breaking news
Vikarabad District News
-
అక్షరాస్యత వైపు అతివలు!
దోమ: స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఉల్లాస్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. అతివలందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే ప్రక్రియకు ఈ నెల నుంచే అడుగులు పడనున్నాయి. 2017 వరకు సాగిన సాక్షర భారత్ కార్యక్రమం ఆ తర్వాత ఆగిపోయింది. ప్రస్తుతం ఉల్లాస్ పేరిట నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా పోర్టల్, యాప్ను రూపొందించారు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాల్లోని మహిళలను వంద శాతం అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో నిరక్ష్యరాస్యులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వారందరికీ చదువు చెప్పేందుకు వలంటీర్లను నియమించనున్నారు. సంఘాల్లో చదువుకున్న మహిళలు, ఆసక్తి ఉన్న విశ్రాంత ఉపాధ్యాయులు, విద్యార్థులను వలంటీర్లుగా ఎంపిక చేయనున్నారు. 40 వేలకు పైగా నిరక్షరాస్యులు జిల్లాలో దాదాపు 40 వేలకు పైగా నిరక్షరాస్యులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరి వివరాలను కంప్యూటర్లో పొందుపరుస్తున్నారు. పాఠశాలల్లో విద్యావకాశాలు కోల్పోయిన 15 ఏళ్లకు పైబడిన వారందరికీ జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రాథమిక అక్షరాస్యత అందించేందుకు ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ లైఫ్లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) పేరిట ప్రత్యేక కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నారు. త్వరలో బోధనను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమం గతేడాదే ప్రారంభం కావాల్సి ఉన్నా వయోజన విద్యాశాఖలో సిబ్బంది కొరత కారణంగా వాయిదా వేశారు. ఈ నెలలో ప్రారంభమై 2027 వరకు కొనసాగనుంది. ఉల్లాస్లో 16 అధ్యాయాలు అందరికీ చదువు..అందరి బాధ్యత అనే నినాదంతో ఉల్లాస్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దీన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన(సెర్ప్), తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం(టాస్) సహకారంతో నిర్వహించనున్నారు. నిరక్షరాస్యులకు ప్రాథమిక విద్యతోపాటు డిజిటల్ అక్షరాస్యత, కీలమైన జీవన నైపుణ్యాలు, ఆర్థిక అక్షరాస్యత, వృత్తి నైపుణ్యం, నిరంతర విద్యను అందించే లక్ష్యంతో ముందుకు సాగనున్నారు. జిల్లాలో గుర్తించిన నిరక్షరాస్యులు, వలంటీర్ల పేర్లను ఉల్లాస్ యాప్లో నమోదు చేస్తారు. వారికి ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లు తదితర వాటిలో తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డీటీహెచ్, టీఈఈ ఛానెల్ నంబర్ 14లో క్రమం తప్పకుండా ప్రాంతీయ భాషల్లో వయెజన అభ్యాసకుల కోసం పాఠాలను ప్రసారం చేయనున్నారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు పుస్తకాలను తయారు చేస్తున్నారు. ఉల్లాస్ కార్యక్రమం కింద స్వచ్ఛందంగా పని చేసే చురుకైన విద్యార్థులకు విద్యా క్రెడిట్లను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏఐసీటీఈ, ఎన్సీటీఈ అనుబంధసంస్థలకు యూజీసీ ద్వారా ఆదేశాలు అందాయి. ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కార్పొరేట్ సంస్థలను భాగస్వాములు చేస్తున్నారు. నిరక్షరాస్యులందరికీ వలంటీర్లే చదువు నేర్పించాల్సి ఉంటుంది. ఒక్కొక్కరు 10 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి. ఆసక్తి ఉన్న వారిని 10వ తరగతి వరకు ప్రోత్సహించాలి. ఏదైనా కారణాలతో 10వ తరగతి మానేసినట్లయితే వారందరినీ గుర్తించి ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ చదువుకునేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలి. సద్వినియోగం చేసుకోవాలి ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది. దీన్ని నిరక్ష్యరాస్యులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. – శోభ, ఏపీఎం, దోమ -
భక్తిశ్రద్ధలతో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన
పూజలో పాల్గొన్న స్పీకర్ ప్రసాద్కుమార్, ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తాండూరు రూరల్: పెద్దేముల్ తండాలో జై శ్రీరామ్ స్మరణతో మార్మోగింది. ఆంజనేయస్వామి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్ విగ్రహానికి పండితులు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన గావించారు. అంతకుముందు ఆలయ నిర్మాణ దాత పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మాజీ సర్పంచ్ తారాభాయి ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్పీకర్ ప్రసాద్కుమార్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, ఫైనాన్స్ కమిటీ మెంబర్ రమేష్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనిప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు అంజయ్య, గోపాల్, మురళీకృష్ణ గౌడ్, మల్లేశం, నారాయణరెడ్డి, మహిపాల్రెడ్డి, లొంక నర్సింలు, ఎల్లారెడ్డి, సంపత్కుమార్, ప్రవీణ్కుమార్, రవి, డీవై నర్సింలు, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.కోటితో మేకల షెడ్డు
ఏఎంసీ డైరెక్టర్ యాదగిరి బంట్వారం: మండల కేంద్రంలో మేకల షెడ్డు నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరైనట్లు మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదగిరి తెలిపారు. శుక్రవారం బంట్వారంలో సహచర డైరెక్టర్లు శాకం నర్సింలు ,ఇసాక్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. స్పీకర్ ప్రసాద్కుమార్ సహకారంతో చైర్మన్ మహేందరెడ్డి మార్కెట్ను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఇటీవల మండల కేంద్రంలో ఎకరం ప్రభుత్వ భూమిలో మేకల సంతను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం మంజూరైన నిధులతో మేకల షెడ్డు, ప్రహరీ, సీసీ రోడ్డు, బోరు వేయనున్నట్లు వివరించారు. సీఎం పర్యటన వాయిదా కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొడంగల్ పర్యటన వాయిదా పడినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తేదీ మార్పు చేసినట్లు తెలిపారు. ఈ నెల చివరి వారంలో సీఎం పర్యటన ఉండవచ్చన్నారు. ధారూరు మండలప్రత్యేకాధికారిగా రాజేశ్వరి ధారూరు: మండల ప్ర త్యేక అధికారిగా జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీ సర్ రాజేశ్వరిని కలెక్టర్ ప్రతీక్జైన్ నియమించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఆర్డీఓగా పని చేస్తున్న రాజేశ్వరి డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొంది వికారాబాద్ జిల్లాకు బదిలీపై వచ్చారు. నేడు తాండూరుకు మందకృష్ణ మాదిగ రాక తాండూరు టౌన్: తాండూరు పట్టణంలో శనివారం నిర్వహించనున్న వికలాంగుల, చేయూత పెన్షన్ దారుల మహాగర్జన సభకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరవుతారని ఆ సమితి జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ మాదిగ తెలిపారు. స్థానిక గగరాణి ఫంక్షన్ హాల్లో ఉదయం 10గంటలకు సభ ప్రారంభమవుతుందన్నారు. శుక్రవారం సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్, దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు మాట్లాడారు. వికలాంగులకు రూ.6 వేలు, వృద్ధులకు, వితంతువులకు, చేయూత పెన్షన్ దారులకు రూ.4 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేడు చించల్పేటకు మంత్రులు నవాబుపేట: మండలంలోని చించల్పేటకు శనివారం జిల్లా ఇన్చార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, మంత్రులు సీతక్క, అడ్లూరు లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య రానున్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించి న అంగన్వాడీ భవనం, బీసీ కమ్యూనిటీ హా ల్, పశు వైద్యశాల భవనం, డ్వాక్రా భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ భవనం, జీపీ భవనాలను ప్రారంభిస్తారని ఎంపీడీఓ అనురాధ తెలిపారు. 1,500 గాంధీజీ విగ్రహాల ప్రదర్శన తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధి మన్నెగూడలోని శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్లో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని 1,500 మహాత్మా గాంధీ విగ్రహాలను ప్రదర్శించారు. గాంధీ గ్లోబల్ క్లబ్ ఫ్యామిలీ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ చైర్మన్ గున్నా రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రదర్శనతో విద్యార్థులకు గాంధీ గొప్పతనాన్ని తెలియజేయడమే ప్రధాన ఉద్దేశమన్నారు. ఒకే పాఠశాలలో 1,500 విగ్రహాలను ప్రదర్శించినందుకుగాను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుందని ఇంటర్నేషనల్ చీఫ్ కో–ఆర్డినేటర్ బింగి నరేందర్గౌడ్ తెలిపారు. ఈ మేరకు స్కూల్ ఎండీ చింతల సంగమేశ్వర గుప్తాకు మెమెంటోను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్లకు ఆమోద ముద్ర
తాండూరు: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో శాసన సభలో ఆమోద ముద్ర వేశామని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శుక్రవారం పెద్దేముల్ తండాకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాల్సి ఉందన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ ఉద్యమిస్తోందన్నారు. వికారాబాద్లో మూడు రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందుకు రాష్ట్ర వాటా 25 శాతం, కేంద్రం వాటా 75 శాతం ఉంటుందని వివరించారు. మూడేళ్ల కాలంలో ఈ పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్య దర్శి థారాసింగ్, నాయకులు డాక్టర్ సంపత్కుమార్, మురళీకృష్ణాగౌడ్, నారాయణరెడ్డి, శోభారా ణి, పట్లోళ్ల బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విజృంభిస్తున్న డెంగీ
తాండూరు: జిల్లాలో డెంగీ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నెల రోజుల వ్యవధిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 36 కేసులు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా తాండూరు మున్సిపాలిటీ పరిధిలో 9 కేసులు ఉన్నాయి. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడలో 6, పుల్మద్ది గ్రామంలో 2, యాలాల మండలం అగ్గనూర్ గ్రామంలో 3 కేసుల నమోదయ్యాయి. జిల్లాలో ఇటీవల ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం లోపించింది. దీంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రతి మండలంలో ఒకటి రెండు డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. తాండూరు పట్టణ పరిధిలోని బస్వణ్ణకట్ట ప్రాంతానికి చెందిన ఓ గర్భిణికి డెంగీ సోకడంతో ప్రైవేటుగా చికిత్స పొందుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా వైద్యాధికారులు, మున్సిపల్ అధికారులు మొక్కుబడి చర్యలతో సరిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీజనల్ వ్యాధులు కూడా భారీగా నమోదువుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. వీధుల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేయడంలేదు. పలు గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించినా పట్టించుకునేవారు లేకుండా పోయారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మిషన్లు పనిచేయడం లేదు తాండూరులో నలుగురికి డెంగీ సోకినట్లు వైద్యశాఖ తెలిపింది. సమాచారం అందిన వెంటనే ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాం. ఫాగింగ్ మిషన్లు పని చేయకపోవడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. రెండు రోజుల్లో మిషన్లు అందుబాటులోకి వస్తాయి.రాగానే ప్రతి వార్డులో ఫా గింగ్ చేస్తాం. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. పరిసరాలు, ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. – విక్రమ్సింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మందులు ఉన్నాయి జిల్లాలో 36 డెంగీ కేసు లు నమోదయ్యా యి. తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీల్లో ఎక్కువ కేసులు ఉన్నా యి. బాధితుల ఇళ్ల వద్ద చర్యలు చేపట్టాం. ఇళ్ల పరిసరాల్లో నీరు నిలవకుండా చూస్తున్నాం. ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నాం. ప్రస్తుతం వ్యాధి తీవ్రత అంతగా లేదు. డెంగీ సోకగానే మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ఆస్పత్రుల్లో మందులు పూర్తిస్థాయిలో ఉన్నాయి. – రవీంద్ర యాదవ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ -
అభివృద్ధి, సంక్షేమం
ప్రజాపాలనతో అన్ని వర్గాలకు సమ న్యాయంవికారాబాద్: ‘రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై సగర్వంగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.. స్వాతంత్య్ర ఫలాలు, రాజ్యాంగం కల్పించిన హక్కులు.. సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందాలి’ అన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్ ఆవరణలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ నారాయణరెడ్డితో కలిసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయా స్కూళ్ల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలరించారు. చక్కటి ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులకు, విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. పోలీసుల పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పథకాల అమలు నిరంతర ప్రక్రియ అన్నారు. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. సాగుభూమి లేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలే లక్ష్యంగా సాగుతున్నట్లు వివరించారు. ఆరు గ్యారంటీలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణాన్ని నాలుగు కోట్ల మంది మహిళలు ఉపయోగించుకున్నారని తెలిపారు. గ్యాస్ సబ్సిడీ పథకం ద్వారా 1,04,300 సిలిండర్లు పంపిణీ చేసినట్లు వివరించారు. గృహ జ్యోతి పథకం ద్వారా 1,39,812 కుటుంబాలు లబ్ధి పొందాయని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.47.99 కోట్లు వెచ్చించిందన్నారు. జిల్లాలో 980 మంది రైతులు మరణించగా రైతు బీమా పథకం ద్వారా బాధిత కుటుంబాలకు రూ.49 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. 1,00,358 మంది రైతులు రు ణాలు రూ.849.30 కోట్లను మాఫీ చేసినట్లు తెలిపా రు. జిల్లాకు 13,640 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కా గా 10,885 నిర్మాణాలకు అనుమతి ఇచ్చామన్నా రు. 1,227 మంది లబ్ధిదారులకు బిల్లులు చెల్లించా మని తెలిపారు. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. విద్య, వైద సేవలపై ప్రత్యేక దృష్టి ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షల వరకు పెంచామని తెలిపారు. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 25,040 మందికి రూ.65.29 కోట్లతో వైద్య సేవలు అందించామన్నారు. అమ్మా ఆదర్శ పాఠశాల పథకానికి 1,062 స్కూళ్లు ఎంపిక చేసి మౌలిక వసతుల కల్పనకు రూ.17.55 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. 126 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరించినట్లు తెలిపారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. కడా ఏర్పాటు చేసి వెనుకబడిన కొడంగల్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్చౌదరి, డీఆర్వో మంగిలాల్, ఆర్డీఓ వాసుచంద్ర, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మార్పుతోనే ప్రగతి
● తాండూరులోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో ‘సాక్షి’ టాక్ షో ● ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు‘విద్య, వైద్యం, వ్యవసాయం, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు రావాలి.. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ సాగును ప్రోత్సహించాలి.. పారిశ్రామిక రంగాన్ని విస్తరించి యువత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి.. అన్ని రంగాల్లో సమూల మార్పు వచ్చినప్పుడే దేశ ప్రగతి సాధ్యం’ అని తాండూరు పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వందేళ్ల భారత్ ఎలా ఉండాలి అనే అంశంపై గురువారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో కళాశాలలో చర్చ వేదిక నిర్వహించారు. విద్యార్థులు వారి అభిప్రాయాలను పంచుకున్నారు. – తాండూరు/తాండూరు టౌన్ దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ లంచగొండితనం అదే స్థాయిలో ఉంది. దాన్ని పూర్తిగా నిర్మూలించాలి. గ్రామీణ ప్రాంతాలకు విద్య, వైద్యం చేరాలి. – ఆకాష్ రాథోడ్, బీఏ ద్వితీయ సంవత్సరం స్వాతంత్య్రం సిద్ధించి 78 సంవత్సరాలు పూర్తయినా నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ విద్య అందడం లేదు. సరైన వైద్య సేవలు లేవు. విద్య, వైద్య రంగాలను మెరుగు పర్చాలి. – అబ్దుల్, డిగ్రీ విద్యార్థి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలి. రసాయన ఎరువులను పూర్తిగా తగ్గించి సేంద్రియ సాగును ప్రోత్సహించాలి. అందరికీ సమాన విద్య దిశగా చర్యలు చేపట్టాలి. – మౌనిక, బీఎస్సీ ఫస్ట్ ఇయర్ స్థానికంగా యువతకు ఉద్యోగావకాశాలు లభించాలంటే పారిశ్రామిక ప్రగతి ఎంతో అవసరం. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను మెరుగు పర్చాలి. – కావేరి, బీకాం ఫస్ట్ ఇయర్ ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రవాణా వ్యవస్థ ఎంతో కీలకం. మారుమూల ప్రాంతాలకు సరైన రోడ్లు, బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందడం లేదు. ప్రజలను సోమరులుగా మార్చే ఉచిత పథకాలను రద్దు చేయాలి. ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. – నాగ వైష్ణవి, బీఎస్సీ దేశంలో వాతావరణ కాలుష్యం రోజు రోజుకూ పెరిగి పోతోంది. పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేయాలి. వాహనాల్లో పెట్రోల్, డిజిల్ స్థానంలో బయో డిజిల్ను వినియోగించాలి. వృక్ష సంపదను పెంచాలి. – హీనా, కంప్యూటర్ సైన్స్ ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య అందించేలా ప్రత్యేక చొరవ చూపాలి. ప్రతి జిల్లాకు ఒక విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలి. మేకిన్ ఇండియాలో భాగంగా విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి. – సామియా, బీఏ సెకండ్ ఇయర్ అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే శాస్త్ర, సాంకేతిక రంగాలను ప్రోత్సహించాలి. ఆ దిశగా విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలి. ఇటీవల కాలంలో రసాయన ఎరువుల వాడకం పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. – లక్ష్మి, కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ఇయర్ ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ యువతం ఎక్కువగా ఉంది. దేశం అభివృద్ధి చెందాలంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడాలి. అప్పుడే ఆర్థిక, సామాజిక పురోగతి సాధిస్తాం. – రాథోడ్ దేవ్జీ, కంప్యూటర్ సైన్స్, థర్డియర్పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యం అందాలి. దేశంలో ఆర్థిక అసమానతల వల్ల సమాన హక్కులు సాధ్యం కావడం లేదు. ఇటీవల కాలంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. – అయేషాబేగం, బీఎస్పీ వ్యవసాయ, శాస్త్ర, సాంకేతిక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగు పర్చాలంటూ విద్యార్థులు ఆలోచించడం అభినందనీయం. ఉచిత పథకాల వల్ల జనాలు సోమరులు అవుతున్నారన్న మాటలు ఆలోచింప జేస్తున్నాయి. – చంద్రకళ, ప్రిన్సిపాల్ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. పాలకులు తీసుకున్న నిర్ణయాలు దేశాభివృద్ధికి దోహదం చేశాయి. పీవీ తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశాయి. జవహర్లాల్నెహ్రూ నుంచి ప్రస్తుత ప్రధాని మోదీ వరకు అభివృద్ధే లక్ష్యంగా సాగారు. 2047 నాటికి దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. – ఉత్తమ్చంద్, కరస్పాడెంట్, పీపుల్స్ కళాశాల దేశంలో పేద, ధనిక అనే తారతమ్యాలు ఉండరాదు. పేదరికాన్ని నిర్మూలించాలంటే విద్య, వైద్య రంగాలు మెరుగు పడాలి. – శ్రీలత, బీకాం ఫస్ట్ ఇయర్ -
అప్రమత్తంగా ఉన్నాం
● భారీ వర్షాలను సమర్థవంతంగా ఎదుర్కొంటాం ● కలెక్టర్ ప్రతీక్జైన్ అనంతగిరి: జిల్లాలో అతి భారీ వర్షం కురిసినా సమర్థవంతంగా ఎదుర్కొంటాం.. అందుకు అధికారులను సమాయత్తం చేశామని కలెక్టర్ ప్రతీక్జైన్ తెలిపారు. గురువారం నగరం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. అనంతరం కొడంగల్లో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. లోత్తట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. పర్యాటక ప్రాంతాలను మూసివేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్ఓ మంగీలాల్, ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు. పరిహారం అందేలా చూస్తాం తాండూరు: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట వివరాలు సేకరించి రైతులకు పరిహారం అందేలా చూస్తామని కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. గురువారం తాండూరు నియోజకవర్గంలోని వరద ప్రాంతాలను ఎస్పీ నారాయణరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహారెడ్డి, డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో కలిసి సందర్శించారు. పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందరాదని సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు ఇళ్లలోనే ఉండాలన్నారు. అప్రమత్తంగా ఉండాలి బొంరాస్పేట: భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. గురువారం మండలంలోని బొంరాస్పేట పెద్ద చెరువు అలుగును, నిర్మాణంలోని వంతెనను పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్ వెంట సీఐ శ్రీధర్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
స్వేచ్ఛ– సమానత్వం అందరికీ చేరుతోందా..?
స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే మరింత నిజాయితీగా పనిచేయాల్సిన రంగం ఏది? లేదు 23అంతంతే 21అవును16మీడియా10చట్ట సభలు16అధికార యంత్రాంగం 22న్యాయ స్థానాలు 12 -
పోటెత్తిన వరద
నిండుకుండల్లా ప్రాజెకులు వాగులు ఉగ్రరూపం అప్రమత్తమైన యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పరిగిలో అత్యధికంగా 127 మిల్లీ మీటర్లు నమోదు నీట మునిగిన పంటలు కొట్టుకుపోయిన రోడ్లు పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వరద ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు -
అవినీతే అసలు సమస్య!
మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏది? ● స్వేచ్ఛ సమానత్వం అందరికీ అందాలి ● యంత్రాంగం మరింత పటిష్టంగా పనిచేయాలి ● ‘సాక్షి’ సర్వేలో జిల్లా ప్రజల అభిప్రాయం సమాజంలో అవినీతే ప్రధాన సమస్యగా మారిందని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం సిద్ధించి 79 ఏళ్లు గడుస్తున్నా స్వేచ్ఛ, సమానత్వం అన్నివర్గాలకు అందడం లేదని తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన 60 మందిని ‘సాక్షి’ సర్వే చేయగా 24 మంది వ్యవస్థలో అవినీతి పేరుకుపోయిందని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం వంటివి అందరికీ అందడం లేదని 23 మంది తెలిపారు. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే అధికార యంత్రాంగం మరింత పకడ్బందీగా పనిచేయాలని 22 మంది, చట్ట సభల్లో మార్పు రావాలని 16 మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. – కొడంగల్/బొంరాస్పేట్నాణ్యమైన విద్య 8పేదరికం 8వైద్యం 10కుల వివక్ష 10అవినీతి24 -
మా ఊరిలో మందు బంద్
● పలు గ్రామాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం ● మహిళల చైతన్యంతో షాద్నగర్: కేశంపేట మండలం బోదనంపల్లిలో 14 ఏళ్ల క్రితం మొదలైన సంపూర్ణ మద్యపాన నిషేధం ఈ రోజు వరకూ అలాగే కొనసాగుతోంది. ఈగ్రామంలో ఎక్కడా బెల్టు షాపులు, మద్యం సేవించడం కనిపించదు. మద్యం ప్రియులు కావాలనును కుంటే బయటి ప్రాంతాలకు వెళ్లాల్సిందే. ఇదే స్ఫూర్తితో అల్వాల గ్రామస్తులు కూడా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తెచ్చారు. ఒక్కడితో మొదలై.. మద్య నిషేదం కోసం పలు గ్రామాల ప్రజలు పోరాటం చేస్తున్నారు. ముందుగా ఫరూఖ్నగర్ మండలం కిషన్నగర్కు చెందిన నడుల్ల శేఖర్తో పోరాటం మొదలైంది. తమ గ్రామంలో మద్యపానం నిషేధించాలని కోరుతూ గత సెప్టెంబర్లో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టాడు. గ్రామ పెద్దలు, మహిళలు రాజకీయాలకు అతీతంగా మద్దతుగా నిలిచారు. స్థానికంగా మద్యం విక్రయిస్తే రూ.50 వేలు జరిమానా విధిస్తామని, మద్యం అమ్మేవారిని పట్టిస్తే రూ.10 వేల నజరానా అందజేస్తామనిప్రకటించడంతో బెల్టు దుకాణాలు మూతపడ్డాయి. ఈ పోరాటం గంట్లవెళ్లి, చౌడమ్మగుట్టతండాలో కూడా కొనసాగుతోంది. జీవితాలు నాశనం కావొద్దని గ్రామంలో చాలా మంది మద్యానికి బానిసలవుతున్నారు. ప్రజల జీవితాలు నాశనం కావొద్దని ఆలోచనతో పోరాటం ప్రారంభించా. స్థానికుల మద్దతుతో ఎమ్మెల్యేతో పాటు అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశాం. అందరి పోరాటంతో బెల్టు దుకాణాలు మూతపడ్డాయి. – శేఖర్, కిషన్నగర్, ఫరూఖ్నగర్ మండలం మహిళల పోరాటంతోనే నిషేధం మద్యంతో చాలా మంది జీవితాలు బలైపోతున్నాయి. దీంతో గ్రామంలో బెల్టు దుకాణాలు తొలగించాలని, మహిళలు పెద్ద ఎత్తున బయటికి వచ్చారు. మద్యం సీసాలను ధ్వంసం చేశారు. ఈ దెబ్బతో గ్రామంలో 14 ఏళ్లుగా మద్యం నిషేధం అమలవుతోంది. – ఎదిర కళమ్మ, బొదనంపల్లి, కేశంపేట -
ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’
శంకర్పల్లి: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పట్టణ బీజేపీ నేతల ఆధ్వర్యంలో గురువారం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించగా.. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, శ్రేణులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలోని ప్రజలంతా ఒక్కటే అని, ప్రతి ఒక్కరూ స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరులను నిరంతరం గుర్తుచేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శంకర్పల్లి మున్సిపల్, మండల అధ్యక్షులు దయాకర్రెడ్డి, లీలావతి, నాయకులు ప్రభాకర్రెడ్డి, రాములుగౌడ్, ప్రతాప్రెడ్డి, వాసుదేవ్ కన్నా, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. ఐక్యతతో దేశభక్తిని చాటుదాం షాద్నగర్రూరల్: దేశంలోని ప్రజలందరూ ఐకమత్యంతో ఏకతాటిపైకి వచ్చి దేశభక్తిని చాటాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆదేశాల మేరకు గురువారం తిరంగా ర్యాలీ ఇన్చార్జి చెట్ల వెంకటేశ్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు హరిభూషణ్ అధ్యక్షతన హర్ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మెయిన్రోడ్డులో గల దుకాణాల్లో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో నేతలు సురేష్, అశోక్, మురళీ తదితరులు పాల్గొన్నారు. -
చంపినా ఇంతేనా?
ధారూరు: పేదలను చంపినా పట్టించుకోరా..? ఎమ్మెల్యేలు, నాయకులు ఫోన్లు చేస్తే హత్యలకు పాల్పడే వారిని కూడా వదిలేస్తారా..? పది మంది యువకులు మద్యం, గంజాయి మత్తులో గొడ్డలితో పాటు ఇతర మారణాయుధాలతో దాడి చేసినా.. రాజకీయాలకు ఒత్తిడికి తలొగ్గి వాస్తవాలను దాచిపెట్టి, పెట్టీ కేసులు పెట్టి వదిలేస్తారా అంటూ బాధిత భార్యాభర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. సామాన్యులకు జరిగే న్యాయం ఇదేనా.. అని పోలీసులను నిలదీశారు. నాగారంలో హోటల్ నిర్వహిస్తూ బతుకీడుతున్న తమపై బుధవారం రాత్రి కారులో వచ్చిన పది మంది యువకులు దాడి చేశారన్నారు. నూడుల్స్లో నూనె తక్కువగా వేశారంటూ మారణాయుధాలతో గాయపర్చారని, అడ్డువచ్చిన మరో ఇద్దరిని సైతం దారుణంగా కొట్టారని బాధిత దంపతులు నీరటి భారతమ్మ, అంజి గురువారం ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన యాలాల మండల రాస్నం యువకులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. లేదంటే తాము ఉన్నతాధికారులతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. తమతో తెల్ల కాగితంపై సంతకాలు తీసుకున్న పోలీసులు కేసును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దాడికి పాల్పడిన పది మందిలో కేవలం ముగ్గురిని మాత్రమే పట్టుకుని మిగిలిన వారిని వదిలేశారని ఆరోపించారు. తామకు న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే హంతకులనూ వదిలేస్తారా.. ధారూరు పోలీసుల తీరుపై బాధితుల మండిపాటు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన ఉన్నతాధికారులు, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆవేదన -
కంపించిన భూమి
పరిగి: మండలంలో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున 3.55గంటలకు బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యాయత్నగర్, హనుమాన్గండి గ్రామాల్లో 3 నుంచి 4 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. ఇళ్లలోని సామగ్రి కింద పడటంతో ప్రజలు బయటికి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. గతంలో ఒకసారి బసిరెడ్డిపల్లిలో భూమి కంపించిన విషయం తెలిసిందే. ధైర్యంగా ఉండాలి: కలెక్టర్ విషయం తెలుసుకున్న కలెక్టర్ ప్రతీక్జైన్ ఎస్పీ నారాయణరెడ్డితో కలిసి గురువారం బసిరెడ్డిపల్లి, రంగాపూర్ గ్రామాలను సందర్శించారు. భూమి కంపించడంపై ఆరా తీశారు. ఇళ్లకు పగుళ్లు వచ్చి ఉంటే ఆ సమాచారం సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు పొలాలకు వెళ్లరాదని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పూడూరు మండలంలో.. పూడూరు: మండలంలోని కెరవెళ్లి, దేవనోనిగు, సిరిగాయపల్లి, సోమన్గుర్తి గ్రామాల్లో గురువారం తెల్లవారుజామున భూమి కంపించింది. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ పాండు దేవనోనిగుడ గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. అనంతరం వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీఓ సుందర్, గ్రామస్తులు నారాయణ, పెద్ద నారాయణ తదితరులు పాల్గొన్నారు. 3 నుంచి 4 సెకండ్ల పాటు ప్రకంపనలు ఇళ్లలోంచి పరుగులు తీసిన జనం గ్రామాలను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ -
సీసీకెమెరాల ఏర్పాటుతో నేరాల కట్టడి
షాద్నగర్: సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను కట్టడి చేయొచ్చని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని రాయికల్లో కాంగ్రెస్ నేత రాయికల్ శ్రీనివాస్ తన సొంత నిధులు రూ.2లక్షలతో గ్రామంలో సీసీకెమెరాలను ఏర్పాటు చేయించారు. ఈ కెమెరాలను గురువారం ఏసీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాలను నియంత్రించడంలో కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని అన్నారు. రాయికల్ గ్రామం జాతీయ రహదారికి పక్కనే ఉండటంతో రద్దీగా ఉంటుందని, గ్రామంలో భద్రతా చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. కార్యక్రమంలో సీఐ విజయ్కుమార్, మాజీ సర్పంచ్ ఆశన్నగౌడ్, దిద్దుల కృష్ణయ్య, పాండు నాయక్, నాయకులు పాల్గొన్నారు. ఏసీపీ లక్ష్మీనారాయణ -
గుంతలో పడి వ్యక్తి దుర్మరణం
తాండూరు రూరల్: తాగిన మైకంలో ఓ వ్యక్తి గుంతలో పడి మృతి చెందిన సంఘటన పెద్దేముల్ పోలీస్స్టేషన్ పరిధిలోని మంబాపూర్ గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ వేణుకుమార్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన చెంచు అంజిలయ్య(41), భార్య లక్ష్మి, కూతురు స్వాతితో కలిసి హైదరాబాద్లో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. లక్ష్మి తన సోదరుడికి రాఖీ కట్టేందుకు పెద్దేముల్ మండలం చైతన్యనగర్కు మంగళవారం భర్త, కూతురితో కలిసి మంబాపూర్ వచ్చారు. బస్సు దిగిన వెంటనే అంజిలయ్య శ్రీమీరు చైతన్యనగర్కి వెళ్లండి, నేను తర్వాత వస్తానుశ్రీ అని భార్యాబిడ్డకి చెప్పి పంపించాడు. అదే రోజు రాత్రయినా ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అసాధ్యమైన ప్రాంతాల్లో వెతికారు. మొబైల్ సైతం స్విచ్ఛాఫ్ వచ్చింది. ఇదిలా ఉండగా గురువారం మంబాపూర్ గ్రామ శివారులోని మైసమ్మ దేవాలయం వద్ద గుంతలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెళ్లి పరిశీలించారు. ఈ క్రమంలో మృతదేహాన్ని చూసిన లక్ష్మి తన భర్త అంజిలయ్యగా గుర్తించారు. మంగళవారం రాత్రి తాగిన మైకంలో మంబాపూర్ నుంచి చైతన్యనగర్కు వెళ్లే క్రమంలో గుంతలో పడి మృతి చెందాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. తాగిన మైకంలో అత్తారింటికి వస్తుండగా ఘటన -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి ● ఎంపీడీఓ బన్సీలాల్ షాద్నగర్రూరల్: కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ బన్సీలాల్ అన్నారు. గురువారం ఫరూఖ్నగర్ మండల పరిధిలోని అయ్యవారిపల్లి వాగు, నాగులపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆయన వాగుల వద్ద బారీకేడ్లను ఏర్పాటు చేసి రక్షణ చర్యలను చేపట్టారు. అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించి వాగుల మీదుగా రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున.. అత్యవసర సమయాల్లో తప్పా ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను చేపట్టాలని సూచించారు. వాగులు, చెరువుల పరిసర ప్రాంతాలలోకి ప్రజలు రావొద్దని సూచించారు. అత్యవసర సమాచారం కోసం మండల పరిషత్ కార్యాలయంలో 24 గంటలు కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు అత్యవసర సమయాలలో 8686793747, 9441947364 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు జైపాల్రెడ్డి, ముజఫర్నిసాభేగం, గ్రామస్తులు పాల్గొన్నారు. నందిగామలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు నందిగామ: భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండల కేంద్రమైన నందిగామలోని తహసీల్దారు కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు గురువారం తహసీల్దారు రాజేశ్వర్ తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం, జంతు నష్టం తదితర సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే గ్రామస్తులు, లేదా బాధితులు తహసీల్ధారు కార్యాలయంలో ఫోన్ నం.8019884605, 98660 23923లను సంప్రదించాలని విజ్ఙప్తి చేశారు. మూడురోజుల పాటు అందుబాటులో.. కేశంపేట: వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో కంట్రోల్ రూంను తహసీల్దార్ అజాంఅలీ ఏర్పాటు చేశారు. శుక్రవారం సీనియర్ అసిస్టెంట్ మచ్చేందర్ (7799363553), శివ జూనియర్ అసిస్టెంట్ (9398094490), శనివారం గిర్దావర్ చెన్నకేశవులు (9948044523), రికార్డు అసిస్టెంట్ జంగయ్య (9912170411), ఆదివారం జూనియర్ అసిస్టెంట్ మహేశ్ (9441579527), జూనియర్ అసిస్టెంట్ జంగేశ్ (9848206029)లు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. -
వర్షపునీరు వెళ్లేందుకు చర్యలు
కేశంపేట: మండల కేంద్రంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రోడ్డుపై వర్షపునీరు నిలవడంతో వాహనదారులు, విద్యుత్ సిబ్బంది రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యెన్నం శ్రీధర్రెడ్డి అర్అండ్బీ ఈఈ రవీంద్రకుమార్, అర్అండ్బీ ఏఈ రాజశేఖర్, ఇన్చార్జి ఎంపీడీఓ కిష్టయ్యలతో కలసి వర్షపునీరు నిలిచిన ప్రాంతాన్ని పరిశీలించారు. నీరు వెళ్లేందుకు అనువుగా గతంలో ఉన్న కల్వర్టును పునరుద్ధరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ మఠం చంద్రశేఖర్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు నారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి విద్యావతిదేవి, కారోబార్ రవి, కోడిపర్తి శ్రీకాంత్రెడ్డి, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో ఇద్దరికీ జీవిత ఖైదు
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో 2012లో జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. ఎస్.శ్రీనివాస్ రెడ్డి జీవిత ఖైదు విధించారని ఎస్పీ నారాయణరెడ్డి బుధవారం తెలిపారు. అప్పట్లో పట్టణంలోని బీటీఎస్ కాలనీకి చెందిన మిర్యాల భాగ్యలక్ష్మిని ఆమె భర్త మిర్యాల రాజు, అతని పెదనాన్న కుమారుడు మల్లేశం కలిసి దారుణంగా హత్య చేశారు. మిర్యాల రాజు జులాయిగా తిరుగుతూ, మద్యానికి బానిసయ్యాడు. తన ఇంటిని అమ్మాలని ప్రయత్నించగా, భార్య భాగ్యలక్ష్మి పిల్లల భవిష్యత్తు కోసం వద్దని వేడుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన రాజు.. మల్లేశంతో కలిసి మే 29న భాగ్యలక్ష్మి మెడకు కేబుల్ వైర్ బిగించి హత్య చేశాడు. మృతురాలి తల్లి కుర్వ కిష్టమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి వికారాబాద్ సీఐ లచ్చిరాం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి చార్జ్ షీట్ దాఖలు చేశారు. సమగ్ర దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాల ఆధారంగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి డా. ఎస్.శ్రీనివాస్ రెడ్డి వాదోపవాదనలు విని, నిందితులు మిర్యాల రాజు, మల్లేశంలను దోషులుగా నిర్ధారించారు. నేరానికి పాల్పడిన ఇద్దరు నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ తుది తీర్పు వెలువరించారు. ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు, ప్రాసిక్యూషన్ అధికారులను ఎస్పీ అభినందించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.సుధాకర్ రెడ్డి, మొదటి దర్యాప్తు అధికారి లచ్చిరాం, అప్పటి ఎస్ఐ శ్రీనివాస్, ప్రస్తుత వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఇన్స్పెక్టర్ భీమ్ కుమార్, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ ఎల్.నరేందర్, లైజన్ ఆఫీసర్ బి.వీరన్న (ఎస్ఐ)లను ఆయన పేరు పేరునా ప్రశంసించారు. కేసులు పెండింగ్లో ఉంచొద్దు పరిగి: పెండింగ్ ఫైళ్లను వెంటనే పూర్తిచేసి న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. బుధవారం పరిగి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని తెలిపారు. గ్రామాల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలను కూడా తక్కువ అంచనా వేయరాదని, వాటిపై కూడా నిఘా ఉంచాలని పేర్కొన్నారు. దొంగతనాల కేసుల పట్ల ప్రత్యేక చొరవ చూపి వాటిని త్వరగా ఛేదించాలని సూచించారు. సీసీ కెమెరాల ఆవస్యకతను ప్రజలకు వివరించి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎస్పీ నారాయణరెడ్డి -
దొడ్డు బియ్యం పందికొక్కుల పాలు
కొడంగల్: రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్న చందంగా మారింది జిల్లా అధికారుల తీరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది కానుకగా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ మాసం నుంచి సన్నాలు పంపిణీ చేశారు. మార్చి నెల వరకు రేషన్ డీలర్ల దగ్గర మిగిలిన మిగులు దొడ్డు బియ్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులు లెక్క కట్టి డీలర్ల దగ్గరే ఉంచారు. ఐదు నెలలు గడుస్తున్నా వాటి గురించి అధికారులు ఆలోచించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జూన్ నెలలో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి వినియోగదారులకు అందజేశారు. జూన్ నెల చివరి వరకు దుకాణాలను తెరిచి సన్న బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేశారు. జూలై, ఆగస్టు నెలల్లో రేషన్ దుకాణాలను తెరవక పోవడంతో మిగిలిన ఉన్న దొడ్డు బియ్యం పంది కొక్కుల పాలవుతోంది. బియ్యానికి పురుగు పట్టి చెడిపోతున్నాయి. డీలర్లు కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. అంతేకాకుండా మిగులు బియ్యాన్ని రేషన్ దుకాణాల్లో ఉంచడం వల్ల సన్న బియ్యానికి కూడా పురుగు పడుతోంది. గ్రామాల్లో రేషన్ దుకాణాలు చాలీచాలనీ స్థలంలో ఉన్నాయి. చిన్న పాటి దుకాణాలు ఉన్నాయి. అందులో దొడ్డు బియ్యం, సన్న బియ్యాన్ని ఉంచుకోడానికి డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్య వైకరి కారణంగా వేలాది క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిరుపయోగంగా ఉన్నాయి. పనికి రాకుండా పోతున్నాయని డీలర్లు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా.. జిల్లా వ్యాప్తంగా 588 రేషన్ దుకాణాల ద్వారా 8,97,270 మంది వినియోగదారులకు ప్రతినెలా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబంలో ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా ఇస్తున్నారు. అలాగే 2.09 లక్షల ఆహార భద్రత కార్డులు, 25వేల అంత్యోదయ కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతి నెలా 5,200 టన్నుల అలాట్మెంట్ ఉంది. ఈ లెక్కన జిల్లాలోని మొత్తం రేషన్ దుకాణాల్లో మిగిలి ఉన్న బియ్యం వేలాది క్వింటాళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకొని దొడ్డు బియ్యం తంటా తెంపాలని డీలర్లు కోరుతున్నారు. ఒక్క కొడంగల్లోనే 750 క్వింటాళ్లు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి డీలర్ల వద్ద మగ్గి, పురుగు పడుతున్న వైనం పట్టించుకోని జిల్లా అధికారులు -
గిరిజనుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ
అనంతగిరి: గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆది కర్మయోగి అభియాన్లో భాగంగా గిరిజనుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించడం తోపాటు సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. ఇళ్లు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేకుంటే మంజూరు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి కమలాకర్ రెడ్డి, డీపీఓ జయసుధ, డీఈఓ రేణుకాదేవి, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవి, చల్మారెడ్డి, జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ సుధీర్ -
