బెంగళూరు:కర్ణాటకలో శిక్షణా విమానం కుప్పకూలింది. కర్ణాటక బాబలేశ్వర్ జిల్లా మంగళూరులో ఓ శిక్షణా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
పోలీసుల సమాచారం మేరకు.. రెడ్ బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన రెండు సీట్ల విమానం ట్రైనింగ్లో భాగంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. అయితే, ప్రయాణంలో ఉండగా అకస్మాత్తుగా ఇంజిన్లో సమస్య తలెత్తింది. అప్రమత్తమైన పైలట్ అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నం చేశారు. అయినప్పటికీ విమానం పంట పొలాల్లో కూలింది. ఈ ఘటనలో విమానం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, పైలట్, ట్రైనీ పైలట్ ప్రాణాలతో బయటపడ్డారు.
ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారి పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

విమానం శిక్షణ ప్రయాణంలో ఉందని, సాంకేతిక లోపమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. విమానం మూడు ముక్కలుగా విరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. అయితే, పైలట్, ట్రైనీ పైలట్ సకాలంలో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.


