ఎవుసానికి ఏఐ ఊపు! | Sagubadi: Artificial Intelligence is revolutionizing agriculture | Sakshi
Sakshi News home page

ఎవుసానికి ఏఐ ఊపు!

Mar 3 2026 6:28 AM | Updated on Mar 3 2026 6:28 AM

Sagubadi: Artificial Intelligence is revolutionizing agriculture

మహిళల సారథ్యంలో మెరిసిన కృత్రిమ మేధ ఆధారిత వ్యవసాయక ఆవిష్కరణలు

కృత్రిమ మేధ (ఏఐ).. ఇప్పుడు ఏ రంగం చూసినా దీని ప్రభావానికి ఆవల లేదు. అందుకు వ్యవసాయ రంగం కూడా మినహాయింపు కాదు. ‘అందరి సంక్షేమం–అందరి సంతోషం’ కోసం ఏఐని వినియోగించుకునే కృషి ఊపందుకుంది. ఈ దిశగా జరిగే కృషిలో ‘ఇండియా–ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ 2026’ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. 

135 దేశాల ఏఐ నిపుణులు, ఆవిష్కర్తలు, సీఈవోలు పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మక ఏఐ శిఖరాగ్రసభ వివిధ రంగాలను ప్రభావితం చేస్తున్న ఏఐ సాంకేతికతలను వెలుగులోకి తెచ్చింది. మన రైతులకు ఉపయోగపడే 26 ఉత్తమ కృత్రిమ మేధ ఆధారిత వ్యవసాయ ఆవిష్కరణలను భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) ఎంపిక చేసి, సంకలనాన్ని వెలువరించింది. రైతులోకం ఆదరణ పొందుతున్న మహిళల సార«థ్యంలోని ఏఐ వ్యవసాయ సంబంధ ఆవిష్కరణలపై ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి సాగుబడి’ స్పెషల్‌ ఫోకస్‌...

కార్బన్ డేటాకు ఏఐ సొబగు
ఆర్మ్స్‌4 ఏఐ... వరి సాగులో వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు తడి పొడి నీటిపారుదల (ఆల్టర్నేట్‌ వెట్టింగ్‌ అండ్‌ డ్రయ్యింగ్‌– ఎ.డబ్ల్యూ.డి.) పద్ధతి ఉపయోగపడుతుంది. నీటిని నిరంతరాయంగా నిల్వగట్టకుండా వరి పంటకు అవసరమైనప్పుడు తగినంతగా నీరు అందిస్తూ ఉండే పద్ధతి ఇది. హరిత గృహ వాయువు అయిన మీథేన్‌ వాయువు తీవ్రతతో పాటు ఎరువులు, సాగునీరు వినియోగం ఎ.డబ్ల్యూ.డి. పద్ధతి వరి సాగులో తక్కువగా ఉంటుంది. దిగుబడుల్లో రాజీ పడకుండా ఎ.డబ్ల్యూ.డి. పద్ధతిలో వరి సాగు చేసే రైతులకు కర్బన ఉద్గారాలను తగ్గించినందుకు ‘కార్బన్‌ క్రెడిట్లు’ ఇస్తారు. 

ఈ కార్బన్‌ క్రెడిట్లను వాతావరణాన్ని కలుషితం చెయ్యక తప్పని పరిశ్రమల యజమానులు కొనుగోలు చేస్తారు. ఆ విధంగా ఈ రైతులకు కొంత ఆదాయం కూడా వస్తుంది. అయితే, ఎ.డబ్ల్యూ.డి. పద్ధతిని పాటించే ప్రతి పొలంలో క్రమం తప్పకుండా అన్ని వివరాలను, గణాంకాలను ఆధార సహితంగా నమోదు చెయ్యాల్సి ఉంటుంది. ఆ డేటాను థర్డ్‌పార్టీ వెరిఫికేషన్‌ తర్వాత కార్బన్‌ క్రెడిట్స్‌ మంజూరు చేస్తారు. అయితే, ఇక్కడే చిక్కంతా ఉంది.  మన దేశంలో వరి రైతుల్లో కూడా అత్యధికులు చిన్న, సన్నకారు రైతులే. 

'క్షేత్రస్థాయిలో సెన్సార్లు ఏర్పాటు చేసి, (వారానికి/ నెలకోసారి) తరచూ గణాంకాలను ప్రతి పొలంలోనూ నమోదు చేసే ప్రక్రియ (దీన్ని మానిటరింగ్, రిపోర్టింగ్, వెరిఫికేషన్‌– ఎం.ఆర్‌.వి. అంటారు) అత్యంత కష్టతరమైనది, వ్యయప్రయాసలతో కూడినది కూడా! ఈ సమస్యను అధిగమించేందుకు ఢిల్లీకి చెందిన ‘ఆర్మ్స్‌ 4 ఏఐ’ అనే స్టార్టప్‌ నూటికి నూరుశాతం ఉపగ్రహాలను ఉపయోగించి అత్యంత విశ్వసనీయమైన, ఆధారపడదగిన, సరిచూడదగిన డేటాను సేకరించే కృత్రిమ మేధతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ‘జియో ఏఐ – ఆధారిత డిజిటల్‌ ఎంఆర్‌వీ’ అని దీన్ని వ్యవహరిస్తున్నారు. ఈ పద్ధతిలో వరి పొలంలో నీటి తేమ, మీథేన్‌ స్థాయి వంటి వివరాల సేకరణకు ఎటువంటి సెన్సార్లను పెట్టాల్సిన పని లేదు. ఒక రైతు పొలం చిన్నదైనా, పెద్దదైనా, ఎన్ని పొలాల్లో అయినా ప్రతి రోజూ అధిక రెజొల్యూషన్‌తో కూడిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ చిత్రాలను సేకరించి, విశ్లేషించటం ద్వారా నమ్మదగిన డేటాను సేకరిస్తోంది. 