నేడు, రేపుపాఠశాలలకు సెలవు
అనంతగిరి: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేడు, రేపు(గురు, శుక్రవారం) సెలవు ఇస్తున్నట్లు డీఈఓ రేణుకాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలిజిల్లా వైద్యాధికారి లలితాదేవి మోమిన్పేట: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి లలితాదేవి పేర్కొన్నారు. బుధవారం మోమిన్పేట పీహెచ్సీని సందర్శించారు. 108 వాహనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్నందున వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలకు తక్షణ సేవలు చేసేందుకు వైద్యులు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి సుజల తదితరులు పాల్గొన్నారు. బంట్వారం పీహెచ్సీ సందర్శన బంట్వారం: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం డీఎంహెచ్ఓ లలితాదేవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపైఅప్ర మత్తంగా ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించరాదన్నారు. అనంతరం ఓపీ సేవలపై ఆరాతీశారు. కార్యక్రమంలో సూపర్వైజర్ రహీం, సీహెచ్ఓ విజయ్కుమార్, ఎల్టీ రవి, అంబులెన్స్ టెక్నిషియన్ శివకుమార్, పైలెట్ బాల్రాజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరో రెండు డెంగీ కేసులు తాండూరు టౌన్: వానాకాలం సీజన్ కావడంతో డెంగీ మహమ్మారి విజృంభిస్తోంది. 24 గంటలు తిరగక ముందే తాండూరు పట్టణ పరిధిలో మరో రెండు డెంగీ కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన వైద్య, మున్సిపల్ సిబ్బంది ఉరుకులు పరుగులు తీశారు. మంగళవారం రాజీవ్ కాలనీలో ఓ వ్యక్తికి డెంగీ సోకిన విషయం విధితమే. తాజాగా బుధవారం గరీబ్ నగర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు డెంగీ బారిన పడ్డారు. స్థానిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు మాలాశ్రీ నేతృత్వంలో వైద్య సిబ్బంది ఆ వార్డుకు వెళ్లి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వార్డు పరిధిలో రసాయనాలను పిచికారీ చేయించారు. వర్షాకాలంలో పూలకుండీలు, టైర్లు, పాడైపోయిన వస్తువుల్లో నీరు నిల్వ ఉండటం వల్ల దోమల లార్వాలు పెరిగే అవకాశం ఉందని, కావున నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు డాక్టర్ సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, ఏన్ఎంలు, ఆశావర్కర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మత్తుతో జీవితం చిత్తు మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహారెడ్డి తాండూరు టౌన్: మత్తు పదార్థాలకు బానిస లైతే జీవితం నాశనమవుతుందని మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరితో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్, గంజాయి వంటికి అలవాటు పడి తే జీవితం చీకటిమయం అవుతుందన్నారు. వ్యసనాలకు బానిసలు కాకుండా బాగా చదువుకుని ఉన్నత స్థానానికి ఎదగాల న్నారు. అలాగే వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ పాల్గొన్నారు. -
వాగు.. పారితే ఆగు
వికారాబాద్: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలు.. పొంగిపొర్లుతున్న వంకలు.. అలుగు పారుతున్న చెరువులు ప్రజలకు ఆందోళనకు గురి చేస్తుంటే మరో రెండు మూడు రోజుల పాటు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు మరింతగా భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో పోలీసు, రెవెన్యూ, పంచాయతీ యంత్రాంగాన్ని ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా మండలాల్లోని లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్వేల వద్ద పోలీసులు మోహరించారు. ప్రమాదకరంగా ప్రవహించే వాగులు దాటరాదని హెచ్చరిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని కలెక్టర్, ఎస్పీ ప్రజలకు సూచించారు. మూడేళ్ల క్రితం జిల్లాలో భారీ వర్షాలకు అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రాణ ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే.. కొన్ని చోట్ల అజాగ్రత్త ప్రాణాలను హ రించిగా మరి కొన్ని చోట్ల ఊహించని వరద ఉధృతి రెప్పపాటులో కబలించి వేసింది. ఇంకొన్ని చోట్ల మానవ తప్పిదాలతో ప్రాణాలు గాల్లో కలిశాయి. గతంలో చోటుచేసుకున్న ప్రమాదాలు ● గడిచిన మూడేళ్లలో జిల్లాలో భారీ వర్షాల కారణంగా అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కొందరు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటే క్రమంలో ప్రమాదాల బారిన పడి మరణించారు. వంతెనలు దాటే క్రమంలో వాహనాలు ప్రమాదాలకు గురి కావడంతో మరి కొందరు మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలు కొన్ని.. ● ధారూరు మండలంలో పొంగిపొర్లుతున్న వాగును దాటే క్రమంలో ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ఐదు మంది రైతులు గల్లంతు కాగా తోటివారు రక్షించారు. ● తాండూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి పక్క గ్రామంలో బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. ● మూడేళ్ల క్రితం అతి భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు పొంగిపొర్లడంతో వరద ప్రవాహంలో ఏడుగురు చిక్కుకొని మరణించారు. మరో 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ● ప్రస్తుతం కూడా అదే తరహాలో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆస్తి నష్టం మరింత పెరిగే అవకాశంకనిపిస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండరాదని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాకు అతిభారీ వర్ష సూచన అన్ని కాజ్వేల వద్ద పోలీసుల మోహరింపు పలు చోట్ల ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు ప్రమాదకరంగా లోలెవల్ బ్రిడ్జిలు సహాయక చర్యలకు ఉపక్రమించిన యంత్రాంగం జాగ్రత్తగా ఉండాలి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వరద ఉధృతి ఉంటే వాగులు దాటే ప్రయత్నం చేయరాదు. జిల్లాలోని ప్రమాదకర కాజ్వేల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. అవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటికి రాకూదు. పర్యాటక ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిది కాదు. ఏది ఏమైనా సమ యం ప్రాణం కంటే విలువైనది కాదు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. వరద ఉధృతి ఉంటే మరో మార్గంలో గమ్యస్థానాలకు చేరుకోవాలి. చెరువు అలుగుల వద్ద సాహసాలు చేయటం, సెల్ఫీలు దిగటం లాంటివి చేయకూడదు. – నారాయణరెడ్డి, ఎస్పీ -
అభివృద్ధి పనుల పరిశీలన
నవాబుపేట: మండలంలోని వట్టిమీనపల్లిలో ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనును బుధవారం అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి పరిశీలించారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు, పశువుల పాకల నిర్మాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అనురాధ, ఎంపీఓ విజయ్ కుమార్, ఏపీవో లక్ష్మీదేవి, ఈసీ జ్యోతి, పంచాయతీ కార్యదర్శులు గీత, నితిన్, టీఏ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. టెన్త్లో ఇంటర్నల్ మార్కులు ఎంఈఓ వెంకటయ్య తాండూరు: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు ఇవ్వాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డైరక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ పేరిట ఈ నెల 11న ప్రభుత్వం సంబంధిత అధికారులకు ప్రొసీడింగ్లు పంపించింది. ఈ విభాగంలో విద్యార్థులకు 20శాతం మార్కులను కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో జిల్లాలో టెన్త్ చదువుతున్న సుమారు 13 వేల మంది విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులు వేయనున్నట్లు తాండూరు ఎంఈఓ వెంకటయ్య తెలిపారు. గతంలో మాదిరిగానే అంతర్గత మూల్యాంకణం మార్కులు ఉంటాయని వెల్లడించారు. -
పసుపు సాగుకు మొగ్గు
మోమిన్పేట: రెండు దశాబ్దాల క్రితం వరకు నీటి వసతి ఉన్న ప్రతి రైతూ పసుపు పంట సాగు చేశాడు. అర ఎకరం నుంచి మూడెకరాల వరకు పంట పండించేవారు. అప్పట్లో పసుపు దిగుబడికి మార్కెట్లో ధర లేకపోవడం, పెట్టుబడి కూడా భారీగా పెట్టాల్సి ఉండటంతో చాలా మంది ఇతర పంటల వైపు మళ్లారు. గత ఏడాది కేవలం 50 ఎకరాల్లో మాత్రమే పంట వేయగా ప్రస్తుత సీజన్లో 150 నుంచి 200 ఎకరాల వరకు సాగు చేశారు. రెండు మూడేళ్లుగా పసుపు పంటకు డిమాండ్ ఉండటం, క్వింటాలు రూ.10 వేలకు పైగా ధర పలుకుతుండటంతో ఎక్కువ మంది మక్కువ చూపుతున్నారు. ఖర్చులు అధికం ఇతర పంటలతో పోలిస్తే పసుపు సాగుకు ఖర్చు ఎక్కువ. ఒక ఎకరాకు దాదాపు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గతంలో ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చేది. క్వింటాలు ధర రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పలికేది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. ప్రస్తుతం సాగులో నూతన పద్ధతులు రావడంతో పంట దిగుబడి బాగా వస్తోంది. అంతేకాకుండా దిగుబడికి మంచి డిమాండ్, ధర ఉంటోంది. దీంతో ఎక్కువ మంది రైతులు సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఆధునిక పద్ధతిలో.. పాత పద్ధతిలో కాకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పసుపు పంట సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. నాగలి వెంట విత్తనం వేయడం కాకుండా బోజ, బెడ్డు పద్ధతిలో సాగు చేస్తున్నారు. బెడ్డులో విత్తనం తక్కువ పట్టడం, డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టడం ద్వారా కొంత మేర కూలీల ఖర్చులు తగ్గించుకోవచ్చని రైతులు అంటున్నారు. బెడ్, డ్రిప్ పద్ధతిలో భూమి గుల్లగా ఉండి కొమ్ము సాగుకు అనుకూలంగా ఉంటుందని, అంతేకాకుండా దిగుబడి పెరుగుతుందని తెలిపారు. ఎరువులు, నీటి యాజమాన్యం సరైన పద్ధతిలో పాటిస్తే మంచి దిగుబడి వస్తుందని ఉద్యాన శాఖ అధికారి అక్షితారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం మే నెలలో విత్తన రాయితీ ఇచ్చి ఉంటే సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉండేదని రైతులు తెలిపారు. చాలా మంది విత్తుకున్న తర్వాత దరఖాస్తులు స్వీకరించడం ద్వారా రైతులు ప్రభుత్వ సదుపాయం పొందలేకపోయారు. ధర బాగుండటంతో రైతుల ఆసక్తి గత ఏడాది 50 ఎకరాల్లో.. ఈ సారి దాదాపు 200 ఎకరాల్లో పంట -
కోట్పల్లి పీహెచ్సీ పరిశీలన
బంట్వారం: వారానికోసారి నిర్వహించే ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని ఎంసీహెచ్ ప్రోగ్రాం జిల్లా అధికారి డాక్టర్ పవిత్ర అన్నారు. మంగళవారం కోట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆరోగ్య మహిళను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులతో మాట్లాడి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. 15 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు తప్పనిసరిగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలన్నారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. గర్భిణులు, బాలింతలకు సంబంధించిన వైద్య సేవలపై మెడికల్ ఆఫీసర్ మేఘనను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎన్సీడీ ఆఫీసర్ నిరోష, డాక్టర్లు మేఘన, బీబీజానీ ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు. -
భూమి విరాసత్ చేయడం లేదని..
కుల్కచర్ల: వారసత్వంగా వచ్చిన భూమిని విరాసత్ చేయకుండా రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మనస్తాపానికి గురైన ఓ యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం కుల్కచర్ల తహసీల్ కార్యాలయం ఎదుట చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఘనపూర్ గ్రామానికి చెందిన కామునిపల్లి రాములుకు కుల్కచర్ల రెవెన్యూ సర్వేనంబర్ 626/6, 626/1లో ఎనిమిదెకరాల ప్రభుత్వ భూమి ఉంది. 2019లో రాములు మృతి చెందగా, అప్పటి నుంచి భూమిని విరాసత్ చేసుకోలేదు. తన తండ్రి పేరున ఉన్న భూమిని తల్లి నర్సమ్మ పేరున మార్చాలని కోరుతూ 2025 జూన్ 23న బాధితుడు నందకిషోర్ అధికారులను కలిశాడు. దస్త్రాలను పరిశీలించిన అధికారులు మీరు కాస్తులో లేరని చెప్పాడన్నారు. ఈ విషయమై తాము కోర్టును ఆశ్రయించగా ఆర్డర్ కాపీ ఇచ్చిందని తెలిపాడు. న్యాయస్థానం ఆర్డర్ కాపీతో వెళ్లి తమ భూమిని విరాసత్ చేయాలని కోరినా.. అధికారులు పట్టించుకోలేదని వాపోయాడు. దీంతో మనస్తాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అక్కడున్న వారు గమనించి పెట్రోల్ డబ్బాను లాక్కున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడికి నచ్చజెప్పారు. ఈ విషయంపై తహసీల్దార్ మనోహర్ చక్రవర్తిని వివరణ కోరగా.. బాధిత రైతు సర్వేనంబర్ పీఓటీ కింద కేసు నమోదై ఉందన్నారు. దీంతో దరఖాస్తును ఆర్డీఓకు పంపించామని తెలిపారు. ఒంటపై పెట్రోల్ పోసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం కుల్కచర్ల తహసీల్ కార్యాలయం ఎదుట ఘటన -
అస్తవ్యస్తంగా మల్కాపూర్
తాండూరు రూరల్: మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో పారిశుద్ధ్యం లోపించింది. ప్రత్యేకాధికారి ఇప్పటివరకు ఊరికి వచ్చిన దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, వీధి లైట్ల ఏర్పాటు ఇలా అన్ని అంశాల్లో పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు వినతిపత్రాలు సమర్పించినా ఎలాంటి చర్యలు లేవని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామ పంచాయతీలో నిధుల కొరత ఉందని కార్యదర్శి ఇస్మాయిల్ తెలిపారని చెప్పారు. ఇకనైనా తమ గ్రామాన్ని పట్టించుకోవాలని అధికారులను వేడుకొంటున్నారు. నిధులు లేక అభివృద్ధి పనుల నిలిపివేత -
విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి
అనంతగిరి: రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సాధన ఎన్జీవో డైరెక్టర్ చిక్కు మురళీమోహన్ పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని డైట్ కళాశాలలో యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా, సాధన సంస్థ జిల్లా కోఆర్డినేటర్ రమేష్ యాదవ్తో కలిసి విద్యాహక్కు చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం సక్రమంగా అమలయ్యేందుకు ప్రభుత్వం ఒక పంచవర్ష ప్రణాళిక విధానాన్ని రూపొందించాలని తెలిపారు. విద్యా సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర జనాభాలో బాలల సంఖ్య సుమారు 40 శాతానికి పైగా ఉందని, దీనిపై సమగ్రమైన సర్వే నిర్వహించి, బాల కార్మికుల సంఖ్యను వాస్తవికంగా నిర్ధారించాలని డిమాండ్ చేశారు. 18 ఏళ్లలోపు బాల బాలికలందరికీ ఉచిత నిర్భంద విద్య అందేలా చట్ట సవరణ చేయాలని కోరారు. అనంతరం సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎహెచ్టీయూ హెడ్ కానిస్టేబుల్ అలీమోద్దీన్, అసిస్టెంట్ కోఆర్డినేటర్ నర్సింహులు, సఖీ సెంటర్ కోఆర్డినేటర్ యశోద, లీగల్ కౌన్సిలర్ సుమలత, షీటీం ప్రతినిధి రేష్మ, డైట్ కళాశాల సూపరింటెండెంట్ హుస్సేన్ సయ్యద్, ధారూర్ మాజీ సర్పంచ్ చంద్రమౌళి, సంస్థ ప్రతినిధులు అంజయ్య, ఆసీమ, రోజా, ప్రకాశ్ పాల్గొన్నారు. సాధన ఎన్జీవో డైరెక్టర్ మురళీమోహన్ -
రైతులకు ఇబ్బందులు రానీయొద్దు
ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పరిగి: విద్యుత్ ఽఅధికారులు ఎప్పుడూ ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి సూచించారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లోని విద్యుత్ సమస్యలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాకాలం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ సమస్యలు గ్రామాల్లో చాలా ఉన్నాయని వాటిని తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా అందుబాటులో ఉండి వాటిని పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వం ప్రజలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ను అందజేస్తుందని తెలిపారు. విద్యుత్ అధికారులు ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యుత్ అధికారులు పాల్గొన్నారు. -
హిందూ ఉత్సవ సమితి ఎన్నిక
తాండూరు టౌన్: తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి పూర్తి స్థాయి కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. ఈ మేరకు సమితి అధ్యక్షులు తాటికొండ స్వప్న, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సిములు 40 మందితో కూడిన కార్యవర్గాన్ని ప్రకటించినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గౌరవాధ్యక్షులుగా రాజుగౌడ్, కోశాధికారిగా రొంపల్లి సంతోష్కుమార్ కొనసాగుతుండగా తాజాగా ఉపాధ్యక్షులు, సహా కార్యదర్శులు, అధికార ప్రతినిధి, కార్యనిర్వాహక కార్యదర్శులు, సాంస్కృతిక కార్యదర్శులు, సమన్వయ కమిటీ, ప్రచార కార్యదర్శులు, న్యాయ సలహాదారులు, ఆధ్యాత్మిక సలహాదారులను నియామకం చేశారు. అలాగే ముఖ్య సలహాదారులుగా పలువురు పట్టణ ప్రముఖులను నియమించారు. ఈ కార్యవర్గం 2025–26 సంవత్సరానికి గాను హిందూ సంప్రదాయ పండగల నిర్వహణ, ఉత్సవాల నిర్వహణకు తమ సేవలను అందిచనున్నట్లు సమితి అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. -
ఆలయాలను కూల్చడం ప్రభుత్వానికి సిగ్గుచేటు
దోమ: హిందూ దేవాలయాలను కూల్చడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా కార్యదర్శి మేకల యాదయ్య ప్రభుత్వాన్ని విమర్శించారు. పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన ‘పెద్దతల్లికి కుంకుమార్చన’ కార్యక్రమానికి తరలివెళ్తున్న పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు తీరు మారకపోతే రానున్న రోజుల్లో ప్రజలే సరైన సమాధానం చెబుతారన్నారు. బీజేపీ నేతల ముందస్తు అరెస్టు అనంతగిరి: బంజారాహిల్స్లో పెద్దమ్మ తల్లి ఆలయంలో నిర్వహిస్తున్న కుంకుమార్చన కార్యక్రమానికి వెళ్లడానికి సిద్ధమవుతున్న వీహెచ్పీ, బీజేపీ నాయకులను మంగళవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. అరెస్టయిన వారిలో వీహెచ్పీ జిల్లా కార్యదర్శి ప్రశాంత్కుమార్, బీజేపీ జిల్లా అద్యక్షుడు రాజఽశేఖర్రెడ్డి, పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, నాయకులు శ్రీనివాస్, ఆచారి, మోహన్రెడ్డి, తదితరులు ఉన్నారు. నేలకూలిన వందేళ్ల మర్రి చెట్టు పరిగి: దాదాపు 110 ఏళ్ల చరిత్ర గల మర్రి చెట్టు నేలకూలింది. పట్టణ కేంద్రంలోని కొడంగల్ చౌరస్తాలో బాలు టిఫిన్ సెంటర్ ముందు ఉన్న మర్రి చెట్టు చరిత్ర వంద ఏళ్ల పైమాటే. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మర్రి చెట్టు వేర్లు మెత్తబడి ఒక్కసారిగా నేలకు ఒరిగింది. మంగళవారం ఉదయం 11 గంటలకు మెల్ల మెల్లగా వృక్షం ఒరగడంతో టిఫిన్ సెంటర్ యజమాని గమనించి చుట్టు పక్కల వారికి సమాచారం అందించారు. చెట్టు ఒక్కసారిగా టిఫిన్ సెంటర్పై పడటంతో రేకులు మొత్తం దెబ్బతిన్నాయి. ఎప్పుడు రద్దీగా ఉండే ప్రదేశంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వంద ఏళ్లకు పైగా వయసున్న మర్రి చెట్టు నేలకూలడంతో చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. అభివృద్ధికి నిధులివ్వండి దుద్యాల్: గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మండలంలోని కుదురుమల్ల గ్రామస్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. మంగళవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామం అన్ని రంగాల్లో వెనుకబడిందని, నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. కార్యక్రమంలో గ్రామస్తులు నర్సింహారెడ్డి, యాదగిరి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సూర్యప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో బొడ్రాయి ప్రతిష్ఠ రెండో రోజూ పూజలు బొంరాస్పేట: మండల కేంద్రంలోని అభయాంజనేయస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బొడ్రాయి ప్రతిష్ఠ రెండు రోజులుగా జరుగుతున్నాయి. మంగళవారం అభయాంజనేయస్వామి ఆలయం వద్ద జ్యోషి సత్యనారాయణశర్మ పండిత బృందంచే పంచ నాభిశిలలు, ధ్వజస్తంభానికి జలాదివాసం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం, ఫలాదివాసం నిర్వహించారు. ఉదయం గోపూజ, ముఖ్యదేవత, దుర్గామాత, నవగ్రహ హోమాలు, ఆంజనేయస్వామికి సిందూరాభిషేకం, అలంకరణ చేపట్టారు. కృష్ణయ్య నాదస్వరం బృందంచే సన్నాయిమేళం, తీర్థప్రసాదాలు, సాయంత్రం భజన నిర్వహించారు. నేడు ప్రతిష్ఠ.. మూడో రోజు బుధవారం గ్రామంలోని ఐదు స్థలాల్లో బొడ్రాయి ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమాలు పండుగలా నిర్వహించనున్నట్లు పండితులు శ్రీనివాసరావు, సుదీంద్ర, సునీ ల్, శ్రీకాంత్, భరద్వాజ్, సంపత్లు తెలిపారు. -
దోమకాటు.. ఆరోగ్యానికి చేటు
దుద్యాల్: ఇటీవల దంచి కొడుతున్న వర్షాలకు గ్రామాలు, పట్టణాల్లోని వీధులు బురదమయంగా తయారయ్యాయి. దీంతో దుర్గంధం ప్రబలి చిత్తడి వాతావరణంలో దోమలు వృద్ధి చెందే ఆస్కారం ఉంది. సీజనల్ వ్యాధులు కలవరపెడుతున్న తరుణంలో దోమకాటు సామాన్యులకు శరాఘాతంగా మారుతుంది. అపరిశుభ్ర వాతావరణం, అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థలే దోమలకు ఆవాసాలు. వీటి కాటుకు ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. జిల్లాలో డెంగీతో మృతిచెందిన సంఘటనలున్నాయి. దోమకాటుతో వచ్చే వ్యాధులు, వాటి లక్షణాలను వైద్యాధికారులు వివరించారు. వ్యాధుల తీరు ఇలా.. మలేరియా: ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడంతో మలేరియా వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న రోగిని దోమ కుట్టడంతో దాని కడుపులోకి పరాన్నజీవి ప్రవేశించి అక్కడే పెరుగుతుంది. ఇదే దోమ మరో వ్యక్తిని కుట్టినప్పుడు ఆ వ్యక్తి రక్తంలోకి చేరి మలేరియాకు కారణమవుతుంది. లక్షణాలు: చలి వణుకుతో కూడిన జ్వరం రావడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, జ్వరం విడిచి విడిచి వస్తుంటుంది. డెంగీ: పగటి సమయంలో కుట్టే ఏడీస్ ఆడ దోమల ద్వారా డెంగీ వ్యాధి సోకుతుంది. ఇది సాధారణ వైరస్ ఎముకలు, కండరాలు, కీళ్ల నొప్పులతో జ్వరం మొదలవుతుంది. లక్షణాలు: హఠాత్తుగా తీవ్ర జ్వరం రావడం, కదలలేని స్థితి, ఎముకలు, కండారాలలో భరించలేని నొప్పి, శరీరంపై ఎర్రని దద్దుర్లు, వాంతులు, వికారం, నోరు ఎండిపోవడంతో పాటు చిగుళ్లు, ముక్కు ద్వారా రక్తం వస్తుంది. చికున్గున్యా: ఏడిస్ ఈజిప్లై దోమలతో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. చేతులు, కాళ్లు, కీళ్లలో వాపు వచ్చి కనీసం అడుగు తీసి అడుగు వెయ్యలేని పరిస్థితి ఏర్పడుతుంది. జ్వరంతో మనిషి బలహీనంగా ఉంటాడు. లక్షణాలు: తలనొప్పి, వాంతులు, వికారంతో పాటు హఠాత్తుగా జ్వరం, కీళ్ల నొప్పులు, సరిగా నిలబడలేకపోవడం వంటివి. పైలేరియా: దీనిని బోదకాలు అని కూడా అంటారు. క్యూలెక్స్ దోమ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. శరీరంలోని ఏ భాగానికై నా బోదకాలు సోకుతుంది. లక్షణాలు: తరచూ జ్వరం, చంకలు, కాళ్ల భాగంలో బిళ్లలు కట్టడం, వెన్నుముక దగ్గర నుంచి అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు డెంగ్యూ, చికెన్గున్యా, మలేరియా వంటి ప్రాణాంతకరమైన వ్యాధులను నివారించాలంటే వైద్యం ఇంటి నుంచే ప్రారంభం కావాలంటున్నారు పెద ్దలు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే తప్పా దోమల నియంత్రణ పూర్తిగా సాధ్యం కాదు. కాబట్టి ఎవరికి వారు ఇంటి లోపల దోమలు లేకుండా చూసుకోవడం మంచిది. దోమ తెరను ఉపయోగించాలి. వేపనూనె, కొబ్బరినూనె, నిమ్మరసం మిశ్రమాన్ని చర్మంపై రాసుకోవడం ద్వారా దోమల నుంచి విముక్తి పొందవచ్చు. ఇంట్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. టీ, కాఫీ పౌడర్ను నిల్వ నీటిలో చల్లినట్లైతే దోమల గుడ్లు నిర్వీర్యమవుతాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు వర్షాలతో దోమల వ్యాప్తికి ఆస్కారం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిపుణుల సూచన నిర్లక్ష్యం చేయొద్దు వర్షాలకు చల్లటి గాలి వీచడంతో విష జ్వరాలు సోకే అవకాశాలున్నాయి. చిన్న, పెద్దలు అనే తేడా లేకుండా వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దు. సాధారణ జ్వరం ఉన్న చికిత్స చేయించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదంగా మారే అవకాశం ఉంది. – డాక్టర్ వందనరాజన్, హకీంపేట్ -
మెరుగైన వైద్యం అందించాలి
ధారూరు: మండల పరిధిలోని నాగసమందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ట్రైనీ కలెక్టర్ హర్షచౌదరి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అన్ని వార్డులను కలియ తిరిగి చూశారు. పలు రిజిస్టర్లను పరిశీలించారు. ఆస్పత్రిలో ఖాళీల పోస్టుల వివరాలను డాక్టర్ జ్యోతిని అడిగి తెలుసుకున్నారు. ఆయూష్ విభాగంలో డాక్టర్, సిబ్బంది ఎవరూ లేకపోడంపై విస్మరించారు. రోగుల సేవలు, వసతులు, పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆస్పత్రిలో ఫార్మాసిస్ట్ పోస్టు ఖాళీగా ఉందని, ఆ పోస్టు భర్తీ అయ్యేలా చూడాలని డాక్టర్ జ్యోతి ట్రైనీ కలెక్టర్కు విన్నవించారు. ఎక్మాయి యువకుడికి డాక్టరేట్ బషీరాబాద్: మండలంలోని ఎక్మాయి గ్రామానికి చెందిన పోషమొళ్ల వెంకటప్ప ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకోనున్నారు. విశ్వవిద్యాలయ హ్యాండ్ బాల్ క్రీడాకారులలో శారీరక దారుఢ్యం శారీరక శాస్త్ర సంబంధిత విలువల అభివృద్ధి, శిక్షణ పద్ధతులు వాటి ప్రభావం అనే అంశంపై పీహెచ్డీ పూర్తి చేశారు. మారుమూల గ్రామంలో పుట్టి పెరిగి పీహెచ్డీ పట్టా పొందడం మండలానికే ఆదర్శమని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. క్రీడారంగంలో వెంకటప్ప అద్భుతమైన ప్రతిభను చాటారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ హ్యాండ్ బాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహించి సీనియర్ నేషనల్ సాఫ్ట్బాల్ పోటీల్లో కాంస్యపతకం సాఽధించారు. ఈ నెల 19వ తేదీన యూనివర్సిటీలో గవర్నర్ ఇస్రో మాజీ చైర్మన్, వైస్ చాన్స్లర్ చేతుల మీదుగా పీహెచ్డీ ప్రదానం చేయనున్నారని వెంకటప్ప మంగళవారం తెలిపారు. వివాహిత అదృశ్యం కేశంపేట: ఓ వివాహిత అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని లేమామిడి గ్రామంలో వెలుగు చూసింది. వివరాలు ఉన్నాయి. గ్రామానికి చెందిన సంపంగి మల్లేశ్కు కల్వకుర్తి మండలం సిలార్పల్లి గ్రామానికి చెందిన గీతతో గతేడాది వివాహం జరిగింది. అయితే గీత రాఖీ పండగకు పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భర్త ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య మాడ్గుల: అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మాడ్గుల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. దోడ్లపహడ్కు చెందిన జంగయ్యగౌడ్ (38)నగరంలో ఆటో డ్రైవర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల అప్పుల బాధలు ఎక్కువ కావడంతో ఇంటికి వచ్చాడు. సోమవారం తన పొలానికి పురుగుల మందు తాగాడు. అక్కడికి వెళ్లిన భార్యాపిల్లలు ఇది గమనించి చికిత్స నిమిత్తం కల్వకుర్తి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
కార్మికులను పర్మినెంట్ చేయాలి
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ తాండూరు టౌన్: తాండూరు మున్సిపాలిటీలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట పలువురు నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏళ్ల తరబడిగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. వారందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని, అప్పటి వరకు నెలకు రూ.26 వేల చొప్పున కనీస వేతనం చెల్లించాలన్నారు. కార్మికుల పీఎఫ్ను వారి ఖాతాల్లో సక్రమంగా జమ చేయడం లేదని, ఈఎస్ఐ అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కార్మికులకు పెండింగ్లో ఉన్న యూనిఫాంలు, సబ్బులు, నూనె వెంటనే అందించాలని, డ్రైవర్ల వేతనాలను పెంచాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామన్నారు. కార్యక్రమంలో మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహబ్, సీఐటీయూ తాండూరు మున్సిపల్ వర్కర్స్ గౌరవాధ్యక్షుడు రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, నాయకులు భాస్కర్, అశోక్, గోపి, ముకుంద్, లక్ష్మణ్, మల్లప్ప, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పనితీరు మార్చుకోండి
తాండూరు రూరల్: ప్రభుత్వ ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయాలని ఎంఈఓ వెంకటయ్య ఆదేశించారు. ‘తాళం వేయబడి’ శీర్షికతో మంగళవారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. సోమవారం తెరుచుకోని గుంతబాస్పల్లి ప్రాథమిక పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలకు సోమవారం లోకల్ హాలిడే ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని హెచ్ఎం జగన్నాథం, టీచర్ సంగీతను ప్రశ్నించారు. తల్లిదండ్రులతో కూడా మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ.. సమయ పాలన పాటిస్తూ, విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని సూచించారు. ఇప్పటికే మెమోలు తీసుకున్న నేపథ్యంలో విధుల్లో మరోసారి అలసత్వం ప్రదర్శిస్తే కలెక్టర్, డీఈఓకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ అంగీకారం మేరకే సోమవారం స్కూల్కు సెలవు ప్రకటించారని విద్యార్థుల తల్లిదండ్రులు లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఈ కార్యక్ర మంలో మాజీ సర్పంచ్ జగదీశ్, అజ్గర్, దస్తయ్యగౌడ్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎంఈఓ హెచ్చరిక గుంతబాస్పల్లి ప్రాథమిక పాఠశాలలో విచారణ -
దేవాలయాలకు రక్షణ కల్పించాలి
కేశంపేట: రాష్ట్రంలోని హిందూ దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పసుల నర్సింహయాదవ్ అన్నారు. ఇటీవల హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద పాక్షికంగా గోడను ధ్వంసం చేయడంతో బీజేపీ పిలుపు మేరకు చలో పెద్దమ్మతల్లి కార్యక్రమంలో భాగంగా మంగళవారం కుంకుమార్చన నిర్వహించేందుకు పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. దీంతో కేశంపేట పోలీసులు మండలంలో పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి.. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహించ తలపెట్టిన చలో పెద్దమ్మతల్లి కార్యక్రమాన్ని అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో హిందువులకు, దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. స్థానిక సంస్థల మండల కన్వీనర్ కంచుకోట మహేశ్, సంస్కృతిక శాఖ జిల్లా కో–కన్వీనర్ కర్రెడ్ల నరేందర్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తిరుపతి, యాదయ్య, కోటి చేశారు.బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహయాదవ్ -
ఆస్తి, ప్రాణ నష్టం జరగొద్దు: ఎస్పీ
అనంతగిరి: భారీ వర్షాల నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం నగరం నుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే 72 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎక్కడ ఏం జరిగినా కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక్కడ 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారని వివరించారు. సహాయం కావాల్సిన వారు ఫోన్ నంబర్ 084162 35291 79950 61192లకు కాల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దాలి
కొడంగల్: నియోజకవర్గంలోని ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. మంగళవారం నగరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లోని వేంకటేశ్వరస్వామి ఆలయాలు, కోస్గిలోని శివాలయం, వేణుగోపాల స్వామి ఆలయాల అభివృద్ధిపై చర్చించారు. వీటిని సమూలంగా అభివృద్ధి చేయాలని సూచించారు. కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో తీర్చిదిద్దాలన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించారు. ఆలయ డిజైన్లను అధికారులు సీఎంకు చూపించారు. ప్రాకార మండపం, మాఢవీధులు, భూ వరాహ స్వామి ఆలయం, గర్భగుడి, మహా మండపం డిజైన్లను, దౌల్తాబాద్, కోస్గి ఆలయాల డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శులు శేషాద్రి, శ్రీనివాసరాజు, కార్యదర్శి మాణిక్రాజ్, దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్రావ్, కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారుల సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి ఆదేశం -
అప్రమత్తంగా ఉండండి
అనంతగిరి: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ చూడాలని జిల్లా స్పెషల్ ఆఫీసర్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పొంగిపొర్లుతున్న చెరువులు, వాగులు, వంతెనల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల వద్దకు వెళ్లకుండా చూడాలన్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. లీకేజీ అవుతున్న గురుకుల, పాఠశాల భవనాలకు తక్షణం మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. పాతబడిన భవనాలు, ఇళ్లను గుర్తించి వాటిలో ప్రజలు ఉండకుండా చూడాలన్నారు. మురుగు నీరు, వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడటంతోపాటు వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీఓ వాసుచంద్ర, డీఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి జిల్లా ప్రత్యేక అధికారి,సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ -
సీఎంఆర్ అందజేయాలి
అనంతగిరి: రబీ సీజన్ 2024–25కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను మిల్లర్లు తక్షణం పూర్తిగా అందజేయాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ఆదేశించారు. అలాగే ఖరీఫ్, రబీ 2025 – 26 సీజన్ల బియ్యం డెలివరీని వేగవంతం చేయాలన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిల్లర్లు వారివారి మిల్లుల సామర్థ్యం మేరకు సీఎంఆర్ను ఎఫ్సీఐకి అందజేయాలన్నారు. అధికారులు మిల్లుల నుంచి వచ్చే బియ్యం నిల్వకు గోదాంలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అలాగే తగినంత మంది హమాలీలు నియమించుకోవాలన్నారు. సమావేశంలో డీఎంసీఎస్ మోహన్ కృష్ణ, డీఎస్ఓ సుదర్శన్, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. క్లస్టర్ల వారీగా వివరాలు సేకరించాలి త్వరలో జిల్లాకు గ్రామ పాలన అధికారులు(జీపీఓ) రానున్నందున క్లస్టర్ల వారీగా ఎంత మంది అవసరం అనే వివరాలు సేకరించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అధికారులకు సూచించారు. మంగళవారం తన ఛాంబర్లో అన్ని మండలాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు గ్రామ పాలన అధికారులు వస్తున్నందున వారిని ఏయే ప్రాంతాల్లో నియమించాలి అనే దానిపై ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ -
రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి
ఏడీఏ శంకర్ రాథోడ్ దుద్యాల్: భూమి ఉన్న ప్రతి ఒక్కరూ రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని కొడంగల్ ఏడీఏ శంకర్ రాథోడ్ సూచించారు. మంగళవారం మండలంలోని హకీంపేట్ రైతు వేదికలో అన్నదాతల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక గుంట భూమి ఉన్న రైతుకు కూడా ఈ పథకం వర్తిస్తుందన్నారు. 14–08–1966 నుంచి 14–08–2007 మధ్య జన్మించిన వారు అర్హులన్నారు. ఆధార్ కార్డు, పట్టాపాసు పుస్తకం, బ్యాంక్ ఖాతా పుస్తకం, నామినీ ఆధార్ కార్డు, నామినీ బ్యాంక్ అకౌంట్ పుస్తకంతో స్థానిక ఏఈవోలను సంప్రదించాలని సూచించారు. అనంతరం మండలంలోని ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి నాగరాజు, ఏఈవో మాణికేశ్వరి, రైతులు పాల్గొన్నారు. దుద్యాల్ ఆయుర్వేదిక్ వైద్యుడిగా సుశీల్ కుమార్ దుద్యాల్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆయుర్వేదిక్ ఆస్పత్రి వైద్యుడిగా సుశీల్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేదంలో పలు చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు వంటి వివిధ రకాల చికిత్సలు చేయనున్నట్లు వివరించారు. ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి డీఈఓ రేణుకాదేవి అనంతగిరి: మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ రేణుకాదేవి సూచించారు. ఏకల్, గ్రామోథన్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో 400 మంది మహిళలు 90 రోజుల పాటు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ పొందారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలో శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. 90 రోజుల్లో కంప్యూటర్, బ్యుటీషియన్, కుట్టు తదితర శిక్షణ పూర్తి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు ప్రభాగ్, రాజేందర్, శ్రీధర్రెడ్డి, వినయ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు విద్యార్థుల ఎంపిక అనంతగిరి: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటవ తరగతి ప్రవేశం కోసం లాటరీ పద్ధతిన ఎస్టీ విద్యార్థులను ఎంపిక చేశారు. 2025 – 26 సంవత్సరానికి నలుగురు విద్యార్థులను అదనపు కలెక్టర్ సుధీర్, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అభివృద్ధి కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. హర్ష వర్ధిని సాయి అన్గోత్, విస్లావాత్ ప్రతిక్ష, కట్రావాత్ వైభవ్, పాత్లవత్ అభినందన్ ఎంపికై నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎంలు సుందర్ రాజు, ఎస్ విక్రం సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
మా కడుపు కొట్టొద్దు
పూడూరు: ‘గతంలో మాయమాటలు చెప్పి ప్రమాదకర ఫ్యాక్టరీ పెట్టారు.. పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థ, వాయు కాలుష్యం కారణంగా పంటలు ఎండిపోతున్నాయి.. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నాం.. ఇప్పుడు ఫ్యాక్టరీని విస్తరించి మా పొట్ట కొట్టాలని చూస్తున్నారు.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోము’ అని మీర్జాపూర్ రైతులు తేల్చి చెప్పారు. మంగళవారం పూడూరు మండలం మీర్జాపూర్ పరిధిలోని సుందర్ సింథటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ విస్తరణ కోసం అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. విషయం తెలుసుకున్న రైతులు, గ్రామస్తులు అక్కడి వచ్చారు. రెండు నెలల క్రితం ఇదే అంశంపై సమావేశం నిర్వహించగా తాము వ్యతిరేకించామని, మళ్లీ ఎందుకు వచ్చారని నిలదీశారు. పరిశ్రమ నుంచి వచ్చే వాసన భరించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యం కారణంగా పంటలు దెబ్బతింటున్నాయని అధికారులకు విన్నవించారు. తక్షణం ఫ్యాక్టరీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బోర్లు, బావుల్లో నీరు రంగు మారుతోందని, రోగాల బారిన పడుతున్నామని రైతులు తెలిపారు. పరిశ్రమను విస్తరిస్తే చావే శరణ్యమన్నారు. వందల మంది పోలీసుల సమక్ష్యంలో అభిప్రాయ సేకరణ చేయడం ఏమిటని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పరిశ్రమను విస్తరించాలని చూస్తే హైకోర్టును ఆశ్రయిస్తామని రైతులు స్పష్టం చేశారు. అనంతరం మూకుమ్మడి కార్యక్రమాన్ని బహిష్కరించారు. దీంతో అధికారులు తూతూమంత్రంగా కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జీఎం మహేష్, ఆర్డీఓ వాసుచంద్ర, పూడూరు తహసీల్దార్ భరత్గౌడ్, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఐ భరత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ్యాక్టరీని విస్తరిస్తే చావే శరణ్యం అనుమతులు ఇస్తే న్యాయ పోరాటం చేస్తాం ప్రజాభిప్రాయ సేకరణలో తేల్చి చెప్పిన మీర్జాపూర్ రైతులు కార్యక్రమాన్ని బహిష్కరించి నిరసన -
ఏసీబీకి చిక్కిన మహిళా ఉద్యోగి
వికారాబాద్: లంచం తీసుకుంటూ ఓ మహిళా ఉద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కింది. కలెక్టరేట్లో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నవాబుపేట మండలం వట్టిమీనపల్లికి చెందిన ఓ రైతు తన రెండెకరాల అసైన్డ్ భూమికి సంబంధించి రికార్డుల్లో తన తల్లి పేరు నమోదు చేయించేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. తహసీల్దార్ కార్యాలయం నుంచి వచ్చిన ఫైల్ను ఈ– సెక్షన్ నుంచి కలెక్టర్ పేషీకి పంపించాల్సి ఉంది. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న సుజాత ఇందుకోసం రూ.5 వేలు డిమాండ్ చేసింది. ఈ మొత్తాన్ని పదిహేను రోజుల క్రితమే రైతు నుంచి గూగుల్ పే చేయించుకుంది. అనంతరం కలెక్టర్ ప్రొసీడింగ్ ఇవ్వగా.. తిరిగి ఆ కాపీని తహసీల్దార్ ఆఫీసుకు పంపించాల్సిఉంది. రోజులు గడుస్తున్నా ఫైల్ రాకపోవడంతో బాధితుడు వెళ్లి జూనియర్ అసిస్టెంట్ సుజాతను కలిశాడు. దీనిపై స్పందించిన ఆమె ప్రొసీడింగ్ కాపీ తహశీల్దార్ కార్యాలయానికి పంపాలంటే రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. రూ.15,000 బేరం కుదిరిన అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సుజాతకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. ఈ– సెక్షన్లో సోదాలు నిర్వహించి, పలు ఫైళ్లను పరిశీలించారు. ఆమెను అదుపులోకి తీసుకుని, ఈ వ్యవహారంలో మరెవరి పాత్రయినా ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. నిందితురాలిని ఏసీబీ కోర్డులో హాజరు పర్చి, రిమాండ్కు తరలిస్తామని వెల్లడించారు. లంచం అడిగితే 1064 కాల్ చేయండి.. అధికారులు, ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే తమను సంప్రదించాలని, ఇందుకోసం 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి వివరాలు చెప్పాలని ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టంచేశారు. కలెక్టరేట్ ఈ– సెక్షన్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నిందితురాలు రైతు నుంచి రూ.15వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు -
తొలగింపా?
బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025పొడిగింపా.. తాండూరు: పీఏసీఎస్ పాలక వర్గాల పదవీకాలం ఈ నెల 14తో ముగియనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీతోనే వారి గడువు ముగియగా ప్రభుత్వం ఆరు నెలలు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున రైతు సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనే సందేహాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సారైనా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందా లేకుంటే గడువు పొడి గిస్తుందా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఇదిలా ఉండగా సహకార ఎన్నికల విషయంలో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తేవాలని చూస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో(వికారాబాద్, రంగారెడ్డి, మెడ్చల్) మొత్తం 51 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. వీటికి 2019లో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో వికారాబాద్ జిల్లాలో అత్యధిక సంఘాలను బీఆర్ఎస్ పార్టీ కై వసం చేసుకొని పాలక వర్గాలను ఏర్పాటు చేసింది. నాడు డీసీసీబీ పాలక వర్గాన్ని, పీఏసీఎస్ చైర్మన్లను కలిసి బీఆర్ఎస్ పార్టీకి చెందిన బుయ్యని మనోహర్రెడ్డి(ప్రస్తుత తాండూరు ఎమ్మెల్యే) డీసీసీబీ చైర్మన్గా ఎన్నికయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మనోహర్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాఽధించారు. ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్గా సత్తయ్య, వైస్ చైర్మన్గా రవిగౌడ్ కొనసాగుతున్నారు. వీరి పదవీ కాలం రెండు రోజుల్లో ముగియనుంది. న్యూస్రీల్ మరో అవకాశం ఇవ్వాలి వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం పొడిగింపుపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరో దఫా పొడిగించాలని తాము కోరుతున్నాం. మరో రెండు రోజుల వ్యవధిలో పదవీకాలం ముగుస్తుంది. సర్కారు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. – రవిగౌడ్, వైస్ చైర్మన్, డీసీసీబీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఈ నెల14తో ముగియనున్న పీఏసీఎస్ పాలక వర్గాల పదవీ కాలం ఇప్పటికే ఆరునెలల పొడిగింపు -
ఆర్టీసీకి ఫుల్ గి‘రాఖీ’
● రక్షాబంధన్తో కిటకిటలాడిన బస్సులు ● సమకూరిన రెండింతల ఆదాయం వికారాబాద్: రాఖీ పండుగ ఆర్టీసీకి ఆదాయం సమకూర్చింది. మహిళలకు ఉచిత ప్రయాణంతో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులన్నీ రద్దీగా ఉంటున్నా యి. రక్షాబంధన్తో రెండింత ఆదాయం వచ్చింది. జిల్లాలో మూడు ఆర్టీసీ డిపోలు(వికారాబాద్, తాండూరు, పరిగి) ఉండగా 200 పైచిలుకు బస్సులు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు సగటున లక్ష మంది ప్రయాణికులు వారివారి గమ్యాలకు వెళ్తుంటారు. వికారాబాద్ డిపో పరిధిలో సాధారణ రోజుల్లో 15 వేల నుంచి 20 వేల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తుంటారు. రాఖీ పండుగ నేపథ్యంలో శని, ఆదివారాల్లో 74,242 మంది ప్రయాణించారు. మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా రోజుకు సగటున రూ.4 లక్షల ఆదాయం వచ్చేది.. పండుగ కారణంగా రోజుకు రూ.7 లక్షల చొప్పున రెండు రోజుల్లో రూ.14 లక్షల ఆదాయం సమకూరింది. తాండూరు డిపోలో సాధారణ రోజుల్లో రోజుకు సగటున రూ.10 నుంచి 12 లక్షల ఆదాయం వచ్చేది. రాఖీ నేపథ్యంలో రోజుకు రూ.20 లక్షల ఆదాయం దాటింది. గడిచిన మూడు రోజుల్లో ఈ డిపోకు రూ.66 లక్షలు సమకూరింది. పరిగి డిపోకి మూడు రోజుల్లో కలిపి రూ.72లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఇందులో 75శాతం వరకు మహాలక్ష్మీ పథకంలో భాగంగా వచ్చిందే. సాధారణంగా రోజుకు రూ.16లక్షల వరకు ఆదాయం రాగా పండుగ సందర్భంగా రోజుకు రూ.25లక్షలు సమకూరింది. -
కరెంటోళ్లకు దండాలు
కేశంపేట: ప్రజలకు వెలుగులు పంచే క్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పలపల్లి సబ్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. వేములనర్వ గ్రామ పరిధిలోని చౌదరిగూడ ఫీడర్కు కరెంట్ సరఫరా చేసే స్తంభంపై ఆదివారం రాత్రి అంతరాయం ఏర్పడింది. ఏఈ ఈశ్వర్, లైన్ ఇన్స్పెక్టర్ రాజు, అసిస్టెంట్ లైన్మెన్ శ్రీకాంత్ సోమవారం ఉదయం విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఇప్పలపల్లి చెరువులోని స్తంభంపై ఇన్సులేటర్ కాలిపోయినట్లు అసిస్టెంట్ లైన్మెన్ శ్రీకాంత్ గుర్తించాడు. స్థానిక రైతు శ్రీనివాస్రెడ్డి సాయంతో నీట మునిగిన స్తంభంపైకి ఎక్కి ఇన్సులేటర్ బిగించి సమస్యను పరిష్కరించారు. ఇది చూసిన స్థానిక ప్రజలు, రైతులు కరెంటోళ్లకు దండాలు అంటూ ధన్యవాదములు తెలియజేశారు. -
బాల్యానికి మూడుముళ్లు
అధికారులు అడ్డుకుంటున్నా ఆగని బాల్యవివాహాలు ‘నందిగామ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక(13)కు మానసిక వైకల్యంతో బాధపడుతున్న కందవాడకు చెందిన ఓ వ్యక్తి(36)తో మే 28న నందిగామ శివారులోని ఓ ఆలయంలో వివాహమైంది. నిజానికి ఈ పెళ్లి చిన్నారికి ఏమాత్రం ఇష్టం లేదు. ఇదే అంశాన్ని సదరు విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేయగా, వారు పోలీసు, రెవెన్యూ, సీ్త్రశిశు సంక్షేమశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెళ్లి కుమారుడు, మధ్యవర్తి, పురోహితుడు, బాలిక తల్లిపై నందిగామ ఠాణాలో కేసు నమోదు చేసి సదరు బాధితురాలిని సఖీ కేంద్రానికి తరలించాల్సి వచ్చింది’అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికీ బాల్య వివాహాలు వెలుగు చూస్తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: అభివృద్ధిలో అంతర్జాతీయ దేశాలతో పోటీ పడుతున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను అదే స్థాయిలో సామాజిక వెనుకబాటుతనం వెంటాడుతోంది. నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలకు ఆర్థిక అసమానతలు తోడయ్యాయి. ఫలితంగా 18 ఏళ్ల తర్వాత జరగాల్సిన అమ్మాయిల వివాహ తంతు.. 14 ఏళ్లకే ముగుస్తోంది. తాను ఇప్పుడే పెళ్లి చేసుకోబోనని, అందరిలాగే తాను ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా.. తల్లిదండ్రులు వినిపించుకోవడం లేదు. బలవంతపు పెళ్లిళ్లకు పాల్పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో బాలికలు అత్యవసర ఫోన్ నంబర్లను ఆశ్రయిస్తున్నారు. గత ఏడాది నమోదైన బాల్య వివాహాలను పరిశీలిస్తే.. ఇదే విషయం స్పష్టమవుతోంది. గత ఏడాది అత్యధిక బాల్య వివాహాలు వెలుగు చూసిన జిల్లాలో జాబితాలో వికారాబాద్(94) ముందు వరుసలో నిలువగా, ఆ తర్వాత స్థానాల్లో రంగారెడ్డి(54), మేడ్చల్ (53) జిల్లాలు నిలవడం గమనార్హం. ఐటీ చదువులకు, అంతర్జాతీయ పెట్టుబడులకు నిల యంగా మారిన ఈ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం, బాల్య వివాహాలు వెలుగు చూస్తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక అంతరాలే అసలు కారణం అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్రోడ్డు రాకతో జిల్లా ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. జిల్లాలోని శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, సైబర్సిటీ, నానక్రాంగూడ, కోకాపేట్, నార్సింగి తదితర ప్రాంతాల్లో ఎకరం భూమి ధర రూ.వంద కోట్లకుపైగా పలుకుతోంది. ఆకాశానికి నిచ్చెన వేస్తున్నట్లు ఓఆర్ఆర్కు ఇరు పక్కలా హైరైజ్ భవనాలే దర్శనమిస్తున్నాయి. ఐటీ, వాటి అనుబంధ సంస్థలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు భారీగా వచ్చి చేరడంతో ప్రజల జీవనశైలిలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. తలసరి ఆదాయంలో దేశంలోనే ముందు వరుసలో నిలిచిన జిల్లా కూడా ఇదే. ఇలాంటి కీలకమైన జిల్లాలో ఇప్పటికీ అంతరాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఉన్నవాడు మరింత ఉన్నవాడిగా, లేని వాళ్లు మరింత లేనివాళ్లుగా మారుతున్నారు. సామాజిక వెనుకబాటుకు ఆర్థిక పరమైన అంశాలు తోడవడంతో కడుపున పుట్టిన పిల్లలను వదిలించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల శంషాబాద్ మండలంలో ఓ తల్లి అప్పుడే పుట్టిన బిడ్డను ఇతరులకు అమ్ముకుని పట్టుబడగా, ఉన్నత చదువులు చదివించి, బిడ్డను మరింత ప్రయోజకురాలిని చేయాల్సిన మరో తల్లి ఏకంగా తన బిడ్డకంటే రెట్టింపు వయసున్న వ్యక్తికి కట్టబెట్టేందుకు సిద్ధపడింది. అంతర్జాతీయ వేదికపై ఓ వెలుగు వెలుగుతున్న ఉమ్మడి జిల్లాలో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెడుతున్నా.. రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి, పైసా ఖర్చు లేకుండానే ఉన్నత చదువులు చెప్పిస్తున్నా.. వివాహం, ఇతర అంశాలకు వచ్చే సరికి తల్లిదండ్రుల ఆలోచన భిన్నంగా ఉంటోంది. అభం శుభం తెలియని వయసులో పెళ్లి చేస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. అత్యవసర నంబర్లను ఆశ్రయిస్తున్న చిన్నారులు 2024లో తొలి మూడు స్థానాల్లో వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు -
అనుమతులు ఇవ్వొద్దు
యాలాల: మండలంలోని కాకరవేణి నది నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పనులకు ఇసుక అనుమతులు ఇవ్వరాదంటూ యాలాల, విశ్వనాథ్పూర్, గోవిందరావుపేటకు చెందిన రైతులు కోరారు. సోమవారం వికారాబాద్లో కలెక్టర్ ప్రతీక్ జైన్ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కాకరవేణి నది నుంచి ఇసుక అనుమతుల కారణంగా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. నది పరీవాహక ప్రాంతంలో బోరుబావులు అడుగంటిపోతున్నాయని వాపోయారు. ఇసుక అనుమతుల కారణంగా శివసాగర్ ప్రాజెక్టు కరకట్ట, చెక్డ్యాంలకు నష్టం వాటిల్లే ప్రమాదముందన్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వారిలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సిద్రాల శ్రీనివాస్, సొసై టీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, రైతులు మాధవరెడ్డి, నాగప్ప, అశోక్, భాస్కరచారి, చెన్వీ రప్ప, గోపాల్, బసప్ప, బషీర్ తదితరులు ఉన్నారు. 16న పరిగికి మందకృష్ణ మాదిగ రాక పరిగి: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ నెల 16న పరిగి పట్టణానికి రానున్నట్లు ఆ సంఘం నియోజకవర్గ ఇన్చార్జ్ సుభాష్ మాదిగ తెలిపారు. సోమవారం పరిగి పట్టణంలోని ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ మొత్తం పెంచాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్ మాదిగ, ప్రశాంత్, వెంకటేష్, పుష్పరాణి, సునీత తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఏజెంట్గా ఎన్నికల కమిషన్ ● దొంగ ఓట్లతోనే కేంద్రంలో అధికారం ● ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పరిగి: కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీకి ఏజెంట్లా పనిచేస్తోందని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. సోమవారం పరిగి పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ అంబేడ్కర్ అందరికీ సమానమైన ఓటు హక్కు కల్పిస్తే దాన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో దొంగ ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. దేశంలో ఎన్నో స్థానాలను కాంగ్రెస్ తక్కువ ఓట్లతోనే ఓడిపోయిందన్నారు. అందుకు కారణం ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యమే అన్నారు. దొంగ ఓట్ల భాగోతాన్ని రాహుల్ గాంధీ బయట పెడితే నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. ఒకే ఇంటి నంబర్పై 80 మంది ఓటర్లను ఎలా నమోదు చేసుకుంటారు అని నిలదీశారు. ప్రజాస్వామ్యా న్ని బీజేపీ ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు.తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తుంటే కేంద్రం అడ్డుపడుతోందని విమర్శించారు. విద్యావ్యవస్థ పటిష్టానికి కృషి రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ డాక్టర్ చారకొండ వెంకటేశ్ మాడ్గుల: విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ చారకొండ వెంకటేశ్ అన్నారు. సోమవారం ఆయన మాడ్గుల జెడ్పీహెచ్ఎస్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ ఫౌండేషన్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేసి సర్కార్ బడులను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. దూరప్రాంత విద్యార్థులకు స్కూల్ బస్లు ఏర్పాటు చేస్తామన్నా రు. త్వరలో 317 జీఓ రద్దు చేసి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. -
దానమ్మదేవి అలంకరణ
తాండూరుటౌన్: శ్రావణమాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకొని తాండూరు పట్టణంలోని శ్రీభావిగి భద్రేశ్వరస్వామి దేవస్థానంలోని శివాలయంలో పరమశివుడు మహారాష్ట్రలో వెలిసిన దానమ్మదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుక్కల దాడిలో 12 మేకపిల్లలు మృతి ధారూరు: వీధి కుక్కల దాడిలో 12 మేకపిల్లలు మృతిచెందిన ఘటన అంతారంలో చోటుచేసుకుంది. బాధితుడు చాకలి యాదయ్య వివరాల ప్రకారం.. చుట్టూ ఇనుప కంచె ఉన్న కొట్టంలో ఆదివారం ఉదయం 12 మేకపిల్లలను వదిలివెళ్లాడు. వీధి కుక్కలు లోనికి జొరబడి తీవ్రంగా గాయపర్చడంతో అవి చనిపోయాయి. సాయంత్రం వచ్చి చూసిన బాధితుడు బోరున విలపించాడు. తనకు రూ.50 వేల నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు. నాగారం ఉప పశువైద్యాధికారి సురేందర్ సోమవారం గ్రామానికి వెళ్లి మేకపిల్లకు పోస్టుమార్టమ్ నిర్వహించారు. ఎన్ఐఎంయూ, ఎఫ్సీడీఏ ఏర్పాటుకు స్థల పరిశీలన కందుకూరు: ఫ్యూచర్సిటీ భూముల్లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్(ఎన్ఐఎంయూ), ఎఫ్సీడీఏ (ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ) కార్యాలయాల ఏర్పాటుకు అధికారులు స్థల పరిశీలన చేశారు. ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ శ్రీదేవి, కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ (ఎంఓహెచ్యూఏ) కార్యదర్శి కె.శ్రీనివాస్, జీహెచ్ఎంసీ కమిషన్ ఆర్వీ కర్ణన్ తదితరులు సోమవారం మండల పరిధిలోని మీర్ఖాన్పేట రెవెన్యూలోని సర్వే నంబర్ 112 లోని భూమిని పరిశీలించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ కోసం గతంలో కేటాయించిన 20 ఎకరాలు, ఎఫ్సీడీఏ కార్యాలయం కోసం అదే సర్వే నంబర్లో 7.20 ఎకరాలను క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేశారు. వారి వెంట ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, తహసీల్దార్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. గుంతల రోడ్డుపై నిరసన యాచారం: వర్షాలకు గుంతలమయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని తక్కళ్లపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తక్కళ్లపల్లి– తక్కళ్లపల్లి గేట్ మధ్యన ధ్వంసమైన రహదారిపై వరి నాటు వేసి నిరసన వ్యక్తంచేశారు. అధ్వానంగా మారిన రోడ్డుతో ఎప్పుడు ఏప్రమాదం ముంచుకొస్తుందో తెలియడం లేదన్నారు. సమస్య ను పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీఓ, పంచాయతీరాజ్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యా దు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఆందోళన చేసిన వారిలో బీజేపీ నాయకులు పగడాల శ్రీశైలం, కుమార్ యాదవ్, డాక్టర్ సురేందర్, గడల సురేష్, బాబురావు, నర్సింహ, అంజయ్య, రాములు ఉన్నారు. ఏఈఈలకు పదోన్నతులు డీఈఈలుగా ప్రమోషన్, బదిలీ కేశంపేట: ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న ఐదుగురికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పదోన్నతులు లభించాయి. షాద్నగర్ పరిధి ఫరూఖ్నగర్ మండలంలో ఏఈఈగా పనిచేస్తున్న సుజాతను నారాయణపేటకు, కొందుర్గు మండలంలో పనిచేస్తున్న క్రాంతిని వనపర్తి జిల్లా పెబ్బేరు ఎస్ఈ కార్యాలయానికి, కేశంపేటలో విధులు నిర్వర్తిస్తున్న గీతను వనపర్తికి, రేఖను జహీరాబాద్, మాధవిని జగిత్యాల జిల్లాకు బదిలీ చేస్తూ, ప్రమోషన్లు కల్పించారు. -
ఆర్టీసీ బస్సులో డీజిల్ చోరీ
కేశంపేట: నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్సు నుంచి గుర్తు తెలియని దుండగులు డీజిల్ దొంగిలించారు. ఈ ఘటన మండల పరిధిలోని కొండారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. కొండారెడ్డిపల్లి గ్రామానికి ఫలక్నుమా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అప్జల్గంజ్ నుంచి కొండారెడ్డిపల్లి గ్రామానికి రాకపోకలను సాగిస్తుంది. రాత్రి కొండారెడ్డిపల్లి గ్రామంలోనే బస్సు నిలుపుతారు. ఆదివారం రాత్రి బస్సును నిలిపి, డ్రైవర్, కండక్టర్లు నిద్రించారు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని దొంగ అర్టీసీ బస్సు నుంచి సుమారుగా 90 లీటర్ల డీజిల్ను దొంగిలించాడు. డ్యూటీ డ్రైవర్ రిపోర్టింగ్ సమయంలో చోరీ జరిగినట్లు గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామానికి చెందిన పల్లె బాలీశ్వర్ రూ.5 వేలు, కానం ప్రేమ్కుమార్గౌడ్ రూ.3 వేలు వెచ్చించి డీజిల్ పోయించారు. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతంతో పాడిగేదె మృతి కొందుర్గు: విద్యుదాఘాతంతో పాడిగేదె మృతి చెందిన ఘటన సోమవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివారలు.. గ్రామానికి చెందిన రాయికంటి బలరాం పాడిగేదెలను పోషిస్తూ జోవనోపాధి పొందుతున్నాడు. పాడిగేదెను మేపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కుగురై అక్కడిక్కడే మృతి చెందింది. మృతి చెందిన గేదె విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందని.. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని రైతు ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. -
సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంచుతాం
● ఆఫీసులు, విద్యాలయాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం ● మెరుగైన విద్యుత్ సరఫరా కోసం చర్యలు తీసుకుంటున్నాం ● పేదలందరికీ రేషన్ కార్డులు,సన్నబియ్యం ఇస్తున్నాం ● ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మొయినాబాద్: భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం కృష్టి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని ముర్తూజగూడలో చిలుకూరు, బాకారం, నవాబ్పేటకు సంబంధించిన 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లకు ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడుతూ.. సోలార్ ఉత్పత్తిని పెంచడంకోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేలా ఇప్పటికే అదేశాలిచ్చామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో పూర్తిగా సోలార్ విద్యుత్ను అందించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ, దేవాదాయ, ఇరిగేషన్ భూముల్లో అనుకూలతను బట్టి సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ పంపిణీ వ్యవస్థను సైతం పెంచేందుకు కొత్తగా సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని.. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడం కోసం రాష్ట్రంలో 104 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొయినాబాద్ ప్రాంతంలో పట్టణీకరణ పెరుగుతుండడంతో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాంత విద్యుత్ అవసరాల కోసం 132 కేవీ సబ్ స్టేషన్ను మంజూరు చేస్తున్నామని చెప్పారు. అనంతరం లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ గౌతమ్కుమార్, విద్యుత్ శాఖ సీఎండీ ముషరఫ్అలీ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
మోమిన్పేట: మండలంలోని వెల్చాల్ గ్రామ శివారులో గల రైల్వే ట్రాక్ వద్ద ఓ యువకుడి మృత దేహం లభ్యమైంది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వెల్చాల్ గ్రామానికి చెందిన మన్నే సాయికుమార్ (22) గ్రామ శివారులోని రైల్వే ట్రాక్ వద్ద విగతజీవిగా కనిపించాడు. మధ్యాహ్నం రైల్వే ఉద్యోగులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తన కుమారుడు సాయికుమార్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తండ్రి మల్లేశం తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి రైల్వే ట్రాక్ వద్ద పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. -
గంట్లవెళ్లి ఎంపీపీఎస్లో ఫ్యాన్లు ధ్వంసం
షాద్నగర్రూరల్: ప్రభుత్వ పాఠశాలలో సీలింగ్ ఫ్యాన్లను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన మండల పరిధిలోని గంట్లవెళ్లి ప్రాథమికోన్నత పాఠశాల(ఎంపీపీఎస్)లో సోమవారం వెలుగులోకి వచ్చింది. పాఠశాల హెచ్ఎం శ్రీధర్రెడ్డి దాతల సహకారంతో విద్యార్థుల సౌకర్యార్థం తరగతి గదుల్లో, వరండాలో సీలింగ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయించారు. వరుస సెలవులు ఉండడంతో వరండాలోని ఫ్యాన్లను దుండగులు ధ్వంసం చేశారు. సోమవారం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు పాఠశాల మైదానంలో ఆడుకునేందుకు వస్తుంటారని.. వారిలో ఎవరైనా ఈ పని చేసి ఉంటారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించి తదిపరి చర్యలు తీసుకుంటామని హెచ్ఎం శ్రీధర్రెడ్డి తెలిపారు. -
నులిపురుగులను నలిపేద్దాం
● వైద్యుల పర్యవేక్షణలోనే అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి ● కలెక్టర్ ప్రతీక్జైన్ అనంతగిరి: ఒకటి నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలందరూ అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారం వికారాబాద్లోని కొత్త గడి బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొంతమంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేషనల్ డీ వార్మింగ్ డేకు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. నులిపురుగుల కారణంగా పిల్లల ఎదుగుదలలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయన్నారు. వాటి నివారణ కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రలు పంపిణీ చేసినట్లు వివరించారు. నులిపురుగుల కారణంగా ఆహారం ఎంత తీసుకున్నా బరువు పెరగరని, బలహీనంగా ఉంటారని తెలిపారు. అల్బెండజోల్ మాత్రలు వేసుకోవడం ద్వారా వాటిని నివారించవచ్చని పేర్కొన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది పర్యవేక్షణలో మాత్రమే మాత్రలు వేసుకోవాలన్నారు. ఈ రోజు స్కూళ్లకు రాని పిల్లలకు 19వ తేదీ వరకు అంగన్వాడీ, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి మాత్రల పంపిణీ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిణి లలితాదేవి, శిశు సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, డాక్టర్ పవిత్ర, రెసిడెన్షియల్ వైస్ప్రిన్సిపాల్ మంజుల, ప్రోగ్రాం అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సత్వరం పరిష్కరించాలి ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించా లని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 84 అర్జీలు వచ్చాయి. వీటిని ఆయా శాఖల అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు. నులి పురుగులను నివారించాలి కొడంగల్: ిపల్లల్లో నులి పురుగులను నివారించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లలితాదేవి, డిప్యూటీ డీఎం హెచ్ఓ డాక్టర్ రవీంద్రా యాదవ్ అన్నారు. సోమవారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డితో కలిసి మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ రాంరెడ్డి, అంగడిరాయిచూర్ ఆసుపత్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణ మన బాధ్యత
పరిగి: నేరాల నియంత్రణకు పోలీసు అధికారులు కృషి చేయాలని ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం పరిగి సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసు అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. కేసులు తగ్గించేందుకు శ్రమించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. యువత తప్పుదోవ పట్టించే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు, యువతకు అవగాహన కల్పించాలన్నారు. దొంగతనాల కేసుల పట్ల ప్రత్యేక చొరవ చూపి వాటిని త్వరగా ఛేదించాలని తెలిపారు. ప్రజలకు సీసీ కెమెరాల ఆవస్యకతను వివరించాలన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఐ మోహన్ కృష్ణ, ఆయ పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు పాల్గొన్నారు. క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేయాలి ఎస్పీ నారాయణరెడ్డి -
ముంచెత్తిన వాన!
జిల్లాలోని పలు చోట్ల సోమవారం వర్షం దంచి కొట్టింది. పంట పొలాలు, రోడ్లు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. బొంరాస్పేట మండలం ఎన్కేపల్లి వద్ద వాగు దాటేందుకు రైతులు ఇబ్బంది పడ్డారు. తాడు సాయంతో అవతలి ఒడ్డుకు చేరుకుని వ్యవసాయ పనులు చేసుకున్నారు. బషీరాబాద్ మండలం జీవన్గీ గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. ఇళ్లలోకి చేరిన నీటితో జనం అవస్థలు పడ్డారు. ధారూరు మండలం కోట్పల్లి ప్రాజెక్టుకు ఒక్క రోజులోనే మూడు అడుగుల నీరు చేరింది. ఎగువ ప్రాంతంలో కరుస్తున్న వర్షాలకు వాగుల ద్వారా వరద ప్రవాహం పెరిగిందని ఇరిగేషన్ డీఈ భాస్కర్గౌడ్ తెలిపారు. ఆదివారం ఉదయం వరకు 16 అడుగుల మేరకు నీరు చేరగా అదే రోజు రాత్రి నుంచి సోమవారం ఉదయానికి వరద నీరు మూడు అడుగుల వరకు పెరిగిందని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం వరకు మరో అడుగు చేరేఅవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 19 అడుగుల నీరు ఉన్నట్లు వివరిచారు. – వికారాబాద్/ధారూరు -
భారీ వర్షం.. అతలాకుతలం
కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం ఆగమాగం అవుతోంది. సోమవారం సైతం విస్తారంగా వాన పడడంతో వాగులు, వంకలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు కొనసాగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపడి సరఫరాలో అంతరాయం కలిగింది. ఇళ్లల్లోకి నీరు చేరడంతో కొన్ని ధ్వంసమయ్యాయి. పంట పొలాల్లోకి వరదనీరు చేరడంతో నీట మునిగాయి. చెరువులు అలుగు పారాయి. రహదారులపై రాకపోకలకు తీవ్ర అవస్థలు పడ్డారు. – సాక్షి, నెట్వర్క్ -
తాండూరు ఆస్పత్రికి మిషన్లు
● ఆరోగ్యశ్రీ రాష్ట్ర జీఎం డాక్టర్ రాంబాబు తాండూరు టౌన్: తాండూరు జిల్లా ఆస్పత్రి లోని డయాలసిస్ సెంటర్కు (రక్త మార్పిడి) కొత్తగా ఐదు మిషన్లు అందుబాటులోకి తెచ్చి నట్లు ఆరోగ్య శ్రీ రాష్ట్ర జనరల్ మేనేజర్ డాక్టర్ రాంబాబు తెలిపారు. సోమవారం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఉమ్మ డి రంగారెడ్డి జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డాక్టర్ సతీష్ రెడ్డిలతో కలిసి మిషన్ల ఏర్పాటు కోసం వసతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ నిర్వహించేందుకు జిల్లా ఆస్పత్రిలో ఎనిమిది మిషన్లు అందుబాటులో ఉన్నాయని, వీటి ద్వారా సుమారు 60 మంది పేషెంట్లకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. అయితే మరో 30 మందికి పైగా పేషెంట్లు వేచి చూడాల్సి వస్తోందన్నారు. దీంతో నూతనంగా ఐదు మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. త్వరలో వీటని ప్రారంభిస్తామన్నా రు. డయాలసిస్ సేవల కోసం 94929 13384 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర డయాలసిస్ మేనేజర్ కిషన్ కిషోర్, జిల్లా ఇన్చార్జ్ టీం లీడర్ వీరేశం తదితరులు పాల్గొన్నారు. -
ధీమా ఇవ్వని బీమా
కేశంపేట: రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం రైతుబీమాను ప్రవేశ పెట్టింది. అందుకు 18 నుంచి 59 ఏళ్లవారిని అర్హులుగా పేర్కొంది. ఇందులో భాగంగా అర్హులైన వారి నుంచి ఆధార్కార్డు, నామిని వివరాలతో పాటు పట్టాదారు పాసు పుస్తకాల జిరాక్స్ కాపీలను జతచేసి ఉన్న దరఖాస్తులను మండల వ్యవసాయ విస్తరణ అధికారులు సేకరించారు. అలా వారు సేకరించిన ఆధారాల ప్రకారం.. బీమా ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసీకి చెల్లించింది. అనంతరం రైతుల పేరిట బీమా సంస్థ జారీ చేసిన ఐడీ నంబర్తో కూడిన బాండ్లను వ్యవసాయశాఖ.. రైతులకు అందజేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు బాండ్లు తమకు అందలేదని, బీమా ఉందన్న ధీమా లేకుండా పోయిందని అన్నదాతలు పేర్కొంటున్నారు. అధికారులే బాధ్యులు? బీమా పత్రాల్లో తప్పులు ఉంటే మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారులే బాధ్యులని ప్రభుత్వం గైడ్లైన్స్లో పేర్కొంది. రైతులు తమ ఆధార్కార్డులో ఇంటిపేరు, పేరు, వయస్సు లాంటి వివరాలను మార్చుకుంటే క్లయిమ్ సమయంలో ఇబ్బందులు వస్తాయని, దీనికి అధికారులే బాధ్యతను వహించాల్సి ఉంటుందని తెలిపింది. గ్రామాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఆధార్కార్డులో మార్పులు, చేర్పులు, పుట్టిన తేది, నామిని తదితర వివరాలను మార్చుకోవాలని అనుకుంటే.. విస్తరణ అధికారులను సంప్రదించి బీమా నమోదులో సవరణ చేసుకోవాలని రైతులకు అవగాహనను కల్పించాల్సి ఉంటుంది. అవగాహన కరువు పత్రాల్లో ఏమైనా తప్పులు ఉంటే దానిని సరిచేసుకోవడానికి రెనివల్ సమయంలో అవకాశం కల్పించారు. అయితే బాండ్లు అందకపోవడంతో.. అందులో తప్పులు ఉన్న విషయం తెలియకపోవడం వలనే రైతులు మార్చుకునేందుకు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం ఈ నెల 12 వరకు మాత్రమే మార్పులు చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. నూతనంగా జూన్ 5 వరకు పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు.. ఈ నెల 13 వరకు రైతుబీమాకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. ఇదిలా ఉండగా.. బీమా ఉన్నప్పటికీ.. పత్రాలు అందక పోవడంతో అందులో తప్పులు ఏమున్నాయో తెలియడం లేదని రైతులు పేర్కొనడం గమనార్హం. 2019 నుంచి పథకం ప్రారంభంలో అర్హులైన రైతులకు ప్రభుత్వం బాండ్లను అందజేసింది. 2019 నుంచి ఇవ్వడం లేదు. దీని కారణంగా అందులో తప్పులు ఏమున్నాయో రైతులకు తెలియడం లేదు. ఏమైనా తప్పుడు సమాచారం ఉంటే.. భవిష్యత్లో రైతు కుటుంబ సభ్యులు క్లయిమ్కు వెళ్లినప్పుడు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి సమస్య వచ్చినప్పుడు ఇప్పటి వరకు అఫిడవిట్ను వ్యవసాయ అధికారులకు సమర్పించి, క్లయిమ్ పొందేవారు. కానీ ఇప్పుడు అఫిడవిట్ లేదని, బీమా పత్రం ఆధారంగానే చెల్లింపు ఉన్నట్లు సమాచారం. బాండ్లు ఇవ్వాలి ప్రభుత్వాలు రైతులకు బీమా బాండ్లను అందించలేదు. వాటిల్లో ఏమైనా తప్పులు ఉంటే క్లయిమ్ సమయంలో వారి కుటుంబ సభ్యులకు ఇబ్బందులు తప్పవు. పత్రాలను అందజేస్తే.. మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వీలుంటుంది. ప్రభుత్వం వెంటనే బీమా పత్రాలను రైతులకు అందజేయాలి. – నరేందర్రెడ్డి, సంతాపూర్ బీమాను ఎత్తివేసేందుకు కుట్ర రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదు. గత ప్రభుత్వం తెచ్చిన రైతుబీమా పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర చేస్తోంది. అందులో భాగంగానే కొత్తగా నమోదు చేసుకునేందుకు మూడు రోజుల గడువే ఇచ్చింది. బీమా చేసుకున్న వారికి పత్రాలు అందజేయలేదు. – నవీన్కుమార్, మాజీ సర్పంచ్, కొత్తపేట రైతులకు అందని పత్రాలు తప్పుల సవరణకు సమీపించిన గడువు రేపటితో ముగింపు అవగాహన లోపంతో అన్నదాతలు క్లెయిమ్లో తప్పని తిప్పలు -
కోట్పల్లి ప్రాజెక్టుకు చేరుతున్న వరద
ధారూరు: కోట్పల్లి ప్రాజెక్టులో వాగుల ద్వారా ఆదివారం వరకు 16 అడుగుల మేర వరదనీరు చేరింది. 3 సంవత్సరాల నుంచి జూలై నెలలోనే ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయేది. అక్కడి నుంచి అలుగు ద్వారా కాగ్నా నుంచి ప్రవహించి కృష్ణానదిలో చేరేది. కానీ ఈ సారి వర్షాలు సంవృద్ధిగా కురియకపోవడంతో ఎగువ ప్రాంతాలనుంచి వరద ప్రవాహం తగ్గింది. జూలైలో కేవలం 4 అడుగుల నీరు చేరడంతో 14.6 అడుగుల వరకు నీటి నిల్వకు చేరింది. మరో 8 అడుగుల నీరు చేరితేనే ప్రాజెక్టు పూర్తిగా నిండుంతుందని అధికారులు చెబుతున్నారు. రబీ పంటలకు నీరు అందాలంటే ప్రాజెక్టు పూర్తిగా నిండాలని రైతులు చెబుతున్నారు. 16 అడుగులకు చేరిన నీటిమట్టం -
సాధారణ పరిహారమేనా?
