‘చూపు’తో చెలగాటం! | TGMC Team Sudden Inspection at Private Hospitals in Miryalaguda | Sakshi
Sakshi News home page

‘చూపు’తో చెలగాటం!

Dec 21 2025 3:35 AM | Updated on Dec 21 2025 3:35 AM

TGMC Team Sudden Inspection at Private Hospitals in Miryalaguda

కేవలం టెక్నీషియన్లతోనే కంటి ఆస్పత్రుల నిర్వహణ

మిర్యాలగూడలో టీజీఎంసీ బృందం తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి పరీక్షలు, అద్దాల సిఫారసు, చివరకు చికిత్సలు సైతం వారే..! 

ఆప్తాల్మాలజిస్టులుగా చెలామణి అవుతున్న ఎంబీబీఎస్‌ డాక్టర్లు  

హైదరాబాద్, ఇతరచోట్ల ప్రాక్టీస్‌ చేస్తూ ఇక్కడ ఆస్పత్రుల నిర్వహణ

సాక్షి, హైదరాబాద్‌: మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు కంటి ఆసుపత్రి అది. అక్కడ ఇద్దరు ఎంబీబీఎస్‌ డాక్టర్లు.. ఎంఎస్‌ (ఆప్తాల్మాలజీ) అని చెప్పుకుంటూ కంటి వైద్యులుగా చలామణి అవుతున్నారు. కానీ వాళ్లు కూడా కంటి చికిత్సలు చేయడం లేదు. కేవలం అక్కడ పనిచేసే టెక్నీషియన్లే కంటి పరీక్షలు మొదలు చికిత్సలు, కంటి అద్దాలు సిఫారసు చేయడం వరకు చేసేస్తున్నారు. జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ నుంచి కంటి వైద్యుల పేర్లతో అనుమతులు పొందినప్పటికీ, ఆప్తాల్మాలజీ, ఆప్టోమెట్రీ టెక్నీషియన్లతోనే ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ (టీజీఎంసీ) నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో బహిర్గతమైన ఈ తరహా కంటి వైద్యుల బాగోతాలు విస్మయం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మిర్యాలగూడ పట్టణంలోని ప్రైవేట్‌ కంటి ఆసుపత్రులు, అర్హతల్లేని నకిలీ వైద్యుల అక్రమాలపై టీజీఎంసీ దృష్టి కేంద్రీకరించింది. ‘మిషన్‌ మిర్యాలగూడ ఎగైనెస్ట్‌ క్వాకరీ’(చికిత్సలకు అర్హతలేని ఆస్పత్రుల తనిఖీలు) కార్యక్రమంలో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన టీజీఎంసీ బృందం, పట్టణంలో కంటి వైద్య సేవల పేరుతో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చింది.

టీజీఎంసీ చైర్మన్‌ డాక్టర్‌ కె. మహేశ్‌కుమార్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ డి.లాలయ్య కుమార్‌ ఆదేశాల మేరకు సభ్యులు డా. వి.నరేష్‌కుమార్, డా. కె.రవికుమార్, డా. జె.శ్రీకాంత్‌ వర్మ, విజిలెన్స్‌ అధికారి ఎం.రాకేశ్‌లతో కూడిన బృందం పట్టణంలోని పలు కంటి ఆసుపత్రులు, క్లినిక్‌లు, ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్లను తనిఖీ చేయగా పలు అక్రమాలు వెలుగుచూశాయి. 

ఒక్క ఆస్పత్రిలో కూడా నిపుణులు లేరు! 
శ్రీ వెంకటేశ్వర (ఎస్‌వీ) ఐ హాస్పిటల్, శ్రీ మహాలక్ష్మి కంటి ఆస్పత్రి, అన్నపూర్ణ నేత్రాలయం, యశస్వి కంటి ఆస్పత్రి, షాలిని ఐ క్లినిక్, రఫా విజన్‌ కేర్‌ సెంటర్, శివ సాయి కంటి ఆస్పత్రి తదితర కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. అయితే ఏ ఒక్క కంటి ఆసుపత్రిలో కూడా అర్హత గల (ఎంఎస్‌– ఆఫ్తాల్మాలజీ) కంటి వైద్య నిపుణులు ప్రత్యక్షంగా పని చేయకపోవడం అధికారులను విస్మయపరిచింది. ఆయా ఆస్పత్రులు నిపుణులైన కంటి వైద్యులు లేకుండానే మందులు, పరీక్షలు సూచించడం, పరీక్షలు చేయడం, కొన్నిచోట్ల శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నట్లు ఈ బృందం గుర్తించింది. వీటికి సంబంధించి అనుమతులు పొందిన కంటి వైద్యులు హైదరాబాద్, ఇతర నగరాల్లో ప్రాక్టీస్‌ చేసుకుంటున్నట్లు టీజీఎంసీ తేల్చింది.  

