ఉపాధ్యాయుడిని హెచ్చరించి మరీ కాల్చివేత
అలీఘడ్ వర్సిటీలో దారుణ హత్య
గుర్తు తెలియని దుండగుల దుశ్చర్య
అలీఘడ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్లో బుధవారం రాత్రి దారుణం జరిగింది. యూనివర్సిటీ పరిధిలోని పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని గుర్తు తెలియని దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో రాష్ట్ర శాంతిభద్రతల గురించి ప్రశంసలు కురిపించిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం.
సహచరులతో కలిసి వెళ్తుండగా..
క్యాంపస్లోని ఏబీకే హైసూ్కల్లో 11 ఏళ్లుగా డానిష్ రావు కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి 8.50 గంటల సమయంలో ఆయన తన ఇద్దరు సహచరులతో కలిసి వర్సిటీ సెంట్రల్ లైబ్రరీ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో స్కూటర్పై వచి్చన ఇద్దరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. కాల్పులు జరపడానికి ముందు ఒక నిందితుడు డానిష్ తో ‘నేనెవరో నీకింకా తెలియదు.. ఇప్పుడు తెలుస్తుంది’.. అంటూ హెచ్చరించి, పిస్టల్తో కాల్పులు జరిపాడు. ‘లైబ్రరీ సమీపంలో కాల్పులు జరిగినట్లు మాకు రాత్రి 9 గంటలకు సమాచారం అందింది. ఏబీకే స్కూల్ ఉపాధ్యాయుడు డానిష్ రావు తలపై కాల్పులు జరగడం వల్ల ఆయన మరణించారు’.. అని వర్సిటీ ప్రోక్టర్ మొహమ్మద్ వసీం అలీ వెల్లడించారు.
ఆసుపత్రికి చేరేలోపే..
దుండగులు డానిష్ పై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇందులో రెండు బుల్లెట్లు ఆయన తలలోకి దూసుకుపోయాయి. రక్తపు మడుగులో పడిపోయిన డానిష్ ను వెంటనే జవహర్లాల్ నెహ్రూ వైద్య కళాశాలకు తరలించారు. అయితే, ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
నిందితుల కోసం ఆరు బృందాలు
ఈ ఘటనపై సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నీరజ్ జాదన్ స్పందిస్తూ.. ‘నిందితులు ఇద్దరూ డానిష్ ను లక్ష్యంగా చేసుకునే కాల్పులు జరిపారు. నిందితులను పట్టుకోవడానికి ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. క్యాంపస్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నాం’.. అని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడానికి కారణం ఇక్కడి భద్రతేనని సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో ప్రసంగించిన రోజే, ఒక విద్యాలయంలో ఉపాధ్యాయుడిని కాల్చి చంపడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అలీఘడ్ వర్సిటీ క్యాంపస్లో ఉద్రిక్తత నెలకొంది. పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి: మహనీయుల భారీ స్మృతి చిహ్నం.. ప్రారంభించిన ప్రధాని మోదీ