దుద్యాల్: మండల పరిధిలోని హకీంపేట్, లగచర్ల, పోలేపల్లి గ్రామాలకు చెందిన 1,275 ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి రైతులు తమ పొలాలను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇస్తూ పరిహార చెక్కులను తీసుకుంటున్నారు. కానీ భూములు ఇవ్వని మరికొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి పలుమార్లు నోటీసులు జారీ చేసింది. అయినా వారిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మరో అడుగు ముందుకేసింది. జనరల్ అవార్డు ప్రకటించేందుకు సిద్ధమైంది. అందుకు సంబంధించి జూలై 19న నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. హకీంపేట్ గ్రామానికి చెందిన రాకం యాదయ్య సర్వేనంబర్ 240లో 2.21 ఎకరాలు, అదే గ్రామానికి చెందిన రఘులకోల ప్రదీప్ కుమార్ సర్వేనంబర్ 245లో 10 గుంటల పట్టా భూమికి గాను నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో వారిరువురి విషయంలో కోర్టునుంచి పరిహారం ఇవ్వనున్నట్లు తెలిసింది. అంగీకారంతో ఇచ్చే భూములకు వచ్చే పరిహారం కాకుండా సాధారణ పరిహారం మంజూరు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా లగచర్ల గ్రామానికి చెందిన భూములు ఇవ్వని రైతులకు కూడా జనరల్ అవార్డు కింద నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. జనరల్ అవార్డు ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం భూములు ఇవ్వని రైతులకు షాక్ -
విగ్రహాల ధ్వంసం దారుణం
రాజేంద్రనగర్: శివరాంపల్లిలోని బంగారు మైసమ్మ దేవాలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బీజేపీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శ్రీధర్ డిమాండ్ చేశారు. నిందితున్ని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన వ్యక్తిని.. అతడి వెనుక ఉన్న వారిని అరెస్ట్ చేయాలన్నారు. బంగారు మైసమ్మ దేవాలయం ఆవరణలోకి ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ యువకుడు దేవాలయంలోని విగ్రహాలను పాక్షికంగా ధ్వంసం చేసి పారిపోయాడు. నిందితుడు వెళ్లిన అనంతరం దేవాలయానికి వచ్చిన భక్తులు ఈ విషయాన్ని గమనించి స్థానికులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు వై.శ్రీధర్, మహిపాల్ రెడ్డి, హరికిషన్ జీ, సందీప్ ముదిరాజ్, ప్రభాకర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, యువకులు పెద్ద ఎత్తున దేవాలయ ప్రాంగణంలోకి చేరుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని పట్టుకొని శిక్షిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ విషయమై రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శ్రీధర్ మాట్లాడుతూ... దేవాలయాలపై దాడులు సహించరానిదన్నారు. నిందితులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కుట్ర జరుగుతుందని ఆరోపించారు. రానున్న గణేష్ ఉత్సవాల నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దుండగుడిని కఠినంగా శిక్షించాలి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ -
సమస్యలు పరిష్కరించాలి
కందుకూరు: భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నిధులను ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి వినియోగించకుండా ఇతర ప్రయోజనాలకు వినియోగిస్తోందని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ అన్నారు. మండల కేంద్రంలో సీఐటీయూ మండల కన్వీనర్ బుట్టి బాల్రాజ్ ఆధ్వర్యంలో ఆదివారం భవన నిర్మాణ కార్మిక సంఘం రెండో మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వామపక్షాల పోరాట ఫలితంగా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పడిందన్నారు. ప్రస్తుతం బోర్డు నిధులను పక్కదారి పట్టించడంతో ఇబ్బందిగా మారిందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో సంక్షేమ బోర్డు ద్వారానే నిధులను కార్మికులకు ఖర్చు చేస్తున్నాయని, ఇక్కడ మాత్రం ఆవిధంగా లేదన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యంతో పాటు ప్రమాద బీమా, 50 ఏళ్లు దాటిన కార్మికులకు పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం సంఘం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా పోల్కం శ్రీరాములు, అధ్యక్షుడిగా బండి సత్తయ్య, ఉపాధ్యక్షులుగా కొమురయ్య, గోల్కండ లక్ష్మయ్య, కోశాధికారిగా ఆర్.రవి, ఉపాధ్యక్షుడిగా జింకల సత్యనారాయణ, కమిటీ సభ్యులుగా శేఖర్, యాదయ్య, ఉప్పుల కృష్ణ, చిన్నయ్య, అంబటి సురేష్, మాదారం సురేష్, కె.నరసింహ, వెంకటేశ్ ఎన్నికయ్యారు. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ -
ఘనంగా లక్ష బిల్వార్చన
అనంతగిరి: వికారాబాద్ పట్టణానికి సమీపంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం లక్ష బిల్వార్చన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఉదయం నుంచే ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సామూహిక లక్ష్య బిల్వార్చన చేసి తీర్థ ప్రసాదాలు అందుకుని మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భ ంగా ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మార్మోగింది. పలువురు ప్రముఖులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
చెరువుకు జలకళ
తుర్కయంజాల్: వరుస భారీ వర్షాలతో తుర్కయంజాల్ మాసబ్ చెరువుకు జలకళ సంతరించుకుంది. వరద పోటెత్తడంతో అలుగు పారుతోంది. శనివారం సాయంత్రం కురిసిన వానతో చెరువు నుంచి పెద్ద మొత్తంలో నీరు బయటకు ప్రవహిస్తోంది. దీంతో సాగర్ రహదారిపై నుంచి రాకపోకలు సాగించే వాహనదారులు.. ప్రవాహాన్ని చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి 8 గంటల నుంచి ఇంజాపూర్లోని ఆపిల్ అవెన్యూ కాలనీలో ఇళ్ల మధ్యలో వాగుపై నిర్మించిన రోడ్డుపై అడుగున్నర మేర నీరు ప్రవహించింది. ఈ కాలనీలో గతంలో వెంచర్ నిర్వాహకులు.. వాగును కబ్జా చేసి దానిపై మూడు అడుగుల నాలాను నిర్మించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు కురిసి.. చెరువు అలుగు పారినప్పుడు నీరు, కృత్రిమంగా నిర్మించిన నాలా పొంగి, ఇలా ఇళ్ల మధ్య నుంచి ప్రవహిస్తుంటుంది. ఇళ్లనుముంచెత్తుతుంది. ఆదివారం మధ్యాహ్నం వరకు వరద కొంత తగ్గుముఖం పట్టింది. దీంతో స్థానికులు చేపలను పట్టేందుకు ఉత్సాహం చూపారు. ఇంజాపూర్లోని ఇందిరమ్మ కాలనీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల చుట్టూ వరద చేరింది. దిలావర్ఖాన్ చెరువు నీరు ఉధృతంగా పరుగులు తీస్తోంది. భారీ వర్షాలతో అలుగు పోస్తున్న మాసబ్ చెరువు ఇళ్ల మధ్య నుంచి ప్రవహిస్తున్న వరద -
ఐక్య పోరాటానికి సిద్ధంకండి
● 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించుకోవాలి ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఇబ్రహీంపట్నం: రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకు ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇబ్రహీంపట్నం బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాన్వెస్లీ మాట్లాడుతూ.. రిజర్వేషన్ల సాధనకు రాష్ట్రం నుంచి ఎంపికై న బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని.. లేనిపక్షంలో తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బీసీ బిల్లును తేల్చకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో జాప్యం జరుగుతోందని అన్నారు. దీనిని సాకుగా చూపి పంచాయతీలకు రావాల్సిన నిధులను విడుదల చేయడంలేదన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు అమలుచేస్తూ ఇక్కడ అడ్డుపడటం ఏమిటని ప్రశ్నించారు. బీసీలకు అనుకూలం అంటునే బండి సంజయ్, కిషన్రెడ్డి, రాంచంద్రరావు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నట్లు ఆరోపించారు. రేవంత్ సర్కార్ అందరినీ కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని.. అందుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.సామేల్, తాడిగళ్ల భాస్కర్, దుబ్బాక రామచందర్, ఏర్పుల నర్సింహ, బి. జగదీశ్, జిల్లా కమిటీ సభ్యులు ఆలంపల్లి నరసింహారావు, జంగయ్య, శ్రీనివాస్రెడ్డి, జి.నర్సింహ, కిషన్, రుద్రకుమార్, జగన్, సుమలత, విఘ్నేష్, పురుషోత్తం పాల్గొన్నారు. -
వర్షాకాలం.. విద్యుత్తో భద్రం
స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, సర్వీస్ వైర్లతో ప్రాణాలకు ముప్పు ●● పొలాల వద్ద అప్రమత్తత అవసరం ● సమస్యలుంటే ట్రాన్స్కో సిబ్బందికిసమాచారం ఇవ్వాలి ● ట్రాన్స్కో ఇన్చార్జ్ ఏఈ రఘువీర్వ్యవసాయ పనుల్లో భాగంగా గత శుక్రవారం కరిగేటు చేస్తుండగా తెగిన సర్వీస్ వైర్ను సరిచేసే క్రమంలో యాలాల మండలం ముద్దాయిపేటలో యువరైతు రమేశ్గౌడ్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య, పిల్లలు వీధిన పడ్డారు. కుల్కచర్ల మండలం బిందెంగడ్డ పంచాయతీ చింతల్కుంటతండాకు చెందిన యువరైతు భాస్యనాయక్ శనివారం సాయంత్రం పొలం వద్ద విద్యుత్ సరఫరా కావడం లేదనిట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి పరిశీలించాడు. అక్కడ తీగలు సరి చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందాడు. ఈ రెండు సంఘటనల్లో చిన్నపాటి నిర్లక్ష్యం రెండు ప్రాణాలను బలిగొంది. దీంతో ఇరు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. యాలాల: వర్షాకాల నేపథ్యంలో తరచూ వ్యవసాయ బోర్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద కరెంటు సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. రైతులు విద్యుత్ సరఫరా కోసం తామే స్తంభాలు ఎక్కడం, ఫ్యూజులు మార్చడం, తీగలు సరిచేయడం చేస్తుంటారు. ఇది ఎంతో ప్రమాదకరమని, కరెంటు విషయంలో నిపుణులైన ట్రాన్స్కోసిబ్బంది వచ్చి సమస్య పరిష్కరించేంత వరకురైతన్నలు ఓపిక పట్టాలని ట్రాన్స్కో ఉన్నతాధికారులు సూచనలిస్తున్నారు. ఇటీవల జరిగిన రెండు ఘటనల నేపథ్యంలో మండల ట్రాన్స్కో ఇన్చార్జ్ ఏఈ రఘువీర్ పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు ● రైతులు పొలాల వద్ద ఏర్పడే కరెంటు సమస్యల విషయంలో సొంతంగా మరమ్మతులు చేపట్టేందుకు ముందుకు రావొద్దు. సమస్య వస్తే వెంటనే స్థానిక లైన్మెన్ లేదా ఏఈకి సమాచారం ఇవ్వాలి. ● వర్షాకాలం నేపథ్యంలో బోర్ల వద్ద, సర్వీస్ వైర్లు ముట్టుకునే సమయంలో భూమిపై తడి ఉంటే, తప్పనిసరి తగు భద్రత చర్యలు తీసుకొని ముందుకు వెళ్లాలి. కాళ్లకు తప్పనిసరిగా రబ్బరు చెప్పులు ధరించాలి. తడి చేతులతో ఎట్టి పరిస్థితుల్లో స్టార్టరు, బోర్లు, సర్వీసు వైర్లను తాకవద్దు. ● పొలాల్లోని స్తంభాలపై తీగలు తెగినప్పుడు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫ్యూజులు ఎగిరినప్పుడు ట్రాన్స్కో అధికారులను సంప్రదించాలి. అలా కాకుండా అనధికార వ్యక్తులు స్తంభాలు ఎక్కడం నేరం. విద్యుత్ అధికారులు స్థానిక సబ్స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకొని మరమ్మతులకు పూనుకుంటారు. ● రైతులు కరెంటు విషయాల్లో కాస్త ఓపికగా ఉంటే ఎంతో మేలు. అరగంట, గంట ఆలస్యమైన ట్రాన్స్కో సిబ్బంది సమస్య ఉన్న ప్రాంతానికి వచ్చేంతవరకు ఆగండి. అంతేకానీ ఆలస్యమవుతుందనే భావనలో ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ● విద్యుత్ సమస్య పరిష్కారంలో నిపుణులైన ట్రాన్స్కో సిబ్బంది, రక్షక పరికరాలతో విద్యుత్ స్తంభం ఎక్కడం, మరమ్మతులు చేయడం, కనెక్షన్ ఇవ్వడం, ఫ్యూజులు మార్చడం చేస్తుంటారు. ఈ విషయంలో కర్షకులు ట్రాన్స్కో సిబ్బందికి సహకరించాలి. ● రైతులు తమ వ్యవసాయ బోర్ల వద్ద, కరెంటు స్తంభాల వద్ద, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ బుడ్డీలు ఏర్పాటు చేసిన ప్రదేశం ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. గడ్డి, కంపచెట్లు, ఇతర మొక్కలు పెరగకుండా తొలగిస్తూ ఉండాలి. ఆయా ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా భూమి చదునుగా ఉండేలా చూడాలి. ● ప్రమాదవశాత్తు రైతులు కానీ, మూగ జీవాలు కానీ మరణిస్తే శాఖ పరంగా ఆర్థికపరమైన సాయం బాధిత కుటుంబాలకు అందుతుంది. ప్రమాద అనంతరం సంబంధిత పత్రాలు, వివరాలను ట్రాన్స్కో సిబ్బందికి అందజేస్తే 60 రోజుల్లో పరిహారం అందే అవకాశం ఉంది. -
గ్రామాభివృద్ధికి కృషి
స్పీకర్ ప్రసాద్కుమార్ తాండూరు రూరల్: తాను పుట్టి పెరిగిన ఊరిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం మండలంలోని బెల్కటూర్లో స్పీకర్ తన వ్యవసాయ క్షేత్రంలో పునర్నిర్మించిన మైసమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన బెల్కటూర్తో పాటు గ్రామస్తులను గుర్తు చేశారు. బెల్కటూర్–కరన్కోట్ మార్గంలో బ్రిడ్జి నిర్మాణ పనులు నెల రోజుల్లో పూర్తి అవుతాయని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు మదన్మోహన్, నారాయణరెడ్డి, వెంకటేష్, అశోక్, యువకులు పాల్గొన్నారు. అంతకుముందు పురోహితులు స్పీకర్కు పూర్ణహుతితో స్వాగతం పలికారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణరెడ్డి, రూరల్ సీఐ నగేష్, పట్టణ సీఐ సంతోష్కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. -
కొండెక్కిన కూరగాయలు
ధరలు పెరగడంతో సామాన్యుల తిప్పలు ● అదుపులోకి తేవాలని విజ్ఞప్తి ● సాగు విస్తీర్ణం తగ్గడమే కారణమని విశ్లేషణనవాబుపేట/మోమిన్పేట: రోజురోజుకూ మార్కెట్లో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఏది కొందామన్నా కొండెక్కి కూర్చొని సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీనికితోడు నిత్యావసర వస్తువుల ధరలు సైతం అమాంతం పెరగడంతో మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ప్రజలు విలవిలలాడుతున్నారు. భగ్గుమంటున్న ధరలను అదుపు చేసేందుకు పాలకులు, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నవాబుపేట, తదితర ప్రాంతాల్లో రైతులు పత్తి, మొక్కజొన్న తదితర వాణిజ్య పంటలు అధికంగా సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. వర్షాలు సమయానికి కురవకపోవడం కూరగాయలు, పప్పుదినుసుల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఫలితంగా వ్యాపారులు వివిధ ప్రాంతాల నుంచి కూరగాయలు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. దీంతో కాయకూరలకు ధరలు బాగా పెరిగాయి. రెట్టింపైన నిత్యావసరాలు కూరగాయలకు తోడు నిత్యావసర సరుకుల ధరలు నెల రోజుల్లోనే రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో పెసర్లు కిలోకి రూ.120, మినుములు కిలో రూ.100, బొబ్బర్లు రూ.90. ఉలువలు రూ.100, పచ్చజొన్నలు రూ.40, ధనియాలు రూ.100, వెల్లుల్లి రూ.100, మినపపప్పు రూ.130, శనగ రూ.70 పలుకుతున్నాయి. కోడిగుడ్డు ధర ప్రస్తుతం రూ.6 ఉంది. పెరిగిన ధరలను చూసి వినియోగదారులు జంకుతున్నారు. నిత్యం కూలినాలీ చేసుకొని జీవించే శ్రమజీవులు పెరిగిన ధరలతో సతమతమవుతున్నారు. శాకాహార ప్రియులతో.. శ్రావణమాసంలో మెజార్జీ హిందువులు మాంసాహారానికి దూరంగా ఉంటారు. కూరగాయల ధరల పెరుగుదలకు ఈ అంశం కూడా కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో కూరగాయలు, ఆకు కూరలతో చేసిన వంటలే ఉపయోగిస్తారు. దీనికి తోడు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో వెజిటెబుల్స్ వినియోగం అమాంతం పెరిగింది. అందుకే ధరలు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయి. వికారాబాద్ మార్కెట్లో ధరలు రకం ధర(కిలోకి) పచ్చిమిర్చి రూ.120 మునగకాయలు రూ.120 చిక్కుడు రూ.100 బీన్స్ రూ.100 క్యాప్సికం రూ.80 బెండకాయ రూ.80 బీరకాయ రూ.80 క్యారెట్ రూ.60 టమాట రూ.60 వంకాయ రూ.60 ఉల్లిగడ్డ రూ.60 సొరకాయ(ఒక్కటి) రూ.15 -
అర్జీలకే పరిమితం
● రాజీవ్ యువ వికాసానికి తీవ్ర జాప్యం ● ఎంపిక ప్రక్రియ పూర్తయినా అమలుకు నోచుకోని వైనం ● నిరాశలో లబ్ధిదారులు వికారాబాద్: రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించడంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు చెక్కు లు అందజేస్తామని హడావుడి చేసిన సర్కారు నేటికి ఆ ఊసెత్తడం లేదు. లబ్ధిదారుల ఎంపిక చేసిన అధికారులు అంతటితో మిన్నకుండి పోయారు. యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యు వ వికాసం పేరుతో నూతన పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కో సం మే 14వ తేదీ వరకు యువత నుంచి దర ఖాస్తులు స్వీకరించిన అధికారులు అనంతరం వెరిఫికేషన్ ప్రక్రియను సైతం పూర్తి చేశారు. జిల్లాలో మొత్తంగా 50,406 అర్జీలు వచ్చాయి. నేతల కనుసన్నల్లో ఎంపిక మండల పరిషత్ అభివృద్ధి అధికారుల పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ చేపట్టగా ఇందులో బ్యాంకర్లను కూడా భాగస్వాములను చేస్తున్నారు. అయితే బ్యాంకు సిబిల్ స్కోర్ను కూడా పరిగణలోకి తీసుకున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఎంపిక ప్రక్రియలో తమ ప్రమేయం ఏమిలేదని అంతా పారదర్శకంగా చేపడుతున్నామని ప్రభుత్వంతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పేర్కొంటున్నారు. అయితే నేతల కనుసన్నల్లోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ప్రచారంలో ఉంది. దీంతో దరఖాస్తులు చేసుకున్నవారు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జూన్ 2వ తేదీనే జాబితా ప్రకటిస్తామన్న ప్రభుత్వం జాప్యం చేయడం ఏంటని అర్జీదారులు ప్రశ్నిస్తున్నారు. తాండూరులో అత్యధికం జిల్లాలో దరఖాస్తుల తీరు ఇలా.. మండలం అర్జీలు బంట్వారం 1,182 బషీరాబాద్ 2,125 బొంరాస్పేట 2,180 చౌడాపూర్ 1,741 ధారూరు 2,380 దోమ 3,136 దౌల్తాబాద్ 1,971 దుద్యాల్ 1,904 కొడంగల్ 2,156 కొడంగల్(మున్సిపల్) 760 కోట్పల్లి 1,141 కుల్కచర్ల 3,311 మర్పల్లి 1,964 మోమిన్పేట్ 1,804 నవాబుపేట్ 1,494 పరిగి 2,615 పరిగి(మున్సిపల్) 604 పెద్దేముల్ 3,200 పూడూరు 2,320 తాండూరు 3,456 తాండూరు(అర్బన్) 2,350 వికారాబాద్ 1,423 వికారాబాద్(అర్బన్) 2,903 యాలాల 2,286 మొత్తం 50,406 మే నెల మొదటి వారంలో 20 మండలాలతో పాటు నాలుగు మున్సిపాలిటీల నుంచి రాజీవ్ యువ వికాసం పథకం(ఆర్వైవీసీ) కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో కొడంగల్ మున్సిపాలిటీలో అత్యల్పంగా 760 మంది మాత్రమే దరఖాస్తులు చేసుకోగా.. అత్యధికంగా తాండూరు మండలంలో 3,456 మంది అర్జీ పెట్టుకున్నారు. మండలాలు, మున్సిపాలిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల వారీగావిభజించి వెరిఫికేషన్ పూర్తి చేశారు. నాలుగు మున్సిపాలిటీలు, 20 మండలాల్లో కలిపి 50,406 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వారు ఎంపిక చేసుకున్న యూనిట్ ధరను బట్టి రూ.లక్ష నుంచి గరిష్టంగా రూ.4 లక్షల వరకు రాయితీపై రుణాలు అందజేయనున్నారు. -
సెల్ఫీ విత్ రాఖీ
అక్కాచెల్లెళ్ల ఆత్మీయ వేడుక రక్షాబంధన్. ఈ పర్వదినాన సోదరులకు కట్టే రాఖీ.. ప్రేమానురాగాలకు ప్రతిరూపంగా నిలుస్తుంది. ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా చూపించాలనే ఉద్దేశంతో ‘సెల్ఫీ విత్ రాఖీ’ ఫొటోలను ఆహ్వానిస్తోంది ‘సాక్షి’. మీ కుటుంబం, సమూహంలో శనివారం నిర్వహించిన రాఖీ సంబరాలను సెల్ఫీ తీసుకుని పంపిస్తే బాగున్నవాటిని ఎంపిక చేసి ప్రచురిస్తాం. ఫొటోతో పాటు మీ పట్టణం లేదా గ్రామం పేరు రాసి పంపండి. పర్యావరణ హిత రాఖీలకు ప్రాధాన్యం ఉంటుంది. మీరు వాట్సప్ చేయాల్సిన నంబర్లు 92906 11217, 98669 34975 -
భారీ వర్షాలు కురిసినా తట్టుకొనేలా వ్యవస్థల ప్రక్షాళన
● నీటి ప్రవాహానికి వీలుగా డ్రైనేజీలు, ట్రాఫిక్ చిక్కుల్లేకుండా చర్యలు ● చెరువులు, కుంటలు, నాలాలు ఎస్టీపీల ద్వారా మూసీకి అనుసంధానం ● అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ నది పునరుజ్జీవం ద్వారానే వరద నీటిని సమర్థంగా నిర్వహించవచ్చని ఆయన పేర్కొన్నారు. వర్షాలతో నగర జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండాలంటే శాశ్వత ప్రాతిపదికన అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వరద నీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలను మరో వందేళ్ల భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకొని కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఢిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం నగరానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. గురువారం రాత్రి హైదరాబాద్లో కురిసిన భారీ వర్షంతో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్లో మరోసారి పునరావృతం కాకుండా అనుసరించాల్సిన తక్షణ, శాశ్వత చర్యలపై అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని విభాగాల అధికారుల అభిప్రాయాలను తీసుకున్నారు. వాతావరణ మార్పులతోనే.. నగరంలో గురువారం రాత్రి కుండపోత వర్షానికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని, అందు కు తగినట్లుగా నగరంలో అన్ని వ్యవస్థలను ఆధునికీకరించాల్సిన అవసరముందని ఈ సందర్భంగా సీఎం అభిప్రాయపడ్డారు. భారీ వర్షాలతో తలెత్తే ఈ విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు విపత్తుల నివారణ నిర్వహణ ప్రణాళిక సమ ర్థంగా అనుసరించాలని ఆదేశించారు. ఎలాంటి భారీ వర్షాన్నైనా తట్టుకొనేలా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును వెంటనే చేపట్టాలన్నారు. నగరంలో 55 కిలోమీటర్ల పొడవునా మూసీని పునరుద్ధరించటం ద్వారా పరీ వాహక ప్రాంతంతో పాటు అన్ని ప్రాంతాలు, కాలనీలకు వరద ముప్పును నివారించవచ్చన్నారు. మూసీలో వరద నీరు చేరేలా.. ఓఆర్ఆర్ లోపల ఉన్న కోర్ అర్బన్ ప్రాంతంలో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అన్ని వైపుల నుంచి వరద నీరు మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, మీరాలం చెరువులతో పాటు అన్ని చెరువులు, కుంటలను నాలాల ద్వారా మూసీకి అనుసంధానం చేయాలన్నారు. డ్రైనేజీల ద్వారా వచ్చే నీటిని ఎస్టీపీ (సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల) ద్వారా శుద్ధి చేసి మూసీలోకి వదలాలని చెప్పారు. నగరంలో ఎక్కడ వర్షం పడినా మూసీలోకి చేరేలా అనుసంధానం జరగాలన్నారు. ప్రాజెక్టును వరద నీటి నిర్వహణకు వీలుగా డిజైన్ చేయాలని చెప్పారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పాత నగరంలో పెడిస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేసి పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టాలని సూచించారు. చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి ప్రాంతాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ ఇలంబర్తి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, జేఎండీ గౌతమి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం
● కలెక్టర్ ప్రతీక్జైన్అనంతగిరి: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్జైన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా వేడుకలను జయప్రదం చేయాలన్నారు. కలెక్టరేట్ ఆవరణలో వేడుకలు నిర్వహించనున్నందున అతిథుల కోసం వేదికపై ఏర్పాట్లు చేయాల న్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలపై శాఖల వారీగా స్టాల్స్ ఏర్పా టు చేయాలన్నారు. ఆరోగ్య, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, జిల్లా రెవెన్యూ అధికారి మంగీలాల్, అడిషనల్ ఎస్పీ మురళీధర్, ఆర్డీఓ వాసుచంద్ర పాల్గొన్నారు. -
రాఖీ శుభాకాంక్షలు
స్పీకర్ ప్రసాద్కుమార్ అనంతగిరి: జిల్లా ప్ర జలకు స్పీకర్ ప్రసాద్కుమార్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపా రు. అన్నాచెల్లెలు, అ క్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్ అన్నారు. తన సోదరుడు గొప్పగా ఉండాలని, తనకు కొండంత అండగా నిలవాలని ఆకాంక్షిస్తూ సోదరి రాఖీ కడుతుందన్నారు. బాధ్యతలు చేపట్టిన మంగీలాల్ అనంతగిరి: జిల్లా రెవెన్యూ అధికారిగా మంగీలాల్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్జైన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగీలాల్ వరంగల్ హనుమకొండ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్గా పని చేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. వాగును విడిపించకుండా తవ్వకాలు ఏమిటి ? చిలుకవాగు పనులను అడ్డుకున్న స్థానిక రైతులు తాండూరు: రియల్ వ్యాపారులు కబ్జా చేసిన చిలుక వాగును విడిపించకుండా, తమ పొలాల నుంచి వాగును తరలించడంపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ మార్గం సాయిపూర్ ప్రాంతంలో శుక్రవారం చేపట్టిన వాగు తవ్వకం పనులను అడ్డుకున్నారు. మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి వెళ్లి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. చిలుక వాగు పరివాహక ప్రాంతం తమ పొలాల మధ్య నుంచి వెళ్లదని తెలిపారు. ఆక్రమణలను తొలగించకుండా తమ భూముల పైనుంచి తవ్వకాలు చేపట్టడం ఏమిటని ఆవేదన వ్యక్తంచేశారు. పాల ఉత్పత్తులపై అవగాహన యాచారం: పీవీ నర్సింహరావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం గునుగల్, గడ్డమల్లయ్యగూడ గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ కొండల్రెడ్డి, ఫార్మర్ డీన్ డాక్టర్ రఘునందన్ తదితరులు శాసీ్త్రయ పద్ధతిలో పాడిపశువుల పెంపకం, పాల పదార్థాల తయారీపై మహిళా రైతులకు అవగాహన కల్పించారు. పశుపోషణ, తక్కువ ఖర్చుతో షెడ్ల నిర్మాణం, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వంటి అంశాలను వివరించారు. కలాకండ్, పన్నీరు, చన్నారసగుల్లా, రసమలై, మజ్జిగ, లస్సీ తదితర పదార్థాల తయారీపై అవగాహన కల్పించి, శిక్షణ ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అధికారులు రత్నాకర్, శశికుమార్ పాల్గొన్నారు. -
రోడ్డు పనులు అడ్డుకుంటున్న వ్యక్తిపై ఫిర్యాదు
కేశంపేట: రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకుంటున్న రైతుపై చర్యలు తీసుకోవాలని గోప్లాయకుంటతండా వాసులు శుక్రవారం తహసీల్దార్ అజాంఅలీకి వినతిపత్రం అందజేశారు. వివరాలు.. బైర్కాన్పల్లి శివారు గోప్లాయకుంట తండాకు 20 ఏళ్ల క్రితం కంకర రోడ్డును వేశారు. ప్రస్తుతం బీటీ రోడ్డు మంజూరు కావడంతో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న రైతు తన పొలం పక్క నుంచి రోడ్డు వేయాలంటూ నిత్యం కాంట్రాక్టర్ను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించారు. రోడ్డు నిర్మాణ మార్గం మార్చితే మిగిలిన రైతుల పొలాలు నీటమునుగుతాయని.. అధికారులు స్పందించి పాతరోడ్డు మాదిరిగానే బీటీ రోడ్డు వేసేలా తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రాయికంటి రాంచంద్రయ్య, కరుణాకర్, నర్సింహ తదితరులు ఉన్నారు. -
దారి తప్పిన ప్లానింగ్
అన్నీ ఉన్నా అధ్యయనమేది? రోడ్ల నిర్మాణంలో సరైన ప్రణాళిక అవలంబించకపోవడంతోనే అసలు సమస్య వస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైనా ఒక ప్రదేశంలో రోడ్డు నిర్మించాల్సి వస్తే దాని వల్ల ఎక్కువగా ఎవరి ప్రయోజనం... అంటే స్కూల్ జోనా? వాణిజ్య ప్రాంతమా? తదితర విషయాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరగాలి. దానికి తగ్గట్టు మార్పుచేర్పులతో రహదారి నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సిటీలో మాత్రం ఆర్టీరియల్ రోడ్లు, ఇన్నర్ రోడ్లు, ఇంటర్మీడియట్ రోడ్లు దేనికీ సరైన ప్రణాళిక, అధ్యయనం లేకుండానే నిర్మితమవుతాయి. అందుకే ట్రాఫిక్ అస్తవ్యస్తంగా కొనసాగుతోంది. సాక్షి, సిటీబ్యూరో: చిన్న వర్షం కురిస్తే రోడ్లన్నీ జలమయం... ఎక్కడి వాహనాలక్కడే నిలిచిపోవాల్సిందే.. ఇక ఎక్కడై ప్రమాదం జరిగినా.. రోడ్డు గుంత పడినా.. వాహనం బ్రేక్డౌన్ అయినా గంటల తరబడి ట్రాఫిక్ జామే.. వీటన్నింటికీ ప్రధాన కారణం ఇంజినీరింగ్ లోపాలే. రహదారులు, కూడళ్లను శాసీ్త్రయంగా అధ్యయనం చేసి నిర్మించకపోవడం. ట్రాఫిక్ కానీ, నాలాల విషయంలో కానీ మన అధికారులు, పాలకులు ఇంజినీర్ల పాత్ర విస్మరించడంతోనే ఈ పరిస్థితులు దాపురించాయి. నాటి నివేదికలే ఇప్పటికీ దిక్కు నిజానికి ట్రాఫిక్ నియంత్రణ బాధ్యత పూర్తిగా పోలీసులదే అనుకుంటే పొరపాటే. వాస్తవానికి ప్రధాన కూడళ్లలో సిగ్నళ్ల వద్ద నిలబడి ట్రాఫిక్ క్రమబద్ధంగా వెళ్లేందుకు మాత్రమే వారు దోహదపడతారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధించడం వంటివి అదనంగా చేస్తారు. ట్రాఫిక్ సజావుగా, సాఫీగా సాగిపోయేందుకు రోడ్లు, కూడళ్లలోని జంక్షన్లు, ఫ్లైఓవర్లు, ప్రధాన రోడ్లను కలిపే యాక్సెస్ రోడ్లు వంటివి ప్రణాళికాబద్ధంగా రూపొందించకపోవడంతోనే నగరంలో ఈ సమస్యలంటున్నారు ట్రాఫిక్ నిపుణులు. నాలాల విషయంలో ఇంజినీరింగ్ ప్రముఖుడు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1920లో రూపొందించిన నివేదికలే ఇప్పటికీ పనికి వస్తున్నట్లే.. రోడ్ల విషయంలో అలాంటి ప్రణాళికలు లేకపోవడమే ఈ సమస్యకు మూలకారణమని స్పష్టం చేస్తున్నారు. లోపాలతోనే వేగానికి తూట్లు నగరంలో వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వేల కిలోమీటర్ల పొడవున రోడ్లు ఉన్నాయి. విపరీతంగా విస్తరిస్తున్న ప్రధాన రోడ్లు, వాటిని కలిపే యాక్సెస్ రోడ్లు, చిన్నా చితకా రోడ్లతో పాటు చిన్నచిన్న గల్లీలనూ లెక్కేస్తే ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. వీటి నిర్మాణంలో ఎలాంటి ప్రణాళిక లేదన్నది నిపుణులు చెబుతున్న వాస్తవం. అత్యంత ప్రధానమైన రోడ్లలోనూ నానాటికీ రద్దీ పెరిగిపోతోంది. వాటికి సమాంతర రోడ్ల అభివృద్ధి అనే ఊసే లేకపోవడంతో ట్రాఫిక్ అనేక పద్మవ్యూహంలా మారిపోతోంది. వాస్తవానికి నగరంలోని ప్రధాన ఆర్టీరియల్ రోడ్లు (ప్రధాన రహదారులు) అయిన పంజగుట్ట, అమీర్పేట్, బేగంపేట్, సికింద్రాబాద్, తార్నాక తదితర రోడ్లన్నీ వాహనాలు కనీసం గరిష్టంగా 60 కి.మీ. వేగంతో వెళ్లగలిగే సామర్థ్యం ఉన్న పెద్దరోడ్లే. కానీ కేవలం ఇంజినీరింగ్ ప్రమాణాల లోపాలతోనే ఇప్పుడీ రోడ్లన్నీ ట్రాఫిక్ వలయంలో చిక్కిపోతూ సరాసరిన గంటకు కనీసం 30 కిమీ వేగంతోనూ వాహనాలు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నాయి. కిర్లోస్కర్ కమిటీ నివేదికా బుట్టదాఖలే.. నగరంలో 2000వ సంవత్సరం ఆగస్టులో కురిసిన భారీ వర్షం–వరద తీవ్రత ప్రజలతో పాటు ప్రభుత్వానికీ ముచ్చెమటలు పట్టించింది. దీంతో వరద నివారణ చర్యలు సిఫార్సు చేయడానికి 2003లో కిర్లోస్కర్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ అప్పట్లో ఉన్న ఎంసీహెచ్ పరిధిలో వరద నీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలను 170 కిలోమిటర్ల మేర విస్తరణ తక్షణం చేపట్టాలని, అందుకు రూ.264 కోట్లు వ్యయం అవుతుందని తేల్చింది. 2007లో నగర శివార్లలోని పన్నెండు మున్సిపాలిటీలలో మున్సిపల్ కార్పోరేషన్లో విలీనమై జీహెచ్ఎంసీ ఏర్పడింది. ఇలా 625 చ.కి.మీల్లో విస్తరించిన గ్రేటర్కు సమగ్ర మాస్టర్ ప్లాన్, సూక్ష్మస్థాయి వరదనీటి పారుదల, మేజర్, మైనర్ వరద నీటి కాలువ ఆధునీకరణ కోసం సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) బాధ్యతను ఓయంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించారు. దాని ప్రాథమిక అంచనా మేరకు గ్రేటర్లో వరద నీటి సమస్య పరిష్కారానికి అప్పట్లోనే రూ. 6247 కోట్లు అవసరం అవుతాయని తేల్చింది. ఈ నివేదికలు ప్రాథమిక స్థాయిలోనూ అమలు చేయకపోవడంతో ఇబ్బందులు తప్పట్లేదు. ఆ ‘భుజం’కు ఊతమేది? నగరంలో ఎక్కడైనా ప్రమాదం జరిగినా, బస్సు వంటివి బ్రేక్ డౌన్ అయినా గంటల తరబడి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవాల్సిందే. నిజానికి ప్రధాన ఆర్టీరియల్ రోడ్లు ఒక్కోటి 2.5 మీటర్ల వెడల్పుతో కనీసం నాలుగు లైన్లుగా ఉండాలి. దీనితో పాటు ఆ రోడ్డుకు సాంకేతికంగా ‘షోల్డర్స్’ అని పిలిచే ఖాళీ ప్రదేశం ఉండాలి. ఎందుకంటే ఆ మార్గంలో ఏదైనా వాహనం పాడయితే అది మిగతా వాహనాలకు అవాంతరం కాకుండా ఉండేందుకు దాన్ని షోల్డర్స్లో నిలిపి వేస్తారు. కానీ మనదగ్గర ఇవి ఏ ప్రాంతంలోనూ మచ్చుకు కూడా కనిపించవు. ఫుట్పాత్లుగా పిలిచే కాలిబాటలపై ఉన్న ఆక్రమణలను తొలగించి వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలంటూ అనేకసార్లు హైకోర్టు, లోకాయుక్త వంటి వ్యవస్థలు హెచ్చరించాయి. రహదారికి పక్కన తప్పనిసరిగా కాలిబాటలు ఉండాలి. ఫలితంగా పాదచారులు వీటిని ఆశ్రయిస్తే ట్రాఫిక్ జామ్స్ తగ్గడంతో పాటు ప్రమాదాలు అదుపులోకి వస్తాయి. సిటీలో ప్రధాన రోడ్లతో పాటు యాక్సెస్ రోడ్లకూ ఉన్న ఫుట్పాత్లు ఆక్రమణలో ఉన్నాయి. ఇలా జరగడానికి ఇంజినీరింగ్ లోపమే ప్రధాన కారణం. ట్రాఫిక్ టెర్రర్తో నగరంలో నరకం నాలాల సమస్యకు పరిష్కారం శూన్యం ఇంజినీరింగ్ లోపాలే ప్రధాన కారణం ప్రణాళికలు లేని అధికారులు, పాలకులు బుట్టదాఖలైన కిర్లోస్కర్ కమిటీ నివేదిక -
16 మేకల అపహరణ
దోమ: గుర్తు తెలియని దుండగలో కొట్టంలో ఉన్న మేకలను అపహరించుకుపోయారు. ఈ ఘటన దోమ ఠాణా పరిధిలోని ఉదన్రావుపల్లిలో శుక్రవారం వెలుగుజూసింది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన నీరటి సాయిలు మేకలు సాకుతూ జీవనోపాధి పొందుతున్నాడు. గురువారం జీవాలను మేపిన తర్వాత సాయంత్రం పాకలో ఉంచి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం వచ్చి చూడగా 16 మేకలు అపహరణకు గురయ్యాయి. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. కొండముచ్చుకు అంత్యక్రియలు బషీరాబాద్: చెట్టుమీద నుంచి కిందపడి మృతి చెందిన కొండముచ్చుకు శుక్రవారం పర్వత్పల్లిలో యువకులు అంత్యక్రియలు చేశారు. గ్రామంలోని హనుమాన్ ఆలయం దగ్గర చెట్టుమీద నుంచి మరో చెట్టుమీదకు దూకుతున్న క్రమంలో కిందపడి అక్కడికక్కడే మృత్యువాత పడింది. గమనించిన యువకులు కొత్త వస్త్రాలు కట్టించి డప్పు చప్పులతో ఊరేగింపు చేసి గ్రామ శివారులో ఖననం చేశారు. ప్రమాదకరంగా విద్యుత్ తీగలుపరిగి: విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. మండల పరిధిలోని రంగంపల్లిలో నర్సింహులు రైతు పొలంలో మీదుగా 11 కేవీ విద్యుత్ తీగలు చేతికి అందే ఎత్తులో ఉన్నాయి. వానాకాలం సీజన్ సాగులో ట్రాక్టర్ పనుల్లో వాహనాలకు తగిలి ప్రమాదం జరిగే అవకాశం ఉందని.. తీగలను సరి చేయాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి నందిగామ: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని అంతిరెడ్డిగూడ పంచాయతీ పృథ్వీకాలనీలో శుక్రవారం హనుమాన్ ఆలయ ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. హనుమాన్ ఆలయ ఆవరణలో మార్క కుమార్ యాదవ్ ఆర్థిక సహాయంతో నూతనంగా నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీవైస్ చైర్మన్ గణేష్, మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, కొత్తూరు మాజీ ఎంపీపీ మదుసూధన్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ నారాయణ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విఠల్, మాజీ సర్పంచులు అశోక్, కుమార్, మాజీ ఉప సర్పంచ్ కుమార్, కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు తుమ్మల నర్సింహయాదవ్ తదితరులు పాల్గొన్నారు. ట్రాక్టర్ ఢీ.. ద్విచక్ర వాహనదారుడు మృతి మాడ్గుల: ట్రాక్టర్ ఢీకొట్టి ఓ ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని చౌటకుంట తండా సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ వేణుగోపాల్రావు తెలిపిన ప్రకారం.. నర్సంపల్లికి చెందిన పోలే మొగులయ్య(45) తన భార్య, కుమారుడితో కలిసి ఇర్విన్లో ఉన్న బ్యాంకుకు బయలు దేరాడు. మార్గమధ్యలో చౌటకుంట తండా సమీపంలో బైక్ ముందుకు ప్రయాణిస్తున్న ట్రాక్టర్కు ఎదురుగా ఓ ట్రాక్టర్ రావడంతో సైడ్ ఇచ్చేందుకు వెనకాల ఉన్న బైక్ను గమనించకుండా వాహనాన్ని రివర్స్ తీశాడు. దీంతో ద్విచక్రవాహనదారుడి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య, కుమారుడికి స్వల్పగాయాలయ్యారు. కేసు దర్యాప్తులో ఉంది. ఉత్సవాలకు ఆహ్వానం తుక్కుగూడ: రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ ఆలయ వార్షిక వేడుకలు ఈనెల 11 నుంచి నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలకు రావాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డితో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఆహ్వానించారు. ఈ మేరకు శుక్రవారం నగరంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెడ్డిగళ్ల రత్నం, నాయకులు జెల్లాల లక్ష్మయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీ వద్ద పడిగాపులు
దోమ: రాఖీ పౌర్ణమి నేపథ్యంలో విద్యార్థులను ఇంటికి తీసుకువెళ్లేందుకు కేజీబీవీకి వచ్చిన తల్లిదండ్రులకు అసహనానికి లోనయ్యారు. వివరాలు.. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లేందుకు ఉదయం 9గంటలకే సుమారు 40 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. కాగా పాఠశాల విద్యార్థులు గేట్ ఓపెన్ చేయలేదు. మధ్యాహ్నం తర్వాత పంపిస్తామని చెప్పారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చిన వెంటనే పంపించడంతో మిగిలిన వారు ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు. ఉపాధ్యాయుల పరిచయస్తులుంటే వెంటనే పంపించారని మండిపడ్డారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఎంఈఓ పైరవీలతోనే పని చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఎంఈఓ వెంకట్, పాఠశాల ఎస్ఓ శైలజను వివరణ కొరగా.. అనారోగ్యంతో ఇబ్బంది పడేవరానికి, దూర భారం ఉన్నవారిని పంపించామని.. మిగిలిన వారిని మధ్యాహ్న భోజనం తర్వాత పంపిస్తామని చెప్పామన్నారు. విద్యార్థులను పంపకపోవడంతో తల్లిదండ్రుల ఆందోళన -
విద్యుదాఘాతంతో యువరైతు మృతి
● బోరుమోటారు సర్వీస్ వైర్ సరిచేసే క్రమంలో షాక్ ● ముద్దాయిపేటలో విషాదం యాలాల: వ్యవసాయ పొలం వద్ద విద్యుదాఘాతానికి గురై ఓ యువ రైతు మృత్యువాత పడ్డాడు. యాలాల మండలం ముద్దాయిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పాలేపల్లి రమేశ్గౌడ్(38) వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వరి సాగుకు కరిగేట్లు సిద్ధం చేసుకుని శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లాడు. ఈ సమయంలో బోరుకు కరెంటు సరఫరా చేసే సర్వీస్ వైర్ తెగిపడి ఉండటాన్ని గమనించాడు. దీన్ని అతికించే క్రమంలో షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వెళ్తున్న రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా రమేశ్ అప్పటికే చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మృతుడికి భార్య గౌరమ్మ, కొడుకు ప్రదీప్, కూతురు శ్రీజ ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే రమేశ్ మృతిని గ్రామస్తులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. పలు పార్టీల నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రమేశ్ అకాల మరణంతో ముద్దాయిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
కూరగాయలకు వెళ్లి.. వరదనీటిలో మునిగి..