ఆర్మ్స్‌ 4 ఏఐ మొదట్లో 200 హెక్టార్ల వరి పొలాలతో ప్రారంభించి ఇప్పటికే 40 వేల హెక్టార్లలోని ఎ.డబ్ల్యూ.డి. వరి పొలాల్లో సేవలందిస్తోందని ఆ సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ జాగృతి దబస్‌ తెలిపారు. నెలకోసారి క్షేత్రస్థాయి గణాంకాలు సేకరించే పాత పద్ధతికి బదులు కొన్ని నిమిషాలకోసారి డేటాను తక్కువ ఖర్చుతోనే నమోదు చేసే అవకాశం తమ ఏఐ ఆధారిత సాంకేతికత వల్ల సాధ్యమైందని ఆమె తెలిపారు. ఆపరేషనల్‌ రిలయబిలిటీ అధికం కాబట్టి ఆడిటర్లు, కార్బన్‌ క్రెడిట్ల బయ్యర్లకు విశ్వసనీయత ఎక్కువగా ఉంటుందని జాగృతి వివరించారు.

ఏఐ ఆధారిత డిజిటల్‌ బిడ్డింగ్‌
అ΄్జావో ఆగ్రోటెక్‌... వరి ధాన్యం నుంచి పప్పుధాన్యాలు, చిరుధాన్యాల వరకు అమ్ముకునే సమయంలో రైతులు నానా కష్టాలు పడుతుంటారు. గుజరాత్‌కు చెందిన అ΄్జావో ఆగ్రోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ధాన్యాల నాణ్యతా నిర్ధారణను ఆధునీకరించేందుకు కృత్రిమ మేధ ఆధారిత యంత్రాలను, వీటికి అనుసంధానంగా డిజిటల్‌ బిడ్డింగ్‌ సదుపాయాలను కూడా రూపొందించింది. వరి, పప్పుధాన్యాల నాణ్యతను కేవలం నిమిషంలో పది కోణాల్లో నిర్ధారించి, నివేదికలను డిజిటల్‌ ΄్లాట్‌ఫామ్‌లో ఈ యంత్రాలు నిమిషంలో నమోదు చేస్తాయి. చెయ్యటంతోపాటు ఎక్కడ, ఏ రైతు వాటిని పండించారనే కచ్చితమైన ట్రేసబిలిటీ సమాచారాన్ని అందిస్తాయి. 

ఏఐ ఆధారిత సాంకేతికతలకు గాను ఈ సంస్థకు రెండు పేటెంట్లు లభించాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఈ సాంకేతికతలకు ఆమోదం తెలిపింది.  ఈ ఏఐ–ఆధారిత ధాన్యం విశ్లేషణా యంత్రం తేమ, శిలీంధ్రాలు, మచ్చలు తదితర పది అంశాలకు సంబంధించి ధాన్యాల నాణ్యతను నిష్పాక్షికంగా అంచనా వేస్తుంది. నాణ్యత గ్రేడ్‌ల ఆధారంగా ధర నిర్ణయానికి తోడ్పడుతూ బయ్యర్లను, రైతులను నేరుగా అనుసంధానిస్తుంది.  ధాన్యాల నాణ్యతా విశ్లేషణ, ట్రేసబిలిటీ ద్వారా కోత అనంతర విలువ గొలుసు వాణిజ్య లావాదేవీలను కృత్రిమ మేధతో ఆధునీకరించిన ఘనత తమదని అ΄్జావో ఆగ్రోటెక్‌ సహ వ్యవస్థాపకురాలు నీరజా మెహతా చె΄్పారు. 

డిజిటల్‌ ఓపెన్‌–మార్కెట్‌ ట్రేడింగ్‌ ΄్లాట్‌ఫామ్‌ను కూడా అ΄్జావో సంస్థ ఏర్పాటు చేసింది. డిజిటల్‌ బిడ్డింగ్‌ ద్వారా రైతులు ఏ సమయంలోనైనా ఏ నమోదిత వ్యాపారికైనా ఉత్పత్తులను విక్రయించడానికి వీలవుతుంది. రైతు మెరుగైన ధరకు అమ్ముకునే అవకాశాలను మెరుగుపరుస్తుంది.  పరాఖ్‌ ΄్లాట్‌ఫామ్‌ ద్వారా ఓపెన్‌ డిజిటల్‌ ట్రేడింగ్‌ను మొట్టమొదటిగా వరి, సజ్జ ధాన్యాలను 300 మందికి పైగా గుజరాత్‌ రైతులు సుమారు రూ. 5 కోట్ల మేర అమ్మకాలు చేశారు. డిజిటల్‌ ట్రేడ్‌లో ఎక్కడెక్కడి నుంచో వ్యాపారులు పోటీ పడతారు. ధర విషయంలో పారదర్శకత ఏర్పడుతుంది. స్థానిక బ్రోకర్లు మోసం చెయ్యలేరు. తత్ఫలితంగా రైతులు 7% అధిక ధర పొందగలిగారు. 
గుజరాత్‌ సహకార శాఖ ధాన్యం కొనుగోళ్లలో కూడా ఈ ఏఐ ఆధారిత గ్రెయిన్‌ క్వాలిటీ అసెస్‌మెంట్‌ మిషన్లను వాడారు. సుమారు 500 మంది రైతులకు చెందిన 32 వేల పైచిలుకు ధాన్యపు బస్తాలను దాదాపు రూ. పది కోట్లకు విక్రయించారు. రైతులకు 5% అదనపు ఆదాయం వచ్చిందని నీరజా మెహతా వివరించారు.

లక్షలాది రైతుల చేతుల్లో ‘ఫార్మర్‌చాట్‌’
డిజిటల్‌ గ్రీన్‌ ట్రస్ట్‌.. లాభాపేక్షలేని అంతర్జాతీయ సాంకేతిక స్వచ్ఛంద సంస్థ. 17 ఏళ్ల అనుభవం గల ఈ సంస్థ రూపొందించిన ఏఐ అడ్వయిజరీ ΄్లాట్‌ఫామ్‌ ‘ఫార్మర్‌చాట్‌’. 4 లక్షల భారతీయ రైతులతో పాటు కెన్యా, నైజీరియా, ఇథియోపియా, బ్రెజిల్‌లో దాదాపు 10 లక్షల మంది వ్యవసాయదారులు, పశుపోషకులు, విస్తరణ సిబ్బంది, ఎఫ్‌పీఓలు, స్వయం సహాయక బృందాల సభ్యులు ఇప్పటికే దీని ద్వారా సలహాలు, సూచనలు పొందుతున్నారు. 

తమ పంటలు, పశువులకు సంబంధించిన ఫొటోలను రైతులు అప్‌లోడ్‌ చేసి స్థానిక భాషలో ప్రశ్నలు అడిగితే.. రైతులకు స్థానిక భాషలోనే వాయిస్, టెక్ట్స్‌ మెసేజ్‌ల ద్వారా, వారికి అత్యంత అవసరమైన సమయంలో మార్గదర్శనం చెయ్యటం ఈ మొబైల్‌ యాప్‌ ప్రత్యేకత. తాజా వాతావరణ స్థితిగతులతో పాటు, స్థానిక పరిస్థితులకు అనుగుణమైన చర్యలపై ‘ఫార్మర్‌చాట్‌’ సమాచారాన్నిస్తోంది. చిన్న, సన్నకారు రైతుల అనుభవాల ఆధారంగా రూపుదిద్దుకున్న ‘ఫార్మర్‌చాట్‌’ డిజిటల్‌ విప్లవపు కొత్త శకానికి నిదర్శనమని డిజిటల్‌ గ్రీన్‌ ట్రస్ట్‌ ఇండియా సీఈఓ నిధి భాసిన్‌ తెలిపారు. మన దేశంలో 15 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతు కుటుంబాలుంటే వారిలో 58%కి సరైన విస్తరణ సేవలందటం లేదన్నారు. ఈ కొరత తీర్చటానికి కృషి చేస్తున్నామన్నారు. ఫార్మర్‌చాట్‌ జెనెరిక్‌ ఏఐ అవుట్‌పుట్స్‌పై యాంత్రికంగా ఆధారపడదని, అనుభవజ్ఞులైన వ్యవసాయ నిపుణుల అనుభవాలపై ఆధారపడి సూచనలు ఇస్తుందన్నారు. 

సంప్రదాయ విస్తరణ వ్యవస్థలో ఒక్కో రైతుపై 35 డాలర్లు ఖర్చు చేస్తుండగా, తాము కేవలం ఒక డాలర్‌ ఖర్చుతోనే సేవలందిస్తున్నామన్నారు. ఒక సర్వే ప్రకారం.. 74% మంది రైతులు ఫార్మర్‌చాట్‌ సూచనలు చాలా బాగా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. 83%మంది సులువుగా సమాచారం తెలుసుకుంటున్నామన్నారు. 80% మంది సమగ్రంగా ఉన్నాయన్నారు. ఎరువులు, చీడపీడలు, పశుపోషణ సూచనలను 60%మంది రైతులు ఆచరిస్తున్నారు.

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement