బీసీలను దగా చేస్తున్న ప్రభుత్వం
బీసీ సర్పంచ్లకు అండగా ఉంటాం
● రిజర్వేషన్లు అమలు చేయకుండా అడ్డు పడుతోంది
● కోర్టు కేసు తేలకుండా ఎన్నికలకు వెళ్లడం పెద్ద కుట్ర
● బీసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
అనంతగిరి: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల జీవితాలు, ఆత్మగౌరవంతో ఆడుకుంటోందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. వికారాబాద్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కోర్టు కేసు తేలకుండా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించ డం ఆవర్గాలను దగా చేయడమేనని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే కేసు హైకోర్టులో నడుస్తోందని తెలిపారు. గత నవంబర్లోనే విచారణ ఫుల్ బెంచ్పైకి రావాల్సి ఉన్నా.. కేసు వాదించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే రూ.300 కోట్ల గ్రాంట్ రా దనే కారణంతోనే ఎన్నికలు పూర్తిచేశారన్నారు. న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ల అంశం బలంగా ఉందని వివరించారు. ఏ కోణంలో చూసినా కేసు గెలుస్తామని, ఇందుకోసం అన్నివిధాలా న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసు గెలిపించడానికి ప్రయత్నం చేయని ప్రభుత్వం, ఎన్నికలకు తొందరపడటంలో కుట్ర దాగి ఉందన్నారు. రిజర్వేషన్లు పెంచేందుకు రాజ్యాంగపరమై, న్యాయపరమైన అవరోధాలేమీ లేవన్నారు. ప్రజల్లో బీసీ ఉద్యమం బలంగా ఉందని, ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీ ల మేరకే రిజర్వేషన్ల పెంపును అడుగుతున్నా మని స్పష్టంచేశారు. ఈవిషయంలో సీఎం రేవంత్రెడ్డి కాలయాపన చేయడం సరికాదన్నారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో ఉన్న 200మందికిపైగా ఎంపీలతో ఇండియా కూటమి తరఫున పార్లమెంట్లో అడగడమో, నిరసన తెలపడమో చేయాలని సూచించారు. లేదంటే అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లి, సభలో ప్రైవేటు బిల్లు పెట్టి ఆమోదింపజేయాలన్నారు.
నూతనంగా గెలుపొందిన బీసీ సర్పంచ్లకు అండగా ఉంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని గౌలికార్ నర్సింగ్రావు ఫంక్షన్ హాల్లో జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ సర్పంచ్లను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదన్నారు. అనంతరం శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి బీసీలకు సరైన న్యాయం జరగలేదన్నారు. అనంతరం శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడారు. రాజ్యాధికారంలో మనవాటా మనకు దక్కాల్సిందేనని పేర్కొన్నారు. అనంతరం బీసీ సర్పంచులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రసిడెంట్ ర్యాగ అరుణ్కుమార్, బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ గుడిసె లక్ష్మణ్, కన్వీనర్ యాదగిరి యాదవ్, ప్రతినిధులు శ్రీనివాస్గౌడ్, నర్సింలు, వెంకటయ్య, మారుతి, విజయ్కుమార్, అనంతయ్య, శివరాజు, పాండుగౌడ్, లాల్కృష్ణ ప్రసాద్, రాజ్కుమార్, షుక్రూ, శ్రీనివాస్, హన్మంతు, రామకృష్ణ, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.