మొయినాబాద్: కూరగాయలు తెచ్చేందుకు ఇంటి నుంచి వెళ్లిన ఓ వలస కూలి వరద నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మొయినాబాద్ ఠాణా పరిధిలోని హిమాయత్నగర్ చౌరస్తాలో శుక్రవారం వెలుగుజూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. నారాయణఖేడ్ జిల్లా దామరగిద్దకు చెందిన వంశిరాజు ఇంద్రప్ప(50), భార్య అంజమ్మతో కలిసి రెండు నెలల క్రితం బతుకుదెరువుకోసం హిమాయత్నగర్కు వలస వచ్చారు. కూలీపనిచేస్తూ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. కాగా గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఇంద్రప్ప కూరగాయలు తేవడానికి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో హిమాయత్నగర్ చౌరస్తాలో రోడ్డుపై వరదనీరు పెద్ద ఎత్తున చేరింది. రోడ్డుపైన నిలిచిన వరదనీటిలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఇంద్రప్ప కల్వర్టు వద్ద గుంతలో పడి నీటిలో మునిగిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో నీటిలోనే మునిగి మృతి చెందాడు. తన భర్త తిరిగి రాలేదని అంజమ్మ రాత్రి సమయంలో పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం తిరిగి వెతుకుతుండగా హిమాయత్నగర్ చౌరస్తాలో ఉడిపి హోటల్ దగ్గర ఉన్న కల్వర్టు గుంతలో మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వలస కూలి మృతి -
భారీ వర్షం.. పంటలకు నష్టం
విన్యాసాలు అదుర్స్స్వచ్ఛ శంకర్పల్లిలో భాగస్వాములుకండి దోమ: భారీ వర్షానికి పంటలు పాడయ్యాయి. అప్పులు తెచ్చి సాగు చేపడితే ఏకదాటి వర్షానికి నేలకొరిగాయి. గురువారం సాయంత్రం మండల పరిధిలోని ఆయా గ్రామాలలో గంటపాటు వర్షం కురిసింది. ఈ క్రమంలో మొక్కజొన్న, పత్తి పంటల్లో నీరు చేరాయి. దీంతో పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. పరిహారం అందించాలి మండల వ్యాప్తంగా 36 పంచాయతీల్లో పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేశారు.ండల పరిధిలోని 1,118 ఎకరాల్లో మొక్కజొన్న, 1,830 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. నాలుగు ఎకరాల్లో.. నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. గురువారం కురిసిన వర్షానికి పంట మొత్తం పాడైంది. అప్పు తెచ్చి సాగు చేశాం. అప్పులు తీర్చే మార్గం ఆవేదన చెందుతున్నాం. అధికారులు పంట నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలి. – బాల్రాజ్, రైతు, బొంపల్లి పరిహారంపై స్పష్టత లేదు రైతులు అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించే విషయంలో స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే క్షేత్ర స్థాయిలో పరిశీలించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటాం. – ప్రభాకర్రావు, ఏఓ, దోమన్యాయవాది బలవన్మరణం ● ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని ఆత్మహత్య ● చర్లపటేల్గూడలో విషాదం ఇబ్రహీంపట్నం: ఆర్థిక ఇబ్బందులతో ఓ న్యాయవాది బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో గురవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపటేల్గూడకు చెందిన న్యాయవాది పి.నరేందర్గౌడ్(34)కు ఇదే వృత్తిలో ఉన్న చంద్రికతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఇరువురూ ఇబ్రహీంపట్నం న్యాయస్థానంలో కేసులు వాదిస్తున్నారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న నరేందర్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. గురువారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో కోర్టుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. అతన్ని వెతుకుతున్న క్రమంలో తమ వ్యవసాయ క్షేత్రంలోని పశువుల కొట్టంలో ఉరేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాడీని ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ఇబ్రహీంపట్నం: గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో దేశ రక్షణ, వాయుసేన దళాలు శుక్రవారం ప్రత్యేక విన్యాసాలు నిర్వహించాయి. హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రానికి చెందిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ), భారత రక్షణ వాయుసేన (ఐఏఎఫ్) సంయుక్తంగా హెలికాప్టర్ల సాయంతో శ్రీహై–ఇంటెన్సిటీ రూఫ్ టాప్ స్లిదరింగ్శ్రీ పేరిటన విన్యాసాలు ప్రదర్శించాయి. ఉగ్రమూకల దాడులు, యుద్ధ పరిస్థితులు, ప్రమాద సంఘటనలు చోటుచేసుకుంటే విపత్కర, అత్యవసర సమయాల్లో ప్రజలను ఏ విధంగా కమాండోలు కాపాడతారో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల వైస్ చైర్మన్ గగన్దీప్ సింగ్ కోహ్లి, ఎండీ హెచ్ఎస్ సైనీ, ఎన్ఎస్జీ దళాల కమాండోలు, అధికారులు పాల్గొన్నారు. నేలకొరిగిన పత్తి, మొక్కజొన్న పరిహారం అందించాలని రైతుల వినతి -
పారదర్శకంగా నిర్వహించాలి
అనంతగిరి: ఉపాధ్యాయుల పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి సుదర్శన్ కోరారు. శుక్రవారం వికారాబాద్లో యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వం అర్హత లేని వారికి 3 జిల్లాల్లో డీఈఓలుగా నియమించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర సహ అధ్యక్షుడు దేవయ్య, నాయకులు జాంప్లా, శివప్ప, బాలకృష్ణ, బాబు శ్రీనివాస్, వీరయ్య సంతోష్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మనువాదాన్ని వ్యతిరేకించాలి
కందుకూరు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితులపై దాడులు జరుగుతున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా మైనార్టీ వర్గాలపై దాడులకు తెగబడుతుందని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాశ్ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో కందుకూరు, మహేశ్వరం, తలకొండపల్లి మండలాలకు సంబంధించిన ప్రజాసంఘాలతో కేవీపీఎస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దళిత టీచర్లతో అయ్యప్ప మాల వేసిన విద్యార్థి కాళ్లు మొక్కించి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. గుడుల్లో దళితులకు ప్రవేశం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ ప్రవేశిస్తే ఆలయాలను శుద్ధి చేస్తున్నారన్నారు. ఇదంతా కేంద్రంలో మోదీ, అమిత్షా పాలనతోనే జరుగుతుందని విమర్శించారు. మతోన్మాదానికి, మనువాదానికి వ్యతిరేకంగా ప్రజలందరిని చైతన్య పరచడానికి ఈ నెల 13న ఇబ్రహీంపట్నంలోని పాషా నరహరి స్మారక కేంద్రంలో జిల్లా సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సుకు కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్వెస్లీ హాజరవుతున్నారన్నారు. సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ బుట్టి బాల్రాజ్, కేవీపీఎస్ మండలాల కన్వీనర్లు ఏర్పుల శేఖర్, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాశ్ -
బీసీలు అన్ని రంగాల్లో రాణించాలి
షాబాద్: బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధించాలని బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో బీసీసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం బీసీసేన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎనుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా కడుమూరు విఠలయ్య, ఉపాధ్యక్షుడిగా కడుమూరి అశోక్, ప్రధాన కార్యదర్శిగా కావలి రాములు, కోశాధికారిగా కావలి సత్తయ్యలను ఎనుకున్నారు. యువజన కమిటీ అధ్యక్షుడిగా కావలి సందీప్, ప్రధాన కార్యదర్శిగా కడుమూరి ఆనంద్, ఉపాధ్యక్షుడిగా మహేందర్, కార్యదర్శిగా బుగ్గరాములు, కోశాధికారిగా ఉండాల మల్లేష్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు కృష్ణ మాట్లాడుతూ.. ఆధిపత్య పోరుతోనే బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడుతున్నారని చెప్పారు. అందుకే బీసీలకు అండగా ఆర్.కష్ణయ్య ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి బీసీలను బలోపేతం చేస్తున్నామన్నారు. బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, మండల అధ్యక్షులు దయాకర్చారి, యూత్ అధ్యక్షుడు అజయ్కుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ -
సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం
యాచారం: సీసీ కెమెరాలుంటే పోలీస్ నిఘా ఉన్నట్లేనని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు పేర్కొన్నారు. మండల పరిధిలోని తక్కళ్లపల్లిలో గురువారం సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రతి ఇంటి వద్ద సీసీ కెమెరాలు బిగించుకోవాలని సూచించారు. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, యువకులు సమష్టిగా డబ్బులు జమ చేసి గ్రామాల్లోని ప్రధాన కూడళ్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలు జరిగిప్పుడు సులభంగా నేరస్తులను గుర్తించే అవకాశం ఉందన్నారు. సీసీ కెమెరాలుంటే నేరాలు, చోరీలు తగ్గుముఖం పడుతాయన్నారు. యాచారం మండలంలోని 24 గ్రామ పంచాయతీలు, మరో 20కి పైగా అనుబంధ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతల సహకారం కోరనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి, ఎస్ఐ మధు, గ్రామస్తులు శ్రీశైలం, సంతోష, మల్లేష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు -
42శాతం రిజర్వేషన్ల సాధనకు పోరు
కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య దుద్యాల్: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేరుగు వెంకటయ్య పేర్కొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన రెండు రోజుల ధర్నా కార్యక్రమానికి కొడంగల్ నియోజకవర్గంలోని బీసీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు గురువారం ఫోన్లో సాక్షితో మాట్లాడారు. రాష్ట్ర బీసీ సంఘం నాయకుడు శ్రీకాంత్గౌడ్తో కలిసి రాష్ట్రపతి భవన్ వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లతో పాటు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును కేంద్రం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొడంగల్ తాలూకా బీసీ సంఘం అధ్యక్షుడు మన్నె బస్వరాజ్యాదవ్, బీసీ సంఘం నాయకులు యాదగిరి, సత్యపాల్, కృష్ణ, మన్సూర్, రాజు, కాశి యాదవ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత దుద్యాల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఎస్ఐ యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. పోలేపల్లి గ్రామానికి చెందిన రెబ్బని శ్రీకాంత్ తన ట్రాక్టర్తో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్నారు. దుద్యాల్ మీదుగా హకీంపేట్కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మీసేవ నిర్వాహకులపై ఫిర్యాదు ధారూరు: మండల కేంద్రంలోని మీసేవ నిర్వాహకులు అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఓ బాధితుడు గురువారం తహసీల్దార్ సాజిదాబేగంకు ఫిర్యాదు చేశారు. కొత్త రేషన్కార్డు కోసం దరఖాస్తు చేయడానికి వెళితే రూ.45కు బదులు రూ.60 తీసుకుంటున్నారని దోర్నాల్ గ్రామానికి చెందిన మహిపాల్ వాపోయాడు. ఇంతకుముందు కూడా తహసీల్దార్కు ఫిర్యాదు చేస్తే తూతూమంత్రంగా నిర్వాహకులను బెదిరించినట్లు చేసి వదిలివేశారని ఆరోపించారు. ప్రస్తుతం కొత్త రేషన్కార్డుల కోసం, పాత కార్డుల్లో ఉన్న కొంతమంది పేర్లు తొలగించడానికి వందల సంఖ్యలో వస్తున్నారని, వీరి నుంచి నిత్యం అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ నిర్వహించేందుకు ఆర్ఐని పంపిస్తున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్ తెలిపారు.కలివివనం పాట ఆవిష్కరణ చేవెళ్ల: పర్యావరణ పరిరక్షణను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలనే కాన్సెప్ట్తో తీసిన కలివివనం సినిమా అందరినీ ఆలోచింపజేస్తుందని చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి, సినీ నటుడు బిత్తిరి సత్తి అన్నారు. పట్టణంలోని కేజీఆర్ గార్డెన్లో గురువారం సాయంత్రం చేవెళ్ల ప్రాంతానికి చెందిన నిర్మాతలు మల్లికార్జున్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి ఏఆర్ క్రియేషన్పై నిర్మించిన చిత్రంలోని ఓ పాటను ఆవిష్కరించారు. స్థానిక వివేకానంద కశాళాల యాజమాన్యం ఆధ్వర్యంలో స్థానిక నాయకులు సీడీని విడుదల చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ రాజ్నరేంద్ర, సినిమా హీరోయిన్ నాగదుర్గ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆగిరెడ్డి, బీజేపీ మున్సిప ల్ అధ్యక్షుడు అనంతరెడ్డి, సీనియర్ నటుడు గాంధీ, చిత్ర యూనిట్ సభ్యులు, చేవెళ్ల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కుమార్తె వెళ్లిపోయిందని.. మనస్తాపంతో తండ్రి ఆత్మహత్యరాంగోపాల్పేట్: అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమార్తె పైళ్లెన వ్యక్తితో వెళ్లిపోవడంతో మనస్తాపానికి లోనైన ఆమె తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెంగళరావునగర్కు చెందిన జంగిటి రామస్వామి (50) ఆటో డ్రైవర్గా పని చేస్తుండగా అతడి భార్య లక్ష్మి బుద్ధభవన్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో స్వీపర్గా పని చేస్తుంది. గత నెల 30న అతడి కుమార్తె పైళ్లెన వ్యక్తితో వెళ్లిపోయింది. దీంతో రామస్వామి రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో మనస్తాపానికి లోనైన రామస్వామి బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. గురువారం ఉదయం లక్ష్మి భర్తను నిద్ర లేపేందుకు వెళ్లి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి
కొడంగల్ రూరల్: విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని కొడంగల్ ఎంజేపీటీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సూచించారు. గురువారం మండల పరిధిలోని ఉడిమేశ్వరం గ్రామ సమీపంలో ఉన్న కొడంగల్ ఎంజేపీటీ కళాశాల, దౌల్తాబాద్ ఎంజేపీటీ పాఠశాలల్లో నిర్వహించిన నూతన విద్యార్థుల స్వాగత కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు పొందాలని సూచించారు. గతేడాది ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి వారికి బహుమతులు అందించారు. అనంతరం విద్యార్థులు నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ సాంఘిక సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్, ఎంజేపీ కొడంగల్ పాఠశాల ప్రిన్సిపాల్ నగేశ్, ఏటీపీ రేఖ్య నాయక్, కాశప్ప, ఉపాధ్యాయులు అనంతరాములు,నరేశ్, విజయ్, కిషన్, అశ్విని, మాణేప్ప, రాధ, రాములు, వెంకటేశ్, అనిల్, నరేందర్, రత్నం తదితరులు పాల్గొన్నారు.ఎంజేపీటీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ -
ఆప్యాయతల ‘రక్షాబంధన్’
సోదరి కష్టసుఖాల్లో అనుక్షణం తోడుగా ఉండేందుకు సోదరులకు కట్టే రక్షాబంధన్ పర్వదినం రానే వచ్చేసింది. అనురాగం, ఆప్యాయతల మేళవింపులో జరుపుకొనే అపూర్వ వేదికకు ప్రతి తోబుట్టువు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పర్యావరణహితంగా పండుగను నిర్వహించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.షాబాద్: అక్కాచెల్లెళ్లు.. అన్నాదమ్ములకు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకుంటారు.. ఏటా రాఖీ పండుగను ఘనంగా జరుపుకొంటారు.. విదేశాల్లో ఉన్న వారు కూడా రక్షాబంధన్కు ఇక్కడికి వచ్చి అన్నాదమ్ములకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపిస్తారు. శనివారం జరుపుకొనే రాఖీ పండుగకు ఆడపడుచులు పుట్టింటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తల్లిదండ్రుల తర్వాత అనుబంధం, అనురాగం, ఆప్యాయత తోబుట్టువుల మధ్య ఉంటుంది. ఇంటి ఆడపడుచుల సుఖాసంతోషాలే తమ సంతోషంగా భావిస్తారు. సోదరులు ఇంతటి విశిష్టమైన అనుబంధానికి ప్రతీకగా, సోదరుల క్షేమం కోరుతూ ఏటా శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున రక్షాబంధన్ నిర్వహిస్తారు.మొదలైన సందడిఅనుబంధాలకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చే హిందూ సంస్కృతిలో రక్షాబంధన్కు విశిష్టమైన స్థానం ఉంది. సోదరి, సోదరుల అనురాగానికి చిహ్నంగా ఈ వేడుక జరుపుకొంటారు. ఇళ్లల్లోనే కాకుండా ఆలయాల్లో, సామూహిక వేదికల వద్ద ఈ పర్వదినాన్ని ఆనందోత్సహాల నడుమ నిర్వహించుకోనున్నారు. బాలికలు, యువతులు, మహిళలు అంతా రాఖీ బంధన్ వేడుకను నిర్వహించేందుకు నాలుగు రోజుల ముందు నుంచే ఆడపడుచులు ఉత్సాహంగా రాఖీలు కోనుగోలు చేయడం మొదలుపెట్టారు.దీక్ష సంకల్పమే రక్షఏదైనా కార్యక్రమం నిర్వహించ తలపెట్టినప్పుడు రక్షను ధరించడం హైందవ ఆచారం. ఆ కార్యక్రమం ఏ విఘ్నాలు లేకుండా సజావుగా సాగాలని, అనుక్షణం లక్ష్యాన్ని గుర్తు చేసేందుకు ఈ రక్షను ధరిస్తారు. వివాహం, యజ్ఞయాగాదులు, వ్రతాలు, నోములు తదితర కార్యక్రమాల్లో ఈ రక్షాధారణ తప్పనిసరి. పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే భర్తలకు భార్యలు, సోదరుల క్షేమాన్ని కాంక్షిస్తూ సోదరీమణులు రక్షలు కట్టేవారు. ఆనాటి నుంచి ఆనవాయితీగా ఈ ఆచారం వస్తోంది.జోరుగా రాఖీల విక్రయాలుఅన్నాచెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ దగ్గర పడుతుండడంతో మండలంలో రాఖీల క్రయ విక్రయాలు జోరందుకున్నాయి. మారుతున్న కాలానికి, అభిరుచులకు అనుగుణంగా, దుకాణదారులు పలు డిజైన్లల్లో రాఖీలు అందుబాటులో ఉంచారు.ప్రకృతి మెచ్చిన ‘వృక్షాబంధన్’కడ్తాల్: ప్రకృతికి మానవాళి రక్షణగా ఉండాలనే గొప్ప సంకల్పంతో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ వినూత్నంగా గత 12 ఏళ్లుగా విద్యార్థులతో కలిసి చెట్లకు రాఖీలు కట్టి వృక్షాబంధన్ నిర్వహిస్తోంది. ప్రకృతికి మానవాళికి మధ్య సైతం అనుబంధం పెంపొందాలనే సదుద్దేశంతో వృక్షాబంధన్ కార్యక్రమం ఏటా దిగ్విజయంగా కొనసాగుతుంది. పిల్లలు, యువకులు, గ్రామస్తులు, విద్యార్థులు అందరి ఆధ్వర్యంలో పర్యావరణ హితంగా ‘నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష... మనమంతా భూమాతకు రక్ష’ అనే గొప్ప సంకల్పంతో వృక్షాబంధన్ కార్యక్రమం నిర్వహిస్తారు.ఆవు పేడతో రాఖీలుతాండూరు టౌన్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలాంటి హాని కలుగచేయని వస్తువులను వినియోగించాలని ప్రకృతి ప్రేమికులు పదే పదే చెబుతుంటారు. ఈ క్రమంలోనే మరో ముందడుగు వేసి ఆవు పేడ, మూత్రంతో ఏకంగా రాఖీలను తయారు చేశారు. పర్యావరణాన్ని రక్షించుటతో హిందూ సంప్రదాయ పండగలు సైతం తమ వంతు పాత్ర పోషిస్తాయనేది సహజసిద్ధంగా తయారు చేసిన రాఖీలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాండూరు పట్టణ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కొట్రిక విజయలక్ష్మి ఏటా పర్యావరణ పరిరక్షణకు తన వంతు బాధ్యతగా ఆవు పేడ, మూత్రంతో తయారు చేసిన రాఖీలను సోదరులకు కట్టాలని ఆమె చెబుతున్నారు. ఈ రాఖీలు తిరిగి భూమిలోకి చేరి మట్టి సారవంతాన్ని పెంపొందిస్తాయంటున్నారు. పరిగి ప్రాంతానికి చెందిన శివరామకృష్ణా చారి అనే వ్యవసాయ విద్య అభ్యసించిన ఓ యువకుడు దీర్ఘాయుష్షు అనే సంస్థను నెలకొల్పి ఆవుపేడ, మూత్రంతో రాఖీలను తయారు చేసి, పర్యావరణ పరిరక్షణపై తన వంతు బాధ్యతను బహిర్గతం చేస్తున్నారు. ఇలాంటి రాఖీలు మార్కెట్లో విక్రయానికి సైతం పెట్టడం విశేషం. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ సూచించారు. గురువారం వికారాబాద్లోని సంగం లక్ష్మీబాయి రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన ట్రైనీ కలెక్టర్ హర్షచౌదరితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు విద్యా బోధన ఎలా చెబుతున్నారని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. పరిశుభ్రమైన తాగునీటిని వాడాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ -
శభాష్.. అమృత
దుద్యాల్: ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత జనార్దన్ అన్నారు. ఇటీవల మండలంలోని కుదురుమల్ల గ్రామానికి చెందిన రాసూరి అమృత బీఎస్ఎఫ్లో చేరడంతో గురువారం ఆమెను స్థానిక పాఠశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సమ్మ, రాములు దంపతులు వారి కూతురు అమృతను దేశ రక్షణ కోసం పంపడం గొప్ప విషయమన్నారు. అనంతరం అమృత మాట్లాడుతూ.. ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సాయప్ప, ఉపాధ్యాయులు వేణుగోపాల్, శ్రీనివాస్, మంజుల, తిరుపతి, శివకుమార్, శ్రీనివాస్, లత, గ్రామస్తులు పాల్గొన్నారు. -
‘రైతు బజారు’పాలు
వికారాబాద్: రైతు బజార్లలో సమస్యలు తిష్ట వేశాయి. కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించే అన్నదాతలు కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు. సంతలు, మార్కెట్లు మరీ అధ్వానంగా మారాయి. రైతులతో పాటు కొనుగోలుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా కేంద్రం వికారాబాద్లోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నా.. కూరగాయల మార్కెట్, రైతు బజార్లలో తాగునీటి వసతి కూడా లేదు. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఇక్కట్ల పాలవుతున్నారు. ఆయా గ్రామాల నుంచి తెల్లవారుజామునే అన్నదాతలు పంట ఉత్పత్తులతో మార్కెట్లకు చేరుకుంటారు. వికారాబాద్లోని మహాశక్తి థియేటర్ ముందు ఉన్న మార్కెట్కు, రైతు బజార్కు, కూరగాయల మార్కెట్లో వ్యాపారాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వీటన్నింటిలోనూ సమస్యలు తాండవం చేస్తున్నాయి. తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పేరుకే రైతు బజార్లు.. అక్కడ షెడ్లు కూడా లేవని అన్నదాతలు అంటున్నారు రోజంతా ఎండలోనే కూరగాయలు విక్రయించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగిన ‘ఇంట్రిగేటెడ్’ గత ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను మంజూరు చేసింది. జిల్లాలోని నాలుగు మున్సిపల్ కేంద్రాల్లో నాలుగేళ్ల క్రితం ఇందుకు సంబంధించిన పనులను ప్రారంభించారు. కొన్ని చోట్ల పిల్లర్ దశలో పనులు ఆగిపోగా.. మరికొన్ని చోట్ల ప్రారంభమే కాలేదు. మరో చోట చేసిన పనులకు బిల్లులు రాక.. వచ్చిన డబ్బులో తమకూ వాటా కావాలని ప్రజా ప్రతినిధులు పేచీ పెట్టడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేసి పారిపోయాడు. వికారాబాద్ పట్టణంలో పిల్లర్ దశలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం రైతులు ఎండలో కూరగాయలు విక్రయిస్తున్నారు. పరిగిలో స్లాబ్ వేసి వదిలేశారు. తాండూరులో పనులు ప్రారంభించి మిన్నకుండిపోయారు. కొడంగల్లో ప్రారంభించలేదు. రూ.3 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు.. గత ప్రభుత్వం ఒక్కో మున్సిపాలిటీలో రూ.3 కోట్ల నుంచి రూ.6 కోట్లు వెచ్చించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించాలని భావించింది. పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో రెండెకరాల విస్తీర్ణంలో మార్కెట్ నిర్మించాలని నిర్ణయించారు. వికారాబాద్, తాండూరు పట్టణాల్లో జనాభా, అవసరాలను బట్టి ఐదు నుంచి ఆరు ఎకరాల్లో నిర్మించేలా ప్లాన్ చేశారు. నాలుగేళ్ల క్రితం స్థలాలను పరిశీలించి 2021లో టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. ఆ తర్వాత పనులు ప్రారంభమైనా నత్తనడకనే సాగాయి. ఎక్కడా పిల్లర్, స్లాబ్ దశ దాటనేలేదు. ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను పూర్తి చేయాలని ఆయా ప్రాంతాల రైతులు, ప్రజలు కోరుతున్నారు. మార్కెట్లలో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ కూరగాయల విక్రయాలు తాగునీటికీ తప్పని అవస్థలు నాలుగేళ్లుగా పూర్తికానిఇంటిగ్రేటెడ్ మార్కెట్లు అన్ని మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి -
దంచికొట్టిన వాన
విరిగి పడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు దోమ: మండల వ్యాప్తంగా గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దోమ – ఊటుపల్లి మార్గంలో చెట్లు విరిగి పడటంతో వాహ నాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పంచాయతీ కార్యదర్శి రవి జేసీబీ సాయంతో చెట్లను తొలగించారు. వికారాబాద్లో భారీ వర్షం అనంతగిరి: వికారాబాద్ పట్టణం, పరిసర ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం పడింది. దీంతో ప్రధాన రోడ్లన్నీ జ లమయంగా మారాయి. పలు చోట్ల వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ధారూరులో.. ధారూరు: మండలంలో భారీ వర్షం పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. పది రోజుల నుంచి వాన జాడ లేక కంది, పత్తి, పెసర, మినుము, మొక్కజొన్న తదితర పంటలు ఎండుముఖం పట్టాయి. ప్రస్తుత వర్షం పంటలకు మేలు చేస్తుందని రైతులు తెలిపారు. హరిదాస్పల్లి, ధారూరు సమీపంలోని వాగులు ఉధృతంగా ప్రవహించాయి. జోరు వాన తాండూరు రూరల్: తాండూరు, పెద్దేముల్ మండలాల్లో గురువారం జోరు వర్షం పడింది. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తి, కంది పంటలకు ప్రస్తుత వర్షాలు జీవం పోశాయని అన్నదాతలు పేర్కొన్నారు. ధారూరు: చింతకుంట – హరిదాస్పల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగు అనంతగిరి: జైదుపల్లి సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు -
ప్రైవేటుకు ‘ఇందిరమ్మ’ ఇసుక..!
బషీరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సమస్య ఉండొద్దని భావించిన ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు అక్రమార్కులు లబ్ధిదారుల పేరిట అక్రమ దందా సాగిస్తున్నారు. ప్రైవేటు నిర్మాణాలకు భారీగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని నావంద్గీ ఇసుక రీచ్ నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతోంది. మంతట్టి నుంచి ఇందర్చెడ్ వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర కాగ్నా నదీ పరివాహక ప్రాంతం ఉంది. నావంద్గీ వద్ద ఇసుక రీచ్ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు అనుమతులు ఇస్తుంటారు. కొంతమంది వాపారులు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను రెవెన్యూ కార్యాలయంలో చూపి అనుమతులు పొందుతున్నారు. అనంతరం ప్రైవేటు నిర్మాణాలకు ఇసుక తరలించి ప్రభుత్వ ఆదాయానికి భారీ గా గండి కొడుతున్నారు. బషీరాబాద్, నావంద్గీ, మంతన్గౌడ్, కొర్విచెడ్, పర్వత్పల్లి, నీళ్లపల్లి, బాబునాయక్ తండా, అల్లాపూర్, దామర్చెడ్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక తరలించాల్సి ఉందని 40 ట్రాక్టర్లకు అనుమతులు తీసుకున్నారు. ఆ పత్రాలు చూపి యథేచ్ఛగా ఇసుక దందా చేస్తున్నారు. కాగ్నాను తోడేస్తున్న తోడేళ్లు కాగ్నా పరీవాహక గ్రామాలైన మంతట్టి, కంసాన్పల్లి(ఎం), జీవన్గీ, క్యాద్గీరా, గంగ్వార్, ఇందర్చెడ్, మైల్వార్, ఎక్మాయి, అల్లాపూర్, దామర్చెడ్, కొత్లాపూర్ నుంచి ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక తరలింపునకు ఎలాంటి అనుమతులు లేవు. కానీ ఈ గ్రామాల నుంచి నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుక ను అక్రమంగా తరలిస్తున్నారు. బాద్లాపూర్, కాశీంపూర్, కుప్పన్కోట్ గ్రామాలకు, తాండూరు మండలం గోనూరు నుంచి కూడా రాత్రి వేళల్లో దొంగతనంగా ఇసుక రవాణా చేస్తున్నారు. నిద్ద్దరోతున్న యంత్రాంగం చీకటి పడగానే కాగ్నాపై ఇసుక తోడేళ్లు పంజా విసురుతున్నాయి. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఈ విషయం రెవెన్యూ, పోలీసు అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో ఒక ట్రాక్టర్ ఇసుకను రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. పోలీసుల దాడుల్లో ట్రాక్టర్లు పట్టుబడితే రూ.5 వేలు జరిమానా కట్టి మరుసటి రోజు నుంచే మళ్లీ దందా సాగిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లబ్ధిదారుల పేరుతో దందా కాగ్నా నుంచి భారీగా తరలింపు కాసులు కొల్లగొడుతున్న అక్రమార్కులు చోద్యం చూస్తున్న రెవెన్యూ, పోలీస్ శాఖలు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కేసులు పెడతాం ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇస్తున్న ఇసుకను ప్రైవేటు అవసరాలకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ట్రాక్టర్లను కూడా సీజ్ చేస్తాం. ఇసుక రీచ్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ట్రాక్టర్ డ్రైవర్లు ఇసుక ఎక్కడ డంప్ వేస్తున్నది మాకు తెలియదు. ఎవరికి అనుమతులు ఇచ్చామో వారి ఇళ్లకు ఇసుక చేరిందా లేదా అని పరిశీలిస్తాం. తప్పు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. – షాహెదాబేగం, తహసీల్దార్ -
భవన లీకేజీలను అరికట్టండి
అనంతగిరి: వికారాబాద్ పట్టణలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ను గురువారం కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనశాల, తరగతి గదులను పరిశీలించారు. వర్షాలకు భవనం ఉరుస్తుండటం చూసి వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేయాలని సూచించారు. అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఎండబ్ల్యూఓ రాజేశ్వరి, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమేష్, ప్రిన్సిపాల్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతీక్ జైన్ -
విశ్వనాథం సేవలను మరువలేం
అనంతగిరి: వికారాబాద్ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత నేత విశ్వనాథం పాత్ర మరువలేమని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. సర్పంచ్గా, మున్సిపల్ చైర్మన్గా ప్రజలకు సేవ చేశారని కొనియాడారు. గురువారం వికారాబాద్లోని సత్యభారతి గార్డెన్లో విశ్వనాథం ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విశ్వనాథం 103 సంవత్సరాలు జీవించడంతో పాటు మరో 100 సంవత్సరాలు ప్రజలు చెప్పుకునే మంచి పనులు చేశారన్నారు. నాలుగు సార్లు వికారాబాద్ మేజర్ గ్రామ పంచాయతీకి ఏకగ్రీవంగా సర్పంచ్ అయ్యారంటే ఆషామాషీ కాదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ కిషన్నాయక్, నాయకులు బస్వరాజు, రాంచంద్రారెడ్డి, సురేష్, రెడ్యానాయక్ తదితరులు పాలొన్నారు. స్పీకర్ ప్రసాద్కుమార్ -
హామీల అమలుకు పోరాటం
మాడ్గుల: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని గురువారం మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మండల కేంద్రంలో భారీ ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయాలనికి తరలివెళ్లి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి మాట్లాడుతూ.. వృద్ధులు, దివ్యాంగుల పెన్షన్లు పెంచాలని, రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లు చెప్పుకొంటుందన్నారు. హామీల అమలుకు ఈ నెల 30 న చలో కొండారెడ్డిపల్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండె హరిప్రసాద్, మండల అధ్యక్షుడు పెద్దయ్య యాదవ్, నాయకులు రామకిషన్, వెంకటేశ్, నర్సింహ, శ్రీను, వెంకన్న, అశోక్, సునీల్, రాజు, భూపేశ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ కమిషన్ జాతీయ మాజీ సభ్యుడు ఆచారి -
ఏ ఒక్క దరఖాస్తూ పెండింగ్లో ఉండొద్దు
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ధారూరు: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో రైతులు ఇచ్చిన దరఖాస్తులను ఆగస్టు 14వ తేదీ నాటికి క్లియర్ చేయాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ఆదేశించారు. గురువారం ధారూరు రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించి భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం తహసీల్దార్, డీటీ, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఇచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలన్నారు. ఎవరికీ అన్యాయం జరుగకుండా చూసుకోవాలని సూచించారు. ఏ ఒక్క దరఖాస్తు పెండింగ్లో పెట్టరాదని ఆదేశించారు. అనంతరం కార్యాలయానికి వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సాజిదాబేగం, డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, ఆర్ఐలు స్వప్న, దేవేందర్రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ బంక్కు స్థలం కేటాయింపు దుద్యాల్: మండలంలోని హకీంపేట్లో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంక్ కోసం గురువారం తహసీల్దార్ కిషన్ స్థలాన్ని కేటాయించారు. గ్రామ శివారులో సర్వే నంబర్ 256లో 20 గుంటల ప్రభుత్వ భూమిని కేటాయించారు. మండలంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఇక్కడ పెట్రోల్ బంక్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ఆర్ఐ నవీన్కుమార్, ఏపీఎం బందెయ్య, సీసీ సంజీవ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, చాకలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వద్దుడీపీఓ జయసుధ దోమ: గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించరాదని డీపీఓ జయసుధ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. గురువారం దోమ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, శ్మశానవాటికను పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్కు సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కాలనీలో బ్లీచింగ్ పౌడర్ చల్లించాలన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గ్యామా తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ పట్టణ కార్యదర్శిగా తేజ అనంతగిరి: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వికారాబాద్ నగర కమిటీ కార్యదర్శిగా తేజను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా ఽశాఖలకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థి సమస్యలపై పోరాటం కొనసాగుతుందని తెలిపారు. -
భార్యాభర్తలపై కత్తితో దాడి
మొయినాబాద్: పశువుల మేత విషయంలో చోటుచేసుకున్న దాడిలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మొయినాబాద్కు చెందిన మహ్మద్ హఫీజ్, మహ్మద్ వాజిద్ ఖురేషీ ముర్తూజగూడ రెవెన్యూలోని షమ్స్ కాలనీలో ఇళ్లు కట్టుకుని, కుటుంబాలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇరువురి వద్దా మేకలు, గేదెలు, ఆవులు ఉన్నాయి. కాలనీలోని ఖాళీ ప్లాట్లలో వీటిని మేపుతుంటారు. బుధవారం ఉదయం వాజిద్ తన మేకలు, గేదెలను ఓ ప్రాంతంలోని ఖాళీ ప్లాట్లలో కట్టేశాడు. ఇది గమనించిన హఫీజ్, అతని కొడుకు అఫ్రోజ్ ముందు నుంచీ తమ పశువులను ఇక్కడే మేపుతున్నామని, నీవెందుకు కట్టేశావని వాజిద్తో గొడవ పడ్డారు. మాటామాటా పెరగడంతో అఫ్రోజ్ తమ ఇంట్లో నుంచి కొమ్మలు కొట్టే కత్తి తీసుకొచ్చి తండ్రికి ఇచ్చాడు. ఇద్దరూ కలిసి పక్కింట్లో ఉండే వాజిద్పై దాడి చేశారు. అడ్డుకోబోయిన అతని భార్య రఫియాను సైతం కత్తితో గాయపర్చారు. దీంతో వాజిద్ తల, మెడ, ఛాతితో పాటు శరీరంపై గాట్లు పడ్డాయి. రఫియా తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఇరువురిపైనా హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పశువుల మేత విషయంలో గొడవ పోలీసుల అదుపులో తండ్రీకొడుకులు ఇద్దరిపైనా హత్యాయత్నం కేసు నమోదు -
పన్ను చెల్లింపుతోనే అభివృద్ధి
అనంతగిరి: గ్రంథాలయాలను అభివృద్ధి పరిచేందుకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు లైబ్రరీ పన్నులను తప్పనిసరిగా వసూలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ అధికారులను ఆదేశించారు. బుధవారం గ్రంథాలయ పన్ను వసూలు కమిటీతో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) తన ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయ సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు పన్ను మాత్రమేనని, వసూలును బట్టి జిల్లాలో అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు చెల్లించాల్సిన గ్రంథాలయ పన్నులను సకాలంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ఐదేళ్లుగా చెల్లించాల్సిన గ్రంథాలయ బకాయి పన్నును చెల్లించే దిశగా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. గ్రంథాలయాలను జ్ఞానాన్ని పెంపొందించే దిశగా తీర్చి దిద్దాలని, భవిష్యత్ తరాలకు కూడా ఎంతగానో ఉపయోగపడే విధంగా చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాస్బాబు, గ్రంథాలయ కార్యదర్శి సురేష్, మున్సిపల్ కమిషనర్లు బలరాంనాయక్, విక్రమ్ సింహారెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ సుధీర్ -
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి
పరిగి: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన పట్టణ కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మోహనకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన ఎర్రవాపుల సాయిరెడ్డి(76) పని నిమిత్తం పరిగికి వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఆటో స్టాండ్కు బయలు దేరాడు. పరిగి నుంచి షాద్నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బహార్పేట చౌరస్తాలో ఆయన్ని ఢీకొంది. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం నగరానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య సుశీలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.సబితారెడ్డిని అవమానించడం తగదుతాండూరు: మాజీ మంత్రి సబితారెడ్డిని అధికారిక కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సందల్ రాజుగౌడ్ పేర్కొన్నారు. బుధవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. మహేశ్వరంలో జరిగిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలను మంత్రి పక్కన కూర్చుబెట్టుకోవడం సరికాదన్నారు. మహిళ అని చూడకుండా మాజీ మంత్రి సబితారెడ్డిని అవమానించడం తగదన్నారు. బీఆర్ఎస్ నాయకులు తలచుకొంటే ఇన్చార్జ్ మంత్రిని చేవెళ్ల గడ్డపై తిరగనివ్వమన్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందన్నారు.చోరీ కేసులో మూడేళ్ల జైలుపరిగి: చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి శ్రీరామ్ తీర్పునిచ్చినట్లు స్థానిక ఎస్ఐ మోహనకృష్ణ ఓ ప్రకటనలో బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన సయ్యాద్ ఫెరోజ్ ఇంట్లో 2025 మార్చి ఒకటిన బంగారు, వెండి నగలు దొంగతనం జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే గ్రామంలో 2024 అక్టోబర్ 14న భారతమ్మ ఇంట్లో బంగారు, వెండి నగలు చోరీ జరిగినట్టు పోలీసులను ఆశ్రయించారు. ఈ రెండు కేసులను దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా వడ్డెరపాలెంకు చెందిన తన్నీరు శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద నుంచి బంగారు, వెండి నగలు రికవరీ చేసి కోర్టులో డిపాజిట్ చేసి చార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా బుధవారం కోర్టులో వాదోపవాదనలు విన్న తరువాత దొంగతనం చేసినట్టు రుజువు కావడంతో జడ్జి నేరస్తుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.100 జరిమాన విధించినట్టు ఎస్ఐ పేర్కొన్నారు.చికిత్స పొందుతూ డ్రైవర్ మృతిపూడూరు: చికిత్స పొందుతూ ఓ డ్రైవర్ మృతి చెందిన సంఘటన చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ ఆలంపల్లికి చెందిన హాజీపాషా(24) డీసీఎం వాహనంతో నగరంలోని మార్కెట్కు మంగళవారం రాత్రి 2 గంటలకు బయలుదేరాడు. మార్గమధ్యలో ఎన్కేపల్లి గేటు సమీపంలో డీసీఎం అదుపుతప్పి మర్రి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హాజీపాషా తల, కాళ్లకు బలమైన రక్త గాయాలయ్యాయి. వెంటనే అతడిని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు రెఫర్ చేశారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి షాహిన్బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.విధుల్లో ఉన్న కండక్టర్.. గుండెపోటుతో మృతిఅబ్దుల్లాపూర్మెట్: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ కండక్టర్కు గుండెపోటు రావడంతో మృతి చెందిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిఽధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన నిమ్మల బాలరాజ్గౌడ్(54) హయత్నగర్– 2 డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం విధుల్లో చేరిన బాల్రాజ్ రాత్రి 8.45గంటలకు అబ్దుల్లాపూర్మెట్లోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీకి బస్లో వచ్చాడు. రాత్రి బస్సును కాలనీలో పార్క్ చేసి(నైట్ హాల్ట్), బ్లాక్ నం.62/1లో విశ్రాంతి తీసుకుంటుండగా రాత్రి 11.20 గంటలకు ఛాతిలో నొప్పి వస్తోందని డ్రైవర్ ఉపేందర్కు చెప్పాడు. దీంతో ఆయన 108కు సమాచారం ఇవ్వగా అతన్ని పరీక్షించిన సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భా ర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ఆహ్లాదం.. విజ్ఞానం
● ఆట పాటలతో పూర్వ ప్రాథమిక విద్య ● విద్యార్థులతో కలిసిపోయి చదువు నేర్పుతున్న ఉపాధ్యాయులు ● ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి ● జిల్లాలో 36 పాఠశాలలు ఎంపిక దుద్యాల్: సర్కారు బడులను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక కార్యక్రమాలతో ముందుకు వెళుతోంది. అందులో భాగంగానే ఏకరూప దుస్తులు(యూనిఫాం) అందించడం, పాఠ్య, రాత పుస్తకాలతో సాంకేతికతను అందించేలా డిజిటల్ విద్యను ప్రవేశ పెట్టింది. మూడేళ్లు నిండిన చిన్నారులను ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తుండడంతో మెజార్జీ తల్లిదండ్రులు అక్కడే తమ పిల్లలను కొనసాగిస్తున్నారు. సర్కారు బడుల్లో పూర్వ ప్రాథమిక విద్య లేకపోవడంతో ఇటువైపు అనాసక్తి చూపుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్యకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంగన్వాడీ కేంద్రాలతో పాటు కొన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా కొంత మంది ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి చిన్నారులకు ప్రత్యేకంగా ఆటపాటలతో బోధనను అందిస్తున్నారు. పేద విద్యార్థులకు మేలు ప్రభుత్వ పాఠశాలలో సైతం పూర్వ ప్రాథమిక విద్యను అమలులోకి తీసుకువస్తే ప్రైవేట్ బడులకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు మూడేళ్లు నిండగానే అంగన్వాడీ కేంద్రాలకు పంపిస్తున్నా అక్కడ ఆ మేరకు విద్యను అందిపుచ్చుకోలేకపోతున్నారనే వాదన తల్లిదండ్రుల్లో బలంగా నాటుకుంది. దీంతో మూడేళ్ల వయసు వచ్చే వరకు ఇంటిలో ఉంచుకుని ఆ తర్వాత ప్రైవేట్ పాఠశాలలకు సాగనంపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశ పెడితే పేద విద్యార్థుల భవిష్యత్తుకు దిక్సూచిగా మారే అవకాశం లేకపోలేదు. మూడేళ్లకు ప్రైవేట్.. ఐదేళ్లకు సర్కార్ ప్రస్తుతం పిల్లలకు మూడేళ్లు నిండగానే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీల పేరుతో ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారు. అదే సర్కారు పాఠశాలకు అయితే ఐదేళ్లు నిండిన వారికి ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. తల్లిదండ్రులకు అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఐదేళ్ల వరకు పిల్లవాడిని పాఠశాలకు పంపించకుండా ఇంట్లో ఉంచుకోవడంతో వయసు పెరిగి విద్య బుద్ధులు నేర్చుకోవడానికి ఇబ్బంది అవుతుందని భావించి, మూడేళ్లకే ప్రైవేట్ బడికి పంపుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి సర్కారు పాఠశాలల్లో కూడా 3–4 ఏళ్ల వయసు పిల్లలను చేర్చుకొని పూర్వ ప్రాథమిక విద్యను అందించడం మొదలు పెడుతుంది. మండల పరిధిలోని నాజుఖాన్పల్లి, ఆలేడ్, హకీంపేట్, చిలుముల మైల్వార్, పోలేపల్లి తదితర ప్రాథమిక పాఠశాలల్లో కొంత మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేక బోధన అందిస్తున్నారు. సన్నాహాలు చేస్తున్నాం పూర్వ ప్రాథమిక విద్యను ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ విద్యను అమలు చేయడానికి జిల్లాలో 36 పాఠశాలలను ఎంపిక చేశాం. ప్రస్తుతం ఐదు బడుల్లో బోధన కొనసాగుతుంది. త్వరలో మిగతా పాఠశాలలో కూడా అమలు చేస్తాం. మునుముందు మరింతగా విస్తరిస్తాం. – రేణుకాదేవి, జిల్లా విద్యాధికారి -
బిరబిరా కృష్ణమ్మ
కొడంగల్: కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులు జోరుగా సాగుతున్నాయి. ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో పరుగులు పెడుతున్నాయి. నారాయణపేట జిల్లా సరిహద్దు వరకు పనులు పూర్తి కాగానే మన జిల్లాలో ప్రారంభిస్తారు. మొదటి విడతలో దామరగిద్ద మండలం కానుకుర్తి వరకు చేపట్టారు. ఇది పూర్తి కాగానే కొడంగల్ నియోజకవర్గంలో ప్రారంభమవుతాయి. కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో లక్షా 5వేల ఎకరాలకు సాగు నీరు అందించే ఈ పథకానికి సుమారు రూ.4,500 కోట్లు అంచనా వేశారు. మొదటి విడతలో రూ.2,945 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. జీఓ 69కి జీవం పోసిన సీఎం గతంలో అటకెక్కిన జీఓ 69కు సీఎం రేవంత్రెడ్డి జీవం పోశారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసింది. బీమా ఎత్తిపోతల ద్వారా కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లోని లక్షా 5వేల ఎకరాలకు సాగునీరు, 5లక్షల 50వేల మందికి తాగునీరు అందించాలని నిర్ణయించింది. 2014లో రాష్ట్ర విభజన జరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని పక్కన పెట్టింది. 69 జీఓను అమలు చేయకుండా అటకెక్కించింది. నాలుగు రిజర్వాయర్లు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మీదుగా కృష్ణానది ప్రవహిస్తూ తెలంగాణలో నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోకి ప్రవేశిస్తుంది. కృష్ణానదిపై తెలంగాణలో తొలి ప్రాజెక్టు జూరాలను నిర్మించారు. ఇక్కడి నుంచి నికర జలాలతో మూడు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు ఇవ్వాలని ఇంజనీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బూత్పూర్ రిజర్వాయర్ నుంచి నాలుగు దశల్లో ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందిస్తారు. ఊట్కూర్, జాజాపూర్, జయమ్మ చెరువు, కానుకుర్తి దగ్గర రిజర్వాయర్లు నిర్మిస్తారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ఊట్కూర్, జాజాపూర్, జయమ్మ చెరువు, కానుకుర్తి, లక్ష్మీపూర్, ఈర్లపల్లి, దౌల్తాబాద్, హస్నాబాద్, కొడంగల్, బొంరాస్పేట చెరువులను కాకరవాణి ప్రాజెక్టును నింపి ఆయకట్టు భూములకు సాగునీరు వదులుతారు. ఈ పథకానికి రేవంత్ సర్కార్ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. తెరపైకి ‘పాలమూరు – రంగారెడ్డి’ కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టి పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఈ ప్రాంతానికి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి కొడంగల్కు సాగునీరు రాదని కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకం జలసాధన సమితి సభ్యులు ఉద్యమించారు. అయినా గత ప్రభుత్వం స్పందించలేదు. రేవంత్రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న 2014 నుంచి 2018 వరకు పలుమార్లు ఈ పథకాన్ని అమలు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేశారు. అయినా పాలకులు పట్టించుకోలేదు. ఎట్టకేలకు రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024లో ఈ పథకానికి ప్రాణం పోశారు. వేగంగా కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పనులు లక్ష ఎకరాలకు పైగా సాగునీరు, 5.50 లక్షల మందికి తాగునీరే లక్ష్యం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.4,500 కోట్లు మొదటి విడతలో రూ.2,945 కోట్లు మంజూరు -
మద్యం తాగి వాహనం నడపొద్దు
మోమిన్పేట: మద్యం తాగి వాహనం నడిపితే కేసు నమోదు చేస్తామని ఏఎస్ఐ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. బుధవారం మండల పరిధిలోని మొరంగపల్లి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాలు నడుపుతున్న సమయంలో మద్యం తాగరాదన్నారు. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనానికి సంబంధించి అన్ని పత్రాలు ఉండాలన్నారు. నంబరు లేని వాహనం రోడ్డు ఎక్కకూడదని హెచ్చరించారు. నిషేధిత వస్తువులను రవాణా చేయ్యెద్దన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని ఉల్లంఘించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బలరాం, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. -
వసతి.. అథోగతి..!
భవనం అప్పగించాలి మండలంలోని ఆయా గ్రామాల నుంచి రోజూ విద్యార్థినులు 3 కి.మీ. నడుచుకుంటూ పాఠశాలకు వస్తున్నారు. వంద మంది ఉండేలా హాస్టల్ నిర్మించారు. భవనానికి కరెంట్, తాగునీటి కనెక్షన్ ఇవ్వలేదు. చిన్ని చిన్న మరమ్మతులు చేయాల్సి ఉంది. వాటిని పూర్తి చేసి తమకు అప్పగిస్తే హాస్టల్ను ప్రారంభిస్తాం. – అనీల, ప్రిన్సిపాల్, బషీరాబాద్ ఆదర్శ పాఠశాల ప్రతిపాదనలు పంపాం మోడల్ స్కూల్ హాస్టల్ భవనంలో చిన్నచిన్న మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇందుకు రూ.6.50 లక్షలు అవసరం. వారం రోజుల క్రితం ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం. హాస్టల్ బిల్డింగ్పై మరో ఫ్లోర్ వేయడానికి రూ.60 లక్షలతో ప్రతిపాదనలు పంపాం. – శ్రీనివాసులు, డీఈ, టీఎస్ఈడబ్ల్యూఎస్ బషీరాబాద్: ప్రభుత్వ ఆదర్శ పాఠశాలల్లో హాస్టల్ వసతి లేక విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2016లో అప్పటి సర్కారు వెనుకబడిన మండలాలకు మోడల్ స్కూల్స్ మంజూరు చేసింది. 2019లో బషీరాబాద్ మండలంలో రూ.1.28 కోట్లతో హాస్టల్ భవన నిర్మాణ పనులు చేపట్టారు. అన్ని సౌకర్యాలతో భవనాన్ని పూర్తి చేసి 2022లో టీఎస్ఈడబ్ల్యూడీసీ అధికారులు జిల్లా విద్యాశాఖకు అప్పగించారు. భవనం అందుబాటులోకి వచ్చి మూడేళ్లు గడిచిన హాస్టల్ ప్రారంభించలేదు. ప్రస్తుతం 120 మంది విద్యార్థినులు వసతి సౌకార్యం లేక రోజూ పాఠశాలకు 3 కి.మీ. కాలినడకన వచ్చి వెళ్తున్నారు. దెబ్బతిన్న తలుపులు, కిటికీలు మూడేళ్ల క్రితం పూర్తయిన హాస్టల్ భవనానికి తాగునీటి వసతి లేదు. కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. భవనం గురించి పట్టించుకునే వారు లేకపోవడంతో తలుపులు దెబ్బతిన్నాయి. కిటికీలు, అద్దాలుఽ పాడయ్యాయి. బాత్రూమ్లు, ఫ్యాన్లు పాడైపోయాయి. భవనం చుట్టూ, లోపల ముళ్ల చెట్లు ఏపుగా పెరిగాయి. మూడేళ్లుగా నిరుపయోగంగా మోడల్ స్కూల్ హాస్టల్ విద్యుత్, నీటి సదుపాయం లేకపోవడంతో వృథాగా.. పట్టించుకోని విద్యాశాఖ అధికారులు -
9న లక్ష తులసీ అర్చన
కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్లో వెలిసిన పద్మావతీ సమేత శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 9న మూడో శనివారం సందర్భంగా స్వామివారికి లక్ష తులసీ దళాలతో అర్చన నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలు, తులసీ దళాలతో మూల మూర్తులకు విశేష అలంకరణ చేస్తారు. పండితులు విష్ణు సహస్ర నామావళి పటిస్తూ లక్ష తులసీ దళాలతో అర్చన చేస్తారు. శ్రావణమాసం మూడో శనివారం కావడంతో శ్రీవారి మూలమూర్తికి అభిషేకం, తోమాల సేవ, అలంకరణ చేయనున్నారు. విష్ణుసహస్ర నామార్చన, నైవేద్య సమర్పణ, మహా మంగళ హరతి తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అందుబాటులో సబ్సిడీ గడ్డి విత్తనాలు అనంతగిరి: జిల్లాలోని అన్ని పశు వైద్యశాలల్లో 75శాతం సబ్సిడీపై మేలుజాతి గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా పశు వైద్యాధికారి సదానందం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐదు కేజీల మినీ కిట్స్ పూర్తి ధర రూ.500 కాగా సబ్సిడీ రూ.375 పోను రూ.125 చెల్లించాల్సి ఉందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి అనంతగిరి: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం వికారా బాద్ మండలం కామారెడ్డిగూడలో ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. బీజేపీతోనే సుపరిపాలన సాధ్యమన్నారు. నేడు ఎక్కడ చూసినా కేంద్రం ప్రభుత్వం చేపడుతున్న పనులే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు అమరేందర్రెడ్డి, మండల అధ్యక్షుడు శివరాజుగౌడ్, నాయకులు గోపాల్రెడ్డి, గోపాల్, నర్సింహారెడ్డి, సురేందర్రెడ్డి, సంజీవరెడ్డి మైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయసమస్యలు పరిష్కరించాలి టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్రావు చేవెళ్ల: ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కె.హన్మంత్రావు అన్నారు. మండలంలోని పలు పాఠశాలల్లో బుధవారం సంఘం నాయకులతో కలిసి సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెల్త్కార్డులు వెంటనే అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని, కామన్ సర్వీస్ రూల్స్ అమలుకు ప్రయత్నం చేయాలని, కేజీబీవీ, ఎస్ఎస్ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, నూతన పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించి విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యల సాధనకోసం టీపీయూఎస్ ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కోట్ల కాశీరావు, గౌరవ అధ్యక్షుడు గణపురం సురధీర్, మండల కోశాధికారి దూత కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వక్ఫ్ భూములు పరాధీనం
వికారాబాద్: జిల్లాలో వక్ఫ్ బోర్డు భూములు రోజురోజుకూ అన్యాక్రాంతం అవుతూనే ఉన్నాయి. మెజార్టీ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పరిగి మండలం సుల్తాన్పూర్ రెవెన్యూ పరిధిలో వక్ఫ్ భూములను పక్క పొలం రైతులు ఆక్రమించారని ఎర్రగడ్డపల్లికి చెందిన కొందరు కలెక్టర్, ఎస్పీ, డీఆర్ఓ, తహసీల్దార్లకు ఫిర్యాదు చేశారు. సమాధులను సైతం కూల్చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆ భూములను గతంలో వక్ఫ్ బోర్డు అధికారులు పలుమార్లు సందర్శించారు. కబ్జాకు గురయ్యాయని తేల్చారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆరోపణలు వచ్చిన ప్రతి సారీ వక్ఫ్ బోర్డు అధికారులు, రెవెన్యూ అధికారులు ఒకరిపై ఒకరు నెపం మోపి కాలం వెల్లదీస్తున్నారు. జిల్లాలో 2,170 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయని ఆ శాఖ అధికారులు చెబుతుండగా అవి చాలా వరకు కాగితాలకే పరిమితమయ్యాయి. పొజిషన్లో మాత్రం వేరేవారు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా గ్రామాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తుల చేతుల్లోకి ఎప్పుడో వెళ్లి పోయాయి. కొన్ని చోట్ల సంరక్షకులుగా ఉన్న వారే యజమానులుగా మారిపోయారు. మరి కొన్ని చోట్ల కాగితాల్లో భూములు కనిపిస్తున్నాయి. పరాధీనం అయిన భూములపై ఫిర్యాదులు వచ్చినా విచారణ జరిపిన దాఖలాలు కనిపించడం లేదు. ఒక వేళ విచారణ జరిపినా నేతల ఒత్తిడి.. కాసులకు కక్కుర్తి పడుతున్న అధికారులు కారణంగా నివేదికలు బుట్టదాఖలవుతున్నాయి. సర్వే చేయడంలో విఫలం వక్ఫ్ భూములు ఉన్నదెంత.. ? అవి ఎక్కడెక్కడ ఉన్నాయి..? ఎవరి ఆధీనంలో ఉన్నాయి..? అనే దానిపై ఆ శాఖ అధికారులకే స్పష్టత లేదు. రెవెన్యూ అధికారులకు అవగాహన ఉన్నా వారు పట్టించుకోవడం లేదు. ఇటు రెవెన్యూ.. అటూ వక్ఫ్ బోర్డు అధికారుల కనుసన్నల్లోనే భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో వక్ఫ్ భూములపై 1958 – 64 ప్రాంతంలో సర్వే నిర్వహించారు. 2006లో మరోసారి సర్వే చేసినా ఆ వివరాలను ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ సర్వే ప్రకారం వక్ఫ్ భూముల విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రెండో విడత సర్వే చేసి ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం 2017 ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భూ ప్రక్షాళన సర్వేలో అన్యాక్రాంతమైన భూముల వివరాలు వెళ్లడవుతాయని అందరూ భావించారు. కానీ మొదటి విడతలో కేవలం లిటిగేషన్ లేని భూములను మాత్రమే సర్వే చేశారు. రెండో విడత సర్వే చేసి ఉంటే వక్ఫ్ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలిసేదని రెవెన్యూ అధికారులు అంటున్నారు. అనేక చోట్ల కబ్జా ● పరిగి మండలం సుల్తాన్పూర్ శివారులో ఓ దర్గా సమీపంలో ఉన్న వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఇందులో సుమారు ఐదెకరాల భూమి పరాదీనం అయ్యింది. గార్డియన్గా ఉన్న ఓ వ్యక్తి ఏకంగా వాటిని తన పేరున రాయించుకున్నాడు. ఈ విషయంలో స్థానకంగా నివాసముండే ఓ వ్యక్తి రెవెన్యూతో పాటు వక్ఫ్బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు విచారణ జరిపి నివేఽధిక కూడా ఉన్నతాధికారులకు అందజేశారు. కాని ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదు. తాజాగా రెండు రోజుల క్రితం కూడా అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గతేడాది అధికారులు ఆ భూములను పరిశీలించి కబ్జాకు గురైనట్టు తేల్చారు, కాని ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదు. వీటితో పాటు పరిగి మున్సిపల్ పరిధిలోని 568 సర్వే నెంబర్లో సుమారు 205 ఎకరాల భూమి ఉండగా అందులో చాలా వరకు అన్యాక్రాంతం అయ్యింది. పరిగి మండలం రాపోల్ గ్రామంలో వక్ఫ్ భూములు పరాధీనమయ్యాయి. ఇదే మండలం నారాయణ్పూర్లో 24 ఎకరాలు ఉండగా 22 ఎకరాలు కబ్జాకు గురైనట్లు స్థానికులు తెలిపారు. వికారాబాద్, ధారూరు, తాండూరు మండలాల్లో సైతం అన్యాక్రాంతం అయ్యాయి. జిల్లాలో 2,170 ఎకరాలు ఆక్రమణలపై తరచూ కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ, వక్ఫ్ బోర్డ్ అధికారులు 2006 సంవత్సరంలో సర్వే.. నేటికీ వెల్లడి కాని భూముల వివరాలు -
ప్రైవేటుకు దీటుగా గురుకులాలు