ఇక్కడ పరిస్థితి దారుణం
మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కంటి ఆసుపత్రి, షాలిని కంటి ఆసుపత్రుల్లో పరిస్థితి దారుణంగా ఉందని టీజీఎంసీ అధికారులు వెల్లడించారు. ఎంబీబీఎస్‌ మాత్రమే చదివిన డా.ఎం.భరత్‌ భూషణ్, డా.కె.వెంకటేశ్వర్లు తాము ఎంఎస్‌ (ఆప్తాల్మాలజీ) చేసినట్లు తప్పుడు వివరాలు ప్రదర్శిస్తూ, కంటి వైద్య నిపుణులుగా ప్రచారం చేసుకుంటూ, కేవలం టెక్నీషియన్లతోనే ఆసుపత్రులు నడుపుతున్నట్లు తేలింది. ఆయా నకిలీ డాక్టర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి, మెడికల్‌ ఎథిక్స్‌ అండ్‌ మాల్‌ప్రాక్టీసెస్‌ కమిటీ ముందు విచారణ చేపట్టనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అవసరమైతే వారి ఎంబీబీఎస్‌ డిగ్రీ లైసెన్సులను సస్పెండ్‌ చేస్తామని స్పష్టం చేశారు.  

 హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఉండి టెక్నీషియన్ల ద్వారా ఇక్కడ ఆసుపత్రులు నిర్వహిస్తున్న కంటి వైద్య నిపుణులు డా.శ్రీకుమార్, డా.ప్రభు చైతన్య, డా.బïÙర్, డా.అమర్‌లకు కౌన్సిల్‌ నుంచి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు.  
కోమల మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్‌ నిర్వాహకుడు ఎ.కోటేశ్వర్‌రావు ఎలాంటి అర్హతలు లేకుండానే ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌లో బెడ్లు ఏర్పాటు చేసి, యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్‌ ఇంజెక్షన్లు ఇష్టానుసారంగా ఇస్తున్నట్లు గుర్తించారు. మరో నకిలీ వైద్యుడు, ఫ్రెండ్స్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ నిర్వాహకుడు మునీర్‌ తనిఖీల సమాచారం తెలిసి పరారైనట్లు అధికారులు తెలిపారు. 

అర్హత లేకపోయినా కంటి వైద్యం నిర్వహిస్తున్న టెక్నీషియన్లు నాగేష్ , వాల్కె శ్రీను, నాగరాజు, శివ కోటేశ్వరరావు, వెంకటేష్, వికాస్‌ కుమార్, అలాగే నకిలీ వైద్యుడు ఎ.కోటేశ్వరరావుపై ఎన్‌ఎంసీ, టీఎంపీఆర్‌ చట్టాల ప్రకారం క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్లు టీజీఎంసీ సభ్యులు తెలిపారు. 
కంటి ఆసుపత్రుల అవకతవకలపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు చేయనున్నట్లు టీజీఎంసీ పబ్లిక్‌ రిలేషన్స్‌ కమిటీ చైర్మన్‌ డా.వి.నరేష్ కుమార్‌ తెలిపారు. అర్హతకు మించి వైద్యం చేయడం, ఇంజెక్షన్లు ఇవ్వడం, ఆపరేషన్లు నిర్వహించడం, లింగ నిర్ధారణ, అ క్రమ గర్భస్రావాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని డా.కె.రవికుమార్, డా.జె.శ్రీకాంత్‌ స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement