breaking news
International
-
ఇంతకీ ఆ లేఖలో ఏముంది?.. అసలేం జరిగింది?
దేశంలోని తీహార్ జైలులో UAPA అంటే Unlawful Activities Prevention Act కింద ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న ఉమర్ ఖాలిద్ అనే వ్యక్తికి అమెరికాలోని న్యూయార్క్ మేయర్ లేఖ రాయడం విచిత్రంగా ఉంది కదూ.. కానీ అది వాస్తవం.. ఆ లేఖలో.. మేమందరం మీ గురించే ఆలోచిస్తున్నాం అని రాశారు. అసలు జైల్లో ఉన్న వ్యక్తికి... మేయర్ మధ్య స్నేహం, బంధుత్వాలు లేవు.. అసలు ఒకరినొకరు ఎప్పుడూ కలవలేదు. అయినా జైలులో ఉన్న వ్యక్తి అమెరికా, యూరప్లలో చర్చలకు కేంద్ర బిందువయ్యాడు.జైల్లో ఉన్న వ్యక్తితో పాటు.. అదే కేసులో జైల్లో ఉన్న మరికొందరిని బెయిల్ ఇవ్వకుండా UAPA చట్టం కింద బంధించడం మానవ హక్కులను హరించినట్టేనని... వారిని విడుదల చేయాలని ప్రపంచదేశాల నుంచి సందేశాలు రావడం గమనార్హం... అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే.. మనం ఓ సారి 2020లోకి వెళ్లి రావాల్సిందే..సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. అదే సమయంలో 2020 ఫిబ్రవరిలో ఉత్తర–తూర్పు ఢిల్లీలో భారీగా అల్లర్లు చెలరేగాయి. ఆ గొడవల్లో53 మంది మరణించగా.. వందలాది సంఖ్యలో గాయపడ్డారు. ఆ అల్లర్ల నేపథ్యంలో పోలీసులు ఈ కుట్రలో ఉమర్ ఖాలిద్ కూడా భాగస్వామి అని ఆరోపిస్తూ దర్యాప్తు చేపట్టారు. జామియా కోఆర్డినేషన్ కమిటీ సమావేశాల్లో చురుకుగా పాల్గొనడమే కాకుండా... అల్లర్లకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారని... రెచ్చగొట్టే ప్రసంగాలు, హింసను ప్రేరేపించారంటూ UAPA, IPC ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఉమర్ ఖాలిద్ను, ఆయనతో పాటు షర్జీల్ ఇమాంలను 2020 సెప్టెంబర్లో అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి వారు అదే జైలులో ఉన్నారు.బెయిల్ కోసం వారి తరపు న్యాయవాదులు తొలుత ఢిల్లీ హైకోర్టుకు వెళ్లగా.. ఢిల్లీ కోర్టు వారి బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. దీంతో న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపిస్తూ.. పిటిషన్దారులు అకస్మాత్తుగా అల్లర్లకు పాల్పడలేదని.. పూర్తి ప్రణాళికతోనే అల్లర్లు జరిగాయని.. కోర్టుకు నివేదించారు.నిందితుల తరఫున కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ దవే, సల్మాన్ ఖుర్షీద్, సిద్ధార్థ్ లూథ్రాలు వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ అరవింద్ కుమార్.., అంజారియాల ధర్మా సనం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని, ప్రభుత్వాన్ని విమర్శించే స్వరాలను అణచివేయడమే లక్ష్యం అని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మానవ హక్కుల సంస్థలు దీన్ని ప్రజాస్వామ్య సంక్షోభంగా అభివర్ణిస్తున్నాయి.ఐదేళ్ల నుంచి బెయిల్ దొరక్క.. జైల్లో ఉన్న ఉమర్ ఖాలిద్కు ప్రపంచవ్యాప్తంగా సానుభూతి అందుతోంది. ఆధారాల్లేకుండానే ఉమర్ ఖాలిద్ ఇండియన్ జైల్లో మగ్గుతున్నాడని... న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ, ఢిల్లీ అల్లర్ల కేసులో తీహార్ జైలులో ఉన్న ఉమర్ ఖాలిద్కు లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన “మేమందరం మీ గురించే ఆలోచిస్తున్నాము” అని పేర్కొంటూ.. ఖాలిద్కు మద్దతు ప్రకటిస్తూ లేఖ రాశారు.తన లేఖలో ఖాలిద్కు మానసిక ధైర్యం ఇవ్వాలని ప్రయత్నించారు. ఆయన “మీరు ఒంటరిగా లేరు, మేమందరం మీ గురించే ఆలోచిస్తున్నాము” అని రాశారు.ఈ లేఖతో ఖాలిద్ కేసు అంతర్జాతీయ వేదికపై మరింత చర్చకు వచ్చింది. అమెరికాలోని రాజకీయ నాయకులు కూడా భారతదేశంలో మానవ హక్కుల అంశాల గురించి చర్చిస్తున్నారనడనికి ఈ లేఖ ఓ ఉదాహరణ.జోహ్రాన్ మమ్దానీ ఉగాండా దేశంలోని కంపాలలో 1991 అక్టోబర్ 18, జన్మించారు. 2021 నుంచి న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. 2025 ఎన్నికల్లో న్యూయార్క్ నగర మేయర్ పదవికి డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఇతర దేశానికి చెందిన ఓ ఉన్నత స్థాయి నాయకుడు జైల్లో ఉన్న వ్యక్తికి లేఖ రాయడంతో.. ఉమర్ ఖాలిద్కు మరింత గుర్తింపు తెచ్చిఇచ్చింది.లేఖ సాధారణమే.. అయినప్పటికీ.. రాసిన లేఖ ఎఫెక్ట్ ప్రపంచంపై పడే అవకామంది. ఖాలిద్ వంటి కార్యకర్తలకు ఇది మానసిక ధైర్యం ఇస్తుంది. భారతదేశంలో మానవ హక్కుల పరిస్థితిపై అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. భారత్- అమెరికాల సంబంధంపైనా ప్రభావం చూపే అవకాశముంది. అమెరికా మాత్రమే కాకుండా... అమెరికా, యూరప్లోని కొన్ని రాజకీయ నాయకులు, మానవ హక్కుల సంస్థలు ఖాలిద్కు మద్దతు తెలుపుతూ... ఆయనపై కేసు రాజకీయ ప్రయోజనాలకోసం పెట్టారని ఆరోపించారు. -
ఇంటర్నెట్పై ఇరాన్ కీలక నిర్ణయం
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ఇంటర్నెట్ వినియోగం భారీ స్థాయిలో తగ్గినట్లు అక్కడి నివేదికలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే ఇంటర్నెట్, సోషల్ మీడియాలపై కఠిన ఆంక్షలు విధించిన దేశాల్లో ఇరాన్ టాఫ్ ప్లేసులో ఉందని అక్కడి సర్వేలు పేర్కొన్నాయి.ఇరాన్లో ప్రస్తుతం ఆర్థికసంక్షోభం, అధిక ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పతనం, మానవహక్కుల ఉల్లంఘన తదితర కారణాలతో అక్కడి ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. దీంతో పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఇంటర్నెట్ వాడకంపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. సోషల్ మీడియాలతో పాటు ఇతర సాధనాలపై బ్యాన్ విధించింది.దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు ఉండడంతో ప్రధాన సోషల్ మీడియా సాధనాలైన యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ తదితర వాటిపై పూర్తిస్థాయిలో నిషేదం విధించింది. అదే ఇరాన్- ఇజ్రాయెల్ ఘర్షణ సమయంలో దాదాపు పూర్తి స్థాయిలో దాదాపు 90 నుంచి 97శాతం ఇంటర్నెట్ సేవలను బ్యాన్ చేసింది. అంతేకాకుండా ఇంటర్నెట్లో వచ్చే ప్రతి కంటెంట్పై అక్కడి ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్లను ప్రసారం కాకుండా ఆంక్షలు విధించింది.డిజిటల్ అపార్థైడ్ అంతేకాకుండా ఇరాన్లో ఇప్పుడు అనుమతి ఉన్న వ్యక్తులు, సంస్థలకు మాత్రమే వైట్ సిమ్ కార్డులు ఇస్తున్నారు. ఇవి ఉన్న వ్యక్తులు మాత్రమే ఇంటర్నెట్కు ఎటువంటి అంతరాయం లేకుండా సేవలు పొందగలరు. సాధారణ ప్రజలకు ఇంటర్నెట్ వాడకంపై కొన్ని పరిమితులు కల్పించబడ్డాయి. దీంతో ఈనియమంపై అక్కడ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి.ఇలా నిరంతరంగా ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించడంతో ఆదేశ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం డిజిటల్ ఎకానమీ ట్రెండ్ నడస్తున్న నేపథ్యంలో రోజువారీ దైనందిన అవసరాలకు ఇంటర్నెట్ అవసరమైన నేపథ్యంలో ఆంక్షలు నేపథ్యంలో ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపుతుంది.అంతేకాకుండా ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ద్వారా గ్లోబల్ ఇంటర్నెట్ వ్యవస్థ నుండి దేశాన్ని వేరుచేసి ఇరాన్కు చెందిన ప్రత్యేక ఇంటర్నెట్ వ్యవస్థను సృష్టించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
పాక్ కొంప ముంచిన.. ఛాయ్.. చక్కెర
ఏ ఛాయ్ చటుక్కునా తాగరా భాయ్ అంటూ.. తేనీటిపై పాటలు విన్నాం..! ఛాయ్ వాలా ప్రధాని కావడం.. ఆపై ‘ఛాయ్ పే చర్చా’తో దేశ ప్రజలను ఆకట్టుకోవడం చూశాం..! కానీ, ఆ ఛాయ్ ఇప్పుడు పాకిస్థాన్ కొంప ముంచిందంటే నమ్ముతారా?? మీరు ఔనన్నా.. కాదన్నా.. ఇదే నిజం..! పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దిగజారడానికి ప్రధాన కారణాల్లో ఛాయ్ ఒకటి..! అంటే.. పాక్ ప్రజల్లో ఛాయ్ అలవాటు కారణంగా.. ఆ దేశం టీపొడి, చక్కెరను పెద్దమొత్తంలో దిగుమతి చేసుకుంది. ఇది విదేశీ మారకం కరిగిపోవడానికి కారణమైతే.. చక్కెర ఎక్కువగా వాడితే ఏమౌతుంది? షుగర్ వస్తుంది. అలా మధుమేహం బారిన పడ్డ వారి కారణంగా ఆ దేశ జీడీపీ నేలచూపులు చూడడం గమనార్హం..!పాకిస్థానీలు ఛాయ్ ఎక్కువగా తాగుతారు. ఏ ఇద్దరు మిత్రులు కలిసినా.. ఛాయ్ తాగాల్సిందే..! ఇంటికి చుట్టమొచ్చినా.. మిత్రులొచ్చినా.. టీతో ట్రీట్ జరగాల్సిందే..! పని ప్రదేశంలో ఛాయ్.. రెస్టారెంట్లు, సినిమా థియేటర్లలో ఛాయ్.. ఇలా పాకిస్థానీల జీవితం ఛాయ్తో ముడిపడి ఉంది. అందుకే.. 600 మిలియన్ డాలర్ల విలువైన టీపొడి పాక్కు నిత్యం దిగుమతి అవుతుంది. తేయాకును పండించే వాతావరణం పాక్లో లేకపోవడంతో.. ఎక్కువగా ఛాయ్ పొడి కోసం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఏటా ప్రతి పౌరుడు సగటున కేజీన్నర మేర టీపౌడర్ను వినియోగిస్తాడనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు..! అంటే సగటున ఒక పౌరుడు రోజుకు నాలుగైదు సార్లు ఛాయ్ తాగుతాడన్నమాట..! ఈ లెక్కన ప్రతిరోజు సగటున 60 గ్రాముల పంచదారను సేవిస్తున్నారు.పాకిస్థాన్ రికార్డుల ప్రకారం 1.5 మిలియన్ హెక్టార్లలో చెరుకు సాగు ఉన్నా.. గడిచిన ఐదేళ్లుగా అయితే అకాల వర్షాలు, లేదంటే కరువుకాటకాలతో దిగుబడి అంతంతగానే ఉంది. కొద్దోగొప్పో సింధూ, దాని ఉపనదులు చెరకు రైతులను ఆదుకున్నా.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ నీటిని నిలిపివేసింది. దీంతో.. పాకిస్థాన్ ప్రభుత్వం పంచదార కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీని ఖరీదు 4 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు పాక్ పత్రిక ‘ద డాన్’ ఇటీవల ఓ విశ్లేషణను ప్రచురించింది. 2030కల్లా ఇది 7 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా..! ఛాయ్తోపాటు.. మిఠాయిలు, బేకరీ ఉత్పత్తులు, జ్యూస్లలో సోడాలు అవసరం. ఏదైనా సంతోషం వచ్చినా.. శుభవార్తను విన్నా.. ‘‘ఆప్ కే మూమే గీ-చక్కర్’’.. అనడం పాకిస్థానీల ఆనవాయితీ..! ఇలా ఏడాదిలో ఒక వ్యక్తి సగటున 25 కిలోల చక్కెరను వినియోగిస్తాడు. ఇందులో సింహభాగం ఛాయ్, స్వీట్లలోనే వాడుతారు. పాకిస్థాన్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించే బడ్జెట్కు 100 రెట్లు అధికంగా చక్కెర, టీపొడిలపై పౌరులు వెచ్చిస్తుండడం గమనార్హం..! ఐదేళ్ల క్రితంతో పోలిస్తే.. 2025లో పాకిస్థాన్లో తేయాకు దిగుమతి 40% కంటే ఎక్కువగా పెరిగింది.ఇక పాకిస్థాన్లో డయాబెటిక్ రోగులకు కొదువ లేదు. గత ఏడాది వీరి సంఖ్య 31.4శాతం మేర పెరిగినట్లు.. ఇది ప్రపంచంలోనే వేగవంతమైన పెరుగుదల రేటు అని పాక్ వైద్యఆరోగ్య శాఖ గణాంకాలు కూడా చెబుతున్నాయి. చక్కెరకు తోడుగా పాక్ ప్రజలు అయితే నెయ్యి లేదంటే డాల్డాను ఎక్కువగా వాడుతారు. స్వీట్లతోపాటు.. బిర్యానీ వంటి వంటకాల్లో వీటి వినియోగం తప్పనిసరి. ఇవన్నీ కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు దారితీస్తాయనే విషయం తెలిసిందే..! ఇప్పటికే డయాబెటిస్లో పాక్ మొదటిస్థానంలో ఉండగా.. 50 ఏళ్లు పైబడిన వారిలో 30% మంది బీపీతో బాధపడుతున్నారు. ప్రతి ముగ్గురు పౌరుల్లో ఒకరు మధుమేహం బారిన పడ్డారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యాధుల చికిత్సలకు పౌరులు వెచ్చించే మొత్తం.. ప్రభుత్వం సర్కారీ దవాఖానాలకు అందజేయడం మామూలే. ఈ కారణంగా జీడీపీపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా పాకిస్థాన్ తన జీడీపీలో 2 నుంచి 3 శాతాన్ని కోల్పోతోందంటే.. తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.ఇక పాకిస్థాన్లో చక్కెర, టీపొడికి డిమాండ్ పెరగడంతో.. అక్రమ వ్యాపారాలు కూడా ఊపందుకున్నాయని ‘ద డాన్’ తన కథనంలో పేర్కొంది. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన పన్ను ఆదాయానికి గండిపడుతోంది. ఓ అంచనా ప్రకారం ఏటా 4.6 బిలియన్ డాలర్ల మేర అక్రమ రవాణాలు, ఆహార కల్తీలు జరుగుతున్నాయి. సింధూ నాగరికత ఆనవాళ్లు పాకిస్థాన్ మొహంజోదారోలోనే ఉన్నాయి. అప్పట్లో సింధూ ప్రజలు విరివిగా బెల్లం ఉత్పత్తి చేసేవారని, లోథాల్ ఓడరేవు మీదుగా విదేశాలకు నౌకలద్వారా ఎగుమతి చేసేవారని మనం చదువుకున్నాం. ఇప్పుడు పరిస్థితి రివర్సయింది. దిగుమతులపైనే ఆధారపడడం పాక్ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ::: హెచ్.కమలాపతిరావు -
వెనెజువెలా అధ్యక్షుడిని నిర్ణయించేది మేమే: ట్రంప్
కరాకస్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరిట అమెరికా వెనెజువెలాపై వైమానిక దాడులతో విరుచుకు పడింది. వెనెజువెలా రాజధాని కరాకస్తో సహా నాలుగు నగరాలను అమెరికా శనివారం రాత్రి లక్ష్యంగా చేసుకుంది. వీటిలో కరాకస్తో పాటు మిరాండా, అరగ్వా,లా గ్వైరా రాష్ట్రాల్లోని సైనిక స్థావరాలపై అమెరికా ఏడు వైమానిక దాడులు చేసింది. ఫలితంగా వెనెజువెలాలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ ఆదేశాల మేరకు దాడులు చేస్తున్నట్లు అమెరికా సైన్యం అధికారిక ప్రకటన చేసింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తొలి దాడి జరిగింది. అమెరికా మీడియా సీబీఎస్ న్యూస్ ప్రకారం, వెనెజువెలా లోపల సైనిక స్థావరాలు, అనేక నిర్దిష్ట ప్రదేశాలపై దాడికి ట్రంప్ ఆదేశించారు. ఈ దాడికి సంబంధించిన వైరల్ వీడియోలో సుమారు పదుల సంఖ్యలో హెలికాప్టర్లు చక్కెర్లు కొట్టాయి. -
Bangladesh: గాయపడ్డ హిందూ వ్యాపారి మృతి
ఢాకా: బంగ్లాదేశ్లో ఆందోళనకారులు చేసిన దాడిలో గాయపడ్డ హిందూ వ్యాపారి ఖోకాన్ దాస్ మృతిచెందాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం(జనవరి 3వ తేదీ) కన్నుమూశాడు. భర్త కన్నుమూయడంతో భార్య సీమా దాస్ కన్నీరుమున్నీరవుతుంది. తన భర్తపై దాడి ఎందుకు చేశారో ఇప్పటికీ అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమకు ఈ ప్రాంతంలో ఎవరూ శత్రువులు లేరని, కానీ తన భర్తపై దారణంగా దాడి చేసి చావుకు కారణం కావడం తనకు అంతులేని ఆవేదన మిగిల్చిందన్నారు. కాగా, హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న ఒక వర్గానికి చెందిన కొందర వ్యక్తులు కలిసి.. రెండు రోజల క్రితం ఖోకాన్ దాస్ అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారు. ఖోకాన్ దాస్కు నిప్పంటించి హత్య చేసే యత్నం చేశారు. 50 ఏళ్లకు పైగా ఉన్న ఖోకాన్ దాస్.. ఇంటికి వెళుతున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. షరియత్ పూర్ జిల్లాలో డిసెంబర్ 31వ తేదీన జరిగిన ఈ ఘటన మరొకసారి బంగ్లాదేశ్లో ఉంటున్న మైనార్టీ హిందువుల భవితవ్యంపై సవాల్ విసురుతోంది. బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మొహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వ ఏలుబడిలో హిందువులకు రక్షణ కరువైందన్న వాదనలకు మరింత బలం చేకూర్చింది. -
అమెరికా దాడులు.. వెనెజులాలో ఎమర్జెన్సీ విధింపు
అమెరికా వైమానిక దాడులతో దక్షిణి అమెరికా దేశం వెనెజులా దద్దరిల్లింది. భారత కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం ఆ దేశ రాజధాని కరాకస్తో దాడులు మొదలయ్యాయి. అసలేం జరగుతుందో అర్థంకాక జనం వీధుల్లోకి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భారీ పేలుళ్ల తర్వాత.. కరాకస్ సిటీ అంధకారంగా మారింది. కీలకమైన పోర్ట్, ఎయిర్పోర్టులు సహా మౌలిక సదుపాయాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. కరాకస్ నుంచి మొదలైన దాడులు.. క్రమక్రమంగా ఇతర రాష్ట్రాల్లోనూ(మిరాండా, అరాగ్వా, లా గువైరా) కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ దాడులు అమెరికా పనేనని ఆరోపించిన వెనెజులా జాతీయ అత్యవసర పరిస్థితి(Emergency in Venezuela) ప్రకటించింది. సైనిక స్థావరాలతో పాటు జనావాసాలపైనా దాడులు జరుగుతున్నట్లు చెబుతోంది. పలుచోట్ల రక్షణ దళాలను మోహరింపజేసింది. అమెరికా సైన్యం వెనిజులాపై దాడులు ప్రారంభించిందని ఫాక్స్ న్యూస్ వర్గాలు వాషింగ్టన్ అధికారులను ఉటంకిస్తూ నివేదించాయి. ఈ దాడుల లక్ష్యం దేశంలోని చమురు, ఖనిజ వనరులను స్వాధీనం చేసుకోవడం కోసమేనని, రాజకీయ స్వాతంత్ర్యాన్ని దెబ్బతీయడం అని వెనెజులా ఆరోపించింది. అయితే, గతంలోలాగే ఈ ప్రయత్నాలు ఈ ప్రయత్నాలు కూడా విఫలమవుతాయని అంటోంది. అయితే అమెరికా ఈ దాడులపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ వేకువజామున కరాకస్లో మొత్తం ఏడు చోట్ల పేలుళ్లు సంభవించినట్లు ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ కథనం ప్రచురించింది. విమానం తక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు శబ్దాలూ వినిపించాయని స్థానికులు చెప్పినట్లు ఆ కథనం ఉటంకించింది.que dios bendiga a todas las personas inocentes que quedaron en medio del bombardeo en caracas - venezuela pic.twitter.com/etH1wbo1sa— haaland erling (@gxldehaalandd) January 3, 2026ఇదిలా ఉంటే.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో కొంతకాలంగా వెనెజువెలాను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ట్రంప్ ఆదేశాల మేరకు డ్రగ్స్ను తరలిస్తున్న పడవలు, జలాంతర్గాములపై దాడుల్ని ముమ్మరం చేసింది. కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది. దీనికి కౌంటర్గా అమెరికన్ పౌరులను వెనెజులా అరెస్ట్ చేయడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. ఈ పరిణామాల నడుమ వైమానిక దాడులకు దిగడం గమనార్హం.వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో.. చైనా ప్రత్యేక దౌత్యవేత్త క్వీ గ్సియాగితో భేటీ అయిన కొద్దిగంటలకే ఈ దాడులు జరిగాయి. వెనెజులా అధ్యక్ష భవనం లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం అందుతోంది. ఈ పేలుళ్ల ఆ చుట్టుపక్కల ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.ఈ పేలుళ్ల గురించి ట్రంప్నకు స్పష్టమైన సమాచారం ఉందని సీబీఎస్ వార్తా సంస్థ ఒక కథనం ప్రచురించింది. పేలుళ్ల నేపథ్యంతో అమెరికా తమ దేశ విమానాలు వెనెజులా గగనతలం నుంచి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. స్థానికంగా ఉండే సీఎన్ఎన్ జర్నలిస్ట్ ఒకరు పేలుడుకు సంబంధించిన పోస్ట్ ఒకటి చేశారు. శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయని.. ఆ ధాటికి తాను ఉంటున్న కిటికీ అద్దాలు పగిలిపోయాయని చెప్పుకొచ్చారు. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ పేలుళ్లపై స్పందించారు. వెనెజులా రాజధాని క్షిఫణుల దాడులతో మారుమోగుతోందని.. ప్రపంచం ఈ విషయం గమనించాలని అన్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్(OAS), ఐక్యరాజ్య సమితి తక్షణమే సమావేశం నిర్వహించాల్సి ఉందంటూ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్చేశారాయన. -
రెడ్ లైన్ దాటితే ఏం చేయాలో మాకు తెలుసు!
ఇరాన్లో కరెన్సీ విలువ పతనంతో మొదలైన ఆర్థిక సంక్షోభం.. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా నడుస్తున్న ఆందోళనలు హింసాత్మక మలుపు తీసుకున్నాయి. భద్రతా బలగాలకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో హింస చెలరేగి ఇప్పటిదాకా 8 మంది మరణించారు. అయితే ఈ పరిణామాలను ఆధారంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు వార్నింగ్ ఇవ్వగా.. ఆ దేశం కౌంటర్ వార్నింగ్ ఇచ్చింది. అదే జరిగితే ప్రతిస్పందన మరోలా ఉంటుందంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.ఇరాన్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాట్లు మరిన్ని నగరాలకు విస్తరించాయని కథనాలు వెలువడుతున్నాయి. పలు చోట్ల భద్రతా బలగాలకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయన్నది ఆ కథనాల సారాంశం. అయితే శాంతియుతంగా నిరసనలు తెలిపేవారిపై కాల్పులు జరిపితే మేం జోక్యం చేసుకుంటామంటూ ట్రంప్ ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. దీనికి ఇరాన్ ఘాటుగా స్పందించింది.ట్రంప్ హెచ్చరికలను తిప్పి కొట్టింది ఇరాన్. తమ దేశ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకుంటే అది ఘర్షణలకు దారి తీస్తుందని.. ఇరాన్ జాతీయ భద్రత రెడ్లైన్ లాంటిదని.. దానిని దాటే ప్రయత్నం చేస్తే ఎక్కడ గురిపెట్టాలో తమకు తెలుసని.. కాబట్టి అమెరికా అలా చేయకపోవడం ఉత్తమం’’ అని ఖమేనీ సలహాదారు అలీ షంఖానీ ఒక ప్రకటనలో తెలిపారు.మరోవైపు.. ట్రంప్ బెదిరింపుల అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లింది ఇరాన్. ఐరాసలో ఆ దేశ రాయబారి అమీర్ సయ్యద్ ఇర్వానీ ఈ మేరకు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, భద్రతా మండలి అధ్యక్షుడికి లేఖ రాశారు. ట్రంప్ బెదిరింపులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంటూ ఖండించిన ఇర్వానీ.. అవసరమైతే తమ దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకునే హక్కుల్ని వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. ఇరాన్ మరో సీనియర్ నేత అలి లారిజానీ సంచలన ఆరోపణలకు దిగారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంలో నిరసనలను ప్రేరేపిస్తున్నాయని అన్నారు. ఇరాన్లో విదేశీ జోక్యం జరిగితే ప్రాంతీయ అస్థిరత పెరుగుతుందని సొంత ప్రజలను ఉద్దేశించి హెచ్చరించారాయన.ఇరాన్లో నిరసనలు ఏడో రోజుకి చేరాయి. 2022లో మోరల్ పోలీసింగ్ ఘటనతో మరణించిన మహ్సా అమినికి సంఘీభావంగా మహిళా లోకం పెద్ద ఎత్తున ఉద్యమించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇరాన్లో ఆ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. -
బలూచిస్తాన్పై చైనా కన్నుపడిందా?
విదేశీ భూభాగాలపై కన్నేయడం చైనాకు పరిపాటి. అది పొరుగు దేశమైతే చైనా చర్యలు మరీ అతిగా ఉంటాయి. ఈ క్రమంలోనే వేరే దేశం భూభాగాన్ని తమ మ్యాప్లో కూడా చూపించడానికి చైనా వెనుకాడదు. ముందు ఒక రాయి వేసి.. తర్వాత ఏం జరుగుతుందో చూస్తుంది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ని పదే పదే చైనా తమ భూభాగంలో చూపించడం ఒక ఉదాహరణ. అయితే ఇక్కడ భారత్ బలమైన దేశం అనేది ఒకటైతే, ఇప్పుడు చైనాకు భారత్ సాయం అవసరం ఉంది కాబట్టి వారు ఎటువంటి దుస్సాహసానికి పాల్పడటం లేదు. గత కొన్నేళ్లుగా భారత్పై దూకుడుగా ఉండే విషయంలో చైనా ఆచితూచి వ్యవహరిస్తోంది. అదే సమయంలో భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న చైనా.. ఇప్పుడు వేరే దేశాలపై పడింది. అందులో ఒకటి రష్యా అయితే, మరొకటి పాకిస్తాన్.కొన్ని రోజుల క్రితం రష్యా భూభాగాన్ని తమ మ్యాప్లో చూపించిన చైనా.. ఇప్పుడు పాకిస్తాన్ను టార్గెట్ చేసింది. చైనాకు పాకిస్తాన్ మిత్రదేశమే కానీ, అవకాశం వస్తే తమకు మిత్రులు, శత్రువులు ఎవరూ ఉండరనే నైజం చైనాది. ఆ క్రమంలోనే పాకిస్తాన్లోని బలూచిస్తాన్ భూభాగంపై చైనా కన్నేసినట్లు కనబడుతోంది. ఎప్పుట్నుంచో పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్న బలూచిస్తాన్.. సుదీర్ఘ పోరాటం చేస్తుంది. తమ హక్కులను పాకిస్తాన్ కాలరాస్తుందని, అందుకు తమకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ ఎక్కువైంది. పాక్పై ప్రేమా..యురేనియం నిల్వలే టార్గెటా?బలూచిస్తాన్లో యురేనియం నిల్వలు ఉన్నాయనేది కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్న తరుణంలో చైనా ఆచితూచి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. పాకిస్తాన్కు సైనిక సాయం పేరుతో ముందుగా వారి భూభాగంలోకి ప్రవేశించాలని చైనా కుట్ర రాజకీయాలకు పాల్పడే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంటున్నారు. అందిందే జుట్ట.. అందకపోతే స్నేహం అనేది చైనా వైఖరి. ఇప్పడు భారత్ విషయంలో చైనా అదే చేస్తంది. మరి పాకిస్తాన్ విషయంలో చైనా అలా ఎందుకు ఆలోచించదని నిపుణులు చెబుతున్న మాట,. ప్రస్తుతం పాకిస్తాన్క సైనిక సాయం పేరుతో చైనా ఒక అడుగు ముందకేసి, ఆ తర్వాత మిగతాది చూసుకోవచ్చనే దృష్టితో ఉందని అంటున్నారు.బలూచిస్తాన్లో యురేనియం నిల్వల పరిస్థితిబలూచిస్తాన్లో యురేనియం నిల్వలు ఉన్నాయని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఇవి చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్టులకు కూడా భద్రతా, భౌగోళిక రాజకీయ పరంగా ప్రభావం చూపుతున్నాయి.ప్రపంచ స్థాయి యురేనియం నిల్వల జాబితాలో పాకిస్తాన్ పేరు ఉన్నప్పటికీ, బలూచిస్తాన్లోని నిల్వల ఖచ్చితమైన పరిమాణం అంతర్జాతీయ నివేదికల్లో స్పష్టంగా ఇవ్వబడలేదు. ఈ వనరుల కారణంగా స్థానిక ప్రజల్లో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం రాజకీయ అస్థిరత కారణంగా తవ్వకాలు, వినియోగం కష్టతరంగా మారాయి. ఓవరాల్గా చూస్తే ఈ వనరులు పాకిస్తాన్కు వ్యూహాత్మకంగా ముఖ్యమైనవి. చైనా పెట్టుబడులు, స్థానిక అసంతృప్తి, మరియు అంతర్జాతీయ ఆసక్తి కారణంగా ఇవి సున్నితమైన అంశంగా మారాయి.బలూచిస్తాన్ నేతల్లో అదే ఆందోళన..ప్రస్తుతం బలూచిస్తాన్ నేతల్లో అదే ఆలోచన ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు పాకిస్తాన్తో పోరాడటానికే తాము ఆపసోపాల పడుతుంటే, మరొకవైప చైనా గోల ఏమిటో వారికి అంతుపట్టడం లేదు. తమ భూభాగంలోకి చైనా సైనిక దళాలు వస్తాయనే కచ్చితమైన సమాచారంతోనే వారు భారత్ సాయాన్ని అభ్యర్థిస్తున్నారు. అందుకోసమే భారత్ సాయాన్ని పదే పదే కోరుతున్నారు. అయితే బలూచిస్తాన్కు సాయం విషయంలో భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. ఎందుకంటే బలూచిస్తాన్ను కూడా పూర్తిగా నమ్మలేం. అసలే ఉగ్రవాద మూలాలున్న బలూచిస్తాన్కు సాయం చేస్తే తర్వాత భారత్కు విపత్కర పరిస్థితుల ఏర్పడవచ్చు.అందుకోసమేనా ఎదురుచూపులు?తమకు అవకాశం వచ్చినప్పుడల్ల పాకిస్తాన్తో యద్ధానికి కూడా సై అంటోంది బలూచిస్తాన్. అయితే జనాభా పరంగా చూసినా, బలూచిస్తాన్ రెబల్స్ ప్రకారం చూసినా.. ఒక దేశంతో పోరాడాలంటే వారి శక్తి సరిపోదు. ఈ తరుణంలో తమ భూభాగంలోకి చైనా వైమానిక దళాలు త్వరలో రాబోతున్నాయని బలూచిస్తాన్ అగ్రనేత మిర్ బలూచ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసం భారత్ సాయాన్ని కూడా అభ్యర్థించారు. దశాబ్దాల క్రితం పాకిస్తాన్ నుంచి విముక్తి పొందిన బంగ్లాదేశ్ తరహాలో తమకు స్వాతంత్ర్యం కావాలని బలూచిస్తాన్ నేతలు కోరుకుంటున్నారు. అప్పుడు ఎలా అయితే భారత్ సాయం చేసిందో ఇప్పుడు కూడా తమకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటోంది. ఈ క్రమంలోనే భారత విదేశాంగ మంత్రి జై శంకర్కు సైతం బలూచిస్తాన్ నుంచి లేఖ వచ్చింది.బలూచిస్తాన్ సాయం విషయంలో భారత్ ఎటువంటి దూకడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు బలూచిస్తాన్కు సైనిక బలం కావాలి కాబట్టి. భారత్ సాయాన్ని కోరుతుందనేది అందరికీ తెలిసిన విషయం. ఈ తరుణంలో బలూచిస్తాన్కు భారత్ మద్దతు ఇచ్చే అవకాశం ఉండదు. కానీ పాకిస్తాన్ నుంచి మరొకసారి ముప్పు ఎదురైన పక్షంలో భారత్ తమ ఉన్న వనురులను ఉపయోగించుకునే ముందుకెళ్తుంది. అది బలూచిస్తాన్కు పరోక్షంగా కలిసి వస్తుందా లేదా అనేది తర్వాత విషయం. అయితే త్వరలో ఆపరేషన్ 2.0 అని వార్త ఇప్పుడు మరొక ఆసక్తిని పెంచుతుంది. మార్చి నెలలో పాక్పై భారత్ ఆపరేషన్ సిందూర్ 2.0ను చేపట్టనుందనే ఇప్పుడు దాయాది దేశం ఉగ్రవాదుల్లో గుబుల పుట్టిస్తోంది. మరొకవైపు భారత్ ఆపరేషన్ సిందూర్ 2.0 చేపడితే, సందట్లో సడేమియా అన్నట్లు తాము కూడా పాకిస్తాన్కు చుక్కలు చూపించాలని బలూచిస్తాన్ రెబల్స్ భావిస్తున్నారు. -
అమెరికాలో బయటపడ్డ భారీ ఉగ్ర కుట్ర
అమెరికాలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం అయ్యింది. ఐసిస్తో సంబంధాలున్న ఓ టీనేజర్ను ఎఫ్బీఐ అదుపులోకి తీసుకుంది. న్యూఇయర్ వేడుకల సందర్భంగా దాడులకు అతను ప్రయత్నించినట్లు దర్యాప్తు సంస్థ చీఫ్ కాష్ పటేల్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా యువత ఆన్లైన్ కార్యకలాపాలపై నిఘా సారిస్తామని ప్రకటించారాయన. పక్కా సమాచారంతో నార్త్ కరోలినాలోని షార్లెట్ సమీపంలో మింట్ హిల్ ప్రాంతానికి చెందిన ఓ టీనేజర్ను ఎఫ్ఐబీ అదుపులోకి తీసుకుంది. అతని నుంచి దాడికి సంబంధించిన ప్రణాళికను సైతం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా రద్దీగా ఉండే ఓ గ్రాసరీ స్టోర్, మరో ఫాస్ట్ఫుడ్ రెస్టారెంట్లో మారణహోమం జరపాలని చూశాడని కాష్ పటేల్ మీడియాకు వెల్లడించారు. ఐసిస్ లింకులుఎఫ్బీఐ అదుపులో ఉన్న టీనేజర్ పేరు క్రిస్టియన్ స్టర్డివాంట్. వయసు 18 ఏళ్లు. ఐసిస్ ప్రేరణతోనే అతను దాడులు చేయాలని భావించినట్లు తెలుస్తోంది. ఆన్లైన్ ద్వారా విదేశీ ఉగ్రసంస్థ అతనికి బ్రెయిన్వాష్ చేసిందని ఎఫ్బీఐ ప్రకటించింది. ‘‘మూడేళ్లుగా అతనిపై నిఘా ఉంచాం. యూరప్లోని ఓ ఐసిస్ సభ్యుడితో కాంటాక్ట్లో ఉన్నాడు. అక్కడి నుంచి అతనికి ఆన్లైన్లో ఆదేశాలు అందేవి. నల్ల దుస్తుల్లో దాడులకు పాల్పడాలని అతనికి సమాచారం అందింది. తనను తాను ఐసిస్ సైనికుడిగా ప్రకటించుకుని.. దాడికి సిద్ధమంటూ అవతలి వాళ్లకు డిసెంబర్ 12వ తేదీన ఓ సందేశం పంపాడు. ఈ దాడికి తాను పని చేసే చోట్లనే ఎంచుకున్నాడు. ముస్లింయేతర గ్రూపులు, ఎల్జీబీటీక్యూలను, యూదులు, క్రిస్టియన్లపై దాడుల చేయాలని తన బుక్లో రాసుకున్నాడు. ఐసిస్కు సంబంధించి టిక్టాక్ వీడియోలను ఇతను ప్రొత్సహించాడు. అతని మానసిక స్థితి కూడా బాగోలేదు. గతంలో చికిత్స తీసుకున్నట్లు ఆధారలు లభించాయి’’ అని అధికారులు తెలిపారు.అయితే తుపాకులు, బాంబులతో కాకుండా కత్తులు, హ్యమర్లతో దాడికి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయుధాల్ని ఎఫ్బీఐ స్వాధీనం చేసుకుంది. మరోవైపు.. ఐసిస్ ఉగ్రవాద సంస్థతో అతనికి సంబంధాలు ఉన్నట్లు అమెరికా న్యాయశాఖ (US Justice Department) ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా యువతలో ఈ తరహా సంబంధాలపై నిఘా, దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాల్సిన అవసరం ఉందని సూచించింది.ఆ పేపర్పై.. మింట్హిల్లోని క్రిస్టియన్ ఇంటిని తనిఖీలు నిర్వహించినప్పుడు “New Years Attack 2026” అనే టైటిల్తో ఉన్న ఒక బుక్ను గమనించారు. అందులో దాడి ఎలా చేయాలి.. ఎలా తప్పించుకోవాలి.. విపత్కర పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలి అనే వివరాలు ఉన్నట్లు ఎఫ్ఐబీ అధికారులు తెలిపారు. డిసెంబర్ 31వ తేదీన అతనిపై క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేసి.. నిన్న కోర్టులో హాజరు పరిచారు. నార్త్ కరోలినా వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ యుఎస్ అటార్నీ రస్ ఫెర్గుసన్ ‘‘క్రిస్టియన్ స్టిర్టివాంట్ జిహాద్కు సిద్ధమయ్యాడు. కాస్తుంటే అమాయకులు ప్రాణాలు పోయేవే’’ అని వ్యాఖ్యానించారు. స్టర్డివాంట్ తనపై ఆరోపణలకు ఇంకా నోరు విప్పలేదు. ప్రస్తుతం కస్టడీలోనే ఉన్న అతన్ని.. వచ్చే వారం ఎఫ్బీఐ కోర్టులో హాజరు పర్చనుంది. -
అర్ధరాత్రి, వణికించే చలిలో క్యాబ్లోనే ప్రసవం
టొరంటో: అర్ధరాత్రి. ఎముకలు కొరికే చలి. ఏకంగా మైనస్ 23 డిగ్రీల అతి శీతల వాతావరణం. వెనక సీట్లో నిండు గర్భిణి ప్రసవ వేదన. టైర్లకు అస్సలు పట్టు దొరక్క రోడ్డుపై నుంచి పక్కలకు జారిపోతున్న కారు. ఇంకోవైపు నొప్పులు భరించలేక సీటును తంతూ, కేకలు పెడుతూ ఆమె పడుతున్న వేదన. పక్కనే కూచుని బిక్కచచ్చిపోయి చూస్తున్న భర్త. ఆ అరుపుల్ని ఉంటూ, ఆమె బాధను వ్యూ మిర్రర్ లోంచి చూస్తూ, అత్యంత ప్రతికూలమైన ఆ పరిస్థితుల్లో తనను తక్షణం ఆస్పత్రికి చేర్చాల్సిన బాధ్యత. కెనడాలో (Canada) భారత సంతతికి చెందిన హర్ దీప్ సింగ్ తూర్ అనే క్యాబ్ డ్రైవర్ తన వృత్తి జీవితంలోనే ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు ఇది. దీనికి తోడు ప్రతి జంక్షన్ లోనూ రెడ్ సిగ్నల్స్. అయినా అన్నింటికీ తట్టుకుంటూ పళ్ల బిగువున దూసుకెళ్లారాయన. అయితే ఆస్పత్రి కనుచూపు మేరలో ఉండగానే కారు వెనక సీటులోనే ప్రసవించిందా మహిళ. అనంతరం కొన్ని క్షణాల్లోనే తల్లీబిడ్డా ఇద్దరినీ భద్రంగా ఆస్పత్రికి చేరవేసి ఊపిరి పీల్చుకున్నారు హర్ దీప్. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన గత శనివారం టొరంటోలో జరిగింది. ఆ అనుభవాన్ని ఆయన స్థానిక మీడియాతో పంచుకున్నారు. ‘ఇక ఇంటిముఖం పడదామని అనుకుంటుండగా ఓ బుకింగ్ వచ్చింది. అర్జంటుగా ఆస్పత్రికి వెళ్లాలని చెప్పారు. తీరా పికప్కు వెళ్లాక నిండు గర్భిణిని ఆమె సహచరుడు అతి కష్టమ్మీద తీసుకొచ్చి వెనక సీట్లో పడుకోబెట్టాడు. కార్లో ప్రయాణం ఆమెకు సేఫ్ కాదనిపించింది. అంబులెన్స్ పిలుద్దామా అని ఆలోచించా. కానీ అర్ధరాత్రి, అంత చలిలో అది రావడానికి సమయం పడుతుంది. అంత ఆలస్యం చేస్తే ప్రమాదమని తెగించి బయల్దేరా. ఆ అరగంట డ్రైవ్ నా జీవితంలోనే అతి సుదీర్ఘమైనదిగా తోచింది. ఎలాగైతేనేం, చివరికి తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉండటం ఎంతో సంతోషాన్నిచ్చింది‘ అంటూ చెప్పుకొచ్చారు. ఇద్దరిని ఎక్కించుకుని ముగ్గురిని దించిన ఘనత తనకే దక్కిందంటూ నవ్వులు పూయించారు.చదవండి: ఇండియా అబ్బాయి.. జపాన్ అమ్మాయి! -
నేడు మరో నూతన సంవత్సరం.. కోలాహలానికి భిన్నంగా..
క్యాలెండర్లో పేజీలు మారడం అనేది కేవలం కాలగమన సూచిక మాత్రమే కాదు.. అది మనిషి తనను తాను పునరావిష్కరించుకునేందుకు ఏర్పడిన ఒక అద్భుత అవకాశం. దానిని గుర్తు చేసేదే ‘మహాయాన నూతన సంవత్సరం’ నేడు(జనవరి 3) ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది బౌద్ధ అనుచరులు ‘మహాయాన నూతన సంవత్సరం’ జరుపుకుంటున్నారు. ఈ రోజున వారంతా అంతర్గత మౌనం, ఆత్మపరిశీలనకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని, కరుణను బోధించే మహాయాన బౌద్ధులు నూతన సంవత్సర వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 2026, జనవరి 3వ తేదీన చైనా, జపాన్, టిబెట్, కొరియా తదితర దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహాయాన బౌద్ధులు ఆధ్యాత్మిక వెలుగుల మధ్య ఈ పర్వదినాన్ని చేసుకుంటున్నారు.'మహాయాన'.. అందరికీ విముక్తి మార్గంసంస్కృతంలో ‘మహాయాన’ అంటే ‘గొప్ప వాహనం’ అని అర్థం. కేవలం కొద్దిమందికే పరిమితం కాకుండా, సమాజంలోని ప్రతి ఒక్కరికీ జ్ఞానోదయం పొందే అవకాశం ఉందని ‘మహాయాన’ సిద్ధాంతం బలంగా నమ్ముతుంది. సన్యాసులతో పాటు సామాన్య గృహస్థులు కూడా తమ దైనందిన జీవితంలోనే నిర్వాణాన్ని సాధించవచ్చని మహాయానశాఖ బోధిస్తుంది.ఆత్మపరిశీలనతో..బౌద్ధ నూతన సంవత్సరం అంటే కేవలం బాహ్య సంబరాలకు మాత్రమే పరిమితం కాదు. ఇది అంతర్గత శుద్ధికి ప్రతీక. గత ఏడాది చేసిన పొరపాట్లన్నింటినీ సమీక్షించుకుంటూ, కొత్త సంవత్సరంలో మరింత ఉత్తమమైన వ్యక్తిగా ఎదగాలని సంకల్పించడం ఈ రోజు చేయాల్సిన ముఖ్యమైన పని. తనను తాను తెలుసుకోవడమే నిజమైన విజయమని చెప్పిన బుద్ధుని బోధనలను అతని అనుచరులు ఈ సందర్భంగా స్మరించుకుంటారు.బౌద్ధ విహారాల్లో ఆధ్యాత్మిక కోలాహలంఈ పర్వదినాన బౌద్ధ విహారాలు భక్తులతో నిండిపోతాయి. దేవతామూర్తుల విగ్రహాలకు పవిత్ర జలాలతో అభిషేకం చేయడం, సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించడం ఒక ముఖ్యమైన ఆచారంగా వస్తోంది. కొవ్వొత్తుల వెలుగులో ఆధ్యాత్మిక గీతాలను ఆలపిస్తూ, లోకంలోని అజ్ఞాన చీకట్లు తొలగిపోవాలని భక్తులు ప్రార్థిస్తారు.అదృష్టానికి చిహ్నంగా గృహాలంకరణమహాయాన నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ బౌద్ధులు తమ ఇళ్లను శుభ్రం చేసి, రంగురంగుల దీపాలతో, అలంకరణలతో ముస్తాబు చేస్తారు. ఇది ఇంటిలోని ప్రతికూల శక్తిని తొలగించి, సానుకూలతను ఆహ్వానిస్తుందని వారు నమ్ముతారు. స్నేహితులు, బంధువులు కానుకలను ఇచ్చిపుచ్చుకుంటారు. తద్వారా తమలోని ప్రేమను, ఐక్యతను చాటుకుంటారు.సంప్రదాయ విందులు ఈ పండుగలో భక్తితో పాటు వినోదం కూడా తోడవుతుంది. బౌద్ధ అనుచరులు రాత్రి వేళ కుటుంబ సభ్యులందరితో కలిసి విందు భోజనాలు ఆరగిస్తారు. అర్ధరాత్రి వేళ ఆకాశంలో బాణసంచా వెలుగులు విరజిమ్ముతుండగా, సంతోషంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.చారిత్రక వారసత్వంక్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో లుంబినిలో సిద్ధార్థుడు జన్మించాడు. క్రీ.పూ. 528లో బోధగయలో జ్ఞానోదయం పొందిన ఆయన ‘బుద్ధుడు’గా అవతరించాడు. అశోక చక్రవర్తి హయాంలో ఆసియా ఖండమంతటా విస్తరించిన బౌద్ధ జీవన విధానం.. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి శాంతిని అందించే మార్గదర్శిగా నిలిచింది.మతం కాదు.. జీవన విధానంప్రస్తుత ఆధునిక కాలంలో బౌద్ధాన్ని ఒక మతంగా కంటే ఒక సైకాలజీగా (మనస్తత్వ శాస్త్రం) ప్రపంచం గుర్తిస్తోంది. ఆడంబరాలకు దూరంగా, కేవలం మానసిక ప్రశాంతత, అహింస, కరుణ ప్రాతిపదికన ఈ పండుగ చేసుకుంటారు. ఏ దేశానికి ఉన్న ఆచారాల ప్రకారం వారు ఈ ఉత్సవాన్ని జరుపుకున్నా, దాని పరమార్థం మాత్రం ఒక్కటే.. అదే శాంతియుత జీవనం విధానం.శాంతి మంత్రమే రక్షప్రపంచవ్యాప్తంగా అశాంతి నెలకొన్న నేటి తరుణంలో, మహాయాన నూతన సంవత్సరం శాంతి సందేశాన్ని అందరికీ అందిస్తోంది. ‘అప్పో దీపో భవ’ (నీకు నీవే కాంతివి కావాలి) అన్న బుద్ధుడి మాటలను స్మరించుకుంటూ, ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ జ్ఞానమనే జ్యోతిని తమలో వెలిగించుకోవాలని బౌద్ధ మతం మనకు చెబుతోంది.ఇది కూడా చదవండి: తొలి గ్రీటింగ్ అలా..‘ఆర్చీస్’ సామ్రాజ్యం ఇలా.. -
ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్గా ఉన్నావు
మనూళ్లో తాగిన మైకంలో వేరే వాళ్ల చెప్పులు వేసుకుని వెళ్లేవారిని చూస్తుంటాం, అమెరికాలో ఒక ఘరానా దొంగ మందు మత్తులో మ్యూజిక్ దుకాణంలోకి దూరాడు. రెండు ఖరీదైన మ్యాండోలిన్లను లేపేశాడు. సీన్ కట్ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత దొంగగారిలో జ్ఞానోదయం కలిగింది. అసలేం జరిగిందంటే.. న్యూజెర్సీలోని ఒక పాతకాలపు మ్యూజిక్ దుకాణంలోకి డిసెంబర్ 22న ఒక దొంగ ప్రవేశించాడు. సుమారు రూ.7 లక్షల రూపాయల విలువైన రెండు మ్యాండోలిన్లను గుట్టుచప్పుడు కాకుండా తన కోటు లోపల దాచేసి చెక్కేశాడు.మైకం దిగాక పశ్చాత్తాపం పాపం, ఆ దొంగగారికి మత్తు దిగాక తాను ఏం చేశానో తెలిసి గుండె ఝల్లుమంది! వెంటనే ఆ రెండు వాయిద్యాలను రెండు క్యారీ బ్యాగుల్లో సర్దుకుని, నేరుగా మ్యూజిక్ దుకా ణం గుమ్మం ముందు పెట్టేసి పరుగు లంఘించుకున్నాడు. అంతేనా.. దాంతో పాటు క్షమాపణ లేఖ కూడా రాసి పెట్టాడు. అందులో మేటర్ చూసి షాపు యజమా ని బజ్జీ లెవిన్ బుర్ర పాడైపోయింది. ‘అయ్యా క్షమించండి! ఆ రోజు ఫుల్లుగా తాగి ఉన్నాను. అందుకే ఇలా జరిగింది. మెర్రీ క్రిస్మస్! మీరు చాలా మంచోళ్ళు సార్!’.. ఇదీ లేఖ సారాంశం.ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అది చూసిన యజమాని బజ్జీ లెవిన్, ‘వీడెవడ్రా బాబూ ఇంత వెరైటీగా ఉన్నాడు’.. అని ఆశ్చర్యపోయాడు. వస్తువులు పెట్టేసి దొంగ పరిగెడుతుంటే, యజమాని కూడా వెనకాలే పరుగు అందుకున్నాడు. కానీ ఆ దొంగగారు ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా మాయమైపోయారు. ‘నా జీవితంలో ఇలాంటి వింత ఎప్పుడూ చూడలేదు బాబోయ్’.. అని యజమాని నెత్తీనోరు కొట్టుకుంటున్నాడు. చిలిపి దొంగ కోసం గాలింపు చివరికి 911కి ఫోన్ చేస్తే, పోలీసులు ఇప్పుడు ఆ మందుబాబు కోసం గాలిస్తున్నారు. మందులో ఉన్నప్పుడు మ్యాండోలిన్ గుర్తొచ్చింది.. మత్తు దిగాక మాత్రం మనస్సాక్షి గుర్తొచి్చంది’.. అని జనం నవ్వుకుంటున్నారు. పాపం.. మందు కొట్టి దొంగతనం చేసినా, ’మెర్రీ క్రిస్మస్’ చెప్పడం మాత్రం మర్చి పోలేదు మన చిలిపి దొంగ. -
మళ్లీ కిమ్ కుమార్తె హల్ చల్!
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కూతురు కిమ్ జు యే మరోసారి బహిరంగంగా కనిపించారు. గురువారం కొత్త సంవత్సరం సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి తాత, ముత్తాతల సమా«ధిని ఆమె తొలిసారి బహిరంగంగా సందర్శించారు. తల్లిదండ్రులతో ముందు వరుసలో నిలబడి ‘కుముసుసన్’స్మారకానికి నమస్కరిస్తున్న చిత్రం శుక్రవారం ఆ దేశ ప్రభుత్వ మీడియాలో ప్రచురితమైంది. 41 ఏళ్ల కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియాను పరిపాలిస్తున్న తన కుటుంబంలోని మూడోతరం నాయకుడు. 2022 నవంబర్లో మొదటిసారిగా కిమ్ కుమార్తె ప్రభుత్వ మీడియాలో కనిపించారు. అప్పటినుంచి పైనిక కవాతులు, క్షిపణి ప్రయోగాలతో సహా అనేక కార్యక్రమాల్లో తన తండ్రితో పాటు పాల్గొంటున్నారు. గతేడాది సెప్టెంబర్లోకిమ్ చైనా పర్యటనలోనూ ఆమె వెంట ఉన్నారు. కిమ్ ఇంకా చిన్న వయసులోనే ఉన్నారు. ఆయనకెలాంటి అనారోగ్య సమస్యలు కూడా లేవు. దానికి తోడు ఉత్తర కొరియా అత్యంత పురుషాధిక్య స్వభావం కలిగిన దేశం. అలాంటిది కిమ్ తన కుమార్తెను బయటి ప్రపంచానికి పదేపదే కనిపించేలా చేయడం ఆశ్చర్యం కలిగిండచంతోపాటు చర్చనీయాంశం కూడా అయ్యింది. కుటుంబ పాలనను విస్తరించాలనే ఆలోచనలకు ప్రజల మద్దతును పెంచుకోవడం కోసమే కిమ్ ఇలా కూతురును ముందుకు తెస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. -
మేమంతా నీ గురించే ఆలోచిస్తున్నాం
న్యూయార్క్: ఢిల్లీ అల్లర్ల కేసులో జైలులో ఉన్న ఉద్యమకారుడు ఉమర్ ఖలీద్కు అమెరికాలోని న్యూయార్క్ నూతన మేయర్ జొహ్రాన్ మమ్దానీ మద్దతు తెలపడం తీవ్ర వివాదం రేపుతోంది. ‘డియర్ ఉమర్, విద్వేషం, చేదు అనుభవం గురించి నువ్వు చెప్పిన మాటలను, అది ఒక వ్యక్తిని పూర్తిగా దహించి వేయకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో నువ్వు వివరించిన తీరును నేను తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. మీ తల్లిదండ్రులను కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషం వేసింది. మేమంతా నీ గురించే ఆలోచిస్తున్నాం’అని ఆ నోట్లో ఉంది. మమ్దానీ స్వయంగా రాసి సంతకం చేసిన ఆ నోట్ను ఆయన భాగస్వామి బనోజ్యోత్స్న లాహరి ఎక్స్లో.. ‘జైళ్లు ఒంటరిని చేయడానికి ప్రయతి్నస్తే మాటలు ప్రయాణిస్తాయి. ఉమర్ ఖలీద్కు జొహ్రాన్ మమ్దానీ ఇలా రాశారు..’అనే క్యాప్షన్తో పోస్ట్ చేశారు. ఢిల్లీలో 2020 లో చెలరేగిన అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోగా 700 మంది క్షతగాత్రులయ్యారు. ఈ గొడవలకు ఖలీద్, తదితరులు కుట్ర పన్నారనే ఆరోపణలపై అధికారులు కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం(ఉపా)తోపాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భారత రాయబారికి ప్రజా ప్రతినిధులు లేఖ ఉమర్ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ అమెరికా చట్ట సభల ప్రతినిధులు 8 మంది అక్కడి భారత రాయబారి వినయ్ క్వాత్రా ఒక లేఖ రాశారు. ‘2020 నాటి ఢిల్లీ హింసకు సంబంధించి అరెస్టయిన ఉమర్ ఖలీద్ సహా పలువురి సుదీర్ఘ నిర్బంధంపై ఆందోళనను వ్యక్తం చేస్తున్నాం. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా, స్వేచ్ఛ, చట్టబద్ధత, మానవ హక్కులను కాపాడాల్సిన బాధ్య ఉంది. ఇదే ఉద్దేశంతో ఖలీద్ నిర్బంధం అంశాన్ని ప్రస్తావిస్తున్నాం. ఉమర్ ఖలీద్ ఐదేళ్లుగా బెయిల్ లేకుండా జైలులో ఉండటం అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు’అని వారు అందులో పేర్కొన్నారు. అప్పుడెందుకు మాట్లాడలేదు?: వీహెచ్పీ ఉమర్ ఖలీద్ను విడిచిపెట్టాలంటూ న్యూయార్క్ నూతన మేయర్ మమ్దానీ, అమెరికా ప్రజా ప్రతినిధులు చేసిన వినతిపై బీజేపీ, వీహెచ్పీ తీవ్రంగా అభ్యంతరం తెలిపాయి. భారత్ విభజన గురించి మాట్లాడిన నేరగాడికి మద్దతివ్వడం ఖురాన్ను అగౌరవపర్చడమే అవుతుందని వీహెచ్పీ వ్యాఖ్యానించింది. ఖురాన్పై ప్రమాణం చేసిన మమ్దానీ, ఉమర్ ఖలీద్కు మద్దతు తెలపడం ద్వారా ఆ ఖురాన్ను అవమానించారని పేర్కొంది. బీజేపీ కూడా మమ్దానీ నోట్పై అభ్యంతరం వ్యక్తం చేసింది. మమ్దానీతోపాటు అమెరికా చట్టసభల ప్రతినిధులు భారత్ అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదని హితవు పలికింది. -
ఇరాన్లో వెల్లువెత్తిన ప్రజాగ్రహం
టెహ్రాన్: ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనం కావడం, అమెరికా డాలర్తో ఇరానియన్ రియాల్ విలువ భారీగా పడిపోవడం, తద్వారా ధరలు ఎగబాకడం, జీవన వ్యయం పెరిగిపోవడం పట్ల జనం అసంతృప్తితో రగిలిపోతున్నారు. దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచి్చ, ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇది క్రమంగా జెన్జీ ఉద్యమంగా రూపుదాలుస్తుండడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉద్యమంలో యువత చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రధాన నగరాలు అట్టుడికిపోతున్నాయి. ప్రభుత్వ వాహనాలను దహనం చేస్తున్నారు. సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని పట్టుబడుతున్నారు. బుధవారం, గురువారం నాలుగు నగరాల్లో నిరసనకారులకు, భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో కనీసం ఏడుగురు మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం పట్టణాల నుంచి పల్లెలకు పాకుతోంది. మరోవైపు నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. భద్రతా దళాలు విరుచుకుపడుతున్నాయి. దాంతో రాజధాని టెహ్రాన్లో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినప్పటికీ ఇతర ప్రాంతాలకు ఉద్యమం విస్తరిస్తోంది. ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చాలని, ధరలు తగ్గించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. వ్యాపార వర్గాలు సైతం ఈ పోరాటానికి అండగా నిలుస్తున్నాయి. పాతాళానికి రియాల్ విలువ డాలర్తో పోలిస్తే రియాల్ విలువ రోజురోజుకీ పడిపోతోంది. ప్రస్తుతం ఒక డాలర్ విలువ 42,125 రియాల్స్గా నమోదయ్యింది. ఇటీవలి కాలంలో ఇదే కనిష్టం. ఇరాన్పై అమెరికాతోపాటు పశ్చిమ దేశాల కఠిన ఆంక్షల ఫలితంగానే ఈ దుస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్లో 2022 తర్వాత ప్రజా ఉద్యమం రగులుకోవడం ఇదే మొదటిసారి. అప్పట్లో హిజాబ్ ధరించనందుకు 22 ఏళ్ల మాషా అమీనీ అనే యువతిని పోలీసులు నిర్బంధించారు. ఆమె పోలీసు కస్టడీలో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడం సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. పెద్ద ఎత్తున హింసాకాండ చోటుచేసుకుంది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోంది. నిరసనకారుల వద్ద అక్రమ ఆయుధాలు భద్రతా సిబ్బంది దాడిలో ఏడుగురు మరణించడం పట్ల జనం మండిపడుతున్నారు. తమ పోరాటం ఉధృతం చేస్తామని తేలి్చచెబుతున్నారు. గురువారం లారెస్తాన్ ప్రావిన్స్లోని అజ్నా సిటీలో నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మరణించారు. బక్తియారీ ప్రావిన్స్లోని లార్డెగాన్ నగరంలోనూ కాల్పుల్లో ఇద్దరు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఇస్ఫాహాన్ ప్రావిన్స్లో ఉన్న ఫులద్షహర్లో ఒకరు బలయ్యారు. మరోవైపు జనం దాడిలో ఇద్దరు పారామిలటరీ గార్డులు మృతిచెందినట్లు అధికారులు చెప్పారు. కౌహదస్త్ నగరంలో 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పలువురు నిరసనకారుల వద్ద అక్రమ ఆయుధాలను స్వా«దీనం చేసుకున్నట్లు ప్రకటించారు. విదేశీ జోక్యాన్ని సహించం: ఇరాన్ ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తిప్పి కొట్టారు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని తేలి్చచెప్పారు. తమ సమస్యలను శాంతియుతంగా చర్చలతో పరిష్కరించుకొనే సామర్థ్యం తమకు ఉందన్నారు. ఇరాన్ వ్యవహారాల్లో అనవసరంగా కలుగుజేసుకోవాలని చూడడం సరైంది కాదని సూచించారు. ఇతర దేశాలు ఈ విషయం గుర్తించాలని పరోక్షంగా అమెరికాను హెచ్చరించారు. ఇరాన్లో అలజడికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే కారణమని ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ ఆరోపించారు. తమ అంతర్గత వ్యవహారాల్లో తలదూరిస్తే అమెరికా అంతిమంగా ప్రయోజనాలే దెబ్బతింటాయని స్పష్టంచేశారు. గత ఏడాది జూన్లో ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులకు దిగిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చర్చలకు సిద్ధమన్న ప్రభుత్వం ఇరాన్ కరెన్సీ విలువ పడిపోకుండా కాపాడే విషయంలో తాను చేయగలిగింది ఏమీ లేదని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంకేతాలిచ్చారు. పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందని, ప్రజలు శాంతించాలని కోరారు. నిరసనకారులతో చర్చలకు సిద్ధంగా ఉన్న ట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఘర్షణలో మృతిచెందినవారి అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి చావు తప్పదంటూ ఈ సందర్భంగా జనం నినాదాలు చేశారు. హద్దు మీరితే జోక్యం: ట్రంప్ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నవారిపై ఆయుధాలు ప్రయోగిస్తే తాము జోక్యం చేసుకోక తప్పదని ట్రంప్ ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియాతో పోస్టు చేశారు. ప్రజా ఉద్యమం పట్ల ప్రభుత్వం సంయమనం పాటించాలని సూచించారు. ప్రజలపై హద్దు మీరి ప్రవర్తిస్తే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందన్నారు. నిరసనకారులను కాపాడుకుంటామన్నారు. అన్నింటికీ సిద్ధంగా ఉన్నామనిహెచ్చరించారు. -
నేపాల్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
నేపాల్లోని భద్రాపూర్ విమానాశ్రయంలో ఓ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి నది వైపు దూసుకెళ్లింది. అయితే.. కాస్త దూరం వెళ్లి ఆగిపోవడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి 9.08 గంటల సమయంలో చోటుచేసుకుంది. బుద్ధ ఎయిర్వేస్కు చెందిన విమానం 51 మంది ప్రయాణికులు, మరో నలుగురు విమాన సిబ్బందితో నేపాల్ రాజధాని కఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 8.23కు బయలుదేరిన విమానం.. 9.08 గంటలకు భద్రాపూర్ చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పింది. రన్వేను దాటుకుని 200 మీటర్ల దూరం వెళ్లి.. గడ్డిలోకి కూరుకుపోయింది. ఇంకాస్త ముందుకెళ్లి ఉంటే.. విమానం నదిలోకి పడిపోయి ఉండేది.విమానం రన్వేపై నుంచి ముందుకు దూసుకుపోవడంతో భారీ కుదుపులు వచ్చాయి. దీంతో.. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. క్షతగాత్రులను సురక్షితంగా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు విమానాశ్రయ ప్రతినిధి రింజీ షెర్పా వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు బుద్ధ ఎయిర్వేస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ నేపాల్ (సీఏఏఎన్) అధికార ప్రతినిధి జ్ఞానేంద్ర భుల్ వెల్లడించారు. -
పుతిన్ సెక్యూరీటి ఎలా ఉంటుందో తెలుసా?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరు విన్నారా...? వినే ఉంటారు...? చూశారా అంటే అతికొద్ది మంది మాత్రమే చూసి ఉంటారు. ఇక కలిశారా? అని ప్రశ్నిస్తే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు..... అదేంటీ... ఓ దేశ అధ్యక్షుడు కొంతమందినే కలిశాడనడమేంటీ అని ఆశ్చర్య పోతున్నారా...? అవును మీరు విన్నది నిజమే. అతని చుట్టూ వలయంలా ఉండే భద్రతా సిబ్బందిని దాటి పుతిన్ను కలవాలంటే... మామూలు విషయం కాదు. అసలు అతనికున్న సెక్యూరిటీని ఛేదించి ముందుకు వెళ్లాలంటే... ఈగలు- దోమలకు కూడా ఆస్కారం లేదు. అంతటి రక్షణ వ్యవస్థతో కూడిన పుతిన్ సెక్యూరిటీతో పోలిస్తే ప్రపంచంలో మరే అధ్యక్షుడికి అంతటి సెక్యూరిటీ లేదనే చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడికి మించి ఉన్న అతని భద్రతా వలయం... అతని రక్షణ కోసం నిత్యం జరిగే కసరత్తుపై ఓ సారి ఫోకస్ చేద్దాం.వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచంలో ప్రముఖుల్లో ఒకరు. ఆయనకు విదేశాల నుంచి ముప్పు పొంచి ఉందని గ్రహించిన భద్రతా బలగాలు... కంటికి రెప్పలా కాపాడుతుంటాయి. పటిష్ఠమైన భద్రతా వలయంలో ఉంటూ... అతనిపై ఈగ కూడా వాలనీయకుండా సిబ్బంది జాగ్రత్త పడుతుంటారు. దానికోసం నమ్మకస్తులైన అతని భద్రతా సిబ్బంది చేసే కసరత్తు... ఓ యంత్రంలా సాగుతుంటుంది. పుతిన్ విదేశాలకు వెళ్లినప్పుడు అతని వ్యక్తిగత భద్రతా సిబ్బంది 5 వలయాల్లో ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా... గుర్తించే యంత్రాంగం ఉంటుంది. చివరకు పుతిన్ మల మూత్రాలను కూడా రష్యా తిరిగి తీసుకెళ్తారు.విదేశాల్లో అక్కడి టాయిలెట్ వాడితే... వాటిని సేకరించి... అతని డీఎన్ఏను గుర్తించడం లేదా... పుతిన్కు ఉన్న రోగాల గురించి తెలుసుకునే ప్రమాదం ఉందని గ్రహించిన సెక్యూరిటీ సిబ్బంది... అతని మల మూత్రాలను కూడా ఓ సూట్కేస్లో భద్రపరిచి రష్యాకు తీసుకొస్తారంటే... ఇక అతని సెక్యూరిటీ స్థాయిని గుర్తించవచ్చు. పుతిన్ సెక్యూరిటీ స్థాయి అమెరికా అధ్యక్షుడి సీక్రెట్ సర్వీస్ కన్నా మించి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. జనంతో అతి తక్కువగా కలిసే పుతిన్ దగ్గరికి కేవలం అతని కుటుంబీకులు, సెక్యూరిటీ మాత్రమే ఉంటుంది. మిగత వారు అతని వద్దకు రావడం అసాధ్యమే అని చెప్పవచ్చు. ప్రజలతో కాంటాక్ట్ చాలా పరిమితంగా ఉంటుంది. అతనికి దగ్గరగా రావడం దాదాపు అసాధ్యం.పుతిన్ భద్రతా వ్యవస్థను ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ అనే ప్రత్యేక భద్రతా సంస్థ పర్యవేక్షిస్తుంది. భద్రతా సిబ్బందితో పాటు ఎలైట్ బాడీగార్డులు, ఇంటెలిజెన్స్ యూనిట్లు పుతిన్ భద్రతలో ఉంటాయి.పుతిన్ మస్కటీర్స్ పేరిట ఉన్న అతని బాడీగార్డులు ఎప్పుడూ అతని చుట్టూ ఓ కంచెలా ఉంటారు. శిక్షణ పొందిన అతని బాడీగార్డులు... అధునాతన ఆయుధాలు ధరించి ఉంటారు. పుతిన్ ఆరస్ సెనేట్ పేరుతో ఉన్న కారులో తిరుగుతారు. సెనేట్ కారు ప్రత్యేకంగా పుతిన్ అధికారిక వినియోగం కోసం తయారైంది. ట్విన్ టర్బో ఇంజిన్తో తయారైన కారు ఎంతో అధునాతనమైంది.లగ్జరీతో పాటు సెక్యూరిటీ... రష్యా తయారీ బ్రాండ్ కారునే పుతిన్ వాడుతారు. ఈ కారు ఆర్మర్-పియర్సింగ్ బుల్లెట్లతో...., గ్రనేడ్ దాడులను కూడా తట్టుకునేలా తయారైంది. భోజన విషయంలోనూ ఎంతో సెక్యూరిటీ ఉంటుంది. పుతిన్ కోసం తయారైన భోజనాన్ని తొలుత అతని బాడీగార్డులు రుచి చూస్తారు. ఆ తర్వాతనే పుతిన్కు వడ్డిస్తారు. ఫుడ్ తయారు చేసే షెఫ్లను కూడా తనిఖీలతో పాటు హైజీన్ చెక్లు ఉంటాయి.పుతిన్ అంతర్జాతీయ పర్యటనల సమయంలో భద్రత పటిష్ఠంగా ఉంటుంది. పుతిన్ ఏ దేశం వెళ్లినా... స్థానిక భద్రతా బలగాలతో కలిపి ఐదు- అంచెల సెక్యూరిటీ గ్రిడ్ ఉంటుంది. వాటిలో స్నిపర్ టీమ్స్, ఏఐ ఆధారిత సర్వైలెన్స్ కూడా ఉంటుంది. విదేశీ ప్రయాణం చేసినప్పుడు ఫ్లయింగ్ క్రెమ్లిన్ అనే ప్రత్యేక విమానం ద్వారా వెళ్తారు. అందులోనూ బాడీగార్డులు, ఎలైట్ సెక్యూరిటీ, అధికారులు, NSG కమాండోలు, టెక్నాలజీ AI ఆధారిత సర్వైలెన్స్, స్నిపర్ టీమ్స్ ఉంటాయి. అతని పర్యటన, షెడ్యూల్ వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి. విమానం కూడా యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్తో ఉంటుంది.దాంతో శత్రు క్షిపణులను గుర్తించి తప్పించుకునే టెక్నాలజీ ఆ విమానానికి ఉంది. రాడార్ - జామింగ్ టెక్నాలజీ ద్వారా శత్రువుల రాడార్లను తప్పుదోవ పట్టించే సాంకేతికత కూడా ఉంది. అందులో ఉన్న కమ్యూనికేషన్ సిస్టంతో.... యుద్ధ పరిస్థితుల్లో కూడా రష్యా సైన్యం... ప్రభుత్వంతో నిరంతర సంబంధాలు కలిగి ఉండేలా చర్యలున్నాయి. విమానం ద్వారానే ఎయిర్బోర్న్ కమాండ్ సెంటర్ – ఏర్పాటు చేసి అణు యుద్ధం జరిగినా అధ్యక్షుడు ఆకాశంలో నుంచే ఆదేశాలు ఇవ్వగల సాంకేతికత జోడించి ఉంది. పుతిన్ భద్రతా వ్యవస్థలో అతని వ్యక్తిగత ఆరోగ్య రహస్యాలు ఎక్కడా లీక్ కాకుండా ఉండే విధంగా జాగ్రత్త పడతారు. విదేశీ ప్రయాణాల్లో ప్రత్యేక ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి. విచిత్రమేమిటంటే... విదేశీ పర్యటనలో అతని బాడీగార్డుల వద్ద పూప్ సూట్కేస్ ఉంటుంది. ఆ సూట్కేస్ కూడా... పుతిన్.. విదేశీ పర్యటనల్లో ఉపయోగించే ఒక విచిత్రమైన భద్రతా ప్రోటోకాల్. అతని బాడీగార్డులు అతని శరీర వ్యర్థాలను మూత్రం, మలము సేకరించి వాటిని ప్రత్యేక సూట్కేస్లో రష్యాకు తీసుకెళ్తారు.దీని ఉద్దేశ్యం అతని ఆరోగ్య స్థితి, DNA వంటి గోప్యమైన సమాచారం విదేశీ గూఢచార సంస్థలకు చేరకుండా కాపాడటం. పుతిన్ ఎప్పుడూ విదేశాల్లో పబ్లిక్ టాయిలెట్ ఉపయోగించరు. అతని బాడీగార్డులు ప్రత్యేకంగా పూప్ సూట్కేస్లో సేకరించి రష్యాకు తీసుకెళ్తారు. ఈ ప్రోటోకాల్ అసాధారణంగా వినిపించినా, ఇది అత్యంత గట్టి భద్రతా వ్యూహంలో భాగమని రష్యా సైన్యాధికారులు చెబుతున్నారు. ఇంతటి రక్షణ వ్యవస్థలో ఉన్న పుతిన్ సెక్యూరిటీని ఛేదించడం దాదాపు అసాధ్యమే. -
మెక్సికోలో భూకంపం.. ఒకరి మృతి, 12 మందికి గాయాలు
మెక్సికోలో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. ఇది గెరెరో రాష్ట్రంలోని సాన్ మార్కోస్ ప్రాంతం సమీపంలో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావం మెక్సికో సిటీ వరకు చేరి, భవనాలు కంపించాయి, ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కొన్ని చోట్ల భూమి బలంగా కంపించింది. భూకంపం కారణంగా ఒకరు మృతిచెందగా.. 12 మంది గాయపడ్డట్లు మెక్సికో సిటీ ప్రభుత్వ అధిపతి క్లారా బ్రూగాడా తెలిపారు. అధ్యక్షురాలు క్లౌడియా షైన్బామ్ తన ప్రత్యక్ష ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలోనే భూకంప అలారం మోగడంతో బయటకు వెళ్లి, కొన్ని నిమిషాల తర్వాత తిరిగి రావడం గమనార్హం. ఇప్పటివరకు ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించి ఎటువంటి నివేదిక బయటకు రాలేదు. కాకపోతే భూకంప తీవ్రత ఎక్కువగానే ఉందని స్థానికులు అంటున్నారు. -
గడ్డం తీస్తే జైలుశిక్షే..?
కాబూల్: వెంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చిందని సామెత ఇప్పుడు ఆఫ్గాన్ దేశంలోని క్షౌరకులుకు సరిగ్గా సరిపోతుంది. అక్కడ తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడడం ఏమోగాని అక్కడి క్షౌరకుల కుటుంబాలు జీవన ఆధారం లేక తల్లడిల్లిపోతున్నాయి.తాలిబన్ల చట్టం ప్రకారం పురుషులు గడ్డం తీసుకోవడం నేరం అని ఓకవేళ గడ్డాలు తీస్తే 15 నెలల దాకా జైలుశిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఆదేశంలో ప్రస్తుతం హెయిర్ డ్రెస్సింగ్స్ పైనే ఆదారపడాల్సి వస్తుందని తెలిపారుతాలిబన్ల చట్టాన్ని ఒకవేళ ఎవరైనా మగవారి గడ్డం తీస్తే వారికి 15 నెలల జైలుశిక్ష వేయడంతో పాటు ఇతర కఠిన శిక్షలు విధించే అవకాశం ఉంది. దీంతో అక్కడి ప్రజలు గడ్డం తీసుకోవడానికి బెంబేలెత్తిపోతున్నారు.అంతేకాకుండా ఇటీవల కొంతమంది యువకులు అక్కడ వెస్ట్రన్ హెయిర్ స్టైల్ చేసుకున్నారని ఆరోపణలతో వారిని తీవ్రంగా కొట్టారని ఆరోపణలున్నాయి. దీంతో అక్కడి హెయిర్డ్రెస్సర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమందైతే ప్రజల ఇళ్ల కెళ్లి పురుషులని కటింగ్ అయినా చేసుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.2021లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంటి తమ జీవనోపాధి పెద్దఎత్తున దెబ్బతిందని అక్కడి క్షౌరకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
సిరియాలో కొత్త నోట్ల ముద్రణ.. మార్పులు ఇవే
రియాలో కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ ప్రక్రియ మొదలైంది. కొత్త ప్రభుత్వం.. పాత బషర్ అల్-అసద్ చిత్రాలతో ఉన్న నోట్లను తొలగించి, వ్యవసాయ వారసత్వాన్ని ప్రతిబింబించే డిజైన్లతో కొత్త నోట్లను విడుదల చేసింది. ఈ ప్రక్రియ 2026 జనవరి 1 నుండి ప్రారంభమైంది. దీన్ని గతేడాది చివరి మాసంలో అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. ముద్రించే కొత్త కరెన్సీ నోట్లపై సిరియా షౌండేషన్ పునర్నిర్మించి.. రెండు సున్నాలు తొలగించారు. ఈ నోట్ల ముద్రణను రష్యా కాంట్రాక్ట్కు తీసుకుంది. కొత్త నోట్లలో గోధుమ, నారింజలు, ఆలివ్, రోజాలు వంటి వ్యవసాయ చిహ్నాలు ఉన్నాయి. బషర్ అల్-అసద్ చిత్రాలను తొలగించి, కొత్త అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా ఆధ్వర్యంలో నోట్లను విడుదల చేశారు.ఈ నోట్ల ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం చూరగొంటుందా అనే ప్రశ్న మాత్రం ఇంకా ఉంది. అయితే అంతర్జాతీయంగా ఈ కొత్త నోట్ల ముద్రణ తర్వాత ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు సైతం కనబడుతున్నాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల నడుమ.. కొత్త కరెన్సీకి అంగీకారం ఎంతవరకూ లభిస్తుందనేది మరొక ప్రశ్నగా మారింది. అయితూ అసద్ చిత్రాలను తొలగించడం ద్వారా కొత్త ప్రభుత్వం ప్రజలకు కొత్త ఆరంభం సంకేతం ఇచ్చింది..మొత్తంగా, సిరియాలో కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ ఆర్థిక పునరుద్ధరణకు ఒక పెద్ద మైలురాయి అవుతుందని అక్కడ ప్రభుత్వం భావిస్తోంది. ఇది కేవలం ఆర్థిక మార్పు మాత్రమే కాదు, రాజకీయంగా కొత్త యుగానికి సంకేతమనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లే యత్నం చేస్తుంది. -
ప్రపంచ నాయకుడు.. పగటి పూటే పిడుగు పడి చనిపోతారట! ఎవరంటే?
సోఫియా: బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ జ్యోతిష్క రాలు బాబా వాంగా చేసిన 2026 సంవత్సరానికి సంబంధించిన జోస్యం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, రాజకీయ కల్లోలాలు, ఆర్థిక సంక్షోభాలు, సాంకేతిక పరిణామాలు వంటి అంశాలపై ఆమె చేసిన సూచనలు ప్రజల్లో ఆసక్తి రేపుతున్నాయి.2026లో ప్రపంచ వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఆమె పేర్కొన్నారు. తుఫానులు, వరదలు, భూకంపాలు మరింత తీవ్రంగా ఉంటాయని అంచనా. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుందని హెచ్చరించారు. కొన్ని దేశాల్లో పెద్ద రాజకీయ కల్లోలాలు సంభవిస్తాయని ఆమె ప్రవచించారు. అంతర్జాతీయ స్థాయిలో పవర్ బ్యాలెన్స్ మార్పులు చోటు చేసుకుంటాయని సూచించారు. కొత్త కూటములు ఏర్పడి, పాత కూటములు కూలిపోతాయని అంచనా.ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర క్షీణత సంభవిస్తుందని ఆమె చెప్పారు. కొన్ని దేశాల్లో కరెన్సీ విలువలు పడిపోవడం, మార్కెట్లలో అస్థిరత పెరగడం జరుగుతుందని అంచనా. 2026లో కొత్త సాంకేతిక ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాయని ఆమె పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు(AI), బయోటెక్నాలజీ రంగాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయని అంచనా.బాబా వాంగా ప్రవచనాలు ఎప్పుడూ ఆసక్తి రేపుతాయి. అయితే, ఇవి శాస్త్రీయ ఆధారాలు లేని ఊహాగానాలు మాత్రమే. వాతావరణ మార్పులు, ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ కల్లోలాలు వంటి అంశాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశాలుగా ఉన్నందున, ఆమె ప్రవచనాలు ప్రజలలో మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. అంతేకాదు ప్రపంచంలో ఓ ప్రముఖ వ్యక్తి మీద పగటి పూట పిడుగు పడి చనిపోతాడు. ఆ వ్యక్తి రాజకీయ వర్గానికి, కళారంగానికి చెందిన వారేనా లేదా అనేది తెలియాల్సి ఉంది. 2026లో ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లపై బాబా వాంగా ప్రవచనాలు ఒక హెచ్చరికలా వినిపిస్తున్నాయి. వాతావరణ మార్పులు, ఆర్థిక అస్థిరత, రాజకీయ కల్లోలాలు, ఇవన్నీ మనం అప్రమత్తంగా ఉండాల్సిన అంశాలుగా గుర్తించబడుతున్నాయి. -
పాక్లో 8 మంది యూట్యూబర్లకు జీవితఖైదు..
ఉగ్రవాద సంబంధింత కార్యకలాపాల్లో సంబంధముందని తీర్మానిస్తూ 8 మంది జర్నలిస్టులు, యూట్యూబర్లకు జీవితఖైదు పడిన ఘటన పాకిస్తాన్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు అనుకూలంగా వీరు యూట్యూబ్లో పోస్టులు పెడుతూ ఉండటాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తూ ఆక్కడి కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్చునిచ్చింది. ఈ కేసులన్నీ కూడా 2023 మే 9వ తేదీన ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేసిన తర్వాత ఆయన మద్దతుదారులు సైనిక స్థావరాలపై దాడి చేసిన హింసాత్మక నిరసనల తర్వాత దాఖలైన కేసులకు సంబంధించినవి. అప్పటి నుండి, ప్రభుత్వం, సైన్యం.. ఇమ్రాన్ఖాన్ మద్దతుదారులను అణచివేసేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. దీనిలో భాగంగా ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు, సైనిక కోర్టులను ఉపయోగించి వందలాది మందిపై విచారణ జరిపాయి. ఈ క్రమంలోనే ఎనిమిది మంది జర్నలిస్టులు, యూట్యూబర్లకు జీవిత ఖైదు పడింది. కోర్టు ఏం చెప్పింది?కోర్టు తన తీర్పులో, నిందితుల చర్యలు పాకిస్తాన్ చట్టం ప్రకారం ఉగ్రవాదంగా పరిగణించబడుతున్నాయని, వారి ఆన్లైన్ కంటెంట్ సమాజంలో భయాన్ని, అశాంతిని వ్యాపింపజేస్తుందని పేర్కొంది. దోషులుగా తేలిన వారిలో ఎక్కువ మంది పాకిస్తాన్ వెలుపల ఉన్నారని , విచారణ సమయంలో హాజరు కాలేదని ధృవీకరించిన కోర్టు.. వారికి జీవితఖైదు విధించింది. దోషులుగా నిర్ధారించబడిన వారు ఎవరు?కోర్టు తీర్పు ప్రకారం, దోషులుగా తేలిన వారిలో మాజీ సైనిక అధికారులు నుండి యూట్యూబర్లు అయిన ఆదిల్ రాజా, సయ్యద్ అక్బర్ హుస్సేన్, జర్నలిస్టులు వజాహత్ సయీద్ ఖాన్, సబీర్ షకీర్ మరియు షాహీన్ సెహబాయి, వ్యాఖ్యాత హైదర్ రజా మెహదీ, విశ్లేషకుడు మోయిద్ పిర్జాదా ఉన్నారు. -
ఆరోగ్యంపై ట్రంప్ కీలక అప్డేట్
వాషింగ్టన్: అమెరిగా అధ్యక్షుడు ట్రంప్ తన ఆరోగ్యంపై ఆసక్తికర విషయాలను రివీల్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉందన్నారు. అయితే డాక్టర్లు చెప్పిన దాని కంటే ఎక్కువ మోతాదులో ఆస్పిరిన్ తీసుకుంటున్నానని వాల్స్ట్రీట్ జర్నల్స్కిచ్చిన ఇంటర్వూలో ట్రంప్ తన హెల్త్ సీక్రెట్స్ బయిటపెట్టారు.డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై గతంలో అనేక పుకార్లు వచ్చాయి. ఆయన కొద్దిరోజులు కనబడపోవడం, బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో ట్రంప్ మిస్సింగ్ అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆయన చేతిపై, కాళ్లపై గాయాలుండడం వాటిని కవర్ చేస్తూ ట్రంప్ మేకప్ వేసుకున్న చిత్రాలు ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ట్రంప్ స్పందించారు. "నా జీవితంలో ఇంత ఆరోగ్యంగా ఎప్పుడూ లేను" అని వివరణ ఇవ్వడంతో అప్పట్లో అంతా సైలంట్ అయ్యారు.అయితే తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్కిచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తన ఆరోగ్యంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. " నా ఆరోగ్యంపై మాట్లాడడం ఇది 25వసారి. గత 25 ఏళ్లుగా ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకుంటున్నా. డాక్టర్లు 81mg తీసుకోమని చెబితే, నేను 325mg తీసుకుంటున్నాను. రక్తాన్ని పలుచగా చేయడంలో అంది ఏంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే నా గుండెలో చిక్కటి రక్తం వెళ్లడం నాకు ఇష్టం లేదు" అని ట్రంప్ అన్నారు. వైట్హౌస్లో ఇటీవల జరిగిన కార్యక్రమాలలో తాను వినడానికి ఇబ్బందులు పడుతున్నానని, తరచుగా నిద్రపోతున్నానని వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని ట్రంప్ తెలిపారు. తన ఆరోగ్యం గురించి చర్చించడం తనను చాలా ఇబ్బందులకు గురిచేస్తోందదన్నారు.. అయితే తనకు వ్యాయామం అంటే అస్సలు నచ్చదని ట్రెడ్మిల్పై నడవడం, పరిగెత్తడం చాలా బోరింగ్గా ఉంటుందని తెలిపారు. తన చేతులపై ఇప్పుడు కొన్ని గాయాలున్నాయని వాటికి 10 నిమిషాలు మేకప్ వేసుకుంటే సరిపోతుందని వాల్ స్ట్రీట్స్ జనరల్కిచ్చిన ఇంటర్వూలో తెలిపారు.ట్రంప్ వయస్సు ప్రస్తుతం 79 సంవత్సరాలు. ఆయన 70 సంవత్సరాల వయసులో అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకూ అదే పెద్దవయస్సు, అయితే 78 సంవత్సరాల వయసులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టి జో బైడెన్ ఆ రికార్డును బ్రేక్ చేశారు. -
చైనా నుంచి మాకు ముప్పు.. మీరు మాతో కలవండి!
బలూచిస్తాన్.. పాకిస్తాన్తో విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడాలనేది వారి లక్ష్యం. ఇందుకోసం గత కొంతకాలంగా పాకిస్తాన్తో పోరాటం చేస్తునే ఉన్నారు. తమకు ప్రత్యేక దేశం కావాలనేది వారి డిమాండ్. గతంలో పాక్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయ ఎలాగైతే దేశంగా ఏర్పడిందో అదే తరహాలో బలూచిస్తాన్ కూడా పాక్ నుంచి వేరు కావాలని కోరుకుంటోంది. అందుకోసం అలుపెరగని పోరాటం సాగిస్తోంది. అయితే గతంలో భారత్ సాయం కోరిన బలూచిస్తాన్.. మరొకసారి భారత్ సాయం కోసం అభ్యర్థించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత జరిగిన పరిణామాల్లో భారత్ సైన్యం తమతో కలిస్తే పాక్ అంతు చూద్దాం’ అంటూ గతంలో కోరిన బలూచిస్తాన్.. ఇప్పుడు తమకు చైనా నుంచి ముప్పు ఉందని, ఆ క్రమంలోనే భారత్ తమకు సాయం అందించాలని వేడుకుంటోంది. బలూచ్ అగ్రనేత మిర్ యార్ బలూచ్.. ఈ మేరకు భారత్కు లేఖ రాశారు. ప్రత్యేకంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్కు లేఖ రాశారు. ఈ లేఖలో ఏముందంటే ‘ మాకు చైనా నుంచి ముప్పు ఉంది. కొన్ని నెలల్లో చైనా బలగాలను మా భూభాగంలో మోహరించే అవకాశం ఉంది. కొన్ని దశాబ్దాలుగా పాక్ నుంచి వేరపాటును కోరుకుంటున్నాం. పాక్తో కలిసి ఉండటం వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుఉతుంది. అలాగే అవమానాలను సైతం ఎదుర్కొంటున్నాం. గతేడాది మే 25వ తేదీన మా జాతీయ నాయకత్వం పాక్ నుంచి విడిపోవాలని తీర్మానించింది. అందుకోసమే పోరాటం సాగిస్తున్నాం. ఈ ఏడాది బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడతుందని అనుకంటన్నాం. మాకు మీ సహకారం అవసరం’ అని పేర్కొన్నారు.ఆపరేషన్ సిందూర్పై ప్రశంసలుఅదే సమయంలో పాక్తో యుద్ధంలో భాగంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై సైతం బలూచిస్తాన్ నేత మీర్ ప్రశంసలు కురిపించారు. . పాక్ లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అమోఘమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్.. పాక్కు వెన్నులో వణుకు పుట్టించిందన్నారు. మరొకవైపు వంద కోట్లకు పైగా జనాభా కల్గిన భారత్.. విశేషమైన ప్రగతి సాధించే దిశలో ఉందన్నారు. ఈ క్రమంలోనే భారత్కు న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. Open letter to Honorable Foreign Minister of #Bharat Shri @DrSJaishankar ji From, Baloch Representative,Republic of BalochistanState.The Honorable Dr. S. Jaishankar,Minister of External Affairs,Government of Bharat,South Block, Raisina Hill,New Delhi – 110011January… https://t.co/WdjaACsG2V pic.twitter.com/IOEusbUsOB— Mir Yar Baloch (@miryar_baloch) January 1, 2026 -
తారా స్థాయికి చేరిన ‘Gen Z’ ఉద్యమం.. యుద్ధం తప్పదంటూ ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారి ప్రాణాల్ని అన్యాయంగా తీసుకుంటుంటే అమెరికా చూస్తూ ఊరుకోదు. నిరసనకారులపై బలప్రయోగం చేయొద్దు. వారిని చంపితే ఇరాన్పై యుద్ధం చేస్తామంటూ ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. ఇరాన్లో జెన్జీ (Gen Z) ఉద్యమం తారాస్థాయికి చేరింది. అక్కడి యువత ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, రియాల్ కరెన్సీ పతనం కారణంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనలు గత వారం టెహ్రాన్లో ప్రారంభమై కొన్ని గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ క్రమంలో ఆందోళన కారుల్ని అరికట్టేందుకు కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఇరాన్ తీరుపై ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. ‘ఇరాన్ ప్రజలపై దాడులు కొనసాగితే, అమెరికా మౌనంగా ఉండదు. మేం సిద్ధంగా ఉన్నాం’ అని ట్రంప్ అన్నారు. అంతేకాదు నిరసన కారులను రక్షించేందుకు అమెరికా చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.2022 తర్వాత తొలిసారి ఇరాన్ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుండడం, రికార్డు స్థాయిలో కరెన్సీ విలువ పడిపోవడం, అనైతిక చట్టాల అమలుతో పాటు పలు అంశాలపై ఇరాన్లోని టెహ్రాన్తో పాటు పలు ప్రోవిన్స్ ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. నిరసన కారుల్ని అణిచి వేసేందుకు కాల్పులకు తెగబడుతోంది. ఫలితంగా ఐదురోజుల వ్యవధిలో సుమారు ఏడుగురికి పైగా ప్రాణాలు కోల్పోయారు. If Iran shots and violently kills peaceful protesters, which is their custom, the United States of America will come to their rescue. We are locked and loaded and ready to go. Thank you for your attention to this matter! President DONALD J.TRUMP(TS: 02 Jan 02:58 ET)…— Commentary: Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) January 2, 2026 -
దుబాయ్లో గ్రాండ్గా తల్లి బర్త్డే : వివాదాల బ్యూటీ వీడియో వైరల్
నటి,వివాదాలతో వార్తల్లో నిలిచే బ్యూటీ క్వీన్ ఊర్వశి రౌతేలా తన తల్లి మీరా రౌతేలా పుట్టిన రోజును ఘనంగా నిర్వహించింది. ప్రపంచంలోనే అతి పెద్ద హెటల్, 24 క్యారెట్ల బంగారు కిరీటం, గోల్డ్ కేక్ లాంటి విశేషాలతో గుర్తుండిపోయేలా వేడుక చేసింది. దీనికి సంబంధించిన వీడియో,ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది.ప్రపంచంలోని ఎత్తైనహోటల్లో 24 క్యారెట్ల బంగారు కిరీట కేక్తో అమ్మ పుట్టినరోజు వేడుక.. మేం అందరం నిన్ను ప్రేమిస్తున్నాం. వరల్డ్ టాలెస్ట్ హోటల్,ప్యూర్ రాయల్ గోల్డ్ క్రౌన్ కేక్,ప్యూర్ లవ్’’అంటూ ఊర్వశి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలతోపాటు, ఊర్వశిపై ప్రశంసలు వెల్లువెత్తాయి.ఇదీ చదవండి: ఐదు నెలల చిన్నారి ఉసురు తీసిన ‘పాలు’విలాసవంతమైన వేడుకలో మూడు లేయర్ల బంగారు రంగు కేక్ ఒక ఆకర్షణ అయితే, 24 క్యారెట్ల బంగారంతో చేసిన కిరిటాన్ని ఊర్వశి తన తల్లి తలపై ఉంచడం మరో ఎట్రాక్షన్గా నిలిచింది. అందంగా ముస్తాబైన మీరా నవ్వుతూ, తన కుమార్తె స్వచ్ఛమైన ఆప్యాయత అనురాగాలను మురిసిపోయింది. కాగా ప్రతీ ఏడాది తల్లి బర్త్డే ఘనంగా నిర్వహించడం ఊర్వశికి అలవాటు. ఊర్వశి కలాజికల్ హారర్ చిత్రం కసూర్ 2 , వెల్కమ్ టు ది జంగిల్లలో నటించనుంది. గ్లెన్ బారెట్టో దర్శకత్వంలో ఆమె అఫ్తాబ్ శివదాసాని, జాస్సీ గిల్తో కలిసి నటిస్తోంది. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) ఇదీ చదవండి: ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి ఏకంగా రూ. 2.5 కోట్ల ఆఫర్, రికార్డ్ -
కండోమ్, గర్భనిరోధక మాత్రలపై అమల్లోకి వచ్చిన వ్యాట్
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశానికి సరికొత్త సమస్య వచ్చి పడింది. జననాల సంఖ్య దారుణంగా పడిపోతుండడంతో జనాభాను పెంచేందుకు చైనా ప్రభుత్వం నానాపాట్లు పడుతోంది. ఈ క్రమంలో కొత్త ఏడాది.. అందునా మొదటి రోజే ఓ కీలక నిర్ణయం ప్రకటించింది. కండోమ్ సహా గర్భ నిరోధక మాత్రలు, ఇతర సంబంధిత ఔషధాలపై 13 శాతం పన్ను విధించి.. తీవ్ర చర్చకు దారి తీసింది.చైనా ప్రభుత్వంలో ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడానికి కారణాలు ఉన్నాయి. అక్కడ గత మూడేళ్లుగా జననాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2024లో కేవలం కోటి మంది పిల్లలు మాత్రమే పుట్టారు. ఇది గత దశాబ్దం కాలంనాటి గణాంకాల్లో సగం కావడం గమనార్హం. వృద్ధ జనాభా, ఆర్థిక మందగమనం కారణంగా ప్రభుత్వం త్వరగా పెళ్లి చేసుకుని ఎక్కువ పిల్లలు కనాలని అక్కడి యువతను కోరుకుంటోంది. ఈ క్రమంలో.. గర్భనిరోధక వస్తువులు (కండోమ్లు, మాత్రలు, IUDలు)లపై పన్నులు పెంచగా, చైల్డ్కేర్ సేవలు (పిల్లల సంరక్షణ), వివాహ సంబంధిత సేవలు, వృద్ధుల సంరక్షణ సేవల వస్తువులపై పన్నులు తగ్గించింది. తల్లిదండ్రులకు ఎక్కువ పేరెంటల్ లీవ్.. క్యాష్ హ్యాండౌట్లు (ఆర్థిక సహాయం) వంటి ప్రోత్సహాకాలు అందిస్తోంది. 2026 జనవరి 1 నుండి కండోమ్లు, గర్భనిరోధక మాత్రలు, IUDలు వంటి వస్తువులపై 13 శాతం వ్యాట్ అమల్లోకి తెచ్చింది. 1993 నుంచి ఈ వస్తువులు వ్యాట్ కేటగిరీ నుంచి మినహాయింపు పొందుతూ వచ్చాయి. కానీ.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..కండోమ్ల ధర పెరగడం వల్ల జననాల సంఖ్య పెరగడం అసాధ్యమని నిపుణులు అభిప్రాయవ్యక్తం చేస్తున్నారు. అసలు సమస్య పిల్లల పెంపకం ఖర్చులు ఎక్కువగా ఉండటమేనని చెబుతున్నారు. చైనాలో కండోమ్లపై పన్నులు పెరగడం వల్ల వాటి ధరలు పెరిగితే, ప్రజలు వాటిని తక్కువగా ఉపయోగించే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతుండగా.. ఇది హెచ్ఐవీ వ్యాప్తి ప్రమాదాన్ని పెంచుతుందని డబ్ల్యూహెచ్వో హెచ్చరిస్తోంది. గతంలో కొన్ని దేశాల్లో ఎదురైన పరిస్థితులనూ ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తావిస్తోంది. అదే సమయంలో చైనాలో హెచ్ఐవీ కేసులు.. గత దశాబ్దంలో తగ్గినా, యువతలో కొత్త కేసులు ఇంకా నమోదవుతున్నాయనే విషయాన్ని గుర్తు చేస్తోంది.ట్రోలింగ్.. జననాల రేటు పెంచేందుకు చైనా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యువత ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం పెళ్లి చేసుకుని పిల్లలు కనమని చెబుతోంది. మరోవైపు గర్భనిరోధక వస్తువులను ఖరీదుగా చేస్తోందంటూ మండిపడుతున్నారు.మరోవైపు.. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. కండోమ్స్ ధరలు పెంచడం అంటే.. ముందుగానే రెండు,మూడేళ్లకు ముందే కండోమ్స్ కొనుగోలు చేయమని చెబుతున్నారా? అంటూ చైనా యువత సెటైర్లు సంధిస్తున్నారు. కండోమ్ ధరలు పెంచటం ద్వారా పిల్లల సంఖ్య పెరుగుతుందనే ఆలోచన రావటమే సూపర్.. మనం పిల్లల్ని కనటానికి మన కంటే ప్రభుత్వమే చాలా ఎక్కువగా కష్టపడుతుందంటూ నెటిజన్లు పంచ్ల మీద పంచ్లు వేస్తున్నారు. -
భయపెడుతున్న ‘ప్లాష్ ఓవర్’.. స్విట్జర్లాండ్ ప్రమాదానికి కారణమిదే?
స్విట్జర్లాండ్ చరిత్రలోనే పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతం క్రాన్స్-మోంటానా స్కీ రిసార్ట్లోని ఓ లగ్జరీ బార్లో నూతన సంవత్సర వేడుకల సమయంలో జరిగిన భారీ పేలుడు గురించి తెలిసిందే. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య 47కి చేరుకుంది. తొలుత ఉగ్రదాడి అయ్యి ఉండొచ్చనే ప్రచారం జరగ్గా.. అధికారులు ఆ కోణాన్ని తోసిపుచ్చారు. అయితే.. దర్యాప్తు అధికారులు ఇది ‘ఫ్లాష్ ఓవర్’ కారణంగా జరిగిన ప్రమాదం అయ్యి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఫ్లాష్ ఓవర్ అంటే ఏంటో అని ఆరా తీస్తున్నారు చాలా మంది. ఇక, ఇప్పటికే ఫ్లాష్ ఓవర్ కారణంగా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి.ప్లాష్ ఓవర్ అంటే.. అమెరికాకు చెందిన నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ (NFPA) ప్రకారం.. ఒక పరిమిత స్థలంలో వేడి వాయువులు గదిలో వ్యాప్తి చెంది.. వేగంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఫ్లాష్ ఓవర్ సంభవిస్తుందని పేర్కొంది. ఈ కారణంగా ఆ గదిలో త్వరగా అంటుకునే స్వభావం ఉన్న వస్తువులు అన్నీ ఒకేసారి అగ్నిలో చిక్కుకుపోతాయి. ఆ ఫలితంగా.. మంటలు ఒక్కసారిగా వ్యాపించి ఎటూ తప్పించుకోవడానికి వీల్లేకుండా పోతుంది. అయితే.. ఫ్లాష్ఓవర్ అనేది అగ్ని ప్రమాదంలో అత్యంత ప్రమాదకరమైన దశ. కొన్ని సెకన్లలోనే మొత్తం గది మంటల్లో కూరుకుపోతుంది. ఇది సాధారణంగా 500–600°C వద్ద జరుగుతుంది. ఈ సమయంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం.ఈ ప్రక్రియలో మొదట ఒక వస్తువుకు మంటలు అంటుకుంటాయి. దాని వల్ల ఉత్పత్తి అయ్యే వేడి పొగ పైకప్పు దగ్గరకు చేరుతుంది. ఈ క్రమంలో పొర వేడెక్కి, గదిలోని ఇతర వస్తువులు ఆటో-ఇగ్నిషన్ ఉష్ణోగ్రతకు చేరుకుంటాయి. దీంతో, ఒక్కసారిగా మొత్తం గది మంటల్లో కూరుకుపోతుంది. సెకన్ల వ్యవధిలో మంటలు వ్యాపించి.. దహనం అయిపోతుంది. ఈ స్థితిలో అగ్నిమాపక శాఖ సిబ్బంది సైతం మంటలను అదుపు చేయలేరు.When this happened in America 23 yrs ago in Rhode Island, our National Institute of Standards and Technology (NIST) recreated the fire with the same polyurethane egg-crate foam and sparklers that ignited it.This is the video showing 1 minute to total flashover. Then, no escape. pic.twitter.com/T52qpPZf5g— Solvated Electron (@Solvatdelectron) January 1, 2026ఫ్లాష్ ఓవర్ గుర్తించే సంకేతాలుకాగా, ఫ్లాష్ ఓవర్ జరగబోయే ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. అగ్నిమాపక సిబ్బంది వీటిని గుర్తించడం ద్వారా ప్రాణాపాయం తగ్గించుకోవచ్చు.పొగ రంగు: గాఢమైన నల్ల పొగ, వేగంగా కదిలే పొగ పొర.వేడి తీవ్రత: గదిలో వేడి ఒక్కసారిగా పెరగడం, నేలస్థాయిలో కూడా వేడి తీవ్రంగా అనిపించడం.పొగ పొర కదలిక: పైకప్పు దగ్గర పొగ పొర కిందికి దిగుతూ, వేగంగా కదలడం.ఫైర్ బిహేవియర్: వస్తువులు ఇంకా మంటలు అంటుకోకపోయినా, వేడి వల్ల వాటి ఉపరితలాలు కాంతివంతంగా కనిపించడం.రేడియంట్ హీట్: గదిలో నిలబడలేని స్థాయిలో వేడి ప్రవాహం (సుమారు 20 kW/m²).నివారణ చర్యలుఫ్లాష్ ఓవర్ ప్రమాదాన్ని తగ్గించడానికి అగ్నిమాపక సిబ్బంది భవన రూపకర్తలు ఇలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.వెంటిలేషన్ నియంత్రణ: గదిలో ఆక్సిజన్ ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా మంటల విస్తరణను తగ్గించడం.కూలింగ్ వాటర్ స్ప్రే: పైకప్పు పొగ పొరపై నీటిని స్ప్రే చేయడం ద్వారా ఉష్ణోగ్రత తగ్గించడం.ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్స్: భవన నిర్మాణంలో అగ్ని నిరోధక పదార్థాలను ఉపయోగించడం.ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్: భవనంలో పొగ డిటెక్టర్లు, హీట్ సెన్సర్లు వాడటం.ఫైర్ఫైటర్ ట్రైనింగ్: ఫ్లాష్ఓవర్ సంకేతాలను గుర్తించే శిక్షణ ఇవ్వడం.ముఖ్యమైన గత ప్రమాదాలు ఇవే..1923: టోక్యో, జపాన్: భూకంపం తర్వాత మంటలు విస్తరించి నగరం మొత్తం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.1964: తమిళనాడులోని మదురై స్కూల్ అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో విద్యార్థులు చనిపోయారు.1997: ఢిల్లీలోని ఉపహార్ సినిమా హాల్లో ఒక్కసారిగా మంటలు విస్తరించాయి. ఈ ప్రమాదంలో 59 మంది మరణించారు.2004: తమిళనాడులోని కుంబకోణం పాఠశాలలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 90కి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.2024: గుజరాత్లోని రాజ్కోట్ టీఆర్పీ గేమింగ్ జోన్లో మంటలు విస్తరించి 33 మంది మరణించారు. వీరిలో 9 మంది చిన్నారులు.2025: ఢిల్లీలోని వివేక్ విహార్లోని న్యూ బోర్న్ బేబీ కేర్ ఆసుపత్రిలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు శిశువులు మరణించారు.2026: స్విట్జర్లాండ్లోని క్రాన్స్-మోంటానా బార్లో ప్రమాదం. 47 మంది మరణించారు. -
ఆప్ఘనిస్తాన్ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు.. 17 మంది మృతి
ఆప్ఘనిస్తాన్ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరదలు కారణంగా 17 మంది మృతిచెందారని, 11 మంది గాయపడినట్లు ఆఫ్ఘానిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. హెరాత్ ప్రావిన్స్లోని కబ్కాన్ జిల్లాలో గురువారం ఒక ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు.సోమవారం(డిసెంబర్ 29, 2025) నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. మధ్య, ఉత్తర, దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో నష్టం అధికంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. వరదలు కారణంగా పశువులు కూడా చనిపోయాయి. వరద ప్రభావం 1,800 కుటుంబాలపై పడిందన్నారు.సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. వరద తీవ్రతను అంచనా వేయడానికి బృందాలను పంపించినట్లు ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా చాలా కాలంగా వర్షాలు లేక కరువు పరిస్థితులు ఎదుర్కొంటుంది. భారీ వర్షాలు కురిసిప్పటికీ ఆకస్మిక వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు పరిస్థితి మరింత దారుణంగా మారింది. -
మేయర్గా మమ్దానీ ప్రమాణం.. ఖాతాలో మరో రికార్డు
న్యూయార్క్: అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ నగర 112వ మేయర్గా భారతీయ మూలాలున్న జోహ్రాన్ మమ్దానీ(34) ప్రమాణ స్వీకారం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం తెల్లవారుజామున న్యూయార్క్ ఓల్డ్ సిటీ హాల్ సబ్వే స్టేషన్ వద్ద నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. మమ్దానీ కుటుంబ సభ్యులు, సలహాదారులు, సన్నిహితులు హాజరయ్యారు. న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన తొలి దక్షిణాసియావాసిగా, తొలి ముస్లింగా, రెండో పిన్న వయసు్కడిగా మమ్దానీ రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. ఆయనతో స్టేట్ అటార్నీ జనరల్ లెటీటియా జేమ్స్ ప్రమాణం చేయించారు. మమ్దానీ రెండు ఖురాన్ ప్రతులపై ప్రమాణం చేయడం గమనార్హం. ఈ సందర్భంగా భార్య రమా దువాజీ పక్కనే ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తా.. ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకురాలు మీరా నాయర్, కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మహమూద్ మమ్దానీల కుమారుడైన జోహ్రాన్ ఉగాండా రాజధాని కంపాలాలో జన్మించారు. ఏడేళ్ల వయసులో కుటుంబంతో కలిసి అమెరికా చేరుకున్నారు. 2018లో అమెరికా పౌరసత్వం పొందారు. మేయర్గా న్యూయార్క్ నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని మమ్దానీ ప్రకటించారు. తన ప్రమాణ స్వీకారం నూతన అధ్యాయానికి ప్రారంభంగా అభివర్ణించారు. ప్రమాణ స్వీకారానికి వేదికగా పాత సబ్వే స్టేషన్ను ఎంచుకోవడానికి గల కారణాన్ని వివరించారు. ఇది 1904లో ప్రారంభమైందని, ఘన చరిత్ర కలిగి ఉందని పేర్కొన్నారు.“I was elected as a Democratic Socialist, and I will govern as a Democratic Socialist.”— Zohran Mamdani in his inauguration speech. pic.twitter.com/R1KlIhu6vA— Pop Base (@PopBase) January 1, 2026ప్రజల జీవితాలను మార్చేలా తెలివైన, సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి ఇదొక ప్రతీక అని చెప్పారు. ప్రమాణం కోసం మమ్దానీ ఉపయోగించిన ఖురాన్ ప్రతులకు కూడా ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ఇందులో ఒకటి మమ్దానీ తాత నుంచి వారసత్వంగా వచ్చింది. మరొకటి న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ నుంచి తీసుకొచ్చారు. దీనికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. నల్ల జాతీయుల సంస్కృతిపై స్కోమ్బర్గ్ సెంటర్ ఫర్ రీసెర్చ్ సంస్థ అధ్యయనం చేసింది. ఈ క్రమంలోనే పలు ఖురాన్ ప్రతులను, పుస్తకాలను సేకరించింది. వీటిని న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీలో భద్రపర్చారు. అందులో ఒకటి మమ్దానీ ఉపయోగించిన ఖురాన్ కావడం విశేషం. తమ లైబ్రరీ నుంచి తీసుకెళ్లిన ఖురాన్పై మేయర్ ప్రమాణం చేయడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నామని లైబ్రరీ సీఈఓ ఆంథోనీ డబ్ల్యూ మార్క్స్ చెప్పారు. ఖురాన్పై ప్రమాణం చేసిన తొలి న్యూయార్క్ మేయర్గా జోహ్రాన్ మరో రికార్డు సృష్టించారు. -
బంగ్లాలో మరో హిందువుపై దాడి.. సీమా దాస్ కీలక వ్యాఖ్యలు
ఢాకా: బంగ్లాదేశ్లో హిందువులే టార్గెట్గా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్లో మరో హిందువుపై దాడి జరిగింది. వ్యాపారి ఖోకన్ చంద్ర దాస్పై దుండగులు దాడి చేశారు. దుండగులు.. ఆ తర్వాత పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటన దాముద్యాలోని క్యూర్బంగా బజార్లో బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో జరిగింది. కాగా, గడిచిన రెండు వారాల్లో నలుగురు హిందువులపై దాడి జరగడం గమనార్హం.ఈ నేపథ్యంలో తన భర్తపై జరిగిన హత్యాయత్నంపై దాస్ భార్య సీమా దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తర్వాత సీమా దాస్ మీడియాతో మాట్లాడారు. పెట్రోల్ పోసి తన భర్తను హత్య చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. తమకు ఏ విషయంలోనూ ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవన్నారు. తన భర్తపై ఎందుకు దాడి చేశారో అర్థం కావడం లేదన్నారు. మేము హిందువులం. ఇక్కడ శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నాం. నా భర్తపై దాడి చేసిన వారిని ప్రభుత్వం శిక్షించాలి. దాడి చేసిన వారిలో ఇద్దరిని నా భర్త గుర్తించారు. అందుకే పెట్రోల్ పోసి నిప్పంటించారు. నేను ప్రభుత్వాన్ని సాయం కోసం అభ్యర్థిస్తున్నాను అని కన్నీటిపర్యంతమయ్యారు.Bangladesh - Seema Das wife of Khokon Das said in Bangla & broke down - We have no dispute with anyone on any issue. We don't understand why my husband was suddenly targeted. He recognised 2 of the attackers, That's why they poured petrol on his head, face & set him on fire. pic.twitter.com/A8atvPubYl— Anand L (@kharshad0) January 1, 2026ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో దాడి చేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. బాధితుడిని మెరుగైన చికిత్స కోసం ఢాకాకు తరలించారు. కోనేశ్వర్ యూనియన్లోని తిలాయ్ గ్రామానికి చెందిన ఖోకన్ దాస్.. క్యూర్బంగా బజార్లో ఔషధాలు, మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారం చేస్తారు. బుధవారం రాత్రి తన దుకాణాన్ని మూసివేసిన అనంతరం ఆయన ఆటోలో ఇంటికి బయలుదేరారు. క్యూర్బంగా బజార్కు సమీపంలో దుండగులు ఆయన ఆటోను ఆపారు. పదునైన ఆయుధాలతో ఆయనపై దాడి చేశారు. గాయపడిన దాస్ తలపై పెట్రోలు పోసి నిప్పంటించారు. దుండగుల నుంచి తప్పించుకోవడానికి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దాస్ దూకేశారు. ఈలోగా స్థానికులు అప్రమత్తమై కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. బాధితుడిని షరియత్పుర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఢాకా తీసుకెళ్లారు. ఆయన పొట్టపై, ముఖంపై, మెడ వెనుక భాగంలో, చేతులపై తీవ్ర గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. -
చైనాకు తైవాన్ చెక్.. అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
తైపీ: దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని తైవాన్ అధ్యక్షుడు లై చింగ్ టె స్పష్టం చేశారు. ఆ దేశం చుట్టూ చైనా ఇటీవల లైవ్–ఫైర్ సైనిక కసరత్తలు చేపట్టిన నేపథ్యంలో గురువారం కొత్త సంవత్సర ప్రసంగం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా విస్తరణవాద కాంక్ష నేపథ్యంలో, తైవాన్ ప్రజలకు తమను తాము రక్షించుకునే శక్తి ఉందో, లేదోనని అంతర్జాతీయ సమాజం చూస్తోందన్నారు.జాతీయ రక్షణ, సమాజాన్ని కాపాడటం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు సమగ్రమైన రక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంపై అధ్యక్షుడిగా తన వైఖరి స్పష్టమన్నారు. ఒకప్పుడు జపాన్ కాలనీగా ఉన్న తైవాన్ 1949లో చైనాతో జరిగిన అంతర్యుద్ధంలో ఓడిపోవడంతో స్వతంత్ర పాలనలో ఉంది. అయితే చైనా మాత్రం తైవాన్ను తన సొంత భూభాగంగా చూస్తుంది. అవసరమైతే దానిని బలవంతంగా స్వాధీనం చేసుకుంటామని పదేపదే బెదిరిస్తుంది. ఈ నేపథ్యంలో లై వ్యాఖ్యలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.అధ్యక్షుడు లై, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఎన్ని చెప్పినా, ఏం చేసినా.. తైవాన్ చైనాలో భాగమనే వాస్తవాన్ని వారు మార్చలేరని తెలిపింది. తైవాన్పై చైనా దాడి చేస్తే టోక్యో జోక్యం చేసుకుంటుందని జపాన్ చేసిన వ్యాఖ్యలు, యూఎస్ ఆయుధ విక్రయాలపై చైనా కొత్త నాయకుడి వ్యాఖ్యలపై బీజింగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ విలీనాన్ని ఎవ్వరూ ఆపలేరని తాజాగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా వ్యాఖ్యానించారు. -
బలగాల ప్రయోగంపై కేపీ ఓలీకి సమన్లు!
కాఠ్మండు: గత ఏడాది సెప్టెంబర్లో నేపాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో యువత పైకి సాయుధబలగాలను ప్రయోగించి నాటి ప్రధాని కేపీ శర్మ ఓలీ అధికార దురి్వనియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ కమిషన్ త్వరలో ఆయనను విచారించనుంది. జనవరి 21వ తేదీలోగా నివేదిక సమర్పింంచాల్సి ఉండటంతో ఆలోపు నిర్ణయాత్మకమైన నేతలు, అధికారుల నుంచి కమిషన్ సభ్యులు వివరణ తీసుకోనున్నారు. సెప్టెంబర్ 8వ తేదీన కాఠ్మండులో ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీ చేపట్టిన యువతపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్లో అవినీతి, వారసత్వ రాజకీయాలు, అస్తవ్యస్త పాలనతో విసిగిపోయిన జనం జెన్–జెడ్ యువతరం సారథ్యంలో ఉద్యమించడంతో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో దేశవ్యాప్తంగా ఆనాడు 77 మంది చనిపోయిన విషయం తెల్సిందే. దీంతో నేపాల్ తాత్కాలిక ప్రభుత్వం నియమించిన గౌరీ బహదూర్ కర్కీ సారథ్యంలోని విచారణ కమిషన్ దర్యాప్తు మొదలెట్టింది. కర్కీ గురువారం మీడియాతో మాట్లాడారు. ఘటనలో స్పష్టత కోసం ఓలీకి సమన్లు జారీచేసి ప్రశ్నించే అవకాశముందని చెప్పారు. అయితే కమిషన్ ఎదుట తాను హాజరయ్యే ప్రసక్తే లేదని కేపీ శర్మ ఓలీ కరాఖండీగా చెప్పేశారు. కమిషన్ చట్టబద్ధతను, విచారణలో పారదర్శకతను ఆయన ప్రశ్నించారు. -
కలిసి జీవిస్తేనే ‘గ్రీన్కార్డు’
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసానికి, తద్వారా పౌరసత్వం పొందడానికి దగ్గరి దారి అమెరికా పౌరసత్వం ఉన్న వారిని పెళ్లాడటం. గ్రీన్కార్డు అని పిలిచే శాశ్వత నివాస కార్డు(పర్మినెంట్ రెసిడెంట్ కార్డు) కోసం విదేశీయులు ముఖ్యంగా భారతీయులు అమెరికా పౌరుడు/పౌరురాలిని వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అమెరికాలో నివసిస్తున్న వలసదారుల అంతిమ లక్ష్యం గ్రీన్కార్డు సాధించడమే. అయితే, గ్రీన్కార్డు కలిగినవారు అమెరికా గడ్డపై జన్మించిన పౌరులతో సమానం కాదు. అయినప్పటికీ పౌరులతో సమానంగా చాలావరకు హక్కులు లభిస్తాయి. తర్వాత అమెరికా పౌరసత్వం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్డుకు డిమాండ్ పెరగడానికి ఇదే అసలైన కారణం. అమెరికా పౌరసత్వం కలిగినవారిని పెళ్లి చేసుకుని గ్రీన్కార్డు కొట్టేద్దామంటే ఇకపై కుదరదని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ బ్రాడ్ బెర్న్స్టీన్ తేల్చిచెప్పారు. ఇలాంటి పెళ్లితో గ్రీన్కార్డు రావడానికి గ్యారంటీ ఉండదని వెల్లడించారు. → యూఎస్ సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ని బంధనల ప్రకారం అమెరికా సిటిజెన్ను వివా హం చేసుకొని జీవిత భాగస్వామిగా మారిన విదేశీ వ్యక్తిని ‘‘అమెరికా సిటిజెన్ తక్షణ బంధువు’గా పరిగణిస్తారు. అమెరికా పౌరుడు/పౌరు రాలి భార్య/భర్తకు గ్రీన్కార్డు కోసం దరఖాస్తు చేసుకొనే అర్హత చట్ట ప్రకారం లభిస్తుంది. → అమెరికా సిటిజెన్ను వివాహం చేసుకుంటే గ్రీన్కార్డు వచ్చేసినట్లేనని భావించవద్దని, ఆ అవకాశం ఉండదని బెర్న్స్టీన్ తెలియజేశారు. గ్రీన్కార్డు పొందాలంటే అమెరికా సిటిజెన్తో పెళ్లి ఒక్కటే సరిపోదని చెప్పారు. వివాహం చేసుకున్న స్త్రీ పురుషులు చాలా ఏళ్లుగా కలిసి జీవిస్తున్నట్లుగా నిర్ధారణ అయితేనే ఈ కార్డు పొందే వీలుంటుందని పేర్కొన్నారు. ఇమ్మిగ్రేషన్ చట్టాలపై బెర్న్స్టీన్కు 30 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. దంపతులు వేర్వేరుగా జీవిస్తున్నట్లు తెలిస్తే గ్రీన్కార్డు దరఖాస్తును ప్రభుత్వం పక్కనపడేసే ప్రమాదం అధికంగా ఉందని ఆయన చెప్పారు. ఒకే ఇంట్లో కలిసికట్టుగా ఉంటేనే అవకాశాలు మెరుగు పడతాయని ఆయన సూచించారు. → ఉద్యోగం, పిల్లల చదువులు వంటి కారణాలతో వేర్వేరుగా ఉంటున్నామని దంపతులు చెప్పినా అధికారులు వినిపించుకునే పరిస్థితి ఉండదని బెర్న్స్టీన్ స్పష్టంచేశారు. కలిసి ఉంటున్నట్లు వారికి విశ్వాసం కలిగించాలని పేర్కొన్నారు. దంపతులు నిత్యం ఒకే ఇంటిని పంచుకోవడం అనేది వివాహనికి నమ్మకమైన గుర్తింపుగా ఇమ్మిగ్రేషన్ చట్టాలు భావిస్తాయని తెలిపారు. → పెళ్లి చేసుకుని దూరంగా ఉంటూ గ్రీన్కార్డు కోసం ప్రయత్నించేవారు తొలుత న్యాయ సహాయం తీసుకోవాలని స్పష్టంచేశారు. అమెరికా వీసాలు, గ్రీన్కార్డుల కోసమే అమెరికా సిటిజెన్ను పెళ్లి చేసుకున్నట్లు తేలితే కఠిన శిక్షలుంటాయని హెచ్చరించారు. → డొనాల్డ్ ట్రంప్ పాలనలో వివాహం ఆధారిత గ్రీన్కార్డు దరఖాస్తులను మరింత నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆ వివాహం అసలైనదేనా? దురుద్దేశం ఏదైనా ఉందా? అనే తనిఖీ చేస్తున్నారు. కేవలం కాగితాలపై జరిగిన పెళ్లి అని తేలితే దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. → అమెరికా వీసాల జారీ కార్యక్రమాన్ని ట్రంప్ కట్టడి చేస్తున్న సంగతి తెలిసిందే. డైవర్సిటీ వీసా(డీవీ) లాటరీని రద్దు చేశారు. ఈ లాటరీ ద్వారా విదేశీయులకు ఏటా 50 వేల దాకా వీసాలు ఇచ్చేవారు. ప్రస్తుతం అవన్నీ ఆగిపోయినట్లే. → గ్రీన్కార్డుల కార్యక్రమంపై ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేకంగా గురిపెట్టింది. నిబంధనలు కఠినతరం చేసింది. ఇప్పటికే గ్రీన్కార్డు పొందిన 19 దేశాల ప్రజల నేపథ్యాన్ని క్షుణ్నంగా పరిశీలించాలని ట్రంప్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
జపాన్ పార్లమెంటులో 73 మంది మహిళా ఎంపీలకు ఒకే ఒక్క టాయిలెట్
టోక్యో: జపాన్ పార్లమెంట్లో మహిళా ఎంపీలకు మౌలిక సదుపాయాల కొరతపై తీవ్ర చర్చ మొదలైంది. ప్రస్తుతం దిగువ సభలో 73 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. కానీ వారికి ప్రధాన ప్లీనరీ సెషన్ హాల్ వద్ద కేవలం ఒకే ఒక్క మరుగుదొడ్డి మాత్రమే ఉండడం దేశవ్యాప్తంగా విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో పరిస్థితిపై మహిళా ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరిన్ని టాయిలెట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సుమారు 60 మంది మహిళా ఎంపీలు పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కొత్త ప్రధాని సేన్ తకైచి కూడా దీనిపై కలత చెందినట్లు సమాచారం.జపాన్ పార్లమెంట్ భవనం 1936లో నిర్మించబడింది. ఆ సమయంలో దేశంలో మహిళలకు ఓటు హక్కు కూడా లేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి తర్వాత 1945 డిసెంబర్లో మహిళలకు ఓటు హక్కు లభించింది. అనంతరం 1946 ఎన్నికల్లో తొలిసారి మహిళలు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అయితే కాలం మారినా భవనంలోని మౌలిక సదుపాయాలు మహిళలకు పెరుగుతున్న ప్రాతినిధ్యానికి అనుగుణంగా మారలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.జపాన్ ప్రముఖ వార్తాపత్రిక యోమియురి షింబున్ నివేదిక ప్రకారం... పురుషుల కోసం పార్లమెంటులో 12 మరుగుదొడ్లు (మొత్తం 67 స్టాల్స్) ఉన్నాయి. మహిళల కోసం 9 మరుగుదొడ్లు (మొత్తం 22 క్యూబికల్స్) మాత్రమే ఉన్నాయి. కాగా ప్రధాన విచారణలు జరిగే ప్లీనరీ హాల్ వద్ద మాత్రం మహిళలకు కేవలం ఒక్క టాయిలెట్ ఉంది. దాంతో సమావేశాలకు ముందు సుదీర్ఘ క్యూలు ఏర్పడుతున్నాయి. కొన్నిసార్లు మహిళా ఎంపీలు భవనంలోని మరో భాగానికి వెళ్లి టాయిలెట్ వినియోగించుకోవాల్సి వస్తోంది. ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ మహిళా ఎంపీ యసుకో కొమియామా స్పందిస్తూ.. పార్లమెంటు సమావేశాల సమయంలో మహిళా సభ్యులు టాయిలెట్ బయట క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఇది చాలా అవమానకరమైన పరిస్థితి అని వ్యాఖ్యానించారు.ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో 148 దేశాల్లో జపాన్ 118వ స్థానంలో నిలిచింది. వ్యాపారం, మీడియా, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం ఇప్పటికీ చాలా తక్కువగా ఉందని ఆ నివేదిక పేర్కొంది. ఎన్నికల సమయంలో మహిళా అభ్యర్థులు తరచూ సెక్సిస్ట్ వ్యాఖ్యలు ఎదుర్కొంటున్నారని, రాజకీయాలకంటే ఇంట్లో పిల్లలను చూసుకోవాలి అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని మహిళా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పార్లమెంటులో మహిళల సంఖ్య పెరుగుతోందిప్రస్తుతం: దిగువ సభలో 465 మంది ఎంపీలలో 72 మంది మహిళలు, ఎగువ సభలో 248 మందిలో 74 మంది మహిళలు ఉన్నారు. మహిళలకు కనీసం 30 శాతం ప్రాతినిధ్యం కల్పించాలన్నది జపాన్ ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ పరిణామాల నడుమ, కొత్త ప్రధాని సేన్ తకైచి నిర్వహించిన సమావేశం తర్వాత దేశంలో పని, జీవిత సమతుల్యతపై మరోసారి చర్చ మొదలైంది. గతంలో ఆమె పని, పని, పని మాత్రమే అనే వైఖరితో వార్తల్లో నిలిచారు. తాను రోజుకు 18 గంటలు పనిచేస్తానని, పని, జీవిత సమతుల్యతను నమ్మనని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి.మొత్తంగా జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా మహిళలు మౌలిక సౌకర్యాల కోసం ఇంకా పోరాడాల్సిన పరిస్థితి ఉందన్న విషయం ఈ ఉదంతం మరోసారి స్పష్టం చేస్తోంది. -
టెన్షన్ టెన్షన్: వెనిజులా వైమానిక దళంలో ఇరాన్ యుద్ధ డ్రోన్లు!
ఇరాన్ యొక్క మొహజెర్-6 స్ట్రైక్ డ్రోన్లు వెనిజులా వైమానిక దళంలో కనిపించడంతో యుద్ధం వాతావరణానికి ఆజ్యం పోస్తుంది. ఉక్రెయిన్లో ఉపయోగించే హమాస్తో అనుసంధానించబడిన ఈ ఇరాన్ యుద్ధ డ్రోన్లు ఇప్పుడు వెనిజులా వైమానిక స్థావరంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి యూఎస్కు కొన్ని మైళ్లు దూరంలో ఉండటంతో మరింత ఆందోళన కల్గిస్తోంది. దక్షిణ అమెరికా దేశం వెనిజులాలోని అపార చమురు నిల్వలపై కన్నేసిన ట్రంప్, వాటిని ఎలాగైనా చేజిక్కించుకునే ప్రయత్నాలకు మరింత పదును పెడుతున్నారు. అందులో భాగంగా ఆ దేశానికి చమురు నౌకల రాకపోకలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. సాగర జలాల్లో భారీగా నేవీ, సైన్యాన్ని మొహరించి ప్రతి చమురు నౌకనూ అడ్డుకుని తీరుతామని ట్రంప్ పేర్కొన్నారు. దాంతో అమెరికా యుద్ధానికి దిగే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో వెనిజులా దానికి ప్రతిగా సన్నద్ధమవుతుందన్న దానికి బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇరు దేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
పాముకు చేత్తో ఆహారం పెట్టాడు.. డాక్టర్లు వేలిని కత్తిరించారు?
పాముల్లో ఉండే గుణం.. కాటు వేయడం. అన్ని పాముల్లో విషం లేకపోయినా, విషపూరిత పాములతోనే అత్యంత ప్రమాదం. అది మనం పెంచుకునే విషపూరిత పాము అయినప్పటికీ దానితో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. లేకపోతే మన ప్రాణం మీదకు తెచ్చుకోవాలి. అదే జరిగింది ఇక్కడ. ఓ వ్యక్తి విషపూరిత పామును ముచ్చటగా పెంచుకుంటున్నాడు. కానీ ఆ పాము కాటుతో తన చేతి వేలిని కోల్పోయాడు సదరు వ్యక్తి. చైనా దేశంలోని బీజింగ్లో జరిగిన ఈ ఘటన వైరల్గా మారింది. అతనికి చిన్నప్పటినుండి పాములంటే ఆసక్తి. ఆ క్రమంలోనే ఓ విషపూరిత పామును పెంచుకోవడం మొదలుపెట్టాడు. అయితే ఆ పాముకు జబ్బు చేసి ఆహారం తినలేకపోతోంది. దానికి బలవంతంగా చేతితో ఆహారాన్ని పెడుతూ వస్తున్నాడు. అయితే ఒకానొక సందర్భంలో ఆ పాము కోరల్లో అతని చేయి ఇరుక్కుంది. దాంతో పాము కాటుకు బారిన పడ్డ ఆ వ్యక్తి ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి కరిచిన వేలిని తీసేయాలన్నారు. వేలిలో విషం ఉందని, అది తొలగించకపోతే ప్రాణానికే ప్రమాదమని చెప్పడంతో చేసేదిలేక వేలిని తీయించుకున్నాడు. ఇది ఆ వ్యక్తికి నేర్పిన జీవిత పాఠంగా గుర్తిండిపోవడం ఖాయం. విషపూరితమైన వాటికి దూరంగా ఉండటం ఎంత మంచిదో ఈ ఘటన ద్వారా తేటతెల్లమైంది.అదొక ఫైవ్ స్టెప్ స్నేక్చైనీస్ కథల్లో ఈ పామును "ఫైవ్ స్టెప్ స్నేక్" అని పిలుస్తారు. ఇది అంతటి విషపూరితమైందని నమ్మకం ఉంది, ఒకవేళ ఇది ఎవరినైనా కరిస్తే వారు ఐదు అడుగులు కూడా వేయకముందే మరణిస్తారని చెబుతారు. ఇటీవలి సంవత్సరాల్లో చైనాలో విచిత్రమైన మరియు తరచుగా ప్రమాదకరమైన జంతువులను పెంపుడు జంతువులుగా పెట్టుకునే ధోరణి పెరుగుతోంది.ఈ పాము విషం.. అత్యంత వేగంగా ప్రభావం‘ఫైవ్ స్టెప్ స్నేక్"అనేది అత్యంత విషపూరిత పాముకు సంబంధించినది.ఈ పాము కాటు వేస్తే, విషం చాలా వేగంగా ప్రభావం చూపుతుంది.ప్రజల్లో ఒక నమ్మకం ఉంది: కాటు పడిన వ్యక్తి ఐదు అడుగులు కూడా వేయలేడు, వెంటనే కుప్పకూలిపోతాడు.అందుకే దీనిని "ఫైవ్ స్టెప్ స్నేక్" అని పిలుస్తారు.శాస్త్రీయ పేరు- రస్సెల్ వైపర్శరీరంపై గోధుమ రంగు, పెద్ద పెద్ద వృత్తాకార మచ్చలు ఉంటాయి. పొడవు సాధారణంగా 1–1.5 మీటర్లు.రాత్రివేళ ఎక్కువగా చురుకుగా ఉంటుంది.విష ప్రభావంరక్తం గడ్డకట్టే విధానాన్ని (blood clotting) దెబ్బతీస్తుంది.తీవ్రమైన నొప్పి, వాపు, అంతర్గత రక్తస్రావం కలుగుతుంది.తక్షణ వైద్య సహాయం లేకపోతే ప్రాణాపాయం. -
న్యూ ఇయర్లో విషాదం : అగ్నికీలల్లో చారిత్రాత్మక వోండెల్కెర్క్ చర్చి
నూతన సంవత్సర వేడుకల సమయంలో నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్లోని చారిత్రక చర్చి భారీ అగ్నిప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించడంతో చర్చి భవనానికి తీవ్ర నష్టం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు.19వ శతాబ్దపు ఈ చర్చికి సంబంధించి 50 మీటర్ల (164 అడుగుల) టవర్ కూలిపోయింది. పైకప్పు తీవ్రంగా దెబ్బతింది గురువారం తెల్లవారుజామున చారిత్రాత్మక వోండెల్కెర్క్ (వోండెల్ చర్చి)లో సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో ఉవ్వెత్తున అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. కొన్ని గంటల్లోనే, 154 సంవత్సరాల పురాతన స్మారక చిహ్నంలో భాగమైన చర్చి టవర్ పూర్తిగా కూలిపోవడం తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. మొత్తం నిర్మాణం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అగ్నిమాపక సిబ్బందికి మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. న్యూ ఇయర్ సంబరాల్లో మునిగితేలుతున్న నగరం అంతటా తీవ్ర గందర గోళం ఏర్పడింది. అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు లేదు. అయితే ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనేదిఇంకా తెలియరాలేదు.వోండెల్కెర్క్ చర్చిని ఎపుడు నిర్మించారు?1872లో వోండెల్కెర్క్ చర్చ్ నిర్మితమైంది. దీనిని ప్రసిద్ధ డచ్ ఆర్కిటెక్ట్ పియరీ క్యూపర్స్ రూపొందించారు. 1970లలో పునరుద్ధరించారు. 1977 వరకు రోమన్ కాథలిక్ చర్చిగా పనిచేసింది. De 150 jaar oude monumentale #Vondelkerk vormde het hart van de door Cuypers, architect van oa het Rijksmuseum, ontworpen Vondelbuurt. 😥 pic.twitter.com/z8KmitkUji— MaaikeDx 🖌 (@RembrandtsRoom) January 1, 2026 -
మరో హిందువుపై దాడి
ఢాకా: బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మొహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వ ఏలుబడిలో హిందువులకు రక్షణ కరువైందన్న వాదనలకు మరింత బలం చేకూరేలా మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా మరో హిందూ వ్యక్తిపై దాడి జరిగింది. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న ఒక వర్గానికి చెందిన కొందర వ్యక్తులు కలిసి.. ఖోకాన్ దాస్ అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారు. ఖోకాన్ దాస్కు నిప్పంటించి హత్య చేసే యత్నం చేశారు. 50 ఏళ్లకు పైగా ఉన్న ఖోకాన్ దాస్.. ఇంటికి వెళుతున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. షరియత్ పూర్ జిల్లాలో డిసెంబర్ 31వ తేదీన జరిగిన ఈ ఘటన మరొకసారి బంగ్లాదేశ్లో ఉంటున్న మైనార్టీ హిందువుల భవితవ్యంపై సవాల్ విసురుతోంది. బంగ్లాదేశ్లో ఇటీవల హింసాత్మక ఆందోళనలు మొదలైన తర్వాత హిందువులపై దాడి జరగడం ఇది నాల్గోసారి. డిసెంబర్ 24వ తేదీన కాలీమోహన్ ఏరియాలో అమృత్ మోండ్(29) అనే హిందూ యువకుడిపై దాడి జరగ్గా, డిసెంబర్ 18వ తేదీన దీపూ చంద్రదాస్ అనే 25 ఏళ్ల హిందూ యవకుడిని దారుణంగా హత్యచేశాయి అల్లరిమూకలు. డిసెంబర్ 29వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు మెమిన్సింగ్ జిల్లాలోని మెహ్రాబారీ ప్రాంతంలోని సుల్తానా స్వెట్టర్స్ లిమిటెడ్ వస్త్ర పరిశ్రమ వద్ద సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే 42 ఏళ్ల బజేంద్ర బిశ్వాస్ హత్యకు గురయ్యారు. తోటి సెక్యూరిటీ గార్డ్ అయిన 29 ఏళ్ల నోమన్ మియా తన సర్విస్ షాట్గన్తో కాలచ్చింపాడు. -
రష్యా డ్రోన్ దాడిలో.. 24 మంది మృతి
మాస్కో: ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రతరం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్లోని ఖేర్సన్ రీజియన్లో ఉన్న ఓ కేఫ్ అండ్ హోటల్పై భారీ డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో 24 మంది చనిపోయారు. కొత్త సంవత్సర వేడుకల్లో పౌరులు ఉండగా ఈ దాడి చోటుచేసుకున్నట్లు ఖేర్సన్ గవర్నర్ తెలిపారు.ఖోర్లీ గ్రామంలో ఉన్న ఆ హోటల్పై మూడు డ్రోన్లతో దాడి జరిగింది. ఘటనలో 24 మంది మరణించగా, 50 మంది గాయపడ్డారని అధికారులు టెలిగ్రామ్ చానెల్ ద్వారా వెల్లడించారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అంటున్నారు.ఒకవైపు ట్రంప్ తన మధ్యవర్తిత్వంతో ఈ యుద్ధాన్ని ముగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే పుతిన్తో ఓసారి.. జెలెన్స్కీతో మూడుసార్లు భేటీ అయ్యారు. తాజాగా 90 శాతం శాంతి ప్రణాళిక ఖరారైనట్లేనని, ఏక్షణమైనా యుద్ధం ఆగిపోతుందని ట్రంప్ స్వయంగా ప్రకటించారు కూడా. అయితే.. శాంతి చర్చల వేళ ఇరు దేశాలు మాత్రం డ్రోన్లతో పరస్పరం దాడులు జరుపుకుంటున్నాయి.. తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి జరగ్గా.. సైన్యం దానిని తిప్పి కొట్టింది. ఇది ఉక్రెయిన్ పనేనని మాస్కో ఆరోపిస్తుండగా.. కీవ్ మాత్రం అవి ఆరోపణలేనని తోసిపుచ్చింది. ఈ క్రమంలో.. ఆధారాలంటూ కొన్ని వీడియోలను బయటపెట్టింది రష్యా. -
ఎయిరిండియా పైలట్ నిర్వాకం, ఆందోళనలో ప్రయాణికులు
విమాన ప్రమాదాలు, ఇండిగో సంక్షోభంతో విమానాలు రద్దు లాంటి అనేక ఇబ్బందులతో విమాన ప్రయాణ మంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి పరిస్థితి ప్రయాణికులది. తాజాగా జరిగిన మరో సంఘటన విమాన ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. కెనడాలోని వాంకోవర్ విమానాశ్రయంలో ఎయరిండియా పైలట్ బుక్ అయ్యాడు. స్టోరీ ఏమిటీ అంటే...టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఫెస్టివ్ మూడ్లో ఉన్న పైలట్ మద్యం సేవించి వాంకోవర్నుంచి ఢిల్లీకి బయలు దేరిన బోయింగ్ 777-AI 186 విమానంలో విధులకు సిద్ధ పడ్డాడు. విమానంలో పైలట్ భద్రతా ప్రోటోకాల్ పరీక్షల్లో పట్టుబడ్డాడు. ఆల్కహాల్ వాసన వస్తున్నట్లు గమనించిన సిబ్బంది ఈ విషయాన్ని కెనడియన్ అధికారులకు నివేదించారు. వారు తక్షణమే పైలట్ను బ్రీత్ అనలైజర్ పరీక్షలో పట్టుబడ్డాడు. దీంతో అతని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విమానాన్ని రెండు గంటల పాటు నిలిపి వేశారు. విషయం తెలిసి ప్రయాణీకులు ఆందోళన పడ్డారు. 2025 డిసెంబరు 23న సంఘటన చోటు చేసుకుంది. పైలట్ వ్యవహారం బయటపడటంతో ఎయిరిండియా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసింది. నలుగురు పైలట్లు రెండు షిఫ్ట్లతో నడిచే ఈ అల్ట్రా-లాంగ్-హాల్ విమానం స్థానిక సమయం సాయంత్రం 5 గంటలకు బయలు దేరింది. షెడ్యూల్ కంటే దాదాపు రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరి, వియన్నాలో కొత్త సిబ్బందితో ఢిల్లీకి బయలుదేరింది. దీనిపై ఎయిరిండియా తీవ్రంగా స్పందించింది. పైలట్ను ఢిల్లీకి తరలించి, దర్యాప్తు చేపట్టింది. జీరో-టాలరెన్స్ తమ విధానమని, నిబంధనల ఉల్లంఘనను సహించబోమని ఎయిరిండియా తెలిపింది. ప్రయాణీలకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. అలాగే ఈ విషయాన్ని ఎయిర్లైన్ రెగ్యులేటరీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి నివేదించింది.మరోవైపు పైలట్ విమానాశ్రయంలో అనుకోకుండా మద్యం తాగాడని కొందరు చెప్పగా, మరికొందరు బాటిల్ కొన్న సందర్భంగా మద్యం వాసన వచ్చిందని చెబుతున్నారు. -
తొలి గ్రీటింగ్ అలా..‘ఆర్చీస్’ సామ్రాజ్యం ఇలా..
ఒకప్పుడు నూతన సంవత్సరం వేళ ప్రతి ఇంట్లోనూ సందడి చేసిన గ్రీటింగ్ కార్డ్స్ ఇప్పుడు కనుమరుగయ్యాయి. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే.. 80, 90వ దశకాల్లో గ్రీటింగ్ కార్డ్స్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పండుగలు, పుట్టినరోజులు, ముఖ్యంగా కొత్త సంవత్సరం వేడుకల సమయంలో ఒకరికొకరు కార్డులు ఇచ్చిపుచ్చుకోవడం ఒక గొప్ప అనుభూతిగా ఉండేది. ఈ గ్రీటింగ్ కార్డుల విప్లవం వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది. రోడ్డు పక్కన పోస్టర్లు అమ్ముకునే ఒక సామాన్య యువకుడు.. కేవలం ఐదు వేల రూపాయల అప్పుతో భారతదేశంలో గ్రీటింగ్ కార్డుల విస్తృత వినియోగానికి నాంది పలికాడు. తద్వారా వందల కోట్ల కంపెనీని కూడా నెలకొల్పాడు.గ్రీటింగ్ కార్డ్ పుట్టుక.. లండన్ నుండి భారత్కు..గ్రీటింగ్ కార్డుల చరిత్ర 182 ఏళ్ల నాటిది. 1843లో లండన్కు చెందిన ప్రభుత్వ అధికారి సర్ హెన్రీ కోల్.. క్రిస్మస్ సందర్భంగా తనకు వచ్చే వందలాది లేఖలకు సమాధానం ఇవ్వలేక ఒక కొత్త ఆలోచన చేశారు. తన స్నేహితుడు, ఆర్టిస్ట్ జాన్ కాల్కాట్ హార్స్లీచేత ఒక చిత్రాన్ని గీయించి, దానిపై ‘క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని రాయించారు. ఇదే ప్రపంచంలో మొట్టమొదటి కమర్షియల్ గ్రీటింగ్ కార్డ్. బ్రిటీష్వారు భారత్ను పరిపాలిస్తున్న సమయంలో గ్రీటింగ్ సంస్కృతి భారత్లో ప్రవేశించింది. 1979లో అనిల్ మూల్చందాని అనే యువకుడు ‘ఆర్చీస్’ (Archies) సంస్థ ద్వారా గ్రీటింగ్ కార్డులను సామాన్యులకు చేరువ చేశారు.అప్పుతో మొదలైన ‘ఆర్చీస్’ ప్రస్థానంఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన అనిల్ మూల్చందాని, ఒకవైపు తన తండ్రికి చీరల దుకాణంలో సాయం చేస్తూనే, మరోవైపు పోస్టర్లు అమ్మేవారు. 1981లో ఆయన ఢిల్లీలోని కమలా నగర్లో కేవలం రూ. ఐదు వేల పెట్టుబడితో ఒక చిన్న దుకాణాన్ని ప్రారంభించారు. అనిల్ అమోఘ కృషితో ‘ఆర్చీస్’ బ్రాండ్ దేశవ్యాప్తంగా విస్తరించింది. గ్రీటింగ్ కార్డులు ప్రతి మధ్యతరగతి ఇంటికీ చేరాయి. ఒకానొక దశలో ఈ కంపెనీ విలువ రూ.100 కోట్లకు చేరింది. నేటి సోషల్ మీడియా యుగంలోనూ ఈ సంస్థ సుమారు రూ. 70 కోట్ల విలువతో తన ఉనికిని చాటుకుంటోంది.డిజిటల్ యుగంలోనూ జ్ఞాపకాలుప్రస్తుత స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా కాలంలో వాట్సాప్ సందేశాలు ప్రాచుర్యం పొందినప్పటికీ, గ్రీటింగ్ కార్డుల ప్రాముఖ్యత పూర్తిగా తగ్గిపోలేదు. ఆన్లైన్ గిఫ్టింగ్ పోర్టల్స్ ద్వారా నేటికీ కార్డుల అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. చేతితో చక్కగా రాసిన సందేశం అందించే ఆత్మీయత డిజిటల్ మెసేజ్లలో కనిపించదని కొందరు నమ్ముతుంటారు. వారు ఇప్పటికీ శుభాకాంక్షలను తెలిపేందుకు గ్రీటింగ్ కార్డులనే ఎంచుకుంటున్నారు. అందుకే గ్రీటింగ్ కార్డుల యుగం ముగిసిందని చెప్పలేం.. అది కేవలం తన రూపాన్ని మార్చుకున్నదని మాత్రమే అనగలం.ఇది కూడా చదవండి: ఆ దేశాల్లో కానరాని సంబరాలు.. కారణమిదే.. -
చరిత్ర సృష్టించిన జోహ్రాన్ మామ్దానీ
భారతీయ మూలాలున్న జోహ్రాన్ మమ్దానీ చరిత్ర సృష్టించారు. అమెరికాలోని అతిపెద్ద నగరమైన న్యూయార్క్కు తొలి ముస్లిం మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. అనూహ్యంగా గురువారం అర్ధరాత్రి చారిత్రక మాన్హట్టాన్ సబ్వే స్టేషన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరిణామంపై అటు నగర ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.న్యూయార్క్ మేయర్ ప్రమాణ స్వీకార వేడుకను ఆయన స్నేహితురాలు లెటిటియా జేమ్స్ నిర్వహించారు. డెమొక్రాట్ అయిన మమ్దానీ అమెరికాలోని అతిపెద్దదే కాదు.. విలాసవంతమైన నగరానికి మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. ఖురాన్ పై చేయి ఉంచి ఆయన ప్రమాణం చేసిన ఆయన.. తన జీవిత కాలంలో లభించిన అరుదైన గౌరవంగా చెప్పారు. అంతేకాదు.. కొత్త రవాణా శాఖ కమిషనర్గా మైక్ ఫ్లిన్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు.న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉగాండ-భారత సంతతికి చెందిన 34 ఏండ్ల జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అతి చిన్న వయస్సులో ఈ పదవికి ఎన్నికైన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. మేయర్ పదవిని దక్కించుకున్న తొలి ఇండో అమెరికన్ ముస్లిం గానూ, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగానూ జోహ్రాన్ మమ్దానీ నిలిచారు.🚨BREAKING: Zohran Mamdani, a 34-year-old immigrant from Uganda, just made history as the first Muslim, first South Asian, and youngest in a century to become Mayor of New York City.He was sworn in alongside his wife minutes into the new year of 2026 by NYS AG Letitia James. pic.twitter.com/NHgE6NVK5l— CALL TO ACTIVISM (@CalltoActivism) January 1, 2026మమ్దానీ తండ్రి మహమూద్ మమ్దానీ ఉగాండా జాతీయుడు. తల్లి ప్రముఖ ఇండియన్ సినీ డైరెక్టర్ మీరానాయర్. కాగా, మేయర్ ఎన్నికల్లో మమ్దానీకి 50.40 శాతం ఓట్లు (10,36,051) పోల్ అయ్యాయి. ప్రధాన ప్రత్యర్థి, న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్ర్యూ క్యూమోకు 41.6 శాతం ఓట్లు (8,54,995) వచ్చాయి. దాదాపు 1.81 లక్షల ఓట్ల మెజార్టీతో మమ్దానీ విజయం సాధించారు. రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ స్లివాకు 7.10% (1,46,137) ఓట్లు వచ్చాయి.నవంబర్ 4వ తేదీన జరిగిన ఈ ఎన్నికలో దాదాపు 20 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత 56 ఏండ్లలో ఈ స్థాయిలో ఓటింగ్ నమోదు కాలేదు. ఎన్నికల ప్రచారంలో స్వయంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ స్లివా తరఫున ప్రచారం చేశారు. ఈ క్రమంలో జోహ్రాన్ను చిత్తుగా తిట్టారు. అయినా కూడా జోహ్రాన్నే విజయం వరించింది.అయితే.. ఆ మధ్య వైట్హౌజ్ వెళ్లి ట్రంప్ను కలిసి కాసేపు భేటీ అయ్యాడు మమ్దానీ. ఆ సమయంలో న్యూయార్క్ అభివృద్ధికి కలిసి పని చేస్తామంటూ ట్రంప్ ప్రకటించారు. -
సంబరాల వేళ స్విట్జర్లాండ్లో పేలుడు
క్రాన్స్–మోంటానా(స్విట్జర్లాండ్): ఎప్పుడు దట్టంగా కమ్ముకున్న మంచుతో దవళవర్ణంతో ధగధగా మెరిసిపోయే స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వతశ్రేణుల్లో ఒక్కసారిగా నిప్పుకణికలు ఎగసిపడ్డాయి. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రఖ్యాత క్రాన్స్–మోంటానాలోని ప్రముఖ బార్లో జనం వేడుకల్లో మునిగిపోయిన వేళ భారీ పేలుడు రూపంలో మృత్యుదేవత అక్కడివారిని కబళించివేసింది. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి దాటాక 1.30 గంటలప్పుడు హఠాత్తుగా లీ కాన్స్టలేషన్ బార్, లాంజ్లో చెలరేగిన మంటలకు 40 మంది బలయ్యారు. 115 మంది గాయపడ్డారు. మంటలకు తాళలేక పలువురు పర్యాటకులు బార్ అద్దాల కిటికీలు బద్దలుకొట్టి బయటకు దూకారు. కాలిన గాయాలతో పలువురు రక్తమోడుతూ రోడ్డుపై పరుగులు పెట్టారు. ఇదంతా ఒక హారర్ మూవీని తలపించిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు ఫ్రెంచ్ ‘బీఎఫ్ఎం’టీవీకి చెప్పారు. తొలుత భారీ శబ్దం వినిపించి తర్వాత బార్ నుంచి దట్టమైన పొగలు వెలువడ్డాయని మరో ప్రత్యక్షసాక్షి చెప్పారు. అనూహ్య ఘటనలో క్రాన్స్–మోంటానా సిటీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే 10 హెలికాప్టర్లలో రంగంలోకి దిగి వెంటనే మంటల్ని ఆర్పే పనిలో పడ్డారు. క్షతగాత్రులను సమీప వలేస్ ఆస్పత్రిలో చేర్పింంచారు. క్షతగాత్రులతో ఆ ఆస్పత్రి ఐసీయూ యూనిట్ పూర్తిగా నిండిపోయింది. తీవ్రగాయాలైన వారిని మిలాన్ నగర ఆస్పత్రులకు తరలించారు. బార్లో గాయపడిన అతిథులను తరలించేందుకు 40 అంబులెన్సులను రప్పించారు. 150కిపైగా అగ్నిమాపక సిబ్బంది బార్లో మంటల్ని ఆర్పేందుకు శ్రమించారు. కాలిపోయిన మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉంది. ‘‘పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో స్థానికులు, ఇటాలియన్లు సహా పలు దేశాల పౌరులు ఉన్నారు. నూతన ఏడాది వేడుకలు కావడంతో వేర్వేరు దేశాల సందర్శకులు హాజరయ్యారు. మృతుల బంధువుల డీఎన్ఏ శాంపిళ్లు తెప్పించి సరిపోల్చి మృతదేహాలను అప్పగించేందుకు కొన్ని వారాల సమయం పడుతుంది’’ అని వలేస్ సబ్డివిజన్ పోలీస్ కమాండర్ ప్రెడెరిక్ గిస్లెర్ స్పష్టంచేశారు. ఘటనను ఉగ్రదాడిగా భావించట్లేమని ఈ ప్రాంత అటార్నీ జనరల్ బేర్రిస్ పిలౌడ్ చెప్పారు. ఇరుకైన మెట్లే ఇరికించాయా? మంటలు అంటుకోవడానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కొత్త ఏడాది మొదలవగా పేల్చిన బాణసంచా నుంచి వెలువడిన నిప్పుకణికల కారణంగా మంటలు అంటుకున్నాయని పలువురు చెప్పారు. ‘‘అతిథుల కోసం నిలువుగా పేర్చిన షాంపేన్ బాటిళ్లపై ఉంచిన ఒక బర్త్డే కొవ్వొత్తి మంటలు పై కప్పుకు అంటుకున్నాయి. దాంతో రెప్పపాటులో మంటలు చెక్క సీలింగ్ అంతటా చుట్టుముట్టాయి. మొదటి ఫ్లోర్ మొత్తం మంటల్లో చిక్కుకుంది. పైన దాదాపు 200 మంది ఉన్నారు. 30 సెకన్ల వ్యవధిలో అంత మంది ఇంత చిన్న ఇరుకు మెట్ల మార్గం గుండా కిందకు దిగిరావడం సాధ్యంకాలేదు. మేం అదృష్టంకొద్దీ ఎలాగోలా బయటపడ్డాం. బాధితుల్లో చాలా మంది 16–26 ఏళ్ల వయసు వారే’’ అని బార్లో సంబరాల్లో పాల్గొన్న ఫ్రాన్స్ జంట ఎమ్మా, అల్బనీలు చెప్పారు. ‘‘వాస్తవిక కారణాలను ఇప్పుడే వెల్లడించలేం. సమగ్ర దర్యాప్తు తర్వాత అగ్ని ప్రమాదానికి కారణాలు వెల్లడిస్తాం’’ అని స్థానిక ప్రభుత్వ సారథి మ్యాథియస్ రెనార్డ్ చెప్పారు. అధ్యక్షుడిగా బాధ్యతలు మొదలెట్టిన తొలిరోజే భారీ అగ్నిప్రమాదం జరగడంతో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గే పార్మెలిన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 4 దశాబ్దాలుగా ప్రముఖ స్కీ రిసార్ట్ బార్గా పేరు.. క్రాన్స్–మోంటానాలోని స్విస్ స్కీ రిసార్ట్లోని అతిపెద్ద బార్గా లీ కాన్స్టెలేషన్కు పేరుంది. దీనిని గత 40 ఏళ్లుగా నడుపుతున్నారు. ఇది రెండంతస్తుల భవంతి. కింది ఫ్లోర్లో అతిపెద్ద బార్ ఉంది. అక్కడ జనం మద్యం సేవిస్తూ నృత్యం చేసే ఏర్పాటు ఉంది. పై ఫ్లోర్లో ఫుట్బాల్ మ్యాచ్లు చూసేందుకు భారీ ఎల్ఈడీ టీవీలున్నాయి. ఇందులో ఒకేసారి 300 మంది ఆతిథ్యం స్వీకరించవచ్చు. ఘటన జరిగినప్పుడు బార్లో ఎంత మంది ఉన్నారనేది తెలియాల్సి ఉంది.Many people were killed and others injured after an explosion at a bar in the ski resort town of Crans-Montana, Switzerland. pic.twitter.com/d2g9rqcCrY— Weather Monitor (@WeatherMonitors) January 1, 2026#Switzerland | Several people were killed and others injured after an explosion rocked a bar in the luxurious alpine ski resort of Crans-Montana, Swiss police said. A spokesperson for the cantonal police said that the explosion was of unknown origin but confirmed multiple… pic.twitter.com/vzDcSNaasS— Deccan Chronicle (@DeccanChronicle) January 1, 2026 -
ఆ దేశాల్లో కానరాని సంబరాలు.. కారణమిదే..
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లోని ప్రజలు జనవరి ఒకటవ తేదీన నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారు. ఆరోజు విందు వినోదాలతో వేడుకలు చేసుకుంటారు. అయితే అన్ని దేశాల్లోనూ జనవరి ఒకటి నూతన సంవత్సర ఆరంభం కాదు. కొన్ని దేశాల్లో తమ సంస్కృతులు, ప్రాచీన క్యాలెండర్లు, చంద్రుని గమనం (లూనార్ సైకిల్స్) ఆధారంగా వేర్వేరు తేదీలలో కొత్త ఏడాదిని స్వాగతిస్తారు. నూతన సంవత్సర వేడుకలు వందల ఏళ్ల నాటి సంప్రదాయాలకు ప్రతిరూపాలు.డ్రాగన్ డ్యాన్స్ల హోరుచైనీస్ నూతన సంవత్సరం సాధారణంగా ఫిబ్రవరి 17 నుండి మార్చి 3 మధ్య వస్తుంది. ఏకంగా 15 రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. ఆ రోజుల్లో డ్రాగన్ డ్యాన్స్లు, ఎరుపు రంగు లాంతర్లు, కుటుంబ విందులతో చైనా కళకళలాడుతుంది. ప్రతి ఏటా ఒక జంతువును ‘రాశి’ (Zodiac Animal) గా పరిగణించడం వీరి ప్రత్యేకత.రైస్ కేక్ సూప్ తింటే..కొరియాలో 'సోల్లాల్' (Seollal) పేరుతో మూడు రోజుల పాటు నూతన సంవత్సర వేడుక నిర్వహిస్తారు. 2026, ఫిబ్రవరి 17న ఇది మొదలుకానుంది. ఈ సందర్భంగా అక్కడి వారంతా ‘టెక్గుక్’ (tteokguk) అనే రైస్ కేక్ సూప్ను సేవిస్తారు. ఇది తింటే వయస్సు ఒక ఏడాది పెరుగుతుందని వారు నమ్ముతారు.దేశవ్యాప్తంగా వాటర్ ఫైట్థాయిలాండ్లో ఏప్రిల్ 13 నుండి 15 వరకు 'సోంగ్క్రాన్' (Songkran) పేరిట నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటారు. దేశవ్యాప్తంగా వాటర్ ఫైట్ నిర్వహిస్తారు. ఇది చెడును కడిగివేస్తుందని వారు భావిస్తారు.నిశ్శబ్ధ స్వాగతంబాలిలో 'న్యేపి' (Nyepi) అనే నిశ్శబ్ద వేడుక జరుగుతుంది. 2026 మార్చి 19న జరగబోయే ఈ వేడుకలో భాగంగా 24 గంటల పాటు ద్వీపం మొత్తం నిశ్శబ్ధంగా మారుతుంది. విమానాలు, ట్రాఫిక్, లైట్లు, శబ్దం ఏమీ ఉండవు. ప్రజలంతా ప్రశాంతంగా మెలుగుతూ ధ్యానంలో కాలం గడుపుతారు.ఇస్లామిక్ నూతన సంవత్సరం (హిజ్రీ)ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం ప్రతి ఏటా మారుతూ ఉంటుంది (2026లో జూన్ 16-17 తేదీలలో రావచ్చు). చంద్రుని గమనం ఆధారంగా ఏటా సుమారు 11 రోజులు ముందుకు జరుగుతుంది. ఇతర దేశాల్లో ఉండే అట్టహాసాలు, పార్టీలకు భిన్నంగా ఇక్కడ ఆ రోజున ప్రశాంతత పాటిస్తూ, ప్రార్థనలు, ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతారు. ఇది కూడా చదవండి: New Year 2026: రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు -
15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్!
సోషల్ మీడియాతో ప్రయోజనాలే కాదు.. అనర్థాలూ పొంచి ఉన్నాయి. ఆ ప్లాట్ఫారమ్లలో అసభ్యకరమైన కంటెంట్ను చూడటం, వేధింపులకు గురికావడంతో పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ అంశాన్ని పలు దేశాలు ఇప్పుడు తీవ్రంగా పరిగణిస్తున్నాయి..నిన్న డిసెంబర్లో ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం అమలు చేసింది. అయితే.. ఇప్పుడు మరో దేశం ఇప్పుడు ఈ రూట్నే ఎంచుకుంది. 15 ఏళ్లలోపు వాడకుండా త్వరలో ఫ్రాన్స్ ఓ చట్టం చేయబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను(డ్రాఫ్ట్)ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.పిల్లలను డిజిటల్ స్క్రీన్ల దుష్ప్రభావాల నుండి రక్షించడమే ఈ చట్టం తీసుకురావడం వెనుక ఉద్దేశమని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ చెబుతున్నారు. ప్రతిపాదనల్లో.. 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించడం, అలాగే సెకండరీ స్కూల్స్లో మొబైల్ ఫోన్లను అనుమతించకపోవడం ఉన్నాయని తెలిపారాయన. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ చట్టాన్ని అమల్లోకి తేవాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే..పిల్లలను స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లకు దూరం చేయాలనే ఫ్రాన్స్ ప్రయత్నం కొత్తేం కాదు. 2018లో ప్రీ-స్కూల్, మిడిల్ స్కూల్లలో మొబైల్ ఫోన్లను నిషేధిస్తూ ఆదేశాలు తీసుకొచ్చింది. అయితే ఆ సమయంలో అది కఠినంగా అమలు కాలేదు. అయితే 2023లో ఇదే రూల్కు ఓ చిక్కు వచ్చిపడింది. “డిజిటల్ లీగల్ ఏజ్” కింద ఫోన్ వాడాలంటే 15 ఏళ్లుగా ఈయూ రూల్ తెచ్చింది. దీంతో ఫ్రాన్స్లో ఆ ఆదేశాలను తేలికగా తీసుకున్నారు.అయితే.. పిల్లలకు డిజిటల్ రక్షణను ప్రాధాన్యంగా తీసుకుని ఫ్రాన్స్ ఈసారి మరో రూట్లో వస్తోంది. నేరుగా నిషేధం అని చెప్పకుండా.. సోషల్ మీడియా, మొబైల్ వినియోగంపై కఠిన నియంత్రణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. సెనేట్ ప్రతిపాదనలో 13 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనుందని తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు నేషనల్ అసెంబ్లీ ఆమోద ముద్ర పడాల్సి ఉంది.ఇంటర్నెట్లో యథేచ్ఛగా అశ్లీల చిత్రాలు లభిస్తున్నాయి. వీటిని ఎవరైనా చూసే వీలుంది. ఇవి చిన్నారుల జీవితాన్ని ప్రమాదంలో పడేస్తాయనే వాదనతో ఏకీభవిస్తున్నాం. ఇలా ఎవరిపడితే వారు అశ్లీల చిత్రాలు, వీడియోలు చూడకుండా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసే అవసరం ప్రభుత్వాలపై ఉంది. అలాగే, ఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధం అంశాన్ని పరిశీలించాలి. అప్పటిదాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బాలల హక్కుల కమిషన్ దీనిపై అవగాహన కల్పించే బాధ్యతను తీసుకోవాలి..::మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తాజా వ్యాఖ్యలుఇప్పటిదాకా .. ఆస్ట్రేలియా కంటే ముందే.. అమెరికాలోని పలు రాష్ట్రాలు స్థానిక చట్టాల ద్వారా నియంత్రిస్తున్నాయి. ఆస్ట్రేలియా పిల్లలకు సోషల్ మీడియాను దూరంగా ఉంచే నిర్ణయాన్ని అమలు చేస్తోంది. ఈ స్ఫూర్తితో.. యూరోపియన్ యూనియన్ అంశాన్ని పరిశీలిస్తోంది. మరి కొన్ని దేశాలు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నాయి. సోషల్ మీడియా వాడకంపై వయస్సు పరిమితులు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ధోరణిగా మారుతోందన్నమాట. -
పుతిన్ ఇంటికే గురిపెట్టారుగా!
ఉక్రెయిన్ సంక్షోభం ఈ ఫిబ్రవరితో నాలుగేళ్లు పూర్తి కానుంది. ఒకవైపు యుద్ధం ముగింపునకు ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నట్లు కనిపిస్తున్నా.. మరోవైపు ఇరుదేశాల కవ్వింపు చర్యలు మాత్రం ఆగడం లేదు. ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంటిపైనే డ్రోన్ దాడి జరగడం కలకలం రేపగా.. అమెరికా సహా పలు దేశాల అనుమానాల నేపథ్యంలో ఆ దాడులకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి జరిగిందనే.. ఇది ఉక్రెయిన్ సైన్యం పనేనని రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే.. ఆ దాడి తమ పని కాదని.. ఇది రష్యా ఆడుతున్న నాటకమని.. అసలు అలాంటి దాడేం జరగలేదని.. శాంతి ప్రయత్నాలకు విఘాతం కలిగించేందుకే ఇలాంటి ఆరోపణలకు దిగింది అని ఉక్రెయిన్ ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. రష్యా అధినేత నివాసంపై దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అదే సమయంలో అలాంటి దాడి జరగకపోయి ఉండొచ్చంటూ అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. అనూహ్యంగా.. మాస్కోతో పాటు క్రిమియాలోని పలు ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగాయంటూ రష్యా కొన్ని వీడియోలను రిలీజ్ చేసింది. అందులో.. క్రెమ్లిన్(రష్యా అధ్యక్ష కార్యాలయం) సమీపంలో నిర్వీర్యం చేసిన ఓ డ్రోన్కు ఆరు కేజీల పేలుడు పదార్థాలు అమర్చి ఉన్నాయి. దీంతో 24 గంటల్లో దాడికి సంబంధించిన ఆధారాలు చూపించాలన్న ఉక్రెయిన్కు గట్టి కౌంటర్ ఇచ్చినట్లైంది. Downed UAV with a 6kg explosive charge — Russian MOD publishes VIDEO PROOF of Ukrainian attack on Putin’s residenceThe attempt was carried out on the night of December 28 to 29WATCH report by the unit who took down 41 of the 91 drones sent by Kiev https://t.co/J9Tgd8yAJx pic.twitter.com/b7Yv55OlxP— RT (@RT_com) December 31, 2025ఈ వీడియోలు వెలుగులోకి రాకముందే.. పుతిన్ ఇంటిపై జరిగిన డ్రోన్ దాడుల్ని పలు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ‘‘శాంతి స్థాపనకు కొనసాగుతున్న ప్రయత్నాలకు భంగం కలిగించవద్దు’’ అంటూ రష్యా-ఉక్రెయిన్లను కోరారు. ఒక్క ఫ్రాన్స్ మాత్రం సరైన ఆధారాల్లేకుండా ఉక్రెయిన్ను నిందించడానికి వీల్లేదంటూ మద్దతు ప్రకటించింది. అయితే.. తాజా దాడుల వీడియోలపై కీవ్ వర్గాలు, జెలెన్స్కీ.. అసలు ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సుమారు 91 డ్రోన్లు.. నోవ్గోరోడ్ రీజియన్లోని పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దూసుకొచ్చాయని.. అయితే మాస్కో-సెయింట్ పీటర్స్బర్గ్లో వాటిని తమ సైన్యం నేల్చకూల్చిందని రష్యా విదేశాంగ మంతరి సెర్గె లావ్రోవ్ ప్రకటించారు. అయితే.. ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ పనేనని ఆరోపిస్తున్నారాయన. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్పై దాడులను రష్యా ఆపడం లేదు. తాజాగా దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెసా నగరంపై తాజాగా డ్రోన్లతో మాస్కో విరుచుకుపడింది. ఈ దాడిలో అనేక అపార్ట్మెంట్లు, విద్యుత్ గ్రిడ్లు ధ్వంసమయ్యాయి. ఓ శిశువు, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు గాయపడ్డారు. శాంతి చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయని భావించేలోపే.. రష్యా ఉక్రెయిన్పై దీర్ఘశ్రేణి దాడుల్ని తీవ్రం చేయడం గమనార్హం. -
చైనాకు పాక్ ఉప ప్రధాని.. కారణం ఇదే..
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్దార్ చైనాలో పర్యటించనున్నారు. ఈ వారం చివర్లో చైనాను సందర్శించనున్న ఆయన చైనా విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కాగా, ఏడో దశ ద్వైపాక్షిక చర్చలు జనవరి 4న బీజింగ్లో జరుగుతాయని పాక్ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఆహ్వానం మేరకు దార్ ఈ పర్యటన చేస్తున్నారని వెల్లడించింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఇరు దేశాలు స్మారక కార్యకలాపాలను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకార భాగస్వామ్యం, ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, అభివృద్ధిని ఈ పర్యటన బలోపేతం చేస్తుందని ప్రకటించింది. -
‘హెచ్–1బీ’ దరఖాస్తు ఫీజు పెంపు చట్టబద్ధమే
వాషింగ్టన్: అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజును డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏకంగా లక్ష డాలర్లకు పెంచడడానికి వ్యతిరేకంగా సాగిస్తున్న న్యాయ పోరాటానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధమేనని కొలంబియా జిల్లాకు చెందిన యూఎస్ జిల్లా కోర్టు న్యాయమూర్తి బెరిల్ హోవెల్ తేల్చిచెప్పారు. ఈ మేరకు డిసెంబర్ 23న ఉత్తర్వు జారీ చేసింది. వీసా దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచడాన్ని సవాలు చేస్తూ యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అక్టోబర్లో యూఎస్ జిల్లా కోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ నిర్ణయంలోని చట్టబద్ధతను ప్రశ్నిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయమూర్తి బెరిల్ హోవెల్ విచారణ చేపట్టారు. రుసుమును విపరీతంగా పెంచేయడం ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని చాంబర్ ఆఫ్ కామర్స్ వాదించింది. వీసా ఫీజును నిర్ణయించే విషయంలో కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కు ఉన్న అధికారాన్ని సైతం ట్రంప్ ప్రభుత్వం అతిక్రమించినట్లు పేర్కొంది. ఫీజను తగ్గించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. అయితే, ఈ వాదనను బెరిల్ హోవెల్ తిరస్కరించారు. అధ్యక్షుడు ట్రంప్ చట్టప్రకారమే నడుచుకున్నారని, వీసా ఫీజు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఆయనకు ఉందని న్యాయమూర్తి స్పష్టంచేశారు. బెరిల్ హోవెల్ గతంలో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒమాబా నియమించిన న్యాయవాది కావడం విశేషం. మరోవైపు జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ యూఎస్ చాంబర్ కామర్స్.. అప్పీల్స్ కోర్టును ఆశ్రయించింది. నోటీసు ఆఫ్ అప్పీల్స్ను దాఖలు చేసింది. జిల్లా కోర్టు ఇచి్చన తీర్పును నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై త్వరలోనే అప్పీల్స్ కోర్టులో విచారణ జరుగనుంది. హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజు విషయంలో చాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయ పోరాటం ఫలించడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. చివరకు ఈ వ్యవహారం అమెరికా సుప్రీంకోర్టుకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెచ్–1బీ వీసాల కోసం అమెరికా వృత్తి నిపుణుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. మొత్తం వీసాల్లో దాదాపు 70 శాతం వీసాలను భారతీయులే దక్కించుకుంటున్నారు. వీసా ఫీజు లక్ష డాలర్లకు(రూ.89.86 లక్షలు) చేరడం అమెరికా కంపెనీలకు పెనుభారంగా మారింది. ఈ ఖర్చు భరించలేక విదేశీ నిపుణులను నియమించుకొనే ప్రక్రియను కంపెనీలు వాయిదా వేస్తున్నారు. అంతిమంగా విదేశీ వృత్తి నిపుణులే నష్టపోతున్నారు. -
బ్యాంక్కు కన్నమేసి భారీ చోరీ
అందరూ నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన వేళ జర్మనీలో చోరశిఖామణులు వందల కోట్ల విలువైన సంపదపై పక్కా ప్రణాళికతో నింపాదిగా కొట్టేశారు. ఏమాత్రం హడావిడి పడకుండా నెమ్మదిగా పని ముగించి ఏకంగా దాదాపు రూ.950 కోట్ల విలువైన కట్టల కొద్దీ కరెన్సీ, కేజీల కొద్దీ బంగారం, ఆభరణాలను వెంట తీసుకెళ్లారు. ఈ చోరీ కోసం దొంగలు భారీ డ్రిల్లింగ్ మెషీన్ను రంగంలోకి దింపారు. అత్యంత దృఢమైన బ్యాంక్ వాల్ట్ గోడకు కన్నమేసి వేలాది మంది బ్యాంక్ వినియోగదారుల విలువైన వస్తువులను తమ వశంచేసుకున్నారు. ఉత్తర రైనీ–వెస్ట్ఫాలియా రాష్ట్రంలోని గెల్సెన్కిర్చెన్ నగరంలోని స్పార్కసీ సేవింగ్ బ్యాంక్ శాఖలో ఈ భారీ చోరీ జరిగింది. సెలవు రోజుల్లో పక్కా ప్రణాళికతో గెల్సెన్కిర్చెన్: జర్మనీలో క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా బ్యాంక్లు సహా పలు రకాల సంస్థలకు సెలవులు ప్రకటిస్తారు. డిసెంబర్ 24 తేదీ నుంచి బ్యాంక్ శాఖలకు తాళాలే వేసి ఉన్నాయి. అటు వైపు కన్నెత్తిచూసే పోలీస్నాథుడే ఉండడు. ఇదే సమయాన్ని దొంగలు తమకు అనువుగా మల్చుకుని విజయం సాధించారు. ఈ స్పార్కసీ సేవింగ్ బ్యాంక్ శాఖలో వందల కోట్ల విలువైన నగలు, బంగారం, కరెన్సీ మూటలను బ్యాంక్ అధికారులు భూగర్భంలోని అత్యంత సురక్షితమైన వాలెట్లోనే భద్రపరుస్తారు. ఈ విషయం తెల్సుకున్న దొంగలు తొలుత ఈ బ్యాంక్ బ్రాంచ్ భవంతిని ఆనుకుని ఉన్న ఒక పార్కింగ్ గ్యారేజీలోకి చొరబడ్డారు. గ్యారేజీ గోడలతో అనుసంధానమైన బ్యాంక్ వాలెట్ గోడ సరిగ్గా ఎక్కడుందో కనిపెట్టారు. పెద్దపెద్ద రంధ్రాలు చేసే అత్యంత శక్తివంతమైన డ్రిల్లింగ్ మెషీన్తో గోడకు రంధ్రం చేశారు. లోపలికి చొరబడి బ్యాంక్ వినియోగదారులకు చెందిన దాదాపు 3,250 లాకర్లను తెరచి వాటిలోని బంగారు ఆభరణాలు, బంగారం కడ్డీలు, కరెన్సీని వెంట తెచ్చుకున్న సంచుల్లోకి నింపారు. ఈ చోరీపై పోలీస్ శాఖ అధికార ప్రతినిధి థామస్ నొవాక్జిక్ మాట్లాడారు. ‘‘దొంగతనం జరిగిన తీరు చూస్తుంటే ఇందులో అత్యంత నిపుణులైన ఘరానా దొంగలు పాల్గొనట్లు తెలుస్తోంది. ఇంత పకడ్బందీగా చోరీ చేయడం ఈ మధ్యకాలంలో చూడలేదు. జర్మనీ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంక్ చోరీ ఘటన ఇదేనేమో. దాదాపు రూ.950 కోట్ల సంపద పోయిందని భావిస్తున్నాం. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో చోరీ జరగలేదు. నింపాదిగా ఒక్కో లాకర్ను బద్దలుకొట్టారు. వాలెట్లోని దాదాపు 95 శాతం లాకర్లలోని విలువైన వస్తువులు గల్లంతయ్యాయి. ఘటనపై ముమ్మర దర్యాప్తు మొదలెట్టాం. ఇప్పటిదాకా ఎవరినీ అరెస్ట్చేయలేదు. అత్యంత ప్రతిభావంతులైన డిటెక్టివ్, పోలీస్ బృందాలతో దొంగల వేట ఆరంభించాం’’అని ఆయన చెప్పారు. తెల్లారిందాకా మోశారు! దొంగలను సంపదను సంచుల్లో నింపుకున్నాక ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము దాకా ఒక్కోటిగా బయటకు తీసుకొచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ‘‘వాళ్లంతా బ్యాంక్ నుంచి రాలేదు. పక్కనే ఉన్న పార్కింగ్ గ్యారేజీ నుంచి రావడంతో మాకు కొంచెం కూడా అనుమానం రాలేదు. అందరూ మాసు్కలు ధరించారు. మెట్ల మీద నుంచి బ్యాగులు మోస్తూ కని్పంచారు’’అని పొరుగు వాళ్లు చెప్పారు. సమీప సీసీటీవీ ఫుటేజీని పోలీసులు తనిఖీచేశారు. అందులో నలుపు రంగు ఆడీ ఆర్ఎస్6 రకం కారు ఒకటి పార్కింగ్ గ్యారేజీ నుంచి బయటకు రావడం కనిపించింది. ఆ కారులో ఉన్నవా ళ్లంతా ముసుగులో ధరించి ఉన్నారు. డీ–లా షెవలేరీ స్ట్రాసీ రోడ్డు గుండా కారులో దొంగలు పారిపోయారు. ఆ కారు లైసెన్స్ ప్లేటు పై పోలీసులు ఆరాతీయగా ఘటనాస్థలి నుంచి 200 కిలోమీటర్ల దూరంలోని హనోవర్ సిటీలో చోరీకి గురైన కారుదిగా గుర్తించారు. ఈ మొత్తం ఘటన హాలీవుడ్లో హిట్ అయిన ‘ఓషన్స్ ఎలెవన్’నేరముఠా చోరీని గుర్తుకు తెస్తోందని పలువురు వ్యాఖ్యానించారు. సోమవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో బ్యాంక్లోని ఒక అలారమ్ మోగడంతో అప్పుడు ఎమర్జెన్సీ బృందం రావడంతో చోరీ జరిగిన విషయం బయటపడింది. -
బ్రహ్మపుత్రపై డ్యామ్కు రూ. 15.27 లక్షల కోట్లు!
బీజింగ్: భారత్కు అత్యంత ముప్పుగా చెబుతున్న బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యామ్ నిర్మాణానికి ఏకంగా దాదాపు రూ.15.27 లక్షల కోట్లు(170 బిలియన్ డాలర్లు) కేటాయిస్తున్నట్టు అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ప్రకటించారు. బుధవారం నూతన సంవత్సర ప్రసంగంలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. విద్యుదుత్పత్తి సాకుతో అరుణాచల్ ప్రదేశ్ కు అతి సమీపంగా టిబెట్ భూభాగంలో ఈ భారీ డ్యామ్ నిర్మాణాన్ని చైనా తలపెట్టడం తెలిసిందే. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాలకు వరద ముప్పు పెరుగుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక వైషమ్యాలు పెచ్చరిల్లిన వేళ ప్రా జెక్టులోని జలరాశిని మనపైకి జలఖడ్గంలా చైనా వాడే ప్రమాదం కూడా ఉందని వారంటున్నారు. అలాంటి డ్యామ్ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లేందుకే చైనా నిర్ణయించుకుందని జిన్ పింగ్ ప్రకటన తేటతెల్లం చేసింది. తైవాన్కు వార్నింగ్ తైవాన్ను ఎప్పటికైనా చైనాలో విలీనం చేసుకుని తీరతామని జిన్ పింగ్ పునరుద్ఘాటించారు. దీన్ని ఎవరూ ఆపలేరని కూడా అన్నారు. తద్వారా తైవాన్ కు మద్దతు పలుకుతున్న అమెరికా వంటి దేశాలను అన్యాపదేశంగా ఆయన హెచ్చరించారు. తైవాన్ చుట్టూ సైనిక కసరత్తులను కొద్ది రోజులుగా చైనా మరింత ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. -
2026కు విశ్వమానవాళి వెల్కమ్
మెల్బోర్న్/న్యూఢిల్లీ: కొత్త ఆశలను మోసుకొచ్చిన నూతన సంవత్సరానికి ప్రపంచదేశాలు ఆనందోత్సాహల నడుమ సాదర స్వాగతం పలికాయి. నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్లో అత్యంత ఆడంబరంగా జరిగే బాల్ డ్రాప్ వేడుక కంటే 18 గంటలు ముందుగానే దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని కిరిటిమాటి ద్వీపవాసులు నూతన ఏడాది వేడుకలను జరుపుకున్నారు. స్థానికకాలమానం ప్రకారం కొత్త ఏడాది అన్నిదేశాలకంటే ముందుగా అక్కడే మొదలైంది. ఏటా డిసెంబర్ 31 అర్ధరాత్రి ఆ్రస్టేలియాలోని సిడ్నీ నగర హార్బర్ బ్రిడ్జిపై కన్నులపండువగా జరిగే బాణసంచా షోను చూసేందుకు జనం ఈసారి సైతం తండోపతండాలుగా తరలివచ్చారు. అయితే రెండు వారాల క్రితం బాండీ బీచ్ వద్ద ఇద్దరు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఈసారి జనసమ్మర్ధ ప్రాంతాల్లో ఆ్రస్టేలియాపోలీసులు మునుపెన్నడూ లేనంతగా మొహరించారు. చాలా మంది పోలీస్ అధికారులు తొలిసారిగా ర్యాపిడ్ఫైర్ రైఫిళ్లను వెంటేసుకుని తిరిగారు. న్యూజిలాండ్లోని అక్లాండ్ సిటీలో ప్రఖ్యాత స్కై టవర్పై పేల్చిన బాణసంచా అక్కడి వారికి కనువిందుచేసింది. ఆ్రస్టేలియా సమీప ఇండోనేసియాలోనూ సంబరాలు అంబరాన్నంటాయి. నెల క్రితమే వేయి మందికిపైగా ప్రజలను వరదలు కబళించిన బాధ నుంచి జనం తేరుకుని కొత్త ఏడాది వేడుకల్లో మునిగిపోయారు. అయితే ఇండోనేసియాలోని బాలీలో మాత్రం భారీ వేడుకలను ఈసారి రద్దుచేశారు. జపాన్లో జనం కొత్త ఏడాది గంట కొట్టగానే బౌద్ధారామాలను దర్శించుకున్నారు. దక్షిణ కొరియా, సింగపూర్ వాసులూ తమదైన శైలిలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. జర్మనీలోని బెర్లిన్ నగర క్యాథడ్రల్, ప్రఖ్యాత బ్రాండెన్బర్గ్ గేటు వద్ద జనం పోగై ఒకరికొకరు నూతన సంవత్సర శుభకాంక్షలు చెప్పుకున్నారు. భారత్లో ఊరూవాడా జనం సంబరాల్లో మునిగిపోయారు. -
చట్టాలు ఉల్లంఘిస్తే శిక్షలే!
న్యూఢిల్లీ: వలసదారులకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం మరో హెచ్చరిక జారీ చేసింది. అమెరికాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని తేల్చిచెప్పింది. క్రిమినల్ నేరాల కింద శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు యూఎస్ ఎంబసీ తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘‘చట్టాలను గౌరవించకపోయినా, ఉల్లంఘించినట్లు తేలినా కఠిన చర్యలు తప్పవు. క్రిమినల్ నేరాలుగా పరిగణించి శిక్ష విధిస్తారు. అక్రమ వలసలను పూర్తిగా నియంత్రించడమే లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. దేశ సరిహద్దులను, పౌరులను రక్షించుకోవాలన్నదే ప్రభుత్వ ధ్యేయం’’అని స్పష్టంచేసింది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ పోస్టు చేయడం గమనార్హం. వలసదారులపై ట్రంప్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వీసా నిబంధనలు మార్చేసింది. ప్రధానంగా హెచ్–1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచేసింది. మరోవైపు హెచ్–1బీ వీసా ఇంటర్వ్యూలను హఠాత్తుగా వాయిదా వేయడంతో వేలాది మంది భారతీయ వృత్తినిపుణులు స్వదేశానికే పరిమితయ్యారు. ఇంటర్వ్యూ తేదీల కోసం ఎదురుచూస్తున్నారు. వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్ను, పోస్టులను అమెరికా అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఇలాంటి సమయంలో చట్టాలను ఉల్లంఘించవద్దంటూ అమెరికా ఎంబసీ హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వలసదారులకు కష్టాలు మొదలయ్యాయి. ట్రంప్ ప్రభుత్వం వారిపై కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. ఈ ఏడాది 6.05 లక్షల మందిని బలవంతంగా బయటకు పంపించింది. అక్రమ వలసదారులను గుర్తించే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా చాలామందిని అమెరికా నుంచి వెళ్లగొట్టడం తథ్యమని ట్రంప్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. -
2025 మండిపోయింది..
అనుకున్నట్టుగానే 2025 పర్యావరణపరంగా మరో అవాంఛనీయ రికార్డు మూటగట్టుకుని ని్రష్కమించింది. చరిత్రలో అత్యంత ఎక్కువ వేడిమి నమోదైన మూడో ఏడాదిగా నిలిచింది. నంబర్లపరంగా మూడో స్థానమే అయినా, ప్రపంచవ్యాప్తంగా 2025 పొడవునా అత్యంత తీవ్రతతో కూడిన వాతావరణ మార్పులు పదేపదే చోటుచేసుకుని వణికించాయి. ముఖ్యంగా అతి తీవ్ర వాతావరణ పరిస్థితుల ఉదంతాలు ఏకంగా 157 నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ‘‘ఇవన్నీ పర్యావరణ మార్పుల విపరిణామాలే. ఈ విపత్తును దీటుగా ఎదుర్కొనే ప్రయత్నాలను తక్షణం ముమ్మరం చేయాలి. ఇందుకు ప్రపంచ దేశాలన్నీ కలసి రావాలి. లేదంటే అంతే సంగతులు. మరో రెండు మూడేళ్ల తర్వాత తత్వం బోధపడ్డా, దిద్దుబాటు చర్యలకు అప్పటికి బాగా ఆలస్యమవుతుంది. అప్పుడిక ఏం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమే కాగలదు’’అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పరిమితిని దాటేశాం! 2025 అత్యంత భారీ ఉష్ణోగ్రతలు చవిచూసిన సంవత్సరాల జాబితాలో మూడో స్థానంలో నిలిచిందంటే మనిషి అత్యాశ వల్ల పుట్టుకొచ్చిన పర్యావరణ విపరిణామాల వల్లేనని సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, గత మూడేళ్ల భూ సగటు ఉష్ణోగ్రత పెరుగుదల 2015 నాటి పారిస్ ఒప్పందంలో నిర్దేశించుకున్న 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పరిమితిని దాటేసింది. ఇలా జరగడం ఇదే తొలిసారి!. ఇది కచ్చితమైన ప్రమాద సంకేతమేనని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025లో కేవలం అత్యుష్ణ ప్రతాపాలే కాదు, భయానక తుఫాన్లు, వరదల వంటివి కూడా బెంబేలెత్తించడం గమనార్హం. నిజానికి 2025లో వాతావరణాన్ని సాధారణంగా చల్లబరిచే లా నినా ఆధిపత్యమే కొనసాగింది. అయినా యూరప్తో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఎండలు మండిపోయాయంటే ఆలోచించాల్సిన విషయమేనన్నది నిపుణుల మాట. ‘‘ముఖ్యంగా శిలాజ ఇంధనాల వాడకానికి మనం తక్షణం గుడ్బై చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే అతి త్వరలో పరిస్థితులు చేయి దాటిపోవచ్చు’’అని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ సహ వ్యవస్థాపకుడు, లండన్ ఇంపీరియల్ కాలేజీ పర్యావరణ శాస్త్రవేత్త ఫ్రెడరిక్ ఒట్టో స్పష్టం చేశారు. ‘‘2025లో వచ్చిన పలు వడగాడ్పులు 2015తో పోలిస్తే ఏకంగా 10 రెట్లు శక్తిమంతమైనవి. పైగా ఏడాది పొడవునా అవి పదేపదే సంభవించాయి. ఇదంతా మనిషి కోరి తెచ్చుకుంటున్న విపత్తే’’ అని ఆయన అన్నారు. ప్రమాదంలో కోట్ల మంది 2025లో ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల వాతావరణ పరిస్థితులు అతి వేడిమి నుంచి తీవ్ర వరదలదాక చూస్తుండగానే మారుతూ వచ్చాయి. ‘‘గ్రీస్, టర్కీ మొదలుకుని అమెరికా, ఆ్రస్టేలియా దాకా పలు దేశాల్లో ఎటు చూసినా కార్చిచ్చులు, మెక్సికోను వణికించిన వరదలు, ఫిలిప్పీన్స్ను కుండపోత వానలతో ముంచెత్తిన ఫుంగ్ వాంగ్ తుఫాను, భారత్లో వానాకాలమంతా ఏదో ఒక ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన వరదలు... ఇవన్నీ వాతావరణ మార్పుల విపరిణామాల సంకేతాలే’’ అని ఫ్రెడరిక్ స్పష్టం చేశారు. ‘‘జమైకా, క్యూబా, హైతీ వంటి దేశాలను హరికేన్ మెలిస్సా రెప్పపాటులో అతలాకుతలం చేసింది. కనీసం హెచ్చరికల జారీకి వ్యవధి ఇవ్వకుండా మెరుపు వేగంతో వచ్చి పడింది. ఆ తర్వాత వెంటనే ఆయా దేశాలను ఉష్ణోగ్రతలు అల్లాడించాయి. ఇలాంటి వెంటవెంట మార్పులకు తట్టుకోలేక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రభావితులవుతున్నారు. వారి జీవనోపాధి దెబ్బతింటోంది. ఇది లక్షలాది కుటుంబాలను దారిద్య్రం దిశగా నెడుతోంది. తద్వారా పలు దేశాల్లో నిశ్శబ్దంగా అతి పెద్ద సంక్షోభాలు పురుడు పోసుకునేందుకు కారణంగా మారుతోంది’’ అని ఆయన అన్నారు.‘శిలాజ’ ముప్పుపై చర్యలేవీ? ఇటీవల బ్రెజిల్లో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ చర్చలు ఈ ప్రమాదకర పరిణామాన్నే హైలైట్ చేశాయి. ముఖ్యంగా గ్లోబల్ వారి్మంగ్కు ప్రధాన కారకాల్లో ఒకటైన శిలాజ ఇంధనాల వాడకాన్ని శరవేగంగా తగ్గించి, వీలైనంత త్వరగా సున్నాకు తేవాలని తీర్మానించాయి. ‘‘కానీ దేశాలన్నీ ఇలాంటి ప్రమాణాలు ఏటా చేస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత తీరిగ్గా విస్మరిస్తూనే ఉన్నాయి. చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలు మాత్రం ఎక్కడా పెద్దగా జరగడం లేదు. చైనాయే ఇందుకు ఉదాహరణ. ఒకవైపు సంప్రదాయేతర ఇంధన వనరుల సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటూనే, మరోవైపు బొగ్గు గనుల తవ్వకాన్ని కూడా విపరీతంగా విస్తరిస్తోంది. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు కొనసాగినంతకాలం పర్యావరణ మార్పులపై సమర్థంగా యుద్ధం చేయడం అసాధ్యమే’’ అని ఫ్రెడరిక్ కుండబద్దలు కొట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తవ్వకాల్లో 500 ఏళ్ల ఓడ.. బంగారం ఎంతుందంటే..!
ఆఫ్రికాలో 500 సంవత్సరాల పురాతన ఓడ ఏడారిలో జరిపిన తవ్వకాల్లో శాస్త్రవేత్తలకు లభ్యమయ్యింది. అయితే సముద్ర గర్భంలో ఉండాల్సిన నౌక ఇంత భారీ పరిమాణం గల నౌక ఇసుక ఏడారిలోకి ఎలా వచ్చిందబ్బా అని వారు తొలుత హవాక్కయ్యారు. తాజాగా అందులో అపారమైన బంగారం. వెండితో పాటు పెద్ద మెుత్తంలో ఖజానా దొరికింది.2008 సంవత్సరంలో ఆఫ్రికాలోని నమీబియాలో నమీబ్ ఏడారిలో వజ్రాల కోసం శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. అప్పుడు ఆశ్చర్యకరంగా 500 సంవత్సరాల పురాతన బోమ్ జీసస్ అనే నౌకను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో దాదాపు 2వేల బంగారు నాణేలు, వెండి నాణేలు, వందల కిలోగ్రాములు రాగి కడ్డీలు ఇతర జంతువుల దంతాలు లభించాయి. దీంతో దానిపై పురావస్తు శాస్త్రవేత్తలు దానిపై పరిశోధన జరపగా అది వాణిజ్య నౌకగా గుర్తించారు.అయితే ఆ నౌక 1533 సంవత్సరంలో ఆఫ్రికా నుంచి భారత్కు వాణిజ్యానికి వెళుతోందని తెలిపారు. ఆ సమయంలో నమిబీయా తీరాన్ని తీవ్ర మంచుతుపాను తాకడంతో ఓడ రాళ్లను ఢీకొట్టి మునిగిపోయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఆ సమయంలో ఓడలో ప్రయాణించిన వారి అవశేషాలు ఎక్కడ లభ్యం కాలేదు ఈ విషయం వారికి ఇప్పటికీ రహస్యంగానే ఉంది. -
ద్వంద్వ పౌరసత్వం ఇవ్వండి..!
అమెరికాలో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించాలని అక్కడి ప్రవాసీ లీగల్ సెల్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ప్రవాసీ లీగల్ సెల్ ప్రతినిధులు బుధవారం యుఎస్, హూస్టన్లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయాన్ని సందర్శించారు. ప్రవాసీ లీగల్ సెల్ గ్లోబల్ ప్రతినిధి సుధీర్ తీరునిలత్ను కలిసి వినతి పత్రం అందించారు. ద్వంద్వ పౌరసత్వం కల్పించడానికి ఉన్న చట్టపరమైన అంశాలను పరిశీలిస్తామని ఆయన వారికి తెలిపారువిదేశాల్లో ఉన్న భారతీయులకు తమ మాతృభూమితో సరైన సంబంధాలు ద్వంద్వ పౌరసత్వం ఇవ్వాలని గ్లోబల్ సెల్ ప్రతినిధులు సూచించారు. తద్వారా ప్రవాస భారతీయుల హక్కులను పరిరక్షించడమే కాకుండా భారత్కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఎన్నారైలకు దంద్వ పౌరసత్వం కల్పించే అంశంపై ప్రవాసీ లీగల్ సెల్ తీవ్రంగా కృషి చేస్తోందని లీగల్ సెల్ హెచ్ఓసీ ప్రశాంత్ కుమార్ సోనా అన్నారు. కనుక అమెరికాలోని ఎన్నారైలు ఈ పోరాటంలో భాగం పంచుకోవాలని కోరారు.ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులకు భారత్ ఓసీఐ కార్టు అందజేస్తుంది. ఈ కార్డు ఉన్నవారు జీవిత కాలం పాటు భారత్లో పర్యటించవచ్చు. ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. కానీ ఓటు హక్కు, రాజకీయ పదవులు, ప్రభుత్వ ఉద్యోగాలకు వీరు అర్హులు కారు. రాజ్యాంగం అమలు సమయం నుంచి భారత్ ఏక పౌరసత్వ విధానాన్ని అనుసరిస్తుంది. అయితే అమెరికా, కెనడా, యూకే లాంటి కొన్ని దేశాలు ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతిస్తాయి. -
కొత్త ఏడాదిలో అవన్నీ సాగవు : గుర్తిస్తే కఠిన చర్యలు
మస్కట్: వర్క్ పర్మిట్లు, వృత్తిపరమైన లైసెన్స్, సర్టిఫికెట్లపై ఒమన్ దేశం కీలక హెచ్చరికలు జారీ చేసింది. నకిలీ వర్క్ పర్మిట్లు, జాబ్ లైసెన్స్ పత్రాలను సమర్పిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. దీనికి సంబంధించి నకిలీని సర్టిఫికెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని కార్మిక మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరంలో నిబంధనలను కఠినతరం చేసింది. ఫేక్ సర్టిఫికెట్లు, కాపీలు లాంటి చర్యలు చట్టాలు, నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఒమన్లో పని అనుమతులు (వీసాలు) పునరుద్ధరించడానికి, కొత్త ఉద్యోగాలలోకి ప్రవేశించడానికి, సంబంధిత రంగాలలో వృత్తిపరమైన వర్గీకరణ సర్టిఫికెట్లు, వృత్తిపరమైన అభ్యాస లైసెన్స్లను సమర్థ అధికారుల (సెక్టోరల్ స్కిల్స్ యూనిట్లు) నుండి పొందాలని స్పష్టం చేసింది.అదే సమయంలో, అన్ని ఉద్యోగులు, కంపెనీలు ఈ పత్రాలు జారీ చేసే క్రమంలో వాటి ప్రామాణికతను ధృవీకరించాల్సిన బాధ్యత ఉందని తెలిపింది. ఏదైనా అనధికార పత్రాలను ఉపయోగించకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రొఫెషనల్ వర్గీకరణ సర్టిఫికేట్ , వృత్తిని అభ్యసించడానికి లైసెన్స్ ముఖ్యమైనవి. ఉద్దేశించిన వృత్తికి సంబంధిత వ్యక్తి సుముఖత , అర్హతను ధృవీకరించడం, వృత్తిపరమైన సామర్థ్యం , పనితీరు ప్రమాణాలను నిర్ధారించడం, కార్మిక మార్కెట్ను నియంత్రించడం వృత్తిపరమైన ప్రమాణాలను నిర్ధారించడమే దీని లక్ష్యంమని పేర్కొంది. నకిలీ లేదా తప్పుడు పత్రాన్ని సృష్టించడం నేరస్థుడిపై చట్టపరమైన చర్యలకు దారితీసుకుంటామని హెచ్చరించింది. చట్టాలని లోబడి జరిమానా, ఇతర చర్యలుంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో న్యూఇయర్ వేడుకలు రద్దు
లాస్ ఏంజెల్స్: భద్రతా కారణాలు, ఉగ్రదాడుల ముప్పు కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో నూతన సంవత్సర వేడుకలు రద్దు చేశారు. లాస్ ఏంజెల్స్లో వరుస బాంబు దాడులే లక్ష్యంగా కుట్ర పన్నిన నలుగురిని ఎఫ్బీఐ అరెస్టు చేసింది. ఈ క్రమంలో ఎఫ్బీఐ వివిధ దేశాలు హెచ్చరికలు జారీ చేసింది.ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని బోండై బీచ్లో ఇటీవల జరిగిన కాల్పుల్లో 15 మంది మరణించగా, 40 మందికి గాయపడ్డారు. ఈ నేపథ్యంలో, 15,000 మందికి పైగా పాల్గొనే బోండై బీచ్లోని పటాకుల ప్రదర్శనతో పాటు ఇతర వేడుకలు రద్దయ్యాయి. యూదుల భద్రత దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.పారిస్లోని షాంప్స్-ఎలీసీ వద్ద ప్రసిద్ధ సంగీత కార్యక్రమాన్ని పోలీసులు సూచన మేరకు రద్దు చేశారు. భారీ జనసమూహం, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్త చర్యగా కార్యక్రమాన్ని రద్దు చేశారు. అయితే అధికారిక పటాకుల ప్రదర్శన మాత్రం జరుగుతుంది.టోక్యోలోని షిబుయా స్టేషన్ వెలుపల జరిగే ప్రపంచ ప్రసిద్ధ నూతన సంవత్సరం కౌంట్డౌన్ రద్దు చేశారు. భారీ రద్దీ కారణంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడే ఆవకాశముందని అధికారులు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధించారు. అయితే, న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ బాల్ డ్రాప్ మాత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. -
ఇతర దేశాలకూ ముప్పు తప్పదా..?
దీర్ఘకాలంగా మిత్రదేశాలుగా ఉన్న సౌదీ అరేబియా... యూఏఈల మధ్య ఘర్షణలు చెలరేగడంతో మధ్య ప్రాచ్య దేశాల్లో అలజడి చెలరేగింది. అంతగా స్నేహంగా ఉన్న దేశాల మధ్య ఒక్కసారిగా విబేధాలు రావడానికి యెమన్ దేశమే కారణమైంది. 9 ఏళ్లుగా యెమన్లో యుఏఈ మద్దతు ఇస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ అనే వేర్పాటువాద గ్రూప్. ఆ గ్రూప్ను యెమన్ దేశంతో పాటు... సౌదీ అరేబియా వ్యతిరేకిస్తోంది. కానీ... యూఏఈ మాత్రం ఆ గ్రూప్ను సమర్థిస్తోందన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ పేరిట పుట్టిన వేర్పాటు వాద గ్రూప్... అంతర్గత కలహాలు సృష్టిస్తూ యెమెన్లోని ప్రధాన దక్షిణ వేర్పాటువాదం కోసం పోరాడుతోంది. ముఖ్యంగా యెమెన్ దక్షిణ ప్రాంతానికి స్వతంత్రత సాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్న ఈ గ్రూప్ 2017లో పుట్టింది.వేర్పాటు వాదులకు మద్దతు ఇస్తోందన్న అనుమానంతో సౌదీకి కోపం వచ్చింది. దీంతో సౌదీ బలగాలు నేరుగా డిసెంబర్ ౩౦న యెమెన్లోని ముకల్లా పోర్ట్ నగరంపై దాడి చేయగా... యుఏఈ దీనిని తీవ్రంగా ఖండించింది. అంతే కాకుండా అక్కడ ఉన్న యూఏఈ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. యెమన్పై జరిగిన దాడితో పాత మిత్రుల మధ్య పుట్టుకొచ్చిన వ్యతిరేకతను దూరం చేయడానికి గల్ఫ్ దేశాలు సమాలోచనలు చేస్తున్నాయి. మరోవైపు దాడి జరగ్గానే యెమన్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. యెమన్లోని వేర్పాటు వాదులకు యూఏఈ నుంచి ఆయుధాలు అందుతన్నాయన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ... యెమెన్లోని ముకల్లా పోర్ట్పై సౌదీ సైన్యం వైమానిక దాడులు జరిపింది. దాడిని యూఏఈ ఖండిస్తూ... సౌదీ ఆరోపణలు నిరాధారమైనవని.. అసలు వారి వద్ద ఆయుధాలే లేవని యూఏఈ స్పష్టం చేసింది. అనాలోచిత దాడి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ యెమన్లో ఉన్న యూఏఈ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇది ఊహించని పరిణామమని గల్ఫ్ దేశాలు చెబుతున్నాయి. అయితే అక్కడ చెలరేగిన యూఏఈ- సౌదీ మధ్య విబేధాలు ఇటు మన దేశంపై కూడా ప్రభావం చూపే అవకాశముంది. ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్థిక భద్రత, భారత్కు అందే ఇంధన సరఫరా, ప్రవాస భారతీయుల సంక్షేమాలపై ప్రభావం చూపే అవకాశముంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ గురించి ఇతర దేశాల్లో అలజడి ప్రారంభమైంది. యెమన్లో మళ్లీ సౌదీ ప్రభుత్వం సైనిక చర్యలకు పాల్పడే అవకాశం లేకపోలేదని... దీంతో గల్ఫ్ దేశాల్లో ప్రధానమైన సౌదీ అరేబియా- యూఏఈల మధ్య ఘర్షణ ముదిరితే.. యెమన్, యూఏఈతో పాటు ఇతర దేశాలకూ ముప్పు తప్పదనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. గల్ఫ్లో ఉద్రిక్తతలు పెరిగితే వాటి ప్రభావం నేరుగా చమురు ధరలపై పడుతుంది. భారత్ లో ప్రవాస భారతీయుల భద్రత, భారత్కు ఇంధన సరఫరా, వాణిజ్య సంబంధాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని మన ప్రభుత్వం ఆలోచిస్తోంది. -మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ -
దుబాయ్లో ఉంటున్నారా..? అయితే ఇది మీకోసమే?
న్యూ ఇయర్- 2026 దుబాయ్లో ఉండే వారికి షాక్ ఇవ్వనుంది. ప్రపంచ వ్యాప్తంగా దుబాయ్ వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరిగడంతో అక్కడ అద్దెలు ఈ ఏడాది గరిష్ఠంగా పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాటితో పాటు విల్లాలు, ప్లాట్ల రేట్లు కూడా అధికంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దుబాయ్ అంటే కాస్లీ లైఫ్కు పెట్టింది పేరు. ఆ నగరం కేవలం టూరిస్ట్ స్పాట్గానే కాకుండా షాపింగ్ కాంప్లెక్స్లు, సాంస్కృతిక వైభవం, సైక్యూరిటీ తదితర కారణాల రీత్యా దుబాయ్కి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఈ నేపథ్యంలో 2026లో అక్కడి భవనాల అద్దెరెట్లు దాదాపు ఆరుశాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. పామ్ జుమేరా, దుబాయ్ హిల్స్, డౌన్టౌన్, దుబాయ్ మెరీనా వంటి ప్రాంతాలలో నివసించడానికి విదేశీయులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారని అందుచేత అక్కడ అద్దెలు ఈ ఏడాది మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వీటితో పాటు సాధారణ ప్రాంతాలలో అద్దెలు సైతం గణనీయంగా పెరుగుతుండడంతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న మధ్యతరగతి ప్రజలకు వీటిని చెల్లించడం అధిక భారంగా ఉండనున్నట్లు పేర్కొన్నారు.వీటితో పాటు గోల్డెన్ వీసా హోల్డర్లు, విదేశీ నిపుణుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో పాట్లు, విల్లాల అమ్మకాలకు అధిక డిమాండ్ ఏర్పడనున్నట్లు తెలిపారు. -
వారి కలయికతో చిక్కుల్లో ఆర్మీ చీఫ్ మునీర్..!
పాక్లోకి చొరబడి... దాక్కుని ఉన్న టెర్రరిస్టులను భారత్ హతమార్చలేదా? అనేది ప్రశ్న... సాధారణంగా ఈ ప్రశ్నను ఎవరు అడుగుతారు? ఎవరో భారతీయుడు అడిగి ఉంటాడని మనం అనుకుంటాం. కానీ అలా జరగలేదు. పాకిస్తాన్కు చెందిన ఓ మతపెద్ద...జమీయతే ఉలేమా ఇస్లాం చీఫ్మౌలానా ఫజలుర్రహ్మన్ .. కరాచీలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ..ఈ ప్రశ్నను అడగడం...గమనార్హం. ఆయన ఎందుకు ఆ మాట అన్నారంటే... వాస్తవంగా ఆఫ్ఘనిస్థాన్పై.. దేశం లోపలకి ప్రవేశించి పాక్ ఆర్మీ వరసగా దాడులకు పాల్పడుతోంది. ఆ దాడులను ఖండిస్తూ... ఇతర దేశాలపై దాడులు చేయడం సమంజసం కాదని... ఒకవేళ అది సరైన నిర్ణయమే అని పాకిస్తాన్ భావిస్తే... మరి భారత్ ఇక్కడికి వచ్చి దాడులు చేయడం కూడా సబబే కదా అని ఆయన సభను ఉద్దేశించి చెప్పారు. ఆఫ్గనిస్తాన్పై పాక్ దాడులు ఆపాలని... చర్చలు జరపాలని ఆయన అన్నారు. అయితే దాడులకు మూలకారకుడిగా ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ లక్ష్యంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ దాడులను నివారించి... పాకిస్తాన్... ఆఫ్గనిస్తాన్ల మధ్య సయోధ్య కుదర్చడానికి... ఇరు దేశాల మతపెద్దలు ఏకమవుతామని కూడా ఆయన ప్రకటించారు. పాక్లో జరిగిన బహిరంగ సభలో పెద్దల మాటలను ఆఫ్గాన్లోని తాలిబాన్ మతపెద్దలు ఆహ్వనించారు. ఇది మంచి సంకేతమని... దాడులకు ఫుల్స్టాప్ పెట్టి ఆసిమ్ మునీర్ ఆటలకు అడ్డుకట్ట వేయడానికి ఆ రెండు దేశాల మత పెద్దలు సిద్ధమయ్యారు. ఆ పెద్దల నిర్ణయం... అటు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనగరల్ ఆసిమ్ మునీర్లకు చిక్కుల్లోకి నెట్టింది. ముఖ్యంగా ఆసిమ్ మునీర్ గేమ్ చివరి దశకు చేరిందని... ఖేల్ ఖతమ్ అని అక్కడి పత్రికలు రాయడం కూడా ప్రారంభించాయి. అక్కడ అసలేం జరుగుతోందో... జరగబోతుందో... ఇప్పుడు మనం చూద్దాం.ఇరు దేశాల మతపెద్దల కలయిక ఆర్మీ చీఫ్ మునీర్కు పెద్ద చిక్కుల్లోనే నెట్టింది. పాకిస్తాన్- ఆఫ్గాన్ల మధ్య చెలరేగిన వివాదాలకు మతపెద్దలు ఆపే ప్రయత్నం చేస్తున్నారని... అసిమ్ మునీర్ లక్ష్యంగా సాగుతున్న ఈ మతపెద్దల కలయిక మునీర్కు పెద్ద ఇరకాటంలో నెట్టనుంది. తాలిబాన్ పెద్దలు, పాకిస్తాన్ మత పెద్దల సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. ఆ పెద్దలు కలిసి దాడులను ఆపడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆసిమ్ మునీర్ అనవసరంగా ఆఫ్గాన్పై దాడులు చేయిస్తున్నారని.. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలను కూడా చెడగొడుతోందన్నారు. ఇరు దేశాలకు నష్టాల పాలు చేస్తున్న దాడులు వెంటనే ఆపేయాలని పెద్దలు హుకుం జారీ చేశారు. ఫజలుర్ రహ్మాన్ వ్యాఖ్యలు ఆఫ్గనిస్తాన్లో సంబరాలు సృష్టిస్తున్నాయి. ఈ మేరకు తాలిబాన్ ప్రభుత్వ అంతర్గత శాఖల మంత్రి సిరాజుద్దీన్... పాక్ మతపెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే మెట్టు దిగిన పాక్ ప్రభుత్వం మతపెద్దల శాంతి రాయబారాన్ని స్వాగతిస్తున్నామని... ఆఫ్గన్పై దాడులు నిలిపివేస్తామని డిప్యూటి ప్రధాన మంత్రి ఇషాక్ దార్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని... ఆర్మీని వెనక్కి రప్పిస్తామని హామీ ఇచ్చారు. అసలు దాడుల ఆలోచనే లేదు... ఇక దాడుల పేరిట ఆఫ్గనిస్తాన్పై అరాచకం సృష్టించిన ఆర్మీ చీఫ్ మునీర్ మాత్రం నోరు విప్పడం లేదు. -మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ -
న్యూ ఇయర్కు గ్రాండ్గా వెల్కమ్ చెబుతూ..
సంవత్సరపు చివరి క్షణాలు మనసులో జ్ఞాపకాల ముత్యాలు చల్లుతూ.. కొత్త ఆశలతో నిండిన ఉదయం వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. పాతది మసకబారుతుంటే, కొత్తది వెలుగులు విరజిమ్ముతోంది. న్యూ ఇయర్కు కొత్త ఉదయం తలుపులు తడుతుంటే.. ఇప్పటి వరకూ మనం ఆస్వాదించిన ఇయర్-2025 ముగింపునకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటికే పలు దేశాల్లో కొత్త ఏడాది ఉదయించింది’. ప్రపంచంలో అన్నింటికి కంటే ముందు సూర్యుడు ఉదయించే దేశాల్లో పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంత దేశాలు ముందు వరుసలో ఉంటాయి. అందులో కిరిబాటి అనే ద్వీప దేశం ఒకటి. అలాగే న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో కొత్త ఏడాది ప్రారంభమైంది. ప్రస్తుతం అక్కడి జనవరి 1 వచ్చేసింది కాబట్టి వారు కొత్త సంవత్సరం వేడుకల్లోకి ప్రవేశించారు.కిరిబాటి.. చిన్న ద్వీప దేశంభూమిపై ప్రకృతి సౌందర్యం, ప్రజలు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఇది ఒకటి. ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదేశాల టాప్-10 జాబితాలో కూడా ఈ ద్వీప దేశానికి చోటు ఉండటం విశేషం. ఇది పసిఫిక్ మహాసముద్రం మధ్యలో, న్యూజిలాండ్కు ఉత్తరాన ఉంది. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే క్రమంలో ఆ భానుడి లేలేత కిరణాలు కిరిబాటి అనే చిన్న దేశం మీద ముందుగా పడతాయి. అంటే ఈ దేశమే ముందు నిద్ర లేస్తుంది అన్నమాట. ఇదొక ద్వీప దేశం. దీని జనాభా చాలా తక్కువ.ఇక్కడ జనాభా 1.34 లక్షలు అని ఒక అంచనా. మన లెక్కన ఒక అసెంబ్లీ నియోజవర్గం ఓటర్ల సంఖ్య కంటే చిన్న దేశం ఇది. భారత్లో డిసెంబర్ 31(3.30 PM) సూర్యుడు అస్తమించే సమయంలో అక్కడ జనవరి 1వ తేదీ వచ్చేస్తుంది. భారత్కు కిరిబాటికి ఇంచుమించు 8.30 గంటల సమయం వ్యత్యాసం ఉంది.భారత్లో ( 12 am అయిన సందర్భంలో)కొత్త ఏడాది ప్రారంభం కావడానికంటే ముందే నూతన సంవత్సరం జరుపుకునే పలు దేశాల జాబితా వరుస క్రమంలో..కిరిబాటి(8.30 am on Jan 1)సమోవా, టోంగా((7.30 am on Jan 1)న్యూజిలాండ్((7.30 am on January 1)రష్యా, ఫిజి((6.30 am on January 1)ఆస్ట్రేలియా((5.30 am on January 1)పాపువా న్యూగినియా((4.30 am on January 1)ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా( 1.30 am on January 1)చైనా, మలేషియా, సింగపూర్(2.30 am on January 1)వియాత్నాం, థాయ్లాండ్( 1.30 am on January 1)మయన్మార్(1 am on January 1)బంగ్లాదేశ్, కజికిస్తాన్, భూటాన్( 12.30 am on January 1)నేపాల్(12.15 am on January 1)Kiribati Island First to celebrate the New Year 2026 #Happynewyear #2026 Celebration to Kiribati as other countries in the world catches up to celebrate The New Year 🎊 🎊🕺💃I TOLD THEMMan U Academy Verse of the day DO NOT#FundsRecovery pic.twitter.com/QQ4Y18av3s— Brass ENt ✴️🔸🔶 (@jakeOttario) December 31, 2025 It's offically 2026 in Auckland, New Zealand pic.twitter.com/uADbsKxZeu— Maurice (@maurice_lippy) December 31, 2025 -
ఉస్మాన్ హాదీ హత్యపై నిందితుడి సంచలన వీడియో
బంగ్లాదేశ్లో తీవ్ర సంక్షోభం సృష్టించిన రాడికల్ నేత ఉస్మాన్ హాదీ హత్య విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉస్మాన్ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న మసూద్ ఈ అంశంపై కీలక సమాచారం తెలుపుతూ వీడియో విడుదల చేశాడు. ఉస్మాన్ హాదీ మృతితో తనకు ఏటువంటి సంబంధం లేదని తెలిపాడు. ఈ నిందితుడు ప్రస్తుతం దుబాయ్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మసూద్ భారత్లో తలదాచుకున్నట్లు బంగ్లా ఆరోపించింది. రాడికల్ విద్యార్థి లీడర్ ఉస్మాన్ హాది హత్యతో బంగ్లాదేశ్లో ఏ స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉస్మాన్ మృతితో ఆ దేశంలో విద్వేశజ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. హిందువులే టార్గెట్గా దాడులు జరిగాయి. ఇవి చాలవన్నట్లు ఇటీవలే అక్కడి మీడియా కథనాలు ఉస్మాన్ హాదీ హంతకులు భారత్లో తలదాచుకున్నారని తప్పుడు కథనాలు ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో ఉస్మాన్ హత్యలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మసూద్ దుబాయ్లో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. ఈ వివరాల్ని సీఎన్ఎన్ మీడియా సంస్థ ప్రచురించింది.ఫైసల్ కరీం మసూద్ మాట్లాడుతూ" నేను ఉస్మాన్ హాదీని చంపలేదు. బంగ్లాదేశ్లో నేను నాకుటుంబం రాజకీయంగా తీవ్రంగా హింసించబడుతున్నాం. ఆ హింస నుంచి తప్పించుకోవడానికి నేను దుబాయ్కి వచ్చాను. ఉస్మాన్ హాదీతో నాకుంది కేవలం వ్యాపార సంబంధమే, నా ఐటీ సంస్థ ప్రయోజనం కోసం ఉస్మాన్ని కలిశాను. అతనికి రాజకీయ విరాళాలు కూడా ఇచ్చాను " అని మసూద్ వీడియోలో తెలిపారు.ఈ హత్య ఖచ్చితంగా జమాతే-ఈ- ఇస్లామి సృష్టేనని దీని వెనుక ఆ కార్యకర్తలు ఉండవచ్చని మసూద్ అనుమానం వ్యక్తం చేశారు. తాను భారత్లో తలదాచుకున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యాలని అన్నారు. జమాతి-ఈ- ఇస్లామి అనిదే బంగ్లాదేశ్లోని ఓ రాజకీయ పార్టీ ఇది ఇస్లామిక్ భావజాలలను ప్రోత్సహిస్తోంది.అయితే రెండురోజుల క్రితం ఉస్మాన్ హాదీ హత్యతో సంబంధమున్నట్లు భావిస్తున్న ఫైజల్ కరీం మసూద్, షేక్ ఆలంగీర్ అనే ఇద్దరు నేరస్థులు బంగ్లాదేశ్ జిల్లాలోని మైమాన్సింగ్ జిల్లా సరిహాద్దు గుండా మేఘాలయలో ప్రవేశించారని బంగ్లాదేశ్ పోలీసులు ఆరోపించింది. అయితే ఈ ఆరోపణల్ని అప్పుడే మేఘాలయ పోలీసులు ఖండించారు. -
జియాకు కన్నీటి వీడ్కోలు
ఢాకా: దశాబ్దకాలంపాటు బంగ్లాదేశ్ను పరిపాలించిన ఆ దేశ మాజీ మహిళా ప్రధానమంత్రి బేగం ఖలీదా జియాకు వేలాది మంది అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. బుధవారం ఢాకా నగరంలోని దేశ మాజీ అధ్యక్షుడు, ఆమె భర్త, దివంగత జియావుర్ రహ్మాన్ సమాధి పక్కనే జియా పారి్ధవదేహాన్ని ఖననంచేశారు. మూడు సార్లు ప్రధాని పగ్గాలు చేపట్టి బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన 80 ఏళ్ల జియా మంగళవారం పలు దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా ఆస్పత్రిలో కన్నుమూయడం తెల్సిందే. బుధవారం ఢాకాలోని మాణిక్ మియా అవెన్యూ సమీపంలోని షేర్–ఎ–బంగ్లా నగర్లోని శ్మశానవాటికలో పూర్తి అధికారిక లాంఛనాలతో జియా అంత్యక్రియలను సాయంత్రం 4.30 గంటలకు మొహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రభుత్వం పూర్తిచేసింది. తొలుత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పారీ్ట(బీఎనీ్ప) కార్యకర్తలు, వేలాది మంది అభిమానుల సందర్శనార్థం జియా పార్థివదేహాన్ని జాతీయ సంసద్ భవన్(పార్లమెంట్) సమీప మాణిక్ మియా అవెన్యూలో ఉంచారు. జియా మృతదేహంపై బంగ్లాదేశ్ జాతీయజెండాను కప్పారు. అక్కడే మధ్యాహ్నం రెండో నమాజు ‘జుహుర్’తర్వాత అంత్యక్రియల సంబంధ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బైతుల్ మొకర్రం జాతీయ మసీదు ప్రధాన మతాధికారి మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో ఈ ప్రార్థనలు జరిగాయి. గడ్డకట్టించే చలిని సైతం లెక్కచేయకుండా సుదూరాల నుంచి సైతం జియా అభిమానులు కడసారి ఆమెను చూసేందుకు తరలివచ్చారు. దీంతో పార్లమెంట్ చుట్టూతా ఉన్న రహదారులన్నీ బీఎన్పీ కార్యకర్తలు, అభిమానులతో జనసంద్రంగా మారాయి. రోడ్లమీదనే జియా కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జియా ఫొటోలున్న భారీ ప్లకార్డులను చేతబూని ఆమె దేశానికి చేసిన సేవను గుర్తుచేసుకున్నారు. తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనుస్, చీఫ్ జస్టిస్ జుబేయర్ రహ్మాన్ చౌదరి, బేగం జియా కుమారుడు, బీఎన్పీ తాత్కాలిక చైర్మన్ తారిఖ్ రెహ్మాన్, పలు దేశాల ప్రత్యేక ప్రతినిధులు, రాయబారులు, హైకమిషనర్లు, అంతర్జాతీయ సంస్థల చీఫ్లు ఈ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ హాజరై జియా కుమారుడికి ప్రధాని మోదీ తరఫున సంతాప లేఖను అందజేశారు. -
ఇండియా-పాక్ వార్.. చైనా అక్కసు
ఆపరేషన్ సిందూర్తో భారత్కు వచ్చిన గుర్తింపును జీర్ణించుకోలేకో ఏమో తెలియదు గానీ ట్రంప్ తరచుగా భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఈ విషయంపై భారత్ ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ట్రంప్ మామ తన తీరు మార్చుకోవడం లేదు. నిన్న ఇజ్రాయెల్ ప్రధానితో జరిగిన భేటీలో కూడా ఈ వ్యాఖ్యలే చేశారు.ఇది చాలదన్నట్లు తాజా ఆజాబితాలో చైనా దేశం కూడా చేరింది.ఆపరేషన్ సిందూర్ విషయంలో భారత్కు తంటాలు తప్పడం లేదు. ఇండియన్ ఆర్మీ ముష్కరుల స్థావరాల్ని వారి స్వస్థలంలోనే ధ్వంసం చేసి ప్రపంచానికి తన సత్తా ఏంటో తెలిసేలా చేసింది. తన జోలికస్తే రిప్లై ఏలా ఉంటుందో చిన్న ట్రైలర్ చూపించింది. దీంతో భారత్తో పెట్టుకుంటే ఏమవుతుందో అర్థమైన పాక్ దారికొచ్చింది. ఇరు దేశాలు పరస్పర కాల్పులు విరమణ ఒప్పందంపై సంతకం పెట్టాయి. తాజాగా చైనా ఈ అంశంలో వేలు పెట్టింది. భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించి తానే ఈ యుద్ధాన్ని ఆపానని డ్రాగన్ కంట్రీ ప్రకటించిందిఆ దేశ విదేశాంగ మంత్రి వాంఘ్ యీ మాట్లాడుతూ " చైనా చాలా దేశాల మధ్య వివాదాల్ని పరిష్కరించింది. మయన్మార్లో సందిగ్ధతలు, ఇరాన్ న్యూక్లియర్ సమస్య, భారత్- పాకిస్థాన్ సమస్య, కంబోడియా-థాయిలాండ్ వివాదం, పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య గొడవ ఇలా ప్రపంచ దేశాల మధ్య గొడవలన మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించాం" అని చైనా విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు.అయితే ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. " మేము ఇదివరకే ఇటువంటి వ్యాఖ్యలను ఖండించాం. భారత్-పాకిస్థాన్ అంశంలో మూడవ పార్టీ జ్యోక్యం లేదు. మా ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం రెండు దేశాల మధ్యలోనే జరిగిందని" భారత్ హెచ్చరించింది. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాక్కు మద్ధతుగా నిలిచింది. పాక్కు అవసరమైన యుద్ధ సామాగ్రిని, ఫైటర్ జెట్స్ అందించింది. ఆసమయంలో భారత్ చేసిన దాడులలో డ్రాగన్ కంట్రీకి చెందిన కొన్ని వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. -
ఎయిర్వేస్లో జాత్యహంకారం? .. ప్రయాణికురాలి మండిపాటు
నైరోబీ: కెన్యాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాష్మీర్ సయ్యద్కు విమాన ప్రయాణంలో ఘోర అవమానం ఎదురైంది. ‘కెన్యా ఎయిర్వేస్’లో తాను ముందుగా బుక్ చేసుకున్న బిజినెస్ క్లాస్ సీటును తనకు కేటాయించకుండా, ఎకానమీ క్లాస్కు మార్చడంపై ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ అంశం అంతర్జాతీయంగా మారింది.కాష్మీర్ సయ్యద్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె గత వారంలో తన ప్రయాణం కోసం బిజినెస్ క్లాస్ టికెట్ను బుక్ చేసుకుని, నిర్ణీత సమయంలోనే చెక్-ఇన్ కూడా పూర్తి చేశారు. అయితే విమానం ఎక్కే సమయంలో సిబ్బంది ఆమెను ఎకానమీ క్లాస్కు వెళ్లాలని సూచించారు. వెంటనే ఆమె ప్రశ్నించగా, విమాన సిబ్బంది సరైన సమాధానం చెప్పకుండా, ముప్పై నిమిషాల పాటు వేచి ఉండేలా చేశారని ఆమె ఆరోపించారు. స్థానిక కెన్యా పౌరురాలైన తనను కాదని, తన సీటునుఘెందుకు తెల్లజాతీయులకు కేటాయించారని ఆమె విమాన సిబ్బందిని నిలదీశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో కాష్మీర్ సయ్యద్ సిబ్బందితో విమాన వాదించడం కనిపిస్తుంది. ‘ఈ సీటు కోసం నేను డబ్బు చెల్లించాను. చెక్-ఇన్ చేశాను.. మరి నా సీటులో ఎవరు కూర్చుంటారు?’ అని ఆమె విమాన సిబ్బందిని నిలదీశారు. దీంతో విమాన సంస్థ ప్రతినిధులు ఆమెకు రీఫండ్ ఇస్తామని లేదా తదుపరి విమానంలో పంపిస్తామని ఆఫర్ చేసినప్పటికీ, ఆమె వాటిని తిరస్కరించారు. ఇది కేవలం సాంకేతిక లోపం కాదని, స్పష్టమైన జాత్యహంకార వివక్ష అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎయిర్లైన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ వివాదం ముదిరిన నేపధ్యంలో కెన్యా ఎయిర్వేస్ స్పందించింది. తమపై వస్తున్న జాత్యహంకార ఆరోపణలను సంస్థ ఖండించింది. విమాన ప్రయాణ సమయంలో చివరి నిమిషంలో విమానం మారడం వల్ల బిజినెస్ క్లాస్ సీట్ల సంఖ్య తగ్గిందని, అందుకే కొందరు ప్రయాణికులను ఎకానమీకి మార్చాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. ఈ విధమైన ఎంపిక ప్రక్రియ సాఫ్ట్వేర్ ద్వారా ఆటోమేటిక్గా జరుగుతుందని, ఇందులో జాతి వివక్షకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బాధిత ప్రయాణికురాలికి జరిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ సంస్థ ఆమెను క్షమాపణలు కోరింది.ఇది కూడా చదవండి: Denmark: ఉత్తరాలపై డెన్మార్క్ కీలక నిర్ణయం.. కాల గర్భంలోకి 400 ఏళ్ల చరిత్ర! -
అది నిజం కాదు.. చైనాకు అంత సీన్ లేదు!
భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను తామే చల్లార్చామంటూ చైనా చేసిన ప్రకటనపై భారత్ స్పందించింది. అయితే చైనాకు అంత సీన్ లేదని భారత్ అంటోంది. మధ్యవర్తిత్వం విషయంలో భారత్ ఎప్పుడూ ఒకేరకమైన విధానాన్ని అనుసరిస్తుందని స్పష్టం చేస్తూ.. డ్రాగన్ కంట్రీ ప్రకటనను తోసిపుచ్చింది. చైనా ప్రకటనను కేంద్ర వర్గాలు తోసిపుచ్చినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ కథనం ఇచ్చింది. ఆ కథనం ప్రకారం.. భారతదేశం మధ్యవర్తిత్వంపై ఎప్పటినుంచో స్పష్టమైన వైఖరిని అవలంభిసతోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో.. ఆ తర్వాత ఎలాంటి మధ్యవర్తిత్వం జరగలేదు. కేవలం పాకిస్తాన్ DGMO (Director General of Military Operations) భారత్ను సంప్రదించి కాల్పుల విరమణ కోరింది. కాబట్టి.. భారత్ ఎప్పటికీ మూడోపక్ష జోక్యాన్ని అనుమతించదు అని పేర్కొన్నాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్లోని ఉగ్రవాద శిబిరాలను భారత వైమానిక దళం ఆపరేషన్ సిందూర్ పేరిట సర్జికల్ స్ట్రయిక్సతో సర్వనాశనం చేసింది. ఈ నేపథ్యంతో మే 7-10వ తేదీల మధ్య ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. రెండు దేశాల సైనిక డీజీఎంవోల సంప్రదింపుల ఫలితంగా సడలిపోయాయని మోదీ సర్కారు ప్రకటించింది. కానీ,తాజాగా బీజింగ్లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు వివాదాలను పరిష్కరించడంలో చైనా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. మయన్మార్, ఇరాన్ అణు సమస్యలతో పాటు భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను కూడా చైనా తన మధ్యవర్తిత్వం ద్వారా తగ్గించిందని ఆయన వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన టారిఫ్ బెదిరింపులతోనే ఇరు దేశాలు దిగొచ్చి కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించుకుంటూ వస్తున్నారు. అంతేకాదు.. దీనికి కారకుడంటూ భారతీయ మూలాలున్న తన ప్రత్యేక సహాయకుడు రికీ గిల్ను ట్రంప్ ప్రభుత్వం తాజాగా సత్కరించింది కూడా. ఈ పరిణామాల నడుమే.. మే నెల ఉద్రిక్తతల సమయంలో పాక్కు ఆయుధాలను సరఫరా చేసిన చైనా ఇప్పుడు మధ్యవర్తిత్వం నడిపి ఉద్రిక్తతలను చల్లార్చామంటూ ప్రకటించుకోవడం కొసమెరుపు. -
Denmark: ఉత్తరాలపై డెన్మార్క్ కీలక నిర్ణయం.. కాల గర్భంలోకి 400 ఏళ్ల చరిత్ర!
కోపెన్హాగన్: ఆధునిక డిజిటల్ యుగం ప్రపంచంలోని అన్నింటినీ సమూలంగా మార్చివేస్తోంది. ఈ ప్రభావం పోస్టల్ విభాగంపై తీవ్రంగా పడింది. సుమారు నాలుగు శతాబ్దాల కాలంగా ప్రజల మధ్య వారధిగా నిలిచిన డెన్మార్క్ పోస్టల్ సర్వీస్ తాజాగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలో భౌతిక రూపంలో ఉండే ఉత్తరాల పంపిణీని అధికారికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.దాదాపు 400 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ వ్యవస్థ, మారుతున్న కాలానికి అనుగుణంగా తన సేవలను సమూలంగా మార్చుకుంటోంది. ఉత్తరాల పంపిణీ కోసం దశాబ్దాలుగా కొనసాగిన సార్వత్రిక సేవా బాధ్యత (Universal Service Obligation) ఒప్పందం ముగియడంతో డెన్మార్క్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఉత్తరాలు రాయడం తగ్గించడమే దీనికి ప్రధాన కారణం. గడచిన 20 ఏళ్లలో డెన్మార్క్లో ఉత్తరాల సంఖ్య ఏకంగా 90శాతానికి పడిపోయింది. స్మార్ట్ఫోన్లు, ఇమెయిల్స్, ఇతర డిజిటల్ సమాచార వ్యవస్థలు అందుబాటులోకి రావడంతో ప్రజలు కాగితంపై రాసే ఉత్తరాలకు దూరమయ్యారు.ఒకప్పుడు వేల సంఖ్యలో పోస్ట్మెన్లు వీధివీధిన తిరిగిన రోజులు ఉండేవి. ప్రస్తుతం ఉత్తరాలు మోయడం అనేది పోస్టల్ విభాగానికి ఆర్థికంగా భారంగా మారింది. దీంతో ప్రభుత్వం పోస్టల్ సేవలను కేవలం పార్సిల్స్, వ్యాపార సరుకుల పంపిణీకే పరిమితం చేయాలని నిర్ణయించింది. మరోవైపు డిజిటల్ విప్లవంలో డెన్మార్క్ అగ్రగామిగా ఉంది. ఈ నిర్ణయంతో డెన్మార్క్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా డిజిటలైజ్ అవుతున్న దేశంగా మరోసారి నిరూపితమయ్యింది. ఇప్పటికే డెన్మార్క్లోని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ప్రజల మధ్య కమ్యూనికేషన్ అనేది దాదాపు 100శాతం మేరకు డిజిటల్ వేదికల ద్వారానే సాగుతోంది.అయితే డెన్మార్క్ పోస్టల్ విభాగం తీసుకున్న నిర్ణయం వృద్ధులకు, సాంకేతికతపై అవగాహన లేని వారికి కొంతమేరకు ఇబ్బంది కలిగించేది ఉందని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా పోస్టల్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభావం పడనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే సంప్రదాయ రీతిలో ఉత్తరాల పంపిణీ ఆగిపోయినప్పటికీ, పార్సిల్, డెలివరీ రంగంలో తమ సేవలను మరింతగా మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే డెన్మార్క్ పోస్టల్ విభాగం వృద్ధుల కోసం ప్రత్యేక సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసి, వారికి డిజిటల్ వ్యవస్థపై అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నది.ఇది కూడా చదవండి: దిక్కుతోచని ప్రయాణికులు.. విమానాల నుంచే ‘విషెస్’! -
యెమెన్ ఎఫెక్ట్.. యూఏఈకి సౌదీ హెచ్చరిక..
దుబాయ్: సౌదీ అరేబియా, యెమెన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యెమెన్లోని తీర ప్రాంత నగరం ముకల్లాపై మంగళవారం సౌదీ అరేబియా బాంబుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో యెమెన్కు మద్దతుగా నిలుస్తున్న యూఏఈకి సౌదీ హెచ్చరికలు జారీ చేసింది. 24 గంట్లలో యెమెన్ నుంచి దళాలను ఉపసంహరించుకోవాలని సౌదీ వార్నింగ్ ఇచ్చింది.ఇక, అంతకుముందు.. యెమెన్లోని వేర్పాటువాదుల కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పంపిన ఆయుధ నౌకలపై దాడి చేసినట్లు సౌదీ తెలిపింది. యూఏఈ చర్యలు అత్యంత ప్రమాదకరమైనవంటూ వ్యాఖ్యానించింది. యూఏఈ మద్దతు కలిగిన సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్కు చెందిన వేర్పాటువాదులు ఇటీవలి కాలంలో యెమెన్లో పలు ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నారు. దీనిపై సౌదీ, దాని మిత్ర దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా దాడికి దిగింది.Saudi Arabia bombs a UAE convoy in Yemen meant to establish a Zionist friendly state called 'South Arabia'. Saudi has issued a warning to the UAE to remove it's presence in Yemen within 24 hours. pic.twitter.com/QelYcZkC69— Israel Exposed (@xIsraelExposedx) December 30, 2025యూఏఈ తీర నగరం పుజైరాహ్ నుంచి ఆయుధాలతో ముకల్లాకు వచ్చిన రెండు నౌకల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను, మిలటరీ వాహనాలను కిందికి దించుతున్న సమయంలోనే మిత్ర కూటమి విమానాలు బాంబులతో దాడి జరిపాయని సౌదీ తెలిపింది. అదే సమయంలో, 24 గంటల్లోగా యెమెన్ నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని యూఏఈకి తీవ్ర హెచ్చరికలు చేసింది. ఈ పరిణామంపై యూఏఈ స్పందించింది. సహనం, వివేకంతో వ్యవహరించాలంటూ సౌదీకి హితవు పలికింది. యెమెన్ నుంచి బలగాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్పై మాత్రం ఆ దేశం స్పందించలేదు. యెమెన్లోని తమ బలగాలకు అవసరమైన వాహనాలను మాత్రమే ఆ నౌకల్లో పంపామని, ఆయుధాలు లేవని యూఏఈ అంటోంది.సౌదీ ఆగ్రహం.. కాగా, యెమెన్లో వేర్పాటు వాదులు ఇటీవల సాధించిన పైచేయికి యూఏఈ కారణమని సౌదీ స్పష్టంచేసింది. దక్షిణ యెమెన్కు ప్రత్యేక దేశ స్థాయి కల్పించేందుకు పోరాటం సాగిస్తున్న సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్(ఎస్టీసీ)కు యూఏఈ మద్దతు తెలుపుతోంది. వేర్పాటు వాద సంస్థ ఎస్టీసీని సౌదీ అరేబియా వ్యతిరేకిస్తోంది. ఆ సంస్థకు మద్దతుగా యూఏఈ తీసుకుంటున్న చర్యలు అత్యంత ప్రమాదకరమైనవని సౌదీ పేర్కొంది. సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్కు మద్దతుగా యూఏఈ నౌకలు ఆయుధాలు చేరవేశాయని ప్రకటన వివరించింది. తాజా పరిణామాలు సౌదీ అరేబియాకు, యూఏఈకీ మధ్య ఉద్రిక్తతల్ని పెంచేలా ఉన్నాయి. పశ్చిమాసియాకు సంబంధించిన అనేక ఇతర విషయాలపై కలసికట్టుగా పనిచేస్తున్న ఈ రెండు దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ విషయాల్లో విభేదాలు ఉన్నాయి.రంగంలోకి అమెరికా..ఇదిలా ఉండగా.. సౌదీ, యెమెన్ వ్యవహారంపై అమెరికా ఫోకస్ పెట్టింది. తాజాగా యెమెన్ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో మాట్లాడినట్టు తెలిపారు. యెమెన్ పరిస్థితి, మధ్య ప్రాచ్య భద్రత, స్థిరత్వాన్ని ప్రభావితం చేసే విస్తృత సమస్యల గురించి ఇద్దరూ చర్చించారని సమాచారం. -
తైవాన్పై చైనా దూకుడు.. గగనతల దిగ్బంధనం
హాంకాంగ్: చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మంగళవారం రెండో రోజు కూడా తైవాన్ జలసంధిలో భారీ సైనిక విన్యాసాలను కొనసాగించింది. తైవాన్ తమ భూభాగమేనని, ఎప్పటికైనా కలిపేసుకుంటామని చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి జస్టిస్ మిషన్ 2025 పేరుతో విన్యాసాలకు తెరతీసింది.తైవాన్కు బయటి నుంచి అందే ఎలాంటి మద్దతునైనా అడ్డుకునే సత్తా తమకుందని చూపేందుకు స్వయం పాలిత దీవిని దిగ్బంధనం చేసి, లైవ్ ఫైర్ డ్రిల్స్ సాగిస్తోంది. ఇందులో పీఎల్ఏ సదరన్ థియేటర్ కమాండ్లోని డె్రస్టాయర్లు, ఫ్రిగేట్లు, యుద్ధ విమానాలు, బాంబర్లు పాల్గొంటున్నాయి. తైవాన్ ఉత్తరం వైపు మొదలుకొని దక్షిణ వైపు సముద్ర జలాలతోపాటు గగనతలంపైనా దిగ్బంధనం కొనసాగిస్తున్నాయి. తైవాన్ ఉత్తర ప్రాంతంపై లాంగ్ రేంజ్ క్షిపణులను ప్రయోగించం ద్వారా ఆశించిన ఫలితాలను రాబట్టినట్లు సదరన్ కమాండ్ తెలిపింది.కాగా, సోమవారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు తమ దీవికి సమీపంలో చైనాకు చెందిన ఫైటర్ జెట్లు, బాంబర్లు కలిపి 130 విమానాలు, 14 మిలటరీ ఓడలు, 8 ఇతర షిప్పులు కనిపించాయని తైవాన్ తెలిపింది. చైనాకు చెందిన కనీసం 90 విమానాలు జలసంధిలోని తైవాన్ గగనతల రక్షణ జోన్లోకి ప్రవేశించాయని పేర్కొంది. చైనా బెలూన్ కూడా సంచరించిందని తెలిపింది. చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్ నుంచి లాంగ్ రేంజ్ ఆర్టిలరీ విభాగం తమ ఉత్తర ప్రాంతంపై కాల్పులు జరిపిందని వివరించింది. తమ తీరానికి 44 కిలోమీటర్ల దూరం వరకు వీటి ప్రభావం కనిపించిందని వెల్లడించింది. -
2 వారాల్లో 3వ హత్య
ఢాకా: మొహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వ ఏలుబడిలో హిందువులకు రక్షణ కరువైందన్న వాదనలకు మరింత బలం చేకూరేలా మరో హిందువు హత్యోదంతం తాజాగా వెలుగుచూసింది. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు మెమిన్సింగ్ జిల్లాలోని మెహ్రాబారీ ప్రాంతంలోని సుల్తానా స్వెట్టర్స్ లిమిటెడ్ వస్త్ర పరిశ్రమ వద్ద సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే 42 ఏళ్ల బజేంద్ర బిశ్వాస్ హత్యకు గురయ్యారు. తోటి సెక్యూరిటీ గార్డ్ అయిన 29 ఏళ్ల నోమన్ మియా తన సర్విస్ షాట్గన్తో కాలచ్చింపాడు. అయితే ఉద్దేశపూర్వకంగా అతడిని హత్యచేయలేదని మియా చెప్పారు.‘‘పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ సరదాగా గన్ను బిశ్వాస్ వైపు గురిపెట్టా. వేలు పొరపాటున ట్రిగ్గర్కు తగిలి గన్ పేలింది. దీంతో బుల్లెట్ గాయంతో అతడు కూలబడితే వెంటనే భలూకా ఉపజిల్లా ఆస్పత్రిలో చేర్పించాం’’అని మియా వివరించారు. అయితే విషయం తెల్సి పోలీసులు వెంటనే మియాను అరెస్ట్చేశారు. ఉద్దేశపూర్వకంగానే హత్యచేశాడని విపక్ష పార్టీలు, హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. షేక్ హసీనా ప్రధాని పదవి కోల్పోయి దేశాన్ని వీడాక బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై దాడులు ఎక్కువయ్యాయి. దైవదూషణ ఆరోపణలపై డిసెంబర్ 18న ఫ్యాక్టరీ కార్మికుడైన హిందువు దీపూ చంద్రదాస్ను స్థానికులు కొట్టిచంపారు. బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ అమృత్ మొండల్ అనే మరో హిందువునూ చంపేశారు. -
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని జియా అస్తమయం
ఢాకా/న్యూఢిల్లీ/బీజింగ్: మూడుసార్లు ప్రధానమంత్రి పీఠం కూర్చుని దశాబ్దకాలంపాటు బంగ్లాదేశ్ను పరిపాలించిన దిగ్గజ నాయకురాలు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పి) అధినేత్రి ఖలీదా జియా కన్నుమూశారు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఢాకాలోని ఎవర్కేర్ ఆస్పత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారని బీఎన్పీ ప్రధాన కార్యదర్శి మిర్జా ఫఖ్రూల్ ఇస్లాం ఆలంగిర్ చెప్పారు. 80 ఏళ్ల జియాను వృద్ధాప్య సమస్యలతోపాటు పలు దీర్ఘకాలిక వ్యాధులు కుంగదీశాయి.ఛాతిలో ఇన్ఫెక్షన్ రావడంతో తొలుత నవంబర్ 23వ తేదీన ఆమెను ఎవర్కేర్ ఆస్పత్రిలో చేర్పించారు.నవంబర్ 27వ తేదీన ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే కరోనరీ కేర్ యూనిట్(సీసీయూ)లో చేరి్పంచి ప్రత్యేక వైద్యం ఆరంభించారు. కాలేయం, మూత్రపిండాలు, హృద్రోగ సమస్యలు, అత్యధిక రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఇలా పలు సమస్యలు చుట్టుముట్టంతో ఆమె ఆరోగ్యం దారుణంగా క్షీణించింది. చివరిసారిగా ఆమె నవంబర్ 21వ తేదీన ఢాకా కంటోన్మెంట్లోని సాయుధబలగాల కార్యక్రమంలో బహిరంగంగా కనిపించారు. జియా చనిపోయినప్పుడు ఆమె పక్కనే జియా కుమారుడు తారిఖ్ రెహ్మిన్, కోడలు జుబైదా, మనవరాలు జైమా ఉన్నారు. భర్త సమాధి పక్కనే ఖననం.. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విమోచన కోసం పోరాడిన మాజీ బంగ్లా అధ్యక్షుడు, బీఎన్పీ వ్యవస్థాపకుడు జియాఉర్ రెహ్మాన్ సమాధి పక్కనే జియా పారి్ధవదేహాన్ని ఖననంచేయనున్నారు. ఢాకాలోని షేర్–ఇ–బంగ్లా నగర్లోని జియా ఉద్యాన్లోని రెహ్మాన్ సమాధి వద్దే అధికార లాంఛనాలతో ఖనన క్రతువును పూర్తిచేయాలని ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది. జియా మృతి నేపథ్యంలో దేశంలో మూడ్రోజులపాటు సంతాప దినాలను, అంత్యక్రియల ప్రార్థనల కోసం అదనంగా మరోరోజు సాధారణ సెలవును ప్రభుత్వం ప్రకటించింది. అంత్యక్రియల కార్యక్రమంలో భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాల్గొననున్నారు. పూడ్చలేని లోటుగా అభివర్ణించిన హసీనా వైరి పార్టీ అవామీ లీగ్ సారథి షేక్ హసీనా సైతం జియా మరణంపై స్పందించారు. ‘‘బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా మాత్రమే కాదు సంక్షుభిత బంగ్లాలో సమస్యల పరిష్కారానికి జియా ఎంతగానో కృషిచేశారు. దేశానికి ఆమె చేసిన సేవ ఎన్నదగింది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఆమె లేని లోటును ఎవరూ పూడ్చలేరు’’అని హసీనా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య మజిలీలో జియా ఒక రక్షకురాలిగా నిలబడ్డారు. జియా మరణంతో బంగ్లాదేశ చరిత్రలో ఒక శకం ముగిసినట్లయింది అని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనుస్ జాతినుద్దేశించి ప్రసంగించారు. జియా మరణంతో ప్రపంచదేశాధినేతల నుంచి సంతాపాలు వెల్లువెత్తాయి. దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని మోదీ ఖలీదా జియా మరణంపై భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆమె కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. వివాదాలు, ప్రశంసలమయం జియా వ్యక్తిగత, రాజకీయ ప్రస్తానం ఆద్యంతం ఆసక్తికరంగా, వివాదాస్పద నిర్ణయాలు, పాలన, ప్రశంసలతో సాగింది. భారత్కు స్వాతంత్య్రం రావడానికి సరిగ్గా ఏడాది ముందు అంటే అవిభాజ్య భారతదేశంలో 1946 ఆగస్ట్ 15న నాటి బెంగాల్లోని దినాజ్పూర్ జిల్లాలో జియా జన్మించారు. తండ్రి ఇస్కందర్ మజూందార్, తల్లి తయ్యబా జల్పాయ్గురిలో టీ వ్యాపారం చేసేవారు. తర్వాత వీళ్ల కుటుంబం తూర్పు పాకిస్తాన్వైపు వలసవెళ్లింది. అంతకుముందు ఈమె సురేంద్రనాథ్ కాలేజీలో చదువుకున్నారు. ఒకప్పుటి పాకిస్తాన్ సైనిక జనరల్ జియాఉర్ రెహ్మిన్ను 1960లో పెళ్లాడారు.1978లో రెహ్మాన్ బీఎన్పీ పార్టీని స్థాపించాక తొలిసారిగా ఈమె గురించి అప్పట్లో వార్తలొచ్చాయి. 1981 మే 30న నాటి సైన్యంలోని ఒక వర్గం రెహ్మాన్ను హత్యచేయడంతో 35 ఏళ్ల వయసులో భర్తను కోల్పోవడంతో పార్టీ బాధ్యతలు ఈమె మోయాల్సి వచ్చింది. 1984 మేలో పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 1982లో నాటి ఆర్మీ చీఫ్ జనరల్ హెచ్ఎం ఎర్షాద్ తిరుగుబాటులేవదీసి అధికారాన్ని కైవసం చేసుకోవడంతో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటూ ఈమె పెద్ద ఉద్యమంలేవదీశారు. దీంతో జాతీయస్థాయి నేతగా అవతరించారు.1991లో చీఫ్ జస్టిస్ షహాబుద్దీన్ అహ్మద్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించగా బీఎన్పీ పార్టీ ఘనవిజయం సాధించింది. దీంతో తొలి మహిళా ప్రధానిగా ఈమె బాధ్యతలు స్వీకరించి రికార్డ్ సృష్టించారు. పాకిస్తాన్లో బెనజీర్ భుట్టో తర్వాత ఒక ఇస్లామిక్ దేశానికి ప్రధాని అయిన రెండో మహిళగానూ జియా చరిత్ర సృష్టించారు. 1996 ఎన్నికల్లోనూ జియా పార్టీ గెలిచినా షేక్హసీనా సారథ్యంలోని ఆవామీ లీగ్ చేసిన ఉద్యమాలతో కేవలం 12 రోజుల్లో జియా అధికారాన్ని కోల్పోయారు. అప్పుడే ఈమె తొలిసారిగా దేశంలో తాత్కాలిక ప్రభుత్వ విధానం తెచ్చారు.2001లోనూ అధికారంలోకి వచ్చారు. 2006లో గద్దె దిగి తాత్కాలిక సర్కార్కు పగ్గాలు అప్పజెప్పారు. ఏడాదికే ఆమెపై అవినీతి ఆరోపణలు చేసి తర్వాతి ప్రభుత్వం జియాను అరెస్ట్చేసింది. ‘జియా అనాథల ట్రస్ట్’కేసులో జియాకు 2018 ఫిబ్రవరిలో ఐదేళ్ల జైలుశిక్ష పడింది. 2024లో హసీనా అధికారంలోకి రాగానే జియాకు క్షమాభిక్ష ప్రసాదించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. -
2025 ఏ టు జెడ్
2025 ప్రపంచమంతటికీ తీపి, చేదుల మిశ్రమంగా గడిచింది. ప్రాకృతిక విపత్తులు, ఘోర ప్రమాదాలు, రాజకీయపుటెత్తులు, యుద్ధక్రీడలు, నేతల నోటి దురుసులు, ఎన్నికల సమరాంగణాలు... ఇలా మొత్తమ్మీద మోదం పంచిన ఘటనలు కొన్నే కాగా చాలావరకు ఖేదమే మిగిలించాయి. ఆంగ్ల అక్షరక్రమంలో అలాంటి ఘటనల సమాహారం...ఎ - ఎయిరిండియా ప్రమాదం జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా–171 విమానం టేకాఫైన 32 సెకన్లకే రన్వే ఎదురుగా ఉన్న మెడికల్ కాలేజీ హాస్టల్పై కుప్పకూలింది. విమానంలోని 242 మంది, కింద ఉన్న మరో 19 మంది నిర్భాగ్యుల ప్రాణాలను గాల్లో కలిపింది. ఈ ఘోర ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక ప్రయాణికుడు మృత్యుంజయునిగా చిన్నపాటి గాయాలతో బయటపడటం విశేషం.బి - బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలను అధికార ఎన్డీఏ, ఆర్జేడీ సారథ్యంలోని విపక్ష మహాఘట్బంధన్ కూటములు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్డీఏ కూటమి 243 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 202 చోట్ల విజయదుందుభి మోగించి ఆశ్చర్యపరిచింది. ఘట్బంధన్ కేవలం 35 స్థానాలతో ఘోర పరాభవం మూటగట్టుకుంది. నితీశ్కుమార్ సీఎంగా ఏకంగా పదోసారి ప్రమాణస్వీకారం చేశారు. సి - క్యాస్ట్ సెన్సెస్ కరోనా కారణంగా 2020లో వాయిదాపడ్డ జనగణనను దేశవ్యాప్తంగా చేపట్టనున్నట్లు కేంద్రం ఏప్రిల్లో ప్రకటించింది. ఇది 2027 మార్చి నుంచి మొదలవనుంది. అందులో భాగంగా కులగణన సైతం చేపడుతున్నట్టు వెల్లడించడం విశేషం. బ్రిటిష్ హయాంలో మన దేశంలో 1881 నుంచి 1931 దాకా కులగణన జరిగింది. కుల విభజనను పెంచరాదనే ఉద్దేశంతో స్వాతంత్య్రానంతరం ఆ ప్రక్రియను నిలిపేశారు. 2011లో సామాజిక, ఆర్థిక కులగణన చేసినా దాన్ని పూర్తిస్థాయి కులగణనగా పరిగణించడం లేదు. డి - డీప్సీక్ ఈ చైనా ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ప్రపంచవ్యాప్తంగా పెను దుమారమే రేపింది. డౌన్లోడ్ చార్టుల్లో చూస్తుండగానే అగ్రస్థానానికి దూసుకెళ్లి ప్రత్యర్థి ఓపెన్ ఏఐకి చెందిన చాట్జీపీటీని తోసిరాజంది. దాంతో పోలిస్తే కారుచౌకగా సేవలందిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా డీప్సీక్–ఆర్1ను విడుదల చేసింది. దీని దెబ్బకు ఓపెన్ఏఐ మార్కెట్ విలువ 600 బిలియన్ల మేరకు తగ్గిపోయింది. ఇ - ఎప్స్టీన్ ఫైల్స్ 20 ఏళ్లనాటి ఈ కామ భూతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. వారి లైంగికానందం కోసం బాలికలను ఎరవేసిన వ్యాపారి ఎప్స్టీన్ చివరికి ఆత్మహత్య చేసుకున్నా, ఆ ఉదంతం ఇప్పటికీ దుమారం రేపుతూనే ఉంది. ఈ కేసు విచారణ ఫైళ్లను బయటపెట్టాలన్న కాంగ్రెస్ ఉత్తర్వులపై ట్రంప్ అయిష్టంగానే సంతకం చేసినా, తనకు నష్టం లేనివాటిని మాత్రమే, అదీ విడతలవారీగా వదులుతూ సాగదీస్తున్నారు. ఎఫ్ - ఫ్లడ్స్ ఇన్ ఆసియా నానాటికీ తీవ్రమవుతున్న పర్యావరణ మార్పుల సమస్యకు ఈ ఏడాది ఆసియా దేశాలను అతలాకుతలం చేసిన వరదలు అద్దంపట్టాయి. శ్రీలంక, ఇండొనేసియా, థాయ్లాండ్, మలేసియా, వియత్నాం తుఫాన్ల దెబ్బకు కుదేలయ్యాయి. ఈ విపత్తు భారత్ను కూడా తీవ్రంగానే నష్టపరిచింది. ఆగ్నేయాసియా దేశాల్లో ఆకస్మిక వరదలు, తుపాన్లు వేలాది నిండు ప్రాణాలను బలిగొన్నాయి. జెన్–జెడ్ ఆందోళనలు ప్రభుత్వాల, పాలకుల కర్రపెత్తనంపై ఆన్లైన్ వీరులు ఆఫ్లైన్లో ఆందోళనలకు దిగితే ఎలా ఉంటుందో నవతరం రుచిచూపింది. ఈ నవయువత నిరసన గళాల ధాటికి నేపాల్లో ప్రధాని కేపీ శర్మ ఓలి గద్దె దిగాల్సి వచ్చింది. జెన్–జెడ్ ఆందోళనలు నేపాల్కే పరిమితం కాలేదు. ఇండొనేసియా మొదలుకుని మడగాస్కర్, బల్గేరియా మీదుగా పెరు, మెక్సికో దాకా విస్తరించాయి.జి - హాంకాంగ్ అగ్ని ప్రమాదంఅగ్నిగోళంలా మండిపోతున్న ఆకాశహర్మ్యం. దానికేసి వేలెత్తి చూపుతూ, తన భార్య అందులో చిక్కుబడిందంటూ విలపిస్తున్న వృద్ధుని ఫొటో. ఇటీవల ఆన్లైన్లో వారాల తరబడి వైరల్గా మారిన చిత్రమిది. అందుకు కారణమైన హాంకాంగ్లోని వాంగ్ఫుక్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం 160 మందిని పొట్టనపెట్టుకుంది. 40 గంటలకు పైగా శ్రమిస్తేనే గానీ మంటలు అదుపులోకి రాలేదు.హెచ్ - ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్12 రోజుల యుద్ధంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఈ పోరు ఇరాన్ను కోలుకోలేని దెబ్బ తీసింది. అమెరికా దన్నుతో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక, క్షిపణి దాడులు ఇరాన్ సైనిక వ్యవస్థలతో పాటు అణు వ్యవస్థలనూ తీవ్రంగా నష్టపరిచాయి. ఇరాన్పై బంకర్ బస్టర్ బాంబులేసి అమెరికా యుద్ధజ్వాలల్లో చలికాచుకుంది. తర్వాత తీరిగ్గా తానే సంధి చేసి జబ్బలు చరుచుకుంది.జె జగ్దీప్ ధన్ఖడ్మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఉపరాష్ట్రపతి పదవికి హఠాత్తుగా రాజీనామా చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు ధన్ఖడ్. ఆరోగ్య కారణాలను చూపుతూ జూలై 21న తప్పుకున్నారు. రాజ్యసభ చైర్మన్గా సభలో చురుగ్గా వ్యవహరిస్తూ, అధికార పక్షానికి పెట్టని కోటగా నిలుస్తూ వచ్చిన ఆయన రాజీనామా సంచలనమే సృష్టించింది. ఇలా తప్పుకున్న తొలి ఉపరాష్ట్రపతి ఆయనే కావడం విశేషం. పలు అంశాలపై కేంద్రంతో ఆయనకు కొంతకాలంగా అంతరం పెరుగుతూ వచ్చిందంటారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు రాజ్యసభలో విపక్షాలిచ్చిన నోటీసును ధన్ఖడ్ స్వీకరించడాన్ని ప్రభుత్వ పెద్దలు తప్పుబట్టడం రాజీనామాకు తక్షణ కారణంగా నిలిచిందని అంటారు.కె కర్ణాటకలో సిద్ధూ వర్సెస్ డీకే కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత పవర్ పాలిటిక్స్ కుస్తీ పోటీలను తలపిస్తున్నాయి. గద్దె దిగేందుకు సీఎం సిద్ధరామయ్య ససేమిరా అంటుండటం, ఒప్పందం ప్రకారం కురీ్చని తనకు అప్పగించాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పట్టుబడుతుండటం అధిష్టానానికి తీరని తలనొప్పిగా మారింది. చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రులుగా కొనసాగేలా హైకమాండే ఒప్పందం కుదిర్చిన నేపథ్యంలో ఇప్పుడు తన వంతు వచ్చిందన్నది డీకే వాదన.ఎల్ - లౌరే దోపిడీ ఈ శతాబ్దంలోనే అతి పెద్ద దోపిడీగా సంచలనం సృష్టించింది. పారిస్లోని లౌరే ఆర్ట్స్ గ్యాలరీలోకి అక్టోబర్ 19న ఆదివారం వేళ నలుగురు దోపిడీ దొంగలు చొరబడ్డారు. అత్యంత విలువైన, చారిత్రక ప్రాధాన్యమున్న 8 అమూల్య ఆభరణాలను కాజేశారు. వాటి విలువ ఏకంగా 10 కోట్ల డాలర్లుగా తేలింది. ఇంతటి దోపిడీని దొంగలు కేవలం ఏడంటే 7 నిమిషాల్లో పని ముగించి జారుకోవడం విశేషం. ఎం - మోదీ 2025లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభ మరింత పెరిగింది. నిజానికి గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీని నిలబెట్టుకోకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయా ల్సి వచ్చింది. జేడీ (యూ) వంటి పారీ్టల మద్దతు కీలకంగా మారడంతో మోదీకి ఇక కష్టకాలమేనన్న అంచనాలూ వెలువడ్డాయి. కానీ కీలకమైన ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయాలతో ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది. అంతర్జాతీయ వేదికలపైనా మోదీ పేరుప్రఖ్యాతులు మరింతగా పెరిగాయి. జీ7తో పాటు ఏ శిఖరాగ్ర సదస్సులోనైనా ఆయనే ప్రధాన ఆకర్షణగా మారుతున్న పరిస్థితి!ఎన్ - నెట్ఫ్లిక్స్–వార్నర్ బ్రదర్స్ డీల్ ప్రపంచవ్యాప్తంగా వినోదపు తీరుతెన్నులనే సమూలంగా మార్చేయగల పరిణామంగా అంతా పేర్కొంటున్న ఒప్పందమిది. వార్నర్ బ్రదర్స్ టీవీ స్టూడియోలతో పాటు కీలకమైన స్ట్రీమింగ్ విభాగాన్ని నెట్ఫ్లిక్స్ ఏకంగా 6.47 లక్షల కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది! హ్యారీపోటర్, సూపర్మ్యాన్, బ్యాట్మ్యాన్, గేమ్ ఆఫ్ థోర్న్ వంటి బ్లాక్బస్టర్ మూవీ సిరీస్లతో పాటు స్కూబీ డూ, టామ్ అండ్ జెర్రీ కామిక్స్, హెచ్బీఓ మాక్స్ ఓటీటీ ప్లాట్ఫాం, డిస్కవరీ చానల్ వంటివన్నీ వార్నర్ నుంచి నెట్ఫ్లిక్స్ సొంతమవుతాయి. ఈ దెబ్బకు చాలా దేశాల్లో సినిమా థియేటర్లు మూతబడటం ఖాయమన్న అంచనాలున్నాయి. ఓ - ఆపరేషన్ సిందూర్ మే 7 తెల్లవారుజాము. బైసారన్ లోయలో 26 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్నందుకు ప్రతీకారంగా మన సైన్యం కొట్టిన దెబ్బకు దాయాది గింగిరాలు తిరిగిన రోజు. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి వందలాది ముష్కరులను హతమార్చి భరతమాతకు రక్తసిందూరం దిద్దిన రోజు. సరిహద్దుల వెంబడి చిన్నాచితకా దాడులతో ఒకట్రెండు రోజులు ప్రతిఘటిస్తున్నట్టు నటించినా, మన దెబ్బకు కీలక వైమానిక స్థావరాలన్నీ వరుసబెట్టి ధ్వంసం కావడంతో మూడో నాటికే పాక్ కాళ్లబేరానికి వచ్చి సంధి చేసుకుంది. పి - పహల్గాం ఉగ్ర దాడి ఏప్రిల్ 22న జమ్మూకశీ్మర్లోని పహల్గాం ప్రాంతం అమాయక పర్యాటకుల రక్తంతో ఎరుపెక్కింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా హిందువులనే లక్ష్యం చేసుకుంటూ ఉన్మాదులు హత్యాకాండకు తెగబడ్డారు. వారిని పేర్లడిగి మరీ కాల్చి చంపారు. దేశమంతటినీ ఆగ్రహావేశాలకు లోను చేసిన ఈ దారుణం ఆపరేషన్ సిందూర్కు దారితీసింది.క్యూ - క్వైట్, పిగ్గీ! మహిళా జర్నలిస్టులను అవమానించే దుర్లక్షణం ట్రంప్ను ఓ పట్టాన వదిలేలా లేదు. ఎప్స్టీన్ వివాదానికి సంబంధించి ప్రశ్నించిన బ్లూంబర్గ్ న్యూస్ జర్నలిస్టు కేథరిన్ లూసీపై ఆయన దారుణంగా నోరు పారేసుకున్నారు. అదే అంశంపై ఆమె రెట్టించడంతో ఉక్రోషానికి లోనై ‘క్వైట్, క్వైట్, పిగ్గీ!’అంటూ అవమానకర పదజాలం వాడుతూ అరుపులకు దిగారు. సదరు వీడియోను మిలియన్ల మంది వీక్షించారు. ట్రంప్ తీరును అంతా తీవ్రంగా ఆక్షేపించారు. ‘క్వైట్, పిగ్గీ’ హా‹Ùట్యాగ్తో నెటిజన్లు హోరెత్తించారు. ట్రంప్ను గేలి చేస్తూ దీనిపై మీమ్లూ ఇంటర్నెట్ను ముంచెత్తాయి. ఆర్ - రాహుల్గాంధీ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాం«దీకి 2025 కష్టకాలంగానే సాగింది. విపక్ష నేత పదవికి న్యాయం చేయడంలో ఆయన విఫలమవుతున్నారన్న అభిప్రాయాలు నానాటికీ విస్తరిస్తున్నాయి. ఢిల్లీతో పాటు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరీ సోదిలో కూడా లేకుండాపోవడం రాహుల్ నాయకత్వ సామర్థ్యంపై అనుమానాలకు తావిచ్చింది. వయనాడ్ నుంచి లోక్సభకు ఎన్నికైన ఆయన సోదరి ప్రియాంకా పారీ్టలో ఇక మరింత ‘క్రియాశీలక’ పాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందని పలువురు కాంగ్రెస్ నేతలే అభిప్రాయపడుతున్న పరిస్థితి! ఎస్ - సెంగర్ అత్యాచార కేసు తీర్పు సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగర్ తాజాగా మరోసారి పతాక శీర్షికల్లోకి ఎక్కాడు. అతని జీవితఖైదును సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనపై అత్యాచారానికి ఒడిగట్టడమే గాక న్యాయ పోరాటానికి దిగిన తన తండ్రిని కూడా చంపించిన సెంగర్కు ఉరిశిక్ష పడేదాకా వదిలేది లేదని బాధితురాలు అన్నారు.ఎక్స్ - షీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ ఏడాది చాలారకాలుగా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ట్రంప్ టారిఫ్లకు బెదరకుండా అమెరికాపై అంతకుమించిన స్థాయిలో టారిఫ్లు బాదారు. ఎన్నడూ లేనట్టుగా మోదీతో సాన్నిహిత్యం పెంచుకుని భారత్నూ ఆకట్టుకున్నారు. వారిద్దరూ కలిసి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో నవ్వులు చిందిస్తున్న ఫొటో అయితే ట్రంప్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. వై - యమున ప్రక్షాళన నానాటికీ కాలుష్య కాసారంగా మారుతున్న యమునా నదిని తిరిగి పరిశుభ్రంగా మార్చేందుకు కేంద్రంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం ఏకంగా రూ.57 వేల కోట్లతో మాస్టర్ ప్లానే ప్రకటించింది. దేశ రాజధానిలో మురుగునీటి శుద్ధి సామర్థ్యం పెంపు కోసం 9 ప్రాజెక్టులను తెరపైకి తెచ్చింది. ఢిల్లీ పరిధిలోని కేవలం 22 కిలోమీటర్ల నిడివే యమున కాలుష్యంలో ఏకంగా 80 శాతానికి కారణంగా మారుతోంది! జెడ్ - జొహ్రాన్ మమ్దానీ ఒక మేయర్ ఎన్నికకు ఏకంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే కూడా క్రేజ్ వచ్చిన సందర్భం బహుశా ఇదొక్కటేనేమో! న్యూయార్క్ మేయర్గా 34 ఏళ్ల ముస్లిం విద్యాధికుడు జొహ్రాన్ మమ్దానీ ఎన్నిక పలు రకాలుగా చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది. ఆయన్ను ఓడించేందుకు ట్రంప్ అపార శక్తియుక్తులన్నీ వినియోగించినా లాభం లేకపోయింది. మమ్దానీ ప్రఖ్యాత భారతీయ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు.టి - టారిఫ్లు ఈ ఏడాదంతా దేశదేశాలను వణికించిన పదమిది. ట్రంప్ ఎడాపెడా పెంచిన టారిఫ్ల దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ తొలుత బెంబేలెత్తిపోయాయి. కానీ చైనా ప్రతీకార టారిఫ్ల దెబ్బకు ట్రంపే చివరికి కాళ్లబేరానికి రావాల్సి వచ్చింది. తర్వాత ఒక్కొక్క దేశంపైనా టారిఫ్లను ఇష్టానికి పెంచుతూ, తగ్గిస్తూ తన స్థాయినీ, అమెరికా స్థాయినీ పలుచన చేసుకున్నారాయన. భారత్పైనా ఒక దశలో 50 శాతం దాకా భారీ టారిఫ్లు విధించినా, వాటిని వెనక్కు తీసుకుని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే పనిలో పడ్డారు.యు - ఉక్రెయిన్ శాంతి చర్చలు ప్రపంచానికి ఈ ఏడాది కాస్త ఉపశమనం ఇచ్చిన ఉదంతమిది. మూడున్నరేళ్ల పై చిలుకు యుద్ధానికి తెర దించేందుకు రష్యా సుముఖత వెలిబుచ్చడంతో ఇరు దేశాలతో అమెరికా అత్యున్నత స్థాయిలో శాంతి చర్చలు జరుపుతోంది. ఈ శాంతి వీచికల కారణంగా ఉక్రెయిన్పై రష్యా దాడుల ధాటి బాగా తగ్గింది.వి - వెనెజులా ధిక్కారం వెనెజులాలోని అపార చమురు నిల్వలపై కన్నేసిన తెంపరి ట్రంప్, వాటిని సొంతం చేసుకునేందుకు అవసరమైతే ఆ దేశంపై యుద్ధానికి వెనకాడబోనని ప్రకటించి ప్రపంచానికి షాకిచ్చారు. ఆ దేశపు చమురు నౌకలను నానా సాకులతో దిగ్బంధిస్తూ, పేల్చేస్తూ కల్లోలం సృష్టిస్తున్నారు. ఏదేమైనా అమెరికాకు తలొగ్గేదే లేదని అధ్యక్షుడు మదురో ధిక్కార స్వరం వినిపించడంతో ట్రంప్ నోట్లో పచ్చి వెలక్కాయ పడింది.డబ్ల్యూ - వక్ఫ్ సవరణ చట్టం మోదీ సర్కారు తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం–2025ను వివాదాలు చుట్టుముట్టాయి. వక్ఫ్ ఆస్తులపై కర్రపెత్తనమే దీని లక్ష్యమని ముస్లిం బోర్డులు, సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పుంఖానుపుంఖాలుగా పిటిషన్లు దాఖలయ్యాయి. కనీసం ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తున్నవారు మాత్రమే వక్ఫ్ (దానం) ఇవ్వొచ్చు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిళ్లలో ఇద్దరు ముస్లిమేతర సభ్యుల వంటి నిబంధనలన్నీ వక్ఫ్ ఆస్తుల స్వా«దీనం కోసం పెట్టినవేనని దుయ్యబడుతున్నాయి. సుప్రీంకోర్టు కొన్ని నిబంధనలను తాత్కాలికంగా పక్కన పెట్టగా మరికొన్నింటిపై పిటిషనర్ల అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో వక్ఫ్ కేసులో తుది తీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జెన్ జడ్ గురించి మీకు తెలుసా?
జెన్ జడ్ గురించి మీకు తెలుసా? ఇదేదో పదం కాదు.. ఓ తరం. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ యుగంలో పుట్టిన... ఈ సాంకేతికను అలవర్చుకున్న... చిన్న నాటి నుంచే టెక్నాలజీని వాడుతున్న జనరేషన్నే జెన్జడ్ అని... అంటే జనరేషన్ జడ్ అని పిలుస్తారు. ముందటి తరాలకు భిన్నంగా... కొత్త ఆలోచనలు... దానికి మించి... ఆన్లైన్ సాంకేతికత... అధిక టెక్నాలజీ వినియోగంతో దూసుకెళ్తున్న తరమే జెన్ జడ్. ఆ తరం ఆలోచనా విధానం... సవాళ్లను ఎదుర్కొనే మనస్తత్వం... పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోడానికి వారు అనుసరించే విధి విధానాలు....సున్నితత్వం.. ఆత్మాభిమానం... ఆవేశం లాంటి అంశాలపై గత తరాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్న జెన్ జడ్ తీరు గురించి మనో వైజ్ఞానిక వేత్తలు జరిపిన పరిశోధనల ఆధారంగా వారి తీరు తెన్నులపై ఓ సారి ఫోకస్ చేద్దాం.జన్ జడ్ తరాన్ని ఓ రకంగా గమనిస్తే 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారిగా గుర్తించవచ్చు. ఆ తరాన్ని సాధారణంగా "జూమర్స్..., "ఐ జనరేషన్"...., "డిజిటల్ స్థానికులు".... అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వారు చాలా చిన్న వయస్సు నుండే ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ లు, సోషల్ మీడియా గురించి పూర్తి అవగాహనతో పెరిగిన మొదటి సామాజిక తరంగా చెప్పవచ్చు. జన్జడ్లో దాదాపు 12 నుంచి 30 ఏళ్ల వరకు వయస్సున్న వారే ఉన్నారు. అంటే ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు చిన్నప్పుడే మొబైల్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు చేతబట్టుకున్నారు. ఇప్పటి వరకు వారి జీవితమంతా అంటే చిన్ననాటి నుంచి చివరివరకు టెక్నాలజీ, ఆన్ లైన్ వీడియోలు, సోషల్ మీడియాకు అలవాటు పడిపోయారు. దాంతో వారి ప్రపంచ దృక్పథం.. వారు చూసే కోణాలు.. వారి కమ్యూనికేషన్ విధి విధానాలు సాధారణ పౌరులకు భిన్నంగా ఉండే అవకాశాలున్నాయి. అంటే అంతకు ముందు తరం గురించి మాట్లాడితే.... పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, విద్య, సామాజిక దృక్పథం వంటి విషయాలను వంట బట్టించుకున్నారు. జన్ జడ్ లో ఉన్న వారిని ప్రశ్నించగానే గూగుల్ వెదకటం, చాట్ జీపీటీని అడగం.... లేదా ఏఐతో ఏదైనా సాధ్యం అని భావించడంతో పాటు కొత్తగా సృష్టించడం... కొత్త ఆలోచనలను బహిరంగ పరచడం లాంటివి అలవర్చుకున్నారు. తరంలో వచ్చిన మార్పు సాంకేతిక పరంగా ఆహ్వనించదగ్గ పరిణామమే... దీంతో వారి మనస్సులు... వారి సామాజిక స్పృహ... ఆరోగ్య అంశాలపై వారికున్న అవగాహన... వారిని మరింత తీర్చి దిద్దుతోంది. ఈ మార్పు సత్ఫలితాలనిస్తాయనడంలో సందేహం లేదు. జన్జడ్ తరానికి సంబంధించిన పరిశోధనల్లో తేలిందేమిటంటే.. ముఖ్యంగా... కొత్త తరం... కథలకు కాకుండా వాస్తవాలకు విలువనిస్తారు. ఆరోగ్య విషయాల్లో పాత తరాలకన్నా... ఎక్కువగా ఆలోచిస్తారు... చర్చిస్తారు. చెడు అలవాట్ల విషయంలో జాగ్రత్త పడటం... దూమపానం, మద్యపానంపై ఆసక్తి చూపకపోవచ్చు. తరచుగా ఉద్యోగ, వ్యాపార అవకాశాలు, విద్య.. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అంతే కాకుండా Gen Z లో చాలా వరకు వ్యక్తులు సొంతంగా అవకాశాలు అంది పుచ్చుకోవడం... సొంతంగా ఏదో చేయాలన్న తపన, కొత్త వాటిని ఆవిష్కరించడం, సృష్టించడం... ఇ-కామర్స్ బ్రాండ్స్, డిజిటల్ కంటెంట్లు, స్టార్టప్లు సష్టించడం, వంటి సొంతంగా గుర్తింపు పొందే ఆసక్తి కలిగి ఉంటారు. జెన్ జెడ్ తరం వారిలో బహిరంగంగా మాట్లాడటం.... భయం లేకుండా ప్రవర్తించడం... కొందరు అంతర్గతంగా చాలా సున్నిత మనస్కులైనప్పటికీ... మానసికంగా బలంగా ఉంటారు. దాన్ని వారు బలహీనత అని చెప్పకుండా అవగాహన అని చెప్పుకుంటారు. వారిలో చాలామంది సామాజిక సమస్యలను చర్చించడానికి, ఆర్థిక అస్థిరత, ప్రపంచ సంక్షోభాలు, మునుపటి తరాలు పట్టించుకోని... లేదా సాధ్యం కానివని వదిలేసిన కార్యకలాపాలు.. పాత తరం వారి ఆలోచనలను వెలికి తీయడానికి ప్రయత్నిస్తారు. జెన్ జడ్ తరం మానసికంగా బలంగా ఉంటారు... భావోద్వేగాలకు తావు లేకుండా... బాధను వ్యక్తీకరించడం... ఆ బాధను తగ్గించే దారులు వెదుక్కుంటారు.... సమస్యలు, బాధలతో సతమతమయ్యే పాత తరపు ఆలోచనలు పట్టించుకోకుండా... వాటిని అడ్డంకులుగా భావించి కొట్టిపారేస్తూ పాత తరం ఆలోచనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు.ఆన్ లైన్లో చర్చల ద్వరా సమాజం అవగాహన, రాజకీయాలపై మక్కువ... ఆర్థిక అసమానతలపై చర్చలు... ప్రపంచ సమస్యలు, సామాజిక అన్యాయాలు, అవాస్తవిక అంశాలు, జీవన ప్రమాణాలపై నిరంతర అవగాహన... చర్చలు సాగుతుంటాయి. అంతే కాకుండా సొంతంగా ఆలోచనలు... వాటిని అమలు పర్చడానికి దారులు వెదుక్కుంటారు. శరీర ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు.వాతావరణంలో మార్పుల ప్రభావం... ఆర్థిక అస్థిరత, విద్యా ఒత్తిడి కారణంగా అధిక ఒత్తిడి స్థాయిలను జయిస్తారు. ఉద్యోగాలు, భవిష్యత్తు అవకాశాలపై అనిశ్చితి వారిని మరింత జాగ్రత్త పడేలా చేస్తుంది. పోటీ పెరిగినందువల్ల వారు తమ భావాలను నిర్భయంగా బయటపెట్టడం... తద్వారా తమ గురించి బయట ప్రపంచానికి చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అలాగే డిజిటల్ ఎక్స్పోజర్... అంటే సోషల్ మీడియా ద్వారా తమను తాము పోల్చుకోవడం... ఇతరుల కంటే భిన్నంగా ఏం చేయగలమనే ఆలోచనలు... కలిగి ఉంటారు. కొత్త తరం ఆలోచనా విధానాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం కూడా ఆహ్వనిస్తోంది. భావాల వ్యక్తీకరణ... బలహీనత కాదు... అది అవగాహన అని చెబుతున్నారు. భావాలను దాచడం కంటే వ్యక్తపరచడం మానసిక ఆరోగ్యానికి మంచిదని.... గత తరాలు మౌనంగా ఉండటం నేర్చుకున్నాయి... కానీ జెన్జడ్ తరం మాత్రం స్వీయ సంరక్షణ.... తమ ఆలోచనలు, విధివిధానాలు బహిరంగ పరుస్తున్నాయి. జెన్జడ్ సున్నితత్వం కాదు... ధైర్యం అని... వారు వాస్తవ పరిస్థితులను జీర్ణించుకుని సమాజానికి కొత్త భావాన్ని నేర్పుతున్నారని మనో వైజ్ఞానిక నిపుణులు చెబుతున్నారు. -
ఒమన్ కీలక నిర్ణయం.. నకిలీ పత్రాలు సమర్పిస్తే కఠిన చర్యలే
ఒమన్లో పనిచేసే ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం షాకింగ్ న్యూస్ తెలిపింది. కొత్త సంవత్సరం నుంచి వర్క్ సర్టిఫికెట్స్, లైసెన్స్, తదితర పత్రాలు సరైనవి లేకుంటే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అక్కడి కార్మిక శాఖ ప్రకటన విడుదల చేసింది.ఒమన్లో వీసా పునరుద్ధరణకు, కొత్త ఉద్యోగులలో ప్రవేశానికి సంబంధింత రంగాలలో వృత్తిపరమైన వర్గీకరణ సర్టిఫికేట్లు, లైసెన్స్లు అందుకు సంబంధించిన శాఖలకు చెందిన అధికారులనుంచి పొందవలసి ఉంటుంది. అయితే అలా పొందాల్సిన సమయంలో సంబంధిత అధికారులు అన్ని రకాలుగా సరైన సమాచారం ధృవీకరించుకున్నాకే ఆ పత్రాలు జారీ చేయాలని తెలిపింది. ఒకవేళ నకిలీ పత్రాలు జారీదేస్తే ఉద్యోగులతో పాటు సంబంధింత కంపెనీలు ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అక్కడి కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.కాగా ఒమన్లో ఉన్న మెుత్తం విదేశీ కార్మికుల సంఖ్య దాదాపు 18 లక్షలు కాగా భారత్ నుంచి దాదాపు 5 లక్షలకు పైగా అక్కడ పనిచేస్తున్నారు. గత కొంత కాలంగా ఒమన్లో పని చేస్తున్న భారతీయుల సంఖ్య తగ్గుతూ వస్తున్నట్లు అక్కడి నివేదికలు పేర్కొంటున్నాయి. -
నిజంగానే భూమి మీదకు వస్తే వారితో సావాసం ఎలా?
2026లో మనం ఏలియన్లను కలవ బోతున్నామా? లేక ఏలియన్లు మన వద్దకు రానున్నాయా? ఏలియన్లకు సంబంధించి బాబా వంగా చేసిన భవిష్యవాణి నిజమవుతుందా? నిజంగా ఏలియన్లు భూమి మీదకు రానున్నాయా? అసలు ఏలియన్లు ఉన్నారా? ఇవన్నీ ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలే. ఇప్పటికీ... బాబా వంగా భవిష్య వాణిని నమ్మేవారు ఏలియన్ల ఉనికి సాధ్యమే అంటున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ... సువిశాల విశ్వంలో పరిశోధనల ఇంకా మిగిలే ఉంది. ఒక వేళ బాబా వంగా వ్యాఖ్యలు వాస్తవమేనని అనుకున్నా.. 2026లో నిజంగా ఏలియన్లు భూమి మీదకు వస్తే మరి వారిని ఎలా కలవాలి...? వారు మనకన్నా బలవంతులా? లేక బలహీనులా?... వాళ్లు శక్తి వంతులై... దాడి చేయడానికి ప్రయత్నిస్తే... వారి ఆయుధాల గురించి కనీస జ్ఞానం లేని మానవులు ఎదుర్కొనగలరా.. ఇలాంటి ప్రశ్నలకు మనం సమాధానాలు వెదుకుదాం. ఏలియన్ల ఉనికి ఉందని... అవి త్వరలోనే భూమి మీదకు వస్తాయని బల్గేరియాకు చెందిన బాబా వంగా చెప్పారు. ఆమె జీవించి ఉన్నప్పుడు... భవిష్యత్తులో జరిగే కొన్ని కార్యాల గురించి చెప్పారు. అందులో ఏలియన్ల ప్రస్తావన కూడా ఉంది. అయితే ఆమె చెప్పిన వాటిలో కొన్ని నిజంగా జరిగాయి. కొన్ని జరగలేదు. దాంతో జనం ఆమె భవిష్యత్తును చూడగలరని నమ్మారు. అందులోనే 2026లో ఏలియన్ల గురించి ఆమె భవిష్యవాణి ప్రస్తావన ఉంది. ఏలియన్లు భూమ్మీదకు వస్తారు... అప్పడు భూమిమీద పెద్ద సంక్షోభం ఏర్పడుతుందని చెప్పారు. జనం నమ్మి ఏలియన్ల మీద ఆసక్తి పెంచుకోవడంతో పాటు సంక్షభాన్ని ఎదుర్కొనే తీరుపై చర్చలు కూడా సాగుతున్నాయ. శాస్రవేత్తలు మాత్రం... మానవులు.... గ్రహంతర వాసులను కలుస్తారనే ఆధారాలు లేవని... అది సాధ్యం కాదని చెబుతున్నారు. ఏదేమైనా.. 2026 మాత్రం ఇంటరెస్టింగా మారనుంది. ఇప్పటికే హాట్ టాపిక్గా మారిన ఏలియన్ల ప్రస్తావన... రాను రాను పెద్ద చర్చకే దారి తీసేట్టు ఉంది. ఇప్పటికే భారీ సంఖ్యలో జనం నమ్మడంతో... శాస్త్రవేత్తలు సైతం మరింత లోతుగా వాస్తవాలను గుర్తించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఏలియన్ల చర్చకు భిన్నంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు చేసిన విస్తృత పరిశోధనల ద్వారా ఏలియన్ల ఉనికి ఉండొచ్చని... ఉండక పోవచ్చని మాత్రం చెప్పగలిగారు. ఉన్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు ఖగోళ శాస్త్రవేత్తలకు లభించలేదు. అయినా నిరంతర అన్వేషణ సాగుతోనే ఉంది. సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్ వంటి ప్రోగ్రామ్లో ఆకాశాన్ని.. గ్రహాలను స్కాన్ చేస్తూనే ఉన్నప్పటికీ... ఏలియన్ల గురించి స్పష్టమైన ఆధారాలు ఇంకా లభించలేదు.ఏలియన్ల గురించి శాస్త్రవేత్తల ఆలోచన ఏంటనే అంశాలపై ఓ సర్వే జరిగింది. అంతో 1055 మంది శాస్త్రవేత్తలు, వారిలో దాదాపు సగం అంటే 521 మంది ఖగోళ జీవ శాస్త్రవేత్తలతో జరిపిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. శాస్త్రవేత్తల్లో 87 శాతం మంది గ్రహంతర వాసులున్నారని నమ్ముతున్నారు. ఖగోళ శాస్త్రవేత్తల్లో సగం మంది మాత్రమే నమ్ముతున్నారు. మిగతా సగం నమ్మడం లేదు. విశ్వంలో... భూమి తప్ప నివాస యోగ్యంగా ఉండే వాతావరణం, నీటి ఉత్పన్నం, ఇతర అవసరాలకు అనుగుణంగా ఇతర గ్రహాలు లేవని... అందుకే వాటిపై జీవం లేకపోవచ్చని కొందరు ఖగోళ శాస్త్రవేత్తల ఆలోచన. ఇతర శాస్త్రవేత్తలు కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నారు. మన సౌర వ్యవస్థలో చంద్రునిపై జీవం ఉండే ఆస్కారం ఉందని... మన గెలాక్సీలో 100 బిలియన్ గ్రహాలు ఉన్నాయి. అన్నింటిపై పరిశోధనలు జరపకుండా ఈ నిర్ణయానికి రావడం తొందరపాటేనని... ఇప్పటి వరకు జరిపిన పరిశోధనలతో పాటు... భవిష్యత్తులో జరిగే పరిశోధనల్లో ఏలియన్లు, ఇతర జీవాల ఉనికి ఉండొచ్చనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.శాస్త్రవేత్తలు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటే ఏలియన్లు, లేదా ఏలియన్లను పోలే ఆకారాలు, ఇతర జీవాలు గెలాక్సీలో ఉన్నాయనే అనుమానాలకు బలం చేకూరుతోంది. అయితే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... శాస్త్రవేత్తలు ఏలియన్ల ఉనికి ఉందని నమ్ముతున్నారు. కానీ ఖగోళ శాస్త్రవేత్తలు ఆ వార్తను ఖండిస్తున్నారు. మరి కొందరు శాస్ర్తవేత్తలు మాత్రం మరో విధంగా కూడా చెబుతున్నారు. ఏలియన్స్ ఉన్నాయా లేదా అని ఓ చర్చ సాగుతుండగానే... వారి స్వభావం... వారి తీరుతెన్నుల గురించి కూడా కొందర శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో వాటి ఉనికి స్పష్టంగా ఉన్న సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు అస్పష్టమైన హ్యూమనాయిడ్లు సుడిగుండంగా మారి... పొగమంచుతో కూడిన నిల్చున్నాయని... అవి వాటి వెనుక నుండి ప్రకాశవంతమైన కాంతితో చలనంలోకి వస్తాయని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇక విశ్వంలో ఉన్న ఏలియన్స్ ఆకారం ఎలా ఉంటుంది... వారి భాష, వారి జీవన శైలి ఎలా ఉంటుందనే అంశాలపై కూడా కొందరు శాస్త్రవేత్తలు చర్చలు ప్రారంభించారు. వారి తెలివి తేటలు ఎలా ఉంటాయి...? వారు వాడే టెక్నాలజీ మనకన్నా అడ్వాన్సుగా ఉంటుందా... లేక సాంకేతికతకు దూరం మన రాతియుగం లాంటి జీవాలుంటాయా అనే క్యూరియాసిటీ కూడా సృష్టిస్తున్నారు. అయితే ఇవన్నీ ఊహగానాలే తప్ప.... విశ్వ ప్రపంచంలో ఇప్పటి వరకు ఏలియన్ల ఉనికి మాత్రం దొరకలేదు. ఏలియన్లపై వచ్చిన సినిమాల ఆధారంగా ఏలియన్ల ఆకారం, తెలివితేటలు, సాంకేతికత, స్పేష్ షటిల్ సఫవగురించి చర్చలు సాగుతూనే ఉన్నాయి. విస్తృత విశ్వం అంతటా నిజంగా భారీ సంఖ్యలో జీవాలు ఉంటే... నివాసయోగ్యమైన వాతావరణాలు ఎందుకు లేవు. అలాంటి ప్రాంతాలుంటే అక్కడి జీవాలపై పరిశోధనలెందుకు జరగడం లేదు.ఏలియన్లు ఉండి... ఒకవేళ ఏలియన్లు భూమ్మీదకు వచ్చేస్తే పరిస్థతి ఏంటీ? ఇప్పటికే సినిమాల ప్రభావం కారణంగా ఏలియన్ల ఆకారం, వాటి ఉనికి... వారి నడక, వారి భాష గురించి అవగాహన పొందినట్లు జనం భావిస్తున్నప్పటికీ... నిజంగా వాళ్లు వస్తేనే అసలు ఆకారాలు బయటపడతాయి. ఏలియన్లు వచ్చినప్పుడు జనంతో భయపడతారా...? లేక మనకన్నా వాళ్లే అడ్వాన్డ్గా ఉంటారా? వాళ్లతో మనం భయపడాల్సి వస్తుందా... ఇలాంటి ప్రశ్నలెన్నో సాధారణ మనుషులను మెదళ్లను తొలచి వేస్తున్నాయి. ఒకవేళ బలహీనులుంటే ... మనుషులు వాటికి హాని కలిగించే ఆలోచనలో మాత్రం ఉండరు. కానీ అవి దాడి చేస్తే మాత్రం ఎలా ఎదుర్కొనాలన్నదే ప్రధాన సమస్య. వారి భాషను డీకోట్cయడానికి ఎలాంటి టెక్నాలజీ వాడాలన్నదీ శాస్త్రవేత్తల ముందున్న సవాళ్లే. -
ఆపరేషన్ సిందూర్.. మరోసారి గెలికిన ట్రంప్
నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరాటం అంతా ఇంతా కాదు అందుకోసం ఏదైనా దేశాల మధ్య పంచాయితీ ఉంటే హడావుడిగా వెళ్లి అందులో వేలు పెట్టడం తర్వాత వారి మధ్య పంచాయితీ తానే తెగ్గొట్టానని క్రెడిట్ కొట్టేయడం ట్రంప్కు చాలా కామన్గా మారింది. ఇప్పటి వరకూ తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని అయినా తనను ఎవరూ గుర్తించరని తనకు శాంతి బహుమతి ఇవ్వరని ఆ మధ్య కస్సుబుస్సులాడారు.ఈ నేపథ్యంలో మరోసారి ఆపరేషన్ సిందూర్ వ్యవహారం తెరమీదకు తెచ్చారు. ఇండియా-పాక్ల మధ్య తానే ఆపానని వార్ ఆపకుంటే అధిక పన్నులు విధిస్తానని హెచ్చరించడంతో ఇరు దేశాలు శాంతించాయని తెలిపారు. ఇలా యుద్ధం ఆపాననే ప్రకటనను ట్రంప్ ఇదివరకూ దాదాపు 70 సార్లు పలికాడంటే ఈ విషయంలో ఆయన భారత్ను ఎంతగా రెచ్చగొట్టారో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా మరోసారి ఆపరేషన్ సిందూర్ అంశం తెరమీదకొచ్చింది.ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహూతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ ప్రస్థావన తెరమీదకు తెచ్చారు. "ఇదివరకూ నేను ఎనిమిది యుద్ధాలను నియంత్రించాను. ఇండియా, పాకిస్థాన్ విషయంలోనూ అంతే కానీ ఆ క్రెడిట్ నాకు ఇవ్వరూ. . నిజానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంలో ఆశ్చర్యపోయారు. తాను గత పదేళ్లుగా ప్రయత్నిస్తూన్నా ఇది చేయలేకపోయానన్నారు. నేను మాత్రం ఒక్కరోజులో ఈ యుద్ధాలను ఆపా" అని ట్రంప్ బింకాలు పలికారు.ట్రంప్ మధ్యవర్తిత్వం అంశంపై భారత్ సైతం ధీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్ అంశంలో ఏవరూ మధ్యవర్తిత్వం వహించలేదని భారత విదేశాంగ శాఖ పలుమార్లు ప్రకటించింది. భారత ప్రధాని మోదీ స్వయంగా పార్లమెంటులో ఈ అంశంపై ప్రకటన చేశారు. ఏ ప్రపంచ నాయకుడు ఆపరేషన్ సిందూర్ను ఆపమని భారత్ను అడగలేదని ఈ నిర్ణయం భారత్ స్వతంత్ర్యంగా తీసుకుందని స్పష్టం చేశారు. పహల్గామ్ అటాక్కు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలను వారి దేశంలోనే ధ్వంసం చేసింది. -
న్యూ ఇయర్ కోసం దుబాయ్ బంపర్ ఆఫర్
దుబాయ్ ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సెలబ్రేషన్స్కు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండడానికి 43గంటల పాటు నిరంతరంగా పబ్లిక్ ట్రాన్స్ఫోర్ట్ అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా వాహనాల పార్కింగ్లకు జనవరి 1న ఎటువంటి రుసుము తీసుకోనున్నట్లు తెలిపింది.సాధారణ సమయాల్లోనే దుబాయ్కి టూరిస్టుల రద్దీ అధికంగా ఉంటుంది. ఇక న్యుఇయర్ వేడుకల సమయంలో ఉండే రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రేటీలు, టూరిస్టులు, కార్పోరేట్ సంస్థలకు చెందిన వారు ఇయర్ ఎండ్ ఈవెంట్ను సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కడికి వస్తుంటారు. ఈ రద్దీ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం టూరిస్టుల కోసం మంచి ఆఫర్ ప్రకటించింది.డిసెంబర్ 31 వేడుకల దృష్యా బుధవారం ఉదయం 5గంటలకు ప్రారంభమయ్యే అక్కడి మెట్రో సర్వీస్ జనవరి 1 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకూ నిరంతరాయంగా నడవనున్నట్లు తెలిపింది. అదే విధంగా దుబాయ్ ట్రామ్ ఉదయం 6గంటల నుండి జనవరి 1 ఉదయం ఒంటిగంట వరకూ నడపనున్నట్లు తెలిపింది. వీటితో పాటు జనవరి1న బహుళ అంతస్థుల భవనాలు, ఆల్ఖైల్ గేట్ పార్కింగ్ మినహా మిగతా అన్ని ప్రాంతాలలో పార్కింగ్ సేవలు పూర్తిగా ఉచితం అని ప్రకటించింది. న్యూ ఇయర్ వేడుకలకు టూరిస్టుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. -
లాంగ్ రేంజ్ క్షిపణి పరీక్షలతో కిమ్ జాంగ్ బిజీబిజీ..!
ఉత్తర కొరియా యుద్ధానికి సిద్ధమవుతుందా? అంటే అవుననే సంకేతాలను ఆ దేశం పంపిస్తోంది. ఇప్పటికే 2 లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి పరీక్షలు జరపడంతో నార్త్ కొరియాలోనే కాదు.. దక్షిణ కొరియాతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ ఉద్రిక్తతను పెంచుతోంది. డిసెంబర్ 28న పసుపు సముద్రంలో జరిగిన క్రూయిజ్ క్షిపణుల ప్రయోగాన్ని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ స్వయంగా పరిశీలించడం అనుమానాలను బల పరుస్తోంది. నార్త్ కొరియా చుట్టూ అమెరికా బలగాలతో పాటు సౌత్ కొరియాకు చెందిన బలగాలు ఇప్పటికే మోహరించి ఉండటంతో కిమ్ ఈ పరీక్షలు నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.2 గంటల పాటు సాగిన క్షిపణుల ప్రయోగాన్ని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ పరిశీలించడమే కాకుండా వాటి లక్ష్యాన్ని అవి ఛేదించగలుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను అధికారులు వెల్లడించారు. క్షిపణుల ప్రయోగానికి సంబంధించిన వీడియోలు బయటకు రాగానే దక్షిణ కొరియా అప్రమత్తమైంది. తమ జోలికి వస్తే అమెరికాతో కలిసి ఎదురొడ్డుతామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ విషయంలో జాగ్రత్త పడిన కిమ్ మాత్రం... యుద్ధానికోసం కాదని... క్షిపణుల పనితీరును పరిశీలించడం, దేశ ఆత్మరక్షణ నిమిత్తమే ఈ పరీక్షలు జరిగాయని వెల్లడించడం గమనార్హం.అయినా అప్రమత్తమైన దక్షిణ కొరియా... కొరియా చుట్టూ మోహరించి ఉండటాన్ని గమనిస్తే ఏ క్షణమైన యుద్ధానికి సై అనే ప్రమాదం లేకపోలేదు. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం... లక్ష్యాన్ని ఛేదించడానికి ముందు క్షిపణులు 2 గంటల పాటు ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయని... ఈ మేరకు న్యూస్ ఏజెన్సీ వీడియోను కూడా విడుదల చేసింది. అందులో క్షిపణి ప్రయోగం నుండి హిట్ టార్గెట్ వరకు వీడియోలను ఈ క్షిపణి పరీక్షపై కిమ్ జాంగ్ ఉన్ తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తర కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కూడా క్షిపణి పరీక్షను ధృవీకరించారు.నార్త్ కొరియా చర్యలతో మరో వైపు దక్షిణ కొరియా కూడా తన సన్నాహాలను మరింత వేగవంతం చేసింది. గత ఆదివారం ఉదయం 8 గంటలకు ప్యోంగ్యాంగ్ సమీపంలోని సునాన్ ప్రాంతంలో అనేక క్రూయిజ్ క్షిపణులను నార్త్ కొరియా ప్రయోగించినట్లు సౌత్ కొరియా అధికారులు గమనించినట్లు చెప్పారు. ఒకవేళ నార్త్ కొరియా తోకాడిస్తై అమెరికాతో కలిసి తాము కూడా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని సైనిక సన్నాహాలు చేశామని తెలిపింది. ఉత్తర కొరియా చేసే ఎలాంటి చర్యనైనా తిప్పి కొడతామని కూడా సౌత్ కొరియా హెచ్చరింది. ఉత్తర కొరియా అణ్వాయుధంతో నడిచే జలాంతర్గామిని నిర్మించే దిశగా ముందుకు కదులుతున్నట్లు కూడా అంతకుముందు వెల్లడించింది. -
ఖలీదా జియా అంత్యక్రియలకు హాజరు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియలకు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ హాజరుకానున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 31న ఢాకాలో జరిగే ఖలీదా అంత్యక్రియలలో పాల్గొనడానికి జయశంకర్ బంగ్లాదేశ్ వెళ్లనున్నట్లు తెలిపింది.బంగ్లాదేశ్ తొలిమహిళా ప్రధానిగా సేవలందించిన ఖలీదా జియా ఈరోజు ఉదయం ఎవర్ కేర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. 80 ఏళ్ల వయసున్న ఖలీదా జియా నవంబర్ 23న ఊపిరితిత్తుల ఇన్ఫ్క్షన్తో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆమె మృతిపట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ అభివృద్ధితో పాటు భారత్తో సంబంధాలు మెరుగుపడడం కోసం ఆమె చేసిన కృషి ఎల్లకాలం గుర్తుండిపోతుందని మోదీ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మెరుగ్గా లేవు. బంగ్లాలో రాజకీయ అస్థితరతతో ఈ ఏడాది ప్రారంభం నుంచే హిందువులపై దాడులు తీవ్రతరమయ్యాయి. వారం రోజుల వ్యవధిలో దాదాపు ముగ్గురు హిందూ యువకులను అక్కడి మతఛాందస వాదులు కొట్టిచంపారు. ఈ నేపథ్యంలో భారత్ సైతం ఈ ఘటనలపై సీరియస్ అయ్యింది. అయితే ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి బంగ్లాదేశ్ వెళ్లడం చర్చనీయాంశమయ్యింది.ఖలీదా జియా ప్రస్థానం1945లో అవిభక్త భారత్లోని పశ్చిమ బెంగాల్లో ఖలీదా జియా జన్మించింది. ఆమె వివాహం జియావుర్ రహమాన్తో (బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షుడు) జరిగింది. రహమాన్ మరణానంతరం సుధీర్ఘ కాలం పాటు బీఎన్పీ అధ్యక్షురాలిగా సేవలంధించింది. 1991లో బంగ్లాదేశ్ ప్రధానిగా తొలిసారి ఖలీదా జియా బాధ్యతలు చేపట్టింది. ఆ దేశంలో మహిళ ప్రధాని పదవి చేపట్టడం అదే మెుదలు. కాగా బీఎన్పీ పార్టీ భారత్కు వ్యతిరేకమని వాదనలుండగా ఖలీదా జియా వాటిని పలుమార్లు ఖండించింది. -
రష్యా నియంత్రణలో 334 గ్రామాలు : పుతిన్ కీలక ప్రకటన
ఉక్రెయిన్తో కొనసాగుతున్నయుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్లో మరిన్ని ప్రాంతాలను ఆక్రమించుకోవడం ద్వారా రష్యా ముందుకు సాగుతోందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.డోనెట్స్స్కీ, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యాలో కలుపుకుంటామని పుతిన్ వెల్లడించారు. ఈ ప్రాంతాలన్నింటినీ దశలవారీగా స్వాధీనం చేసుకుంటున్నామని పుతిన్ పేర్కొన్నారు.తూర్పు ఉక్రెయిన్లోని డొనెట్స్కీ ప్రాంతంలోని డిబ్రోవా గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. డొనెట్స్క్లోని స్లోవియన్స్కీలో రష్యా జరిపిన షెల్లింగ్లో ఒకరు మరణించగా, మరో 5 మంది గాయపడ్డారు. జపోరిజియాలో కూడా రష్యా జరిపిన దాడిలో ఒకరు మరణించారు . ఈ ఏడాది ఉక్రెయిన్లో 6,460 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని రష్యా స్వాధీనం చేసుకున్నట్లు జనరల్ వాలెరీ గెరాసిమోవ్ తెలిపారు. ఇందులో 334 గ్రామాలు కూడా ఉన్నాయన్నారు. ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలు విఫలమైన కొద్దిసేపటికే పుతిన్ సైనిక యూనిఫాంలో కమాండర్ల సమావేశానికి హాజరయ్యారు. ఇదీ చదవండి: త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్ఆర్ఐ మృతిజెలెన్స్కీతో చర్చల తర్వాత, ట్రంప్ మాట్లాడుతూ శాంతి ఒప్పందం కుదిరిందని, అయితే ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉన్న జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం భవిష్యత్తు, డోనెట్స్కి, మరియు లుహాన్స్కీలను కలిగి ఉన్న డాన్బాస్ ప్రాంతాన్ని అప్పగించడం అనేవి పరిష్కారం కాని రెండు సమస్యలు అని జెలెన్స్కీ అన్నారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు శాంతి ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చారు. దానికోసం కనీసం 60 రోజుల కాల్పుల విరమణ అవసరం. ప్రస్తుతం డాన్బాస్లో కొంత భాగం మాత్రమే ఉక్రెయిన్ చేతిలో ఉంది. ఉక్రెయిన్ దళాలు అక్కడి నుండి వెనక్కి తగ్గాలని లేదా మరిన్ని నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యా ప్రభుత్వ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ హెచ్చరించారు.ఇదీ చదవండి: త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్ఆర్ఐ మృతి మరోవైపు ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు శాంతి చర్చలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడులు జరిగినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. డిసెంబర్ 28 నుంచి 29 మధ్య పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను కానీ ఉక్రెయిన్ మాత్రం ఖండించింది.ఇదీ చదవండి : ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం : త్వరలోనే శుభకార్యం -
రోజుకు 25 గంటలు..ఎందుకో తెలుసా?
రోజుకు ఎన్ని గంటలు అనగానే ఠక్కున వచ్చే సమాధానం 24 గంటలు. అయితే ఈ రోజుకు 24 గంటల రోజు నెమ్మదిగా మారుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ మార్పు నిజం. కచ్చితంగా.. ఇప్పటికే జరుగుతోంది. ఈ మార్పు చాలా క్రమంగా జరుగుతుందని పరిశోధకులు నొక్కి చెబుతున్నారు. భూమి భ్రమణం నెమ్మదిగా నెమ్మదిస్తోందని శాస్త్రవేత్తల మాట. అంటే రోజు ఎక్కువుతోంది. కాలం, జీవితం , గ్రహం నిశ్శబ్దంగా ఎలా పరిణామం చెందుతాయనే దానిపై ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఆగండి ఆగండి..అయితే ఇప్పటికిప్పుడు దైనందిన జీవితానికి తక్షణ అంతరాయం లేదంటున్నారు. ఈ మార్పుకు మిలియన్ల సంవత్సరాలు పడుతుంది, అసలు ఏం జరుగుతోంది. దేని ఆధారంగా సైంటిస్టులు ఈ విషయాన్ని అంచనా వేస్తున్నారు.భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు సమయం పడుతుంది. సాధారణంగా భూమి తన అక్షంపై తిరిగే వేగాన్ని ఆధారంగా చేసుకుని ఒక రోజు ఎంత సమయం అనేది నిర్ణయిస్తారు. ఇపుడు ఈ వేగం క్రమంగా తగ్గుతోంది. ఫలితంగా రోజులకు 24 గంటలకు బదులు 25 గంటలు పడుతుందంటున్నారు. ఇది ఆ రోజు రావడానికి ఇంకా చాలా సమయం ఉందని చెబుతున్నారు. దాదాపు 20 కోట్ల సంవత్సరాలు పట్టే అవకాశం ఉందట.భూమి భ్రమణం నెమ్మదిస్తోందిభూమి భ్రమణం క్రమంగా వేగాన్ని తగ్గిస్తోందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ మందగమనంతో మానవులపై చాలా నెమ్మదిగా ఉంటుందనీ, ప్రస్తుత గడియారాలు , క్యాలెండర్లు పూర్తిగా ప్రభావితం కావు. ఈ ధోరణి వందల మిలియన్ల వరకు విస్తరించి ఉందని పరిశోధకులు అంటున్నారు.ఈ ప్రక్రియ ఇదే విధంగా కొనసాగితే, భవిష్యత్తులో ఒక రోజు వ్యవధి 25 గంటలకు చేరుకునే అవకాశం ఉందని జర్మనీలోని మ్యూనిక్ టెక్నికల్ యూనివర్సిటీతో పాటు అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్శిటీ పరిశోధకులువెల్లడించారు. ఈ మార్పుకు ప్రధాన కారణం భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడు ప్రతి ఏడాది సుమారు 3.8 సెంటీమీటర్ల మేర భూమి నుంచి క్రమంగా దూరమవుతున్నాడు భూ భ్రమణం దాదాపు 1.7 మిల్లీసెకన్ల పాటు ఉంటుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఈ మార్పు దాదాపు ప్రతి వంద సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. చంద్రుడి వల్ల కలిగే టైడల్ ఘర్షణ. చంద్రుని గురుత్వాకర్షణ భూమి, మహాసముద్రాలను నిరంతరం ఆకర్షిస్తుంది. దీంతో చంద్రుడిని దూరంగా నెట్టివేస్తూ భూమి నెమ్మదిస్తుంది. కాలక్రమేణా, ఈ శక్తులు కొలవగల ప్రభావాలను కూడగట్టుకుంటాయి. అణు గడియారాలను ఉపయోగించి ఈ మార్పులను శాస్త్రవేత్తలు ట్రాక్ చేస్తారు. భూమి భ్రమణ స్థిరమైన వేగంతో నెమ్మదించదు. స్వల్పకాలిక మార్పులు భ్రమణాన్ని కొద్దిగా వేగవంతం చేస్తాయి లేదా నెమ్మదిస్తాయి. వాతావరణ పీడన మార్పులు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యరాశి పంపిణీని ప్రభావితం చేస్తాయి. కరిగే హిమానీనదాలు భూమి, మహాసముద్రాల మధ్య బరువును కదిలిస్తాయి. ఈ పునఃపంపిణీలు తాత్కాలికంగా భ్రమణ వేగాన్ని సూక్ష్మంగా ప్రభావితం చేస్తాయి.శాస్త్రవేత్తలు 25 గంటల రోజు సుదూరమని అంచనా వేస్తున్నారు. ఈ మార్పులను దాదాపు 200 మిలియన్ (20 కోట్ల )సంవత్సరాలు పట్టవచ్చు. అంతేకాదు సుమారు 140 కోట్ల సంవత్సరాల క్రితం చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉన్న సమయంలో భూ భ్రమణ వేగంఎక్కువగా ఉండేదని, అప్పట్లో ఒక రోజు పూర్తవడానికి కేవలం 18 గంటలే పట్టేదట. డైనోసార్ కాలంలో, రోజులు దాదాపు 23 గంటలు ఉండేవి. భూమిపై జీవితం క్రమంగా ఆ మార్పులకు అనుగుణంగా మారింది. పరిణామం తరతరాలుగా జీవ లయలను నెమ్మదిగా సర్దుబాటు చేసుకుంటుంది.ప్రస్తుతానికి, భూమి మునుపటిలాగే తిరుగుతోంది. అయితే నెమ్మదించే భ్రమణం శాస్త్రీయంగా మనోహరంగా ఉంది. ఈ పరివర్తన నెమ్మదిగా ఉంటుంది, విపత్తు కాదు,ఎలాంటి ఆందోళన అవసరం శాస్త్రవేత్తలు నొక్కి చెప్పారు.త ప్పుదారి పట్టించే వైరల్ వాదనలకు వ్యతిరేకంగా నిపుణులు జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. సహస్రాబ్దాలలో కొలిచిన మార్పును శాస్త్రం సూచిస్తుంది. -
యెమెన్లోని ముకల్లాపై సౌదీ వైమానిక దాడులు
సనా: యెమెన్లోని ఓడరేవు నగరం ముకల్లాపై సౌదీ అరేబియా వైమానిక దాడులు జరిపింది. మంగళవారం జరిపిన ఈ దాడులపై గల్ఫ్ వార్తాసంస్థలు కథనాలను ప్రచురించాయి. యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్(యూఏఈ)కి వ్యతిరేకంగా వేర్పాటువాద సమూహానికి ఆయుధాలు, సైనిక వాహనాలను అందజేస్తున్నారనే ఆరోపణలపై ఈ దాడులు జరిపినట్లు సౌదీ అరేబియా అధికారిక వార్తాసంస్థ స్పష్టం చేసింది. వేర్పాటు వాదుల చేతికి ఆయుధాలు చిక్కడం ఈ ప్రాంతంలో శాంతికి ముప్పుగా పేర్కొంది. అందుకే వైమానిక దళం నిర్ణీత లక్ష్యాలపై దాడులు జరిపిందని, పౌరులకు ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకుందని వెల్లడించింది.ఈ దాడులపై అటు యెమెన్ సీరియస్గా స్పందించింది. యూఏఈతో ఉన్న రక్షణ ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసింది. తమ సార్వభౌమాధికారం, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యెమెన్ కౌన్సిల్ అధిపతి రషాద్ అల్-అలీమి ప్రకటించారు. ఈ మేరకు ఆయన జాతినుద్దేశించి టీవీలో మాట్లాడారు. యెమెన్లో ఉన్న యూఏఈ దళాలు(అల్-అలీమీ) తమ భూభాగాన్ని 24 గంటల్లో విడిచి వెళ్లాలని ఆదేశించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మూడ్రోజులపాటు నోఫ్లై జోన్గా ప్రకటించారు. 90 రోజుల అత్యయిక స్థితిని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
బంగ్లాదేశ్లో మరో మైనారిటీ హిందువు హత్య
ఢాకా: బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువుల హత్యలు తీవ్ర ఆందోళన పుట్టిస్తున్నాయి. ఇటీవల ఐదు హిందూ కుటుంబాల ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టడం ఆలయాలపై దాడులు, ఇళ్ల ధ్వంసం, మతపరమైన వేధింపులు కలవరపెడుతోంది. తాజాగా బంగ్లాదేశ్లో మరో మైనారిటీ హిందువు హత్యకు గురయ్యాడు.మైమెన్సింగ్లోని భలుకాలో బజేంద్ర బిశ్వాస్ (40) అనే అన్సార్ (రక్షణ కమిటీ) సభ్యుడిని సహోద్యోగి కాల్చి చంపాడు.ఈ సంఘటనలో హంతకుడు అన్సార్ సభ్యుడు నోమన్ మియాను అరెస్టు చేశారు. మరోవైపు ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఆ సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 20 మంది అన్సార్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. బజేంద్ర బిస్వాస్ ,నోమన్ మియా ఆవరణలో కలిసి కూర్చున్నప్పుడు నోమన్ వద్ద ఉన్న తుపాకీ పేలిందనే కథనాలు వినిపిస్తున్నాయి. బుల్లెట్ బిస్వాస్ ఎడమ తొడలో దూసుకుపోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఫ్యాక్టరీ సిబ్బంది బజేంద్ర బిస్వాస్ను భాలుకా ఉపజిల్లా హెల్త్ కాంప్లెక్స్కు తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. భాలుకా మోడల్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్-ఇన్చార్జ్ జాహిదుల్ ఇస్లాం ఈ సంఘటనను ధృవీకరించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మైమెన్సింగ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ మార్చురీకి పంపారు.కాగా బంగ్లాదేశ్ ఒక తీవ్రవాద రాజ్యంగా మారుతోంది. ఈ హత్యాకాండపై సర్వత్రా ఆందోళన వ్యకమవుతోంది. బంగ్లాదేశ్లో హిందువులు ఎదుర్కొంటున్న అభద్రతకు ఇది నిదర్శమంటూ ఆగ్రహం వెల్లువెత్తుతోంది.ఇదీ చదవండి: త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్ఆర్ఐ మృతి -
ఆయుధంగా నదీ జలాలు!
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు నదీ జలాలను ఆయుధంగా మార్చుకోవడం వల్ల మరింతగా పెచ్చరిల్లు తాయని పాకిస్తాన్ సెనేటర్ షెర్రీ రెహ్మాన్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సెనేటర్ అయిన షెర్రీ రెహ్మాన్.. చీనాబ్ నదిపై జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు భారత ప్రభుత్వం పయ్రత్నాలు ప్రారంభించిన వేళ పైవిధంగా వ్యాఖ్యానించారు. భారత్ నిర్ణయం సింధూ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు.వాతావరణ మార్పుల కారణంగా అత్యంత ప్రభావితమవుతున్న ఈ ప్రాంతంలో, నీటిని ఒక ఆయుధంగా (water weaponisation) మార్చుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదు, ఆమోదయోగ్యం కాదు. ఇప్పటికే శత్రుత్వం, అపనమ్మకంతో నిండిపోయి ఉన్న రెండు దేశాల సంబంధాల్లో ఇది ఉద్రిక్తతలను మరింతగా పెంచుతుంది’ అని షెర్రీ రెహ్మాన్ (Sherry Rehman) సోమవారం ఎక్స్లో పేర్కొన్నారు.కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల పైశాచిక దాడి నేపథ్యంలో సింధూ నదీ జలాల ఒప్పందం (Indus Waters Treaty) నుంచి వైదొలగుతున్నట్లు భారత ప్రభుత్వం ఏప్రిల్ 22న ప్రకటించడం తెల్సిందే. కశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో చీనాబ్ నదిపై 260 మెగావాట్ల దుల్హస్తి స్టేజీ–2 జల విద్యుత్ ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. చదవండి: లాహోర్ లేడీ సింగానికి తప్పని ట్రోలింగ్ -
భారతీయులు సహ వలసదారుల్లో సరికొత్త భయం!
H-1B వీసాలపై అమెరికాకు వెళ్లిన భారతీయులు గుబులు.. గుబులుగా కనిపిస్తారు. ఇప్పటికే కఠినమైన నియమాలు అమలు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. ఇంకా ఏం మెలికలు పెడుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో భారతీయులే కాదు.. విదేశీ వలసదారులు సైతం ఇమిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడటానికి ఇష్టపడడం లేదు. ఎందుకైనా మంచిదని టోటల్గా ప్రయాణాలు రద్దు చేసుకొని ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం వలస నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేస్తుండటంతో.. వలసదారులు దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణాలకు భయపడుతున్నారట. కైసర్ ఫ్యామిలీ ఫౌండేషన్ (KFF)-న్యూయార్క్ టైమ్స్ సంయుక్తంగా నిర్వహించిన 2025 సర్వేలో ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం అమెరికాలోని వలసదారులలో 27% మంది జర్నీలు చేయకుండా జాగ్రత్త పడుతున్నారన్నది ఈ సర్వే సారాంశం. ఈ క్రమంలో.. చట్టబద్ధంగా ఉన్నవారు కూడా భయాందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. సరైన H-1B వీసాలు కలిగినవారు (32 శాతం), పౌరసత్వం పొందినవారు (15 శాతం) కూడా ప్రయాణాలకు వెనుకడుగు వేస్తున్నారు. ఇక.. అక్రమ వలసదారులలో ఈ సంఖ్య 63% గా ఉంది. ఇటు దేశీయంగానూ ప్రయాణాలపై వలసదారుల్లో భయం నెలకొంది. ఇందుకు కారణం లేకపోలేదు.. ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (TSA) దేశీయ విమాన ప్రయాణికుల వివరాలను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE)కు షేర్ చేస్తోంది. దీంతో వలస దారులు తమపై దృష్టి పడకుండా ఉండేందుకు ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారని సర్వేలో వెల్లడైంది. టెక్సాస్లో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణురాలు శిఖా ఎస్.. తన తల్లిదండ్రులను చూసేందుకు భారత్కి రావాలనుకుంటోంది. అయితే.. H-1B వీసా దారులపై పెరుగుతున్న పరిశీలన, ఆలస్యమవుతున్న ఇంటర్వ్యూల కారణంగా తన ప్రయాణాన్ని అర్ధాంతరంగా వాయిదా వేసుకుంది.ఈ ఏడాది జూలైలో H-1B వీసా రీన్యువల్స్ను స్వదేశంలోనే చేయాలని నిబంధన విధించగా.. సెప్టెంబర్లో కొత్త H-1B దరఖాస్తులపై 100,000 డాలర్ల ఫీజు విధించారు. అటుపై ట్రంప్ ప్రభుత్వం డిసెంబర్లో సోషల్ మీడియా స్క్రీనింగ్ను కూడా కఠినతరం చేసింది.ఇక.. వీసా ఇంటర్వ్యూలు 2026–2027 వరకు వాయిదా పడటంతో.. వందలాది మంది ఉద్యోగాలు, కుటుంబాల నుండి దూరమయ్యారు. దీనితో మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు, ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు వలసదారులు అత్యవసర పరిస్థితులు తప్ప విదేశీ ప్రయాణం చేయవద్దని సూచిస్తోంది. ఈ మొత్తం పరిణామాలన్నీ అమెరికాలో వలసదారులలో భయాన్ని పెంచి.. వారి రోజువారీ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఉద్యోగాలు, కుటుంబాలు, చట్టబద్ధ స్థితి కాపాడుకోవడానికి, వలసదారులు ప్రయాణం పూర్తిగా నివారించడం సురక్షిత మార్గంగా భావిస్తున్నారని సర్వేలతో స్పష్టమవుతోంది. -
‘స్వయంగా పుతినే చెప్పారు’.. డ్రోన్ ఎటాక్పై ట్రంప్ ఆగ్రహం
అమెరికా దౌత్యంతో ఉక్రెయిన్ సంక్షోభం ఓ కొలిక్కి వస్తుందని భావించేలోపు ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి జరగిందని రష్యా ప్రకటించింది. పైగా ఇది ఉక్రెయిన్ పనేనంటూ ఆరోపణలు గుప్పించింది. అయితే ఈ ఆరోపణలను కీవ్ వర్గాలు తోసిపుచ్చాయి. మరోవైపు ఈ దాడిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫ్లోరిడాలోని తన మార్ ఎ లాగో రిసార్ట్లో ట్రంప్ సమావేశం అయ్యారు. ఆ భేటీకి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయం గురించి నాకు ఎవరు సమాచారం ఇచ్చారో తెలుసా?. స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్. ఆయన నాకు ఫోన్ చేసి దాడి జరిగిందని అన్నారు. ఆయనపై దాడి జరిగిందని. ఇది ఏమాత్రం మంచిది కాదు. నేను చాలా కోపంగా ఉన్నాను అని ట్రంప్ అన్నారు. అయితే దాడిపై కూడా ట్రంప్ సందేహాలు వ్యక్తం చేశారు. డ్రోన్ దాడి జరగకపోయి ఉండొచ్చని.. అందుకు ఆస్కారం ఉందని కూడా వ్యాఖ్యానించారు. ‘‘ఎవరైనా అవమానకరంగా ప్రవర్తించడం ఒక విషయం. కానీ ఆయన ఇంటిపై దాడి చేయడం మరో విషయం. ఇప్పుడే అలాంటి పనులు చేయడానికి సరైన సమయం కాదు’’ అంటూ వ్యాఖ్యానించారాయన. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి ప్రయత్నించిందని రష్యా సోమవారం ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కల్పిత కథనాలేనని, రష్యా మరిన్ని దాడులకు కారణాలు చూపించుకోవడానికి, శాంతి ప్రయత్నాలను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నమని ఉక్రెయిన్ పేర్కొంది. ఈ విషయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ.. ఉత్తర రష్యాలోని నోవ్గొరోడ్ ప్రాంతంలో ఉన్న అధ్యక్ష నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ రాత్రిపూట డ్రోన్ దాడి చేసిందని అన్నారు. అయితే రష్యా వాయుసేన రక్షణ వ్యవస్థలు 91 దీర్ఘశ్రేణి డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేశాయని, ఎలాంటి ప్రాణ నష్టం/ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు. రష్యా దీనికి తప్పకుండా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. ప్రతీకార దాడుల కోసం ఇప్పటికే లక్ష్యాలను గుర్తించామని చెప్పారు. అలాగే..ఈ పరిణామంతో శాంతి చర్చలపై రష్యా తన వైఖరిని పునఃపరిశీలించాల్సి వస్తుందని తెలిపారు. అంతమాత్రాన ఉక్రెయిన్తో జరుగుతున్న శాంతి చర్చల నుంచి మాత్రం తప్పుకోబోమని స్పష్టం చేశారు. ఆ సమయంలో పుతిన్ ఆ నివాసంలో ఉన్నారా లేదా అనే విషయాన్ని రష్యా స్పష్టంగా చెప్పలేదు. డోల్గియే బొరోడీ అనే ఆ నివాసాన్ని గతంలో జోసెఫ్ స్టాలిన్, నికితా ఖ్రుష్చెవ్, బోరిస్ యెల్త్సిన్, పుతిన్ వంటి సోవియట్, రష్యా నేతలు ఉపయోగించారు.రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పూర్తిగా తిరస్కరించారు. ఇది “మరో అబద్ధాల పరంపర” అని వ్యాఖ్యానించారు. దౌత్య ప్రయత్నాలను భగ్నం చేయడానికి, కీవ్పై కొత్త దాడులు చేయడానికే రష్యా ఈ కథలు సృష్టిస్తోందని అన్నారు. సున్నితమైన దౌత్య చర్చల సమయంలో రష్యా ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తత పెంచుతోందని ఆరోపించారు. ఉక్రెయిన్–అమెరికా మధ్య జరుగుతున్న శాంతి చర్చలను దెబ్బతీయడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారని జెలెన్స్కీ చెప్పారు. రష్యా బెదిరింపులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించాలని కోరారు. ఈ క్రమంలో ట్రంప్ తాజాగా స్పందించారు. -
Bangladesh: మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధ్యక్షురాలు ఖలీదా జియా కన్నుమూశారు. 80 ఏళ్ల వయసున్న ఆమె ఢాకాలోని ఎవర్కేర్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తనువు చాలించారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన ఆమె నవంబర్ 23న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరారు.Reuters reports, Bangladesh's first female Prime Minister, Khaleda Zia, dies at 80.— ANI (@ANI) December 30, 2025గత కొంతకాలంగా ఖలీదా జియా గుండె, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన ఆమె దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆమె దీర్ఘకాలంగా మధుమేహం, ఆర్థరైటిస్, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. తాజాగా సోకిన ఛాతీ ఇన్ఫెక్షన్ ఆమె శ్వాసక్రియపై తీవ్ర ప్రభావం చూపింది. వైద్యుల నివేదిక ప్రకారం ఆమె గుండె పనితీరు కూడా మందగించింది. దీంతో ఆమెను అత్యవసరంగా కోరోనరీ కేర్ యూనిట్ (ససీయూ) నుండి వెంటిలేటర్కు తరలించారు. ఆమె వ్యక్తిగత వైద్య బృందం, అంతర్జాతీయ నిపుణులు కలిసి ఆమెకు మెరుగైన వైద్యం అందించారు.ఖలీదా జియా మృతిపై బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఆమె మంగళవారం ఉదయం 6 గంటలకు తుది శ్వాస విడిచినట్లు తెలిపింది. ‘బీఎన్పీ చైర్పర్సన్, మాజీ ప్రధాని, జాతీయ నాయకురాలు బేగం ఖలీదా జియా ఈరోజు ఉదయం 6:00 గంటలకు ప్రార్థనల తర్వాత మరణించారు’ అని పార్టీ ఆ ప్రకటనలో తెలిపింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని పేర్కొంది. బీఎన్పీ మీడియా సెల్ కూడా ఫేస్బుక్లో ‘మా ప్రియమైన జాతీయ నాయకురాలు బేగం ఖలీదా జియా ఇప్పుడు మాతో లేరు. ఆమె ఈరోజు ఉదయం 6 గంటలకు మరణించారు’ అని పోస్ట్ చేసింది.ఖలీదా జియా ప్రస్థానం.. భారత్తో బంధంబంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని ఖలీదా జియా.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)అధ్యక్షురాలిగా సుదీర్ఘ కాలం సేవలందించారు. 1945లో అవిభక్త భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లాలో జన్మించిన ఖలీదా జియాకు భారత్తో సంబంధం ఉంది. ఆమె భర్త, దివంగత అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన ఆమె, దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పలు పోరాటాలు చేశారు.ఖలీదా జియా పదవీకాలంలో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఆమె పార్టీ బీఎన్పీని భారత్ వ్యతిరేకిగా కొందరు పరిగణించినప్పటికీ, ఆమె ఎప్పుడూ ఆ వాదనలను ఖండించారు. ఇటీవల ఆమె భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భంలో, తమ పార్టీ భారత్కు వ్యతిరేకం కాదని, కేవలం వ్యూహాత్మక ప్రయోజనాల కోసమే ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. జల్పైగురిలో జన్మించిన ఆమెకు భారతీయ సంస్కృతి, ప్రాంతీయ సంబంధాలపై ప్రత్యేక గౌరవం ఉంది. 1991లో మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆమె, ఆ తర్వాత 2001లో తిరిగి అధికారంలోకి వచ్చారు. అయితే, గత కొన్ని దశాబ్దాలుగా ఆమె పలు అవినీతి ఆరోపణలు, జైలు శిక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవి భారత్తో దౌత్య సంబంధాలపై కూడా ప్రభావం చూపాయి.ఇది కూడా చదవండి: Mumbai: పాదచారులపైకెక్కిన బస్సు.. నలుగురు మృతి -
తైవాన్ జలసంధిలో భారీగా విన్యాసాలు
బీజింగ్: తైవాన్ ఎప్పటికీ తమదేనంటున్న డ్రాగన్ దేశం చైనా తైవాన్ జలసంధిలో తాజాగా సైనిక విన్యాసాలకు తెరతీసింది. తైవాన్కు మద్దతుగా జపాన్ ప్రధానమంత్రి తకాయిచీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతోపాటు, తైవాన్కు అమెరికా ఇటీవల భారీగా ఆయుధాలను విక్రయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నడుమ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆరీ్మ(పీఎల్ఏ) ఈస్టర్న్ థియేటర్ కమాండ్ సోమవారం యుద్ధ విమానాలు, బాంబర్లు, డ్రోన్లతోపాటు లాంగ్ రేంజ్ క్షిపణులతో తైవాన్ జలసంధి మధ్యప్రాంతంలో సముద్రజలాలతోపాటు గగనతలంలోనూ విన్యాసాలు చేపట్టింది. ఈ విషయాన్ని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. కీలకమైన లక్ష్యాలను కచి్చతంగా ఛేదించేలా బలగాల సామర్థ్యాలకు పదును పెట్టడమే వీటి ఉద్దేశమని పేర్కొంది. చైనా చర్యలపై తైవాన్ వెంటనే స్పందించింది. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా ర్యాపిడ్ రెస్పాన్స్ విన్యాసాలను చేపట్టామని తైవాన్ రక్షణ మంత్రి తెలిపారు. చైనా మిలటరీ చర్యలను శాంతికి తీవ్ర విఘాతం కలిగించే దుందుడుకు వైఖరిగా ఆయన అభివరి్ణంచారు. తైవాన్ వైమానిక స్థావరంలో ల్యాండవుతున్న పలు మిరేజ్ 2000 యుద్ధ విమానాల వీడియోను విడుదల చేశారు. దీంతో, సోమవారం పీఎల్ఏ చేపట్టిన విన్యాసాలు ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచినట్లయిందని పరిశీలకులు అంటున్నారు. ఓ వైపు జపాన్.. మరో వైపు అమెరికా నవంబర్ 7న జపాన్ పార్లమెంటులో ప్రధానమంత్రి సనాయే తకాయిచీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తైవాన్లో తలెత్తే ఏదైనా అత్యవసర పరిస్థితి జపాన్ మనుగడకే ముప్పు కలిగించే పరిస్థితిగా మారవచ్చని, అటువంటప్పుడు అమెరికాకు మద్దతుగా జపాన్ సైన్యం రంగంలోకి దిగాల్సిన అవసరం రావచ్చని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తకాయిచీ తకైచి తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. చైనా విమా న వాహక నౌకలు, విమానాల సంచారంపై ఓ కన్నేసి ఉంచేందుకు ఒకినావాలోని సుదూర తూర్పు ద్వీపంలో మొబైల్ సర్వైలెన్స్ రాడార్ యూనిట్ను మోహరించాలనే జపాన్ నిర్ణయాన్ని కూడా చైనా విమర్శించింది. తైవాన్కు సమీపంలో జపాన్ లకి‡్ష్యత సైనిక మోహరింపులను బలోపేతం చేయడా న్ని, మధ్యశ్రేణి క్షిపణులను మోహరించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై చైనా తీవ్రంగా తప్పుబట్టింది. సైనిక శక్తిని బలోపేతం చేసుకునేందుకు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడు తోందని ఆరోపించింది. ఈ ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే ఈ నెల 18వ తేదీన తైవాన్కు రూ.లక్ష కోట్ల విలువైన అత్యాధునిక ఆయుధాలను విక్రయించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ ఆమోదం తెలిపిన పక్షంలో తైవాన్కు ఇచ్చే అతిపెద్ద ఆయుధ ప్యాకేజీ అవుతుంది. అమెరికా చర్య తైవాన్ స్వాతంత్య్రం కోరే, వేర్పాటువాద శక్తులకు ఊతమిచి్చనట్లేనని చైనా కన్నెర్ర చేసింది. తైవాన్ స్వాతంత్య్ర శక్తులు ఆ దీవిని పేలేందుకు సిద్ధంగా ఉన్న బాంబులాగా మారుస్తారంటూ వ్యాఖ్యానించింది. చైనా స్వాతంత్య్రాన్ని, సార్వ¿ౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడు కునేందుకు అవసరమైన అన్ని చర్యలను తప్పక తీసుకుంటుందని స్పష్టం చేసింది. 2022లో అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్కు మద్దతు తెలిపేందుకు వచి్చనప్పటి నుంచి డ్రాగన్ దేశం విన్యాసాల పేరుతో తైవాన్ను పలుమార్లు దిగ్బంధనం చేసింది. -
శాంతి ఒప్పందానికి చేరువలో...
