C/O సుజాత టీ కొట్టు | Inspiring womens stories of Sujatha Tea Stall in Mahabubabad | Sakshi
Sakshi News home page

C/O సుజాత టీ కొట్టు

Mar 3 2026 6:17 AM | Updated on Mar 3 2026 6:17 AM

Inspiring womens stories of Sujatha Tea Stall in Mahabubabad

మన మధ్యే మహాశక్తి

మహిళా దినోత్సవ కథనాలు

‘‘ఉదయం ఆరు గంటలకు టీ కొట్టు దగ్గరకు వస్తాను. రోజంతా టీ కాస్తూనే ఉంటాను.. సాయంత్రం ఆరుగంటలకు ఇంటికి వెళతా. పదేళ్లుగా ఇదే నా పని. టీ కొట్టు మీద వచ్చిన ఆదాయంతో  నేను, నా ఇద్దరు పిల్లలు బతుకుతున్నాం. ఈ ఆదాయంలోనే పిల్లలను చదివించుకుంటున్నా. మా అమ్మాయి కిందటేడాది నీట్‌లో మంచి ర్యాంకు సాధించింది. ఇప్పుడు ఎంబీబీఎస్‌ చదువుతోంది. మా అబ్బాయి సిద్దార్థ ఇంటర్‌ పూర్తి చేసి జేఈఈ చదివేందుకు సిద్దం అవుతున్నాడు.

అటు నుంచి ఇటు .. ఇటు నుంచి అటు..
మహబూబాబాద్‌ జిల్లాలోని కురవి మండలం తట్టుపల్లి గ్రామం మాది. మా దగ్గరి బంధువుల అబ్బాయికే ఇచ్చి పెళ్లిచేశారు మా అమ్మనాన్నలు. ఉన్న ఊళ్లో కలిగిన దాంట్లో బాగానే ఉండేవాళ్లం. మాకు ఇద్దరు పిల్లలు. మేం చదువుకోలేదు. అందుకే, పిల్లలను బాగా చదివించాలనే ఆలోచనతో హైదరాబాద్‌కు వెళ్లాం. కానీ, మా ఆయనకు ఎక్కడా సరైన పని దొరకలేదు. ఆర్థిక భారం, అప్పులు మా ఆయన్ని కలిచి వేశాయి. దిక్కుతోచక ఓ రోజు క్షణంలో తీసుకున్న నిర్ణయం నన్ను, నా కుటుంబాన్ని ఒంటరిని చేసింది. భర్త తోడులేని ఆడది, ఇద్దరు పిల్లలతో పట్టణంలో ఎలా బతకాలనేది నా ముందు పెద్ద ప్రశ్నగా ఉండేది. పుట్టెడు దుఃఖంలో కూడా బిడ్డల భవిష్యత్‌పై మేం పెట్టుకున్న ఆశలు మదిలో మెదలుతూనే ఉండేవి. కానీ, పట్టణంలో బతకలేక ఊరి బాట పట్టాను.

ఒంటరి పోరాటం.. 
ఊళ్లో కూలీ పనులకు పోయేదాన్ని. రోజులు గడిచిపోతున్నాయి. పిల్లల కడుపైతే నింపగలను కానీ, వారికి సరైన భవిష్యత్తును ఇవ్వగలనా.. అనేది పెద్ద సందేహంగా ఉండేది. అంతేకాదు, పిల్లలను బాగా చదివించాలని మా ఆయన, నేను పదే పదే అనుకునేవాళ్లం. ఆ మాటలు ఎప్పుడూ గుర్తుకువస్తుండేవి. పిల్లలను చదివించాలంటే మహబూబాబాద్‌లో ఉండాలనుకున్న. కానీ, అక్కడకెళ్లి ఎలా బతకాలి? టీ కొట్టు పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. బంధువుల సహకారం, కొద్దిపాటి ΄÷దుపు మొత్తంతో మహబూబాబాద్‌లో చిన్న టీ కొట్టు పెట్టుకున్న. గత 10సంవత్సరాలుగా ఉదయం ఆరు గంటలకు రావడం. 

సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వెళ్లడం పనిగా పెట్టుకున్న. దీనిపై వచ్చిన డబ్బులతో మేం బతుకుతున్నం, పిల్లలనూ చదవిస్తున్న. నా ఒంటరి పోరాటాన్ని పిల్లలు అర్ధం చేసుకున్నారు. మంచిగా చదువుకుంటేనే భవిష్యత్తు అని వారికీ అర్ధమైంది. మా అమ్మాయి వైష్ణవి కిందటేడాది నీట్‌లో మంచి ర్యాంకు సాధించింది. ఎంబీబీఎస్‌ సీటు ΄÷ంది చదువుతోంది. కొడుకు సిద్దార్థ ఇంటర్‌ పూర్తి చేసి జేఈఈకు ప్రిపేర్‌ అవుతున్నడు. పిల్లలపై నా భర్త పెంచుకున్న ఆశలను నిజం చేయాలన్నదే నా తపన’ అంటూ వివరించింది సుజాత. టీ కొట్టు మీద వచ్చిన ఆదాయం ఇంటి కిరాయి, పోషణ, పిల్లల చదువుకు ఖర్చైపోతుంది. పిల్లలు వారి జీవితాల్లో వారు స్థిరపడాలంటే ఇంకా సమయం పడుతుంది. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తే తనకు ఎంతో అండగా ఉంటుందంటోంది సుజాత. 

– ఈరగాని బిక్షం, సాక్షి మహబూబాబాద్‌
ఫొటోలు: మురళీ మోహన్‌

Advertisement
 
Advertisement
Advertisement