తాండూరు టౌన్: ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ గురుకులాల్లో బోధన సాగుతోందని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల (ట్రైస్) కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ అన్నారు. బుధవారం తాండూరులోని తెలంగాణ గురుకుల బాలికల పాఠ శాల, కళాశాలను తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, వంటగది, లైబ్రరీ, ల్యాబొరేటరీ, కంప్యూటర్ ల్యాబ్, ఆన్లైన్ బోధనను పరిశీలించారు. మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సిలబస్తో పాటు ఆన్లైన్ తరగతులపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ గురుకులాల్లో అత్యుత్తమ బోధన అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అనేక వసతులను కల్పిస్తోందన్నారు. ప్రతి ఏటా ప్రైవేటుకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు. తాండూరు గురుకులంలో బోధన, ఫలితాలు, వసతులు భేషుగ్గా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బోధన, వసతుల కల్పనలో మేటి ట్రైస్ సెక్రటరీ రమణకుమార్ తాండూరులోని గురుకుల బాలికల పాఠశాల సందర్శన -
మా సమస్యలు పరిష్కరించండి
హయత్నగర్: అబ్దుల్లాపూర్మెట్టు మండలం తొర్రూర్లో హెచ్ఎండీఏ ద్వారా రూపొందించిన లే అవుట్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చేపట్టిన ప్లాట్ల వేలాన్ని భూములు ఇచ్చిన రైతులు అడ్డుకున్నారు. తమకు పరిహారంగా ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేయకుండా వేలం వేయడంపై అభ్యంతరం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. తొర్రూర్లోని సర్వే నంబర్ 383/1లో సుమారు 117 ఎకరాల ప్రభుత్వ భూమిని లే అవుట్ చేసి ప్లాట్లుగా విభజించి అమ్మేందుకు గత ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి హెచ్ఎండీఏ అధికారులు సేకరించారు. పొజీషన్లో ఉన్న రైతులకు పరిహారం కింద ఒక్కొక్కరికి 300 గజాల ఇంటి స్థలాన్ని అదే లే అవుట్లో ఇచ్చేందుకు ఒప్పించారు. ఈ మేరకు అలాట్మెంట్ పత్రాలు జారీ చేశారు. అనంతరం కొన్ని ప్లాట్లను వేలం వేశారు. తమకు ఇచ్చిన పత్రాల ఆధారంగా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని, ఆ స్థలాలపై పూర్తి హక్కుల కల్పించాలని రైతులు కొంత కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో హెచ్ఎండీఏ నుంచి అధికారం పొందిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ 510 ప్లాట్లలో 100 ప్లాట్లను వేలం వేసేందుకు సిద్ధమైంది. గ్రామంలోని ఓ కన్వెన్షన్ హాలులో వేలం వేసేందుకు బుధవారం ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ సుదర్శన్రెడ్డి, రాజీవ్ స్వగృహ సీఈ భాస్కర్రెడ్డి, ఈఈ నరేందర్రెడ్డి వచ్చారు. బహిరంగ వేలం మొదలు పెట్టగానే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న రైతులు వేలం పాటకు అడ్డు తగాలారు. పోలీసులు కలుగ జేసుకోవడంతో తోపులాట జరిగింది. అనంతరం వేలం వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించి వెనుదిరిగారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డిని అక్కడికి పంపించారు. రైతులు ప్రభుత్వానికి సహకరించాలని, 10–15 రోజుల్లో ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరిగే విధంగా చూస్తామని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలాన్ని అడ్డుకున్న రైతులు అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి హామీతో శాంతించిన వైనం -
మహోన్నత వ్యక్తి జయశంకర్
అనంతగిరి: తెలంగాణ ఉద్యమం కోసం ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ అన్నా రు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి తోకలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్ సేవలను కొనియాడారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆవస్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అన్నారు. ఆయన కలలుగన్న తెలంగాణ కోసం మనమందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఉపేందర్, డీఆర్డీఏ శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. బూత్స్థాయి అసిస్టెంట్లను నియమించుకోవాలి పోలింగ్ కేంద్రాల్లో పర్యవేక్షణకు ఆయా పార్టీలు బూత్స్థాయి అసిస్టెంట్లను నియమించుకోవాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణకు సన్నాహాలు, కొత్త పోలింగ్ బూత్ల ఏర్పాటు, భవనాల గుర్తింపు తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 1,200 మందికి మించి ఓటర్లు ఉండరాదన్నారు. జిల్లాలో 284 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, బూత్స్థాయి అసిస్టెంట్లను నియమించి ఎన్నికల కమిషన్ సైట్లో అప్లోడ్ చేసి అనుమతి పొందాలని సూచించారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో బీఎల్ఓలు, బీఎల్ఏలు సమన్వయంతో పని చేసి ఓటరు జాబితాలో పేర్ల మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో వికారాబాద్ తహసీల్దార్ లక్ష్మీనారాయణ, డీటీ అనిత పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ సుధీర్ కలెక్టరేట్లో ఘనంగా జయంతి వేడుకలు -
లక్ష్యాన్ని అధిగమించాలి
అనంతగిరి: ప్రభుత్వ ఆస్పత్రులో ప్రసవాలు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రోగ్రాం ఆఫీసర్లు, వైద్యాధికారులు, ఎంఎల్ హెచ్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కే లలితాదేవి జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాధి నిరోధక టీకాలు, అసంక్రమిత వ్యాధులు, టీబీ నియంత్రణ కార్యక్రమలపై సమీక్షించారు. పీహెచ్సీలు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. జిల్లాలో 87 ఆరోగ్య ఉప కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయని, నాణ్యత పాటిస్తూ మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మాతాశిశు మరణాలపై ప్రతి మూడు నెలలకు సమీక్ష చేయాలన్నారు. ఈనెల 11న నులిపురుగుల నివారణ కార్యక్రమం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, అడిషనల్ కలెక్టర్ సుధీర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవీంద్ర యాదవ్, పంచాయతీ రాజ్ ఈఈ ఉమేష్, డాక్టర్ పవిత్ర, వైద్యాధికారులు పాల్గొన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాల్లోని విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంతోపాటు మెనూ ప్రకారం భోజనం అందించాలి కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు, వసతి గృహాల వార్డెన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో చేపట్టిన మరమ్మతు పనులను సత్వరం పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు తరచూ వైద్య సేవలు అందేలా చొరత తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, ట్రైనీ కలెక్టర్ హార్స్ చౌదరి, డీఆర్డీఏ శ్రీనివాస్, సంక్షేమ ఖాఖ జిల్లా అధికారులు కమలాకర్ రెడ్డి, ఉపేందర్, రాజేశ్వరి, వార్డెన్లు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనేప్రసవాలు జరిగేలా చూడాలి కలెక్టర్ ప్రతీక్జైన్ -
నిరుపయోగం.. కూలేందుకు సిద్ధం
దుద్యాల్: మండలంలోని గౌరారం, నాజుఖాన్పల్లి, హస్నాబాద్ గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంకులు పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. అవి ఎప్పుడు కూలుతాయోననే భయంతో ఆయా గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గౌరారంలో ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న వాటర్ ట్యాంకు శిథిలావస్థకు చేరడంతో నిరుపయోగంగా ఉంచారు. హస్నాబాద్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంకు తీవ్ర ప్రమాదకరంగా మారింది. వినియోగించక చాలా ఏళ్లు అవ్వడంతో ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థులు వాపోతున్నారు. నాజుఖాన్పల్లిలో ఓ వాటర్ ట్యాంకు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉంది. ప్రమాదాలు సంభవించకముందే అధికారులు స్పందించి ఆయా గ్రామాల్లో వాటర్ ట్యాంక్లను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వాటర్ ట్యాంక్లతో పొంచి ఉన్న ప్రమాదం -
కార్మిక సమస్యలు పరిష్కరించాలి
పరిగి: కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులను విడుదల చేయాలని బుధవారం నగరంలోని విద్యా కమిషన్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. భోజన కార్మికులు, సీఐటీయూ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్లు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేసుకుంటే ప్రభుత్వం అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. సర్కారు కార్మికులకు ధర్నా చేసే హక్కులను కాలరాస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు కార్మికులకు రూ.పది వేలు ఇస్తామని చెప్పి ప్రస్తుతం ఇవ్వడం లేదన్నారు. భోజన కార్మికులకు బిల్లులు, గౌరవ వేతనాలు సక్రమంగా రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రవికుమార్, శ్రీశైలం, సువర్ణ, రాములమ్మ, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ -
చికిత్స పొందుతున్న యువకుడి మృతి
హస్తినాపురం: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై గిరీష్కుమార్ వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ గ్రామానికి చెందిన మంచన్పల్లి లోకేశ్(31) ప్రైవేటు ఉద్యోగం చేస్తూ సికింద్రాబాద్లోని బోయిన్పల్లిలో ఉంటున్నాడు. గత కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ మనస్తాంపం చెంది గత నెల 26న పురుగుల మందు తాగడంతో వెంటనే కుటుంబ సభ్యులు బండ్లగూడ జాగీర్లోని మెడిలైఫ్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. -
కూలీల కొరత.. రైతులకు వెత
పరిగి: వర్షాలు సరిగ్గా పడక సాగు చేసిన పంటలు దెబ్బతింటున్నాయి. వారం రోజులుగా వానలు లేక పోవడం, బోర్లల్లో నీరు తగ్గడంతో వరినాట్లు వేయాలనుకునే చిన్న, సన్నకారు రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు కూలీల కొరతతో విలవిలలాడే పరిస్థితి నెలకొంది. వర్షాధార పంటలకు కలుపు తీసేందుకు కూలీ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అటు వరి నాట్లు, కలుపుతీత తీసే రైతులు ఒకేసారి పనులు చేయిస్తుండటంతో కూలీల కొరత తీవ్రంగా ఏర్పడింది. వలస కూలీలతో పనులను చేయిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో వరి నాట్లు వేసేందుకు కూలీల రేట్లు రెండింతలు కాగా సాగు పెట్టుబడి కూడా పెరిగింది. సాధారణంగా ఒక్కో కూలీకి రూ.250 నుంచి రూ.300 ఉండగా ప్రస్తుతం రూ.1,000 వరకు తీసుకుంటున్నారు. దెబ్బతింటున్న పంటలు జిల్లా వ్యాప్తంగా రైతులు వర్షాధార పంటలపైనే ఆధారం. ఖరీప్ సీజన్లో గతేడాది కురిసిన వర్షపాతానికి ఈసారి చాలా తక్కువగా కురిశాయి. అయినా పంటల సాగుపైన దృష్టి సారించారు. వరి నాట్లు వేయడం, పొలాల్లో కలుపు మొక్కలను తొలగించడానికి కూలీలు అవసరం ఏర్పడింది. వరినాట్లు వేసేందుకు పంట పొలాలను సిద్ధం చేసినా కూలీల కొరతతో సమయానికి నాట్లు పడటం లేదని రైతులు దిగులు చెందుతున్నారు. కూలీల కొరత ఒకవైపు భారీగా పెరిగిన కూలీల రేట్లతో కర్షకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అదునుకు కలుపు తీత తీయకపోవడంతో పంటను మించి కలుపు పెరిగిపోతుంది. దీంతో రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. కొంత మంది రైతులు కూలీలు దొరక్క సాగు చేసిన పంటలో కలుపు తీత తీయకుండా రసాయనాలు పిచికారీ చేసి చేతులు దులుపుకొంటున్నారు. ఇప్పటికే వరినాట్లు వేసి కలుపులు తీయాల్సి ఉండగా ఇంకా పూర్తిగా నాట్లే పడలేదు. నారుమళ్లు ముదిరి పోవడంతో పంట దిగుబడిపై దెబ్బపడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కూలీల కొరతతో కలుపు తీసేందుకు, వరి నాట్లు వేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రెండింతలు పెరిగాయి కూలీల రేట్లు రెండింతలు కావడంతో పెట్టుబడి కూడా భారీగా పెరుగుతోంది. రేట్లు పెరిగినా కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడింది. గతంలో గ్రామాల్లో కూలీల కొరత ఉండేది కాదు. కాలానుగుణంగా వ్యవసాయ కూలీలు చేసే వారి సంఖ్య భారీగా తగ్గుతుంది. దీంతో డిమాండ్ పెరిగింది. – రవికుమార్, రైతు మోత్కూర్ కష్టంగా సాగు పంట సాగు చేయాలంటే కష్టంగా మారింది. వ్యవసాయం చేయడానికి కూలీలు కచ్చితంగా అవసరం. విత్తనాలు విత్తిన నాటి నుంచి కోత నూర్పిడి తదితర పనులకు కూలీలు ఉండాలి. రైతులంతా ఒకేసారి ఒకే పంట సాగు చేయడంతో కూలీల కొరత ఏర్పడుతోంది. – శ్రీనివాస్, ఐనాపూర్ భారీగా పెరిగిన కూలీ రేట్లు వరినాట్లకు తీవ్ర ఇబ్బందులు కలుపుతీతకు రసాయనాల పిచికారీ -
రైతులకు అండగా కేంద్రం
అనంతగిరి: ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువతను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముద్ర రుణాలను కేంద్రం అందజేస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానంద్రెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్ మండలంలోని రాళ్ల చిట్టెంపల్లి, మైలార్ దేవరంపల్లి గ్రామాల్లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం ప్రారంభించి, కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని రైతులకు పెట్టుబడి సహాయం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని వివరించారు. రైతులపై భారం పడకుండా ఎరువులను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు శివరాజ్ గౌడ్, జాయింట్ కన్వీనర్ అమరేందర్ రెడ్డి, నాయకులు మల్లేష్, ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం దోమ: బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని మండల అధ్యక్షుడు బొంగు మల్లేశం అన్నారు. మంగళవారం దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామంలో బీజేపీ ప్రవేశపెడుతున్న పథకాలను కార్యకర్తలతో కలిసి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేరుగా అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు సత్యం, నాయకులు అశోక్, శ్రీనివాస్, శ్రీనుగౌడ్, వెంకటేశ్గౌడ్, శ్రీశైలం, మాదవులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానంద్రెడ్డి -
రైతుల పొలాల్లో ఆస్తుల సర్వే
దుద్యాల్: మండల పరిధిలోని పారిశ్రామికవాడ ఏర్పాటుకు పనులు చకచకా జరుగుతున్నాయి. భూములు ఇచ్చిన రైతుల పొలాల్లో ఉన్న ఆస్తులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మండల పరిధిలోని హకీంపేట్ గ్రామ పరిధిలోని ఇటీవల భూములు ఇచ్చిన రైతులు పొలాల్లో పెద్ద పెద్ద వృక్షాలు, బోర్లు, పశువుల షెడ్లకు సంబంధించి వివరాలను మంగళవారం సేకరించారు. గతంలో కొంత మందికి పొలాల్లో ఉన్న ఆస్తులకు సంబంధించి పరిహారం ప్రభుత్వం అందించింది. ఈ సందర్భంగా రైతుల పొలాల్లో ఆస్తుల వివరాలను నమోదు చేసుకుని ప్రభుత్వానికి నివేదించామని తహసీల్దార్ కిషన్ తెలిపారు. సర్వేలో హర్టికల్చర్ అధికారి సురేంద్రనాథ్, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. -
హత్యాయత్నం కేసులో ముగ్గురికి రిమాండ్
ధారూరు: పాత కక్షలను మనసులో పెట్టుకుని ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన కేసులో ముగ్గురు వ్యక్తులను రిమాండ్కు తరలించారు. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ధారూరు మండలం రాంపూర్తండాకు చెందిన సబావత్ మోహన్పై ఇదే తండాకు చెందిన శంకర్, అతని భార్య లక్ష్మీబాయి, కొడుకు రాజేశ్ ఈనెల 1న గొడ్డలి, రోకలి, ఇనుప వస్తువులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మోహన్ను కుటుంబ సభ్యులు వికారాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి భార్య సావిత్రీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ముగ్గురిపైనా హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం వీరికి రిమాండ్ విధించింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మోహన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిసింది. ఘటన జరిగిన రోజు మోహన్కు చెందిన కోడి, దాని పిల్లలు శంకర్ ఇంటివైపు వెళ్లాయి. ఇందులో కొన్ని చనిపోవడంతో.. నోరు లేని కోడి పిల్లలను ఎలా చంపాలనిపించిందంటూ శంకర్ కుటుంబ సభ్యులను మోహన్ నిలదీశాడు. పాత కక్షలతో కోపోద్రిక్తులైన వారు అతనిపై దాడికి తెగబడ్డారు. ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించాలి ఏడీఏ లక్ష్మీకుమారి కుల్కచర్ల: ఎరువులను ఎమ్మార్పీ ధరలకంటే ఎక్కువ విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏడీఏ డీఎస్ లక్ష్మీకుమారి సూచించారు. మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులకు యూరియా, డీఎపీలను అందుబాటులో ఉంచాలని సూచించారు. యూరియా కోసం వచ్చిన రైతులకు లేవని చెప్పి పంపిస్తే లైసెన్స్లను రద్దు చేస్తామన్నారు. యూరియాలో సన్న రకం, దొడ్డు రకం రెండు ఉన్నాయని రెండింటిలో ఎటువంటి తేడాలు లేవన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. భారీ శబ్దాలతో భయందోళన తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం సిద్ధన్నమడుగుతండా, ఎర్రగడ్డతండా, ఆత్కూర్ గ్రామాల్లో భారీ శబ్దాలతో ప్రజలు భయందోళన చెందారు. సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం ఉదయం 7 గంటల వరకు భూమి కంపించే విధంగా భారీ చప్పుళ్లు వినిపించాయని తండావాసులు వాపోతున్నారు. ఆత్కూర్ గ్రామ శివారులో ఉన్న ఓ క్రషర్ మిషన్కు సంబంధించి గనులు ఉన్నాయని అక్కడ బ్లాస్టింగ్ చేయడంతో శబ్దాలు వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పెద్దేముల్ పోలీసులు మధ్యాహ్నంపర్యటించి అనుమానిత ప్రదేశాలను పరిశీలించారు. ఈసీవాగులో కూలీ గల్లంతు? పూడూరు: కంకల్ ఈసీ వాగులో ఓ వ్యవసాయ కూలీ గల్లంతైన సంఘటన చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కంకల్ గ్రామానికి చెందిన మంగళి సాయన్న(36) వ్యవసాయ కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం ఈసీ వాగు సమీపంలో ఉన్న పత్తి పొలంలో పత్తి దంతె పట్టేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి తిరిగి పొలానికి వెళ్లే క్రమంలో ఈసీ వాగు ఉధృతి ఎక్కువ కావడంతో అందులో పడి పోయి ఉండవచ్చని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. కాగా సాయన్నకు ఈత రాదు. చుట్టు పక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. బాధితుని భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అసత్య వార్తలపై ఫిర్యాదు దోమ: విధుల్లో ఉన్నా లేనట్లుఅసత్య కథనాలు రాసి, తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మండలంలోని మోత్కూరు అంగన్వాడీ టీచర్ సువర్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ పత్రికలో అసత్య వార్తలు రాసిన రిపోర్టర్పై దోమ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. తనపై అవాస్తవాలు చిమ్మిన సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
లైసెన్స్ల జారీలో దళారుల దగా!
బషీరాబాద్: టీఎఫ్టీ లైసెన్స్ల జారీలో అవినీతి రాజ్యమేలుతోంది. కల్లు విక్రయించేందుకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ గీత కార్మికుడి నుంచి మధ్యవర్తులు ఏకంగా రూ.85 వేలు వసూలు చేశారు. ఈ ఘటన బషీరాబాద్ మండలం ఎక్మాయిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన పోతుల బాలయ్యగౌడ్ వ్యవసాయంతో పాటు గీత కార్మికుడిగా జీనవం సాగిస్తున్నాడు. ఇతను కల్లు దుకాణం లైసెన్స్ కోసం ఈఏడాది జనవరిలో తాండూరు ఆబ్కారీ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఫిబ్రవరి 19న ఇతనికి టాపింగ్ పరీక్ష నిర్వహించిన అధికారులు లైసెన్స్ జారీ కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. రోజులు గడుస్తున్నా లైసెన్స్ రాకపోవడంతో బాధితుడు ఓ స్థానిక నాయకుడిని ఆశ్రయించాడు. ఇందుకు రూ.70 వేలు ఖర్చవుతుందని చెప్పడంతో తన భార్య బంగారాన్ని తాకట్టు పెట్టి.. సదరు లీడర్కు రూ.65 వేలు ఇచ్చాడు. అనంతరం ఎన్నిసార్లు వాకబు చేసినా ఏదో కారణం చెబుతూ దాటవేయడంతో బాధితుడు ఎకై ్సజ్ కార్యాలయంలో పనిచేసే ఓ ప్రైవేటు ఉద్యోగిని సంప్రదించాడు. రూ.40 వేలు ఇస్తే అధికారులతో పని పూర్తి చేయిస్తానని చెప్పడంతో రూ.20 వేలు ఇచ్చాడు. ఈక్రమంలో అతనికి లైసెన్స్ మంజూరైంది. ఇదిలా ఉండగా తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితుడు బాలయ్య, అతని భార్య నర్సింగమ్మ మంగళవారం సదరు నాయకుడిని నిలదీశారు. అయితే నేను పైరవీ చేయడంతోనే మీకు లైసెన్స్ వచ్చిందంటూ లీడర్ తమను దబాయించాడని బాధితులు వాపోయారు. ఆబ్కారీ అధికారుల పేరుతో మధ్యవర్తుల వసూళ్లు ఎక్మాయిలో ఓ గీత కార్మికుడి నిలువు దోపిడీ మా ప్రమేయం లేదు గీత కార్మికుడు పోతుల బాలయ్య దరఖాస్తును పరిశీలించి, అన్ని పరీక్షలు నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. అన్ని అర్హతలు కలిగి ఉండటంతో అతనికి లైసెన్స్ జారీ చేశారు. ఇందుకోసం ప్రభుత్వ ఛాలన్ డబ్బులు మాత్రమే కట్టించుకున్నాం. మధ్యవర్తులు తీసుకున్న డబ్బులతో మాకెలాంటి సంబంధం లేదు. – రవికుమార్, ఎకై ్సజ్ ఎస్ఐ -
రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం
తుర్కయంజాల్: రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసమే సహకార సంఘాలు పనిచేస్తున్నాయని డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. మంగళవారం డీసీసీబీ చైర్మన్ అధ్యక్షతన తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం కార్యాలయంలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23 మంది సభ్యులను సంఘంలో నూతనంగా చేర్చుకున్నామని, 24 మంది రైతులకు రూ. 2.65 కోట్లు రుణాలను మంజూరు చేశామన్నారు. 2024–25 ఆర్ధిక సంవత్సరం ఆడిట్ సర్టిఫికెట్ను ఆమోదించడంతో పాటు, 2025–26 మే 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు మూడు నెలల జమా ఖర్చులను ఆమోదించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, డైరెక్టర్లు లక్ష్మారెడ్డి, లక్ష్మమ్మ, సంజీవ రెడ్డి, యాదగిరి, ఎస్.లక్ష్మమ్మ, కృష్ణారెడ్డి, సత్యనారాయణరెడ్డి, సీఈఓ వై.రాందాసు తదితరులు పాల్గొన్నారు.డీసీసీబీ చైర్మన్ సత్తయ్య -
నేడు టీజీఈపీసెట్ ధ్రువపత్రాల పరిశీలన
అనంతగిరి: టీజీఈపీసెట్–2025 చివరి విడత ధ్రువపత్రాల పరిశీలన బుధవారం వికారాబాద్లోని ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం పొందే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తొమ్మిదేళ్ల చిన్నారిపై యువకుడి అఘాయిత్యం పూడూరు: తొమ్మిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిని దేహశుద్ధి చేసి పోలీసులకు ఈ సంఘటన చన్గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండల పరిధిలోని నేవీరాడార్లో బిహార్కు చెందిన పలు కుటుంబాలు పనిచేస్తున్నాయి. ఇదే రాష్ట్రానికి చెందిన కృష్ణకుమార్ (24) ఓ తొమ్మిదేళ్ల చిన్నారిని లేబర్ కోసం నిర్మించిన షెడ్డులోకి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. ఇది గమనించిన చిన్నారి కుటుంబ సభ్యులు అతనికి దేహశుద్ధి చేసి, పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ భరత్రెడ్డి తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు అనంతగిరి: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని ప్రిన్సిపాల్ రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8న స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయన్నారు. బుధ, గురువారాల్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. వాటని పరిశీలించి సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకునే వారు 8న ఉదయం 10గంటలకు అన్ని ఒరిజినల్స్ సర్టిఫికెట్లు, మూడు సెట్ల జిరాక్స్లతో రిపోర్టు చేయాలన్నారు. సీటు లభించిన వారు వెంటనే రూ.5,080 కౌన్సిలింగ్ ఫీజు వెంటనే చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నియామకం అనంతగిరి: బీజేపీ పార్టీ వికారాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మహిళ కన్వీనర్గా వికారాబాద్కు చెందిన మాజీ కౌన్సిలర్ టి.శ్రీదేవిసదానందరెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు పాటుపడుతామని, పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. బాధ్యతలు అప్పగించినందుకు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వాటర్ ట్యాంకర్ ఢీకొని యువకుడి దుర్మరణం నిజాంపేట్: నగర శివారులోని ప్రగతినగర్ ఎలీప్ సర్కిల్ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఒక వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైకు నడుపుతున్న బీటెక్ విద్యార్థి నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ద్విచక్ర వాహనాల దొంగకు రిమాండ్
షాద్నగర్రూరల్: బైక్ చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని రిమాండ్కు తరలించామని ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఠాణాలో సీఐ విజయ్కుమార్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ లక్ష్మీనారాయణ కేసు వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని చెరుకుపల్లికి చెందిన నర్సింలు జూన్ 19న ద్విచక్రవాహనంపై షాద్నగర్కు వచ్చాడు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న కొరియర్ కార్యాలయం పక్కన తన బైక్ పార్క్ చేసి వెళ్లాడు. మరునాడు వచ్చి చూడగా కనిపించలేదు. దీంతో ఆయన షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా సాంకేతిక నైపుణ్యంతో కొత్తూరు మండలం ఇన్ముల్నర్వకు చెందిన కొర్రా వినోద్ను అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ చోరీ చేసినట్లు అంగీకరించాడని తెలిపారు. నాలుగు బైక్లు స్వాధీనం నిందితుడిపై ఇప్పటికే షాద్నగర్ ఠాణా పరిధిలో నాలుగు, ఆర్జీఐ పీఎస్ పరిధిలో ఒకటి, కొత్తూరు పరిధిలో నాలుగు, అప్జల్గంజ్ పీఎస్ పరిధిలో రెండు కేసులు నమోదై జైలు వెళ్లి వచ్చినట్లు వెల్లడించారు. నిందితుడి నుండి రూ.2 లక్షల విలువ చేసే బైక్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు. కేసును ఛేదించిన పట్టణ సీఐ విజయ్కుమార్, డీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శివారెడ్డి, సిబ్బంది రవీందర్, సంతోశ్, కర్ణాకర్, జాకీర్, రాజు చాకచక్యంగా వ్యవహరించినట్లు తెలిపారు. ఇద్దరు చైన్ స్నాచర్లకు.. ఇబ్రహీంపట్నం: ఇద్దరు చైన్ స్నాచర్లను ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. సీఐ మహేందర్రెడ్డి తెలిపిన ప్రకారం.. తలకొండపల్లికి చెందిన సంఘీ నాగరాజు(25) అల్మాస్గూడలో నివసిస్తూ ఆమెజాన్ కంపెనీలో ప్యాకింగ్ బాయ్గా పనిచేస్తున్నాడు. 2023లో ఓ రేప్ కేసులో జైల్కు వెళ్లి వచ్చాడు. షార్ట్ ఫిల్మ్లు తీస్తున్న నాగరాజుకు నెల రోజుల క్రితం జడ్చర్లకు చెందిన వేదవ్యాస్ (24)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఒకే రూంలో ఉంటున్నారు. వ్యసనాలకు బానిసలైన వీరు ఇరువురూ సులువుగా డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్ బాటపట్టారు. ఈ నెల 1వ తేదీన పోల్కంపల్లి పంచాయతీ పరిధిలోని జాజోనిబావికి చెందిన లావణ్య(33) తమ పొలంలో పశువులను మేపుతుండగా నాగరాజు, వేదవ్యాస్ బైక్పై వచ్చి ఆమె మెడలోంచి పుస్తెల తాడును అపహరించేందుకు యత్నించారు. సదరు మహిళ అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు వచ్చారు. అప్రమత్తమైన దుండగులు వెంటనే పుస్తెలతాడును వదిలి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజీలను పరిశీలిస్తున్న క్రమంలో మంగళవారం మంగళ్పల్లి వద్ద చైన్ స్నాచింగ్ కోసం యత్నిస్తూ పోలీసులకు చిక్కారు. చైన్స్నాచింగ్కు వాడిన వేదవ్యాస్ ఆర్15 బైక్ను సీజ్ చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.నాలుగు బైక్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఏసీపీ లక్ష్మీనారాయణ -
దళితవాడకు అడ్డు కంచె తొలగింపు
షాద్నగర్రూరల్: ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామంలో నెలకొన్న దళితవాడకు అడ్డంగా కంచె వివాదం సద్దుమణిగింది. రాకపోకలకు ఇబ్బందులు రాకుండా దారిని ఏర్పాటు చేశారు. కంచె ఏర్పాటుపై మంగళవారం దళిత సంఘాలు, కమ్యూనిస్టు పార్టీ, టీఎమ్మార్పీఎస్, ధర్మసమాజ్పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, కేవీపీఎస్, ప్రజా సంఘాల నాయకులు గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అడ్డుగా వేసిన కంచెను తొలగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ అవసరాలకోసం ఇచ్చిన స్థలంలో కంచె వేయడం ఏమిటని ప్రశ్నించారు. దళితులకు దారి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనే కంచె ఏర్పాటు చేశారని ఆరోపించారు. కంచె ఏర్పాటుతో దళితులు తమ ఇళ్లకు రాకపోకలు కొనసాగించలేని పరిస్థితి నెలకొందన్నారు. కంచె ఏర్పాటుతో ఇబ్బంది కలుగుతుందంటే తొలగిస్తామని బూర్గుల నర్సింగ్రావు సోదరి సుమన చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు, వివిధ సంఘాల నాయకులు సామేల్, జంగయ్య, చెన్నయ్య, శ్రీశైలం, శ్రీనునాయక్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. స్మృతివనం ఏర్పాటు చేస్తాం స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగ్రావు గ్రామ అవసరాలకు ఇచ్చిన స్థలంలో ఆయన స్మృతివనం ఏర్పాటు చేస్తామని ఆయన సోదరి, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు బూర్గుల సుమన వెల్లడించారు. మంగళవారం గ్రామాన్ని సందర్శించిన ఆమె గ్రామస్తులు, దళితులతో మాట్లాడారు. దళితులు వెళ్లడానికి దారి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గ్రామానికి ఇచ్చిన స్థలంలో కొందరు ఇళ్లు నిర్మించుకున్నారని, ఆ స్థలంలో బోర్లు వేసి గ్రామానికి నీటి సరఫరా చేస్తున్నారని అన్నారు. ఆ స్థలంలో బూర్గుల నర్సింగ్రావు ఉద్యానవనం ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారని, ఆ కోరిక తీరకుండానే ఆయన మృతి చెందారని చెప్పారు. ఏ రోజూ తాము ఆ స్థలాన్ని తిరిగి తీసుకోవాలనే ఆలోచన చేయలేదన్నారు. స్మృతివనం ఏర్పాటుచేస్తే మొక్కలను పశువులు మేస్తాయనే ఆలోచతో కంచె వేశామే తప్ప ఆక్రమించుకునేందుకు కాదని స్పష్టం చేశారు. సద్దుమణిగిన వివాదం -
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
పూడూరు: బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మంగళవారం మండల కేంద్రంలో మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. కేంద్ర పథకాలను ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల ప్రభారి శ్రీకాంత్, సినిమా సెన్సార్ బోర్డు సభ్యుడు మల్లేష్ పటేల్, పార్టీ మండల అధ్యక్షుడు రాఘవేందర్, నాయకులు జంగయ్య, బుచ్చన్న, పెద్దిని ప్రకాష్, కృష్ణాచారి, సుభాన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి -
సత్వరం పరిష్కరించండి
దౌల్తాబాద్: భూ భారతి సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్జైన్ ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరితో కలిసి సందర్శించారు. రెవెన్యూ సదస్సుల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ఇంత వరకు ఆన్లైన్లో నమోదు చేశారని తహసీల్దార్ను అడిగి తెలుసుకున్నారు. వీటన్నింటినీ వారంలోగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం మండలంలోని దౌల్తాబాద్, తిమ్మారెడ్డిపల్లి, బాలంపేట, గోకఫసలవాద్ గ్రామాల్లోని పాఠశాలలను తనిఖీ చేశారు. పాఠశాలల్లో చేపట్టిన మరమ్మతు పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. తరగతి గదులకు తలుపులు, కిటికీలు అమర్చాలని ఆదేశించారు. స్కూల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండచడంతోపాటు మొక్కలు నాటాలని సూచించారు. కేజీబీవీ ప్రహరీ చుట్టూ బ్లూ షీట్లు అమర్చాలన్నారు. గోకఫసల్వాద్ ఉన్నత పాఠశాలకు ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని ఏఈ నాగేందర్కు సూచించారు. బాలంపేటలో నిర్మిస్తున్న పీహెచ్సీకి రోడ్డు వేయాలన్నారు. అనంతరం కేజీబీవీ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, తహసీల్దారు గాయత్రి, ఎంఈఓ వెంకటస్వామి, ఎంపీడీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్జైన్ పలు గ్రామాల్లో పాఠశాలల సందర్శన వసతులు కల్పించాలని ఆదేశం -
లేన్లుగా..
నాలుగు లేన్లుగా విస్తరించనున్న హైదరాబాద్ – బీజాపూర్ రహదారికొడంగల్: హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారిని(ఎన్హెచ్ 163) జిల్లా పరిధిలో మరింత విస్తరించనున్నారు. మన్నెగూడ నుంచి కొడంగల్ మండలం రావులపల్లి వరకు నాలుగు లేన్ల రహదారిగా మార్చనున్నారు. మొత్తం 73 కిలో మీటర్ల మేర రోడ్డు విస్తరణకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ అనుమతి మంజూరు చేసింది. భూసేకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఇప్పటి వరకు ఉన్న రెండు వరుసల రోడ్డును ఇకపై నాలుగు లేన్లుగా మారుస్తారు. ఐదేళ్ల క్రితం హైదరాబాద్ – బీజాపూర్ అంతర్రాష్ట్ర రహదారిని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా మార్చింది. ఎన్హెచ్ 163గా నామకరణం చేసింది. కొన్ని సాంకేతిక సమస్యలు, కోర్టు కేసుల కారణంగా హైదరాబాద్ నుంచి మన్నెగూడ వరకు పనులు జరగలేదు. మన్నెగూడ నుంచి పరిగి, కొడంగల్ మీదుగా తెలంగాణ సరిహద్దు వరకు జాతీయ రహదారిని నిర్మించారు. రెండు లేన్ల రహదారి వేశారు. ప్రస్తుతం దీన్ని విస్తరించడానికి కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2028 నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంపై బాధ్యతలు జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై ఉంచింది. ఇందుకు అవసరమైన భూ సేకరణను రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంది. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును కేంద్రానికి సమర్పించాల్సి ఉంది. డీపీఆర్ అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులతో పాటు నిధులు మంజూరు చేయనుంది. రోడ్డు విస్తరణ పనులు పూర్తి అయిన తర్వాత వాహనాల నుంచి టోల్ వసూలు చేస్తారు. జిల్లాలో ఇప్పటికే కొడంగల్ మండలం చిట్లపల్లి గేటు సమీపంలో ఒక టోల్ గేటు ఉంది. రహదారి విస్తరణ పూర్తి అయితే రెండో టోల్ గేట్ను మన్నెగూడ – పరిగి మధ్యలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ రహదారి పనులు పూర్తయితే పరిగి, కొడంగల్ పట్టణాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మన్నెగూడ – రావులపల్లి రోడ్డు విస్తరణ 73 కిలోమీటర్ల మేర పనులు నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు నాలుగు లేన్ల రోడ్డు అందుబాటులోకి వస్తే రవాణా వ్యవస్థ మరింత మెరుగు పడుతుంది. నియోజకవర్గ ప్రజలు హైదరాబాద్ వెళ్లి రావడానికి సులభంగా ఉంటుంది. పరిగి, కొడంగల్ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. – తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కొడంగల్ ఇన్చార్జ్ -
పశు వైద్యంపై నిర్లక్ష్యం వద్దు
అడిషనల్ కలెక్టర్ సుధీర్ అనంతగిరి: మూగజీవాలకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందాలని అదనపు కలెక్టర్ సుధీర్ సూచించారు. మంగళవారం వికారాబాద్లోని జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయం, పశు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు పడుతున్నందున మూగ జీవాలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. సమయపాలన పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డాక్టర్ విజయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. ఎంఈఓ, హెచ్ఎంకు షోకాజ్ నోటీసుతాండూరు రూరల్: పెద్దేముల్ మండలం తింసన్పల్లి ప్రాథమిక పాఠశాలలో 50 రోజులుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంపై కలెక్టర్ ప్రతీక్జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దేముల్ ఎంఈఓ తోపాటు హెచ్ఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఈఓను ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తింసన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో 13 మంది విద్యార్థులు ఉన్నారు. వంట చేసేందుకు నిర్వాహకులు ముందుకు రాకపోవడంతో విద్యార్థులకు భోజనం పెట్టడం లేదు. ఈ విషయం తెలుసుకున్న డీఈఓ రేణుకాదేవి శనివారం పాఠశాలను సందర్శించి కలెక్టర్కు నివేదిక సమర్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంఈఓ నర్సింగ్రావు, హెచ్ఎం ఫక్రుజమాకు షోకాజ్ నోటీసులతో పాటు చార్జి మోమో ఇచ్చినట్లు డీఈఓ తెలిపారు. అరుణాచలేశ్వరుడి సేవలో బీఎంఆర్ తాండూరు: తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణమలై అరుణాచల పుణ్యక్షేత్రాన్ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి సందర్శించారు. మంగళవారం బీఎంఆర్ జన్మదినం కావడంతో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. తాండూరు నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వయోజనుల కోసం ‘ఉల్లాస్’ కొడంగల్: చదువురాని వయోజనులు, నిరక్షరాస్యుల కోసం న్యూ ఇండియా లిటరసీ ప్రోగాం పేరుతో కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ అనే కార్యక్రమం చేపట్టిందని ఉల్లాస్ జిల్లా అధికారి శ్రీనివాసులు, ఎంఈఓ రాంరెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలో ఐకేపీ, మెప్మా శాఖలకు చెందిన ఆర్పీలు, సీసీలతో సమావేశం నిర్వహించారు. మండలంలోని వయోజనులు, నిరక్షరాస్యులను గుర్తించాలన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి బోధనా కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. మహిళా సంఘాల సభ్యులు, సీసీలు, ఆర్పీలు బాధ్యత వహించి నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పాలన్నారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం గోపాల్, సీసీలు, మెప్మా సభ్యులు పాల్గొన్నారు. యూరియా కొరత లేదు యాలాల: జిల్లాలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రాజరత్నం తెలిపారు. మంగళవారం యాలాల, లక్ష్మీనారాయణపూర్లోని ఫెర్టిలైజర్ షాపులను మండల వ్యవసాయ అధికారి శ్వేతారాణితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తగినంతగా యూరియా వాడాలన్నారు. ప్రస్తుతం ఎకరాకు రెండు బస్తాల చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. -
అర్చకులు సంఘటితంగా ఎదగాలి
యాలాల: అర్చకులు సంఘటితంగా ఎదిగేందుకు కృషి చేయాలని దూప దీప నైవేద్య అర్చక సంఘం(డీడీఎన్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ పిలుపునిచ్చారు. మంగళవారం కోకట్ రోడ్లోని షిరిడీ సాయిబాబా మందిర ఆవరణలో జిల్లా అర్చక సంఘం ఆధ్వర్యంలో చండీ, కుబేర పాశుపత యాగ విజయోత్సవ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్చకులకు కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్కారు అందిస్తున్న అర్చక సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీడీఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు లోకూర్తి జయతీర్థాచారి, మఠం రాజశేఖరస్వామి, విజయ కృష్ణజ్యోషి, కరణం శ్రీకాంత్ పంతులు, జంగం జగదీశ్వర్ స్వామి, నటరాజ స్వామి, కిరణ్కుమార్ జ్యోషి, సంతోష్ స్వామి, వికారాబాద్ శ్రీకాంత్ స్వామి, గౌరారం రఘు స్వామి, సుమన్ పంతులు తదితరులు పాల్గొన్నారు. డీడీఎన్ఎస్ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవశర్మ -
ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు
తాండూరు రూరల్: మనిషికి ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ నాయక్ అన్నారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం మండల కేంద్రమైన పెద్దేముల్లో ఎల్ఎన్ఆర్ యువసేన, ఎంఎన్ఆర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి ఒక్కరూ రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎల్ఎన్ఆర్ యువసేన వ్యవస్థాపకులు నర్సింలు ఆధ్వర్యంలో వృద్ధులకు చేతికర్రలు పంపిణీ చేశారు. అనంతరం కేక్కట్ చేశారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్కుమార్, గ్రామ కమిటీ అధ్యక్షుడు డీవై నర్సిలు, కో ఆప్షన్ మాజీ సభ్యుడు నసిరొద్దీన్, నాయకులు వెంకటయ్య, ఆనంద్చారి, రాంరెడ్డి, సంగమేశ్వర్, నాగభూషణం, ప్రకాష్రెడ్డి, రాములు, సురేష్, విజయ్, సచిన్, వెంకట్, దేవ్యాసింగ్, శ్రీను, వైద్యులు సుభాష్, ఇశ్వర్య, కావ్య, ఫజల్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిధారాసింగ్ నాయక్ పెద్దేముల్లో ఉచిత వైద్య శిబిరం -
తాగునీరు కలుషితం
తాండూరు టౌన్: రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నిర్వహించిన తవ్వకాలతో తాగునీటి పైప్లైన్ పగిలిపోయింది. దీంతో నీరు కలుషితమవుతోంది. తాండూరు – చించోళి మార్గంలో సెయింట్ మార్క్స్ పాఠశాల సమీపంలో మిషన్ భగీరథ పైప్ పగిలిపోవడంతో నీరు బయటకు వచ్చి మడుగును తలపిస్తోంది. లీకేజీ నీటిలో పందులు పొర్లాడుతున్నాయి. కుక్కలు, పశువులు దాహం తీర్చుకుంటున్నాయి. ఆ నీరే ఇంకి పైపుల్లో కలిసి ఇళ్లకు సరఫరా అవుతోంది. నెల రోజులుగా ఇలాగే జరుగుతోందని అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వెంటనే పైప్లైన్కు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. -
విద్యారంగ సమస్యలు పరిష్కరించండి
అనంతగిరి: విద్యారంగంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకుడు ఏ.రాములు(టీఎస్ యూటీఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) వికారాబాద్ జిల్లా స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పదోన్నతులను పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. జీవో నంబర్ 25ను సవరించి కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా 40 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా, ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు వర్క్ లోడ్ కనుగుణంగా టీచర్ పోస్టులు కేటాయించాలన్నారు. అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయుల పెన్షన్ బెనిఫిట్స్ విడుదల చేయాలని తెలిపారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు. సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించి పర్యవేక్షణాధికారి పోస్టులను నింపాలన్నారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేసి బీఈడీ, డీఈడీ అర్హతలు ఉన్న సీనియర్ ఎస్జీటీ లందరికీ ప్రమోషన్ అవకాశం కల్పించాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలని, కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష, కాంట్రాక్టు ఉద్యోగులకు బేసిక్ పే అమలు చేయాలని కోరారు. మోడల్ స్కూల్స్, గురుకుల సిబ్బందికి 010 ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు ఇవ్వాలని, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని జూలై 2023 నుంచి అమలు చేయాలని విన్నవించారు. జీవో 317 కారణంగా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులను వారి స్థానిక జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. డీఎస్సీ 2008 కాంట్రాక్టు టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, 12 నెలల వేతనాలు చెల్లించాలని వర్తింపచేయాలన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ సుధీర్కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు బాబురావు, టి.పవన్ కుమార్, శివరాజ్, బసప్ప, వికారాబాద్ మండల అధ్యక్షుడు రాములు, ధారూరు అధ్యక్షుడు అజయ్ కుమార్, కోటపల్లి అధ్యక్షుడు రాంచంద్రయ్య, జిల్లా నాయకులు వినోద్ కుమార్, పరమేష్, ప్రభాకర్, వికారాబాద్ మండల ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ నాయకుడు రాములు డిమాండ్ యూఎస్పీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా -
దళితవాడకు అడ్డంగా కంచె
షాద్నగర్ రూరల్: తమ కాలనీకి వెళ్లే రోడ్డుకు అడ్డంగా కొందరు వ్యక్తులు కంచె వేశారని ఫరూఖ్నగర్ మండలం బూర్గుల దళితవాడకు చెందిన బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామస్తులు, దళితుల కథనం ప్రకారం.. బూర్గుల గ్రామంలోని సర్వేనంబర్ 130లో స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగ్రావు స్థానిక అవసరాల నిమిత్తం యాభై ఏళ్ల క్రితం ఎకరా పది గుంటల భూమిని కేటాయించారు. ప్రస్తుతం ఇది పశువుల మంద స్థలంగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. గ్రామం కోసం కేటాయించిన ఈ భూమిలో కొంతమంది నిరుపేద దళితులు పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. మిగిలిన స్థలంలో పంచాయతీ తరఫున బోర్లు వేసి గ్రామానికి నీటి సరఫరా అందించడంతో పాటు పశువుల కోసం నీళ్ల తొట్టి నిర్మించారు. ఇళ్లు కట్టుకున్న దళితులు ఈ భూమిలో నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా సర్వే నంబర్ 130లోని 20 గంటల భూమి మాదేనంటూ బూర్గుల నర్సింగ్రావు బంధువు ఆ స్థలం చుట్టూ ఇనుప కంచె వేశారు. దీంతో ఇళ్లకు వెళ్లే దారి లేక ఇబ్బంది పడుతున్నామని దళితులు తెలిపారు. ఇటీవల ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణానికి సంబంధించిన సామాగ్రిని తరలించేందుకు కొంత కంచెను తొలగించాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు వ్యక్తులు తనకు ఫోన్ చేసి బెదించారని తెలిపాడు. బూర్గుల నర్సింగ్రావు ఆశయ సాధనకు కృషి చేయాల్సిన వారి కుటుంబ సభ్యులే ఇలా దళితులను చిన్నచూపు చూస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న దారిని మూసేసి కంచె నిర్మించడంపై ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై బాధితులు పోలీసులు, పంచాయతీ అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం. రాకపోకలకు అవస్థలు పడుతున్నామని బాధితుల ఆందోళన -
పరిసరాల పరిశుభ్రతపై అవగాహన తప్పనిసరి
తాండూరు టౌన్: పరిసరాల పరిశుభ్రతపై వి ద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని పట్టణ మున్సిపల్ డీఈ, ఇంచార్జి కమిషనర్ మణిపాల్ సూచించారు. వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం పాత తాండూరులోని ప్రభుత్వ నెంబర్–2 పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ.. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ముఖ్యమన్నారు. ఇళ్లు, పాఠశాల, మైదానం వంటి ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇళ్లల్లోని పూల కుండీల్లో, టైర్లలో నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు. ఇంటిలోని చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేసి, మున్సిపల్ వాహనానికి అందించాలన్నారు. పరిసరాలు శుభ్రంగా లేకపోతే ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి పోయి ప్రజలు అనారోగ్యం పాలవుతారన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగుతూ వ్యక్తిగత, పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవడంతో పాటు ఇంట్లో వారికి, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ గౌడ్, పాఠశాల హెచ్ఎం ప్రతిభా భారతి, వార్డు ఆఫీసర్లు కార్తీక్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. తడి, పొడి చెత్త వేరుచేయాలి పరిగి: పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటేనే రోగాలు దరిచేరవని మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని గంగపుత్ర కాలనీలో వందరోజుల ప్రణాళికలో భాగంగా ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీఒక్కరు రోజు తడి చెత్తను పొడి చెత్తను వేరు వేరుగా వేయాలని సూచించారు. చెత్త సేకరణకు ప్రతి రోజు వాహనాలు వస్తున్నాయని వాటిలోనే చెత్తను వేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ దశరథ్ పాల్గొన్నారు. తాండూరు మున్సిపల్ డీఈ మణిపాల్ -
బాధ్యతలు స్వీకరించిన ఏపీఎంలు
తాండూరు రూరల్: తాండూరు మండల నూతన ఏపీఏంగా బాలయ్యను జిల్లా అధికారులు నియమించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఐకేపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో పని చేసిన ఏపీఏం ఆనంద్ బంట్వారం మండలానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. మహిళ సంఘాల బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు. అనంతరం ఏపీఎంను కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం మండల అధ్యక్షురాలు కవిత, కార్యదర్శి నాగమ్మ, సీసీలు శంకర్, సంధ్య, ప్రభు, వెంకటయ్య, అరవింద్కుమార్, అనసూయ, అకౌంటెంట్ కవిత పాల్గొన్నారు. కుల్కచర్ల ఏపీఎంగా శ్రీనివాస్రెడ్డి కుల్కచర్ల: మహిళ సంఘాల ఉన్నతికి అధికారులు నిస్వార్థంగా పనిచేయాలని మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సంతోష అన్నారు. సోమవారం కుల్కచర్ల నూతన ఏపీఎంగా శ్రీనివాస్రెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న శోభ బదిలీపై దోమ మండలానికి కేటాయించగా.. పరిగి ఏపీఎంగా శ్రీనివాస్రెడ్డి కుల్కచర్లకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా నూతన ఏపీఎంను మహిళా సమాఖ్య అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీసీలు, వీబీకేలు తదితరులు పాల్గొన్నారు. విధుల్లో చేరిక..యాలాల: ఐకేపీ ఏపీఎంగా శ్రీనివాస్ సోమవారం విధుల్లో చేరారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ప్రమీల జనగాం జిల్లాకు బదిలీపై వెళ్లారు. దీంతో ఆమె స్థానంలో చౌడాపూర్లో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ను యాలాలకు కేటాయించారు. సో మవారం ఐకేపీ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఐకేపీ సిబ్బంది, మహిళా సమాఖ్య సభ్యులు శ్రీనివాస్కు ఘన స్వాగతం పలికారు. -
ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడికి సన్మానం
బొంరాస్పేట: జాతీయ ఉపాధిహామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికై న మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నర్సింలుగౌడ్ను పలువురు నాయకులు, ఆయా సంఘాల సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సన్మానించారు. తన సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయిలో అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపినవారిలో కోస్గి ఏఎంసీ మాజీ చైర్మన్ ఏర్పుమళ్ల వెంకట్రాములుగౌడ్, రాంచంద్రారెడ్డి, గౌడసంఘం మండల నాయకులు ప్రకాశ్గౌడ్, భీమయ్యగౌడ్, బాల్రాజ్గౌడ్ తదితరులున్నారు. భవిత సెంటర్లో ఫిజియోథెరపీ ఎంఈఓ చంద్రప్ప బంట్వారం: వారానికోసారి నిర్వహించే ఫిజి యోథెరపీకి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను తల్లిదండ్రులు తప్పక తీసుకురావాలని కోట్పల్లి ఎంఈఓ చంద్రప్ప అన్నారు. సోమవారం భవిత సెంటర్లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు డాక్టర్ శ్రీకాంత్ ఫిజియోథెరపీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. సుమారు 20 మందికి పైగా పిల్లలకు ఫిజియోథెరపీ చేయించామన్నారు. వీరికి ప్రతిరోజు తరగతులు ఉంటాయన్నారు. వారానికోసారి ఫిజియోథెరపీ ఉంటుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రమం తప్పకుండా భవిత కేంద్రానికి తీసుకురావాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ స్పెషల్ ఎడ్యుకేటర్ శ్రీదేవి, డాక్టర్ శ్రీకాంత్, ఐఈఆర్పీ దిలీప్కుమార్, సీఆర్పీ నర్సింలు పాల్గొన్నారు. వైద్య శిబిరానికి స్పందన 380 మందికి ఉచిత పరీక్షలు తాండూరు టౌన్: పట్టణంలోని ఇందిరానగర్ అర్బన్ పీహెచ్సీలో సోమవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 380 మంది పేషంట్లు ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈసందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. డీఎంహెచ్ఓ లలితాదేవి ఆదేశానుసారం ఏర్పాటు చేసిన ఈ శిబిరం విజయవంతమైంది అన్నారు. 62 మందికి ఆపరేషన్ల నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశామన్నారు. వీరికి వారం రోజుల్లో ఆపరేషన్లు పూర్తి చేస్తామన్నారు. అనంతరం పేషెంట్లకు ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు గిరిధర్, అక్షయ్, అఖీల్ ఖాన్, రాధ, రాజేశ్వరి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అదనపు కట్నం కోసం వేధింపులు భర్తపై కేసు మొయినాబాద్: అదనపు కట్నం కోసం భార్య ను వేధిస్తున్న భర్తపై మొయినాబాద్ పీఎస్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎనికేపల్లి గ్రామానికి చెందిన చీపిరి రాజుకు 2012లో నాగిరెడ్డిగూడకు చెందిన సరితతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సరితకు మరో ముగ్గురు అక్కాచెళ్లెల్లు ఉన్నారు. సోదరులు లేకపోవడంతో పుట్టింటి నుంచి భూమి, ఇల్లు ఇప్పించాలని రాజు కొన్నేళ్లుగా భార్యను వేధిస్తున్నాడు. అతని బాధ భరించలేక కొంత కాలం క్రితం 6 గంటల భూమి ఇచ్చారు. అయినా ఇల్లు కావాలంటూ ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో గత ఆదివారం సరిత పుట్టింటికి వెళ్లిపోయింది. రాత్రి అక్కడికి చేరుకున్న రాజు భార్యపై దాడిచేశాడు. దీంతో సోమవారం ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోక్సో నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు ఆమనగల్లు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా ఓ బాలికకు దగ్గరై మోసం చేసిన వ్యక్తికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆమనగల్లుకు చెందిన వెంకటేశ్పై 2021లో పోక్సో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన షాద్నగర్ పోక్సో కోర్టు నిందితుడికి పైశిక్ష విధిస్తూ తీర్పు వెలువర్చింది. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎస్పీ కుషాల్కర్, ఆమనగల్లు సీఐ ఉపేందర్, ఆమనగల్లు ఎస్ఐ వెంకటేశ్, కోర్టు కానిస్టేబుల్లు యాదయ్య, జగన్ నిందితుడికి శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించారు. -
ఢిల్లీకి తరలిన బీసీ నాయకులు
దుద్యాల్: కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ మేరకు మండలంనుంచి పలువురు బీసీ నాయకులు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో కలిసి సోమవారం ఢిల్లీకి పయనమయ్యారు. మండల కేంద్రానికి చెందిన మెరుగు వెంకటయ్య కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, బీసీ సంఘం జిల్లా ముఖ్య నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన మీనాక్షి నటరాజన్తో కలిసి ట్రైన్లో ఢిల్లీకి బయలుదేరారు. ఆయన వెంట కొడంగల్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీసీ నాయకులు ఉన్నారు. అనంతగిరి: బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధనకై కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో చేపడుతున్న ధర్నా కార్యక్రమానికి వికారాబాద్ ప్రాంతం నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సోమవారం బయలుదేరారు. హైద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో వీరంతా పయనమయ్యారు. రిజర్వేషన్ల సాధనకై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక రైలులో ప్రయాణం యాలాల: 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు సాధనలో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు సోమవారం మండల నాయకులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేశం, ముదిరాజ్ సంఘ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ హన్మంతు, నాయకులు మహిపాల్ తదితరులు ఢిల్లీకి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో బయలుదేరారు. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
తాండూరు రూరల్: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ నాయక్ అన్నారు. సోమవారం పెద్దేముల్ మండల కేంద్రంలో గ్రామానికి చెందిన 151 మందికి నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ధారాసింగ్ నాయక్ మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రేషన్కార్డు ఇచ్చిన దాఖాలలు లేవన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపాల్, పీసీసీ మైనార్టీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శోభారాణి, నాయకులు ప్రవీణ్ కుమార్, జితేందర్రెడ్డి, విద్యాసాగర్, ఆనంద్చారి, షబ్బీర్, నర్సింలు, ఫయాజ్, మల్లేశం, ఇక్బాల్, మినహాజ్, బుజ్జమ్మ, ఎర్రబాలప్ప, శంకర్నాయక్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలుబొంరాస్పేట: ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన రేషన్కార్డులను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. బురాన్పూర్, తుంకిమెట్ల తదితర గ్రామాల్లో లబ్ధిదారులు కార్డులు అందుకుని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నర్సింలుగౌడ్, కోస్గి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రాములుగౌడ్, నాయకులు రాంచంద్రారెడ్డి, గౌడ సంఘం మండల నాయకులు ప్రకాశ్గౌడ్, భీమయ్యగౌడ్, బాల్రాజ్గౌడ్ తదితరులున్నారు.పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ -
నేడు రేషన్ కార్డుల పంపిణీ
బడంగ్పేట్: మహేశ్వరం నియోజకవర్గంలోని లబ్ధిదారులకు మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరు కానున్నారని కాంగ్రెస్ పార్టీ మహే శ్వరం ఇన్చార్జ్ కేఎల్లార్ తెలిపారు. మల్లాపూర్లోని యెల్మేటి అమరేందర్రెడ్డి ఫంక్షన్ హాలులో కొనసాగుతున్న ఏర్పాట్లను సోమవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గానికి 12 వేల కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని స్పష్టంచేశారు. లబ్ధిదారులు విధిగా హాజరై కార్డులు అందుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు అమరేందర్రెడ్డి, సీనియర్ నాయకులు దేప భాస్కర్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోవర్ధన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, నవారు మల్లారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ‘డబుల్ ఇళ్లు’ స్థానికులకే ఇవ్వాలి తుక్కుగూడ: గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను స్థానికులకే కేటాయించాలని నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ప్రజలు కోరారు. ఈ మేరకు తుక్కుగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఆయన అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్రూంల పనులను పూర్తి చేయాలని హౌసింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. వీటి పంపిణీలో స్థానికులకే మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. హాజరుకానున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఏర్పాట్లను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ -
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
కుల్కచర్ల: విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లోనూ రాణించాలని ముజాహిద్పూర్ ప్రభుత్వ మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతిహెప్సిబా అన్నారు. మండల పరిధిలోని ముజాహిద్పూర్ మాడల్స్కూల్లో 10వ తరగతి చదువుతున్న నరేశ్ ఈ నెల 2, 3 తేదీల్లో చైన్నైలోని రామకృష్ణ పాలిటెక్నిక్ కాలేజ్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి టెన్నిస్బాల్ క్రికెట్ పోటీలలో ప్రతిభను కనబరిచాడు. ఈ మేరకు ఆయన్ను జాతీయస్థాయి పోటీలకు ఎంపికచేశారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాల ఉపాధ్యాయ బృందం నరేశ్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ కృష్ణారెడ్డి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యానికి మించి..
● ఈ ఏడాది సాగు లక్ష్యం 2వేల ఎకరాలు ● ఇప్పటికే టార్గెట్ పూర్తి ● ముందుకొచ్చిన 2,300 మంది రైతులు ● 90శాతం రాయితీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు ● ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా.. వికారాబాద్: ఆయిల్ పామ్ సాగుకు జిల్లా రైతాంగం ఆసక్తి చూపుతోంది. ఈ పంట సాగు చేయడం ద్వారా అధిక దిగుబడి, లాభాలు ఉండటంతో ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా పెద్ద మొత్తంలో రాయితీలు ఇస్తోంది. భవిషత్ అవసరాలు, ఆయిల్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఉద్యాన వన శాఖ అధికారులకు లక్ష్యం నిర్ధేశించింది. ఇన్నాళ్లు ఈ పంట సాగుపై రైతులకు అవగాహన లేకపోవడంతో ముందుకు రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రోత్సాహం, రాయితీలు కల్పిస్తుండటంతో అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం జిల్లాకు ఇచ్చిన టార్గెట్ను ఉద్యాన వన శాఖ పూర్తి చేసింది. ఇటీవల వికారాబాద్ మండలం కొత్రెపల్లి శివారులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, స్పీకర్ ప్రసాద్కుమార్, ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ రాష్ట్ర డైరక్టర్ హాస్మిన్బాషా, డిప్యూటీ డైరక్టర్ నీరజ ఆయిల్ పామ్ మొక్కలు నాటి రైతులకు అవగాహన కల్పించారు. 35వేల ఎకరాల్లో అనుకూలం జిల్లాలో 5.61 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతుండగా ఇందులో 50 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలను సాగుచేస్తున్నారు. ఆయిల్ పామ్ సాగు అవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం జిల్లాల వారీగా లక్ష్యాలను విధించింది. వికారాబాద్ జిల్లాలో 35 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు నేలలు అనుకూలంగా ఉన్నాయని ఉద్యానవన శాఖ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఏడాది జిల్లాలో కనీసం 2వేల ఎకరాల్లో పంట సాగు చేయాలని లక్ష్యం పెట్టుకొగా అది పూర్తయ్యింది. 2వేల మంది రైతులు సాగుకు సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. లక్ష్యానికి మించి మరో 300 ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. రాయితీతో.. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తోంది. ఐదెకరాల వరకు సాగుచేసే సన్న, చిన్నకారు రైతులకు 90శాతం రాయితీపై మొక్కలు అందజేయనుంది. 90శాతం రాయితీపై డ్రిప్పైపులు కూడా అందజేస్తారు. పంట దిగుబడి ప్రారంభమయ్యే వరకు అంతర పంటలు సాగుకు ఎకరాకు ఏడాదికి రూ.2100 చెల్లిస్తారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు మొక్కలతోపాటు డ్రిప్ పరికరాలను ఉచితంగా ఇస్తారు. 9 ఎకరాల నుంచి 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ పంట సాగు చేసే రైతులకు 80 శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఏడాదికి రూ.2.5 లక్షల ఆదాయం ఆయిల్పామ్ దీర్ఘకాలిక పంట. మూడున్నర సంవత్సరాల నుంచి పంట ప్రారంభమై ఐదు సంవత్సరాలకు అమ్మాకినికి వస్తుంది. అప్పటి నుంచి 35 సంవత్సరాల పాటు ఏడాదికి ఎకరాకు 10 నుంచి 16 టన్నుల దిగుబడి వస్తుంది. దాదాపు రూ.2.5 లక్షల ఆదాయం చేకూరుంది. ఎకరం పొలంలో 57 మొక్కలు మాత్రమే నాటుకోవాల్సి ఉంటుంది. అంతర పంటలుగా శ్రీగంధం, సర్వి, ఉల్లి, కూరగాయల పంటలు సాగు చేసుకోవచ్చు.ఇటీవల కొత్రెపల్లిలో ఆయిల్ పామ్ మొక్క నాటుతున్న మంత్రి తుమ్మల, స్పీకర్ ప్రసాద్కుమార్ దరఖాస్తు చేసుకోవాలి ఆయిల్ పామ్ సాగుపై అసక్తి గల రైతులు తమను సంప్రదించి దరఖాస్తూ చేసుకోవాలి. రైతు వాటా ఎకరాకు రూ.1,750 చొ ప్పున ఎన్నిఎకరాలు ఉంటే అంత డబ్బు డీడీ రూపంలో తీసి ఇవ్వాలి. నీట సౌకర్యం ఉన్న రైతులే దరఖాస్తు చేయాలి.తాండూ రు సమీపంలోని కోకట్ నర్సరీలో మొక్కలు అందుబాటులో ఉన్నాయి. పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే కంపెనీలతో రైతులను టయ్యప్ చేస్తాం. – సత్తార్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి -
రిజర్వేషన్లు ఆమోదించకుంటే ఉద్యమం
కడ్తాల్: 42 శాతం బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, కార్యవర్గ సభ్యుడు కందుకూరి జగన్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్లో సోమవారం ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. తక్షణమే బీసీ రిజర్వేషన్లను ఆమోదించి అమలు చేయాలని లేని పక్షంలో బీసీ సామాజికవర్గాన్ని ఐకమత్యం చేసి, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకోసం మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. బీసీ సామాజికవర్గ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ ఆమనగల్లు ఏరియా కమిటీ కన్వీనర్ శివశంకర్, నాయకులు శివగల రమేశ్, గుమ్మడి కరుమయ్య పాల్గొన్నారు. -
మొండి బకాయిల వసూలుకు చర్యలు
జాయింట్ రిజిస్ట్రార్ సూర్యచంద్రరావు బంట్వారం: దీర్ఘకాలిక రుణాలు తీసుకొని చెల్లించని వారిపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు హైదరాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ జాయింట్ రిజిస్ట్రార్ (ఓఎస్డీ) సూర్యచంద్రరావు తెలిపారు. సోమవారం బంట్వారం సహకార సంఘం కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సంఘం పరిధిలో రూ.5.32 కోట్ల రుణాలు రికవరీ చేయాల్సి ఉందన్నారు. మొండి బకాయి దారులకు మొదటగా నోటీసులు జారీ చేసి కొంత సమయం ఇస్తామన్నారు. వారి నుంచి స్పందన లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు దీర్ఘకాలిక రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించకుంటే వడ్డీ ఎక్కువ పడుతుందన్నారు. తీసుకున్న రుణాలను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తే ఎలాంటి నష్టం ఉండదన్నారు. కార్యక్రమంలో సేల్స్ ఆఫీసర్ డీఎల్ఎన్ రెడ్డి, మోమిన్పేట్ బ్రాంచ్ మేనేజర్ నారాయణరెడ్డి, సీఈఓ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. సీనియర్ అసిస్టెంట్ ప్రదీప్కు పదోన్నతి తాండూరు రూరల్: తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ ప్రదీప్కు పదోన్నతి లభించింది. డిప్యూటీ తహసీల్దార్గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రదీప్ హైదరాబాద్ జిల్లాకు డీటీగా వెళ్లారు. బదిలీపై వెళ్తున్న ఆయన్ను సోమవారం తహసీల్దార్ తారాసింగ్ తోపాటు సిబ్బంది ఘనంగా సన్మానించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలి సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పరిగి: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి ప్రభుత్వాతన్ని డిమాండ్ చేశారు. సోమవారం పరిగి పట్టణంలో పార్టీ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా వెంకటేష్, కార్యవర్గ సభ్యులుగా రాంచంద్రయ్య, యాదయ్య, చంద్రయ్య, మల్లయ్య, జంగయ్య, రాములు, నజీర్, గఫార్, నర్సింహులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎంతో మంది నిరుపేదలు ఇళ్లు లేక రోడ్డు పక్కన జీవిస్తున్నారని తెలిపారు. అలాంటి వారికి ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. పలు గ్రామాల్లో భూ సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి పీర్ మహ్మద్, సురేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. సర్వేకు సహకరించాలి యాచారం: ఫార్మాసిటీకి పరిహారం అందజేసి సేకరించిన భూముల సర్వేకు రైతులు సహకరించాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి అన్నారు. యాచారం మండలం పరిధిలోని నక్కర్తమేడిపల్లిలో అధికారులు చేపట్టిన రైతుల కబ్జా భూముల సర్వేను సోమవారం ఆమెపరిశీలించారు. -
సర్వం సిద్ధం
● చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు ఏర్పాట్లు పూర్తి ● ప్రభుత్వానికి చేరిన అంచనాలు ● ఉత్తర్వులు రావడమే ఆలస్యం ● జిల్లాలో మొత్తం చెరువులు 1,179 ● ఎంపిక చేసినవి 778 ● వదలాల్సిన చేపపిల్లలు 1.29 కోట్లు ● మత్స్య సహకార సంఘాలు 152వికారాబాద్: జిల్లాలోని చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వదిలేందుకు మత్స్య శాఖ కసరత్తు చేస్తోంది. వందశాతం రాయితీతో ప్రభుత్వం వీటిని పంపిణీ చేస్తుంది. ఇటీవల ఇందుకు సంబంధించిన నిధులు కేటాయించినా ఉత్తర్వులు మాత్రం విడుదల కాలేదు. ఏ సమయంలోనైనా ఆదేశాలు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. చేప పిల్లలు వదిలేందుకు అనువైన చెరువులను ఎంపిక చేశారు. ఇప్పటికే అంచనాలు సిద్ధం చేసిన ఆ శాఖ జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అంజేశారు. ప్రస్తుతం టెండర్లు పిలవాల్సి ఉంది. అయితే ఎప్పటిలోగా చేపపిల్లలు వదులుతారనే విషయంపై స్పష్టత లేదు. జిల్లాలో మొత్తం 1,179 చెరువులు, కుంటలు ఉండగా 778 చెరువుల్లో చేపపిల్లలు వదలాలని నిర్ణయించారు. ఈ ఏడాది 1,29,72,000 చేప పిల్లలు, 14.97 లక్షల రొయ్య పిల్లలు వదలాలని లక్ష్యం పెట్టుకున్నారు. జిల్లాలో 152 మత్స్య సహకార సంఘాలు.. 5,665 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం వర్షాలు కురిసి చెరువుల్లోకి నీరు చేరుతుండటంతో ఈ నెల నుంచే చేప పిల్లలు వదిలే ప్రక్రియ ప్రారంభించాలని మత్స్య సహకార సంఘాల సభ్యులు కోరుతున్నారు. అలాగే చెరువులకు సరిపడా చేప పిల్లలు పంపిణీ చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. లక్ష్యానికి దూరంగా.. చెరువుల్లో చేపపిల్లలు వదిలే విషయంలో అధికారులు ఎంచుకున్న లక్ష్యానికి వదులుతున్న దానికి ఏ మాత్రం పొంతన ఉండటం లేదు. ఏటా ఇదే తంతు కనిపిస్తోంది. ఎంచుకున లక్ష్యంలో 60 నుంచి 70 శాతం వరకే చేపపిల్లలు వదిలి చేతులు దులపుకొంటున్నారు. ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో చెరువులు పూర్తి స్థాయిలో నిండేవి. ఈ ఏడాది ఇప్పటికే అన్ని చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. ప్రభుత్వం చేపపిల్లల పంపిణీ ప్రక్రియను ప్రారంభించపోవడంతో చాలా మంది మత్స్యకారులు బయట కొనుగోలు చేసి చెరువుల్లో వదులుకోవాల్సి వస్తోంది. నాసిరకం పిల్లలు ఏటా ప్రభుత్వం వదులుతున్న చేపపిల్లల్లో ఎక్కువ శాతం నాసిరకంగానే ఉంటున్నాయి. సాధారణంగా చెరువుల్లో వదిలే సమయంలో మూడు నుంచి నాలుగు ఇంచులు ఉండాలి. కానీ ఒక్క ఇంచుకు మించి ఉండటం లేదు. గతేడాది దోమ మండలం మోత్కూర్ చెరువులో చేపపిల్లలు వదిలేందుకు అధికారులు వచ్చారు. నాసిరకంగా ఉండటంతో మత్స్యకారులు అధికారులతో గొడవకు దిగారు. నాలుగు సార్లు చేప పిల్లలను తిరిగి పంపారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చేప పిల్లల లెక్కల్లో తేడా ఉందని అంటున్నారు. లక్ష పిల్లలు వదిలామని చెబుతున్నా అందులో 50 వేలు కూడా ఉండటం లేదని ఆరోపిస్తున్నారు. అధికారులు దృష్టిసారించి నాణ్యమైన చేపపిల్లలు వదలడంతోపాటు లెక్క కూడా సరిగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఉత్తర్వులు రాగానే.. జిల్లాకు ఎన్ని చేపపిల్లలు అవసరం అనే దానిపై అంచనాలు సిద్ధం చేశాం. ప్రభుత్వానికి నివేదిక కూడా పంపాం. ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నాం. ఆదేశాలు అందిన వెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వదులుతాం. – వెంకయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి -
మాత్రలు వేద్దాం.. ‘నులి’మేద్దాం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఒకటి నుండి 19 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలందరికీ విధిగా అల్బెండజోల్ మాత్రలు వేయించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 11న అల్బెండజోల్ మాత్రలు అందజేయాలని సూచించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఈ మాత్రలపై అవగాహన కల్పించి, వందశాతం లక్ష్యం పూర్తయ్యేలా చూడాలన్నా రు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆ ర్ఓ సంగీత, డీఆర్డీఏ పీడీ శ్రీలత, డీపీఓ సురేష్మోహన్, డీఈఓ సుశీందర్రావు పాల్గొన్నారు. ప్రజావాణికి 82 ఫిర్యాదులు ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమవేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్ఓ సంగీతతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ వారం మొత్తం 82 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి కోసం డీఈఈటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ)ను ప్రారంభించిందని, యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఈఈటీ పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రైవేట్ సంస్థల్లో నిరుద్యోగ యువతకు నిరంతర ఉపాధి కల్పించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఆధారితమైన డీఈఈటీ వెబ్సైట్ను గత సంవత్సరం డిసెంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు. నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో ఉచితంగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు వారి నైపుణ్యాలు, విద్యార్హతలు, నివాస ప్రాంతం మొదలైన వాటి ఆధారంగా ఉద్యోగ సమాచారం అందించబడుతుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్ఓ సంగీత, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యనందించాలి
● కలెక్టర్ ప్రతీక్ జైన్ ● వికారాబాద్, మోమిన్పేట్ జూనియర్ కళాశాలల్లో తనిఖీ అనంతగిరి/మోమిన్పేట్: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ లెక్చరర్లకు సూచించారు. సోమవారం వికారాబాద్, మోమిన్పేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించారు. బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఏఏ సబ్జెక్టులు ఎంత వరకు పూర్తయ్యాయని ఆరా తీశారు. ఆతర్వాత సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని, మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. పెండింగ్ పనులు ఉంటే సత్వరం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆదేశించారు. అనంతరం మోమిన్పేట్ పశువైద్యశాలను తనిఖీ చేశారు. ఒక్కరే విధుల్లో ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎన్.శంకర్ నాయక్, వికారాబాద్ఎంపీడీఓ వినయ్ కుమార్, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ రావు, మోమిన్పేట్ ఎంపీడీఓ విజయలక్ష్మి, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. సత్వరం పరిష్కరించాలి ప్రజా ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 147 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి అర్జీలను ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి
షాబాద్: పరిశ్రమల ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభు త్వం కృషి చేస్తుందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. షాబాద్ మండలం చందనవెళ్లి పారిశ్రామిక వాడలో నీలోఫర్ బాబురావు ఏర్పాటు చేసిన నీలోఫర్ టీ ఫౌడర్ ప్యాకింగ్ కర్మాగారాన్ని ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్ది, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అనేక ప్రోత్సాహాకాలను అందజేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అశోక్, మాజీ సర్పంచ్లు జనార్దన్రెడ్డి, లింగం, నాయకులు అశోక్, రాఘవేందర్, నర్సింహారెడ్డి, సూర్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి -
ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్ష
ఇబ్రహీంపట్నం రూరల్: కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పీజీ నీట్ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగిన పరీక్షకు ఇబ్రహీంపట్నంలోని సిద్ధార్థ, శ్రీఇందు, ఏవీఎన్, శ్రీఇందు, గురునానక్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని రాందాస్పల్లి సమీపంలో ఉన్న ఏవీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష కోసం 110 మందిని కేటాయించారు. పరీక్ష సమయానికి ముందుగానే చేరుకున్న గాంధీ మెడికల్ కళాశాల నుంచి వచ్చిన డాక్టర్ నితిన్ పొరపాటున ప్రొవిజనల్ సర్టిఫికెట్ మర్చిపోయాడు. పరీక్ష సమయం దగ్గరపడుతుండడం.. సమీపంలో ఎక్కడా జిరాక్స్ కేంద్రాలు లేకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్రెడ్డి తన కారు ఇచ్చి ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్కు పంపించి ప్రొవిజనల్ సర్టిఫికెట్ జిరాక్స్ తీసుకొచ్చి ఇచ్చారు. దీంతో నితిన్, ఆయన తల్లిదండ్రులు సీఐకి కృతజ్ఞతలు తెలిపారు. -
ఛత్రపతిని ఆదర్శంగా తీసుకోవాలి
శంకర్పల్లి: హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఛత్రపతి శివాజీ చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. మండలంలోని గోపులారంలో ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్ గౌడ్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఛత్రపతి శివాజీ వ్యక్తిత్వాన్ని, ఆయన పోరాటాలకు సంబంధించిన చరిత్రను చదివి స్ఫూర్తి పొందాలన్నారు. రాజ్భూపాల్గౌడ్ మాట్లాడుతూ.. యువత అన్ని మతాల వారిని గౌరవిస్తూనే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో సిద్దిపేట వీరధర్మాజ స్వామి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ మండలాధ్యక్షురాలు లీలావతి, మున్సిపల్ అధ్యక్షుడు దయాకర్రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు ప్రభాకర్రెడ్డి, రాములు, వాసుదేవ్ కన్నా, బయానంద్ తదితరులు పాల్గొన్నారు. గెలుపుకోసం కృషి చేయాలి మొయినాబాద్రూరల్: ఎన్నికలు ఎప్పుడు వచ్చిన పార్టీ గెలుపుకోసమే అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. మండలపరిధిలోని అమ్డాపూర్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కట్టమైసమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు గొల్లపల్లి రవీందర్రెడ్డి, నోముల అంజిరెడ్డి, మధుసూధన్రెడ్డి, మహేందర్ముదిరాజ్, నారంరెడ్డి, బాత్కు శేఖర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు -
వర్షాభావం కారణంగా భారీగా తగ్గిన వరిసాగు
● నిండని చెరువులు..పెరగని భూగర్భజలాలు ● నెలాఖరు వరకు సమయం ఉందంటున్న శాస్త్రవేత్తలు ● శాస్త్రీయ పద్దతులు పాటించాలని వ్యవసాయ శాఖ సూచన ఈ ఏడాది ఖరీఫ్(వానాకాలం) రైతులకు నిరాశే మిగుల్చుతోంది. గతేడాది 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ ఏడాది నేటికీ 40 వేల ఎకరాలకే పరిమితమైంది. జిల్లాలో మెజార్టీ స్థాయిలో చెరువులు నిండక.. భూగర్భ జలాలు పెరగక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వికారాబాద్: ఈ ఏడాది వరి సాగుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. వర్షాకాలంలో వచ్చిన మార్పులతో ఈ ఏడాది సాగు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలోనే అత్యధికంగా పరిగి నియోజకవర్గంతో పాటు వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని ధారూరు, కొడంగల్ పరిధిలోని బొంరాస్పేట్, దౌల్తాబాద్, దుద్యాల, తాండూరు పరిధిలోని యాలాల మండలాల్లో వరి అత్యధికంగా సాగు చేస్తారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 93 వేల ఎకరాలు కాగా గత నాలుగేళ్లుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది చెరువుల్లోకి నీరు పూర్తి స్థాయిలో చేరకపోవడంతో గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 1,187 చెరువులకు గాను 62 చెరువులు అలుగు పారుతుండగా మరో 194 చెరువులు 75 శాతం నుంచి వందశాతం నిండాయి. మిగతా చెరువులు ఇంకా నిండలేదు. భూ గర్భ జలాలు సైతం పెరగలేదు. ఆందోళనలో అన్నదాత సరిపడా వర్షాలు కురవక రైతులు వరి నాట్లు వేసుకునేందుకు వెనుకాడుతున్నారు. రైతులంతా నారు పోసుకున్నా సగం కంటే తక్కువ మంది నాట్లు వేస్తున్నారు. బోర్లు ఉన్న రైతులు నాట్లు వేస్తున్నప్పటికీ నీరు అడుగంటడంతో పంటలు పండుతాయా.. ఎండుతాయా..? అని ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం ఈ నెలాఖరు వరకు వరి నాట్లు వేసుకోవచ్చని సూచిస్తున్నారు. తమ సలహాలు, సూచనల మేరకు సాగు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చునని అవగాహన కల్పిస్తున్నారు. శాస్త్రవేత్తల సూచనలు ● బీపీటీ 5204, ఎంటీయూ 1010, ఎంటీయూ 1001, చిట్టిముత్యాలు తదితర రకాలవరివిత్తనాలు సాగుచేస్తున్నారు. ● సాంబమసూరి, భరణి, కాటన్ దొర సన్నాలు, సోమశిల, సింహపురి, తెలంగాణ సోనా రకాలను వానాకాలం సీజన్లో సాగుచేస్తే మంచి దిగుబడులు వస్తాయి. ● ఈ రకాలు ఎకరాకు 40 బస్తాల దిగుబడి వస్తుంది. యాసంగిలో మరో పది బస్తాల వరకు పెరుగుతాయి. ● ఈ ప్రాంతంలో సాగు చేస్తున్న ఎంటీయూ 1010, ఎంటీయూ 1001 రకాలు యాసంగిలో మంచి దిగుబడులు ఇస్తాయి. ● సెప్టెంబర్ మొదటి వారంలోపు వరినాట్లు వేసుకోవటం మంచిది. జాగ్రత్తలు ● వరి పంటను కాండం తొలుచు పురుగు, ఆకుముడత తెగులు, దోమపోటు, అగ్గితెగులు ఆశించే అవకాశాలు ఎక్కువ. ● కాండం తొలుచు పురుగు నివారణకు నారు మళ్లలో ఒకటిన్నర కిలోల గుళికల మందు చల్లుకోవాలి. ● నాట్లు వేశాక 20 రోజులకు ఎకరానికి 8–10 కిలోల వాసన రాని గుళికల మందు వేసుకోవాలి. ● ఆకుముడత తెగులు నివారణకు కోలరోపైరిపాస్ లేదా మోనొ క్రొటోపాస్ మందు పిచికారీ చేసుకోవాలి. ● దోమపోటు నివారణకు ఇమిడా క్లోరోఫిడ్, అగ్గి తెగులు నివారణకు ట్రై సోక్లోజోన్ మందులను పిచికారీ చేసుకోవాలి. ● ఈ మందులన్నీ సూచిచించిన మోతాదు మేరకే వాడాలి. అందుబాటులో ఎరువులు రైతులు అధిక మోతాదులో ఎరువులు వాడుతున్నారు. దీంతో అనర్థాలు ఎక్కువ. యూరియా ఎక్కువగా వా డడంతో పైరు ఏపుగా పెరగి పచ్చగా మారడంతో పంటను ఆశించే పురుగులు, చీడపీడల శాతం పె రిగి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. జిల్లాలో రై తులకు సరిపడా ఎరువులు అందుబాటు ఉంచాం. – రాజారత్నం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి