యుద్ధం ఆమెకు విషాదాన్ని మిగిల్చినా..ఆమె సేవతో మనసులను రంజింప చేసింది.అపరిచితుల దయ మధ్య పెరిగి పెద్దదై జీవితాన్ని సార్థకం చేసుకునేలా బతికి చూపించింది. ఓ అనాథ తిరగరాసిన ఈ కథ..యువతకు స్ఫూర్తి, విలువలను నేర్పించే ఓ గొప్ప పాఠం. ఆమె స్ఫూర్తిదాయకమైన కథేంటంటే..
1945లో రెండొవ చైనా-జపనీస్ యుద్ధంలో జపాన్ ఓటమి అనంతరం సుమారు నాలుగువేల మంది జపనీస్ పిల్లలు చైనాలో నిరాశ్రయులయ్యారు. వీరిలో ఎక్కువ మంది ఈశాన్య చైనా, ఇన్నర్ మంగోలియా ప్రాంతాలలో ఉన్నారు. ఈ పిల్లల్లో చాలామందిని చైనీస్ కుటుంబాలు దత్తత తీసుకున్నాయి. ఆ అనాథల్లోని ఒకటే ఈ జు యాన్ చిన్నారి కథ..!.
ఆమె లియోనింగ్ ప్రావిన్స్లోని షెన్యాంగ్ నగరంలో సకురా యమమోటోగా జన్మించింది. ఆమె తండ్రి విమానం కూలిపోవడంతో మరణించగా, తల్లి ప్రసవం తర్వాత అనారోగ్య సమస్యల కారణంగా మరణించింది. దాంతో ఆమె కనీసం ఏడాది కూడా నిండకమునుపే ఓ చైనీస్ కుటుంబం దత్తత తీసుకుంది. అయితే ఆమె పెంపుడు తండ్రి సైన్యానికి వెళ్లిపోవడంతో అతని భార్య ముగ్గురు పిల్లల్ని పెంచడం కష్టంగా భావించి తన పొరుగింటి వాళ్లకు దత్తతగా ఇచ్చేసింది ఆమెను.
అలా ఆమె జు జెన్స్ దంపుతులకు చేరింది. వాళ్లు ఆమెకు జు యాన్ అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకునేవారు. ఆమె పుట్టుకతో ఎంతో విషాదాన్ని చూడటంతో బాధను దిగమింగి ఎంతో స్థైర్యవంతురాలిగా పెరగాలన్న ఉద్దేశ్యంతో జు యాన్ అని పేరుపెట్టారట ఆ పెంపుడు తల్లిదండ్రులు. అయితే వాళ్లకు పిల్లలను పెంచిన అనుభవం అంతగా లేకపోవడంతో తన తల్లికి ఇచ్చి పెంచమని చెప్పింది జు పెంపుడు తల్లి.
అలా అమ్మమ్మ ఇంటి వద్ద పెరిగిన ఆమెకు, మంచి ప్రేమ, సంరక్షణ లభించాయి. 1962లో స్థానిక ఆస్పత్రిలో వైద్య శిక్షణ పూర్తి చేసుకుని, తూర్పు చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్లోని ఒక గ్రామీణ ప్రాంతంలో వైద్యురాలిగా పనిచేసేందుకు వెళ్లింది. అలా ఆమె ఎన్నో ప్రసవాలు చేసింది. ఆమె పురుడుపోసిన నవజాత శిశువులందరూ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నారు కూడా. తనను చైనీస్ ప్రజలు రక్షించారు, ఫలితంగా శిశువులకు సేవ చేశానని అనుకునేదామె.
1980లో తన బిడ్డతో షెన్యాంగ్కు తిరిగి వచ్చి నిర్మాణ సంస్థలో పనిచేయడం ప్రారంభించింది. పదవీ విరమణ తర్వాత స్వయంగా చైనా సంప్రదాయ వైద్యాన్ని నేర్చుకుని మళ్లీ సేవ చేయడం ప్రారంభించింది. అప్పుడే తాను జపనీస్ అనాథనని తెలుసుకుని భావోద్వేగానికి గురైంది. యుద్ధసమయంలో చైనా, జపాన్ వేర్వేరు పద్ధతుల్లో టీకాలు వేసేది. దాని కారణంగానే నాటి చైనా జపాన్ యుద్ధ సమయంలో నిరాశ్రయలైన పిల్లల్లో ఆమె ఒక్కత్తినని తెలుసుకుంటుంది.
అయితే ఆమెలాగా యుద్ధం కారణంగా అనాథగా మారిని చాలామంది రెడ్క్రాస్ సొసైటీ సాయంతో తమ వాళ్లను కలుసుకుని స్వదేశానికి వెళ్లిపోయారు. అయితే జు యాన్ ఆ పని అస్సలు చేయలేదు.
నిజానికి ఆ సమయంలో జపనీస్ యుద్ధ అనాథలు దాదాపు 120 మంది ఉండగా ఇప్పుడు కేవలం ఐదుగురే మిగిలి ఉండటం విశేషం. అయితే జు తనను తాను ఎప్పుడూ చైనీస్గానే భావించాను కాబట్టి తనవాళ్లను కలిసే ప్రయత్నం చేయలేదంటోంది. పైగా తనకు రక్షణ కల్పించిన ఈ నేల నా ఇల్లు తన స్వదేశం అని సగర్వంగా చెబుతోందామె.
(చదవండి: ఇండియాలో ఇటలీగా పేరొందిన హిల్ స్టేషన్..! మన హైదరాబాద్కి జస్ట్..)