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం త్వరలో ముగిసిపోతుందన్న సంకేతాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. శాంతి ఒప్పందం విషయంలో ఆ రెండు దేశాలు ఎన్నడూ లేనంత సమీపంలోకి వచ్చాయని తెలిపారు. ఆదివారం ఫ్లోరిడాలోని ఓ రిసార్ట్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఈ భేటీ జరగడం విశేషం. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా శాంతి ఒప్పందంతోపాటు యుద్ధం ముగించడంపైనే వారు చర్చించినట్లు తెలుస్తోంది. జెలెన్స్కీతో అద్భుతమైన సంభాషణ జరిగిందని ట్రంప్ పేర్కొన్నారు. భేటీ అనంతరం జెలెన్స్కీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా అధినేత పుతిన్ శాంతిని కోరుకుంటున్నారని తాను భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. జెలెన్స్కీ నిజంగా ధైర్యవంతుడైన నాయకుడు అంటూ కొనియాడారు. మరోవైపు జెలెన్స్కీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఉక్రెయిన్పై రష్యా భీకర దాడికి దిగడం గమనార్హం. ఉక్రెయిన్లోని పలు నగరాలపై రష్యా సైన్యం దాడులకు పాల్పడింది. ఏం చర్చించారు? ఉక్రెయిన్–రష్యా శాంతి ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. కొన్ని అంశాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఉక్రెయిన్కు సంబంధించిన కొన్ని భూభాగాలను రష్యా ఆక్రమించింది. వాటిని తిరిగి అప్పగించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తుండగా రష్యా అంగీకరించడం లేదు. వాటిపై హక్కులు వదులుకోవడంతోపాటు రష్యాలో అంతర్భాగంగా అధికారికంగా గుర్తిస్తేనే యుద్ధాన్ని ఆపేస్తామని తేలి్చ చెబుతోంది. ఇందుకు ఉక్రెయిన్ ససేమిరా అంటోంది. మరోవైపు భవిష్యత్తులో తమపై దాడులు జరగకుండా భద్రతాపరమైన గ్యారెంటీలు ఇవ్వాలని కోరుతోంది. ఈ రెండు ముఖ్యమైన అంశాలపైనే ట్రంప్, జెలెన్స్కీ చర్చించినట్లు తెలుస్తోంది. యూరోపియన్ నాయకులతో సమావేశం కావాలని వారిద్దరూ నిర్ణయించారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయన్తోపాటు ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, పోలాండ్ తదితర దేశాల అధినేతలతో సమావేశం ఏర్పాటుచేస్తానని ట్రంప్ చెప్పారు. వచ్చే నెలలో ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. శాంతి కోసం ట్రంప్ ఎంతగానో కృషి చేస్తున్నారంటూ ఆయనకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలియజేశారు. శాంతికి తాము సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా, రష్యా అధినేత పుతిన్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. శాంతి ఒప్పందంపై వారు అభిప్రాయాలు పంచుకున్నారు. -
పుతిన్ నివాసంపై డ్రోన్ల దాడి.. రష్యా సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు సంబంధించి జరుగుతున్న దౌత్య ప్రయత్నాల మధ్య రష్యా–ఉక్రెయిన్ మధ్య మాటల యుద్ధం మరోసారి ముదిరింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిందని మాస్కో సోమవారం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఘటనను ఉగ్రదాడిగా పేర్కొంది. యుద్ధ విరమణ చర్చలపై తమ వైఖరిని మార్చుకుంటామని రష్యా స్పష్టం చేసింది.రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకారం... ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం మధ్యలో మాస్కో–సెంట్ పీటర్స్బర్గ్ మధ్య ఉన్న నోవ్గొరడ్ ప్రాంతంలోని పుతిన్ అధికారిక నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ మొత్తం 91 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపారు. అయితే వాటన్నింటినీ రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.ఈ ఘటనకు ప్రతీకారంగా ఉక్రెయిన్లోని కొన్ని లక్ష్యాలను ఇప్పటికే ఎంపిక చేసినట్లు లావ్రోవ్ తెలిపారు. యుద్ధం ముగింపుకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న రష్యా చర్చల వైఖరిని పునఃసమీక్షిస్తాం అని హెచ్చరించారు.ఇదే సమయంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. అమెరికా నేతృత్వంలో సాగుతున్న దౌత్య ప్రయత్నాలను భగ్నం చేయడానికే రష్యా ఈ విధమైన ప్రమాదకర ప్రకటనలు చేస్తోందని ఆయన విమర్శించారు. పుతిన్ నివాసంపై దాడి జరిగిందన్న కథనం పూర్తిగా కల్పితం. ఉక్రెయిన్పై మరిన్ని దాడులకు, ముఖ్యంగా కీవ్పై దాడులకు న్యాయబద్ధత కల్పించేందుకే రష్యా ఈ కథనాన్ని ప్రచారం చేస్తోంది. అలాగే, యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోకుండా తప్పించుకోవడానికీ ఇదే కారణం అని జెలెన్స్కీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.ఈ పరిణామాలతో రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న శాంతి ప్రయత్నాలు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పాక్ ఆర్మీపై దాడి: 15మంది మృతి
బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్పై విరుచుకపడుతోంది. గత కొద్ది రోజులుగా పాక్లోని కీలక ప్రాంతాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ దాడులలో 15మంది పాకిస్థాన్ సైనికులు మృతిచెందినట్లు బీఎల్ఎఫ్ ప్రకటించింది.ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. సరిహాద్దు వెలుపల భారత్, ఆప్గాన్లతో ఆ దేశానికి ఇబ్బందికర పరిస్థితులున్నాయి. ఇవి చాలవన్నట్లు పాకిస్థాన్ ఆర్మీపై బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ దాడులను తీవ్రతరం చేసింది. దీంతో ఆ దేశ ఆర్మీ ఊక్కిరిబిక్కిరవుతోంది.ఇటీవల పాక్పై జరిపిన దాడులలో 15 మంది ఆదేశ సైనికులు మృతి చెందినట్లు బిఎల్ఎఫ్ అధికార ప్రతినిధి జియాంద్ బలూచ్ తెలిపారు. డిసెంబర్ 23న కేచ్ జిల్లా తేజ్బాన్ ఆర్మీ పోస్టుపై జరిపిన దాడిలో ఇద్దరు సైనికులు మృతి చెందినట్లు పేర్కొన్నారు. అనంతరం డిసెంబర్ 25వ తేదీన పంజూర్ జిల్లాలో చైనా- పాక్ ఎకనామిక్ కారిడార్ వద్ద మిలటరీ వాహనంపై రిమోట్ కంట్రోల్ ఎక్స్ప్లోసివ్స్తో దాడులు జరిపామని ఆ ఘటనలో ఆరుగురు పాకిస్థాన్ సైనికులు మృతిచెందగా నలుగురు గాయపడ్డారని వెల్లడించారు.అదే విధంగా పాకిస్థాన్ సెక్యూరిటీ వెహికిల్స్ పై చేసిన దాడిలో ఐదుగురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు ఈ ఆదివారం మరో దాడి చేసి ఆ దేశ కమ్యూనికేషన్ టవర్స్ ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్ స్వాతంత్ర్యం సాధించేవరకూ ఈ పోరాటాన్ని ఆపేది లేదని బీఎల్ఎఫ్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.1948లో పాక్లో బలూచిస్థాన్ విలీనం చేసే సందర్భంలో ఆ ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అయినప్పటికీ బలంవంతంగా ఆప్రాంతాన్ని పాకిస్థాన్లో కలిపారు. అప్పటి నుంచి పాకిస్థాన్ నుంచి స్వతంత్ర్యం కోసం బలూచిస్థాన్ ప్రాంత వాసులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బలూచ్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, ఆప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లేదని అక్కడి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ పై బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడులను తీవ్రతర చేసింది. -
లకురవాను తుడిచిపెట్టనున్న ట్రంప్..!
లకురవా..! ఒకప్పుడు నైజీరియాలో దోపిడీ దొంగల నుంచి గ్రామీణులను కాపాడతారనే పేరున్న ఈ ముఠా సభ్యులు.. క్రమంగా కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్తో జతకట్టారు. నైజీరియా వాయవ్య ప్రాంతంలో పాగా వేశారు. ఇప్పుడు పెద్దన్న...... అదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్గా మారారు. అందుకే ట్రంప్ క్రిస్మస్ రోజున ‘హ్యపీ క్రిస్మస్’ సందేశమిస్తూ.. నైజీరియా వాయవ్య సరిహద్దుల్లోని సోకోటో రాష్ట్రంలో ఐఎస్ ఉగ్రవాదులను టార్గెట్గా చేసి, దాడులు జరిపిన విషయాన్ని బహిర్గతం చేశారు. ఏమిటా లకురవా ముఠా? ట్రంప్ వారిపై ఎందుకు కక్షకట్టాడు?? లకురవా అంటే రిక్రూటింగ్ అని అర్థం. 2016-17 మధ్యకాలంలో లకురవా ముఠా టంకాసాలోని గోంగానో అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాలపై దాడులు జరిపి, దోపిడీలకు పాల్పడే మూకల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేది. తీవ్ర పేదరికంతో కొట్టుమిట్టాడే ఈ గ్రామాలను దోచుకునే బందిపోట్ల పీచమణిచేది. వ్యవసాయాధారితమైన ఈ గ్రామాల్లో రాజకీయ అస్థిరతకు తోడు.. నైజీరియా సైన్యం రక్షణ లేకపోవడంతో.. దోపిడీదారులు విజృంభించేవారు. ఈ పరిస్థితుల్లో నైజర్, మాలి నుంచి వచ్చిన కొంతమంది యువకులు దోపిడీదారులపై ఎదురుదాడి చేశారు. గ్రామస్థులు కూడా వీరికి మద్దతిచ్చారు. 2018 నాటికి ఈ ముఠా శక్తిమంతమైంది. తమ ముఠాకు లకురవా అని నామకరణం చేసింది. స్థానికులతో వైవాహిక సంబంధాలను ఏర్పరుచుకుని స్థిరపడింది. ఆ తర్వాత.. తన నిజస్వరూపాన్ని బయటపెట్టడం ప్రారంభించింది. ఇస్లామిక్ నిబంధనలను అమలు చేయడం మొదలు పెట్టింది. మ్యూజిక్ వినేవారికి కొరడాలతో శిక్షలు విధించింది. 2023 నాటికి లకురవా ముఠా.. సోకోటోలోని అనేక ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకుంది. గతంలో ఈ ప్రాంతాలను బెంబేలెత్తించిన దోపిడీదారులను మించి.. ప్రజలను హింసించడం మొదలు పెట్టింది. క్రమంగా క్రూరత్వానికి మారుపేరుగా లకురవా మారిపోయింది. గ్రామాలపై పన్నులు విధించి.. దారుణంగా వసూలు చేసేది. దాదాపు 500 గ్రామాల్లో లకురవా పాగా వేసింది. అదే సమయంలో ఈ ప్రాంతానికి వచ్చే నైజీరియా సైన్యంపై అత్యంత క్రూరంగా దాడులు జరిపేది.క్రమంగా లకురవా ముఠాలు రిక్రూట్మెంట్లను తీవ్రతరం చేశాయి. 18-35 ఏళ్ల యువకులను ఆకట్టుకున్నాయి. తమతో జతకట్టే యువకుల కుటుంబాలకు డబ్బులివ్వడమే కాకుండా.. వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు, విత్తనాలను అందజేసేది. అలా.. దారుల్ ఇస్లాం అనే పేరుతో శిక్షణ శిబిరాలను ప్రారంభించింది. దీంతో.. నైగర్, నైజీరియా సైన్యాలు చర్యలకు ఉపక్రమించాయి. 2024 నవంబరులో ఈ రెండు దేశాలు లకురవాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. దీంతో లకురవా ఉగ్రదాడులను మరింతగా పెంచింది. అదే నెలలో కేబ్బీలోని మెరా అనే గ్రామంపై దాడి చేసి, 25 మంది గ్రామస్థులను హతమార్చింది.లకురవాను ఉగ్రసంస్థగా ప్రకటించడానికి సరిగ్గా రెండు నెలల ముందు.. అంటే.. 2024 సెప్టెంబరులో ఐక్యరాజ్య సమితి ఓ కీలక సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేసింది. లకురవా నేతలు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరారనేది ఆ సమాచారంలో ప్రధానాంశం. ఐఎస్లో చేరి ఐఎస్జీఎస్.. అంటే.. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ద గ్రేటర్ సహారాను ఏర్పాటు చేసినట్లు వివరించింది. అంతేకాకుండా.. ఐఎస్ నుంచి అధునాతన ఆయుధాలు, డ్రోన్లు, శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరాలను సేకరించింది. ఐఎస్జీఎస్ ఇప్పుడు బోకోహరామ్తో కూడా చేతులు కలిపే ప్రమాదాలున్నట్లు ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితి హెచ్చరికలతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అదే సమయంలో.. లకురవా మాత్రం అరాచకాలను మరింత పెంచింది. క్రైస్తవులు అధికంగా ఉండే గ్రామాలను టార్గెట్గా చేసుకుంది. క్రిస్మస్ సందర్భంగా చర్చిలను టార్గెట్గా చేసుకుంది. లకురవా చర్యలపై ఉప్పందుకున్న అమెరికా రంగంలోకి దిగింది. ఈ ఏడాది నవంబరు నుంచే అమెరికా గూఢచర్య సంస్థలు వాయవ్య నైజీరియాలో నిఘాను పెంచినట్లు అంతర్జాతీయ వార్తాసంస్థ రాయిటర్స్ కూడా ఈ నెల 22న ఓ కథనాన్ని ప్రచురించింది. అందుకు తగిన ఆధారాలుగా అమెరికా సైన్యం ఫైటర్ జెట్ల రాకపోకలకు సంబంధించిన ఫ్లైట్ ట్రాకింగ్ డేటాను పాఠకుల ముందుంచింది. అంతేకాదు.. క్రైస్తవులపై హింస పెరుగుతుండడంతో మత అసహన దేశాల జాబితాలో నైజీరియాను ట్రంప్ ప్రభుత్వం చేర్చింది. అయితే.. క్రిస్మస్ సందర్భంగా ట్రంప్ ప్రపంచానికి షాకిచ్చారు. నైజీరియా వాయవ్య ప్రాంతంలోని బోకో హరామ్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని, దాడులు జరిపినట్లు ప్రకటించారు. నైజీరియా ప్రభుత్వ అభ్యర్థన మేరకే ఈ దాడులు జరిపానంటూ తననుతాను సమర్థించుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని అంతంచేస్తానని ప్రతినబూనారు.లకురవా అరాచకాలు ఒక్కటని చెప్పలేం. నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో కూడా క్రిస్మస్ రోజున దాడులు జరిపింది. కొన్ని వారాల క్రితం ఉత్తర నైజీరియాలో ఓ క్యాథలిక్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, 300 మంది పిల్లలను అపహరించింది. నైజీరియా చరిత్రలోనే ఇది అతిపెద్ద సామూహిక అపహరణ ఉదంతం. చాలా మంది పిల్లలను ఆ తర్వాత విడుదల చేసినా.. మిగతావారెక్కడ? అనేదానిపై స్పష్టత లేదు. ఓ క్రైస్తవ మిషనరీ సంస్థ కోసం పనిచేసే ఓ పైలట్ కూడా ఇటీవల అపహరణకు గురయ్యారు. నైజీరియాలో ముస్లిం-క్రిస్టియన్ల జనాభా దాదాపుగా చెరిసగం ఉంటుంది. ఈ నేపథ్యంలో నైజీరియాలో క్రైస్తవులపై దాడులు కొనసాగితే.. అమెరికా నేరుగా జోక్యం చేసుకుంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఆ మేరకే క్రిస్మస్కు ముందు సోకోటోలోని అనేక ఉగ్రవాద స్థావరాలను అమెరికా, నైజీరియా సైన్యాలు సంయుక్తంగా ధ్వంసం చేశాయి. ఈ ఉదంతాన్ని బహిర్గతం చేస్తూనే ట్రంప్ ‘హ్యాపీ క్రిస్మస్’ అంటూ పోస్టు చేశారు. ట్రంప్ పట్టుదలను చూస్తుంటే.. నైజీరియాలో అమెరికా సైన్యాన్ని మరింతగా మోహరించి, మున్ముందు మరిన్ని దాడులు జరిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. -హెచ్.కమలాపతిరావు -
తెగిపోయిన చెవిని పాదంపై అతికించారు..!
అనుకోని ప్రమాదాల్లో బాధితులు అవయవాలు కోల్పోవడం సర్వసాధారణం. ఒక్కోసారి కొన్నిటిని కృత్రిమ అవయవాలతో భర్తి చేస్తే.. కొన్ని సున్నితమైన అవయవాల విషయాల్లో అది అస్సలు సాధ్యం కాదు. ఇక్కడ ఒక్క మహిళ కూడా అలానే ఎడమ చెవిని కోల్పోయింది. అయితే దాన్ని చక్కగా తిరిగి ఆమెకు అతికించేందుకు విన్నూతమైన వైద్యవిధానాన్ని ఉపయోగించారు. తెగిన చెవిని తిరిగి అతికించడం కాస్తం కష్టం. అయితే దాన్ని పాడవకుండా కాపాడి మరి అతికించారు. అది ఏవిధంగానే తెలిస్తే.. ఇదేం వైద్య విధానం అని విస్తుపోతారు.చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్కు చెందిన సన్ అనే మహిళ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె జుట్టు యంత్రంలో చిక్కుకుంది. ఆ వేగానికి తల ఎడమవైపు చర్మంతో సహా చెవి కూడా పూర్తిగా తెగిపోయింది. దాంతో స్థానికులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆ ప్రమాదంలో సదరు మహిళకు రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందువల్ల చెవిని తిరిగి అమర్చడం క్లిష్టంగా మారింది. అయితే తెగిపోయిన చెవికి గనుక రక్తప్రసరణ అందకపోతే అది కుళ్లిపోయే ప్రమాదం ఉంది. దాంతో వైద్యులు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు. తెగిపోయిన చెవి పాడవ్వకుండా ఉండేలా.. పాదం పైభాగానికి అతికించారు. ఎందుకంటే అక్కడ చర్మం పల్చగా ఉండటమే గాక అక్కడి ఉండే రక్తనాళాలు సరిగ్గా చెవి రక్తనాళాల పరిమాణంలోనే ఉంటాయి. ఆ నేపథ్యంలో పాదానికి చెవిని అతికించారు. అక్కడ తలవెంట్రుకల కంటే సన్నగా ఉండే రక్తనాళాలు ఉండటంతో ఈ క్లిష్టమైన మైక్రో సర్జరీకి సుమారు 10 గంటల సమయం పట్టింది. చెవి సురక్షితంగా పెరగడానికి సుమారు ఐదు నెలలు పైనే పట్టింది. ఆ ఐదు నెలలు నిరీక్షణ అనంతరం పాదంపై ఉన్న చెవిని తీసి తల భాగంలో విజయవంతంగా అమర్చారు వైద్యులు. అలాగే ఆ మహిళ తల చర్మాన్ని పునరుద్ధరించడానికి కడుపు నుంచి తీసిన చర్మాన్ని అతికించారు. ఈ సరికొత్త చికిత్సా విధానం విజయవంతం అవడమే గాక సదరు మహిళ సైతం పూర్తిగా కోలుకుంటోంది కూడా. ఇలాంటి శస్త్ర చికిత్సలు చైనాకేం కొత్త కాదు. ఎందుకంటే గతంలో కూడా చైనా వైద్యులు రోగి భుజంపై చెవిని పెంచి అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. View this post on Instagram A post shared by Interesting Engineering (@interestingengineering)చదవండి: భావోద్వేగ మద్దతుకు పెరుగుతున్న డిమాండ్..! ఈ ఏడాదిలోనే ఏకంగా.. -
ఘోరం.. డోర్ లాక్చేసి ఐదు గృహాలకు నిప్పంటించారు..!
బంగ్లాదేశ్ హింసతో అట్టుడుకుపోతుంది. అక్కడి హిందువుల టార్గెట్గా జరుగుతున్న దాడులు భారత్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఆదేశంలోని మతఛాందస వాదులు అక్కడి ఇద్దరు హిందు యువకులని అత్యంత కిరాతకంగా కొట్టి చంపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఘటన మరవకముందే మరో ప్రమాదం వెలుగు చూసింది. ఫిరోజ్పుర్ జిల్లాలో హిందువులకు చెందిన ఐదు గృహాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు.షేక్ హాసీనా బంగ్లాను వీడి భారత్లో ఆశ్రయం పొందిన నాటి నుంచి ఆ దేశంలో రాజకీయ అస్థిరత తీవ్రరూపం దాల్చింది. ఇదే అనువుగా భావించిన అక్కడి టెర్రరిస్టు గ్రూపులు, మత ఛాందస సంస్థలు హిందువులే టార్గెట్గా దాడులు జరుపుతున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకూ హిందు కుటుంబాలపై దాడులు జరిగిన ఘటనలు దాదాపు 71కి పైగా నమోదయ్యాయి. ఈ విషయాలను స్వయంగా బంగ్లాదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రకటించింది. అధికారిక నివేదికలే ఇలా ఉన్నాయంటే ఇంకా అనధికార ఘటనల వివరాల సంగతులు ఏలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.అయితే డిసెంబర్ 28 ఆదివారం ముస్లిం సామాజిక వర్గం అధికంగా గల ఫిరోజ్పుర్ జిల్లా దుమ్రితల గ్రామంలో ఘోరం జరిగింది. హిందూ సామాజిక వర్గానికి వ్యక్తులకు సంబంధించిన ఐదు ఇళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఐదు ఇళ్లు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియలేదు.ఈ ఘటనకు సంబంధించి బాధితులు మాట్లాడుతూ "మేము ఉదయం లేచే సరికి ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాము. అయితే బయిటినుంచి ఎవరో తలుపులు లాక్ చేశారు. దీంతో వెనుకనుంచి బాంబో ఫెన్సింగ్ను తెంపి తప్పించుకోగలిగాం. మా ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. పెంపుడు జంతువులు చనిపోయాయి". అని కన్నీటి పర్యంతమయ్యారు.🚨 BangladeshAn attack on Hindu minorities continues to raise serious concern. In Dumritola village of Pirojpur district, a house belonging to a Hindu family was reportedly set ablaze by an extremist Islamist mob.Authorities have launched an investigation as calls grow louder… pic.twitter.com/Yul4dTf5q5— World News (@World_Breaking_) December 29, 2025 అగ్నిప్రమాద వివరాలు తెలుసుకున్న ఫిరోజ్పుర్ ఎస్పీ మంజూర్ అహ్మద్ సిద్దీఖీ ఘటన స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. అగ్నిప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేస్తామని ఇప్పటికే ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎన్డీటీవీ ప్రతినిధులు ఢాకాలోని బాధితులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. బాధితులు భయంగా ఉన్నారని ప్రమాద వివరాలను రికార్డింగ్లో తెలపాలని కోరగా వారు నిరాకరించినట్లు పేర్కొన్నారు. -
Indonesia: అగ్నిప్రమాదం.. 16 మంది వృద్ధులు సజీవ దహనం
జకార్తా: ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జకార్తా శివార్లలోని ఒక ప్రైవేట్ వృద్ధాశ్రమంలో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 16 మంది వృద్ధులు సజీవ దహనమయ్యారని అధికారులు ధృవీకరించారు. ప్రమాదం నుంచి మరో 15 మందిని అక్కడి సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు. తూర్పు జకార్తాలోని ‘కాసిహ్ సయాంగ్’ వృద్ధాశ్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రమాదం జరిగిన సమయంలో ఆశ్రమంలోని వృద్ధులంతా గాఢనిద్రలో ఉండటంతో ప్రాణనష్టం భారీగా జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.తూర్పు జకార్తా అగ్నిమాపక, రక్షణ విభాగం అధిపతి గటోట్ సులేమాన్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. ‘మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. చనిపోయిన 16 మందిలో 10 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. వీరంతా 65 నుండి 85 ఏళ్ల మధ్య వయస్సు గలవారని’ ఆయన వివరించారు.ప్రమాదం నుంచి బయటపడిన 15 మందిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయని, వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని అధికారులు తెలిపారు. సుమారు రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అధికారుల ప్రాథమిక విచారణ ప్రకారం.. వంటగదిలో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరిస్తోంది. వృద్ధాశ్రమంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను పాటించారా లేదా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని జకార్తా తాత్కాలిక గవర్నర్ హెరు బూడి హర్తోనో సందర్శించి, మృతుల కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు.ఇది కూడా చదవండి: రష్యా సైన్యంలో ‘నేరాలు- ఘోరాలు’.. ‘సాక్ష్యం’ తెచ్చిన పంజాబీ? -
ఓడియమ్మ.. ఫ్లాష్ ఉమెన్!
ఫలానా కేసును.. గంటల్లోనే చేధించిన ఖాకీలు.. అంటూ అత్యంత అరుదుగా చూస్తుంటాం. అదే ఒక కేసును గంటలోనే చేధిస్తే ఎలా ఉంటుంది?.. అదీ ఒక మహిళా ఆఫీసర్ ఆ పని చేస్తే!. అయితే.. పాపం అలాంటి సందర్భంలో ఆ సూపర్ ఉమెన్ను అభినందించాల్సిందిపోయి.. ‘ఒడియమ్మ.. ఫ్లాష్ ఉమెన్’ అంటూ ఎగతాళి చేసేస్తోంది సోషల్ మీడియా..‘‘మేడమ్.. ఇది స్క్రిప్ట్ కాదు కాదా.. ఎందుకంటే సీఐడీ(హిందీ క్రైమ్ టీవీ సిరీస్) కూడా ఇంత ఫాస్ట్గా కేసును సాల్వ్ చేయలేదేమో’’ అంటూ అనుమానాలతో పాకిస్థాన్కు చెందిన మహిళా ఎస్పీని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. లాహోర్ ఎస్పీ షెహర్బానో నఖ్వీ.. ఈ పేరుతో గతంలోనూ నెట్టింట బాగా వైరల్ అయ్యింది. కిందటి ఏడాది.. దుస్తులపై అరబిక్ ప్రింట్ ఉండడంతో ఒక మహిళపై మూక దాడి ప్రయత్నం జరిగింది. అయితే సీన్లోకి ఎంట్రీ ఇచ్చి.. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి బాధితురాలిని ఆ మూక నుంచి కాపాడి లాహోర్ లేడీ సింగంగా గుర్తింపు పొందింది నఖ్వీ. ఆ సమయంలో నెట్టింట ఆమెపై ప్రశంసలు కురిశాయి. అయితే..ఆవిడను ఇప్పుడు ట్రోల్ చేయడానికి కారణం లేకపోలేదు. ఏఆర్వై న్యూస్ ప్రకారం.. ఎస్పీ నఖ్వీ ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూకి హాజరైంది. ఆ సమయంలో.. మధ్యలో ఉండగానే ఆమెకు ఒక ఫోన్ కాల్ రాగా లిఫ్ట్ చేసి.. ‘‘ఖుర్రం జీ.. ఎక్కడున్నారు... వాళ్లను పట్టుకున్నారా? మంచిది’’ అంటూ మళ్లీ వస్తానంటూ హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ మధ్యలో టైంని బ్రేక్ ప్రకటించారు సదరు పాడ్కాస్ట్ వ్యాఖ్యాత.గంట సేపటి తర్వాత తిరిగి వచ్చాక.. ఆమె జరిగిందో పాడ్కాస్ట్లో వివరించారు. డిఫెన్స్ ఫేస్ ఏలో ఒక హత్య జరిగిందని.. ఆ కేసును చేధించడం కోసమే వెళ్లానని అన్నారామె. ‘‘డబ్బు కోసం ఇద్దరు స్నేహితులు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఒకడు మరొకడిని చంపేశాడు. ఆ తర్వాత బాధిత కుటుంబాన్ని బంధించాడు. ఈ విషయం బంధువుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. నాకు సమాచారం ఇచ్చారు. మేం అక్కడికి వెళ్లి.. ఆ హంతకుడ్ని పట్టుకుని ఆ కుటుంబాన్ని సేఫ్గా విడిపించాను. అందులో ఓ చిన్నారి కూడా ఉంది.. అని తెలిపారు. ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అయ్యింది..కానీ, ఆమె చెప్పేది గతంలో ఆమెను పొగిడిన వాళ్లు కూడా నమ్మలేకపోతున్నారు. అంత దూరం.. అదీ అంత స్పీడ్గా వెళ్లి ఎలా కేసును సాల్వ్ చేశారంటూ ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు. ఏసీపీ ప్రద్యుమన్(సీఐబీ సిరీస్ క్యారెక్టర్) కూడా ఈ కేసును చూసి సుత్తితో తలబద్ధలు కొట్టుకుంటాడేమో అంటూ వెటకారం ప్రదర్శించాడు. ఈ స్క్రిప్ట్ రాసింది ఎవరు? అని ఒక యూజర్.. కిడ్నీ టచింగ్ యాక్టింగ్.. అని మరో యూజర్ ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు ట్రోలింగ్ చేస్తున్నారు ఆ లేడీ సింగాన్ని.. کسی مہذب معاشرے میں ایک پولیس افسر یہ ناٹک کرتی تو اُسے نا صرف برطرف کیا جاتا بلکہ جیل ہو جاتی ! ایک گھنٹے میں FIR نہیں لکھی جاتی اس نے نا صرف قاتل پکڑ لیا وجہ قتل اور ساری کہانی میڈیا پر بتا دی عدالتیں جس کام میں سالوں لگا دیتی ہیں اس نے ایک گھنٹے میں کر دیا ۔۔ واہ دی دی واہ pic.twitter.com/1loxSxQGWV— AliZai Vlogs (@alizaihere) December 21, 2025 -
రష్యా సైన్యంలో ‘నేరాలు- ఘోరాలు’.. ‘సాక్ష్యం’ తెచ్చిన పంజాబీ?
జలంధర్: ఉపాధి కోసం రష్యా వెళ్లిన భారత యువకుల విషాదాంతం వెలుగు చూసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యం తరపున పోరాడుతూ 10 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని పంజాబ్కు చెందిన ఓ యువకుడు వెల్లడించడం సంచలనంగా మారింది. తన సోదరుని ఆచూకీ కోసం రష్యా వెళ్లిన పంజాబ్లోని జలంధర్ జిల్లా గోరయాకు జగదీప్ కుమార్ ఈ వివరాలను మీడియా ముందు వెల్లడించారు.జగదీప్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం రష్యాలో మరణించిన 10 మందిలో ముగ్గురు పంజాబ్కు చెందిన వారు కాగా, మిగిలిన ఏడుగురు ఉత్తరప్రదేశ్, జమ్మూ ప్రాంతాలకు చెందిన వారు. రష్యా సైన్యం అందించిన అధికారిక పత్రాల ఆధారంగా వీరి మరణాలను జగదీప్ కుమార్ ధృవీకరించారు. అయితే ఈ అంశంపై భారత ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా రష్యా సైన్యం జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రాలను జగదీప్ కుమార్ రాజ్యసభ సభ్యుడు సంత్ బల్బీర్ సింగ్ సీచేవాల్ కార్యాలయానికి అందజేశారు. మరణించిన వారితో పాటు మరో నలుగురు భారతీయులు కూడా రష్యాలో గల్లంతయ్యారని ఆయన పేర్కొన్నారు.జగదీప్ సోదరుడు మన్ దీప్ కుమార్ గత ఏడాది రష్యాకు వెళ్లారు. ఒక ట్రావెల్ ఏజెంట్ మోసం కారణంగా ఆయన రష్యా సైన్యంలో చేరాల్సి వచ్చింది. 2024, మార్చి నుంచి కుటుంబ సభ్యులకు మన్ దీప్ నుంచి ఎటువంటి సమాచారం అందలేదు. కాగా తన సోదరునితో పాటు అక్కడ చిక్కుకున్న ఇతర భారతీయులను రక్షించాలని కోరుతూ జగదీప్ జూన్ 29, 2024న రాజ్యసభ సభ్యుడు సీచేవాల్ను కలిశారు. అనంతరం తన సోదరుని ఆచూకీ కోసం జగదీప్ స్వయంగా రెండుసార్లు రష్యాలో పర్యటించారు. మొదటిసారి 21 రోజులు, రెండోసారి రెండు నెలల పాటు అక్కడే ఉండి సమాచారాన్ని సేకరించారు.భాషా సమస్యలతో పాటు ఇతర అడ్డంకులు ఎదురైనప్పటికీ, రష్యా సైనిక అధికారుల ద్వారా తన సోదరుడితో సహా ఇతర భారతీయ యువకుల స్థితిగతులపై ఆయన పలు కీలక పత్రాలను సేకరించగలిగారు. ఈ ఘటనపై ఎంపీ బల్బీర్ సింగ్ సీచేవాల్ స్పందిస్తూ విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాశారు. రష్యాలో మృతిచెందిన భారతీయ యువకుల మృతదేహాలను వారి స్వగ్రామాలకు తెచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అమాయక యువకులను మోసం చేసి, యుద్ధ భూమికి పంపుతున్న ట్రావెల్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భారత యువకులు రష్యా సైన్యంలో చేరకుండా దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఇది కూడా చదవండి: Delhi Blast: దర్యాప్తులో వేగం.. పరిహారంలో లేదా? -
ఆ దేశాల మధ్య జపాన్ ప్రధాని ‘చిచ్చు’
ఫసిఫిక్ మహా సముద్రంలో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తైవాన్ను రక్షించేందుకు తాము ఎటిపరిస్థితుల్లోనూ వెనుకాడబోమంటూ జపాన్ ప్రధాని సనే తకైచి చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి. ఈ వ్యాఖ్యలకు ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా.. తైవాన్ చుట్టూ ‘జస్టిస్ మిషన్ 2025’ సైనిక విన్యాసాలను ప్రారంభించింది. దీంతో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.మూడు ప్రధాన సముద్రాలు (తూర్పు చైనా, దక్షిణ చైనా, ఫిలిప్పీన్)తో కూడిన తైవాన్ జలసంధి మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో జరిగిన స్వోర్డ్ A, జాయింట్ స్వోర్డ్ B, స్ట్రైట్ థండర్ వంటి విన్యాసాల కంటే భారీ స్థాయిలో చైనా తాజా సైనిక విన్యాసాలు నిర్వహించడమే ఇందుకు కారణం. తైవాన్ కోస్ట్ గార్డ్ అడ్మినిస్ట్రేషన్ సమీప జలాల్లో చైనా కోస్ట్ గార్డ్ కార్యకలాపాలు పెరిగాయి. అదేవిధంగా.. తైవాన్ సమీపంలో చైనా కోస్ట్ గార్డ్ నౌక 1303 దృశ్యాన్ని విడుదల చేసింది. అయితే, చైనా కోస్ట్ గార్డ్ ఈ విన్యాసాల్లో తమ పాల్గొనడం గురించి అధికారికంగా ప్రకటించలేదు. తైవాన్పై చైనా దాడులు చేస్తే జపాన్ సైన్యం జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని.. జపాన్ ప్రధాని సనే తకైచి ఇటీవల పార్లమెంటులో హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిచర్యగా చైనా తన సైనిక బలగాలను తైవాన్ చుట్టూ భారీగా మోహరించి యుద్ధ విన్యాసాలు చేస్తోందనేది స్పష్టమవుతోంది. తైవాన్ చుట్టూ ఉన్న ప్రధాన ఓడరేవులను దిగ్బంధించడం, బయటి దేశాల నుంచి సాయం అందకుండా అడ్డుకోవడం, క్షిపణి వ్యవస్థల పనితీరును పరీక్షించడం ప్రధాన టార్గెట్గా తెలుస్తోంది.మరోవైపు తకైచి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీజింగ్ వర్గాలు.. తమ అంతర్గత విషయాల్లో జపాన్ జోక్యం చేసుకుంటే బాగోదని హెచ్చరించింది. తక్షణమే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అల్టిమేటం జారీ చేసింది. అదే సమయంలో.. కౌంటర్గానే తైవాన్ను దిగ్బంధించేలా తన ఎయిర్ఫోర్స్, నేవీ బలగాలతో ‘జస్టిస్ మిషన్ 2025’లో చేపట్టినట్లు పరోక్ష ప్రకటన చేయడం గమనార్హం. -
Mexico: ఘోర రైలు ప్రమాదం.. 13 మంది మృతి
మెక్సికో సిటీ: దక్షిణ మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పసిఫిక్ మహాసముద్ర తీరాన్ని.. గల్ఫ్ ఆఫ్ మెక్సికోతో అనుసంధానించే ‘ఇంటర్ ఓషియానిక్’ రైలు పట్టాలు తప్పడంతో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 98 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.నౌకాదళం అందించిన వివరాల ప్రకారం ప్రమాద సమయంలో రైలులో 9 మంది సిబ్బంది, 241 మంది ప్రయాణికులు.. మొత్తం 250 మంది ఉన్నారు. ఓక్సాకా, వెరాక్రజ్ రాష్ట్రాల సరిహద్దులోని నిజాండా పట్టణం మీదుగా రైలు వెళుతున్నప్పుడు.. ఒక మలుపు వద్ద రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ‘ఎక్స్’వేదికగా స్పందించారు. ‘ఇంటర్ ఓషియానిక్ రైలు ప్రమాదంలో 13 మంది మృతి చెందడం అత్యంత బాధాకరం. గాయపడిన 98 మందిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది’ అని ఆమె వెల్లడించారు.బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు, మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు నౌకాదళ కార్యదర్శిని, మానవ హక్కుల అధికారులను ఘటనా స్థలానికి పంపినట్లు క్లాడియా షీన్బామ్ తెలిపారు. ఈ ఘటనపై ఓక్సాకా గవర్నర్ సలోమన్ జారా మాట్లాడుతూ.. పలు ప్రభుత్వ సంస్థల అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించరని తెలిపారు. కాగా గాయపడిన వారికి మటియాస్ రోమెరో, సలినా క్రజ్, జుచిటాన్, ఇక్స్టెపెక్ ప్రాంతాల్లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదంపై మెక్సికో అటార్నీ జనరల్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో అటార్నీ జనరల్ ఎర్నెస్టినా గోడోయ్ రామోస్ విచారణకు ఆదేశించారు. 2023లో అప్పటి అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడర్ ఈ ఇంటర్ ఓషియానిక్ రైలును ప్రారంభించారు. ఇది పసిఫిక్ తీరంలోని సలినా క్రజ్ నుండి గల్ఫ్ తీరంలోని కోట్జాకోయాల్కోస్ వరకు సుమారు 290 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇది కూడా చదవండి: ‘మహా’ రాజకీయాలు.. పవార్ ఇకపై ‘పరివార్’ -
ట్రంప్ పీస్ ప్లాన్.. ఇదేం ట్విస్టు?!
దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు దిశగా కీలక అడుగు పడింది. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందం విషయంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో జరిపిన భేటీ ఫలవంతంగా ముగిసింది. తుది ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా.. ఇద్దరు దేశాధినేతలు చర్చలు కీలక దశకు చేరుకున్నాయనే సంకేతాలు మాత్రం ఇచ్చారు. కానీ..ఫ్లోరిడాలోని తన మార్ ఎ లాగో నివాసంలో సుమారు మూడు గంటలపాటు ట్రంప్ జెలెన్స్కీతో చర్చలు జరిపారు. శాంతి ఒప్పందానికి 90-95 శాతం ఆమోదం లభించిందని ఇరువురు నేతలు ప్రకటించారు. అయితే కీలకమైన సరిహద్దు అంశంపైనే ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని ఇద్దరి మాటల్లో వెల్లడి అయ్యింది.ఉక్రెయిన్కు భద్రత కల్పించే అంశాలపై 95 శాతం చర్చలు పూర్తయ్యాయని ట్రంప్ అన్నారు. అయితే.. తూర్పు భాగంలోని సరిహద్దుల అంశమే ఎటూ తేలడం లేదని మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘చాలా అంశాలపై చర్చించాం. దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లే అనుకోవచ్చు. గతంతో పోలిస్తే ఇది ఎంతో మెరుగైన ఫలితం. మరికొన్ని వారాల్లోనే ఈ యుద్ధం ముగిసే అవకాశం ఉంది. అయితే ఈ చర్చలకు డెడ్లైన్ అంటూ ఏదీ లేదని గమనించాలి. కాబట్టి సరైన సమయంలో.. అదీ అమెరికా సమక్షంలో రష్యా-ఉక్రెయిన్లు ఈ యుధ్దానికి ముగింపు పలుకుతాయి’’ అని అన్నారాయన. ఇక ట్రంప్కు మరోసారి కృతజ్ఞతలు తెలియజేసిన జెలెన్స్కీ.. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికలో ఇరువైపులా సంబంధించిన అంశాలను పొందుపరిచారని.. ఇందులో 90 శాతం ఆమోదయోగ్యంగానే ఉన్నాయన్నారు. అయితే అంతిమంగా.. శాశ్వత శాంతి సాధనలో భద్రతా హామీలే కీలకమైన మైలురాయిగా అభివర్ణించారు. మిగిలిన అంశాలపై యూరోపియన్ యూనియన్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతామని.. జనవరిలో వాషింగ్టన్లో మరిన్ని చర్చలు జరుగుతాయని.. త్వరలోనే ట్రంప్ పీస్ ప్లాన్కు తుది రూపం ఇవ్వనున్నట్లు జెలెన్స్కీ చెప్పారు. ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ యుద్ధానికి తాత్కాలికంగా ఆపేందుకు సుముఖంగా లేరు. అందుకే ఆయన కాల్పుల విరమణకు అంగీకరించలేదు. ఉక్రెయిన్లో పర్యటించాలని, అక్కడి పార్లమెంట్లో ప్రసంగించాలని తాను కోరుకుంటున్నప్పటికీ.. ముందుగా శాంతి ఒప్పందం ఓ కొలిక్కి రావాలని జెలెన్స్కీ ఆకాంక్షిస్తున్నారని, ఆ అభిప్రాయాన్ని తాను గౌరవిస్తాను అని అన్నారు.అసలు చిక్కల్లా అక్కడే.. డోన్బాస్ (Donbas) అనేది తూర్పు ఉక్రెయిన్లోని ఒక చారిత్రక.. ఆర్థిక ప్రాంతం. డొనెట్స్క్ (Donetsk), లుహాన్స్క్ (Luhansk) ప్రాంతాల కలయిక. అందుకే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కేంద్ర బిందువుగా మారింది. రష్యా అనుకూల వేర్పాటువాదులకు, ఉక్రెయిన్కు మధ్య ఈ ప్రాంతంపై పట్టు కోసం తీవ్ర పోరాటం జరుగుతోంది. వ్యూహాత్మకంగా భావిస్తుండడంతో.. రష్యా దీనిని తమ భూభాగంగా ప్రకటించుకుంటోంది. అందుకే శాంతి చర్చలలో కీలక అంశంగా మారింది. అయితే.. ఈ అంశంపైనా చర్చలు దాదాపు కొలిక్కి వచ్చినట్లేనని ట్రంప్ ఇప్పుడు చెబుతుండగా, డోన్బాస్పై ఉక్రెయిన్ వైఖరి స్పష్టంగా ఉందని.. అది రష్యా అభిప్రాయానికి భిన్నమని వ్యాఖ్యానించడం కొసమెరుపు. భేటీకి ముందు.. జెలెన్స్కీతో భేటీకి ముందు మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ.. తుది గడువు ఏమీ లేదని, యుద్ధం ముగింపుపైనే దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. దౌత్య ప్రయత్నాలు తుది దశకు వచ్చినట్లు పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ ఫోన్లో మాట్లాడానని.. ఆయనతో ఫలితం సాధించే దిశగా చర్చలు జరిగినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు.‘‘రష్యా, ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటున్నాయి. నేను జెలెన్స్కీతో జరుపుతున్న సమావేశంపై పుతిన్ చిత్తశుద్ధితో ఉన్నారు. తుది గడువు ఏమీ లేదు.. యుద్ధం ముగింపుపైనే దృష్టి సారిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులపై పుతిన్, జెలెన్స్కీ ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల చాలా మంది చనిపోయారు. ఇప్పటికే 8 యుద్ధాలు ఆపాను.. ఇదీ చాలా క్టిష్టమైనది. ఫ్లోరిడాలో సమావేశం కోసం జెలెన్స్కీ చాలా కృషి చేశారు. ఆయన, ఉక్రెయిన్ ప్రజలు చాలా ధైర్యవంతులు. రష్యా, ఉక్రెయిన్ పరిస్థితులపై చర్చలు కొనసాగిస్తుంటాం. చర్చలు చివరి దశలో ఉన్నాయి.. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని ట్రంప్ అన్నారు.ట్రంప్తో జరిగే సమావేశంలో ఉక్రెయిన్కు కల్పించాల్సిన భద్రతా హామీల అంశాన్ని లేవనెత్తనున్నట్లు ఇది వరకే జెలెన్స్కీ వెల్లడించారు. ముఖ్యంగా 20సూత్రాల ప్రణాళికపై చర్చిస్తామని, ఇది దాదాపుగా(90 శాతం) సిద్ధమైందని తెలిపారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్, అమెరికా మాత్రమే కాకుండా యూరప్ దేశాలూ పాలుపంచుకోవాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. -
హదీ హంతకులు భారత్లోకి రాలేదు
షిల్లాంగ్: ఇంక్విలాబ్ మంచ్ నేత షరీఫ్ ఒస్మాన్ హదీ హంతకులు భారత్లోకి ప్రవేశించారంటూ బంగ్లాదేశ్ పోలీసులు చేసిన ఆరోపణలను బీఎస్ఎఫ్ తీవ్రంగా ఖండించింది. బంగ్లాదేశ్ చేస్తున్నవి నిరాధార, తప్పుదోవ పట్టించే ప్రకటనలని మేఘాలయలో బీఎస్ఎఫ్ చీఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఓపీ ఉపాధ్యాయ్ స్పష్టం చేశారు. హదీ హత్య కేసులో ఫైసల్ కరీం మసూద్, ఆలంగిర్ షేక్ అనే కీలక అనుమానితులిద్దరు హలువాఘాట్ బోర్డర్ పాయింట్ మీదుగా స్థానికుల సాయంతో భారత్లోకి ప్రవేశించినట్లు బంగ్లాదేశ్లోని ఢాకా మెట్రోపాలిటన్ అదనపు పోలీస్ కమిషనర్ ఇస్లాం ఆదివారం ఆరోపించారు. ‘భారత్లోకి పారిపోయాక ఒకరు వీళ్లను మేఘాలయలోని తురా నగరానికి తీసుకెళ్లాడు’అని ఇస్లాం చెప్పారు. ‘అనంతరం వీళ్లను భారత అధికారులు నిర్బంధించారు. ఈ విషయమై అనధికారిక వర్గాల ద్వారా భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. నిందితులను వెనక్కి తీసుకొస్తాం’ అని అన్నారు. ఆ ఇద్దరు నిందితులు భారత్లోకి ఎప్పుడు ప్రవేశించారనే విషయం ఆయన వెల్లడించలేదు. బంగ్లా పోలీస్ అధికారి ప్రకటనపై ఉపాధ్యాయ్ స్పందిస్తూ..‘హలువాఘాట్ సెక్టార్ మీదుగా ఎవరూ మేఘాలయలోకి ప్రవేశించినట్లు ఎలాంటి ఆధారాలూ లేవు’అని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన వార్తలన్నీ అసత్యాలని తెలిపారు. గారో హిల్స్ ప్రాంతంలోని హలువాఘాట్ ద్వారా కొందరు వ్యక్తులు మన భూభాగంలోకి ప్రవేశించినట్లు తమకు ఎటువంటి నిఘా సమాచారం అందలేదని మేఘాయ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. వివిధ నిఘా, భద్రతా సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి మోహరించిన జవాన్లు అత్యంత అప్రమత్తతతో ఉన్నారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. దొంగచాటుగా ఎవరైనా ప్రవేశించిన పక్షంలో వారిని గుర్తించి, పట్టుకుని తగు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. -
మయన్మార్లో తొలిసారిగా ఎన్నికలు
యాంగూన్: మయన్మార్లో సైన్యం అధికార పగ్గాలు చేపట్టిన ఐదేళ్ల తర్వాత సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదివారం తొలి విడత పోలింగ్ జరిగింది. దేశం అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతుండగా, సైన్యం కన్నుసన్నల్లో ఎన్నిక తంతు జరుగుతోంది జనవరి 11, 25వ తేదీల్లో మరో 2 దఫాల పోలింగ్ అయ్యాక ఫలితాలొస్తాయి. జాతీయ, ప్రాంతీయ శాసనసభల స్థానాల కోసం 57 పార్టీలకు చెందిన 4,800 మందికి పైగా అభ్యర్థులు పోటీపడుతున్నారు. పార్లమెంటులో రాజకీయ ప్రాతినిథ్యం పొందే అవకాశమున్న 6 పార్టీలే పోటీ చేస్తున్నాయి. అంగ్సాన్ సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోకస్రీ పార్టీని సైనిక ప్రభుత్వం రద్దు చేసింది. సైన్యం అండదండలతో పనిచేస్తున్న యూనియన్ సాలిడారిటీ, డెవలప్మెంట్ పార్టీయే ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్న అంచనాలున్నాయి. -
సూరినామ్లో కత్తిపోట్ల కలకలం
పారమారిబో: దక్షిణ అమెరికాలోని సూరినామ్లో ఓ వ్యక్తి కత్తితో జరిపిన దాడిలో ఐదుగురు బాలలు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని పారమారిబో సమీపంలో ఆదివారం ఘటన చోటు చేసుకుంది. బాధితులంతా నిందితుడి పిల్లలు, అతడి పొరుగువారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకుని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై అతడు దాడికి దిగాడన్నారు.ఈ క్రమంలో పోలీసులతో జరిగిన ఘర్షణలో అతడు గాయపడ్డాడని చెప్పారు. అతడికి మతిస్థిమితం లేదని తెలిసిందన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
మా విమానాలు కొంటే భారత్లో తయారీ
మారియెటా (యూఎస్): సైనిక రవాణా అవసరాల నిమిత్తం 80 భారీ విమానాల కొనుగోలుకు మోదీ సర్కార్ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో వందల కోట్ల డాలర్ల విలువైన ఆ కాంట్రాక్టు కోసం అతి పెద్ద రక్షణ ఉత్పత్తుల కంపెనీ లాక్హీడ్ మార్టీన్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇందుకోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్తో కలిసి బిడ్ వేయడం విశేషం. తమ సీ–130జే సూపర్ హెర్క్యులెస్ భారీ విమానాలు భారత అవసరాలకు సరిగ్గా సరిపోతాయని ఈ అమెరికా దిగ్గజం తాజాగా పేర్కొంది. ఈ భారీ కాంట్రాక్టు లభిస్తే విమానాల తయారీకి భారత్లోనే మెగా హబ్ ఏర్పాటు చేస్తామని భారీ ఆఫర్ ప్రకటించింది. అమెరికా బయట తాము ఇలాంటి ప్లాంటు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అవుతుందని గుర్తుచేసింది. సీ–130జే సిరీస్లో లాక్హీడ్ ఇప్పటిదాకా 560కి పైగా విమానాలను సరఫరా చేసింది. అవి 23 దేశాల్లో సేవలందిస్తున్నాయి. మన వాయుసేవ వద్ద ప్రస్తుతం ఈ శ్రేణికి చెందిన 12 విమానాలున్నాయి. రవాణా అవసరాలతో పాటు నిఘా, ఎల్రక్టానిక్ వార్ఫేర్, గాలింపు, రెస్క్యూ మిషన్ల వంటి అవసరాల నిమిత్తం సీ–130జే శ్రేణిలో ప్రత్యేక కని్ఫగరేషన్లను సంస్థ అమరుస్తుంటుంది. ప్రస్తుతం డి్రస్టిబ్యూటెడ్ అపర్చర్ సిస్టమ్ తదితరాలతో వాటిని మరింత ఆధునీకరించే ప్రయత్నాల్లో ఉంది. ఆ్రస్టేలియాతో పాటు జపాన్ కూడా సీ–130జే రవాణా విమానాల కొనుగోలు యోచనలో ఉన్నాయి. భారత వాయుసేన ప్రస్తుతం రవాణా అవసరాలకు సోవియెట్ కాలం నాటి ఏఎన్–32, ఐఎల్–76 రకం విమానాలపై ఆధారపడుతోంది. -
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ముగింపుకు ట్రంప్ పిలుపు
వాష్టింగన్: కొనసాగుతున్న ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ఆపాలని, అందుకు సమయం వృదా చేయాల్సిన అవసరం లేదని’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో జరిగిన భేటీలో ట్రంప్ పైవిధంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ప్రధానంగా ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధానికి శాంతి పరిష్కారం కనుగొనడంపై దృష్టి సారించింది. ట్రంప్ తన శైలిలో యుద్ధాన్ని త్వరగా ముగించగలమని నమ్మకం వ్యక్తం చేయగా.. జెలెన్ స్కీ అమెరికా మద్దతు ఉక్రెయిన్ భవిష్యత్తుకు అత్యంత కీలకమని స్పష్టం చేశారు.ఈ చర్చల్లో సైనిక సహాయం, ఆర్థిక మద్దతు, రాజకీయ వ్యూహాలు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. జెలెన్ స్కీ ఉక్రెయిన్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించి, అమెరికా సహాయం కొనసాగాలని కోరారు. ట్రంప్, తన పదవీకాలంలో ప్రత్యేక శాంతి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది.యూరోపియన్ నాయకులు, ట్రంప్- జెలెన్స్కీల మధ్య చర్చలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి కొత్త మార్గం చూపవచ్చని భావిస్తున్నారు. అయితే, విశ్లేషకులు ట్రంప్ ప్రతిపాదించే శాంతి ప్రణాళికలో రష్యా పాత్ర ఎలా ఉంటుందనే అంశంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద, ఈ సమావేశం ఉక్రెయిన్ భవిష్యత్తుకు కీలక మలుపు కావచ్చు. ట్రంప్ త్వరిత పరిష్కారం వాగ్దానం చేస్తున్నప్పటికీ జెలెన్ స్కీ మాత్రం ఉక్రెయిన్ స్వాతంత్ర్యం, భూభాగ సమగ్రతపై రాజీ పడరాదని స్పష్టం చేస్తున్నారు. -
‘నేను నీ బానిసనా?’.. మేనేజర్కి బుద్ది చెప్పిన ఉద్యోగి!
లండన్: యూకేలో కెంటకీ ఫ్రైడ్ చికెన్ (KFC) రెస్టారెంట్లో మేనజర్గా పనిచేస్తున్న శ్రీలంక మేనేజర్కి.. భారతీయ ఉద్యోగి గట్టిషాకిచ్చాడు. నువ్వు నా బానిసవి అంటూ చేసిన అవమానకర వ్యాఖ్యలపై సదరు మేనేజర్ని ఆధారాలతో సహా కోర్టుకీడ్చాడు. కోర్టు సైతం మేనేజర్ని చివాట్లు పెట్టింది. భారత కరెన్సీలో రూ.81లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.అంతర్జాతీయ కథనాల ఆధారంగా.. తమిళనాడుకు చెందిన రవిచంద్రన్ 2023లో లండన్లోని వెస్ట్ విక్హామ్ కేఎఫ్సీ అవుట్లెట్లో ఉద్యోగం ప్రారంభించారు. కొద్ది నెలల్లోనే అతని మేనేజర్, శ్రీలంకకు చెందిన కజన్ థైవెంటిరం అతనిపై బానిస,భారతీయులు మోసగాళ్లు అంటూ అవమానించారు. దీంతో జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన కజన్పై రవిచంద్రన్ ఎంప్లాయిమెంట్ ట్రైబ్యునల్ను ఆశ్రయించాడు. అంతేకాదు.. లీవ్ అడిగితే ఇవ్వకపోవడం, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినట్లు పలు ఆధారాల్ని ట్రైబ్యునల్కు అందించాడు. ఈ కేసును పరిశీలించిన ఎంప్లాయ్మెంట్ ట్రైబ్యునల్ రవిచంద్రన్కు అండగా నిలిచింది. మేనేజర్ ప్రవర్తనను జాతి వివక్షగా గుర్తించింది. కోర్టు తీర్పు ప్రకారం.. అతనికి 67వేల యూరోలు (సుమారు రూ.81 లక్షలు) పరిహారం చెల్లించాలని ఆదేశించింది.ట్రైబ్యునల్ జడ్జి పాల్ అబ్బాట్ తీర్పులో ‘ఈ కేసులో జాతి వివక్ష స్పష్టంగా ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని’ వ్యాఖ్యానించారు. ఈ తీర్పు యూకేలోని ఉద్యోగ రంగంలో జాతి వివక్షకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని పంపిందని న్యాయవర్గాలు పేర్కొన్నాయి. -
భారత సంతతి వ్యక్తి మృతి.. ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇదే
ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా భారత్ సంతతికి చెందిన ఓ వ్యక్తి.. కెనడాలో మరణించడంపై టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్రస్థాయిలో స్పందించారు. కెనడా ప్రభుత్వంపై తన ఎక్స్లో విమర్శలు గుప్పించారు. భారత సంతతికి చెందిన ప్రశాంత్ కుమార్(44) కెనడాలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే, ఈ నెల 22వ తేదీన ప్రశాంత్ కుమార్కు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో ఎడ్మంటన్లోని గ్రే నన్స్ కమ్యూనిటీ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు.మధ్యాహ్నం 12.20 గంటల నుంచి రాత్రి 8.50 గంటల వరకు చికిత్స అందించకుండా వెయింట్ చేయించారు. ఛాతీనొప్పి ఎక్కువగా ఉందని ఆస్పత్రి సిబ్బందిని బతిమాలినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బీపీ 210కి పెరిగినా కూడా ఆయకు టైలెనాల్ మాత్రమే ఇచ్చారు. వెయిటింగ్ హాల్లో 8 గంటలు ఉంచిన తర్వాత చికిత్స ప్రారంభించారు. కొన్ని నిమిషాల్లోనే ప్రశాంత్ కుమార్ కుప్పకూలి మృతిచెందారు.కెనడా ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఎలాన్ మాస్క్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తే, అది DMV(డిపార్ట్మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్) లాగే ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. కెనడా ఆరోగ్య వ్యవస్థను US మోటారు వాహన విభాగంతో పోల్చుతూ మస్క్ విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది. కెనడా ప్రభుత్వానికి లేఖ రాసింది. అతడి మృతికి కెనడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. When the government does medical care, it is about as good as the DMV https://t.co/kRdlL3idyF— Elon Musk (@elonmusk) December 26, 2025 -
ఉస్మాన్ హాదీ హంతకులు భారత్లో?
బంగ్లాదేశ్లో రాడికల్ నేత ఉస్మాన్ హాది హత్య తీవ్ర అంతర్గత సంక్షోభం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉస్మాన్ హాదీ హత్యతో ఆ దేశంలో హింస చెలరేగింది. హిందువులపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఉస్మాన్ హాదీని హత్య చేసినట్లు అనుమానిస్తున్న నేరస్థులు భారత్లో తలదాచుకున్నట్లు బంగ్లాదేశ్ ఆరోపిస్తుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్, భారత్ మధ్య సంబంధాలు నివురు కప్పిన నిప్పులా ఉన్నాయి. భారత్ వ్యతిరేక భావజాలం ఉన్న నేతలు ప్రస్తుతం అక్కడ బలంగా ఉండడంతో పాటు ఆదేశ మాజీ ప్రధాని షేక్ హాసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడం ఆదేశానికి మింగుడుపడడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆదేశానికి చెందిన కొంతమంది నేతలు ఇండియాపై కారుకూతలు కూశారు. అంతేకాకుండా ఇటీవల అక్కడ భారత వ్యతిరేక భావజాలం ఉన్న విద్యార్థి నేతల ఉస్మాన్ హాదీ హత్య తరువాత అక్కడ అలర్లు చెలరేగాయి. ఇద్దరు హిందూ యువకులను తీవ్రంగా కొట్టి కిరాతకంగా చంపారు. కాగా ఇప్పుడు ఉస్మాన్ హాదీని హత్య చేసిన వారు భారత్లో ఉన్నట్లు ఢాకా పోలీసులు ఆరోపిస్తున్నారు.అక్కడి అడిషనల్ కమిషనర్ నార్జూల్ ఇస్లాం మాట్లాడుతూ" ఉస్మాన్ హాదీ హత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఫైజల్ కరీం మసుాద్, ఆలంగీర్ షేక్ అనే ఇద్దరు నేరస్థులు, మైమెన్ సింగ్ జిల్లాలోని హాలుఘాట్ సరిహద్దు ద్వారా భారత్ లోని మేఘాలయలోకి ప్రవేశించారు. అనంతరం వారిని పూరి అనే వ్యక్తి రిసీవ్ చేసుకొని, సమీ అనే ట్యాక్స్ డ్రైవర్ అక్కడి టూరా సిటిీలో దించారు." అని తెలిపారు. ఈ వివరాలను అక్కడి డైలీ స్టార్ పత్రిక ప్రచురించింది.అయితే పూరి, సమీలిద్దరినీ భారత అధికారులు అదుపులోకి తీసుకున్నారే అనధికార సమాచారం తమకు అందిందని ఆయన తెలిపినట్లు మీడియా కథనాలు ప్రచురించాయి. నేరస్థులను బంగ్లాదేశ్ రప్పించేలా ప్రభుత్వం చర్చలు జరుపుతుందని తెలిపాయి . అయితే ఈ ఆరోపణల్ని మేఘాలయ పోలీసులు ఖండించారు. ఫైజల్ కరీం మౌసుద్, ఆలంగీర్ షేక్ అనే ఇద్దరు భారత్లో ప్రవేశించలేదని తెలిపారు.బంగ్లాదేశ్ మీడియా సంస్థలు మేఘాలయ ప్రజలన భయభ్రాంతులకు గురిచేసేలా కథనాలు ప్రచురిస్తున్నాయని పోలీసులు పేర్కొన్నారు. పూరి, సమీలను అదుపులోకి తీసుకున్నట్లు ప్రచురించారని అది కూడా పూర్తిగా అసత్య ఆరోపణలని వారు తెలిపారు -
బంకర్లో దాక్కోమన్నారు
లాహోర్: ఈ ఏడాది మేలో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సమయంలో బంకర్లో దాక్కోవాలంటూ అధికారులు తనకు సలహా ఇచ్చారని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దార్ వెల్లడించారు. 2007లో హత్యకు గురైన తన భార్య, మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో వర్ధంతి సందర్భంగా సింధ్ ప్రావిన్స్లోని లార్కానాలో ఆదివారం ఏర్పాటైన కార్యక్రమంలో జర్దారీ ఈ విషయం తెలిపారు. ‘సర్, యుద్ధం మొదలైంది. సురక్షితంగా ఉండటం కోసం బంకర్కు వెళ్దాం రండి అంటూ నా సెక్రటరీ వచ్చి నాతో అన్నారు. అందుకు నేను అంగీకరించలేను. మృత్యువు వస్తే ఇక్కడికే రానీయండి. నేతలు ప్రాణాలొదలాల్సింది యుద్ధ క్షేత్రంలోనే..బంకర్లలో కాదని చెప్పా. నేతలు బంకర్లలో కూర్చుని చనిపోవడం సరికాదని అతడికి తెలిపాను. వాస్తవానికి యుద్ధం మొదలవుతుందని నాలుగు రోజులు ముందుగానే తమకు తెలుసు’అని అన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ కంటే 10 ఎక్కువే అయినా, ఆ దేశానికి యుద్ధం చేసే ధైర్యం లేదని వ్యాఖ్యానించారు. #BREAKING : Pakistan President Asif Ali Zardari says the Pakistani military was hiding in bunkers during Operation Sindoor. The remarks were made at a public rally.Pakistan President Asif Ali Zardari said the military advised him to take shelter in bunkers during Operation… pic.twitter.com/f6aBOoG5Gj— upuknews (@upuknews1) December 28, 2025అదంతా అబద్ధం: ఆర్మీ రిటైర్డు అధికారి ఆసిఫ్ జర్దారీ చేసిన ప్రకటనపై భారత లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డు) కేజేఎస్ ధిల్లాన్ ఘాటుగా స్పందించారు. యుద్ధం మొదలవుతుందని నాలుగు రోజులు ముందుగానే తెలిస్తే 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత క్షిపణులను ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. ఆపరేషన్ సిం«ధూర్ వేళ ఆర్మీ చీఫ్ మునీర్ సహా రాజకీయ నేతలు, మిలటరీ కమాండర్లు బంకర్లోనే దాక్కున్నారన ధిల్లాన్ చెప్పారు. నూర్ ఖాన్ స్థావరంపై దాడి వాస్తవమేభారత్తో మేలో తలెత్తిన సంక్షోభం సమయంలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దాడికి గురైందని పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అంగీకరించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ అంగీకరించడం ఇదే మొదటిసారి. ‘ఆ∙రోజు ఉదయం 8.15 గంటల వేళ అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చేసి..కాల్పుల విరమణకు భారత్ సిద్ధంగా ఉంది. మీరూ సిద్ధమా? అని నన్నడిగారు. పాక్ ఎల్లప్పు డూ శాంతినే కోరుకుంటుందని బదులిచ్చా’ అని తెలిపారు. -
2026 మరింత భయానకం.. వణికిస్తున్న నోస్ట్రడామస్ జోస్యం!
ప్రముఖ ఫ్రెంచ్ భవిష్యవేత్త నోస్ట్రడామస్ రాబోయే 2026కు సంబంధించి చేసిన సంచలన అంచనాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతూ, అందరిలో వణుకుపుట్టిస్తున్నాయి. ‘న్యూస్ 24’ కథనం ప్రకారం నోస్ట్రడామస్ అంచనా వేసిన భయానక పరిణామాలు, ముంచుకొస్తున్న విపత్తుల వివరాల్లోకి వెళితే..2026 మధ్యకాలంలోలో మూడవ ప్రపంచ యుద్ధం?నోస్ట్రడామస్ జోస్యం ప్రకారం 2026 మధ్యకాలం నాటికి మూడవ ప్రపంచ యుద్ధం (World War III) ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది అత్యంత వినాశకరంగా మారుతుందని నోస్ట్రడామస్ పేర్కొన్నారు. మతం, జాతీయవాదం పేరుతో జనం ఒకరినొకరు చంపుకుంటారని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే తూర్పు దేశాల్లో ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం గమనార్హం.సముద్ర యుద్ధాలు - రాజకీయ మార్పులునోస్ట్రడామస్ అంచనాల ప్రకారం.. 2026లో జరిగే భారీ నౌకాదళ ప్రమాదం లేదా సముద్ర యుద్ధం ప్రపంచాన్ని కుదిపేయనుంది. ఒక భారీ నౌక మునిగిపోవడం లేదా నౌకాదళాల మధ్య పోరు ప్రారంభమై అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటాయి. సముద్ర తీర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగి, అగ్రరాజ్యాల మధ్య ఘర్షణకు దారితీయవచ్చు. సముద్రంలో నౌక మునిగిన రోజున.. ఆ సముద్ర శక్తి ప్రపంచ రాజకీయాల గమనాన్ని మారుస్తుందని నోస్ట్రడామస్ తన పద్యాలలో పేర్కొన్నారు.ఆర్థిక సంక్షోభం- సామాజిక అశాంతి2026లో అమెరికా, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని నోస్ట్రడామస్ అంచనా వేశారు. ఫలితంగా ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగి, సామాజిక అశాంతికి దారితీయవచ్చు. విపరీతమైన ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలువురు అగ్రనేతల పదవులు చేజారిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.ప్రకృతి ప్రకోపం: తీవ్రమైన ఎండలు, వరదలుపర్యావరణ పరంగా కూడా 2026 అత్యంత ప్రమాదకరంగా ఉండబోతోంది. నోస్ట్రడామస్ తెలిపిన వివరాల ప్రకారం తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల పలు ప్రాంతాలు ఎడారులుగా మారిపోతాయి. ఆ తర్వాత ఒక్కసారిగా కురిసే భారీ వర్షాలతో భీకర వరదలు సంభవిస్తాయి. నీటి మట్టాలు పెరగడం వల్ల పర్యావరణానికి, మానవజాతికి అపార నష్టం వాటిల్లుతుందని ఈ ఫ్రెంచ్ జ్యోతిష్యుడు అంచనా వేశారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధిపత్యంరాబోయే కాలంలో సాంకేతిక రంగంలో వచ్చే కీలక మార్పులను ఆయన ముందే ఊహించారు. 2026లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం సలహాదారుగా మాత్రమే కాకుండా, నిర్ణయాధికార స్థాయికి చేరుకుంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు, అన్ని వ్యవస్థలు ఏఐ నియంత్రణలో నడిచే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.అణు దాడి- అంతరిక్ష కార్యక్రమాల పతనంమరో భయానక అంచనా ప్రకారం.. 2026లో అణు దాడి జరిగే అవకాశం ఉంది. ఇది మానవజాతి అంతరిక్ష పరిశోధనలపై ప్రభావం చూపనుంది. ‘మార్స్’పై చీకట్లు కమ్ముకుంటాయని, అలాగే ఒక ప్రముఖ దేశం అణు దాడికి సిద్ధమవుతుందని ఆయన హెచ్చరించారు.ఆహార ధాన్యాల ధరల పెరుగుదలనోస్ట్రడామస్ అంచనాల్లో గోధుమలు, ఇతర ఆహార ధాన్యాల ధరల పెరుగుదల కూడా ఉంది. ఆయన పద్యాల్లో నిర్దిష్టమైన తేదీలు లేకపోయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నోస్ట్రడామస్ చెప్పిన ఈ అంచనాలు చాలా వరకు అస్పష్టంగా ఉంటాయని, వీటిని ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నోస్ట్రడామస్ అంచనాలకు దగ్గరగా ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఉన్నాయని పలువురు అంటున్నారు.ఇది కూడా చదవండి: ఈ ఐదు ఘటనలు చాలు.. ‘టాటా’ రియల్ హీరో.. -
ఉక్రెయిన్కు పుతిన్ సంచలన హెచ్చరిక
మాస్కో: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు శాంతి చర్చల వేళ అధ్యక్షుడు పుతిన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరు దేశాల మధ్య శాంతియుత మార్గం ద్వారా సమస్య పరిష్కారానికి ఉక్రెయిన్ ముందుకు రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. లేని పక్షంలో సైనిక మార్గాలను అనుసరించాల్సి ఉంటుందని పుతిన్ చెప్పుకొచ్చారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా ఆ దేశ మిలిటరీ కమాండ్ పోస్టును సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరిసిమోవ్, రష్యన్ దళాలతో పుతిన్ చర్చలు జరిపారు. అనంతరం పుతిన్ మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం చర్చలు జరుగుతున్నాయి. శాంతి చర్చలపై ఉక్రెయిన్ అధికారులకు పెద్దగా ఆసక్తి లేనట్లుగా ఉంది. సమస్య పరిష్కారానికి వాళ్లు తొందరపడటం లేదు. ఒక వేళ ఉక్రెయిన్ అధికారులు ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఇష్టపడకపోతే.. ప్రత్యేక సైనిక చర్యతో మా లక్ష్యాలను సాధిస్తాం. రష్యా దాడులు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.రష్యా దాడులు.. మరోవైపు.. శాంతి చర్చల వేళ ఉక్రెయిన్పై రష్యా దళాలు విరుచుకుపడ్డాయి. కీవ్పై లాంగ్ రేంజ్ ప్రెసిషన్ గైడెడ్ ఆయుధాలతో భారీ దాడి చేసింది. ఈ దాడులను జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్ దౌత్యపరమైన మార్గాలకు కట్టుబడి ఉందని.. మాస్కోనే యుద్ధం పొడిగించాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత రష్యా దాడుల్లో ఉక్రెయిన్లో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. అంతేకాకుండా భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలిసింది. JUST IN:🇷🇺 Putin in full military uniform:" If Kiev does not want peace, Russia will achieve all Special Military Operation goals by MILITARY means" pic.twitter.com/CCMLzoA1GB— Megatron (@Megatron_ron) December 27, 2025 -
ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని ఇంధన వనరులు, సైనిక మౌలిక వసతులే లక్ష్యంగా రష్యా శనివారం వేకువజాము నుంచి మరోమారు భారీ దాడులకు తెరతీసింది. కింఝాల్ హైపర్సోనిక్ క్షిపణులు, డ్రోన్లను పెద్ద సంఖ్యలో ప్రయోగించింది. బాంబు మోతలతో కీవ్ కొన్ని గంటలపాటు ప్రతిధ్వనించింది. వివిధ ఘటనల్లో కనీసం ఒకరు చనిపోయారు. 32 మంది గాయపడ్డారు.కాగా, ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు ఓవైపు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నా, రష్యా మాత్రం తన దాడులను ఆపడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కలవనున్న నేపథ్యంలోనే ఈ భారీ దాడి జరగడం గమనార్హం. చర్చల్లో ప్రధానంగా భద్రతా హామీలపైనే పట్టుబడతామని జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. శాంతి చర్చలకు ముందు జరిగిన ఈ దాడి పుతిన్ మనస్తత్వాన్ని తెలియజేస్తుందని అన్నారు.BREAKING: Russia launched a massive attack on Kyiv and across Ukraine, firing roughly 500 drones and 40 missiles, hitting residential areas and knocking out power and heat in parts of the capital, ahead of President Zelenskyy’s meeting with Donald Trump in Florida on Sunday. pic.twitter.com/N1aSuRxJO9— Republicans against Trump (@RpsAgainstTrump) December 27, 2025ఇక, రష్యా మాత్రం.. భూమి, వాయు, సముద్ర మార్గాల్లో కీవ్పై లాంగ్ రేంజ్ ప్రెసిషన్ గైడెడ్ ఆయుధాలతో భారీ దాడి చేపట్టినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ పేర్కొంది. మొత్తం 519 డ్రోన్లు, 40 వరకు క్షిపణులను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. దాడుల ఫలితంగా కీవ్లోని చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా బంద్ అయినట్లు వెల్లడించింది. దాడుల్లో పది వరకు బహుళ అంతస్తుల నివాస భవనాలు దెబ్బతిన్నాయని, కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయని వివరించింది. మరోవైపు.. తాము ఉక్రెయిన్ ఇంధన, మిలిటరీ సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేపట్టామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కీవ్ తమ దేశంలోని జనావాసాలపై చేసిన దాడులకిది ప్రతీకారమని తెలిపింది.500 drones & 40 missiles were used by russia this night and morning. Most of them targeted Kyiv.Energy, critical civilian infrastructure & residential areas were under attack.Many households in Kyiv & the region are left without power & heat.It's subzero temperature in Ukraine pic.twitter.com/51V2uqUn3V— Ania_In_UA (@Ania_In_UA) December 27, 2025 -
తైవాన్లో భారీ భూకంపం.. వీడియోలు వైరల్
తైపీ: తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంపం ధాటికి రాజధాని తైపీలో పలు భవనాలు కుప్పకూలిపోయాయని.. 73 కి.మీ (45 మైళ్ళు) లోతున భూకంపం సంభవించిందని వాతావరణ శాఖ యంత్రాంగం తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వివరాల మేరకు.. తైవాన్ ఈశాన్య తీర నగరమైన యిలాన్కు సుమారు 32 కి.మీ దూరంలో శనివారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్స్కేల్పై 7గా నమోదైంది. భూప్రకంపనల కారణంగా రాజధాని తైపేలో నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు జాతీయ అగ్నిమాపక సంస్థ తెలిపింది. బుధవారం 6.0 తీవ్రతతో వచ్చిన ప్రకంపనల అనంతరం ఈ వారంలో ఆ ద్వీపాన్ని తాకిన రెండో భారీ భూకంపం ఇది.🚨⚡⚡Video documents the moment the earthquake struck Taiwan today #earthquake #Taiwan pic.twitter.com/3wASXHGKvv— MOSCOW NEWS 🇷🇺 (@MOSCOW_EN) December 27, 2025 కాగా, తైవాన్ రెండు టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ దగ్గర ఉంది. భూకంపాలకు గురయ్యే అవకాశం ఉంది. భూకంపం తర్వాత సునామీ హెచ్చరిక జారీ చేయలేదని తైవాన్ అగ్నిమాపక శాఖ తెలిపింది. భవనాలు కంపిస్తుండగా ప్రజలు భయాందోళనకు గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. 2016లో దక్షిణ తైవాన్లో సంభవించిన భూకంపంలో 100 మందికి పైగా మరణించగా, 1999లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2,000 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం మరణాలు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. 🚨 MAJOR EARTHQUAKE UPDATE: A powerful magnitude 7.0 quake just struck off Taiwan's east coast at 11:05 PM! Epicenter located 32.3km east of Yilan County at 72.8km depth. Tremors felt across Taiwan AND southern Japan's islands. pic.twitter.com/n20g8M1eBy— TVBS World Taiwan (@tvbsworldtaiwan) December 27, 2025Before the magnitude 7.6 earthquake struck Taiwan, people captured unusual phenomena on Hehuan Mountain in Taiwan. pic.twitter.com/BqAIcnhpUT— Real Taiwan news (@RealTaiwannews) December 27, 2025 -
17 ఏళ్ల తర్వాత ఓటరుగా..
ఢాకా/న్యూఢిల్లీ: బ్రిటన్లో ప్రవాసజీవితం గడుపుతున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పారీ్ట(బీఎన్పీ) తాత్కాలిక చైర్మన్, మాజీ మహిళా ప్రధాని ఖలీదా జియా తనయుడు తారిఖ్ రెహ్మాన్ పదిహేడు సంవత్సరాల తర్వాత మళ్లీ బంగ్లాదేశ్ ఓటరుగా తన పేరును నమోదుచేయించుకున్నారు. లండన్ నుంచి ఇటీవల స్వదేశానికి తిరిగొచ్చిన రెహ్మాన్ శనివారం ఓటరు జాబితాలో తన పేరును జతచేయడంతోపాటు జాతీయ గుర్తింపు(ఎన్ఐడీ) కార్డును సంపాదించినట్లు బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ శనివారం ఢాకాలోని ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చిన రహ్మాన్ నుంచి అధికారులు వేలి గుర్తులు, ఐరిస్ స్కాన్ తీసుకుని ఓటర్గా పేరు నమోదుచేశారు. అంతకుముందే రెహ్మాన్ తన ఓటరు దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించారని ఎన్నికల కమిషన్లోని జాతీయ గుర్తింపు నమోదు విభాగ డైరెక్టర్ జనరల్ హుమయూన్ కబీర్ వెల్లడించారు. రెహ్మాన్తోపాటు ఆయన కుమార్తె జైమా సైతం ఎన్ఐడీ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2007–08 రాజకీయ సంక్షోభం తర్వాత ఫక్రుద్దీన్ అహ్మద్ సారథ్యంలోని సైనిక తాత్కాలిక ప్రభుత్వం తొలిసారిగా 2008లో బంగ్లాదేశ్లో ఫొటో, బయోమెట్రిక్ డేటాతో ఓటర్ జాబితాను తయారుచేయడం తెల్సిందే. ఆ కాలంలో రాజకీయ ఖైదీగా ఉన్న రెహ్మాన్ను జైలు నుంచి విడుదలచేయగానే ఆయన 2008 సెపె్టంబర్ 11వ తేదీన లండన్కు వెళ్లిపోయారు. దీంతో ఆయన పేరు ఓట్ల జాబితాలో నమోదుకాలేదు. ఆ తర్వాత వైరి వర్గానికి చెందిన షేక్ హసీనా పార్టీ అధికారంలోకి రావడంతో రెహ్మాన్ ఇంకెప్పుడూ స్వదేశానికి రాలేదు. -
‘వాణిజ్యం’లో మధ్యవర్తిగా కింగ్ ఛార్లెస్!
లండన్: అమెరికా, బ్రిటన్ చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందంలో స్వయంగా బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్–3 మధ్యవర్తిత్వం వహించనున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. తండ్రి ఛార్లెస్తోపాట బ్రిటన్ యువరాజు విలియం సైతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయి బ్రిటన్ తరఫున మంతనాలు జరిపే అవకాశముంది. బ్రిటన్–అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారే లక్ష్యంగా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఛార్లెస్ అమెరికాలో పర్యటించనున్నారు. అదే నిజమైతే గత 20 ఏళ్లలో అమెరికాలో అడుగుపెడుతున్న తొలి బ్రిటన్ రాజపాలకుడిగా చార్లెస్ రికార్డ్సృష్టించనున్నారు. వాణిజ్య చర్చల్లో ఛార్లెస్, విలియం ప్రమేయాన్ని ఉటంకిస్తూ ‘ది టైమ్స్’ ఒక కథనం ప్రచురించింది. వచ్చే ఏడాది జులైలో కెనడా, మెక్సికోలతో సంయుక్తంగా అమెరికా ప్రపంచ ఫుట్బాల్ కప్ మ్యాచ్లను నిర్వహించనుంది. వాటిని తిలకించేందుకు విలియం అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఛార్లెస్, విలియం పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. వాణిజ్య ఒప్పందానికి తుది రూపునిచ్చేందకు జరిగే కీలక చర్చల్లో తండ్రీకొడుకులు భాగస్వాములుగా మారతారని సమాచారం. అయితే విలియం, ఛార్లెస్లకు ఇంకా అమెరికా నుంచి ఎలాంటి అధికారిక ఆహ్వానాలు అందలేదు. ఈ ఏడాది సెప్టెంబర్లో బ్రిటన్లో ట్రంప్ పర్యటించినప్పుడే బ్రిటన్లోకి 31 బిలియన్ పౌండ్ల పెట్టుబడిపై ఆశలు చిగురించాయి. కానీ బ్రిటన్లో కఠినతర ఆన్లైన్ భద్రతా నిబంధనలు, డిజిటల్ సేవా పన్ను, ఆహార భద్రతలో కఠిన నిబంధనలతో బ్రిటన్ సాంకేతిక రంగంలో ప్రతిపాదిత బిలియన్ డాలర్ల పెట్టుబడులపై ఈ నెలలోనే అమెరికా ప్రభుత్వం మోకాలడ్డింది. మా రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని బ్రిటన్ చెబుతుండగా అమెరికా రైతులకూ అవకాశం ఇవ్వాలని ట్రంప్ సర్కార్ అభ్యర్థిస్తోంది. -
కెనడాలో భారత్ హెల్ప్సెంటర్
టొరంటో: కెనడాలో కుంగుబాటు తదితర మానసిక సమస్యలతో బాధపడుతున్న భారతీయ మహిళల కోసం టొరంటోలోని కాన్సులేట్ జనరల్ కార్యాలయం ప్రత్యేకమైన హెల్ప్ డెస్క్ ప్రారంభించింది. ఇన్ స్టాప్ సెంటర్ ఫర్ విమెన్ (ఓఎస్సీడబ్ల్యూ)గా పిలిచే ఈ కేంద్రం నిరంతరం పనిచేస్తుంది. గృహ హింస , కుటుంబ సమస్యలు, అణచివేత, లైంగిక, ఇతరత్ర దోపిడీ, న్యాయ సవాళ్లు తదితరాలు ఎదుర్కొంటున్న మహిళలకు సకాలంలో సాయం అందించడమే దీని లక్ష్యమని కార్యాలయం తెలిపింది. -
ఫొటో 2025
వేయి వాక్యాల్లో చెప్పలేని విషయాన్ని ఒక్క ఫొటో పట్టిచూపుతుందని ఒక విశ్లేషణ. అలా 2025 ఏడాదిలో విశ్వవ్యాప్తంగా పలు ఘటనలు చరిత్రలో నిలిచిపోయాయి.సమాజంపై ప్రభావితంచూపిన, చర్చనీయాంశమైన చిత్రాలివి..పెళ్లయి కాళ్లకు పారాణి కూడా ఆరకముందే ఉగ్రవాదుల పైశాచికకాండలో భర్తను కోల్పోయి అతని మృతదేహం వద్ద నిశ్చేష్టురాలై కూలబడిన నవ వధువు ఫొటో ఇది. పెళ్లయిన ఆరు రోజులకే నూరేళ్లు నిండిపోయిన భారత నావికాదళాధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకోగా కాపాడండి అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరచి అలసిపోయిన భార్య హిమాన్షీ ఫొటో ప్రపంచవ్యాప్తంగా అన్ని మీడియాలో ప్రచురితమైంది. ఏప్రిల్ 22వ తేదీ జమ్మూకశ్మీర్లోని పహల్గాం పరిధిలోని బైసారన్ పచ్చికబయళ్లలో అమాయక పర్యాటకులపై ఉగ్రమూకలు దాడిచేయడం, అందుకు ప్రతిగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రమూకల స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట దాడులు చేయడం తెల్సిందే.అగ్రరాజ్యాధినేత అధికారి నివాసం వైట్హౌస్ ఒక్కసారిగా రచ్చబండగా మారిన అరుదైన క్షణం తాలూకు ఫొటో ఇది. మాట్లాడుకుందాం అంటూ ఆహా్వనించి మీడియా ప్రతినిధుల ఎదుట ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్కువచేసి మాట్లాడటం, దానికి జెలెన్స్కీ దీటుగా బదులివ్వడం, చివరకు ద్వైపాక్షిక భేటీ వాగ్వాదాలమయంగా మారడం తెల్సిందే. ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన ఈ వాగ్వాదాన్ని ప్రత్యక్ష ప్రసారాల్లో ప్రపంచదేశాలన్నీ చూశాయి. అతిథిని అవమానించిన ట్రంప్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయల్దేరిన విమానం గాల్లోకి లేచిన 32 సెకన్లకే ఎదురుగా ఉన్న వైద్యకళాశాల భవనంపై కుప్పకూలిన అత్యంత విషాధ ఘటన తాలూకు ఫొటో ఇది. 12 మంది విమాన సిబ్బంది, 230 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలి అగ్నిగుండంగా మారి బూడిదైంది. ఈ ఘటనలో ఒక్కరే బతికి బయటపడ్డారు. విమానంలో సాంకేతిక లోపమా? పైలట్ తప్పిదమా అనేది మిస్టరీగా మారింది. దేశీయ విమానయాన రంగ భద్రతపైనా ఈ దుర్ఘటన నీలినీడలు కమ్మేలా చేసింది.వేగంగా మండే స్వభావమున్న వెదురు కర్రలు, స్టీరోఫోమ్ కిటికీలను నెలలతరబడి మరమ్మతుల కోసం వినియోగించడంతో అనుకోకుండా అంటుకున్న నిప్పురవ్వలు చివరకు హాంకాంగ్లోని ప్రముఖ వాంగ్ఫుక్ కోర్ట్ కాంప్లెక్స్ బహుళ అంతస్తుల భవనాలను నిలువునా బూడిదచేసిన దారుణోదంతం ఫొటో ఇది. ఈ ఘటనలో ఏకంగా 161 మంది ప్రాణాలు కోల్పోయారు. నవంబర్ 26వ తేదీన జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదం తర్వాత హాంకాంగ్లో వెదురు కర్రలు, స్టీరోఫోమ్ వినియోగంపై పెద్ద చర్చే మొదలైంది. అవినీతి, వారసత్వ రాజకీయాలు, నేతల విలాసవంత జీవితం, అసమర్థ, అస్తవ్యస్త పాలనతో విసిగిపోయిన నేపాల్ యువత ఉవ్వెత్తున నిరసనోద్యమంగా ఎగసిపడిన క్షణం నాటి ఫొటో ఇది. జెన్ జెడ్ ఉద్యమంగా నేపాల్ ప్రధాన నగరాల్లో వేలాదిగా బారులుతీసిన విద్యార్థులు ప్రభుత్వాన్ని బలవంతంగా కూలదోశారు. ఈ దెబ్బకు సెపె్టంబర్ 9న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, కేబినెట్ మంత్రులు పదవులకు రాజీనామాచేసి సురక్షిత ప్రాంతాలకు పారిపోవడం తెల్సిందే. వారం తిరిగేలోపే మాజీ సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి సుశీల కర్కి తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.గాజాపై నెలల తరబడి వేల కొద్దీ బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుండటంతో ఇళ్లు, ఆస్పత్రులు సహా ప్రతి కట్టడం కుప్పకూలడంతో నిలువనీడలేక, తినడానికి తిండిలేక, దుర్భర దారి్రద్యంలో బతుకీడుస్తూ అన్నదాన శిబిరాల వద్ద గిన్నె పట్టుకుని ఆహారం కోసం పోటీపడుతున్న చిన్నారులు వీరంతా. ఈ ఏడాది మొదట్లో గాజాలో ఓ శరణార్థి శిబిరంలో తీసిన ఈ ఫొటో అక్కడి దయనీయ స్థితికి అద్దంపడుతోంది. ఇకనైనా ఇజ్రాయెల్ దారుణదాడులను నిలిపివేయాలని ప్రపంచదేశాలు వేడుకుంటున్నా అమెరికా అండతో ఇజ్రాయెల్ ఈ అభ్యర్థనలను పెడచెవిన పెడుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
2025: ట్రంప్ నామ సంవత్సరం
కాలం నిజంగానే మాయల మరాఠీ. రెప్పపాటే అనిపిస్తుంది గానీ చూస్తుండగానే శరవేగంగా సాగిపోతుంది. ఆ క్రమంలో మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. మంచీ చెడుల మిశ్రమ అనుభూతులు పంచి 2025 త్వరలో వీడ్కోలు చెప్పనుంది. ఈ సంవత్సరంలో ఎంతోమంది ప్రముఖులు మెరుపులు మెరిపించారు. కొందరు మరకలు అంటించుకుని తల దించుకున్నారు. ఇంకొందరు అనన్య సామాన్యమైన సాహసాలు, రికార్డులతో ప్రముఖుల జాబితాలో చేరిపోయారు. అలా 2025లో వార్తల్లో వ్యక్తులుగా నిలిచి అందరి నోళ్లలోనూ నానిన టాప్ 10 ప్రముఖుల గురించి ఒకసారి చూద్దాం...తంపులమారి (డొనాల్డ్ ట్రంప్) నిస్సందేహంగా 2025 ట్రంప్ నామ సంవత్సరమే అని చెప్పాలి. మీడియా వ్యతిరేకత, దు్రష్పచారాల మోత తదితరాలను సమర్థంగా కాచుకుంటూ 78 ఏళ్ల లేటు వయసులో రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి ఔరా అనిపించారు. కానీ ఈ ఏడాది మొదట్లో పీఠమెక్కింది మొదలు రోజుకో ఆకస్మిక నిర్ణయంతో దేశాల గుండెల్లో అక్షరాలా రైళ్లు పరుగెత్తించారు. ముఖ్యంగా ఆయన ఎడాపెడా బాదిన టారిఫ్ల ధాటికి భారత్ తో సహా చాలా దేశాలు ఉక్కిరిబిక్కిరే అయ్యాయి. అయితే వాటిని అంతే వేగంగా తగ్గించడం, రద్దు చేయడం వంటి చర్యలతో ట్రంప్ నవ్వులపాలు కూడా అయ్యారు. అమెరికాతో పరువుతో పాటు అగ్ర రాజ్య అధ్యక్ష పీఠం హుందాతనాన్నీ తన ప్రవర్తనతో పలుమార్లు పలుచన చేశారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాక్ ఘర్షణలను తానే ఆపానని ఇప్పటికి కనీసం 75 సార్లకు పైగా ప్రకటించుకున్నారు. భారత్ నిర్ద్వంద్వంగా ఖండించినా, పాక్ కాళ్లబేరానికి వచ్చినందుకే కాల్పుల విరమణ జరిగిందని స్పష్టం చేసినా పట్టించుకోలేదు. ఈ విషయంలో సెంచరీ కొట్టడమే ట్రంప్ లక్ష్యం కనిపిస్తోందంటూ సోషల్ మీడియాలో జోకులు కూడా పేలాయి. రష్యా–ఉక్రెయిన్, గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాలను కూడా చిటికెలో ఆపేస్తానంటూ బీరాలు పలికినా అవిప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు గాజాను స్వా«దీనం చేసుకునేందుకు, వెనిజులాలోని చమురు నిల్వలను చెర పట్టేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అంతర్జాతీయంగా కాక రేపుతున్నాయి. రెండో టర్ములో ఇంకా ఏడాదైనా పూర్తవకుండానే ఇన్ని చుక్కలు చూపిన తంపులమారి ట్రంపు 2026లో ఇంకెంత విశ్వరూపం చూపుతారో చూడాలి!నిప్పులు చిమ్మి... (ఎలాన్ మస్క్) ఈ ప్రపంచ కుబేరునికి 2025 అక్షరాలా ఒక పీడకలగా మిగిలిపోతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ తో కుదిరిన దోస్తీ మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసింది. దాంతో అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దేందుకంటూ ట్రంప్ తనకు అప్పగించిన డోజ్ సారథ్యం కూడా అటకెక్కింది. చూస్తుండగానే ట్రంప్ తో మస్క్ విభేదాలు రచ్చకెక్కాయి. వారి రచ్చ నిత్యం వార్తల్లో నిలిచింది. దాంతో మస్క్ కంపెనీలు ఎక్స్, టెస్లా షేర్లు ఈ ఏడాదంతా భారీగా నేల చూపులే చూశాయి. కాకపోతే, ఏదో ఒక రూపంలో నిత్యం పతాక శీర్షికల్లో మాత్రం నిలవడం ఒక్కటే ఆయనకు ఊరట!నిరసన పతాక (మరియా కొరీనా మచాడో) వెనిజులా విపక్ష నేత. మదురో నియంతృత్వానికి వ్యతిరేకంగా చేసిన మడమ తిప్పని పోరాటానికి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఆమెను వచ్చి వరించింది. దేశాన్ని ప్రజాస్వామ్యం వైపు నడిపే పోరాటంలో అవసరమైతే ప్రాణార్పణకు కూడా సిద్ధమంటూ కొన్నాళ్ల క్రితం ఆమె చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగం అంతర్జాతీయంగా మన్ననలు అందుకుంది. ఆమెకు నోబెల్ బహుమానం నేపథ్యంలో వెనిజులాలో మానవ హక్కుల ఉల్లంఘన, మదురో నియంతృత్వం తదితరాలు మరోసారి చర్చల్లో నిలిచాయి. ట్రంప్ ను వెనక్కి నెట్టి మరీ ఆమె నోబెల్ శాంతి పురస్కారం అందుకోవడం విశేషం. అయితే, ’వెనిజులా ప్రజాస్వామిక పోరాటానికి ఇస్తున్న నిరంతర మద్దతుకు’ గాను ఆమె తన పురస్కారాన్ని ట్రంప్ కు అంకితం చేయడం విశేషంగా నిలిచింది. మచాడో తరఫున ఆమె కూతురు ఇటీవలే నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు.కుట్రలకు బలి (షేక్ హసీనా)బంగ్లాదేశ్ లో తెర వెనక కుట్రలకు బలైన మరో నేతగా నిలిచిన మాజీ ప్రధాని. భారత్ తో నిత్యం సత్సంబంధాలు కొనసాగించడమే ఆమె పాలిట శాపమైంది. విద్యార్థులు, యువత మాటు మతోన్మాద, భారత వ్యతిరేక శక్తులు ఆజ్యం పోసిన అల్లర్లకు ప్రధాన లక్ష్యంగా మారారు. ప్రధాని పదవిని, దేశాన్ని వీడి భారత్ కు పారిపోయి వచ్చారు. అనంతరం పలు నేరాలపై అక్కడి కోర్టు ఆమెకు మరణశిక్ష తో సహా పలు కఠిన శిక్షలు విధించాయి. ఆమె పార్టీ అవామీ లీగ్ గుర్తింపు కూడా రద్దయింది. 15 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన హసీనా ఇప్పుడు 78 ఏళ్ల వయసులో పొరుగు దేశంలో చివరి రోజులు గడపాల్సిన పరిస్థితిలో పడ్డారు. నారీ శక్తులు (వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషి) నారీ శక్తికి ప్రతిరూపాలు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాక్ లో మన సైన్యం సాగించిన విధ్వంసం తాలూకు విశేషాలను ఎప్పటికప్పుడు మీడియాకు వివరి స్తూ 3 రోజుల పాటు ప్రపంచమంతటి దృష్టినీ ఆకర్షించారు. పాక్ తప్పుడు ప్రచారాలను రుజువులతో సçహా ఎండగట్టారు. యుద్ధరంగంలోనే గాక మీడియా వార్ లో కూడా భారత్ ను తిరుగులేని స్థాయిలో నిలిపారు. దాంతో వారి పేర్లు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాయి. అంతర్జాతీయ సైనిక కవాతులో భారత దళానికి సారథ్యం వహించిన తొలి మహిళా ఆఫీసర్ అన్న రికార్డు సోఫియాది. కాగా వైమానిక దళంలో ఉజ్వలమైన కెరీర్ తో దేశ మహిళలకు స్పూర్తినిచ్చారు వ్యోమిక.వ్యోమ వీరుడు (శుభాంశు శుక్లా) ఆక్సియం – 4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయునిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలో కాలు పెట్టిన రెండో భారతీయుడు ఆయనే కావడం విశేషం. ఈ ఏడాది మన నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 పేర్లలో చేరారు. వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ అయిన శుభాంశు అంతరిక్ష యాత్ర దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆ రంగం పట్ల ఎనలేని ఆసక్తిని పెంచింది. జపాన్లో నారీ భేరి (సనాయే టకైచీ) ఈ అక్టోబర్ లో జపాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. రాజకీయ రంగంలో స్త్రీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే సంప్రదాయం ప్రబలంగా ఉన్న జపాన్ లో ఇది నిజంగా అనూహ్యమే. అయితే టకైచీ కేబినెట్ మాత్రం పూర్తిగా పురుషులతోనే కిటకిటలాడిపోవడం విశేషం. దాంతో, స్త్రీ శక్తిపరంగా నిజమైన మార్పులను ఊహించిన వారంతా ఆశాభంగమే చెందారు.నూతన సారథి (పోప్ లియో 14) పోప్ ఫ్రాన్సిస్ మరణానంతరం సుదీర్ఘ ఎంపిక ప్రక్రియ అనంతరం వాటికన్ పగ్గాలు చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోమన్ కాథలిక్కులకు సారథిగా గత మే నెలలో కొలువుదీరారు. అమెరికా ఖండం నుంచి వచ్చిన తొట్ట తొలి పోప్ గా కొత్త చరిత్ర సృష్టించారు.అప‘హాస్యం’ (సమయ్ రైనా, రణ్ వీర్ అలహాబాదియ) హాస్యం కాస్తా శ్రుతి మించితే ఏమవుతుందో ఫేమస్ యూట్యూబర్ రణ్ వీర్, స్టాండప్ కమెడియన్ రైనా వివాదం నిరూపించింది. తల్లిదండ్రులు, పిల్లల గురించి లైంగికపరంగా అత్యంత అసభ్యమైన కామెంట్లు, దివ్యాంగుల గురించి చౌకబారు వ్యాఖ్యలతో ప్రసారమైన వీరి పాడ్ కాస్ట్ లు అందరి ఆగ్రహానికి గురయ్యాయి. చివరికి విషయం అంటున్న న్యాయస్థానం దాకా చేరింది. కోర్టు వాళ్లకు పదేపదే అక్షింతలు వేయాల్సి వచ్చింది. క్రియేటివ్ ఫ్రీడం పేరిట వెర్రితలలు వేసే పోకడలను భారత సమాజం హర్షించబోదని ఈ ఎపిసోడ్ మరోసారి చాటింది.కాసుల వర్షమే (టేలర్ స్విఫ్ట్) సూపర్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ఈ ఏడాది అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఆమె ’ఎరాస్’ అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన సింగిల్ టూర్ గా కొత్త చరిత్ర సృష్టించింది. ఈ షోలో భాగంగా స్విఫ్ట్ ఏకంగా ఐదు ఖండాల్లో 149 షోలు చేసి అభిమానులను ఉర్రూతలూగించారు. దాంతో ’ఎరాస్’ షో దాదాపుగా 200 కోట్ల డాలర్ల కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు..దిగొచ్చిన యూనస్ ప్రభుత్వం
ఢాకా: బంగ్లాదేశ్లో ఇటీవల మైనారిటీలపై, ముఖ్యంగా హిందూ సమాజంపై జరిగిన దాడులు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. ఆలయాలపై దాడులు, ఇళ్ల ధ్వంసం, వ్యాపారాలపై దాడులు, మతపరమైన వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో తాత్కాలిక యూనస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ ఘటనలను తీవ్రంగా ఖండించింది. దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మైనారిటీల భద్రత కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయబడింది. హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిపై కఠిన శిక్షలు విధిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.హిందూ సమాజానికి చెందిన నాయకులు, ముఖ్యంగా దీపు చంద్ర దాస్, ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ, “మైనారిటీలపై దాడులు దేశ ప్రజాస్వామ్యానికి, మానవ హక్కులకు విరుద్ధం. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి” అని అన్నారు. ఈ ఘటనలపై అంతర్జాతీయ స్థాయిలో కూడా తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమైంది. పలు మానవ హక్కుల సంస్థలు బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఖండించాయి. ఐక్యరాజ్యసమితి సహా పలు దేశాలు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మైనారిటీల రక్షణకు కట్టుబడి ఉండాలని కోరాయి.మొత్తానికి, బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులు దేశ ప్రజాస్వామ్యానికి, సామాజిక సమగ్రతకు పెద్ద సవాలుగా మారాయి. తాత్కాలిక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. మైనారిటీల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ సమాజం కూడా కళ్లప్పగించి చూస్తోంది. -
పెళ్లి చేసుకోలేదంటే జరిమానా.. గ్రామస్తుల తీర్మానం
బీజింగ్: చైనాలోని ఓ గ్రామం ఇటీవల తీసుకున్న నిర్ణయం ఆ దేశవ్యాప్తంగా, సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారింది. గ్రామ కమిటీ ప్రత్యేకంగా రూపొందించిన నియమావళి ప్రకారం.. ఆ ఊరి గ్రామస్తులు ఆలస్యంగా వివాహం చేసుకోవడం, గర్భధారణకు సంబంధించిన నియమాలు పాటించని వారికి, అలాగే పిల్లల పెంపకం విధానాల్లో మార్పులు చేసిన వారికి జరిమానాలు విధిస్తూ ఆ ఊరి పెద్దలు తీర్మానించారు. జరిమానా వివరాలు• పెళ్లి కాకముందే గర్భం దాల్చితే 3,000 యువాన్ (సుమారు రూ.35,000).• పెళ్లి కాకముందే కలిసి నివసిస్తే సంవత్సరానికి 500 యువాన్ (సుమారు రూ.6,000).• బయటి ప్రావిన్స్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే 1,500 యువాన్ (సుమారు రూ.18,000).• అసత్య వదంతులు వ్యాప్తి చేస్తే 500 నుంచి 1,000 యువాన్ జరిమానా.ఈ వార్త వెలుగులోకి రావడంతో నెటిజన్లు ఊరు పెద్దలు తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నల వర్షం కురిపించారు. చాలా మంది నెటిజన్లు ఈ నియమాలను వ్యక్తిగత స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. వివాహం ఎప్పుడు చేసుకోవాలి? పిల్లల్ని ఎప్పుడు కనాలి? అనేది వ్యక్తిగత నిర్ణయం. దానిపై గ్రామ కమిటీకి హక్కు ఎలా వస్తుంది?’ అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, కొందరు మాత్రం గ్రామంలో జనాభా నియంత్రణ కోసం తీసుకున్న చర్యలుగా సమర్థిస్తున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం, చైనాలో ప్రస్తుతం జనన రేటు తగ్గుదల (Demographic Winter) ఒక పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం జనన రేటు పెంచాలని ప్రయత్నిస్తున్న సమయంలో, గ్రామ స్థాయిలో ఇలాంటి జరిమానాలు విధించడం వ్యతిరేక ధోరణిగా కనిపిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న విధానాలకు విరుద్ధమని విశ్లేషకులు చెబుతున్నారు.ఈ సంఘటనతో చైనా గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక నియంత్రణ ఎంత కఠినంగా అమలవుతోందో బయటపడింది. ఒకవైపు ఆధునికీకరణ, ఆర్థికాభివృద్ధి దిశగా చైనా దూసుకెళ్తుంటే, మరోవైపు గ్రామాల్లో ఇలాంటి నియమాలు వ్యక్తిగత స్వేచ్ఛను ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి. మొత్తానికి, ఈ గ్రామం తీసుకున్న నిర్ణయాలు స్థానిక సమస్యగానే కాకుండా, జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. -
రాకెట్ లాంటి రైలు.. 2 సెకన్లలోనే 700 KMPH వేగంతో పరుగులు..
బీజింగ్: చైనాలో మాగ్లేవ్ రైలు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ రైలు కేవలం రెండు సెకన్లలోనే గంటకు 700 కిలోమీటర్ల వేగాన్ని చేరి రికార్డు సృష్టించింది. చాంగ్షాలో నిర్వహించిన ఈ ప్రయోగం చైనాలో సాంకేతిక ఆధిపత్యాన్ని మరోసారి చాటింది.మాగ్లేవ్ ట్రైన్ సాంకేతికతలో రైలు పట్టాలపై నేరుగా నడవదు. బలమైన అయస్కాంత శక్తి సహాయంతో గాల్లో తేలుతూ ముందుకు సాగుతుంది. దీని వల్ల ఘర్షణ తగ్గి అత్యధిక వేగాన్ని సాధించడం సాధ్యమవుతుంది. ఈ రికార్డు స్థాయి వేగం భవిష్యత్తులో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీయనుంది.నిపుణుల అంచనా ప్రకారం, బీజింగ్ నుంచి షాంఘై వరకు ప్రయాణం కేవలం రెండు గంటల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. పర్యావరణహితమైన ఈ రైలు ఇంధన వినియోగాన్ని తగ్గించడమే కాకుండా శబ్ద కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. చైనా ప్రభుత్వం దీన్ని జాతీయ గర్వంగా భావిస్తూ, రాబోయే దశాబ్దాల్లో దేశవ్యాప్తంగా మాగ్లేవ్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ విజయంతో చైనా ప్రపంచ రవాణా రంగంలో ముందంజలో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.అమెరికా, జపాన్, యూరప్ వంటి దేశాలు కూడా మాగ్లేవ్ ట్రైన్ సాంకేతికతపై పరిశోధనలు చేస్తున్నప్పటికీ, చైనా సాధించిన ఈ వేగం వారిని ఆశ్చర్యపరిచింది. మొత్తంగా, ఈ ప్రయోగం కేవలం చైనాకే కాకుండా ప్రపంచ సాంకేతికతలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది.Reporter left speechless after witnessing Japan's new $70 million Maglev train in action at 310 mphpic.twitter.com/nexIApcmRh— Massimo (@Rainmaker1973) November 25, 2025 -
ష్.. 30 ఏళ్లగా నిశ్శబ్దం… లారా పుట్టింది.. గ్రామం మళ్లీ నవ్వింది!
రోమ్:ఇటలీ అబ్రుజ్జో పర్వత ప్రాంతంలోని పాగ్లియారా డై మార్సి అనే చిన్న గ్రామం. గత 30ఏళ్లుగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. యువకులు, కుటుంబాలు వలస వెళ్లిపోవడంతో పాఠశాలలు మూతపడ్డాయి, వీధులు వెలవెలబోయాయి. మిగిలిన కొద్దిమంది వృద్ధులు మాత్రమే అక్కడ జీవనం సాగిస్తున్నారు.అయితే ఈ నిశ్శబ్దాన్ని మార్చిన సంఘటన ఈ సంవత్సరం మార్చిలో చోటుచేసుకుంది. లారా బుస్సి ట్రాబుక్కో అనే చిన్నారి జననం గ్రామానికి కొత్త ఊపిరి పోసింది. ఆమె తల్లిదండ్రులు సింజియా ట్రాబుక్కో, పావ్లో బుస్సి. లారా పుట్టడంతో గ్రామ జనాభా 20కి చేరింది. ఒకప్పుడు పిల్లల కిలకిలారావాలు వినిపించని వీధులు ఇప్పుడు కొత్త ఆశతో నిండిపోయాయి.ప్రభుత్వం నుంచి బోనస్ఇటీవల యూరప్ దేశాలైన ఇటలీ,స్పెయిన్,జర్మనీలలో జననాల రేటు తగ్గిపోతుంది. దీంతో జనాభా రేటును పెంచేందుకు ఆయా దేశాలు ప్రోత్సహకాలు అందిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సైతం పిల్లల్ని కన్న తల్లిదండ్రులకు బేబీ బోనస్ కింద వెయ్యి యూరోలు ఇస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా లారా జన్మించడంతో ఆమె కుటుంబానికి 1000 యూరోలు (సుమారు రూ.90,000) విలువైన బేబీ బోనస్ అందించింది. లారా పుట్టుక ఒక కుటుంబానికి మాత్రమే కాకుండా, ఇటలీ ఎదుర్కొంటున్న జనాభా సంక్షోభానికి ప్రతీకగా నిలిచింది. దేశంలో జనన రేటు తగ్గిపోవడం వల్ల అనేక గ్రామాలు వెలవెలబోతున్నాయి. పాగ్లియారా డై మార్సి గ్రామం ఈ సమస్యకు ప్రత్యక్ష ఉదాహరణ.గ్రామస్తుల స్పందనగ్రామస్తులు లారా పుట్టుకను కొత్త జీవంగా భావిస్తున్నారు. మా గ్రామం మళ్లీ బతికింది అని వారు ఆనందం వ్యక్తం చేశారు. పిల్లల పుట్టుకతో గ్రామానికి మళ్లీ భవిష్యత్తు ఉందన్న నమ్మకం కలిగిందని వారు చెబుతున్నారు. 30 ఏళ్ల తర్వాత పుట్టిన లారా చిన్నారి పాగ్లియారా డై మార్సి గ్రామానికి కొత్త ఆశను తెచ్చింది. ఒక చిన్నారి పుట్టుకతో ఒక గ్రామం మళ్లీ జీవం పొందడం, దేశవ్యాప్తంగా జనాభా సంక్షోభంపై చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది. -
పాకిస్థాన్ను వీడుతున్న మేథోసంపత్తి
పాకిస్థాన్లో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ని జైలులో ఉంచడం, పాక్ ఆర్మీ చీఫ్గా ఆసిమ్ మునీర్ బాధ్యతలు చేపట్టడం,ఉగ్రవాద ప్రభావితం అధికంగా ఉండడం తదితర కారణాలతో అంతర్గతంగా పాక్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావం ఆదేశ మేథో సంపత్తిపై పడుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన రెండేళ్లలో పాక్ నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, అకౌంటెంట్లు పెద్దఎత్తున వలస వెళ్లినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.ఏ దేశ భవిష్యత్తయిన అక్కడి మేథో సంపత్తిపై ఆదారపడి ఉంటుంది. దేశంలోనే ప్రతిభావంతులు ఉపాధి, శాంతి భద్రతలు, తదితర కారణాలతో దేశాన్ని వీడినట్లయితే ఆదేశ అభివృద్దికే ప్రమాదం. ప్రస్తుతం పాకిస్థాన్ ఆ పరిస్థితుల్లేనే ఉన్నట్లు తెలుస్తోంది. మిలిటరీచీఫ్గా ఆసిమ్ మునీర్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పాక్లో రాజకీయ అనిశ్చితి నెలకొందని నివేదికలు పేర్కొంటున్నాయి.గడిచిన 24 నెలలో పాకిస్థాన్లోని అంతర్గత పరిస్థితుల కారణంగా దాదాపు 5 వేల మంది డాక్టర్లు, 11 వేల మంది ఇంజినీర్లు, 13 వేల మంది అకౌంటెంట్లు దేశాన్ని వీడారని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ మేథో సంపన్న వర్గం దేశాన్ని వీడడానికి అక్కడి ఆర్మీచీఫ్ ఆసిమ్ మునీర్ నిరంకుశ విధానాలే కారణమని అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ పరిస్థితిపై పాక్ ఆర్మీచీఫ్ వ్యంగ్యంగా స్పందించారు. వారి వలస దేశానికి "బ్రెయిన్ గేన్" మాట్లాడారు.పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితిపై ఆదేశ సెనెటర్ ముస్తఫా నవాజ్ కోకర్ స్పందించారు. పాకిస్థాన్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఫ్రీలాన్సింగ్ ఎకానమీగా ఉందని తెలిపారు. ఇంటర్నెట్ షట్డౌన్స్ వల్ల 1.62 బిలియన్ డాలర్లు నష్టం జరిగిందన్నారు. అంతే కాకుండా 2.37 మిలియన్ల ఫ్రీలాన్సింగ్ జాబులు రిస్కులో పడ్డాయన్నారు. ఈ ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలంటే ముందుగా రాజకీయాల్ని సరిదిద్దాలి అని తెలిపారు.2024 పాకిస్థాన్ నివేదికల ప్రకారం విదేశాలలో ఉద్యోగాల కోసం 7,27,381 మంది రిజిష్టర్ చేసుకున్నారు. ఈ ఏడాది నవంబర్ వరకూ దాదాపు 6,87,246 మంది ఉపాధి కోసం అప్ల్పై చేసుకున్నారు. అంతేకాకుండా 2011-2024 మధ్య ఆదేశం వీడి వెళ్లిన ఆరోగ్య సిబ్బంది శాతం గతంతో పోలిస్తే 2,144 శాతం పెరిగిందని డేటా తెలుపుతుంది ఇదిలా ఉండగా పాకిస్థాన్ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కొంతమంది అక్కడి బిచ్చగాళ్ల మాఫియా మారారు. దీంతో దేశ పర్యాటక రంగం దెబ్బతింటుందని వారిని వెనక్కి పంపించి వేస్తున్నారు. దీంతో పాకిస్థాన్ పరువు అంతర్జాతీయంగా మంటగలిసింది. -
భారత్-కెనడా మధ్య చిగురిస్తున్న వాణిజ్య బంధం
భారత్-కెనడా దేశాల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న దౌత్యపరమైన స్తబ్ధత వీడనుంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మెరుగవ్వనున్నాయి. ఈ దేశాల మధ్య అత్యంత కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) లేదా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్షిప్ అగ్రిమెంట్-CEPA) పునరుద్ధరణకు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా చర్చలు ప్రారంభం కానున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.కీలక పర్యటనలు - సన్నాహక చర్చలుకేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫిబ్రవరిలో కెనడాలో పర్యటించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భాగంగా చర్చలకు పచ్చజెండా ఊపనున్నారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య అనధికారికంగా సన్నాహక చర్చలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందాల తరహాలోనే కెనడా కూడా పరస్పర రాయితీలతో కూడిన ఒక బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవాలని రంగం సిద్ధం చేస్తోంది.మార్క్ కార్నీ రాకతో మారిన సమీకరణాలు2023 సెప్టెంబర్లో హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణం విషయంలో జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన సంగతి తెలిసిందే. అయితే, 2025 మార్చిలో మార్క్ కార్నీ కెనడా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. ఇటీవల జోహన్నెస్బర్గ్లో జరిగిన జీ20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాని మార్క్ కార్నీ మధ్య జరిగిన భేటీ ఈ ఒప్పందానికి పునాది వేసింది.50 బిలియన్ డాలర్ల వాణిజ్యం లక్ష్యంఅమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశీ ఉత్పత్తులపై (భారతీయ వస్తువులపై 50% వరకు) భారీ టారిఫ్లు విధిస్తున్న నేపథ్యంలో భారత్-కెనడా ఒప్పందం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 2030 నాటికి ఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. కెనడా ప్రభుత్వం ఇప్పటికే డిసెంబర్ 13, 2025 నుంచి జనవరి 27, 2026 వరకు ఈ ఒప్పందంపై ప్రజాభిప్రాయాలను సేకరిస్తోంది.రాజకీయ ఉద్రిక్తతలను పక్కన పెట్టి ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా భారత్, కెనడాలు ముందుకు సాగుతున్నాయి. ఫిబ్రవరిలో పీయూష్ గోయల్ పర్యటనతో ఈ ఒప్పందం పట్టాలెక్కితే అది రెండు దేశాల వ్యవసాయం, ఐటీ, తయారీ రంగాల్లోని ఎగుమతిదారులకు ఊరటనిస్తుంది.ఇదీ చదవండి: రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం -
పెళ్లి చేసుకోకుంటే పన్ను కట్టాలా?
ప్రపంచంలో కొన్ని ఊళ్లు కొన్ని కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ఇదే క్రమంలో చైనాలోని ఒక చిన్న గ్రామం ప్రస్తుతం ఆన్ లైన్లో హాట్ టాపిక్గా మారింది. ఆ ఊరు విధిస్తున్న వింత జరిమానాలు, వసూలు చేస్తున్న విచిత్ర పన్నులే ఇందుకు కారణం. పెళ్లికీ, పిల్లలకూ పెనాల్టీలు వసూలు చేయడంపై ఆ గ్రామం తీవ్ర విమర్శలకు గురవుతోంది.నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్ లోని లింకాంగ్ గ్రామంలో వివాదం చెలరేగింది. 'విలేజ్ రూల్స్: ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్' అనే పేరుతో ఆ గ్రామానికి సంబంధించిన పెనాల్టీల నోటీసుల ఫొటోలు నెటిజన్లు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివాహం, గర్భం, వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించిన వివిధ జరిమానాలను నోటీసులో వివరించడం ఆన్ లైన్ లో తీవ్ర చర్చకు దారితీసిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక పేర్కొంది.ఫొటోలలో చూపించిన నోటీసు ప్రకారం.. యునాన్ ప్రావిన్స్ వెలుపల ఉన్న వ్యక్తిని ఆ గ్రామస్తులు వివాహం చేసుకుంటే 1,500 యువాన్ల జరిమానా విధిస్తారు. పెళ్లికి ముందే గర్భవతి అయిన మహిళలు 3,000 యువాన్లు జరిమానా చెల్లించాలి. పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించే జంటలకు ఏటా 500 యువాన్లు చొప్పున పన్ను కట్టాలి.ఇక పెళ్లయిన 10 నెలల్లోపు బిడ్డను కంటే 3 వేల యువాన్ల జరిమానా విధించనున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. అలాగే చీటికీమాటికీ పోట్లాడుకునే మొగుడూపెళ్లాలకూ పెనాల్టీ తప్పదు. భార్యభర్తలు తగువులాడుకుంటే గ్రామ పెద్దలు పంచాయితీ చేస్తారు. ఇరువురికీ చెరో 500 యువాన్లు జరిమానా విధిస్తారు.మద్యం మత్తులో వీరంగం సృష్టించే మందుబాబులకూ ఇక్కడ పెనాల్టీలు ఉన్నాయి. గ్రామంలో ఇలా ఎవరైనా చేస్తే వారికి 3,000 నుండి 5,000 యువాన్ల మధ్య జరిమానా విధిస్తారు. అలాగే అనవసరమైన పుకార్లు వ్యాప్తి చేసినా 500 నుండి 1,000 యువాన్ల జరిమానా ఎదుర్కొంటారు.ఈ లింకాంగ్ గ్రామం జనాభా లేదా ఆర్థిక స్థితికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. అయితే ఆ నోటీసు చాలా అసాధారణంగా ఉందని స్థానిక మెంగ్డింగ్ టౌన్ ప్రభుత్వానికి చెందిన ఒక అధికారి రెడ్ స్టార్ న్యూస్ తో మాట్లాడుతూ చెప్పారు. తమను సంప్రదించకుండానే గ్రామ కమిటీ సొంతంగా ఆ నోటీసును పోస్ట్ చేసిందని, తర్వాత దాన్ని తొలగించినట్లు ఆ అధికారి తెలిపారు. -
పని చెప్పలేదని యజమానిపై కోర్టుకు..
ఇది కూడా లారెన్స్ తరహా అంశమే. తనకు పనేమీ చెప్పకుండా బోర్ కొట్టించారని పేర్కొంటూ ఓ వ్యక్తి యజమానిపై కోర్టుకెళ్లాడు. ఫ్రాన్స్కు చెందిన ఫెడ్రిక్ డెస్నార్డ్ ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్ తయారీ కేంద్రంలో మేనేజర్గా పనిచేశాడు. అయితే, తనకు చిన్నచిన్న పనులు తప్ప కీలకమైన విధులేమీ అప్పగించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డానని యజమానిపై దావా వేశాడు. నాలుగేళ్లు తనది అదే పరిస్థితి అని పేర్కొన్నాడు. పని చెప్పకుండా ఇలా ఇబ్బందులకు గురి చేసినందుకు కంపెనీ 4 లక్షల డాలర్ల (రూ.3.6కోట్లు) పరిహారం ఇవ్వాలని కోరాడు. ఏమీ పనిచేయకుండా జీతం తీసుకున్నందుకు సిగ్గుగా ఉందని.. పైగా దానివల్ల మూర్ఛవ్యాధి కూడా వచి్చందని వివరించాడు. వాదనలు విన్న న్యాయస్థానం ఫెడ్రిక్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అధిక పనిఒత్తిడితో బాధపడే ఉద్యోగికి ఈ వ్యవహారం భిన్నంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఫెడ్రిక్కు 45వేల(రూ.40 లక్షలు) డాలర్ల పరిహారం చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. 20 ఏళ్లు ఉత్తినే జీతమిచ్చారని కంపెనీపై దావా పని చేయకపోయినా జీతం ఇచ్చేస్తాం అంటే.. ఇలాంటి డీల్ ఉంటే ఎలా వదులుకుంటాం అనే కదా అంటారు. కానీ ఆమె అలా అనలేదు. తనకు ఎలాంటి పనీ అప్పజెప్పకుండా 20 ఏళ్ల పాటు వేతనం ఇచి్చన కంపెనీపై కోర్టుకెక్కారు. లారెన్స్ వాన్ వాసెన్హోవ్ అనే మహిళ 1993లో ఫ్రాన్స్ టెలికాం కంపెనీలో ప్రభుత్వ ఉద్యోగిగా నియమితులయ్యారు. అయితే, పుట్టుకతోనే హెమిప్లెజియా (ముఖం, అవయవాలలో పాక్షిక పక్షవాతం) ఉండటంతో ఆమెకు అందుకు అనుగుణమైన పనులే అప్పగించారు. ఆ తర్వాత ఆ కంపెనీని ఆరెంజ్ సంస్థ స్వా«దీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో స్వీయ అభ్యర్థనపై ఆమెను ఫ్రాన్స్లోని మరో ప్రాంతానికి బదిలీ చేశారు. కానీ అక్కడ కొత్త కార్యాలయం ఆమె అవసరాలకు అనుగుణంగా లేదు. దీంతో కంపెనీ ఎలాంటి పనులూ అప్పజెప్పకుండా వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, వాసెన్ దీనిని వివక్షగా భావించి.. పోరు మొదలుపెట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు విచారణ కొనసాగుతోంది.16 ఏళ్లుగా సిక్ లీవ్.. తిరిగి యజమానిపైనే కేసు జర్మనీకి చెందిన ఓ టీచరమ్మ కూడా ఇదే బాపతు. కాకుంటే కాస్త పద్ధతిగా సిక్ లీవ్ పెట్టింది. సిక్ లీవ్ అంటే వారాలు, నెలలు కాదు.. ఏకంగా 16 సంవత్సరాలు. అవాక్కయ్యారా? కాస్త ఆగండి. ఇంకా ఉంది. అనారోగ్యానికి సంబంధించిన రుజువులు చూపించండి అని అడిగినందుకు యాజమాన్యంపైనే కేసు పెట్టింది. జర్మనీలోని నార్త్ రైన్–వెస్ట్ఫాలియాకు చెందిన ఓ మహిళ వెసెల్లోని ఓ వృత్తి విద్య కాలేజీలో ఉపాధ్యాయురాలు. అనారోగ్యం సాకుతో 16 ఏళ్లు సిక్ లీవ్లోనే ఉండి 11.66 లక్షల డాలర్లు (దాదాపు రూ.10 కోట్లు) వేతనం తీసుకుంది. జర్మనీ చట్టాల ప్రకారం ఉపాధ్యాయులు అనారోగ్య సెలవులో ఉన్నప్పుడు పూర్తి జీతం తీసుకోవడంతో సహా కొన్ని ప్రత్యేక హక్కులు కలిగి ఉంటారు. దీనినే ఆమె క్యాష్ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ కాలేజీకి కొత్త యాజమాన్యం వచ్చి.. ఆమె అనారోగ్యానికి రుజువు అడగడంతో వారిపై దావా వేసింది. అయితే, న్యాయస్థానం ఆమెనే చీవాట్టు పెట్టింది. అనారోగ్యానికి సంబంధించి రుజువును అడిగే హక్కు యాజమాన్యానికి ఉంటుందని తేల్చి చెప్పింది. పని చేయకుండానే పదేళ్లుగా జీతం తీసుకుని.. ఇతడు ఎలాంటి విధులూ నిర్వర్తించలేదు.. ఇంకా చెప్పాలంటే అసలు ఆఫీసుకే రాలేదు.. కానీ నెలనెలా జీతం మాత్రం తీసుకున్నాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదేళ్ల పాటు దర్జాగా వేతనం పొందాడు. ఎట్టకేలకు అతడి బాగోతం బయట పడటంతో కటకటాలపాలయ్యాడు. కువైట్ లోని పౌర సేవల విభాగంలో ఉద్యోగిగా ఉన్న ఓ వ్యక్తి గత దశాబ్దకాలంగా ఆఫీసుకే రాలేదు.. కానీ నెలనెలా అతడి ఖాతాలో జీతం జమైంది. ఇటీవల ఈ విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు కేసు పెట్టారు. రెండు కోర్టుల్లో తీర్పు అతడి పక్షాన రాగా.. కోర్ట్ ఆఫ్ క్యాసేషన్లో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. అతడికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే పదేళ్లుగా తీసుకున్న వేతనం మొత్తం 1,04,000 కువైట్ దీనార్లను (దాదాపు రూ.3 కోట్ల పైనే) రికవరీ చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ నిధుల నుంచి అక్రమంగా వేతనం పొందినందుకు 3,12,000 కువైట్ దీనార్ల (దాదాపు రూ.9 కోట్ల పైనే) జరిమానా విధించింది. -
చైనాలో మరో అద్భుతం..
బీజింగ్: చైనా మరో అడుగు ముందుకేసి అద్భుతం సృష్టించింది. ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగాన్ని ప్రజా రవాణా కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ సొరంగం ద్వారా 7 గంటల ప్రయాణాన్ని ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.డ్రాగన్ దేశం చైనాలో ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. 22.13 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగం టియాన్షాన్ షెంగ్లీ టన్నెల్ డిసెంబర్ 26 శుక్రవారం అధికారికంగా ట్రాఫిక్కు ప్రారంభించారు. ఇది వాయువ్య చైనాలోని జిన్జియాంగ్ ఉయ్గుర్ అటానమస్ రీజియన్లోని సెంట్రల్ టియాన్షాన్ పర్వతాలను దాటి, గతంలో కొన్ని గంటలు పట్టే పర్వత ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాలకు తగ్గిస్తుంది.22.13 kilometers! China just opened the world’s longest highway tunnel across a mountain range to traffic in Xinjiang.China named the tunnel Tianshan Victory. Why? Because it cuts through 16 geofracture zones and is without doubt a world marvel of engineering. pic.twitter.com/FGM34fyqia— Li Zexin 李泽欣 (@XH_Lee23) December 26, 2025 ఇదిలా ఉండగా.. చైనా శుక్రవారమే మరో ఎక్స్ప్రెస్వేను కూడా ప్రారంభించింది. ఉత్తర, దక్షిణ జిన్జియాంగ్లోని పట్టణ సముదాయాలను కలిపే మరొక ముఖ్యమైన సహాయక సొరంగం G0711 ఉరుంకి-యులి ఎక్స్ప్రెస్వే కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ సొరంగం చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్లోని టియాన్షాన్ పర్వత శ్రేణిలో ఉంది. ఇది రెండు సమాంతర గొట్టాలుగా రూపొందించబడింది. ఒక్కొక్కటి రెండు లేన్ల ట్రాఫిక్ను కలిగి ఉంటాయి. ఇది ఉత్తర జిన్జియాంగ్లోని ఉరుంకిని దక్షిణాన యులికి కలిపే ఉరుంకి-యులి ఎక్స్ప్రెస్వేలో భాగం. ఈ సొరంగం 3,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించబడింది. సొరంగం ప్రారంభంతో గతంలో సుమారు ఏడు గంటలు పట్టే ప్రయాణానికి ఇప్పుడు 20 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. The Urumqi-Yuli Expressway officially opens to traffic!At its heart lies the world’s longest expressway tunnel. At 22 kilometers, it turns a 3-hour mountain drive into 20 minutes.A major leap in connectivity for Xinjiang.🛣 pic.twitter.com/jNMoRm2qvU— Mao Ning 毛宁 (@SpoxCHN_MaoNing) December 26, 2025The Tianshan Victory Tunnel opened to full traffic today. Spanning 22.13 km, it is the world's longest highway tunnel. The driving time from Ürümqi to Korla has been reduced from seven hours to 3.5 hours. Traveling in #Xinjiang has become significantly more convenient.#China… pic.twitter.com/fUWIHPZNRC— China Bro (@chinalittlebro6) December 26, 2025 -
మక్కాలో కలకలం.. వీడియో వైరల్
మక్కా: ముస్లింలు అత్యంత పవిత్ర స్థలంగా భావించే సౌదీ అరేబియాలోని మక్కాలో కలకలం చెలరేగింది. మసీదు అల్-హరమ్ (గ్రాండ్ మసీదు)లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడం అందరినీ షాక్నకు గురిచేసింది. మసీదు పైఅంతస్తు నుంచి కిందకు దూకి తనువు చాలించాలని ఆ వ్యక్తి ప్రయత్నించగా, అక్కడే విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమై, అతనిని కాపాడారు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న యాత్రికులు ఒక్కసారిగా భయాందోళనలకు లోనయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. మసీదు పై అంతస్తు రెయిలింగ్ దాటి, ఒక వ్యక్తి కిందకు దూకబోతుండగా, స్పెషల్ ఫోర్స్ సెక్యూరిటీ సిబ్బంది ఒకరు ప్రాణాలకు తెగించి, అతనిని పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే ఈ ప్రయత్నంలో ఆ భద్రతా అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 🕋🚨 A security guard at the Masjid al-Haram rushed to intervene after a person tried to take their own life by jumping off the upper floors of the masjid.The security guard was injured while trying to prevent the person from hitting the ground. Both individuals were… pic.twitter.com/NnpveIE8wf— • (@Alhamdhulillaah) December 25, 2025ఈ ఉదంతంపై మక్కా ప్రాంతీయ ఎమిరేట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్పెషల్ ఫోర్స్ వేగంగా స్పందించి ప్రాణనష్టాన్ని నివారించిందని దానిలో కొనియాడింది. అయితే ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో భద్రతా అధికారికి ఫ్రాక్చర్ అయినట్లు అధికారులు ధృవీకరించారు. నిందితునిపై ఇప్పటికే చట్టపరమైన చర్యలు ప్రారంభించామని, సౌదీ అరేబియా నిబంధనల ప్రకారం విచారణ చేపడుతున్నామని మక్కా భద్రతా దళాలు వెల్లడించాయి.ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తితో పాటు, గాయపడిన భద్రతా అధికారిని కూడా చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తి ఎందుకు ఆత్మహత్యకు యత్నించాడనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.. పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ వ్యక్తిని కాపాడటంతో ధైర్యసాహసాలు ప్రదర్శించిన అధికారిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇది కూడా చదవండి: థాయ్-కంబోడియా.. కాల్పుల విరమణ ఒప్పందం ఖరారు -
థాయ్-కంబోడియా.. కాల్పుల విరమణ ఒప్పందం ఖరారు
బ్యాంకాక్: ఆగ్నేయాసియా దేశాలు థాయ్లాండ్- కంబోడియా మధ్య కొద్దివారాలుగా కొనసాగుతున్న భీకర పోరుకు ఎట్టకేలకు తెరపడింది. శనివారం జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఉభయ దేశాలు తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని నిర్ణయించాయి. కొన్ని గంటలకే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇరు దేశాల రక్షణ మంత్రుల సమక్షంలో జరిగిన ఈ కీలక భేటీలో ‘ఇకపై ఇరు దేశాల మధ్య ఎటువంటి సైనిక కదలికలు ఉండకూడదని, ప్రస్తుతం ఎక్కడి సైన్యాలు అక్కడే ఉండి, శాంతిని కాపాడాలంటూ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. దీంతో గత 20 రోజులుగా వినిపిస్తున్న బాంబుల మోత ఆగిపోయి, సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. దశాబ్దాల కాలంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం ఈ ఏడాది డిసెంబర్ ప్రారంభంలో తిరిగి ముదిరింది. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో కుదిరిన శాంతి ఒప్పందం ఈ నెలలో విచ్ఛిన్నం కావడంతో, యుద్ధం తీవ్రతరమయ్యింది. థాయ్లాండ్ తన ఎఫ్-16 యుద్ధ విమానాలతో వైమానిక దాడులు చేయగా, కంబోడియా రాకెట్ లాంచర్లతో దీటుగా బదులిచ్చింది. ఈ హింసాకాండలో ఇప్పటివరకు సుమారు 101 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు ఐదు లక్షల మందికి పైగా జనం తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.చారిత్రక దేవాలయాలు ఉన్న భూభాగం కోసం జరిగిన ఈ పోరు అంతర్జాతీయంగా ఆందోళన రేకెత్తించింది. శాంతి పునరుద్ధరణ కోసం రెండు దేశాల రక్షణ మంత్రులు.. నాత్థాఫోన్ నాక్ఫానిత్ (థాయ్లాండ్), టీ సీహా (కాంబోడియా) సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి ఆసియాన్ (ఆసియాన్) పరిశీలకులు సాక్ష్యంగా నిలిచారు. తాజా ఒప్పందం ప్రకారం, సరిహద్దుల్లో ఎటువంటి అదనపు బలగాలను మోహరించకూడదని, పౌర నివాస ప్రాంతాలపై దాడులు చేయకూడదని నిర్ణయించారు. వచ్చే 72 గంటల పాటు కాల్పుల విరమణ సజావుగా సాగితే, తమ వద్ద బందీలుగా ఉన్న 18 మంది కంబోడియా సైనికులను విడుదల చేస్తామని థాయ్లాండ్ హామీ ఇచ్చింది. ఇరుపక్షాలు ఈ మేరకు అంగీకారం కుదుర్చుకున్నాయి.ప్రస్తుతానికి ఇరు దేశాల సరిహద్దుల్లో తుపాకుల మోత ఆగిపోయినప్పటికీ, ఇది ఎంతకాలం నిలుస్తుందనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. మరోవైపు యుద్ధం కారణంగా నిర్వాసితులైన లక్షలాది మందిని తిరిగి వారి స్వస్థలాలకు పంపే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. కాగా గతంలో కూడా ఇలాంటి ఒప్పందాలు జరిగిన కొద్ది రోజులకే విచ్ఛిన్నం కావడంతో, అంతర్జాతీయ సమాజం పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తోంది. తాత్కాలికంగా ఇరు దేశాల మధ్య శాంతి నెలకొన్నప్పటికీ, శాశ్వత సరిహద్దు పరిష్కారం కోసం దౌత్యపరమైన చర్చలు జరగాల్సి ఉంది.ఇది కూడా చదవండి: భారత్తో వాణిజ్య ఒప్పందం.. న్యూజిలాండ్ ప్రధాని ‘ముందడుగు’ -
బంగ్లాదేశ్లో మరో దారుణం.. సింగర్ షోపై మూక దాడి
ఢాకా: బంగ్లాదేశ్లో పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. వరుస దాడి ఘటనల కారణంగా ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బంగ్లాదేశ్లో ప్రముఖ రాక్స్టార్ కాన్సర్ట్పై మూక దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 20 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇంతకీ ఏం జరిగిందంటే.. బంగ్లాదేశ్లోని ఫరీదాపూర్లో ఓ పాఠశాల 185వ వార్షికోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బంగ్లాదేశ్కు చెందిన ప్రముఖ గాయకుడు జేమ్స్ కాన్సర్ట్ను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాఠశాల పూర్వ విద్యార్థులతో సహా వేలాది మంది అక్కడికి వచ్చారు. అయితే, ఈ కాన్సర్ట్ ప్రారంభానికి ముందు(రాత్రి తొమ్మిది గంటల సమయంలో).. ఉన్నట్టుండి ఆందోళనకారులు వేదిక వద్దకు దూసుకొచ్చారు. దీంతో, వారిని భద్రతా సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ.. సాధ్యం కాలేదు. కాన్సర్ట్కు వచ్చిన వారిపై ఆందోళనకారులు రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు.Once again, a concert by Bangladesh’s leading band music artist James has been shut down.In Faridpur, just before the concert was set to begin, extremist groups stormed the stage and carried out an attack. Following intervention by law enforcement agencies, the organizers were… pic.twitter.com/NfmLRjL2OF— Sahidul Hasan Khokon (@SahidulKhokonbd) December 26, 2025కాగా, ఆందోళనకారుల దాడి నుంచి గాయకుడు జేమ్స్ తృటిలో తప్పించుకున్నారు. ఉద్రిక్తతలు మొదలవగానే భద్రతా సిబ్బంది ఆయన్ను అక్కడినుంచి తరలించారు. కానీ, మూక దాడిలో పలువురు పాఠశాల విద్యార్థులు గాయపడ్డారు. దీంతో ఈ కార్యక్రమం రణరంగాన్ని తలపించింది. దాడి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అనంతరం, భద్రతా కారణాల రీత్యా కాన్సర్ట్ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ దాడిలో 20 మంది గాయపడినట్లు తెలుస్తోంది. దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
భారత్తో వాణిజ్య ఒప్పందం.. న్యూజిలాండ్ ప్రధాని ‘ముందడుగు’
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్య రంగంలో న్యూజిలాండ్ మద్దతుతో భారత్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. సుదీర్ఘ చర్చల అనంతరం న్యూజిలాండ్తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్టీఏ) ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ శనివారం అధికారికంగా ప్రకటించారు. ఇది తమ ప్రభుత్వ విజయమని, భవిష్యత్ అభివృద్ధికి ఇది పునాది వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఈ ఒప్పందంపై న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ప్రధాని లక్సన్ భారత్తో ఒప్పందం కుదుర్చుకున్నారు.‘హిందుస్థాన్ టైమ్స్’ తెలిపిన వివరాల ఈ ఒప్పందం కేవలం రెండు దేశాల మధ్య వ్యాపార లావాదేవీలను మరింతగా పెంపొందించనుంది. భారత్లోని 140 కోట్ల మంది వినియోగదారుల మార్కెట్ను న్యూజిలాండ్కు చేరువ చేయనుంది. ప్రధాని మోదీ- లక్సన్ మధ్య జరిగిన చర్చల సారాంశం ప్రకారం.. రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కావడమే కాకుండా, వచ్చే 15 ఏళ్లలో భారత్లో సుమారు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఏర్పడనుంది. భారత్ నుండి ఔషధ ఉత్పత్తులు, న్యూజిలాండ్ నుండి అటవీ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ప్రధానంగా ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. తద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఇరు దేశాలు భావిస్తున్నాయి.కాగా న్యూజిలాండ్ అధికార సంకీర్ణ ప్రభుత్వంలో ఈ భారత్తో ఒప్పందం చిచ్చు రేపింది. ఆ దేశ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ ఈ డీల్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఇది అశాస్త్రీయమైనదని విమర్శించారు. ముఖ్యంగా న్యూజిలాండ్ పాడి పరిశ్రమ (డైరీ సెక్టార్) ప్రయోజనాలను ఈ ఒప్పందంలో తాకట్టు పెట్టారన్నారు. పాల ఉత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గించలేదని పీటర్స్ ఆరోపిస్తున్నారు. అలాగే భారతీయులకు ఉపాధి వీసాల విషయంలో సులభతర నిబంధనలు తీసుకురావడాన్ని ఆయన తప్పుబట్టారు. దీని కారణంగా స్థానిక న్యూజిలాండ్ ప్రజల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంపై తమ దేశంలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నప్పటికీ ప్రధాని లక్సన్ దీని అమలుకు మొగ్గుచూపారు. కాగా 2024 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యం 2.07 బిలియన్ డాలర్లుగా ఉండగా, అందులో భారత్ ఎగుమతులే అధికంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త ఒప్పందంతో భారత్కు న్యూజిలాండ్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది.ఇది కూడా చదవండి: Myanmar Elections: ప్రజాస్వామ్యంపై ‘జుంటా’ బరితెగింపు.. -
Myanmar Elections: ప్రజాస్వామ్యంపై ‘జుంటా’ బరితెగింపు..
మయన్మార్.. ఒకనాడు శాంతికి, ఆధ్యాత్మికతకు నిలయం. అయితే ఇప్పుడు ఈ దేశం హింసాయుత ఘటనల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడి అందమైన పగోడాల(బౌద్ధ ఆరామాలు) నీడన అమాయక ప్రజల ఆర్తనాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న సైనిక అణచివేత, ఇప్పుడు ఎన్నికల పేరుతో మరింత శక్తిని పొందేందుకు సిద్ధమవుతోంది. ప్రజాస్వామ్యం పునరుద్ధరణ పేరుతో జరుగుతున్న ఈ తతంగం వెనుక దాగిన వాస్తవాలను తెలియజెప్పడమే ఈ కథనం ఉద్దేశం.అంతులేని ‘జుంటా’ అరాచకాలుమయన్మార్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికీ సైనిక నియంతృత్వానికీ మధ్య యుద్ధం కొన్ని తరాలుగా సాగుతూ వస్తోంది. 2021 ఫిబ్రవరిలో జరిగిన సైనిక తిరుగుబాటు ఆ దేశ ప్రజల ప్రజాస్వామ్య ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లింది. నాడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన అంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూల్చివేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్న మిలిటరీ ‘జుంటా’ దేశంలో నిరంతరం తన ప్రతాపాన్ని చూపుతూ వస్తోంది. ‘జుంటా’ అరాచకాలకు వేలాది మంది ప్రజలు మృతి చెందారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే స్వేచ్ఛ కోసం వారి పోరాటం కొనసాగుతూనే ఉంది.40కి పైగా పార్టీలను నిషేధించి..ఇప్పుడు జరగబోతున్న ఈ ఎన్నికలు, క్రూరమైన ‘జుంటా’ సైనిక పాలనకు చట్టబద్ధత కల్పించే ఒక ప్రయత్నంగా కనిపిస్తున్నాయని ‘ది గార్డియన్’ తన కథనంలో పేర్కొంది. మయన్మార్లో ప్రస్తుతం మూడు దశలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ పోలింగ్ 2025, డిసెంబర్ 28న, రెండవ దశ 2026, జనవరి 11న, చివరి దశ పోలింగ్ జనవరి 25న జరగనుంది. అంగ్ సాన్ సూకీ తదితర నేతలు ఇంకా జైలులోనే మగ్గుతుండగా, ‘జుంటా’ 40కి పైగా రాజకీయ పార్టీలను నిషేధించి, కేవలం తమకు అనుకూలంగా ఉండే వారితోనే ఎన్నికలు నిర్వహించడం అనేది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేననే వాదన వినిపిస్తోంది. ఇది కేవలం ప్రపంచ దేశాల కళ్లకు గంతలు కట్టడానికి వేస్తున్న ఒక నాటకం తప్ప, ప్రజల అభీష్టాన్ని గౌరవించే ప్రక్రియ కాదని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.‘జుంటా’ సైన్యానికి ఎదురు దెబ్బలుఈ ఎన్నికల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటినే విషయానికొస్తే.. దేశంలోని సగం కంటే ఎక్కువ భూభాగం ప్రస్తుతం సైనిక నియంతృత్వం చేతుల్లో లేదు. వివిధ జాతుల సాయుధ బలగాలు, పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్.. జుంటా సైన్యాన్ని ముప్పు తిప్పులు పెడుతున్నాయి. దేశం అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. ఇటువంటి సమయంలో పోలింగ్ పూర్తయ్యాక ఓట్ల లెక్కింపు సవ్యంగా సానేగా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దేశంలో సగానికిపైగా ప్రాంతాల్లో ఓటర్ల జాబితా కూడా సిద్ధం కాకుండానే సైన్యం అన్నీ బాగున్నాయని చెబుతూ ప్రపంచాన్ని భ్రమ పరుస్తూ, ఎన్నికల దిశగా ముందుకు వెళుతోందనే మాట వినిపిస్తోంది. మయన్మార్ సైన్యాన్ని జుంటా అని పిలవడానికి ప్రత్యేక కారణముంది. దేశాన్ని సైనిక నేతల కమిటీ పాలిస్తున్నందున దీనికి ‘జుంటా’ అనే పేరు వచ్చింది. జుంటా అంటే ‘కమిటీ’ లేదా ‘సమావేశం’ అని అర్థం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు ‘జుంటా’ అనే పదాన్ని ఉపయోగిస్తారు. 2021లో మయన్మార్ సైన్యం.. అంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని తప్పించి, అధికారం చేపట్టినప్పటి నుండి ‘జుంటా’ సైన్యం పాలన అని అంటున్నారు.కత్తి పెట్టి ఓటు అడుగుతారా?ఇటువంటి తరుణంలో సైన్యం విడుదల చేసిన కొత్త ఎన్నికల నిబంధనలు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఏదైనా పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారీ మొత్తంలో నగదు డిపాజిట్ చేయాలి. వేల సంఖ్యలో సభ్యులను కలిగి ఉండాలి. ఈ నిబంధన చిన్న రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులపై నీళ్లు చల్లేదిగా మారింది. దీనివల్ల రేపు ఎన్నికల్లో గెలిచేది ఎవరో ముందే అంచనా వేయవచ్చంటున్నారు. ఈ పరిస్థితుల్లో మయన్మార్ సామాన్య ప్రజల వేదన వర్ణనాతీతంగా ఉంది. ‘మాకు ఓటు వేసే హక్కు కావాలి.. అయితే అది మా గొంతు మీద కత్తి పెట్టి అడిగేదిగా కాకూడదు’ అని వారంటున్నారు. భయం నీడన జరిగే ఏ ఎన్నికలైనా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించలేవు. ఈ ఎన్నికల తంతు పూర్తయ్యాక దేశంలో హింస మరింతగా పెరుగుతుందని, సాయుధ తిరుగుబాటుదారుల పోరాటం ఉధృతం అవుతుందని మేధావులు హెచ్చరిస్తున్నారు.చైనా మద్దతు వెనుక ఏముంది?మయన్మార్ ‘జుంటా’ నిర్వహించిన జనాభా గణన ప్రకారం దేశంలోని 5.1 కోట్ల జనాభాలో దాదాపు 1.9 కోట్ల మంది వివరాలు సేకరించడం సాధ్యపడలేదు. భద్రతా కారణాల రీత్యా దేశంలోని పలు ప్రాంతాలకు అధికారులు వెళ్లలేకపోయారు. దీంతో ఏ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే చైనా వంటి దేశాలు ఈ ఎన్నికలకు మద్దతు ఇవ్వడం వెనుక వారి వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే మయన్మార్ ప్రజలు ఈ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారు. ప్రజాస్వామ్య ముసుగులో నిరంకుశ సైనిక పాలన కొనసాగుతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం వారు ప్రపంచదేశాల సాయం వైపు చూస్తున్నారు. ఇది కూడా చదవండి: విష్ణు విగ్రహం కూల్చివేత.. థాయ్ వివరణ -
ట్రంప్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. జెలెన్స్కీకి కొత్త టెన్షన్?
వాషింగ్టన్: ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పందించారు. అమెరికా మద్దతు లేకుండా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఉపయోగమేమీ ఉండదు అంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే, ప్రతిపాదనల విషయమై తాను.. రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా మాట్లాడనున్నట్టు తెలిపారుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జెలెన్ స్కీ ఫ్లోరిడాలో చర్చలు జరుపనున్నారు. ఈ నేపథ్యంలో చర్చలపై ట్రంప్ స్పందిస్తూ.. రెండు దేశాల మధ్య శాంతి ప్రతిపాదనలను నేను ఆమోదించే వరకు ఏమీ ఉండదు. జెలెన్ స్కీ వద్ద ఎలాంటి సమాచారం ఉందో చూద్దాం. చర్చలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కూడా చర్చలు జరుపుతాం. సమావేశం అంతా బాగానే జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్తో ఆదివారం ఫ్లోరిడాలో సమావేశమయ్యే అవకాశముందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శుక్రవారం తెలిపారు. ‘మేం ఒక్క రోజు కూడా వృథాగా పోనివ్వడం లేదు. అధ్యక్షుడు ట్రంప్తో అతి త్వరలోనే ఉన్నత స్థాయి సమావేశం జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. నూతన సంవత్సరం ప్రవేశించే లోగానే కీలక పరిణామాలు సంభవించొచ్చు’అని ఆయన మీడియాకు తెలిపారు. ట్రంప్ ప్రతిపాదిత 20–సూత్రాల ప్రణాళికలో 90 శాతం మేర ఏకాభిప్రాయం కుదిరిందన్నారు.ఆదివారం జరిగే సమావేశం సందర్భంగా ఉక్రెయిన్కు అమెరికా ఇచ్చే భద్రతా హామీలపై చర్చించనున్నామన్నారు. జెలెన్స్కీ వ్యాఖ్యలతో చర్చలు పురోగతిలో ఉన్నట్లు భావించవచ్చని పరిశీలకులు అంటున్నారు. అమెరికా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుషె్నర్తో ఫలవంతమైన చర్చలు జరిగినట్లు జెలెన్స్కీ అంతకుముందు గురువారం ప్రకటించారు. పారిశ్రామికంగా కీలకమైన తూ ర్పు ప్రాంతం తమ బలగాలను ఉపసంహరించుకునేందుకు సిద్ధమని జెలెన్స్కీ తెలిపారు. అయితే, రష్యా కూడా ఆ ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించుకుని, నిస్సైనిక ప్రాంతంగా ప్రకటించేందుకు సిద్ధం కావాలన్నారు. -
పాక్లో ఇంకా 20 లక్షల మంది అఫ్గాన్లు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఇప్పటికీ 20 లక్షల మందికి పైగా అఫ్గాన్లు నివసిస్తున్నారని ఐరాస శరణార్ధి విభాగం తెలిపింది. 2025లో 10 లక్షల మంది వరకు ఆ దేశం నుంచి తిరిగి స్వదేశానికి చేరుకున్నారంది. ఒక్క నవంబర్లోనే 1.71 లక్షల మంది అఫ్గానిస్తాన్కు వచ్చారని తెలిపింది.పాక్ అధికారులు చమన్, తోర్ఖామ్, బారాబ్చా బోర్డర్ పాయింట్ల మీదుగా మరో 37, 899 మందిని వెనక్కి పంపించి వేశారని పేర్కొంది. నవంబర్లో రెండు దేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మానవతా సాయం పంపిణీపై ప్రభావం చూపాయని తెలిపింది. తమ దేశంలో పెద్ద సంఖ్యలో ఉంటున్న అఫ్గాన్లను పంపించి వేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం 2023 సెపె్టంబర్ నుంచి ప్రయత్నాలను ప్రారంభించింది. స్వదేశంలో అస్థిర పరిస్థితులు, అణచివేత చర్యల కారణంగా వీరంతా పొరుగుదేశంలో తలదాచుకుంటున్నారు. -
అమెరికాను బెంబేలెత్తిస్తున్న డెవిన్
డెవిన్ మంచు తుపాను ధాటికి అమెరికాలో గగనతల ప్రయాణాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఇయర్ ఎండ్ సెలవులు.. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యాలతో ప్రయాణాలకు సిద్ధపడినవాళ్లకు అమెరికన్ ఎయిర్లైన్స్లు షాకిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా 1,800 విమానాలు రద్దు చేశాయి. వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్అవేర్ గణాంకాల ప్రకారం.. వివిధ ఎయిర్లైన్స్లకు చెందిన 1,802 విమానాలను శుక్రవారం రద్దు చేశారు. మరో 22,349 విమానాలు ఆలస్యంగా నడిచాయి. జాన్ ఎఫ్ కెనడీ, లాగార్డియా, డెట్రాయిట్ మెటరోపాలిటిన్ లాంటి ప్రధాన విమానాశ్రయాల్లో వేలమంది ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతికూల వాతావరణ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే ఎయిర్లైన్స్ కంపెనీలు ప్రయాణికులకు క్షమాపణలు చెప్పాయి. మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని తెలుస్తోంది. డెవిన్ తీవ్ర మంచు తుపాను(తుపానుకు పెట్టిన పేరు) గ్రేట్ లేక్స్, మిడ్ అట్లాంటిక్, నార్త్ ఈస్ట్ ప్రాంతాలను ప్రభావితం చేసింది. సుమారు 4-8 ఇంచుల మేర మంచు కురిసింది. నేషనల్ వెదర్ సర్వీసెస్ హెచ్చరికల నేపథ్యంలో.. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. పలు రాష్ట్రాల్లో.. అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని ప్రజలకు సూచిస్తున్నారు. వింటర్ స్ట్రోమ్ డెవిన్.. ఈ క్రిస్మస్, న్యూఇయర్ సీజన్కు లక్షల మందిపై ప్రభావం చూపెడుతోంది. స్వస్థలాలకు చేరుకోలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల సంఖ్యలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇటు రోడ్లపై ట్రాఫిక్ నెమ్మదించింది. కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించినట్లు తెలుస్తోంది. మంచు కరిగి ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అయితే స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం నుంచి మంచు కురిసే తీవ్రత తగ్గొచ్చని.. ఆ తర్వాత క్రమక్రమంగా పరిస్థితులు మెరుగుపడొచ్చని నేషనల్ వెదర్ సర్వీసెస్ అంటోంది. -
అవినీతి కేసులో మలేసియా మాజీ ప్రధానికి 15 ఏళ్ల జైలు
పుత్రజయ: ప్రభుత్వ నిధుల దురి్వనియోగం కేసులో మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్(72)కు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీంతోపాటు రూ.2,500 కోట్ల భారీ జరిమానా విధిస్తూ శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రభుత్వ పెట్టుబడి నిధి 1ఎంబీడీ నుంచి కోట్లాది రూపాయల నిధులు పక్కదారి పట్టిన అతిపెద్ద అవినీతి కేసులో ఆయన్ను కోర్టు దోషిగా నిర్ధారించింది. 1 ఎంబీడీ నిధి నుంచి తన సొంత ఖాతాకు రూ.6,500 కోట్లను మళ్లించారంటూ దాఖలైన కేసులో అధికార దురి్వనియోగం, మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఆయనపై 25 ఆరోపణలున్నాయి. ప్రస్తుతం 1ఎంబీడీ అవినీతి కేసులోనే నజీబ్ రజాక్ జైలులో ఉన్నారు. ఈ శిక్షాకాలం ముగిశాక, తాజా తీర్పు ప్రకారం జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని జడ్జి ప్రకటించారు. జరిమానా చెల్లింపులో విఫలమైన పక్షంలో ఆయన మరో 10 ఏళ్లు జైలులోనే గడపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, తానెలాంటి తప్పూ చేయలేదని రజాక్ అంటున్నారు. ఈ నిధులన్నీ సౌదీ అరేబియా నుంచి అందిన రాజకీయ విరాళాలని అంటున్నారు. లౌ టెక్ ఝో అనే ఫైనాన్షియర్ వల్లే కుంభకోణంలో ఇరుక్కోవాల్సి వచి్చందంటున్నారు. లౌ టెక్ ఝొ మాత్రం ఇప్పటికీ పోలీసులకు దొరకలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద 1 ఎంబీడీ ఆర్థిక కుంభకోణంలో ఈ తీర్పును మైలురాయిగా భావిస్తున్నారు. -
ఆదివారం ట్రంప్తో భేటీ: జెలెన్స్కీ
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆదివారం ఫ్లోరిడాలో సమావేశమయ్యే అవకాశముందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శుక్రవారం తెలిపారు. ‘మేం ఒక్క రోజు కూడా వృథాగా పోనివ్వడం లేదు. అధ్యక్షుడు ట్రంప్తో అతి త్వరలోనే ఉన్నత స్థాయి సమావేశం జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. నూతన సంవత్సరం ప్రవేశించే లోగానే కీలక పరిణామాలు సంభవించొచ్చు’అని ఆయన మీడియాకు తెలిపారు. ట్రంప్ ప్రతిపాదిత 20–సూత్రాల ప్రణాళికలో 90 శాతం మేర ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. ఆదివారం జరిగే సమావేశం సందర్భంగా ఉక్రెయిన్కు అమెరికా ఇచ్చే భద్రతా హామీలపై చర్చించనున్నామన్నారు. జెలెన్స్కీ వ్యాఖ్యలతో చర్చలు పురోగతిలో ఉన్నట్లు భావించవచ్చని పరిశీలకులు అంటున్నారు. అమెరికా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుషె్నర్తో ఫలవంతమైన చర్చలు జరిగినట్లు జెలెన్స్కీ అంతకుముందు గురువారం ప్రకటించారు. పారిశ్రామికంగా కీలకమైన తూ ర్పు ప్రాంతం తమ బలగాలను ఉపసంహరించుకునేందుకు సిద్ధమని జెలెన్స్కీ తెలిపారు. అయితే, రష్యా కూడా ఆ ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించుకుని, నిస్సైనిక ప్రాంతంగా ప్రకటించేందుకు సిద్ధం కావాలన్నారు. -
‘హెచ్–1బీ’ కష్టాలపై అమెరికాతో చర్చిస్తాం
న్యూఢిల్లీ: హెచ్–1బీ వీసా ఇంటర్వ్యూలు హఠాత్తుగా వాయిదా పడడం, తద్వారా అమెరికా ప్రయాణాలు ఆగిపోవడం పట్ల భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో జరగాల్సిన ఇంటర్వ్యూలు నాలుగైదు నెలలపాటు వాయిదా పడ్డాయి. వేలాది మంది భారతీయుల ఇబ్బందులకు గురవుతున్నారు. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ను, వారు చేసిన పోస్టులను నిశితంగా పరిశీలించడానికి వీలుగా ఇంటర్వ్యూలను వాయిదా వేస్తూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత వారం జరగాల్సిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మే నెల దాకా వాయిదా వేస్తున్నట్లు దరఖాస్తుదారులకు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి ఈ–మెయిల్ సందేశాలు రావడం గమనార్హం. దాంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ శుక్రవారం స్పందించారు. దరఖాస్తుదారుల కష్టాలను అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే దిశగా సంప్రదింపులు జరుపుతామని వివరించారు. వీసా దరఖాస్తుదారుల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు అందుతున్నాయని తెలిపారు. ఇంటర్వ్యూల విషయంలో ఆలస్యాన్ని భారీగా తగ్గించాలన్నదే తమ ప్రయత్నమని వెల్లడించారు. ఇబ్బందులకు త్వరలోనే తెరపడుతుందని రణ«దీర్ జైస్వాల్ ఆశాభావం వ్యక్తంచేశారు. అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవడానికి హెచ్–1బీ వీసాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. మొదట మూడేళ్ల కాలానికి ఈ వీసా జారీ చేస్తారు. తర్వాత మరో మూడేళ్లు పొడిగిస్తారు. హెచ్–1బీ వీసాలు స్వీకరించినవారిలో దాదాపు 70 శాతం మంది భారతీయులే ఉంటున్నారు. హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు పెంచేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంబంధిత ఉత్తర్వుపై సంతకం చేశారు. రాబోయే రోజుల్లో ఈ వీసాలు పొందడం కష్టతరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. -
బంగ్లాదేశ్లో పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులకు అడ్డుకట్ట పడకపోవడంపై భారత్ తీవ్ర ఆందోళన వెలిబుచి్చంది. మైమన్సింగ్ ప్రాంతంలో గతవారం హిందూ యువకుడిని మూక దాడిలో చంపేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత తారిఖ్ రెహ్మాన్ తిరిగి స్వదేశానికి చేరుకోవడంపై ఆచితూచి స్పందించింది. ఆ దేశంలో స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా పార్లమెంట్ ఎన్నికలు జరగాలని భారత్ చేస్తున్న ప్రయత్నాల కోణంలోనే దీనిని చూడాలని పేర్కొంది. బంగ్లా విముక్తి పోరాటం దగ్గర్నుంచి ఆ దేశంతో సన్నిహిత, స్నేహ సంబంధాలనే భారత్ కోరుకుంటోందని చెప్పింది. ఫ్యాక్టరీ కారి్మకుడు దీపు చంద్ర దాస్ను చంపేసిన వారిని కఠినంగా శిక్షించాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువులతోపాటు క్రైస్తవులు, బౌద్ధులపైనా అతివాదులు పాల్పడుతున్న దాడులు ఆగకపోవడం తీవ్ర ఆందోళన కరమైన అంశమన్నారు. మధ్యంతర ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా మైనారిటీల హత్యలు, భూ ఆక్రమణలు, దాడులకు సంబంధించిన ఘటనలు 2,900కు పైగా నమోదయ్యాయన్నారు. వీటిని మీడియా చేస్తున్న అతి ప్రచారంగానో లేదా రాజకీయ హింసగానో చూడరాదని జైశ్వాల్ తెలిపారు. -
ఐఎస్ స్థావరాలపై దాడులు
వెస్ట్ పామ్ బీచ్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) లక్ష్యంగా అమెరికా వాయవ్య నైజీరియాలోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులు జరిపింది. నైగర్–నైజీరియా సరిహద్దుల్లో ఉన్న సొకొటొ రాష్ట్రంలో ఐఎస్ నడుపుతున్న క్యాంపులపై ఈ దాడులు జరిగాయి. ఈ ప్రాంతంలో ప్రాబల్యం కోసం ఐఎస్ తీవ్రంగా ప్రయతి్నస్తోంది. నైజీరియా యంత్రాంగం వినతి మేరకు గురువారం తమ దాడుల్లో పలువురు మృతి చెందినట్లు ప్రాథమికంగా సమాచారముందని అమెరికా మిలటరీ ప్రకటించింది. అమాయక క్రైస్తవులను అమానుషంగా చంపుతున్నందుకే ఐఎస్ శిబిరాలపై భీకర, శక్తివంతమైన దాడులు చేపట్టామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే, ఇది అమెరికా బలగాలతో కలిసి చేపట్టిన ఉమ్మడి ఆపరేషన్ అని, నైజీరియా ప్రజలను చంపుతున్న ఉగ్రవాదులే తమ లక్ష్యమని నైజీరియా విదేశాంగ మంత్రి యూసుఫ్ మైతామాని అన్నారు. అదేవిధంగా, దాడులకు మతం ప్రాతిపదిక కాదని, క్రిస్మస్తో సంబంధం లేదని యూసుఫ్ స్పష్టం చేశారు. నైజీరియా నిఘా విభాగం అందించిన సమాచారం మేరకు ముందస్తు పథకం ప్రకారమే ఈ దాడులు జరిగాయన్నారు. మరిన్ని దాడులకు అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు. అయితే, జిహాదీ గ్రూపుల దాడుల నుంచి క్రైస్తవులను కాపాడటంలో నైజీరియా ప్రభుత్వం విఫలమైందంటూ కొంతకాలంగా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు. ‘ప్రత్యేకంగా ఆందోళనకరంగా మారిన దేశం’గా నైజీరియాపై అమెరికా ప్రభుత్వం ముద్ర వేసింది. దీని ప్రకారం.. మత స్వేచ్ఛ ఉల్లంఘనలు చోటుచేసుకున్న ఇలాంటి దేశాలపై ఆంక్షలు విధించే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే అమెరికా మిలటరీ నవంబర్ నుంచే నైజీరియాలోని ఐఎస్ గ్రూపు స్థావరాలపై దాడులకు పథకం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఐఎస్ అనుబంధ గ్రూపుల హింస నైజీరియాలోని వాయవ్య ప్రాంతంలోని రెండు రాష్ట్రాల్లో ఐఎస్ అనుబంధ గ్రూపులు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఐఎస్కు సంబంధించిన ఓ గ్రూపు ఇప్పటికే బోర్నో రాష్ట్రంలో గట్టి పట్టు సాధించింది. ఈశాన్య నైజీరియాలో బోకోహరామ్, ఐఎస్ అనుబంధ గ్రూపులు గత పదేళ్లుగా వేలాది మందిని పొట్టనబెట్టుకున్నాయి. బాధితుల్లో ఎక్కువ మంది ముస్లింలేనని ఆక్లెడ్ అనే మానవ హక్కుల విభాగం తెలిపింది. ఈ గ్రూపు ప్రపంచవ్యాప్తంగా జరిగే రాజకీయ పరమైన హింసను విశ్లేíÙస్తుంది. ఐఎస్ అనుబంధ ‘నైజీరియా–ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్’ఈశాన్య ప్రాంతంలో నడుస్తున్న అతిపెద్ద గ్రూపని విశ్లేషకుడు బులామా బుకాటి చెప్పారు. అదే వాయవ్య సొకొటొ, కెబ్బి రాష్ట్రాల్లో ప్రాబల్యం కోసం స్థానికంగా లకురమా అని పిలిచే గ్రూపు ప్రయతి్నస్తోందన్నారు. ఈ గ్రూపునే తాజాగా అమెరికా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. గత ఏడాదిన్నర కాలంలో ఈ గ్రూపు సొకొటొలోని ప్రజలపై సామాజిక ఆంక్షలను అమలు చేస్తోందని చెప్పారు. అదే సమయంలో, సెంట్రల్ నైజీరియా ప్రాంతంలో క్రైస్తవులైన రైతులు, ముస్లింలైన పశువుల కాపరుల మధ్య నీళ్లు, పచి్చక బయళ్ల విషయమై తరచూ ఘర్షణలు జరుగుతున్నాయని బుకాటి వివరించారు.ట్రంప్ ఆరోపణల్లో నిజముందా?నైజీరియాలోని వివిధ జిహాదీ గ్రూపులు జరుపుతున్న దాడుల్లో ముస్లింల కంటే క్రైస్తవులే ఎక్కువ మంది చనిపోయారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని మానవ హక్కుల సంస్థలంటున్నాయి. బాధితుల్లో రెండు మతాల వారూ దాదాపు సమానంగానే ఉంటున్నారన్నాయి. క్రిస్మస్ రోజు రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా..‘నైజీరియాలో రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదం పెచ్చుమీరడాన్ని మేం జరగనీయం. హ్యాపీ క్రిస్మస్’అంటూ వ్యాఖ్యానించారు. దాడులకు మద్దతు, సహకారం అందించిన నైజీరియా ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ పేర్కొన్నారు. ఓ యుద్ధ నౌక నుంచి క్షిపణిని ప్రయోగిస్తున్న ఫొటోను రక్షణ శాఖ విడుదల చేసింది. నైజీరియా జనాభా 22 కోట్లు కాగా, వీరిలో క్రైస్తవులు, ముస్లింలు సమాన సంఖ్యలో ఉన్నారు. -
పాక్ గుండెల్లో ‘సిందూర్ 2.0’ గుబులు
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్కు చావుదెబ్బ తగిలింది. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడి చేయడంతో పెద్ద సంఖ్యలో ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాద స్థావరాలు, శిక్షణా కేంద్రాలు నేలమట్టమయ్యాయి. పాక్ వైమానిక కేంద్రాలు, యుద్ధ విమానాలు సైతం ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సిందూర్తో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని సాక్షాత్తూ పాకిస్తాన్ సైన్యమే చెబుతోంది. భారత సైన్యం సత్తా ఏమిటో పొరుగు దేశానికి తెలిసొచి్చంది. దాంతో ముందు జాగ్రత్త చర్యగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సరిహద్దు అయిన నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. కీలక ప్రాంతాల్లో కౌంటర్–డ్రోన్ వ్యవస్థలను మోహరించింది. మరో కవ్వింపు చర్యలకు పాల్పడితే సిందూర్ మళ్లీ ప్రారంభమవుతుందని భారత ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. అందుకే ఆపరేషన్ సిందూర్ 2.0 భయం పాకిస్తాన్ను వెంటాడుతోంది. భారత సైన్యం దాడులకు దిగితే తిప్పికొట్టడానికి పీఓకేలోని మూడు సెక్టార్లలో కౌంటర్–అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్(సీ–యూఏఎస్)ను పాక్ సిద్ధం చేసినట్లు భారత నిఘా వర్గాలు తాజాగా గుర్తించాయి. రావల్కోట్, కోట్లీ, భింబర్ సెక్టార్లలో వీటిని నెలకొల్పినట్లు పేర్కొన్నాయి. ఎల్ఓసీ వద్ద 30కిపైగా యాంటీ–డ్రోన్ యూనిట్లను అందుబాటులోకి తీసుకొచి్చనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గగనతల నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఎల్రక్టానిక్ యుద్ధ సామర్థ్యాలు పెంచుకోవడం పాక్ వ్యూహంగా కనిపిస్తోంది.శత్రు డ్రోన్లపై నజర్ భారత్లోని పూంచ్ సెక్టార్కు ఎదురుగా ఉన్న రావల్కోట్లో యాంటీ–డ్రోన్ల వ్యవస్థలను రెండో ఆజాద్ కశ్మీర్ బ్రిగేడ్ నిర్వహిస్తోంది. రాజౌరీ, నౌషెరా, సుందర్బనీ సెక్టార్లకు ఎదురుగా ఉండే కోట్లీలో వీటి నిర్వహణ బాధ్యతను మూడో ఆజాద్ కశ్మీరీ బ్రిగేడ్కు, భింబర్లో నిర్వహణను ఏడో ఆజాద్ కశ్మీరీ బ్రిగేడ్కు అప్పగించినట్లు తెలిసింది. ఎల్ఓసీ వెంట ఎల్రక్టానిక్, కైనటిక్ కౌంటర్–యూఏఎస్లను పాక్ రంగంలోకి దించినట్లు సమాచారం. ఇందులో కీలకమైన స్పైడర్ వ్యవస్థ కూడా ఉంది. ఇది పది కిలోమీటర్ల దూరంలోని శత్రు డ్రోన్లను కూడా సరిగ్గా గుర్తించగలదు. అంతేకాకుండా పాక్ అమ్ముల పొదిలో సఫ్రా యాంటీ–యూఏవీ జామింగ్ గన్ కూడా ఉంది. దీనిని మనుషులు ఆపరేట్ చేస్తుంటారు. 1.5 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను కూలి్చవేయొచ్చు. తక్కువ ఎత్తులో ఎగిరే శత్రు డ్రోన్లను కూల్చడానికి సంప్రదాయ గగనతల రక్షణ ఆయుధాలను కూడా పాక్ ఉపయోగిస్తోంది. జీడీఎఫ్ 35 ఎంఎం ట్విన్ బ్యారెల్ యాంటీ– ఎయిర్క్రాఫ్ట్ గన్స్, అజ్నా ఎంకే–2, ఎంకే–3 మ్యాన్–పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పాక్ వద్ద ఉన్నాయి. తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో దూసుకొచ్చే డ్రోన్లను వీటితో కూల్చవచ్చు.తుర్కియే, చైనాలతో పాక్ చర్చలు ఇటీవలి కాలంలో పశ్చిమ సరిహద్దుల్లో భారత సైన్యం కదలికలు ముమ్మరమయ్యాయి. సైన్యం, నావికాదళం, వైమానిక దళం తరచుగా విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు పాక్ సరిహద్దుల్లో అధునాతన డ్రోన్లను మోహరిస్తున్నారు. ఈ పరిణామాలతో పాక్ అప్రమత్తమైనట్లు భారత నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు నూతన డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కోసం తుర్కియే, చైనాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కౌంటర్–డ్రోన్ సామర్థ్యాల విషయంలో పాక్ సైన్యం చాలా బలహీనంగా ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ విషయం నిరూపితమైంది. అందుకే డ్రోన్లతో జరిగే దాడిని తట్టుకోవడంపై పాక్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు భారత నిఘా వర్గాలు కనిపెట్టాయి. -
మన బ్రాండ్.. స్విచ్ ఆఫ్!
సాక్షి, స్పెషల్ డెస్క్ : మొబైల్ ఫోన్ల తయారీలో చైనా తర్వాతి స్థానం భారత్దే. యూఎస్, యూఏఈ, నెదర్లాండ్స్, యూకే, ఆ్రస్టియా, ఇటలీ వంటి దేశాలకు మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్తో ఐఫోన్లూ ఎగుమతి అవుతున్నాయి. స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో భారత్ రెండవ స్థానంలో ఉంది. ఏటా 15 కోట్లకుపైగా స్మార్ట్ఫోన్లు వినియోగదారుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఈ స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నా ఇండియన్ బ్రాండ్స్ కనిపించకపోవడం గమనార్హం. మైక్రోమ్యాక్స్ వంటి దేశీ బ్రాండ్స్ వచ్చినా.. భారత మొబైల్ ఫోన్ల విపణిలో 2010కి ముందు వరకు నోకియా (ఫిన్లాండ్), మోటరోలా (యూఎస్), ఎరిక్సన్ (స్వీడన్), సీమెన్స్ (జర్మనీ), సామ్సంగ్ (దక్షిణ కొరియా), సోనీ ఎరిక్సన్ (జపాన్/స్వీడన్), బ్లాక్బెర్రీ (కెనడా), ఎల్జీ (దక్షిణ కొరియా) కంపెనీలు రాజ్యమేలాయి. 2003లో చెన్నైకి చెందిన వీకే మునోత్తోపాటు పలు కంపెనీలు ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా రాణించలేదు. కానీ 2008లో మైక్రోమ్యాక్స్ రాకతో భారతీయ చవక హ్యాండ్సెట్స్ యుద్ధం మొదలైంది. క్రమంగా కార్బన్, లావా, సెల్కాన్, ఇంటెక్స్ వంటి దేశీ బ్రాండ్ల రాకతో 2010–12 మధ్య మొబైల్ ఫోన్ల కంపెనీల మధ్య పోటీ తారస్థాయికి చేరింది. దేశీయ మొబైల్ కంపెనీల దెబ్బకు ఒక దశలో నోకియా, సామ్సంగ్ మార్కెట్ వాటా తగ్గింది. ఏకంగా 230 బ్రాండ్స్.. భారత మొబైల్స్ రంగంలో ఒకానొక దశలో 50%పైగా వాటాను దేశీయ కంపెనీలు చేజిక్కించుకున్నాయంటే అతిశయోక్తి కాదు. 230 దాకా భారతీయ బ్రాండ్స్ అమ్మకాలు సాగించాయి. ఫీచర్ ఫోన్లతోపాటు స్మార్ట్ఫోన్స్, ట్యాబ్లెట్ పీసీలు, టీవీల తయారీలోకి సైతం ప్రవేశించాయి. 2010లో చైనా కంపెనీ హువావే భారత్లో అడుగుపెట్టగా షావొమీ, వివో, ఒప్పో ప్రవేశంతో 2014 నుంచి అసలైన యుద్ధం మొదలైంది. చైనా బ్రాండ్ల ముందు మన కంపెనీలు నిలవలేకపోయాయి. కొన్ని భారతీయ కంపెనీలు ఇప్పుడు ఫీచర్ ఫోన్లతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నా స్మార్ట్ఫోన్ల విభాగం పోటీలో మాత్రం విదేశీ కంపెనీల దరిదాపుల్లో కూడా లేవు. ఎలా సాధ్యమైందంటే..చవక ధరలో విక్రయించాలన్న లక్ష్యంతో ప్రవేశించిన దేశీయ బ్రాండ్స్ రిటైలర్ల మార్జిన్లపై దృష్టిపెట్టలేదనేది మార్కెట్ వర్గాల మాట. పైగా రూ. 10 వేలలోపు ధరల విభాగంలోనే ఇవి ప్రధానంగా దృష్టిపెట్టాయి. ఇక్కడే చైనా కంపెనీలు చక్రం తిప్పాయి. అధిక ఫీచర్లు, నాణ్యతకుతోడు రిటైలర్లకు అధిక లాభాలను అందించాయి. పైగా సొంత పరిశోధన, అభివృద్ధి విభాగాలతోపాటు స్మార్ట్ఫోన్ల తయారీ సైతం వాటి చేతుల్లోనే ఉండటంతో ధరలను శాసించాయి. విక్రయానంతర సేవలను చిన్న పట్టణాలకూ విస్తరించాయి. క్రమంగా చైనా బ్రాండ్లు భారతీయ మార్కెట్ను కైవసం చేసుకున్నాయి. ప్రస్తుతం మార్కెట్ పరిమాణం పరంగా దాదాపు 70% వాటా చైనా కంపెనీలదే. ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశీయ బ్రాండ్లకు అవకాశమే లేదన్నది నిపుణుల మాట.ఇదీ భారత మార్కెట్..» 2025 జూలై–సెప్టెంబర్ మధ్య 4.8 కోట్లస్మార్ట్ఫోన్లుఅమ్ముడయ్యాయి. » టాప్–10లోని సామ్సంగ్, యాపిల్, మోటరోలా మినహా మిగిలినవన్నీ చైనావే. » మన దేశంలో అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్సగటు ధర రూ. 26,400పైమాటే. » రూ.72 వేలు, ఆపై ఖరీదు చేసేమోడళ్ల అమ్మకాలు ఏడాదిలో53 శాతం పెరిగాయి. » విక్రయాల్లో ఆఫ్లైన్ వాటా48.3 నుంచి 56.4 శాతానికిదూసుకెళ్లగా ఆన్లైన్ విభాగం 51.7నుంచి 43.6 శాతానికి తగ్గింది.» ఈ ఏడాది స్మార్ట్ఫోన్ మార్కెట్ రూ. 4.34 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతంస్మార్ట్ఫోన్లనువినియోగిస్తున్నవారి సంఖ్య70కోట్లు -
పర్వత ప్రాంతం.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్ప్రెస్వే ప్రారంభం
బీజింగ్: చైనా మరోసారి ప్రపంచ ఇంజనీరింగ్ రంగాన్ని ఆశ్చర్యపరిచే ప్రాజెక్టును పూర్తి చేసింది. షింజియాంగ్ ప్రావిన్స్లోని తియాన్షాన్ పర్వతాల ప్రాంతంలో నిర్మించిన 22.13 కిలోమీటర్ల పొడవైన ‘తియాన్షాన్ షెంగ్లీ టన్నెల్’ను అధికారికంగా ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్ప్రెస్వే టన్నెల్గా గుర్తింపు పొందింది.ఈ టన్నెల్ ద్వారా గతంలో పర్వత మార్గం గుండా ప్రయాణించడానికి గంటల తరబడి పట్టిన ప్రయాణం ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లో పూర్తవుతోంది. షింజియాంగ్ ఉత్తర భాగంలోని ఉరుమ్చీ నగరాన్ని, దక్షిణ భాగంలోని యులీ ప్రాంతాన్ని కలుపుతూ నిర్మించిన G0711 ఉరుమ్చీ–యులీ ఎక్స్ప్రెస్వేలో ఇది కీలక భాగంగా నిలిచింది.తీవ్ర చలిలో, మైనస్ 43 డిగ్రీల ఫారెన్హీట్ వరకు పడిపోయే ఉష్ణోగ్రతల్లో, 9,842 అడుగుల ఎత్తులో ఈ టన్నెల్ను నిర్మించడం ఒక ఇంజనీరింగ్ సవాలుగా నిలిచింది. కేవలం ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా చైనా మరోసారి తన నిర్మాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించింది.తియాన్షాన్ పర్వతాలు షింజియాంగ్ను ఉత్తర–దక్షిణ భాగాలుగా విభజిస్తాయి. ఈ టన్నెల్ ప్రారంభం వల్ల రెండు ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగవుతుంది. ఇది కేవలం రవాణా మార్గమే కాకుండా, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక పరంగా కొత్త అవకాశాలను ఆహ్వానించినట్లు అవుతుంది. -
ఘోరం.. మసీదులో బాంబు పేలుళ్లు 8మంది మృతి
సిరియాలో దారుణం జరిగింది. హోమ్స్ సిటీలో శుక్రవారం సందర్భంగా మసీదులో ప్రత్యేక ప్రార్థనల చేస్తున్న సమయంలో బాంబు పేలింది. ఈ దుర్ఘటనో ఎనిమిది మంది మృతి చెందగా, 21 మంది గాయపడ్డట్లు అధికారులు పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే మసీదులో బాంబు అమర్చి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.కాగా ఈ ఘటనను అక్కడి ప్రభుత్వం ఖండించింది. ఇది పిరికపంద చర్యని పేర్కొంది. ఇటువంటి చర్యలు సిరియాలో ప్రభుత్వాన్ని పౌరుల భద్రతను విఫలం చేయవని పేర్కొంది. ప్రజలలో అయోమయాన్ని, భయాన్ని సృష్టించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని వారి ప్రయత్నాలు ఫలించవని ప్రభుత్వం పేర్కొంది. కాగా మసీదు బాంబు దాడి ప్రాథమిక విచారణలో బాంబులు అమర్చినట్లు తేలిందని అధికారులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతంలో భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
వ్యాపారం అమ్మేసి, ఒక్కొక్కరికీ రూ. 4 కోట్ల బోనస్
ఒక కంపెనీ అధిపతి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏకంగా 2 వేల కోట్ల రూపాయలను బోనస్ను ప్రకటించారు. దీంతో సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవ్వడం ఉద్యోగుల వంతైంది. సోషల్ మీడియాలో ఎన్నో ప్రశంసలందుకున్నారు. ఎవరా అధిపతి, ఏమా కథ నిజ జీవితంలో శాంతా క్లాజ్ గురించి తెలుసుకుందాం పదండివాల్ స్ట్రీట్ జర్నల్లోని ఒక నివేదిక ప్రకారంతన కుటుంబ కంపెనీ అమ్మకం తర్వాత ఒక వ్యాపార యజమాని తన కార్మికులకు లక్షలాది బోనస్లను బహుమతిగా ఇచ్చాడు. ఫైబర్బాండ్ సంస్థ (Fibrebond) సీఈవో 46 ఏళ్ల గ్రాహమ్ వాకర్ 540 మంది ఉద్యోగులకు సుమారు రూ.2,155 కోట్లు బోనస్ పంపిణీ చేశారు.ఈ సంవత్సరం ప్రారంభంలో తన కంపెనీని ఈటన్ కార్పొరేషన్కు (రూ.15,265 కోట్లు) విక్రయించాడు. అయితే ఉద్యోగుల కోసం ఆదాయంలో 15 శాతం కేటాయించే వరకు వాకర్ తన కంపెనీని విక్రయించడానికి అంగీకరించలేదు. ఈ కొనుగోలు ఒప్పందం ప్రకారం రానున్న ఐదేళ్ల కాలంలో ఆ సిబ్బంది ఒక్కొక్కరికీ సుమారు రూ.4 కోట్ల మేర అందుతుంది. ఉద్యోగులలో ఎవరికీ స్టాక్ లేనప్పటికీ దానిలో కొంత భాగాన్ని ఇవ్వాలను నిర్ణయించాడు. అతని దాతృత్వం విశేష ప్రశంసలను దక్కించుకుంది.ఫైబర్బాండ్ ఎలక్ట్రికల్ పరికరాల కోసం ఎన్క్లోజర్లను తయారు చేసే కంపెనీ. ఫైబర్బాండ్ఫైబర్బాండ్ను 1982లో వాకర్ తండ్రి క్లాడ్ వాకర్, మరో 11 మందితో కలిసి ప్రారంభించారు.1998లో ఫ్యాక్టరీ కాలిపోవడం నుండి డాట్-కామ్ బబుల్ సంక్షోభం వరకు, ఫైబర్బాండ్ ఉద్యోగులు ఒడిదుడుకులను ఎదుర్కొని విధేయతతో మనుగడ సాగించగలిగింది. 2020లో క్లౌడ్ కంప్యూటింగ్ కోసం డిమాండ్ పెరగడంతో 150 డాలర్లు మిలియన్ల పెట్టుబడి ఫలించింది.ఐదు సంవత్సరాలలో అమ్మకాలు దాదాపు 400శాతం పెరిగాయి.వ్యాపారం దాదాపుగా కుప్పకూలినప్పటికీ, వ్యాపారాన్నికొనసాగించడానికి ఉద్యోగులుదశాబ్దాలుగా పని చేశారని, వారి అంకితభావానికి గుర్తింపు లభించకపోతే, వారికి ప్రతిఫలం లభించకపోతే చాలా మంది వెళ్లిపోతారని తాను నమ్ముతున్నానని వాకర్ ది జర్నల్తో వాకర్ వ్యాఖ్యానించారు.ఆశ్చర్యపోయిన ఉద్యోగులుబోనస్ అందించిన రోజు ఉద్యోగులు కొంతమంది దీన్ని నమ్మలేకపోయారు. మరికొందరు ఇదేదో జోకేమో అనుకున్నారట. తీరా అసలు విషయం వారి ఆనందానికి అవధుల్లేవు. ఉద్వేగానికి గురయ్యారు. కొందరు ఆ డబ్బును అప్పు తీర్చడానికి, కార్లు కొనడానికి, కాలేజీ ట్యూషన్ ఫీజు చెల్లించడానికి లేదా పదవీ విరమణ కోసం ఆదా చేయడానికి ఉపయోగించారు.ఉద్యోగినులలో ఒకరైన లెసియా కీ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. 1995లో 21 సంవత్సరాల వయస్సులో ఫైబర్బాండ్లో ఆమె కరియర్ ఆరంభమైంది. అప్పుడు ఆమె జీతం 5.35 డాలర్లు మాత్రమే. క్రమంగా ఉన్నత పదవులకు ఎగబాకింది. ఈ ఏడాది నాటికి, 18 మంది వ్యక్తుల బృందానికి నాయకత్వం వహించింది , 254 ఎకరాలలో కంపెనీ సౌకర్యాలను నిర్వహించేలా కృషి చేశారు.'క్యారెక్టర్ ఆఫ్ మ్యాన్'బోనస్ల వార్తలు వైరల్ కావడంతో, సోషల్ మీడియాలో వాకర్ , దాతృత్వాన్ని, ఉద్యోగుల పట్ల అతన ప్రేమను కొనియాడారు నెటిజన్లు. వావ్, నిజంగా దయగల, ఉదారమైన వ్యక్తి, అద్భుతం అంటూ ఆయనకు అభినందనలు తెలిపారు. -
బంగ్లాలో హిందువులపై దాడులు
బంగ్లాదేశ్లో ఇటీవల మైనార్టీలపై దాడులు తీవ్రతరం అవుతున్నాయి. అక్కడి మతతత్వ వాదులు వేరు వేరు ఘటనల్లో ఇద్దరు హిందు మతానికి చెందిన వ్యక్తులపై దాడి చేసి చంపారు. అంతే కాకుండా వారి ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో భారతీయ విదేశాంగ శాఖ స్పందించింది. అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులు తీవ్రంగా బాధిస్తున్నాయని తెలిపింది.బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై గత కొంతకాలంగా భారత్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం ఎదుట విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంఘాలు నిరసనలు తెలిపాయి. అంతే కాకుండా పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడుల పట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ స్పందించారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఘటనలను భారత్ గమనిస్తోందని తెలిపారు.రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. "బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా భారత్ తీవ్రంగా పరిగణిస్తుంది. హిందువులపై జరిగే దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము. వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించేది లేదు. ఈ ఘటనలకు కారణమైన వారిని తీవ్రంగా శిక్షించాలని బంగ్లాదేశ్ను కోరుతున్నాము. హిందువులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వానిదే." అని రణధీర్ జైశ్వాల్ అన్నారు. ఈ బుధవారం రాత్రి పాంగ్షా ఉపజిల్లా హోసైన్డంగాలో 29ఏళ్ల అమృత్ మండల్ అనే యువకుడిని అక్కడి మత ఛాందస వాదులు కొట్టిచంపారు. అతను బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. అయితే కొద్దిరోజుల క్రితం దీపు చంద్రదాస్ అనే యువకుడిని దైవదూషణ చేస్తున్నాడనే ఆరోపణలతో అక్కడి అల్లరి మూకలు విపరీతంగా కొట్టి చంపారు.అంతే కాకుండా మరో ఘటనలో ఓ హిందూ కుటుంబంపై దాడికి యత్నించగా వారు తృటిలో తప్పించుకున్నారు. ఈ నెల ప్రారంభంలో అక్కడ ఉస్మాన్ హాది అనే రాడికల్ నేతపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆయన ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. దీంతో ఆదేశంలో మరోసారి హింస చేలరేగింది. హిందువులే టార్గెట్గా అక్కడి మత ఛాందస వాదులు దాడులు జరుపుతున్నారు. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. -
ఆపరేషన్ సిందూర్ 2.0.. వణికిపోతున్న పాక్!
ఆపరేషన్ సిందూర్ ఈ పేరు వింటే చాలు పాకిస్థాన్కు చెమటలు పడతాయి. పహల్గామ్ లోయ విహారయాత్రకు వెళ్లిన భారతీయులను అన్యాయంగా పొట్టన బెట్టుకున్న ఉగ్రమూకలను వారి దేశంలోనే భారత్ తుదముట్టించింది. అంతే కాకుండా ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని దాయాది దేశాన్ని హెచ్చరించింది. అయితే ఆపరేషన్ సిందూర్ భయం పాక్ను ఇప్పటికీ వీడనట్లే కనిపిస్తుంది. అందుకే తాజాగా ఎల్ఓసీ సరిహద్దు ప్రాంతాలలో డ్రోన్లలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి యావద్దేశాన్ని వేదనకు గురి చేసింది. విహారయాత్రకు వెళ్లిన పౌరులపై పాక్ లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రమూకలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాయి. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు వదిలారు. అంతేకాకుండా మరణించిన వారిలో అప్పుడే పెళ్లయిన నవ దంపతుల జంట ఉండడం, వారిని హేళన చేస్తూ ఉగ్రవాదులు మాట్లాడడం చూసి కోట్లాది హృదయాలు ఆవేదనతో రగిలిపోయాయి.దీనికి ప్రతికారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై త్రివిధ దళాల సమన్వయంతో ఇండియన్ ఎయిర్ఫోర్స్ విరుచుకుపడింది. లష్కరేతోయిబాతో పాటు జైషేమహమ్మద్ ఉగ్రస్థావరాలపై దాడులు జరిపింది. ఇందులో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మరణించినట్లు పలు నివేదికలు తెలిపాయి. అయితే పాకిస్థాన్ను ఆపరేషన్ సిందూర్ భయం (Operation Sindoor) ఇంకా వదలట్లేదు. తాజాగా భారత్తో సరిహద్దు ప్రాంతాలలో ఆధునాతన డ్రోన్ టెక్నాలజీ వ్యవస్థను మెహరించినట్లు సమాచారం.సరిహద్దులో ప్రత్యేక నిఘాభారత్, పాకిస్థాన్ సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి దాదాపు 30కి పైగా యాంటీ డ్రోన్ యూనిట్స్ని 12వ పదాదిదళ విభాగం ఏర్పాటు చేసింది. వీటితో సరిహద్దు రేఖ వెంబడి అకస్మాత్తుగా వచ్చే యుద్ధవిమానాలు, డ్రోన్లపై ప్రత్యేక నిఘా ఉంచనుంది. అంతేకాకుండా రాజస్థాన్ పుంచ్ సెక్టార్కు రావల్కోట్ల ఈ డోన్ వ్యవస్థలను మోహరించింది. ఇవి సరిహద్దు రేఖకు 10 కిలోమీటర్ల వెలుపల ఎగిరే అతి చిన్న వస్తువును సైతం గుర్తిస్తాయి. ఈ సిస్టమ్లో 1.5 కిలోమీటర్ల పరిధిలోని వస్తువులను గాలిలోనే ధ్వంసం చేసేలా ప్రత్యేక వ్యవస్థ కలిగిన గన్ సిస్టమ్ ఉంటుంది.చదవండి: పాక్ పన్నాగాల్ని ముందే పసిగట్టిన పుతిన్!దీనితో పాటు డ్రోన్ సాంకేతికత మరింతగా పెంచుకునేందుకు టర్నీ, చైనా దేశాలతో పాకిస్థాన్ (Pakistan) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఆ దేశ నాయకులు సైతం తరచుగా భారత్తో యుద్ధానికి సిద్ధం అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నేపథ్యంలో ఆపరేషన్ 2.0 అవసరముందని ఇటీవల విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ వ్యాఖ్యానించారు. -
పాక్ పన్నాగాల్ని ముందే పసిగట్టిన పుతిన్!
అమెరికాను సైతం తాకేలా క్షిపణులను ఆసియా దేశం పాకిస్థాన్ రహస్యంగా తయారు చేస్తోందని ఆ మధ్య అతి ప్రచారం నడిచింది. అలాగే.. పాక్ అణ్వాయుధాలపై భారత్ కొన్నేళ్లుగా ఆందోళనలు వ్యక్తంచేస్తోంది. అయితే.. పాక్ పన్నాగాల్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందే పసిగట్టారా?.. ఈ విషయంలో ఆయన అగ్రరాజ్యం అమెరికాను ముందే అప్రమత్తం చేశారా?.. రెండు దశాబ్దాల కింద.. 2001లో స్లోవేనియాలో జరిగిన ఓ సమావేశానికి పుతిన్, నాటి అమెరికా అధ్యక్షుడు బుష్ హాజరయ్యారు. ఆనాడు వాళ్ల మధ్య జరిగిన సంభాషణను అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్స్ (2001-2008) బయటపెట్టింది. తమ మధ్య మాటల్లో.. నాటి పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలోని పాక్ అణు కార్యక్రమాన్ని నాడు వారిద్దరు తీవ్ర సమస్యగా పరిగణించినట్లు ఆ పత్రాలను బట్టి స్పష్టమవుతోంది.‘‘అది అణ్వాయుధాలు కలిగిన సైనిక కూటమి. అక్కడ ప్రజాస్వామ్యం లేదు. మిలిటరీ పాలనలో ఉంది. కానీ పాశ్చాత్య దేశాలు(వెస్ట్రన్ కంట్రీస్) దానిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదు. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది’’ అని రష్యా అధ్యక్షుడు బుష్ వద్ద ఆక్షేపించారు. పాక్ పట్ల ఉదాసీనంగా వ్యవహరించడంపై పలు అనుమానాలు లేవనెత్తారు. అయితే.. ఈ వ్యాఖ్యలతో బుష్ విభేదించలేదని తెలుస్తోంది. కానీ, పాక్ అక్రమ అణు వ్యాపారంపై అమెరికా అధ్యక్షుడు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఉల్లంఘన కలవరపెట్టేదే’’ అని పుతిన్ మాటలను బుష్ అంగీకరించారు.ఇలా.. పాక్ అణ్వాయుధాల అంశంపై వీరు సమగ్రంగా చర్చించారు. అంతేకాదు అణు కార్యక్రమాల నిబంధనలను ఉల్లంఘించిట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశాల విషయంలో వ్యవహరించినట్లుగా.. పాకిస్థాన్పై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని నాడు పుతిన్ (Putin) పశ్నించినట్లు ఆ పత్రాల ద్వారా బయటకు వచ్చింది. అయితే.. పాక్ అణుపితామహుడు అబ్దుల్ ఖాదిర్ ఖాన్ కార్యకలాపాలు బయటపడిన తర్వాత ఆ దేశంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చామని నాడు బుష్ వెల్లడించారు. అలాగే ఖాన్తో పాటు అతడి అనుచరులను నిర్బంధించేలా చేశామన్నారు. కానీ.. ఈ అణు పదార్థాలు పాక్ (Pakistan) నుంచి ఎవరికి చేరాయనే దానిపై మాత్రం స్పష్టత లేదని ఆ సందర్భంలో బుష్ తెలిపారు. ప్రజాస్వామ్య జవాబుదారీతనం లేని ప్రభుత్వాల చేతుల్లో అణ్వాయుధాలు అధికంగా ఉన్నాయని పుతిన్ పదేపదే లేవనెత్తగా.. ఆ సున్నితమైన పరిజ్ఞానం మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని బుష్ సమర్థించినట్లు వెల్లడైంది. అలాగే.. ఇరాన్ అణు కార్యక్రమంలో పాక్ యురేనియాన్ని గుర్తించామని 2005లో జరిగిన మరో భేటీలో బుష్ వద్ద పుతిన్ ప్రస్తావించినట్లు ఇవే పత్రాలు బయటపెట్టాయి.అయితే.. పాక్ అణ్వాయుధాలతో ప్రధానంగా భారత్కే ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఆ అణ్వాయుధాలను భారత్ను ఎదుర్కోవడానికే పాక్ అభివృద్ధి చేసిందని(ఇంకా చేస్తోందనే) అని కూడా అంటున్నారు. భారత్ అణ్వాయుధాల విషయంలో “No First Use” (మొదట ప్రయోగించొద్దు) అనే స్పష్టమైన అణు విధానం పాటిస్తోంది. కానీ పాక్ వద్ద అలాంటి పద్ధతులేం లేవు. పైగా భారత్ సాంప్రదాయ సైనిక శక్తిని సమతుల్యం చేసుకోవడానికే పాక్ చాలా కాలంగా పాకులాడుతూ వస్తోంది.2025 నాటికి పాకిస్తాన్ వద్ద సుమారు 170 అణ్వాయుధాలు ఉన్నాయని ఒక అంచనా. రానున్న ఐదేళ్లలో ఆ సంఖ్య 200కి చేరుకునే అవకాశం లేకపోలేదు. అయితే.. పాక్ అణ్వాయుధాలనేవి యావత్ ప్రపంచానికి ఒక ఆందోళనకర అంశమే. ఎందుకంటే.. పాక్లో కొనసాగే రాజకీయ అస్థిరత.. సైనికాధిపత్యం, ఉగ్రవాద సంస్థలు వాటిని చేజిక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉండడం, వీటికి తోడు గతంలో అణు సాంకేతికత లీక్ కావడం లాంటివి విశ్లేషకులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. -
ఇది భారత్తో విభేదాలు సృష్టించే ప్రయత్నమే..!
అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ రిలీజ్ చేసిన తాజా నివేదికపై చైనా తీవ్రంగా స్పందించింది. భారత్తో సరిహద్దు ఉద్రిక్తతలు శాంతియుతంగానే ఉన్నాయని.. అయితే పాత పరిస్థితులను ప్రస్తావిస్తూ భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలకు అమెరికా ప్రయత్నిస్తోందని మండిపడింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియన్ మాట్లాడుతూ.. ఈ నివేదిక చైనా రక్షణ విధానాన్ని వక్రీకరిస్తోంది. భారత్ సహా పొరుగు దేశాల మధ్య విభేదాలు సృష్టిస్తోంది. తన సైనిక ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నమే ఇది అని అన్నారు. భారత్ సంబంధాలను చైనా వ్యూహాత్మక స్థాయిలో, దీర్ఘకాల దృష్టితో చూస్తోంది. పరస్పర విశ్వాసం పెంపు, సహకారం, విభేదాల పరిష్కారం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను స్థిరంగా ఉంచాలని కోరుకుంటోంది అని అన్నారు. అయితే.. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) పై US నివేదికలో చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతం సరిహద్దు పరిస్థితి స్థిరంగా ఉందని, కమ్యూనికేషన్ చానెల్స్ సజావుగా పనిచేస్తున్నాయని తెలిపారు. మరోవైపు.. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఈ నివేదికను ఖండిస్తూ.. ఇది తప్పుడు కథనాలు, పక్షపాతాలతో కూడిందని, చైనా మిలిటరీ ముప్పు అనే అతిశయోక్తితో నిండిపోయి ఉందని విమర్శించింది. మొత్తంగా చైనా అగ్రరాజ్య నివేదికను అసంబద్ధమైనదని.. బాధ్యతారహితమైనదని పేర్కొంది.భారత అమెరికా సంబంధాలను నీరుగార్చేందుకు చైనా కృషి చేస్తోందని.. సరిహద్దు ఉద్రిక్తతలు సడలింపును ఎరగా వేసి భారత్తో సత్సంబంధాలను పునరుద్ధరించకోజూస్తున్న డ్రాగన్ కంట్రీ అదే సమయంలో పాకిస్థాన్తోనూ మైత్రిని నెరపుతోందని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ నివేదిక వెలువరించింది. దీంతో చైనా పైవిధంగా స్పందించింది.


