైల్ నిర్వహణ తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. వరుస నష్టాలు, పెండింగ్ బకాయిల దృష్ట్యా రైళ్లను నడపడం కష్టంగా ఉన్నట్లు ఇటీవల కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. మెట్రో రెండో దశ డీపీఆర్పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం వివరణ కోరిన సంగతి తెలిసిందే. టికెట్ చార్జీల పంపకాలు, విద్యుత్ చార్జీల చెల్లింపులు, అసంపూర్తిగా ఉన్న మెట్రో మొదటి దశ ప్రాజెక్టు తదితర అంశాలపై ఎల్అండ్టీతో ఏ రకమైన అవగాహన ఏర్పాటు చేసుకున్నారో తెలియజేయాలని చెప్పింది. ఈ సంప్రదింపుల క్రమంలోనే ఎల్అండ్టీ సంస్థ కేంద్ర గృహనిర్మాణశాఖ సంయుక్త కార్యదర్శి జైదీప్కు లేఖ రాసింది. దేశంలోనే పీపీపీ పద్ధతిలో నిర్మించిన మొదటి మెట్రో ఇదే కావడం గమనార్హం. బకాయిలు రూ.5,000 కోట్లకు పైనే..హైదరాబాద్ మెట్రో మొదటి దశ 2017లో ప్రారంభమైంది. సుమారు రూ.22 వేల కోట్లతో 69 కి.మీ.పొడవున నిర్మించారు. ఈ మొదటి దశకు సంబంధించిన ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కి.మీ. కారిడార్ మాత్రం పెండింగ్లో ఉండగా, ప్రస్తుతం దీన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడిగించి రెండో దశలో కలిపేశారు. మొదటి కారిడార్ పూర్తయిన 2017 నాటికి, ఎల్ అండ్ టీకి ప్రభుత్వం రూ. 3,756 కోట్ల రాయితీ బకాయిలను చెల్లించాల్సి ఉంది. అవి 2020 ఫిబ్రవరి నాటికి రూ.5 వేల కోట్లకు పెరిగాయి. మరోవైపు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద ఇవ్వాల్సిన రూ.254 కోట్లను కేంద్రం ఇవ్వడం లేదని ఎల్అండ్టీ పేర్కొంది. ప్రస్తుతం మెట్రోలో రోజూ వారు 4.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.చాలని టికెట్ ఆదాయం ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో టికెట్లపై వచ్చే ఆదాయం రైళ్ల నిర్వహణకు చాలకపోవడం వంటి కారణాల దృష్ట్యా మెట్రో రైళ్లు నడపడం తమకు కష్టంగా ఉన్నట్లు ఎల్అండ్టీ వెల్లడించింది. నిర్వహణ ఖర్చులు, విద్యుత్చార్జీలు, ఉద్యోగుల జీతభత్యాలు, తదితర ఖర్చులు పెనుభారంగా మారినట్లు పేర్కొంది. మెట్రో మొదటిదశలోని తమ ఈక్విటీ వాటాను కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది.మెట్రో రెండో దశ ప్రతిపాదనలివీ.. » ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట, నాగోల్–ఎల్బీనగర్–శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఎల్బీనగర్–హయత్నగర్, రాయదుర్గం–అమెరికన్ కాన్సులేట్–హైకోర్టు భవనం, మియాపూర్–బీహెచ్ఈఎల్ తదితర మార్గాల్లో ‘ఏ’విభాగం కింద మొత్తం 5 కారిడార్లలో 76.5 కి.మీ. మేర నిర్మించనున్నారు. » సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు (23 కి.మీ.) ప్యారడైజ్ నుంచి శామీర్పేట్ వరకు (22 కి.మీ,), ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్సిటీ వరకు 39.6 కి.మీ నిర్మించాలని ప్రతిపాదించారు. » ఏ, బీ విభాగాల్లోని మొత్తం 8 కారిడార్ల నిర్మాణానికి రూ.40 వేల కోట్లకు పైగా ఖర్చుకానున్నట్లు అంచనా. -
అంగట్లో గ్రూప్ –1 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మంత్రులు గ్రూప్–1 పోస్టులను అంగట్లో పెట్టి అమ్ముకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయంలో మంత్రులు, సీఎం కార్యాలయంపై వస్తున్న ఆరోపణలను నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి, తమ విలువైన సమయాన్ని, తల్లిదండ్రుల కష్టార్జితాన్ని వెచ్చించి పోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందని గురువారం ఆయన ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్–1 పరీక్షను అక్రమాలకు తావులేకుండా తాజా నోటిఫికేషన్ వేసి మళ్లీ నిర్వహించాలన్నారు. పరీక్షల్లో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు అమ్ముకున్న దొంగలెవరో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్–1 పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతతో పాటు ఆ పార్టీ నేతల కాసుల కక్కుర్తి వల్లే గ్రూప్–1 పరీక్షలో అవకతవకలు చోటు చేసుకున్నాయని అన్నారు.తమ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందన్నారు. ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చేసిన మోసపూరిత వాగ్దానాలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించాలని, కేవలం మాటలతో కాకుండా చేతల్లో చూపించి యువత ఆశలను నెరవేర్చాలని కేటీఆర్ సూచించారు. కేటీఆర్కు ‘గ్రీన్ లీడర్షిప్’అవార్డు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో చేసిన కృషికిగాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ లీడర్షిప్ అవార్డు 2025’కు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల చివరిలో అమెరికాలోని న్యూయార్క్లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. సెపె్టంబర్ 24న న్యూయార్క్లో జరగనున్న 9వ ఎన్వైసీ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్లో ఈ అవార్డు ప్రదానోత్సవం జరగనుంది.నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటంమాజీ మంత్రి హరీశ్రావుసాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రూప్–1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని అన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షలను సక్రమంగా నిర్వహించలేక విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. డైవర్షన్ రాజకీయాలతో గ్రూప్–1 పరీక్షలో అవినీతి, అవకతవకలను కప్పిపుచ్చాలనే ప్రభుత్వ ఆటలు సాగవు. గ్రూప్–1 పరీక్షలో జరిగిన అక్రమాలపై వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను రెచ్చగొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అసమర్థతను ఒప్పుకొని క్షమాపణ చెప్పాలి’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆకాంక్షలను నీరుగార్చి, వారి భవిష్యత్తుతో ఆటలాడుతోందని ఆయన విమర్శించారు. గ్రూప్–1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి బీఆర్ఎస్వీ నేతల డిమాండ్ చిక్కడపల్లి (హైదరాబాద్): గ్రూప్–1 పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగబాలు డిమాండ్ చేశారు. గురువారం చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం ముందు గ్రూప్–1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులతో కలసి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. దీంతో నిరసనలో పాల్గొన్న వారిని చిక్కడపల్లి పోలీసులు అరెస్టుచేసి అబిడ్స్, ముషీరాబాద్ పోలీసుస్టేషన్లకు తరలించారు. గెల్లు శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ గ్రూప్–1 పరీక్షల్లో జరిగిన అవకతవకలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలుగు మీడియం విద్యార్థులకు పేపర్ వాల్యుయేషన్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రస్తుత నోటిఫికేషన్ రద్దు చేయాలని, తప్పుచేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తుంగబాలు మాట్లాడుతూ గ్రూప్–1 పరీక్షను నిర్వహించడంలో విఫలమైనందున, నైతిక బాధ్యత వహిస్తూ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
సంస్కరణలకు వేదిక జైలు వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: ‘జైలు వ్యవస్థ కేవలం భద్రతకే పరిమితం కాకుండా..సంస్కరణలు, పునరావాసానికి వేదికగా మారుతోంది’అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. ఖైదీల్లో సత్ప్రవర్తన తెచ్చి వారిని మళ్లీ సమాజంలో పంపడమే జైళ్లశాఖ అసలు విజయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 9 నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీలో తెలంగాణ జైళ్లశాఖ, బీపీఆర్అండ్డీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 7వ ఆల్ ఇండియా ప్రిజన్స్ డ్యూటీ మీట్–2025 గురువారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథి బండి సంజయ్, విశిష్ట అతిథి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితోపాటు తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, డీజీపీ జితేందర్, జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా, బీపీఆర్అండ్డీ అడిషనల్ డీజీ రవిజోసెఫ్ లోకూర్, నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్గార్గ్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాషబిస్త్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్లో అత్యధిక ట్రోఫీలతో తెలంగాణ జైళ్లశాఖ జాతీయస్థాయిలో కీర్తి చాటిందన్నారు. జాతీయస్థాయి పోటీలను ఎంతో ఘనంగా నిర్వహించారని సౌమ్యామిశ్రాను బండి సంజయ్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ జైళ్లశాఖను రోల్మోడల్గా తీసుకోవాలి : పొంగులేటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ..ఎన్నో అంశాల్లో సంస్కరణలతో ముందుకు వెళుతున్న తెలంగాణ జైళ్ల శాఖను దేశవ్యాప్తంగా రోల్మోడల్గా తీసుకోవాలన్నారు. జాతీయస్థాయిలో డ్యూటీ మీట్ను విజయవంతంగా నిర్వహించినందుకు తెలంగాణ జైళ్ల శాఖను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నట్టు తెలిపారు. – తెలంగాణ జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా మాట్లాడుతూ మూడు రోజుల డ్యూటీమీట్లో 21 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1,300 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నట్టు తెలిపారు. జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలంగాణ జైళ్లశాఖ మూడు రోజులుగా తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన డ్యూటీ మీట్లో ఓవరాల్ చాంపియన్గా తెలంగాణ జైళ్ల శాఖ సత్తా చాటింది. అన్ని అంశాల్లో కలిపి మొత్తం 28 పతకాలు సాధించగా..అందులో 21 బంగారు పతకాలు, 4 వెండి పతకాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. తమిళనాడు 17 పతకాలతో రెండో స్థానం, 16 పతకాలతో మహారాష్ట్ర మూడో స్థానంలో నిలిచాయి. -
గ్లాస్గో నుంచి డాక్టర్ రఘురాంకు అరుదైన గుర్తింపు
కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ స్థాపక డైరెక్టర్ డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. బ్రిటన్లోని గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ (RCPSG) వారు ఆయనకు గౌరవప్రదమైన ఎఫ్ఆర్సీఎస్(గ్లాస్గో) ను ప్రదానం చేశారు. ఈ గౌరవం పొందిన దక్షిణాసియాలోని అతి పిన్న వయస్కుడైన శస్త్రవైద్యుడిగా ఆయన చరిత్రలో నిలిచారు. ఇది మాత్రమే కాకుండా డాక్టర్ రఘురామ్ 1997లో ఇదే కాలేజ్ నుంచి ఎస్ఆర్సీఎస్ ద్వారా (గ్లాస్గో) పరీక్ష ద్వారా అర్హత పొందారు. ఇప్పుడు అదే కాలేజ్ నుంచి గౌరవ ఫెలోషిప్ పొందిన ప్రపంచంలో ఏకైక శస్త్రవైద్యుడు అయారు.ఈ అత్యున్నత గౌరవం 425 ఏళ్ల పురాతనమైన గ్లాస్గో రాయల్ కాలేజ్ తరఫున, 2025 సెప్టెంబర్ 10న, గ్లాస్గోలోని చారిత్రాత్మక కాలేజ్ హాల్లో జరిగిన ప్రత్యేక్ష కార్యక్రమంలో, కాలేజ్ అధ్యక్షుడు ప్రొఫెసర్ హనీ ఎటీబా డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టికి అధికారికంగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ అధ్యక్షుడు ప్రొఫెసర్ హనీ ఎటీబా మాట్లాడుతూ..డాక్టర్ పిల్లరిశెట్టికి మా కాలేజ్ తరఫున అత్యున్నత గౌరవమైన హానరరీ ఫెలోషిప్ అందించడంలో నాకు ఎంతో ఆనందంగా ఉంది. గత రెండు దశాబ్దాలుగా, ఆయన తన సమస్త జీవనాన్ని రొమ్ము క్యాన్సర్తో పోరాటంలో ప్రజలకు ఆశనిస్తూ, సేవలో నిమగ్నమయ్యారు. బ్రిటన్, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా శస్త్రవైద్యుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందించడంలో ఆయన పాత్ర అస్తాధారణం. శస్త్రచికిత్సలో నాణ్యతా ప్రమాణాలు, ప్రజారోగ్యం అభివృద్ధి పరంగా మేము తీసుకుంటున్న మిషన్లో ఆయన ఓ ముఖ్య భాగస్వామిగా మారారు. మా కాలేజ్ కుటుంబంలో ఆయనను ఆహ్వానించడంపై మాకు ఎంతో గర్వంగా ఉంది. భారత్ బ్రిటన్ల మధ్య సంబంధాలను మరింత బలపరిచే దిశగా ఈ కలయిక పనిచేస్తుందని మా విశ్వాసమని పేర్కొన్నారు.గౌరవ ఫెలోషిప్ ప్రదానోత్సవ సందర్భంగా గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ రిజిస్ట్రార్, ట్రస్టీ ప్రొఫెసర్ అభయ్ రేన్ చదివారు. దాదాపు రెండు దశాబ్దాలుగా భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ చికిత్సలో డాక్టర్. రఘురామ్ చేసిన విప్లవాత్మక మార్పులు అమూల్యమైనవని ప్రశంసించారు. హైదరాబాద్లో నిర్వహించిన 12 అంతర్జాతీయ ఎస్ఆర్సిఎస్/ఎంఆర్సిఎస్ ప్రిపరేటరీ కోర్సులకు ఆయనే ముందుండి నాయకత్వం వహించారని, వాటి ద్వారా దక్షిణాసియాలోని 2,000 మందికి పైగా వైద్య విద్యార్థులు ప్రతిష్టాత్మక పరీక్షల్లో విజయవంతం అయ్యే అవకాశం పొందారన్నారు. అంతేకాకుండా, భారతదేశంలో కాలేజ్ చేపట్టిన విద్యా కార్యక్రమాలకు డాక్టర్ రఘురామ్ అందించిన వ్యూహాత్మక మార్గనిర్దేశనం ఎంతో కీలకమైందని, అది కాలేజ్ విద్యా ప్రమాణాల బలోపేతానికి దోహదపడిందని ఆయన పేర్కొన్నారు.డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టి మాట్లాడుతూ 'ఈ అత్యున్నత గౌరవాన్ని ప్రదానం చేసినందుకు ఆర్సిపి ఎన్జీ అధ్యక్షుడికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రత్యేక గుర్తింపును నా కుటుంబం, నా రోగులు, నా తల్లితండడ్రులకు ఈ నేలకి అంకితం చేస్తున్నాను.1599లో స్థాపించబడిన గ్లాసో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఇప్పటివరకు 425 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. బ్రిటిష్ దీవుల్లో ఏకైక బహుళ శాఖా వైద్య కళాశాలగా ఇది ఉన్నది. ప్రపంచంలోని 97 దేశాల నుంచి వచ్చిన 15,000కి పైగా శస్త్రవైద్యులు, దంతవైద్యులు, పొడియాట్రీ మరియు ట్రావెల్ మెడిసిన్ రంగాల్లో పని చేసే నిపుణులను ఇది ప్రతినిధ్యం వహిస్తోంది. తర్వాత, కాలేజ్ అధ్యక్షుడు ప్రఖ్యాత ‘ఎంఆర్సీఎస్’, ఎఫ్ఆర్సీఎస్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సర్టిఫికెట్లు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవి. ఇవి ఇంటర్కలేజియేట్ పరీక్షలో ఉత్తీరులు అయిన,శిక్షణ అవసరాలను పూర్తి చేసిన వైద్యులకు మాత్రమే ఇస్తారు.డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టికి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన మరో 7 శస్త్రచికిత్స కళాశాలల నుండి హానర్జరీ ఫెలోషిప్లు ప్రదానం చేయబడ్డాయి. పద్మశ్రీ, డాక్టర్ బీసీ రాయ్ జాతీయ అవార్డు గ్రహీత అయిన ఆయన, బ్రిటన్లోని మూడు శస్త్రచికిత్స రాయల్ కాలేజ్ నుండి, బ్రిటిష్ ప్రభుత్వ నుండి అత్యున్నత గౌరవాలు అందుకున్న ఏకైక శస్త్రవైద్యుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన వ్యక్తిడాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టికి లభించిన ప్రధాన గౌరవాలు ఇవీ:బ్రిటిష్ సామ్రాజ్య గౌరవ విధాన అధికారి (ఆఫీసర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ 2020) నైట్హుడ్ను తప్పిస్తే బ్రిటిష్ సామ్రాజ్యంలో రెండో స్థాయి అత్యున్నత అవార్డు.హానరరీ ఎస్ఆర్సీఎస్ (ఇంగ్లాండ్), 2022- రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్లు ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క అత్యున్నత గౌరవం.హానరరీ ఎస్ఆర్సీఎస్ (గ్లాస్గో), 2025 - రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్గో అత్యున్నత గౌరవం. యూకే వెలుపల ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ (ఆర్సీఎస్ ఎడిన్బర్), 2013 నివసిస్తున్న రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్ల ఎడిన్బర్గ్ ఫెలోకు లభించే అత్యున్నత గౌరవం. డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టి గత 18 సంవత్సరాలలో భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ చికిత్స రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఆయన దక్షిణాసియాలోని మొదటి సమగ్ర బ్రెస్ట్ హెల్త్ సెంటర్ ని స్థాపించి, దేశవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ అవగాహన పెంపొందించడానికి ఓ చారిటబుల్ ఫౌండేషన్ కూడా ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రారంభించిన దక్షిణాసియాలోనే అతిపెద్ద జనాభాపరమైన స్క్రీనింగ్ కార్యక్కరమాలు ఆయన అమలు చేశారు. ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించబడుతోంది. భారతదేశంలో రొమ్ము శస్త్రచికిత్స చేసే శస్త్రవైద్యులను ప్రతినిధ్యం వహించే దక్షిణాసియాలోని మొదటి మరియు ఏకైక సంస్థ, "అసోసియేషన్ ఆఫ్ బ్రెస్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా" ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. తన తల్లిప్రేము మరియు సామాజిక సేవా పట్ల ఉన్న అభిమానం ఆయన వ్యక్తిత్వ లక్షణాలు. తెలంగాణలోని ఒక దూర ప్రాంత గ్రామమైన ఇబ్రాహింపూర్ను ఆయన దత్తత తీసుకుని, వ్యక్తిగత దాతృత్వం ద్వారా అక్కడ జీవనోపాధి మార్పులు తేవడమైన పరికరాలు, సౌకర్యాలు అందించారు. ఈ సేవలకు స్థానిక, ప్రాంతీయ, జాతీయ స్థాయిలో గౌరవాలు లభించాయి.చారిత్రాత్మక ఈ కాలేజ్ తో సన్నిహితంగా సంబంధం కలిగిన కొన్ని ప్రముఖ శస్త్రవైద్యుల్లో ప్రొఫెసర్ పీటర్ లోని ఉన్నారు. ఆయన ఆర్సీపిఎస్టీ స్థాపకుడు కాగా, 1597లో ఇంగ్లీష్ లో తొలి శస్త్రచికిత్స పుస్తకాన్ని ప్రచురించారు. సర్ విలియమ్ మేస్వాన్, 'న్యూరో శస్త్రచికిత్స తండ్రి"గా ప్రసిద్ధి పొందిన ఆయన, మొదటి మెదడు కణితిని తొలగించిన శస్త్రవైద్యుడిగా గుర్తింపు పొందారు. ప్రొఫెసర్ జోసెఫ్ లిస్టర్ శస్త్రచికిత్సలో శుద్ధి పద్దతుల పితామహుడిగా పేరుగాంచారు. ప్రొఫెసర్ సర్ గ్రీమ్ టీస్ డేల్ మరియు ప్రొఫెసర్ బ్రయాన్ బెనెట్ గ్లాస్గో కోమా స్కేల్ను స్థాపించారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అవగాహన స్థాయిని అంచనా వేయడానికి ఉపయోగించే ప్రసిద్ధ పరికరం, అలాగే, ప్రొఫెసర్ జమిని సేన్ భారతీయ శస్త్రవైద్యురాలు మరియు 1912లో ఈ కాలేజ్లో తొలి మహిళా ఫెలోగా ఎంపికైన వ్యక్తి -
హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం(సెప్టెంబర్ 11వ తేదీ) సాయంత్రం సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్ పేట్, ఉప్పల్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్, శామీర్పేట్, అంబర్పేట్, అబ్దుల్లాపూర్మెట్, మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. హయత్ నగర్-విజయవాడ రహదారిపై చేరిన వర్షపు నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హయత్నగర్ కోర్టు, ఆర్టీసీ డిపోలోకి వరద నీరు చేరింది. ప్రధానంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.ఇక మెదక్ జిల్లాలో ఈరోజు మూడు గంటల వ్యవధిలో భారీ నుంచి అతి భారీ వర్షంపడింది. మూడున్నర గంటల వ్యవధిలో 13 సెం.మీ అతి భారీ వర్షం పడింది. దీంతో రోడ్లు చెరువులను తలపించాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీపల్లి 9.2, పాతుర్ 8 సెం. మీ వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలకు భారీగా నీరు చేరింది. గాంధీ నగర్ కాలనీని రోడ్డు ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రామ్ దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై వరద పోటెత్తింది. మెదక్-హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో మధ్యలో ఉన్న డివైడర్ను అధికారులు తొలగించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో మొన్నటి పరిస్థితుల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
మద్యం అక్రమ కేసు.. కొనసాగుతున్న కూటమి కక్ష సాధింపు
సాక్షి, హైదరాబాద్: మద్యం అక్రమ కేసులో కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసుతో సంబంధం లేని నర్రెడ్డి సునీల్ నివాసం, ఆఫీసుల్లొ సిట్ సోదాలు చేపట్టింది. హైదరాబాద్, విశాఖపట్నంలో సిట్ సోదాలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి హోదాలోనూ కూడా సునీల్ పని చేయలేదు. మరో భేతాళ కథ సృష్టిస్తూ తప్పుడు మార్గంలో సిట్ సోదాలు నిర్వహిస్తోంది.కుట్రలు.. పన్నాగాలు.. బెదిరింపులు.. వేధింపుల మధ్య.. అబద్ధపు వాంగ్మూలాలు.. తప్పుడు సాక్ష్యాలతో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) మద్యం అక్రమ కేసును నడిపిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కక్ష సాధింపే లక్ష్యంగా.. దెబ్బతీయడమే ఉద్దేశంగా.. అబద్ధాల పునాదులపై అడ్డగోలుగా భేతాళ కథలు అల్లుతోంది.కాగా, మద్యం అక్రమ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు.. చంద్రబాబు సర్కార్కు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాగించిన ప్రయత్నాలను పటాపంచాలు చేసింది. ఈ ముగ్గురికీ బెయిల్ ఇచ్చింది. గత ప్రభుత్వ మద్యం విధానంలో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ నిరుడు సెప్టెంబరు 23న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అనంతరం ఈ అక్రమ కేసులో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు నిమిత్తం సిట్ను ఏర్పాటు చేసింది. దర్యాప్తు జరిపిన సిట్... రాజ్ కేసిరెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, దొడ్డా సత్యప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, వేణుంబాక విజయసాయిరెడ్డి, శ్రీధర్రెడ్డి, కాల్వ ధనుంజయరెడ్డి, పెళ్లకూరు కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్రెడ్డితో పాటు మొత్తం 48 మందిని నిందితులుగా చేర్చింది. -
అన్ని పార్టీలకూ సవాల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అన్ని పార్టీలూ సవాల్గా తీసుకోవడంతో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. బుధవారం నియోజకవర్గంలోని రహ్మత్నగర్ డివిజన్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు ముఖ్య నాయకులతో పాటు మాగంటి గోపీనాథ్ భార్య సునీత కూడా పాల్గొన్నారు. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ స్థానం ఖాళీ అయినందునే ఈ ఉప ఎన్నిక జరుగుతుండటం తెలిసిందే. గోపీనాథ్ ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎవరికే ఆపద వచ్చినా అండగా ఉండేవారని, ఆయన మరణంతో అనుకోకుండా వచి్చన ఈ ఎన్నికలో మాగంటి కుటుంబానికి ప్రజలంతా అండగా ఉండాలని కేటీఆర్ పిలువపునివ్వడంతో పాటు, తనకు అండగా నిలవాలని సునీత కూడా కోరడంతో ఇక ఆ నియోజకవర్గ అభ్యర్థిగా ఆమె పేరు ప్రకటించడం లాంఛనప్రాయమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గోపీనాథ్ మరణం వల్ల సానుభూతి పవనాలు బీఆర్ఎస్కు ఉపకరించగలవా అనే చర్చలు జరుగుతున్నాయి. సిట్టింగ్ సీటును నిలుపుకోవాలని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి శ్రీగణేశ్ గెలవడంతో, బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కోల్పోయింది. ఇప్పుడు గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఈ ఎన్నికలో ఘన విజయంతో ప్రజలు తమ వెంటే ఉన్నారని, తిరిగి జైత్రయాత్ర ప్రారంభించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలు, హైడ్రా కూల్చివేతలవంటివి అస్త్రాలుగా మలచుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్కు రెఫరెండం ఇక ఈ ఎన్నికలో గెలుపు కాంగ్రెస్కు రెఫరెండంగా పలువురు భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి త్వరలో రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఇతర ప్రతిపక్ష పారీ్టలు సైతం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించడం ద్వారా రాబోయే రోజుల్లో గెలిచేది తామేనని చెప్పేందుకు ఎవరి వ్యూహాల్లో వారున్నారు. పార్టీల వ్యూహం ఇలా.. కాంగ్రెస్: ఈ ఎన్నికలో గెలుపు ద్వారా తమ పాలన కు ప్రజల రెఫరెండం అని బలంగా చెప్పవచ్చని భా విస్తూ ఇప్పటికే కొన్ని వ్యూహాలు అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీఅధ్యక్షుడు మహేశ్గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్చార్జిమీనాక్షి నటరాజన్ వంటి నేతలు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్లకు నియోజకవర్గంలోని డివిజన్ల బాధ్యతలు అప్పగించి, బూత్ స్థాయి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు, పేదలకు సన్నబియ్యం సహా ఇతర హామీల అమలు వంటి అంశాలను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. బీజేపీ: ఈ ఎన్నికలో గెలవడం ద్వారా పజ్రలు తమవైపు మొగ్గుచూపుతున్నారని చెప్పడంతో పాటు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారం తమదేనని బీజేపీ చెప్పాలనుకుంటోంది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దాకా నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కార్పొరేటర్లతోనూ ముమ్మర ప్రచారం నిర్వహిస్తోంది. ఈ ఎన్నిక కోసం మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి బూత్స్థాయిలో సమన్వయం చేస్తోంది. బీఆర్ఎస్: సిట్టింగ్ సీటు కావడంతో బీఆర్ఎస్ ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం కృషి చేస్తోంది. గోపీనాథ్ మరణంతో ప్రజల్లో ఏర్పడిన సానుభూతి ఉపకరిస్తుందనే మాగంటి సునీత తమ అభ్యర్థి అనే సంకేతాలిచ్చింది. మాగంటి గోపీనాథ్ వరుసగా మూడు పర్యాయాలు గెలిచిన నేపథ్యం ఉంది. మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభల ద్వారా పార్టీ ఐక్యతను చాటుతోంది. సునీత ఇప్పటికే ఇంటింటి ప్రచారం ప్రారంభించి, తన భర్త చేసిన సేవలను గుర్తు చేస్తూ ప్రజలతో మమేకమవుతోంది. తాజాగా తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో కేటీఆర్ స్వయంగా పాల్గొనడం, పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశంతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న వారిని గుర్తించి తమవైపు తిప్పుకోవాలనే యోచనలో ఉంది. మజ్లిస్: జూబ్లీహిల్స్లో మైనారిటీ ఓటర్లు కీలకంగా ఉండటంతో, మజ్లిస్ మద్దతు పెను ప్రభావం చూపనుంది. మజ్లిస్ పోటీ చేస్తుందా, కాంగ్రెస్కు మద్దతుగా నిలుస్తుందా చూడాల్సి ఉంది. -
కూకట్పల్లి రేణు కేసు.. ఆ ఇద్దరూ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లిలో దారుణ హత్యకు గురైన రేణు అగర్వాల్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వంట మనిషి, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి ఆమెను కిరాతకంగా హత్య చేసి.. ఆపై ఇంట్లోని నగదుతో అక్కడి నుంచి పారిపోయారు. ఇద్దరు నిందితులూ జార్ఖండ్కు చెందిన వాళ్లుగా గుర్తించారు. పోలీసులు వెల్లడించిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. కూకట్పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటిలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. రేణు అగర్వాల్ అనే మహిళ ఇంట్లో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండగా.. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్తో పాటు క్లూస్ టీం ద్వారా కీలక ఆధారాలు సేకరించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన బాలనగర్ డీసీపీ దర్యాప్తు బృందం నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ, వేలి ముద్రలు ఇతరత్ర సాక్ష్యాల ఆధారంగా హత్య జరిగిన తీరుపై ఓ నిర్ధారణకు వచ్చారు. రాకేష్,రేణు అగర్వాల్కు ఫతేనగర్ లో స్టీల్ దుకాణం ఉంది. కూతురు తమన్నా చదువు నిమిత్తం వేరే రాష్ట్రంలో ఉంది. కొడుకు శుభం వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. స్పాన్ లేక్లోనే మరో అపార్ట్మెంట్లో రాకేష్ బంధువులు నివసిస్తున్నారు. ఆ ఇంట్లో జార్ఖండ్కు చెందిన రోషన్ అనే యువకుడు పని చేస్తున్నాడు. అయితే.. రోషన్ తన స్నేహితుడు హర్షను జార్ఖండ్ నుంచి రప్పించి.. 11 రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనిలో కుదిర్చాడు. ఈ ఇద్దరికీ రూ.15వేల జీతంతో పాటు అక్కడే ఆశ్రయం కల్పించారు.బుధవారం ఉదయం రాకేష్,శుభం స్టీల్ దుకాణానికి వెళ్లగా ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం ఐదు ఇంటికి భర్త కుమారుడు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు.రాత్రి 7 గంటల సమయంలో రాకేష్ ఇంటికి వచ్చి తలుపు తట్టిన రేణు తీయలేదు. దీంతో ప్లంబర్ని పిలిపించి వెనుకవైపు నుంచి లోపలికి పంపించి తలుపు తీయించారు. లోపలికి వెళ్లి చూడగా.. హాల్లో రేణు కాళ్లు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపుమడుగులో కనిపించడంతో తండ్రికి, పోలీసులకు శుభం సమాచారమిచ్చాడు. ప్రాథమిక విచారణలో.. వేలిముద్రలో సరిపోలడంతో రోషన్, హర్షలే రేణు అగర్వాల్ను హతమార్చినట్లు తేలింది. ఆమె కాళ్లు చేతులు కట్టేసి తలపై కుక్కర్తో కొడుతూ బంగారం, నగదు కోసం చిత్రహింసలకు గురి చేశారు. ఆపై కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోశారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. ఆమె ఒంటిపై నగలను సూట్ కేసులో సర్దేసుకున్నారు. రక్తపు మరకలున్న దుస్తులను అక్కడే వదిలేసి.. శుభ్రంగా స్నానం చేసి సూట్కేసుతో బయటకు వచ్చేశారు. ఈ సమయంలో సీసీటీవీల్లో దృశ్యాలు నమోదు అయ్యాయి. చివరకు.. ఓనర్కు చెందిన స్కూటీపైనే ఇద్దరూ పరారయ్యారు. కూకట్పల్లి పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి.. నిందితుల కోసం గాలిస్తున్నారు. పారిపోయేందుకు ఉపయోగించిన స్కూటీ జాడ కూడా ఇంకా లభ్యం కాలేదు.బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శకూకట్పల్లిలో పనిమనుషుల చేతుల్లో దారుణ హత్యకు రేణు అగర్వాల్ కుటుంబాన్ని గురువారం ఉదయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. రాకేష్, శుభంలను ఓదార్చారాయన. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీస్ అధికారులతో ఆయన కేసు స్టేటస్ గురించి ఆరా తీశారు. -
ఉదయంలోగా చచ్చిపో.... లేదంటే చంపేస్తాం....
హైదరాబాద్: ఒరేయ్ తలుపులు తీయరా.. నీ అంతు చూస్తాం.. ఉదయంలోగా చచ్చిపో.. లేకుంటే మా చేతిలో చస్తావు అంటూ ముగ్గురు కిలాడీ లేడీలు మారణాయాధాలతో ఓ వ్యక్తి ఇంటి వద్దకు వచ్చి అర్ధరాత్రి మూడుసార్లు హల్చల్ చేశారు. దీంతో సదరు వ్యక్తి భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధి కైసర్నగర్ డబుల్ బెడ్ రూమ్ సముదాయంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కైసర్ నగర్ డబల్ బెడ్ రూమ్ సముదాయంలో 6వ బ్లాక్ ప్లాట్ నెంబర్ 302 లో బియ్యం పల్లి రాజు (55), జ్యోతి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. రాజు బాలానగర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి అతను డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుండగా 2వ బ్లాక్లో నివాసం ఉంటున్న నౌసీమ్ అనే మహిళ అతడిని అనుసరిస్తూ వచ్చింది. అతడి జేబులో నుంచి డబ్బులు తీసేందుకు ప్రయతి్నంచగా నివారించేందుకు రాజు సదరు మహిళా చేయి పట్టుకున్నాడు. దీంతో సదరు మహిళతో పాటు ఆమె తల్లి షహజాన్, 4వ బ్లాక్లో ఉండే అంజుమా అక్కడికి చేరుకుని రాజును దుర్భాషలాడారు. దీంతో సొసైటీ సభ్యులు జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పి ఇంటికి పంపించారు. ఆ తర్వాత మళ్లీ రాజు ఇంటికి వచ్చి గొడవ చేయగా స్థానికుడు సతీష్ చెప్పడంతో వెనుదిరిగారు. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి మారణాయుధాలతో అతడి ఇంటికి వచ్చి ఒరేయ్ బయటికి రారా.. నీవు చచ్చిపోతావా.. మమ్మల్ని చంపమంటావా, ఉదయంలోగా చచ్చిపోవాలి లేకుంటే నీ అంతు చూస్తాం అంటూ హెచ్చరించి వెళ్లిపోయారు. దీంతో ఆందోళనకు గురైన రాజు ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా మరో బెడ్ రూమ్లోకి వెళ్లి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం దీనిని గుర్తించిన అతడి భార్య జ్యోతి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించింది. దీంతో ఆగ్రహానికి లోనైన స్థానికులు రాజు మృతికి కారణమైన వారి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. దీనిపై సమాచారం అందడంతో సూరారం సీఐ సు«దీర్ కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రాజు కారణమైన మహిళలపై పోలీసులు పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరైన అంజుమా ఈ గొడవకు ముందు మరో వ్యక్తితో గొడవ పెట్టుకొని రభస చేసింది. వీరు ముగ్గురూ నిత్యం అమాయకులను టార్గెట్ చేసుకొని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
Kukatpally: కాళ్లు, చేతులు కట్టేసి... అక్కడే స్నానం చేసి..
హైదరాబాద్: ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక సాన్వీ లేక్ అపార్ట్మెంట్లో 1311 ప్లాట్లో రాకేష్ అగర్వాల్, రేణు (50) దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్ సనత్నగర్ లో స్టీల్ షాప్ నిర్వహిస్తున్నాడు. వారి ఇంట్లో పని చేసేందుకు పది రోజుల క్రితం హర్ష అనే వ్యక్తిని వంట మనిషిని నియమించుకున్నారు. బుధవారం భర్త, కుమారుడు షాప్కు వెళ్లగా రేణు ఒక్కతే ఇంట్లో ఉంటుంది. సాయంత్రం ఆమె భర్త ఇంటికి వచ్చి చూడగా ఇళ్లు తాళం వేసి ఉండటంతో ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి ప్లంబర్ సహాయంలో తలుపులు తెరిచి చూడగా రేణు రక్తం మడుగులో పడి ఉంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కాళ్లు, చేతులు కట్టేసి... అక్కడే స్నానం చేసి.. రేణు కాళ్లు, చేతులు కట్టేసి కుక్కర్తో తలపై మోది గొంతు కోసి హత్య చేశారు. రక్తం అంటుకున్న దుస్తులను అక్కడే విడిచి బాత్రూంలో స్నానం చేసి దుస్తులు మార్చుకుని బ్యాగ్తో సహా యజమాని స్కూటీపై పరారైనట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యింది. 5 టీమ్లతో నిందితుల కోసం గాలిస్తున్నట్లు బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. -
ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూల్చడమే..: కేటీఆర్
శ్రీనగర్కాలనీ (హైదరాబాద్): ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూలగొట్టడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్కు ఓటువేస్తే మీ ఇళ్లను కూలగొట్టడానికి లైసెన్స్ ఇచ్చినట్టేనని స్థానిక ప్రజలను హెచ్చరించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. బుధవారం తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ రహమత్నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. డబ్బున్న పెద్దల జోలికెళ్లదు.. ‘కాంగ్రెస్ పార్టీలో చేరలేదనే అక్కసుతో బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చేశారు. దీంతో ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. హైడ్రా ఇల్లు కూలగొడుతుందన్న భయంతో కూకట్పల్లిలోని బుచ్చమ్మ అనే మహిళ ప్రాణాలు తీసుకుంది. డబ్బున్న పెద్దల జోలికి ఈ ప్రభుత్వం పోదు. దుర్గం చెరువులో అక్రమంగా ఇల్లు కట్టుకున్న రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటిని కూల్చే దమ్ము అధికారులకు ఉందా? ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతోంది. తమకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపివేస్తామంటూ ప్రజలను బెదిరిస్తోంది. హైడ్రా పేరుతో బిల్డర్ల దగ్గర దోచుకున్న అవినీతి సొమ్మును ఉప ఎన్నికల్లో పంచి గెలవడానికి సీఎం రేవంత్రెడ్డి కుట్ర పన్నుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓటు అడిగే హక్కు ఆ పార్టీకి లేదు..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్కు ఓటేస్తే మోదీకి వేసినట్లే.. ‘ప్రధాని మోదీని పెద్దన్నలా భావించి ఆయన మార్గదర్శకత్వంలో నడుస్తున్న బీజేపీ సీఎం రేవంత్రెడ్డి అన్న సత్యాన్ని మైనార్టీలు ఇప్పటికైనా గుర్తించాలి. రాహుల్గాంధీని తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ పార్టీని రేవంత్రెడ్డి తన పార్టీగా భావిస్తున్నారని, కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ప్రజలు గమనించాలి. తెలంగాణాలో కాంగ్రెస్కు ఓటువేస్తే పీఎం నరేంద్ర మోదీ, బీజేపీకి ఓటు వేసినట్లే. రాష్ట్ర చరిత్రలో తొలిసారి మైనార్టీ మంత్రి ప్రభుత్వంలో లేరంటే.. మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గౌరవం ఏమిటో గుర్తించాలి. మాగంటి కుటుంబానికి అండగా నిలవాలి బీఆర్ఎస్ మైనార్టీలకు సముచిత స్థానం ఇచ్చింది. బీఆర్ఎస్తోనే మైనార్టీల సంక్షేమం సాధ్యం. ప్రజలు అన్నీ గమనించి, ప్రజల మనిషిగా చిరస్థాయిగా నిలిచిన దివంగత మాగంటి గోపీనాథ్కు నివాళిగా..సంక్షేమాన్ని చేతల్లో చూపించిన బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్లో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా అండగా నిలబడే వాడు. ఆయన కుటుంబానికి ప్రజలు అండగా నిలవాలి. కారు గుర్తుకు ఓటువేసి హస్తానికి తగు బుద్ధి చెబుతూ రేవంత్రెడ్డి అహంకారాన్ని బొందపెట్టాలి..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో హైదరాబాద్లో అన్ని సీట్లను బీఆర్ఎస్కు అందించారని, అదే స్ఫూర్తితో జూబ్లీహిల్స్లో గెలిపించి, హైదరాబాద్ గులాబీ అడ్డా అన్న సందేశాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 14వ తేదీ నుంచి కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్ళి, మాగంటి చేసిన పనులను, ఆయన సేవలను ఓటర్లకు గుర్తు చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీమంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్భాస్కర్, పి.విష్ణువర్ధన్రెడ్డి, కోరుకంటి చందర్, మాగంటి సతీమణి సునీత, రహమత్నగర్ ఇన్చార్జి టి.రవీందర్రావు పాల్గొన్నారు. -
దసరా తర్వాత ‘వైన్స్కు’ దరఖాస్తులు!
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండేళ్ల కాలానికి వైన్షాపుల నిర్వహణ కోసం దసరా పండుగ తర్వాత దరఖాస్తులు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ యోచిస్తోంది. ఈ ఏడాది నవంబర్ 30తో ప్రస్తుత షాపులకు గడువు ముగియనున్న నేపథ్యంలో అక్టోబర్ 5వ తేదీ తర్వాత కొత్త పాలసీ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఆ శాఖ అధికారులున్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు తగినంత సమయం ఇవ్వడం ద్వారా ఎక్కువ దరఖాస్తులు వచ్చేలా చూడాలన్న ఆలోచనతోనే దసరా ముగిసిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్న ట్టు సమాచారం. అయితే రాష్ట్రంలో 2,620 వైన్షాపులుండగా ఆ సంఖ్యను పెంచుతారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. రాష్ట్రంలో ఎంత జనాభాకు ఒక వైన్షాపు ఉండా లో 2011 జనాభా లెక్కల ఆధారంగా నిర్ధారించా రు. ఆ తర్వాత జనగణన జరగక పోవడంతో ఇప్పటికీ ఆ సంఖ్యనే కొనసాగిస్తున్నారు. కానీ ఈసారి షాపుల సంఖ్యను పెంచే అవకాశాలున్నాయని ఎక్సైజ్ వర్గాలంటున్నాయి. గత పాలసీతో రూ.2,920 కోట్ల ఆదాయం గత రెండేళ్ల పాలసీ ప్రకారం వైన్షాపుల నిర్వహ ణకు ఆహ్వానించిన దరఖాస్తుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,920 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. ఈసారి ఆదాయం రూ.3,500 కోట్లు దాటుతుందనే అంచనాలో ఎక్సైజ్ శాఖ ఉంది. దరఖాస్తు ఫీజును రూ.3 లక్షలకు పెంచి, తగిన స మయం కూడా ఇస్తే ఈ ఆదాయం మరింత పెరు గుతుందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి దరఖాస్తుల స్వీకరణకు నెలన్నర రోజులు గడువు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు ఆదాయార్జిత శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచి్చనప్పటికీ ఇప్పుడప్పుడే స్థానచలనం అవసరం లేదనే భావనలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులున్నట్టు తెలుస్తోంది. ఈసారి వైన్షాపుల ఏర్పాటు కోసం దరఖాస్తుల ప్రక్రియ ముగిసి, కొత్త షాపులు ప్రారంభమైన తర్వాత బదిలీలతో పాటు పెండింగ్లో ఉన్న పదోన్నతులను కూడా చేపట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం. -
సరైన చర్యలతో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట
సాక్షి,హైదరాబాద్: సరైన చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించ వచ్చని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే అన్నారు. ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకు నిర్ణీత కాలవ్యవధి (టైమ్ బౌండ్) పెట్టుకొని సంబంధిత శాఖలు పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ విధంగా చేస్తే ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ‘రోల్ మోడల్’గా నిలిచే అవకాశం ఉందన్నారు. రోడ్డు భద్రత అనేది ప్రభుత్వం, సమాజం ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. బుధవారం తెలంగాణలో రోడ్డు భద్రతపై ఉన్నతాధికారులతో మనోహర్ సప్రే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రోజుకు 500 మంది, గంటకు 25 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతినెలా కనీసం ఒకసారి క్రమం తప్పకుండా జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశాలను నిర్వహించాలని సూచించారు. ప్రమాదాలకు కారణమవుతున్న ‘బ్లాక్స్పాట్స్’ను సరిచేయాలని, రోడ్లపై గుంతలను వెంటనే పూడ్చాలని, చెల్లుబాటయ్యే డ్రైవింగ్, వాహన బీమా ఉండేలా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, వాహన యజమానులకు డ్రైవింగ్, వాహన బీమా గడువుతీరిపోవడానికి సంబంధించిన అలర్ట్లు పంపించాలని సప్రే తెలిపారు. రోడ్డు భద్రతకు టెక్నాలజీ వినియోగం రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఈ కమిటీ, చట్టాల అమలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాల సమీక్షతో పాటు ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వంటి అంశాల్లో మార్గనిర్దేశం చేస్తోంది. ఈ విషయంలో రాష్ట్రంలో చేపట్టిన చర్యలను సీఎస్ రామకృష్ణారావు, హోం సెక్రటరీ రవిగుప్తా వివరించారు. ట్రాఫిక్ నియంత్రణలో కృత్రిమ మేధ, డేటా అనలిటిక్స్ వినియోగిస్తున్నట్లు డీజీపీ జితేంద్ర తెలిపారు. వాహనాల రిజి్రస్టేషన్లు, ప్రమాదాలు, మరణాలు, గాయాల వార్షిక గణాంకాలను ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేంద్రమోహన్ తెలియజేశారు.పాఠశాలల్లో రోడ్డు భద్రతపై పాఠ్యాంశాలు ప్రవేశపెడుతున్నట్లు విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై భద్రతా చర్యలు గురించి హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ప్రమాదకర ప్రాంతాలలో జాగ్రత్తలతో పాటు రోడ్లపై గుంతలు పూడ్చటం, లేన్మార్కింగ్, సిగ్నేజీల ఏర్పాటు వంటి ఇంజనీరింగ్ చర్యలను గురించి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వివరించారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల పరంగా తెలంగాణ 8వ స్థానంలో, మరణాల పరంగా 10వ స్థానంలో ఉందని వివిధ శాఖల అధికారులు వెల్లడించారు. హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం లేకపోవడం, మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ వాడకం, అతివేగం ప్రధాన కారణాలని తెలియజేశారు. దీంతో వీటిపై మరింత లోతైన అవగాహన కార్యక్రమాలు అవసరమని జస్టిస్ సప్రే సూచించారు. రాష్ట్రంలో అమలవుతున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్రాజ్, మున్సిపల్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇలంబర్తి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, హెల్త్ కమిషనర్ డా.సంగీత తదితరులు పాల్గొన్నారు. -
సీతారామకు ‘క్లియరెన్స్’!
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతలు పథకానికి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) దరఖాస్తు చేయనుంది. ప్రాజెక్టు అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) కార్యాలయానికి సమర్పించారు. సీతారామ ఎత్తిపోతలు పథకం–సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు జారీ చేస్తూ సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) గత ఏప్రిల్లో నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ను సాధిస్తే ప్రధానమంత్రి క్రిషి సించాయ్ యోజన (పీఎంకేఎస్వై) పథకం కింద కేంద్ర ప్రభుత్వ నిధులను రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సీతారామ ఎత్తిపోతలు పథకానికి ఇప్పటికే పర్యావరణ అనుమతులుండగా, సీతమ్మసాగర్కు ఇంకా రావాల్సి ఉంది. దీంతో ఈ ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ వచ్చే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలోనే సీతారామ ప్రాజెక్టుకు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కోసం దరఖాస్తు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ రెండు ప్రాజెక్టులు ఒకే ప్రాజెక్టుగా ఉండేవి. సీతారామ–సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం డీపీఆర్ కూడా సిద్ధం చేసింది. అయితే ఇప్పుడవి వేర్వేరు ప్రాజెక్టులుగా మారాయి. ప్రతిపాదనలు పరిశీలించి సిఫారసు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సీడబ్ల్యూసీ పరిశీలించి కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని కేంద్ర జలవనరుల శాఖకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కోసం సిఫారసు చేయనుంది. ఈ సిఫారసుల ఆధారంగా ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ విషయంలో జలవనరుల శాఖ నిర్ణయం తీసుకోనుంది. అంతకుముందు ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంత? ఇప్పటివరకు చేసిన ఖర్చు ఎంత? చేయాల్సిన ఖర్చు ఎంత? రాష్ట్ర బడ్జెట్లో ఏటా కేటాయించిన నిధులు ఎంత? వంటి అంశాలను సీడబ్ల్యూసీ పరిశీలించనుంది. ఇతర సాగునీటి ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం పడకుండా ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమేనా? అనే అంశాలనూ సమీక్షించనుంది. మొత్తం 4 ప్రాజెక్టులపై దృష్టి సీతారామతో పాటు మోడికుంటవాగు, చనాకా–కొరాటా, చిన్నకాళేశ్వరం.. మొత్తం 4 ప్రాజెక్టులకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్లు సాధించి పీఎంకేఎస్వై కింద కేంద్ర నిధులు రాబట్టుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే 57 శాతం పనులు పూర్తి గత ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 18వ తేదీన రూ.7,926.14 కోట్ల అంచనాలతో సీతారామ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు ఇవ్వగా, ఆ తర్వాత 2018 ఆగస్టులో రూ.13,057 కోట్లకు అంచనాలను సవరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు ద్వారా 67.05 టీఎంసీల గోదావరి జలాలను తరలించి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో మొత్తం 7.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరుతో పాటు తాగునీరు సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 757 మెగావాట్ల సామర్థ్యంతో 11 పంప్హౌస్లు, 36.57 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో సీతమ్మసాగర్ బరాజ్ను నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తైతే సాగర్, పాలేరు, వైరా ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటి కొరత తీరుతుంది. ఇప్పటివరకు రూ.11,320 కోట్ల వ్యయంతో 57 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ పథకాన్ని 2026 నాటికి పూర్తి చేసి రబీ పంటలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లభిస్తే పీఎంకేఎస్వై కింద కేంద్ర ప్రభుత్వ నిధులను రాబట్టుకుని మిగులు పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. -
జెన్కోకు జీఎస్టీ షాక్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు జీఎస్టీ షాక్ తగలబోతోంది. వస్తు సేవల పన్నుకు సంబంధించి కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం విద్యుత్ ఉత్పత్తి సంస్థలపై ప్రభావం చూపుతోంది. జెన్కో వాడే బొగ్గు ప్రస్తుతం 5 శాతం జీఎస్టీ పరిధిలో ఉంది. కొత్త శ్లాబులు అమలులోకి వస్తే ఇది 18 శాతానికి పెరుగుతుంది. అదనంగా 13 శాతం భారం పడుతుంది. దీనివల్ల ప్రతి టన్ను బొగ్గుపై అదనంగా రూ.630 భారం పడే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ జెన్కో కాకుండా, పలు ప్రైవేటు సంస్థలతో విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇవి కూడా దేశీయ, విదేశీ బొగ్గును కొనుగోలు చేస్తున్నాయి. వీటిపై పడే జీఎస్టీ భారాన్ని విద్యుత్ వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. పెరిగే భారం ఎంత అనేది అధికారులు లెక్కగట్టాల్సి ఉంది. ఈ మొత్తానికి చార్జీలు పెంచుకునేందుకు విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత పెరిగిన బొగ్గు విలువను వార్షిక ఆదాయ, అవసర నివేదికలో పొందుపరుస్తారు. దీన్ని ఈఆర్సీ ఆమోదించిన తర్వాత వచ్చే ఏడాది కొత్త టారిఫ్లలో విద్యుత్ బిల్లుల రూపంలో ప్రజలపై భారం పడే అవకాశం ఉంది. భారం రూ.300 కోట్లపైనే..! టీజీ జెన్కో ప్లాంట్లకు ఏడాదికి 29 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. అయితే, పవన, సౌర విద్యుత్తోపాటు, బహిరంగ మార్కెట్లో చౌకగా విద్యుత్ లభిస్తుండటంతో విద్యుత్ సంస్థలు వాటిని కొనుగోలు చేస్తున్నాయి. దీంతో జెన్కో ప్లాంట్లను బ్యాక్ డౌన్ చేస్తున్నారు. ఏడాది పొడవున గరిష్టంగా 65%ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో పనిచేస్తున్నాయి. దీంతో ఏటా 15 మిలియన్ టన్ను ల వరకు బొగ్గు అవసరం ఉంటోంది. ప్రతి టన్ను బొగ్గును సింగరేణి నుంచి సగటున రూ.5 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. జీఎస్టీ పెరగడం వల్ల అదనంగా టన్నుకు రూ.630 చెల్లించాలి. 15 మిలియన్ టన్నులకు రూ.945 కోట్ల వరకు భారం పడుతుంది. అయితే, బొగ్గుపై కొంత రాయితీ ఇవ్వాలన్నది కేంద్రం నిర్ణయం. ఇది తీసివేసినా ఏడాదికి రూ.300 కోట్ల పైనే భారం పడొచ్చని అంచనా వేస్తున్నారు. పీపీఏలున్న ప్రైవేటు సంస్థలపై పడే జీఎస్టీ భారం మరో రూ.125 కోట్లు ఉండొచ్చని అంచనా. మొత్తంగా రూ.425 కోట్ల మేర భారం ఉండొచ్చని చెబుతున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నాం జీఎస్టీ శ్లాబులు మారడం వల్ల బొగ్గుపై వ్యయం పెరుగుతుంది. ఇది జెన్కోకు ఏమేర భారం కలిగిస్తుందనేది పరిశీలిస్తున్నాం. అధికారికంగా శ్లాబులు అమలులోకి వచ్చిన తర్వాత పెరిగే భారాన్ని విద్యుత్ నియంత్రణ కమిటీకి వివరిస్తాం. కమిషన్ ఆదేశాల మేరకు ముందుకు వెళ్తాం. – హరీశ్, టీజీ జెన్కో సీఎండీ ప్రజలకు ఇది భారమే పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టులపై జీఎస్టీని తగ్గించారు. కొత్తగా వచ్చే వాటికే ఇవి వర్తిస్తాయి. కాబట్టి ప్రస్తుతం ఎలాంటి ఉపయోగం లేదు. మరోవైపు థర్మల్ విద్యుత్ కేంద్రాలు వాడే బొగ్గుపై జీఎస్టీ పెంచారు. సెస్ తగ్గించినా జీఎస్టీ భారమే ఎక్కువ. ఈ భారం మొత్తం ప్రజలపైనే పడుతుంది. రాబోయే కాలంలో విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశం ఉంటుంది. - ఎం వేణుగోపాలరావు, సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వినర్ -
ఇష్టమొచ్చినట్లు ఎఫ్ఐఆర్లా?
సాక్షి, హైదరాబాద్: రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదులతో, సోషల్ మీడియాలో చేసిన విమర్శలు ఆధారంగా చేసుకుని ఇష్టమొచ్చినట్లు కేసులు నమోదు చేయడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పోలీసుల తీరుతో కేసులతో పాటు కోర్టుల్లో పిటిషన్లు పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో విమర్శలు చేసినా.. సంబంధం లేని వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేస్తారా అని నిలదీసింది. కనీస చట్టాలు పట్టించుకోరా?.. సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తారా? అని ప్రశ్నించింది. కేసులు నమోదు చేసే ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సూచనలు తీసుకోవాలని సూచించింది. కేసు నమోదుకు ముందే ప్రాథమిక దర్యాప్తు చేయాలన్న కనీస విధిని మరిచిపోవద్దని హెచ్చరించింది. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన సోషల్ మీడియా పోస్టులను రీ పోస్టు చేసిన దుర్గం శశిధర్గౌడ్ అలియాస్ నల్లబాలుపై పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేస్తూ బుధవారం తీర్పునిచ్చింది. కేసు పూర్వాపరాలు.. సోషల్ మీడియా (ఎక్స్)లో కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నల్లబాలుపై పోలీసులు మూడు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. ‘నో విజన్.. నో మిషన్, ఓన్లీ ట్వంటీ పర్సంట్..’, ‘రాష్ట్రానికి తెగులు–కాంగ్రెస్ కీడు’, ‘సీఎం రేవంత్రెడ్డిది 20 పర్సంట్ కమీషన్ పాలన’, ‘ప్రభుత్వానికి విజన్ లేదు–మిష¯న్ లేదు..’ వంటి పోస్టులకు సంబంధించి ఈ మూడు కేసులు పెట్టారు. నల్ల బాలును అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయన 20 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో రామగుండం, కరీంనగర్, గోదావరిఖని–1 పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ నల్ల బాలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ తుకారాంజీ విచారణ చేపట్టారు. రాజకీయ విమర్శలపై కేసులా?: పిటిషనర్ తరఫు న్యాయవాది పిటిషనర్ తరఫున న్యాయవాది టీవీ రమణరావు వాదనలు వినిపించారు. ‘నల్ల బాలువి క్రిమినల్ చర్యలు కావు. రాజకీయ విమర్శలు. దీనికే హింస, దురుద్దేశం, అల్లర్లు సృష్టించే పోస్టులంటూ రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టించింది. పోలీసులు బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) చట్టంలోని సెక్షన్లు 192, 352, 353 కింద కేసులు నమోదు చేయడం చెల్లదు. ఒకవేళ పిటిషనర్ పెట్టిన పోస్టులతో కీర్తి ప్రతిష్టలు దెబ్బతిన్నాయంటే నేరుగా సీఎం లేదా ఆయన పార్టీ ఫిర్యాదు చేయాలి తప్ప ఇతరులు కాదు. థర్డ్ పార్టీ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్లను నమోదు చేయడం చట్ట విరుద్ధం..’ అని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘నల్ల బాలు ఇలాంటి ఇతర కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. కావాలని సీఎంను కించపరుస్తూ, ప్రజల్లో సీఎంపై ఆగ్రహం కలిగించేలా పోస్టులు పెట్టారు. కేసుల విచారణను కొనసాగించాలి..’ అని కోరారు. కేసుల కొట్టివేత..పోలీసులకు సూచనలు వాదనల అనంతరం నల్ల బాలుపై రామగుండం సీసీపీఎస్, కరీంనగర్ సీసీపీఎస్, రామగుండం జీడీకే–1 స్టేషన్లలో నమోదైన కేసులను న్యాయమూర్తి కొట్టేశారు. ఈ సందర్భంగానే పోలీసుల తీరును ఆయన ప్రశ్నించారు. పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. – పరువు నష్టం కేసులు నమోదు చేసే ముందు ఫిర్యాదుదారుడు చట్టపరంగా బాధిత వ్యక్తేనా?.. అనేది పోలీసులు ధ్రువీకరించుకోవాలి. – కాగ్నిజబుల్ (అరెస్టు చేయదగిన) నేరాల్లో తప్ప ఇతర కేసుల్లో సంబంధం లేని మూడో వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేస్తే అది చెల్లదు. – కాగ్నిజబుల్ కేసుల విషయంలో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయో.. లేదో దర్యాప్తు చేయాలి. – హింస, ద్వేషం, ప్రజల్లో అశాంతిని ప్రేరేపించడానికి సంబంధించి ప్రాథమిక అంశాలు లేనట్లయితే.. ప్రజా శాంతికి ముప్పు, దేశద్రోహం వంటి కేసులను నమోదు చేయవద్దు. – కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసు, శ్రేయ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు పేర్కొన్న సూత్రాలను పాటించాలి – కఠినమైన, అభ్యంతరకరమైన, విమర్శనాత్మక రాజకీయ ప్రసంగానికి సంబంధించిన కేసులను పోలీసులు యాంత్రికంగా నమోదు చేయవద్దు. – ప్రసంగం హింసను ప్రేరేపించేలా లేదా ప్రజా శాంతికి తక్షణ ముప్పుగా ఉన్నప్పుడు మాత్రమే క్రిమినల్ చట్టాన్ని ప్రయోగించాలి. – రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) కింద.. రాజకీయ విమర్శకు రక్షణ ఉంది. – పరువు నష్టం అనేది నాన్ కాగ్నిజబుల్ నేరంగా పరిగణించినప్పుడు పోలీసులు నేరుగా క్రిమినల్ కేసు నమోదు చేయలేరు. – ఫిర్యాదుదారుడిని మెజిస్ట్రేట్ను సంప్రదించమని చెప్పాలి. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 174(2) కింద మేజిస్ట్రేట్ ఆదేశం మేరకు మాత్రమే పోలీసు చర్య తీసుకోవాలి. – ఇష్టారాజ్యంగా, ఆటోమెటిక్గా, మెకానికల్గా అరెస్టులు అనుమతించబడవు. – అర్నేశ్కుమార్ వర్సెస్ బిహార్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విధిగా పాటించాల్సిందే. – ఫిర్యాదు అనవరమైనది, రాజకీయ ప్రేరేపితం అని తేలితే.. దర్యాప్తునకు తగిన కారణాలు లేవంటూ బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 176(1) కింద పోలీసులు దాన్ని మూసివేయాలి. చెంపపెట్టు లాంటి తీర్పు: కేటీఆర్ ‘బీఆర్ఎస్ పార్టీ ట్వీట్లను రీట్వీట్ చేసినందుకు శశిధర్ గౌడ్పై అక్రమ కేసులు నమోదు చేయించిన ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిది. సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పేరుతో ప్రభుత్వాలు అడ్డగోలుగా కేసులు పెడుతున్నాయి. గత 21 నెలలుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై రాజకీయ ప్రేరేపితమైన కేసులు పెట్టి కాంగ్రెస్ వేధిస్తోంది. ఈ వేధింపులు ఇకనైనా ఆపి.. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందుకు నడవాలి. బీఆర్ఎస్ పార్టీ తన కార్యకర్తలకు, కేసీఆర్ నాయకత్వాన్ని తిరిగి తీసుకురావడానికి పోరాడుతున్న వారికి ఎప్పుడూ అండగా ఉంటుంది..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. -
కాలేజీకి వస్తేనే ఫీజు?
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ను ఎత్తివేసే ప్రసక్తే లేదని చెబుతున్న ప్రభుత్వం.. చడీచప్పుడు లేకుండా ఆ పథకంలో కోతలు వేసే దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై గత నెల 21వ తేదీన ‘సాక్షి’కథనం ప్రచురించగా, ప్రభుత్వం స్పందించి ‘అబ్బే అలాంటిదేమీ లేదు.. నిరాధార వార్త’అంటూ కొట్టిపారేసింది. కానీ వచ్చే శుక్రవారం అన్ని విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్లతో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఫేషియల్ రికగ్నిషన్ గుర్తింపు హాజరును ఫీజు రీయింబర్స్మెంట్కు ఎలా లింక్ చేయాలి, ఎలా తప్పనిసరి చేయాలి? అనే అంశాన్ని భేటీ ఎజెండాలో ప్రధానంగా చేర్చారు. కొత్తగా కాలేజీలకు డిజీ లాకర్ను తీసుకొస్తున్నారు. ఇందులో ఫ్యాకల్టీ, విద్యార్థుల హాజరు శాతం నమోదు అవుతుంది. విద్యార్థుల హాజరు కనీసం 75 శాతం లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇటీవల అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి సూచనలు చేసినట్టు తెలిసింది. దీనికి అనుగుణంగానే వీసీల సమావేశంలో ఫీజు రీయింబర్స్మెంట్ కోతపై వ్యూహ రచన చేయబోతున్నట్టు సమాచారం. ముందు హాజరు.. తర్వాత మార్కులు ప్రస్తుతానికి ముఖ గుర్తింపు హాజరు విధానం ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ను ఫిల్టర్ చేయాలని భావిస్తున్నారు. ఈ దశలో విద్యార్థుల నుంచి అభ్యంతరాలు రాకపోతే తర్వాత దశలకు వెళ్లే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. ఇంజనీరింగ్, డిగ్రీ మొదలుకొని అన్ని సాంకేతిక, సాధారణ కోర్సుల్లో ఒక సంవత్సరంలో 50 శాతం సబ్జెక్టులు పాసవ్వడంతో పాటు, 75 శాతం హాజరు ఉండాలన్న కొత్త నిబంధన తీసుకురావాలన్నది ముఖ్యమంత్రి సూచనగా చెబుతున్నారు. సాంకేతిక విద్యలో కోర్సులోని ప్రధాన సబ్జెక్టులో విద్యార్థి కనీసం 60 శాతం మార్కులు తెచ్చుకుంటేనే రీయింబర్స్మెంట్ అమలు చేయాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్టు తెలిసింది. ఉదాహరణకు సీఎస్ఈ ఎమర్జింగ్ కోర్సు తీసుకున్న విద్యార్థి డేటాసైన్స్ సబ్జెక్టులో 60 శాతం మార్కులు తెచ్చుకుని తీరాలి. అదే విధంగా బీకాంలో కామర్స్ సబ్జెక్టులో మంచి మార్కులు రావాల్సి ఉంటుంది. అధికారుల అంతర్మథనం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా అనేక మంది పేదలు ఉన్నత చదువులకు వెళ్లారు. తర్వాత ప్రభుత్వాలు ఈ పథకంలో మార్పులు తెచ్చేందుకు సాహసించలేదు. ఈ నేపథ్యంలో పథకంలో కోతకు అడుగులు వేయాల్సి రావడంపై అధికారులు మథనపడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రస్తుతం దాదాపు రూ.8 వేల కోట్ల వరకు పేరుకు పోయాయి. వీటిని రాబట్టుకునేందుకు కాలేజీలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. భారీగానే కోతరాష్ట్రంలో ఏటా 12.50 లక్షల మంది ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్నారు. ఇందులో 5 లక్షల మంది కొత్తవాళ్లు ఉంటారు. అన్ని కోర్సులకు కలిపి ఏటా రూ.2,350 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్గా ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఎంత ర్యాంకు వచ్చినా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది. బీసీలకు మాత్రం 10 వేల లోపు ర్యాంకు వస్తేనే ఇంజనీరింగ్లో మొత్తం ఫీజు చెల్లిస్తారు. ఆపై ర్యాంకులకు రూ.35 వేలు మాత్రమే ఇస్తారు. మొదటి ఏడాదిలో 50 శాతం సబ్జెక్టులు ఉత్తీర్ణులు అవ్వని విద్యార్థులు దాదాపు 50 శాతం మంది ఉంటున్నారు. ఉన్నత విద్యలో కొత్తగా ప్రవేశించడం, భయం వల్ల వారికి తక్కువ మార్కులు వస్తున్నాయి. కాలేజీల్లో ఫ్యాకల్టీ లేకపోవడం, కాలేజీకి వచ్చినా తరగతులు జరగకపోవడంతో విద్యార్థులు ఆన్లైన్ బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో హాజరును కొలమానంగా తీసుకుంటే చాలామంది విద్యార్థులకు అసౌకర్యం తప్పదని అధికారులే చెబుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్లో కోత వల్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంటున్నారు. -
బోధన్లో ఉగ్రకలకలం
సాక్షి,బోధన్: నిజామాబాద్లో ఉగ్ర కలకలం రేపుతోంది. బోధన్ పట్టణంలో మహమ్మద్ ఉజైఫా యమాన్ అనే అనుమానిత ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.ఇటీవల ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా కేంద్రదర్యాప్తు సంస్థలు ఐసిస్తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో రాంచీలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్న హషన్ డ్యానిష్ను అరెస్ట్ చేశాయి. అయితే డ్యానిష్ ఇచ్చిన సమాచారంతో నిజామాబాద్ జిల్లా బోధన్లో ఐసిస్తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న హుజైఫా ఎమన్ను అదుపులోకి తీసుకున్నారు. బోధన్ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం పీటీ వారెంట్పై ఢిల్లీకి తరలించారు. నిందితుడి నుంచి ఎయిర్ పిస్తోల్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కాగా, యామన్.. బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్నట్లు ఎన్ఐఏ సోదాల్లో తేలింది. -
కూకట్పల్లిలో దారుణం.. అపార్ట్మెంట్లో మహిళ హత్య
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో దారుణం జరిగింది. రేణు అగర్వాల్(50) అనే మహిళ హత్యకు గురయ్యారు. కాళ్లు, చేతులు కట్టేసిన దుండగులు.. ఆ మహిళను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు.ఇంట్లో పనిచేసే వ్యక్తులే చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బీజేపీపై ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వికారాబాద్: బీజేపీలో కొంత మంది తనను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని.. ఆ పార్టీలో తప్పులు జరుగుతున్నాయి కాబట్టే రాజీనామా చేశానంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని అందుకే పార్టీకి రాజీనామా ఇచ్చానన్న రాజాసింగ్.. కొన్నిసార్లు తనను ఢిల్లీ పిలిచి వార్నింగ్ కూడా ఇప్పించారన్నారు. ‘‘బీజేపీ స్టేట్ కమిటీలో 10 నుంచి 12 మంది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పదవులు ఇచ్చారు. జిల్లాలో ఉండే కార్యకర్తకు పదవులు ఇవ్వాలని నేను ప్రతిపాదించాను. బీజేపీ రాష్ట్ర కమిటీ రామచందర్ రావు వేశారా? కిషన్ రెడ్డి వేశారా?. బీజేపీ రాష్ట్ర కమిటీతో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా?’’ అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు.‘‘బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్టీని సర్వ నాశనం చేసేందుకు కమిటీ వేసినట్లు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర కమిటీపై బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సంతృప్తిగా లేరు. బీజేపీ కార్యకర్తలను పక్కన పెడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని దెబ్బతీస్తున్నారు. రామచందర్ రావు మంచి మనిషి.. కానీ రబ్బర్ స్టాంప్’’ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.‘‘బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అశోక్ మాట్లాడిన తీరు బాగాలేదు. ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వేముల అశోక్ డబ్బులు వసూలు చేశారు. బీజేపీ కార్యకర్తలే నాలుగో సారి కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తారు. నా కార్యకర్తల కోసం మాట్లాడుతున్నా. బీజేపీనీ పండబెట్టారు. పార్టీ కోసం కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా లేరు. నేను రాజీనామా చేయను.. పీక్కొండి’’ అంటూ రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘‘మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాకు పార్టీలో మర్యాద దక్కలేదు. కార్యకర్తల్లో పనిచేసేవారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. ఢిల్లీ నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నా. ఎన్నికల్లో పార్టీ సపోర్ట్ చేయలేదు. కార్యకర్తలకు అనుకూలంగా నేను మాట్లాడతా. అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు 15 మందిని తీసుకువస్తే వాళ్లను దాచిపెట్టారు. వెనక ఉన్న వాళ్ళు బయటకు రండి. తెలంగాణలో ఈ కమిటీతో బీజేపీ అధికారంలోకి రాదు’’ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. -
హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. అకస్మాత్తుగా భారీ వర్షం మొదలైంది. నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో వర్షం పడుతోంది. గచ్చిబౌలి, కొండాపూర్, షేక్పేటలో కుండపోత వర్షం కురిసింది.తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కొన్ని చోట్ల కుండపోత వర్షం కురిసింది. సెప్టెంబర్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావడంతో పాటు.. వర్షపాతం కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని ఐఎండీ వెల్లడించింది. కామారెడ్డి, జనగామ, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం అసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ అభ్యర్థి ఫిక్స్?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ తరఫున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. తాజాగా బీఆర్ఎస్ కార్యకర్త సమావేశంలో కేటీఆర్ సహా సునీత పాల్గొన్నారు.తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాగంటి గోపీనాథ్ సతీమణి.. మాగంటి సునీత పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా ఆమె పేరును ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ ఇంచార్జ్లను నియమించింది. కార్యకర్తలకు కేటీఆర్.. దిశానిర్దేశం చేస్తున్నారు. -
రూ.4 లక్షలు తీసుకుంటూ ఏసీబీ చిక్కిన మణిహారిక
మణికొండ (హైదరాబాద్): ఓపెన్ ప్లాట్కు ఎల్ఆర్ఎస్ ధ్రువపత్రం ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఓ అధికారిణి ఏసీబీ వలకు చిక్కారు. రూ.5 లక్షలు డిమాండ్ చేసి రూ. 4 లక్షలు తీసుకుంటూ మంగళవారం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయంలో టీపీవోగా పనిచేస్తున్న మణిహారిక మంచిరేవులలోని వినోద్కు చెందిన ఓపెన్ ప్లాట్కు ఎల్ఆర్ఎస్ ఇచ్చేందుకు రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో 4 లక్షలకు బేరం కుదిరింది. ప్రభుత్వానికి ఫీజు చెల్లిస్తే ఉచితంగా చేయాల్సిన పనికి లంచం డిమాండ్ చేయటంతో వినోద్ తమను వారం రోజుల క్రితం సంప్రదించాడని శ్రీధర్ తెలిపారు. తమ సూచన మేరకు తను ఇస్తానన్న డబ్బును మంగళవారం నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చి ఆమెకు ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగి డబ్బును స్వా«దీనం చేసుకుని మణిహారికను అరెస్టు చేశామన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధి అలకాపూర్ టౌన్షిప్లోని ఆమె నివాసంలోనూ తనిఖీలు చేశామని చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఎవరు లంచం డిమాండ్ చేసినా తమ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
నైపుణ్య శిక్షణతో విదేశాల్లోను ఉపాధి కల్పిస్తున్నాం
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ పథకం కింద శిక్షణ పొందిన 18 మంది ఎలక్ట్రీషియన్లు జర్మనీలో ఉద్యోగానికి ఎంపికయ్యారని కార్మిక, ఉపాధికల్పన శాఖా మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంగళవారం సచివాలయంలో జర్మనీలో ఉద్యోగం చేయడానికి ఎంపికైన 18 మంది ఎలక్ట్రీషియన్లకు ఆయన ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇండో యూరో సింక్రనైజేషన్(ఐఈఎస్) సంస్థ వీరికి ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చారని ఈ శిక్షణ పూర్తి చేసుకొని అన్ని పరీక్షల్లో నెగ్గిన వీరు జర్మనీలో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇతర దేశాల్లో సైతం మన యువత పనిచేసేలా వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్నదని అన్నారు. వీరు నెలకు రూ. 2.6 లక్షల వేతన ప్యాకేజీని పొందనున్నారని తెలిపారు ఈ పథకం ద్వారా ఇక్కడి వారి కుటుంబాలు ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయని అన్నారు. త్వరలోనే ఇండో యూరో సింక్రనైజ్ సంస్థ కార్యకలాపాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేస్తామని గ్రామీణ ప్రాంతల్లో యువతకు నైపుణ్య శిక్షణ పెంచేందుకు పలు కార్యక్రమాలు క్యాంపులు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, ఇండో యూరో సింక్రనైజేషన్ సీఈవో డాక్టర్ బంగారు రాజు తదితరులు పాల్గొన్నారు. -
సన్నగా బియ్యం.. తిన్నగా నల్లబజార్కు!
పాతబస్తీకి చెందిన మహమూద్కు కొత్త రేషన్ కార్డు మంజూరైంది. సెప్టెంబర్ నెలవారీ రేషన్ కోటా విడుదలైంది. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ జరుగుతుండటంతో కోటా డ్రా చేసి తెచ్చుకునేందుకు డీలర్ వద్దకు హుషారుగా వెళ్లాడు. కార్డు నెంబర్ చెప్పి ఈ–పాస్ యంత్రంపై బయోమెట్రిక్ పెట్టాడు. కార్డులో నలుగురు సభ్యులు ఉండటంతో 24 కిలోల బియ్యంపై తీసుకొవచ్చని భావించాడు. కానీ, డీలరు అందరి మాదిరిగానే నగదు కావాలా? బియ్యం కావాలా? అడిగాడు. అలోచిస్తున్న లోపే ‘బియ్యం వండుకొని తినలేరు. ముద్దముద్ద అవుతుంది. వృథా ఎందుకు? నగదు తీసుకోండి’అంటూ కిలోకు రూ.12ల చొప్పున లెక్కకట్టి రూ.288 చేతిలో పెట్టాడు. నెలవారీ కోటా డ్రా కోసం వచ్చిన మిగతా కార్డుదారుల్లో మెజార్టీ పరిస్థితి ఇదే. చేసేదేమీ లేక చేతిలో పెట్టిన నగదును జేబులో పెట్టుకొని ఇంటిముఖం పట్టక తప్పడంలేదు. ఇలాంటి ఉదంతాలు ప్రతిరేషన్ షాపులో నిత్యకృత్యం.సాక్షి, హైదరబాద్: ఇది రేషన్ బియ్యం కథ.. బియ్యం మారినా డీలర్ల తీరు మారలేదు. అదే చేతివాటం.. అదే తప్పుదారి.. సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న ‘ఉచిత సన్న బియ్యం’నగదు దందా బాహాటంగా కొనసాగుతోంది. ఆహార భద్రత (రేషన్) కార్డుదారులు సన్న బియ్యంపై కూడా అనాసక్తి కనబర్చడం డీలర్లకు కలిసివస్తోంది. కొందరు కార్డుదారులు ఈ–పాస్ యంత్రంపై బయోమెట్రిక్ (వేలిముద్ర) పెట్టి నెలవారీ బియ్యం కోటాను డీల్లకు అప్పగించి నగదు పుచ్చుకోవడం, డీలర్లు కూడా కిలో ఒక్కంటికి రూ.12ల చొప్పున లెక్క కట్టి నగదు అందించడం సర్వసాధారణమైంది. సన్నబియ్యంపై కూడా.. పూట గడవని అత్యంత నిరుపేద కుటుంబాలు మినహా మిగతా కుటుంబాలు పీడీఎస్ బియ్యం వండుకొని తినడానికి పెద్దగా ఆసక్తి కనబర్చరు. మొన్నటి వరకు బియ్యం దొడ్డుగా, నాసిరకం, ముక్కి పోయి ఉండటం, వండి తిన్న తర్వాత జీర్ణం కాకపోవడం లాంటి కారణాలతో పెద్దగా ఆసక్తి కనబర్చేవారు కాదు. కొన్ని కుటుంబాలు మాత్రం రేషన్ బియ్యాన్ని కేవలం ఇడ్లీ, దశలు, పిండి వంటలకు వినియోగిస్తున్నారు. ప్రతినెలా ఉచితంగా అందుతుండటం, అవసరానికి మించి వస్తుండటంతో డీలర్లకు అప్పగిస్తూ వచ్చేవారు. తాజాగా సన్నబియ్యం పంపిణీ జరుగుతున్నా లబి్ధదారులను డీలర్లు తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక యూనిట్ బియ్యమే... కొందరు కార్డుదారులు తమ నెలవారీ కోటాలో ఒక యూనిట్ బియ్యమే తీసుకొని మిగతా యూనిట్ల కోటాను డీలర్ల వద్ద నగదు రూపంలో బదిలీ చేసుకుంటున్నారు. వాస్తవంగా ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో ఈ–పాస్ (బయోమెట్రిక్) అమలు కంటే ముందు రేషన్ డీలర్లు చేతివాటం ప్రదర్శించి డ్రా చేయని లబి్ధదారుల సబ్సిడీ సరుకులు గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకునేవారు. సంస్కరణలో భాగంగా ఈ– పాస్ అమలుతో లబ్ధిదారులు బయోమెట్రిక్, ఐరిస్, ఓటీపీ తప్పనిసరి కావడంతో డీలర్లు లబి్ధదారుల ప్రమేయంతో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యం పీడీఎస్ బియ్యం అక్రమ దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అడపాదడప విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసుల దాడుల్లో పీడీఎస్ బియ్యం క్వింటాళ్ల కొద్దీ పట్టుబడుతోంది. స్పెషల్ డ్రెవ్ సమయంలో బియ్యం వ్యాపారులు ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్గా.. మౌనం దాల్చుతున్నారు. అ తర్వాత తిరిగి దందాను కొనసాగించడం సర్వసాధారణంగా మారింది. -
అభివృద్ధికి కొత్త ‘దారులు’
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో రహదారి నెట్వర్క్ విస్తరణ, విద్యాభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర మంత్రులు నితిన్గడ్కరీ, నిర్మలా సీతారామన్ను మంగళవారం ఆయన వేర్వేరుగా కలిసి ఈ అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. హైదరాబాద్ సమీపంలోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా బందరు ఓడరేవు వరకు 12 వరుసల రహదారి నిర్మించాలని నితిన్ గడ్కరీని కోరారు. ఈ ప్రతిపాదిత మార్గంలో 118 కిలోమీటర్లు తెలంగాణ పరిధిలో ఉంటుందని సీఎం వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) పనులను వేగవంతం చేయాలని కోరారు. శ్రీశైలానికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మించండి హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వెళ్లే మార్గంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా మన్ననూర్–శ్రీశైలం మధ్య నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని సీఎం రేవంత్ ప్రతిపాదించారు. దీనితో పాటు రావిర్యాల–ఆమన్గల్–మన్ననూర్ మార్గాన్ని నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిగా, రద్దీ అధికంగా ఉన్న రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్–మంచిర్యాల మధ్య కొత్త గ్రీన్ఫీల్డ్ రహదారిని మంజూరు చేయాలని కోరారు. సీఎం విజ్ఞప్తులపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సీఆర్ఐఎఫ్ కింద ప్రతిపాదించిన రూ.868 కోట్ల పనులకు వారంలోగా అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. బందరు పోర్టుకు గ్రీన్ఫీల్డ్ రహదారిపై ఈ నెల 22న హైదరాబాద్లో ఎన్హెచ్, ఎన్హెచ్ఏఐ అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రూ.30 వేల కోట్లతో విద్యా ప్రణాళిక తెలంగాణలో విద్యా రంగాన్ని సమూలంగా మార్చేందుకు తమ ప్రభుత్వం రూ.30 వేల కోట్లతో ప్రణాళిక రూపొందించిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు రేవంత్రెడ్డి వివరించారు. మంగళవారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో ఆమెను కలిసి.. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కూళ్ల ఏర్పాటు, ఇతర విద్యా సంస్థల అభివృద్ధికి ఉద్దేశించిన రూ.30 వేల కోట్ల ప్రణాళికకు అనుమతులివ్వాలని కోరారు. 105 నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో పాఠశాలలో 2,560 మంది చొప్పున సుమారు 2.70 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని వివరించారు. ఈ స్కూళ్లకు రూ.21 వేల కోట్లు, ఇతర ఉన్నత విద్యాసంస్థల అభివృద్ధికి రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. నిధుల సమీకరణకు ఏర్పాటు చేసే ప్రత్యేక కార్పొరేషన్కు అనుమతి ఇవ్వడంతో పాటు ఎఫ్ఆర్బీఎం పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం కోరారు. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు చేసిన అప్పుల రీస్ట్రక్చర్కు అనుమతించాలని విన్నవించారు. సీఎం విజ్ఞప్తులపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సీఎం వెంట ఎంపీలు రేణుకా చౌదరి, మల్లు రవి, పోరిక బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురాంరెడ్డి, చామల కిరణ్కుమార్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
లాభాలుండవ్.. లాసే
హైదరాబాద్కు చెందిన ఒకరు వాట్సాప్ ద్వారా ‘బజాజ్ ఫైనాన్షియల్సెక్యూరిటీస్ లిమిటెడ్’అనే పేరుతో ఉన్న నకిలీ గ్రూప్లో చేరాడు. ఈ గ్రూప్ మార్కెట్ ట్రెండ్స్, బ్లాక్ ట్రేడ్స్, ఐపీఓలపై అప్డేట్స్ ఇచ్చేది. గ్రూప్ అడ్మిన్ పురవ్ ఝవేరి, అతని సహాయకురాలు ప్రిషాసింగ్ బాధితుడిని ఒక నకిలీ యాప్లో ఇన్వెస్ట్ చేయమని ప్రోత్సహించారు. దీంతో బాధితుడు మే 30 నుంచి జూలై 9, 2025 మధ్య రూ.3.24 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు. డబ్బులు విత్డ్రాకు వీలుకాకపోవడంతో టీజీసీఎస్బీ ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో టీజీసీఎస్బీకి అధికారులు మహ్మద్ రజియుద్దీన్, మహ్మద్ వలియుల్లా, మహ్మద్ జుబైర్ఖాన్లను అరెస్టు చేశారు. హైదరాబాద్కు చెందిన 49 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్టెలిగ్రామ్ గ్రూప్లో చేరగా, ఒక మహిళ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి సలహాలు ఇవ్వగా, ఒక నకిలీ వెబ్సైట్లో ఇన్వెస్ట్ చేశాడు. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి 20వ తేదీ వరకు రూ.3.30 కోట్లు అందులో పెట్టాడు. విత్డ్రా చేయడానికి ప్రయతి్నంచగా, 10 శాతం కమీషన్, ట్యాక్స్ చెల్లించమని కోరడంతో ఇది స్కామ్ అని గుర్తించి టీజీసీఎస్బీకి ఫిర్యాదు చేశాడు. తాజాగా ఆదివారం (సెప్టెంబర్ 7) నమోదైన కేసులో యూసుఫ్గూడకు చెందిన వ్యక్తి రూ.28.76 లక్షలు ఈ తరహా మోసంలో పోగొట్టుకున్నాడు. ఫేస్బుక్లో పరిచయమైన గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సలహాలతో ఓ వాట్సాప్ గ్రూప్లో చేరాడు. ట్రేడింగ్ ఐపీఓల పేరిట పెట్టుబడి పెట్టేలా చేశారు. మొదట లాభాలు వచి్చనట్టు చూపి తర్వాత డబ్బులు విత్డ్రాకు అవకాశం ఇవ్వలేదు. సాక్షి, హైదరాబాద్: అధిక లాభాల ఆశే కొందరి కొంప ముంచుతోంది. ఈ బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. పెట్టిన పెట్టుబడికి పదుల రెట్లలో లాభాలు వస్తాయని ఆశపెట్టి అందినకాడికి దండుకుంటున్నారు. సాధారణానికి భిన్నంగా తక్కు వ సమయంలోనే అనూహ్య లాభాలు వస్తాయని ఎవరైనా చెబితే అవి పక్కా మోసమే అన్న చిన్న లాజిక్ మిస్సవుతున్న ఎంతోమంది సైబర్ నేరగాళ్లకు రూ.కోట్లు సమర్పించుకుంటున్నారు. ఇటీవల తెలంగాణలో ఈ తరహా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులు పెరిగినట్టు టీజీ సైబ ర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తెలిపారు. ఈ ఏడాది లో ఆగస్టు 31 వరకు చూస్తే ఈ తరహా కేసులు 17,169 నమోదైనట్టు టీజీసీఎస్బీ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇలా మోసం చేస్తున్నారు... సైబర్ కేటుగాళ్లు అధునాతన వ్యూహాలను ఉపయోగిస్తున్నారు. ఫిషింగ్, సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్లు వాడుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ వేదికల్లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, తద్వారా భారీ లాభాలు పొందే అవకాశాల గురించి మెసేజ్లు పంపుతారు. అందులో లింక్లపై ఎవరైనా క్లిక్ చేస్తే వారికి ఆన్లైన్ పెట్టుబడుల అంశాలపై సలహాలు ఇస్తూ...నమ్మకం పెంచుతారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని ఆశ కల్పిస్తారు. అవతలి వ్యక్తి తమను నమ్ముతున్నట్టు గుర్తిస్తే వెంటనే వాట్సాప్ గ్రూప్లలో యాడ్ చేయడం..తాము సూచించిన యాప్లలో పెట్టుబడి పెట్టాలని క్రమంగా ఒత్తి్తడి చేస్తారు. తొలుత లాభాలు వచ్చినట్టుగా నకిలీ మెసేజ్లు చూపుతారు. ఇలా రూ.లక్షల నుంచి మొదలై రూ.కోట్ల వరకు డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి » తక్కువ సమయంలో అధిక లాభాలు అంటూఊదరగొడుతున్నారంటే అది మోసమని గ్రహించాలి. » వాట్సాప్, ఫేస్బుక్లో వచ్చే ఎస్ఎంఎస్లలో ఉండే లింక్లపైక్లిక్ చేసి వారిచ్చిన యాప్లలో పెట్టుబడి పెట్టొద్దు. » మీరు పెట్టుబడి పెట్టే ముందు చట్టబద్ధత ఉందా లేదానిర్ధారించుకోవాలి. షేర్లలో పెట్టుబడి డీమాట్ అకౌంట్స్ ద్వారానే జరుగుతుందని మరవొద్దు. అధిక లాభాల ప్రకటనలతోజాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియా ద్వారా వచ్చే పెట్టుబడి టిప్స్,లింక్లను నమ్మి తెలియని యాప్లు లేదావెబ్సైట్లలో పెట్టుబడి పెట్టి మోసపోవొద్దు. అధిక లాభాల ప్రకటనలతో జాగ్రత్తగా ఉండండి.మీ డబ్బులు సురక్షితంగా ఉంచుకోండి – శిఖాగోయల్, డైరెక్టర్, టీజీ సీఎస్బీ -
గ్రూప్1 అర్హుల గుండె చెదిరింది!
సాక్షి, హైదరాబాద్/చిక్కడపల్లి: రాష్ట్ర ప్రభుత్వశాఖ ల్లో గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ఆనందం ఆవిరైంది. తుది జాబితాలో అర్హత సాధించి ధ్రువపత్రాల పరిశీలన సైతం పూర్తి చేసుకుని నియామక పత్రాలు తీసుకోవల్సిన సమయంలో.. అర్హుల జాబితాను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వారికి శరాఘాతంలా తగిలింది. మెయిన్స్ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం తిరిగి నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించడంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో పడ్డారు. రీవాల్యుయేషన్ తర్వాత తమ పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. రీవాల్యూయేషన్కు హైకోర్టు 8 నెలల గడువు ఇవ్వడంతో కింకర్తవ్యం ఏమిటనే దానిపై టీజీపీఎస్సీ ఆలోచనలో పడింది. ఇలావుండగా..పరీక్షలు బాగా రాసినప్పటికీ ఆశించినవిధంగా ఫలితాలు రాలేదని భావిస్తున్న కొంతమంది అభ్యర్థులు మాత్రం హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు. ఎన్నెన్నో అడ్డంకులు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా 2022 ఏప్రిల్ 26న 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం గ్రూప్–1 నియామకాల ప్రక్రియలో ఉన్న ఇంటర్వ్యూలను రద్దు చేసింది. 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కొందరు ఆశావహులు అప్పటివరకు తాము చేస్తున్న చిన్నపాటి ఉద్యోగాలకు రాజీనామా చేసి పరీక్షలకు సిద్ధమయ్యారు. మరికొందరు దీర్ఘకాలిక సెలవులు పెట్టారు. 2022 అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. అదే ఏడాది చివర్లో 1:50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. » 2023 ఆగస్టులో మెయిన్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. అభ్యర్థులు కఠోర దీక్షతో సన్నద్ధతకు ఉపక్రమించారు. ఇంతలో టీజీపీఎస్సీలో పలు అర్హత పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూసింది. ఇందులో భాగంగా గ్రూప్–1 ప్రశ్నపత్రాలు సైతం బయటకు వెళ్లాయని విచారణలో తేలడంతో గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షను కమిషన్ రద్దు చేసింది. » 2023 జూన్ 11న టీజీపీఎస్సీ మరోమారు ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. అయితే ఈ పరీక్షల నిర్వహణ తీరుపై క్షేత్రస్థాయిలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు.. పరీక్ష నిర్వహణలో లోపాలు జరిగాయని నిర్ధారిస్తూ పరీక్షను రద్దు చేయాలని తీర్పు ఇచ్చింది. » టీజీపీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ.. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడం, కొ త్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, టీజీపీఎస్సీ ప్రక్షాళన, కొత్త కమిషన్ ఏర్పాటు, కొత్తగా మ రో 60 గ్రూప్–1 ఉద్యోగ ఖాళీలను గుర్తింపు చ కచకా జరిగిపోయాయి. 2022 ఏప్రిల్లో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసిన టీజీపీఎస్సీ.. 2024 ఫిబ్రవరిలో 563 ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 4,03,645 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. » 2024 జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ ఆధారిత పద్ధతిలో నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను జూలై 7న టీజీపీఎస్సీ విడుదల చేసింది. 31,383 మంది మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. వీరితో పాటు మరో 20 మందిని కోర్టు ఉత్తర్వుల ద్వారా అనుమతించారు. » అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 31,403 మంది అభ్యర్థుల్లో 21093 మంది మాత్రమే అన్ని పరీక్షలూ రాశారు. 2025 మార్చి 10వ తేదీన అభ్యర్థుల ప్రొవిజినల్ మార్కుల జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మార్చి 30వ తేదీన జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేసింది. » ఏప్రిల్ 10వ తేదీన 563 గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. ఏప్రిల్ 16 నుంచి 22 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా చేపట్టింది. అయితే గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ వివిధ కేటగిరీలకు చెందిన పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో నియామకాలకు బ్రేక్ పడింది. రీవాల్యుయేషనా? మళ్లీ పరీక్షలా? తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎంపికైన అభ్యర్థులతో పాటు నిరుద్యోగ వర్గాల్లో చర్చోపచర్చలకు తెర లేపింది. మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం మళ్లీ జరుపుతారా? లేక తిరిగి పరీక్షలు నిర్వహిస్తారా? అనే చర్చ జరుగుతోంది. అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నియామక పత్రాలు అందుకోవాల్సి ఉండగా.. రీవాల్యుయేషన్ లేదా మళ్లీ పరీక్షలంటూ తీర్పు రావడంతో మూడున్నరేళ్లు పడిన శ్రమను తలచుకుంటూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాగా హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీల్కు వెళ్లాలని టీజీపీఎస్సీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నెలల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి చదివిన అభ్యర్ధులు హైకోర్టు తీర్పుతో ఆందోళనకు గురవుతుంటే.. మెయిన్స్లో విఫలమైన కొంతమంది న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నారు. మంగళవారం అశోక్నగర్, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, పలు శిక్షణా కేంద్రాల్లో హైకోర్టు తీర్పు చర్చనీయాంశం అయ్యింది. ఆర్థికంగా పెను భారం కోచింగ్లు, మెటీరియల్, తదితర ఖర్చులు ఇప్పటికే తడిసి మోపెడయ్యాయి.మరోసారి పరీక్షలు రాయవలసి వస్తే మాత్రం ప్రతి పేద అభ్యర్థిపై పెను భారం పడుతుంది. – వై.క్రాంతికుమార్, గ్రూప్–1 అభ్యర్థి మళ్లీ పరీక్షలు నిర్వహించాల్సిందే హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ప్రభు త్వం మళ్లీ ఎగ్జామ్స్ నిర్వహించాలి. తెలుగు మీడియం అభ్యర్థులకు గతంలో ఎంతో నష్టం జరిగింది. మరోసారి పరీక్షలు నిర్వహించడం వల్ల వీరికి న్యాయం జరిగే అవకాశం ఉంది. – సలీమ్, గ్రూప్–1 అభ్యర్థికోచింగ్ కేంద్రాల దోపిడీకి మళ్లీ అవకాశం కోచింగ్ సెంటర్లు మరోసారి దోపిడీకి పాల్పడే అవకాశం ఉంది. ఇప్పటికే అశోక్నగర్ కోచింగ్ కేంద్రాల మాఫియాకు అడ్డాగా మారింది. హాస్టళ్లు, మెస్లు, స్టడీ హాళ్లు, కోచింగ్ కేంద్రాలు అభ్యర్థులను పెద్ద ఎత్తున దోచుకుంటున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. – బి.చంద్రకాంత్, రాష్ట్ర సహ కనీ్వనర్, లా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా -
పీసీసీ అధ్యక్షుడే అప్రూవర్గా మారారు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘ఆ పది మంది ఎమ్మెల్యేలు మా పార్టీ లో చేరారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ మొన్న టీవీల్లో చెప్పారు. ఆయనే అప్రూవర్గా మారి.. నేరాంగీకారం తెలిపిన తర్వాత విచారణ ఎందుకు? చర్చ ఎందుకు? వారిపై వేటు వేసేందుకు స్పీకర్కు మొహమాటం ఎందుకు?’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) ప్రశ్నించారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి భార్య శ్వేతారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన మాజీ మంత్రి హరీశ్రావుతో కలిసి నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని ఆవంచ గ్రామానికి వచ్చారు. శ్వేతారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. హరీశ్రావు తిరిగి హైదరాబాద్కు పయనమైన అనంతరం కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ మారిన వారు ఏ పార్టీ లో ఉన్నారో చెప్పుకోలేని దురవస్థలో ఉన్నారన్నారు. స్పీకర్ నిర్ణయంలో తేడా ఉంటే.. టీపీసీసీ అధ్యక్షుడు మాట్లాడింది సుప్రీంకోర్టు ముందు పెడతామని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధికోసమే ‘మేడిగడ్డ’.. కాళేశ్వరం ప్రాజెక్ట్లో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ నాయకులు కావాలనే దు్రష్పచారం చేస్తున్నారని.. రాజకీయ కక్షతో కేసీఆర్పై కేసు పెట్టేందుకు యత్నిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రాజెక్ట్కు ఖర్చు చేసిందే రూ.94 వేల కోట్లు అని.. ఈ విషయాన్ని సీఎం రేవంత్ మామ పద్మారెడ్డి క్లియర్గా చెప్పారని.. అలాంటప్పుడు లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. మేడిగడ్డలో 85 పిల్లర్లలో రెండు కుంగిపోతే అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించి.. రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ‘ఫార్ములా– ఈ’ ఓ లొట్టపీసు కేసు.. ‘నేను మళ్లీ చెప్తున్నా.. ఫార్ములా–ఈ ఒక లొట్టపీసు కేసు. ఈ అంశంలో ఎవరైనా వచ్చి నన్ను లై డిటెక్టర్ పరీక్ష చేసుకోవచ్చు’అని కేటీఆర్ సవాలు చేశారు. హైదరాబాద్కి ఫార్ములా– ఈ రేసును తీసుకురావడానికి తాను ప్రయత్నాలు చేశానని చెప్పారు. రేసు నిర్వహణ కోసం ప్రభుత్వం నుంచి రూ.46 కోట్లు ఇవ్వాలని తానే ఆదేశాలు ఇచ్చానని, డబ్బులు కూడా నిర్దేశిత ఖాతాలోకే చేరాయన్నారు. మంగళవారం నందినగర్ నివాసంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రతి రూపాయికి లెక్క ఉంది. ప్రాసిక్యూషన్ చేసినా, చార్జిషీట్లు వేసినా ఏమీ చేయలేరు’అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
ఫార్ములా ఈ– కారు రేసుపై ఏసీబీ నివేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ–కారు రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిధుల బదలాయింపులో తీవ్ర ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని, హెచ్ఎండీఏ నిధులు దురి్వనియోగం అయ్యాయని అవినీతి నిరోధక శాఖ తేల్చినట్టు తెలిసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలాంటి అనుమతులు లేకుండా, సంబంధం లేని విభాగం నుంచి నిధులను ఫార్ములా ఈ– కారు రేసుకు బదిలీ చేయడం వెనుక క్విడ్ ప్రో కో జరిగినట్టు అవినీతి నిరోధక శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. రూ.55 కోట్ల హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ తుది నివేదిక అందించింది. ఈ కేసులో విధానపరమైన లోపాలు ఉన్నాయని వెల్లడించింది. హైదరాబాద్లో తొలిసారి 2023 ఫిబ్రవరిలో ఫార్ములా ఈ–కారు రేసు సంస్థ రేసును నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పట్లో స్పాన్సర్లతో తొలి రేసు నిర్వహించినా, అందుకు మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. తొలిసారి స్పాన్సర్లుగా వ్యవహరించిన సంస్థలకు ఆశించిన మేరకు ఆదాయం రాకపోవడంతో... 2024లో నిర్వహించాల్సిన రెండో రేసు నుంచి స్పాన్సర్లు తప్పుకున్నారు. రేసు నిర్వహణకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఫార్ములా ఈ– కారు రేసు నిర్వాహకులు వెంటనే నిధులు ఇస్తే తప్ప.. 2024 ఫిబ్రవరిలో రేసు కేటాయించడం సాధ్యం కాదంటూ ఒత్తిడి తేవడం, స్పాన్సర్లు ముందుకు రాకపోవడంతో అప్పట్లో హెచ్ఎండీఏ నుంచి ఫార్ములా ఈ–కారు రేసు సంస్థకు విదేశీ కరెన్సీలోనే నిధులు చెల్లించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి కూడా తీసుకోలేదని, ఆర్థికశాఖ నుంచి కూడా అనుమతి తీసుకోలేదని తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. 2023 డిసెంబర్లో రాష్ట్రంలో అధికారం మారడంతో...ఫార్ములా ఈ– కారు రేసును రద్దు చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల సమయంలో హెచ్ఎండీఏ నుంచి నిధులు విదేశాలకు తరలివెళ్లాయని తెలియడంతో.. అప్పటి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ ఈ నిధులు మళ్లింపుపై విచారణ చేయాలని అవినీతి నిరోధక శాఖకు లేఖ రాసిన సంగతి విదితమే. ఆ తర్వాత ఎసీబీ అధికారులు అప్పట్లో పురపాలకశాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ను రెండుసార్లు, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ను మూడుసార్లు, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్రెడ్డిలను మూడుసార్లు ప్రశ్నించింది. ఎస్ నెక్స్ట్ జెన్తోపాటు ఫార్ములా ఈ–కారు రేసు ప్రతినిధులను కూడా ప్రశ్నించింది. ఈ మేరకు పూర్తిస్థాయిలో నివేదికను తయారు చేసిన ఏసీబీ అందులో ప్రధానంగా మాజీమంత్రి కేటీఆర్, అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరి్వంద్కుమార్లను ముద్దాయిలుగా పేర్కొన్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. వారిపై ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం. -
కొత్త దళపతి.. తిరుపతి
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కోరుట్ల: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీని ఆ పార్టీ ఎన్నుకున్నట్టు తెలిసింది. పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు బస్తర్ డివిజన్లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో భద్రతాదళాలతో జరిగిన కాల్పుల్లో మే 21వ తేదీన మరణించారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. మే 21 తర్వాత పొలిట్బ్యూరో, కేంద్ర మిలటరీ కమిషన్ సంయుక్త సమావేశం జరగకపోవడంతో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎవరినీ ఎన్నుకోలేదు. తీవ్ర నిర్బంధం ఉన్నా, ఇటీవల జరిగిన సమావేశంలో తిరుపతిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. తిరుపతి కేంద్ర మిలటరీ కమిషన్ చీఫ్గా, పొలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేశారు. తిరుపతి ఎన్నికతో రెండోసారి కరీంనగర్ జిల్లాకు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు లభించినట్టు అయ్యింది. పీపుల్స్వార్ నుంచి కొండపల్లి సీతారామయ్యను తప్పించిన తర్వాత కరీంనగర్ జిల్లా బీర్పూర్కు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.వృద్ధాప్యం పైబడడంతో ఆయన ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళికి చెందిన నంబాళ్ల కేశవరావు మావోయిస్టు పార్టీ సుప్రీం లీడర్గా వ్యవహరించారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తిప్పరి తిరుపతికి ముప్పాళ్ల లక్ష్మణ్రావుకు ప్రియశిష్యునిగా పార్టీలో పేరుంది. మిలటరీ ఆపరేషన్లలో దిట్టగా పేరున్న ముఖ్య నేతల్లో ఒకరైన దేవుజీకి ఈ బాధ్యతలు అప్పగించడమే సముచితంగా ఉంటుందని పార్టీ భావించినట్టుగా సమాచారం. దండకారణ్యంలో పార్టీ కార్యకలాపాల నిర్వహణకు ప్రతికూల పరిస్థితులు నెలకొనడం, రెడ్ కారిడార్ ఏరియాలో చాలా భూభాగాన్ని బలగాలు కైవసం చేసుకున్నాయి.పార్టీ ప్రధాన నాయకులే లక్ష్యంగా బలగాలు ఆపరేషన్లు చేపడుతున్న క్రమంలో ఎదురు దాడులు చేయాల్సిన ఆవశ్యకతను కూడా కేంద్ర కమిటీ నాయకులు గమనించినట్టుగా తెలుస్తోంది. ఈ కారణంగానే అటు మిలటరీ ఆపరేషన్లు, ఇటు రాజకీయ వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉన్న దేవుజీకి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. కాగా, మడావి హిడ్మాకు మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ఇన్చార్జ్తోపాటు ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ బాధ్యతలు అప్పగించారు. కమలేశ్ విచారణలో విజయవాడలోని పోరంకికి చెందిన నాగరాజు అలియాస్ కమలేశ్ ఆలియాస్ రామకృష్ణ మావోయిస్టు పార్టీలో 34 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ ఏడాది జూలై 26న ఏపీ పోలీసుల ముందు లొంగిపోయాడు. వారి విచారణలో మావోయిస్టు కొత్త సారథిగా తిరుపతిని ఎన్నుకున్నట్టు కమలేశ్ వెల్లడించాడని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇంజినీర్ కావాలనుకొని.. కోరుట్లలోని అంబేడ్కర్నగర్కు చెందిన తిప్పరి వెంకటనర్సయ్య–గంగుబాయి దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో పెద్ద కుమారుడైన తిరుపతి చిన్నప్పటి నుంచి చదువులో రాణించేవాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఆయన.. 1980లో పదో తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత ఇంజినీర్ కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ఎంపీసీలో చేరాడు. అప్పటికే కాలేజీలో ఏబీవీపీ, ఆర్ఎస్యూ విద్యార్థి సంఘాల మధ్య తీవ్రమైన గొడవలు జరిగాయి. ఈ ప్రభావానికి గురైన తిరుపతితోపాటు పలువురు విద్యార్థులపై పోలీసుల నిర్బంధం సాగింది. అయినా, ఇంటర్ పూర్తి చేసి 1982లో కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. అక్కడా విద్యార్థి సంఘాల మధ్య జరిగిన గొడవల్లో తిరుపతిపై కేసులు నమోదయ్యాయి. దీంతో డిగ్రీ పూర్తి కాకముందే మల్లోజుల కోటేశ్వర్రావు ముఖ్య అనుచరుడు మెట్పల్లి మండలంలోని కొండ్రికర్లకు చెందిన సాయిని ప్రభాకర్ ఆధ్వర్యంలో తిరుపతితోపాటు మరికొందరు అడవి బాట పట్టినట్టు సమాచారం.1984లో బస్తర్కు వెళ్లి అక్కడే అంచెలంచెలుగా ఎదిగారు. బస్తర్ బాధ్యతలు హిడ్మాకు కేంద్ర కమిటీలో స్థానం సంపాదించిన తొలి ఛత్తీస్గఢ్ మావోయిస్టుగా పేరున్న మడ్వి హిడ్మాకు మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ఇన్చార్జ్తోపాటు ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ బాధ్యతలు అప్పగించారు. గెరిల్లా దాడులు చేయడంలో దిట్టగా పేరున్న హిడ్మాకు బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాల దూకుడుకు బ్రేకులు వేసేపని అప్పగించినట్టు తెలుస్తోంది. తెలంగాణతో సరిహద్దులు పంచుకునే సుక్మా, బీజాపూర్ జిల్లాలతో కూడిన దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైంది. ఒకప్పుడు ఐదువేల మందికి పైగా సాయుధ మావోయిస్టులు ఈ కమిటీలో ఉండేవారు. ఇప్పటికీ మావోయిస్టు పార్టీలో అత్యధిక సాయుధులు ఈ కమిటీలోనే ఉన్నారు. దీంతో రాబోయే రోజుల్లో దండకారణ్యం దద్దరిల్లే అవకాశం కనిపిస్తోంది. దండకారణ్యం బాధ్యతలు ఇప్పటివరకు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ చూస్తుండగా, ఇక్కడే ఉన్న జనతన సర్కార్ బాధ్యతలు మరో కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత అలియాస్ మైనా నిర్వర్తిస్తున్నారు. కొత్తగా హిడ్మా ఈ పోస్టులోకి రావడంతో ఆ ఇద్దరికి ఏ విధులు అప్పగిస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది. మిలిటరీ బాధ్యతల్లో మిసిర్ బెహ్రా: కేంద్ర కమిటీలో ముగ్గురు పొలిట్బ్యూరో సభ్యులు ఉన్నారు. వీరిలో తిప్పిరి తిరుపతి జనరల్ సెక్రటరీగా ఎన్నికవడంతో సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలు జార్ఖండ్కు చెందిన మిసిర్ బెహ్రాకు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనుదాదా అలియాస్ అభయ్ ఆ పార్టీకి సంబంధించిన రాజకీయ వ్యవహారాలు చూస్తున్నారు. -
మళ్లీ దిద్దాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాలను మళ్లీ దిద్దాల్సిందేనని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు హైకోర్టు తేల్చిచెప్పింది. మార్చి 10న వెలువరించిన తుది మార్కుల జాబితా, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితా(జీఆర్ఎల్)ను రద్దు చేసింది. గ్రూప్–1 మెయిన్స్కు సంబంధించిన అన్ని సమాధాన పత్రాలను మాన్యువల్గా తిరిగి మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలని ఆదేశించింది. సంజయ్సింగ్ అండ్ అదర్స్ వర్సెస్ యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలహాబాద్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు మోడరేషన్ పద్ధతిని వర్తింపజేయాలని స్పష్టం చేసింది. ఆ ఫలితాల ఆధారంగా 563 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇది సాధ్యంకాని పక్షంలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష రద్దు చేసి ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించిన అందరికీ తిరిగి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియంతా మంగళవారం నాటి ఉత్తర్వుల కాపీ అందిన రోజు నుంచి 8 నెలల్లో పూర్తి చేయాలంటూ కీలక తీర్పు వెలువరించింది. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్కు చెందిన కె.పర్శరాములుతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని విచారించిన జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు సుదీర్ఘ వాదనల అనంతరం.. జూలై 7న తుది తీర్పు రిజర్వు చేశారు. తాజాగా మంగళవారం తీర్పు వెలువరించారు. ఈ కేసుకు సంబంధించిన మొత్తం సమస్యను విధానపరమైన, మూల్యాంకన విధానం అనే రెండు కేటగిరీలుగా విభజించవచ్చునని న్యాయమూర్తి తెలిపారు. ఒక్కో కేటగిరీలోని అంశాల వారీగా తీర్పు ఇచ్చారు. 1) విధానపరమైన అంశాలు.. రెండు హాల్ టికెట్ల జారీ: 2024 ఫిబ్రవరి 19న టీజీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లో రెండు హాల్టికెట్ల ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ వేర్వేరు హాల్ టికెట్లు జారీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. కమిషన్ వివరణ కూడా అస్పష్టంగా ఉంది. యూపీఎస్సీనే ఒక హాల్టికెట్ ఇస్తున్నప్పుడు.. ఇక్కడ రెండు ఎందుకనే దానిపై వివరణ నమ్మశక్యంగా లేదు. 2011లో ఇదే విధానం అనుసరించినట్లు కమిషన్ పేర్కొన్నా.. ఆ డాక్యుమెంట్లను సమర్పించలేదు. నోటిఫికేషన్ లేదా నిబంధనల మేరకు పరీక్ష జరగలేదని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది. కేంద్రాల కేటాయింపు: 18, 19 పరీక్షా కేంద్రాల్లో మహిళా అభ్యర్థులకే ప్రాధాన్యత ఎలా ఇచ్చారు. రాండమైజేషన్ విధానమే అయితే ఎక్కువ మంది మహిళా అభ్యర్థులను రెండు కేంద్రాలకే ఎలా కేటాయించారు? మహిళా అభ్యర్థులనే కేటాయించాలని కళాశాల అధికారులు చెప్పినట్లు కమిషన్ పేర్కొన్నా ఆధారాలను సమర్పించలేదు. అసలు అలా కేటాయింపులో ప్రాధాన్యత ఎందుకో కమిషన్ చెప్పలేదు. నోటిఫికేషన్లో పేర్కొనలేదు. మరోవైపు శారీరకంగా వికలాంగులైన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. నగరానికి దూరంగా 2వ, 3వ అంతస్తుల భవనాలను కేటాయించింది. ఇది కేంద్రాలను కేటాయించడంలో వివక్షను ప్రతిబింబిస్తోంది. హాజరులో అసమానత: మెయిన్స్కు హాజరైన అభ్యర్థుల సంఖ్యను.. 21,093, 21,085, 21,110, 20,161గా ఇలా ఒక్కోసారి ఒక్కోలా పేర్కొంది. అభ్యర్థుల హాజరు నమోదులో కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రాజ్యాంగ సంస్థ ఇలా చేయడం ప్రశంసించలేం. తుది మార్కుల జాబితా విడుదల సమయంలో 21,085 మందిగా పేర్కొంది. సంఖ్యలో మార్పునకు ఎటువంటి వివరణ లేదు. బహుళ మూల్యాంకనం: జవాబు పత్రాల తొలి రెండు మూల్యాంకనాల్లో మార్చి 13 నాటి వెబ్ నోట్ ప్రకారం బార్కోడ్, బబ్లింగ్లున్నాయి. మూడో మూల్యాంకనంలో ఇవి లేవు. ఏపీలో నిర్వహించినట్లు ఇక్కడా చేశామని కమిషన్ చెప్పినా మూడో మూల్యాంకనం భిన్నంగా ఉండటంతో మార్కులను మార్చే అవకాశం ఉంది. నోటిఫికేషన్లో మూడో మూల్యాంకనంపై వివరాలు లేవు. కమిషన్ చర్యలు గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పవిత్రతను దెబ్బతీశాయి. మూల్యాంకన ప్రక్రియ పిటిషనర్ల వాదనలకు బలాన్ని చేకూర్చింది. వారి వాదన తోసిపుచ్చలేం. మార్కుల జాబితా ప్రచురణ: నిబంధనల ప్రకారం అభ్యర్థుల మార్కులను సబ్జెక్టుల వారీగా ప్రచురించాలి. అలా చేయకుండా కమిషన్ వ్యక్తిగత లాగిన్లకు సబ్జెక్టుల వారీగా పంపింది. అంటే ఎవరి మార్కులు వారికే కనిపిస్తాయి తప్ప.. ఇతరుల మార్కులు తెలియవు. ఇది సరికాదు. అందరి అభ్యర్థుల మార్కులతో జాబితాను ప్రచురించకపోవడం పారదర్శకతను దెబ్బతీస్తోంది. దీనిపై కమిషన్ను ప్రశ్నించే హక్కు అభ్యర్థులకు ఉంది. అర్హత సాధించని అభ్యర్థుల పేపర్లు మూల్యాంకనం: ఇంగ్లిష్ పరీక్షలో అర్హత సాధించిన తర్వాతే ఇతర పేపర్లు మూల్యాంకనం చేశామని కమిషన్ చెప్పింది. అయితే జనరల్ ఇంగ్లిష్లో అర్హత సాధించని వారి పేపర్లూ మూల్యాంకనం చేసినట్లు 12 మంది పేర్లు పరిశీలిస్తే తెలుస్తోంది. పరీక్ష నిర్వహణలో అసమగ్రతను ఇది స్పష్టం చేస్తోంది. దశాబ్దంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది అశనిపాతం లాంటిది. ఖాళీలు పెంచడం: రెండో నోటిఫికేషన్ ద్వారా ఖాళీల సంఖ్య పెంచారు. మళ్లీ దరఖాస్తులు తీసుకున్నారు. అంతకుముందు దరఖాస్తు చేసుకోని వాళ్లు కూడా కొత్తగా రావడంతో అభ్యర్థుల సంఖ్య పెరిగింది. అయితే దీనిపై ఇప్పటికే ఇదే హైకోర్టు తీర్పునిచ్చింది. అందుకే ఈ అంశంపై విచారణకు నిరాకరించాం. 2) మూల్యాంకన విధానం.. మూల్యాంకనదారుల ఎంపిక: రెగ్యులర్ అధ్యాపకులు, ఇద్దరు రిటైర్డ్ అధ్యాపక సభ్యులను మెయిన్స్ మూల్యాంకనానికి నియమించినట్లు కమిషన్ పేర్కొంది. వీరి పేర్లను రహస్యంగా ఉంచామని, పిటిషనర్లు బహిర్గతం చేసినందుకు చట్టప్రకారం చర్యలు తీసుకునే హక్కు ఉందని వాదించింది. అలాంటప్పుడు ఆ వివరాలిచ్చిన కమిషన్ ఉద్యోగులపై కూడా చర్యలు తీసుకోవాలి. నోటిఫికేషన్ ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులను మాత్రమే తీసుకోవాలన్నది పిటిషర్ల వాదన. ప్రైవేట్ ట్యూటర్గా పనిచేసిన డాక్టర్ ఎం.ఎ.మాలిక్ను కూడా తీసుకున్నారని వారు తెలిపారు. ఇతను 22 ఏళ్లుగా ఆంధ్రజ్యోతి సహా ఇతర పత్రికలకు పోటీ పరీక్షల కథనాలను అందిస్తున్నానని పేర్కొన్నారు. దీనిని అంగీకరించని కమిషన్ పిటిషనర్లపై కేసులు నమోదు చేస్తామని బెదిరించింది. అలాగే కమిషన్ రెగ్యులర్ ఫ్యాకల్టీ అనే దానికి అర్థాన్ని మార్చింది. పత్రాలు దిద్దిన విధానం: సమాధాన పత్రాల మూల్యాంకనానికి ఏదైనా విధానం ఉందా? కీ ఉందా? అని కమిషన్ను ప్రశ్నించాం. ఎటువంటి కీ లేదని, మూల్యాంకనదారులు సబ్జెక్ట్ నిపుణులని పేర్కొంది. తర్వాత కీ ఉందని సీల్డ్ కవర్లో సమర్పించింది. కీ విషయంలో కమిషన్ తన వాదనను ఎప్పటికప్పుడు మార్చింది. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనాలపై ఏదైనా కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టాలనుకుంటే సర్కార్ను సంప్రదించాలి. కానీ అలా జరగలేదని తెలుస్తోంది. కోర్టుకు సమర్పించిన కీలోనూ లోపాలున్నాయి. ‘తెలుగు’ అభ్యర్థుల విషయంలో నిర్లక్ష్యం: తెలుగు మాధ్యమంలో మెయిన్స్ రాసిన వారి పత్రాలను సరైన పద్ధతిలో మూల్యాంకనం చేయలేదనేది ప్రధాన ఆరోపణ. కాగా భాషల వారీగా ఎంతమంది మూల్యాంకనదారులను నియమించారన్నది స్పష్టత లేదు. టీచర్లంతా ఇంగ్లిష్, తెలుగులో ప్రావీణ్యం కలిగినవారే అని చెప్పడం హాస్యాస్పదం. ఇంగ్లిష్ మీడియంలో 506 మంది (మొత్తం రాసిన వారిలో 89.88 శాతం), తెలుగు మీడియంలో 56 (9.95 శాతం), ఉర్దూలో ఒకరు అర్హత సాధించారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే తెలుగు అభ్యర్థులకు అన్యాయం జరిగిందని స్పష్టమవుతోంది. నిర్దిష్ట కేంద్రాల్లో అత్యధికులు అర్హత సాధించడం: 18, 19 కేంద్రాల నుంచి 35.5 శాతం మహిళలు అర్హత సాధించగా, ఇతర కేంద్రాల నుంచి 5.35 మాత్రమే అర్హత పొందారు. ఇది చాలా వ్యత్యాసాన్ని చూపిస్తోంది. ఆమోదయోగ్యంగా లేదు. కొందరు అభ్యర్థులకు ఒకే మార్కులు ఇవ్వడం: మెయిన్స్ రాసిన చాలామంది అభ్యర్థులకు ఒకే విధంగా మార్కులొచ్చాయి. 719 మందికి ఈ విధంగా మార్కులొచ్చాయని కమిషన్ అంగీకరించింది. అయితే పోటీ పరీక్షలో సమాన మార్కులు వచ్చే అవకాశమున్నా.. పక్కపక్క హాల్టికెట్ల వ్యక్తులకు అలా రావడం అనుమానాలకు తావిస్తోంది. సమాన మార్కులు వచ్చిన వారి విషయంలోనూ కమిషన్ అనుసరించిన ర్యాంక్ల విధానం చట్టవిరుద్ధం.. లోపభూయిష్టం. -
‘సీఎం రేవంత్ నోరు విప్పితే గోబెల్ ప్రచారం’
హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డి నోరు విప్పితే గోబెల్ ప్రచారమేనని, మొత్తం అబద్ధాలేనని మండిపడ్డారు. అసత్యాల ప్రచారంలో సీఎం రేవంత్ ఉన్నారని విమర్శించారు హరీష్. ఈ రోజు(మంగళవారం, సెప్టెంబర్ 9వ తేదీ) తెలంగాణ భవన్లో హరీష్ మాట్లాడారు. ‘ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మేమే కట్టం అంటున్నావు.. కత్తెర పట్టుకొని కేసీఆర్ కట్టినవి కట్ చేస్తున్నావ్.. పేర్లు మార్చుడు, కత్తెర పట్టుకొని కేసీఆర్ తిరగలేదు. ఎల్లంపల్లి కోసం 2వేల కోట్లు ఖర్చు పెట్టాము. రేవంత్ ప్రారంభోత్సవం చేసిన ఫ్లై ఓవర్లు, డ్యాములు కేసీఆర్ హాయంలోనివే. ఎల్లంపల్లి ద్వారా 20టిఎంసి హైదరాబాద్కు ఎలా తెస్తావ్?, సీఎం కుర్చీకి గౌరవం పోగొడుతున్నావ్. కాళేశ్వరం మోటర్లతోనే నీళ్లు ప్రాజెక్టులకు వస్తున్నాయి. కేసీఆర్ ముందుచూపుతో మల్లన్నసాగర్ నిర్మించారు. గండిపేట, హిమాయత్ సాగర్ కి వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లే. కాళేశ్వరం లో 12రిజర్వాయర్లు.. అందులో భాగమే మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తెస్తా అంటే నీళ్లు ఎక్కడివి..?, కాళేశ్వరం నీళ్లే మల్లన్న సాగర్కి వస్తాయి. కేసీఆర్ హయాంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ చేపడితే... రేవంత్ నియామక పత్రాలు ఇస్తున్నారు. కాళేశ్వరంలో అంతర్భాగం.. మల్లన్నసాగర్. కాళేశ్వరంను తిడుతావ్ అక్కడి నుండే నీళ్లు వచ్చేవి’ అని హరీష్ కౌంటర్ ఇచ్చారు. -
నేను లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధం.. రేవంత్ సిద్ధమా? కేటీఆర్
హైదరాబాద్: తనపై పెట్టిన ఫార్మాలా ఈ-కార్ రేసు ఒక లొట్టపీస్ కేసని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇమేజ్ పెంచేందుకు ఆనాడు ఈ-కార్ రేస్ నిర్వహించామన్నారు. లొట్టపీస్ కేసులో ఎటువంటి చార్జ్షీటైనా వేసుకోమనండి, అందులో అవినీతే జరగలేదన్నారు. ఈరోజు(మంగళవారం, పెప్టెంబర్ 9వ తేదీ) ఫార్మాలా ఈ-కార్ రేస్ చార్జ్షీటు దాఖలుపై కేటీఆర్ స్పందించారు. ‘ ఫార్ములా ఈ కార్ రేస్ లో అవినీతే జరగలేదు. ేను లైట్ డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధం , రేవంత్ రెడ్డి సిద్ధమా?, దమ్ముంటే రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ టెస్ట్ కు రావాలి. రేవంత్ వస్తారా.. ఏసీబీ డీజీ వస్తారా.. లై డిటెక్టర్ సిద్ధం. ూ. 45 కోట్లు ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశించింది నేనే. ఎక్కడా కూడా రూపాయి తారుమారు కాలేదు. ప్రాసిక్యూషన్, చార్జిషీట్, జైలు.. ఏదైనా చేసుకోండి.. నేను సిద్ధం’ అని కేటీఆర్ సవాల్ చేశారు. కాగా, అంతకుముందు ప్రెస్మీట్లో మాట్లాడిన కేటీఆర్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ‘కొందరు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేదని దుస్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మీటింగ్లకు ఎందుకు రావడం లేదు?.కాంగ్రెస్ కండువా వేసుకుని సిగ్గులేకుండా బీఆర్ఎస్లో ఉన్నానంటున్నాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే వేటువేయాలి’అని డిమాండ్ చేశారు. -
‘గ్రూప్-1’ తీర్పు.. రేవంత్కో గుణపాఠం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 కేసులో హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠమంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని మండిపడ్డారు. హైకోర్టు తీర్పు ప్రకారం, విద్యార్థులు కోరిన విధంగా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పిళ్లు, మళ్ళీ కోర్టు కేసుల పేరు చెప్పి యువతకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వానికి కేటీఆర్ హితవు పలికారు.నిరుద్యోగ విద్యార్థులు కోరుతున్న తీరుగా మళ్లీ తిరిగి పరీక్షను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలన్న కేటీఆర్.. ఇన్ని రోజుల పాటు గ్రూప్-1 అభ్యర్థులు లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా వారిపై అణిచివేతకు పాల్పడిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు.హైకోర్టు తీర్పు.. రేవంత్ సర్కార్ సమాధానం ఏంటి?: హరీష్హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీష్రావు ఎక్స్ వేదికగా స్పందించారు. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలపై ఆయన మండిపడ్డారు. పరీక్ష కేంద్రాల కేటాయింపు, హల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ హరీష్రావు ట్వీట్ చేశారు. లోప భూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం.. ఈ కోర్టు తీర్పుకు చెప్పే సమాధానం ఏమిటి? అంటూ ఆయన ప్రశ్నించారు.‘‘హడావుడిగా పరీక్షలు నిర్వహించి, అవకతవకలకు పాల్పడ్డ మీ నిరక్ష్యానికి విద్యార్థులు, నిరుద్యోగులు బలవుతున్నారు. గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు ఎలా నిర్వహించాలనే సోయి కూడా లేదు. పరీక్షలు నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అంటే విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి చిల్లర రాజకీయాలు చేయడం కాదు’’ అంటూ రేవంత్రెడ్డిపై హరీష్రావు మండిపడ్డారు.గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు..పరీక్ష కేంద్రాల కేటాయింపు, హల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. లోప భూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న…— Harish Rao Thanneeru (@BRSHarish) September 9, 2025 -
వదల బొమ్మాళీ.. వదల!
రెగ్యులర్ అధికారి బాధ్యతలు చేపట్టినా కదలని ఇన్చార్జ్సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర తూనికలు, కొలత శాఖ లెక్క తప్పింది. తూకాలు, మోసాలపై పర్యవేక్షణేమో గానీ, పరిపాలనపరమైన వ్యవహారాల్లో సైతం జవాబుదారీతనం కొరవడింది. సాక్షాత్తు ప్రధాన కార్యాలయంలోని పరిపాలన విభాగంలో రెగ్యులర్ అధికారి బాధ్యతలు చేపట్టినప్పటికీ నెలరోజుల క్రితం వరకు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించిన అధికారి మాత్రం చాంబర్ను వదలా.. కదలా.. అంటూ యధావిధిగా ఫైళ్లను పరిశీలిస్తుండటం ఉద్యోగ వర్గాల్లో చర్చనీంశంగా మారింది. ఇటీవల తూనికల, కొలతల శాఖలో పలువురికి పద్నోతులు కల్పిస్తూ రాష్ట్ర కంట్రోలర్ ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా హైదరాబాద్ హెడ్ క్వార్టర్–1 డిస్ట్రిక్ ఇన్స్పెక్టర్(డీఐ)కి అసిస్టెంట్ కంట్రోలర్(ఏసీ)గా పదోన్నతి కల్పించి ప్రధాన కార్యాలయంలోని పరిపాలన విభాగంలో హెడ్క్వార్టర్ అసిస్టెంట్ కంట్రోలర్గా రెగ్యులర్ పోస్టింగ్ ఇచ్చారు. జూలై 31న పదోన్నతి పొందిన సదరు అధికారిణి తక్షణమే రిపోర్టు చేసి బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు హెడ్ క్వార్టర్ అసిస్టెంట్ కంట్రోలర్గా విధులు నిర్వహించిన వరంగల్ అసిస్టెంట్ కంట్రోలర్ పూర్తి అదనపు బాధ్యత(ఎఫ్ఎసీ)ల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. కానీ, రెగ్యులర్ అధికారిణి డ్యూటీలో చేరినప్పటికి 25 రోజులుగా సదరు అధికారి మాత్రం కార్యాలయానికి త్వరగా వచ్చి ప్రధాన సీటుపై కూర్చుంటూ ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏడాదిపాటు హెడ్ క్వార్టర్ ఏసీగా వ్యవహరించిన సదరు అధికారి సీనియర్ కావడం, మరోవైపు పలువురు ఉద్యోగుల పదోన్నతి ఫైళ్ల వ్యవహారం ఉండటంతో ఆయన అనుభవం తనకు సహకారంగా ఉంటుందని సదరు అధికారిణి కూడా మిన్నుకుండినట్లు సమాచారం. అయితే వారం రోజుల క్రితం పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావడంతో రెగ్యులర్ అధికారిణి ఆఫీస్కు ఆయన కంటే ముందుగానే వచ్చి ప్రధాన కుర్చీలో కూర్చుంటున్నారు. అయినా సదరు అధికారి మరో సాధారణ కుర్చీలో కూర్చొని ఫైళ్లు పరిశీస్తూ చాంబర్ను వదలక పోవడం ఉద్యోగులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర కంట్రోలర్ కూడా పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. హాజరెట్లెట్టా..? ప్రధాన కార్యాలయంలో హెడ్ క్వార్టర్ అసిస్టెంట్ కంట్రోలర్ పూర్తి అదనపు బాధ్యతలను నుంచి నుంచి తప్పుకున్నా వరంగల్లోని రెగ్యులర్ ఏసీ విధులకు హాజరు కాకుండా హెడ్ క్వార్టర్లోనే ఉండిపోవడంతో హాజరు నమోదుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం రెగ్యులర్ పోస్టింగ్లో కాకుండా ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తే, న్ఆన్ డ్యూటీ హెడ్ ఆఫీస్ (ఓడీహెచ్) అని హాజరు పట్టికలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ రోజులైతే మాత్రం ఆ శాఖాధిపతి అనుమతి తప్పనిసరి. అయితే ఎలాంటి అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయంలోనే తిష్ట వేసి ఫైళ్లు తిరగేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. సదరు అధికారి ఇటీవల జరిగిన ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో కూడా చేతివాటం ప్రదిర్శంచినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. అదనపు బాధ్యతల మాటున తప్పిదాలెన్నో.. సదరు అధికారి పలు నిబంధనలు సైతం తుంగలో తొక్కి పదోన్నతులు, కొత్త పోస్టింగ్ల్లో పలు జిమ్మిక్కులు చేసినట్లుగా విమర్శలు ఉన్నాయి. పదోన్నతులతో కొత్త స్థానాల్లో చేరినవారు కొద్ది నెలలకే తాము కోరుకున్న చోటుకు బదిలీ చేయడం గమనార్హం. వాస్తవంగా బదిలీలపై నిషేధం కొనసాగుతోంది. అయినా ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 20న పలువురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి పరిపాలనా సౌలభ్యానికి అనుగుణంగా ఖాళీగా ఉన్న స్థానాల్లో పోస్టింగ్లు కేటాయించారు. పదోన్నతుల ద్వారా పోస్టింగ్లో చేరి శిక్షణ పూర్తి చేసిన తర్వాత కొందరికి పోస్టింగ్ మార్చి కోరుకున్న స్థానాల్లో బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఇలా.... ● పదోన్నతి ద్వారా హైదరాబాద్ సీసీ–1 ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ లభించిన ఉద్యోగికి జనగామాకు, హెడ్ క్వార్టర్ హైదరాబాద్–1 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్గా పోస్టింగ్లో చేరిన మరో ఉద్యోగికి రంగారెడ్డి జిల్లా ఆఫీస్కు బదిలీ చేశారు. ● మేడ్చల్–మల్కాజిగిరి డీఐ పోస్టు సస్పెన్షన్తో ఖాళీ కాగా, ఆ స్థానంలో నల్లగొండ డీఐకి బదిలీపై పోస్టింగ్ ఇచ్చారు. వాస్తవంగా బదిలీలపై నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న నేపథ్యంలో ఖాళీగా ఉన్న పోస్టుకు ఇన్చార్జ్గా అదనపు బాధ్యతలు అప్పగించవచ్చు. కానీ, నేరుగా బదిలీ చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ● నిబంధనల ప్రకారం నిషేధిత కాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం బదిలీలు చేయాలంటే కూడా ప్రభుత్వం ఉన్నత స్థాయి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా ఆమోదం పొందాల్సి ఉంటుంది. కానీ, తూనికలు, కొలతల శాఖ పరిపాలనా విభాగం నిబంధనలను తుంగలోకి తొక్కి సిఫార్సులు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే నిబంధనలకు వ్యతిరేకంగా బదిలీలు జరగడంతో ట్రెజరీ అండ్ అకౌంట్ విభాగం వారి వేతనాల చెల్లింపు నిలిపివేసినట్లు తెలుస్తోంది. అదే చాంబర్లో నెలరోజులుగా విధులు సాక్షాత్తు ప్రధాన కార్యాలయంలో నిబంధనలు తూచ్ గతంలో పోస్టింగ్, పదోన్నతుల్లో చేతివాటం ఆరోపణలు పట్టని తూనికలు, కొలతల శాఖ రాష్ట్ర కంట్రోలర్ -
అన్నదాతలప్రయోజనాలే ముఖ్యం
● రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సాక్షి, సిటీబ్యూరో: రైతుల ప్రయోజనాల కోసం మార్కెట్ కమిటీలు పనిచేయాలని, రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. సోమవారం బాటసింగారం పండ్ల మార్కెట్ను సందర్శించిన ఆయన బత్తాయి రైతులతో ముచ్చటించారు. ఉద్యానవన పంటలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్ర భుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమ లు చేస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని మార్కెట్ కమిటీల పనితీరును కమిషన్ సమీక్షిస్తుందని చెప్పారు. కోహెడలో త్వరలోనే మార్కెట్ నిర్మా ణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కమిషన్కు విన్నపం కొత్తపేట నుంచి పండ్ల మార్కెట్ను తాత్కాలిక ప్రాతిపదికన బాటసింగారానికి మార్చినప్పటికీ, వ్యాపారానికి అనువైన వాతావరణం లేదని కమిషన్ ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని, మార్కెట్ యార్డులోని సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు సునీల్రెడ్డి, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర చారి, సభ్యులు అంజయ్య, మధుసూదన్రావు, రఘుపతిరెడ్డి, లక్ష్మి, మచ్చేందర్ రెడ్డి, నర్సింహ, గణేష్ నాయక్, గోవర్ధన్ రెడ్డి, వెంకటేశ్వర్లు గుప్తా, ఇబ్రహీంతోపాటు మార్కెట్ ఈఈ ప్రసాద్ రావు, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్, ఫ్రూట్ ట్రేడర్స్ అఽధ్యక్షుడు మహ్మద్ తాజ్, ఉపాధ్యక్షుడు అచ్చ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సవ్యమైన జాబితాకు సహకరించండి!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై పార్టీల ప్రతినిధుల సమావేశంలో కర్ణన్ సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఓటర్ల తుది జాబితాను సవ్యంగా సిద్ధం చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సంక్షిప్త సవరణకు సంబంధించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ఈ నెల 2వ తేదీన ప్రచురించామన్నారు. ఆ మేరకు నియోజకవర్గంలోని 139 లొకేషన్లలో 407 పోలింగ్స్టేషన్ల పరిధిలో 3 లక్షల 92 వేల 669 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ వివరాలతో కూడిన జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు అందజేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ), జీహెచ్ఎంసీ వెబ్సైట్లలో కూడా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. పోలింగ్ ఏజెంట్లను నియమించాలి ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ లెవల్ ఏజెంట్ల(బీఎల్ఏ)ను నియమించి, జాబితా సవరణ పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండేందుకు భాగస్వాములు కావాలని పార్టీల ప్రతినిధులను కోరారు. ఓటరుగా నమోదు చేసుకోండి దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 17 వరకు అవకాశం ఉందని, ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న, అర్హులైన పౌరులు ఆ తేదీలోగా తప్పనిసరిగా ఓటరుగా నమోదయ్యేలా చూడాలని రాజకీయ పార్టీలను కర్ణన్ కోరారు. జాబితాలో సవరణలు, మార్పులు చేర్పులు చేయాలనుకున్నా అదే తేదీ(సెప్టెంబర్ 17)లోపు దరఖాస్తు ఫారాలు సమర్పించాలన్నారు. ఈ నెల 30న తుది జాబితా ఇప్పటివరకు ఫారం–6, 6ఎ, 7, 8ల ద్వారా వచ్చిన 2,855 దరఖాస్తులు, అభ్యంతరాల్లో 246 (8.62 శాతం) దరఖాస్తులను పరిష్కరించామని కర్ణన్ తెలిపారు. ఓటర్ల తుది జాబితాను సెప్టెంబర్ 30న ప్రచురించనున్నట్లు చెప్పారు. సమావేశానికి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు జాయింట్ సీఈఓ పల్లవి విజయ్వంశీ, అదనపు కమిషనర్(ఎలక్షన్స్) మంగతాయారు హాజరయ్యారు. నందేశ్ కుమార్(బహుజన్ సమాజ్ పార్టీ), పి.వెంకటరమణ, పవన్ కుమార్(భారతీయ జనతా పార్టీ), విజయ్ మల్లంగి (ఆమ్ ఆద్మీ పార్టీ), ఎం.శ్రీనివాసరావు (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా–మార్క్సిస్టు), రాజేశ్ కుమార్ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్), వై.జయసింహ, కె.మాధవ్ (భారత్ రాష్ట్ర సమితి), కె.జోగేందర్ సింగ్, ప్రశాంత్ యాదవ్ (తెలుగుదేశం పార్టీ), సయ్యద్ ముస్తాక్ (ఎఐఎంఐఎం) తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు హైదరాబాద్ జిల్లాలో జీఐఎస్ ఆధారిత నజరి నక్ష తయారీ కార్యాచరణ ప్రణాళికపై కర్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు. -
రూ.1.92 కోట్ల ‘పాత కరెన్సీ’ స్వాధీనం
● నలుగురిని అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ ● మరికొందరి కోసం కొనసాగుతున్న గాలింపు సాక్షి, సిటీబ్యూరో: సుదీర్ఘకాలం తర్వాత నగరంలో మరోసారి రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు పట్టుబడ్డాయి. 2016లో డీమానిటైజేషన్ తర్వాత దాదాపు రెండున్నరేళ్ల పాటు ఈ కేసులు నమోదైనా... ఆ తర్వాత తగ్గిపోయాయి. తాజాగా సోమవారం రాత్రి నలుగురిని అదుపులోకి తీసుకున్న ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రూ.1.92 కోట్ల పాత కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో సూత్రధారులతో పాటు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. డీమానిటైజేషన్ సమయంలో ప్రభుత్వం పాత కరెన్సీ మార్పిడికి అవకాశం ఇచ్చింది. బ్యాంకులతో పాటు కొన్ని పోస్టాఫీసుల్లోనూ ఆధార్ సహా ఇతర ఆధారాలు సమర్పించి నగదు మార్పిడి చేసుకోవడానికి, బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే బ్లాక్ కరెన్సీ కలిగిన అనేక మంది అప్పట్లో మార్పిడి, డిపాజిట్ చేసుకునేందుకు ముందుకు రాలేదు. ఇలాంటి వారికోసం పని చేసిన కొన్ని ముఠాలు కమీషన్ ప్రాతిపదికన వీటిని మార్పిడి చేశాయి. మరికొందరు మార్పిడి పేరుతో ఎర వేసి అందినకాడికి దండుకుని ఉడాయించారు. కొందరు సూడో పోలీసులు, ఖాకీలు సైతం ఈ దందాలు నడిపారు. 2016–18 మధ్య ఇలాంటి కేసులు అనేకం నమోదయ్యాయి. అయితే కరోనా ప్రభావంతో అమలులోకి వచ్చిన లాక్డౌన్ తర్వాత ఇలాంటి మోసాలు, వ్యవహారాలు, కేసులు దాదాపుగా తగ్గిపోయాయి. అప్పుడప్పుడు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఓ ఉదంతమే సోమవారం బయటకు వచ్చింది. కొందరు వ్యక్తులు కమీషన్ తీసుకుని పాత కరెన్సీని మార్చి, కొత్త రూ.500, రూ.200, రూ.100 నోట్లు ఇస్తామంటూ ప్రచారం చేసుకున్నారు. వీరి మాటలు నమ్మిన కొందరు తమ వద్ద ఉన్న నగదును ఇద్దరు వ్యక్తులకు ఇచ్చి పంపారు. దీనిపై సమాచారం అందుకున్న ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం నారాయణగూడ పోలీసుస్టేషన్ పరిధిలో వలపన్నారు. శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంక్ వద్ద ఇద్దరిని, వీరిచ్చిన సమాచారంతో వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద ఎదురు చూస్తున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న మూడు బ్యాగులను తనిఖీ చేయగా... అందులో రూ.1.92 కోట్ల పాత కరెన్సీ లభించింది. ఇందులో అత్యధికం రూ.1000 నోట్లే ఉన్నట్లు తెలుస్తోంది. వీరి విచారణ నేపథ్యంలో ఈ కరెన్సీని మార్పిడి కోసం ఇచ్చిన వారు, మారుస్తామంటూ ఒప్పందం చేసుకున్న వారు మరి కొందరు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్లోని ఓ ఇంట్లో మరికొందరు అనుమానితులు ఉన్నట్లు టాస్క్ఫోర్స్ గుర్తించింది. దీంతో వారితో పాటు ఇతర నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. అందరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తేనే ఈ కరెన్సీ మూలాలు, మొత్తం ఎంత ఉందనేది తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై మంగళవారం పూర్తి స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ఈ నలుగురు నిందితులను అధికారులు టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తరలించి వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.